Wednesday, 4 February 2026

 


_*


🚩మాఘ పురాణం - 9 వ అధ్యాయము🚩*_

*గంగా జలం మహిమ*

ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక , పూజదు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా , గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు , శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని , *"గంగ గంగ గంగ"* అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక , మాఘమాసములో అంగాస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుదు వివరించెను.

కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను , బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి , మోహించి , అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా , ఆ విధ్యార్థియూ , మీరుకూడ పిశచులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి , అందరిని బాదించి , ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.

కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు , తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు , గంధర్వులకు కూడ పవిత్రమైనది.

ఓక మాఘమాసములో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

🙏

Oooo

_*మాఘ పురాణం - 10 వ అధ్యాయము*_

*ఋక్ష కయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము*

పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి, దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి, విరక్తితో ఇల్లువిడిచి గంగానది తీరమునకుపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుటవలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠమందేవుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి "తిలోత్తమ" అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "ఓయీ! మీకేమి  కావలయునో కోరుకొనుము" అని అనగా, "స్వామీ మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.

బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులును మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి, ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి, దేవతలందరినీ తరిమివేసిరి, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని "మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానాభీబత్సము జేతుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు" మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  "అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో చాల అల్లకల్లోలము చేయుమన్నారు. కాన, నీవుపోయి నీచాకచక్యముతో వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము" అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమునూ విని ఆ దానవసోదరులు అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి, నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా! మిమ్ములను పెండ్ళియాడుట నాకు యిష్టమే. మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరియెడల సమాన ప్రేమతోనున్నాను. కాని ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను  స్వంతముకాగలను అని చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడననగా నేను బలవంతునని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి, ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి, ఇద్దరూ చనిపోయిరి.

తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినందా తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి,"తిలోత్తమా! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన, నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"వని పంపెను.

Oooo

_* భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 

మాఘ పురాణం - 11 వ అధ్యాయము*_

*భీముని ఏకాదశివ్రతము*

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేనిచోట తటాకమందుగాని, తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును తాను తినడు, యితరులకు పెట్టడు, ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. "అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము, శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా" అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్రనుండి లేచి చూడగా, అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి సానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ 'నారాయణా' అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను, అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు యేకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా! "ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి", అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు "అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును యేకాదశీ వ్రతము చేయవచ్చును" అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని, "విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున, యేకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము", అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి "రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు యిరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు" అని వివరించెను.


ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని "భీమ ఏకాదశి" అని పిలుతురు. అంతియేగాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైనదినమో, అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే 'శివరాత్రీ యని అందురు. అది యీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే 'మహాశివరాత్రి" అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది.

Ooooo

_*మాఘ పురాణం - 12 వ అధ్యాయము

*శూద్ర దంపతుల కథ*

వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు , వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. *"అమ్మా నేను బాటసారిని అలసినవాడను , చలి , చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే  వెళ్లిపోదునని"* ఇంట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి , పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.

కుముద *"ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును , అందులకై ఇట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను , కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన అభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు , అనారోగ్యమునకు , ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు ఇంటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.*


అప్పుడామె విష్ణుదూతలారా ! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు  అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను , భయమువలన గాని , పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా !  మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా ! బలవంతముగ చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా ! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.


అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట , నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున , నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు ఇష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి.రాజా ! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి , విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి , యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని , యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.


మానవుడు తెలిసికాని , తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును , తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము , పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా , పురాణశ్రవణము , దానము యధాశక్తి గా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి , కృష్ణవేణి , నర్మద , తుంగభద్ర , సరస్వతి , గోకర్ణ , ప్రభాస , కోణభద్ర , గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను , కూడ ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ , పురాణశ్రవణము , దానము వీనినన్నిటినిగాని , కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము , మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.

🙏

.......

*MAAGHA PURANAM -- 13**13వ అధ్యాయం*

శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట

వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలముతో దిలీపుడు -

“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినాలి అన్న కోరిక కలుగుతున్నది. ఇంకా చెప్పవలసినద” ని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను.

పూర్వము పార్వతీదేవికి శివుడు, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్యము గురించి చెప్పి ఉన్నారు. శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు ప్రమథగణములు సేవిస్తు ఉండగా , నానారత్న విభూషితమైన కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనని పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నమస్కరించి “స్వామీ! మీవలన అనేక పుణ్య సంగతులు తెలుసుకున్నాను. ప్రయాగ క్షేత్ర మహాత్యమును, మాఘమాస మహాత్యమును వినవలెనని కోరిక ఉన్నది. ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాన” ని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసముతో -

దేవీ! నీ అభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక జన్మాంతమందు మోక్షమును పొందును. మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగుతుంది. జీవనది ఉన్నా లేకున్నా పాదము మునుగునంత నీరు ఉన్నచోట గాని, తటాకమందు గాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలమును ఇచ్చుటయే గాక సమస్తపాపములు తీరి పోతాయి. రెండవరోజు స్నానం చేసిన విష్ణులోకమునకు వెళ్ళగలరు. మూడవ నాటి స్నానం వలన విష్ణుదర్శనము కలుగుతుంది. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుష్యునకు మరుజన్మ ఉండదు.

దేవీ! మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకరరాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా – నదిగానీ, చెరువుగానీ, నుయ్యి గానీ, కాలువ గానీ, లేక పాదము మునుగునంత నీరున్నచోట గానీ ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం చెప్పనలవి కాదు.

ఏ మానవునకైననూ తన శరీరంలో శక్తిలేక, నడువలేనటువంటి వాడు, గోవుపాదం మునుగునంత నీరున్న ఏ సెలయేరునందైనను, బావియందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవిస్తున్నా వాని కష్టములు మేఘమువలె విడిపోయి విముక్తుడవుతాడు. ఎవరైనను తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నాన మాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కుతుంది. మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదం సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక ఎన్నటికి పునర్జన్మ కలుగదు. ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఇది ఆచరించవచ్చును. మానవుడు నరజన్మము ఎత్తిన తరువాత మరల ఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీస్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తిపొందుట శ్రేయస్కరము. ఇది మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం. ఓ పార్వతీ! ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టి వాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరిస్తాను సావధానురాలివై ఆలకించు.


