Monday, 12 October 2020

stories

******

పరమాచార్య ప్రసాద మహిమ

పరమాచార్య స్వామివారి భక్తుడైన శ్రీ జయరామన్ చెన్నై పశ్చిమ మాంబళంకు చెందిన గొప్ప భక్తుడు మరియు స్వామివారికి ఎంతో సేవ చేసుకున్నవారు. వారి కుటుంబం మొత్తం మహాస్వామివారికి మరియు కామకోటి మఠానికి విధేయులు. పశ్చిమ మాంబళంలో ఉన్న శంకర మఠం భూమి విరాళం కోసం వీరు ఎంతగానో సహాయం చేశారు.

ఒకసారి మహాస్వామివారు ఆంధ్రదేశంలోని సుబ్బనాయుడు ఖండ్రిగ అనే గ్రామంలో మకాం చేస్తున్నారు. అప్పుడు జయరామన్ తన భార్య పట్టమ్మాళ్, కుమార్తె నాగలక్ష్మి, అల్లుడు వాసుదేవన్, మనవడు చంద్రశేఖరన్ తో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. మహాస్వామివారు ఆ పిల్లవాడు చంద్రశేఖరన్ ను ప్రేమతో దగ్గరకు పిలిచి, అతని వివరాలు, చదువు గురించి అడిగారు. స్వామివారు ఆ పిల్లవానికి బోలెడంత పటికబెల్లం ముక్కలు ఇచ్చి నీ వద్దనే ఉంచుకో అని చెప్పి ఆశీర్వదించారు. చేతుల్లో ప్రసాదాన్ని గట్టిగా పట్టుకుని బయటకు వచ్చాడు.

బయట పచ్చిక బయళ్ళు ఉండడంతో, అందులో ఆడుకోవడం మొదలుపెట్టాడు. దగ్గర్లోనే పెద్ద మెట్లబావి ఉంది. ఆడుకుంటూ అజాగ్రత్తతో అందులోకి పడిపోయాడు. అక్కడ బావి ఉన్నట్టు బయటివారికి కనపడదు. బావి ఎక్కువ లోతు ఉండి ఎక్కువ నీళ్లతో ఉంది. ఆ పిల్లవాడి తండ్రి వాసు, పిల్లాడి కోసం అంతా వెతుకుతూ బావి వద్దకు వచ్చాడు. బావిలోనికి వెళ్లడానికి మెట్లు ఉండడం గమనించాడు. పిల్లాడి చొక్కా మెట్ల వద్ద ఇరుక్కుని ఉండడం గమనించాడు.

ఆత్రంగా మెట్లు దిగి ఏమిటా అని చూస్తే అది తన కుమారుడే. గట్టిగా అరుస్తూ పిల్లాణ్ణి పైకెత్తాడు. అక్కడ ఉన్నవారందరూ పరిగెత్తుకుని వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ పిల్లాణ్ణి పైకి తీసుకునివచ్చి, ఎడ్లబండి చక్రంపై పడుకోబెట్టి కడుపులో ఉన్న నీటిని బయటకు తీశారు. పిల్లవాడికి స్మృతి వచ్చిన వెంటనే పరమాచార్య స్వామి వారి వద్దకు తీసుకువెళ్ళి జరిగిన విషయం తెలిపారు. స్వామివారు ఆశీర్వదించి, “పిల్లవాని చేతిలో ఏముంది?” అని అడిగారు.

అప్పుడు గమనించారు అందరూ పిల్లవాడు పిడికిలి మూసుకునివుండడం. స్వామివారు ఆశీర్వదించి ఇచ్చిన పటికబెల్లం పిల్లవాని చేతిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. పరమాచార్య ప్రసాదం గురించిన మహిమను ఏమని వర్ణించగలం! ఆ పిల్లవానికి ఉన్న గండాన్ని స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన పటికబెల్లం తీసేసింది. ఆ పిల్లవాడు పెద్దవాడై మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, స్వామివారి ఆశీస్సుల వల్ల జీవితంగా స్థిరపడ్డాడు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
 

********

దీర్ఘాయుష్మాన్ భవ అంటే?

చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు.

“భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”

మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని అశీర్వదిస్తాము అదే సంప్రదాయము” అని అన్నారు.

”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు.

”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం.

మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు.

పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత…

 *******

నమస్కారం చేసే విధానం
ఆధ్యాత్మికత అందిస్తున్న సంస్కారం
నమస్కారం అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం.

తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.

మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం,  విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం  భాష.

సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా  "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు.  వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా  తాకేలా గౌరవంగా చేయాలి.

🙏 శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి  నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు)

🙏హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు..

🙏గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి .

🙏తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి.

🙏తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.

🙏యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.

నమస్కారంలోని అంతర్గతం ....

