Friday, 20 February 2026

22-24

 [12/11, 9:12 am] . Mallapragada: _*కార్తీక పురాణం - 22 వ అధ్యాయము*_


 *పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*


☘☘☘☘☘☘☘☘☘


మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.

పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి , శ్రీహరిని గానముచేసి , సాష్టాంగ నమస్కారము చేసి , సూర్యోదయముకాగానే నదికిపోయి , స్నానమాచరించి తన గృహమున కెగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి *"రాజా ! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని , యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము , నీ రాజ్యము నీకు దక్కును"*, అని దీవించి అదృశ్యుడయ్యెను. *"ఈతడెవరో మహానుభావునివలె ఉన్నారు అని , ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక , శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా !*


ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి *"పురంజయా రక్షింపుము రక్షింపు"* మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా ! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా *'శ్రీ హరి'* అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా ! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా !


హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగరం ఉద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు , అంబరీషుడు , శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు , భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండును.


శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి , వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు , నిరాకారుడు , నిర్వికల్పుడు , నిత్యానందుడు , నీరజాక్షుడు , పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావింశోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.*


******

[13/11, 9:36 am] . Mallapragada: _*కార్తీక పురాణం - 23 వ అధ్యాయము*_


*శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట*


అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి *"ఓ మునిపుంగవా ! విజయమొందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"* మని అడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కుంభసంభవా ! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము , శత్రుశేషము వుండకూడదని తెలిసి , తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు , పవిత్రుడు , సత్యదీక్షాతత్పరుడు , నిత్యాన్నదాత , భక్తప్రియవాది , తేజోవంతుడు , వేదవేదాంగవేత్తయై యుండును. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై , విష్ణు సేవాధురంధరుడై , కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల ? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు , సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున , యే కాలమున , యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా ? యని విచారించుచుండగా  ఒకానొకనాడు అశరీరవాణి *"పురంజయా ! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు"* అని పలికెను.


అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని , రాజ్యభారమును మంత్రులకు అప్పగించి , సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు , ఆయా దేవతలను సేవించుచు , పుణ్యనదులలో స్నానము చేయుచు , శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యముపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది , చేతులు జోడించి , *"దామోదరా ! గోవిందా ! గోపాలా ! హరే ! కృష్ణా ! వాసుదేవా ! అనంతా ! అచ్యుతా ! ముకుందా ! పురాణపురుషా ! హృషికేశా ! ద్రౌపదీమాన సంరక్షకా ! దీనజన భక్తపోషా ! ప్రహ్లాదవరదా ! గరుడధ్వజా ! కరివరదా ! పాహిమాం ! పాహమాం ! రక్షమాం రక్షమాం ! దాసోహం పరమాత్మ దాసోహం"* యని విష్ణు సోత్త్రమును పఠించి , కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల , మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో , పాడిపంటలతో , ధనధాన్యాలతో , ఆయురారోగ్యములతో నుండిరి.


అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహా గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై , రాజనీతి గలవారై , వైరిగర్భ నిర్బేదకులై , నిరంతరము విజయశశీలురై , అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ , పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము , విశాల కటిత్వము , సూక్ష్మ మద్యత్వము , సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు , శీలవతులనియు , గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.


ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై , ప్రౌఢలై , వయోగుణ రూప లావణ్య సంపన్నలై , సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.


పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు , కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని , తన కుమారునికి రాజ్యభారము అప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున , ఓ అగస్త్యా ! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి , చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము - ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తము.*


****

[14/11, 7:09 am] . Mallapragada: [

*🚩కార్తీక పురాణం - 24 వ అధ్యాయము🚩*_


*అంబరీషుని ద్వాదశి వ్రతము*



అత్రి మహాముని మరల అగస్త్యునితో *"ఓ కుంభసంభవా ! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ , యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.*


*"గంగా , గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందువలనను , సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.*


*కార్తీక శుద్ధదశమి రోజున , పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావధానుడవై అలకింపుము"* అని ఇట్లు చెప్పుచున్నాడు.


పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి , ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన , తొందరగా స్నానమున కేగిరమ్మనమని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. *"ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీ ఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల , హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు , భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక , ఈ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు."* అని అలోచించి *"బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగట్టగలరు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"* దని , సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.


*"ఓ పండిత శ్రేష్టులారా ! నిన్నటి దినమున ఏకాదశి యగుటం జేసి నేను కటిక ఉపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి ఇంతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా ? లేక , వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా ? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన"* దని కోరెను. అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు , ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని , దీర్ఘముగా అలోచించి *"మహా రాజా ! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము , నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు , దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు , ఇంటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును , మహతపశ్శాలియు , సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను"* అని విశదపరచిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.*


🙏

25-27

 [15/11, 11:00 am] . Mallapragada: _*🚩కార్తీక పురాణం - 25 వ అధ్యాయము🚩*_


*దూర్వాసుడు అంబరీషుని శపించుట*


☘☘

*"అంబరీషా ! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ అనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము"* అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు *"ఓ పండితోత్తములారా ! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్న , విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును ? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన , జలపాన మొనరించి వూరకుందును"* అని వారి ఏదుటనే జలపానము నొనరించెను.


అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ *"ఓరీ మదాంధా ! నన్ను భోజనానికి రమ్మని , నేను రాకనే నీవేల భుజించితివి ? ఎంత దుర్మార్గము , ఎంత నిర్లక్ష్యము ? ఎంతటి ధర్మ పరిత్యాగివి ? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన , నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు ?   శ్రీ హరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా ! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా ! నీ వంశము కళంకము కాలేదా?"* అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు , ముని కోపమునకు గడ గడ వణుకుచు , ముకుళిత హస్తములతో *"మహానుభావా ! నేను ధర్మహీనుడను , నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ , దయా దాక్షిణ్యములు గలవారూ కాన , నన్ను కాపాడు"* డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని *"దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను , రెండవ జన్మలో తాబేలుగానూ , మూడవజన్మలో పందిగాను , నాలుగవ జన్మలో సింహముగాను , ఐదవ జన్మలో వామనుడు గాను , ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను , ఎ ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను , ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను , తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను , పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక"* అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా , శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని , తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి *"మునివర్యా ! అటులనే - మీ శాపమనుభవింతు"* నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా , శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి *"బ్రతుకుజీవుడా"* అని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను , దేవలోకమునకు వెళ్లి దేవేంద్రుని , బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని , కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ ఎంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. 


*ఇట్లు స్కాంద పురాణాంర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

[16/11, 7:43 am] . Mallapragada: _*🚩కార్తీక పురాణం - 26 వ అధ్యాయము🚩*_


*దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ*


ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి , మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.


ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము , భువర్లోకము , పాతాళలోకము , సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి *"వాసుదేవా ! జగన్నాథా ! శరణాగతరక్షణ బిరుదాంకితా ! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి ! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"* దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"దూర్వాసా ! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా ! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో , దేవ , బ్రాహ్మణ , సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని , అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చికూడ , నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి , నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను ! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని , పవిత్రతకును చేయదగినదే కదా ? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే ? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని , తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి , దయాశాలి , ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.


అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము , సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి , ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప , యదువంశమున శ్రీకృష్ణునిగను , కలియుగమున బుద్దుడుగను , కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట *"కల్కి"* యను పేరున జన్మించి , అశ్వారూడుండనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.*


🙏

[17/11, 7:51 am] . Mallapragada: _*🚩కార్తీక పురాణం - 27 వ అధ్యాయము🚩*_


*దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*


మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభ సంభవా ! ఆ శ్రీ హరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను.


*"ఓ దూర్వాసమునీ ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున , అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని , ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును , బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును , కాలితో తన్నినవాడును , విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును , విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన , ఓ దూర్వాస మహర్షి ! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు , విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి , నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును"* అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి    సప్తవింశోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.*

Tuesday, 17 February 2026

 

*శతపత్ర -9*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు


పదినిముషాలు ఇట్టే గడిచిపోయాయి.


రెండు సూట్ కేస్ లతో సమీక్ష టాక్సీ దిగింది. నవ్వులు, కేరింతలు ఒకరినొకరు ఆప్యాయం గా పలకరింపులు, సమీక్ష చాలా ఉత్సాహం గా ఉంది. లండన్ వదిలి వెళ్ళిపోతున్న ఆనందం ఆమెలో కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. అమ్మాయిలంతా ఆమె బావ గురించి జోకులు పేలుస్తున్నారు. వాళ్ళకి నవ్వుతూ కౌంటరిస్తోంది సమీక్ష. 


ఈ హడావుడి మధ్యలో ఓ కొత్త గొంతు- "హలో సూసైడ్ కేస్. హౌ ఆర్ యూ?" అంటూ పలకరించింది. సుపరిచితమైన గొంతు సడన్ గా వెనుక నుండి వినబడగానే ఉలిక్కిపడుతూ తిరిగి చూసింది శతపత్ర.


ఎరుదుగా రుద్రపాద.


తన సూట్ కేస్, ఎయిర్ బ్యాగ్ లను ట్రాలీ మీద తోసుకొస్తున్నాడు. అదే చిరునవ్వు. అదే హుషారు. మరింత స్మార్ట్, మరింత అందంగా కన్పిస్తున్నాడు. అదే ఫ్లయిట్ కి అతను కూడా ఇండియా వెళ్ళిపోతున్నట్టు న్నాడు.


కళ్ళు పెద్దవి చేసి పది సెకన్ల వరకు అలా అతడ్నే చూస్తూండిపోయింది శతపత్ర. అమ్మాయిలంతా ఆ అపరిచితుడ్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.


శతపత్ర తేరుకుంది. ఆమెకు ఒళ్ళు మండుతోంది. సూసైడ్ కేస్ అని పిలవటం మరింతగా మండించింది. దాంతో మరింత ఫైరయిపోయింది. 


“ఇడియట్... నేను... నేను సూసైడ్ కేసా? నువ్వే డ్రైవింగ్ డెవిల్. నువ్వు ఇక్కడ కూడా దాపురించాలా?" అనేసింది బిగ్గరగా.


అతనెవరో మిగిలిన యువతులకు తెలీదు. అతను శతపత్రను పిలిచి గొడవపడ్డం ఏమిటో అంతకన్నా తెలీదు. వారిలో విశ్వదా ఒక్కతే కొంత ఊహించగలిగింది. ఎలాగంటే నిన్న చీకటిపడే వేళ ఫోన్ చేసినప్పుడు జరిగింది ఆమెతో చెప్పింది శతపత్ర.


శతపత్ర రుసరుసలకు అతను బెదరలేదు. భయపడలేదు. ఆమెను మరింత టీజ్ చేస్తూ- “దాపురించలేదు మేడమ్. ఇండియా వెళ్ళిపోతున్నాను. ఇప్పట్లో నన్ను చూడాలన్నా లండన్ లో చూళ్లేవు” అన్నాడు.


"చూడాలన్న కోరికగాని, అవసరంగాని నాకు లేదు. యు కెన్ గో” అంది కటువుగా శతపత్ర.


"అబ్బో! నాకు మాత్రం నిన్ను చూడాలన్న కోరికగాని, అవసరంగాని ఉందా ఏమిటి? అయినా చూశావా? నిన్న రోడ్డు మీద కలుసుకున్నాం. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఇలా కలుసుకున్నాం. ఏదైనా రాసిపెట్టి వుంటే తప్పదమ్మడూ. అప్పుడప్పుడూ ఇలాగే కలుసుకుంటాం. కాని ఏ మాటకా మాట చెప్పుకోవాలి. యూ ఆర్ సో బ్యూటీఫుల్. కోపంలో మరింత అందంగా వుంటావ్ తెలుసా?” అన్నాడు.


"నాకు తెలుసులే."


"తేలీదేమో అనుకుని గుర్తుచేశానే... అయినా అమ్మాయిలంతా ఇలా గుంపుగా వచ్చారేమిటి? మిమ్మల్ని చూస్తుంటే ఇది లండన్ ఎయిర్ పోర్ట్ లా లేదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లా ఉంది. కొంపదీసి మీరంతా సామూహికంగా ఇండియాకు వలసరావటం లేదు గదా?'


"హలో! వలస రావలసిన ఖర్మ మాకేమిటి? మా మాతృభూషి ఇండియా” అంది నవ్వుతూ విశ్వదా.


"అలాగా. అయితే మాతృదేవిలందరికీ వందనం. ఈ అమ్మాయికి తప్ప. బైదబై అయామ్ రుద్రపాద. నా పేరు గుర్తుంటుంది గా?" అని శతపత్రని అడిగాడు.


“షటప్" కోపంతో ఉడికిపోతోంది శతపత్ర.


అమ్మాయిలంతా ఆ ఇద్దరి గొడవను ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నారు. ఆమెను మరింత ఉడికిస్తూ- "అయితే మీరంతా ఇండియా వచ్చేస్తున్నారన్న మాట" అన్నాడు.


"మేం రావటం లేదు. నువ్వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్ కి సెండాఫ్ ఇవ్వటానికొచ్చాం" అంది సీరియస్ గా శతపత్ర.


“అదా సంగతి. ఓకె” నాకు సెండాఫ్ ఇవ్వటానికి ఎవరూ రాలేదు. పనిలో పనిగా నాకు కూడా మీరందరూ సెండాఫ్ ఇస్తే సంతోషిస్తాను" అన్నాడు రుద్రపాద.


“నువ్వెళ్ళిపోతే సంతోషిస్తాను.”


“వెళ్తాలే... నూరాకులూ...”


"ఏయ్.. హోల్డ్ యువర్ టంగ్..." అంటూ హెచ్చరించింది శతపత్రి. అమ్మాయిలంతా నవ్వారు.


“నూరాకులేమిటి? మేనర్స్ తెలీదా? నా గురించి నీకు తెలీదు" అంటూ హెచ్చరించింది శతపత్ర.


అయినా అతను జంకలేదు. అదే చిరునవ్వు. “హలో... సంస్కృతంలో శతపత్ర అంటే అచ్చతెలుగులో నూరాకులు అని అర్థం. మీరే చెప్పండి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? భాష వేరైనా భావం ఒక్కటే. అవునో కాదో నీ ఫ్రెండ్స్ ని అడుగు."


విసుగ్గా చూసింది శతపత్ర. “మిస్టర్ రుద్రపాద... నా పేరు శతపత్ర దాన్ని నూరాకులని, హండ్రెడ్ లీవ్స్ అని రకరకాల భాషల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నాతో గొడవపడాలనే వచ్చావా?” అంది.


"లేదు. ఫ్లైట్ ఎక్కాలని వచ్చాను”


"వెళ్ళి ఎక్కు.. న్యూసెన్స్ చేస్తే మర్యాదగా వుండదు. ఐ హేట్ యు" అంది. 


“నేనూ ఐ టూ హేట్ యూ అనే చెప్తాను. ఐ లవ్ యూ అని అస్సలు చెప్పను."


"వాట్?" మరోసారి కళ్ళింతలు చేసి నోరు తెరిచి అలా చూస్తూండిపోయింది శతపత్ర. ఇంత మొండి మనిషిని తనింతవరకు ఎక్కడా చూళ్ళేదు. కొంచెం కూడా బెదురు, భయం లేవు. నోటికొచ్చింది వాగటమే పనిలా వుంది.


"మరీ ఆశ్చర్యపోకు డియర్. నువ్విన్నది కరక్టే. ఈ అమ్మాయిలంతా సాక్షి, ఐ లవ్ యూ అని చెప్పనంటున్నాను. ఇంకెందుకు కోపం?


"చాలా అందంగా వున్నావ్. ఏం లాభం? అమ్మాయికి ఇంతటి గయ్యాళితనం ఉండకూడదు. కొంచెం కోపం తగ్గిస్తే మంచిది. నీ ఉడ్ బి సుఖపడతాడు" గడగడా ప్రవాహంలా మాట్లాడేస్తున్నాడు రుద్రపాద. శతపత్ర కౌంటర్ ఇవ్వటానిక్కూడా అతను అవకాశం ఇవ్వలేదు.


"అయినా ఏమిటిది? మనం మనం తెలుగు వాళ్ళం. ఇలా లండన్ ఎయిర్ పోర్ట్ లో గొడవపడ్డం ఏమిటి? ఎనీవే బ్యూటీ... నిన్న యాక్సిడెంట్ లో కలిశాం. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో... ఏమో... మళ్ళీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుస్తామో... దేవుడా... ఇంకెప్పుడూ ఈ పెంకిపిల్ల నాకు ఎదురుపడకుండా చూడు" అంటూ పైకి చూసి లెంపలేసుకుని తన దారిన ట్రాలీలో ముందుకెళ్ళిపోయాడు రుద్రపాద. అమ్మాయిలంతా శతపత్రని కాస్సేపు టీజ్ చేసేవాళ్ళే. కాని అంతలోనే బోర్డింగ్ కి అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే అమ్మాయిలంతా సమీక్షకు బై చెప్పారు.


అంతా ఆప్యాయంగా సెండాఫ్ ఇస్తుండగా తన లగేజీతో వెళ్ళిపోయింది సమీక్ష.


అంతవరకూ అక్కడే ఉన్నాడు రుద్రపాద. సమీక్ష వెళ్ళగానే వెనకే తనూ బైలుదేరాడు. సెక్యూరిటీ చెక్ లోకి ఎంటరవుతూ తిరిగి చూసి శతపత్రవైపు చిరునవ్వుతో చేయి ఊపాడు.


తనకు తెలీకుండానే చిరునవ్వు నవ్వి చేయి ఊపింది శతపత్ర. అది గమనించిన అమ్మాయిలు టీజ్ చేయటం ఆరంభించారు. ప్లయిట్ టేకాఫ్ తీసుకునే వరకు నవ్వులు, కేరింతలతో అమ్మాయిలంతా అక్కడే లాంజ్ లో ఉన్నారు. కాస్సేపటికి సమీక్ష ప్లయిట్లోంచి శతపత్ర సెల్ కి ఫోన్ చేసింది.


“సమీక్ష...అంతా ఓకేనా? సీట్ కంఫర్టబుల్ గా ఉందా?" అడిగింది శతపత్ర. 


“అంతా ఓకేగాని నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను" అంది సమీక్ష.


"ఇదిగో ముందే చెప్తున్నాను. మీ పెళ్ళి తాలూకు వీడియో, సీడీ ఒకటి మాకు పంపించటం మర్చిపోవద్దు."


"ఓ.కె శతా... అలాగే పంపిస్తాగాని నీ శత్రువు రుద్రపాద లేడూ?"


"వాడి సంగతి ఎందుకే?”


"ఎందుకంటావేమిటే... ఆ దుర్మార్గుడు ఇప్పుడు నా పక్క సీట్లోనే ఉన్నాడు" గుసగుసలాడుతున్నట్టు చెప్పింది సమీక్ష. శతపత్ర త్రుళ్ళిపడింది.


అమ్మాయిలంతా స్పీకర్ ఫోన్లోంచి వాళ్ళ సంభాషణంతా వింటున్నారు. 


"ఓ మైగాడ్... వాడు నీ పక్క సీట్లో ఏమిటే? మాటలతోనే బోల్తా కొట్టించి నిన్ను లేపుకెళ్ళి పోతాడు వాడు. తర్వాత నీ బావ లబోదిబో మన్నా ప్రయోజనం ఉండదు" అని హెచ్చరించింది.


"రుద్రపాద చాలా మంచివాడు" అంది.


"నీకెలా తెలుసే?" 


"ఎలా ఏమిటే... అతనెవరనుకుంటున్నావు. నా కజిన్ బ్రదర్" అంది సమీక్ష.


"వాట్...?!" అని అరిచింది శతపత్ర.


కళ్ళు గిర్రున తిరిగి కిందపడుతుందేమో అన్పించింది. అమ్మాయిలంతా ఒకేసారి తెల్లబోయారు. అసలు పరిచయమే లేనట్టు అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ ఎంత నాటకం ఆడారు.


చటుక్కున శతపత్ర చేతిలోంచి ఫోన్ లాక్కుంది విశ్వదా, "ఏయ్.. ఏమే జోక్ చేస్తున్నావా? అతను కజిన్ అయితే కలిసి రావాలి. విడివిడిగా ఎలా వచ్చారే?" అనడిగింది.


"సారీ విశ్వదా! అక్కడ చెప్తే అన్నయ్య కోప్పడతాడని మీకు చెప్పలేదు. నిన్న ఎవరో అమ్మాయితో గొడవపడ్డానని, ఆ అమ్మాయి పేరు శతపత్ర అని చెప్పినప్పుడే నేను అనుమానించాను. అదే నిజమైంది. అన్నయ్య తన ఆఫీస్ పనిమీద పదిరోజుల క్రితం లండన్ వచ్చాడు. వాడి సొంత అక్క ఇక్కడే ఉన్నా వాళ్ళింట్లో దిగడు. ఏ వూరు వెళ్ళినా హోటల్లో దిగటం వాడి అలవాటు. నేను మా మావయ్య వాళ్ళింట్లో ఉంటున్నా ను. తెలుసుగదా. అందుకే విడివిడిగా ఎయిర్ పోర్ట్ కి వచ్చాం. సాధారణంగా అమ్మాయిలంటే దూరంగా ఉంటాడు అన్నయ్య. అలాంటిది శతపత్రతో కావాలని గొడవపడుతుంటే నేను కూడా సరదాగా చూస్తూ ఊరుకున్నాను. ఎనీవే. టీజ్ చేసినందుకు శతపత్రకి సారీ చెప్పమన్నాడు. శతా, ప్లీజ్ మా అన్నయ్య చెడ్డవాడు కాదు. ఓకే... బి హ్యాపీ బై..." అని అవతల లైన్ కట్ చేసింది సమీక్ష.


శతపత్ర మదిలో రుద్రపాద మెదిలాడు. ఆమెకు తెలీకుండానే గులాబీ పెదవుల మీద చిరునవ్వులు పూశాయి. టాక్సీకోసం ఎయిర్ పోర్ట్ బయటికి బయలుదేరారంతా.

🍁

*సశేషం*

*శతపత్ర -10*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



"నాన్సీ! వేరార్ యూ?” దేనికోసమో వెదుకులాడుతూ బెడ్రూమ్ లోంచి పెద్దగా భార్యను పిలిచాడు స్టీఫెన్ వార్నర్.


"అయాం ఇన్ ది కిచెన్. వాట్ హ్యాపెన్ డియర్?". సరిగ్గా అంతే రేంజ్ లో కిచెన్లోంచి వినవచ్చింది నాన్సీ గొంతు. అది పశ్చిమ లండన్ ప్రాంతం.


ఒక కెనాల్ ని ఆనుకొని వుంది రెండతస్తుల పాతకాలం నాటి బిల్డింగ్ ఒకటి. ఆ ఇంటి చుట్టూ అనేక పూలమొక్కలు, చక్కని లాన్ తో కూడిన ఆవరణ వుంది. ఎత్తైన కాంపౌండు వుంది. వెనకపక్క కెనాల్ విశాలమైంది. అందులో పెంపుడు బాతులు తిరుగుతుంటాయి. సాయంకాలం కెనాల్లో బోటింగ్ చాలా సరదాగా ఉంటుంది.


కాంపౌండు మూలన గ్యారేజ్ లో ఓల్డ్ మోడల్ ఫోర్ సీటర్ ఫోర్డ్ కారు వుంది. స్టీఫెన్ వార్నర్ వయసిప్పుడు అరవై సంవత్సరాలు. ఆరడుగుల హైటు, తగిన లావుతో ఇప్పటికీ మనిషి చాలా దృఢంగానే ఉన్నాడు. మిగలపండిన జాంపండు రంగులో ఉంటాడు.


నిగనిగలాడే బట్టతల, చత్వారం కళ్ళజోడు ఆయన స్పెషాలిటీ. ఆయన భార్య నాన్సీ..... ఆమె వయసు ఏభై ఐదు సంవత్సరాలు. కాస్తలావుగా మీడియం హైట్ లో ఉంటుంది. వాళ్ళది ఆదర్శ దాంపత్యం. యూరోపియన్స్ దుస్తులు మార్చినంత సులువుగా డైవోర్స్ తీసేసుకుంటారు. అందుకే ఒక్కొక్కరూ ఐదారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్నాక జీవితాంతం కలిసి బతకాలనే సెంటిమెంట్ అక్కడలేదు.


కాని స్టీఫెన్ వార్నర్, నాన్సీలు తమ పెళ్ళయి నప్పట్నుంచి కలిసి కాపురం చేస్తూ ఆనందం గా ఉంటున్నారు. విడిపోవాలనే ఆలోచనే వాళ్ళకి ఎప్పుడూ రాలేదు.


ఆ దంపతులకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు అమెరికాలో ఇంజనీర్ గా సెటిలయ్యాడు. ఒక కొడుకు బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా చేస్తున్నాడు. కూతురు డాక్టర్. జర్మనీలో ఉంటోంది. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్నారు. మనవలు, మనవరాళ్ళు ఉన్నారు. ఆ పాత ఇల్లు అమ్మేసి తమ వద్దకు వచ్చేయమంటారు కొడుకులు. కాని ఆ ఇల్లు, ఆ వాతావరణం అంటే ఆ దంపతులకు ప్రాణం. అందుకే ఇక్కడే ఉంటున్నారు.


వీరితోపాటు అక్కడ సూజీ అనే ముసలి కుక్క కూడా ఒకటి వుంటోంది.


అంత ఎత్తున, నల్లగా భూతంలా ఉండే ఆ కుక్కని కొత్తవాళ్ళు చూస్తే జడుసుకుంటారు. వేళకు వచ్చి తినటం, వెళ్ళి తన డాగ్ హౌస్ లో నిద్రపోవటం ఇదే దాని పని. అది మొరిగిన సందర్భాలు చాలా తక్కువ. పగలు లోపలకు ఎవరు వచ్చి వెళ్ళినా పట్టించుకోదు. రాత్రిపూట వచ్చారో, వాళ్ళ అంతు చూడకుండా వదలదు. అయితే ఆ ఇంటి గురించి తెలిసినవాళ్ళెవరూ లోపల అడుగుపెట్టడానికి సాహసించరు. దానికో కారణం ఉంది.

📖


స్టీఫెన్ వార్నర్ ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నాడు. క్వీన్ విక్టోరియా మెమోరియల్ లైబ్రరీ చీఫ్ ఇన్ఛార్జ్ ఆయన. అతి పెద్దదైన ఆ లైబ్రరీలో అనేక విభాగాలున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన అతి ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. సుమారు పాతికమంది లైబ్రేరియన్లుగా అందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ హెడ్డు స్టీఫెన్ వార్నర్. ఆ లైబ్రరీలో ఏ భాషలో, ఏ గ్రంథం ఎక్కడ ఉందో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు. పరిశోధనకు తమకు అవసరమైన గ్రంథాల కోసం ఔత్సాహికులు ఆయన్ని సంప్రదిస్తుంటారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఆయన చిరపరిచితుడు.


అటువంటి స్టీఫెన్ వార్నర్ లైబ్రరీకి బయలు దేరుతూ తన బ్రీఫ్ కేస్ కనపడక భార్యని సాయం కోసం పిలిచాడు. “నాన్సీ. ప్లీజ్ కమ్ హియర్?" అనరిచాడు పెద్దగా.


"ఏమిటి స్టీఫెన్. ఏమిటి హడావుడి?” అంటూ కిచెన్లోంచి గబగబా బయటికొచ్చింది నాన్సీ.


"నా బ్రీఫ్ కేస్.... ఇక్కడే పెట్టాను రాత్రి. ఇప్పుడది కన్పించడంలేదు ఏమైంది?" రిపోర్ట్ చేశాడు.


"ఎందుకు ఇక్కడ పెట్టారు? ఎన్నిసార్లు చెప్పాను. బీరువాలో పెట్టి తాళం వేయమని.. ఈ పిల్ల దెయ్యాలతో పెద్ద చావొచ్చింది. ఏది కనపడ్డా ఉంచవు. 'అవే తీసుండాలి. ఉండండి చూస్తాను" అని వెదకటం ఆరంభించింది నాన్సీ- 


పిల్ల దెయ్యాలంటే ఆ ఇంట్లో చిన్నపిల్లలు 

ఉన్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె చెప్పింది నిజంగా పిల్లదెయ్యాలే. ఆ ఇంట్లో వాటి అల్లరీ అంతా ఇంతా కాదు. వీటి గురించి తెలిసినవాళ్ళు ఎవరూ అనుమతి లేకుండా పొరపాటున కూడా ఆ కాంపౌండ్లోకి అడుగుపెట్టరు. నాన్సీ హెచ్చరికతో ఇది ఎవరి పనో స్టీఫెన్ కి అర్ధమైపోయింది.


"ఏయ్ క్రిష్ట, రోసీ... ఎక్కడున్నార్రా?” అంటూ గబగబా మెట్లెక్కి పైఅంతస్తులోకి వెళ్ళాడు.


అతను లోపల అడుగుపెడుతుండగానే దఢాలున ఏదో కిందపడ్డ చప్పుడైంది. వాళ్ళిద్దరూ పైనే ఉన్నారని, పైగా వాళ్ళకి కోపం వచ్చిందని వార్నరికి అర్థమైపోయింది. డ్రాయింగ్రూమ్లోకి వచ్చి చుట్టూ చూశాడు. కార్నర్లోని ఫ్లవర్ వేజ్ కిందపడి ఇంకా దొర్లుతోంది. “మంచి పిల్లలు ఇలా అల్లరి చేయరు. డూ యు నో దట్. కమాన్" అంటూ ఫ్లవర్ వేజ్ తీసి యధాస్థానంలో ఉంచాడు.


