Saturday, 2 October 2021


[

‘తులసి’ అన్న పదాన్ని మనం వివేచన చేస్తే ‘తులాంస్యతి తులసి’. ‘తుల’ అంటే ‘వెల కట్టడం’ అని అర్థం. వెల కట్టడానికి వీలు లేనిది తులసి. ‘తులస్యంమృత జన్మాసి’ అని కీర్తింపబడే తులసిని పరమపూజ్యమైందిగా భావిస్తాం. దీన్ని మహాలక్ష్మీ స్వరూపంగా ‘పద్మపురాణం’లో వ్యాసమహర్షి చెప్పాడు. ఇది విష్ణుకామిని. కృష్ణభూషణ రూప. విష్ణుపాద స్థల నివాసిని. తపఃస్సంకల్ప పూజాదులను సిద్ధింపజేసే శక్తి కలది. కలియుగంలో కాలుష్యాలను దహించే అగ్ని. దేవతల తృప్తి కోసం మహర్షులు తపస్సు చేసి ఈ వృక్షాన్ని పొందగలిగారు. అందుకే, ఇది  కోరికలు తీర్చగలిగే మన పాలిటి కల్పవృక్షం. గంగ ఎంత పవిత్రమో తులసి కూడా అంతే పవిత్రమైంది. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి అని వివిధ రకాలుగా పిలుస్తున్నా వాటి గొప్పతనం, పవిత్రత మాత్రం ఒక్కటే. ‘తులసి లేని ఇంట పితృకర్మ, దైవకర్మ లేవి చేసినా ఫలించవు’ అన్నది శాస్త్రం.

తులసి ఉన్నచోటికి దేవతలైనా, పితృదేవతలైనా ఆనందంగా వస్తారట. అంతేకాక, ఇది ఉన్నచోటకు దుష్టశక్తులు రావు. ఎందుకంటే, ఇది సాక్షాత్తూ ‘అమ్మవారి ప్రధానాంశ’ అని ‘దేవీ భాగవతం’ చెప్తున్నది. పువ్వులన్నిటి సారం తులసి. భూమ్మీద దొరికే పుష్పాలన్నిటి సారమంత విశేషమైన, పవిత్రమైంది ఇది. అంతటి పుణ్యదాయిని కూడా. దీన్ని దర్శించినా, స్పర్శించినా ముక్తిని, శక్తిని ప్రసాదిస్తుంది. భారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మాన్ని అనుసరించి తులసి మొక్క లేని గృహం ఉండదు. మనం ప్రకృతిని దైవంగా భావించి వృక్షాలన్నిటినీ దైవాలుగానే భావించినా ప్రత్యేకించి తులసి మొక్కను ఇంటి వద్ద తులసికోటలో పెంచి ధూపదీప నైవేద్యాలతో పూజించటం ఒక ప్రత్యేకత. దీనిని ‘కోట’గా ఎందుకంటామంటే, కోట ఎలాగైతే రక్షణనిస్తుందో ఇదీ అలాంటిదని నమ్మకం. ఇంటి గుమ్మం ముందు నుంచి చూస్తే పెరట్లో పెట్టిన తులసికోట కనపడాలని, ఉదయం నిద్ర లేవగానే తులసిని చూడాలన్నది అనాదిగా వస్తున్న ఆచారం. ఆధునిక ఇండ్ల నిర్మాణంలో అది సాధ్యం కాకపోయినా చిన్న కుండీలలోనైనా తులసి చెట్టు ఉండటం మాత్రం ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ తులసి మొక్కలు కనపడుతున్నాయంటే అది మన ప్రాచీన ఋషుల తపఃఫలమే. 

తులసి మూలంలోని మట్టికి ఉన్న శక్తి ఎంతో గొప్పది. తులసీ మృత్తిక (మట్టి)కు ‘గోపీ చందనమని’ వ్యవహారం. దీన్ని బొట్టుగా పెట్టుకుంటే పవిత్రమని, దివ్యత్వమని అంటారు. తులసి మూలంలో సర్వతీర్థాలున్నాయని, మూలంలో నీళ్లు పోసి తలపై చల్లుకుంటే తీర్థస్నాన ఫలితం కలుగుతుందని ‘విష్ణు పురాణం’ చెబుతున్నది. మన దేశంలోని తులసి, మారేడు వంటి వృక్షజాతి, గోజాతి సామాన్యమైనవి కావు. మనిషి తుదిఘడియలో ‘తులసీ తీర్థం నోట్లో పోయడం’ అంటే తిరిగి ప్రాణాన్ని పుంజుకుంటాడేమోనని ఆశ. అంత ఔషధీయుతమైన తులసి చెట్టు అత్యధిక ప్రాణవాయువును ప్రసరింపజేస్తూ ఆ గాలి పీల్చిన వారికి దీర్ఘాయుర్దాయాన్ని కలిగిస్తుంది. తులసి చెట్టు వద్ద సంధ్యావేళ దీపం పెట్టడం మోక్షదాయకం. అటువంటి ఇంటికి ఐష్టెశ్వర్యాలు లభిస్తాయి. వేదవాక్యంలోని అంతరార్థం తెలిపే తులసిని పెంచి పూజించడం నిజమైన భారతీయాత్మకు ప్రతీక. మన సంస్కృతీ సంరక్షణలో భాగంగా, ఆచారాలు అనుసరించడంలో అంతర్భాగంగా తులసీ మాతను భక్తితో అర్చిద్దాం.

[


భావనకు బలముంది

సామవేదం షణ్ముఖశర్మ |


సంఘటన బహిరంగం. భావన అంతరంగం.

ఈ రెండూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించడం సహజం, సంఘటనను అంచనా వేయడమో, అనుభవించడమో చేయగలం- కానీ పూర్తిగా మార్చగలగడం మనవల్ల అవుతుందా! అన్ని సందర్భాల్లోనూ కుదరదేమోగానీ; తగిన ప్రణాళికలతో, ప్రయత్నాలతో కొన్నిటినైనా మలచగలం, మార్చగలం అనడంలో సందేహించనక్కర్లేదు. జరగబోయేవి మన చేతుల్లో లేవు- అనడం నిజం కావచ్చు. కానీ 'సద్భావన'తో వాటిని ప్రయోజనకరంగా పరిణమింపజేయగలం- అని శాస్త్రాలు రుజువు చేస్తున్నాయి.

భావనలో సలక్షణం ఉంటే- 1. సంఘటన తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చు, 2. లేదా, అది తప్పిపోవచ్చు, 3. దాన్ని తట్టుకొని, సానుకూలంగా మలచుకొనే సమర్థత పొందవచ్చు. అందువల్లనే భావనను బలపరచే సాధనలు మనకు సూచించారు మహర్షులు. ధ్యానం, తపస్సు, క్రమబద్ధమైన జీవితం... భావనకు బలాన్నిస్తాయి. సంకల్ప సిద్ధులు కావడమంటే ఇదే. 'భావనాయోగం' అనే దివ్యప్రక్రియను కొన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల్లో వివరించారు. ఒక యోగంగా అభ్యసిస్తే భావనను కళ్లముందు సత్యంగా సాక్షాత్కరింపజేయవచ్చు- అని శాస్త్రనిరూపణ. ఆధ్యాత్మికసిద్ధికి భావనే ఆధారసూత్రం. 'చిత్తంకొద్దీ శివుడు-విత్తం కొద్దీ వైభవం' అనీ సామెత. భౌతికరంగంలోనూ ఈ భావనాబలం పనిచేస్తుంది. జీవితంలో అనుబంధాలు, అనుభవాలు భావంతో అల్లుకున్నవే. ఏకాగ్రచిత్తంతో, యోగశాస్త్రపద్ధతుల్లో తపశ్శక్తితో భావనను దృఢపరిస్తే దేనినైనా సాధ్యం చేయవచ్చు... అని ధైర్యాన్నిస్తున్నాయి. దానికి ఎన్నో తార్కాణాలు నేటి యుగంలోనూ చూడవచ్చు. ఎల్లవేళలా సానుకూల సకారాత్మక భావన కలిగి ఉండి, దాన్నే వ్యక్తీకరించేవాడు తప్పకుండా విజయాలు సాధించగలడు. స్వప్నాలను సత్యం చేసుకోగలడు, ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు 'ఇది నేను చేయగలను- చేసి తీరతాను' అనే దృక్పథం ఉన్నప్పుడు ఆ పని దాదాపు సిద్ధించినట్లే. ఈ సద్భావన ఇచ్చే బలం ఏ అవరోధాన్నైనా ఎదుర్కొనేలా చేస్తుంది. ఈ విధానమే 'శుభాకాంక్షలు'లో ద్యోతకమవుతుంది.

దీవెనలు, ఆశీర్వచనాలు, ప్రార్థనలు... ఇవన్నీ శుభాకాంక్షలే. పెద్దలు మనసారా పలికే దీవెనలు, శుభాన్ని 'ఆశించి' చెప్పే ఇతరుల ఆశీస్సులు, భగవచ్ఛక్తిని ఆరాధిస్తూ మనకోసం, ప్రపంచం కోసం ప్రసరించే మంచి భావాల ప్రార్థనలు... ఇవన్నీ ప్రాచీనకాలంనుంచి మనదేశంలో సంప్రదాయాలు. పర్వదినాల్లో, కార్యారంభాల్లో, శుభకర్మల్లో ఈ ఆనవాయితీ నేటికీ ఉన్నది. ముఖ్యంగా కాలం మలుపుల్లో శుభకామనను వ్యక్తపరచడం మానవ స్వభావం. అందుకే దేశాలేవైనా, మత, సంస్కృతులేవైనా అందరూ వారి కాలమానాల ప్రకారం- ఏడాదంతా ఆనందమయం కావాలని కోరుకుంటారు. 'ఈ సంవత్సరంలో జరిగే మార్పులన్నీ శుభకరంగా ఉండాలి...' అంటూ ప్రపంచంలోని ప్రథమ వాఞ్మయమైన వేదంలోనే కనబడుతోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలను వేదం తొలిసారి పలికింది. జరగబోయే చెడు ముందే తెలిసినా, సద్భావంతో కాలాన్నే మార్పుచేసిన వైనాలు మన పురాణాల్లో కోకొల్లలు. తన భర్త సత్యవంతుడు కొద్దికాలంలో మరణిస్తాడని తెలిసీ నిబ్బరంగా నిలబడింది సావిత్రి. నిజానికి వివాహానికి పూర్వమే ఆమెకు తెలుసు. కానీ ధైర్యంగా, తన ప్రేమకు ప్రాధాన్యమిచ్చి పెళ్లాడింది. తనకు తెలిసిన నిజం భర్తకు చెప్పలేదు. తాను తపస్సాధనను కొనసాగిస్తూ, తన భర్తకు ఆయువు పెరగాలనే సద్భావాన్ని కేంద్రీకృతం చేసింది. సద్భావాన్ని విశ్వాసంతో, ఏకాగ్రంతో బలపరచడమే కదా తపస్సు! దాని ఫలితంగా కాలం (కాలుడు = యముడు) ఆమెను అనుగ్రహించింది, అనుకూలపడింది. జరగబోయే దుస్సంఘటనను తప్పించగలిగింది. మానవుడు తన సద్భావనాబలంతో దేన్నైనా సాధించగలడనడానికి ఇదో తార్కాణం! 'నేను లంకకు వెళ్లి సీత జాడ తెలుసుకొని తీరతాను' అనే సద్భావనను సమర్థంగా సత్యంచేశాడు హనుమ. సీతమ్మకు ఆ శుభభావనను ప్రసరించి ధైర్యాన్నిచ్చాడు. అరణ్యవాస సమయంలో ధర్మరాజు వద్దకు వచ్చిన అనేకమంది రుషుల దీవెనల్లోంచి ఈ సద్భావన శుభాకాంక్షలుగా వెలువడి శుభాన్నే కలిగించింది.

శుభాన్ని ఆకాంక్షించడం ఎన్నడూ వ్యర్థం కాదనేది- సారాంశం. వ్యర్థంకాని విధంగా ఆకాంక్ష తెలపాలంటే ఆ తెలిపే చిత్తంలో నిజాయతీ, శుద్ధి ఉండాలి. అప్పుడది అమోఘమవుతుంది, ఫలవంతమవుతుంది. సద్భావన స్వభావమైతే ప్రభావం తప్పక ఉంటుంది.

[

*ఆయతగాళ్లు*


అరణం అంటే కానుక. భక్తులు తమ శక్తి కొద్దీ భగవంతుడికి మడులు మాన్యాలు ధనరాశులు... ఇంకా ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పిస్తారు. ఈ అరణాలు, ఆభరణాలు సద్వినియోగం కావాలని వారి కోరిక. దేవాలయ నిర్వాహకులు వాటిని ధర్మకార్యాలకు వినియోగిస్తే తరాల తరబడి తరిస్తామని భక్తుల విశ్వాసం. పూర్వకాలంలో ఆలయాలలో ధూప దీప నైవేద్యాది కైంకర్యాలకు వేలాది ఎకరాలను భక్తులు కానుక చేసిన వైనం చరిత్రలో కనిపిస్తుంది. స్థల పురాణాల్లో వినిపిస్తుంది. ఏదైనా ఘనకార్యం సాధించినవారి గురించి చెబుతూ మనవాళ్లు ‘అదంతా వారి పెద్దల పుణ్యం’ అంటూంటారు.


అసాధారణమైన కృషితో అనితరసాధ్యమైన పట్టుదలతో గంగానదిని ఆకాశాన్నుంచి నేలకు దించాడు భగీరథుడు. ‘మీ వంశంలో ఎవరూ సాధించలేకపోయినదాన్ని సాధించి చరితార్థుడవయ్యావు’ అని బ్రహ్మదేవుడు ప్రశంసిస్తుంటే భగీరథుడు నవ్వి ‘ఇది మా పెద్దల పుణ్యఫలం’ అన్నాడు రామాయణంలో! ధర్మకార్యం పట్ల ఆసక్తి చూపించే వారందరిదీ ఇదే భావన. తమ పెద్దల పుణ్యం తమకు కలిసొచ్చింది... దీన్ని రాబోయే తరాలకు అందించాలి అనే అమృత భావనే ఈ జాతి జనులను ధర్మపరులను చేసింది. పుణ్యకార్యాలకు ప్రేరేపించింది. గ్రామాల్లో వాటి చిహ్నాలు ఇప్పటికీ స్పష్టంగా గోచరిస్తాయి. సత్రాలు కట్టించడం, ఆలయాలు నిర్మించడం, అన్న దానాలు జరిపించడం... వాటి నిర్వహణ నిమిత్తం శాశ్వత నిధులను సమకూర్చడం వంటి ఎన్నో సత్కార్యాలకు ఆ దాన శాసనాలు సాక్ష్యం చెబుతాయి.


దేవుడి సొమ్మును అక్రమ మార్గాలకు మళ్ళించేవాడిని ‘ఆయత గాడు’ అన్నాడు ఆముక్త మాల్యదలో శ్రీ కృష్ణదేవరాయలు. దేవాలయ నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయతగాడి చేతికి అప్పగించరాదని ‘యామున రాజనీతి’లో స్పష్టం చేశాడు. స్వార్థ ప్రయోజనానికే కాదు, నీరసపడిన రాజుగారి బొక్కసానికి బలం చేకూర్చడానికైనా సరే, దేవుడి ధనం వినియోగించరాదని ఆయన శాసించాడు. దానివల్ల ధర్మహాని జరుగుతుందని హెచ్చరించాడు.

ఆలయ అధికారులుగా మంత్రులుగా ఎలాంటివారిని నియమించాలో ఆముక్తమాల్యద విస్పష్టంగా ప్రకటించింది. మన ధర్మశాస్త్రాలన్నింటా ఈ విషయంలో పాటించవలసిన నియమాల్ని పొందుపరచారు. ‘పెడితే పెళ్ళి- పెట్టకపోతే శ్రాద్ధం’ అన్న తీరులో వ్యవహరించేవారు ఆలయ అధికారులుగా పనికి రారన్నారు. అలాగే మంత్రులు! ‘అమా’ అనే మాటకు కలిసి ఉండటమని అర్థం. రాజు గారి మనసుకు అత్యంత సమీపంగా ఉండేవాడు అమాత్యుడు. దేవాదాయమంటే దేవుడికిచ్చిన అరణమని అర్థం. ఆ శాఖకు మంత్రిగా ఉండేవారు భక్తుల మనోభావాలకు దగ్గరగా ఉండాలి. దాతల ఆశయ సాధనకు అంకితం కావాలి. అంతేగాని దేవాలయాలను ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా భావించేవారు ఆ శాఖకు మంత్రులుగా తగరన్నది మన పెద్దల నిర్దేశం. రాజకీయ నిరుద్యోగులను ధర్మకర్తలుగాను, ఆయతగాళ్లను ఆ శాఖకు అధికారులుగాను నియమిస్తే ధర్మానికి గ్లాని, రాజ్యానికి హాని తప్పవన్నది మన ధర్మశాస్త్రాల నిర్దేశం!


తాము చేసే మంచి పనుల వల్ల నలుగురికీ మేలు జరగాలన్నది ఒక్కటే దాతల పరమలక్ష్యం. అలా సమకూరిన ఆస్తిపాస్తులను ఆలయ నిర్వాహకులు దాతల ఆశయాలకు అనుగుణంగా సక్రమ మార్గంలో వినియోగించినప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. అలా కాకుండా ప్రభుత్వాలు గాని ఆలయ అధికారులు గాని వాటిని వేరే ప్రయోజనాలకు వినియోగిస్తే దాతల ఆశయాలకు తూట్లు పడటమే కాదు, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. దానం చేయాలన్న బుద్ధి మాసిపోవడం అన్నింటికన్నా పెద్ద ప్రమాదం.

✍️ఎర్రాప్రగడ రామకృష్ణ

[

ఈ ప్రపంచంలో మానవ జీవిత పతనానికి ప్రధాన కారణం క్రోధమే. మానవాళి పతన హేతువులలో ప్రధానమైంది క్రోధమే. ‘క్రోధం వల్ల మూఢత్వం కలుగుతుంది. దాన్నే ‘సమ్మోహం’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. దీనివల్ల స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమిస్తే బుద్ధి శక్తి నశిస్తుంది. అప్పుడు మనిషి పతితుడవుతాడు’. ఆఖరకు ఈ పతనమే మనిషి సర్వనాశనానికి హేతువవుతుంది. కనుక, వినాశనానికి ప్రధాన కారణం ‘క్రోధమే’ అని గ్రహించాలి.

ఒకసారి ఈ పతనం మొదలైతే అది ఆ వ్యక్తి సర్వనాశనం అయ్యేంత వరకూ ఆగదు. మనిషి నిలువునా పడిపోవడానికి ఒక్క క్రోధమనే దుర్గుణం చాలు. మానవాభ్యున్నతికి ఏ విధంగా ఆరోహణ క్రమం ఉంటుందో అదే విధంగా పతనానికీ అవరోహణ క్రమం ఉంటుంది. అదే ఒక్కొక్క మెట్టు మీదుగా మనిషిని దిగజారుస్తుంది. ‘దీనికంతటికీ మూలం క్రోధం’ అని తెలుసుకొనేలోగానే అంతా జరిగిపోతుంది. ఈ క్రోధానికి కూడా ఒక మూలం ఉంటుందని స్వామి దీని ముందటి శ్లోకంలో చెప్పాడు. ‘.. కామాత్‌ క్రోధో భిజాయతే’ (2.62). కోరికలే క్రోధానికి కారణం. అవి తీరనప్పుడు మనిషి కోపానికి గురవుతాడు. ఇది సామాన్యులకేకాదు ఒక్కోసారి ధీమంతులనుకూడా పతనం దిశగా అడుగులు వేయిస్తుంది. ఈ క్రోధం వల్ల మొదట మూఢత్వం వస్తుంది. దీనితో మనిషి ‘స్మరణ శక్తి’ని కోల్పోయి ప్రవర్తిస్తాడు. తత్ఫలితంగానే ‘స్మృతి విభ్రమం బారిన పడతాడు’ అని భగవానుడు హెచ్చరించాడు. బుద్ధి నశించి, చెయ్యరాని పనులన్నీ చేసే దిశగా అలాంటివారు అడుగులేస్తారు. ఒక్కోసారి విచక్షణా జ్ఞానం సైతం కోల్పోయి అమానవీయంగానూ ప్రవర్తిస్తారు. ఇదే అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. 

ఈ విధమైన క్రోధాన్ని నివారించడానికి చేసే ప్రయత్నం గురించి ప్రతి వ్యక్తీ చిత్తశుద్ధితో ఆలోచించాలన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా తనకు, తన వల్ల సమాజానికి ఏర్పడబోయే దుస్థితిని తప్పించవచ్చు. సకల అనర్థాలకు కారణమైన ఈ దుర్గుణం ఎల్లవేళలా పరిహరించవలసిందే. ‘కామం, క్రోధం, సమ్మోహం, స్మృతి విభ్రమం, బుద్ధి నాశనం, చివరకు సర్వనాశనం’- ఈ వరుసలో తానెక్కడున్నాడో తెలుసుకున్న మానవుడు సరైన మార్గంలోకి మళ్లి, భగవద్భావన దిశగా పయనిస్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఎవరు, ఏ విధంగా జీవించినా తనను తాను నియంత్రించుకొంటే శుభాలు జరుగుతాయి. ఎదుటి వ్యక్తికి అడ్డు చెప్పే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. కానీ, తన స్వేచ్ఛ తన బతుకునేగాక సమాజంలోని ఇతరుల బతుకునుకూడా సర్వనాశనం చేసే దిశగా వున్నప్పుడే పెనుప్రమాదాలు పొంచి వుంటాయి. తన కోరికలు తీర్చుకోవడానికి సిద్ధమైన వ్యక్తి ఉచితానుచితాలు ఆలోచించక పోవడానికి అతనిలో ‘స్మృతి విభ్రమమే’ మూల కారణం. కనుక, జీవితంలో మనం ఆశించినవన్నీ విధిగా పొంది తీరాలన్న తీవ్ర కోరికల్ని పెంచుకోక పోవడమే మంచిది. 

ఒక్కోసారి మన కోరికలు ఎండమావుల్లో నీటిని ఆశించినట్లుగా ఉంటాయి. అవి తీరే మార్గమే ఉండదు. అయినా, అవి ఉన్నట్టు కనిపించి మనల్ని భ్రమింపజేస్తుంటాయి. ఈ విషయంలో మనకు తెలియకుండానే మనలో విపరీత ధోరణులు చోటు చేసుకొని మానవీయ విలువలకూ తిలోదకాలు ఇచ్చేంత తీవ్రతర ప్రభావానికి లోను చేస్తాయి. కనుక, కోరదగిందే కోరుకొంటూ, ధర్మబద్ధంగా, కర్తవ్య నిష్ఠ, గుండె దిటవులతో జీవించగలిగితే వినాశకరమైన క్రోధాలోచనలకు ఎంతమాత్రం చోటు వుండదు.

[

*దయాగుణమే మానవత్వం*


భాగవతం అష్టమ స్కంధంలో పోతన గారు ఓ మాటంటారు... ‘‘కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటగట్టుకొని పోవం జాలిరే? భూమిపై బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్‌ యశః కాములై యీరే కోర్కులు? వారలన్‌ మఱచిరే యిక్కాలమున్‌? భార్గవా!’’...ఈ భూమిని కోట్లమంది రాజులు పాలించారు, వీరిలో ఎంతమంది మనకు జ్ఞాపకం ఉన్నారు ? ఉండరు. ఎవడు సాటివారి ఆపదలను తీర్చడానికి ముందుకు వచ్చాడో, కష్టాల్లో ఉన్నవారిని గురించి ఆలోచించాడో వాడు చిరస్థాయిగా మిగిలిపోతాడు. వాడి కీర్తి మిగిలి పోతుంది. వాడు చూపిన దయ వాడికి చుట్టమై వాడిని వాడి పిల్లల్న్లి, పిల్లల పిల్లల్ని కూడా కాపాడుతూ పోతుంటుంది.


రంతిదేవోఖ్యానం అని ఒక ఉపాఖ్యానం...తినడానికి ఏమీ లేక 47 రోజులు రంతిదేవుడు పస్తులున్నాడు. 48వ రోజున కాస్త అన్నం, పాయసం, నెయ్యి, కాసిని మంచినీళ్ళు దొరికాయి. వాటిని తినబోతుండగా ... డొక్కలు ఎండిపోయిన కొందరు వచ్చి చేయి చాపితే ఆహార పదార్థాలన్నీ వారికిచ్చేసాడు. నీళ్ళుతాగి ఉపశమనం పొందుదామని అనుకుంటూ నీళ్ళ చెంబెత్తుకుని తాగబోతున్న క్షణంలో... ‘కళ్ళు తిరుగుతున్నాయ్, నిలవలేక పోతున్నా, గొంతెండుకుపోతున్నది’ అన్న ఆర్తనాదం వినిపించింది. ‘నీళ్ళు కూడా తాగనివ్వరా..’’ అని ఆయన విసుక్కోలేదు. ...‘‘అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రావన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్‌ గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మేలున్నదె? నాకు దిక్కు పురుషోత్తము? డొక్క?డె చుమ్ము పుల్కసా!’’ అంటూ వెళ్ళి ఉన్న ఆ కొన్ని నీళ్ళు దాహార్తికిచ్చేసాడు.


మనిషి హృదయం రాయిలా ఉందనుకోండి. చిక్కిన లేడిపిల్లతో పులి ఎలా చెలగాటమాడుతుందో అలా కష్టంలో ఉన్నవాళ్ళని చూసి కరగకపోగా దానికి హాస్యం ఆడడం అలవాటవుతుంది. వాడు కష్టంలో ఉన్నాడుగా.. ఎదురుతిరిగి ఏమీ అనలేడుగా... అందుకని వాళ్ళని పరిహాసాలాడడం, చిన్నబుచ్చుకునేటట్లు చేయడం... ఇది మంచి లక్షణం కాదు.. ముఖ్యంగా పిల్లలు ఇటువంటి లక్షణాలను అలవర్చుకోకూడదు.  మనిషి మనిషిగా బతకడానికి మూడు విషయాలు నేర్చుకోమంటారు..


1. ఇతరులు సంతోషపడుతుంటే చూసి మనం కూడా సంతోషించాలి.. వాడు సంతోషపడడం చూసి నువ్వు ఏడ్వడం మొదలుపెడితే... పాడయిపోయేది నువ్వే. 2. వాడు కష్టంలో ఉన్నట్లు తెలిసింది.. అది నీ కష్టమనే అనుకొని గబగబా వెళ్ళి వాడికి ఉపకారం చేయడానికి ప్రయత్నించడం నేర్చుకో. 3. నీ వల్ల మరొకరు కన్నీళ్ళు పెట్టుకునే ఘడియ నీ జీవితంలో ఎప్పుడూ రాకుండా చూడు. మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బతకడం అంటే అది. దయాగుణం ఉంటే మనసు రాయిలా ఉండదు వెన్నలా కరుగుతుంది. అలాకాక ఉపకారం చేయాల్సిన సమయం లో అది చేయకపోగా చులకనగా చూడడం, నిందలు వేయడం అన్న ధోరణి ఉందంటే... పశువుల్లో లెక్కవేస్తారు తప్ప మనిషిగా లెక్కగట్టరు.


‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టం అవుతుందని చెప్పింది ఇందుకే. అది సర్వవేళలా నిన్ను కాపాడే చుట్టమవుతుంది. వార్తల్లో చూస్తుంటాం... ప్రమాదవశాత్తూ ఎవడో రోడ్డుమీద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే... వెళ్ళి వారి ప్రాణరక్షణకు ప్రయత్నించకుండా... సెల్‌ఫోన్‌లో చిత్రిస్తున్న వారి గురించి చదువుతుంటే... అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నదని తెలుసుకుంటుంటే... బాధనిపిస్తుంది... పిల్లల్లో ఈ సంస్కారం ఉండడం సభ్యసమాజానికి మంచిది కాదు.

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

[

*మానసిక సౌఖ్యం మహోన్నతం*


సుఖం, అనేది అంగట్లో దొరికే వస్తువే అయితే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువు అయ్యేది. వెండి, బంగారం, వజ్రాల కంటే విలువైనది అయ్యేది. అది కొని తెచ్చుకునేది కాదు. ప్రతి మనిషీ తనకు తాను, తనలో తాను రూపొందించుకునే గొప్ప అనుభూతి! మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు, ధనరాశులు, రాజ్యం, అధికారం, మహా ఐశ్వర్యం ఇవన్నీ దర్పాన్ని తెచ్చిపెడతాయి కానీ, చిటికెడు సుఖాన్ని అందించలేవు. కనీసం కంటినిండా కునుకు తీసే అవకాశాన్ని ఇవ్వలేవు.

కప్పినుడు అలాంటి పరిస్థితిని చవిచూశాడు. అతను కుక్కుట రాజ్యానికి రాజు. తండ్రి మరణానంతరం రాజయ్యాక జంబూ ద్వీపం మొత్తాన్ని జయించాడు. రాజులందర్నీ పొరద్రోలాడు. కానీ... మెత్తటి పడక ఉన్నా, సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉన్నా కంటినిండా నిద్రపోలేక పోయాడు. శత్రువులు ఏ క్షణాన, ఏ రూపంలో వచ్చి పడతారో అనే భయం. అతను ఒకరోజున నగర ప్రదక్షిణ చేస్తూ చెట్టుకింద హాయిగా నిద్రపోతున్న ఒక భిక్షువుని చూశాడు. ఆగి అతణ్ణి లేపి ‘‘నీ సుఖనిద్రకు కారణం ఏమిటి?’’ అని అడిగాడు. ఆ భిక్షువు రాజుని బుద్ధుని దగ్గరకు తీసుకుపోయాడు. బుద్ధ ప్రబోధం విన్నాడు రాజు.

‘‘కోరికలు ఎడతెరిపి లేనివి. వాటివల్ల కలిగే కామసుఖం తాత్కాలికం. కానీ నిష్కామసుఖం గొప్పది. శాశ్వతం. సంపాదనతో ముడిపడిన కర్మవల్ల కలిగే సుఖం కొద్దిపాటిది. అలా ముడిపడనిది మహత్తరమైనది. తృష్ణవల్ల కలిగే సుఖం తుచ్ఛం. తృష్ణారహిత సుఖం అమోఘం. లేశమంతే లౌకిక సుఖం. అద్వితీయం. అలౌకికసుఖం, శారీరక సుఖం కంటే మానసిక సుఖం మహోన్నతమైంది. సుఖం మీద ప్రీతితో పొందే సుఖం కంటే అప్రీతితో పొందే సుఖం అమరమైంది. అపేక్షతో పొందే సుఖం అమరమైంది. ఆపేక్షతో పొందే సుఖం కంటే ఉపేక్షతో పొందే సుఖం ఉన్నతమైంది. ఉత్తమమైంది. సమాధిస్థితిలో పొందే సుఖం అనిర్వచనీచమైంది. ఒక గృహస్తు పొందే సుఖం కంటే తాపసి. ధ్యాని పొందే సుఖం ధరణీతలంలో అన్నింటికంటే గొప్పది’’ అని చెప్పాడు.


మనం మరొకరి సుఖాన్ని దొంగిలించినా, లాక్కున్నా అది మనకు సుఖాన్నివ్వదు. దొంగ అందుకే ఎంత ధనాన్ని దోచుకున్నా సుఖంగా బతకలేడు. పట్టుబడతానేమో అనే భయంతో బతుకుతూనే ఉంటాడు. కామ దురాచారుల గతి కూడా అంతే! ఎదుటివారి శ్రమను దోపిడి చేసినా, సంపదను దోచుకున్నా, పరుల అధికారాన్ని, రాజ్యాల్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నా, ఆస్తి, అంతస్తు అధికారాల్ని పెంచుతాయి గానీ, ఆదమరచి నిద్రపోనీయవు. కునుకు సుఖాన్ని కూడా దక్కనీయవు. కామ, క్రోధ, లోభ, మోహ, రాగాల్ని వీడినవారే అమరమైన సుఖాన్ని పొందగలరు. బుద్ధ ప్రబోధానంతరం, రాజ్యాన్ని త్యజించి, భిక్షువుగా మారాడు కప్పియరాజు. ‘ప్రజ్ఞాని మాత్రమే సుఖంగా జీవిస్తా’డనే బుద్ధవాక్కు ప్రకారం ఆ తర్వాత ఆనందంగా, సుఖంగా, కంటినిండా నిద్రపోయాడు. జీవితాంతం ధర్మాన్ని ప్రబోధిస్తూ మరణించాక కూడా అమరుడయ్యాడు. కప్పియ భిక్షువుగా కీర్తిగాంచాడు.                                

– డా. బొర్రా గోవర్ధన్‌

[20/09, 7:49 pm] +91 80995 58991: ఉదంకుడు వ్యాసమహర్షి నలుగురి శిష్యులలో ఒకరైన పైలుడి శిష్యుడు. ఉదంకుడు గురువును భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామనసాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పోందాడు. ఒకరోజు అతడు తన వయసు మీరి పోయిందని గ్రహించి చితించి గురువుకు చెప్పి బాధ పడగా గురువు అతడిని ఊరడించి తన కహమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వాడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. ఉదంకుడు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించి బయలుదేరే సమయంలో గురువు అతనికి బుద్ధిమతి చెప్పి పంపాడు.


పౌష్యమీ దేవి కుండలాలను కోరుట

వెళుతున్న సమయంలో ఒక దివ్యపురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు. ఉదంకుడు మారుమాటాడక అలాగే చేసాడు. ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి " నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను. అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను " అని అడిగాడు. ఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు " మహాత్మా ! నాభార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి " అని బదులిచ్చాడు.