హిందూ సంస్కృతిలో నమస్కారం   విశిష్ట ప్రక్ధియ. ఒకరికొకరు ఎదురైతే  రెండు చేతులు జోడించి హృదయ
 స్థానం దగ్గర ఉంచి నమస్కారం  చెప్పడం   హిందువు అలవాటు  .  మామూలుగా  చూస్తే నమస్కారం చేయడం  అంటే  ఎదుటి వ్యక్తికి గౌరవం  ఇవ్వడం  నమస్కారం అన్న పదం  సంస్కృతం  నుంచి వచ్చింది .
 సంస్కృతానికి చెందిన నమః  అనే  పదం నుంచి  నమస్కారం  అన్న. పదం  ఏర్పడిననది ..  సంస్కృతంలో నమః
 అంటే విధేయత. ప్రకటించామని  అర్ధం ..
 మనషులందరిలోనూ దైవత్వము  ఉంటుందని  హిందువులు నమ్ముతారు ...
 దీనినే ఆత్మ అంటారు  . నమస్కారం పెట్టడం  అంటే  ఒక వ్యక్తిలో  ఉన్న ఆత్మ ఎదుటి  వ్యక్తిలోని ఆత్మను
 గుర్తించి దానికి విధేయత ప్రకటించడం ..
 ఇది అధ్యాత్మిక పరమైన వివరణ ..
 శాస్త్రీయంగా చూస్తే నమస్కారం  చేసేటప్పుడు  రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి  తాకుతాయి  మనం చేతి వెళ్ల కొనలకు  కళ్ళు చెవి మెదడులతో సంబంధం  ఉంటుంది.  నమస్కారం  చేసేటప్పుడు
 చేసేటప్పుడు  వేలి కొనలు పరస్పరం  ఒత్తుకోవడం  వల్ల కళ్ళు చెవి మెదడు  కేంద్రాలు ఉత్తేజమవుతాయి  దాంతో
 కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని  మెదడు ఎక్కువ -
 కాలం  గుర్తు పెట్టుకోవడం . వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం.  జరుగుతుంది ..
 అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి -
 నమస్కారం పెడితే  వాళ్ళు మనకి  ఎక్కువ కాలం గుర్తుండిపోతారని అర్థము  ..
 నమస్కారం పెట్టేటపుడు మనం   ఎదుటి వాళ్ళను ముట్టుకోనవసరంలేదు  దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు  సోకె ప్రమాదం ఉండదు.  భౌతిక సంబంధం లేకపోవడంవల్ల.  ఇద్దరి మధ్య సానుకూల శక్తుల అదాన
 ప్రదానం జరుగుతుంది. ఒకరినొకరు ముట్టుకోకపోవడం వల్ల  ఒకరి నుంచి చెడు భావనలు  మరొకరిలోకి  చొరబడే అవకాశము కూడ. ఉండదు. నమస్కారం అన్నది సత్యగునమైనది . అవకాశం ఉన్నంతవరకు  ఎదుటి వ్యక్తికి -  మంచి మనస్సు తో  చేతులు జోడించి నమస్కంరించడం   మంచిది  ....

నమస్కారం  మంచి  సంస్కారం  దీన్ని మనం   అందరం  పాటిదాం . ఎదుట వారికి   నమస్కరించటం  తో  మన  విలువ  పెరుగుతుంది . ఈ సాంప్రదాయాన్ని  మనం  పాటిస్తూ , మన  పిల్లలకు  నేర్పిద్దాం .లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ ఎందరో మహానుభావులు అందరికి వందనములు నేను కొన్ని కధలు వ్రాయటం జరిగినది ౨౦౧౨ నుండి అవి అన్ని పోస్టు చేయ దలిచాను, నా కథలపై మీ అభిప్రాయాలు తెలపండి మీరు వ్రాసినా తెలపండి  ప్రాంజలి ప్రభ అందరికొరకు జ్ఞానాన్ని పంచాలని ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం ఆశయంతో ౧౧ బ్లాగుల్లో నిక్షిప్తం గదా ఉన్నవి పోష్టు చేస్తున్నాను చదవండి -- చదవమని చెప్పండి ... తెలుగుభాషను బతికించండి నచ్ఛితే షేర్ చేసి స్నేహాన్ని పెంచుకోండి      
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి ... ఓం శాంతి .. ఓం శాంతి
 

 అత్యవసర చికిత్స

కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆత్రుతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, స్వామివారి పాదాలపై పడి విలపించసాగాడు, “నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా!” అని.

ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు.

ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు, ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్లిపోవడం వల్ల భయంతో మూర్చిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడంలేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పధ్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు.

“సామి మాత్రమే వాణ్ణి కాపాడాలి . . .”


మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. “ఆ పిల్లవాని నుదురుపై పూయండి”.

“సరే సామి”

“మీ ఇంట్లో శీకాయ పుడి ఉందా?”

“ఉంది సామి” అని తలూపాడు.

“పిల్లవాని పెదాలు వేరుచేసి, కొద్దిగా శీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మివేస్తే, పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలి తీసుకుంటే, పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్లి పిల్లవాడికి శేకాయ పొడి ఇవ్వు”


ఆ రైతు పరుగున ఇంటికి వెళ్లి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. శీకాయ పొడిని నోటిలో వెయ్యగానే, “చేదు, చేదు” అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు.