“నాకు లైబ్రరీకి వెళ్ళే టైమైంది. మీరిలా నా బ్రీఫ్ కేస్ దాచేస్తే ఎలా పిల్లలూ... ప్లీజ్.... మీరు మంచి అమ్మాయిలని నాకు తెలుసు. కమాన్ ప్లీజ్...” పిలిచాడు.


పక్కగదిలో అలికిడైంది. అతడి బ్రీఫ్ కేస్ గాల్లో తేలుతూ నెమ్మదిగా దగ్గరకొచ్చింది. దాన్ని అందుకుని టేబిల్ మీద ఉంచి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. "మీకెందుకు కోపం వచ్చింది? నాకు తెలియాలి కదా. అంకుల్ తో అబద్ధమాడకూడదు. ఓ.కె? మీరు నాకు కన్పిస్తే సంతోషిస్తాను” అన్నాడు. మరుక్షణం అతని ఎదురుగా పొట్టిగౌన్లు ధరించిన ఇద్దరు అమ్మాయిలు ప్రత్యక్షమయ్యారు. ఒకమ్మాయి వయసు పదేళ్ళు ఉంటుంది. ఎర్రగా, బొద్దుగా, చాలా అందంగా ఉంది. రెండో అమ్మాయి వయసు ఎనిమిదేళ్ళు. చాలా అందంగా ఉంది. పెద్దమ్మాయి పేరు క్రిష్ట. రెండో అమ్మాయి పేరు రోసీ, ముద్దులు మూటగట్టేంత ముచ్చటగా ఉన్న ఆ పాపల్ని చూస్తే వాళ్ళు దెయ్యాలని ఎవరూ అనుకోరు.

📖


సుమారు ముప్ఫై సంవత్సరాల క్రితం మాట. అప్పట్లో ఆ కట్టడం థామ్సన్ షెప్పర్డ్ అనే పెద్దమనిషిది. థామ్సన్ దంపతుల పిల్లలు ఈ క్రిస్టీ, రోసీలు. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో ఆ దంపతులు యార్క్ షైర్ లో మృతిచెందారు.


అప్పటికి క్రిష్ట వయసు పదేళ్ళు. రోసీ వయసు ఎనిమిదేళ్ళు. యార్క్ షైర్ నుంచి మృతదేహాలు ఇంటికి తీసుకురాబడ్డాయి. తల్లిదండ్రుల భౌతికకాయల్ని చూసి ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. వాళ్ళకి బంధువులంతా వున్నా తాము అనాధలయి పోయినట్టు వారికి అర్థమైంది.


థామ్సన్ కి తమ్ముడు ఒకడున్నాడు. వాడి పేరు డేవిడ్. కర్మకాండలన్నీ ముగిశాక పిల్లలిద్దర్ని తన వద్దకు తీసుకెళ్ళి ఆ ఇంటిని అమ్మేయాలని చూశాడు. వాళ్ళు పారిపోయి వచ్చేసి అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు.


ఆ విధంగా వారసులు లేని ఆ కట్టడం థామ్సన్ తమ్ముడు డేవిడ్ పరమైంది.


అయితే అసలు సమస్య కూడా అప్పుడే మొదలైంది. మరణించిన పాపలిద్దరూ పిల్ల దెయ్యాలుగా మారి తెగ అల్లరిచేయటం ఆరంభించారు. వీటి గురించి తెలిసిన ఎవరూ ఆ ఇంటిని కొనటానికి ముందుకురాలేదు.


ఆ సమయంలో చవగ్గా వస్తున్న ఆ కట్టడాన్ని స్టీఫెన్ వార్నర్ కొనుక్కున్నాడు. తన పిల్లలు ముగ్గురితో సహా ఆ ఇంట్లో దిగాడు. మొదట్లో అవి వాళ్ళని చాలా భయపెట్టాయి. వండిన పదార్ధాలు పాడుచేసేవి. సీసాలకొద్దీ బీర్ తాగేసేవి. ఒకచోట ఉంచిన వస్తువుల్ని మరో చోట పడేసేవి. అతిధులు వస్తే అదరగొట్టేవి.

వచ్చినవాళ్ళు కూర్చొని వుండగా గ్లాసులు గాల్లో తేలుతూ వారి వద్దకి రావటం సోఫాలు తిరగబడడం, తినే వస్తువులు ఎగిరొచ్చి మీదపడడం లాంటివి కళ్ళముందు జరుగుతుంటే భయపడి పారిపోయారు.


అవి దెయ్యాలని తెలుసుకాబట్టి స్టీఫెన్ వార్నర్ నాన్సీలు క్రమంగా వాటిని బుజ్జగించి మచ్చిక చేసుకుని ప్రేమను పంచి తమ కుటుంబ సభ్యులుగా మార్చేసుకున్నారు. అవి కూడా అంకుల్, ఆంటీ అని పిలుస్తూ వారికూడా తిరగటం ఆరంభించాయి.

🍁

*సశేషం*

*శతపత్ర -11*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



స్టీఫెన్ వార్నర్ దంపతుల పిల్లలు ముగ్గురూ దెయ్యం పాపలతో ఆడుకున్నవాళ్ళే. వాళ్ళ కుక్క సూజీకి కూడా ఆ పిల్ల దెయ్యాలు మంచి దోస్తులు. పిల్లలు, పెద్దాళ్ళయి ఎవరి దారిన వారు వెళ్ళిపోవడంతో స్టీఫెన్ దంపతులకు ఆ పిల్లదెయ్యాలే గారాల బిడ్డలయ్యాయి. అవి అల్లరి చేయకపోతే వీళ్ళకి ఏమీ తోచదు. వాళ్ళు బతికుంటే ఈపాటికి సుమారు నలభైయ్యేళ్ళ వాళ్ళ య్యేవారు. వారు మరణించేనాటికి ఏ వయసులో ఉన్నారో ఇప్పటికీ అలానే చిన్నపిల్లల్లా ఉండిపోయారు.


క్రిష్టి, రోసీలు ఎదురుగా ప్రత్యక్షం కాగానే వాళ్ళని లేపి తన ముందు టేబుల్ మీద కూర్చోబెట్టుకుని ప్రేమగా చూశాడు స్టీఫెన్ వార్నర్.


"ఏమైందిరా మీకు అలక ఎందుకొచ్చింది" అంటూ అడిగాడు ఎంతో లాలనగా.


"సూజీ మాతో ఆడుకోవడం లేదు. దానికి బద్ధకం మరీ ఎక్కువయిపోతోంది. నువ్వు దానికి భయం చెప్పాలి అంకుల్" అంది క్రిష్టి.


“రాత్రి బీర్ తాగామని అంటీ తిట్టింది. అంటీ కి కూడా భయం చెప్పాల్సిందే” అంది మారాంగా రోసీ.


“ఇంతేనా... ఇంకేమన్నా ఉందా?"


"మాకు ఆడుకోడానికి బెలూన్లు తీసుకువస్తా నన్నావు. ఇంతవరకూ తీసుకురాలేదుగా. అందుకే మాకు బాగా కోపం వచ్చింది" అంది క్రిష్టి.


"అదా... సారీ డియర్. నిన్న పని ఒత్తిడి వల్ల మీ బెలూన్ల సంగతి మర్చిపోయాను. ఇవాళ తెస్తాను. ప్రామిస్" భరోసా ఇచ్చాడు స్టీఫెన్ వార్నర్.


“మరి... అంటీకి భయం చెప్పరా... బీరు తాగామని తిట్టిందిగా...” అంది రోసీ.


అంతలో నాన్సీ అక్కడికి వచ్చేసింది.


"ఏమిటే రిపోర్ట్ చేస్తున్నారు? బీర్ తాగితే తిట్టరా?... తెచ్చినవన్నీ మీరే తాగేస్తే ఊరుకోవాలా... మీరిలా చేస్తే ఇంట్లో ఒక్క బీర్ సీసా కూడా లేకుండా చేస్తానంతే. రాను రాను మీ అల్లరి మరీ ఎక్కువైపోతోంది” అనరిచింది.


"చూడు అంకుల్... ఎలా తిడుతుందో... నాకు కోపం వస్తోంది. ఆంటీని మెట్లమీంచి తోసేస్తాను" అంది రోసీ.


"తోస్తావా. వేలెడంత లేవు. నన్ను తోస్తారా, అంకుల్ అండ చూసుకుని మీరిద్దరూ మరీ పెంకిపిల్లల్లా తయారయ్యారు. ఏయ్ రోసీ. ఆగవే" అంటూ ముందుకొచ్చి రోసీని పట్టుకోబోయింది నాన్సీ.


చటుక్కున టేబిల్ పై నుంచి దూకి మూలకెళ్ళింది రోసీ. నాన్సీ వెంట పడ్డంతో గోడవెంట నడుచుకుంటూ పైకెళ్ళి సీలింగ్ నుంచి తల్లకిందులుగా వేలాడుతూ-


“ఆంటీ... రా మరి నన్ను పట్టుకో” అని అరిచింది ఉడికిస్తూ రోసీ, అది చూసి క్రిష్టీ, స్టీఫెన్లు పగలబడి నవ్వారు. నాన్సీ కూడా నవ్వేసింది.


వాళ్ళు కిందికి వచ్చేసరికి వారి కుక్క సూజీ ఆ దెయ్యం పిల్లలతో ఆడుకోడానికి సిద్ధంగా బంతిని తోసుకుంటూ వచ్చింది. దానివైపు వెళ్ళిపోయారు క్రిష్టీ, రోసీలు.


“తిడితే వాళ్ళు మరింత అల్లరి చేస్తారు. తెలుసుగదా వదిలెయ్ డియర్. నాకు టైమైంది. బయలుదేరుతున్నాను” అంటూ తన బ్రీఫ్ కేస్ తో బయటికొచ్చాడు స్టీఫెన్ వార్నర్. అతడి కారు వరకు వచ్చింది సాగనంపటానికి అతని భార్య నాన్సీ.


తన చిన్న ఫోర్డ్ కారు స్టార్ట్ చేశాడు స్టీఫెన్ వార్నర్. కారును బయటకు దూకించాడు. నాన్సీ బై చెప్పింది.


కారు గేటు దాటగానే వెళ్ళి గేటు మూసి వెనుదిరిగింది. అప్పటికే ఆవరణలో కొచ్చేసి బంతితో ఆడుకుంటున్నారు ముసలికుక్క సూజీతోపాటు క్రిష్టీ, రోసీ దెయ్యాలు.


నిజానికి బయటివాళ్ళు చూస్తే బంతితో ఆడుకుంటున్న సూజీ మాత్రమే కన్పిస్తుంది. క్రిష్టీ, రోసీలు కన్పించరు. వాళ్ళు స్టీఫెన్ దంపతులకు మాత్రమే కన్పిస్తారు.

📖


క్వీన్ విక్టోరియా మెమోరియల్ లైబ్రరీ. ఎందరో పాఠకులు లోపల సెక్షన్లలో కూచుని చదువుకుంటున్నారు. చీమ చిటుక్కుమన్నా విన్పించేంత నిశ్శబ్దంగా ఉంది.


ఉదయం సుమారు పదకొండు గంటల ప్రాంతం. లైబ్రరీ చీఫ్ స్టీఫెన్ వార్నర్ ఛాంబర్ డోర్ మీద చిన్నగా అలికిడి అయింది.


ఆ సమయంలో ఏవో లైబ్రరీ ఫైళ్లు చెక్ చేస్తున్నాడు స్టీఫెన్ వార్నర్. యధాలాపంగా ఫైల్ మూసి తలెత్తి డోర్ వంక చూశాడు. “యస్... కమిన్” అన్నాడు. చిన్నగా డోర్ తెరుచుకుని లోపలకొచ్చింది శతపత్ర.


"గుడ్ మార్నింగ్ సర్” అంది మర్యాదపూర్వకంగా.


“యస్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ యంగ్ లేడీ" అడిగాడు స్టీఫెన్ వార్నర్.


"సర్. ఐ వాంట్ సమ్ అమెరికన్ ఇంగ్లీష్ జర్నల్స్. బట్ దట్ సెక్షన్ లైబ్రేరియన్ నాట్ హెల్పింగ్ మి. ప్లీజ్ రికమెండ్ మి...” అని అడిగింది శతపత్ర.


“ఓకె. ఓకె... ఐ అండర్ స్టాండ్ యువర్ ప్రాబ్లం. గో దేర్” అన్నాడు స్టీఫెన్ వార్నర్.


"థాంక్యూ... థాంక్యూ సర్” అని శతపత్ర వెళ్ళిపోడానికి వెనుతిరిగింది.


"మిస్ శతపత్రా" పిలిచాడాయన.


"ఎస్సార్” అంటూ తిరిగి చూసింది.


"రామ్మా... వచ్చి ఇలా కూర్చో. నీతో మాట్లాడాలి” అన్నాడు.


త్రుళ్ళిపడింది శతపత్ర. తన చెవుల్ని నమ్మలేకపోయింది. ఏదో అద్భుతం చూస్తున్నట్టు ఆయన్ని చూస్తూండిపోయింది. ఆయన తెలుగు మాట్లాడుతున్నాడు.


ఒక యూరోపియన్ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాడు. గతంలో తమ సంభాషణంతా ఇంగ్లీష్ లోనే సాగేది. మాట వరసక్కూడా తనకు తెలుగు తెలుసని ఆయన ఎప్పుడూ చెప్పలేదు.


“మరీ ఆశ్చర్యపోతున్నట్టున్నావు" అంటూ మృదువుగా నవ్వాడు స్టీఫెన్ వార్నర్.


"మీ తెలుగుభాషకు మొదటి నిఘంటువు రాసిన బ్రౌన్ దొర మా ఇంగ్లీష్ వాడేనని గుర్తుంటే, ఇలా ఆశ్చర్యపోవు. నాకు తెలిసిన భాషలు పన్నెండైతే, అందులో నాలుగు ఇండియాకు చెందిన భాషలున్నాయి. సంస్కృతం, ఉర్దూ, హిందీ, తెలుగు చదవగలను. మాట్లాడగలను" అన్నాడాయన.


మంత్రముగ్దల్లా వెనుతిరిగి వచ్చి-ఆయన ఎదురుగా సీట్లో కూర్చుంది.


"నమ్మలేకపోతున్నాను సర్. మీరు ఇండియా ఎన్నిసార్లు వెళ్ళారు? అడిగింది.


"వెళ్ళటం ఏమిటమ్మా. నేను పుట్టి, పెరిగింది ఇండియాలోనే. అదీ మీ హైదరాబాద్ లోనే. నమ్మలేకపోతున్నావు కదూ? బ్రిటీష్ వలస పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత చాలా ఇంగ్లీష్ కుటుంబాలు ఇంగ్లాండ్ కి తిరిగి రాకుండా అక్కడే నివాసం ఉండిపోయాయి. వాళ్ళని ఆంగ్లోఇండియన్స్ అంటున్నాం. అలాంటి కుటుంబాల్లో మాదీ ఒకటి. మీకు స్వాతంత్య్రం వచ్చినప్పుడే నేను పుట్టాను. అప్పట్లో మేం హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. నా బాల్యం, చదువు అంతా హైదరాబాద్ లోనే గడిచింది.


నా ఇరవయ్యో ఏటకే ఇంగ్లీష్ తోపాటు సంస్కృతం, హిందీ, ఉర్దూ, తెలుగు అభ్యసించాను. చిన్నప్పట్నుంచి నాకు భాషలంటే చాలా అభిమానం. నా ఇరవై రెండో సంవత్సరం మా డాడీ పోయాక, మమ్మీ నేను తిరిగి ఇంగ్లాండ్ వచ్చేశాం. ఇక్కడికొచ్చాక ఫ్రెంచి, ఇటలీ, రష్యా, జర్మనీ ఇలా మరో ఎనిమిది భాషలు నేర్చుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ మా అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను.


నా ముప్ఫయ్యో ఏట ఈ లైబ్రరీలో ఒక సెక్షన్ కి లైబ్రేరియన్ గా ఉద్యోగం సంపాదించు కున్నాను. తర్వాత అనారోగ్యంతో మమ్మీ పోయింది. మరుసటి సంవత్సరం నాన్సీ అనే డచ్చి యువతితో లవ్ మేరేజ్ జరిగింది.


ఇండియాలో పుట్టి, పెరిగిన మూలంగా కావచ్చు వివాహవ్యవస్థ మీద నాకు ఎంతో గౌరవం. అందుకే ఇప్పటికీ నాన్సీ నేనూ హ్యాపీగా ఉన్నాం. భాషలమీద నాకున్న పట్టు, అనేక భాషలు తెలిసి వుండటం, విధి నిర్వహణలో నాకున్న ఏకాగ్రత- ఇవే నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టాయి. సో... తెలుగు నేలమీద పుట్టి, పెరిగిన నాకు తెలుగన్నా, తెలుగువాళ్ళన్నా ప్రత్యేక అభిమానం.


మా ఫ్యామిలీతో కలిసి ప్రపంచంలో అనేక ప్రదేశాలు చూశాం. కాని ఎక్కువసార్లు వచ్చింది ఇండియాకే. ఇప్పటికీ మా తల్లి తరపు బంధువులు ఇండియాలోనే వున్నారు" అంటూ ఆయన వివరిస్తుంటే చాలా ఆశ్చర్యానికి గురైంది శతపత్ర. ఏం చెప్పాలో, ఎలా అభినందించాలో కూడా అర్ధంకాలేదు అమెకు. 


"మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగానూ, ఆనందంగానూ ఉంది సర్" అంది ఉత్సాహంగా.


"థాంక్యూ మై చైల్డ్ నౌ కమ్ టు ది పాయింట్. మూడు మాసాలుగా నిన్ను చూస్తున్నాను. సెలవురోజు తప్ప నిత్యం నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్నో పుస్తకాలు చదువుతున్నావు. దేని గురించో తెలుసుకోవచ్చా?" అడిగాడు వార్నర్.


"ప్రత్యేకించి కారణం లేదు. జస్ట్ ఇంట్రెస్ట్. అంతే” అంది శతపత్ర నవ్వుతూ.


"నోనో... నా వద్ద దాచాల్సిన పనిలేదు. యూ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. దానికోసం లైబ్రరీలో అన్వేషిస్తున్నావు. యామై రైట్' ఆయన సూటిగా అడిగేసరికి మొదట కొంత సంకోచించింది. తర్వాత అవునన్నట్టు తలూపింది.


“దెన్... నా అంచనా కరెక్ట్. ఇప్పుడు నీక్కావలసిన ఇన్ఫర్మేషన్ ఏమిటని నేనడగను. ఎందుకంటే నీ డౌట్స్ తీర్చడానికో మనం ఫ్రీగా మాట్లాడుకోడానికో ఇది చోటు కాదు. లైబ్రరీ రూల్స్ ని మనం పాటించాలి గదా. ఓ పని చెయ్యి. రేపు హాలిడే. లైబ్రరీ ఉండదు. నేను మా ఇంటి దగ్గర ఫ్రీగానే ఉంటాను. మా ఆవిడ నాన్సీ నిన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది. రేపు ఉదయం తొమ్మిది గంటలకి మా ఇంటికి రా” అంటూ తన విజిటింగ్ కార్డు శతపత్రకి అందించాడు.


"థాంక్యూ సర్” అంది కృతజ్ఞతగా శతపత్ర.


"సో... రేపు వస్తున్నావుగా?” అన్నాడు.


"తప్పకుండా వస్తాను సర్. నాకు మీ హెల్ప్ కావాలి”


“ష్యూర్... రేపు మార్నింగ్ నీ లంచ్ మా ఇంట్లోనే... బైదిబై శతపత్రా ఒక ముఖ్య విషయం. తెలిసిన వాళ్ళెవరూ మా ఇంటికి రావాలంటే భయపడతారు. మరేం లేదు. మా ఇంట్లో చాలాకాలంగా రెండు దెయ్యం పిల్లలున్నాయి..." అన్నాడు స్టీఫెన్ వార్నర్.


"దెయ్యం పిల్లలా..." అంది నవ్వేస్తూ శతపత్ర.


ఆయన 'ఆశ్చర్యంగా చూశాడు.


"నీకు దెయ్యాలంటే భయంలేదుగదా?” అడిగాడు.


"లేదు సర్” అంది నవ్వాపుకుంటూ.


“దెన్ ఇట్స్ ఓకె.”


శతపత్రకి దెయ్యాలనగానే విశ్వదా ప్లాట్ వద్ద సిక్కు కుటుంబం ప్లాట్ లో పూర్ణిమా దయ్యం గుర్తుకొచ్చింది. అదేమిటో గాని పెద్ద దెయ్యమే తనని చూసి పారిపోయింది. ఇక ఈ పిల్ల దెయ్యాలెంత అన్పించింది.


"అవి భయపెడతాయా సార్?" అడిగింది.


“మేం ఇల్లు కొన్నప్పటికే అవిఅక్కడున్నాయి. ఎనిమిది, పదేళ్ళ ఆడపిల్లలు వాళ్ళు. అప్పటికీ, ఇప్పటికీ అదే వయసు వాళ్ళది. మేం వాటికి అలవాటు పడిపోయాం. తెగ అల్లరి చేస్తాయి. కొత్తవాళ్ళు వస్తే వాళ్ళని భయపెట్టాలని చూస్తాయి. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. మేం వుంటాం గదా. నువ్వు తప్పకుండా రావాలి" వివరించాడు స్టీఫెన్ వార్నర్.


"ష్యూర్ సర్. ఆ పిల్లదెయ్యాల్ని చూడడాని కైనా వస్తాను. థాంక్యూ సర్. వస్తాను" అంటూ లేచి బయటికి వెళ్ళిపోయింది శతపత్ర. ఆమె చెప్పిన లైబ్రేరియన్ కి ఫోన్ చేయటానికి తన ముందున్న టెలిఫోన్ సెట్ ని దగ్గరకు లాక్కున్నాడు లైబ్రరీ చీఫ్ స్టీఫెన్ వార్నర్.

🍁

*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*కథల ప్రపంచం* 

***

13/02, 11:43 am] . Mallapragada: *శతపత్ర -12*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



మరుసటి రోజు ఉదయం-


సరిగ్గా తొమ్మిది గంటలవేళ- శతపత్ర ఎలక్ట్రిక్ స్కూటీ స్టీఫెన్ వార్నర్ కాంపౌండ్ గేట్ ముందు ఆగింది. పెద్ద కెనాల్ సైడ్ కాలనీ అది.


ఎగువన బ్రిడ్జి దాటి వస్తున్నప్పుడే ఆ ప్రాంతాన్ని పరికించింది శతపత్ర. ఎవరో చిత్రకారుడు గీసిన అందమైన స్కెచ్ లా ఉందా కాలనీ. చక్కని పనితనంతో కూడిన పాతకాలం కట్టడాలతోపాటు అధునాతన భవనాలు కలగలసి వున్నాయక్కడ.


ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా పచ్చదనం, తెల్లగా పెద్ద పెద్ద వెన్నముద్దలు నీటిమీద తేలుతున్నట్టు కాలువలో విహరిస్తున్నాయి పెద్ద సైజు తెల్లబాతులు. కొందరు బోటింగ్ చేస్తున్నారు.


కాలువ వెంట ఉన్న ప్రతి ఇంటి పెరడువైపున బోట్లు వున్నాయి. ఆ కాలువలోకి మరబోట్ల కు అనుమతి లేదు. తెడ్లు ఉపయోగించే బోట్లే తిరగొచ్చు.


స్కూటీ సైడ్ స్టాండ్ వేసింది శతపత్ర.


గేటు తెరవబోతూ యథాలాపంగా లోపలకు చూసింది. లోపల నుంచి చిన్నపిల్లల నవ్వులు, కేరింతలు విన్పించటమే అందుక్కారణం. అలా లోపలకు చూసిన శతపత్రకు ఒక అద్భుత దృశ్యం కన్పించింది.


లోపల లాన్ మీద భూతంలా వున్న ఒక నల్లకుక్క ఫుట్ బాల్ సైజులోని ఎర్రటి బంతి కోసం అటూ ఇటూ పరుగులు తీస్తోంది. ఆ బంతి కాస్సేపు నేలమీద దొర్లుతోంది. వెంటనే గాల్లోకి లేస్తోంది. తానుగా అంత దూరం ఎగురుతోంది బంతి. అక్కడ ఎవరో ఉండి పట్టుకున్నట్టుగా గాల్లో నిలబడుతోంది బంతి. అటునుంచి రెండోవైపు ఎగురుతోంది.


ఆ బంతి వెంట పరుగు తీస్తోంది కుక్క. ఆడుకుంటున్న చిన్నపిల్లల నవ్వులైతే విన్పిస్తున్నాయిగాని. అలాంటి వాళ్ళెవరూ అక్కడ కన్పించటంలేదు.


ఆ బ్లాక్ డాగ్ స్టీఫెన్ వార్నర్ గారి కుక్క సూజీ అని, దెయ్యం పిల్లలని ఆయన చెప్పిన పిల్ల దెయ్యాలు ఆ కుక్కతో కలిసి బంతాట ఆడుతున్నాయని శతపత్ర గ్రహించింది. కానీ భయపడలేదామె. గేటు తీసి స్కూటీని లోపలకు తెచ్చి తిరిగి గేటు మూసింది.


స్కూటీ ఎక్కి అంతదూరంలోని ఇంటివైపు పోనిచ్చింది. మరోపక్క ఆ కుక్కను, బంతిని గమనిస్తూనే వుందామె.


సమీపంలోకి రాగానే పిల్లల ఆర్తనాదాలు విన్పించాయి. పిల్ల దెయ్యాలైన, క్రిస్టీ, రోసీలు శతపత్రను చూసి ఆట ఆపేశాయి. ఆమె సమీపంలోకి రాగానే అవి తట్టుకోలేక పెద్దగా అరుస్తూ బంతి పారేసి ఇంట్లోకి పారిపోయాయి. కుక్క సూజీ కూడా పెద్దగా మొరుగుతూ శతపత్ర స్కూటీ వెంటపడింది.


శతపత్ర పోర్టికోలో స్కూటీ దిగి వెనుతిరిగి కుక్కవంక చూసింది. ఆశ్చర్యం, అద్భుతం. మీదకు దూకేంత ఫోర్స్ తో వస్తున్న ఆ కుక్క ఒక్కసారిగా ఆగిపోయింది. పది సెకన్లు శతపత్ర కళ్ళలోకి చూసింది. అంతే. ఒక మానవాతీతశక్తిని చూసిన విధంగా ఎంతో వినయంగా నేలబారుకు సాగిలపడి తలదించుకుంది.


శతపత్ర దగ్గరకెళ్ళి దాని తల నిమిరింది. "గుడ్ బోయ్. గో... గో బ్యాక్" అంది.


ఆమె మాటల్ని ఆర్డర్ గా భావించినట్టు సూజీ చివ్వున లేచి తన డాగ్ హౌస్ వైపు పారిపోయింది. అంతలో స్టీఫెన్ వార్నర్ బయటికొచ్చాడు-

“రామ్మా ఎంతసేపైంది వచ్చి?” అంటూ ఆప్యాయంగా పలకరించాడు. 


"ఇప్పుడే వచ్చాను సర్. మీ డాగ్ సూజీ చాలా బాగుంది” అంది శతపత్ర.


"అది కొత్తవాళ్ళని చూస్తే పెద్దగా అరుస్తుంది. నిన్ను చూసి ఏమీ గొడవచేయలేదా?" ఆశ్చర్యంగా అడిగాడాయన.


"లేదు సర్. నన్ను పలకరించి తన డాగ్ హౌస్ కి వెళ్ళిపోయింది” అంది నవ్వుతూ శతపత్ర.


“విచిత్రంగా ఉంది. నీ దగ్గర ఏదో విశేషం ఉందమ్మా. సాధారణంగా మా సూజీ ఎవరినీ వదలదు. కమాన్...” అన్నాడు స్టీఫెన్.


ఇద్దరూ హాల్లోకి వచ్చారు. సరిగ్గా అప్పుడే కంగారుగా వచ్చింది నాన్సీ.


"ఏమైంది? పిల్లలిద్దరూ పారిపోయి పెరట్లో దాక్కున్నారు. ఆంటీ ఆమెను పంపించెయ్ అని అరుస్తున్నారు. నాకు ఏమీ అర్థం కావటంలేదు. ఎవరు ఈ అమ్మాయి?" అడిగింది శతపత్రను చూస్తూ.


“క్రిష్ట, రోసీలు ఎక్కడ?” స్టీఫెన్ అడిగాడు భార్యని.


"నేను వాళ్ళ గురించే చెప్తున్నాను. పెరట్లో కాలవవైపు దూరంగా పారిపోయారువాళ్ళు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు” మళ్ళీ అంది నాన్సీ.


అప్పుడు కల్పించుకుని- “ఆంటీ, నా పేరు శతపత్ర. సార్ కి శిష్యురాలిని. మీ క్రిష్ట, రోసీలు నన్ను చూసే భయపడి దూరంగా పారిపోయారు. నేను వెళితే కాని వాళ్ళు రారు" అంది. 


శతపత్రవైపు ఆశ్చర్యంగా చూసింది నాన్సీ.


"ఇట్స్ క్రేజీ. లోకంలో దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడ్డం ఏమిటి?” అంది నమ్మలేనట్టు.


"రాత్రి తాగిన బీరు కిక్కు దిగలేదేమో. వెళ్ళి పిలుచుకు రా...” అన్నాడు స్టీఫెన్ వార్నర్.


“నాకు తెలుసు సార్... నేను వెళ్ళిన తరువాత గాని అవి తిరిగి రావు" అంది శతపత్ర.