కుండలాలను ఇచ్చుట

ఉదంకుడు అలాగే పౌష్యమహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు " వద్దకు వచ్చి " మహారాజా ! నాకు ఆమెకనిపించ లేదు. కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి. " అన్నాడు. మహారాజు ఆమె మహాత్మా ! ఆమె మహా పతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి." అని చెప్పాడు. ఉదంకుడు అప్పుడు తాను గోమయం తినిన తరువాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు తెచ్చుకుని కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యా దేవి కనిపించింది. ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ " ముని కుమారా ! ఈ కుండలములు " కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు. నీవు ఈ కుండలములు అతడి కంట బడకుండా జాగ్రత్తగా తీసుకుని పో" అని చెప్పింది.


ఉదంకుడు పౌష్యుల శాపప్రతిశాపాలు

కుండలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డి వాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి " ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్షా. నేను నీకు ప్రతి శాపం ఇస్తున్నాను. నీవు సంతాన హీనుడవు కమ్ము" అన్నాడు. . తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా ! నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు " అని కోరగా పౌష్యుడు " మనసు నవనీతం, మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం. క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించ లేను కనుక నీవు ఉపసంహరించు" అన్నాడు. అందుకు ఉదంకుడు " కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు.


తక్షకుడు కుండలములు తస్కరించుట

అలాగే అని చెప్పి ఉదకుండు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందచేయాలని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉదకుండు అనుష్టానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదాశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళాడు. అతనిని వెన్నంటి వెళ్ళిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తానూ ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు. నాగ ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ " వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శయ్యగా సేవలు చేస్తున్న అనంతా ! నీకు నమస్కారం. సమస్త నాగలోకమును రాక్షసుల బారినుడి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకికి వందనం. సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకొంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి. కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షకా న్ను అనుగ్రహించు. " అని ప్రార్థించాడు.


కుండలములు గ్రహించుట

అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న ఇద్దరు స్త్రీలు, పన్నెండు ఆకులుగల చక్రమును తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల ఆరుగురు కుమారులు. మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు. ఆ దివ్యపురుషుడు అతని వద్దకు వచ్చి " ఉదంకా నీ భక్తికి మెచ్చాను. ఏమి కావాలో కోరుకో " అన్నాడు. ఉదంకుడు " ఈ నాగలోకం నాకు వశం కావాలి " అని కోరాడు. అలాగే అని వరమిచ్చిఆ దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్ని జ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లి పోయారు. తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడి నుడి బయటపడే మార్గం లేక ఉదంకుడు అయోమయంలో పడగా దివ్యపురుషుడు " ఉదంకా ! ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు " వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుడలాలను గురుపత్నికి సమర్పించాడు.


ఉదంకుడు గురుదక్షిణ సమర్పించుట

గురువు ఉదంకునితో " ఉదంకా ! సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుడలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎదుకు అయ్యింది " అని అడిగాడు. ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు. గురువు " ఉదంకా ! నీవు ధన్యుడివి. ఎద్దును ఎక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. గోమయం అమృతం. అది సేవించడం వలనే నీవు అనుకునిన పని చేయగలిగావు. నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత, విధాత. నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు.పన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు మాసమపలకు ప్రతీక అయిన కాల చక్రం. వారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు. గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించున్నావు. ఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది " అని పలికాడు.


తక్షకుని మీద ఉదంకుని ప్రతీకారం

అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందు కొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు. " జనమేజయ మహారాజా ! నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను గురువు గారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేసాడు. నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేసాడు. శృంగి శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు మహారాజును అతి క్రూరంగా కాటు వేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు. మహా బలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా డంపాడు కదా ! నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా ! ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసి నట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి " అని జనమేజయుని రెచ్చకొట్టాడు. .

[

🙏 ప్రాణదీపం🙏

సూర్యాస్తమయం అయింది. వెలుగు రేఖలు అంతరించాయి. చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఒక సాధువు ఆ చీకట్లో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆయన చేతిలో దీపం ఒకటుంది. అది గాలికి అప్పుడప్పుడూ అటు ఇటు కదలుతోంది. ఆ దారినపోతున్న యువకుడు సాధువును ఇలా ప్రశ్నించాడు- ‘స్వామీ! మీరు పట్టుకున్న దీపంలో వెలుగు ఎక్కడి నుంచి వస్తున్నదో చెప్పండి’. సాధువు సమాధానం చెప్పకుండా నిర్వికారంగా తన దారిన తాను పోతున్నాడు. యువకుడు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. ఇంతలో గాలి విసురుగా వచ్చింది. సాధువు చేతిలోని దీపం టపటప కొట్టుకొని పుటుక్కున ఆరిపోయింది. సాధువు ‘నాయనా! ఈ దీపం వెలుగు ఇప్పుడు ఎక్కడకు వెళ్లిందో చెప్పగలవా? అది నువ్వు చెప్పగలిగితే వెలుగు ఎక్కడ నుంచి ఎలా వచ్చిందో చెప్పగలుగుతా’ అని సమాధానమిచ్చాడు.

దోసపాదు పెద్ద ఆకులతో పూలతో పిందెలతో ఎదుగుతుంది. ఒక పిందె అనతికాలంలోనే కాయగా మారుతుంది. మరికొంత కాలంలోనే ‘దోసపండు’ సిద్ధమవుతుంది. దోసపండును ఎవరూ తుంచనక్కరలేదు. చెట్టు నుంచి అదే ఊడిపోతుంది. ఈ క్రమం అంతా అత్యంత సహజంగా జరుగుతుంది. మానవుడికి మరణం అలా సిద్ధించాలని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. $కాలం ప్రాణులను పక్వం చేస్తూ ఉంటుంది. కాలమే ప్రజలను సంహరిస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోయేటప్పుడు సైతం కాలం మేలుకొనే ఉంటుంది. కాలమహిమను ఎవరూ అతిక్రమించలేరు.

తెలుగులో ‘కాలం చేయడం’ ఒక జాతీయం. అర్థం ‘మరణించడం’. కాలాన్ని ఎవరూ దాటిపోలేరు కాబట్టి మరణాన్నీ ఎవరూ తప్పించుకోలేరు. జీవన పోరాటంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో ఆ దేవుడికే తెలియాలి. ఆరాటమేతప్ప పోరాటం, ప్రయత్నం అసలు చేయని బలహీనులు; ఎంతో కాలం పోరాటం చేసి అలసిసొలసిన బలవంతులు... అందరూ కాలం చేయవలసిందే! చివరి క్షణాల్లోనైనా భగవంతుడు గుర్తుకు వస్తే అదృష్టవంతులే! ‘బలం కొంచెం కూడా లేదు, అవయవాలు పనిచేయడం లేదు,ప్రాణాలు ఉంటాయా ఊడతాయా అన్నట్లుంది. శరీరం పూర్తిగా అలసిపోయింది, ఇప్పుడు నా మనసునిండా దేవుడొక్కడే నిండి ఉన్నాడు. ఈ దీనుడిపై దయ చూపాలి! రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!’ అని గజేంద్రుడిలా ఆ జగద్రక్షకుని ప్రార్థించి మోక్షం పొందవచ్చు. ఆ జగద్రక్షకుడు ఎవరో, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహకు అందవు. అయినా ఫరవాలేదు. ‘సర్వేశ్వరుడు భక్త రక్షకుడు. ఆపదుద్ధారకుడు, ఏం జరిగినా ఆయనే దిక్కు నాకు’ అనే భావన కలిగితే చాలు, వాళ్ళు అదృష్టవంతులే! ఇక మరణ భయం ఉండదు! హరి నామస్మరణ తప్పక ముక్తినిస్తుంది. పూర్వం ఖట్వాంగుడు అనే రాజు దేవతలను ‘నా ఆయువు ఎంత?’ అని అడిగాడు. ‘నీ ఆయుష్షు ఇంకా ఒక్క ముహూర్తకాలం మాత్రమే’ అన్నారు దేవతలు. వెంటనే రాజు తన సంపదను దానం చేసి, వైరాగ్యంతో శ్రీహరిని మనసులో నిలుపుకొని ముక్తిని పొందాడు.

ప్రాణం ఒక దీపం. అది ఎప్పటికైనా ఆరిపోక తప్పదు. ఈ సంగతి మనసులో స్థిరంగా ఉంటే- లోకంలో ఇన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఉండవు. ఈ ఆరిన దీపం పోయి పరమేశ్వరుడి పాదాల దగ్గర వెలుగునిస్తుంది. తెలుగు భాగవతం పన్నెండో స్కంధంలో వెలిగందల నారయ మహాకవీంద్రుడు శుకయోగితో చెప్పించిన మాటలు- సర్వమానవాళికి సర్వకాలాలకు పనికివచ్చే రతనాల మూటలు...

‘ఓ రాజా! మరణిస్తానేమో అనే భయాన్ని మనసులో నుంచి వదిలిపెట్టు! పుట్టుకగల మానవజాతికి చావూ తప్పదు. కాబట్టి హరిని నిత్యమూ స్మరిస్తూ ఉండు. ఇక మళ్ళీ భూమిపై జన్మ అంటూ నీకు ఉండదు! వైకుంఠంలో సుఖంగా ఉంటావు!’

[


*ధృతరాష్ట్రుని చింత*


భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి సంజయా! అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. నాలుగు దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారు ధర్మవర్తనులు వారిని విజయలక్ష్మి వరిస్తుంది అన్నాడు . సంజయుడు సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుని అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభి షేకం చేస్తానని అన్నాడట. మిగిలినవారు వారించి అర్జునినికి సారధ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సాయంతో అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునిని దివ్యాస్త్రాలకు, భీముని గధాఘాతాలకు తట్టుకోగలరా? అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు నేనేం చేసేది సంజయా ! నేను ముసలి వాడిని. నాకొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేంచేయుదును అని పరితపించాడు. ధరమరాజు కామ్యకవనంలో అర్జునిని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు అన్నయ్యా! నువ్వే కదా అర్జునిని తపసుకు పంపింది. మన బతుకులన్నీ అర్జునిని మీద ఆధారపై ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునిని వెంటనే తీసుకు రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము. రణరంగంలో నన్ను ,అర్జునిని ఎదిరించే వారు లేరు అన్నాడు. అందుకు ధర్మరాజు భీమసేనా! ఆ విషయం నాకు తెలియును కాని యుద్ధానికి ఇది సమయం కాదు. పదమూడు సంవత్సరాల తరువాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను అన్నాడు ధర్మరాజు.

[


మానవాభ్యున్నతికై వేదాలు ‘ధర్మ, అర్థ, కామ, మోక్షం’ అనే నాలుగు (చతుర్విధ) పురుషార్థాలను నిర్దేశించాయి. మానవ ధార్మిక జీవన గమనానికి పునాదులైన వీటిని ప్రతి ఒక్కరూ విధిగా ఆచరించాలి. ధర్మాచరణ వల్ల క్లేశాల బారిన పడకుండ మనిషి తనను తాను రక్షించుకోగలడు.

పనులను ఒక యజ్ఞంలా, భగవదర్పితంగా ఆచరించాలి. లేకపోతే, అవి మనలను ఈ జగత్తులో కర్మబంధాలలో కట్టివేస్తాయి. ఓ కుంతీపుత్రుడా! నీకు నిర్దేశితమైన విధులను వాటి ఫలితాలపై ఆసక్తి లేకుండా విష్ణు ప్రీత్యర్థమే నిర్వర్తించు’. ‘భగవద్గీత’లోని ఈ నిర్దేశానుసారం మనం ఆచరించే పనులన్నిటినీ యజ్ఞపురుషుడైన విష్ణువు సంతృప్తి కోసం నిర్వర్తించినప్పుడు మాత్రమే కర్మబంధనాల నుంచి మనం విముక్తి పొందగలం. ధర్మాచరణ వల్ల అర్థమూ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ధార్మికంగా మాత్రమే ధనాన్ని ఆర్జించాలి. అలా ఆర్జించిన ధనాన్ని మరింత విష్ణు భక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగించాలి. ధార్మిక ధనంతో విష్ణువును సేవించటం వల్ల జీవితంలో సుఖాలను ఆస్వాదించగలరు. ఇదే ‘ధర్మబద్ధమైన కామం’.

ఇంద్రియ సౌఖ్యాలను ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఆస్వాదించడం సాధ్యమే. సంతాన ప్రాప్తి కోసమే కామాన్ని ఆచరించాలని ‘భగవద్గీత’ సూచించింది. సంతానాన్ని చక్కగా సంరక్షిస్తూ, విష్ణు ప్రీతికోసం నిర్దేశితమైన ధర్మాచరణలను వారికి బోధించాలి. వాస్తవానికి శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’లో ‘ధర్మావిరుద్ధో కామోస్మి’ అని సంబోధించాడు. అంటే, ‘ధర్మ విరుద్ధం కాని కామం పట్ల నేను ప్రసన్నుడనవుతాను’. పలు ధార్మిక భోగాలనంతరం చివరికి మోక్షాన్ని పొంది భగవద్ధామమైన వైకుంఠాన్ని చేరాలని భావించడమే అంతిమ పురుషార్థం. విష్ణు ప్రీతి కోసం గడిపిన జీవితం సహజంగానే భగవద్ధామాన్ని చేరే మార్గాన్ని సుగమం చేసి, ఆ సాంగత్యంలో శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇదే నిజమైన మోక్షం.

శ్రీచైతన్య మహాప్రభువుల వారు మరో అడుగు ముందుకేసి, ‘ప్రతి జీవుని అంతిమలక్ష్యం దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పట్ల పరిపూర్ణమైన ప్రేమను పొందటమే’ అంటూ, ‘పంచమ పురుషార్థాన్ని’ వివరించారు. శ్రీల ప్రభుపాదుల వారు దీనినే ‘శ్రీమద్భాగవతం నాల్గవ స్కంద’ వ్యాఖ్యానంలోనూ తెలిపారు. ‘ధృవ మహారాజుచే భగవంతుడు పురుషార్థమూర్తి అంటూ మానవ జీవిత అంతిమలక్ష్యాన్ని’ స్తుతించారు. సాధారణంగా, చతుర్విధ పురుషార్థాలు మతాచారాలుగానో లేదా భౌతికపరమైన వరానుగ్రహం నిమిత్తం భగవంతుని ఆరాధన విధి విధానాలు గానో పరిగణింపబడుతుంటాయి. భౌతిక లాభాపేక్షతో చేసే ప్రార్థనలు ఇంద్రియ ప్రీత్యర్థమే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా తన ఇంద్రియాలను పూర్తిగా సంతృప్తి పరచుకోలేక ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తిని ప్రసాదించే మోక్షానికై జీవుడు ఆరాటపడతాడు.

వాస్తవానికి జీవుని అంతిమలక్ష్యం ‘భగవంతుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోవడమే’. ఇదే ‘పంచమ పురుషార్థం’. అందుకే, శ్రీ చైతన్య మహాప్రభువులవారు ‘మనం భగవంతుణ్ణి భౌతిక సంపదలు, కీర్తి ప్రతిష్ఠలు, చక్కటి అర్థాంగి వంటి కోర్కెల కోసం ప్రార్థించరాదని’ సూచించారు. ‘కేవలం తన సేవలో సదా నియుక్తులమయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమనే’ మనం ప్రార్థించాలి. ధృవ మహారాజు తనలోని భౌతిక లాభాపేక్ష గుణాన్ని గుర్తించి, దాని కారణంగా తాను భగవంతుని సేవాపథం నుంచి పక్కదారి పట్టకుండా స్వామి రక్షణను కోరుకున్నాడు (శ్రీమద్భాగవతం: 4వ స్కందం). ‘ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. కానీ, ‘కృష్ణ ప్రేమ’ అనే పంచమ పురుషార్థం ముందు ఇవన్నీ తృణప్రాయాలే’- (శ్రీచైతన్య చరితామృతం: ఆది లీల- 7.84). కనుక, ప్రతి ఒక్కరూ నిత్యం ‘హరేకృష్ణ’ మంత్రాన్ని జపించడాన్ని నిత్యకృత్యంగా మార్చుకోవాలి.

[

‘అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు’. మతిమరపువల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసినా కూడా పాపం పాపమే. దానిని పోగొట్టుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. మిక్కిలి కోపిష్ఠుడైన కౌశికునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాటను నొక్కి చెప్పాడు.

మది మఱపున బాపము దన

కొదవుటయును బిదప వగచి యొక సగమును నే

నిది సేయనింక ననియెడు

మదిఁ బెఱ సగమును నరుఁడు మలుఁగు నఘంబున్‌.

-మహాభారతం (ఆరణ్యపర్వం:5-41)

‘తెలియకుండా చేసిన పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగ పాపం తొలగిపోతుంది’. ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. ‘తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటును తెలుసుకొని, ఇక ముందెప్పుడూ దానిని చేయకూడదని నిర్ణయించుకొని బాధ పడటమే’ పశ్చాత్తాపమని మన సనాతన ధర్మం చెపుతున్నది. అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నాన్నే ‘ప్రాయశ్చిత్తమని’ అంటారు. ప్రతి మనిషీ మనసా వాచా కర్మణా ఎప్పడూ ఏ తప్పులనూ చేయకుండా ఉండాలి. ఏ తప్పుకైనా ఆ పాపం ఊరికే పోదు. ఒకవేళ ఏవైనా పొరపాట్లు అనుకోకుండానో, పరధ్యానంలోనో చేసినా వాటికి పరిహారంగా ఆ పాప ప్రాయశ్చిత్తం చేస్తుండాలి. అప్పుడే, ఆ పాపం తొలగిపోతుంది. ‘కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని’ పురాణాలు చెపుతున్నాయి. దానినే ‘మనఃప్రాయశ్చిత్త’మని అంటారు.

పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్‌

ఆచార్యస్యచ సర్వదా

తేషుహి త్రిషు తృప్తేషు

తపస్సర్వం సమాప్యతే.

‘తల్లి, తండ్రి మాటనుగానీ, గురువు మాటనుగానీ జవ దాటకుండా ఎప్పుడూ వారికి అనుకూలంగా నడుచుకోవాలి. ఈ ముగ్గురూ తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిధ్ధిస్తుంది’. తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్కృతి లేదు. ఎప్పుడైనా గురువు మాటను ధిక్కరించి మాట్లాడితే, ఆ పాపం సదరు గురువును వినయ విధేయతలతో ఆహ్వానించి, ఉపాహారాన్ని సమర్పించుకొని సంతోష పెట్టడం ద్వారా తొలగింపజేసుకోవచ్చు. కొట్టివేయ కూడని చెట్టును నరికి వేయడం, స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించడం వంటివీ మహాపాప హేతువులే. ఐతే, అనుకోకుండా చేసే పాపాలు ‘అన్నపానీయాలను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ నియమనిష్ఠలతో జీవితాన్ని గడపడం ద్వారా’ నశిస్తాయి. దైవసన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగిలించిన పాపం వల్ల గుడ్డివాళ్లయి పోతారు. గుడిపైనగానీ, రథంపైగానీ, పర్వతంపైగానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది. చేసిన పాపాలకు పరిహారంగా ఇలాంటి శిక్షలు ధర్మశాస్ర్తాలలో చెప్పడమనేది మనం అలాంటి పాపాలకు పాల్పడకూడదనే. ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. అలాంటి పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.

[


*పాలనలో పొరపాట్లు*(కథ)  నారంశెట్టి ఉమామహేశ్వరరావు


          మాళవరాజు మదనుడు  అకస్మాత్తుగా చనిపోవడంతో   యువరాజు మోహనుడు రాజయ్యాడు.  యువరాజుకు  పాలనానుభవం  లేదు. తండ్రి కంటే మంచి  పేరు తెచ్చుకోవాలన్న కోరిక మాత్రం  ఉండేది.  అందుకోసం  ఏమి చేయాలని  ఆలోచించాడు. కానీ తగిన ఆలోచన తట్టకపోవడంతో మంత్రులను    సలహా అడిగాడు. 

“మీకు పాలనలో అనుభవం వచ్చాక కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి   అనుభవజ్ఞుడైన మీ తండ్రి పాలనను  కొనసాగిద్దాం”  చెప్పాడు మంత్రి  వివేకుడు. 

    యువరాజుకు  ఆ మాటలు నచ్చలేదు. కొందరు మంత్రులు మాత్రం మోహనుడిని మెప్పించే  సలహాలిచ్చారు. అవి  విన్న  మోహనుడు సంతోషించి  ప్రజలతో  సభ ఏర్పాటు చేసాడు. తాము అమలు చేయబోతున్న పథకాలను వారికి  చెప్పాడు. ప్రజలంతా చప్పట్లతో   ఆమోదం తెలిపారు. 

మరునాటి నుండి  రాజ్యమంతటా పేదలందరికీ ఉచిత ఆహారధాన్యాలను  అందించారు. ఇల్లు నిర్మించి ఇచ్చారు. నిరుద్యోగులు, వికలాంగులు, వయో వృద్ధులకు ధన సహాయం చేసారు. ధర్మసత్రాలు, అన్నదాన కేంద్రాలు నిర్మించి  వసతి, ఉచిత భోజన సదుపాయాలు  కల్పించారు.    

      ‘అలాంటి పథకాల వలన ముందు ముందు కష్టాలు వస్తాయని’ చెప్పాడు వివేకుడు. యువరాజు  వాటిని పెడచెవిన పెట్టాడు. ప్రజలు సంతోషించడమే కాకుండా యువరాజుని  పొగిడారు.   

      అన్ని అవసరాలను రాజుగారే  ఉచితంగా తీర్చడం   సోమరులకు వరంగా మారింది. పేద కుటుంబాల వారికి   ఆహారధాన్యాలతో బాటు కొంత డబ్బు ఇవ్వడంతో వారికి  పనుల మీద శ్రద్ధ తగ్గింది. మరికొందరు ఇంట్లో  వంట   మానేసి  ఉచిత భోజనశాలకు వెళ్లారు.  

       శ్రమ పడకుండా డబ్బు, ఆహారం చేతికి  అందుతుండేసరికి  చేతి  వృత్తుల వారి ఆలోచనల్లో  మార్పు వచ్చింది. ఎండనకా వాననకా కష్టమెందుకు పడాలనుకున్నారు. వృత్తి పనులను మూల పెట్టేసారు. మరొకవైపు పొలంలో పనికి కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడ్డారు. సమయానికి పంటలు వేయలేకపోయారు కొందరు. మరి కొందరు పంటల్నే పండించలేదు. 

తమ పిల్లలు చదువుకున్న వారయితే నౌకరీ దొరుకుతుందన్న ఆశతో  బడులకు పంపే తల్లిదండ్రుల  ఆలోచనలో మార్పు వచ్చింది. అన్నీ రాజుగారే ఇస్తుంటే వేరే కొలువులెందుకని బడులకు పిల్లల్ని పంపడం మానేశారు. వ్యాపారులయితే  యువరాజు   బలహీనత కనిపెట్టి  పన్నులు చెల్లించకుండా సాకులతో తప్పించుకునేవారు.   

పని చెయ్యకుండా ఉండడంతో పొద్దుపోక  జూదం, మద్యపానం  వైపు మొగ్గు చూపారు  ప్రజలు.  రాజ్యంలో క్రమశిక్షణ  నశించింది. 

     రెండేళ్ళు  గడిచే సరికి  ఖజానా ఖాళీ అయింది.    పంటలు పండించక రాజ్యంలో  తిండి ధాన్యాల కొరత వచ్చింది.  మరోప్రక్క పన్నుల ఆదాయం  తగ్గింది. చాలా సరుకులకు రాజ్యంలో కొరత వచ్చింది. 

    ఖజానాలో డబ్బు లేకపోవడం వల్ల సైనిక సదుపాయాల్లో, జీతాల్లో కోత విధించాడు రాజు. ఫలితంగా సైనికుల ఆత్మవిశ్వాసం, నైపుణ్యం దెబ్బతిన్నాయి. క్రమశిక్షణ కొరవడింది.  అలసత్వం, బద్ధకం పెరిగాయి.  

    మాళవ రాజ్య పరిస్థితులను వేగుల ద్వారా నిత్యమూ తెలుసుకుంటున్న శత్రురాజు సమీరుడు అదే మంచి సమయ మనుకున్నాడు. దండయాత్రకు వస్తున్నట్టు   మోహనుడికి వర్తమానం పంపించాడు. 

దిక్కుతోచక అత్యవసర సమావేశం ఏర్పాటు  చేసి గండం గట్టెక్కించమని మంత్రులను కోరాడు మోహనుడు.  

    వివేకుడు “ఉచితాలను అలవాటు చేయొద్దని  విన్నవించినా తమరు వినలేదు. తమ తండ్రి  గారు  ఇలాంటివి  ప్రోత్సహించలేదు. సరికదా  శ్రమ గొప్పదనం వివరిస్తూ  కష్టార్జితం విలువ తెలిపేవారు. మన రాజ్యం సుభిక్షంగా ఉండేదప్పుడు. ఇప్పుడు  సోమరులతో, వ్యసనపరులతో  నిండిపోయింది.    మీ తండ్రిలా  కష్టించే తత్వాన్ని  ప్రజల్లో పెంచుతానంటే ఉపాయం ఆలోచిస్తాను’  అన్నాడు . 

    వివేకుడి మాటలకు  అంగీకారం తెలపడమే కాకుండా  తక్షణమే ఉచితాలను రద్దు చేసిన పత్రం విడుదల చేసాడు మోహనుడు. 

    వివేకుడు తన బుర్రకు పదును పెట్టాడు.  మొదటి చర్యగా  పూర్వపు తమ రాజుగారైన  మదనుడితో మిత్రత్వం ఉన్న రాజుల  వద్దకు  సైనిక సహాయం కోరుతూ దూతలను పంపాడు. తిండి ధాన్యాలను అప్పుగా పంపమని కూడా కోరాడు. తదుపరి చర్యగా  ఖచ్చితమైన సందేశం ప్రజల్లోకి పంపాడు. “సోమరితనం వీడమని , మునుపటిలా కష్టించి పనిచేయాలని, పని చేయకుండా కనిపించేవారిని వారిని  సైన్యంలోకి తీసుకుని శిక్షణ ఇచ్చి యుద్ధానికి పంపుతామని’ చాటించాడు. ప్రజల్లో భయం, అభద్రతాభావం కల్పించి వారిలో గూడుకట్టుకున్న పెనునిద్దరను  వదిలించాడు. 

మూడవచర్యగా తమకు మద్దతు నిలిచిన  రాజుల వివరాలతో శత్రురాజు సమీరుడికి జవాబు పంపాడు.  మాళవరాజ్య పరిణామాలను, తాజా పరిస్థితులను  తెలుసుకున్న సమీరుడు  దండయాత్ర ఆలోచన మానుకున్నాడు.  

     వివేకుడు చూపిన ప్రజ్ఞ వలన ఆపద తప్పినందుకు  మోహనుడు  ఊపిరి పీల్చుకున్నాడు. జరిగిన దానికి బుద్ధి తెచ్చుకుని, తప్పిదాలకు  అవకాశం ఇవ్వకుండా మంత్రి  వివేకుడి సలహాలను స్వీకరిస్తూ  పాలనలో మంచి పేరు తెచ్చుకున్నాడు మోహనుడు .

               -----****---

[


ఎంతటి పాండిత్యమైనా ‘అ, ఆ’లతోనే ప్రారంభమవుతుంది. ఇది అందరూ ఎరిగిన సత్యమే. అ, ఆలతో ప్రారంభమైన చదువు మనిషిని విద్యావేత్తగా మారుస్తుంది. పండితుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ వ్యక్తికి కీర్తిని తెచ్చిపెడుతుంది. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిప్రదాతగా నిలబెడుతుంది. మరి ఆధ్యాత్మికంలో ‘అ, ఆ’ ఏమిటి? పాండిత్యానికి అ, ఆ ఎలాగైతే ప్రాథమికమో.. ఆధ్యాత్మిక యానానికీ ఈ రెండు అక్షరాలే ప్రామాణికాలు.

నిజానికి ఆధ్యాత్మికమనేది నాగరికులైన మానవులకే తప్ప ఇంకొక జీవజాలానికి కానేకాదు. అది మూలతత్త్వంతో మన సంబంధాన్ని తెలుసుకోవడానికి నిర్దేశించింది. ఆ కార్యంలో ‘అ’ అనేది అనాత్మను, ‘ఆ’ ఆత్మను సూచిస్తాయి. ఆధ్యాత్మికతలో ప్రవేశించేవారు నిశ్చయంగా తెలుసుకోవలసిన మూల విషయాలు అనాత్మ, ఆత్మ. మన కండ్లకు కనిపించే మన శరీరాన్నే ‘అనాత్మ’ అని భావిస్తారు. అంటే అది ఆత్మకు అన్యమైనది. ఇక మన కండ్లకు కనిపించనిది ‘ఆత్మ’. ఇది లేనిదే అనాత్మ (శరీరం) నిలిచి ఉండే అవకాశమే లేదు. అందుకే ఈ ఆత్మ, అనాత్మ గురించి తెలుసుకోవడంతోనే ఆధ్యాత్మిక విద్య ప్రారంభమవుతుంది.

సాధారణంగా అందరూ చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పురాణ శ్రవణం, మందిర దర్శనం, గ్రంథ పఠనం, భగవత్‌ పూజ, తీర్థయాత్రలు, దానం, పండుగలు వంటివి కనిపిస్తుంటాయి. నోములు, వ్రతాలు, దీక్షలు కూడా అందులోకే వస్తాయి. అయితే, వీటన్నిటి లక్ష్యం దాదాపుగా అనాత్మయైన శరీరానికి సుఖం, భోగం కలిగించడమే అవుతుంది. ఏ కొద్దిమందో అనాత్మకు ఆధారమైన ఆత్మ గురించి తెలుసుకునేందుకు వీటిని వారధిగా ఉపయోగించుకుంటారు. ఆధ్యాత్మిక కలాపాలతో దేహాన్ని ఎంత సుఖపెట్టాలని ప్రయత్నించినా అది శాశ్వతంగా నిలిచి ఉండదు. అందుకే, కర్తవ్యబోధ చేయడానికై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ విషయాన్ని భగవద్గీత ప్రారంభంలోనే అర్జునునికి తెలియజేశాడు. శరీరానికి ఉండే తాత్కాలిక స్వభావాన్ని ఆ దేవదేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అలా గీతాజ్ఞానం కూడా ‘అ, ఆ’తోనే మొదలైంది.

భరత మహారాజు మహాభక్తుడు. రాజ్యపాలనలో గొప్ప విజయాన్ని సాధించి ఈ భూమిని తనపేరుతో పిలిచేంత గొప్ప పనులు చేశాడు. ఆయన పాలించిన మేర ప్రాంతం భారత వర్షంగా ప్రసిద్ధి చెందింది. అయితే చివరలో ‘అనాత్మ’ (జింకపిల్ల) పట్ల ఆకర్షణ కారణంగా పతనం చెంది, జింక శరీరాన్ని పొందాడు. అంటే ‘రాజ శరీరం’ (అనాత్మ) పోయి జింక శరీరం వచ్చింది. కానీ, జ్ఞానం మాత్రం నశించలేదు. దాని కారణంగానే మరుసటి జన్మలో ఉన్నతమైన మరో ఉపాధి పొందాడు. ఈ విధంగా అనాత్మ (శరీరం) మారుతూ వచ్చింది. కానీ, లోపల ఉండే ఆత్మ మారలేదు. ‘అనాత్మ’కు మారే స్వభావం ఉంటుంది. ‘ఆత్మ’ ఎన్నటికీ మారదు. అందుకే భరతుడు మరుసటి జన్మలో జడభరతుని రూపంలో అత్యంత సావధానంగా ప్రవర్తించి మోక్షసాధన చేశాడు, ముక్తిని పొందాడు.

అనాత్మతో తాదాత్మ్యం ఉన్నంతవరకు ఆత్మ కనిపించదు, ఇక ఆత్మ దర్శనం కాగానే అనాత్మతో పని ఉండదు. అంటే శరీరాలను ధరించవలసిన అవసరం కలగదు. కనుక ఆధ్యాత్మిక కలాపాలను ఆత్మదర్శియైన గురువు నిర్దేశంలో ‘అ,ఆ’లను నేర్చుకోవడానికి, అనుభూతం చేసుకోవడానికి నిర్వహించాలి. తద్వారా సాధకుడు ఇహపర సౌఖ్యాలను సాధిస్తాడు. ఇదే గీతా సందేశం! గీతలో ఆత్మ, అనాత్మ గురించిన సంపూర్ణమైన వివరణ మనకు లభిస్తుంది. ఆ దివ్యజ్ఞానంతో అందరూ మానవజన్మను సఫలం చేసుకోవాలి.

[


*కుందేలు ప్రచారం- నక్క మోసం*  (కథ )  నారంశెట్టి ఉమామహేశ్వరరావు


ఒక అడవిలో చెరువు గట్టు దగ్గరున్న  బొరియలో  కుందేలు కుటుంబం ఉండేది. మగకుందేలు రోజూ  ఉదయాన్నే   దుంపలు  తింటూ చెరువు వైపు చూసేది. తామరాకులు, కలువపువ్వులు కనువిందు చేస్తుంటే ప్రకృతి అందాలకు మురిసిపోయేది. 


ఒక రోజు చెరువు వైపు చూస్తూ దుంపలు తింటున్న కుందేలుకి అక్కడున్న  జామ  ఆకు రాలి నీళ్ళల్లో  పడడం కనబడింది. అప్పుడే ఒక  చేప ఆకుని   అందుకుని బుడుంగున నీట్లో  మునగడం జరిగింది.  ఆ దృశ్యాన్ని పరాకుగా చూసింది  కుందేలు. దానికి జామ ఆకే చేపగా మారిపోయినట్లు అనిపించింది.  


మరి కాసేపటికి ఒక  జామపండు క్రింద  పడింది. ఈసారి అక్కడే ఉన్న పక్షి ఒకటి దాన్ని అందుకుని ఎగిరిపోయింది. చెట్టుకి అటువైపున్న పక్షి , కుందేలుకి మొదట కనబడలేదు. ఎగురుతున్నపుడు అది చూసింది. క్రింద పడిన ఆ  పండే పక్షి  అయిపోయిందని భ్రమ పడింది కుందేలు. దానికి చాలా ఆశ్చర్యం వేసింది.      