పరిస్థితి చక్కబడిన తరువాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రితు భార్యతో స్వామివారు, “ప్రతి రోజూ ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు” అని చెప్పారు.

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం





 శుక్లామ్బరధరం వర్సెస్ కాఫీ

☕☕

కాంచి  మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు.  ఒకరోజు తన శిష్యుని పిలిచి,
"సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా? "అనిఅడిగారు.

వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు.
దానికి మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను " అన్నారు.

శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు. పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న  భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది. .......
కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత,

మహా పెరియవర్  అతనితో "శుక్లాం బరధరం "చెప్పు చూద్దాం అన్నారు.....
పెరియవర్ చెప్పమన్న వెంటనే,"శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే "అని శిష్యుడు చెప్పాడు.......

శిష్యుడు   చెప్పింది విన్న మహాపెరియవర్ " దీనికి అర్థం తెలుసా? "అని అడిగారు. "తెలుసు "అని బదులు చెప్పిన శిష్యుడు, తెల్లని మనసు, యేనుగులా నల్లని రంగు, నాలుగు చేతులు,ప్రకాశమయిన ముఖం, అందరూ తలచి చూసేలా చేయు ఆకారం వున్న వినాయకుని స్మరిస్తే ఏవిధమైన ఆటంకాలు, బాధలూ వుండవని చెప్పాడు. .....
అరే !సరిగ్గా చెప్పావే,దానికి ఇంకో అర్థం వుంది, అది నీకు తెలుసా? అని చెప్పి,నవ్వారు.
శుక్లాం అంటే తెల్లనిది. అంటే పాలు. విష్ణుం అంటే నలుపు అది డికాషన్. శశి వర్ణం అంటే నలుపు తెలుపు కలిసినది. అంటే "కాఫీ". చతుర్బుజం అంటే నాలుగు చేతులు. అంటే, భార్యవి రెండు
చేతులు, కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు కలిసి నాలుగు చేతులు.
"ధ్యాయేత్ అంటే తలిచే తలపులు. అంటే అలాకాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే
"ప్రసన్న వదనం "ముఖం వికసిస్తుంది ఆసమయంలో. "సర్వ విఘ్నోప శాంతయే "అంటే అన్ని వేదనలూ పోగొట్టేది. అనగా కాఫీ  త్రాగితే వేదనలుతీరి, మనసు శాంతమవుతుందని అర్థం. ....
"శుక్లాం బరధరం అయిందా "అన్న ప్రశ్నలో , కాఫీ త్రాగటం అయ్యిందా? అన్న అర్ధం దానిలో ఇమిడి వుంది.
అని తెలుసుకున్న శిష్యులు మైమరచి నవ్వనారంభించారు.  

కంచి పెరియవర్ చిరునవ్వులు చిలకరించారు. 🙏🙏

--(())--

 యాండీ ఈ సంగత్తెలుసా మీకు ... ???

కాకినాడ కోటయ్య కాజా ఫేమ్ " కోటయ్య " గారు అసలు కాకినాడాయన కాదంట .

మా గుంటూరాయనంట .
తెనాలి తాలూకా , చిన్న పరిమి గ్రామంలో పుట్టారంట .

ఇదిగో ఇది చదవండి .
చంద్రమౌళీ దాసు గారు పంపించారు .
భలే ఇంటరెస్టింగా ఉంది ఆయన విజయ గాధ .

                       🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కాకినాడ కోటయ్య కాజ!!

కథానిక!