“ఓ మైగాడ్. అరచేతిలో గరుడరేఖ ఉన్నవాళ్ళను చూస్తే పాములు భయపడి పారిపోతాయని, పట్టుకున్నా ఏమీ చేయవని ఇండియాలో ఉండగా విన్నాను. నీ అరచేతి లో అలా ఏదన్నా రేఖగాని ఉందా ఏమిటి? ఈ కొంటె దెయ్యాలు నిన్ను చూసి అలా పారిపోవడం నాకు అర్థంకావడం లేదు" సీఫెన్ మరింతగా ఆశ్చర్యపోయాడు.


“నాకూ అర్థం కాలేదు సార్. కాని, ఒకటి రెండు అనుభవాలు అయిన తర్వాత అర్థమైంది ఎందుకో నేనంటే దెయ్యాలు భయపడతాయని" అంది శతపత్ర.


"నమ్మలేకపోతున్నాను. గత ముప్పై సంవత్సరాల కాలంలో క్రిస్టీ, రోసీలు ఇలా పారిపోవటం ఇదే మొదటిసారి. ఈ అమ్మాయికి మంత్రతంత్రా లేమన్నా తెలుసా?" అంది ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ నాన్సీ.


“సారీ ఆంటీ... నేను మంత్రగత్తెను కాను. ఎలాంటి మంత్రాలు నాకు తెలీదు. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలీదు" అంది నవ్వుతూ శతపత్ర.


భార్యకి శతపత్రని పరిచయం చేశాడు స్టీఫెన్ వార్నర్. నాన్సీ మంచితనం, ఆదరణ శతపత్రకు నచ్చాయి. స్టీఫెన్ వార్నర్ లాగే నాన్సీకి కూడా ఇండియన్స్ అంటే ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉన్నాయి. మంచితనానికి మారు పేరైన ఆ ఆదర్శ దంపతులతో కలిసి భోజనం చేయటం అదృష్టంగా భావించింది శతపత్ర.


తరువాత స్టీఫెన్ వార్నర్, శతపత్రలు మేడమీది డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు.


నాన్సీ ఉన్నంతసేపు వారి సంభాషణ ఇంగ్లీష్ లో సాగింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడుకోనారంభించారు.

📖


"నువ్విక్కడికి రావటం వలన నాకో కొత్త విషయం తెలిసిందమ్మా. దెయ్యాలకు నువ్వు శత్రువని” అంటూ నవ్వాడు స్టీఫెన్ వార్నర్.


శతపత్ర చిన్నగా నవ్వి ఊరుకుంది.


"ఒకటి కాదు రెండు కాదు. సుమారు మూడు మాసాలుగా లైబ్రరీలో కొనసాగుతోంది నీ అన్వేషణ దేనికోసం?" అంటూ సూటిగా అసలు విషయం లోకి వచ్చేశాడాయన. ఒకింత ఆలోచించింది శతపత్ర.


వెంటనే తన సమస్య చెప్పటం ఆమెకిష్టం లేదు. విన్నాక ఆయన ఎలా స్పందిస్తాడో తెలీదు. విని తేలిగ్గా కొట్టిపారేస్తే తనకే ప్రయోజనం ఉండదు. “సార్! మీకెప్పుడైనా కలలు వస్తుంటాయా?" అడిగింది.


“నాకూ కలలు వస్తుంటాయి. నాకే కాదు. కలగనని మనిషంటూ భూమ్మీద ఎవడూ ఉండడు. యూనొ... ఈ మధ్య పరిశోధనల్లో మనుషులకేకాదు ఏనుగులు, గుర్రాలు, చింపాంజీలవంటి జంతువులు కూడా కలల కంటాయని రుజువైంది" బదులిచ్చాడు.


"కలల మీద మీ అభిప్రాయం ఏమిటి?" అని వెంటనే అడిగింది శతపత్ర.


"అవి వస్తుంటాయి. పోతుంటాయి. వెరీ కామన్... వాటికి నీ సమస్యకీ సంబంధం ఏమిటి?” 


"సంబంధం ఉంది సార్. మీకొచ్చిన కలలు ఎప్పుడైనా నిజమయ్యాయా?" అడిగింది శతపత్ర.


"నీకో సంగతి తెలుసా? రాత్రి వచ్చిన కలని తెల్లవారేసరికి మర్చిపోతాన్నేను. ఇక నిజమయిందో లేదో ఎలా తెలుస్తుంది?" అన్నాడు స్టీఫెన్.


"నిజమవుతాయంటారా? మీ అనుభవంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదన్నారు సరే. మీ అభిప్రాయం ఏమిటి? కలలు నిజమయ్యే అవకాశం ఉందా?"


“నువ్వింత సీరియస్ గా అడుగుతున్నావు కాబట్టి నేను నా అభిప్రాయం చెప్తాను. నిజం వేరు. అనుభవం వేరు. చాలామంది తమ అనుభవానికి వస్తేనే ఏదయినా నిజమని నమ్ముతారు. ఉదాహరణకి చాలామంది దెయ్యాలు లేవని, ఉంటే చూపించమని మొండిగా వాదిస్తారు. మొదట్లో నేనూ నమ్మేవాడిని కాదు.


దెయ్యాలు నిజం కాదు. కేవలం భ్రాంతి, అదంతా అబద్ధం అనుకునేవాణ్ణి. కాని ఇప్పుడు? ముప్పయ్యేళ్ళ క్రితం ఈ ఇల్లు కొన్నప్పుడు ఇక్కడ ఉన్న చిలిపిపిల్ల దెయ్యాలు క్రిప్ట్, రోసీతో పరిచయం. ఇప్పటికీ మేము వాటితోనే సహజీవనం చేస్తున్నాం.


ఇంకా పది సంవత్సరాల తర్వాతగాని తమకి ముక్తి కలగదని ఓసారి క్రిష్టి నాతో చెప్పింది. ఏం చెప్పగలం... అప్పటివరకు మేము ఉండాలిగా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కలలు నిజమవుతాయా అంటే నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మనివాళ్ళు ఉన్నారు. అలాగని కలలన్నీ కూడా నిజం కావు. ఈ కలలమీద ఒక ప్రత్యేక శాస్త్రమే ఉంది.


కలలు రావటానికి అనేక కారణాలు చెప్తారు. సాధారణంగా మనం పగలు చూసిన దృశ్యాలు, సంఘటనలు వాటిలో మన మనసుకు బాగా హత్తుకున్నవి నిద్రలో మనకు కలగా వస్తాయంటారు. అలాగే తీరని కోరిక కూడా కలగా వచ్చే అవకాశం ఉందంటారు. ఉదాహరణకి ఒక మనిషికి విమానంలో ప్రయాణం చేయాలని సరదా అనుకుందాం. ఏవో కారణాలచేత అతని కోరిక తీరలేదు. ఆకాశంలో విమానం వెళుతుంటే ఆశగా చూస్తుంటాడు. అతనికి రాత్రిళ్ళు విమానంలో ప్రయాణం చేస్తున్నట్టు కలవస్తుంది. అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు తీరని కోరికలు ఏవైతే  ఉంటాయో అవి కలల రూపంలో తీరుతుంటాయన్న మాట.


అలాగే నిద్ర సమయంలో ఉండే మన మానసిక స్థితిని బట్టి ఆ కలయొక్క నిడివి ఆధారపడి వుంటుంది. ఒక్కోసారి అనేక సంఘటనల సమాహారంగా ఒకే కల తెల్లవార్లూ రావచ్చు. ఆ కలలు చిత్రవిచిత్రం గా రకరకాల మలుపులు తిరుగుతాయి.


ఇక కలలు నిజమవుతాయా అంటే, ఎక్కడో నూటికో కోటికో కొందరి కలలు మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది. కొన్ని కలలు వెంటనే జరగొచ్చు. కొన్ని ఆలస్యంగా జరగొచ్చు” వివరించాడు స్టీపెన్ వార్నర్.


అప్పటికీ శతపత్ర సమాధానపడలేదు.


"అర్థమైంది సర్. కానీ... ఒకే కల తిరిగి తిరిగి వస్తుంటే ఏమను కోవాలి?" అంది శతపత్ర,


నమ్మలేనట్టు చూశాడు స్టీఫెన్ వార్నర్.


"అలా వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ అలా వస్తోందీ అంటే ఆ కల తాలూకు ఆబ్జెక్ట్ ఏదో నిన్ను బాగా ఆకర్షించి ఉండాలి" అన్నాడు.


"ఆబ్జెక్ట్ కాదు సర్. నేను పుట్టి పెరిగాక ఎన్నడూ చూడని ఒక ఒంటరి ప్రదేశం అది" చెప్పింది.


"అర్ధం కాలేదు. ఎటువంటి ప్రదేశం అది?" స్టీఫెన్ లో ఉత్కంఠ తొంగిచూసింది. అందుకే వెంటనే అడిగాడు. ఆయనతో తన సమస్య చర్చించటానికే నిశ్చయించుకుంది శతపత్ర. గట్టిగా గొంతు సవరించుకుని ఆయనవంక చూసింది. 


"సార్. అదో విచిత్రమైన కల. ఇంతవరకూ ఎవరికీ చెప్పలేదు. మీరే ఫస్ట్ పర్సన్” అంది.


“ఫరవాలేదమ్మా చెప్పు. నాకు విషయం తెలియకుండా నీకు సాయపడలేను కదా" అని ప్రోత్సహించాడు స్టీఫెన్ వార్నర్.

🍁

*సశేషం*

[13/02, 7:11 pm] . Mallapragada: *శతపత్ర -13*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



“సుమారు పదిమాసాల క్రితం మొదటిసారి గా ఈ కల వచ్చింది-సాయంకాల సమయం లో మూడు కొండ శిఖరాల మధ్య ప్రాంతంలో ఒంటరిగా నిలబడి వున్నాను. ఎదురుగా పెద్ద లోయ. ఇదే సార్ ఆ కల" అంది.


"ఆ ప్రాంతాన్ని ఎప్పుడన్నా చూశావేమో. ఆలోచించావా?” అని అడిగాడు స్టీఫెన్ వార్నర్.


"లేదు. ఎప్పుడూ చూళ్ళేదు.”


"తిరిగి తిరిగి ఆ ప్రదేశమే కల్లోకి వస్తోందా?"


"అవును.”


"కొంచెం కూడా ఛేంజ్ లేదా?”


"ఉంది. నెలకి కనీసం రెండుసార్లయినా ఆ ప్రదేశం కల్లో కన్పిస్తోంది. మొదట్లో వచ్చిన కలల్లో ఆ ప్రదేశంలో నేను నిలబడి చూసేదాన్ని. ఆ తరువాత లోయలోకి నడుస్తున్నట్టు. ఏవో శక్తులు నన్ను అడ్డుకుంటున్నట్టు కల వస్తోంది. రాత్రి మూడు గంటల ప్రాంతంలో కూడా ఇదే కల" చెప్పింది శతపత్ర.


"వెరీ ఇంట్రెస్టింగ్.. అండ్ ఆల్ సో అన్ బిలీవ బుల్. మరి నీ కలకు, లైబ్రరీలో అన్వేషించ టానికి సంబంధం?”


“నాకెందుకో ఆ ప్రదేశం ఒక అన్ సాల్వడ్ మిస్టరీస్ లాంటి ప్రాంతమై వుంటుందని అనుమానం. జస్ట్ లైక్.. బర్ముడా ట్రయాంగిల్ ఈజిప్టు పిరమిడ్స్... ఇలా ఖచ్చితంగా ఎవరికీ అంతుచిక్కని ఒక విచిత్రమైన ప్రదేశం అయి వుంటుందని ఊహించాను.

ఆ కోణంలోనే ప్రపంచవ్యాప్తంగా అటువంటి ప్రదేశాలకు సంబంధించిన సమాచారం కోసం రోజూ లైబ్రరీలో కూర్చుని అన్వేషిస్తున్నాను.”


"నీ అంచనా సరైందే కావచ్చు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. గమనించావో లేదో... నిన్ను చూసి దెయ్యాలు ఇలా పారిపోవడానికి, నీకు కల్లో కన్పిస్తున్న ప్రదేశానికి ఏదన్నా సంబంధం వుందేమో?”


ఆయన మాటలు వింటూ వులిక్కిపడింది శతపత్ర.


"ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఖచ్చితమైన ఆధారం లేదు కదా?” అంది శతపత్ర. 


"అదీ కరెక్టే. అయినా ఏదో కల అని పట్టించు కోకుండా వదిలేయొచ్చు కదా. దీనిమీద ఎందుకు నీకు ఇంత ఇంట్రస్ట్?" అడిగాడు ఆయన.


“నన్ను బాగా డిస్ట్రబ్ చేస్తోంది సార్. నేను కాబట్టి గాని, అదే కల ఇంకెవరికన్నా వస్తే ఖచ్చితంగా భయపడతారు. అది అంత భీతావహంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నవే నాది” అంది శతపత్ర.


“తెలుసుకుని ఏం చేస్తావు?” నవ్వుతూ అడిగాడు.


“వెళ్తాను” వెంటనే బదులిచ్చింది. శతపత్ర.


ఉద్వేగంతో చూశాడాయన.


“ఖచ్చితంగా వెళ్తాను సర్. ఆ ప్రదేశం- కేవలం నాకే ఎందుకు కలలో కన్పిస్తోందో తెలియాలంటే నేను అక్కడికి వెళ్ళాలి కదా" అంది శతపత్ర. ఆమె పట్టుదలకు మెచ్చుకో లుగా చూశాడు స్టీఫెన్ వార్నర్. 


“ఆ కల నిన్నెంతగా డిస్టర్బ్ చేస్తోందో అర్థమైందమ్మా. బహుశా అది నీ గత జన్మ

తాలూకు ముఖ్యఘట్టం జరిగిన ప్రదేశం కావచ్చు. లేదా నీ భవిష్యత్తు మీద మంచో చెడో ప్రభావం చూపించే ప్రాంతం కావచ్చు. కాని ఆ ప్రదేశాన్ని కనిపెట్టడం అంత సులువు కాకపోవచ్చు” అన్నాడు.


“అయినా తప్పదు సర్. కనిపెట్టాలి” అంది.


స్థిరంగా, ఒక్కక్షణం ఆలోచించాడు స్టీఫెన్ వార్నర్.


“చూడమ్మా. నీ ప్రయత్నాన్ని ఆపటమో, హెచ్చరించటమో నా ఉద్దేశం కాదుగాని, నువ్వు కల్లో చూస్తున్న లోయ ప్రాంతానికి చెందిన ఏదో ఒక బలీయమైన శక్తి నిన్ను ఆకర్షిస్తోందని అనుమానంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది" అన్నాడు సీరియస్.


“శక్తులు ఆకర్షిస్తాయా?” ఆశ్చర్యంగా అడిగింది.


"కాదని అనుకుంటున్నావా? పిరమిడ్స్ గురించి తెలుసన్నావుగా?" అన్నాడు స్టీఫెన్ వార్నర్.


“కొంతమాత్రమే తెలుసు...”


“మమ్మీల గురించి కూడా తెలుసా?”


"తెలుసు సర్. ఆ కాలంలో, అంటే ఈజిప్టును పరిపాలించిన ఫారో చక్రవర్తుల కాలంలో చనిపోయిన వాళ్ళ భౌతిక శరీరం పాడవకుండా శవాలకు ఏవో లేపనాలు, పూతలు పూసేవారు. ఆ తరువాత ఒక ద్రవాన్ని ఉడికించేవారు. అందులో ఒక చెట్టు బెరడును ముంచి శవానికి చుట్టి మమ్మీగా తయారుచేసి శవపేటికలో ఉంచి పాతిపెట్టే వారు.


ఒక్కోసారి క్రూరమయిన నేరస్తులను బతికి వుండగానే మమ్మీలుగా మార్చే శిక్ష విధించేవారు. ఈ కార్యక్రమంలో వారి మత పెద్దలు శిష్యులు ప్రధానపాత్ర వహించేవారు.  

మరణించిన ఫారో చక్రవర్తుల శవాల్ని కూడా మమ్మీలుగా చేసి పిరమిడ్స్ లో ఆభరణాల మధ్య భద్రపరిచేవారు.


మరణానంతర జీవితాన్ని ఈజిప్టియన్లు నమ్మేవారు. మమ్మీగా మార్చ బడినవారు భవిష్యత్తులో ఎప్పుడో తిరిగి ప్రాణంతో లేస్తారని భావించేవారు. చక్రవర్తులు, ధనవంతులైనవారు చనిపోయినప్పుడు వారి విలువైన వస్తువులు, బతికున్న భార్యలు, నౌకర్లు, పెంపుడు జంతువులను కూడా మమ్మీలతోపాటు ఆ పిరమిడ్స్ లోను సమాధులలోనూ ఉంచేవారు. కొద్దిరోజులకు అలా ఉంచిన వారు కూడా మరణించేవారు. పిరమిడ్స్ లో రాజుగారి మమ్మీతో పాటు రథాలు, సింహాసనం, విలువైన సంపద కూడా బయటపడిన సందర్భాలున్నాయి...” అంటూ తనకు తెలిసిన విషయాల్ని చెప్పుకొచ్చింది శతపత్ర.


"పిరమిడ్స్ గురించి ఒక చారిత్రకాంశంగా మాత్రమే 'నీకు తెలుసు. వాటి వెనకవున్న ఈవిల్ పవర్స్ గురించి నీకు తెలీదు. తమ పూర్వీకులు ఏ ఉద్దేశంతో తమను మమ్మీగా మార్చారో ఆ ఉద్దేశానికీ, తమ ఉనికికీ భంగం కల్గించేవారిని అవి క్షమించవు.”


"అంటే మరణించిన ఆ శరీరం తాలూకు ఆత్మ ఆ మమ్మీని ఎప్పటికీ ఆవహించే ఉంటుందంటారా?" అని ఆసక్తిగా అడిగింది శతపత్ర.


“ష్యూర్. ప్రాచీన ఈజిప్టియన్లు దైవభక్తి గలవారు. మంత్రతంత్రాలు తెలిసినవారు. వైద్యశాస్త్రంలో నిష్ణాతులు, కెమికల్స్ తయారుచేయటంలో సిద్ధహస్తులు. మమ్మీగా మార్చిన శవాలు ఈనాటికీ పాడవకుండా ఈరోజే మరణించినంతగా ఉంటున్నాయంటే దానికి ఆ కాలం వారు ఉపయోగించిన కెమికల్సే కారణం. వాటిని ఎలా తయారుచేసేవారో ఈరోజు ఎవరికీ అర్థంకాదు. ఇండియాలో ఢిల్లీలోని తుప్పు పట్టని ఇనుపస్తంభాన్ని ఎలా తయారు చేశారో తెలియనట్టే ఈజిప్షియన్లు మమ్మీలు గా మార్చే కెమికల్స్ కూడా ఎవరికీ తెలీదు.”


"మమ్మీలకు ఈవిల్' పవర్స్ ఉంటాయా?"


"ఉంటాయి. అలాగని అకారణంగా అవి ఎవరికీ అపకారం చేయవు. లాప్టార్ లో డగ్లస్ అనే ధనవంతుడైన యువకుడు ఉండేవాడు. ఇది పందొమ్మిదివందల పది ప్రాంతంలో జరిగిన యధార్థగాధ.


అతను ఓసారి లండన్ వచ్చినప్పుడు జాతకం చెప్పటంలో సుప్రసిద్ధుడైన ఒక జ్యోతిష్కుడికి తన చేయి చూపి జాతకం చెప్పమన్నాడు. ఆయన చెప్పిన జాతకానికి తిరుగుండదు. ఆయన డగ్లస్ చేతిరేఖలను చూసి చాలాసేవు ఆలోచించి ఫలితాలు చెప్పాడు. ముఖ్యంగా మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఆయుధాలతో జాగ్రత్తగా వుండాలి. లేకపోతే ఎడంచేయి లేకుండా పోయే ప్రమాదం ఉంది. లాటరీల్లో ఎప్పుడూ పాల్గొన వద్దు. అలాగే బహుమతిగా వచ్చిన వస్తువుల్ని తాకొద్దు.


ఆయన చెప్పిన ఫలితాలు విని డగ్లస్ మండిపడ్డాడు.


"ఇదీ ఒక జాతకమేనా... నేను ధనవంతుణ్ణి. నా చేయిపోవడం ఏమిటి? లాటరీలతో నాకేమి పని? నోటికొచ్చింది చెప్తావా?" అంటూ జ్యోతిష్కుని మీద అరిచాడు.


"నుదుటి రాతను తప్పించలేరు. వెళ్ళిరా నాయనా..." అన్నాడా జ్యోతిష్కుడు.


ఇది జరిగిన ఆరుమాసాల తర్వాత డగ్లస్ ఫ్రెండ్స్ ఇద్దరు కైరో నగరానికి హాలిడేస్ ట్రిప్ వెళుతూ డగ్లస్ ని కూడా రమ్మన్నారు. ముగ్గురూ కైరో చేరుకున్నారు. హ్యాపీగా టూర్ చేశారు. డెజర్ట్ చూశారు. పిరమిడ్స్ చూశారు. కైరో నగర అందాలు చూశారు.


కైరోలో ఒకచోట ఒక మమ్మీని కొందరు అమ్మకానికి పెట్టారు. ఈజిప్టు సందర్శించిన గుర్తుగా ఓ మమ్మీని కొందామని ఫ్రెండ్స్ ప్రపోజ్ చేశారు.


అప్పటికి జ్యోతిష్కుడి హెచ్చరికలను డగ్లస్ మర్చిపోయాడు. అతను హిస్టరీ చదవలేదు.

చారిత్రక ప్రాధాన్యత వున్న వస్తువుల్ని కొనాలన్న ధ్యాసా లేదు. కాని విధి అతనిచేత ఆ పని చేయించింది. ఆ మమ్మీ ఒకప్పుడు ఏదో గుడిలో ప్రధాన పూజారిణి అట. ఆ మమ్మీని అద్దాలు బిగించిన బాక్స్ లో ఉంచారు. ఈజిప్ట్ భాషలో దానిమీద ఏవో రాతలు కూడా ఉన్నాయి.


మొత్తానికి మమ్మీని కొన్నారు. దాన్నెవరు తీసుకోవాలనే విషయంలో మిత్రులు ముగ్గురూ లాటరీ వేశారు. లాటరీలో మమ్మీ డగ్లస్ కి వచ్చింది.


తమ ముగ్గురిలో లాటరీలో మమ్మీ తనకే వచ్చినందుకు అది తన అదృష్టంగా భావించాడు డగ్లస్. నిజానికి ఆ క్షణమే తనను దురదృష్టం చుట్టుకుందని గ్రహించ లేకపోయాడు. మమ్మీని ఉంచిన బాక్స్ ని ఇంగ్లాండ్ లోని తన ఇంటి అడ్రస్ కి పార్శిల్ పంపించాడు. మిత్రులిద్దరితో కలిసి మళ్ళీ ఈజిప్టులో తన టూర్ ని కంటిన్యూ చేశాడు.

📖


ఈజిప్టు, నైలునది మీద బోటులో షికారు చేస్తుండగా, ఉన్నట్టుండి తుపాన్ ఏర్పడింది. ఆ సమయంలో బోటు మునిగిపోతుందని భయపడ్డారు ముగ్గురూ. ఆ హడావుడిలో పొరపాటున డగ్లస్ వద్ద వున్న రివాల్వర్ పేలి బుల్లెట్ అతడి ఎడం భుజంలో దిగబడింది. తుపాన్ లో బోటుమీద ఎటో కొట్టుకు పోయిన మిత్రులు తిరిగి కైరో చేరుకునేసరికి వారం రోజులు దాటింది. దాంతో డగ్లస్ ఎడం చేతి బుల్లెట్ గాయం సెప్టిక్ అయింది. చేయి తీసేశారు డాక్టర్లు.


అప్పుడు జ్యోతిష్కుడు చెప్పిన భవిష్యవాణి డగ్లస్ కి గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఇక చేయగలిగింది ఏముంది? తమ యాత్రను ముగించుకుని ఇంగ్లాండ్ కి తిరుగు ప్రయాణ మయ్యారు. దారిలో జరిగిన ఒక అనుకోని ప్రమాదంలో మిత్రులిద్దరూ మరణించారు.


చివరకు డగ్లస్ ఒక్కడే ఇంగ్లాండ్ చేరుకున్నాడు. ఇంటికొచ్చేసరికి తను పంపించిన మమ్మీ హాల్లో అలంకరింపబడి వుంది. మమ్మీ కళ్ళు తనను కోపంగా చూస్తున్నట్టుగా వున్నాయి. దానితో డగ్లస్ వణికిపోయాడు. భయం పట్టుకుంది. తనను చుట్టుముట్టిన కష్టాలకి ఆ మమ్మీనే కారణం అనుకున్నాడు. దాన్ని తన స్నేహితురాలైన ఓ యువతికి బహుమతిగా ఇచ్చేశాడు.

🍁

*సశేషం*

*శతపత్ర -14*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



మమ్మీని ఇంటికి తీసుకెళ్ళిన వారం రోజుల లోనే ఆ స్నేహితురాలికి అనేక కష్టాలు ఆరంభమయ్యాయి. ఆమె తల్లి మెట్లు దిగుతూ జారిపడి కాలు విరగ్గొట్టుకుంది. కొద్దిరోజులు బెడ్ మీదే ఉండిపోయింది. అప్పటికే ఆమెకు పెళ్ళి నిశ్చయమైంది. ఆ పెళ్ళి చెడిపోయింది. ఆమె పెంపుడు కుక్కలు మూడు పిచ్చిపట్టి ఒకేరోజు చనిపోయాయి. వరస కష్టాలతో ఆమె వణికిపోయింది. తెలీని నీరసంతో తనూ ఆస్పత్రి పాలైంది.


ఇవన్నీ చూశాక ఇదంతా మమ్మీ ప్రభావమని గ్రహించింది. ఆరోజే డగ్లస్ ని పిలిచి మమ్మీని తిరిగి ఇచ్చేసింది. మమ్మీని వెనక్కు తెచ్చిన తర్వాత  ఆమె యధాస్థితికి వస్తుందని అనుకున్నాడు డగ్లస్. కాని అలా జరగలేదు. ఆమె మరింతగా నీరసపడింది. చివరికి తెలీని ఆ వ్యాధికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది.


ఆ తర్వాత ఒక ఫ్రెండ్ సలహాతో డగ్లస్ ఆ మమ్మీని బ్రిటీష్ మ్యూజియమ్ కి డొనేట్ చేశాడు. ఆ ఫ్రెండే మమ్మీని తీసుకెళ్ళి ఒప్పగించాడు. అతన్ని కూడా వదల్లేదు మమ్మీ. ఆ ఫ్రెండ్ వారం రోజులు తిరక్క ముందే బెడ్ మీద నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నట్టే మరణించాడు.


ఆ మమ్మీ సృష్టిస్తున్న ఇబ్బందులు, ప్రమాదాల గురించి తెలుసుకున్న మ్యూజియమ్ అధికారులు దాన్ని న్యూయార్క్ లోని మ్యూజియమ్ కి డొనేట్ చేసి వదిలించుకోవాలనుకున్నారు. అదే ప్రకారం మమ్మీని ఒక షిప్ లో అమెరికాకు పంపించారు.


ఆ షిప్ పేరు టైటానిక్. అది ఏమైందో అందరికి తెలుసు. 13.4. 1912వ తేదీన ఒక మంచు పలకను గుద్దుకుని టైటానిక్ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదం లో సుమారు పన్నెండు వందలమంది జలసమాధి అయ్యారు. వారితో పాటే ఆ మమ్మీ కూడా సముద్రంలో కలిసిపోయింది" వివరించాడు" స్టీఫెన్ వార్నర్.


నమ్మశక్యంగాని ఆ గాధని ఆశ్చర్యంతో ఎంతో ఆసక్తిగా విన్నది శతపత్ర. “తరువాత.... డగ్లస్ ఏమయ్యాడు సార్?" కుతూహలంగా అడిగింది శతపత్ర.


"అదే ఆశ్చర్యం... ఎక్కడో అమెరికా తీరంలో టైటానిక్ మునిగిపోయిన అదేరోజు విచిత్రంగా ఇక్కడ ఇంగ్లాండ్ లో డగ్లస్ కూడా మరణించాడు” అంటూ భారంగా నిట్టూర్చాడు స్టీఫెన్ వార్నర్.


“నమ్మలేకపోతున్నాను సర్... మమ్మీలకు అంత పవర్ ఉందంటే చాలా ఆశ్చర్యంగా వుంది. కాని నాదో డౌటు" అంది శతపత్ర.


“అడుగమ్మా. ఏమిటది?” అడిగాడు స్టీఫెన్.


“ఏ మతాచారం ప్రకారమైనా చూడండి, హిందూమతంగాని, క్రైస్తవం గాని, ముస్లిం గాని, బౌద్దంగాని ఇలా ఏ మతం ప్రాతిపదికన చూసినా మనిషి చనిపోయిన తరువాత ఆత్మ పైకి వెళ్ళిపోతుందని, చేసిన పాపపుణ్యాల ప్రకారం ఆ ఆత్మలకు స్వర్గమో నరకమో ప్రాప్తిస్తాయని అంటారు.


'అలానే సమయం రాకుండా ముందే శరీరాన్ని పోగొట్టుకున్న ఆత్మలు అంతవరకూ భూమ్మీదే సంచరిస్తాయని కదా నమ్మకాలు.

కాని ఈ ఈజిప్టియన్లు మాత్రం ఎందుకిలా? మృతదేహాల్ని మమ్మీలుగా మార్చి భవిష్యత్తులో ఎప్పుడో అవి తిరిగి మళ్ళీ బతుకుతాయని విశ్వసించటం?" ప్రశ్నించింది శతపత్ర.