నేను తెలియచేసిన విధముగా ఏ మనుష్యుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున జపముగానీ, విష్ణుపూజ గానీ, యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టి వాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవిస్తాడు. కుంభీ నరకములో పడద్రోయబడి, అగ్నిలో కాల్చబడును. రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడి సలసల కాగు తైలములో వేయబడి భయంకర యమకింకరులచే పీడింపబడతాడు. ఏ స్త్రీ వేకువ ఝాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామలకు సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీకి అయిదవతనం వర్ధిల్లి, ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క మొదలైన జన్మములు ఎత్తి హీనస్థితి పొందుతుంది. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైనను, జవ్వనియైనను, మాఘస్నానము ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో ఉన్న కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది.

```

          `ఘ పురాణం*14 వ అధ్యాయం

మాఘ పురాణం   పదునాల్గవ  అధ్యాయములో….        పూర్వం, గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు, సంతానం లేని లోటుతో బాధపడుతూ, శ్రీహరిని పూజించి వరం కోరుకున్నాడు. అతని నిష్టకు మెచ్చిన శ్రీహరి, కుమారుడిని వరంగా ఇచ్చాడు. కానీ, ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నారదుడి ద్వారా కుమారుడు పన్నెండేళ్లకే మృతి చెందుతాడని తెలుసుకున్న బ్రాహ్మణుడు, భార్యతో కలిసి విచార సముద్రంలో మునిగిపోయాడు. అయితే, భార్య ధైర్యం చెప్పి, మరణం తప్పనిదని, శోకించడం వ్యర్థమని చెప్పింది. తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్లీ శ్రీహరిని ఆరాధించాడు.

అతని భక్తికి మెచ్చిన శ్రీహరి, కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు. ఈ కథ, ధైర్యం, భక్తి యొక్క ఫలితాలను చాటిచెప్పడమే కాకుండా, మాఘమాస వ్రతం యొక్క మహిమను కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే, ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాలపు ఋషులు చెప్పేవారు. అంతేకాకుండా, ఈ వ్రతం మనసుకు శాంతిని, ఆత్మకు తృప్తిని కలిగించి, జీవితంలోని కష్టాలను దాటే శక్తినిస్తుంది. ..

*విప్రుని పుత్ర ప్రాప్తి:*```

గృతృనమద మహర్షిని చూసి జహ్నముని యిట్లనెను. “మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా?, నా సందేహమును తీర్చుమ”ని అడుగగా మహర్షి ఇట్లు చెప్పెను. 

“జహ్నమునీ! వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందు వల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకను హరి ప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తినందును. అటువంటి కథని ఓక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను..

‘పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. అతడు వేద వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయజ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారిరువురికి  సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచార పడుచున్న ఆ బ్రాహ్మణుడు ఓక నాడు భార్యతో “గుణవంతుడు అయిన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను”. 

అప్పుడు ఆమె ‘నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదు అని అనుకొందును’ అని సమాధానము ఇచ్చెను. 

అప్పుడు ఆ  బ్రాహ్మణుడు ‘ప్రియా కష్టతరమైన తపమును ఆచరించి  అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టి పరచెదను. పుత్ర వరమును కోరుదు’నని చెప్పెను. 

కష్టతరమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోరెదననియు పలికెను. 

ఆ దంపతులు ఇరువురు తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.

బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరినిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. 

కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగ ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.

తనను గమనించక తీవ్రతరమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో  “విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని” అని పలికెను. ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. 

అతనికి ఎట్టి వరమునైన ఈయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్తుతించెను.```      

*విప్ర కృత విష్ణు స్తుతి:*

నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |

నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||

గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |

కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||

లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |

అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||

యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |

జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||

సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |

కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||

నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |

విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||

సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |

హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||

పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |

ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||

జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |

వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||

జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |

ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||

నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |

గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||

కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |

కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||

సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |

భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||

నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |

నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||```

శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము.

జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతిస్తూ ఆనంద పరవశుమై  నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొనమనెను.

శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు “స్వామీ! నీ పదములనందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము, ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను. 

శ్రీహరి “నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదు”నని పలికి యంతర్థానయ్యెను. 

బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కిలి  లాభము అందినవానివలె సంతసింసించు తన ఇంటికి చేరెను. 

కొంత కాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.

కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములేయని చెప్పి తన దారిని తాను పోయెను. 

ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచార వదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. “నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్ర శోకము నెట్లు సహింపగలను?” అని భర్తతో పలికెను.

ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయేట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా! మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు కదా. కావున నీవును శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు.

అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపుము” అని ఆమెను ఊరడించెను మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ ఉండుము” అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నిష్ఠలతో శ్రీహరిని సర్వ ఉపచారములతో పూజించుచుండెను. 

శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. 

శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.✍️```

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

---*MAAGHA PURANAM -- 15*

*15వ అధ్యాయము*

*శిష్యుడు పశ్చాత్తాపము పొందుట*

సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించారని శివుడు పార్వతికి తెలియచేసాడు.

నీలకంఠుని పార్వతీ దేవి -

“నాధా! సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియచెప్పారు. సుబుద్ధి శిష్యుడు సుమిత్రుడు ఏమైనాడు? అతడు ఏ స్థితిలో ఉన్నాడు? వినకుతుహలముగా ఉన్నద” ని కోరగా శివుడు ఈ విధముగా చెప్పసాగాడు.

“సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగక్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము కలిగింది. తాను చేసిన పాపమునకు ఫలితము అనుభస్తున్నాన’ ని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి పాదములపై పడి “గురువర్యా! నేను మహా పాపిని అయ్యాను. క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అది నాదోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి వెళుతుండగా దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుకుంటూ నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నావెంట వచ్చి, నేను అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టుక్రింద విశ్రమించగా మెల్లగా నాచెంత చేరి నన్ను మంచిమాటలతో వంచించి తన కామవాంఛ తెలియచేసింది. నేను అందుకు ఒప్పుకోలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని “నాతో నీవు క్రీడించపోతే నీ ఎదుటనే ప్రాణత్యాగము చేస్తాన” ని చెప్పేసరికి నాకు భయము కలిగి నిజముగా ఆమె ప్రాణత్యాగము చేసుకున్నచో మీరు నన్ను దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహాపాపము అనుభవిస్తున్నాను. నేను ఎటుల పాపరహితుడను కాగలనో సెలవిమ్మ” ని బ్రతిమాలాడు.

శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి తన కుమార్తె వలె తన శిష్యుని గూడ పాపరహితుని చేయాలని ఎంచి “సుమిత్రా! నీపాప కర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నువ్వు మావలె పాపరహితుడవు కాగలవు. నువ్వు గంగానదీ తీరమునకు వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరములు తపస్సు చెయ్యి. ఆ తపస్సుచే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినట్లు నశించిపోతుంద” ని శిష్యునికి చెప్పాడు.

“ధన్యోస్మి ధన్యోస్మి” మీ ఆజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణము అవుతున్నాను” అని గురువుగారికి నమస్కారము చేసి గంగానదీ తీరమునకు ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్ళు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళాడు. అక్కడ మనోహరమైన ఆహ్లాదము ఒనరించు దృశ్యములు కనిపించినవి. కౄరమృగములు, సాధుజంతువులు కలసిమెలసి తిరుగుతున్నాయి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము కనిపించలేదు. ప్రకృతి రమణీయత మనస్సునకు ఆనందము కలిగిస్తున్నది. ఆ ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొనుటకు ఒక వటవృక్షము క్రింద విశ్రమించి నలుదిశల పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది. వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగిచూడగా ఆ ఆశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ వస్త్రములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేస్తున్నారు. మధ్యమధ్య శ్రీహరి విగ్రహము పై అక్షతలు వేసి “హరిహరీ”యని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేస్తున్నారు. ఆ దృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార చూసాడు. పూజ పూర్తయిన తరువాత అందరూ ప్రసాదం సేవించారు. బైట కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదము ఇచ్చారు అతడు - “స్వామీ! మీరు ఆచరించిన వ్రతము ఏమిటి ? దీనివలన ఏమి ఫలితము కలుగుతుంది ? మనుష్యుడు పాపరహితుడు అవుతాడా ? నా సందేహములను తీర్చవలసిందని వేడుకొంటున్నాను” అని వినయముగా ఆ మునిసత్తములను అడిగాడు.

పాపముచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అక్కడ ఉన్న వారు మాఘమాసమందు ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు వారిలో ఒకరిని నియమించారు. ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లు వివరించెను. “విద్యార్థీ! మేము చేసినది మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేసిన పాపములన్నింటినీ నశింపచేయును. రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవి అన్ని పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపము లన్నియు నశించిపోతాయి. మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు స్నానం చేయు మనుష్యుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నానము ఒనర్చువారు వైకుంఠ వాసులు అవుతారు. అలాగ చేయనివాడు, అసత్యములు పలికేవాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్వము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జన సమర్ధము ఉండు చోట మలమూత్రములను విడచుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానము.

-

*మాఘ పురాణం - 16 వ అధ్యాయము*

*విద్యాధర పుత్రిక కథ*

*రాజా!మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను, పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను, నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను, అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను, పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను,అప్పుడు బ్రహ్మ "నయనా!నీకు పుత్ర సంతానయోగము లేదు అయినను నీ తపముకై మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని"* *అంతర్దానమునందెను, ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని,తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను, విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను,వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని  నిశ్చయించుకొనెను, ఒకనాడొక రాక్షసుడామెను చూచెను,ఆ రక్షసుడు దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను,కోరిన రూపము ధరింపగల  శక్తిని కూడ సంపాదించెను,           ఆ రక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను, ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను,ఆ రక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు, శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను,శివుడును వానికి శూలమునిచ్చుచు"ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని"చెప్పి యిచ్చెను,వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.*

------------------------------------

*అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి"సుందరీ! నన్ను వరించుమని యడిగెను,ఆమెయు               నా తండ్రినడుగుమని చెప్పెను,రాక్షసుడును విద్యాధరుని వద్దకు         పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను, విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను, రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను.న, శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను,             ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను,రాక్షసుడు అందుకు అంగీకరించెను, అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును,        ఈలోపున నిన్నేమియు బాదింపను,నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు,రాక్షసుడు మరల మరల నడుగగా* *'నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను,        ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను,విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి* *సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను, ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను, అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను,* *ఆశ్చర్యపడి'అమ్మాయి! నీవిచటనున్నావేమని అడిగెను,ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను, రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.*

---------------------------------------

*నారదుడామె చెప్పినదంతయును వినెను,అమ్మాయీ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును,అతడే నీ భర్త విచారింపకుము,                నా మాటను నమ్ముము, నీకొక ఉపాయమును చెప్పెదను వినుము,ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు, మాఘమాసమున నీవీ సరస్సు స్నానమాచరింపుము గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము, మాఘమాసమంతయు ఇట్లు చేయుము,ఇట్లు చేసిన వారు కోరినది లభించును, శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును, మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును,         నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.*

---------------------------------------

*విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను, మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను,నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను, మాఘమాసమును వ్రతముతో గడపెను, నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను, ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును, అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును,వారిని హరీయని ఆహ్వానించును, విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును, శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును, దామోదరాయనుచు భుజించును, కేశవాయనుచు నిద్రించును, నరసింహాయని స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును,ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును,ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.*

---------------------------------------

*హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను,నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు,                                      ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి,సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను,                   ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును        అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను, హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను,నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను,హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను,ఆ సమయమున రాక్షసుడింట లేడు,అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను అతడు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను, రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను, రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను,ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను,రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను,                     ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను,వానిని భర్తగా వరించెను, హరిద్రధుడును ఆమెను వివాహమాడెను,                 ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి, చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి,                          అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.*                                    --------------------------------------

Thursday, 8 January 2026

 



02-

లోకం తీరు చిన్న  పద్య కధ

(చేట- జల్లెడ)

చేట మంచినుంచియుచెడు చేర నీదు

జల్లెడ చెడును ఉంచియు జార్చు మంచి

చేట కన్న జల్లెడ వారి చిత్త మాయ

ఏమి యందరి మనసుకు ఏల చెప్ప

చేట జల్లెడ ఈ రెండూ శుభ్రపరిచే సాధనాలే అయినా పని తీరులో తేడా ఉంది. చేట మంచి ఉంచుకుని చెడుని విడిచిపెట్టేస్తుంది. జల్లెడ డానికి విరుద్ధంగా చెడును ఉంచుకుని మంచిని విడిచి పెట్టేస్తుంది.  సమాజం,  మంచి,చెడుల మిశ్రమం . అందువల్ల సమాజంలో కూడ ఈ రెండు తరగతులకు చెందిన మనుషులు  ఉంటారు.

సజ్జనులు చేటవలె చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరిస్తారు. దుర్జనులు జల్లెడ వలె చెడును ఉంచుకుని మంచిని విడిచిపెట్టేస్తారు. ఇక ఈ సమాజంలో చేటల కంటే జల్లెళ్ల సంఖ్యే ఎక్కువని చెప్పవచ్చు. ఎవరినైన తప్పు పడతారు . ఏం చేసినా తప్పు పడతారు. ఒక విధంగా చెప్పాలంటే తప్పులు వెదకడమే వారి లక్ష్యం. ఒక విధంగా చెప్పాలంటే తమ స్థాయిని బట్టి ఎదుటివారినందరిని అంచనా వేస్తారు . మంచిలో కూడ తప్పులు వెదకడం వారి నైజం .

*****

తే. గీ

భయపడకు మాటలలొ మర్మ బంధ మాయ 

కొంత మంచికొందరికి యే కొంత చెడగు 

సమయంధర్మము తెలుపుచు శాంతి కర్మ 

తల్లి తండ్రి గురువు ధర్మ తప్పు నొప్పు


ఒకసారి శివపార్వతులిద్దఱు ఎద్దుమీద కూర్చుని దేశ సంచారం చేస్తున్నారు. దారిలో కొంతమంది వారిని చూశారు. వాళ్లంల్లో వాళ్లు 'చూశారా! ఎంతవిడ్డూరం. ఎద్దు చాల బక్కగా ఉంది. దాని మీద కూర్చుని ఇద్దఱూ ప్రయాణం చేస్తున్నారు. ఇద్దర్నీ అది ఎలా మోయగలదు. ఒకవేళ మోసినా ఎంతసేపు మోయగలదు? ఆమాత్రం తెలుసుకోవద్దా. దేవతలట దేవతలు వీళ్లేం దేవతలు' .అన్నారు.

1. ఆ మాటలు శివుని చెవిలో పడ్డాయి. భార్యతో పార్వతీ ! నువ్వు కాసేపు దిగి నడిచిరా! అన్నాడు. ఆమె సరే అంది. దిగి నడుస్తోంది. మఱొక చోట మరో కొంతమంది ఎదురుపడ్డారు. వాళ్లల్లో కొందఱు 'ఎంత విడ్డూరమో చూశారా! మగవాడై ఉండి ఆడది, అందులోను కట్టుకున్న భార్య అన్న కనికరం కూడ లేకుండ ఆమెను నడిపిస్తూ ,  తానూ మాత్రం దర్జాగా కూర్చున్నాడు. ఈయనేం దేవుడు?' అన్నారు. ఆ మాటలు శివుని చెవులకు ఈటెల్లా గుచ్చుకున్నాయి. 'పార్వతీ ! నువ్వు ఎక్కి కూర్చో, నేనే నడుస్తాను' అన్నాడు. ఆమె మహా పతివ్రత కదా ! అందుకని భర్త మాటకు ఎదురు చెప్పలేక 'సరే' అంది. మరో కూడలిలో ఇంకొంతమంది ఎదురయ్యారు. వాళ్లల్లో కొందఱు 'చూశారా!  వింతల్లో వింత. మొగుణ్ణి నడిపిస్తూ తాను దర్జాగా కూర్చుని ఊరేగుతోంది. పతివ్రతట, పతివ్రత. ఇదేం పాతివ్రత్యం. ఎవరైన నవ్వుతారని సిగ్గు కూడ లేదు ఆమెకు . ఛీ! ఛీ!, స్త్రీ జాతికే తలవంపు, అన్నారు . పాపం! ఆ మాటలు ఆ మహా ఇల్లాలి చెవిలో పడ్డాయి. 'నాథా! నేను దిగుతాను . దయచేసి అనుమతించండి' అంది. 'సరే లే దిగు' అన్నాడు . ఇద్దఱూ మౌనంగా నడుస్తున్నారు. ఎద్దు వారి వెంట నడుస్తో వస్తూ ఉంది. మరొక చోట వేరొక గుంపు ఎదురయింది. 'అబ్బబ్బ! చూడండే!  ఏమి వింత!  ప్రక్కన వాహనం ఉండి కూడ ఇద్దరు నడిచొస్తున్నారు. ఏమి తెలివితేటలు! దాన్ని ఊరికే ఎందుకు నడిపిస్తున్నట్లు . దానికి కాల్లు నొప్పి పుట్టవా. జాలి కూడ లేదు. దేవుళ్లట! దేవుళ్లు!' అన్నారు . ఈ మాటలు ఇద్దరి చెవుల్లోను పడ్డాయి. గతుక్కుమన్నారు. ఇద్దరు తమ రెండు చేతులతో ముందు కాళ్ల నొకరు, వెనుక కాళ్లనొకరు ఎత్తి పట్టుకుని మెల్లగా మోసుకుని వెళుతున్నారు. కొంత సేపట్లో,  మరో గుంపు ఎదురయ్యింది. వాళ్ళు తమలో తాము 'చూడండి! చూడండి! వింతల్లోకెల్ల పెద్ద వింత . ఎద్దుపై కూర్చుని దర్జాగా రావలసింది పోయి, వీళ్లే దాన్ని మోసుకొస్తున్నారు. వీళ్లకి బుర్ర మోకాల్లో కూడ లేదనిపిస్తోంది కదూ! అన్నారు. ఈ మాటలకు ఇద్దఱూ తట్టుకోలేకపోయారు. వెంటనే మాయమయ్యారు . మఱు క్షణం కైలాసం చేరుకున్నారు. కాబట్టి లోకులు కాకులు . అందువల్ల అందరినీ సంతోషపెట్టాలని అనుకోకూడదు . ఎంత మంచిగా ఉన్నా ఎదో వంక పెడతారు . 


జాతిపిత మహాత్మాగాంధీ ఒక మాట అంటారు   He, who wants to please all, will please none. అందరినీ సంతోశాపెదదామనుకునే వాళ్ళు ఎవరినీ సంతోష పెట్ట లేరు .  అందువల్ల, వాళ్లను లెక్కచెయ్యకూడదు. వాళ్లకి ఎప్పుడు  భయపడకూడదు. లోకం తీరు చాల చిత్రంగా ఉటుంది. మనం భయపడితే అది  భయపెడుతుంది. మనం,  భయపెడితే అది  భయపడుతుంది. అందువల్ల ఎవరికీ భయపడకుండ, ఎవరినీ భయపెట్టకుండ, ఒక్క ధర్మానికే భయపడి జీవించాలి. మరి ధర్మం కూడ ఒక్కొక్కప్పుడు సమయాన్ని బట్టి అనేక విధాలుగా మారుతో ఉంటుంది. అందువల్ల మహాత్ములు ఏ మార్గంలో నడిచారో, ఆ మార్గాన్ని అనుసరించి ప్రయాణం చెయ్యడమే మన కర్తవ్యం . ఇదే తరుణోపాయం తరణోపాయం కూడ.

అందుకే  మహాజనో యేన గత: స పంథా:

అన్నారు మన పెద్దలు .

                              .

Monday, 15 December 2025

 తిరుప్పా వై మొదటి రోజు.. పాట


పల్లవి


రండు రండు వేగిగా రండు మగువలరా

ముదముగా కృష్ణుని పొందగోరు వేళ

మార్గశీర్ష పూర్ణిమ నేడు శుభదినం

ధనుర్మాస వ్రతము చేద్దాం చెలియలార!


(రెఫ్రెయిన్)

చేసుకుందాము—రారండి చెలియలార!

భక్తితోనే—రారండి చెలియలార!

---


అనుపల్లవి


దివ్యభూషా ప్రసాధిత గోపబాలుడా—రా!

మనకెల్ల నారాయణుడు—దీప్తాయుధుడా

నందగోప మనోనందనుడు—విశాలాక్షుడా

యశోద గన్న బిడ్డ—రా! రా!


---


చరణం – 1


వీరసింహుడు, కరిమేని కాంతియుతుడు

నూర్యవిధు ముఖుడై నూరేల్ల వెలుగుడు

దండాయుధములు దాల్చి రక్షించు గోవిందుడు

రమణులారా—చూడండి ఆ అందాలు!


(రెఫ్రెయిన్)

చేసుకుందాము—రారండి చెలియలార!


---


చరణం – 2


నల్లని తనువు, ఎఱ్ఱ తామర నేత్రాలు

చూడగానే మురిసే మనసుల మేళాలు

తహతహలాడే యశోదమ్మ దయవల్ల

తరుణులారా—పొందండి ఆశీర్వాదాలు!


---


చరణం – 3


చల్లచల్లని వెన్నెలొలుకు చిరునవ్వు

చందురుని మించే ప్రేమపూర్ణ ప్రభావు

వైరులకు భాస్కరునిగ వెలిగే ముఖమండలం

మననోము నొమంగ—నడిచిరెండూ!


(రెఫ్రెయిన్)

ధనుర్మాస వ్రతము—చేసుకుందాము

భక్తితోనే—రారండి చెలియలార!


---


ముగింపు


మార్గశీర్ష పూర్ణిమ—మంగళ ఘడియ

గోపికల గీతమై మ్రోగు మనసుల నడయ

కృష్ణుని కృపతో కలియుగ సౌఖ్యం

చేసుకుందాము—రారండి చెలియలార!


---


మీ విధేయుడు

మల్లాప్రగడ

 సర్వం విష్ణుమయం జగత్

                  (1వ. భాగం)

గడచిన కార్తీక మాసంలో శివ తత్వము, శివ స్త్రోత్ర పఠనము, శివ మహాత్మ్యం గురించి యధా శక్తి ముచ్చటించు కున్నాము. ఇప్పుడు ధనుర్ మాసంలో విష్ణు తత్వాన్ని, విష్ణు క్షేత్రాల గురించి మరియు విష్ణు స్తోత్రాలు, కీర్తనల గురించి తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దాము.

(ఇందులో ఒక్క విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఉండేది పరబ్రహ్మ ఒక్కడే, శివుడన్నా, విష్ణువన్నా, శక్తన్నా, గణపతన్నా, సూర్యనారాయణుడన్నా. కానీ భక్తుని కోరిక మీద ఆతను కోరిన రూపంలో అభివ్యక్త మవడమే అసలు సత్యం. అందుకేఆధ్యాత్మిక ఐక్యతకు సంబంధించి స్వామి వివేకానంద కేంద్ర బోధనలలో ఒకటి "ఏకం సత్ విప్రా బహుధా వదంతి", దీని అర్థం " సత్యం ఒకటే; జ్ఞానులు దానిని అనేక పేర్లతో పిలుస్తారు ." ఈ లోతైన ప్రకటన వేదాంత బహుత్వవాదం యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది, విభిన్న మత మరియు తాత్వికతను వివరిస్తుంది. ఈ ధోరణిని సమన్వయ పరచడానికే శంకర భగవత్పాదులు పంచాయతనం అనే పద్ధతిని ప్రవేశపెట్టారు.)


సూర్యనారాయణమూర్తి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణందాకా సంచరించే అతి పవిత్ర మైన మాసమే ధనుర్మాసం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం…

మేష, సింహ, ధనుస్సు రాశులు ధర్మ క్షేత్రాలుగా

వృషభ, కన్య, మకర రాశులు అర్థ క్షేత్రాలుగా

మిథున, తుల, కుంభ రాశులు కామక్షేత్రాలుగా

కర్కాటక, వృశ్చిక, మీన రాశులు మోక్ష క్షేత్రరాలుగా ప్రసిద్ధికెక్కాయి.