1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న కాలం.  ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ భరతమాత స్వేచ్చా వాయువులకోసం భారతవీరులు కరవాలాలు ఝళిపిస్తున్నారు  . ఆదే కాలంలో భారతదేశం అద్భుత ప్రతిభావంతులకు జన్మనిస్తున్న సమయం కూడా. తెలుగు వీరుల గడ్డ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చిన్నపరిమి గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబం ఓ ప్రతిభావంతుడుకి జన్మనిచ్చింది.అతడే చిట్టిపెద్ది కోటయ్య .చిన్ననాటి నుండి కోటయ్యను  తండ్రి తన కూడా పొలానికి తీసుకుపోవాలని ఆరాటపడేవాడు. పొలం పని అస్సలు ఇష్టం ఉండేది కాదు కోటయ్యకు . పదేళ్ళ వయస్సుకే  కోటయ్యలో నూతన ఆలోచనలు గజి బిజి చేయసాగాయి. అమ్మ పిండివంటలు చేస్తున్నప్పుడల్లా ఎంతో సంబర పడిపోయేవాడు.తనూ కూడా ఉండలు ఒత్తుతూనో , గరెటెలతో వండినవి పెనం నుండి దించుతుంటేనో  చెప్పలేని ఆనందం కలిగేది కోటయ్యకు.
 పొలం పనికి కోటయ్య రావటంలేదని ఆరోజు పెద్ద రాద్దాంతం చేసాడు కోటయ్య తండ్రి. పొలం పని ఇష్టంలేని కోటయ్య పదేళ్ళవయస్సులో అర్దరాత్రి ఇంటినుండి పారిపోయేడు. కన్నవారు కోటయ్య కోసం వెతకని ఊరులేదూ వెతకని చోటూ లేదు .కోటయ్య పోయి పోయి తిరుపతి చేరుకున్నాడు. ఎలా బ్రతకాలో బ్రతకడానికి ఏంచెయ్యాలో తెలియని వయస్సు కోటయ్యది. దూరంగా ఏడుకొండలు కనిపిస్తున్నాయి. అమ్మ ఏడుకొండలవాడా అంటూ పూజలు చేయడం గుర్తుకు వచ్చింది. ఇంతలో తన ముందర నుండి భక్తులగుంపు " ఏడుకొండలవాడా  వెంకటరమణా "  అంటూ కొండ ఎక్కడం చూసాడు.తను కూడా" ఏడుకొండలవాడా వెంకటరమణా " అంటూ  నడవడం మొదలెట్టాడు కోటయ్య . కొంత సేపటికి తిరుపతి కొండ ఎక్కలేక ఓ చెట్టు క్రింద కూలబడిపోయాడు. ఓ ప్రక్క ఆకలి దంచేస్తుంది . ఇంతలో ఓ భక్తుల బృందం కొండ దిగుతుంది. అందులో  ఓ ముసలావిడ అలసిపోయి ఆకలితో దిగులుగా కూర్చున్న కోటయ్య దగ్గరకు వచ్చి చేతిలో తిరుపతి లడ్డు పెట్టింది. గబా గబా సగం తినేసాడు. అబ్బ ఎంత రుచిగా వుందో అనేలోపు లడ్డూతీపిలోని మాధుర్యానికి కోటయ్య  కనులు మెల్లగా మూతలు పడ్డాయి. కనులు తెరచి చూసే సరికి చెన్నపట్టణం అంటే ఇప్పుడు చెన్నై నగరం లో మంచం మీద పడుకుని ఉన్నాడు. వంటపాత్రల చప్పుడుకు మెలకువ వచ్చి గబ గబా మంచం దిగి గది బయటకు వచ్చి చూసాడు. అక్కడ చాలా మంది పనివాళ్ళు రకరకాల మిఠాయిలు చేస్తూ ఉన్నారు. అక్కడ కుర్చీలో జేరబడి వినసకర్ర విసురుకుంటూ ఉన్న బామ్మ కనబడింది. ఆ బామ్మే తనకు చేతిలో లడ్డు పెట్టిన బామ్మ అని గుర్తు పట్టాడు కోటయ్య . బామ్మ  కోటయ్యను చూడగానే లేచి దగ్గరకు వచ్చింది. "ఏం నాయనా ఇప్పటికి కళ్ళు తెరచావా. నీకు లడ్డూ పెట్టగానే తింటూనే  నిద్రపోయావు. నువు ఎవరో ఏంటో ఎవరిబిడ్డవో తెలియదు .అందుకే అక్కడ నిన్ను వదిలేయలేక తీసుకువచ్చాను మా ఇంటికి" అంటూ కోటయ్యకు గాలి విసురుతూ చెపుతుంది. కోటయ్యకు మెల్లగా అర్దమయ్యింది. బామ్మగారి బుగ్గన ముద్దుపెట్టాడు. బామ్మగారి మనస్సు వెన్నలా కరిగిపోయింది. తన వృత్తాంతమంతా చెప్పాడు బామ్మగారికి. "పాలుగారే ఉన్నావు నిన్ను కొడతాడా మీ నాన్న  వద్దులే అక్కడకు పోవద్దు ఇదిగో మా మిఠాయి దుకాణంలో రకరకాల వంటలు నేర్చుకుంటూ ఇక్కడే ఉండిపో" అంది. కోటయ్యకు బామ్మగారి ప్రేమాభిమానాలు మిఠాయి దుకాణం ఎంతో నచ్చేసింది. కోటయ్య నెల తిరిగేలోపే అన్ని రకారకాల మిఠాయిలు వండటం నేర్చేసుకున్నాడు. పన్నెండేళ్ళు గిర్రున తిరిగాయి. ఇరవై రెండేళ్ళు వచ్చేసరికి చిట్టిపెద్ది కోటయ్యకు ఇంటి వైపు మనసు లాగింది. అమ్మా  నాన్నలను చూడాలనిపించింది. మెల్లగా బామ్మ దగ్గరకు పోయి " మా ఇంటికి వెళతాను" అని బామ్మతో చెప్పాడు. బామ్మకు దుఖః ఆగలేదు కోటయ్య పట్ల ప్రేమ పెంచుకుంది మరి. బామ్మ కన్నీళ్ళు తుడుచుకుని "వెళ్ళు కోటయ్య మీ అమ్మ నీకోసం ఎంత ఏడుస్తుందో ఎంత బెంగ పెట్టుకుందో" అంటూ  గబగబా లోపలికి వెళ్ళి డబ్బుల మూట ఇచ్చి దీవించి పంపింది.