వెంటనే “నీకు తెలుసా? జామచెట్టుకి మహిమలున్నాయి. దాని ఆకులేమో చేపలుగా, పండ్లేమో పక్షులుగా మారిపోతున్నాయి.” అని భార్య కి చెప్పింది.    ఆ   కుందేలు నమ్మలేదు ఆ విషయాన్ని . గట్టిగా నవ్వి ఎగతాళి చేసింది భర్తని.   

     

వాటి మధ్య జరుగుతున్న వాదనల్ని చెట్టు మీదున్న ఒక  కోతి వింది. ఆ కోతికి  కంటి చూపు తక్కువ. పైగా దూరం వస్తువులు స్పష్టంగా చూడలేదు. అయితే అది కూడా కుందేలు చూసిన దృశ్యాలనే చూసింది. కుందేలు లాగానే అదీ అనుకుంది. 


ఆ కోతి చెట్టు దిగి కుందేలు భార్యతో “నీ మొగుడు  చెప్పింది నిజమే. నేను కూడా చూసాను” అంది. అప్పుడు  ఆడకుందేలు నమ్మింది. 


మరునాటి నుండి  తమ ఇంటిముందున్న జామ చెట్టుకి ఎన్నో  మహిమలున్నాయని చిలువలు పలవులుగా చేసి మిగతా జంతువులకి ఆ మూడూ చెప్పాయి.      

 

ఇదేదో బాగుందనుకున్నాయి జంతువులు. రాబోయే జన్మయినా మంచిది ఇమ్మని చెట్టుకి మొక్కి వెళ్లిపోయేవి. అలా కొన్నాళ్ళు గడిచింది. 


ఒక రోజు ఉదయమే ఒక నక్క అక్కడకు  వచ్చింది.  ఐదేసి పండ్లు చొప్పున్న చెట్టు ముందు ఉంచి ప్రదక్షిణ చేసింది. గుంజీలు తీసి చెట్టుకి మొక్కుకుంది. 


మిగతా జంతువులు చెట్టుకి మొక్కడానికి వచ్చి నక్క  చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయి అడిగాయి. 

 నక్క ‘వనదేవత కలలో  కనిపించింది. చెట్టును జాగ్రత్తగా చూడమంది.  ఎవర్నీ దగ్గరకు రానివ్వద్దని చెప్పింది” అంది.  


‘అలా అంటే ఎలా నక్కమామా? మా మొక్కులు మేము మొక్కాలి కదా. మరెలా” అన్నాయి   జంతువులు. కాసేపు ఆలోచించినట్టు నటించింది నక్క. తరువాత   “పండ్లు, కాయలు, తేనె, చెరుకుగడలు, కోళ్లు, మాంసం .. అలా ఏవైనా  చెట్టు దగ్గర పెట్టి మొక్కుకోండి. వనదేవతకు నేను చెబుతాను” అంది నక్క. 

జంతువులన్నీ  అది చెప్పినట్టే  చేశాయి. వాటిని సుష్టుగా తినేసి హాయిగా నిద్రపోయేది నక్క.  


     ఒకసారి అటువచ్చిన మృగరాజు చెట్టు దగ్గరి గుంపును చూసింది. నక్క పరుగున వెళ్లి “మృగరాజా! దేవతకు మొక్కి వరం కోరుకుని వెళ్ళండి’ అంది.   


  మృగరాజు ఆలోచిస్తుంటే ప్రక్కనే ఉన్న మంత్రి ఏనుగు  ‘‘చెట్టుకి మహిమలా? ఇదొక కొత్త నాటకమా? ఏదీ మహిమల్ని చూపించు’ అంది.   


   ఏనుగు తొండంతో  సైగ చెయ్యగానే ఒక చిలుక  జామ చెట్టు  ఆకుల్ని, పండ్లను  రాల్చింది. కానీ  వింతేమీ  జరగలేదు. మృగరాజుకి కోపం వస్తే తనకి చావు తప్పదని అనుకుంది నక్క.  ‘కావాలని రాలిస్తే మహిమ ఉండదు’ అంది.     


దీని సంగతేమిటో తేలుద్దామని అక్కడే కూర్చుంది  మృగరాజు. కాసేపట్లో    గాలి వీచి  జామ ఆకులు, పండ్లు నీట్లోనూ, క్రిందా పడ్డాయి. అక్కడున్న జంతువులన్నీ ఆతృతగా చూశాయి కానీ మహిమ కనబడలేదు.   

 

సింహానికి కోపం వచ్చి  “నక్కా ! ఇప్పుడైనా నిజం చెప్పు’ అని గర్జించింది.    ‘తప్పయింది మృగరాజా!కష్టపడకుండా తిండి గడిచిపోవాలని ఎత్తు  వేసాను. అంతకు మించి నాకేం తెలియదు. మహిమలున్నాయని చెప్పింది ఈ కుందేళ్లే“ అంది.   


 ‘చూసారా! దేన్నైనా గుడ్డిగా నమ్మితే ఇలాగే ఉంటుంది. మనుషుల్లో మోసగాళ్లు ఉన్నారని మా నాన్న చెప్పేవాడు. మనలోనూ  నక్క లాంటి వాళ్ళు ఉన్నారని ఇప్పుడు తెలిసింది.  అలాంటివాళ్ళు ఇతరుల నమ్మకాలని సొంత లాభానికి వాడుకుంటారు’ అని జంతువులకు హితవు చెప్పింది మృగరాజు.  


“ఇంకోసారి అడవి జంతువులను మోసగించాలని చూస్తే బహిష్కరణ తప్పదు’ అని  నక్కను హెచ్చరించింది సింహం. కుందేలు, కోతిలను పిలిచి “మీ కళ్ళు  వైద్యుడికి చూపించి బాగు చేయించుకోండి” అనేసి వెళ్లాయి జంతువులు. 

---***----

[


సాహిత్య వ్యాసం 

*తప్పులు  - ఒప్పులు* 


ఉచ్ఛారణ తప్పు పదం . ఉచ్చారణ సరైన పదం .ప్రతిష్ఠ సరైన పదం. కానీ ప్రతిష్ట అని రాసేవాళ్లే ఎక్కువ. కవుగలించు అని రాయకూడదు . . కౌగలించు అని రాయాలని తెలియకపోవచ్చు ; కానీ, 

పెద్ద పెద్ద రచయితలూ కౄరుడు అని రాస్తారు క్రూరుడు అని రాయబోయి! అందుకే ఈ చిన్న వ్యాసం . 


మాయాబజార్ చలనచిత్రంలో ఎస్వీఆర్ ' ఎవడూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? ' అన్న మాట వందశాతం నిజమే. కానీ, మరీ పండితులమని గుండెలు విరుచుకునే జ్ఞానులు  ఛందస్సు కు బదులుగా చంధస్సు,  చేమంతికి బదులుగా చామంతి - అంటూ చెండుకుఅంటేనే భాష పుట్టిమునిగే ప్రమాదం . తెలుగును కాపాడుకోవడమే కాదు.. ఉన్న తెలుగూ ఉప్పుపాతర పాలవకుండా కాచుకోవాలి  కదా! అందుకే చిలుక కు చిలక, ఎలుక కు ఎలిక 

చెవుడు కు చెముడు - అంటూ  పలుకుబడుల చేత పలుగురాళ్ల స్నానం చేయించవద్దు దేవుడా! అని పలక తలకు బాదుకుంటూ మొత్తుకునేది.   అన్నట్లు దేవుడు కు బదులుగా దేముడు, రాముడుకు బదులుగా  రావుడు అంటూ తెలుగు తల్లికి తలంటు పోసే ఘనులూ తక్కువేమీ లేరు మహాశయులారా! ఎవరి నెవరు సరిదిద్దేది? ఎవరికి వారే దిద్దుకోవలసి దోషాలు అందుకే దోసెడన్ని ఈ కింద ( క్రింద - కాదు). 

అలాగని, పిచ్చిచేష్టలు కు బదులు పిచ్చిచేష్ఠలు అంటూ వత్తి మరీ రాసే ఘనాపాఠీలు   ( ఘనాపాటీలు  ) లేరని కాదర్థం. బావి లో వత్తు వేసి  మరీ భావి అని రాసినా భాషామతల్లికి అనర్థమే - అనే ఈ బాధ౦తా  . ( భాద కాదు ) .  

('రాసినా' అని నేను పైన రాసాను కదా! దాన్నీ ఓ తప్పుగా ఎదురెత్తి చూపించ బుద్ధవుతుంది కొద్ది మంది బుద్ధిమంతులకని తెలుసు. వారి కోసమే  ఈ సందర్భంగా ఓ వివరణ.  వ్రాస్తుంటారు - వంటి పదజాలి ప్రయోగాలు క్రమంగా బలహీనపడిపోతూ భాష ఆధునీకరణ దారి సుగమనం అవుతున్న పరిణామమూ రచయితలు పట్టించుకోక తప్పదు. పద్యాలు రాసేటప్పుడు పద్య ధోరణి అంటే కొంత సర్దుకుపోవచ్చు. కానీ వాయువేగంతో పోటీకి దిగినట్లు ప్రపంచంలోని ప్రముఖ భాషలన్నీ రోజు రోజుకూ కొత్తదనం వైపుకు ఉరకలెత్తుతున్న  తరుణంలో మనమూ మన తెలుగు భాష  పరుగు ట్రాక్ కు అడ్డంగా పడివున్న పలుగురాళ్లను  ఏరిపారేయాలి. సంస్కరణలకు  లోనవుతున్న తెలుగు భాషలో ' వ్రా'  కు బదులుగా 'రా', 'ఋ'బదులుగా 'రు' బ్రతుకు కు బదులు బతుకు లాంటి పదాల వాడకం ఊపందుకోవడంలోని ఔౌచిత్యం  గ్రహించి ఆదరిస్తేనే తెలుగు భాషకు ఉన్న ' చాదస్తం ' అనే అపప్రధ  తొలగిపోయి భాష తాజాగాలిలా హాయిగొలిపేది. విశ్వనాథ వంటి ఉద్దండ పిండాల సాహిత్యం చదివి తప్పక అధ్యయనం చేయవలసిందే! కానీ అణుయుగానికి అనువుగా ఆధునీకరణకు గురయే  సందర్భంలో  తాజాగా భాషలో జరుగుతున్న పరిణామాల  ప్రయోగాల వరకు   మాత్రమే దృష్టిని పరిమితం చేయడం     తప్పనిసరి. ఆ ఉద్దేశం ( ఉద్దేశ్యం తప్పుపదం ) తోనే నాకు తటస్థించిన  (  తటస్తించిన - తప్పు పదం ) కొన్ని పదాలను ఇక్కడ ఉట్టంకించడం. ఉటంకించడం  అని కూడా రాయవచ్చు. కాని ఉట్టంకించడం - అంటే నొక్కి చెప్పటం అనే అర్ధంలో వాడడం సంప్రదాయంగా వస్తోన్న భాషా విశేషం.  జాగ్రత్తగా ( జాగర్తగా తప్పు పదం) గమనిస్తే  ఈ తరహా వైవిధ్యాలు వేలాదిగా ఏ భాషలో ఉండటమయినా సహజమే. కానీ, మెరుగైన ( మెఱుగు అనే పదం క్రమంగా ప్రయోగం నుంచి పక్కకు తప్పుకుంటోంది ప్రస్తుతం)  . ఱ, ఱులకు బదులుగా ర, రు అనే అక్షరాలు రాయడం మీదనే ( గుర్రం . .  రుషి ) మోజు పెరుగుతోన్న కాలం ఇది .. అని గమనించాలని  విన్నపం. (విన్నపము అని కూడా రాయవచ్చు. ఓల్డ్ స్టైల్ వాడుకలోని 'ము' అనే అక్షరం కొత్త ( క్రొత్తకు బదులుగా ) పూర్ణ బిందు   '౦' అనుస్వరంగా గా మారిపోవడం గుర్తించడం అవసరం.  పాత పద ప్రయోగాలనే నమ్ముకుని కూర్చుంటే  సమకాలీనత అనే  స్ఫూర్తికి  విఘాతం కలిగే ప్రమాదం కద్దు. ఆ  భయంతోనే ఆంగ్లంలో కూడా ఓల్ట్ ఇంగ్లీష్ కు న్యూ  ఇంగ్లీష్ శాఖ ( శాక కాదు ) ఏర్పడటం .  చిత్రాల  ద్వారా వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఉన్నప్పటి కన్నా తమ భాషను తాము  సరళీకరించుకుని ప్రజాచైనా  భాషగా అవతరించిన తరువాతనే చైనీయుల అభివృద్ధి పుంజుకున్నది.   

తమిళ సాహిత్య అభిమానులకు మల్లే  రోజూ అన్ని రకాల రచనలను శ్రద్ధగా పరిశీలనా దృష్టితో చదివే ఆసక్తి (ఆశక్తి- కాదు) అలవడితేనే  తప్పొప్పుల తరహా  నిర్దిష్టతలోనే కాకుండా , పద ప్రయోగ  లక్షణ ఔచిత్యంలోనూ   వడుపులు ఔత్సాహిక రచయితలకు పట్టపడేది . ఆ లక్ష్యంతోనే నాకు తోచిన కొన్ని సామాన్య దోషాలను, సమర్థనీయం కాని పద ప్రయోగాలు మరి కొన్నిటిని  ఈ కింది ( క్రింది - కాదు) పట్టికలో పేర్కొనడం  జరిగింది. విస్తరణ భీతి వల్ల  సవిస్తరంగా రాయడం కుదిరింది కాదని    మనవి! 

( గమనిక : అట్లాగని అంగుళిత్రం అంటే చేతితొడుగు ( గ్లోవ్స్). అగ్ని ముఖి అంటే జీడిమామిడి చెట్టు, కంకతం అంటే దువ్వెన అన్న అర్థాలు ఉన్నాయి కాబట్టి ..  ఆ పౌరాణికగ్రంథస్థ పరిభాషే   ప్రామాణికమనుకుని   గేహం ( ఇల్లు ) లో ప్రయోగాలకు పూనుకుంటే ఊఢల( భార్యల) దృష్టిలో మొగుళ్లు మూఢమతులవడం ఖాయం. అప్పడాల కర్ర కార్ట్యూనులు నిజమవడం నిశ్చయం. రచయితలూ .. తస్మాత్ జాగ్రత్త! ) 

కొన్ని తప్పులు - వాటి పక్కన ఒప్పులు : 

ఆలశ్యం - ఆలస్యం 

ఇస్తర్లు - విస్తరులు 

కాటిక కళ్లు - కాటుక కళ్లు 

క్రుషి - కృషి 

కూపస్త మండూకం - కూపస్థ మండూకం 

కొంచం - కొంచెం 

గృహస్తులు - గృహస్థులు 

ఆద్యక్షులు - అధ్యక్షులు 

బాలింత - బాలెంత 

'గోయిలో, పన్నుతో లాంటివి అపభ్రంశ ప్రయోగాలు  . 'గోతిలో.. పంటితో'  వంటివి వ్యాకరణ సమ్మత పదాలు : అట్లాగే ' చెప్పు మని  ' అనడానికి బదులుగా 'చెప్పమని ' అనడం కూడా తప్పే! 

దయార్దబుద్ధికి అని రాయడానికి  'దయాద్ర బుద్ధి' గా రాసే బుద్ధిమంతులూ,  దారిద్ర్యo ' అనే పదాన్ని దరిద్రం ' గా లిఖించే భాషాజ్ఞాన దారిద్ర్యులకు కొదవలేదు ( కొరత లేదు).  కొదువ అని రాసే సీనియర్ రచయితలూ మనకు కద్దు. ( కొదువ= న్యూనత అని అర్థం కదా! ) 

తెలిసో .. ధ్యాసపెట్టకో తెలియదు కానీ, పురాణేతిహాసాదులలో అనుక్షణం కనిపించే ప్రముఖుల పేర్లకు  కూడా తరచూ ( తరుచూ అని కూడా అనవచ్చు) రూపురేఖలు  మార్చేయడం  విచారించవలసిన దోషం. ధృతరాష్ట్రుడు ని ధృతరాష్టుడు అని ఒకరు ,   ధ్రుతరాష్ట్రుడు అని ఇంకొకరు రాస్తుంటారు ! కృష్ణుడు ను క్రిష్ణుడుగా మార్చిన వాళ్లెంత మందో .. ద్రౌపదిని ద్రౌపతిగా మార్చిన రచయితలు  అంతకు రెట్టింపు. దృష్టాంతం వంటి  పదాలను దృష్టాంతరాలుగా పరిమార్చడం చదివే సమయంలో పరిశీలనలో జరిగే లోపం వల్లనే. దృఢమైన ( ధృఢమైన కాదు) సంకల్పం ఉంటే భాష కుంటుపడని భాష స్వంతమవడం  ఏమంత అసాధ్యమైన సాధన కాదు . నివాసము అనే పదానికి సంబంధించిన క్రియారూపం అని బోధపడితే , నివశించు అని రాయడం తప్పవుతుందని మనకే తెలిసొస్తుంది . ప్రవేశం అనే పదానికి సంబంధించింది కాబట్టి ' ప్రవేశించడం ' అనడం సరైన క్రియారూపం. ' ప్రవేసించడం ' అని రాస్తే  రచయిత తన అజ్ఞానం తానే బట్టబయలు చేసుకున్నట్లు  . శుద్ధి అనే పదం నుంచి ' పారిశుధ్యం ' అన్న పదం పుట్టిందని పసిగడితే'పారిశుద్యం' అని రాయడం పరమ దోషం అనే తెలివొస్తుంది. పండగ అనడం సాధారణం . నిజానికి ఆ పదం పండుగ . పండగ అన్న పదంలో పండుకోవడం  అనే  అర్థం ఇమిడి  ఉందని తడితే ఈ పొరపాటు దొర్లే అవకాశం ఉండదు.  ప్రియ సోదరా! అంటే తప్పులేదు, కానీ ప్రియ అనే సంస్కృత విశేషణానికి తమ్ముడు అనే తెలుగు నామవాచకం తగిలించి ' ప్రియతమ్ముడా!' అని రాస్తే మాత్రం రచయితగా మారే రస్తా  ఇంకా  కొన్ని మైళ్ల  దూరంలో ఉందని తెలుసుకోవాలి. మేలైన భాష రాయడానికి రచయిత సదా మేలుకునే ఉండడం అవసరం.  భేదం అనే సరైన పదానికి బేధం అనీ, బాధ అనే చక్కని పదానికి ' భాద ' అనే వికృతరూపం  అపురూపంగా రాసేస్తున్న ఈ కాలపు తెలుగు కవులకు .. రచయితలకు తప్పొప్పుల పట్టికలు  ప్రత్యేకంగా పెట్టే  అవసరమక్కర్లేని మంచి రోజులు మళ్లీ రావాలని అభిలషిస్తూ ఈ చిన్ని వ్యాసానికి ఇక్కడ కామాతో ఫుల్ స్టాప్ ( పుల్ స్టాప్ కాదు ) పెట్టేస్తున్నాను. . సదసద్విమర్శనాపరుల పట్ల రచయితకు సదా గౌరవాభిమానాలే ఉన్నవన్న   సవినయమైన  విన్నపంతో !   

– కర్లపాలెం హనుమంతరావు

[


మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి.


దర్భకొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపమని భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.


వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వాటికి మందుగా వాడుతున్నారు.అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.


దర్భఅసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితోకప్పుకొమ్మని శాసనం చేశారు. బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు. కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.


దర్భదర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి. వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవచ్చునని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

దర్భల కొనలు విడుదల చేసే తేజము – దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

[

క్షమిస్తున్నారు కదా అని

మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ

కష్టపెట్టకు.

వాళ్ళు ఒక్క క్షణం

మంచితనాన్ని మర్చిపోయారంటే

వేరేలా మారడానికి

నిమిషం కూడా పట్టదు.

 మనకు ఎన్ని పనులు ఉన్నా

ఉదయాన్నే మనసుకు నచ్చినవారిని పలకరించడంలో ఉండే ఆనందం

మాటల్లో చెప్పలేం.

విలువ లేని దుమ్ము కూడా,

ఒక్కోసారి నీ కంట్లో పడి,

నిన్ను విలవిలలాడేలా చేస్తుంది..!

అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా,

చాలాసార్లు వారి మాటలతో బాధపెడతారు,

ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం...

 "నీ చుట్టూ ఉన్నవాళ్ళ స్థానం, స్థాయి మారితే

నిన్ను మర్చిపోతారేమో.

అయినా కూడా 

నువ్వు నీలానే ఉండాలి స్థానం మారినా, స్థాయి *మారినా. 

అదే వ్యక్తిత్వం అంటే."

 "ఏదీ శాశ్వతం కాదు.

నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు.

ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే

మారిపోక తప్పదు."

 కాలం ఎందరినో

పరిచయం చేస్తుంది.

కానీ కొందరినే

మనసుకు నచ్చిన వారిగా

మార్చుతుంది.

అది స్నేహమైనా, ప్రేమైనా..!!

 మనిషిని గెలుచుకోవడంలో

సంతోషం ఎన్నిరోజులు

ఉంటుందో తెలియదు కానీ...

మనసును గెలుచుకోవడంలో

ఉండే సంతోషం మాత్రం...

జీవితాంతం ఉంటుంది....!!

 మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి.

చెట్టుకి ఇవ్వడమే తెలుసు.మంచి మనుషులు కూడా అంతే 

ఇతరులకి సాయం చెయ్యడం తప్ప 

వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమి ఆశించరు

 మన కష్టంలో మనవాళ్లే

కలిసిరానప్పుడు

ఎవరో ఆదుకోవడానికి

రాలేదని బాధపడటం

అనవసరం.

 ఎక్కువగా నమ్మటం,

ఎక్కువగా ప్రేమించటం,

ఎక్కువగా ఆశించటం..

ఫలితంగా వచ్చే బాధ కూడా

ఎక్కువగానే ఉంటుంది.

[


*ధర్మాచరణతోనే  లోకరక్షణ*

✍🏻 నారంశెట్టి ఉమామహేశ్వరరావు    


‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నది సూక్తి.  ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే లోకాన్ని రక్షిస్తుంది. ధరించునది కనుకనే ధర్మం అనబడింది. ‘దృ’ అనే సంస్కృత ధాతువు  నుండి ధర్మం వచ్చింది. ధర్మం అంటే రుగ్వేదంలో  ‘రుత’ అని భావం. అనగా క్రమం అని.  

‘మానవ సంఘాన్ని కట్టుబాటులో నిలిపేది  ధర్మమేనని, ప్రజలు తమ  ధర్మాన్ని నిర్వర్తిస్తే  సమాజం వ్యవస్తీకృత మవుతుందని,  ధర్మమే ప్రజలను, ప్రపంచాన్ని ధరిస్తూ చక్కని కట్టుబాటులో నిలుపుతుందని’ ఆర్ష వాంఙ్మయం   వివరించింది. వర్ణాశ్రమ, గుణ ధర్మాలను మానవులు పాటించినప్పుడే ధర్మం నాలుగు పాదాలతో  నడుస్తుందని బోధించింది.   

 ధర్మసంస్థాపన కోసం మహావిష్ణవు అనేక అవతారాలెత్తి దుష్టసంహారం జరిపినట్టు పురాణాలు, ఇతిహాసాలు తెలిపాయి. కృతయుగంలో మత్స్యావతారమెత్తి  హయగ్రీవుడిని హతమార్చి వేదాలను సంరక్షించిన విష్ణువు,  త్రేతాయుగంలో రామావతారంమెత్తి  రావణ సంహారం గావించాడు. ద్వాపర యుగంలో కృష్ణావతారంమెత్తి  భగవద్గీతను బోధించడమే కాక, దుష్టులైన  దుర్యోధనాదులను సంహరించి, ధర్మం కోసం వనవాస, అజ్ఞాత వాసాలను పూర్తి చేసిన పాండవులకు విజయం సిద్ధింపజేసాడు. 

 ‘ధర్మం నుంచి సంపద, సుఖం ప్రభవిస్తాయని’ రామాయణం, ప్రజల్ని రక్షించేది, మానవ  సక్రమ  మనుగడకు  పరివ్యాప్తమైనది ధర్మమేనని’ భారతం  తెలిపాయి.  కురుక్షేత్ర  సంరంభానికి ముందు ఆశీస్సులు కోరిన ధర్మరాజు, దుర్యోధనులతో కౌరవమాత  గాంధారి   'యతోధర్మస్తతో జయః' అని దీవించింది. ధర్మమున్న చోటనే  విజయ వైభవం ఉంటుందని తెలిపిందే తప్ప కుమారునికి విజయం దక్కాలని దీవించలేదు. ధర్మ రక్షణకు ఆనాటి మహిళలు ఇచ్చే ప్రాధాన్యత తెలుపుతుందీ సంఘటన.  

 ‘దేశ కాలమాన పరిస్థితులను బట్టి సత్యం, అహింస, మనోనిగ్రహం, సహనాలను ఆచరించినపుడు ధర్మం వర్ధిల్లుతుందని’ శాస్త్రాలు బోధించాయి. అయితే లోకంలో అనుసరించబడుతున్న సామదానభేద దండోపాయాలతో పనులు చక్కబడవని గుర్తించి  పంచతంత్రమైన ‘కౌటిల్యం’ ప్రయోగించి ధర్మస్థాపన చేసిన   చాణక్యుడుని చరిత్ర గుర్తించింది.  విశ్వవిజేత అలెగ్జాoడర్,  నవనందులను  పంచతంత్రంతోనే  జయించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా   నీతిసూత్రాలను లోకానికి అందించిన కౌటిల్యుడు చిరస్మరణీయుడయ్యాడు.     

   

‘మూడేసి పిల్లలకు సింహం, అయిదేసి పిల్లలకు పులి, ఒక పిల్లకు  ఆవు జన్మనిస్తున్నప్పటికీ, ధర్మపరుల వంశం మాత్రమే  వృద్ధిలోకి వస్తుందన్నట్టు,  ఆవుల సంతతి  లోకంలో వృద్ధి చెందుతుండడం తెలిసిందే.  అందుకే  ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని కలిగించే ధర్మాన్ని నిత్యం ఆచరించాలి.  'షడ్విధం ధర్మలక్షణం' అని పద్మ పురాణంలో చెప్పినట్టు సత్పాత్రునికి దానం, కృష్ణభక్తి, మాతా పితృ పూజ, శ్రద్ధ, మూగ జీవుల ఆహారానికి ద్రవ్యదానం, గోగ్రాస దానాలు  చేస్తూ ధర్మరక్షణకు పాటుపడాలి  జనులు.

 [

కర్మలు మూడు రకాలు.

1) ఆగామి కర్మలు

2) సంచిత కర్మలు

3) ప్రారబ్ధ కర్మలు

1) ఆగామి కర్మలు: మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మలలో ఫలితాన్నిస్తాయి.అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు! వివాహమైన దంపతులందరికీ సంతానం కలుగకపోవచ్చు! అయితే కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం. అది కర్మ. వెంటనే మన ఆకలి తీరుతుంది.ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు.దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం,అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు.ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ‘అగామికర్మలే’!

2) సంచిత కర్మలు: మనము పూర్వ జన్మలలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు మనము తీసుకుని వెళ్తాము.జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడితో వస్తుంటాయి. జీవుడు ఈ శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాడు. దీనికి కారణం ‘సంచిత కర్మలు’.

3) ప్రారబ్ధ కర్మలు: సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనము చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. మనము చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాము.ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు.అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది.ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి, చేసే, చేసిన కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికి మరికొన్ని కూడగట్టుకుంటున్నాం!ఇలా ప్రోగు చేసుకోవడం వలనే మరల మరల ఈ జన్మలు,శరీరాలు వస్తున్నాయి . కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదు. ఇక్కడ మీకో అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి.ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు. ఆ అనుభవాలను ,కర్మ ఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్ని ఎంచుకుంటారు. అంతకు మించి , నిజానికి కూతురు, కొడుకు అనే బంధాలు లేవు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు జన్మించటాన్ని మనం చూసాం!అలా వారు పుట్టటాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు. భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే!యోగసాధన ద్వారా ఇలాంటి కర్మలను కొంతవరకు evaporate చేసుకోవచ్చు! అలా కర్మలు తొలగించబడేవరకు వైకల్యంతో పుట్టిన శిశువు నానా బాధలు పడుతూ జీవిస్తూ ఉంటాడు. ఇది పరమ సత్యం. ఇటువంటి సంఘటనలను మీరు కూడా చూసే ఉంటారు. వైకల్యంతో పుట్టిన ఆ శిశువు వలన భార్యాభర్తలు పడే బాధలు వర్ణనాతీతం.ఆ బాధను చూసి కొంతమంది ,ఆ బాలుడిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రంలో చేర్పిస్తారు .అయితే, అది అంత మంచిది కాదేమో! కారణం–ఈ ప్రారబ్ధకర్మ నుంచి తల్లి తండ్రులు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే లేక ఆ శిశువు ఆ కర్మ అనుభవించకుండా చేయటం వలన, వారు అట్టి కర్మను మళ్ళీ ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే! అంబానీ సోదరులు అత్యంత ధనవంతులుగా జన్మించి సుఖాలను అనుభవించటానికి,నిత్యం దేవుడిని సహస్ర నామాలతో అర్చించే పూజారికి మరియు గుడి బయట అడుక్కునే వేలాదిమంది బిచ్చగాళ్ళు దీన స్థితిలో ఉండటానికి కారణం వారి వారి ప్రారబ్ధమే. ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించేవరకూ జీవుడు మరల మరల జన్మిస్తూనే ఉంటాడు. జన్మ పరంపరలు పూర్తైన వారు, తర్వాత దివ్య శరీరంతో రాశీమండలంలోకి ప్రవేశిస్తారు. సృష్టి ప్రణాళికలో వారి పాత్ర కనుక ఉంటే,మరలా వారు ఈ భూమి మీద జన్మిస్తారు. ఇంతకు ముందర నేను చెప్పిన విధంగా వారు యేయే అనుభూతులు పొందాలో అట్టి తల్లి గర్భాన్ని వారే ఎన్నుకుంటారు. జన్మ పరంపరలు పూర్తి కాకపోతే ,వారు రాశీమండలంలోకి చేరటానికి అర్హులు కారు. కారణం శరీరం నశించిన తర్వాత ,సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది.వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనం అవుతుంది.సూక్ష్మ శరీరం నశిస్తే కానీ జీవికి మోక్షం కలుగదు.సూక్ష్మ శరీరం నశించాలంటే మనల్ని అలుముకున్న అజ్ఞానం నశించాలి.సూక్ష్మ శరీరం నశింప చేసుకోవాలంటే దానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి.ముముక్షువు మొదటగా సూక్ష్మ శరీరాన్ని నశింపచేయకుండా ,దానికి మూలమైన కారణ శరీరాన్ని నాశనం చేయాలి. అసలు ఈ శరీరం ఏర్పడటానికి కారణం అజ్ఞానమే!ఆ అజ్ఞానాన్ని నశింపచేస్తే కారణ శరీరం నశిస్తుంది. అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగటానికి కారణాలు–అహంకారం వలన అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వలన అభిమానం కలుగుతుంది. అభిమానం వలన కామ,క్రోధ ,మోహాలు ఏర్పడుతాయి. కామ, క్రోధ, మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది.కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి. ప్రారబ్ధకర్మలను ఆనందంగా అనుభవిస్తూ,మరేయితర దుష్కర్మల జోలికి పోకుండా , కర్మ ఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం

కావచ్చేమో!జాతక కధల ప్రకారం బుద్ధుడిది అది 700 వ జన్మ అని చెప్పబడింది.ఇక మనం ఎన్ని జన్మలు ఎత్తాలో? మళ్ళీ ఈ మానవ జన్మే వస్తుందని నమ్మకం ఏమీ లేదు. అందుకని ఈ జన్మలో సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం! ప్రాపంచిక విషయాలాలసలో ఉన్నప్పటికీ వాటి వాసన అంటకుండా జీవించటం అనేదే కర్మయోగ సాధన సారాంశం. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించటం!

[

ఏకవీర సాధన


అమ్మవారికి " ఏకవీర " అన్న పేరు ఉంది. అలాగే “ మహవీరేంద్ర వాహన” అన్న పేరు కూడా ఉంది. " మహవీరేంద్ర వరదా" అని కూడా ఉంది. అంటే మహవీరేంద్రుడు అయినటువంటి వానికే ఆమె అడగకుండానే అనేక వరాలు ఇస్తుంది. వీరు అడగలేదు కాబట్టి, ఇంకా ఎక్కువ ఇస్తుంది. అడిగితే అంతమాత్రమే ఇచ్చి ఊరుకుంటుంది. లేక అది కూడా ఇవ్వదు. ఇది రహస్యం. సర్వాంతర్యామి అయిన పరమాత్మ స్వరూపం నీలో అంతరాత్మగా, చైతన్యంగా, సంకల్పంగా, మనస్సుగా ఉన్నప్పుడు, ఆ పరమాత్మకు నీ మనసులోని బావం ఏమిటో తెలియదని చెప్పి, నువ్వు సంకల్పం చేసి, ఇది కావాలి, అది కావాలి అని కోరడం నీ అజ్ఞానానికి గుర్తు కానీ అది సాధనకు గుర్తు కాదు. సృష్టి పుట్టినప్పటి నుండి, ఇప్పటి వరకూ మనిషి ఈ అజ్ఞానంలోనే పడి ఉన్నాడు. అందుకే పెద్దలు అన్నారు... “ గతానుగతికోలోకః నలోకః పారమార్థికః” అని అంటే ఒకడు ఏదారినపోతే పదిమంధీ ఆ దారినే పోతారు కానీ ఆ దారి మంచిదా,చెడ్డదా, చివరికి ఈ గమ్యం ఎక్కడికి చేరుతుంది? గోతిలో దిగుతామా? బంగాళాఖాతంలో దిగుతామా? లేకపోతే కొండ దగ్గర కొచ్చి ఆగిపోతామా, ఎక్కడికి వెళ్తాం!? అనేది ఆలోచించకుండా ఎవరైతే వెళ్తారో అలాంటి గతానుగతికమైనలోక సంకల్పంతో సాధన చేయడానికి పూనుకోవడం అంటే, గతానుగతికమైన లోకంలో మనం కూడా ఒక్కళ్ళంగా ఉండటం. కానీ సాధన అంటేనే పారమార్థికం . అక్కడ సంకల్పంతో పనిలేదు. పారమార్థిక సత్యం, నిత్యం, బుద్దము, ముక్తము కాబట్టి, అది ఎక్కడా మారదు. నీ యోగ్యతను బట్టి నీకు ఎంతగా లోంగవలసి ఉంటుందో, ఎంత ఇవ్వాల్సి ఉంటుందో , అంతా తప్పకుండా ఇస్తుంది ఆ జగన్మాత. ఆ ఇచ్చినప్పుడు కూడా ఇదంతా నాదే అని మనం భావించకూడదు. అప్పుడు కూడా నీ త్యాగ గుణాన్ని పరీక్షించడం కోసం పరమేశ్వరి నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చు. ఇచ్చినప్పుడు ఇదంతా నాదే నా అదృష్టం వలనే వచ్చింది అనుకోవడం బుద్ది తక్కువ పొరపాటు నిజమైన సాధకుడు ఎవ్వరూ కూడా త్యాగం ఈ విధంగా నన్ను పరీక్షీస్తున్నది అమ్మవారు ఇంత సంపద ఇచ్చి అనుకోవాలి.. అలా కాకుండా.. ఇదంతా నాదే.... అని కృతజ్ఞత లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది. లౌకిక సంపదలు వచ్చినప్పుడు కూడా గర్వపడకూడదు.