అందున ధనూరాశికి దేవగురువైన బృహస్పతి అధిపతి, ఆయనకు చాలా బలో పేతమైన మూల త్రికోణస్థానం ధనూరాశి.అంతే కాక ఇక్కడ ఉండే మూడు నక్షత్రాలలోనూ మూలా నక్షత్రం ఒకటి. ఆశ్వియుజ మాసం శరన్నవరాత్రులలో ఈ మూలా నక్షత్రం రోజునే సరస్వతీ మాత పూజలందు కుంటుంది. ఒక విధంగా ఇది మూలాధార క్షేత్రంగా భావించి కుండలిని మేల్కొల్ప డానికి అనువైన సమయంగా ఈ ధనుర్మాసాన్ని ఉపయోగించుకొని ధన్యులము అవవచ్చు.

ఈ ధర్మక్షేత్రంలో సూర్యనారాయణుని సంచారం ధర్మ సంస్థాపనానికి చిహ్నం. అట్టి సమయం 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం (04:07)

పరిత్రాణాయ సాధూనాఁ వినాశాయ చ దుష్కృతాం

ధర్మసఁస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే (04:08)

(ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సం రక్షణముల కొఱకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.)

అన్న విష్ణువు సంపూర్ణ అవతారమైన కృష్ణుని స్మరించు కొనుటకు చక్కని సమయం. అందునా అధర్మం వీర విహారం చేస్తున్న ఈ రోజుల్లో ఆ నారాయణుని కరుణా కటాక్ష వీక్షణాలే మనకు అత్యంత ఆవశ్యకము.

అట్టి పవిత్ర సమయాన నారాయణాయ నామ సంకీర్తనతో ఈ ధనుర్మాసం సద్వినియోగము చేసుకుందుకు ప్రయత్నం చేద్దాము.

తదుపరి భాగంతో రేపు కలుసుకుందాము అంత వరకు శ్రీమద్వల్లభాచార్యవిరచిత మధురాష్టకాన్ని, నారాయణ తీర్థుల కృష్ణం కలయ సఖి…తరంగాన్ని మధురంగా ఆశ్వాదిద్దాము.

సేకరణ

హైదరాబాద్

                      మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం

నయనం మధురం హసితం మధురమ్ ।

హృదయం మధురం గమనం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥


వచనం మధురం చరితం మధురం

వసనం మధురం వలితం మధురమ్ ।

చలితం మధురం భ్రమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 2 ॥


వేణు-ర్మధురో రేణు-ర్మధురః

పాణి-ర్మధురః పాదౌ మధురౌ ।

నృత్యం మధురం సఖ్యం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 3 ॥


గీతం మధురం పీతం మధురం

భుక్తం మధురం సుప్తం మధురమ్ ।

రూపం మధురం తిలకం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 4 ॥


కరణం మధురం తరణం మధురం

హరణం మధురం స్మరణం మధురమ్ ।

వమితం మధురం శమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 5 ॥


గుంజా మధురా మాలా మధురా

యమునా మధురా వీచీ మధురా ।

సలిలం మధురం కమలం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 6 ॥


గోపీ మధురా లీలా మధురా

యుక్తం మధురం ముక్తం మధురమ్ ।

దృష్టం మధురం శిష్టం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 7 ॥


గోపా మధురా గావో మధురా

యష్టి ర్మధురా సృష్టి ర్మధురా ।

దలితం మధురం ఫలితం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 8 ॥


॥ ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ॥

*****

 నారాయణ తీర్థుల కృష్ణం కలయ సఖి…


రాగం: ముఖారి

తాళం: ఆది


కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

(సఖీ! అత్యంత మనోహరమైన కృష్ణుడిని చూడు)


కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం


(కృష్ణుడు, ఇంద్రియాల దాహాన్ని గెలుచుకున్నవాడు, విశ్వానికి ప్రభువు, రాక్షస సంహారకుడు మరియు రాక్షసులపై విజయం సాధించినవాడు, ఎప్పుడూ చిన్న పిల్లవాడే.)


నృత్యంతమిహ ముహుర్ అత్యంత పరిమిత,

బ్రూత్యానుకూలమకిలా సత్యం సదా బలా ॥


(అతను గొప్ప రాగాలకు నృత్యం చేస్తూనే ఉంటాడు,తన సేవకుల పట్ల పక్షపాతం చూపుతాడు, సత్యవంతుడు మరియు ఎల్లప్పుడూ బాలుడే)


ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం


(ఆయన ధైర్యవంతుడు, ఆయన మనల్ని సంసార సాగరాన్ని దాటిస్తాడు, ఆయనే అన్ని వేదాలకు సారం, ఆయనే అన్ని యోగాలకు, యోగులకు ఆధారం మరియు ఆయన ఎల్లప్పుడూ బాలుడే.)


శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం


(అతను శృంగార, సంగీత మరియు సాహిత్యాలనే గంగా తరంగాల సంగమము  మరియు ఎల్లప్పుడూ బాలుడే)


రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల

కృష్ణం కలయ సఖి సుందరం


(లోకాన్ని ఆకర్షించే రాముడు ఆయనే మరియు బలరాముడు ఆయనే,మన కోరికలను తీర్చే రాముడు ఆయనే కానీ ఆయన ఎప్పుడూ బాలుడే.)

దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం

(సమస్త లోకమూ తనను ప్రేమించేలా చేసే దామోదరుడు ఆయనే, ఆయన ముదురు నల్లని రంగు కలిగి ఉంటాడు, అసురులకు భయంకరంగా ఉంటాడు కానీ ఆయన ఎప్పుడూ బాలుడిగానే ఉంటాడు.)

రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం

(ఎర్రటి పెదవుల బాధను తీర్చేది ఆయనే రాధ,  దివ్య ఆనందం యొక్క రూపాన్ని కలిగి ఉంటాడు, మూడు లోకాలకు రాజు కానీ ఎల్లప్పుడూ బాలుడిగా ఉంటాడు.)

అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం

*****-

(ఆయనే సంపద, దుఃఖాన్ని నాశనం చేసేవాడు,నారాయణ తీర్థ రక్షకుడు, దైవిక పురుషుడు కానీ ఎల్లప్పుడూ బాలుడు.

*****

సర్వం విష్ణుమయం జగత్

                (2వ. భాగం)

“విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి భాష్యకారులు అర్థం చెబుతారు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. 

"యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు - అని నిరుక్తి అర్థం. 

ఏది అన్నింటా వ్యాపించి ఉంటుందో, అదే విష్ణువు" అని అర్థం, ఇది విష్ణువు సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది.

"వేవేష్టి ఇతి విష్ణుః" అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. "విశ్వం" అంటే అంతా తానైనవాడు. "విష్ణువు" అంటే అన్నియెడలా ఉండేవాడు. "భూత భవ్య భవత్‌ప్రభుః" అంటే గడచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూత కృత, భూత భృత్, భావః, భూతాత్మా, భూత భావనః అంటే అన్ని భూతాలను (జీవులను) సృష్టించి, పోషించి, భరించేవాడు. అన్ని జీవులలోను ఉండేవాడు. ఈ నామాలు  విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నా యనుకోవచ్చును. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్థానికి అతీతుడు.

భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. 

లో కం బులు లోకేశులు

లో క స్థులుఁ దెగినఁ దుది న లో కం బగు పెం

జీ క టి కవ్వల నెవ్వఁ

డే కా కృతి వెలుఁగు నతని నే సేవించున్. తా|| 

ప్రళయాంతమందు స్ధితమగువాని వర్ణించుచున్నా డెటులన భువనములుఁ దత్పరిపాలనంబును, దద్గత జంతువులను నశించిన పిదపఁ బెంజీఁకటి కావల నేకాకియై ప్రకాశించు, నిషేధ వశిష్టుఁ డగు వికారరహితుని సేవించెను. 

ఇంకా

ఎ వ్వ నిచే జనించు జగ; మె వ్వని లోపల నుండు లీనమై;

యె వ్వ ని యందు డిందుఁ; బర మే శ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ ;​ డనాదిమధ్యలయుఁ డె వ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ డె వ్వఁ డు; వాని నాత్మభవు నీ శ్వరు నే శరణంబు వేడెదన్. తా|| 

సకల భువనసృష్టిలయ నియామకత్వంబులును, ఉపాదాన కారణత్వమును, ఆది మధ్యాంత రహితత్వమును, సర్వనామ రూపత్వ మెవ్వనిచే ధరింపఁబడుచున్నదో, యట్టి యీశ్వరుని శరణుఁజొచ్చుచున్నాను.

అట్టి ఈశ్వరుడు మహావిష్ణువేనని తలచి

శ్రీవిష్ణు షట్పదీ స్తోత్రరాజంతో స్తుతిద్దాము.

విష్ణు షట్పది స్తోత్రం పఠించడం వల్ల అజ్ఞానం తొలగి, మనస్సు ప్రశాంతమై, సంసార బంధాల నుండి విముక్తి లభించి మోక్షం వైపు నడిపిస్తుందని, భగవంతునిపై భక్తి పెరుగుతుందని, ఆత్మను ఉద్ధరించుకోవడానికి సహాయపడుతుందని పెద్దల విశ్వాసం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ స్తోత్రరాజం శ్రీ ఆదిశంకరాచార్య విరచిత మైనది.

అల్లాగే కర్ణాటక సంగీతనికి ఆద్యుడైన శ్రీ పురందర దాస విరచిత “ జగదోద్ధారణ “ కృతితో తరిద్దాం.

B-910

హైదరాబాద్.

                విష్ణు షట్పదీ స్తోత్రం

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ ।

భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ॥ 1 ॥

(ఓ విష్ణు మూర్తి, నా అవినయమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము, ప్రాపంచిక విషయములనెడి  ఎండమావులను రూపుమాపుము, సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము, సంసార సాగరం నుండి బయటపడుటకు నాకు మార్గము చూపించుము.)

దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే ।

శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ॥ 2 ॥

(ఆకాశ గంగయే మకరందముగా కలిగివుండి సచ్చిదానందమును పరిమళముగా కలిగి

సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయిన శ్రీపతి (లక్ష్మి దేవి భర్త అగు విష్ణువు) యొక్క పాద పద్మములకు నమస్కరించుచున్నాను)

సత్యపి భేదాపగమే నాథ తవాఽహం న మామకీనస్త్వమ్ ।

సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ॥ 3 ॥

(ఓ నాథ, పరమ సత్యమును గ్రహించి నీకు నాకు భేదములేదు అను భావన కలిగినా కూడా, నేను నీకు చెందిన వాడినే కానీ నీవు నాకు చెందిన వాడవు కాదు ఎలాగంటే సముద్రము తరంగముల లాగా. తరంగములు సముద్రమునకు చెందినవి కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా)

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే ।

దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ॥ 4 ॥


(పర్వతమును ఎత్తిన వాడా (కృష్ణునిగా), పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా, రాక్షస కుల శత్రువుగా ఉన్నవాడా, సూర్యచంద్రులను కన్నులుగా కలవాడా

మీ దృష్టి మాపై ప్రసరించినచో, ప్రత్యక్షమైనచో సంసార బాధ నశించక ఎలా ఉంటుంది)

మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధామ్ ।

పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహమ్ ॥ 5 ॥

(ప్రపంచమును కాపాడుటకు నీవు మత్స్య ఇతర అవతారములు ఎత్తితివి

ఓ పరమేశ్వరా, భవ తాపముతో, సంసార 

తాపముతో భయపడు నన్ను కాపాడుము.)

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద ।

భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే ॥ 6 ॥

(ఓ దామోదర (ఉదరము భాగమున త్రాడు వంటి ఆభరణము కలిగినవాడా), గుణములకు  నిలయమై, సుందరమగు పద్మము వంటి ముఖము కలిగినవాడా, గోవిందుడా ( గోవులను , సకల ప్రాణులను చూసుకొనువాడా)

సంసారమను సముద్రమును మథించు మందర పర్వతము వలే మథించువాడా, తీవ్రమగు నా భయమును పోగొట్టుము)

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ।

ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ॥

(ఓ నారాయణుడా, కరుణా మూర్తి, నీ పాదములను శరణు పొందుచున్నాను

ఇట్లు ఈ ఆరుపాదములు కలిగిన షట్పదీ స్తోత్రం ఆరుపాదములు కలిగిన తుమ్మెద వలే నా ముఖమనే పద్మము నందు ఎల్లపుడు నెలకొనుగాక)

ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం సంపూర్ణం

          జగదోద్ధారణా

పల్లవి

జగదోద్ధారానా ఆదిసిదాలే యశోదే

అనుపల్లవి

జగదోద్ధారానా మగనెందు తిలియుత

సుగుణాంత రంగనా ఆదిసిదాలే యశోదే

(ఆ స్వామి సద్గుణాలతో నిండి ఉన్నాడు. ఆయన అన్ని మంచి పాత్రల స్వరూపం. ఈ లోకాన్ని నివసించడానికి మంచి ప్రదేశంగా మార్చేది ఆయనే. రాక్షసులను చంపి, ఋషులను రక్షించేలా ఆయనే చూసుకుంటాడు. కానీ, యశోదే ఇవన్నీ పట్టించుకోడు. ఆమె అతనితో ఆడుకుంటోంది. ఆమె కొడుకులాగే. )

చరణం

నిగమకే సిలుకడ ఆగనిత మహిమాన

మగుగలే మాణిక్యానా ఆదిసిడలే యశోదే

(వేదాలు కూడా నిజంగా కనుగొనని వ్యక్తితో యశోద ఆడుకుంటోంది. అతను లెక్కలేనంత పెద్దవాడు. అతను అందరికంటే పెద్దవాడు. పిల్లలలో అతను ఒక రత్నం. కానీ, యశోదే అతనితో తన కొడుకులా ఆడుకుంటోంది, అంతకు మించి కాదు. )

అనోరనియాన మహతో మహిమాన

అప్రమేయనా నా ఆదిసిదాలే యశోదే

(ప్రపంచంలోని అతిపెద్ద వస్తువుల కంటే పెద్దవాడితో యశోద ఆడుకుంటోంది. ఆమె అపరిమితమైన మరియు నిజంగా కొలవలేని దానితో ఆడుకుంటోంది. ఆమె అణువులలో అతి చిన్నదానితో ఆడుకుంటోంది. ఆమె ఇవన్నీ అయిన వ్యక్తితో ఆడుకుంటోంది కానీ అతను ఎవరో నిజంగా తెలియకుండానే ఆమె అతనితో ఆడుకుంటోంది. అతను తన కొడుకులాగా ఆమె అతనితో ఆడుకుంటోంది. )

పరమ పురుసన పరవాసుదేవాన

పురందర విఠలనా ఆదిసిడలే యశోదే

(ఆయన మానవులలో అత్యుత్తముడు. ఆయన సమస్త లోకానికి దేవుడు. ఆయన పండరపుర విఠలుడు. ఇప్పుడు పురందరదాసు చేత ప్రశంసించబడుతున్నది ఆయననే. కానీ, యశోద నిజంగా ఆయన ఎవరో తెలియకుండానే ఆయనతో ఆడింది. ఆమె ఆయనతో కేవలం ఒక కొడుకుగానే ఆడింది.)

****

3.సర్వం విష్ణుమయం జగత్

వేదస్వరూపుడు, వేదరక్షకుడు, వేదాంత వేద్యుడు అయిన శ్రీ మహా విష్ణువుని వేదాలు యెంత గానో కీర్తించాయి.

పంచమ వేదమైన  మహాభారతం మొదలుపెడుతూనే శ్రీ మహావిష్ణుని వ్యాసభగవానుడు ఈ విధంగా స్మరించడం జరిగింది.

ఆద్యం పురుషమీశానం పురుహూతం పురుష్టుతం।

ఋతమేకాక్షరం బ్రహ్మ వ్యక్తావ్యక్తం సనాతనం॥ 1-1-28(28)

అసచ్చ సచ్చైవ చ యద్విశ్వం సదసతః పరం

పరావరాణాం స్రష్టారం పురాణం పరమవ్యయం॥ 1-1-29(29)

మంగల్యం మంగలం విష్ణుం వరేణ్యమనఘం శుచిం।

నమస్కృత్య హృషీకేశం చరాచరగురుం హరిం॥ 1-1-

కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన నారాయణోపనిషత్తులో ఇలా ఉంది -

ఓం. అథ పురుషో హ వై నారాయణోఽ కామయత, ప్రజాః సృజయేతి, నారాయణాత్ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, నారాయణాద్బ్రహ్మాజాయతే.... .... –

ఋగ్వేదంలో ఇలా ఉంది -

అథ నిత్యో నారాయణః, బ్రహ్మో నారాయణః, శక్రశ్చ నారాయణః, ద్యావా పృథివ్యౌచ నారాయణః, కాలశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః,నారాయణ ఏవేదగ్‌ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః,న ద్వితీయోఽస్తి కశ్చిత్, య ఏవం వేదస విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి, ఏతద్యజుర్వేద శిరోఽధీతే –

నారాయణుడే సత్యము, నిత్యము, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, భూమి, ఆకాశము, పైన, క్రింద, అన్నిదిశలు, బయట, లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్వర్తమానాలు. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. నారాయణుని మాటలతో నిర్వచింపలేము..

అట్టి పురాణ పురుషుణ్ణి ఈ రోజు ఈ స్కందపురాణోక్త శ్రీ ఆదినారాయణస్తవంతో స్వామిని ప్రార్ధన చేద్దాము.

తాళ్ళపాక అన్నమాచార్య తన కీర్తనలలో "సర్వం విష్ణుమయం" అనే భావనను లోతుగా వివరిస్తారు. ఆయన ప్రకారం, ఇంద్రియాలను జయించి, కర్మ బంధాలను విడిచిపెట్టి, పాప పుణ్యాలను త్యజించినప్పుడే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందని, అదే విష్ణుమయం అనే భావనకు మూలం అని ఆయన కీర్తనల ద్వారా విశదమౌతోంది.  

రేపు మరల కలిసి శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఆస్వాదిద్దాము.

B-910

హైదరాబాద్.

            శ్రీ ఆదినారాయణ స్తవః

ఋషయ ఊచుః |

నమః పరమకళ్యాణ కళ్యాణాయాత్మయోగినే |

జనార్దనాయదేవాయ శ్రీధరాయ సువేధసే || 1 ||


నమః పరమకింజల్క సువర్ణముకుటాయ చ |

కేశవాయాతిసూక్ష్మాయ బృహన్మూర్తే నమో నమః || 2 ||


నమః పంకజనాభాయ హరయే హరివేధసే |

నమో హిరణ్యగర్భాయ జగతః కారణాత్మనే || 3 ||


అచ్యుతాయ నమో నిత్యమున్నతాయ నమో నమః |

నమో మాయాపటచ్ఛన్న జగద్ధాత్రే మహాత్మనే || 4 ||


సంసారసాగరోత్తార జ్ఞానపోతప్రదాయినే |

అకుంఠమతయేధాత్రే సర్గస్థిత్యంతకారిణే || 5 ||


యథా హి వాసుదేవేతి ప్రోక్తం పాతకనాశనం |

తథా విలయమభ్యేతు దైత్యోయం మేఘవాహనః || 6 ||


యథా న విష్ణుభక్తేషు పాపం నాప్నోతి సంస్థితం |

తథా వినాశమాయాతు దైత్యోయం పాపకర్మకృత్ || 7 ||


స్మృతమాత్రో యథా విష్ణుః సర్వం పాపం వ్యపోహతి |

తథా ప్రణాశమభ్యేతు దైత్యోయం మేఘవాహనః || 8 ||


భవంతు భద్రాణి సమస్తదోషాః

ప్రయాంతు నాశం జగతోఽఖిలస్య |

అభ్యేత్యభక్త్యా పరమేశ్వరస్య

స్మృతే జగద్ధాతరివాసుదేవే || 9 ||


యస్తం పూజయతే భక్త్యా ఏకాదశ్యాన్నరోత్తమః |

సోఽశ్వమేధఫలం ప్రాప్య మోదతే దివి దేవవత్ || 10 ||


గోలక్షం బ్రాహ్మణే దత్త్వా యత్ఫలం ప్రాప్నుయాన్నరః |

తదాదిదేవం గోవిందం దృష్ట్వా భక్త్యా ఫలం లభేత్ || 11 ||


కలౌ కృతయుగస్తేషాం క్లేశాస్తేషాం సుఖాధికాః |

ఆదినారాయణో దేవో యేషాం హృదయసంస్థితః || 12 ||


ఏకాదశ్యాం రవిదినే స్నాత్వా సన్నిహితో జలే |

ఆదినారాయణం పూజ్య ముచ్యతే భవబంధనాత్ || 13 ||


ఇతి స్కందపురాణే శ్రీ ఆదినారాయణ స్తవః ||

(స్తవం ఆరంభంలో ఋషులు పరమకళ్యాణస్వరూపుడైన జనార్దనుడు, శ్రీధరుడు, సువేధసుడు అయిన దేవునికి నమస్కరిస్తారు. సువర్ణమయ కిరీటంతో, సున్నితమైన కానీ విస్తారమైన మహామూర్తిగా కేశవుడిని ధ్యానిస్తారు. పంకజనాభుడు, హరుడు, హిరణ్యగర్భుడు, జగత్తుకూ కారణాత్ముడు అనే నామాలు ఆయన సృష్టితత్త్వాన్ని వ్యక్తం చేస్తాయి.

అచ్యుతుడు, నిత్యం ఉన్నతుడైన పరమాత్ముడు మాయాపటంతో కప్పబడిన జగత్తును ధరిస్తూ అన్ని లోకాలకు ఆధారంగా ఉన్నారని ఋషులు వర్ణిస్తున్నారు. భగవంతుడు సంసారసాగరంనుండి బయటపడే జ్ఞానపోతాన్ని ప్రసాదించే దాత, సృష్టి–స్థితి–లయం నిర్వహించే ధాత్రి.

తరువాతి శ్లోకాలలో దైత్యసంహారం కోసం రక్షకశక్తిని ప్రార్థిస్తూ—

“వాసుదేవ నామస్మరణం పాపనాశకం, అలానే ఈ పాపకర్మకుడు అయిన దైత్యుడు నశించాలి”

అని ఋషులు దేవుని దయను వేడుకుంటారు.

విష్ణువును ఒక్కసారైనా స్మరించినా పాపాలు నశిస్తాయన్న సత్యాన్ని స్తవం పునరుద్ధరిస్తుంది.

జగత్తు దోషాలు, కష్టాలు, అశాంతులు నశించి శాంతి ఏర్పడాలని, వాసుదేవుని స్మరణతో లోకం క్షేమం పొందాలని సామూహికంగా ప్రార్థిస్తున్నారు.

ఫలశ్రుతి ప్రకారం, ఏకాదశి రోజున భక్తితో ఆదినారాయణుని పూజించే వ్యక్తి అశ్వమేధయాగఫలాన్ని పొందుతాడు. గోలక్ష దానం చేసిన పుణ్యాన్ని గోవిందుని దర్శనం, పూజ ద్వారా సులభంగా పొందుతాడు. కలియుగంలో ఆదినారాయణుడు హృదయంలో నివసించిన వారికి కృతయుగమంత శుభం, కష్టనాశనం లభిస్తాయి. ప్రత్యక్ష నారాయణునిగా భాసించే శ్రీ మహావిష్ణువును ఆదివారం,  ఏకాదశి సందర్భంగా స్నానము చేసి పూజించినవాడు భవబంధనమునుండి విముక్తి పొందుతాడు.

ఇది భక్తుని పాపక్షయం, ధర్మరక్షణ, దైవసన్నిధి, సంసారమోక్షం ప్రతిజ్ఞ చేసే అత్యంత పవిత్రమైన స్తోత్రం)

అన్నమయ్య” సర్వం విష్ణుమయం’

సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను

సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతియే వుపాయము ॥పల్లవి॥


తానని యెడి బుద్ధి దైవంబందు నునిచి

తానే తనమతి మరచిన సుఖ తత్వానందమిది

మేనని యెడి బుద్ది యీ మేదిని ప్రకృతి యందు

ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు ॥సర్వం॥


పొరలి జగమనే బుద్ధి మాయపై నునిచి

పరగిన యింద్రియముల గెలిచినదే పరమపు యోగంబు

పొరిఁ గర్మపు బుద్ధి పుట్టువుపై నునిచి

వెరపునఁ బాపము బుణ్యము విడుచుట వివేకమగు దుదిపదము ॥సర్వం॥


వెలి దోచిన బుద్ధి వేగమే లోనునిచి

చలమున చంచల ముడిగి యుండుటే సమాధి లక్షణము

పలు భావపు బుద్ధి భక్తి వొకట నునిచి

యెలమి శ్రీ వేంకటపతి గలయుటే యిది తుర్యావస్థ.


(సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను: ఈ విశ్వమంతా విష్ణుమయం (విష్ణువుతో నిండి ఉంది) అనే ఆలోచన నిజం, నిజం, ఇందులో ఎటువంటి సందేహం లేదు.

సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతియే వుపాయము: సర్వానికి ప్రభువైన విష్ణువును పొందాలంటే, ఆయనకు సంపూర్ణంగా శరణు కోరడం (శరణాగతి) మాత్రమే సరైన మార్గం. 

ముఖ్య సందేశం:

ఈ కీర్తన ద్వారా అన్నమయ్య, విశ్వమంతా భగవంతుడి రూపమేనని, ఆ భగవంతుడిని చేరడానికి అహంకారాన్ని విడిచిపెట్టి, పూర్తిగా దేవునిపై ఆధారపడటమే (శరణాగతి) అత్యుత్తమ మార్గమని తెలియజేస్తున్నారు. ఇది భగవద్గీత వంటి శాస్త్రాలలోని "వాసుదేవః సర్వమితి" (వాసుదేవుడే సర్వస్వం) అనే భావనకు దగ్గరగా ఉంటుంది. )

******

సర్వం విష్ణుమయం జగత్

                    (4వ. భాగం)

పురాణాలన్ని ఆ పరమపురుషుని కీర్తిస్తూ ఆతని తత్వాన్ని తెలియచేడమే పరామవధిగా ఉద్భవించాయి . అట్టి పరమ పురుషుడే ఈ శ్రీ మహావిష్ణు. 

ముఖ్యంగా మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. 

మద్వయం, భద్వయం చైవ, బ్రత్రయం, వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్‌ పృథక్‌.

అర్థం :- పురాణాలు 'మ' అనే అక్షరంతో మొదలయ్యేవి రెండు, 'భ'తో మొదలయ్యేవి రెండు, 'బ్ర'తో మొదలయ్యేవి మూడు, 'వ'తో మొదలయ్యేవి నాలుగు, 'అ', 'నా', 'ప', 'లిం', 'గ', 'కూ', 'స్కా' ప్రథమాక్షరాలుగా కలిగినవి ఏడు, వెరసి 18 పురాణాలు.

ఈ 18 పురాణాలు శ్రీమహావిష్ణువు యొక్క అవయవాలుగా ఆవిష్కరించారు మన పెద్దలు..

1.బ్రహ్మ పురాణం (మహావిష్ణువు యొక్క శిరస్సు), 

2.పద్మపురాణం (మహావిష్ణువు యొక్క హృదయం),

3.విష్ణుపురాణం (మహావిష్ణువు యొక్క కుడిచేయి), 

4.వాయుపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమచేయి), 

5.శ్రీమద్భాగవతపురాణం (మహావిష్ణువు యొక్క తొడలు), 

6. నారదపురాణం (మహావిష్ణువు యొక్క నాభి), 

7.మార్కండేయపురాణం (మహావిష్ణువు యొక్క కుడిపాదం), 

8.అగ్నిపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ పాదం), 

9.భవిష్యపురాణం (మహావిష్ణువు యొక్క కుడిమోకాలు), 

10.బ్రహ్మవైవర్తపురాణం (మహావిష్ణువు యొక్క ఎడామ మోకాలు), 

11.లింగపురాణం (మహావిష్ణువు యొక్క కుడి చీలమండ), 

12.వరాహపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ), 

13.స్కాందపురాణం (మహావిష్ణువు యొక్క కేశములు), 

14.వామనపురాణం (మహావిష్ణువు యొక్క చర్మము), 

15.కూర్మపురాణం (మహావిష్ణువు యొక్క వీపుభాగం), 

16.మత్స్యపురాణం (మహావిష్ణువు యొక్క మెదడు), 

17.గరుడపురాణం (మహావిష్ణువు యొక్క మాంససారము), 

18.బ్రహ్మాండపురాణం (మహావిష్ణువు యొక్క ఎముకలు) మొదలయినవి; 

ఈ విధంగా మహావిష్ణువు యొక్క శరీరం లోని 18 అవయవములతో పోల్చారు.

ఈ పోలిక పురాణాలలోని సారాన్ని, ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క వివిధ రూపాలు, అవతారాలు, మరియు ఆయన మహిమను సూచిస్తుంది.

 "సర్వం విష్ణుమయం జగత్" (సమస్త ప్రపంచం విష్ణుమయం), విశ్వం, దానిలోని ప్రతి జీవి, ప్రతి వస్తువు అంతా విష్ణువు యొక్క స్వరూపమే అని సూచిస్తుంది. అన్నింటిలోనూ విష్ణువును చూడగలగడం, సర్వత్రా ఆయన వ్యాపించి ఉన్నాడని గ్రహించడమే జ్ఞానం అని ఉద్ఘాటిం చాయి పురాణాలు.

అట్టి పురాణ పురుషుడైన శ్రీ మహా విష్ణువుని గురించి  దృవుడు చేసిన విష్ణు స్తోత్రము అల్లాగే శృంగేరి జగత్గు రువులు శ్రీభారతీ తీర్థమహా స్వాములు వ్రాసిన అతి మధురమైన కీర్తన

“గరుడ గమన తవ చరణ కమలమివ” పాడుకుంటూ నేటికి శలవు తీసుకుందాము.

B-910

హైదరాబాద్.


        ధృవ కృత భగవద్ స్తుతి


ధృవ కృత భగవద్ స్తుతి

ధ్రువ ఉవాచ

యోऽన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం

సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా

అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్

ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్. 1


నీకు నీవుగా మా హృదయం లోపల చేరి నిదురిస్తున్న శక్తిని మేలుకొలిపి నీ యందు మా దృష్టిని నిలిపేట్లు చేస్తున్నావు. నిదురపోయి ఉన్న నా వాక్కును ఉజ్జీవింపచేసావు. అందరి శక్తినీ అందించేవాడివి, అందరి sakhti నీవే అయిన వాడివి. కేవల వాక్కునే కాదు, చేయీ కాలూ కళ్ళూ నాలికా అన్నీ, వీటిలో ఏది కదలాలన్నా పరమాత్మ వలనే. అన్ని ఇంద్రియాలలోకీ నీవు వెళ్ళి వాటి శక్తిని ఉజీవింపచేస్తావు. అటువంటి నీకు నమస్కారం


ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా

మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్

సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు

నానేవ దారుషు విభావసువద్విభాసి..2.


నీవొక్కడవే నీ యోగ మాయ అనే శక్తితో ప్రకృతితో మహత్ తత్వాన్ని, దానితో అహంకారమునూ, దానితో ఇంద్రియాలను సృష్టించి, ప్రవేశించి, సత్ అసత్తులోనూ,ప్రకృతిలోనూ మహదహంకారములో ప్రవేశించావు. ఒక్కడివే ఉన్నా చాలా మంది ఉన్నట్లు భాసిస్తావు. కట్టె ఆకారం బట్టి మంట ఆకారం మారుతూ ఉంటే, అగ్నే పలు రకాలుగా మారుతోంది అనిపించినట్లుగా నీవు కూడా పలు రకాలుగా ఉన్నట్లు భాసిస్తావు. వాస్తవముగా నీవు ఒక్కడవే.


త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం

సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః

తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం

విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో..3


పడుకుని లేచిన వాడు ఎలా చూస్తాడో నీవిచ్చిన జ్ఞ్యానముతో సకల ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచం తెలియాలన్నా ప్రపంచాన్ని చూడాలన్న నీ అనుగ్రహమే కావాలి. మోక్షమూలమైనది నీ పాదం. కానీ ఈ విషయాన్ని అన్నీ తెలుసనుకునే జనులు ఎలా మరిచిపోతున్నారు


నూనం విముష్టమతయస్తవ మాయయా తే

యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః

అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్యమ్

ఇచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేऽపి న్ణామ్..4


పరిశుద్ధమైన బుద్ధికలిగి, బాగా పరిశీలించి మంచి బుద్ధిగా ఉంటున్న వారందరూ నీ మాయతో సంసారాన్నీ మోక్షాన్నీ ఇచ్చేవాడివి (భవాప్యయవిమోక్షణ) అయిన నీ గురించి తెలిసి కూడా మోక్షన్ని కోరక సంసారాన్ని అడుగుతున్నారు. నిన్ను సంసారం కోసం అర్చిస్తున్నారు. కల్పవృక్షాన్ని పట్టుకొని పురుగులు తినే శరీరాన్ని కోరుతున్నారు. దానికి నీ మాయే కారణం


యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ

ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్

సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్

కిం త్వన్తకాసిలులితాత్పతతాం విమానాత్..5


శరీరధారులకు ఆనందం నీ పాద పద్మాలని ధ్యానం చేయడం వలనా, నీ భక్తుల కథలు వినడం వలనా, కలుగుతుంది. వీటి వలన కలిగే ఆనందం సంసారములో ఉండే జనులు యముని కత్తి వేటు తప్పించుకోవడములో పొందుతున్నారు. కింద పడేసే విమానాలు వద్దు నాకు


భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసఙ్గో

భూయాదనన్త మహతామమలాశయానామ్

యేనాఞ్జసోల్బణమురువ్యసనం భవాబ్ధిం

నేష్యే భవద్గుణకథామృతపానమత్తః..6.


ఏమి చేస్తున్నా మాట్లాడుతున్నా నీ యందే భక్తి కలగాలి. నిరంతరం నిన్ను తలచుకొనే భక్తుల సావాసం చాలు. దాని వలన పరమ తీవ్రమైన మహాకష్టాలతో నిండి ఉన్న సంసారమనే మహా సముద్రాన్ని సులభముగా దాటుతాము. నీ కథలనే మత్తులో ఉన్న మాకు ఈ సంసారములో మునుగుతున్నా కూడా, మునుగుతున్నట్లు తెలియదు.


తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం

యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః

యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద

సౌగన్ధ్యలుబ్ధహృదయేషు కృతప్రసఙ్గాః..7


నిరంతరం నీయందే మనో వాక్కులూ లగ్నం చేసిన వారి పొరపాటున కూడా శరీరాన్ని, మరణ ధర్మం కలిగి ఉన్నదాన్ని స్మరించరు. శరీరాన్నే తలచనప్పుడు, శరీరం కోసం వచ్చేవారు, శరీరముతో వచ్చిన వారు, శరీరం వలన వచ్చేవారైన, భార్యా పిల్లలూ ఇల్లూ వెంట రావు. పుత్రులూ, మిత్రులూ, ఇల్లూ, విత్తం, ధార వీళ్ళంతా శరీరం వెంట తిరిగేవారు. నీ పాదారవింద మకరందాన్ని రుచి చూసిన వారు వీటిని కోరరు.


తిర్యఙ్నగద్విజసరీసృపదేవదైత్య

మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్

రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం

నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః..8


మేము ఏ ఏ ఆకారాలను  కోరతామో ఆ రూపాలలో వచ్చావు. ఆహారముగా తినే మత్స్యాదులలో, పర్వతాలుగా, నదులుగా, పక్షులుగా, సర్పాలుగా, దేవతలుగా (వామనుడు) మనుషులుగా , ఎవరెవరు ఏ ఏ ఆకారలతో నిన్ను భావిస్తారో ఆ ఆకారములలో వచ్చావు. ఇన్ని రూపాలలో ఉన్నా వీటిలో ఉన్న దోషాలు ఏవీ నీకు అంటవు. నీవు సత్ కాదూ అసత్ కాదు. అన్నింటిలో ఉంటావు కానీ దేనిలోనూ ఉండవు. మహదాదులు ఉన్నాయి గానీ అవి నిజానికి లేవు. అవి అన్నీ నీ రూపాలే. ఇంతకంటే ఎక్కువ నేను ఏదీ తెలుసుకోలేను. అక్కడిదాకే నీ వాదాలన్నీ.


కల్పాన్త ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్

శేతే పుమాన్స్వదృగనన్తసఖస్తదఙ్కే

యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మ

గర్భే ద్యుమాన్భగవతే ప్రణతోऽస్మి తస్మై..9


ప్రళయకాలములో ఈ సకల జగత్తునీ నీ కడుపులోకి తీసుకుని, సకలప్రపంచాన్నీ నీకు నీవే చూస్తూ పడుకుంటావు. కొంతకాలానికి అలా పడుకొని ఉన్న నీ నాభి నుంచి బంగారు పద్మం పుడుతుంది. అదే లోకపద్మం. దాని మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటారు.