  చెన్నపట్టణం మద్రాసుగా మారింది. మద్రాసు నగరం నుండి తెనాలి చేరి తన ఊరు చిన్నపరిమి చేరుకున్నాడు. ఇంటి ముందుకు వెళ్ళి "అమ్మా ! నాన్నా !" అని పిలిచాడు కోటయ్య. ఎన్నాళ్ళగానో  ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్న కోటయ్య తల్లిదండ్రులు గబగబా బయటకు వచ్చి నూనూగు మీసాల కోటయ్యను చూసి గుర్తుపట్టి  కౌగిలించుకుని ముద్దాడుతూ తనివితీరా ఏడ్చారు.క్షమించమని తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అమ్మా నాన్నల కాళ్ళకు నమస్కరించి లోపలికి నడిచాడు కోటయ్య.
     1888  గాంధీ ఇంగ్లాండు నగరం బారేట్ల చదవడానికి ఓడమీద వెళుతున్న సమయం.
కోటయ్యకు తల్లిదండ్రులు అనసూయతో పెండ్లి జరిపించారు. కోటయ్య తెనాలిలో మిఠాయి దుకాణం తెరిచాడు. అనతికాలంలోనే మంచి మిఠాయి దుకాణంగా పేరుతెచ్చుకుంది. అయితే ప్రతిభావంతులు ఎప్పుడూ చేతులు కట్టుకు కూర్చోరు. తన పనిలో గొప్పదనం కోసం  నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కోటయ్య మనస్సు నూతన ఆవిష్కరణకు ప్రయత్నిస్తుంది. ఒక రోజు పిండితో కుస్తీ పడుతున్న కోటయ్యను చూసి భార్య ఏం  చేస్తున్నారండి అంది. "అనసూయ మనం అమ్మే తినుబండారాలు అందరి దగ్గరా దొరికేవే నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అందుకు ఓ కొత్తరకం వంటకు ప్రయత్నిస్తున్నాను" అన్నాడు కోటయ్య "అసలు మీ ఆలోచన ఏంటో చెప్పవచ్చుకదా " " ఏం లేదు అనసూయ కొరికితే పాకం కారాలి కాని చూస్తుంటే  లోపల పాకం ఉన్నట్టు కనబడకూడదు నొక్కితే గట్టిగా ఉండాలి" అన్నాడు కోటయ్య.   "ఏంటి ఏంటి విడ్డూరంగా ఉందే "బుగ్గలు నొక్కుకుంటూ కళ్ళు పెద్దవి చేసి కోటయ్య ప్రక్కన పీట వేసుకు కూర్చుంది అనసూయ.
"ఏలా చేస్తారు మరి"  "ఏం చేస్తానంటే  ఇదిగో మైదా పిండి  కేజి తీసుకున్నాను దీనికి  ఓ వంద గ్రాములు పచ్చి సెనగపిండి కలుపుతాను."
"మైదాలో సెనగపిండా బలేగుందండి"  "అనసూయ నిన్న నువు తయారుచేసిన గుమగుమలాడే నెయ్యి తీసుకురా" అన్నాడు కోటయ్య. అనసూయ లేడిలా వంటగదిలోకి పరిగెత్తి నెయ్యి డబ్బా తెచ్చింది. కోటయ్య అందుకుంటూ  ఇందులో వందగ్రాముల నెయ్యి వేస్తాను. వేసి ఇదిగో నెయ్యితో పిండిని పాలిష్ చేసినట్టు కలుతాను అంటూ ఓ పదినిమిషాలు
నెయ్యిని మొత్తం పిండికి పట్టించాడు.
"ఆ తరువాత ఏం చేస్తారు"  ఆతృతగా అడిగింది అనసూయ. "వంటసోడా ఓ  ఇరవై గ్రాములు వేస్తాను". "నాకు తెలుసు వంటసోడా వేస్తే పొంగుతాయి కదా" అన్నది అనసూయ . "ఆ అవును అందుకే వేస్తాను .  వేపినప్పుడు కరకరలాడడానికి కాస్త డాల్డ కూడా కలుపుతాను."  "మీ బుర్రే బుర్రండీ" మెచ్చుకుంటూ సాయంచేస్తుంది కోటయ్యకు భార్య అనసూయ. "కాస్త ఇత్తడి చెంబు తీసుకుని  నీళ్ళుపొయ్యి "అన్నాడు . అనసూయ  పిండిలో నీళ్ళు పోసింది. "ఇప్పుడు పిండిని కలిపి కలిపి ముద్దలా చేస్తాను చెయడమే కాదు ఓ అరగంటసేపు ముద్దను ఎత్తి కుదేస్తాను" అంటూ పళ్ళెం కేసి బాదడం మొదలెట్టాడు కోటయ్య .  ఇలా చేస్తున్నాడే కాని అలా వండాలని కోటయ్యకూ తెలియదు ప్రయత్నిస్తూన్నాడంతే. కోటయ్యకు చేతులు నొప్పి పుట్టాయి. అనసూయ  కోటయ్య అలసిపోవడం చూసి "పైకి లేవండి బాదింది చాలుగాని చేతులు కడుక్కొని భోంచేయండి అంది." కోటయ్య అవస్దను చూస్తూ . వంటగదిలోకి వెళ్ళి భోజనం పళ్ళెం తెచ్చి పీటమీద పెట్టింది. కలిపిన పిండి ముద్దను ప్రక్కన పెట్టి  దానిపై గుడ్డను కప్పాడు కోటయ్య. కోటయ్యకు తెలియదు అలా కొంత సేపు  పిండిముద్దను ఉంచితే చక్కగా మృదువుగా అవుతుందని.
"భోజనం చేస్తున్నాడు గాని కోటయ్య "తరువాత ఏంచేయాలి ? అని అనుకుంటుంటే   ఒక్కసారిగా పొలమారింది కోటయ్యకు. అనసూయ కోటయ్యకు మంచి నీళ్ళ చెంబు అందిస్తూ "  నాకు తెలుసు మన కాకినాడ చూట్టాలే తలుచుకుంటున్నారు. మొన్న దీపావళికి వచ్చినప్పుడు నాతో చెప్పారు.  