ఈ విధంగా వీరత్వం అనే గుణం ఉండాలి. వీరత్వం తర్వాత #వినయం అనే గుణం ఉండాలి. మనం ఎంతటి వాళ్ళం? మనం జ్ఞానులమా? భక్తులమా? కర్మయోగులమా? జ్ఞానయోగులమా? విరాగులమా? మంత్రశాస్త్ర వేత్తలమా? అలా చూస్తే మన కంటే ఎందరో ఈ ప్రపంచంలో మహ మహానుభావులు ఉన్నారు. కొందరు ఈ ప్రపంచానికి తెలుసి ఉంటే , ఇంకా కొందరు ప్రపంచానికి బొత్తిగా తెలియదు..అసలు వారిని చూడటం కూడా సాధ్యం కాదు. వారితో పోలిస్తే మనం ఏపాటి వాళ్ళము!? అనేటువంటి వినయ సంపద ఎవరికైతే వస్తుందో , వారే భగవంతుని మార్గంలో , నిజమైన రాజమార్గం లో , సనాతన దర్మ మార్గంలో ప్రయాణం చేయడానికి తగిన వారు ! మిగిలిన వారంతా గతానుగతమైన లోకంలో ఉన్న వారే తప్ప, మరేం కాదు ( దయచేసి అపార్థం చేసుకోకండి, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు) అలా వినయ సంపదతో పాటు మానవుడి శ్రద్ద అనేది ఉండాలి... “శ్రద్దయా ధేయం, అశ్రధ్ధాయా నధేయం” అని వేదం చెబుతోంది. నాయనా ఏదయినా ఇచ్చినప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి. మనం ఏదో భగవంతునికి మొక్కుకున్నాం కాబట్టి, భగవంతునికి ఇవ్వక తప్పదు కాబట్టి, ఇవ్వకపోతే కష్టాలు వస్తాయి ఏమో అని, ఒక వేళ మళ్ళీ ఆ కష్టాలు వస్తే మనం మొక్కుకున్న విషయం జ్ఞాపకం వచ్చి, దానికి వడ్డీ కూడా కలిపి, వెయ్యలేక, వెయ్యలేక, హుండీలో వేసి వస్తారు కొందరు భక్తులు ( దయచేసి అపార్థం చేసుకోకండి) ఎందుకని? భయమే కానీ శ్రద్దలేదు కాబట్టి. సకాములకు చాలా మందికి తెచ్చిపెట్టుకున్న శ్రద్దే కానీ, సహజమైన శ్రద్ద లేదు. ఎందుకు ? కోరిక పైన నీకు ఉన్న మక్కువే నీ శ్రద్ద అవుతోంది అక్కడ. అంతే గానీ, కోరిక కంటే అతీతమైనటువంటి పరమేశ్వర పదార్థం అక్కడ ఉంది అనే విషయం శ్రద్ధగా గమనిస్తే , అన్నీ అదే చూస్తుంది. కానీ మనం నడవమన్నట్లు నడవం. చలన చాలనములు రెండూ సృష్టి యొక్క లక్షణాలు. కాలం నీకేం చెబుతోంది. నాయనా నేను వస్తాను, వచ్చిన నిమిషం నేను సత్యం! రాకముందు నేను సత్యం కాదు.ఎందుకు అంటే అది గతం. సత్యమైనప్పటికీ నువ్వు మర్చిపోవలసిందే.మళ్ళి అది తిరిగి రాదు. ఇంక భవిష్యత్తా అది అసత్యం . ఇంకా రాలేదు కాబట్టి. దానిని నిరూపించలేం. ఇక వచ్చిన క్షణాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తావో దానిని బట్టి నీ జీవితం ఉంటుంది. కాబట్టి భక్తుడు, సాధకుడు, దేనిని కూడా వాయిదా వెయకూడదు..రేపు అనేది ఉన్నదో లేదో . ఈ రోజు చేయవలసిన పని ఈ రోజే చేయి. ఇప్పుడు అనుకున్నది ఇప్పుడే చేయి. అలా చేయగలిగిన వారికి శ్రద్ద ఉంది అని అర్థం. 


నేను చాలా గొప్ప భక్తుడిని, గొప్ప మంత్రాలను ప్రతినిత్యం వేలకు వేలు జపం చేస్తాను.. నాకు వాక్సుద్ది ఉంది ఆ అమ్మవారే నా ఒళ్ళోకి తీసుకుని వచ్చి ఇస్తుంది అనే మూర్ఖత్వం కంటే , !!! అసలు అవి అన్నీ నేనెందుకు కోరాలి. ఆ జగన్మాత ఇవ్వడంలో ఏమి తక్కువ చేస్తుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ ఉన్నాను? నేను చేసిన కృషికి తగిన ఫలితాన్ని జగన్మాత కరుణించి ఇచ్చింది కదా .

_*🚩ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణ 🚩*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

                                                                                                   *"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ*

*నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ*

*సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ*

*భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"*



కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు. 

వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి , నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే , ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశశ్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది.


*​అన్నపూర్ణా దేవి కథ*


కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ  ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంధాలు , పురాణాల ప్రకారం... ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు.


*​అన్నకూట్ ఉత్సవం*


ఈ ఆలయంలో అన్నపూర్ణ దేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.


ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణేలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం.


*​ఆలయ సందర్శన*


భక్తులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత అన్నపూర్ణ ఆలయానికి వెళతారు. వారు ఆలయ వంటశాల నిర్వహణకు గానూ తగిన వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వంటగది , భోజన శాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి. స్వచ్ఛంధ సేవకులు భక్తులను ఆహారాన్ని పంపిణీ చేస్తారు.


*​ఎప్పుడు దర్శించాలి*


దీపావళి మరియు అన్నకూట్ పండుగ సమయాల్లో వారణాసిలోని అన్నపూర్ణ దేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మీరు రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలంటే నవంబర్ ఆఖరులో లేదా డిసెంబర్ లో ట్రిప్ ప్లాన్ చేసుకోవడం మంచిది.


ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం అన్నపూర్ణ ఆలయం వద్ద నిరాడంబరమైన సౌకర్యాలు కలిగిన ఉచిత వసతి కూడా అందుబాటులో ఉంది. అయితే సందర్శకులు ముందుగానే ధర్మశాల వద్ద గదుల లభ్యతను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.


*ఆలయం తెరిచి ఉండే సమయాలు:* ఉదయం 4 గంటల నుండి 11.30 వరకు , రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకకు


అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. *"హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా"*  అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం , పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం , స్తోత్రాలు పారాయణం చేయాలి.


*శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి*


                                                                                 ఓం అన్నపూర్ణాయై నమః

ఓం శివాయై / దేవ్యై నమః

ఓం భీమాయై /పుష్ట్యై నమః

ఓం సరస్వత్యై / సర్వజ్ఞాయై నమః

ఓం పార్వత్యై / దుర్గాయై నమః

ఓం శర్వాణ్యై నమః

ఓం శివవల్లభాయై నమః

ఓం వేదవేద్యాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం విద్యాదాత్ర్యై / విశారదాయై నమః

ఓం కుమార్యై / త్రిపురాయై నమః

ఓం లక్ష్మ్యై / భయహారిణ్యై నమః

ఓం భ్వాన్యై నమః

ఓం విష్ణుజనన్యై నమః

ఓం బ్రహ్మదిజనన్యై నమః

ఓం గణేశ జనన్యై / శక్త్యై నమః

ఓం కౌమారజనన్యై / శుభాయై నమః

ఓం భోగప్రదాయై / భగవత్యై నమః

ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః

ఓం భవరోగహరాయై నమః

ఓం భవ్యాయై / శుభ్రాయై నమః

ఓం పరమమంగళాయై నమః

ఓం భ్వాన్యై / చంచలాయై నమః

ఓం గౌర్యై నమః

ఓం చారుచంద్రకళాధరాయై నమః

ఓం విశాలక్ష్యై / విశ్వమాత్రే నమః

ఓం విశ్వవంద్యాయై నమః

ఓం విలాసిన్యై / ఆర్యాయై నమః

ఓం కల్యాణ నిలయాయై నమః

ఓం ర్ద్రాణ్యై కమలాసనాయై నమః

ఓం శుభప్రదాయై /శుభాయై నమః

ఓం అనంతాయై నమః

ఓం మత్తపీనపయోధరాయై నమః

ఓం అంబాయై నమః

ఓం సంహారమథన్యై నమః

ఓం మృడాన్యై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం విష్ణు సేవితాయై నమః

ఓం సిద్దాయై / బ్రహ్మాణ్యై నమః

ఓం సురసేవితాయై నమః

ఓం పరమానందాయై నమః

ఓం శాంత్యై నమః

ఓం పరమానందరూపిణ్యై నమః

ఓం పరమానంద జనన్యై నమః

ఓం పరానంద ప్రదాయిన్యై నమః

ఓం పరోపకార నిరతాయై నమః

ఓం పరమాయై నమః

ఓం భక్తవత్సలాయై నమః

ఓం పూర్ణచంద్రాబ్భవదనాయై నమః

ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః

ఓం శుభలక్షణ సంపన్నాయై నమః

ఓం శుభానంద గుణార్ణవాయై నమః

ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః

ఓం శుభదాయై నమః

ఓం రతిప్రియాయై నమః

ఓం చండికాయై నమః

ఓం చండమదనాయై నమః

ఓం చండదర్పనివారిణ్యై నమః

ఓం మార్తాండనయనాయై నమః

ఓం సాధ్వ్యై నమః

ఓం చంద్రాగ్నినయనాయై నమః

ఓం సత్యై నమః

ఓం పుండరీకహరాయై నమః

ఓం పూర్ణాయై నమః

ఓం పుణ్యదాయై నమః

ఓం పుణ్యరూపిణ్యై నమః

ఓం మాయాతీతాయై నమః

ఓం శ్రేష్ఠమాయాయై నమః

ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః

ఓం అసృష్ట్యై నమః

ఓం సంగరహితాయై నమః

ఓం సృష్టిహేతుకవర్థిన్యై నమః

ఓం వృషారూఢాయై నమః

ఓం శూలహస్తాయై నమః

ఓం స్థితి సంహార కారిణ్యై నమః

ఓం మందస్మితాయై నమః

ఓం స్కందమాత్రే నమః

ఓం శుద్దచిత్తాయై నమః

ఓం మునిస్తుత్యాయై నమః

ఓం మహాభగవత్యై / దక్షాయై నమః

ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః

ఓం సర్వార్థ దాత్ర్యై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సదాశివకుటింబిన్యై నమః

ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః

ఓం సచ్చిదానంద లక్షణాయై నమః

ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః

ఓం శంకరప్రియవల్లభాయై నమః

ఓం సర్వధారాయై నమః

ఓం మహాసాధ్వ్యై నమః

ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః


*శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్*

🙏🙏🔱🙏🙏🔱🙏🙏🔱🙏🙏

[

పక్షి బొమ్మ  (కథ)  ✍🏻నారంశెట్టి ఉమామహేశ్వరరావు 


  ఏడవ తరగతి చదివే కావ్య తెలివైనది.అప్పుడప్పుడు  అమ్మానాన్న ఇచ్చిన డబ్బుతో  బొమ్మలు కొనుక్కుని ఖాళీ ఉన్నప్పుడు ఆడుకునేది. 

ఒకసారి కావ్య వాళ్ళమ్మ ప్రక్కింటావిడతో బొమ్మల కొలువు గురించి మాట్లాడుతుండగా ఆలకించింది  కావ్య. కొన్ని రోజుల్లో  వచ్చే దసరాకి  బొమ్మల కొలువు చేయాలని,  తన స్నేహితులను పిలిచి చూపించాలని అనుకుంది కావ్య. తన దగ్గర ఏయే బొమ్మలున్నాయో చూసుకుంది. 

తన దగ్గరున్న  బొమ్మలు మాత్రం బొమ్మల కొలువు చేయడానికి సరిపోవని, మరిన్ని కొత్త బొమ్మలు  కొనుక్కోవాలని అనుకుంది కావ్య.  అంతలో  బయట కాకి అరిచింది. కాకి అరుపు వినగానే పక్షులు, జంతువుల బొమ్మల్ని  కూడ బొమ్మల కొలువులో పెట్టాలన్న కోరిక కలిగింది కావ్యకు.    

తరువాత రోజు సాయంత్రం నాన్నని బొమ్మల దుకాణానికి తీసుకువెళ్లి చిలుక, పావురం, నెమలి, కాకి, కొంగ, డేగ, గుర్రం, గాడిద, మొదలైన జంతువుల బొమ్మల్ని కొనుక్కుంది  కావ్య. 

దసరా నాడు స్నేహితురాళ్ళని పిలిచి బొమ్మలతో కొలువు తీర్చింది. రోజంతా ఆడుకున్నారు  పిల్లలు. బాగా అలసిపోయిన కావ్య  అక్కడే నిద్రపోయింది. అమ్మ వచ్చి కావ్యను ఇంట్లోపలకు  తీసుకువెళ్ళగా ,   బొమ్మలు  బయట గడపలో కొలువు దగ్గరే  ఉండిపోయాయి. 

తరువాత రోజు ఉదయం కావ్య చూసుకుంటే వాటిలో కాకి బొమ్మ  కనబడలేదు. అమ్మను అడిగితే తెలియదని చెప్పింది. నాన్న పని మీద వెళ్ళాడు. ఇంటి చుట్టూ ప్రహరీ ఉండడంతో బయటివారు తీసే అవకాశం లేదు. బొమ్మ పోవడంతో ఏడుపు వచ్చింది కావ్యకు.

అటుగా పిల్లి వెళుతుంటే ”కాకి బొమ్మను తీసావా?’ అని అడిగింది కావ్య. “పాలు తాగుతాను. ఎలుకల్ని తింటాను కానీ  బొమ్మ నాకెందుకు?” అంది పిల్లి. 

పిల్లిని చూసి కంతలోకి దూరుతున్న ఎలుకను “నువ్వు తీసావా?” అని అడిగింది కావ్య. “తినే ఆహారం కావాలి  కానీ బొమ్మ నాకెందుకు?” అనేసి దాక్కుంది ఎలుక.

 దొడ్లో ఎవరినో చూసి మొరుగుతున్న కుక్కను అడిగింది కావ్య.   “అన్నము, మాంసం ముక్కలు అయితే తింటాను.  బొమ్మ నాకెందుకు?’ అంది కుక్క.  కోడి, బాతులనీ అడిగింది. అవి తియ్యలేదని చెప్పాయి. కావ్య ఉసూరుమంటూ కూర్చుంది. 

 దొడ్లో ఉన్న జామచెట్టు మీద ఒక చిలుక వాలి కావ్యను పలకరించింది. దాని మాటలకు ఉత్సాహం వచ్చింది కానీ బొమ్మ పోయిన   బాధను దాచుకోలేక పోయింది కావ్య. జరిగిందంతా చిలుకతో చెప్పింది. 

“నీ స్నేహితులే తీశారేమో” అంది చిలుక.  

“లేదు. అడగకుండా తీయరు. మేము ఆడుతుండగా ఒక కాకి    బొమ్మల్ని చాలా సేపు చూసింది. అది  తీసిందంటావా” అని అడిగింది కావ్య. ఆ  కాకి ఆనవాళ్ళని కూడా చెప్పింది చిలుకతో.    

‘ఇక్కడకు ప్రక్కనే మా అడవి. మా అడవిలో ఉన్న కాకి నువ్వు చెప్పినట్టే  ఉంటుంది. దాన్ని అడుగుతాను” అనేసి ఎగిరిపోయింది చిలుక. 

అడవికి వెళ్లి కాకిని అడిగింది కానీ తెలియదని అది చెప్పడంతో పక్షి రాజుని కలసి జరిగిందంతా  చెప్పింది చిలుక. ‘నా కెందుకో కాకి మీద  అనుమానం ఉంది” అంది చిలుక. కాకినే  కాకుండా అన్ని పక్షులను పిలిచి అడిగింది పక్షి రాజు. 

 “నేనటు వైపు వెళ్ళలేదు’ అంది పావురం.  

“నా నాట్యంతో మెప్పిస్తాను తప్ప దొంగతనం తెలియదు’ అంది నెమలి. “ చేపల్ని తింటాను కానీ బొమ్మ నేనేం చేసుకోవాలి?” అంది కొంగ. 

దాదాపు అన్ని పక్షలూ బొమ్మను  తీయలేదనే  చెప్పాయి. అంతవరకూ కాకి ఎక్కడికో వెళ్లడం వల్ల వెంటనే  రాలేదు. తరువాత వచ్చి “నేనే కాకిని. కాకి బొమ్మ నాకెందుకు?” అంది.   

“మరెవరు తీసినట్టు” అని పక్షిరాజు అంటుండగా “ పక్షులే తెచ్చాయని  ఎందుకనుకుంటారు? మనుషులే తీసారేమో” అనుమానంగా చెప్పింది కాకి.  అంతలో  మైనా అక్కడకు వచ్చి కాకి పిల్ల కాకి దొంగిలించిన  బొమ్మతో ఆటాడుతుండగా చూసానని చెప్పింది.  

పక్షిరాజు తీక్షణంగా కాకిని చూసి “నిజం చెబుతావా? దండించమంటావా?” అని  అడిగింది. 

కాకి “బొమ్మలతో ఆడుతున్న పిల్లల్ని చూసాక నా పిల్ల కూడా  అలా ఆడాలని తెచ్చాను” అని నిజం ఒప్పుకుంది.  

“మన బొమ్మల్ని కొలువులో పెట్టిందని సంతోషపడాలి కానీ బొమ్మ ఎత్తుకొస్తావా? ఆ బొమ్మను  ఇచ్చేసి క్షమాపణ చెప్పేసి రా. చిలుక కూడా నీతో వస్తుంది” అని ఆదేశించింది పక్షి రాజు.  

చిలుక, కాకి  కలసి వెళ్లి బొమ్మను కావ్యకు ఇచ్చాయి. బొమ్మ దొంగిలించినందుకు క్షమాపణ చెప్పింది కాకి. బొమ్మ దొరికినందుకు  ఆనందపడిన కావ్య “దొంగతనం తప్పు కదా. అలా తియ్యకూడదని అమ్మ చెపింది. నన్నడిగితే బహుమతిగా ఇద్దును. నాకొద్దు ఆ బొమ్మ. మీ పిల్లకు నా కానుకగా తీసుకో” అని తిరిగి ఇచ్చేసింది కావ్య.  

 చిలుక  చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇంట్లో ఉన్న తియ్యటి పండును బహుమతిగా దానికి ఇచ్చింది కావ్య. 

---***----

[


పురాణ కథలు చాలా ప్రబోధాత్మకంగాను, ప్రరోచకంగానూ ఉంటా యి. వాటిలో మనో విజ్ఞానం, ఆధ్యాత్మ జ్ఞానం మెండుగా నిండి ఉంటాయి. ఎంతో ఉన్నత శ్రేణి భక్తులైతే తప్ప, వైకుంఠ ద్వార పాలకులు కాలేరు. పూర్వ పుణ్య విశేషం వల్ల ఉన్నత స్థితి కలిగినా దానిని కాపాడుకోవడానికి మరింత పుణ్యం కావాలి. 


మోక్ష మందిర ద్వారాలు!

పారమార్థికంగా జయ-విజయులను- ‘జయ’ అనగా ఇంద్రియ జయమని, ‘విజయ’ అనగా, మనో విజయమని భావించవచ్చు. జయ-విజయుల అనుమతి- అనగా ఇంద్రియ, మనోజయాలు సాధించకపోతే ఎంతటి మతిమంతుడైనా ఇందిరావరుని మందిర (వైకుంఠ) ప్రవేశం చేయజాలడని సనాతన సిద్ధాంతం. ‘లోకము లన్నియున్‌ గడియలోన జయించిన వాడ వింద్రియానీకము జిత్తమున్‌ గెలువ నేరవు’ అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని నిర్భయంగా నిలదీస్తాడు- ‘తండ్రీ! ఈ ఆ లోకాలు గడియలో జయించానని గొప్పలు గుప్పిస్తున్నావు. కానీ, నీలోని మనస్సునూ, ఇంద్రియాలను గెలువ లేకపోయావు. నీ ఇంద్రియానీకం జయిస్తే మరి ఏ లోకమూ జయించే పని లేదు గదా!’ అని.

సనాతన ధర్మంలో ఇంద్రజిత్తు కన్నా ఇంద్రియ జిత్తు మిన్న. ఇంద్రుని జయించిన వానిని జయించడమే అతీంద్రియత్వం! ఇదే రామాయణంలో రామానుజుని (లక్ష్మణుని) రామణీయకం! ‘జితం జగత్‌ కేన మనో హి యేన’- మనస్సును జయించిన వాడే జగద్విజేత. కానీ, చిత్రమేమంటే అట్టి జయ-విజయులకు కూడా అహంకారం, దర్పం కలిగాయి. భగవంతుడు అచ్యుతుడు ఇట్టి అభిమానాన్ని ఎట్టి స్థితిలోనూ ఆమోదించడు, అట్టి పెట్టుకోనివ్వడు. మాధవుడు ఏదో ఒక మాయ చేసి, మరులు గొల్పి అట్టి వారికి కూడా ‘పదవీ (వైకుంఠ) చ్యుతి’ కలిగిస్తాడు.


సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు బ్రహ్మదేవుని మానస పుత్రులు. సురుచిర సుందర గాత్రులు. నలుగురిని సముచ్చయంగా (కలిపి) ‘సనత్కుమారులు’ అని పిలుస్తారు. నివృత్తి- మోక్ష మార్గ నిరతులు. ధీరులు- నిరంతర చిరంతన (సనాతన) బ్రహ్మ చింతనతో చిత్త, ఇంద్రియాలను చెత్తగా చిత్తు చేసిన (ఓడించిన) వారు. ఆశాదూరులు, ఆత్మ వేత్తలు. విచరన్‌ నిర్వాణులు- రూపు దాల్చి నడచి వస్తున్న నిర్వాణం (ముక్తి) వంటివారు. సర్వం కష శేముషీ విచక్షణులు-వివిధ విషయాలలో విశుద్ధ జ్ఞానం కల విద్వాంసులు. అవ్యాహత గమనులు- అడ్డు అదుపు లేక అంతట- ఎక్కడికైనా వెళ్ల గలిగిన అసమాన సామర్థ్య సంపన్నులు. ‘సనత్‌’ అనగా ‘సదా’- ఎల్లప్పుడు అని అర్థం. వారు బ్రహ్మ సృష్టిలో సర్వాధిక వయోవృద్ధులు. అయినా ‘సదా కుమారులు’- ఐదేళ్ల బాలురుగానే ఉంటారు. అనగా, రాగ ద్వేష రహితులై, అకృత్రిమంగా, అమాయకంగా- నిష్కపటంగా ఉంటారు. దిగంబరులు- అంటే పరమార్థంలో దేహాభిమాన రహితులు. దేహాభిమానులు, దైవీ సంపద విరహితులు, దైవసన్నిధికి దూరంగానే ఉంటారు తప్ప దూసుకు పోలేరు.


సనకాదులు ఒక పర్యాయం పద్మనాభుని పాదపద్మ పూజా ప్రసాద ప్రాప్తికై ప్రేమతో పవిత్రమైన వైకుంఠం వెళ్లారు. వైకుంఠం, వైకుంఠుడు ఒకటే! ‘కుంఠం నాశం వైకుంఠం అవినాశ స్థానమ్‌’- కుంఠమనగా నశించే అజ్ఞానం. వైకుంఠమనగా నాశం లేనిది గాన జ్ఞానం. కాన, జ్ఞానానుభవ స్థితియే వైకుంఠం. ‘అభేద దర్శనం జ్ఞానం’- ఏకత్వాన్ని దర్శించుటే జ్ఞానం కనుక వైకుంఠంలో భేదబుద్ధి ఉండదు. ఆదిశేషుడు, ఆమ్నాయ (వేద) స్వరూపుడైన గరుత్మంతుడు అవిరోధంగా ఎక్కడ ఉంటారో అదే వైకుంఠం. నళినాయతేక్షణుడు నారాయణుడు అక్కడ నెలకొని ఉంటాడు. అంత్యానుప్రాసల అలంకార విన్యాసాలతో పద్యాన్ని అర్థవంతంగా హృద్యంగా పలకడం పోతన్నకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రింది వృత్తాలలో అమాత్యుడు అనంతుని వైకుంఠ వైభవాన్ని, ఆయన దివ్య స్వరూప సౌందర్య ప్రాభవాన్ని ఎంతో ప్రభావ పూర్ణంగా వర్ణించాడు.-


విబుధ వరులు సనకాదులు అలా ముందుకు వెళ్ళి-వెళ్ళి విశిష్ట వైభవంతో విరాజిల్లుతున్న వైకుంఠ నగరాన్ని వీక్షించారు. అది నిత్యమైన దివ్యశోభతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సుమనో మనోహరంగా, ప్రపన్ను (శరణాగతు)లైన భక్తులకు పరమ భజనీయమైన పవిత్రనామంగా పరిఢవిల్లుతోంది. ‘యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ’- ఆ పరంధామం పొందిన వారికి పునర్జన్మ లేదు. సత్పురుషులచే సన్నుతింపబడే ఆ సుందర నగరం ‘భూమా’- సర్వ వ్యాపకమైన విష్ణు స్వరూపం. అశేష భక్త బృందాన్ని అహర్నిశం కృపతో కాచే కరుణా నిధానం. ఆ నగర ఉద్యాన వనం మూర్తీభవించిన మోక్షం వలె ‘నైశ్శ్రేయసం’ అన్న నామంతో నయనాభిరామంగా అలరారుతోంది-


లీలా పురుషోత్తముని లోకాతీతమైన ఆ వర (శ్రేష్ఠ) వైకుంఠపురం ఒక సుందర సరోవరం. అవర్ణనీయ దివ్య సువర్ణ శాలలతో, గోపురాలతో, రమ్యమైన హర్మ్యాల (మేడల)తో కూడిన ఆ మహామందిరమే సరస్సు మధ్య ఉన్న సరోజం (పద్మం). ఆ మందిర మధ్య భాగంలో ప్రకాశించే ఆదిశేషుడే తామర దుద్దు. శేషశెయ్యపై శయనించి శోభిస్తున్న శ్రీమన్నారాయణుడే షట్పదం- తుమ్మెద!


లోక కళ్యాణ మూర్తులైన ఆ సనక సనందనాదులు సంతోషంతో తమ యోగశక్తివల్ల వడి-వడిగా వైకుంఠధామం విచ్చేశారు. సాధనాపరంగా కర్మ, ధ్యాన, భక్తి, జ్ఞాన యోగాలే సనత్కుమారులు. ఆఱు మహాద్వారాలు దాటి ఏడవ మహాద్వారం చేరుకున్నారు. అదికూడా దాటి వెళ్లితే ఇక దామోదరుని దివ్య దర్శనమే! కాని, దైవ యోగం వల్ల పూజార్హులని గుర్తించక ద్వారపాలకులైన జయ-విజయులు అహంకారంతో అక్కడ వారిని అడ్డుకొన్నారు. ఇక్కడ పరమార్థంలో కామ, క్రోధాది అరిషడ్వర్గమే ఆఱు ద్వారాలు. అహంకారమే ఆఱున్నొక్క (ఏడవ) ద్వారం. సాధువరేణ్యులైన సనకాదులకు స్వామి సంకల్పమేమో అన్నట్లు సాత్తికమైన కోపం వచ్చింది. కటు స్వభావులు, కుటిల స్వాంతు (మనస్కు)లైన జయ-విజయులతో వారిలా అన్నారు- 


‘సత్య సనాతనుడైన స్వామి సందర్శనం మాకు క్రొత్త కాదు. ఇది మా నిత్యకృత్యం. నిరాటంకంగా వచ్చి పోతూ ఉండే మాకు మీరు ఆటంకంగా నిలిచారు. ఇలా అడ్డు పడుట చాలా చెడ్డ పని. భక్తులమైన మాకు, భగవంతునికి మధ్య భేదం లేదు. (‘తస్మిన్‌ తజ్జనే భేద అభావాత్‌’- భగవంతునికి భాగవతులకు అభేదమని భక్తి సూత్రాలలో నారద ఉపదేశం). మీరు భేదం పాటించారు. మాకు ఖేదం కల్గించారు. భేదబుద్ధి భయంకర రాక్షస స్వభావం. అది ఉన్న మీరు రాక్షసులై జన్మించండి.’


కామ క్రోధ లోభాది శత్రు గుణాలకు లోనై భూలోకంలో పుట్టండని సనకుడు శాపం పెట్టాడు. జయ-విజయుల కోప కారణమైన పాపమే వారికి శాపమయింది. అన్ని లోకాలకు మిన్న అయిన వైకుంఠంలో ఉన్నవారైనా అనన్య భక్తులను అవమానిస్తే వారికి అధఃపతనం అనివార్యమని హచ్చున హెచ్చరిక! ఈ ప్రసంగంలో అర్భకులైన సనకాదులు కూడా మార్గమధ్యలోనే (7వ ద్వారం దగ్గఱ) మన్యువుకు (కోపానికి) లోనైనందున గర్భాలయం లోనికి వెళ్లి విశ్వగర్భుడైన విష్ణువును దర్శించే భాగ్యం దక్కించుకోలేకపోయారు. భగవంతుడే భార్గవీ (లక్ష్మీ) సమేతంగా బయటకు వచ్చి కన్పించాడు. ఎంతటి విబుధ శ్రేష్ఠులైనా క్రోధావిష్టులైతే వైకుంఠానికి వెళ్లి విష్టరశ్రవుని (విష్ణువుని) దర్శించే అదృష్టానికి నోచుకోలేరని విస్పష్టమైన హెచ్చరిక.

[


వాయువు చేతనే మేఘం రావించబడి మరల వాయువు చేతనే తొలగింప(కొనిపో) బడుచున్నది. అలాగే, మనసు చేతనే బంధం, మోక్షం కల్పించబడుతున్నాయి’. మనసు సత్తరజస్తమో గుణాత్మకం. మనసు రజోగుణంతో ఉన్నప్పుడు కర్మలను ప్రేరేపిస్తుంది. ఇంద్రియభోగాలలో ఆసక్తిని కలిగిస్తుంది. ఫలితంగా రాగద్వేషాలు కలుగుతాయి. ఇంద్రియ విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు ‘సుఖం’, అనుకూలంగా లేనప్పుడు ‘దుఃఖం’ భావనలను కలిగిస్తుంది. మనసు తమోగుణంతో ఉన్నప్పుడు నిద్ర, సోమరితనం మొదలైనవి ప్రేరేపితమై వ్యర్థచేష్టలకు కారణమవుతుంది. మోహాన్ని కల్పించి మానవుని వివేకహీనుని చేస్తుంది. అదే మనసు నిర్మలం, వికార రహితమైనప్పుడు శుద్ధసత్త గుణంతో జ్ఞాన, వైరాగ్యాలను కల్పించి మోక్షానికి కారణమవుతుంది.

ఈ మనసే ఇంద్రియాల ద్వారా విషయాలను సేకరిస్తూ ‘భోగాల’ను అనుభవిస్తుంటుంది. ‘నేను, నాది’ అనే భావనలను కల్పిస్తుంది. కర్మలు చేయిస్తూ, వాటి ఫలాలను అనుభవింపజేస్తుంది. అందువల్ల, మనసును వశంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ‘మనసు అనే పెద్దపులి విషయాలనే అరణ్యభూములలో తిరుగుతున్నది. మోక్షాపేక్షగల ఓ సాధుజనులారా! అటువైపు వెళ్లకండి (వివేక చూడామణి)’ అన్నారు శంకరులు.’ శబ్ద, స్పర్శ, రూప, రస (రుచి), గంధము (వాసన)లు- అన్నవి చెవులు, చర్మం (శరీరం), కళ్లు, నాలుక, ముక్కు అనే అయిదు ఇంద్రియాలకు చెందిన విషయాలు. వీటిపట్ల వ్యామోహంతో మనిషి వివేకహీనుడై పతనం చెందుతాడు. జింక వేణుగానాని (శబ్దం)కి వశపడి బోయవానికి చిక్కుతుంది. మగ ఏనుగు ఆడ ఏనుగు స్పర్శ(శరీరం) కోసం కందకంలో పడిపోతుంది. మిడుత అగ్నిజ్వాలను చూసి (రూపం) దానిని మింగాలని ప్రయత్నించి, ఆ అగ్నిలోనే పడి మరణిస్తుంది. ఎరలకు (రుచి) ఆశ పడి చేప గాలానికి చిక్కుతుంది. ఇదే విధంగా, తుమ్మెద పువ్వు పరిమళాన్ని (వాసన) ఆశించి దానిలోనే చిక్కు పడుతుంది. ఇలా- జింక, ఏనుగు, మిడుత, చేప, తుమ్మెద అనే అయిదు ప్రాణులు ఒక్కొక్క ఇంద్రియ విషయంలోని ఆసక్తిచేత నశించి పోతుండగా, పంచేంద్రియాల పట్లా ఆసక్తితో మనిషి భ్రష్టుడవుతున్నాడు. అందువల్ల ఇంద్రియ వ్యామోహాన్ని (మోక్షానికి) ఆటంకంగా గుర్తించి, వాటిని మనసుద్వారా నియంత్రించుకోవాలి. 

రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, దంభం, దర్పం, అహంకారం, ఇచ్ఛ, భక్తి, శ్రద్ధ.. ఈ 16 మనసుకు చెందిన వృత్తులు. వీటిలో ‘శ్రద్ధ, భక్తి’ మినహా మిగిలిన 14 మలిన (అశుద్ధ) వృత్తులు. ఇవి మనిషిని పాపకర్మలవైపు ప్రోత్సహిస్తాయి. ఏ ప్రయత్నం లేకుండగానే మరల మరల ఏర్పడుతుంటాయి. వీటితోనే మనిషి పతనమవుతాడు. ప్రయత్నపూర్వకంగా ఈ అశుద్ధ వృత్తులను నిరోధించి, శుద్ధ వృత్తులైన భక్తి, శ్రద్ధలను అలవరచుకోవాలి. భక్తి, శ్రద్ధలతో కర్మలు చేసేవారికి క్రమక్రమంగా సంసారబంధ విముక్తి కలుగుతుంది. ఆకలి, దప్పిక, విసర్జనాది కర్మలు విడువదగినవి కావు. రాగాది విషయాలు కూడా ‘నేను, నాది’ అనే అభిమానం చేతనే ఏర్పడతాయి. అభిమానం ఉన్నంతవరకు కర్మలపట్ల ప్రవృత్తి (ఆసక్తి) ఏర్పడుతుంది. ఈ అభిమానం అజ్ఞానం (అవివేకం) చేత కలుగుతుంది. వాస్తవమైన దానిని గుర్తించలేక పోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానానికి ‘ఆది లేదు’ కానీ, అంతం వుంది. జ్ఞానం వల్లే అజ్ఞానం నశిస్తుంది. ఈ జ్ఞానం నిర్మలమైన మనసులోనే కలుగుతుంది. అందువల్ల, ఇంద్రియాలను, మనసును, బుద్ధిని వశం చేసుకొని అంతరంగ శుద్ధిని ఏర్పరచుకోవాలి. అదే అసలైన ఆధ్యాత్మిక సాధన!

[

*గంగా, లక్ష్మీ, సరస్వతులు.*


లక్ష్మీ దేవి, గంగాదేవి, సరస్వతీ దేవి అనే దేవతామూర్తులు ముగ్గురూ పూర్ణాంశతో మహావిష్ణువులో తాదాత్మ్యం చెందారు. వారి కళలు మాత్రం భారతభూమిలో నదులుగా అవతరించాయి.


సరస్వతీ దేవి పూర్ణాంశగా కళారూపంలో అవతరించి 'భారతి' అనే పేరు పొందింది. వాక్కులకు అదిష్ఠాన దేవత కనుక అమెకు 'వాణి' అనే పేరు వచ్చింది. పాపాలను దహింపజేయగల పచ్చని కాంతితో అగ్నివలె ప్రకాశిస్తూ పవిత్రమైన నదీరూపాన్ని పొందినపుడు ఆమె 'సరస్వతి'. 


సరస్వతీ నది అంతర్వాహిని. అంటే పైకి కన్పించకుండా నీటి అడుగున గుప్తంగా దాగి ప్రవహించేది. ప్రయాగ క్షేత్రంలో గంగా యమునా సరస్వతీ నదులు కలుస్తాయి. అది త్రివేణీ సంగమం. త్రివేణి సముద్రంలో కలిసేచోటు కూడా అక్కడే ఉంది. అది త్రివేణీ సాగర సంగమ స్థానం కాని, ప్రయాగలో గంగా యమునా నదులు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఆ రెండిటి మద్య సూక్ష్మరూపిణిగా ఉన్న అంతర్వాహిని సరస్వతీ నది. గంగాజలం తెల్లని కాంతితో చల్లగా ఉంటుంది. యమున నీరు నల్లని కాంతితో గోరువెచ్చగా ఉంటుంది.


గంగానది విష్ణుపాదాల నుండు ఉద్భవించింది. భగీరథుని తపః ప్రభావం చేత భూలోకంలో ప్రవహించింది. సగర పుత్రులను ఉద్ధరించడానికి, గంగను భూమికి రప్పించడానికి సూర్యవంశరాజులు ప్రయత్నించారు. 


సగర చక్రవర్తి కుమారులు అరవై వేల మంది కపిలమహర్షి శాపం వల్ల దగ్ధులు కాగా, వారిని ఉద్ధరించడానికి సూర్యవంశంలో పుట్టిన అసమంజుడు తీవ్రమైన తపస్సు చేశాడు. తపఃఫలం పొందక మునుపే అతని శరీరం రాలిపోయింది. అతని కుమారుడైన అంశుమంతుడు కూడా చిరకాలం ఘోరతపస్సుచేసి, ఫలం పొందకుండానే తనువును వదిలాడు. అంశుమంతుని కుమారుడైన భగీరథుని గుణవంతుడు, బుద్ధిమంతుడు, భగవద్భక్తుడు. కఠోర తపోదీక్షతో గంగను ప్రసన్నురాలిని చేసుకొన్నాడు. అతని కోరిక మేరకు గంగ భూలోకంలో ప్రవహించిది.

 గంగానదీ ప్రవాహం వల్ల సగరపుత్రులు సజీవులయ్యారు. ఆ ఆ ప్రదేశం సాగరమై పుణ్యస్థలమైంది.


లక్ష్మీ దేవి భారతీదేవి వాక్యానుసారం పద్మినిగా అవతరించి, నదీ రూపాన్ని దాల్చి , ధర్మధ్వజుని పుత్రికయై తులసీ వృక్షంగా రూపొంది. పాప పరిహారకమై నిలిచింది.


నదీ రూపాలను పొందిన గంగా లక్ష్మీ సరస్వతులు ముగ్గురూ భూలోకంలో ప్రవహిస్తూ, కలియుగంలో ఐదువేల సంవత్సరాల కాలం గతించే వరకు ఉండి, ఆ తరువాత వైకుంఠంలో మహావిష్ణువులో పూర్ణత్వం పొందుతారు. కాశీక్షేత్రం, బృందావన క్షేత్రం కలియుగాంతం వరకు పుణ్యస్థలాలుగా నిలిచి ఉంటాయి. జగన్నాథ క్షేత్రం, సాలగ్రామ శక్తి కలియుగంలో పదివేల సంవత్సరాల వరకు మహీమాన్వితమై నిలిచి ఉంటాయి.


కలిప్రభావం వల్ల లోకమంతా అధర్మ ప్రవర్తనతో నిండి సద్గుణాలు, పురాణాలు, వేదవిహిత కర్మలు, దేవతార్చనలు, భగవన్నామ సంకీర్తనలు, సత్య ధర్మాలు, వ్రతోపవాసాలు అన్నీ క్రమంగా భూలోకాన్ని విడిచిపోతాయి. అవన్నీ వైకుంఠం చేరుకుంటాయి.


 కలియుగాంతం నాటికి భూమిపై జనులు ఆచారహీనులై స్వైరవిహారాలకు పాల్పడతారు. ఎనిమిది సంవత్సరాల వయస్సునాటికే స్త్రీలు సంతానవతులు కావడం, పదహారు సంవత్సరాల వయస్సుకే వార్ధక్యం ప్రవేశించడం కలిలక్షణాలే.


శ్రీమహావిష్ణువు విష్ణుయశుడు అనే బ్రాహ్మణునకు కుమారుడై చేత ఖడ్గాన్ని ధరించి, అశ్వవాహనుడై 'కల్కి' అనే పేరుతో మూడు రాత్రులలో పాపాత్ములందరిని అంతం చేస్తాడు. ఆరురోజుల పాటు రాత్రింబవళ్లు ఏకథాటిగా కుంభవృష్టి కురిసి అంతా జలమయమైపోతుంది. ద్వాదశాదిత్యులు ఒకే సారిగా దర్శనమిస్తారు. వారితేజస్సు వల్ల భూమిపై అంతా ఎండిపోతుంది.


'కల్కి' ప్రభావంతో కలిపురుషుడు అంతరిస్తాడు. కృతయుగం ప్రారంభమవుతుంది. ధర్మదేవత నాలుగు పాదాలతో నిలబడుతుంది. భూలోకం అంతా ప్రకాశిస్తూంది. ఇలా యుగ పరివర్తనం జరిగే కాలం బ్రహ్మకు 108 సంవత్సరాలు. ఆ తరువాత బ్రహ్మ కూడా లయమైపోతాడు. దానికి 'ప్రాకృత ప్రళయము' అని పేరు. త్రిమూర్తులు, మహర్షులు, జ్ఞానులు, యోగులు చిద్రూపమై తేజస్సులో లయమైపోతారు. ప్రకృతి అంతా చిదగ్నిలో లీనమైపోతుంది.


 ఈకాలమంతా పరాశక్తికి ఒక్కనిమిషం. అంటే ఆమె కనురెప్పల కదలికలో ఈ సమస్త భువనాలూ పుట్టి నశిస్తూ ఉంటాయి. ఆమె ఒక్కసారి కన్నుతెరిస్తే సృష్టి .ఆమె కనురెప్పమూస్తే ప్రళయం. అందుకే ఆమె విరాడ్రూపాన్ని సందర్శించిన హయగ్రీవుడు 'లలితా సహస్ర నామావళి'గా ఆమె వైభవాన్ని గానం చేస్తూ "ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః" అని కీర్తించాడు.


ఈ విధంగా పరాశక్తి సంకల్ప ప్రభావం వల్ల .యుగాలు , ధర్మాలు, కాలచక్రం, నదులు, పర్వతాలు, బ్రహ్మ, విష్ణువు, రుద్రులు కూడా ప్రాకృతిక ప్రళయములో అంతమవుతూ, మళ్ళీ కృతయుగారంభంలో ఆవర్భవిస్తూ వుంటారు. ఇదంతా పరాశక్తి లీలావిలాస ప్రభవమే.

[

మనం పూజలు కానీ, వ్రతాలు కానీ, జపం కానీ, ధ్యానం కానీ రోజూ చేసుకునే అలవాటు/అభ్యాసం అయితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే అలా కేవలం అభ్యాసంగా కాకుండా వాటిలోని అర్థాన్ని తెలుసుకొని చేయటం ఉత్తమమని "శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్" అని భగవద్గీత బోధిస్తోంది.  దీనినే "తెలిసి రామ చింతన చేయమని" శ్రీ త్యాగరాజ స్వామివారు బోధించారు. 


అయితే కేవలం అర్థం తెలుకున్నంత మాత్రాన సరిపోదు, దానిమీద నీ మనస్సునుంచి నీ ధ్యానంలో నిలుపుకుని చేయాలని "జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే" అని కూడా చెబుతోంది. 


కానీ, అర్థం తెలుసుకొని, ధ్యాస నిలిపి సత్కర్మలు ఆచరించినప్పటికీ వాటిని ఏదో ప్రయోజనం ఆశించి చేయటం వలన అవి కామ్య కర్మలుగా మారి చివరికి బంధాన్నే కలిగిస్తాయి. అందుకనే ధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగం గొప్పదని "ధ్యానాత్ కర్మఫల త్యాగః" అని చెప్పబడింది. 


ఇక అలా ఫలితాన్ని భగవంతునికే విడిచిపెట్టి సత్కర్మలను ఆచరించటం వలన మనకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది. దీనినే భగవద్గీత "త్యాగాత్ శాంతిరనంతరం" అని నొక్కి వక్కాణిస్తోంది. 


 చెరువు దగ్గరకు ఒక గ్లాసు తీసుకువెళితే నీకు గ్లాసుడు నీళ్ళే వస్తాయి. అలాగే చెంబుతో వెళ్ళిన వాడికి చెంబుడు నీళ్ళు, బిందెతో వెళ్ళిన వాడికి బిందెడు నీళ్ళు లభిస్తాయి. కాని ఏమీ తీసుకువెళ్ళకుండా తానే వెళ్ళి చెరువులో మునిగిన వాడికి ఆ చెరువంతా తనదే అవుతుంది. చూసారా ఫలితం ఆశించని వాడికి ఎంతటి ఫలితం దక్కుతుందో? ఇక వాడి మనసులో అశాంతికి తావెక్కడిది? 


ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే, ప్రకృతి దానిని గడ్డీగాదంతొ  నింపేస్తుంది. అదేవిధంగా మనసును  మంచి ఆలోచనలతో  నింపక పోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి.

[

అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక,  ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.


ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి  మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు. 


జాతకం చూపిస్తే,  పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు. 


ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. 'వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూండండి' అని చెప్తారు. 


నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. 


పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 


ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా 

తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది. 

అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు. 


రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. 


మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. 


పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. 


అతడు వెంటనేె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో,  నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. 


వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. 

తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు : 


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. 


కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు 

గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న 

విషయాన్ని గమనించరు. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

 విద్యుచ్చంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం 

ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు 

అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు 

వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన 

మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని 

ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ 

నవసరములేదు. 


11. ఇదం కాష్టం ఇదం కాష్టం 

నధ్యం వహతి సంగతః| 

సంయోగాశ్చ వియోగాశ్చ 

కా తత్ర పరివేదన|| 


తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు. 


ఈచివరి శ్లోకం భార్యభర్తల గురించి సంకేతంగా చెప్పినదే! ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వేరు వేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం.


ఇందులో  వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించవలసినదే! 


మరి పరివేదన పనికిరాదన్నారు. వేదనకి, పరివేదనకి తేడా ఉంది. వేదన సహజాతం.  దానిని అను భవించాలి, పరివేదన అలాకాదు, మనం తలుచుకుని తలుచుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరివేదన పనికి రాదన్నారు. 


 యఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.


మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదహరించి చెప్పేరు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు,కొంతకాలం, ఒంటరిగా. 


ఇది అందరు భార్యభర్తలకీ జరిగేదే! 


ఇది సహజ పరిణామం,సృష్టి క్రమమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం.

[


దివ్యజీవనం అంటే ఏమిటి? 

ఈ ప్రశ్నకు రకరకాలైన సమాధానాలు, వ్యాఖ్యానాలు, అర్థాలు చెబుతారు. సరైన అవగాహన కొరవడటం వల్ల ఒక్కొక్కప్పుడు పెడార్థాలకు, అపార్థాలకు, అనర్థాలకు దారితీయటం కద్ధు దివ్య అనే పదానికి చాలా అర్థాలున్నాయి. జ్ఞానం, అతీంద్రియశక్తి, ఆకాశం, సత్యం, శ్రేష్ఠం, ఆశ్చర్యకరమైంది... ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్ఛు గొప్పగా బతకడం, అంటే భవ్యజీవితమే దివ్య జీవితం అనుకుని చాలామంది గొప్పలకుపోయి, అప్పులపాలై, నానాతిప్పలకు గురై, చివరికి పశ్చాత్తాపంతో కుంగి కృశించి నశించిన సంఘటనలు ఉన్నాయి.

ఈ ప్రపంచానికి దూరంగా అడవుల్లోనో, కొండగుహల్లోనో, ఒంటరిగా, ఏకాంతంగా, బతకడమే దివ్య జీవనమని మరికొందరి అభిప్రాయం. మూడోరకం మనుషులు, చనిపోయాక స్వర్గంలో అనుభవించే సుఖభోగాలని అనుకుంటారు. వాటికోసం పరితపిస్తూ ప్రస్తుతాన్ని కర్తవ్యాన్ని బాధ్యతలను, పక్కనపెట్టి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటివారు సమాజానికి, ప్రపంచానికి ప్రమాదకరంగా తయారవుతారు. మతం అనే మత్తుమందుకు బానిసలై చివరికి తమ వినాశనాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.


ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. ఈ మతాలు మానవ సమాజాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో, కొందరు ప్రవక్తలు బహుళ ప్రచారాలు చేపట్టారు. వ్యక్తి ఎదుగుదల, సమాజ సంక్షేమం రెండూ మతానికి మూల స్తంభాల వంటివి. వ్యక్తి నైతికవిలువలు పాటిస్తూ సుఖజీవనం సాగించాలి. తనలాగా మిగతావారూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. సభ్యులందరూ బాగుంటే సమాజమూ బాగుంటుంది. అలా ఉండాలంటే, మనుషుల్లో దైవంపట్ల భక్తివిశ్వాసాలు కలగాలి. తనను కాపాడే దివ్యశక్తి ఒకటి ఉన్నదని, అది కనిపెడుతూ ఉంటుందని, హద్దుమీరి ప్రవర్తించవద్దని దాదాపు మతాలన్నీ బోధిస్తాయి.


మానవమాత్రుడై ఈ భూమిపైన పుట్టాక, ప్రకృతి ప్రభావానికి లోనుకాక తప్పదు. అహంకార మమకారాలకు మూలకారణాలైన రాగద్వేషాలకు గురికాక తప్పదు. మృగదశలోని ఆదిమానవుడు క్రమేణా బుద్ధిబలంతో మానవుడయ్యాడని శాస్త్రజ్ఞులు రుజువుచేశారు. ఆ మానవుడే దివ్యమానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నదని యోగజ్ఞులు ప్రవచించారు. ప్రయోగాలు, ప్రవచనాలు, మానవ సమాజపు ప్రగతి రథచక్రాలు. మృగత్వం, దివ్యత్వం, మానవత్వానికి కుడి ఎడమల్లాంటివి. పరిస్థితులను బట్టి, పరిసరాలను బట్టి మనిషి పశువులా ప్రవర్తిస్తాడు. తన తప్పు తెలుసుకుని ఇకపైన అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేయడానికే గురువులు, ప్రవక్తలు ఉన్నారు. వారి బోధనలతోపాటు స్వయంగా ఆలోచించగల మేధాశక్తి మనిషికి ఉంది. ఒకనాటి మహాపాపాత్ముడు ఒకరోజు మహాత్ముడుగా మారిపోవడానికి గురుకృప, ఆత్మవిమర్శ... రెండూ అవసరమే.


బుద్ధుడి నీడలో అంగుళీమాలుడు పరివర్తన చెందాడు. ఆదికవి వాల్మీకి నారదుడి బోధవల్ల వేటవృత్తికి దూరమై మహర్షి కాగలిగాడు. వైజ్ఞానిక జీవపరిణామ క్రమానికి ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నట్లే- దివ్య జీవనానికి భవ్యజీవన విధానం ఒక వాహికలా ఉపయోగపడాలి. జ్ఞాన వైరాగ్యాలకు జీవితం ఒక అడ్డుగోడ అనుకోవడం పొరపాటు. జీవిత పరమార్థం జీవితం నుంచే పొందాలి. ప్రపంచ పాఠశాలలో అనుభవాలు పాఠాలు. దివ్య జీవనానికి అవి భవ్యసోపానాలు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం- ఈ నాలుగూ ఆశ్రమధర్మాలు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని ఆదుకుంటుంది. కష్టసుఖాలు అనుభవించి, అవి ప్రచ్ఛన్నవరాలని తెలుసుకున్నప్పుడే నిజమైన వైరాగ్యం కలుగుతుంది. అజ్ఞానపుచీకటి తొలగి జ్ఞానోదయం అవుతుంది.

[

ప్ర: 'దక్ష యజ్ఞ విధ్వంస' గాథలోని ఆంతర్యం తెలుపగలరు.


జ: అన్నీ కలిసొచ్చినంతకాలం అంతా తన నిర్వాకమేనను కుంటాడు మనిషి. అప్పుడు మర్యాద, మన్ననవంటివేమీ పట్టవు. 


'తాను బ్రహ్మగారి పుత్రుడు, ప్రజాపతి. దేవతలందరూ తన మాట వింటారు. యజ్ఞకర్మలాచరించి కావలసిన ఫలాన్ని తాను పొందగలడు.


మధ్యలో ఈశ్వరుడెవడు? తన కర్మే (పనియే) తనకు ఫలాన్నిస్తుంది. ఈశ్వరుని ప్రస్తావనే తన కక్కర్లేదు' - ఈ అహంకారంతో ఈశ్వరావమానానికే సిద్ధపడ్డాడు దక్షప్రజాపతి.

ఈశ్వరునే కాదని యజ్ఞాన్ని ప్రారంభించాడు.


ద్వేషంతో, దైవాన్ని అవమానించే ఉద్దేశంతో సాగే ఆ యజ్ఞంలో అన్ని వనరులూ సమకూర్చుకున్నాడు. ఎంతైనా ప్రజాపతి కదా!


అసలు - ఈ ప్రజాపతిత్వం ఈశ్వరుని కృపవల్లనే బ్రహ్మ ద్వారా తనకు లభించింది. కానీ అహంకారం అసలు సత్యాన్ని గ్రహించనివ్వదు. కేవలం బాహ్య దృష్టినీ, అలంకారాల ఆడంబరాలనీ వదలలేని భౌతికునికి - పరమాత్ముని పరమార్ధ వేషం అర్థమవుతుందా!

ప్రజాపతి మాట తీసేయలేక దేవతలు యజ్ఞంలో పాల్గొన్నారు. అవమానించడం దక్షుని అసలు ఉద్దేశమైనా, ఏ మానావమానాలూ ఈశ్వరునికి అంటవు. అందుకే ఆయన చలించలేదు. నిర్వికారుడై ఆయన కదలక పోయినా, ఆయన శక్తి చూస్తూ ఊరుకోదు.

అందుకే తాను కదిలివచ్చింది, హెచ్చరించింది.


వినాశకాలం దాపురించిన దక్షునికి ఆ హెచ్చరిక చెవిన పడలేదు. దానితో ప్రకృతి (సతీదేవి) తాను 'దక్షుని పుత్రిక'గా (దాక్షాయణిగా) మనదలచుకోలేదు. శివనిందాపరుని కూతురు అనిపించుకొనే ఇష్టంలేక భౌతిక శరీరాన్ని త్యాగం చేసింది.

అప్పుడు విజృంభించింది ఈశ్వరాగ్రహం. ఏ భౌతిక శక్తులూ, దేవతాశక్తులూ ఈశ్వరాగ్రహాన్ని ఎదుర్కొనలేక పోయాయి. ఆ ఆగ్రహశక్తి వీరభద్రుడు. అందులో అధర్మపరుల్ని శిక్షించే 'వీరత్వం' ఉంది. ధర్మాన్ని రక్షించే 'భద్రత్వం' ఉంది.

వీరభద్రుని వీరావేశం దక్షుని అహంకారపుటజ్ఞానయజ్ఞాన్ని ధ్వంసం చేసింది.


'దక్షత' అంటే సమర్థత. ప్రకృతిని తన శాసనానుగుణంగా నడచుకొనే శక్తి అని (కూతురిగా) భ్రమించాడు. అంతా తన సమర్ధతేనని భ్రమించే భౌతికదృష్టి కలిగి ఉండడమే 'దక్షత'. తనకు, ప్రకృతికీ కూడా శాసకుడొకడున్నాడనే వివేకంలేని అహంకారానికి ప్రతీక అతడు.

సర్వకర్మలకీ బలాన్నిచ్చి, ఫలాన్నిచ్చే పరమేశ్వరుని విస్మరించి, ధర్మపు హద్దుల్ని అతిక్రమిస్తే, ఆ ఈశ్వరుని శక్తి అయిన ప్రకృతి క్షమించదు. అది వీరభద్ర విజృంభణ తాండవానికి వీలు కల్పిస్తుంది. సంక్షోభించిన ప్రకృతి నుంచి సర్వేశ్వరుని రౌద్రం వీరతాండవం చేస్తుంది. దానితో స్వయంసమర్థుడననే మానవాహంకారం మట్టి కరుస్తుంది.


ఈ శాశ్వత సత్య బోధనను దక్షయజ్ఞ విధ్వంసగాథ నుంచి గ్రహించాలి.

"ఒక్క కథలోనే ఎన్నో సందేశాలను ఇమడ్చడం భారతీయ మహర్షుల విజ్ఞానం."


[సేకరణ -  'ఏష ధర్మః సనాతనః' పుస్తకం నుండి.

[


*ఒక రోజు, దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడుతూ, "భీష్మ పితామహ" ఇలా ప్రకటించాడు -*


        *"నేను రేపు పాండవులను చంపుతాను"*


         *అతని ప్రకటన గురించి తెలిసిన వెంటనే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది -*


     *భీష్ముని సామర్ధ్యాల గురించి అందరికీ తెలుసు, కాబట్టి ప్రతిఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు...*

    శ్రీ కృష్ణుడు ద్రౌపదితో చెప్పాడు, ఇప్పుడు నాతో రండి. 


    *శ్రీ కృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మ పితామహ శిబిరానికి తీసుకెళ్లాడు -*


   *శిబిరం వెలుపల నిలబడి, అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు - లోపలికి వెళ్లి తాతకు నమస్కరించండి -*


       *ద్రౌపది లోపలికి వెళ్లి తాత భీష్ముడికి నమస్కరించినప్పుడు, అతను* -

     *"అఖండ సౌభాగ్యవతి భవ" అని ఆశీర్వదించిన తర్వాత  ద్రౌపదిని అడిగాడు !!*


    *"ఏంటమ్మా?! ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చారు? శ్రీ కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా"?*


   *అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది -*

      *"అవును తాతయ్యా.!  వారు గది బయట నిలబడి ఉన్నారు" అంది ద్రౌపది. అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు. మరియు ఇద్దరూ ఒకరికొకరు నమస్కరించుకున్నారు.*


 *భీష్ముడు చెప్పాడు-*


 *"నా ఇతర పదాల నుండి నా మాటలలో ఒకదాన్ని కత్తిరించే పనిని శ్రీ కృష్ణుడు మాత్రమే చేయగలడు"*


    *శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు -*


      *"మీ తాతకు ఒకసారి వెళ్లి నమస్కరించడం ద్వారా మీ భర్తలు జీవితాన్ని పొందారు"* -


       *"మీరు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు -దుశ్శాసనుడి భార్యలు మొదలైనవారు కూడా పాండవులకు నమస్కరిస్తే, బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు"* -

 *...... అంటే ......*


        *ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం -*

*ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడమే.!*

     *"తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు"*


     *"ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజూ ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే, అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు."*


      *పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి, ఏ "ఆయుధం" వాటి నుండి చొచ్చుకుపోదు -*


     *"అభ్యర్థన 🙏 ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నిర్ధారించుకోండి మరియు నియమాలను పాటించండి, అప్పుడు ఇల్లు స్వర్గం అవుతుంది."*

               *ఎందుకంటే*:-


         *నమస్కారం ప్రేమ.*

         *నమస్కారం క్రమశిక్షణ.*

         *నమస్కారం చల్లదనం.*

         *నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.*

         *నమస్కారం నుండి మంచి ఆలోచనలు వస్తాయి.*

         *నమస్కారం నమస్కరించడం నేర్పుతుంది.*

         *నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*

         *నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*

         *నమస్కారం అహాన్ని నాశనం చేస్తుంది.*

         *ప్రాణం మన సంస్కృతి.*

    

 🙏🙏 *అందరికి నమస్కారం*🙏🙏

[

గుడి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువున్నిసాలగ్రామ శిలలకు రుద్ర నమకచమకాలతో, పురుష సూక్తం ,పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి ( తులసీదళ సహితమై ,పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము తీర్ధము అనబడును) ఇస్తారు.

ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలిబాహ్యశుద్ధి, అంతశ్శుద్ధి అని శుద్ధి రెండు రకాలు. తీర్థము అంతశ్శుద్ధికి కల్పించబడింది. మనం ప్రతిరోజు స్నానమాచరించి బాహ్యశుద్ధి చేసుకోగలం. కామ, క్రోధ, లోభ, మహ, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములను జయించినవాడే పరమ పదమును పొందలడు. ఈ అంశ్శత్రువులను జయించుటకు మనస్సు శుద్ధి చేసుకొనుటకోసం తీర్థము గ్రహించాలి. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.

భక్తులు ఆలయానికి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత అర్చకుడు భగవంతునికి నివేదించిన తీర్థాన్ని అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు. పరమాణు సమానమైన ఈ తీర్థాన్ని సేవించడం వలన పంచ మహాపాతకాలన్ని తొలగిపోతాయని అర్చకులు చెపుతుంటారు. ఇంతటి పవిత్రమైన తీర్థాన్ని భక్తులు కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి. ఒక వేళ తీర్ధం నేల మీద పడితే అది ఎనిమిది రకాల పాపాలు చుట్టుకుంటాయని భక్తుల నమ్మకం. తీర్థం తీసుకోవడం వలన కలిగే లాభాలు.. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని, పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు. భగవంతుడిని నైవేద్యంగా పెట్టిన తీర్థాన్ని భక్తలు తీసుకుంటే వారికి సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం సిద్దిస్తుంది చెపుతుంటారు. అంతే కాక ఆ భగవంతుని ఆశ్వీర్వాదాలను పొందుతారని పురాణాల్లో తెలిపారు. అదే విధంగా తులసితో కూడిన సాలగ్రామ తీర్థాన్ని తీసుకోవడం వలన అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. భగవంతునికి నైవేద్యంగా పెట్టే తీర్థంలో ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం అనే తొమ్మిది పదార్థాలను కలుపుతారు.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలితీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. ద్వితీయంగా స్వీకరించే తీర్థం ధర్మసాధన కోసం, తృతీయంగా తీసుకునే తీర్థం మోక్షము సిద్ధించేందుకు. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుంది.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలితీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.

శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు. ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

తీర్ధమును ఎలా తీసుకోవాలి?

మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత ,అనంతా ,గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి. తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు.తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి. ఇకపోతే అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఓ విశేషం ఉంది. హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది. అదేవిధంగా చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్నిఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ, అవి అన్నీ దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పట్టి తీర్థం తీసుకుంటారు. గుళ్లో తీర్ధం తీసుకోగానే... ఆ చేతిని తలకు రాసుకోవడం చూస్తూ ఉంటాం. చాలామంది ఇలాగే చేస్తారు. నిజానికి అది చాలా తప్పు. కారణం తీర్థం తీసుకోగానే.. చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలిని తలపై రాసుకోకూడదు. తలపై సహస్రర చక్రం ఉంటుంది. సప్త రుషీ మండల స్థానం కూడా. అందుకే.. ఎంగిలితో  తలను అపవిత్రం చేయరాదు.

తీర్థాల రకాలు తెలుసుకుందాం…

జలతీర్ధం, కషాయ తీర్ధం, పంచామృత తీర్ధం, పానకా తీర్ధం జల తీర్ధం ఈ తీర్ధం సేవించడం ద్వార అకాల మరణం, సర్వ రోగాలు నివారించాభాడుతాయి. అన్నికష్ట్టలు ఉపసమానాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .

కషాయ తీర్ధం

ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు. రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కని కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.

పంచామృత అభిషేక తీర్థం

పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

పానకా తీర్ధం

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునిడికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.

పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది . దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది . రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు.ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది.

జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ది చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు. వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.

[


ప్రతి మనిషి పుట్టుకతోనే దేవ, పితృ, ఋషి ఋణాలను కలిగి ఉంటాడు. మొదటిదైన ‘దేవఋణం’ యజ్ఞయాగాదులు, అర్చన, ఆరాధనాది విధులద్వారా తీర్చుకోగలం. సంతానం, వంశప్రతిష్ఠలను పెంచే సత్కార్యాలు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల హితోపదేశాలను పాటించడం, దివంగత పెద్దలకోసం శ్రద్ధతో శ్రాద్ధకర్మలు చేయడం.. వంటివన్నీ ‘పితృ (మాతా పితరుల) ఋణం’ తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. వేదవిజ్ఞానం, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, భాగవత, భగవద్గీతాది మహాగ్రంథాలతో సహా పురాణ వాఙ్మయాన్నంతా భక్తితో అధ్యయనం చేయడం ద్వారా ‘ఋషిఋణం’ తీర్చుకొనే అవకాశం మనకుంది. ‘మహర్షులు అందించిన విజ్ఞాన సంపదను తాను పొందుతూ, పర్యావరణ పరిరక్షణకు, పశుపక్ష్యాదులు, జీవకోటితోపాటు తోటివారి శ్రేయస్సు కోసమూ దానిని ఉపయోగించగల శక్తి సామర్థ్యాలను వివేకవంతుడైన మానవుడు కలిగి ఉన్నాడు.

మానవులలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రకాశింప చేయడానికే వేలవేల సంవత్సరాల క్రితమే మహర్షులు ‘అపారమైన విజ్ఞాన సంపద’ను సిద్ధపరిచి ఇచ్చారు. ప్రజలు తెలుసుకోలేని అపౌరుషేయమైన వేదవిజ్ఞానాన్ని, అతీంద్రియ విషయాలను ఎన్నింటినో తమ తపశ్శక్తి ప్రభావంతో ప్రత్యక్షంగా దర్శించి మనకు అందించిన మహోపకారులే మహర్షులు. ‘మంత్రద్రష్టారో ఋషయః’ అంటే, ‘వేదమంత్రాలను దర్శించినవారు ఋషులు’. నిరుక్తకారుడైన యాస్కాచార్యుడు, ‘ఋషిః దర్శనాత్‌. విశ్వ విజ్ఞానప్రదమైన వేదవిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా దర్శించే మహనీయుడే ఋషి’ అని నిర్వచించాడు. ధర్మశాస్త్ర కల్పసూత్రాల లాక్షణిక గ్రంథాలను ఇతిహాస పురాణాలను, సంగీత, నాట్య, శిల్ప, ఆయుర్వేదాది విద్యలను, తర్క, వ్యాకరణ, మీమాంసాది శాస్ర్తాలను మన క్షేమలాభాల కోసమే ఋషులు అందించారు.