ఆమె ప్రశ్నకు నిజానికి స్టీఫెన్ వార్నర్ వద్ద కూడా సమాధానం లేదు. ఏం చెప్పాలో తెలీక ఆలోచిస్తుండగా డోర్ వద్ద అలికిడైంది. నాన్సీ- మూడు అందమైన డచ్ డిజైన్డ్ కప్పుల్లో పొగలు చిమ్ముతున్న కాఫీతో లోపలకి వస్తూ కన్పించింది.


"మీరు ఏదో భాషలో మాట్లాడుకుంటే నాకేమీ అర్థంకాదు. ఇంగ్లీష్ లో మాట్లాడితే నేనూ మీ చర్చలో పాలుపంచుకుంటాను” అంది నవ్వుతూ.


“ఏమిటీ? పనులన్నీ అయిపోయాయా?” కాఫీ కప్పు అందుకుంటూ అడిగాడు స్టీఫెన్.


“అందుకేగా మీతో జాయినవుతున్నాను" అంటూ శతపత్రకు ఒక కప్పు అందించి, తను కూడా ఒక కప్పు తీసుకుంటూ భర్త పక్కన కూర్చుంది. ముగ్గురూ కాఫీ తాగారు.


శతపత్ర సందేహాన్ని నాన్సీకి వివరించాడు స్టీఫెన్ వార్నర్. ఆమె రాకతో వారి సంభాషణ ఇంగ్లీష్ లోకి మారింది. “నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను” అంది అంతా విన్నాక శతపత్రను చూస్తూ నాన్సీ.


"నువ్వు చెప్తావా? చెప్పు చూద్దాం” అన్నాడు నవ్వుతూ స్టీఫెన్ వార్నర్. సీరియస్ గా చూసింది నాన్సీ.


"అంటే, మీ ఉద్దేశం ఏమిటి? నాకేమీ తెలీదనా? ఇదిగో అమ్మాయ్, శతపత్రా, నీ సందేహం న్యాయమైందే. ప్రపంచంలో అందరి విశ్వాసం ఏమంటే మన శరీరంలో ఆత్మ ఒక్కటే ఉంటుందని, కాని నిజానికి రెండు ఆత్మలుంటాయి” అంది.


"ఓర్నాయనో రెండు ఆత్మలా... నువ్వు మమ్మల్ని మరింత కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నావు నాన్సీ” అన్నాడు కంగారుగా స్టీఫెన్ వార్నర్.


“నొనొ... నొ కన్ఫ్యూజ్... వినండి. మీకో ఉదాహరణ చెప్తాను. కారు ఉంది. అది పనిచేస్తుంది కదా? అది ఎప్పుడు పని చేస్తుంది? డ్రైవరు కూర్చుని స్టార్ట్ చేసినప్పుడు పనిచేస్తుంది. పరుగులు తీస్తుంది. డ్రైవరు దిగిపోతే పనిచేయదు. ఏ యంత్రమయినా అంతే. మంచి కండిషన్ లో ఉన్న యంత్రమైనా సరే మనిషి లేందే పనిచేయదు. అవునా?” అడిగింది.


“అఫ్కోర్స్. యు ఆర్ కరెక్ట్” అన్నాడు స్టీఫెన్ వార్నర్. శతపత్ర ఆసక్తిగా వింటోంది.


"మన మానవ శరీరం కూడా ఒక యంత్రం అనుకుందాం. ఆ శరీరంలో స్వతస్సిద్ధంగా ఒక ఆత్మ ఉంది. అది భౌతికమైన ఆత్మ. అదే శరీర ధర్మాల్ని కాపాడుతోంది. ఈ భౌతికమైన ఆత్మకి పరమాత్మ సంబంధమయిన ఆత్మ తోడయినప్పుడే జీవం ఏర్పడి చలనం వస్తోంది. అర్థమయిందా?” అని అడిగింది.


"అర్థం కాలేదు" అంది శతపత్ర.


"అంతా మనమే... మనవల్లే అంతా జరుగుతోంది అనుకుంటాం. మన బుర్ర ఆలోచిస్తుంది. కాళ్ళు, చేతులు పనిచేస్తాయి.. ఇవి మన ఆధీనంలోనే ఉంటాయి. కాని శరీరం మొత్తం మన నియంత్రణలో ఉండదు.


ఆకలేస్తే భోంచేస్తున్నాం. కాని జీర్ణవ్యవస్థ పని మన నియంత్రణలో లేదు. నిరంతరం గుండె కొట్టుకుంటోంది. దాని నియంత్రణ మన చేతుల్లో లేదు. ఇలా మన ప్రమేయం లేకుండానే శరీర విధుల్ని నిర్వర్తింపచేస్తున్న దే భౌతికమైన ఆత్మ. ఒక మనిషి కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు శరీర విధులన్నీ సక్రమంగా వున్నా చలనం మాత్రం ఉండదు. ఎందుచేత? అక్కడ భౌతికమైన ఆత్మ ఒక్కటే శరీర విధుల్ని నిర్వర్తింపచేస్తోంది.


“పరమాత్మ సంబంధమైన ఆత్మతొలగిపోడం చేత చలనం లేకుండాపోతోంది.కాబట్టి భౌతిక ఆత్మ నియంత్రణలో వున్నా శరీరమనే ఈ యంత్రంలోకి, పరమాత్మ సంబంధమైన ఆత్మ అనే డ్రైవరు ప్రవేశించి స్థిరంగా ఉన్నప్పుడే ఈ యంత్రం సక్రమంగా పనిచేస్తుంది.


ఈ సిద్ధాంతాన్ని మా డచ్చివాళ్ళేకాదు ఈజిప్షియన్లు కూడా గాఢంగా విశ్వసిస్తారు.


నీ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు తెలిసి ఉండాలి. భౌతిక 'ఆత్మ నియంత్రణలోని ఈ శరీర యంత్రం పాడవకుండా దీన్ని సురక్షితం గా ఉంచితే భవిష్యత్తులో ఏదోరోజు శరీరాన్ని వదిలిపోయిన దివ్యాత్మ తిరిగి ప్రవేశించి ఆ శవం బతుకుతుందని పురాతన ఈజిప్టియ న్లూ నమ్మేవారు. అందుకే శవాల్ని అత్యంత భద్రంగా మమ్మీలుగా మార్చి పిరమిడ్స్ లో భద్రపర్చేవారు" వివరించింది నాన్సీ.


“నాన్సీ క్లారిఫికేషన్ విన్నావుగా శతపత్రా?... పురాతన ఈజిప్షియన్లు శవాలను మమ్మీలు గా మార్చటంతో ఊరుకోలేదు. శరీరానికి సంబంధించిన భౌతికమైన ఆత్మను ప్రేరేపించి తమ మంత్రాలతో కొన్ని శక్తులు ఆపాదించి, కాపలా ఉంచేవారు ఎంత కాలమైనా కూడా

అసలు ఆత్మ తిరిగి ఆ శరీరంలోకి ప్రవేశించే దాకా భౌతిక ఆత్మ మమ్మీకి రక్షణగా ఉంటుంది. సో... అటువంటి మమ్మీ యొక్క లక్ష్యానికి, ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా అవి క్షమించవు. శపిస్తాయి.

ప్రతీకారం తీర్చుకుంటాయి. వాటి శక్తి నీకు అర్ధంకావటానికి టుటాంఖమెన్ సమాధికి సంబంధించిన వాస్తవ గాధ చెప్తాను విను” అన్నాడు స్టీఫెన్ వార్నర్.


"టుటాంఖమెన్ ఎవరు?” అడిగింది శతపత్ర.


"క్రీస్తుపూర్వం పధ్నాలుగో శతాబ్దంలో ఈజిప్టును పరిపాలించిన గొప్ప చక్రవర్తి టుటాంఖమెన్. క్రీ.పూ. 1352 ప్రాంతంలో ఆయన మరణించగా మమ్మీగా మార్చబడి సమాధి చేయబడ్డాడు” వివరించాడు స్టీఫెన్ వార్నర్.


"అతడి సమాధి ఎలా బయటపడింది?”


“అదే చెప్తున్నాను... వ్యాలీ ఆఫ్ కింగ్స్ వద్ద ఒక పిరమిడ్ లో టుటాంఖన్ మెన్ సమాధి వుంది.


మిస్టర్ కానర్వాన్ అనే ఆర్కియాలజిస్టు సాహసి, మొండివాడు. అతడి సబార్డినేట్ కార్టన్ అనే మరో ఆర్కియాలజిస్టు... ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు వారికి సహాయకులుగా మరో ఇరవైమంది కింగ్స్ వ్యాలీలో సమాధుల్ని కనుగొని, వాటి గురించి బయట ప్రపంచానికి తెలియజేయా లని ఒక టీమ్ బయలుదేరారు.


ఇలా మమ్మీలను కనుగొనే ప్రయత్నం మంచిది కాదని కానర్వాన్ ఫ్రెండ్ ఒకడు అతన్ని ముందే హెచ్చరించాడు. గత అనుభవాలనూ వివరించాడు. గతంలో ఇలానే ఒక ఆర్కియాలజిస్టూ ఒక సమాధి నుంచి శవపేటికతో సహా మమ్మీని ఇంగ్లాండ్ తీసుకెళ్ళగా అతనికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దురదృష్టం వెన్నంటి ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు. అతడి ప్రాణ ప్రదమైన ప్రియురాలు సముద్రంలో మునిగి చనిపోయింది. మమ్మీని ఉంచిన ఇల్లు కాలి బూడిదయింది. ఆ మమ్మీని ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ అనూహ్యరీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు.


ఇదంతా వినికూడా టీమ్ లీడర్ కానర్వాన్ లెక్కచేయలేదు. అవన్నీ కేవలం భయాలు మాత్రమేనంటూ కొట్టిపారేశాడు. తన సాహసాన్ని ప్రపంచానికి నిరూపించాలను కున్నాడు. 


“పొరపాటున కూడా మమ్మీ సమాధుల్లోకి ప్రవేశించకు. ఈ హెచ్చరికను పెడచెవిన పెడితే కోరి చిక్కులు తెచ్చుకున్నట్టే. ప్రాణాలతో ఈజిప్టు దాటి బయటకుపోలేవు" అంటూ మరో సన్నిహితుడు చేసిన హెచ్చరికను కూడా కానర్వాన్ లెక్క చేయలేదు.

🍁

*సశేషం*

16/02, 11:43 am] . Mallapragada: *శతపత్ర -15*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



1920 ప్రాంతంలో కానర్వాన్ కింగ్స్ వ్యాలీకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నప్పుడే సన్నిహితులు చేసిన హెచ్చరికలు అవి. అవన్నీ మూఢ నమ్మకా లంటూ కొట్టిపారేశాడు కానర్వాన్" అంటూ చెప్పటం ఒకింత ఆపాడు స్టీఫెన్ వార్నర్.


అతడు చెప్తున్న మాటలు శతపత్రకన్నా నాన్సీకే ఎక్కువ ఆత్రుత కలిగించినట్టుంది.. "తర్వాత ఏమైంది?" అనడిగింది ఆసక్తిగా వెంటనే.


"ఎవరైతే భౌతికమైన మమ్మీల శాశ్వత నిద్రకు భంగం కలిగిస్తారో, వారు తమ మృత్యువును కోరి ఆహ్వానించుకున్నట్టే. ఇది ప్రాచీన ఈజిప్టియన్ల ప్రగాఢ నమ్మకం. ఇప్పటికీ ఈజిప్టు ప్రజలు ఈ నమ్మకాన్ని గౌరవిస్తారు. కాని మొండివాడైన కానర్వాన్ గౌరవించలేదు.


మూఢనమ్మకమని అపహాస్యం చేశాడు. తన టీమ్ మెంబర్స్ ని ప్రోత్సహించి కింగ్స్ వ్యాలీలో పని ప్రారంభించాడు. 

రాత్రింబవళ్ళు నిర్విరామంగా పని చేయటం ప్రారంభించారు. రోజులు గడిచిపోతున్నాయి.


మొత్తానికి 1923లో టుటాంఖమెన్ సమాధిని కనుగొన్నారు. సమాధిలో అంతులేని సంపదతోపాటు రాజుగారి బంగారు సింహాసనాన్ని, ఆయన ఉపయోగించిన మణిమయఖచితమైన బంగారు రథాన్ని, ఆభరణాలు, ఆ కాలం నాటి వస్తువులు అనేకం దొరికాయి.

టుటాంఖమెన్ మమ్మీని ఉంచిన బంగారు శవపేటికను సమాధినుంచి బయటికి తీశారు.


కానర్వాన్ తన సాహసాన్ని ప్రపంచానికి చాటాడు. కాని విధి నుంచి తప్పించుకోలేక పోయాడు..

📖


టుటాంఖమెన్ సమాధి తెరిచిన అయిదు మాసాల్లోనే కానర్వాన్ చనిపోయాడు. చనిపోయేముందు 'భరింపరాని వేదనతో నేను చనిపోతున్నాను. దేవుడా!' అంటూ వెర్రిగా కేకలు వేశాట్ట- సంపూర్ణ ఆరోగ్యంగా వున్న కానర్వాన్ అలా హఠాత్తుగా మరణించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. టుటాంఖమెన్ మమ్మీ అలా తన మొదటి ప్రతీకారం తీర్చుకుంది. కానర్వాన్ చనిపోయిన కొద్ది రోజులకే విచిత్రంగా అతడి సహచరుడు కార్టర్ కూడా చనిపోయాడు.


కానర్వాన్ చనిపోయాడని తెలిసి అతని ఫ్రెండ్ ఒకడు ఈజిప్టు వెళ్ళాడు. విషయం తెలుసుకుని ఇదేమిటో చూద్దామని అతను కూడా టుటాంఖమెన్ సమాధిలోకి వెళ్ళి పరిశీలించి వచ్చాడు. వెళ్ళి వచ్చీ రాగానే తీవ్రమైన జ్వరంతో మంచానపడి పన్నెండు గంటల్లోపల చనిపోయాడు.


అంతేకాదు. టుటాంఖమెన్ సమాధిని ఎక్స్ రే తీసిన వ్యక్తికి ఉన్నట్టుండి మతిచెడింది. ఇంగ్లాండ్ తిరిగివస్తూ దారిలోచనిపోయాడు. తర్వాత కానర్వాన్ సెక్రటరీ కూడా విచిత్రంగా మరణించాడు.


కానర్వాన్ తో పనిచేసిన టీమ్ లోని మెంబర్స్ మొత్తం ఒక్కొక్కరే మరణించారు. ఎవరూ మిగల్లేదు. ఇదంతా యధార్థంగా జరిగిన సంఘటన. ఇంత జరిగినా కొత్తగా విన్నవాళ్ళు సూపర్ పవర్స్ లేవనీ అవన్నీ కో ఇన్సిడెంట్స్ అనీ కొట్టి పారేస్తారు. అందుకే చెప్తాను. ఏదైనా అనుభవానికి వస్తేగాని మనిషి నమ్మడు." అంటూ ముగించాడు స్టీఫెన్ వార్నర్.

📖


అంతవరకూ వింటూ కూచున్న నాన్సీ ఏదో పని గుర్తుకొచ్చి లేచి కిందకు వెళ్ళిపోయింది. స్టీఫెన్ వార్నర్, శతపత్రలు చాలాసేపు ఈ విషయాల మీద చర్చించుకున్నారు. చివరకు స్టీఫెన్ ఓ సలహా ఇచ్చాడు--


"చూడమ్మా శతపత్రా బయట ఎవరికీ తెలియని ఒక రహస్యం మా లైబ్రరీలో ఉంది. అది టాప్ సీక్రెట్. ఇప్పుడు హై అథారిటీస్ లో కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు. నీ సమస్య నాకు అర్ధమైంది గాబట్టి ఆ రహస్యం ఇప్పుడు నీతో చెబుతున్నాను.


ప్రపంచ వ్యాప్తంగా అరుదైన కొన్ని రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల వెనక ఉన్న మిస్టరీని ఈనాటికీ ఎవరూ ఛేదించలేక పోయారు. ఇలాంటివి అందరికీ తెలిసినవి చాలా ఉన్నప్పటికీ, నేను చెప్పేది మాత్రం అతి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ప్రదేశం.


బ్రిటీష్ పరిపాలనా కాలంలో, దేశాలవారీగా అలాంటి ప్రదేశాల ఫోటోగ్రాఫ్స్ ని, వివరాలని వాటికి సంబంధించిన బుక్స్ ని సేకరించి ఇక్కడ భద్రపరిచారు.


అవి సాధారణ ప్రజలు చదివి అవేమిటో చూడాలని వెళ్తే ప్రమాదమని భావించి వాటిని అందరికీ అందుబాటులో లేకుండా ఒక ప్రత్యేక విభాగంలో భద్రం చేసి తాళాలు వేసివుంచారు.


నెలరోజులకోసారి తలుపులు తెరిచి లోపల శుభ్రం చేయించి తిరిగి తాళాలు వేస్తాం. నా పర్యవేక్షణలోనే చాలా భద్రంగా జరుగుతుందా పని.


నీవు అనుమానిస్తున్నట్టు నీ కలలో కన్పించే ప్రాంతం ఆ మిస్టరీస్ లో ఒకటయి వుంటే దాని గురించిన సమాచారం మా సీక్రెట్ విభాగంలోనే నీకు దొరకాలి. అక్కడ దొరకలేదంటే నువ్వా కల గురించి ఇక మర్చిపోవచ్చు. నీకు నేను చేయగల సాయం ఇదే.


నీకోసం నేను రేపు ఉదయం ఒక గంట ముందుగా లైబ్రరీకి వస్తాను. నువ్వు కూడా రావాలి. నేను ఎవరూ చూడకుండా తాళం తీసి ఆ విభాగంలోకి నిన్ను పంపించి బయట తాళం వేస్తాను. పనికాగానే నా సెల్ కి ఫోన్ చేస్తే వచ్చి తలుపు తీస్తాను. ఓకేనా?"


"థాంక్యూ సర్... తప్పకుండా వస్తాను" అంది ఎంతో వినయంగా కృతజ్ఞతాభావంతో శతపత్ర.


ఇద్దరూ మెట్లుదిగి కిందకు వచ్చారు. అప్పటికి తన పనులు ముగించుకుని నాన్సీ కూడా హాల్లోకి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఆప్యాయంగా శతపత్ర వెంట పోర్టికోలోకి వచ్చి ఆమెను సాగనంపారు.


శతపత్ర స్కూటీ మీద బయటకి వెళ్ళిపోగానే స్టీఫెన్ వార్నర్ భార్యను చూస్తూ- "ఇంతకీ మన క్రిష్ట, రోసీలు ఎక్కడ?" అని అడిగాడు భార్యని.


"ఎంతకీ నాకు అర్థంగాని విషయం అదే... అంత మంచి అమ్మాయిని చూసి ఈ దెయ్యం పిల్లలు భయపడ్డం ఏమిటి? ఆ కాలువ గట్టునే కూచున్నట్టున్నాయి. నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తానుండు. వాళ్ళిద్దరూ లేకపోతే ఇంట్లో అసలు సందడే లేదు" అంటూ పిల్ల దెయ్యాలయిన క్రిష్ట, రోసీలను పిలుచుకు రావటానికి పెరటివైపు బయలుదేరింది నాన్సీ.

📖


మరునాడు ఉదయం-


ఎందుకో లేచినప్పట్నుంచి శతపత్రకు మనసు అస్సలు బాగోలేదు. అదేపనిగా కుడికన్ను అదురుతోంది. మగాళ్ళకి ఎడం కన్ను, ఆడాళ్ళకి కుడికన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుందంటారు. ఒక్కోసారి నిద్రలేమి వల్ల కంటినరాల అలసటతో కూడా

కనురెప్పలు అదురుతుంటాయి. శతపత్ర సెంటిమెంట్ పూల్ కాదు. కాని ఉదయం నుండి మనసు బాగాలేకపోవటం, ఆపైన కుడికన్ను అదే పనిగా అదరటం చూస్తుంటే, ఏదో కీడు జరగనుందా అనే ఆలోచనలు ఆమెను ముసురుకుంటున్నాయి. ఇవాళ లైబ్రరీకి వెళ్ళటం వాయిదా వేద్దామనుకుంది. కాని అంతలోనే మనసు మార్చుకుంది.


స్టీఫెన్ వార్నర్ తనకు తానుగా హెల్ప్ చేస్తామన్నారు. ఓ గంట ముందుగానే లైబ్రరీకి రమ్మన్నారు. ఆయన చెప్పినప్పుడు వెళ్ళాలిగాని మనకోసం ఆయన్ని రమ్మనటం మర్యాద కాదు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవటమే తెలివైన పని.


అనేక విధాలుగా ఆలోచించిన శతపత్ర చివరకు వెళ్ళటానికే నిశ్చయించుకుంది. చకచకా రెడీ అయి ఎనిమిది గంటలకే బయటికి బయలుదేరింది.


"ఇంత పొద్దుటే బయలుదేరావ్. ఎక్కడికే" అంటూ కాఫీ కప్పు అందిస్తూ అడిగింది పిన్ని సువర్ణ.


శతపత్ర ఏదో చెప్పేలోపలే బాబాయ్ అందుకున్నాడు. ఆయన కూడా బయటకు బయలుదేరే హడావుడిలో ఉన్నాడు. "ఎవరన్నా బయటికి వెళుతుంటే ఎక్కడికి అని అడగకూడదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు?” అని అంటూ కసురుకున్నాడు. భార్యని.


“అవునా! మరైతే ఏమని అడగాలేమిటి?" అమాయకంగా ముఖంపెట్టి ఒకింత దీర్ఘం తీస్తూ అడిగింది సువర్ణ భర్తవైపు చూస్తూ. “పనేమిటి? అనడగాలి" చెప్పాడు.


"ఏం పనులో ఏమిటో! ఇంగ్లాండ్ లో ఉంటున్నా, మీ ఇండియన్ సెంటిమెంట్లు పోవడంలేదు" అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందావిడ. వెళ్తున్న భార్యను చూస్తూ అదోలా ముఖంపెట్టి వెక్కిరించాడు బాల గోపాలం.


“చూశావా అమ్మాయ్, తనకేమీ సెంటిమెంట్లే లేనట్టు, మనవి ఇండియన్ సెంటిమెంట్లు అంటోంది మీ పిన్ని. మరి యూరప్ లోఉన్నా పసుపు రుద్దుకుని స్నానాలూ, పెద్దగా గణగణ గంటలు వాయిస్తూ ఆ పూజలు, పునస్కారాలు అవన్నీ సెంటిమెంట్లు కావా?" అంటూ నవ్వేశాడు.


"లైబ్రరీ వద్ద పనుంది. నేను వెళ్తున్నాను" అంటూ బయలుదేరింది శతపత్ర.


“జాగ్రత్త తల్లీ” వెనక నుంచి హెచ్చరించాడు బాలగోపాలం. శతపత్ర వెళ్ళిన పది నిమిషాలకు తను కూడా బయటకు బయలుదేరాడు.


"పనేమిటి?” గుమ్మంలోకొచ్చి అడిగింది సువర్ణ.


ఆమె కావాలనే తన మాట తనకే ఇలా అప్పజెప్పేస్తోందని బాలగోపాలానికి అర్ధమైపోయి పెద్దగా నవ్వేశాడు.


"లండన్ మహానగరంలో ఆరు రెస్టారెంట్లకు అధిపతినే. నీ పతిదేవుడికి పాతిక ముప్పై పనులుంటాయి.. అన్నీ నీకు చెప్పాలా? వెధవ చాదస్తం నువ్వూ... తలుపేసుకో” అంటూ బయటికి వెళ్ళిపోయాడు.

📖


సరిగ్గా తొమ్మిది గంటలకి క్వీన్ విక్టోరియా మెమోరియల్ లైబ్రరీకి చేరుకుంది శతపత్ర.


ఆరోజు మంచు కురవకపోవటంతో లండన్ వీధులు అద్దంలా మెరుస్తున్నాయి. నగర శోభని ఎంజాయ్ చేసే మూడ్ లో శతపత్ర లేదిప్పుడు. కుడికన్ను ఇంకా అదేపనిగా అదురుతోంది. ఎందుకు? నిజంగా ఏదన్నా కీడు జరగనుందా? మనసును తొలుస్తున్న ప్రశ్న ఇది.


కొన్నిటిని ఎంతగా మూఢనమ్మకాలని కొట్టిపారేసినా, మనసు మాత్రం తెలియని అలజడితో గుబులు పుట్టిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం శతపత్ర మానసిక స్థితి కూడా అలానే ఉంది.


ఒకవేళ నిజంగా కీడు జరిగేట్టయితే తనకి వస్తున్న కలకి, దీనికి సంబంధం ఏదన్నా ఉండి వుంటుందా? ఆ కోణంలో కూడా ఆలోచించిందామె. అలాగని భయపడి వాయిదా వేసుకునే అవకాశం లేదు.


తనకోసం గంటముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు స్టీఫెన్ వార్నర్ గారు. ఆయన కారు పార్కింగ్ లో ఉంది అప్పటికే. ఏమైతే అయిందని మనసు దృఢపరుచుకుంది శతపత్ర.


తన స్కూటీని లాక్ చేసి వెనుతిరుగుతుండ గా పరుగు పరుగున అక్కడికొచ్చింది విశ్వదా.


ఆమెను చూసి షాకయింది శతపత్ర, “విశ్వదా! నువ్వేమిటే ఇక్కడికి వచ్చావ్?” అంది ఆశ్చర్యపడుతూ.


“నా సంగతి అలా ఉంచు. ఇంతకుముందు లైబ్రరీ తెరిచాక వచ్చేదానివి. ఇప్పుడేమిటి గంటముందే వచ్చాశావ్?" ఎదురు ప్రశ్నించింది విశ్వదా.


"పనుండి వచ్చాను.”


"ఏం పని? కొంపదీసి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా వస్తున్నాడా? అలాంటిదేమన్నా ఉంటే చెప్పెయ్ లేటయినా బాధలేదు. ఆ నవమన్మధుడు ఎలా ఉంటాడో చూసి వెళ్తాను” అంది విశ్వదా.


"చంపుతాను. పొద్దుటే జోకులేయకు. నిజంగా పనుండే వచ్చాను. నాకోసం కొన్ని ఓల్డ్ బుక్స్ తీసి ఉంచుతాను, ఎర్లీగా రమ్మన్నారు స్టీఫెన్ వార్నర్ గారు. అందుకే వచ్చాను. నీ సంగతేమిటి? ఏం పనిమీద వచ్చావిటు?"


“నీకోసం కాదులే. టాక్సీలో ఇటుగా పోతూ నిన్ను చూసి ఆగాను. నేను మెట్రోట్రైన్ లో రమణా రావుగారింటికి వెళ్తున్నాను. అదేనే.. ఎత్తుపళ్ళ రమణ రావుగారు. వాళ్ళ ఫ్యామిలీ ఇండియా వెళ్ళి నిన్ననే తిరిగి వచ్చారు. వాళ్ళచేత మా డాడీ ఏదో పార్శిల్ పంపించారట. కాలేజీ టైమ్ లోపలే వెళ్ళి కలెక్ట్ చేసి తెచ్చుకుందామని పొద్దున్నే బయలుదేరాను" అంది విశ్వదా.


బరువుగా నిట్టూర్చింది శతపత్ర-


"ఇండియా. వెళ్ళివస్తున్న వాళ్ళని చూస్తుంటే నాకూ ఓసారివెళ్ళి అందరీ చూసిరావాలని ఉంటుంది. మమ్మీని, డాడీని, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని.. ప్చ్.. ఎప్పటికి వీలవుతుందో మా డాడీకి నేనంటే ప్రాణం.

నాకూ అంతే. అసలు ఇంతకాలం ఆయన్ని చూడకుండా ఎలా ఉండా గలిగాను. తలచుకొంటే ఆశ్చర్యంగా ఉంటుంది” అంది బాధగా.


"మాతృదేశానికి దూరంగా ఉండే మనలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు, బాధలు తప్పవు. నాకూ వెళ్ళి రావాలనుంది. కాని ఎలా వీలవుతుంది. ఎగ్జామ్స్ అవ్వాలి గదా. కాని ఒక్కటిమాత్రం నిజం" అంది విశ్వదా.


"ఏమిటి ఆ నిజం?”


“నాకన్నా ముందుగా నువ్వే ఇండియా వెళ్ళిపోతావనిపిస్తోంది. ఏమో ఈ రోజే వెళ్ళిపోతావేమో.”


“ఈరోజా... ఏమిటే భయపెట్టేస్తున్నావ్?”


“డోన్ట్ వర్రీ. జస్ట్ జోక్ చేశానంతే. టేకిటీజీ. ఈవెనింగ్ ఫోన్ చేస్తాను. నా ప్లాట్ కి రావాలి.


మావాళ్ళు ఏం పంపించారో చూపిస్తాను. ట్యాక్సీ వెయిటింగ్ లో ఉంది. వస్తాను. బై" ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్లిపోయింది విశ్వదా.


ట్యాక్సీ వెళ్లిపోయింది. తన వేనిటీ బ్యాగ్ తీసుకుని లైబ్రరీలోకి నడిచింది శతపత్ర.

📖


ఆమె వెళ్ళేసరికి లైబ్రరీ సెంట్రల్ హాల్లోనే ఆమెకోసం ఎదురుచూస్తూ కనిపించాడు స్టీఫెన్ వార్నర్.


"సారీ సర్. కొంచెం లేటయింది. మిమ్మల్ని వెయిట్ చేయించాను" అంది ఆలస్యానికి నొచ్చుకుంటూ.


"నో ప్రాబ్లమ్ మై చైల్డ్... కమ్ విత్ మి" అంటూ తన ఛాంబర్ వైపు దారితీశాడు ఆయన.