కాకినాడ లో మంచి మిఠాయి దుకాణం  ఏదీ లేదు మీరు అక్కడకు వచ్చేయవచ్చు కదా . తెనాలి బాగా చిన్నఊరు  కాకినాడ అయితే వ్యాపారం పెద్దదవుతుందని " అంటూ చుట్టాలు సలహ ఇవ్వడం గుర్తు చేసుకుంది. చేయి కడుగుకుంటూ కోటయ్య "నాకు అలాగే అనిపిస్తుంది అనసూయ మద్రాసు లో చూసాను కదా  ఎంత పెద్దనగరమైతే వ్యాపారం అంత పెద్దగా సాగుతుంది  వెళదాము గాని ముందు మనకంటూ ఓ ప్రత్యేకమైన వంటకం ఉండాలి. నేను అనుకున్న వంటకం  బాగా వస్తే రేపే ప్రయాణం " అన్నాడు కోటయ్య. "ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టండి" అంది అనసూయ సంతోషపడుతూ పిండి ముద్దను పీటపై వేసుకున్నాడు" ఏంచెయ్యాలి ఇప్పుడూ  చేసేది ఏదైనా నేతి వంటకమే ఉండాలి అలాగే చేతిలో ఇమడాలి అంటే వ్రేలంత పొడవుంటే చాలు  అనుకుని ఒక్కసారిగా వచ్చిన ఆలోచనతో  "అనసూయ  ముందు పొయ్యి వెలిగించి పెనం మీద కళాయి పెట్టి నెయ్యి మరిగించు" అన్నాడు. అదేంటండి నెయ్యంతా మరిగిస్తే రేపు వంటలకో అంది"  అనసూయ ." మాట్లాడకు మన దశ తిరగబోతుంది బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది." అంటూ కోటయ్య పిండిని సన్నని గొట్టంలా చేసి ముక్కలు ముక్కలుగా ఇనపరేకు తో కోసాడు. ఇంతలో కళాయిలో నెయ్యి వేడెక్కింది. కోటయ్య పిండి ముక్క తీసుకుని వేలితో ఓ నొక్కు నొక్కి అప్పడాలు వత్తే కర్రతో అదిమి ఆ పిండి ముక్కను మరిగే నెయ్యిలో వేసాడు అంతే బుడగలా పొంగింది. కోటయ్య అనుకున్నది వచ్ఛేసింది. భార్య అనసూయ "ఇదేంటండి గొట్టంలా వుంది అంది. " "అవును గొట్టాలే " గబగబా ఓ యాబై గొట్టాలు తయారు చేసాడు కోటయ్య. " అనసూయ బంగారు రంగులో వచ్చేక గరిటే బెట్టి గొట్టాలు పళ్ళెంలోకి తీసేయ్ " అన్నాడు  . అనసూయ కంగారుపడుతూ గొట్టాలను కళాయినుండి తీసే పళ్ళెంలో వేసింది.. "అదేంటండి అప్పుడే దించేయమన్నారు." " చెపుతాను గాని  నువ్వు  
కేజి పంచదార తీసుకుని దానికి సమానమైన నీరు పోసి పంచదార పాకం పట్టు " అన్నాడు.  అనసూయ కోటయ్య చెప్పినట్టే పంచదార పాకం పట్టింది. ఇంతలో కోటయ్య గొట్టాలు అన్నీ ఒకేసారి  మరలా నెయ్యికళాయిలో వేసి గరెటెతో తిప్పుతూ గొట్టాలను ఎగరేస్తూ ఉన్నాడు. "అనసూయ అదేంటండి అలా ఎగరేస్తున్నారు మతిగాని పోయిందా" అంది కోటయ్య చేసేది అర్దంకాక . " నాకు మతి పోలేదోయ్  ఎందుకు ఎగరేస్తున్నానంటే గొట్టాలు గలగల శబ్దం చేసేవరకూ వేపాలని"   
 "బాగానే ఉంది కాని పాకం వేడి తగ్గిపోతుంది"  అంది అనసూయ.
"తగ్గితేనే మంచిది అనసూయ గొట్టాలు వేడిగా పాకం వేడితక్కువగా ఉంటే గొట్టాలలొకి పాకం ఎక్కువ పడుతుంది" అన్నాడు కోటయ్య.
భర్త కోటయ్య అనుకున్నది సాధించినట్టే ఉన్నాడనిపించింది అనసూయకు.
"అనసూయ రాత్రి నువు పడుకున్నాక జార అని తయారు చేసాను అది బయట అరుగుమీద ఉంది పట్టుకురా" అన్నాడు. ఇదెప్పుడు చేసాడు రాత్రంతా నిద్రపోలేదన్నమాట అనుకుంటూ భర్త ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తూ ఉంది అనసూయ. గరెటెలో మైదాపిండితో చేసిన గొట్టాలు గలగలలాడుతున్నాయ్  కోటయ్య ముఖం ఆనందంతో విప్పారింది. గొట్టాలను పంచదారపాకంలో వేసి జారతో ఓ నిమిషం నొక్కి బయటకు తీసాడు చిట్టిపెద్ది కోటయ్య.
     భార్య అనసూయ ముఖం చిన్నబోయింది . గొట్టం గొట్టంలాగే వుంది  ఏంవుంది ఇందులో అనుకుంది. కోటయ్య భార్యకు ఓ గొట్టం ఇచ్చి తినమన్నాడు. భర్త శ్రమను చూసి వద్దనలేక వంటకం సరిగా రాలేదు పాపం అనుకుంటూ  గొట్టాన్ని పళ్ళమధ్య పెట్టి కొరికింది అంతే ఒక్కసారిగా నోటినిండా పాకం జలజలా కారింది. అనసూయ ఆశ్చర్యానికి అంతులేదు  .కోటయ్య అనుకున్నది సాధించాడు. బయటకు మామూలుగా గట్టిగా కనిపిస్తుంది గొట్టం కాని నిండా పాకమే. పాకం గొట్టం లోపలికి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. బలే వంటకం."ఏమండీ దీనికి ఏం పేరు పెడతారు ? "  అని అడిగింది. "అనసూయ దీనికి " కాజ "అని పేరు పెడతాను. "గొట్టం కాజా అంటారా" " లేదు ఇది కాకినాడ కాజా " అని ప్రసిద్ది చెందుతుంది అన్నాడు కోటయ్య . భర్త ఉద్దేశ్యం అర్దమయ్యింది కాకినాడలో అమ్మడం మొదలు పెడతారన్నమాట అని అనుకుంది అనసూయ.  భర్తను మురిపెంగా చూస్తూ "ఏమండి మీరు తయారు చేసిన ఈవంటకం వందేళ్ళపాటు ప్రపంచ ప్రసిద్ది చెందుతుంది "అంటూ భర్త కోటయ్య నుదిటికి పట్టిన చెమటను పైట చెంగుతో తుడిసింది అనసూయ.
1891 గాంధీ ఇంగ్లాండులో బారెట్ల పట్టాపుచ్చుకుని  మూడేళ్ళ తరువాత తిరిగి భారతదేశంలో అడుగు పెట్టాడు.  1891  కాకినాడ కోటయ్య కాజా  దుకాణం తెరవడానికి కాకినాడ మెయిన్ రోడ్డులో అడుగు పెట్టాడు  మన కోటయ్య.