పొంగి ప్రవహించే ప్రేమ, ప్రకృతి-ప్రాణులను ప్రేమించే నడవడిక, వినయశీలత, మధురమైన వాక్కు, లోకహితం- మంగళకరమైన ఆలోచనలు, రాగద్వేషాలకు అతీతమైన మనస్తత్వం.. మొత్తంగా దోషాలు అంటని జీవితాలను మహర్షులు సహజ స్థిరసంపదగా కలిగి ఉంటారు’. ఇదీ ఋషుల వ్యక్తిత్వం, గొప్పతనం. ఇంతేకాదు, లౌకిక సుఖభోగాలపై వైరాగ్యం, సడలని తపస్సు, దృఢమైన మనస్సు, జీవుల క్షేమాన్ని కోరే స్వభావం, అహింసా భావన, ఆడంబరాలు లేని జీవన విధానం, భగవద్‌ భక్తి, ఆదర్శప్రాయమైన సత్కార్యాచరణ, శీతోష్ణ ప్రతిబంధకాలను సహించగల శక్తి, ఆశలు లేని- ఆకర్షణలకు లొంగని ఇంద్రియ నిగ్రహం.. వంటి గుణాలెన్నో మూర్తీభవించిన వారు మహర్షులు. వారు మనకు అందించిన ఆధ్యాత్మిక, ధార్మిక విజ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసి, ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఋషుల చరిత్రను ఆసాంతం తెలుసుకోవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపైనా ఉన్నది.

మానవుల సమగ్ర వికాసానికి దోహదపడే, మానవత్వాన్ని వికసింపజేసే, జీవితానికి పరమార్థాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధించే శ్రీరామాయణ, మహాభారత, భాగవతాది మహాగ్రంథాలను వాల్మీకి- వ్యాసాది మహర్షులు అందించారు. మానవజాతికి అవి సుఖశాంతులను అందించే కాంతి కిరణాలు. సాంసారిక తాపత్రయాన్ని తొలగించే తాత్తికమైన మలయ మారుతాలు. సంకుచిత స్వభావం, ఆత్మన్యూనతతో సతమతమయ్యేవారికి, సుఖశాంతి సంతోషాలు మృగ్యమైనవారికి విజ్ఞానదీపికలుగా, హస్తభూషణాలుగా, హృదయాభరణాలుగా వెలుగొందే అమృతరస ఖండాలే ఆ మహాగ్రంథాలు. వీటి సమగ్ర అధ్యయనానికి మానవాళి ఇప్పటికైనా కృషి చేయవలసి వుంది. ఆర్షవాఙ్మయంలోని అనర్ఘ రత్నాలన్నిటినీ శోధించి, ఆ జ్ఞానసంపదను పూర్తి స్థాయిలో వెలికి తీసి, ఆచరణలోకి తెచ్చుకోగలిగితే మన జీవితాలు చరితార్థమవుతాయి.

[

మన మహాత్ముడు..

గుజరాత్ రాష్ట్రంలో పుట్టి,

బారిస్టర్ పట్టాను చేపట్టి,

దక్షిణాఫ్రికా లో అడుగెట్టి,

అవమానాలను ఎదురొడ్డి,

అహంకారాన్ని తరిమికొట్టి,

ప్రక్షాళనను చేపట్టి.......!


ఆసేతుహిమాచలం దర్శించి,

హింసావాదాన్ని వ్యతిరేకించి,

అహింసామార్గాన్ని ఎంచి,

గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి,

సంసమాజాన్ని నిర్మించి,

బానిస సంకెళ్లను తెంచి,

నవభారతాన్నీ రచించి,

బోసినవ్వుల బాపూజీ,

భావిభారత దిక్షుచి.....!


రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం,

మనుషులను మనిషిగా చూడని సమాజం,

తారతమ్యాలు లేని సరికొత్త భారతం,

శాంతి,అహింసలే తన ఆయుధం,

బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం,

స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి కేతనం...!


ఒంటరిగా పోరాడిన వీరుడు,

హింసను విడనాడిన ధీరుడు,

అహింసను చేపట్టిన దేవుడు,

ఐక్యతను చాటిన నాయకుడు,

ఐన్ స్టీన్ కు ఆదర్శప్రాయుడు,

హిట్లర్ ను ఆలోచింపచేసిన ఘనుడు,

గ్రామగ్రామాలలో,

వాడవాడలలో,

స్వదేశంలో,

విదేశంలో

వినుతి కెక్కిన విశ్వవిఖ్యాతి

మన మహాత్ముడు.......!

[


*కర్మ ఫలం తప్పదు*


పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.

కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.


తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.


’ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడ్తున్నాను’ అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.


’అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటువేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో?’ అన్నాడు.


’తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా‘ అని ప్రశ్నించాడు కశ్యపుడు.


అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు.


అంతట కశ్యపుడు, ‘సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం!’ అని అన్నాడా కశ్యపుడు.


అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.


కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు. ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, ‘అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు!’ అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు.


చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది.


వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని ‘మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షితుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు!’

‘ఇంతకూ తమకు కావలసింది... ‘అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ‘ధనమయ్యా! ధనం!’అన్నాడు కశ్యపుడు.


‘అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను!’ అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.


ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.


మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు!

ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం.

అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.

పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా.

ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి.

కశ్యపుడు రాజును రక్షించుదామని బయలుదేరినా, పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.


ఏమిటి ఆ పాప కర్మ?

ఒక ముని మీద     చచ్చిన పామును వేయడం!

*మంచివారితో మహాత్ములతో చెలగాటమాడడం.  


కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.


రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.


పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది.


మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.

నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.

మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది.

కర్మ బలీయమైనది.

’గోవిందా, నారాయణా, రామా, శివా!కాపాడు!కాపాడు!’ అని ప్రార్ధిస్తూ ఉంటాం. 


ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు…. ‘ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా? నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు.

మన పుణ్యఫలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది.

గురు అనుగ్రహం వున్నదా?

గురు దృష్టి వున్నదా?

శుభగ్రహ దృష్టి వున్నదా?

వుంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు.


పాపం అంటే… శరీరాన్ని,  తద్వారా మనసును బాధ పెట్టడమే!


"మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది."


"మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది" .


పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు,పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ, నిష్కామ కర్మ.


కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు.


తాతముత్తాతలు చేసిన పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది.


ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలన్ని కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది.

ఇదే మన జాతకంలో రెండవ స్తానం, తొమ్మిదవ స్తానం స్పష్టంగా చెబుతుంది.


మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము.

వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది.

మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది.


సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా!


కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు?

అదే కర్మఫలం, కాల మహిమ.


కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు. దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి…


తక్షకుడు విషనాగు అంటే ప్రారబ్దకర్మ. దానిని కూడా జయించింది మంత్రశాస్త్రం.


కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే, మంత్రం మరలా దానిని చిగురింప జేసినది.


అంటే మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది అని మనం తెలుసుకోవాలి.

మంత్రం ప్రాణం పోస్తుంది.


 కానీ ఆ మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి! అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!

[


*ఉషా పరిణయం*


పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. ఆటను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. వేయి చేతులు వున్న బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ‘వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు’ అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. ఆటను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు ‘నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. అపుడు వానిలో వున్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. “ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు.

అపుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు.పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు యిటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈవిధంగా శంకరుడు కోతబయత తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు.ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో యిక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి ‘శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతొ యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది’ అని కోరాడు. భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనపడింది.

ఈశ్వరుడు తెల్లబోయాడు. అపుడు ఆయన అన్నాడు – ఇపుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది రక్షించవలసినవాడూ తానే. వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడూ తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు వున్న ఇంకొక రూపంతో వేయాలి. ‘నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకున్న వ్యగ్రత పోతుంది’ అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురుచూస్తున్నాడు.

ఇపుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణమును అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివ కేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానమును బాణాసురుని స్థాయికి తీసుకువస్తుంది. ఇపుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యౌవనంలో వుండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకతె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని కొన్ని గుర్తుల చేత స్పష్టముగా తెలిసింది. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్నరాత్రి కలలో ఎ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి “నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది’ అని అడిగింది. అపుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది.

అప్పుడు చిత్రలేఖ సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందఱో రాజాధిరాజులను చూశాను. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు’ అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరుపేరునా వివరించింది. అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అపుడు చిత్రలేఖ ‘ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందా నీవు మనసు పడ్డావు. సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు.


అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంస తూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.’ అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనస్సులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అక్కడ ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశమార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుని తీసుకొని కోటలోపలికి వెళ్ళడం బయట కోటకి కాపలా కాస్తున్న మూడు కన్నులవాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు.

చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేరీతిగా ఉండదు. ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు యిక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు. అసురీవృత్తి ఎటువంటిదో చూడండి. వానికి కూతురి గొడవ అక్కరలేదు. యుద్ధం కావాలి.

ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు “అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది’ అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి “నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు వున్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది’ అని అన్నాడు.

శంకరుడు భక్త వత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు.కాబట్టి యిపుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభం అయింది. శివుడు యుద్ధంలో లొంగనంత సేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు యిచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. అపుడు శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి డీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది.

ఉషాపరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వనాల లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో, వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమయినదిగా జ్వరము బాధించడానికి వీలులేదు. ఆ మేరకు నేను వరం యిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడయినా జ్వరము చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్త్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరమును యిస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది.


వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మా చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లియైన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటిమీద ఉన్న వలువలన్నిటిని విప్పేసి, జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురునిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనుస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మరల యుద్ధం ప్రారంభం అయింది. అపుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. ‘నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలులేదు. కాబట్టి తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసినది అని.

శివకేశవుల హృదయములు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్ధం రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆరోజు కృష్ణ భగవానుడు

బాణాసురునకు ఉన్న బాహువులలో 996బాహువులను సుదర్శన చక్రధారల చేత తెన్చేశాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. అపుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. ఇప్పుడు వాని శరీరమునందు రజోగుణ తమో గుణములు లేవు. శుద్ధ సత్త్వంతో ఉంటాడు. ‘ఈశ్వరా వీడు నీ భక్తులలో అగ్రేసరుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసురసంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని నాలుగు చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదముతో కూడిన ప్రవర్తన వీడియందు ఉండదు’ అని ఆరోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషమును పొందాడు.

ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి యిపుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు.

బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మాల్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు. ఈవిధంగా ఉషాపరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది.

ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు పరమ శివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నాడో ఎవరు తుట్టతుదకు నాలుగు చేతులతో, పరమశివునికే కింకరుడు అయ్యాడో కృష్ణుని విజయమునకు పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, కల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయం వింటున్నారో ఆయన నామం ఎవరు చెపుతారో వారికి సమస్త విజయములు చేకూరుతాయి. వాళ్లకి ఓటమి సంభవించదు. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషాపరిణయఘట్టమును, బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారు. ఇది అంతగొప్ప ఆఖ్యానము.

[

కష్టాల్లో కుంగిపోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా సంయమనం పాటించాలంటుంది బౌద్ధం. అంతే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కలవరపడితే మన మానసిక శక్తులు కుంచించుకుపోతాయి. సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపలేవు. మరింత లోతున పడేస్తాయి. అదే మనం దిగాలు పడకుండా దిటవుగా నిలబడితే... కష్టాలను తొలగించుకొనే మార్గాలు కనిపిస్తాయి. అలాంటి మార్గాన్వేషణలో మనిషి తన ఉపాయ కుశలతను ప్రదర్శించాలంటాడు బుద్ధుడు. అటువంటి ఒక ఉపాయశాలి గురించి ఆయన చెప్పిన కథ ఇది.

పూర్వం జంబూద్వీపంలో, ఒక నిరుపేద కుటుంబంలో బోధిధరుడు పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అతని మిత్రులందరూ తక్షశిలకు వెళ్ళి, విద్యలు నేర్చుకొనేవారు. తాను కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. కానీ ఆ స్తోమత లేదు. అయినా తల్లితండ్రులకు నచ్చజెప్పి తక్షశిలకు వెళ్ళాడు. అక్కడే ఒక గురువును కలిసి, తన పేదరికం గురించి చెప్పుకున్నాడు. 

‘‘గురువర్యా! గురుదక్షిణ లేకుండా విద్యను అభ్యసించడం మంచిది కాదు. నేను తమకు ఇప్పుడు ఏమీ సమర్పించలేను. కానీ విద్య ముగిశాక యాచించి, ధనాన్ని తెచ్చి, మీకు సమర్పిస్తాను’’ అని చెప్పాడు.

గురువు సంతోషించి ‘‘సరే!’’ అన్నాడు. గురుదక్షిణ కన్నా బోధిధరుడిలో దక్షతను ఆ గురువు చూడగలిగాడు. అందుకే అతను అడిగిన వెంటనే తన శిష్యుడిగా చేర్చుకోవడానికి అంగీరకించాడు.

కొన్నాళ్ళకు బోధిధరుడి విద్యాభ్యాసం పూర్తయింది. ‘‘గురుదేవా! నా మాట ప్రకారం యాచించి, దక్షిణ తెచ్చి ఇస్తాను. అనుమతి ఇవ్వండి’’ అని కోరాడు. 


‘‘అలాగే...వెళ్ళి రా!’’ అన్నాడు గురువు. 

బోధిధరుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. తన గురించి చెప్పాడు ఎందరో కాదనకుండా, లేదనకుండా శక్తి కొలదీ సహాయాన్ని అందించారు. ఇలా వచ్చిన వాటన్నిటినీ బంగారు నాణేలుగా మార్చుకున్నాడు. గురుదక్షిణ సమర్పించడం కోసం తక్షశిలకు బయలుదేరాడు. 

దారిలో ఒక నది అడ్డుగా ఉండడంతో... పడవ మీద ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో గాలి వీచింది. సుడి రేగింది. పడవ కొద్దిగా పక్కకు ఒరిగింది. అతని జేబులోని బంగారు నాణేల మూట నదిలో పడిపోయింది. నావికుడు పడవను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు. కానీ... గురుదక్షిణ మొత్తం గంగపాలైంది. 


ఈ విషయం తెలిసి అక్కడున్నవారందరూ విచారపడ్డారు. ‘‘మళ్ళీ గ్రామాలకు పోయి యాచించు’’ అని సలహా ఇచ్చారు.

కానీ ఆ సొమ్మును రాజు దగ్గర నుంచి సంపాదించాలనుకున్నాడు బోధిధరుడు. వెంటనే తన బుద్ధికుశలతను ఉపయోగించాడు. ఆ నదీ తీరంలో... ఇసుకలో కూర్చొని మౌనవ్రతం పట్టాడు. తిండి మానేశాడు. అలా రోజంతా గడిచింది. అక్కడి నుంచి బోధిధరుడు కదల్లేదు. 

సమీప గ్రామాల ప్రజలు ఎందరో వచ్చి అతణ్ణి పలకరించారు. ‘‘ఎందుకిలా చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘ఆహారం తీసుకోండి’’ అని అర్థించారు. బోధిధరుడి నుంచి వారికి ఎలాంటి సమాధానం రాలేదు.

రెండు రోజులు గడిచాయి. ఈ వార్త దేశమంతా పాకింది. రాజుగారికి చేరడంతో, తన మంత్రులను పంపాడు. వారు ప్రశ్నించినా బోధిధరుడు ఉలకలేదు, పలకలేదు.


చివరకు రాజే తరలివచ్చాడు. ‘‘ఎవరు నీవు? ఇక్కడ ఎందుకు నిరాహారంగా, మౌనంగా కూర్చున్నావు?’’ అని అడిగాడు. 

అప్పుడు బోధిధరుడు నోరు తెరచి మాట్లాడాడు. తన చరిత్ర చెప్పాడు. 

రాజు ఆశ్చర్యపడి ‘‘ఈ విషయం నాతోనే ఎందుకు చెప్పావు? మిగిలినవారికి ఎందుకు చెప్పలేదు?’’ అని అడిగాడు. 

‘‘రాజా! మనం సమయా సమయాలు ఎరిగి సహాయాన్ని అర్థించాలి. ఎవరు మన కష్టాలను తీర్చగలరో వారికే చెప్పుకోవాలి. అలాకాని వారికి చెప్పడం వల్ల మన కష్టం తీరదు సరికదా... హేళనకూ, అవమానానికీ గురవుతాం. మనిషి కష్టం రాగానే కలతపడి, కనబడిన ప్రతివారితో చెప్పుకోకూడదు. తీర్చగలవారు దొరికేవరకూ ఆ కష్టాన్ని దిగమింగుకొని భరించాలి. చాలా రోజులపాటు ఎన్నో గ్రామాలు తిరిగి, ఎందరెందరి నుంచో తీసుకున్న డబ్బు గంగపాలైంది. అంత సహాయాన్ని అందించగలవారు మీరొక్కరే. అందుకే మీతోనే మాట్లాడాను’’ అన్నాడు. 

బోధిధరుడి ఆలోచనలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే గురుదక్షిణకు కావలసినన్ని బంగారు నాణేలు ఇచ్చాడు. అతణ్ణి తన కొలువులో ఆస్థాన పండితుడిగానే కాదు, తన ఆంతరంగికుడిగానూ నియమించుకున్నాడు.

బుద్ధి వచ్చిన కుందేలు   (కథ)  -  నారంశెట్టి ఉమామహేశ్వరరావు 


 ఒక అడవిలో  సాధు జంతువులే ఉండడంతో   చుట్టుప్రక్కల ఉండే ప్రజలు    అడవికి వెళ్లి కాయలు, పళ్ళు, వంట కలప తెచ్చుకునేవారు.  

     దగ్గర్లోని ఒకవూళ్ళో   కట్టెలు  అమ్ముకునే  రంగన్న ఉన్నాడు.  వీలైనప్పుడల్లా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి   దగ్గరి  ఊళ్లలో అమ్ముకుని బ్రతికేవాడు.  

ఒకసారి  రంగన్న కట్టెలు  మోపుతో  వెళ్తుండగా  కుందేలు చూసింది.  రాళ్లు,  ముళ్ళ మీద  నడుస్తున్నా అతడికేమీ కాకపోయేసరికి “రాళ్ల మీద,  ముళ్ళ మధ్య నడుస్తున్నా నీకేమీ కాదా ” అంది. 

“  కాళ్లకు చెప్పులేసుకుంటే ఏమీ కాదు. హాయిగా నడవొచ్చు” అన్నాడు రంగన్న  చెప్పులు చూపిస్తూ.  అప్పటి నుండి తనకీ  చెప్పులుంటే బాగున్ను అనుకుంది  కుందేలు. ఆ సంగతి  మిత్రుడైన  కోతికి చెప్పి సాయమడిగింది.   

“ఇప్పుడే తాడిచెట్టెక్కి కాయలు పడేస్తాను. కాయల్లోపలి గుజ్జు తినేసి  మిగిలింది  కాళ్ళకి వేసుకుని నడు. చెప్పుల్లాగే కాళ్ళకి బాగుంటాయి” అంది కోతి.  కుందేలు సరేననడంతో  తాడికాయల్ని ఇచ్చింది  కోతి. కోతి  చెప్పినట్టే చేసింది కుందేలు. కానీ నడక కుదరలేదు. ఆ కాయలు గుండ్రంగా,  బరువుగా ఉన్నాయి.  చక్రాల్లా  దొర్లుకుంటూ  వెళ్లాయి. ముందుకు పడిపోయింది కుందేలు. దాని ముఖం భూమికి అంటుకుంది. 

 కోతి వచ్చి కుందేలుని లేవదీసింది. ఈసారి రావి ఆకుల్ని ఇచ్చి వాటితో నడవమంది.  అయితే ముళ్ళు, తుప్పల్లో నడిచేసరికి  ఆకులు  చినిగిపోయాయి. ‘ఇక నావల్ల కాదంది’ ’ కోతి.    

కుందేలు, కోతిల   ప్రయత్నాల్ని  చూసింది  వడ్రంగి పిట్ట. అది వాటికి  సాయం చేస్తానంది.  ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని చెప్పులకు సరిపడే కర్రను బయటకి  తీసింది.  ఎలుగుబంటి చేత  పావుకోళ్ళలాగ చేయించి కుందేలు కిచ్చింది.  పచ్చికర్రతో చెయ్యడంతో అవి బరువెక్కువై కుందేలు అడుగు వెయ్యలేకపోయింది. మళ్ళీ బాధపడింది కుందేలు.   

 రంగన్న చెప్పుల్లాంటివే కావాలంటే అతడినే అడగాలని ఎదురు చూసింది  కుందేలు. రంగన్న   పదిహేను రోజులు తరువాత కనబడగానే అతడ్ని కలిసి చెప్పుల కోసం పడిన కష్టాలు చెప్పింది.   రంగన్న “చర్మంతో చేసిన  చెప్పులయితే నడవడానికి బాగుంటాయి” అన్నాడు . 

 చర్మంతో చెప్పులనగానే ఎలుక గుర్తొచ్చింది కుందేలుకి. ఎలుకని కలిసి  “చెప్పుల కోసం సరిపడే చర్మం తెస్తావా? అని అడిగింది.   “చనిపోయిన జంతువు కనబడగానే తెస్తాను”  అంది ఎలుక. పదిరోజులైనా చర్మం తెచ్చివ్వలేదు ఎలుక. రోజూ ఎలుకని అడిగేది కుందేలు. ‘నీకు చర్మం ఇవ్వాలంటే ఏదైనా చచ్చిన జంతువు కనబడాలి కదా” అనేది ఎలుక. కుందేలు మళ్ళీ   బాధ పడింది.    

   చెప్పుల కోసం కుందేలు పడుతున్న  తిప్పలు చూసిన రంగన్న తన కొడుకు వాడుతున్న. పాత చెప్పుల్ని మళ్ళీసారి వచ్చినప్పుడు తెచ్చి దానికిచ్చాడు. ఎంతో సంతోషపడింది కుందేలు.అతడికి ధన్యవాదాలు చెప్పింది.

తరువాత రోజు వర్షం పడి బురదగా ఉంది నేల. నీళ్లు త్రాగడానికి చెప్పులతో చెరువుకి వెళ్ళింది కుందేలు. చెప్పుల మీద  నడక  అలవాటు లేక జారిపోయి చెరువులో పడింది కుందేలు. నీట్లో మునకలు వేస్తూ రక్షించమని అరిచింది. 

అప్పుడే చెరువుకి  నీళ్లు త్రాగడానికి వచ్చిన ఏనుగు దాని మునకలు చూసి కుందేలుని  రక్షించి ఒడ్డుమీద వేసింది. దాని కాళ్ళకి ఉన్న చెప్పులు చూసి “అవేంటి?” అని అడిగింది ఏనుగు. కుందేలు గొప్పగా చెప్పింది వాటి గురించి.   

“అదా సంగతి. అవే లేకపోతే  చెరువులో జారేదానివి కాదు.  మనుషులకీ, మనకీ  తేడా ఉంది. వాళ్ళు  సున్నితమైనవాళ్లు కాబట్టి  చెప్పులవసరం. మనకి రాళ్లు, ముళ్ల మీద కాస్తోకూస్తో నడిచే విధంగా  కాళ్ళున్నాయి. ఎండకీ వానకీ తట్టుకోగలం మనం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కొత్త అలవాట్లు చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. వాటిని పారెయ్. లేదంటే ఇంకేమైనా జరగొచ్చు” అంది ఏనుగు. కుందేలు బుద్ధిగా వాటిని పారేసింది. మనుషుల్లాగా ఉండాలని ఇంకెప్పుడూ అనుకోలేదు కుందేలు. 

---****-----

[


కళ్లు తెరిస్తేనే చూపు. కానీ తెరిచిన ప్రతీ కన్నూ చూసినట్లు కాదు. అలాగే మూసుకున్నంత మాత్రాన నిద్రించినట్లూ కాదు. తెరవడం, మూయడం లాంటివి కేవలం భౌతికమైన చర్యలు మాత్రమే. మన కళ్లెదుటే ఎవరో వస్తారు. వెళ్తారు. కానీ వారిని మనం గుర్తించని సందర్భాలు అప్పుడప్పుడు తటస్థిస్తాయి. అలాగే కళ్లు మూసుకుని కూడా నిద్రకు నోచుకోని అనుభవాలూ మామూలే! ఇదే సూత్రం చెవులకు, నోటికి సైతం వర్తిస్తుంది. వీటన్నింటికీ మూల కారణం- పైన ఉటంకించిన యాంత్రిక చర్యలకు హృదయాన్ని జోడించ(లే)కపోవడమే. మామూలు మాటల్లో చెప్పాలంటే ‘మనసు పెట్ట(లే)కపోవడం’. దీన్నే ధ్యాస అంటారు.


ఈ ధ్యాసను పెంచుకోవడం కళ్లుమూసుకుని ప్రశాంతంగా ధ్యానించడం ద్వారా సాధ్యమవుతుందని వివిధ సాధన మార్గాలకు చెందిన గురువులు సూచించారు. కేవలం కళ్లు మూసుకుంటే ప్రశాంతత చేకూరుతుందా, ధ్యానించినట్లవుతుందా? అంటే కాదు. తెరిచిన కళ్లు చూసినట్లు ఎలా చెప్పలేమో, మూసిన కళ్లు ధ్యానిస్తున్నట్లుగానూ భావించలేం. ఇక్కడ కూడా ధ్యాసకే ప్రాధాన్యం. ‘ఇది హృదయపూర్వకంగా, అత్యంత సహజంగా నిర్వర్తించాల్సిన ఆధ్యాత్మ ప్రక్రియ’ అని జ్ఞానులు పేర్కొన్నారు. భగవంతుడు అత్యంత సూక్ష్ముడు. ఆయనతో అనుసంధానమయ్యే మార్గం కూడా అంతే సరళంగా ఉండాలి. నేల మీద పడ్డ సూదిని ఒడిసి పట్టాలంటే సన్నని వేలి కొసలు చాలు, భారీ క్రేన్ల అవసరం లేదని ఓ సద్గురువు అన్నారు. ఇందుకు హృదయంలో దివ్యకాంతి మూలాన్ని ధ్యానించమని ఆయన సూచించారు. ఇక్కడ కూడా ధ్యానం మీద ధ్యాస ఎలా ఏర్పడుతుందన్న ప్రశ్న సాధకులకు ఎదురవుతుంది. ఇందుకోసం వారో ఆచరణ యోగ్యమైన పరిష్కారాన్ని సూచించారు. పరిపరి విధాలుగా ఆలోచించే మనసును బలవంతంగా కట్టడి చేయవద్దన్నారు. ముసురుకునే ఆలోచనలను పిలవకుండా వచ్చే అతిథులుగా భావించమన్నారు. మనం పట్టించుకోకపోతే కాసేపటికి అవే తిరుగుముఖం పడతాయని సూచించారు.


‘నేను ధ్యానిస్తున్నాను’ అని ఎవరికి వారు గుర్తు చేసుకోవడం ద్వారా, కిక్కిరిసిపోయిన ఆలోచనలకు తలుపు తెరుచుకుంటుంది. మూత తెరిచిన సోడా సీసాలోంచి వాయువు ఒక్కసారిగా పైకి వెళ్ళి, నీరు క్రమంగా స్థిరపడినట్లుగా, అనవసరమైన తలపులు మనసు పొరల్లోంచి సాధకుడికి తెలియకుండానే కనుమరుగవుతాయి. ధ్యానం మీద ధ్యాస అత్యంత సహజంగా ఏర్పడి, హృదయపు లోతుల్లో స్థిరపడుతుంది. ఇలా సాధన చేస్తున్న కొద్దీ భౌతికమైన చేతలకు, హృదయానికి చక్కని సమన్వయం కుదురుతుంది. ధ్యానానికి, ధ్యాతకు మధ్య  సరిహద్దు రేఖ చెరిగిపోతుంది. దీని ఫలితంగా అనవసరమైన ఆలోచనలను వడపోయడం సహజమైన ప్రక్రియలో భాగమైపోతుంది. ఆలోచనలకు  పదును పెట్టి, నాణ్యమైన ఫలితాలను ఇస్తుంది. కీలకమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు మంచి, చెడ్డలను బేరీజు వేసి, సన్మిత్రుడిలాగా సలహాలను ఇస్తుంది. అదేవిధంగా సత్వర నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులలో గురి తప్పకుండా వ్యవహరించే నైపుణ్యాన్ని సంతరింపజేస్తుంది. అజ్ఞాతంగా వెన్నంటి ఉంటూ సహాయపడుతుంది. ఒత్తిడికి గురిచేసే పోటీ ప్రపంచంలో మనసును ఆటుపోట్ల నుంచి కాపాడి, మానసిక సమతౌల్యాన్ని పరిరక్షించడంలో ధ్యానం ప్రముఖ భూమికను వహిస్తోందన్నది నిపుణుల మాట. శారీరక దృఢత్వం  కోసం రకరకాల పోషకాలు ఉన్నట్లే- వృత్తి, ఉద్యోగాల్లో, సృజనాత్మకమైన కార్యకలాపాల్లో మెరుగైన ఫలితాలను సాధించే దిశగా మానసిక శక్తిని పెంపొందించే దివ్యౌషధమే  ధ్యానం!

[


కాలంతోపాటు మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. అనుబంధాలు, అనురాగాలు ఆర్థిక అవసరాలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనం చేసే స్నేహాలు, మన చుట్టూ ఉన్న మనుషులే ఇలాంటి వైఖరులు ప్రబలడానికి కారణం.

“సుహృతులు’ అంటే ప్రత్యుపకారం ఆశించకుండా ఉపకారం చేసేవాళ్లు. మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషులు, బంధువులు, సత్పురుషులు, పాపాత్ములు వీరందరి విషయంలోనూ సమానమైన ఆదరణ బుద్ధి కలవాడు ఉత్తముడు, శ్రేష్ఠుడు’ అంటుంది భగవద్గీత.

వస్తువులు జడ పదార్థాలు. వాటిని మనం అంగీకరించినా, ఇష్టపడకపోయినా, ద్వేషించినా మనలోనే అలజడి రేగుతుంది. వాటి నుంచి ఎలాంటి ప్రతిక్రియ ఉండదు, రాదు. మరి మనుషుల విషయంలో అలా కాదు. మనం ప్రదర్శించే రాగద్వేషాలకు అనుగుణంగా అవతలి వైపు నుంచి కూడా ప్రతిక్రియ ఉంటుంది. మనం ఏది ఇస్తే.. ఫలితంగా మనకు అదే వస్తుంది. స్వభావాలను బట్టి ఈ సృష్టిలోని మనుషులను ఎనిమిది తరగతులుగా విభజించాడు పరమాత్మ. వీరిలో ప్రథములు సుహృతులు. వీరి పేరులోనే మంచి నడవడి ఉన్నది. మంచి హృదయంతో ఉంటారు. ఎదుటివారికి ఎప్పుడూ ఉపకారం చేయాలనే తత్వం కలిగి ఉంటారు. చెడు, అపకారం అంటే వీరికి తెలియదు.

రెండోది- మిత్రులు. మిత్రత్వం గొప్ప పదం. కల్మషం లేనిదే స్నేహం. ఆపదలలో, కష్టాలలో ఆదుకునే వాడే అసలు సిసలైన మిత్రుడు. స్నేహితుల మధ్య అంతరాలు ఉండవు. కులం,ధనం, ఆడ, మగ ఇటువంటి వివక్షకు తావుండదు. స్నేహానికి వయోపరిమితులు కూడా అడ్డుకావు. ‘బతికి బంధువు ఇంటికి, చెడి స్నేహితుడి ఇంటికి’ అనే సామెత స్నేహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. కానీ, కాలచక్రంలో స్నేహం కూడా ఆర్థిక అవసరాల మధ్య నలిగిపోతుండటం బాధాకరం. 

మూడో రకం- ఉదాసీనులు. అంటే తటస్థులు. వీరు ఎవరి పక్షమూ ఉండరు. ఎవరికీ కొమ్ముకాయరు. జరిగే విషయాలను కేవలం సాక్షిగా చూస్తూ ఉండిపోతారు. ఏది ఎలా జరిగినా పట్టించుకోరు. నాలుగో రకం- మధ్యస్థులు. ఇద్దరి మధ్య తగాదా వచ్చినప్పుడు న్యాయం చెబుతారు. వీరు కూడా ఎవరి పక్షమూ వహించరు. వీరి దృష్టిలో ఇద్దరూ కావాల్సిన వారే! ఐదో రకం మనుషులు ద్వేషులు. వీరికి ఈ లోకంలో ఎవరూ గిట్టరు. ఒక రకమైన మనసత్వం కలిగి ఉంటారు. ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్వలేరు. తామే బాగుపడాలి, ఇతరులు నాశనం కావాలని కోరుకుంటారు. డబ్బున్న వాళ్లనే అభిమానిస్తారు. వారితోనే సంబంధాలు నెరుపుతారు. ఒక విధంగా చెప్పాలంటే భారతంలో దుర్యోధనుడి లాంటి వారన్నమాట.

బంధువులు ఆరో రకం. వీరు అందరినీ కావాలి అనుకుంటారు. అందరూ తమ వారేనని తలుస్తూ ఉంటారు. తన అనుకున్న వారిని అవసరానికి ఆదుకుంటా రు. ఏడో రకం- సాధువులు. వీరు చాలా మృదుస్వభావులు. ప్రతి చిన్న విషయానికీ కదిలిపోతారు. కష్టం కలిగించే వార్త విన్నా, దృశ్యం చూసినా విచలితులు అవుతారు. వీరి హృదయం కోమలంగా ఉంటుంది. ఎనిమిదో రకం- పాపేషు. అంటే పాపులు. వీళ్లకు దైవప్రీతి, పాపభీతి ఉండదు. పాపాలు చేస్తూ ఉంటారు. జాలి, కరుణ ఉండవు. జీవితమంతా తప్పులు చేస్తూనే ఉంటారు. చివరకు అర్ధంతరంగా తనువు చాలిస్తారు.