తన ఛాంబరికి పక్కనే ఉన్న చిన్న కారిడార్ చివరన ఉంది ఆయన చెప్పిన సీక్రెట్ లైబ్రరీ. సాధారణంగా అటుగా ఎవరూ రారు.


ఇద్దరూ డోర్ వద్దకి చేరుకున్నారు.


స్టీఫెన్ వార్నర్ తాళం తీసి డోర్స్ తెరిచాడు.


ఎందుకో తెలీదుగాని లోపలికి చూస్తున్న శతపత్రకి గుండెలు కొద్ది క్షణాలు వేగంగా కొట్టుకున్నాయి. తన అన్వేషణకి ఇది చివరి మజిలీ అన్పిస్తోంది.


"లోపలికి వెళ్ళమ్మా. నీమీద నాకున్న నమ్మకంతో నీకీ అవకాశం ఇస్తున్నాను. నాకు మాట రాకుండా చూసుకో... లోపల ఉన్నవి అపురూపమైన అతి ప్రాచీన గ్రంథాలు, ముట్టుకుంటే పాడయిపోయే ప్రమాదం ఉంది. బీకేర్ ఫుల్. పని పూర్తి అయిపోగానే నా సెల్ కి ఫోన్ చెయ్యి. వచ్చి తాళం తీస్తాను. గో ఇన్ సైడ్ క్విక్ లీ" అంటూ హెచ్చరించాడు స్టీఫెన్ వార్నర్.


కృతజ్ఞత నిండిన కళ్ళతో ఆయన్ని చూసింది శతపత్ర. "థాంక్యూ, సర్. మీ సాయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. మెనీ మెనీ థ్యాంక్స్" అంది.


ఆమె లోపలకు వెళ్ళగానే "బెస్ట్ ఆఫ్ లక్” అంటూ డోర్స్ ఎప్పటిలా మూసి లాక్ చేసుకొని ఏమీ తెలీనట్టే తన ఛాంబర్ కి వెళ్ళిపోయాడు స్టీఫెన్ వార్నర్.

🍁

*సశేషం*

[17/02, 11:22 am] . Mallapragada: *శతపత్ర - 16*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



ఆమె గది లోపలకు వెళ్ళగానే "బెస్ట్ ఆఫ్ లక్” అంటూ డోర్స్ ఎప్పటిలా మూసి లాక్ చేసుకొని ఏమీ తెలీనట్టే తన ఛాంబర్ కి వెళ్ళిపోయాడు స్టీఫెన్ వార్నర్.


లోపలకు అడుగుపెట్టిన శతపత్ర కాస్సేపు అలాగే నిలబడి చుట్టూ చూసింది. అది సువిశాలమైన పెద్ద హాలు. వరుసగా నిలబెట్టి వున్న స్టీల్ రాక్స్ లో చాలా నీట్ గా వరుసలు తీరి వున్నాయి ప్రాచీన గ్రంథాలు. అవన్నీ ఖండాల వారీగా, దేశాలవారీగా చక్కగా విడివిడిగా ఉంచబడ్డాయి. ఓసారి వాటన్నిటినీ చుట్టి వచ్చింది శతపత్ర.


ఆసియా విభాగంలో చైనా, ఇండియాలకు సంబంధించిన రాక్స్ లో అత్యధికంగా బుక్స్ కన్పిస్తున్నాయి. ఆఫ్రికా, అమెరికాలది తర్వాతి స్థానం.


అక్కడ ప్రాచీన తాళపత్ర గ్రంథాలు అనేకం ఉన్నాయి. అలాగే నూటయాభై సంవత్సరాల క్రితం ప్రచురితమైన బుక్స్ కూడా భద్రపరిచి వున్నాయి.


అదో పుస్తక ప్రపంచం. అందులో తనకు కావలసిన సమాచారం ఏ ఖండంలో ఏ దేశానికి చెందిన గ్రంథంలో లభిస్తుందో ఎలా తెలుసుకోవడం?


అలాగని మొత్తం బుక్స్ గాలించాలి అంటే అందుకు ఒక్కరోజు కాదు, ఒక జీవితకాలం చాలదు. వాటిలో అనేక భాషలకు చెందిన గ్రంథాలున్నాయి. తనకు ఇంగ్లీషు హిందీ, తెలుగు తప్ప మరో భాష తెలీదు.


కాస్సేపు దీర్ఘంగా ఆలోచించింది శతపత్ర.


తెలీక ఒక మనిషి ప్రమాదకరమైన ప్రాంతం లో అడుగుపెట్టి ప్రాణాలు పోగొట్టుకోవటం వేరు. ఏదో ఉంది అని తెలిస్తే, అది ఎంత ప్రమాదభరితమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు మనిషి.


అక్కడ అటువంటి ప్రదేశాల గురించే కాదు, మంత్ర తంత్రాలు, క్షుద్రవిద్యలు, భూతప్రేత పిశాచ సంబంధమైనవి, రకరకాలైన విష ప్రయోగాల గురించి, అత్యంత ప్రమాదకరమైన యుద్ధవిద్యల గురించి, మహారాజుల, రాణుల శృంగార జీవితాల గురించి, దేవదాసీల గురించి ఇలా ఒకటేమిటి మనిషికి మంచి చేసేవి, హానిచేసే సాహిత్యమంతా అక్కడ ఉంది.


అతి నిగూఢము, అతి ప్రమాదకరము అయినటువంటి ఆ సమాచారం సామాన్యు లకు అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సాహిత్యాన్ని ముందు చూపుతో ఇలా రహస్యంగా భద్రపరిచిన బ్రిటీషర్ల దూరాలోచనకు అబ్బురపడి మనసులోనే అభినందించకుండా వుండలేక పోయింది శతపత్ర.


తను ఇండియన్. తనకు వస్తున్న కల కూడా భారత భూభాగానికి చెందినదే అయి వుండాలి. కాబట్టి మిగిలిన ఖండాలు దేశాలతో తనకు పనిలేదు. ముందుగా ఇండియా విభాగం నుంచే తన పరిశీలన ఆరంభించటం మంచిదనిపించింది.

ఆసియా విభాగంలో ఇండియాకు చెందిన బుక్స్ ఉన్న రాక్స్ వైపు వెళ్ళింది. అలా వెళ్తూండగా ఎందుకో ఆమె అడుగులు తడబడ్డాయి. చలి చలి వాతావరణంలో కూడా చిరుచెమటలు పోస్తున్నాయి. ఆపైన కుడికన్ను ఇంకా అదురుతూనే వుంది.


ఏదో ఊహాతీతమైన అదృశ్యశక్తి తన ముందు కదులుతున్నట్టుగా, ఏవో తెలీని విచిత్ర ఆలాపనలు తన చెవులకు సోకుతున్నట్టుగా భ్రమ కలుగుతోంది.

అయినా కూడా అడుగు వెనక్కి తగ్గలేదామె. సహజంగానే ఆమె ధైర్యస్తురాలు, మహా మొండి.


తన మానసిక సంఘర్షణలను పక్కకునెట్టి సూటిగా రాక్స్ ముందు కెళ్ళింది. వాటిలో మళ్ళీ ఇంగ్లీషుతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ ప్రాంతీయ భాషల సెక్షన్లు ఉన్నాయి. వాటిలో అనేక తాళపత్ర గ్రంథాలు, ఎప్పుడో ప్రింటయిన పుస్తకాలు కూడా ఉన్నాయి.


ముందుగా తెలుగుభాష నుంచి తన అన్వేషణను ఆరంభించింది శతపత్ర. ఒక్కో గ్రంథం తీసి చూసి తిరిగి అతిజాగ్రత్తగా యథాస్థానంలో ఉంచుతోంది. తెలుగు సాహిత్య పరిశీలనకి సుమారు నాలుగు గంటల సమయం వెచ్చించినా ప్రయోజనం కలగలేదు.


తర్వాత హిందీ సాహిత్యం వైపు మళ్ళింది. అన్నీ మర్చిపోయిందామె, సాయంకాలం మూడు గంటలయింది.


తనకు కావలసిన సమాచారం ఏదో ఒక గ్రంథంలో లభించకపోదు అనే ఆశతో వరుసగా గ్రంథాలను తిరగేస్తూనే వుంది. సరిగ్గా ఆమె చూస్తున్న రాక్ లో హిందీ పుస్తకాలకు పై అరలోనే ఉన్నాయి ఇంగ్లీషు పుస్తకాలు, ఆమె ఒక తాళపత్ర గ్రంథాన్ని తీసి చూసి తిరిగి యథాస్థానంలో ఉంచుతూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. పై వరుసలోని ఇంగ్లీషు బుక్స్ లోంచి ఎవరో తోసినట్టుగా ఒక బుక్ జారి ఆమె మీద పడింది.


ఏం జరిగిందో అర్ధంగాక అదిరిపడి ఒక్కసారిగా ఎగిరి వెనక్కి దూకింది శతపత్ర, ఆమెనుంచి జారి దబ్బున నేలమీద పడిందా పుస్తకం.


అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఆ సంఘటన తో రెండు నిముషాల వరకు ఆమె గుండెదడ తగ్గలేదు. కింద పడున్న బుక్ వంక ఒకింత బెదురుగా చూసింది.


అది తాళపత్ర గ్రంథం కాదు.


మామూలు పేపరు మీద ప్రింటయిన చందమామ సైజులోని ఇంగ్లీషు పుస్తకం. చాలా పాతది. అట్టమీద ఏదో ముఖచిత్రం ప్రింటయి ఉంది. ధైర్యాని కూడగట్టుకుంటూ వంగి ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని, సరిగ్గా తిప్పి ముఖ చిత్రాన్ని చూసింది. అంతే-


మరోమారు షాక్ తో బిగసుకుపోయింది.

ఆమెకి తన కల ఎదురుగా సాక్షాత్కరించినట్టయింది.


మూడు కొండగుట్టలు, వాటిమధ్యలో లోయ ప్రాంతం. తను నిలబడి చూస్తుండగా కలలో ఆ ప్రాంతం తనకు ఎలా కన్పించిందో సరిగ్గా అదే దృశ్యం ఆ పుస్తకానికి ముఖచిత్రంగా ముద్రించబడి వుంది.


'అన్ సాల్వడ్ అండ్ డేంజర్ మిస్టరీస్ ఇన్ ఇండియా' అనే టైటిల్ తో ప్రింటయిన ఇంగ్లీషు బుక్ అది.


ముఖచిత్రం దిగువన 'ది వ్యాలీ ఆఫ్ గరుడా' అని ప్రింటయి ఉంది. పేపరు చాలా డెలికేట్ గా ఉంది. తాకితే చాలు చినిగిపోయేలా ఉంది.


కలలో తను చూసిన దృశ్యం. చేతిలో పుస్తకం అట్టమీద అదే దృశ్యం. తిలకిస్తున్న శతపత్రకి చేతులు వణుకుతున్నాయి. రంగు మాసినా దృశ్యం స్పష్టంగానే ఉంది. ఆ దృశ్యం తాలూకు ప్రాంతాన్ని గరుడలోయగా వ్యవహరిస్తారని అర్థమైంది.


కాని... కానీ... ఈ లోయకు, తనకు ఏమిటి అనుబంధం. పదే పదే తన స్వప్నంలో ఎందుకు సాక్షాత్కరిస్తోంది? అసలు ఆ లోయలో ఏముంది?


అన్నిటికీ మించి తన శ్రమను చూసి జాలిపడి ఏదో అదృశ్యశక్తి తనకు సాయం చేసిందా అన్నట్లుగా పై అరలోని ఆ బుక్ తానుగా జారి తనమీద పడ్డం ఏమిటి?


ఆ పుస్తకాలన్నీ సీడీల్లో భద్రపరిచే వుంటారు. కాని తను కంప్యూటర్లో అన్వేషించే అవకాశం లేదు.


ఎందుకంటే అఫీషియల్ గా పర్మిషన్ తో వచ్చినవారికి మాత్రమే ఆ సౌకర్యం ఉంది. అనఫీషియల్ గా తను కంప్యూటర్ వినియోగిస్తే రికార్డవుతుంది. స్టీఫెన్ వార్నర్ చిక్కుల్లో పడతారు. అందుకే తనను డైరెక్ట్ గా లోపలకు పంపించారాయన...ఆలోచిస్తూ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క పేజీ తిరగేయసాగింది శతపత్ర. 


అది పందొమ్మిది వందల అయిదో సంవత్సరంలో ప్రింటైన బుక్, అంటే దాని వయస్సు సుమారు నూట అయిదు సంవత్సరాలు. ఇంగ్లీషు భాషలో ఇంగ్లాండు లోనే ప్రింటయింది. ఆ పుస్తకాన్ని రాసిన రచయిత పేరు జాన్ ఉడ్.


ఆ కాలంలో అతనో ప్రముఖ జర్నలిస్టు, టూరిస్ట్ కూడా. బ్రిటీష్ పరిపాలనా కాలంలో అతను ఒక సంవత్సరం పాటు ఇండియాలో విస్తృతంగా పర్యటించాడు. మళ్ళీ తిరిగి ఇంగ్లాండు వచ్చాక అక్కడ సాంఘిక రాజకీయ పరిస్థితుల గురించి, భారతీయుల స్వాతంత్య్ర కాంక్ష గురించి, భారత నైసర్గిక స్వరూపం; అక్కడి వింతలు, విశేషాలను గురించి అనేక రచనలు చేశాడు. అలాంటి వాటిలో ఈ 'అన్ సాల్వడ్ డేంజర్ మిస్టరీస్ ఇన్ ఇండియా' అనే పుస్తకం ఒకటి.

పుస్తకం ఆరంభ పరిచయంలోనే తన మాట గా రచయిత జాన్ ఉడ్ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. 


బహుశా ఈ ఒక్క కాపీ తప్ప ప్రపంచవ్యాప్తం గా దీని తాలూకు కాపీలన్నీ ఎప్పుడో నాశనమైపోయి వుండాలి. అసలు ఇలాంటి ఒక బుక్ ఉందని తాను ఎప్పుడూ వినలేదు.


ఆ బుక్ 1905లో ప్రింటయిందంటే, అప్పట్లో ఇండియాలో అది బెంగాల్ రెండుగా విభజన జరుగుతున్న కాలం, లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో బెంగాలు అప్పుడే తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని రెండుగా విభజించారు. అందుకు దారితీసిన పరిస్థితులు చాలా ఉన్నాయి.


జూలై ఏడో తేదీ 1905న బెంగాల్ విభజన అనంతరం అందుకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిచాయి. అలనాటి ప్రముఖ తెలుగు మాసపత్రిక 'భారతి' వ్యవస్థాపక సంవత్సరం కూడా అదే.


అలాగే సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయం స్థాపించబడింది కూడా అదే సంవత్సరం. ఆ మరుసటి సంవత్సరమే 1906లో దాదా భాయి నౌరోజీ అధ్యక్షతన కలకత్తా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన ప్రముఖ ఆంధ్రుల్లో పి.ఆనందాచార్యులు, హరి సర్వోత్తమరావు, మునగాల రాజా, కొమర్రాజు లక్ష్మణరావు వంటి స్వాతంత్ర్య సమరయోధులున్నారు. ఆ సమావేశంలోనే వందేమాతరం గీతాన్ని జాతీయగీతంగా స్వీకరించటం జరిగింది. స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆ సమావేశంలోనే.


అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆ కాలంలో ఇక్కడ ఇంగ్లాండ్ లో ముద్రితమైన అరుదైన పుస్తకం ఇప్పుడు తన చేతుల్లో ఉంది. దీర్ఘంగా ఆలోచిస్తూ పేజీలను జాగ్రత్తగా తిరగేస్తోంది శతపత్ర. మొత్తం ఏడు మిస్టరీలకు సంబంధించిన సమాచారంతో వంద పేజీల బుక్ అది. దగ్గర్లోని టేబిల్ ముందు కూర్చుని చదవటం ఆరంభించింది.


ముందుగా అందులో ఒక సొరంగ మార్గం గురించి చెప్పబడింది. అది గుజరాత్ తీరంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరానికి సంబంధించినది. నీట మునిగే సమయానికి అంతులేని సిరిసంపదలతో తులతూగుతున్న నగరం ద్వారక. ఆ పైన శ్రీకృష్ణుని వద్దగల శమంతకమణి అనే సూర్య ప్రసాదితమైన హారం రోజుకి కొన్ని పుట్ల బంగారాన్ని ఇచ్చేదట.


మణిమయ రత్నఖచితమైన బంగారు గోపురాలతో అలరారే రాజసౌధాలు, జనా వాసాలతో సహా నగరం నీట మునిగింది. అత్యవసర సమయాల్లో తప్పించుకోవడానికి రాజసౌధం నుండి అనేక సొరంగ మార్గాలు ఉండేవట.


ప్రస్తుతం ఉన్న ద్వారకకు పదిమైళ్ళ దూరం లోని అటవీ ప్రాంతంలోని కొండల్లో ఒక సొరంగ మార్గం ఉంది. అది నీట మునిగిన ద్వారక రాజసౌధం నుంచి ఏర్పరచిన సొరంగ మార్గం అని స్థానికుల నమ్మకం.


ఆ సొరంగ మార్గంలో వెళ్తే నీటిలో ఉన్న అలనాటి ద్వారక రాజసౌధంలోకి చేరుకో వచ్చని, ఆ విధంగా అక్కడి సంపదను తెచ్చుకోవచ్చని ఆశపడి ఎందరో సొరంగం లోకి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళలో ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగిరాలేదు. గతకాలం నుంచి కొన్ని వందలమంది అదృశ్యమయి వుంటారు.


అయినా సరే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆ సొరంగంలో ప్రవేశించి అదృశ్యమవుతూనే వున్నారు. గుంపుగా వెళ్ళినవాళ్ళు తిరిగి రాలేదు. లోపల ఏం జరుగుతుందనేది వేల సంవత్సరాలు గడిచినా మిస్టరీగానే ఉండిపోయింది.


స్థానికులతో మాట్లాడి సేకరించిన అలాంటి సంఘటనల్ని కూడా చక్కగా ఆ పుస్తకంలో పొందుపరిచాడు జాన్ ఉడ్..


ఆ సొరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని రాశాడు జాన్ ఉడ్.


అంతేకాదు. ఆ సొరంగం మిస్టరీ ఏమిటో ఛేదించాలని ప్రభుత్వం పంపించిన కొందరు సాహసికులు సారంగంలో కొంతదూరం వెళ్ళి ఇక ముందుకు పోలేక భయంతో వెనక్కి వచ్చేసిన సంఘటనలను కూడా ఉదహరించాడు.


ఆ విశేషాలు చదివి ఆలోచనలోపడింది శతపత్ర. ప్రస్తుతం ద్వారక చుట్టుపక్కల అలాంటి ఒక సొరంగమార్గం ఉన్న సమాచారం లేదు. దాని గురించి ఇప్పుడు ఎవరికీ తెలిసినట్టు కూడా లేదు. బహుశా అప్పట్లోనే బ్రిటీష్ ప్రభుత్వం ఆ సొరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయించి వుంటుంది.


పుస్తకంలో రెండో మిస్టరీగా అస్సాం ప్రాంతం లోని కొండమీది ఒక బావి గురించి చెప్పబడింది. తనకు కావలసిన గరుడ లోయ సమాచారం నాలుగో మిస్టరీ.


డైరెక్ట్ గా ఆ పేజీలు తీసి చదవడానికి ధైర్యం చాలడం లేదు. అయినా సాహసించి ఆ పేజీల్లోకి వెళ్ళబోతూండగా సడన్ గా మోగింది ఆమె సెల్ ఫోన్.


ఉలిక్కిపడి టైమ్ చూసింది శతపత్ర. సాయంకాలం నాలుగు గంటలు. ఫోన్ చేసింది బాబాయి. ఆయన తనకు ఫోన్ చేయడం చాలా చాలా అరుదైన విషయం.

ఫోన్ ఆన్ చేసింది. 


“ఏం తల్లీ... ఎక్కడున్నావ్?" బాలగోపాలం గొంతు ఫోన్ లో.


"లైబ్రరీలో ఉన్నాను బాబాయ్. వచ్చేస్తాను" చెప్పింది.


"లేదమ్మా నువ్వు వెంటనే బయలుదేరి రావాలి"


"ఏమైంది బాబాయ్?”


"నో ఆర్గ్యుమెంట్స్... నీ కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటాను. వెంటనే బయలుదేరు.”


"ఓ.కె బాబాయ్. వచ్చేస్తున్నాను.”


ఫోన్ ఆఫ్ చేసి ఆలోచనల్లో పడిపోయింది. ఏమిటంత అర్జంటు పని? ఊహకి అందటం లేదు. ఎంతో ముఖ్యమైన పని అయుండాలి. లేకపోతే బాబాయి ఇలా వెంటనే బయలుదేరమని ఒత్తిడి చేయడు.


ఇక ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న మినీ డిజిటల్ కెమెరాతో ఆ పుస్తకాన్ని కవర్ డిజైన్ తో సహా ప్రతి పేజీని చకచకా ఫోటోలు తీయటం ఆరంభించింది. ఇరవై నిముషాల్లో ఆ పని పూర్తి చేసింది.


తర్వాత ఆ బుక్ ని భద్రంగా యధాస్థానంలో ఉంచి డిజిటల్ కెమెరాని తన వేనిటీ బ్యాగ్ లో జాగ్రత్త చేసుకుని అప్పుడు స్టీఫెన్ వార్నరికి ఫోన్ చేసింది.


మూడు నిముషాల తర్వాత ఆయన వచ్చి తలుపులు తెరిచాడు. "ఏమైంది శతపత్రా? నీక్కావలసిన సమాచారం దొరికిందా?” అంటూ ఆతృతగా అడిగాడు.


“లేదు సర్” కావాలనే అబద్ధం చెప్పింది శతపత్ర.


"మా బాబాయి ఎందుకో వెంటనే రమ్మని ఫోన్ చేశారు. వెళ్ళాలి. మరోసారి వస్తాను సర్” అంది తిరిగి తనే.


"ఓ.కె. ఇట్సాల్ రైట్... శ్రమపడందే ఫలితం దక్కదమ్మా. ట్రై అగైన్. నీకోసం మరో అవకాశం తప్పకుండా ఇస్తాను" అంటూ డోర్స్ లాక్ చేశాడు.


ఆయన తన ఛాంబర్ లోకి వెళ్ళగానే శతపత్ర వేగంగా బయటకి వచ్చేసింది. స్కూటీని స్టార్ట్ చేసి తాముంటున్న సౌత్ లండన్ లోని గ్యాలక్సీ అవెన్యూ థర్డ్ రోడ్ లోని యూనివర్సల్ టవర్స్ దిశగా పోనిచ్చింది.

🍁

*సశేషం*

Saturday, 14 February 2026

లక్ష్మి అష్టో త్తరo ఆధారంగా పద్యాలు భావాలు




001. శ్రీదేవీ

అర్థం: సర్వమంగళస్వరూపిణి, సౌభాగ్యానికి అధిష్ఠాన దేవత

👉 శుభం, శోభ, శ్రీ అన్నింటికీ మూలమైన అమ్మ.

001.శా

శ్రీదేవీసహ దీప్తి సఖ్యతగనున్ శ్రీతృప్తి సౌభాగ్య దా

శ్రీదేవీ నిధి విశ్వ మార్గముగనున్ శ్రీ శక్తి శోభాకృతిన్

శ్రీదేవీ శుభ మూలమైనసహనమ్ శ్రీమంత్రి తీరేయగున్

శ్రీదేవీ మది సర్వ మంగళముగన్ శ్రీ సృష్టి కార్యార్థి గన్

 — వరుస భావం

శ్రీదేవి దీప్తి, సఖ్యతలతో కూడి భక్తుని హృదయంలో తృప్తి, సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. ఆమె నిధిస్వరూపిణిగా సమస్త విశ్వానికి మార్గదర్శకమైన శ్రీశక్తిగా, శోభతో కూడిన ఆకృతిగా ప్రకాశిస్తుంది. శుభానికి మూలమైన సహనాన్ని అందించి, అంతరంగంలో మంత్రంలా పనిచేసే శక్తిగా నిలుస్తుంది. అటువంటి శ్రీదేవి మనస్సును సర్వమంగళమయంగా చేసి, సృష్టి కార్యాలన్నిటికీ అర్థాన్ని ప్రసాదించే ఆదిశక్తిగా విరాజిల్లుతుంది.

👉

002. పద్మా

అర్థం: కమలంలో నివసించువది

👉 అపవిత్రతలోనూ అంటుకోని పవిత్ర తత్త్వం.

పద్యం 

పద్మా నివాస విధి వాంఛ ఫలంబుగన్

పద్మాసనాస్థితిగసర్వ పదంబు గానున్

పద్మా శుభ శోభనమార్గ ప్రమాణమేనున్

పద్మా ప్రసిద్ధిగ సహా నుపయోగ మేనున్

 వరుస భావం

పద్మా అయిన అమ్మ, జీవుని వాంఛలకు విధిబద్ధమైన ఫలాన్ని ప్రసాదించేది. ఆమె పద్మాసనస్థితిగా సమస్త పదార్థాలలో ఆధారంగా నిలిచి, ప్రతి స్థితికీ కేంద్రబిందువుగా ఉంటుంది. శుభం, శోభ కలిసిన మార్గాన్ని ప్రమాణంగా చూపిస్తూ జీవనానికి దిశను నిర్ధారిస్తుంది. అటువంటి పద్మాస్వరూపిణి లోకంలో ప్రసిద్ధిగా, ఉపయోగకరమైన ఫలస్వరూపంగా భక్తుల జీవితంలో వికసిస్తుంది.

****

003. కమలా

అర్థం: కమలస్వరూపిణి, సౌందర్య–సౌమ్యతల సమ్మేళనం

👉 కాంతి, లావణ్యం, కృప ఒకటైన రూపం.

పద్యం 

కమలా యపరంజిత దేహమణీ

విమలా చరితాభవభాగ్య మణీ

మమతామనసాసమపద్మ మణీ

సమయానికితృప్తిభవాధరిణీ

— వరుస భావం

కమలా అయిన అమ్మ అపరంజితమైన దేహకాంతితో ప్రకాశించే మణిస్వరూపిణి. ఆమె చరిత్ర నిర్మలమైనదై, జీవుని భాగ్యాన్ని వికసింపజేసే శుద్ధశక్తిగా నిలుస్తుంది. మమకారంతో నిండిన మనస్సును సమపద్మంలా సమతుల్యంలో ఉంచి, కాలానుగుణంగా తృప్తిని ప్రసాదించి భవబంధాలను ధరించి క్రమబద్ధం చేస్తుంది.

*****

004. లోకమాతా

అర్థం: సమస్త లోకాలకు తల్లి

👉 భక్తుడు–అభక్తుడు అనే భేదం లేని మాతృకరుణ.

పద్యం.

లోకమాతావిలోలమ్బగా వాసవీ

శ్రీకరామ్భోజ శ్రీరంగ శ్రీరత్నణీ

శ్రీ కళా సేవసద్విత్వ మున్ శ్రీస్థితీ

స్త్రీకధాశ్రీమతీస్త్రీస్థితీ శ్రీ నిధీ

— వరుస భావం

లోకమాత అయిన అమ్మ సమస్త లోకాలకు ఆధారంగా, విలోలంబగా అన్ని స్థితులను ధరిస్తూ నిలుస్తుంది. వాసవీ స్వరూపిణిగా దేవతలకూ శ్రీకారిణిగా ఉండి, కమలస్వరూపమైన శ్రీరంగంలో రత్నంలా ప్రకాశిస్తుంది. కళ, సేవ, సద్గుణాల సమన్వయంగా శ్రీస్థితిని నిలిపి, స్త్రీత్వ మహిమను శక్తిగా ప్రతిష్ఠిస్తుంది. అటువంటి లోకమాతా సమస్త కథలకు మూలమైన శ్రీమతిగా, నిత్యనిధిగా జగత్తును పోషిస్తుంది.

👉 ***

005. హరిప్రియా

అర్థం: శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది

పద్యం 

హరిప్రియా సదా ప్రవాహ రంజణీ సుమంబుగన్

దరీ నిజంబుగన్ ప్రభోద మాధురీ సుఖంబుగన్

ధరాతలంబునేస్తమైధరిత్రిగా నిదాణంబున్

విరక్తిశక్తియుక్తిగా విశాలభక్తిగా ముక్తిగన్

 — వరుస భావం

హరిప్రియా అయిన అమ్మ నిత్యప్రవాహంలా భక్తుని హృదయాన్ని రంజింపజేసే మాధుర్యస్వరూపిణి. ఆమె బోధ సత్యంతో నిండినదై, అంతరంగాన్ని సుఖప్రకాశంగా మారుస్తుంది. భూమిపై ధరణిగా నిలిచి, జీవనానికి ఆధారమై వ్యవస్థను కాపాడుతుంది. విరక్తి శక్తితో కూడిన విశాలభక్తిని పెంపొందించి, చివరికి ముక్తిని ప్రసాదించే పరమగమ్యంగా నిలుస్తుంది.

👉 ఇక్కడ హరిప్రియా అంటే

విష్ణువుకు ప్రియమైనది మాత్రమే కాదు,

భక్తుని ముక్తిమార్గానికి ప్రియమైన శక్తి.

🌸 

6. ఓం శ్రీరంజన్యై నమఃఅర్థం:శ్రీని (సంపద, శుభం, శ్రేయస్సు) ఆనందింపజేయు తల్లి.భక్తుల హృదయాలను సంతోషంతో నింపే లక్ష్మీదేవి.