--(())--

సాష్టాంగ నమస్కారం 09=11=2020
సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి..? ఆ సాష్టాంగ నమస్కారం యొక్క విధి విధానాలను తెలుసు కొందామా..*_

_**మనం నమస్కారాలను అనేక విధాలుగా చేస్తూ ఉంటాము. రెండు చేతులను జోడించి హృదయం దగ్గర ఉంచుకొని ఆ దేవుడికి చేసే నమస్కారం ఒకటి. రెండు చేతులను పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ చేసే ఆ సూర్య భగవానుడికి, గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఆ వేంకటేశ్వరునికి చేసే నమస్కారం మరొకటి. అలాగే గుడిలో దేవుని ముందు బోర్లా పడుకుని చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. ఈ సాష్టాంగ నమస్కారాన్నే మరో పేరుతో అష్టాంగ నమస్కారం అని అంటారు. సాష్టాంగ నమస్కారము, అష్టాంగ నమస్కారము అంటే అర్థం ఏమిటంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో కలిపి నమస్కారము చేయుట అని అర్ధము..*_

_**అష్టాంగాలు అంటే :-*_

_**ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...*_

_**వీటి అర్థాలను ఒకసారి పరిశీలిస్తే "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు,"కర్ణాభ్యాం" అంటే చెవులు.*_

_**ఇలా "ఎనిమిది అంగములతో కూడి కలిపి ఈ నమస్కారం చేయాలి. అందుకే ఈ నమస్కారాన్నే "అష్టాంగ, సాష్టాంగ నమస్కారం అంటారు.*_

_**అలా ఎందుకు చేయాలంటే మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..*_