ఇలా మనుషుల్లో రకాలను చెబుతారు. ఇందులో సుహృతులు, సాధువులు, బంధువులు చెప్పుకోదగిన వారు. ఇలాంటివారితో అనుబంధం కొనసాగించా లి. వారి నుంచి ప్రేరణ పొంది మనమూ ఆ విధంగానే నడుచుకోవాలి. అన్నిటిని మించి కన్న తల్లిదండ్రుల ప్రేమ, వాత్సల్యం, దయ వెలకట్టలేనివి. వారి మనసు గుర్తెరిగి మన ప్రవర్తన ఉండాలి. సాటి మనుషులను ప్రేమతో జయించాలి. అనురాగంతో దగ్గర చేసుకోవాలి. అప్పుడు ఈ జగమంతా వసుధైక కుటుంబమే!

[

*అసలైన సౌభాగ్యం*


*సమాజంలో అందరిదీ ఒకే రీతి జీవిత గమనం కాదు. కొందరు భాగ్యవంతులు, మరికొందరివి దైన్యమైన జీవన పరిస్థితులు. ఎందరో వారిలోని సామర్థ్యాన్ని సహజ ప్రతిభలను వృద్ధి చేసుకునే అవకాశమూ ఆలోచనా లేనివారు. వీళ్లంతా సంతోషంగా బతుకుతున్నారా అంటే, కచ్చితంగా ఔనని చెప్పలేం.*


*ఆనందం మనసుకు సంబంధించింది.అదేమీ ఎండమావి కాదు. ఆనంద స్థితిని అందుకోవడం కష్టతరం కాదు. ఎందుకంటే సంపదలకు, లేమికి అతీతమైంది ఆనందం. కొన్నిసార్లు బండి లాగేవాడిలో కనపడే ఆనందం సొంత కారు నడిపేవాడిలో కనిపించకపోవచ్చు.*


*సంతోషం లేని సంపదలు విషతుల్యమైన రసభరిత ఫలాల్లాంటివని కౌటిల్యుడు రాజనీతి శాస్త్రంలో చెబుతాడు. మనలో చైతన్యం ఉంటే సంతోషం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కష్టసుఖాల మధ్య తేడా గమనించని వ్యక్తి మనసు సదా నిర్మలంగా ఉంటుంది. నిర్మల హృదయం గలవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందం వేరెక్కడో దొరికే వస్తువు కాదు. మనలోని చైతన్యమే ఆనందం!*


*ఏది ఉన్నా లేకున్నా, అసంతృప్తితో జీవించేవాడికి ఆనందం అందని ద్రాక్ష లాంటిదే. జీవన మార్గంలో ఎంత వేగిరపడినా అందరికీ అన్నీ అందవు. దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. ఈ హద్దులను గుర్తించలేకపోతే నిరాశ, నిస్పృహ తప్పవు. మనిషికి దుఃఖం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆశించడంలో తప్పులేదు. ఆశించినదాన్ని అందుకోవడం కోసం శ్రమ పడాలి. ఆశ లాలస కాకూడదు. శక్తికి మించిన ఆశ దురాశే అవుతుంది. గాఢమైన కోరికలతో సతమతం కావడం మంచి లక్షణం కాదు. అది దుఃఖానికి కారణమవుతుంది. ఎక్కడైతే కోపం, దురాశ, ఈర్ష్య ఉండవో ఆ శూన్యంలో చైతన్యం వికసిస్తుంది. ఆ చైతన్యమే ఆనందానికి హేతువవుతుంది.*



*వక్తగా వేదికనెక్కి ప్రసంగి స్తుంటే... సభలో నిశ్శబ్దం ఆవహించి అందరూ ఆ ప్రసంగాన్ని విని చివర్లో ఆ ప్రాంగణం కరతాళ ధ్వనులతో నిండిపోతే ఆ వక్త లోపలినుంచి ఉబికి ఉబికి పొంగిపొరలి వచ్చేదే ఆనందం. ఆ ఆనందం ఎలాంటిదంటే గతంలో తనను విమర్శించినవారిని సైతం హృదయపూర్వకంగా క్షమించేటంతటిది! తోటలో గుంత తవ్వి ఒక మొక్క నాటడంలో మనం పూర్తిగా నిమగ్నమై ఆ పరిసరాలనే మరచిపోతే... అదిగో అక్కడ ఉంటుంది ఆనందం!*


*ధనం, ప్రతిష్ఠ, అధికారం కోసం వెంపర్లాడతాం. వాటిలోనే ఆనందం ఉందని అనుకొంటాం. ద్వేషం, అసూయ, కోపం మనల్ని వెన్నంటి ఉంటాయి. అయినా వాటిని గమనించం. సూర్యోదయానికి ముందే చల్లని వాతావరణంలో కిలకిలా రావాలు చేస్తూ ఆకాశంలో ఎగిరే పక్షులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్రాతఃకాలంలో చల్లని గాలులకు ఊగుతున్న చెట్లు, మంచు కురిసిన పచ్చిక, ఇంటిముందు ఉదయాన్నే రంగవల్లులు దిద్దుతున్న గృహిణుల కళాభిరుచి... పరిశీలిస్తే ఎంతగానో ఆకట్టుకుంటాయి. మనసును కట్టిపడేస్తాయి. ఆ ఆనందం ముందు ధనం, ప్రతిష్ఠ, అధికారం ఏ పాటివి? అటువంటి అభిరుచి మొలకెత్తితే- మనుషుల్లో ఆనందం మొక్కగా మారి మానవుతుంది. మనలోని చైతన్యం వికసిస్తే ఆనందం మనసును ఆవహించి ఉంటుంది.*



*యోగి ఎందుకు ఆనందంగా ఉంటాడు? ఆయన వద్ద డబ్బు లేదు. అధికారం అంతకన్నా లేదు. ఆ యోగిలోని చైతన్యం కారణంగా ఎప్పుడూ చిరునగవుతో అంతర్లీనంగా ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. దైవం పట్ల అప్రమత్తతతో, ఎరుకతో ఉంటాడు. ఆనందంగా జీవించగలిగితే పవిత్రత మనల్ని అనుసరించి ఉంటుంది. సంతోషంగా ఉండేందుకు మనిషి మనసుతో సంబంధం పెట్టుకొని భౌతిక విషయాలపట్ల నిర్లిప్తంగా ఉండాలి. సుఖం, దుఃఖం మనకు సంబంధించిన వ్యక్తులపై ఆధారపడి ఉంటాయి. ఆనందం అలా కాదు. అది మన మనసు లోలోపలి నుంచి ఉబికే ఊట!*

[


కుందేలు మంచితనం    (కథ) -- నారంశెట్టి ఉమామహేశ్వరరావు 



 ​మహేంద్రగిరి ప్రక్కనున్న అడవిలో ఒక కుందేలు కుటుంబం ఉండేది. వాటి పిల్లల్లో చిన్నదానికి చూపు లేదు. అందుకెంతో దిగులు పడేది కుందేలు కుటుంబం. 


దూరంగా ఉండే అడవి నుండి వచ్చిన ఒక మైనాకు కుందేలు  కుటుంబం దిగులు పడుతున్న సంగతి తెలిసింది. కుందేలు దంపతులను కలిసి 'మా  అడవిలోని ముసలి కోతికి అద్భుత శక్తులున్నాయి. దాన్ని కలిస్తే మీ పిల్లకు చూపు రావచ్చు' అంది.    


ఒక రోజు ఉదయమే మగ కుందేలు బయల్దేరింది. అది వెళ్తుండగా ఎలుగుబంటి ఎదురైంది. “అల్లుడూ! పొద్దున్నే  బయల్దేరావు. ఎక్కడికో!’ అని అడిగింది. తన పిల్లకి చూపు తెప్పించడానికి కోతి దగ్గరకి వెళుతున్నట్టు చెప్పింది కుందేలు. 


ఎలుగు “నాకూ ఒక సమస్య ఉంది. అడుగుతావా?” అని బ్రతిమాలాడింది. అలాగే అంది కుందేలు. ‘దొడ్లో నుయ్యి తవ్వించాను కానీ నీరు పడలేదు. ఎందుకో కనుక్కో’ అంది ఎలుగు.   


 అలాగే అనేసి  కుందేలు వెళుతుంటే ఈసారి ఒంటె పలకరించి ‘ఎక్కడిదాకా?‘ అనడిగింది. ఎలుగుకి చెప్పినట్టే దానికీ చెప్పింది కుందేలు. ‘నాకూ సమస్య ఉంది. కోతిని అడిగి నాకు జవాబు చెప్పవూ‘అని బ్రతిమలాడింది ఒంటె. 


సరే అని కుందేలు అనగానే  ‘కొన్నాళ్లుగా  తలనెప్పితో  బాధపడుతున్నాను. ఎందుకో కోతిని కనుక్కో’ అంది ఒంటె. సరే అనేసి మళ్ళీ నడక మొదలుపెట్టింది కుందేలు. 



ఈసారి అడవి దున్న ఆపింది కుందేలుని. ముందు చెప్పినట్టుగానే దానికీ  చెప్పింది కుందేలు. తనకీ ఒక సమస్య ఉందని,  మేత మేస్తుంటే ఏదో అడ్డుపడి మింగలేక పోతున్నట్టు చెప్పిందది. సరే అడుగుతానని చెప్పింది కుందేలు. 


అలా నడుచుకుంటూ వెళ్ళిన కుందేలు రెండురోజుల్లో ముసలి కోతిని కలుసుకుంది. కుందేలుని చూసి వచ్చిన  పనేమిటో చెప్పమంది  ముసలి కోతి.  


“నా పిల్ల గురించి ముందుగా  అడిగితే  స్వార్ధవుతుంది. వాళ్ళ  ప్రశ్నల్నే మొదట అడిగి  ఆఖరున నాది చెబుతాను’ అనుకున్న’  కుందేలు అలాగే చేసింది. 


ఎలుగుబంటి, ఒంటె, అడవి దున్నల సమస్యల్ని ముసలి కోతితో చెప్పి పరిష్కారం అడిగింది.


కళ్ళు మూసుకునే మూడింటికి  పరిష్కారాలు చెప్పింది ముసలి  కోతి. చివర్లో తన పిల్ల గురించి కుందేలు  అడగబోతుంటే ‘మూడు ప్రశ్నలకు మించి జవాబు చెప్పే శక్తి లేదు’ అనేసింది కోతి. 



తన పని కాలేదని బాధ పడుతూనే తిరుగు ప్రయాణమైంది కుందేలు. 


దారిలో అడవి దున్న దగ్గర ఆగి “నీ గొంతులో వజ్రం అడ్డుపడింది. దాన్ని తీస్తే మేయగలవు” అంది. ‘నువ్వే దాన్ని తియ్యరాదా’ అంది అడవిదున్న. దాని గొంతులో అడ్డుపడిన వజ్రాన్ని బయటకు లాగింది కుందేలు. వజ్రాన్ని కుందేలుకి ఇచ్చేసింది అడవి దున్న. 


ఈసారి ఒంటెని కలసి ‘నీ ఎడమ చెవిలో ఏదో రాయి ఉంది. దాన్ని తీస్తే నీ తలనెప్పి ఎగిరి పోతుంది” అంది కుందేలు. 


‘నువ్వే అది తియ్యరాదా’ అని బ్రతిమాలాడింది ఒంటె. జాగ్రత్తగా  రాయిని బయటకు తీసి చూడగా అదొక విలువైన మణి.  ‘నువ్వే ఉంచుకో ‘ అని మణిని కుందేలుకి ఇచ్చేసింది ఒంటె.


వజ్రాన్ని, మణిని  చెరో చేత్తో పట్టుకుని కుందేలు వెళుతుండగా ఎలుగు కనబడింది.  ‘నువ్వు తవ్వించిన నుయ్యి అడుగున పెద్ద రాళ్లు ఉన్నాయట. అవి తీస్తే నూతిలో నీరు ఊరుతుంది” అంది  కుందేలు. 



‘నేనొక్కర్తినే తియ్యలేను. నువ్వు సాయం చేస్తావా’ అని బ్రతిమలాడింది ఎలుగు. ఆ రెండూ కలసి  మరికొన్ని జంతువులని  పిలిచి నూతిలోని  రాళ్లను బయట పడేసాయి. రాళ్ల క్రిందన రెండు లంకె బిందెలు దొరికాయి వాటికి. బిందెల్లో బంగారు నాణాలున్నాయి. తనకు చేసిన మేలుకి కృతజ్ఞతగా ఒక బిందెను కుందేలుకి ఇచ్చింది ఎలుగు. 


వజ్రాన్ని, మణిని, బిందెను మోసుకుని తిన్నగా మృగరాజు దగ్గరకు వెళ్ళింది కుందేలు. అవి తనకు ఎలా వచ్చాయో చెప్పి వాటిని రాజుగారినే తీసుకోమని అప్పగించింది. 

కుందేలు చేసిన పనికి, స్వార్ధం లేకుండా ప్రవర్తించినందుకు ఆశ్చర్యపోయింది మృగరాజు. అక్కడున్న జంతువులు కూడా కుందేలు యొక్క మంచితనాన్ని మృగరాజుకి చెప్పాయి.


కుందేలుని మెచ్చుకోవడమే కాకుండా ఘనంగా సత్కరించింది మృగరాజు. రాజ్యంలోని ఉత్తమ వైద్యుడిని కుందేలు ఇంటికి పంపించి కుందేలు పిల్లకు వైద్యం చేయించింది. కొన్నాళ్ళకు కుందేలు పిల్లకు చూపు వచ్చింది. కుందేలు కుటుంబం సంతోషించింది .  


కుందేలు చూపిన  మంచితనమే దానికి రక్షగా నిలిచిందని, దాని పిల్లకు చూపు తెప్పించిందని అడవిలోని జంతువులు చెప్పుకున్నాయి.

[06/10, 6:10 am] తెలుగు1: 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి 

https://t.me/teluguvelugu01


లంకాపట్టణంలో రావణవధ తరువాత సీతమ్మ...స్వామి హనుమకు వివరిస్తూ... "జంతువులపాటి మంచితనం అయినా మనుషులకు ఉండాలి. కదా! దీనికి నీకు ఒక కథ చెబుతా విను..." అంది.

"ఒకానొకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఒక వేటగాడు తీవ్రంగా గాలిస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ పెద్దపులి ఎదురయింది.. ఆకలిమీద ఉన్నట్లుంది. అది మీద పడేలోగా ప్రాణభయంతో పరుగు లంఘించుకున్నాడు. అది తరుముకొస్తున్నది. దారిలో ఓ పెద్ద చెట్టొకటి  కనిపిస్తే... గబగబా ఎక్కేసాడు.. దానికి అందకుండా ఉండాలని అన్ని కొమ్మలు దాటుకుంటూ పైకి ఎక్కుతూ పోతున్నాడు. వెనక తరుము కుంటూ వచ్చిన పులి చెట్టుకింద తిష్టవేసింది. ఎప్పటికయినా దిగక  పోతాడా... అని కింద కాపుకాసింది. మరో రెండు కొమ్మలు దాటితే చిటారు కొమ్మ ను అందుకోవచ్చని రొప్పుతూ పోతున్న వేటగాడికి పైకొమ్మను పట్టుకునేంతలో అక్కడ గుబుర్లలో ఒక భల్లూకం (ఎలుగుబంటి) కూర్చుని ఉంది. కింద చూస్తే పులి చూపు అతని మీదే ఉంది. ముందు చూస్తే వేటగాడికి సమీపంలో భల్లూకం. చావు ఖాయం అనుకుని గుండె దిటవు చేసుకున్నాడు. ఊపిరి బిగపట్టుకుని చావుకోసం చూస్తున్నాడు. ఈలోగా పెద్దపులి ఎలుగుబంటితో..." వీడు వేటగాడు. నన్ను చూసి పారిపోతూ ఈ చెట్టెక్కాడు. నేను వెళ్ళిపోతే నిన్ను చంపేస్తాడు. అందుకని వీడిని నమ్మకు. వాడిని కిందకు తోసెయ్. తినేస్తా. నిన్ను వదిలిపెట్టేస్తా...." అంది. దానికి ఎలుగుబంటి...ఈ మనిషి తెలిసో తెలియకో నేనున్న చెట్టుమీదికి వచ్చాడు. అంటే... నా ఇంటికొచ్చిన అతిథితో సమానం. వాడిని నేను కాపాడాలి. వాడిని కిందకు తోసేసి నీకు ఆహారంగా అందించలేను" అని చెప్పేసింది. "నీవు మనిషివి నమ్మావు కదా... అది నీకే తెలిసొస్తుందిలే.." అని పెద్దపులి చెప్పింది. కానీ కదలకుండా అక్కడే కూర్చుంది. ఈలోగా వేటగాడికి అలసటవచ్చి నిద్రపోయాడు. అది కూడా అతనినిఏమీ చేయలేదు. కాసేపటికి నిద్ర లేచాడు.. ఈలోగా భల్లూకానికి నిద్ర

వచ్చి.. నిద్రపోతున్నది.


పెద్దపులి వేటగాడితో ..."ఆ భల్లూకం నిద్ర లేస్తుంది. ఆకలితో ఉంటుంది. నేను చంపేస్తానని దిగదు. నువ్వు అందుబాటులో ఉన్నావు కాబట్టి నిన్ను తినేస్తుంది. దాన్ని కిందకు తోసెయ్. నేను తినేస్తా.. నా ఆకలి తీరిపోతుంది కాబట్టి నేను నీ జోలికి రాను....” అంటుండగానే వేటగాడు క్షణం ఆలస్యం చేయకుండా భల్లూకాన్ని కిందకు తోసేసాడు. అదృష్టంకొద్దీ అది కిందకు పడే సమయంలో తేరుకుని మధ్యలో ఒక కొమ్మ అందితే దాన్ని  పట్టుకుని పైకి ఎక్కేసింది. వెంటనే పెద్దపులి అంది.. నేను ముందే చెప్పా. వాడిని నమ్మొద్దు ఇప్పటికయినా తెలుసుకున్నావు కదా.. వెంటనే తోసెయ్ వాడిని.." అన్నది. వాడు నాకు అపకారం చేసి ఉండొచ్చు. వాడు నా అతిథి. వాడికి అపకారం చేయను. కిందకు తోయను.." అన్నది భల్లూకం. చేసేదిలేక పెద్దపులి వెళ్లిపోయింది. ఎలుగుబంటి కూడా

అతనిని వదిలేసింది. వేటగాడు కిందకు

దిగి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు.” "చూసావా హనుమా ! అడవిలో ఉండే జంతువుల పాలిటి వివేకం కూడా మనం చూపకపోతే ఎలా... అందువల్ల ఆ రాక్షస స్త్రీలను చంపవద్దు. వారి జోలికి పోకు..అంది

[07/10, 6:11 am] తెలుగు1: 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి 

https://t.me/teluguvelugu01


*ఆశ్వయుజ మాసం విశిష్టత*


త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !


జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !


ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు *"దేవి నవరాత్రులు."* సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి. దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి , నవమిలలో పూజించిన భక్తులకు ఎటువంటి శోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు , అమ్మవారి పటానికి గాని , విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.


ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది. 


అలాగే , ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని , కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను. 


పూర్ణిమ నాడు  *"నారదీయ పురాణము"* ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.


పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మిదేవి సంతోషించి , అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.


ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం , మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది. 


ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న మాసం *ఆశ్వయుజ మాసం.*


ఈ మాసం లో చేసే పూజలు , విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. *ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.*


*తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి  కరుణామయి..ఆ తల్లి !*

[07/10, 6:11 am] తెలుగు1: 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి 

https://t.me/teluguvelugu01


త్రిగుణ తత్వాలు


గీతాచార్యుడు మనుషులను మూడు రకాలుగా వివరించాడు. యావత్ మానవవర్గాన్ని మూడు గుణాలలో విభజించాడు. అవి, సత్వ గుణం. రజో గుణం. తమో గుణం. సత్వ గుణమున్నవారిని సాత్వికులని అంటున్నాం. రజో గుణం కలిగిన వారిని అతనికేం రాజు అంటాం. తమో గుణం కలిగిన వారిని ఒట్టి తామసం అంటాం. ఈ మూడింటినూ రూపం వేరు. ఆత్మ వేరు. కొందరి అభిప్రాయం ప్రకారం దేహానికి ఆత్మపై ఆధిక్యం ఉందంటారు. కానీ ఆత్మ దేహంపై ఆధిక్యం చెయ్యలేక తల్లడిల్లుతోంది. మొదటి రకమైన సత్వ గుణం కలిగిన మనిషి ఆత్మను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. మనిషి చేసే పనులు జ్ఞానంతో తేజోవంతమైనప్పుడు సత్వగుణం వృద్ధి చెందుతుంది. రజో గుణ మనిషి ఆత్మ గురించి పట్టించుకోక శారీరక ఇచ్చనే ప్రపంచమనుకుని జీవిస్తాడు. రజో గుణంతో కోరికలు అణచుకోలేం. క్రియాశీలత వృద్ధి చెందు తుంది. ఇక తమో గుణమున్న మనిషికి ఆత్మ, దేహం రెండింటిపైనా ఎలాంటి ఆధిక్యం ఉండదు.


అందరికీ సత్వ గుణముండటం అనేది కఠినమే. కంచి పరమాచా ర్యులవారికి కోపం తెప్పించలేం. ఏ స్త్రీ తమ దర్శనం కోసం వచ్చినా వారిలో ఆయన కామాక్షి స్వరూపాన్నే చూసేవారు. ఇలాంటివారు కోటి మందిలో ఒక్కరుంటారు. దేహానికి విడిగా వ్యవహరించే శక్తి ఉంది. మనసుని అది నలపగలదు. వెళ్ళకూడని చోటికల్లా అది వెళ్ళమం టుంది. చెయ్యకూడని కార్యాలను అది చెయ్యమంటుంది. పట్టించుకో కూడని విషయాలను పట్టించుకోమంటుంది. దేహం సవ్యంగా ఉంటే మనసు బాగుంటుంది. దేహం చెదిరితే మనసు చెదిరిపోతుంది. మన సుకి మరొక రూపమే ఆత్మ. దేహానికి ఆత్మపై ఆధిక్యం ఉంది. ఈ ఆధి క్యాన్ని వేరు చేయగలవారినే సాత్విక గుణం కలిగి ఉంటారు. దేహానికి ఆత్మపై ఆధిక్యం లేకుండా ఉన్న వారే ప్రపంచంలో ఉత్తములవుతారు. వారే సాధువులు. ఈ మూడు గుణాలకూ అతీతమైనవారు దైవత్వం నిండిన వారై ఉంటారు.

- యామిజాల జగదీశ్

[08/10, 6:21 am] తెలుగు1: 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి 

https://t.me/teluguvelugu01


" మరణించిన పితృ దేవతలకు తర్పణలు వదలడం, గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు,  మనకు మనసు నిండుతాయి.

"తృప్తినిచ్చే అర్పణం తర్పణం "".అంటారు.

పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. 

విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.

తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.

ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.

1-గరుడ తర్పణం : -

ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.

2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : -

నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.

3-పర్హెణి తర్పణం : -

యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.

4-సాధారణ తర్పణం : -

అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.

మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.


 ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?

1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.

2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .

3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.

4. ఆవు నేతితో తర్పణము చేస్తే, …….సుఖము

5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, ……. సర్వ సిద్ధి

6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే …….. శత్రు నాశనము

 తర్పణం ఎలా వదలాలి ?

కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.


(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

 భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

[08/10, 6:21 am] తెలుగు1: 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి 

https://t.me/teluguvelugu01


ఎంత చిత్రమో ఈజీవిత సత్యాలు

-

మెట్టెలవిలువ వేలల్లోఉంటుంది-కానీ వేసేదికాళ్ళకి

కుంకుమవిలువ రూపాయల్లో ఉంటుంది-కానీ నుదుటిన పెట్టుకుంటాం.విలువ ముఖ్యంకాదు ఎక్కడ పెట్టుకుంటాం అనేదే ముఖ్యం.

ఉప్పులాగ కటువుగా మాట్లాడేవాడు నిజమైన మితృడు...చక్కెరలాగ మాట్లాడి మోసగించేవాడు నీచుడు.

ఉప్పులో యెప్పుడు పురుగులుపడ్డ దాఖలాలులేవు—తీపిలో పురుగులు పట్టనిరోజంటులేదు.....!

-

ఓమనిషీ!-

ఈజీవితం అంత విలువైనదేమీకాదు-ఏడుస్తూ ఈలోకంలోకి అడుగుపెడతాము-ఏడిపిస్తూ-ఈలోకాన్ని వదలి వెళ్ళిపోతాము....!

రమ్మన్నా సన్మార్గము(మంచిదారి)లోకి ఎవరుా రారు.చెడుమార్గమునే యెంచుకుంటారు.

పాలు అమ్మేవాడు ఇల్లిల్లుతిరగాలి.సారాయి అమ్మేవాడి దగ్గరికీ అందరూ వెళ్తారు.-పాలల్లో నీళ్ళుకలిపావా అని అడుగుతారు-ఖరీదైన సారాయిలో నీళ్ళుకలుపుకునితాగుతారు.


ఆహాహా యేమిలోకం తీరు.....!

పెళ్ళి ఊరేగింపులో బంధుమితృలుముందు వరుడు వెనకాల ఉంటాడు.అదే చావులో శవం ముందుంటుంది బంధుమితృలు వెనకాల నడుస్తారు.

శవాన్ని ముట్టుకున్నందుకు స్నానంచేస్తారు.మూగప్రాణులను చంపి శవాన్ని పీక్కుతిన్నట్టుగా భుజిస్తారు.-

కొవ్వొత్తులని వెలిగించి చనిపోయినవారిని గుర్తుచేసుకుంటారు.అదే కొవ్వొత్తులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తున్నారు....!

ఓమనిషీ!

ఆకలి విలువ పేదవానికి తెలుసు కష్టము విలువ కర్షకునికి తెలుసు-

         ఇదే పచ్చి నిజం

     పుట్టినపుడు జాతకం

    నడిమధ్యలో నాటకం

   చావగానే      సుాతకం

ఐనా ఆగదు జనాలమధ్య కౌతుకం.!

 

సకలజీవులకు అన్నమే పరబ్రహ్మమని అన్నాడు బసవన్న

అది తెలుసుకోకుండా మూఢులైనారు ఎంతోమంది మనుషులు

కళ్ళతో ఈజగత్తునిచూస్తే కనిపించేవిదృశ్యాలే...హృదయంతో చూడగలితే జగత్తంతా సుందరమే,,,,!


శుభోదయం

[09/10, 5:46 am] తెలుగు1: 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి 

https://t.me/teluguvelugu01


     *ధనం - ధర్మం ఏది గొప్పది?* 


 *అర్థం పురుషార్థాల్లో ఉత్తమమైందని పంచతంత్ర వాక్యం. ధర్మమార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహింపదగింది. ఒక్కొక్క నీటిబొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణకణం సాధించుకోవాలి. ఆత్రంగా నీటితో నింపబోతే కుండవిచ్చిపోవచ్చు. నీరు నేలపాలు కావచ్చు. ధనార్జన విషయంలో ఒక క్రమపద్ధతి అవలంబించాలని విజ్ఞులు చెబుతారు.* 


 *డబ్బుంటే చాలు కానిదేదీలేదన్న ఆలోచన నేడు చాలామందిలో ప్రబలంగా ఉంది. సంపాదనకు అధర్మమార్గం తొక్కడమూ సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితం కావాలన్నారు పెద్దలు. అధర్మ మార్గాల్లో సంపాదించి విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంటుంది. వారు ఏ రకంగా ఆర్జించారన్నది పట్టించుకోదు. దానం చేసే ధనం న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి.* 


 *ఒక ఊళ్లో పేద పండితుడు యాచకవృత్తిలో ఉంటూ ఓ ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఉత్తమురాలైన ఇల్లాలు భోజనం పెట్టింది, చేతులు కడుక్కోవటానికి వెండి చెంబుతో నీళ్లిచ్చింది. పండితుడు ఇంటికి వచ్చేటప్పుడు గృహిణి ఇచ్చిన వస్తువులతో పాటు వెండిచెంబు కూడా సంచిలో చేరింది. ఆమె గమనించలేదు. ఇంటికి వచ్చాక సంచి తెరిచి చూసి అతడు ఖిన్నుడయ్యాడు. తనవల్ల ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఎంత ఆలోచించినా అలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో అర్థంకాలేదు. తానెలా వెండిచెంబు సంగ్రహించాడో తెలియలేదు. ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళి, సిగ్గుపడుతూ- తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు. తిరిగి వెళ్లిపోతూ 'తల్లీ... నీ భర్త ఏం చేస్తుంటారు?' అని అడిగాడు. ఆ గృహిణి దుఃఖిస్తూ. తన భర్త దారి దోపిడులు చేసి సంపాదిస్తున్నాడని ఇదంతా పాపమని చెప్పినా వినడం లేదని, ఆ పాపం పోవడంకోసం తాను దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తున్నానని పలికింది.* 


*అప్పుడా పండితుడు… అన్యాయార్జితమైన విత్తంతో చేసిన దానధర్మాలుగాని, అన్నప్రసాదనంగాని స్వీకరించరాదని శాస్త్రాలు చెబుతున్నవనే విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలు కలిగిస్తుంది.* 


 *1. తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది.* 


*2. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం.* 


*3. సోదరుడినుంచి వచ్చినది అధమం.* 


*4. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమని శాస్త్రవచనం.* 


*విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశ పడకూడదు.* 


*సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు.* 


*ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి.* 


*తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు.* 


*ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు.* 


*వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. అంటే- ధర్మంలేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం.*

[09/10, 5:46 am] తెలుగు1: 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి 

https://t.me/teluguvelugu01


*అద్వితీయ సందేశం* 

               ➖➖➖✍️


 *మానవాళికి కలిగే అనేక సంశయాలకు సమాధానం ఇచ్చే ఆధ్యాత్మిక గ్రంథం - భగవద్గీత.* 


*భగవంతుడైన కృష్ణుడి ముఖారవిందం నుంచి వెలువడిన జ్ఞానామృతమైన భగవద్గీత మనుషులకు జీవనగీతగా మారి, కర్తవ్యాన్ని ఉపదేశిస్తోంది...*


*మామూలుగా మనిషికి జీవితంలో అడుగడుగునా భయాలే ఎదురవుతుంటాయి.* 


*అడుగుతీసి అడుగు వేస్తే ఏమవుతుందోనని మనిషి భయపడుతుంటాడు.* 


*ఏదైనా పనిని ప్రారంభించే ముందు భయం వెంటాడుతుంది. ప్రారంభించిన తరవాత తుది వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందో లేదోనన్న భయం పీడిస్తుంది. గమ్యాన్ని చేరుకున్న తరవాత పరిణామఫలం ఎలా ఉంటుందోనన్న వెరపు వెంటాడుతుంది.* 


*ఇలా అనుక్షణం భయాల మధ్య బతుకు గడిపే మనిషికి మృత్యువు అంటే పెను భయం! ఏ ఆపదా రాకుండా ఉండాలని అనుక్షణం మనిషి కోరుకుంటాడు.* 


*మరణం తొందరగా రాకూడదని ప్రార్థిస్తాడు. చిరకాలం జీవించాలని ఆశపడతాడు...*


*ఇలా మనిషి ఆశపడటంలో తప్పులేదు. మరణం విషయంలో మనిషికి ధైర్యాన్ని కలిగించేందుకు భగవద్గీత ఎన్నో విషయాలను బోధించింది.*


*వాటిలో రెండు శ్లోకాలు మాత్రం మనిషికి భయాన్ని పోగొట్టే తారకమంత్రాలుగా కని పిస్తాయి.*

 

*వాటిలో మొదటి శ్లోకంలో కృష్ణుడు- ‘అర్జునా! నీవు చేయ బోతున్న యుద్ధంలో నీవు చంపేవాడివని, శత్రుపక్షం వారు చావుకు గురయ్యేవాళ్లు అని నీవు అనుకుంటున్నావు.       అది నిజం కాదు... నీవు నిమిత్తమాత్రుడివే. మరణం వారికి ఇంతకు ముందే నిశ్చితమై ఉన్నది. పుట్టిన ప్రతి ప్రాణికీ చావు తథ్యం.*


*చచ్చిన ప్రతి ప్రాణికీ మళ్ళీ పుట్టుక అనివార్యం. కనుక నీవు ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు. యుద్ధం చేయడమే నీ ధర్మం’ అంటాడు. *


*ఈ మాటల్లో లోకంలోని ప్రాణుల మరణాలకు ఎవరూ కారణం కాదని, అది సహజంగా జరిగే పరిణామమేనని తెలిసినప్పుడు మనిషికి చింత, దుఃఖం దూరమవుతాయి...*


*ఇక రెండో శ్లోకంలో- ‘మనిషి దేహం జీవన కాలంలో అనేక దశలను చవిచూస్తుంది….*

*కౌమారావస్థ, యౌవనావస్థ, వృద్ధాప్యావస్థ అనేవి ముఖ్యమైనవి. పుట్టినప్పుడు మనిషి చిన్నగా ఉంటాడు.  క్రమంగా పోషణతో శరీరం పెద్దదిగా మారుతుంది.*


*బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలలో అనుక్షణం మార్పులకు లోనవుతూ తుది దశకు చేరుకుంటుంది. 