శ్రీ రంజిన్యభవామృతంబుకళగన్ శ్రీ లక్ష్మి సంతోష మున్
ధీరంసఖ్యత లక్ష్యమూల్యము గనున్ ధ్యేయంబు నిత్యంబుగన్
వైరంబున్ కథ లీలమార్గముగనున్ వైపర్య సౌకర్యమున్
ప్రారంబున్ మదిదీక్షతీరుగకథల్ ప్రావీణ్యతా భాగ్యంబు గన్
తాత్విక ప్రవాహం. —
అమ్మ స్వయంగా ఆనందస్వరూపిణిగా, ఆనందాన్ని ప్రసాదించేవారిగా దర్శింపజేస్తుంది.
—లక్ష్మీ తత్త్వం కేవలం భోగం కాదు, జీవన లక్ష్యంగా మారాలి అన్న సందేశం స్పష్ట —విరోధాలే కూడా లీలగా మారే స్థితి – ఇది భక్తి పరిపక్వతకు సంకేతం.
ప్రావీణ్యతా భాగ్యంబు —సంపద అనేది కేవలం ధనం కాదు;బుద్ధి, దీక్ష, నైపుణ్యం అన్నీ కలసిన భాగ్యం అని ముద్ర వేస్తుంది.
****

[9/2 7:11 AM] Mallapragada Sridevi: 7. ఓం శ్రీకర్యై నమః
అర్థం:
శుభకార్యాలను కలిగించునది.
మంగళం, ఐశ్వర్యం, కార్యసిద్ధి ప్రసాదించే అమ్మ.

శ్రీకర్యై భవభంజనాభరితమున్ శ్రీధైర్య విశ్వాసమున్
శ్రీ కర్యై వరదేహదాహముగనున్ శ్రీలక్ష్య సర్వంబుగన్
శ్రీ కర్యై నవవైభవంబు గతిగన్ శ్రీయుక్తి సౌలభ్యమున్
శ్రీ కర్యై తరుణంబుభాగ్యతగనున్ శ్రీ లక్ష్య వైనంబుగన్
వరుస భావం:
అమ్మ శ్రీకర్యై —
భవబంధాలను భంజించు శక్తితో నిండి,
మనసుకు ధైర్యం, జీవితానికి విశ్వాసం ప్రసాదించునది.
ఆమె కృపవల్ల శరీర–మనో బాధలు శమించి,
లక్ష్యము స్పష్టమై, కార్యమంతయూ శుభఫలమునకు దారితీయును.
నూతన వైభవములు జీవనంలో ప్రవేశించి,
బుద్ధికి యుక్తి, కార్యాలకు సౌలభ్యం కలుగజేసి,
సమయానుకూలంగా భాగ్యాన్ని అనుగ్రహించును.
ఈ విధంగా శ్రీకర్యై
ప్రయత్నానికి సిద్ధి, సంకల్పానికి ఫలం,
జీవితానికి మంగళం, ఐశ్వర్యం ప్రసాదించు
సర్వశుభకార్యాధిష్ఠాత్రి గా విరాజిల్లును.
[9/2 7:24 AM] Mallapragada Sridevi: 8. ఓం శ్రీవల్ల్యై నమః
అర్థం:
శ్రీ (లక్ష్మి) స్వరూపమైన వల్లి;
శ్రీమన్నారాయణునికి ప్రియమైన దివ్య భార్య.

శ్రీ వల్యై సమతృప్తిగాంచగలగన్ శ్రీ విద్య శ్రీతృప్తిగన్
శ్రీ వాక్కుల్ శుభశోభశోధనగనున్ శ్రీ దివ్య కాంతుల్ సుధీ
శ్రీ విధ్యా పరకారణంబగుటయున్ శ్రీ వైపరీత్యా మదీ
శ్రీ విశ్వాస గుణాన్వితాలయలుగన్ శ్రీ కార్య భక్తీయగున్
శ్రీవల్లి అనగా శ్రీ స్వరూపమే. ఆమె సన్నిధిలో నిలిచినవాడికి మనసు సమతృప్తిని పొందుతుంది. ఆమె ఆశ్రయముతో శ్రీ విద్య పవిత్రమై వికసిస్తుంది. ఆమె కటాక్షంతో వాక్కులు శుభశోభలతో ప్రకాశిస్తాయి; దివ్య కాంతి, సుధీగుణము మనసును వెలిగిస్తాయి. నిజమైన విద్యకు ఆమె పరమ కారణమై, మనసులోని విపరీత భావాలను శమింపజేస్తుంది. విశ్వాసం, సద్గుణాలు ఆమె ఆలయమై నిలిచి, ఆ విశ్వాసమే కార్యసిద్ధికి దారి చూపే భక్తిగా మారుతుంది.
*****
[9/2 7:34 AM] Mallapragada Sridevi: 9. ఓం శ్రీధర్యై నమః
అర్థం:
శ్రీని ధరించినవది;
సర్వలోకాలకు సంపదను ఆధారంగా నిలబెట్టే శక్తి.

శ్రీధర్యై సుఖవాంఛలైసవరణన్ శ్రీ యాత్మ తప్పేమిటన్
యోధాయోగజయంబువిలువల్ యోగ్యంబు వైనంబుగన్
ప్రాధాన్యంబుగనౌనుసర్వకళగన్ ప్రావీణ్య లక్ష్యంబుగన్
శ్రీధాత్రీ వినయంబుమార్గము గనున్ శ్రీ కార్య బంధంబుగన్
“ఓం శ్రీధర్యై నమః” నామానికి మీ పద్యానికి వరుస భావం ఇలా—
శ్రీధర్యై అనగా శ్రీని తనలో ధరించిన దేవీ. ఆమె సన్నిధిలో సుఖవాంఛలు శుద్ధమవుతాయి; స్వార్థభావాలు తొలగి ఆత్మలోని తప్పులు తరుగుతాయి. యోధుడి ధైర్యంలా, యోగి యొక్క సాధనలాగా, జయం విలువైనదిగా మారి జీవితం యోగ్యమైన మార్గంలో నడుస్తుంది. ఆమె కటాక్షంతో సర్వకళలలో ప్రాధాన్యం లభించి, ప్రావీణ్యం లక్ష్యసిద్ధిగా మారుతుంది. అటువంటి శ్రీధాత్రి వినయమే మార్గముగా చూపించి, చేసిన ప్రతి కార్యాన్ని ధర్మబద్ధమైన బంధంగా, ఫలప్రదమైన భక్తిగా నిలబెట్టుతుంది.
సారంగా—
[9/2 7:44 AM] Mallapragada Sridevi: 10. ఓం శ్రీకాంతాయై నమః
అర్థం:
శ్రీకాంతుని (విష్ణువు) హృదయప్రేయసి;
సౌందర్యం, కాంతి, అనుగ్రహానికి మూలమైన అమ్మ.

శ్రీకాంతాభవచిత్తహృద్యవరమున్ శ్రీ గాంతి సౌందర్యమున్
శ్రీ కావ్యా లయసౌఖ్య భాగ్యతగనున్ శ్రీ మూల్య శ్రీశక్తిగన్
శ్రీ కారుణ్యత భావలక్ష్యముగనున్ శ్రీ తత్వ భాగ్యంబుగన్
🙏
“ఓం శ్రీకాంతాయై నమః” నామానికి మీ పద్యానికి వరుస భావం ఇలా—
శ్రీకాంతాయై అనగా శ్రీకాంతుడైన విష్ణువుకు హృదయప్రేయసి అయిన అమ్మ. ఆమె సన్నిధిలో మనసు హృద్యంగా మారి, వరప్రదమైన శాంతిని అనుభవిస్తుంది. ఆమె నుంచే కాంతి, సౌందర్యం ఉద్భవించి జీవనాన్ని రమ్యంగా చేస్తాయి. కావ్యములో లయలా, జీవితంలో సౌఖ్య–భాగ్యాలను సమన్వయంగా ప్రసాదిస్తూ, విలువలకే అసలైన శక్తిగా నిలుస్తుంది. కారుణ్యమే ఆమె స్వభావలక్ష్యంగా ఉండి, తత్త్వజ్ఞానంతో భాగ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. అటువంటి అమ్మ అనుగ్రహంతో కైంకార్యాలపట్ల జయవాంఛ, ధైర్యబలం పెరిగి, ఆ భక్తి చివరికి కైవల్యాన్ని ప్రసాదించే శ్రీశక్తిగా పరిణమిస్తుంది.
సారాంశంగా—
శ్రీకాంతాయై భక్తుని జీవితంలో సౌందర్యం–కాంతి–కారుణ్యం–భక్తి–కైవల్యం అన్నిటికీ మూలమైన పరమాత్మిక శక్తి.
*****
[09/02, 8:56 pm] Mallapragada Sridevi: 11. ఓం లోకమాత్రే నమః
సర్వలోకాలకు తల్లిగా నిలిచినవారు.

లోకమాత్రే ప్రలోభంబు సర్వంబుగన్
సేకరింపున్ సుస్నేహంబుగానున్ సుధీ
నేక మయ్యేనణేకంబుధ్యానంబుగన్
చాకచక్యoబుగానున్ మహా దీప్తిగన్
వరుస భావం:
సర్వలోకాలకు తల్లిగా ఉన్న అమ్మ,
ఈ జగత్తంతటినీ తన మమకారంతో ఆకర్షించి,
ప్రతి జీవిని స్నేహబంధంతో సమీకరిస్తుంది.
ఒక్కటిగా ఉన్న పరమసత్యం,
అనేకరూపాలుగా ధ్యానమునందు దర్శనమిస్తుంది.
ఆ అనేకత్వాన్ని సమన్వయపరచి,
అద్భుతమైన చాకచక్యంతో
మహా దీప్తిగా జగత్తును ప్రకాశింపజేస్తుంది.
ఇక్కడ
లోకమాత్రే → సర్వజగన్మాత
ప్రలోభంబు → మాయ కాదు, మమకారం, ఆకర్షణ
ఏకం–అనేకం → అద్వైత తత్త్వ ప్రతిబింబం
మహా దీప్తి → చైతన్య ప్రకాశం
అమ్మ తత్త్వం… మాతృత్వం, అద్వైతం, కరుణ—మూడూ ఒక్క
[09/02, 8:56 pm] Mallapragada Sridevi: 12. ఓం పద్మప్రియాయై నమఃi
పద్మమును (కమలం) ప్రీతిగా పొందినవారు.
త భ జ జ గ గ.. 10.
పద్మప్రియాస్వతయెపాధ్య ప్రధాన మేనున్
పద్మ ప్రభావమగుటేసుధ పాశమేనున్
పద్మప్రియాస్వతనుపాధ్యపు పాధ్యపాఠ్యమ్
పద్మకళాన్వితసువిద్యపదా సుమమ్మున్
వర్షభావం
పద్మాన్ని ప్రీతిగా భావించే అమ్మ—పవిత్రతకు, సౌందర్యానికి పరాకాష్ఠ.
ఆమె స్వరూపమే కమలప్రభ; అదే సుధాపాశంలా భక్తుని హృదయాన్ని మృదువుగా బంధించును.
ఉపాధ్యత్వమై ఉపదేశమై, పాఠ్యమై పాఠమై—విద్య అంతా ఆమె నుంచే ప్రసరిస్తుంది.
పద్మకళలతో అలంకృతమైన సువిద్యను వరంగా ప్రసాదించి,
భక్తుని చిత్తాన్ని సుమంలా వికసింపజేసే కరుణామయి తల్లి.
ఇలా భావం గట్టిగా నిలుస్తుంది.
ఇంకా ఛందస్సు–పదబంధం
****
[09/02, 8:56 pm] Mallapragada Sridevi: 13. ఓం పద్మహస్తాయై నమః
చేతిలో కమలాన్ని ధరించినవారు

పద్మహస్తా ప్రభావంబుగానున్ స్థితిన్
పద్మ విశ్వాస భాగ్యంబు తీరేయగున్
పద్మ లక్ష్యా ప్రధాన్యంబుగానున్ విధిన్
పద్మ సిద్ధీశుభంబున్ సుగమ్యమ్ నిధీ
వర్షభావం:
చేతిలో కమలాన్ని ధరించిన అమ్మ—శుభసంకల్పానికి, సౌమ్యతకు ప్రతీక.
ఆమె ప్రభావమే స్థితిగా నిలిచి, విశ్వాసం–భాగ్యాలను పరిపక్వతకు చేర్చును.
లక్ష్యానికి దారి చూపు మార్గదర్శినిగా, విధిని సక్రమంగా నడిపించేది ఆమెనే.
పద్మసిద్ధితో శుభఫలాలను సులభంగా అందించి,
భక్తునికి నిధిలాంటి సంపదను, సుగమమైన జీవనయానాన్ని ప్రసాదించే తల్లి.
*****
[09/02, 8:56 pm] Mallapragada Sridevi: 14. ఓం పద్మాక్ష్యై నమః
కమలసదృశ నేత్రాలు గలవారు.

పద్మాక్ష్యై చూపులగు తీరు ప్రధాన మేనున్
పద్మావతీకళలుతోను ప్రభావమేనున్
పద్మాశుభాశుభ ఫలంబు ప్రకాశ మేనున్
పద్మాక్ష్య నేత్రములతీరు బలంబు గానున్
వరుస భావం:
పద్మాక్ష్యై అనగా —
కమలంలాంటి నేత్రాలున్న అమ్మ.
ఆ చూపు కేవలం సౌందర్యానికే కాదు;
ఆమె చూపు స్వభావమే ప్రధాన శక్తి.
ఆ చూపులో
పద్మావతి లక్షణాలైన
కరుణ, ఐశ్వర్యం, మంగళత్వం
సహజంగా వికసిస్తాయి.
ఆ చూపు పడినచోట
శుభ–అశుభాల భేదం స్పష్టమవుతుంది;
అవిద్య తొలగి, ఫలితాలు ప్రకాశిస్తాయి.
అందుకే —
పద్మాక్ష్యై యొక్క నేత్రాలు
కేవలం చూడవు,
జీవితాన్ని దిశానిర్దేశం చేసే బలంగా మారుతాయి.
****
[09/02, 8:56 pm] Mallapragada Sridevi: 15. ఓం పద్మసుందర్యై నమః
కమలంలా సౌందర్యమూర్తియైనవారు
పద్మావతి కళలుగా ప్రభవంబు సౌకర్యమున్
పద్మ సంభవాసృష్టిగా శుభంబుమది దృష్టిగన్
పద్మ సంకల్ప విశ్వాస విన్యాస సద్భావ తీరుణ్
పద్మసుందర్యై సఖ్యతా అపరంజితా భవాని
వరుస భావ0
→ అమ్మ లక్ష్మీ తత్త్వంగా సౌకర్యం, ఐశ్వర్యం, సౌందర్యంగా అవతరించడం.
→ ఆ సౌందర్యమే సృష్టికి మూలమై, జగత్తునంతటినీ శుభంగా దర్శించే దివ్య దృష్టిగా మారడం.
→ సంకల్పం శుద్ధంగా మొదలై, విశ్వాసంగా నిలిచి, క్రమబద్ధమైన జీవన విన్యాసంగా వ్యక్తమై, చివరికి సద్భావంగా పరిపక్వమవడం.
→ ఈ సమస్త ప్రక్రియల తుదిస్వరూపమే
సౌందర్యంతో కూడిన అజేయ శక్తిగా అమ్మ అవతరించడం.
*****

[10/02, 7:44 am] Mallapragada Sridevi: 16. ఓం పద్మోద్భవాయై నమః
కమలమునుంచి అవతరించినవారు.

పద్మోద్భవాసహమదీయ పదంబుగానున్
సద్భావ వాంఛగసుఖాలు సమoబుగానున్
విశ్వాత్మ దేహమున విద్య వినమ్రతేనున్
విశ్వాక్షి గానిధి మయంబు విధంబు గానున్
వరుస భావం (భావార్థ సారాంశం):
కమలమునుంచి అవతరించిన ఆ పరాశక్తి,
పద్మోద్భవ స్వరూపముతో భక్తుల పాదములను ఆశ్రయంగా స్వీకరించి,
సద్భావములైన కోరికలకు సుఖసమృద్ధిని ప్రసాదించుచు,
విశ్వమంతటా ఆత్మరూపంగా వ్యాపించి,
విద్యతో వినయాన్ని అలంకరించి,
సర్వదృష్టి కలిగిన విశ్వాక్షిగా,
నిధివలె అపార కృపతో జగత్తును నడిపించుచున్నది.
👉 భావక్రమం ఇలా సాగుతుంది:
ఉద్భవం (పద్మం) → ఆశ్రయం (పదం) → అనుగ్రహం (సద్భావ సుఖం) → వ్యాప్తి (విశ్వాత్మ) → లక్షణం (విద్య–వినయం) → ఫలితం (విశ్వక్షేమం)
****
[10/02, 7:44 am] Mallapragada Sridevi: 17. ఓం పద్మముఖ్యై నమః
కమలసమాన ముఖకాంతి కలవారు.

పద్మముఖ్యకాంతిగా పదాంభవాంబు శక్తిగన్
పద్మలోక ధర్మమై భవాoమృతంబు  యుక్తిగన్
పద్మ సంభవామదీ పరాత్పరాగుణంబుగన్
పద్మ మాయమర్మమేపదామృతంబు ముక్తిగన్
వరుస భావం (భావార్థ సారాంశం):
కమలసమానమైన ముఖకాంతి కలిగిన ఆ పద్మముఖి,
పాదకమలాల నుంచే శక్తిగా ప్రవహించుచు,
పద్మలోక ధర్మస్వరూపిణిగా
భవబంధమును చెరిపి అమృతత్వాన్ని యుక్తిగా అనుగ్రహించుచున్నది.
ఆమె పద్మసంభవమైన పరాత్పర గుణములతో
సృష్టి–స్థితి–లయాలకు ఆధారమై నిలిచి,
పద్మమాయ అనే సూక్ష్మ రహస్యాన్ని బోధించుచు,
భక్తులకు పాదామృత రూపమైన ముక్తిని ప్రసాదించుచున్నది.
👉 భావక్రమం స్పష్టంగా ఇలా సాగుతుంది:
ముఖకాంతి (సౌందర్యం) → పాదశక్తి (ఆధారం) → ధర్మం–అమృతం (రక్షణ) → పరాత్పర గుణం (తత్త్వం) → మాయమర్మం (రహస్యం) → ముక్తి (ఫలితం)
*****
[10/02, 7:44 am] Mallapragada Sridevi: 18. ఓం పద్మనాభప్రియాయై నమః
పద్మనాభునికి ప్రియమైనవారు.

పద్మనాభప్రియా పద్మకైవల్యతా
విశ్వశక్తి ప్రియా విశ్వ వాంఛప్రియా
జన్మ యుక్తిప్రియా జ్ఞాన కర్మప్రియా
జ్ఞాన లోకప్రియా జ్ఞానగమ్య ప్రియా
వరుస భావం (భావార్థ సారాంశం):
పద్మనాభునికి ప్రియమైన ఆ లక్ష్మీదేవి,
కైవల్యాన్ని ప్రసాదించు పద్మస్వరూపిణిగా నిలిచియుండి,
విశ్వశక్తిగా సమస్త జగత్తు కోరికలకు ప్రియమైనదై,
జీవుల జన్మయుక్తిని సార్థకం చేయు మార్గాన్ని చూపుచున్నది.
ఆమె జ్ఞానానికి ప్రియమైనది, కర్మానికి ప్రియమైనది,
జ్ఞాన–కర్మ సమన్వయమున జీవులను నడిపించుచు,
జ్ఞానలోకమునకు అధిష్ఠాత్రిగా,
జ్ఞానమార్గమున మాత్రమే చేరదగిన పరమగమ్యంగా ప్రకాశించుచున్నది.
👉 భావప్రవాహం ఇలా క్రమబద్ధంగా సాగుతుంది:
పద్మనాభ సంబంధం → కైవల్యం → విశ్వవాంఛ పరిపూరణ → జన్మార్థ సార్థక్యం → జ్ఞాన–కర్మ సమన్వయం → జ్ఞానలోక ప్రాప్తి
****
[10/02, 7:44 am] Mallapragada Sridevi: 19. ఓం రమాయై నమః
ఆనంద స్వరూపిణి.

రమాయై సుఖంబై రసంబై ఋణంబై
ప్రమాణం ప్రధానం ప్రభోదం ప్రభావ్యం
ప్రకీర్తిం ప్రలక్ష్యం ప్రవీరం ప్రలోభం
సుభాగం సభోదం సుభావం సలక్ష్మీ
వరుస భావం (భావార్థ సారాంశం):
ఆనందస్వరూపిణియైన రమాదేవి,
సుఖంగా, రసంగా జీవనమంతా వ్యాపించి,
జీవుల ఋణబంధాలను తీర్చు కరుణామూర్తిగా నిలిచియుండి,
సర్వ ప్రమాణాలకు ఆధారమై,
ప్రధాన తత్త్వంగా,
ప్రబోధాన్ని కలిగించు ప్రభావశక్తిగా ప్రకాశించుచున్నది.
ఆమె కీర్తిగా వ్యాపించి,
లక్ష్యంగా దర్శనమిచ్చి,
వీరత్వానికి ప్రేరణగా,
లోభమునకూ శుభదిశ చూపు నియంత్రకురాలిగా నిలిచి,
సుభాగ్యాన్ని ప్రసాదించు సభోద స్వరూపిణిగా,
శుద్ధమైన సుభావంతో,
లక్ష్మీతత్త్వమంతటినీ తనలో నిలుపుకొని
జగత్తును ఆనందమార్గంలో నడిపించుచున్నది.
👉 భావక్రమం ఇలా సుస్పష్టంగా సాగుతుంది:
ఆనందం (రమా) → సుఖ–రసం (అనుభవం) → ఋణవిమోచనం (కరుణ) → ప్రమాణ–ప్రధాన తత్త్వం (ఆధారం) → ప్రబోధం (జ్ఞానం) → కీర్తి–లక్ష్యం (మార్గం) → సుభాగ్యం–లక్ష్మీ (ఫలితం)
ఈ నామం ద్వారా
లక్ష్మీ = ఆనందం మాత్రమే కాదు, జీవన శాసనం కూడా అన్న భావం అద్భుతంగా వ్యక్తమైంది.
****
[10/02, 7:44 am] Mallapragada Sridevi: 20. ఓం పద్మమాలాధరాయై నమః
కమలమాలలను ధరించినవారు.

పద్మమూలాధరా పద్మ శక్తీధరా
విశ్వమోక్ష ధరా విశ్వ సత్యా ధరా
బ్రహ్మతత్వా ధరా బ్రహ్మ నిష్టా ధరా
సర్వ దీప్తీ ధరా సర్వ ముక్తీ ధరా

వరుస భావం (భావార్థ సారాంశం):
కమలమాలలను ధరించిన ఆ పద్మమాలాధరా,
పద్మమూలమైన సృష్టిశక్తిని తనలో ధరించి,
పద్మశక్తి స్వరూపిణిగా జగత్తుని నిలబెట్టుచున్నది.
ఆమె విశ్వమంతటికి మోక్షాన్ని ధరించిన తల్లి,
విశ్వసత్యాన్ని తన హృదయంలో మోసుకొనిన ధర్మమూర్తి.
ఆమె బ్రహ్మతత్త్వాన్ని ధరించి,
బ్రహ్మనిష్ఠగా స్థిరమైన చైతన్యరూపిణిగా ప్రకాశించుచు,
సర్వదీప్తులను వెలిగించు మహాజ్యోతిగా,
సర్వజీవులకు ముక్తిని ప్రసాదించు పరమకరుణామయిగా నిలిచియున్నది.
👉 భావప్రవాహ క్రమం ఇలా సాగుతుంది:
పద్మమూలం (ఆధారం) → శక్తి (సృష్టి) → సత్యం (ధర్మం) → మోక్షం (లక్ష్యం) → బ్రహ్మతత్త్వం (తత్త్వస్థితి) → దీప్తి (ప్రకాశం) → ముక్తి (ఫలితం)
*****

21. ఓం దేవ్యై నమః

దివ్యశక్తి స్వరూపిణి.

మ. కో.
దేవ్యైవిజ్ఞత ధన్యతాభవ దీక్షతత్త్వము తీరుగన్
దేవ్యై నిర్మల సఖ్యతాభవ దీన తత్పరి సేవగన్
దేవ్యై విశ్వమనస్సుగాభవ దీప్తిగా యగు మూలమున్
దేవ్యై ధర్మము సర్వనేస్తాము దివ్య తేజము కాలమున్
వరుస భావం:
దేవీ స్వరూపమే విజ్ఞానమై, ధన్యతగా, దీక్షాతత్త్వంగా పరిపూర్ణమై ప్రకాశిస్తుంది.
ఆమె నిర్మలమైన సఖ్యతగా, దీనుల పట్ల తత్పర సేవగా కరుణను అవలంబిస్తుంది.
సమస్త విశ్వమనస్సుకు మూలదీప్తిగా నిలిచి, చైతన్యప్రకాశానికి ఆధారమవుతుంది.
అదే దేవీ కాలప్రవాహంలో ధర్మాన్ని సర్వత్ర వ్యాపింపజేసే దివ్యతేజస్వరూపమై ఉంటుంది.

22. ఓం పద్మిన్యై నమః

పద్మసౌందర్య గుణసంపన్నురాలు.
పద్మిన్యైనిర్మల మనస్సు పదంబు గానున్
పద్మిన్యై విశ్వము యనంత ఫలంబు గానున్
పద్మిన్యై గమ్యమగు శాంతి ప్రభావమేనున్
పద్మిన్యై కాంతులగు తత్వ వినో దమేనున్
వరుస భావం:
పద్మినిగా అమ్మ నిర్మలమైన మనస్సుకు ప్రతిరూపం —
ఆ పవిత్ర చిత్తమే భక్తుని హృదయంలో స్థిరపదంగా నిలుస్తుంది.
ఆ నిర్మలత్వమే విశ్వమంతటా విస్తరించి
అనంతమైన ఫలాలను ప్రసాదించే శక్తిగా మారుతుంది.
ఆ ఫలసిద్ధికి దారి చూపేది అమ్మే —
ఆమెయే గమ్యమై, గమనం ముగిసే శాంతిస్వరూపం.
అటువంటి శాంతి నుంచే
కాంతి, తత్వం, వినోదం ఒకే అనుభూతిగా వికసించి
జీవనాన్ని రమ్యమైన తత్త్వయాత్రగా మార్చుతుంది.
****

23. ఓం పద్మగంధిన్యై నమః

కమలసువాసన గలవారు.

పద్మగంధిన్యై హృదయ వాసిన్యే  స్థిరనివాసి
లోక రక్షిని సత్యమనసు నిత్య సమర్ధని
అనంత ఫల శాంతిగమ్యమౌను తాత్వనందిని
జయ విజయ కళలు తీరు భవామృత వాణి
వరుస భావం:
పద్మగంధినిగా అమ్మ హృదయమునే తన నివాసంగా చేసుకొని
భక్తుని అంతరంగంలో స్థిరంగా వెలుగొందుతుంది.
ఆ హృదయవాసమే లోకమంతటికి వ్యాపించి
ఆమెను లోకరక్షకిగా, సత్యమనస్సు కల నిత్య సమర్థ శక్తిగా నిలబెడుతుంది.
ఆ సమర్థత ఫలితంగా
అమ్మ అనుగ్రహం అనంత ఫలాలను ప్రసాదించి, శాంతియే గమ్యమయ్యే తాత్వానందాన్ని అనుభూతి పరచుతుంది.
ఆ ఆనందం నుంచే
జయ–విజయ కళలు, జీవన విజ్ఞానం, భవబంధనాన్ని కరిగించే అమృతవాణి ప్రవహిస్తుంది.
****

24. ఓం పుణ్యగంధాయై నమః

పుణ్యసుగంధంతో లోకాన్ని పవిత్రం చేసేవారు.
పుణ్యగoధాయపూర్వం సహాయంమదీ
పుణ్యతీర్ధాసపూజ్యంబుగానేస్తమున్
సూణ్యవిశ్వాసిసూత్రంబుశోభల్ సుధీ
గుణ్యమౌనంబుగుప్తంబుగానున్ నిధీ
వరుస భావం:
పుణ్యగంధాయైగా అమ్మ
మన ప్రతి కార్యానికి ఆదిలోనే సహాయక శక్తిగా,
అదృశ్యంగా తోడుగా నిలుస్తుంది.
ఆ సహాయం ఫలంగా
ఆమె సన్నిధి పుణ్యతీర్థాల వలె పవిత్రమై,
పూజ్యమై, భక్తుని హృదయంలో ఇష్టస్వరూపంగా నిలుస్తుంది.
అలాంటి పవిత్రత నుంచే
ఆమె శూన్యమై కనిపించే విశ్వానికీ ఒక విశ్వాససూత్రంగా,
సుధీజనులకు శోభనమైన తాత్త్విక బలంగా ప్రకాశిస్తుంది.
ఆ విశ్వాససూత్రం
బయటికి మాటలకందని గుప్తమైన మౌనగుణ్యంగా,
నిధివలె అంతరంగంలో నిలిచి
జీవనానికి లోతైన స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది.
*****

25. ఓం సుప్రసన్నాయై నమః

ఎల్లప్పుడూ ప్రసన్నవదనంతో ఉండేవారు.
మ. కో.
సుప్రసన్నత సుందరేశ్వరి  సఖ్యతాభవ తీరుగన్
సుప్రభావము కాలనిర్ణయ సూత్రధారిగ మూలమున్
స్వప్రకాశిని విశ్వవాహిని వాణిలీలల విద్యగన్
సుప్రభాతము సర్వవేళల సూత్రమేయగు లక్ష్మిగన్
వరుస భావం:
సుప్రసన్నాయైగా అమ్మ
సౌందర్యంతో మాత్రమే కాదు, సఖ్యతాభవంతో భవబంధాలను సౌమ్యంగా తీర్చే ప్రసన్నశక్తిగా అవతరిస్తుంది.
ఆ ప్రసన్నత యాదృచ్ఛికం కాదు —
ఆమెయే కాలనిర్ణయానికి మూలమైన సుప్రభావ సూత్రధారి,
సృష్టి ప్రవాహాన్ని సమతుల్యంగా నడిపే ఆధారశక్తి.
ఆ మూలశక్తి స్వయంగా వెలిగే స్వప్రకాశిని,
విశ్వాన్ని వాహనంగా ధరించి
వాణిలీలలుగా, విద్యా ప్రవాహంగా చైతన్యాన్ని పంచుతుంది.
అందుకే అమ్మ
ప్రతి ఉదయమే కాదు —
సర్వవేళలకూ సుప్రభాతమై,
జీవనమంతటికీ వర్తించే శాశ్వత సూత్రమై లక్ష్మిగా నిలుస్తుంది.
****

[12/02, 6:26 am] Mallapragada Sridevi: 26. ఓం ప్రసాదాభిముఖ్యై నమః

భక్తులపై కృప చూపేందుకు సన్నద్ధురాలు.