త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా

కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః

యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా స్వదృష్ట్యా

ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే..10..


స్థితావధిమఖో- పరమాత్మ జగత్తును రక్షించడానికే పుడతాడు. అధి మఖ అంటే లోక రక్షణ గురించి యజ్ఞ్యములచే ఆరాధించబడే వాడు. నీ "స్థితి" ధర్మ స్థాపన కొరకే (పరిత్రాణాయ సాధూనాం). నీవు లోకాన్ని రక్షించడానికి అవతరిస్తున్నావు. నీ చేత రక్షించబడినవారు యజ్ఞ్యముల ద్వారా నిన్ను ఆరాధిస్తున్నారు. అవతరించినా నీవు వ్యతిరిక్త . అంటే ప్రకృతి కన్నా పురుషుడికన్నా విలక్షణుడవు. కానీ వాటికన్నా వేరుగా ఉన్నట్లు కనపడతావు.

                గరుడ గమన

గరుడ గమన తవ చరణ కమలమివ

మనసిల సతు మమ నిత్యం                      || గరుడ ||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 1 

జలజ నయన విధి, నముచి హరణ ముఖ

విబుధ వినుత పద పద్మా                           || 2||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 2

భుజగ శయన భవ, మదన  జనక మమ

జనన మరణ భయ హారి                            || 2||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

 చరణం: 3

శంఖ చక్ర ధర , దుష్ట దైత్య హర

సర్వ లోక శరణా                                        || 2||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 4

అగణిత గుణ గణ , అశరణ శరణద 

విదిలిత సురరిపు జాలా                           || 2|| 

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 5

భక్త వర్య మిహ , భూరి కరుణయా

పాహి భారతీ తీర్థం                                    || 2||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||k

Sunday, 7 December 2025

 [18/11, 8:47 am] . Mallapragada: _*కార్తీక పురాణం - 28 వ అధ్యాయము*_


*విష్ణు సుదర్శన చక్ర మహిమ*


జనక మహారాజా ! వింటివా దుర్వాసుని అవస్ధలు ! తాను ఎంతటి కోపవంతుడైనను , వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున , ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.


అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి *"అంబరీషా , ధర్మపాలకా ! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము , నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి , కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్దించితిని . ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"* మని అనేక విధాల ప్రార్ధించగా , అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి , *"ఓ సుదర్శన చక్రమా ! నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో , తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన , ఈతనిని చంపవలదు , ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని , ముందు నన్నుచంపి , తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి , నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు , దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా ! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు , నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.*


*నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును , శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము"* అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి *"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా ! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు , మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు ఏకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ! ఈ లోకములో దుష్టశిక్షణ , శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే , ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి , నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి , ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.*


*ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని , శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను , కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.*


*ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి , శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు"* మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి , *" నేను దేవ గో , బ్రాహ్మణాదులయుందును , స్త్రీలయందును , గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా అభిలాష. కాన , శరణుగోరిన ఈ దుర్వాసుని , నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు , కోట్ల కొలది సూర్య మండలములు ఏక మైననూ నీ శక్తీకి , తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి , వారిని శిక్షించి , తన కుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన , నికివే నామనఃపూర్వక నమస్కృతులు"* అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి *"అంబరీషా ! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని.విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో , ఎవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో , ఎవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబట్టక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి , ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన , నిన్నూ , దుర్వాసుని రక్షించుచున్నాను , నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు."* అని చెప్పి అతన్నీ ఆశీర్వదించి , అదృశ్యమయ్యెను.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.*

[19/11, 7:07 am] . Mallapragada: _*కార్తీక పురాణం - 29 వ అధ్యాయము*_


*అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము*


అత్రి మహాముని అగస్త్యులవారితో ఈవిధముగా - సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి వుభయులను రక్షించి , భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.


ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి , పాదములను కడిగి , ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని , *"ఓ మునిశ్రేష్టా ! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును , ద్వాదశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన , నా అతిధ్యమును స్వీకరించి నన్నును , నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు , మీరు దయార్ద్ర హృదయులు , ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను.


*మహానుభావా ! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన , ఓ పుణ్యపురుషా ! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును , సదా , మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"* డని ప్రార్ధించి , సహాపంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.


ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి *"రాజా ! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో , ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.


*నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని , నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక , మరొకటి యగునా?"* అని దుర్వాస మహాముని పలికి , అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి , అతని భక్తిని కడుంగడు ప్రశంసించి , అంబరీషుని దీవించి , సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.


*ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా ! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే , ఆరోజుకంతటి శ్రేష్టతయు , మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ , లేక , వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతికొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నారాయుణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.*


ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో , అట్టి వారు ఏకాదశి వ్రతము , ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను , అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.


ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.*

[20/11, 6:41 am] . Mallapragada: *కార్తీక పురాణం - 30 వ అధ్యాయము*_


*చివరి రోజు*


*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*



నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నె,అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.*

🙏

*కార్తీక పురాణం - 30 వ అధ్యాయము*_


*చివరి రోజు*


*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*



నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నె,అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.*

🙏