ఇన్ని దశలుగా మార్పు చెందిన శరీరం ఒక వస్త్రంలా జీర్ణమైపోతూ ఉంటుంది.* 


*వస్త్రం చిరిగిపోయినట్లే, అతుకులు పడినట్లే మానవదేహం కూడా శిథిలమై అతుకులబొంతలా తయారవుతుంది.* 


*చివరికి పూర్తిగా పాడైపోయి పారవేయవలసిన స్థితికి చేరుకుంటుంది. చిరిగిపోయిన పాతబట్టలా ఈ దేహం మరణిస్తుంది.*


*మళ్ళీ ఆత్మ మరో జన్మరూపంలో కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. అప్పుడు ‘పునరపి జననం’ సంభవిస్తుంది.* 


*ఇలా ఆత్మను కప్పి ఉంచే వస్త్రం లాంటిదే దేహం.*

     

*’కనుక దేహం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం, ఎన్ని దేహాలు మరణించినా ఆత్మ మరో దేహమనే వస్త్రాన్ని తొడుక్కుని నూతన జన్మను పొందుతుంది’ అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తేటతెల్లం చేశాడు.*


*సృష్టిలో పరిణామం అనేది అనివార్యం. ఏది అయినా పుట్టినప్పుడు ఉన్న తీరులోనే ఉండదు కదా? మార్పునకు లోనవుతూనే ఉంటుంది. అదే జీవన సత్యం. మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటే తాను శాశ్వతం కాదని, తన ఉనికి పరిమిత కాలమేనని తృప్తిపడతాడు. మరణ భయానికి దూరమవుతాడు. తాను జీవించిన పరిమిత కాలంలో అపరిమితంగా మంచి పనులు చేసి, తన జన్మను సార్థకం చేసుకుంటాడు. ఇదే భగవద్గీతా పరమార్థం!*

[02/10, మన మహాత్ముడు గాంధీ జీ

గుజరాత్ రాష్ట్రంలో పుట్టి,

బారిస్టర్ చదువు చేపట్టి,

దక్షిణాఫ్రికయందు అడుగెట్టి 

అవమానములను ఎదురొడ్డి 

అహమును తరిమి కొట్టియు

దుర్మార్గులను తరిమి వేసి

ప్రక్షాళనం కునడుము చుట్టి కర్రచేపట్టియు నడిచి యు


భరత దేశాన్ని దర్శించి,

హింసను వ్యతిరేకించి,

అవేమిటో అహింసను ఎంచి,

గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి,

సంసమాజమును నిర్మించి,

బానిస బతుకులు  మార్చి

నవభారతాన్నీ రచించిన

బోసినవ్వులతొ బాపూజీ,

భావితరానికి దిక్షుచి.....!


రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం,

మనుషులను మనిషిగా చూడని సమాజం,

తారతమ్యాలు లేని సరికొత్త భారతం,

శాంతి,అహింసలే తన ఆయుధం,

బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం,

స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి కేతనం...!


ఒంటరిగా పోరాడిన వీరుడు,

హింసను విడనాడిన ధీరుడు,

అహింసను చేపట్టిన దేవుడు,

ఐక్యతను చాటిన నాయకుడు,

ఐన్ స్టీన్ కు ఆదర్శప్రాయుడు,

హిట్లర్ ను ఆలోచింపచేసిన ఘనుడు,

గ్రామగ్రామాలలో,

వాడవాడలలో,

స్వదేశంలో,

విదేశంలో

వినుతి కెక్కిన విశ్వవిఖ్యాతి

మన మహాత్ముడు.......!

[02/10, 11:40 am] . Mallapragada: "శ్రీపద్మేశం ఘనతనురుచింపద్మాయతాక్షం సుశీలం ,

ఆపద్బంధుం దురితహరణం పద్మనాభం సలీలావిభూతిమ్ !

రూపాతీతం కలివిదరణం పద్మపాదం హి కృష్ణం ,

భూపాలం తం విహగగమనం నిత్యసేవాంకరోమి !!! 

----

శ్రీ విశ్వేశం జనుల సమధర్మన్యాయ భావం సుశీలం

శ్రీ సౌందర్యం మెరుగు పరుచేశక్తీ  సమానం సుశీలం

శ్రీ సర్వాత్మా సకల విషవాంఛాప్రేమ తత్త్వం సుశీలం

శ్రీ పద్మేశం ఘనతనురుచిపద్మాయతాక్షం సుశీలం


ప్రేమద్బంధం మనసువిదితమ్ సర్వమోహం సకాల విభూతిమ్

విశ్వాసమ్మే విజయ చరితమ్ న్యాయ భావం విశాల విభూతిమ్

ధర్మార్ధమ్మే  వినయ భరితమ్ ధ్యాన ధైర్యం సుఖాల విభూతిమ్

ఆపద్బంధుం దురితహరణం పద్మనాభం సలీల విభూతిమ్


 మోహావేశం మనసుమదనం సేవలక్ష్యం హిబ్రహ్మం

ఆశాపాశం విషయ వినయం ప్రేమభాష్యం హివిశ్వం

ప్రేమాతత్వం కరుణ తరుణం కార్య సాధ్యం సుధర్మం

రూపాతీతం కలివిదరణం పద్మపాదం హికృష్ణం


 ప్రేమార్పితం విషయచరితం విశ్వాసమ్మే కరోమి

స్నేహార్పిత్వం విమళ గమనం సర్వార్ధమ్మే కరోమి

రామార్పితం సహనవినయం సత్యన్యాయం కరోమి

భూపాలంతం విహగగమనం నిత్య సేవాంకరోమి

[02/10, 2:10 pm] . Mallapragada: *🍁శ్వాస ప్రాధాన్యత 🍁*


మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు...


100 నుండి 120 సం.౹౹లు  బ్రతుకుతాడు. 


తాబేలు నిమిషానికి "3 సార్లు శ్వాస" తీస్తుంది...

500 సం. లు బ్రతుకుతుంది.


ఐతే "శ్వాస"లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.?


దీనిని .

సశాస్త్రీయంగా వివరిస్తాను...

అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.


మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. 


ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.

వీటినే సెల్స్ అంటాం.


ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా (హరిత రేణువు)

"అనే ప్రత్యేక కణ వ్యవస్థ''ఉంటుంది.


ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. 

దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.


ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది

ఇలా శరీరం లోని

కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...


ఇలా ఒక్కొక్క కణం నిముషానికి... 

15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.


ఎందుకంటే మనం నిముషానికి "15" సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి...


ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...


ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.


ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...


ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది......


ఉదాహరణకు మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి. అనుకుంటే...


ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము.

మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమేఆ స్థలం లో కణాలు తయారవు తాయి.*


పాత వాటిని ఖాళీ చేస్తేనే...

కొత్తవి రాగల్గుతాయి. 

        

అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.


ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో... 


వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి...

సరిగా ఉష్ణం జనించక......

తీవ్ర రోగాల బారిన పడతారు...


కనుక ఈ టాక్సిన్ లను .....

బయటికి పంపే డిటాక్సీఫీకేషన్..

(విసర్జన)

చాలా ముఖ్యం.


ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది. 


అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...


5 రోజులు జీవిస్తుంది......


13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...


7 రోజులు జీవిస్తుంది......


ఈ విధం గా మనం.. శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ...


మన కణాలు పని చేసే కాలం పెరుగుతుంది. 


ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...

త్వరగా పాడై పోతుందో

పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో

అలాగే ఈ కణాలు కూడాను...


భారతీయ యోగులు ...

కణం యొక్క జీవిత కాలాన్ని...

3 నుండి 21 రోజుల వరకు...

పెంచి...

2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.


మనం శ్వాసను ఎక్కువ తీసు కునే కొద్దీ...


శరీరం లోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...

ఆ కణం త్వరగా పాడైపోతుంది. 

       

ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......


మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...


ఎందు కంటే......


అవయవాలు "అంటే"...

కణాల సముదాయమే.


ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క...

ఆయుష్షు పెరిగితే...


మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా.!!


మనం ఒక్క "శ్వాస,ను తగ్గించ గల్గితే...

20 సంవత్సరాల ఆయుష్షును...

పెంచు కోవచ్చు...


యోగులు...

ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...


తాము...

ఏ రోజు... మరణించేదీ...

ముందే చెబుతారు...!

[02/10, 2:14 pm] . Mallapragada: _*⚜️ పసిడి పలుకులు 💫*_


_-{మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి !}-_


_ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_


_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_


_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._ 


_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._


_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_


_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._


_కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి._


_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_


_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._ 


_నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_


_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_


_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._


_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?_


_నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_


_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._

_మౌనంగావుండేవాడు ముని._

_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._ 

_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._ 

_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._


_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_ 


_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._


_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._


_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_


_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_


_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._ 


_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._ 


_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_


_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_

_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !_


_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !_


_మానవులుగా బతకటం కాదు.._

_మానవత్వంతో బతకాలి !🙏🙏🙏

[02/10, 5:07 pm] . Mallapragada: కమనీయం  కనునాధ మమ్ము గన సౌఖ్యమ్మే సేవమ్ములే


[01/10, 7:01 pm] . Mallapragada: అమ్మపాట ---- --2-- 


అమ్మా, అమ్మా పసుపు కుంకుమతో 

గాజులు వేసి పూజిస్తున్నా మమ్మా 

నీ మాహిమలూ మాకు చూపి మా  

తప్పులు తిద్ధి మమ్ము ఆదుకోవమ్మా

 

బ్రహ్మ సృష్టికి నీవే మూలం కదమ్మా 

మా శక్తి సామర్ధ్యాలకు నీ తేజమే నమ్మా 

మా ఆలోచన అంతా నీ కరుణయే నమ్మా 

మా బిడ్డల పోషణ భాధ్యత నీవే నమ్మా 


మా బిడ్డల విద్యా బుద్ధులకు 

గురువుగా సరస్వతి వైనవమ్మా 

మాకు ఆరోగ్య సంపాదన కల్పించి 

క్రమ బుద్ధి కల్పించే మహాలక్ష్మివమ్మా   


కుటుంబానికి పౌష్టిక ఆహారాన్ని అందించి 

ఆత్మానందం అందించే అన్నపూర్ణవమ్మా 

మాకు దృఢ సంకల్పం  శక్తినిచ్చి 

సన్మార్గంలో నడిపించే పార్వతివమ్మా 


సహాయసహకారు అందిస్తూ దుష్టులను 

ఎదుర్కొనే శక్తినిచ్చే మాహాకాళివమ్మా 

దుర్మార్గాన్ని అణిచే శక్తినిచ్చి 

న్యాయ మార్గంలో ఉంచే దుర్గవమ్మా   


ప్రకృతిలో సహకరించి వికృతి 

చేష్టలు, మాటలను మార్చే మర్దినివమ్మా 

స్త్రీని అగౌరపరచి పరస్త్రీవ్యామోహంలో 

ఉన్న వారిని మార్చే చండివమ్మా  


అమ్మా, అమ్మా పసుపు కుంకుమతో 

గాజులు వేసి పూజిస్తున్నామమ్మా 

నీ మాహిమలూ మాకు చూపి

మా తప్పులు తిద్ధి మమ్ము ఆదుకోవమ్మా 


--((***))----

[01/10, 7:25 pm] . Mallapragada: *పులిహోర* 


*పర బ్రహ్మమునకు కూడా* 

*ప్రీతి కరమైన ఇహ బ్రహ్మం..* 😁👌👍👏👏👏🌺💐🌹

Fwdd...

ముంగిట మామిడాకులు వంటింట పులిహోర గుబాళింపులు చాలు..పండగో, శుభకార్యమో ! వచ్చిందంటానికి గుర్తుగా.


మొన్న శ్రావణ మాసం అయిపోగానే దిగులు. మళ్ళీ ప్రసాదాల రూపంలో పులిహోర కోసం శరన్నవరాత్రులు దాకా ఆగాలి కదా అని!!


ఆంధ్రులు గర్వించే వంటకం పులిహోర..అన్నిహక్కులూ ఆంధ్రులవే. పేటెంట్ తీసుకున్నారో?? లేదో తెలియదు.


ఇప్పుడంటే ఈ పులిహోర "వేరియెంట్స్" మార్చుకుంటూ రకరకాలుగా వచ్చాయి కానీ నా చిన్నప్పుడు రెండే రకాలు.. అవి నిమ్మ పులిహోర, చింతపండు పులిహోర. 

చింతపండు పులిహోరతో పోలిస్తే నిమ్మ పులిహోర లో హడావుడి తక్కువ. 


రవ్వపులిహోర అని ఉంటుంది గానీ! వీటి సరసన నిలబడే స్థాయి కాదు. దానికి ఆదరణ కూడా తక్కువనే చెప్పాలి 


"ఏదో మైనారిటీ స్టేటస్ ఇవ్వచ్చు!"😊


ఇక రాత్రి అన్నం మిగిలితే పొద్దున  మతలబు చేసి నిమ్మ పులిహోరగా మార్చి టిఫిన్ గా పిల్లలకి పెట్టి చేతులు దులుపుకునే తల్లులు కోకొల్లలు. అలా చేసింది వాసి,  రాశి లో నాసి అనే చెప్పాలి.


అదే అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండి పులిహోర చేసి చూడండి..అ మజా వేరు.

నిమ్మ పులిహోర  లో ఆ పలచని పసుపు కాంతి నీరెండలా మెరిస్తూ లేత యవ్వన కన్య లా  ఉంటే చింతపండు పులిహోర ఇంత పసుపు పట్టించి స్నానం చేసి గుప్త గాంభీర్యాన్ని పోగేసుకున్న పూర్ణ ముత్తయిదువులా ఉంటుంది.☺️


నాకు బాగా గుర్తు...ఓరోజు స్కూల్ నుంచి రాగానే వాకిట్లోకి తిరగమాత గుబాళింపు వచ్చింది.


 " *అమ్మ* *నీ* *చేతి* *తాలింపు* *కమ్మదనము* *భరత* *దేశమున* *గుమ* *గుమ* *పరిమళించె* ... " అని కరుణశ్రీ గారి పద్యం మా అమ్మ పాడుతోంది. అవిడో సాహితీ పిపాసి.


 పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళితే అమ్మ చీర కొంగుకి పసుపు ఆంటి ఉంది. కొత్త చీర కొనుక్కున్నావా?? అని కొంగు ని పట్టుకు అడిగితే అమ్మ నవ్వి పులిహోర చేస్తున్నా రా!! పసుపు చేతుల్తో చెంగు తుడిచా !!అంటింది కాబోలు!! అంది.

ఆ పసుపు కొంగునిండా తిరగమాత సువాసనే..అది మొహాన కప్పుకున్నప్పుడు నాకు *తిరుమల* *శ్రీవారి* *మేల్* *చాట్* వస్త్రం కప్పుకున్న అనుభూతి.


సాధారణంగా మిగిలిన టిఫిన్లన్నీ ఒక దారి అయితే

పులిహోర ఒకటీ వేరే. ఇంట్లో వారినే కాకుండా పనిమనిషి, చాకలి వంటి వారిని కూడా తినే సభ్యుల్లో లెక్కచేర్చాలి. లేదంటే ఆనక ఇబ్బందులు.


మూడుపూట్లా ఇదే తినే కడుపులు

మూడ్రోజులూ తినే గడపలు కూడా ఉన్నాయి.

టిఫిన్గా తిన్నదే కాక కారేజ్ బాక్స్ లోకి, నాన్నగారు ట్రైన్ లోకి..ఇలా అందరి మోజు తీరాలంటే భారీ మొత్తంలో చేయాల్సి ఉంటుంది.


పులిహోరలో కేవలం తిరగమాత ఉంటే అధమశ్రేణి , పల్లీలుంటే మధ్యమశ్రేణి, జీడిపప్పు ఉంటే ఉన్నత శ్రేణి

జీడిపప్పు గుళ్లు ఉంటే ఎగువ ఉన్నతశ్రేణి కింద ఆదాయపు పన్ను శాఖ వారు గుర్తించవచ్చు. 

ఇంట్లో బాచిపీటవేసుకుని లుంగీ కట్టి అరిటాకులో తిన్న తృప్తి తో ఏదీ పోల్చలేము. ఒక పంటికింద చింతపండు లో ఊరిన పచ్చిమిర్చి, మరో పంటికింద తాలింపు చేరిన ఎండుమిర్చి నములుతుంటే మనసు " *ద్విపద* " కావ్యం రాస్తున్నట్టే!! 


పులిహోర అంటే పులకరించని మనసుంటుందా?? అనుమానమే!!


రేపు పులిహోర అనగా నిద్ర పట్టని రాత్రులున్నాయి

పులిహోర లో నూనె బాగా పడాలి..చూస్తుంటే అది మెరవాలి.. తిన్న మన కళ్ళు అంతే మెరవాలి.

అలా పెద్ద బేసిన్ నిండా పులిహోర తయారు చేసి పరిస్తే చూడండీ!!!.


అసలు శ్రావణ శుక్రవారం పులిహోర బాగా కుదరటమే మన భక్తికి పరీక్ష అని జెప్పచ్చు.


శ్రావణం, దసరా రోజుల్లో ఈ పులిహోర నాలుగైదు గృహాలనుంచి  ప్రసాదాల రూపంలో వస్తూ ఉంటుంది. 

ఇక్కడే సాంకేతిక సమస్య నాకు!!


ఎవరిది ఏపులిహోర?? అని గుర్తుంచుకోవడం  వాళ్ళ బాక్స్ మళ్ళీ వాళ్ళకి అందచెయ్యడం, పులిహోర పై అభిప్రాయాన్ని సదరు గృహిణికి message పెట్టడం..ఇత్యాది బాధ్యతలు చాలా ఉంటాయి. ఈ విషయంలో మా అబ్బాయి రాటు దేలాడు. నాకు అందరి పులిహోర్లూ ఒకేలా ఉన్నా మా అబ్బాయి ఠక్కున చెప్పగలడు.!! 

ఆవులన్నీ ఒకేలా ఉన్నా యజమాని విడివిడిగా గుర్తించినట్టు అన్ని పులిహోరలూ ఒకేలా ఉన్నా ఇది ఫలానా ఆంటీది!!అంటూ వాడు చెప్పగలగడం నాకు పెద్ద ఊరట. కొన్ని పులిహోరలు మనసు కి చివుక్కనిపించినా అది  అభిప్రాయం గా మారకుండా నోరు జారకుండా జాగ్రత్తపడతా.

 ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ పండక్కి పులిహోర హుళక్కే. ఇప్పటికే అలా ఒకరిద్దరు పులిహోరదాతల్ని పోగొట్టుకున్నా కూడా!😢 


ఇక స్థల ప్రభావం అంటారే!! 


అలా  పులిహోర తినే ప్రదేశాలు కూడా పులిహోర రుచికి సమన్వయమై ఒక్కో అనుభూతిని ప్రసాదిస్తాయి.ఉదాహరణకి ట్రైన్లో  వింధ్య గుహల్లోనుంచి ఏ ఢిల్లీ నో  వెళ్తు మాంచి జోరు మీదుండగా ఊగుతూ పులిహోర తినడం ఒక అనుభవమయితే, కార్తీకంలో పంచారామాల దర్శనం అప్పుడు మంచు పడుతుండగా  పొలాల మధ్య ఏ చిన్న ఆలయంలోనో  తినడం మరో అనుభూతి.

స్థల ప్రభావం వల్ల రుచి ఇబ్బడిముబ్బడి గా పెరిగే  ఏకైక వంటకం ఇదొక్కటే అనుకుంటా!


ఆలయం అంటే గుర్తొచ్చింది..చిన్నప్పుడు ముత్యాలంపాడు రామాలయం రాజుల అజమాయిషీ. పులిహోర ప్రసాదంఘాటుగా ఉండేది..దాన్ని నేను "క్షాత్ర పులిహోర" అనేవాడిని. అక్కడ రాజులు అరికాలు మంట నెత్తి కెక్కేట్లుగా పచ్చిమిర్చి వేసేవారు..తెలియక ఆబగా నోట్లో పెట్టా ఒకసారి. అంతే వెక్కిళ్ళు తమన్ డ్రం బీట్ లా కన్నీళ్లు జోగ్ జలపాతాల్లా ఉబికిరాగా కుక్కపిల్ల నాలిక బైటపెట్టినట్లు అంగలార్చుకుంటూ ఇంటికొచ్చా. విషయం తెలిసిన అమ్మ పంచదార పెట్టడం తో ఆ ఘాటు స్మృతి కి 

స్వీటు ముగింపు. 


ఇక తిరుమలలో దర్శనం అయ్యి వస్తుంటే ఉచిత ప్రసాదం ఏమిపెడతారో!! అని టెన్షన్. లడ్డూ , పరమాన్నం అయితే ok.. 


పులిహోర అయితే మాత్రం! ...ఆ దొన్నె ఏమూలకి? దొన్నె సైజ్ పెంచరు సరికదా!! రెండో దొన్నె ఇవ్వరు. 

దద్ధోజనం, కట్టెపొంగలి లాంటివి దొన్నెల్లో పెట్టినా, 

పులిహోరకుమాత్రం దొన్నె బదులు గిన్నె ఇవ్వాలి అని నా అభిప్రాయం. ఇక ఖాళీ అయిన  గంగాళాల గోడలకు అతుక్కుపోయిన జీడిపప్పులు వేలాడే చంద్రవంకల్లా అగుపిస్తుంటే..అన్ని జీడిపప్పులు వృథాయేనా!! అని బాధ.


ఏది ఏమైనా అరసవిల్లి నుంచి అయినవిల్లి వరకు 

అన్ని పులిహోరలూ ఒక ఎత్తైతే తిరుమల పులిహోర మరో ఎత్తు.నేతి పులిహోర బహుశా నాకు తెలిసి చేసే ఆలయం తిరుమలే అనుకుంటా!!

ఆరుచి అందరకూ నచ్ఛకపోవచ్చు. ఆ మిరియాలు, ఘాటైన ఆవ ముఖ్యంగా ఆంధ్రులకు!! 


కవిత్వాన్ని ఎందరు ఆస్వాదించగలరు?? దాని విలువదానిదే!! అలాగే తిరుమల పులిహోర కూడా.

అసలు స్వామి వారికి నచ్చింది అండీ..అది చాలు!!


ఇంతకీ పులిహోర,   భోజనమా!! ఫలహారమా!!  అన్నది నన్ను చాలా కాలం గా వేధిస్తున్న ప్రశ్న?? 


కొందరు పరగడుపున ఇంత పెరుగేసి కలిపి భోజనంలాగా స్వీకరించి ఇక ఆరోజుకి ఇంకేమీ ముట్టని వారుంటారు. అదేమిటంటే!! పులిహోర, పెరుగు కలయిక మామూలనుకుంటున్నారా?? రెండు అగ్రరాజ్యాల భేటీ ... మోదీజీ, బైడెన్ కలయిక లాంటిది..కడుపులో దండిగా పడుంటుంది అంటారు.


కొందరు మాఇంట్లో  ఉదయం పులిహోర టిఫిన్  అంటూండగా

మరికొందరు ఇవ్వాళ ఉపవాసం , ఫలహారం మాత్రమే అని "పులిహోర తప్ప" అని షరతు పెడతారు. 

అంటే పులిహోర ప్రభావం చూడండి!!...కొందరి దృష్టిలో ఫలహారం మరికొందరి దృష్టిలో అది భోజన సమానం.

ఇడ్లీ/ దోసెలకు కానీ  పూరీ/వడ మరే ఇతర టిఫిన్ కానీ  పులిహోరకి లభించిన ఆధ్యాత్మిక స్థాయి లేదు. 


నాకు తెలిసి మిగిలిన టిఫిన్స్  మాట ఎలా ఉన్నా పులిహోర మాత్రం స్నానం చేసి కలిపే మహిళలే ఇప్పటికీ మెజారిటీ. అలాగే అది సాధారణ టిఫిన్ గా తీసుకొచ్చినప్పటికీ  అప్రయత్నంగా కళ్లకద్దుకొని తినడం సహజ ప్రవృత్తి . అంటే ఆ పులిహోర పట్ల ఏదో తెలియని ఒక

 " *అసంకల్పిత* *పవిత్ర* *భావన*  " అలా పురిగొల్పుతుందేమో!!


అందుకే నేను


" అన్నం పర బ్రహ్మమయితే " 

   పులిహోర "ఇహ బ్రహ్మం"          అంటాను.!!😊

[01/10, 8:40 pm] Akirajusridar: Bapanaiah Kukkapalli:

🙏🏻మీరే కనుక మహా మహా ఙ్ఞానులను గౌరవించే వారైతే , మీ పిల్లలకు లెక్కల పై మక్కువ పెంచాలను కునే వాళ్ళు అయితే ? తప్పకుండా ఈ పోస్టు పూర్తిగా చదువుతారు. 🙏🏻


గణితబ్రహ్మగా పేరొందిన *లక్కోజుసంజీవరాయశర్మ*  (నవంబర్ 27, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో 6వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడపజిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించాడు.


జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ గారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు.


తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.


శ్రీ సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించారు. అప్పటినుంచి 1995వరకు ఆయన ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు,ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ శ్రీసంజీవరాయశర్మ గారి గణితావధానమే.

సాధారణంగా, గణితావధానం లో, పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం-కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది. 

ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడాచెప్పి, కొంతవరకు జాతకం కూడాచెప్పేవారు.


ఈ ప్రత్యేకతను (మానవ గణనయంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలాదేవితో సహా) మరెవరూ చూపలేకపోయారు. ఆవిధంగా, 

ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత 1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత? 


దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. 

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు... 


కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా ?... కాదు. 


పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా ?... కాదు. పుట్టుగుడ్డి! 

పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది. )

ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ "అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!"  శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా... 

మొదటి గడిలో ఒక వడ్లగింజ, 

రెండో గడిలో రెండు గింజలు, 

మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది... ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు! 


దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం... ''ఒక కోటి 84 లక్షల, 

46 వేల 74 కోట్ల 40 లక్షల, 

73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట... (1,84,46,74,40,73,70,95,51,615!) 

ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే... 


అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు! 


అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!  ఇదంతా అబ్బురమని పించవచ్చు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ అదంతా!  ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు! 


సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షిత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు.. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహిం చిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను  పలు ప్రదర్శనలు నిర్వహించారు.. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు


ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి #రాష్ట్రపతి డా. #రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం! 

అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ,

 రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన.. ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్లా కీర్తించారు. 


శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు. 

అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు. 

ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేకపోయారు. 


వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు. 


ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు.. మంచి శిక్షణ పొందారు. 


కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు 


ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు.. చేసేవాళ్లం'' అని శర్మనుద్దేశించి అన్నారు. 


శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయశర్మని రక్షించుకోలేకపోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. 'అంక విద్యాసాగర' విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు! 


నిజానికి... ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు... 

ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో!

🎊🙏🏻🙏🏻🙏🏻🎊


( చరిత్రలో   తెలుగు వాడు......)

[01/10, 10:19 pm] . Mallapragada: సప్తవర్ణి...పంచమాత్రల సీసము పాట


కలమారె కధమారె .. కనువిందు చేయు మా

కలలాట నిజ మాయె.. వింత రగడ


మదిలోన మాయేను... మనువాడ మన్నాది

కధలాగ కదిలే ను ... కనికరం గాను లే

విధి ఆట అయ్యేను... వింతగా నిజ మాయె

మదిలోన పలుకులే... మనసు లాయె


కలలన్ని తీరును లె... కావ్యమై కదిలే ను

గలుగు లే సుఖములు .. కలుసునే కరములు

తలపులే సహజమే.. తపనలే తీరునే

మలుపు లే హృదయాన...మేలు కొలువు


ఒకరికి ఒకరుగా నె ... ఒకటి గా వెలుగులే

మకుటము కొరకు లే.. నువ్వు లతొ నావలే

సుఖము ల రోజులే..  సహనపు ఆటలే

సకలము సృష్టి యే... సుఖము చాలు


....

విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ


(((())))

రమణీయం శుభమేగ సమ్మతము సంరంభం సౌందర్య మే

గమనాలే సుఖమేలు విశ్వ జన సాంగత్యం సాహిత్య మే

మమకారం నిజమేలు సర్వ సహ సామాన్యం గా ప్రేమయే

[01/10, 10:22 am] . Mallapragada: ఉత్పలమాల 


నీకును నీడయే నిజము నిర్ణయ మవ్వుట కార్యసాధనమ్ 

నాకును బత్కులో నిజము నాణ్యత తెల్పుట ధర్మసాధనమ్ 

నేకము అవ్వుటే నిజము నేర్పుయు కల్గుట యుక్తి సాధనమ్ 

సోకము కల్గుటే నిజము సేవల పల్కులు నోట్ల సాధనమ్

[01/10, 10:42 am] . Mallapragada: శార్దూలం 


క్షేమమ్మే విజయం పరంగ వినయం క్షామమ్ము లేకుండుటన్  

ప్రేమమ్మే ప్రణయం ప్రమాద విదితం ప్రాధాన్య సాహిత్యమే 

కామమ్మే మనలో సుఖాన్ని సలిపే కల్లోల జీవత్వమే 

శ్రీమాతే  మనలోన మనసై  శ్రీ రక్ష గానుండుటన్

[01/10, 10:59 am] . Mallapragada: కందపద్యము 


నీదు మొగము చెమట లొత్తి 

నాదు కళలను కవ్వింపు లేని నటన నాడిగా 

కాదు లేదను నేతల పలుకు  

చేదును జనులలొ సృష్టించెదననగా

[01/10, 11:12 am] . Mallapragada: చంద్రిక 


నీడ నిన్నుగాను నీదు గుర్తుగాను తెల్పుచుండు చుండెఁ 

నాడి పట్టు చూడు నాలొ రోగమంత తెలియ గల్గు చుండెఁ 

నేడు అన్నమాట నేత నేర్పు మాట నీటి లోన తేలు 

ఆడినోడువోడు  ఆట మరు చున్న ఆశ లేని వాడు

[01/10, 11:42 am] . Mallapragada: సీస పద్యము 


నీ మోము నీ గాము నీ మోవి నీ తావి 

ని సౌరు ని తీరు నీకు తగును 

నా గుట్టు నా బెట్టు నా పాట నా పట్టు 

నా చెల్మి నా తాల్మి నాకు దగును 

నీ చనుల్ నీ కనుల్నీకౌను నీ మేను 

నీ తొడ ల్నీనడల్ నీకు దగును 

నా తల్కు నావెల్గు నా నీటు నా మోటు 

నాహోయల్ నాలయల్ నాకు దగును    

  

తేటగీతి 


నేను తగినట్టు పురుషుండు నేను నీకు 

మంచి తో నుండి నోడితి మేను  నీకు 

దగిన వాడుగా నేనుకా దలచె చాలు 

వలచి వేడుక చాలును వద్దు అనకు 


((()))

[01/10, 12:55 pm] . Mallapragada: నేటి సమస్యా పూరకం --- ప్రాంజలి ప్రభ 


మనముగ కల్సి కోరుట సమాన మనస్సు యశస్సు సౌఖ్యముల్ 

వినయము గాను పల్కియు నవాభ్యు దయాన నె శాంతి కల్గుటన్ 

ఋణమును తీర్చిభాగ్యముయె రాగము యుక్తి యుశక్తి  నిచ్చుయౌ

వనమున సంతతిన్,బడయువానికి గల్గును సౌఖ్యముల్ గడున్

[01/10, 2:29 pm] Chaganti: "కర్మ   కర్మణా   నశ్యతి"


గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది... వెంటనే గంగానదినే అడిగాడట.


"అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు.  మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ... అని. 


అందుకా తల్లి  "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను"  అని బదులిచ్చిందట. 


వెంటనే, అయ్యో  అన్ని పుణ్యనదులు ఇంతేకదా... పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని... సముద్రాన్నే అడిగాడు...ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని... దానికా సముద్రుడు 


నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట. 


అరే ... ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది... అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు... ఈ పాప భారాన్ని అని అడగగా... అవి పకపకా నవ్వి  'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా...


ఓహో...ఆ పాపాలన్నీ మన  మీద పడి లేదా తాగుతూ, మనమే అనుభవిస్తున్నామన్నమాట. 

కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట.


ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః 

ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే.


పరమశివుడు, పార్వతీదేవి కి ఉపదేశించిన శ్లోకమిది. 

ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. 

ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?...అని ఈ శ్లోకం అర్థం.


కర్మ కర్మణా నశ్యతి.... అనగా,  కర్మ కర్మతోనే నశిస్తుంది.

[01/10, 6:24 pm] . Mallapragada: వృద్ధుల దినోత్సవం.సందర్భముగా 

నేటి కవిత 

నేటి  పరిస్థితి లో వృద్ధులు


తేగలో చంద మామగా 

నీటిలో బుడగ తేలుట 

చినిగిన బతుకు కాగితం 

పెద్ద వయసులో బతుకంత


క్రొవ్వువత్తి గను కరిగేను 

చినిగిన బతుకు నీడలా 

కళ్ళజోడు తొ కఱ్ఱ తోడు 

అరిగిన చెప్పుల జోడు 


ఉడిగిన ఆకులా కలిగి  

నలిగిన పూలుగా మిగిలె  

విరిగిన కొమ్మలా ఒరిగె    

మాగిన పండులా మిగిలె 


బట్ట తలగాను బతకగా  

వాడిన బొట్టు వాడక 

ఈనాటి వృద్ధుల లీల 

ప్రేమలు వెల్లువ కళలు 


దర్జాగా బ్రతక లేకయే 

దగ్గుతూ మింగుతూ బతుకె 

వ్యర్ధ పదార్దము కాదు 

సలహాల తండ్రిగా తోడు 


మంచిరోజులు నిండు వెలుగు 

ప్రేమతో తాత పలుకులు 

స్వార్దము లేని జీవియే 

ఆదుకునే పెద్ద తరముయే 

 

మనసు పెట్టి చూడ గలుగుటే  

చిన్న పిల్లల లాగుండు 

ఆరోగ్యమే రక్ష సలుపు 

మానవత్వమును నిల్పవలె 


వృద్ధులందరికి పాదాభి వందనాలు 

మీరే మాసంపద మా మనోధైర్యం 


--((())--


No comments:

Post a Comment