ప్రసాదాభిముఖ్యై ప్రదీప్తీ ప్రభావం

ప్రసారోగ్య దీక్షా ప్రకోపా ప్రసూనా

విశాలాక్ష్మి తేజా వినోదత్వ వాణి

ప్రసన్నా భవాణీ ప్రధానంబు గంగా

🔹 సమగ్ర భావం:

భక్తుని పట్ల ఎల్లప్పుడూ కృపాకటాక్షంతో సిద్ధంగా నిలిచే అమ్మవారు,

ఆరోగ్య-ఆనంద ప్రసాదాన్ని పంచే దయామూర్తి;

విశాల దృష్టి, జ్ఞానతేజస్సుతో లీలామయ వాణిగా వెలిగే పరాశక్తి;

ప్రసన్న భవాణిగా గంగాప్రవాహంలా శుద్ధి ప్రసాదించే జగద్జననీ.

****

[12/02, 6:26 am] Mallapragada Sridevi: 27. ఓం ప్రభాయై నమః

దివ్యకాంతి స్వరూపిణి.

ప్రభాయై శుభాంగీ ప్రమోదై సువిశ్వా

శుభోదా సుదీక్షా సుకన్యా సుచిత్రా

శుభావ్యా సులక్ష్యా సులక్ష్మీ సుమిత్రా

సుబంధాలు సుఖ్యా సుదుర్ఘస్వరార్ధా 

🔹 సమగ్ర భావం:

దివ్యప్రభగా వెలిగే అమ్మవారు

శుభమయ అవయవాలతో విశ్వానందాన్ని ప్రసరింపజేసి,

శుభసంకల్పములు, ఐశ్వర్యములు, సత్సంబంధములు ప్రసాదించే పరాశక్తి.

ఆమె కాంతి కేవలం వెలుగు కాదు

జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం, సత్సంగం అన్నింటికీ మూలమైన ఆధ్యాత్మిక ప్రభ.

[12/02, 6:26 am] Mallapragada Sridevi: 28. ఓం చంద్రవదనాయై నమః

చంద్రునిలాంటి ముఖసౌమ్యత గలవారు.

(భ జ స ణ గ గ.. 8. వనమయూరి)

చంద్ర వదనామతిజ సాగుణముగానున్

బిందుసుమయోగసఖిగమ్యపరమౌనున్

చందన సుదీర్ఘకళజాడ్యహర మేనున్

అందరివినోద పరమాధురిగనౌనున్

– సమగ్ర భావం:

చంద్రుని వంటి శాంతసౌమ్య వదనంతో, యోగులకు పరమమౌనరూపిణిగా అనుభవమయ్యే, చందనశీతల కృపతో అజ్ఞానాన్ని తొలగించే, సర్వలోకానందకర మాధుర్యమూర్తియైన దేవిని స్తుతించుచున్నారు.

****

[12/02, 6:26 am] Mallapragada Sridevi: 29. ఓం చంద్రాయై నమః

శీతల కాంతిని ప్రసరింపజేసేవారు.

శా.

చంద్రాయైహరదివ్యలక్ష్యముగనున్ చాతుర్య సంభావ్యతన్

చంద్రాయైకళలీల మాధురితగన్ సామాన్య హృద్యంబుగన్

చoద్రాయైమది లక్ష్మిభాగ్యతగనున్ శాంతంబు సఖ్యంబుగన్

చంద్రాయై జయవాంఛదేహము గనున్ సామర్థ్య వైనంబుగన్

– హరుని (శివుని) దివ్యలక్ష్యస్వరూపిణి; ఆయన మనోనేత్రంలో ప్రతిఫలించే చైతన్యకాంతి. “చాతుర్య సంభావ్యత” — సృష్టి–స్థితి–లయల నిర్వహణలో దక్షత.

– కళలలో లీలామాధుర్యమై, సర్వసామాన్యులకు కూడా హృద్యంగా అనుభవమయ్యేది. చంద్రకాంతి ఎవరినీ వేరుచేయదు; అలాగే ఆమె కృపా ప్రసరణ.

– మనస్సులో లక్ష్మీభాగ్యరూపిణిగా వెలిగి, శాంతి–సఖ్యతలను ప్రసాదించేది. చంద్రకాంతి మనసును ప్రశాంతపరచినట్లు ఆమె అనుగ్రహం చిత్తశుద్ధి కలిగిస్తుంది.

– జయవాంఛ (సత్కార్య విజయం) సాధించుటకు దేహ–మనో సామర్థ్యాన్ని ప్రసాదించేది. ఆమె కాంతి బలహీనతను కాదు, సమర్థతను పెంపొందిస్తుంది.

****

[12/02, 6:26 am] Mallapragada Sridevi: 30. ఓం చంద్రసహోదర్యై నమః

చంద్రుని వంటి శీతల స్వభావం గలవారు.

చంద్రసహోదర్యై విశ్వ వినయ విశ్వాసి విధి

వీక్షణ వినిమయగా వీనుల విందు పరమున్

శిక్షణ రక్షణ తీరు శీఘ్రపర సంతృప్తిగా

అక్షయ పదా భవము అశ్రీత లక్షము గానున్

 భావవిశ్లేషణ 

– విశ్వమంతటికీ వినయస్వరూపిణి; ఆమెపై విశ్వాసమే విధి (ధర్మమార్గం). చంద్రునిలా మృదుత్వం, సౌమ్యత.

– ఆమె కటాక్షమే పరస్పరానుభూతి (వినిమయం); ఆమె దర్శనం, నామస్మరణం భక్తులకు చెవుల విందు (వీనుల విందు). శ్రవణానందదాయక స్వరూపం.

– అవసరమైతే శిక్షణ (శాస్త్రోపదేశం), ఎల్లప్పుడూ రక్షణ; భక్తసంతృప్తి కలిగించడంలో శీఘ్రస్పందన. చంద్రశీతలతలోనూ ధర్మనిర్వహణలో కాఠిన్యం దాగి ఉంటుంది.

– ఆమె శరణు పొందినవారికి అక్షయపదం (మోక్షభవం); ఆశ్రితుల లక్ష్యమంతా ఆమె పాదారవిందమే.

[12/02, 7:58 am] Mallapragada Sridevi: 31. ఓం చతుర్భుజాయై నమః – భావ విశ్లేషణ

నామార్థం:

నాలుగు భుజములతో దివ్యకార్యాలను నిర్వహించువారు. ఈ నాలుగు భుజాలు కేవలం శారీరక లక్షణం మాత్రమే కాదు — శక్తి, జ్ఞానం, కృప, నియమం అనే చతుర్విధ శక్తుల సూచిక.

చెం.

వనిత చతుర్భుజాకదలికేను సునందసుధారిలీలగన్ 

ప్రణతి విధాన పాశముగుప్రాభవ హృద్యసమర్పణాయగున్ 

వినతిగ మస్తకంబున సువిద్యగపుస్తకలీల యజ్ఞమున్ 

అణుకువ యాశలన్నియు కళామయపుష్పసువాస సేవగన్ 


పద్య భావము

– చతుర్భుజాల కదలికలు సునందసుధారిలీలలవలె సౌమ్యముగా, ఆహ్లాదకరముగా ఉన్నాయి. భుజాలు శక్తికి సూచికలు అయినప్పటికీ, అవి కఠినత్వం కాదు — కరుణామయ చలనం.


– ఒక భుజంలో పాశము (బంధనము). అది భక్తులను ప్రేమబంధములో కట్టే సాధనం. భక్తుని ప్రణతి (నమస్కారం) ఆమెకు హృదయసమర్పణగా మారుతుంది.



– మరొక చేతిలో పుస్తకము — జ్ఞానప్రదాతగా ఆమె స్వరూపం. వినయంతో తలవంచిన వారికి సువిద్య యజ్ఞాన్ని అనుగ్రహిస్తుంది.

– మిగిలిన భుజాలు కళామయ పుష్పాల వలె — సేవ, దయ, అనుగ్రహాల సూచికలు. భక్తుని అణుకువ యాశలు సుగంధమై ఆమె సేవలో పరిపూర్ణమవుతాయి.

*****

[12/02, 7:58 am] Mallapragada Sridevi: 32. ఓం చక్రధారిణ్యై నమః

రక్షణశక్తిని ధరించినవారు.


చక్రధారిణ్య సాధ్యా సమాజంభవా

చక్ర దాహంబు మోహoబు చాతుర్య తా

చక్రహృద్యా సజాడ్యా జపా విజ్ఞతా

చక్ర మూల్యా విశాలాక్ష్మి సూత్రా ధరీ 

🔹 పద్య భావ విపులీకరణ

– చక్రాన్ని (సుదర్శన శక్తిని) ధరించిన ఆమె సాధ్యస్వరూపిణి;

– సమాజరక్షణకై అవతరించువారు.

ఇక్కడ “చక్రం” కేవలం ఆయుధం కాదు — ధర్మచక్రం, కాలచక్రం, జ్ఞానచక్రం అన్న మూడు సూచనలు కనిపిస్తున్నాయి.

– చక్రం అజ్ఞానమనే మోహాన్ని దహిస్తుంది;

– దివ్యచాతుర్యంతో దురితాన్ని ఛేదిస్తుంది.

ఇది అంతర్ముఖంగా చూసితే — జ్ఞానచక్రం మనసులోని మోహాంధకారాన్ని కాల్చివేయుట.

– చక్రస్వరూపిణి హృదయంలో స్థితించి జడత్వాన్ని తొలగిస్తుంది;

– జపమార్గంలో విజ్ఞతను ప్రసాదిస్తుంది.

“సజాడ్యా” అనే పదం ద్వారా జడత్వం తొలగింపు భావం బలపడింది.

– చక్రమనే మూల్యమైన రక్షణతత్త్వాన్ని ధరించిన విశాలాక్షి;

– సూత్రధారిలా జగత్తును నడిపించువారు.

ఇక్కడ “సూత్రధరీ” అన్నది మహత్తర భావం — విశ్వనాటకానికి ఆమెనే నేతృత్వం.

****

[12/02, 7:58 am] Mallapragada Sridevi: 33. ఓం పద్మిన్యై నమః

పద్మగుణసంపన్నురాలు.

పద్మిని విశ్వహృద్యమగు పాశము బంధము సర్వ వేళలన్ 

పద్మిని దృష్టిలో సమయ ప్రాభవ లక్ష్యము దివ్య కాంతిగన్

పద్మిని సేవలక్ష్యమగు పాలన సఖ్యత సంభ వంబుగన్

పద్మిని విద్యలీల మదిభావ ప్రధానము రక్షణేయగున్

– పద్మిని విశ్వహృదయాన్ని ఆకర్షించు మాధుర్యబంధము.

– ఇది మోహపాశం కాదు; ప్రేమపాశం.

కమలం ఎలా నీటిలో ఉన్నా తడవదు, అలాగే ఆమె బంధం అనురాగబంధం — ఆసక్తి కాదు, ఆత్మీయత.

– ఆమె దృష్టిలో సమయోచిత ప్రాభవం;

– దివ్యకాంతి లక్ష్యస్పష్టతను ప్రసాదిస్తుంది.

కమలం ఉదయసూర్యకాంతిలో వికసించునట్లే, ఆమె దృష్టి జీవనాన్ని వికాసింపజేస్తుంది.

– సేవే లక్ష్యమై పాలన సాగుతుంది;

– సఖ్యత ద్వారా సంభవించే శాంతి.

ఇది “శాసన” కాదు — “పాలన”. పద్మస్వభావం మృదుత్వం.

– విద్యలీలల ద్వారా మదిలో ప్రధానభావాన్ని స్థాపించి;

– రక్షణతత్త్వాన్ని అనుగ్రహిస్తుంది.

కమలం సరస్సులో ఉండి సరస్సుకే శోభనిచ్చునట్లు, ఆమె జ్ఞానం మనస్సుకు కాంతినిస్తుంది.

*****

[12/02, 7:58 am] Mallapragada Sridevi: 34. ఓం పద్మపత్రాక్ష్యై నమః

కమలదళాల్లాంటి నేత్రాలు గలవారు.


పద్మపత్రాక్ష్యై జూపుల్ సంతృప్తి దివ్యత్వ భావంబుగన్

పద్మపత్రాక్ష్యై విశ్వాస చిన్మాయా ధర్మా ధారిణీ

పద్మపత్రాక్ష్యై సన్మాన సద్భావ సంతోష ధారీ

పద్మపత్రాక్ష్యై ప్రాబల్య ప్రభావ ప్రతిభా లక్ష్మి

— ఆమె దృష్టి (జూపులు) భక్తునికి సంతృప్తి, దివ్యత్వానుభూతి కలిగించునని అర్థం.

“పద్మపత్ర” ఉపమానం కేవలం ఆకృతి కాదు, శాంతి–శీతలత్వ సూచకం కూడా

— ఆమె చూపు విశ్వాసాన్ని నింపుతుంది; చిన్మయ స్వరూపిణి; ధర్మానికి ఆధారం.

ఇక్కడ “ధర్మా ధర్మిణీ” అనేది తత్త్వపరంగా బలమైన ప్రయోగం.

— ఆమె దృష్టి గౌరవాన్ని, సత్సంకల్పాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తుంది.

“ధారీ” అనే పదం గుణాధారత్వాన్ని సూచిస్తోంది.

— ప్రభావం, ప్రతిభ, ఐశ్వర్యం — ఇవన్నీ ఆమె కటాక్షఫలితాలు.

ఇక్కడ “లక్ష్మి” అనగా కాంతి–ఐశ్వర్య–శోభల సమాహారం.

*****

[12/02, 7:58 am] Mallapragada Sridevi: 35. ఓం పద్మాసనస్థాయై నమః

పద్మాసనంపై ఆసీనులైనవారు.


నిత్య పద్మాసనస్థాయ నిర్మలంబి 

సత్య పద్మాసన సకలం సాక్షి తీర్పు ముత్యకాంతి పద్మాసని ముఖ్య మోహ 

ఆది స్థిర పద్మాసనస్థాయి లక్ష్మి 

🔹 భావ విశ్లేషణ

— నిత్యంగా పద్మాసనంలో విరాజిల్లే నిర్మల స్వరూపిణి.

“నిత్య” + “నిర్మల” కలయిక ఆమె కాలాతీత పవిత్రత్వాన్ని తెలియజేస్తోంది

— సత్యాసనంలో కూర్చొని సకల జగత్తుకు సాక్షిగా తీర్పునిచ్చువారు.

ఇక్కడ “సాక్షి” భావం తత్త్వపరంగా చాలా గంభీరమైనది.

— ముత్యంలాంటి కాంతి; పద్మాసనంలోని ప్రధాన మాధుర్యం.

“ముఖ్య మోహ” అన్న పదబంధం — ఆమె మాధుర్యానికి లోకమంతా ఆకర్షితమవుతుందనే సూచన.

— ఆదికారణమైన, స్థిరమైన పద్మాసనాసీన లక్ష్మి.

ఇది ఆమెను ఆది శక్తిగా నిలబెడుతోంది.

*****




 [17/02, 7:43 am] Mallapragada Sridevi: 46. ఓం సత్యాయై నమః

సత్యస్వరూపిణి.


సత్యాసన్నుతిగాసమర్ధతగనున్ సాధ్యంబు జ్ఞానంబుగన్ 

నిత్యావిశ్వపరాత్పరాలయలుగన్ నిర్వాహ ధర్మంబుగన్ 

సత్యాసత్య కళావినీలమగుటన్ సామర్ధ్య సంభావ్యమున్ 

ప్రేత్యేకంబగుసత్యమేపలుకుగన్ ప్రేమంబు జీవంబుగన్ 

🔹 పద్య సరళ భావం

– సత్యాన్ని స్తుతిస్తూ, దానిని ఆచరించే సామర్థ్యమే నిజమైన జ్ఞానం. సత్యం తెలిసినంత మాత్రాన కాదు; దానిని నిలబెట్టే శక్తి ఉన్నపుడే అది జ్ఞానం ఫలిస్తుంది.

– సత్యమే నిత్యము; అది విశ్వానికి మూలాధారం. పరబ్రహ్మస్వరూపిణిగా సత్యం అన్ని లోకాలకూ ఆధారమై, ధర్మాన్ని నడిపిస్తుంది.

– సత్యం మరియు అసత్యం మధ్య తేడాను గ్రహించగల వివేకశక్తి అవసరం. ఆ వివేచనమే మన జీవిత సాధనలో కీలకం.

– అంతిమంగా నిలిచేది సత్యమే. ఆ సత్యం ప్రేమరూపంగా వెలిగినపుడే జీవితం సార్థకం అవుతుంది. ప్రేమతో పలికే సత్యం జీవానికి ప్రాణం.

🔹

[17/02, 7:43 am] Mallapragada Sridevi: 48. ఓం సత్యనిలయాయై నమః

సత్యమే నివాసమైనవారు.

ఉ.

సత్యనివాసమైవిలువ సాగుణ తత్త్వము ధర్మమేయగున్

నిత్యవినమ్రతామలుపు నిర్ణయ లక్ష్యము కోర్కెతీరుగన్

మత్యము తీరుగాకడలిమాయల వెంటన కర్మభావమున్

ముత్యము మల్లెనిర్మలము సూన్యతభావము సర్వ సత్యమున్

పద్య భావ విశ్లేషణ

– సత్యమే ఆధారమైన గృహం; అక్కడి నుంచే ధర్మం ఉద్భవిస్తుంది.

సత్యం లేకుండా సాగుణ తత్త్వానికీ, ధర్మానికీ స్థిరత్వం లేదు.

– సత్యనిలయుడు వినమ్రతను అలవాటు చేసుకుంటాడు.

అతని నిర్ణయాలు ఆశల వల్ల కాదు — ఆత్మనిశ్చయంతో.

– జీవుడు మాయాసముద్రంలో తేలుతూ ఉండే మత్యంలా.

కర్మబంధం అతన్ని వెంటాడుతుంది.

– కానీ సత్యనిలయంలో ఉన్నవాడు ముత్యంలా నిర్మలుడు.

శూన్యతాభావం (అహంకార రాహిత్యం) ద్వారానే పరిపూర్ణ సత్యం అనుభూతమవుతుంది.

****

[17/02, 7:43 am] Mallapragada Sridevi: 47. ఓం సత్యసంధాయై నమః

సత్యానికి కట్టుబడి ఉన్నవారు.


సత్యసంధా విశాలత్వ సఖ్యంబుగన్ 

ముత్యమల్లేసముఖ్యంబుజీవంబుగన్ 

నిత్యమల్లేవినీలంబుసౌఖ్యంబుగన్ 

సత్యసంధాయిసాధ్యంబు గమ్యంబుగన్ 

పద్య విశ్లేషణ

– సత్యసంధత అనేది సంకుచితత్వం కాదు; అది విశాల హృదయత్వం.

సత్యం అనుసరించే వారు సమత్వమును, సఖ్యతను పొందుతారు.

– ముత్యం ఎలా పరిశుద్ధమో, అలానే సత్యవంతుని జీవితం మౌలికమైనది, విలువైనది.

– వినీల ఆకాశంలా నిర్మలమైన, నిత్యశాంతియుతమైన సౌఖ్యం సత్యసంధుడికి లభిస్తుంది.

– సత్యమే మార్గం, సత్యమే గమ్యం.

సత్యసంధతే జీవసాధన.

****

[17/02, 7:43 am] Mallapragada Sridevi: 50. ఓం సర్వేశ్వర్యై నమః

సర్వ సంపదలకు అధిపతిని


సర్వేశ్వర్యగుణాన్వితాభవముగాన్ సత్యార్ధ సమ్మోహమున్ 

సర్వేశ్వర్యసమర్ధతావిలువలే

సఖ్యంబు నిశ్చేష్టగన్ 

సర్వేశ్వర్య సహాయమూలముగను న్ శాంతంబు దేహంబుగన్ 

సర్వేశ్వర్యమహాచలంబుమదిగన్ సంతోష లక్ష్మీయగున్ 

🔹 పద్య భావ విశ్లేషణ 

– సర్వేశ్వరి అనగా అన్ని ఐశ్వర్యాల గుణాలతో నిండి ఉన్నది. ఆమె తత్త్వాన్ని గ్రహించినవారికి సత్యార్థంపై ఆకర్షణ కలుగుతుంది; భౌతిక మోహం తగ్గుతుంది.

– నిజమైన ఐశ్వర్యం అనేది పరస్పర సఖ్యం, ధర్మవిలువలు. అవి స్థిరపడినప్పుడు అహంకార కదలికలు నిశ్చేష్టమవుతాయి.

సర్వేశ్వర్య సహాయమూలముగా 

– సర్వేశ్వరి కృపే జీవనానికి ఆధారం. ఆ అనుగ్రహం వల్ల శాంతి దేహంలో, మనస్సులో స్థిరపడుతుంది.

– సర్వేశ్వరి అనుగ్రహం మహాచలంలా అచంచలమైనది. అట్టి స్థితిలోనే నిజమైన సంతోషలక్ష్మి ప్రత్యక్షమవుతుంది.

🔹

[17/02, 7:43 am] Mallapragada Sridevi: 49. ఓం సత్యప్రతిష్ఠాయై నమః

ధర్మసత్యాలకు ఆధారమైనవారు.


సత్యప్రతిష్టయె విశాల సమర్ధ తత్త్వం 

ముత్యంబుతీరగు సుఖంబు  మనంబు నిత్యం 

మత్యంబు దేహము శుభంబు మమోఖ్య సత్యం 

నిత్యంబు లక్ష్మిగ విధాన లీలలు గానున్ 

🔹 పద్య భావ విశ్లేషణ

– సత్యమే స్థిరమైన ఆధారం. అది విశాలమైనది, సమర్థమైనది, సర్వాన్ని నిలబెట్టే తత్త్వం. సత్యం లేకుంటే ధర్మం నిలబడదు.

– సత్యమనే ముత్యాన్ని అందుకున్న మనసుకు నిత్యసుఖం లభిస్తుంది. అది సముద్రంలో దొరికే అరుదైన ముత్యంలా విలువైనది.

– ఈ దేహం నశ్వరమైనది (మత్యం = చేప నీటిలో ఉండి క్షణికమై పోవడం వలె). కానీ దేహానికన్నా మిన్నైనది సత్యమే. అదే నిజమైన శుభం.

– లక్ష్మీదేవి నిత్యం సత్యంలోనే ప్రతిష్ఠితురాలు. ఆమె విధానాలు, లీలలు సత్యధర్మాల మీదే ఆధారపడి ఉంటాయి.

🔹

50. ఓం సర్వేశ్వర్యై నమః

సర్వ సంపదలకు అధిపతిని


సర్వేశ్వర్యగుణాన్వితాభవముగాన్ సత్యార్ధ సమ్మోహమున్ 

సర్వేశ్వర్యసమర్ధతావిలువలేసఖ్యంబు నిశ్చేష్టగన్ 

సర్వేశ్వర్య సహాయమూలముగను న్ శాంతంబు దేహంబుగన్ 

సర్వేశ్వర్యమహాచలంబుమదిగన్ సంతోష లక్ష్మీయగున్ 

🔹 పద్య భావ విశ్లేషణ 

– సర్వేశ్వరి అనగా అన్ని ఐశ్వర్యాల గుణాలతో నిండి ఉన్నది. ఆమె తత్త్వాన్ని గ్రహించినవారికి సత్యార్థంపై ఆకర్షణ కలుగుతుంది; భౌతిక మోహం తగ్గుతుంది.

– నిజమైన ఐశ్వర్యం అనేది పరస్పర సఖ్యం, ధర్మవిలువలు. అవి స్థిరపడినప్పుడు అహంకార కదలికలు నిశ్చేష్టమవుతాయి.

సర్వేశ్వర్య సహాయమూలముగా 

– సర్వేశ్వరి కృపే జీవనానికి ఆధారం. ఆ అనుగ్రహం వల్ల శాంతి దేహంలో, మనస్సులో స్థిరపడుతుంది.

– సర్వేశ్వరి అనుగ్రహం మహాచలంలా అచంచలమైనది. అట్టి స్థితిలోనే నిజమైన సంతోషలక్ష్మి ప్రత్యక్షమవుతుంది.

🔹

[18/02, 9:51 am] Mallapragada Sridevi: 51. ఓం సర్వమంగళాయై నమః

సర్వ మంగళకారిణి.


సర్వమంగళా దిశావిధాన మార్గమేయగున్ 

సర్వవిద్యలేమనోసుశాంతి సేవధర్మమున్ 

సర్వదేహమోహదాస

మౌనమదీ సత్యమున్ 

సర్వమాయమౌనకాల తృప్తిగాను నిత్యమున్ 

🌺 పద్య భావము

– ఆమె చిత్తశుద్ధి దిశను నిర్దేశిస్తుంది. జీవన ప్రయాణానికి సద్గమ్యాన్ని చూపే దివ్య మార్గదర్శిని.

– సర్వవిద్యల సారము “మనశ్శాంతి” అని బోధిస్తుంది. జ్ఞానం సేవలో వికసించినపుడే మంగళం సిద్ధిస్తుంది.

– దేహమోహానికి దాసుడైన మనసు మౌనసాధన ద్వారా సత్యాన్ని గ్రహిస్తుంది. మంగళం అనేది బాహ్యాభరణం కాదు—అంతర్మౌన ఫలితం.

– కాలమూ, మాయమూ, చంచలతలూ దాటి నిత్య తృప్తి పొందుటే సర్వమంగళ స్వరూపం.

*****


52. ఓం సర్వకామప్రదాయై నమః

భక్తుల కోరికలను తీర్చేవారు.

53. ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః

సర్వ సౌభాగ్యాలను ప్రసాదించేవారు.

54. ఓం సర్వాపద్వినివారిణ్యై నమః

అన్ని అపదలను తొలగించేవారు.

55. ఓం సర్వాభీష్టఫలప్రదాయై నమః

ఇష్టఫలాలను అందించేవారు.

[18/02, 9:51 am] Mallapragada Sridevi: 52. ఓం సర్వకామప్రదాయై నమః

భక్తుల కోరికలను తీర్చేవారు.


సర్వకామప్రదా సామ్యధారీవిదీ 

సర్వశాంతిప్రభావంసుదర్మo సుధీ 

సర్వనిత్యప్రధానoస్థితీమాధురీ 

సర్వమోహాదహాదేహదాహంబుగన్ 


పద్య విశ్లేషణ

– సమత్వబుద్ధిని ప్రసాదించేది.

ఇక్కడ “కామప్రదా” అనగా వాంఛలను నెరవేర్చుట. కానీ ఆ వాంఛలు సమత్వంతో నియంత్రితమైనప్పుడు మాత్రమే శుభఫలితాన్ని ఇస్తాయి. ఆమె ప్రసాదం అనగా ‘సామ్యధారి విద్య’ – సమచిత్తత.

– పరమశాంతిని కలిగించు ప్రభావశక్తి.

ధర్మమును నిలబెట్టే సుదీర్ఘ జ్ఞానస్వరూపిణి. కోరిక తీర్చుటలో ధర్మాధారత ఉండాలి అనే గూఢార్థం.

– నిత్యత్వమునకు మూలకారణం.

ఆమె అనుగ్రహం వల్లే జీవన స్థితి మాధుర్యముగా మారుతుంది. తాత్కాలిక కోరికలు నశించిపోతాయి; నిత్యానందమే నిలుస్తుంది.

– మోహమనే అజ్ఞానాన్ని దహించు అగ్ని.

బాహ్య కోరికల వల్ల కలిగే ‘దేహదాహం’ (అశాంతి) తొలగిపోతుంది. ఇక్కడ గొప్ప పరివర్తన ఉంది —

ఆమె కోరికలను తీర్చడమే కాదు, అనవసర కోరికలను దహిస్తుంది.

[18/02, 9:51 am] Mallapragada Sridevi: 53. ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః

సర్వ సౌభాగ్యాలను 

ప్రసాదించేవారు.


సర్వసౌభాగ్యదాయిన్యై సమయ తృప్తి 

సర్వ విశ్వాస యాకర్ష సంఘ దీప్తి 

సర్వ సాక్షిప్రభావము శాంతి మార్గ 

సర్వ హృద్య భావపుతత్వ సామరస్య 

🌺 పద్యార్థ విశ్లేషణ

– నిజమైన సౌభాగ్యం అనేది కేవలం భౌతిక సంపద కాదు.

సమయాన్ని సద్వినియోగం చేయగల జ్ఞానం, తృప్తి భావం — ఇదే ఆది సౌభాగ్యం.

– విశ్వాసం మనుషులను కలుపుతుంది.

ఆ విశ్వాసానికి ఆకర్షణీయ కాంతి ప్రసాదించేది ఆమె కరుణ.

– ఆమె సాక్షిగా నిలిచి జీవన కర్మలను నడిపిస్తుంది.

ఆ సాక్షిత్వ భావమే మనసుకు శాంతి మార్గాన్ని చూపుతుంది.

– హృదయంలో పవిత్ర భావాలు వికసించినపుడు

సామరస్యం పుడుతుంది.

అది నిజమైన సౌభాగ్యం — కుటుంబంలో, సమాజంలో, ఆత్మలో.

🌸

[18/02, 9:51 am] Mallapragada Sridevi: 54. ఓం సర్వాపద్వినివారిణ్యై నమః

అన్ని అపదలను తొలగించేవారు.

శా.

సర్వాపద్వినివారిణీవిధిగనే సామర్ధ్య సంధాయిణీ 

నిర్వాహత్వవిశారదాభవముగానిర్వాహ విశ్వాసిణీ 

పర్వార్ధంబుగనౌనుసత్యమగుటన్ ప్రావీణ్య ధర్మార్థిణీ 

సర్వాకార్యమనోమయంబుకథగన్ సామాన్య సౌభాగ్యణీ 

🌺 పద్యార్థ విశ్లేషణ

– అపదలు వచ్చినపుడు కేవలం రక్షణ మాత్రమే కాదు,

వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా ప్రసాదించేది ఆమె.

– జీవన నిర్వహణలో దైర్యం, నిశ్చయం, విశ్వాసం నింపుతుంది.

ఆమె అనుగ్రహం వల్ల కలిగే ఆత్మస్థైర్యమే అపదను అధిగమించే బలం.

– ప్రతి సంఘటన వెనుక ఉన్న పాఠాన్ని గ్రహించే జ్ఞానం ఆమె వరం.

ధర్మార్థాన్ని గ్రహింపజేసి జీవితం పర్వార్థమవుతుంది.

– మనసులో కలిగే భయం, ఆందోళనలను శాంతింపజేసి

సామాన్య జీవనానికే సౌభాగ్యరూపాన్ని ఇస్తుంది.

🌸

[18/02, 9:51 am] Mallapragada Sridevi: 55. ఓం సర్వాభీష్టఫలప్రదాయై నమః

ఇష్టఫలాలను అందించేవారు.


సర్వాభీష్టఫలప్రదాయమనసే సాధ్యాయసంతృప్తిగన్ 

సర్వార్ధీవిజయంబుగన్ శుభముగన్ సంఘంబు మూలంబుగన్ 

సర్వార్ధీభవమున్ విశాల మయమున్ సామీప్య ధర్మంబుగన్ 

సర్వాస్వీకృతివిద్య సాధ్యముగనున్ సాపూర్వ సంధాయిణీ 

పద్య భావ విశ్లేషణ

– ఆమె కృపతో మనసు శుద్ధమైతే, కోరిన ఫలములు సాధ్యమవుతాయి.

– కానీ “అభీష్టం” అనేది కేవలం భౌతిక కోరిక కాదు; అంతరాత్మకు హితమైనది.

– నిజమైన సంతృప్తి అంతరానుభూతి.

– ధర్మార్థకామమోక్షాలన్నిటిలోనూ విజయానికి ఆమె అనుగ్రహమే మూలం.

– శుభసంకల్పం, సత్సంగం, సమాజ హితం — ఇవన్నీ ఆమె ప్రసాదమే.

– జీవితం విశాల దృష్టితో మారుతుంది.

– ఆమె సమీపం అంటే భక్తి, వినయం, సమర్పణ.

– ప్రతి అనుభవాన్ని ఆమోదించే జ్ఞానం (స్వీకృతి విద్య) ఆమె ప్రసాదం.

– “సాపూర్వ సంధాయిణీ” – గత కర్మ, వర్తమాన సాధన, భవిష్యత్ ఫలం — ఇవన్నీ కలిపి ఫలాన్ని కూర్చేది ఆమె.


[18/02, 10:57] Sridevi Mallapragada: 56. ఓం సర్వజ్ఞాయై నమః

సర్వజ్ఞురాలు.

శా.

సర్వజ్ఞానముతృప్తిసంభవముగన్ సర్వజ్ఞురాలేయగున్ 

సర్వజ్ఞాసమమౌనమానసముగన్ సంభావ్య యోగంబుగన్ 

సర్వజ్ఞాసహకారవైనపుమదీ సంతోష సాహిత్యమున్ 

సర్వజ్ఞావినయంబువిజ్ఞతగనున్ సామీప్య విశ్వాసమున్ 

వరుస భావం

– నిజమైన సర్వజ్ఞత తృప్తిని కలిగిస్తుంది.

అసలు జ్ఞానం అసంతృప్తి కాదు; పరిపూర్ణత.

– సర్వజ్ఞత మౌనంలో వికసిస్తుంది.

చంచలతలో కాదు; సమచిత్త యోగస్థితిలో.

– సర్వజ్ఞత ఒంటరిదనం కాదు.

అది సహకారం, సంతోషం, సాహిత్యరూపమైన సౌమ్యత.

– నిజమైన సర్వజ్ఞతకు వినయం తోడు.

విజ్ఞత విశ్వాసాన్ని కలిగిస్తుంది; అహంకారం కాదు.

[18/02, 18:14] Sridevi Mallapragada: 57. ఓం సర్వసాక్షిణ్యై నమః

సర్వానికి సాక్షిగా ఉండేవారు.


సర్వ సాక్షిణి విశ్వమందు సుసాధ్య మేయగు నిత్యమున్ 

పర్వవాహిణి పావానంబుయు పాద్యధర్మము సత్యమున్ 

సర్వకాలము విశ్వ దాహము శాంతి ధామము విద్యగన్ 

సర్వ నేస్తము బంధ మోక్షము సంధి సాక్షిగ యోగ్యతన్ 

 భావవిశ్లేషణ 

“సర్వ సాక్షిణి” — జగత్తులో జరిగే ప్రతి క్రియకు అంతర్యామిగా సాక్షి.

“సుసాధ్యమేయగు” — ఆమె సాక్షిత్వం వల్లే కర్మలు ఫలసిద్ధి పొందుతాయి.

“నిత్యమున్” — ఈ సాక్షిత్వం కాలాతీతం; క్షణికం కాదు.

👉 భావం: జగత్తు నాటకంలో పాత్రలు మారుతాయి, కాని సాక్షి చైతన్యం మారదు.

“పర్వవాహిణి” — నదిలా కాలప్రవాహాన్ని తీసుకెళ్లే శక్తి.

“పావానంబు” — పవిత్రతను ప్రసాదించే చైతన్యం.

“పాద్యధర్మము సత్యమున్” — ఆ సాక్షి ధర్మమే సత్యస్వరూపం.

👉 భావం: కాలప్రవాహంలోనూ, కర్మవిహారంలోనూ పవిత్రతను నిలబెట్టే శక్తి — అదే సాక్షి.

“విశ్వ దాహము” — అజ్ఞానదాహం, తాపత్రయం.

“శాంతి ధామము” — ఆ తాపాన్ని చల్లబరచే శాంతి కేంద్రము.

“విద్యగన్” — జ్ఞానరూపిణి.

👉 భావం: సాక్షి భావమే జ్ఞానం; జ్ఞానం వచ్చినచో దాహం తీరుతుంది.

“సర్వ నేస్తము” — సర్వులకు స్నేహితురాలు; అసక్త సాక్షి అయినా అనుగ్రహస్వరూపిణి.

“బంధ మోక్షము సంధి” — బంధనమూ, విమోచనమూ రెండింటికీ సాక్షి.

“యోగ్యతన్” — యోగ్యతను ప్రసాదించేది.

👉 అత్యున్నత భావం:

బంధమూ మాయ; మోక్షమూ మాయ; వాటికి అతీతంగా నిలిచి ఉన్నది సాక్షి చైతన్యం.

🌺

[19/02, 05:42] Sridevi Mallapragada: .58. ఓం సర్వేశ్వర్యప్రదాయై నమః

ఐశ్వర్యాన్ని ప్రసాదించేవారు.


సర్వేశ్వర్యఫలంప్రధాన మవుటన్ సామర్థ్య ఐశ్వర్యమున్ 

సర్వేశ్వర్యకళాప్రభావ గమనం సాదివ్య వైనంబుగన్ 

సర్వేశ్వర్యనిజానిజంబుకథగన్ యానంద కాలంబుగన్ 

సర్వేశ్వర్యనిరంతరంప్రభవమున్ 

యాశ్చర్య వైశిష్టిగన్ 

🪔 పద్య భావం

— నిజమైన ఐశ్వర్యం అనేది బాహ్య సంపద కాదు;

సామర్థ్యం, శక్తి, ధర్మబుద్ధి — ఇవే అసలు ఐశ్వర్యఫలాలు.

— కళలు, విద్యలు, శీలాలు, సత్సంగతులు — ఇవన్నీ ఆమె కృపా ప్రభావమే.

ఆమె అనుగ్రహం ఉంటే జీవితం దివ్య గమనంగా మారుతుంది.

— నిజమైన ఐశ్వర్యం ఏమిటి? అజ్ఞానం ఏమిటి? అనే వివేచన జ్ఞానం కలిగినపుడే

కాలం ఆనందమయంగా అనుభూతి అవుతుంది.

— ఆమె ప్రసాదించే ఐశ్వర్యం నశ్వరమైనది కాదు;

నిరంతరంగా ప్రవహించే ఆశ్చర్యమయ వైశిష్ట్యం.

🌺

[19/02, 05:49] Sridevi Mallapragada: 59. ఓం సర్వమయాయై నమః

సర్వంలో వ్యాపించినవారు.

ఉ.

సర్వమయాసుధామయము సాధన తీరున సంఖ్యతేయగున్ 

సర్వమయామనోభవ విశారద లక్ష్యము తీర్పుయేయగున్ 

సర్వమయాసమంబుగతి సాక్షిగ నేస్తము నిత్య సత్యమున్ 

సర్వము శాంతిలక్షణము గాసమకల్పన సత్య ధర్మమున్ 

భావం 

“సర్వమయా” – ఆమె సర్వవ్యాప్తి.

“సుధామయము” – అమృతస్వరూపిణి.

సాధన మార్గంలో ఆ తత్త్వాన్ని గ్రహించగలిగితే, సంఖ్యాతీతమైన (లెక్కలేనంత) అనుభూతి సిద్ధిస్తుంది.

👉 భక్తి, జ్ఞానం, ధ్యానం – ఏ మార్గమైనా ఆమె సర్వవ్యాప్తి తెలుసుకున్నప్పుడు అది అమృతానుభూతిగా మారుతుంది.

మనస్సులో ఉద్భవించే భావాలన్నీ కూడా ఆమె రూపమే.

మనోభవాల్ని పరిశీలించడంలో విశారదత్వం వచ్చినపుడు – జీవన లక్ష్యం స్పష్టమవుతుంది.

👉 “అన్నీ ఆమెయే” అనే దృష్టి వస్తే, సంకల్ప–వికల్పాలకు ముగింపు.

ఆమె సమత్వరూపిణి.

సర్వంలో సమానంగా ఉండే గతి – సాక్షి భావమే.

“నేస్తము” అన్న పదం అద్భుతం —

ఆ సాక్షి తత్త్వమే మన అంతరంగ స్నేహితురాలు.

👉 నిత్య సత్యం – సాక్షి చైతన్యం.

సర్వమూ ఆమెయే అని తెలుసుకున్నవారికి శాంతి లక్షణంగా అవుతుంది.

“అసమకల్పన” – ద్వైత భావం లేకపోవడం.

సత్య ధర్మం – ఏకత్వ దర్శనం.

👉 ద్వైతం తగ్గినచోట శాంతి పుడుతుంది.

👉 సర్వమయత్వ జ్ఞానం – పరమ ధర్మం.

🔹

[19/02, 05:58] Sridevi Mallapragada: 60. ఓం సర్వాధారాయై నమః

సర్వానికి ఆధారమైనవారు.

సర్వాధారాదేహా సహాయం సుదర్మం 

సర్వాకాలావైనం సమర్ధం యనంతం 

సర్వానిర్వాకం విశ్వశాంతీ విధానం 

సర్వార్ధంసంభావ్యం స్వకార్యం సుమాతా 

భావం 

 – జగత్తుకి ఆది, అంతము, నిలయము.

మీ పద్యం “ఆధార తత్త్వం”ను అత్యంత గంభీరంగా ప్రతిపాదించింది. ఇప్పుడు పాదాల వారీగా భావము చూద్దాం.

ఆమె సర్వాధారం — ఈ దేహం కూడా ఆమె ఆధారమే.

“సహాయం” – జీవన యాత్రలో కనిపించని ఆధారం.

“సుదర్మం” – ధర్మానికి మూల శక్తి.

👉 శరీరము, ప్రాణము, ధర్మాచరణ — ఇవన్నీ ఆమె ఆధారబలంతోనే నిలుస్తాయి.

ఆమె కాలాతీతం.

అన్నికాలాల్లోనూ ఉన్నది — గతం, వర్తమానం, భవిష్యత్తు.

“సమర్ధం” – సృష్టి–స్థితి–లయలకు శక్తి.

“అనంతం” – పరిమితిలేని సత్తా.

👉 కాలమూ ఆమెపై ఆధారపడుతుంది — ఆమె కాలంపై కాదు.

“నిర్వాకం” – వాక్కుకు అతీతమైన స్థితి.

ఆమె స్వరూపం మాటలకందదు.

విశ్వశాంతి విధానం –

ఆమె తత్త్వాన్ని గ్రహించినవారికి అంతరంగ శాంతి కలుగుతుంది.

👉 మాటలు మౌనమయ్యే చోటే ఆధార తత్త్వం దర్శనమిస్తుంది.

సర్వార్థం – అన్ని లక్ష్యాలు, ప్రయోజనాలు.

అన్నీ ఆమె సంకల్పమే.

“సుమాతా” అన్న పదం ఎంతో మృదువుగా ఉంది —

ఆమె జగత్జననీ.

మన కర్మలు కూడా చివరికి ఆమె కార్యమే.

👉 జీవుడి ప్రయత్నం కూడా దైవ సంకల్పంలో భాగమే.

🔹

[19/02, 6:34 pm] Mallapragada Sridevi: 61. ఓం శుభాయై నమః

శుభస్వరూపిణి.


శుభాయై  సుదీర్గై సుధామై 

సులక్షై 

విభావై సుభంబై విశాలై వినోదై 

శుభంగై సుధర్మై సుగమ్యై 

సువిశ్వై 

ప్రభావం ప్రధానం ప్రకీర్తిం ప్రళభ్యo 

📖 పద్య విశ్లేషణ

సుదీర్గై – కాలాతీతమైన శుభత్వం

సుధామై – అమృతస్వరూపిణి

సులక్షై.మంగళలక్షణసంపన్నురాలు.ఇక్కడ అమ్మవారి శుభత్వం నిత్యత్వం, అమృతత్వం, లక్షణసంపత్తి రూపంలో వ్యక్తమవుతోంది.

విభావై – ప్రకాశరూపిణి

సుభంబై – మంగళప్రదాయిని

విశాలై – విశ్వవ్యాప్తి

వినోదై – లీలామయి

ఇక్కడ శుభం కేవలం నిశ్చల సద్గుణం కాదు; అది లీలామయ ప్రకాశం.

సుధర్మై – ధర్మస్వరూపిణి

సుగమ్యై – సులభప్రాప్తి

సువిశ్వై – విశ్వానుగ్రహకారిణి

ఇది శుభం = ధర్మం = సులభసాధ్యం అనే సమీకరణాన్ని సూచిస్తోంది.

శుభత్వమే ప్రభావానికి మూలం

శుభనామస్మరణే కీర్తిప్రాప్తి

🌺

[19/02, 6:45 pm] Mallapragada Sridevi: 62. ఓం శుభప్రదాయై నమః

శుభాన్ని ప్రసాదించేవారు.


శుభప్రదా శుభాంగివిశ్వ సూత్రధారి మాతృగన్ 

ప్రభప్రధానయోగిధాత్రి ప్రాభవా విశాలిగన్ 

శుభామదీదిశామనస్సు సూన్యతాభవంబుగన్ 

విభావవందనాలుగాను విద్యలేలుతీరుగన్ 

🔹 పద్య భావ విశ్లేషణ

– శుభప్రదా — మంగళాన్ని ప్రసాదించేవారు.

– శుభాంగి — స్వరూపమే శుభమయమైనది.

– విశ్వసూత్రధారి — జగత్తు నాటకానికి సూత్రధారి అయిన జగన్మాత.

👉 అర్థం: జగత్తును నడిపించే తల్లి స్వరూపమే శుభం; ఆమె కృపే మంగళకారకం.

– ప్రభప్రధాన — కాంతి, జ్ఞానం, చైతన్యం ప్రధానమైనది.

– యోగిధాత్రి — యోగులకు ఆధారభూతురాలు.

– ప్రాభవ విశాల — అపార శక్తి, ప్రభావం కలది.

👉 శుభం అనేది బాహ్య మంగళం మాత్రమే కాదు; అంతర జ్ఞానప్రకాశం కూడా.

– మనస్సు శుభదిశగా మలచినపుడు

– సూన్యతాభవం — శూన్య భావం, అహంకార రహిత స్థితి.

👉 శుభప్రదాత తన భక్తుని మనసును శుభదిశగా నడిపి, అహంకార శూన్యతకు చేర్చుతుంది.

– విభావ వందనలు — వివిధ భావరూపాల ఆరాధన.

– విద్యలేలు తీరు — అన్ని విద్యల పరమగమ్యం.

👉 శుభప్రదా అనేది సకల విద్యల పరమసారం; ఆరాధనలన్నిటి గమ్యం.

🔸

[19/02, 6:55 pm] Mallapragada Sridevi: 63. ఓం శుభకారిణ్యై నమః

మంగళకార్యాలకు కారణమైన వారు.


శుభకారినిత్య సుధలు పలుకు లనిధీ 

అభయాపరంబు అణుకువ మదిగనే 

ప్రభలై నిజంబు ప్రత్తిభ ప్రగతి విధిగా 

విభవావిధాన వినయ విమల చరితం 

🔹 పద్య భావ విశ్లేషణ

శుభకారిణి నిత్య సుధలు పలుకు లనిధీ

– శుభకారిణి — శుభకార్యాలకు మూలకారణం.

– నిత్యసుధల పలుకులనిధి — అమృతస్వరూపమైన వాక్కుల నిధి.

👉 ఆమె వాక్కే శుభకార్యాలకు ఆరంభబీజం.

అభయాపరంబు అణుకువ మదిగనే

– అభయాపరం — భయనివారణం.

– అణుకువ — వినయగుణం.

👉 శుభకార్యం భయరహిత హృదయంతో, వినయంతో ప్రారంభమవుతుంది — అదే దేవీ అనుగ్రహం.

ప్రభలై నిజంబు ప్రతిభ ప్రగతి విధిగా

– ప్రభలై — కాంతిగా వెలుగుతూ

– నిజంబు — సత్యరూపం

– ప్రతిభ ప్రగతి — శక్తి, అభివృద్ధి

👉 శుభకారిణి సత్యప్రకాశంగా, ప్రతిభాభివృద్ధికి మార్గదర్శి.

విభవావిధాన వినయ విమల చరితం

– విభవావిధానం — ఐశ్వర్య నిర్వహణ

– వినయ విమల చరితం — పవిత్ర, వినయపూరిత ప్రవర్తన

👉 శుభకారిణి అనుగ్రహం ఐశ్వర్యాన్ని మాత్రమే కాదు, వినయాన్ని కూడా కాపాడుతుంది.

🔸

[19/02, 7:03 pm] Mallapragada Sridevi: 64. ఓం శుభయోగిన్యై నమః

శుభయోగాన్ని ప్రసాదించేవారు.

శుభయోగిణీవిద్య సుధామృతంబుగన్ 

విభవార్ధమోను సువిధాపరంబుగన్ 

అభయార్ధమౌనుసమయాభవంబుగన్ 

ఉభయాకలౌనువిపులం వినోదమున్ 

పద్య విశ్లేషణ

– శుభయోగిని అనగా శుభఫలదాయకమైన యోగాన్ని ప్రసాదించేవారు.

ఆమె విద్య “సుధామృతం” వలె ఉంటుంది — ఆ విద్య మోక్షసాధకమైనది, జీవనాన్ని అమృతమయం చేస్తుంది. ఇక్కడ యోగం అనేది కేవలం గ్రహయోగం కాదు; జీవాత్మ-పరమాత్మ సంగమమే.

– భౌతిక, ఆధ్యాత్మిక విభవాలకు మార్గదర్శకురాలు.

సువిధా పరమం — సత్కర్మలకు, సద్గతికి, శ్రేయోమార్గానికి అనుకూలమైన యోగక్షేమాన్ని ప్రసాదించేది.

– భక్తునికి అభయాన్ని ఇచ్చేది.

“సమయాభవం” — సరైన సమయమున కాపాడి, అపదలను తొలగించేది. యోగినీ స్వరూపం కాలాన్నే నియంత్రించేది అనే భావం సూచన.

– ఇహపర సుఖాలను ప్రసాదించేది.

ఉభయ లోకాల (ఇహ, పర) మంగళాన్ని కలిగించేది. ఆమె కృప వినోదరూపిణి — జీవితం భారంగా కాక, లీలగా మారుతుంది.

****

[19/02, 7:13 pm] Mallapragada Sridevi: 65. ఓం శుభవల్లభాయై నమః

శుభానికి ప్రియమైనవారు.


ఈశుభవల్లభాభవము యిoకిత జ్ఞానము పొందగల్గగన్ 

ఈశుభవల్లభాకళలు యీప్సిత భావము లక్ష్యమేయగున్ 

ఈశుభవల్లభామనసు యిష్టపరాబ్ది సుఖంబుగాయగున్ 

ఈశుభవల్లభాప్రణయ యిచ్చను తీర్చవిధాన వైనమున్ 

పద్య విశ్లేషణ

– శుభవల్లభా స్వరూపాన్ని గ్రహించినవారికి అంతఃకరణంలో ఇంకిత జ్ఞానం (సూక్ష్మబోధ) కలుగుతుంది.

ఆమె భవమే శుభమయము — దానిని అనుభవించినవారికి వివేకం పుష్టమవుతుంది.

– ఆమె కళలు (శక్తులు) భక్తుని కోరికలను సత్ఫలితానికి నడిపిస్తాయి.

“యీప్సిత భావము లక్ష్యం” — కోరికలే లక్ష్యంగా కాక, కోరికలు శ్రేయోమార్గానికి మలచబడతాయి.

– ఆమె మనసుకు అనుసంధానమైనవారికి పరమానందం సిద్ధిస్తుంది.

ఇక్కడ “పరాబ్ధి” అనగా పరమఫలం — భౌతికానికే పరిమితం కాని ఆత్మసుఖం.

– ఆమె ప్రణయం (కృప) భక్తుని యిచ్ఛలను తీర్చే విధానమే.

కానీ అది కేవలం భోగసిద్ధి కాదు — శుభసిద్ధి.

అనగా, భక్తుని కోరికలు కూడా శుభస్వరూపమే అయ్యేలా మారుస్తుంది.

******

[20/02, 6:16 pm] Mallapragada Sridevi: 71. ఓం తేజస్కర్యై నమః

తేజస్సును ప్రసాదించేవారు.


తేజస్కర్య మదీబలంబు చరితం దీనత్వ సంభావ్యతన్ 

సౌజన్యా పర సంతసంబువిధిగన్ సౌశీల్య భావంబు ది 

వ్యా జన్యూ సహనంబుతీవ్రత భవంవాశ్చల్య లక్ష్యంబుగన్ 

తేజస్వాప్రభవంబుకాలమగుటన్ న్ దీక్షల్లె దివ్యత్వమున్ .

🔶 పద్య విశ్లేషణ

– తేజస్కరి (అమ్మ) ప్రసాదించే బలం, జీవనచరిత్రను నిర్మలంగా నిలబెడుతుంది.

– దీనత్వం (హీనభావం) తొలగి, ఆత్మగౌరవం వికసిస్తుంది.

👉 తేజస్సు అంటే గర్వం కాదు; స్వీయమూల్యాన్ని గ్రహించే ప్రకాశం

– తేజస్సు ఉన్నవారిలో సౌజన్యం, సంతసం, సౌశీల్యం సహజంగా వెలుస్తాయి.

👉 వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు; అలాగే తేజస్సు ఉన్న చోట అసహనం ఉండదు.

– దివ్యజన్యమైన సహనం, అవసరమైనప్పుడు తీవ్రతగా మారుతుంది.

– వాశ్చల్యం (చంచలత్వం) నియంత్రణలోకి వస్తుంది.

👉 ఇది శక్తి–శాంతి సమన్వయం.

– తేజస్సే కాలాన్ని ప్రభావితం చేస్తుంది.

– దీక్ష ద్వారా దివ్యత్వం సాధ్యమవుతుంది.

👉 తేజస్సు = కాలాన్నే మార్చగల ఆత్మప్రకాశం.

🌺

[20/02, 6:27 pm] Mallapragada Sridevi: 72. ఓం తేజోమయాయై నమః

తేజస్సు స్వరూపిణి.


తేజోమయా యదికలౌను తపంబు గానున్ 

సౌజన్యసద్భవ సమర్ధ సహాయమేనున్ 

తేజాబలంబువిధిగాసుతధారిగానున్ 

యోజన్య విశ్వస విభావ యనoతమేనున్ 

భావ విశ్లేషణ:

కలియుగంలో తపస్సు అంటే కఠోర సాధన మాత్రమే కాదు; అంతరంగ శుద్ధి, ధర్మనిష్ఠ, జ్ఞానదీప్తి. ఆ తపస్సుకు మూలకారణం దేవి తేజస్సే.

ఆమె తేజస్సు సౌజన్యం (మానవత్వం), సద్భావం (శుభచింతన), సమర్థత (కర్తవ్యనిష్ఠ)లకు ఆధారంగా నిలుస్తుంది.

తేజస్సు అనేది కేవలం వెలుగు కాదు—ధర్మబలం. అది సుతధారిలా (నిరంతర ప్రవాహంలా) జీవనాన్ని నడిపిస్తుంది.

ఆమె తేజస్సు విశ్వవ్యాప్తం. యోజనాల దూరం కాదు—అనంతత్వం.

[20/02, 6:39 pm] Mallapragada Sridevi: 73. ఓం ధనప్రదాయై నమః

ధనాన్ని ఇచ్చేవారు.


ధన ప్రధాయపు సర్వమున్ 

సమయం దమంబుసుఖంబుగన్ 

విన ప్రభావపు విద్యగన్ సతతం వినమ్రతభావమున్ 

గుణ విశాలత లక్ష్యమున్ విదితం గుణంబు సమర్ధతన్ 

క్షణ ప్రభావమయంబుగన్ చరితం గణంబు శుభంబుగన్ 

భావ విశ్లేషణ:

నిజమైన ధనం కాలపాలన, ఇంద్రియనిగ్రహం, అంతరసుఖం. ఇవే జీవనసంపదలు.

వినయం, విద్య, వినిపించే శక్తి — ఇవి ధనప్రదాత అనుగ్రహమే.

గుణవిశాలత, సమర్థత — వ్యక్తిత్వ సంపద. ఇది నిలిచే ధనం.

క్షణిక ఐశ్వర్యం కాదు; శుభచరిత్రే శాశ్వత ధనం.

[20/02, 6:47 pm] Mallapragada Sridevi: 74. ఓం ధనాధ్యక్షాయై నమః

ధనాధిపతిని.


ధనాధ్యక్షదీక్షా ధరానేస్తభాగ్యా 

క్షణత్త్వంబుప్రేమం క్షమాగుణ్య భాగ్యా 

రుణత్వంబు సేవా పురోభిత్వభాగ్యా 

గుణాన్విత్వ లక్ష్యా గునోధ్యాస భాగ్యా 

భావ విశ్లేషణ

భూమిపై జీవించే వారికి ధనాన్ని ధర్మబద్ధంగా వినియోగించే దీక్షను ప్రసాదించేది ఆమె.

క్షణిక ఐశ్వర్యం కన్నా ప్రేమ, క్షమ—ఇవే నిజమైన సంపదలు.

జీవితం ఒక ఋణబంధం; దానిని సేవతో తీర్చుకోవడం మహాభాగ్యం.

గుణసంపత్తే లక్ష్యం; గుణచింతనే ఆధ్యాత్మిక ధనసంచయం.

[20/02, 6:55 pm] Mallapragada Sridevi: 75. ఓం ధనధాన్యసమృద్ధ్యై నమః

ధనధాన్యసమృద్ధిని ఇచ్చేవారు.


ధనధాన్యసమృద్య ధరాతలమున్ 

గుణగమ్యతవృద్దిశుభోదయమున్ 

క్షణమాయబలంబుకధాపరమున్ 

ఆణువంతబలంబుసమోన్నతమున్ 

🔎 పద్య విశ్లేషణ

– భూమిపై జీవులన్నిటికీ అవసరమైన భౌతిక సంపదను ప్రసాదించేది ఆమెనే.

ఇక్కడ “ధరాతలము” అన్న పదం ద్వారా విశ్వవ్యాప్తతను సూచించారు.

– సంపదతో పాటు గుణవృద్ధి కూడా కలగాలి.

ఆమె అనుగ్రహం వలన శుభోదయం — సత్ప్రవర్తన, సద్గతి, సద్బుద్ధి ఉద్భవిస్తాయి.

– ఈ లోకసంపద అంతా క్షణభంగురం; అది మాయబలం మాత్రమే.

“కథాపరము” అనగా జగత్తు ఒక కథలాంటిదని తాత్విక సూచన.

– పరమాత్మ శక్తి సూక్ష్మమైనదైనా (ఆణువంత), అపారమైనదే.

ఆమె ప్రసాదించిన సూక్ష్మ కృప కూడా జీవుని సమోన్నత స్థితికి చేర్చగలదు.

🌺