_**ముఖ్యంగా మనందరమూ తెలుసు కోవలసిన విషయం ఏమిటంటే దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ద్వారానికి ధ్వజ స్తంభానికి మధ్యలో వుండి చేయాలి.*_

_*1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.*_

_*2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.*_

_*3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.*_

_*4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.*_

_*5) వచసా నమస్కారం అంటేవాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. అంటే "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*_

_*6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*_

_*7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*_

_*8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి...*_

_**అయితే స్త్రీలు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం అనేది మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, మోకాళ్ళు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.*_

_**పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.*_

_**నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేయడం వల్ల పొందుతారని శాస్త్రవచనం. కాబట్టి మిత్రులారా ! ఇప్పుడు సాష్టాంగ నమస్కారానికి అర్థం, నమస్కారం ఎలా చేయాలో తెలుసుకొన్నారు కాబట్టి ఇక ముందు నుండి ఆ విధంగా నమస్కారం చేస్తూ ఆ భగవంతుడి కృపకు పాత్రులౌతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_

_
 

నేటి కధ   09-11-2020  
బాల్య స్నేహితుడు...💕💕
 💙💚🧡

నిజామాబాద్ పెళ్లికి వచ్చాం...
ఊళ్ళో లలిత మహల్ థియేటర్లో ప్రభాస్ "బాహుబలి" సినిమా ఆడుతోంది.

మా ఆవిడ సినిమాకి వెళదామంటే..
సరే అని  వెళ్ళాం.టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..
ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక,
మా ఆవిడకి పరిచయం చేశాను. ఖిల్లా నిజామాబాద్ కాలేజ్ ఇంటర్లో క్లాస్మెట్ అని..!

హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....
ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.

"ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.
వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...
చాలా అల్లరి వెధవ....
సినిమాల పిచ్చి ఎక్కువ...
ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం,
ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం...
ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం...
సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..
ఇదే పని.
అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి  నన్ను కూడా తీసుకెళ్లేవాడు...
"ఎందుకురా" అంటే..
"ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని..
నువ్వూ వస్తే 2నేల టికెట్స్..
అంతే గదరా.."
అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!
"మా పెద్దోళ్ళు,
వాడితో తిరిగితే ఎక్కడ  చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.
చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.
"మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....
లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..
అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద ఉద్యోగమా ఏంటి....
ఇప్పటి వరకు కనీసం ఓ స్కూటర్ కూడా కొనలేదు" అంటూ దెప్పింది.

నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదా" అన్నాను.

ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..
ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే..
"వద్దు సార్" అని వెళ్లి పోయాడు.

ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ..
"నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..
మీరే సరిగ్గా పలకరించ లేదు..
పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.

"కాదులే...
వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదు కదా..
నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...
రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...
అదో తలనొప్పి మళ్లీ..!" అన్నాను సాలోచనగా.

"అతను ఏ పొజిషన్ లో ఉన్నా..
బాల్య స్నేహితుడు బాల్య స్నేహితుడే..!* అంది.

"కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నిశ్చయంగా..

సినిమా అయిపోయింది..

మా ఆవిడ పోరు పడలేక..
ఎంట్రన్స్ దగ్గర సిబ్బందిని,
వాడి గురించి వాకబు చేస్తే...
అతను పై ఫ్లోర్ లోని  ఒక రూమ్ లోకి  తీసుకెళ్లాడు.

పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...
ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....
హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు...
ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...
మేము లోపలికి వెళ్లగానే...
లేచి బయటకు వెళ్లిపోయారు.

గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా..
రారా..
అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు.
ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!

మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో  ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి,
ఈ స్టేజీకి ఎదిగాడుట.
ఇంకా హైదరాబాద్ లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చాడు.

"ఎలా వచ్చార్రా.." అని అడిగితే..
"ఆటోలో" అని చెప్పా.

డ్రైవర్ని పిలిచి,
వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.

దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ,
ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....
ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను..."
అంది చిరు కోపంగా.!!

👉మాట : "*మన కళ్ళకు కనబడేవన్నీ నిజాలు కాదు...

మనం చేసేదే గొప్ప పని కాదు...
మనం సంపాదించినదే ఎక్కు
వ కాదు...
ఎదుటివాడిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించు...
వాడు మన కన్నా గొప్పవాడే.."👈
--(())--

 

--(())--

 సత్సాంగత్యం
                 ➖➖➖✍️

ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు,    ఎర దొరకలేదు, అలసిపోయి ఒక చెట్టు     కింద పడుకున్నాడు.

గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ ఆ పేదవాడు కలత చెందుతున్నాడని అతని పై ఎండ వస్తోంది అని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది.

వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది.

కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు,
 ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది.

అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను చంపేసాడు.
హంస కింద పడి చనిపోతూ, ఇలా అన్నది...
నేను నీకు సేవ చేస్తున్నాను, నీకు నీడ ఇస్తున్నాను, నీవు నన్ను చంపావు.. ఇందులో నా తప్పు ఏమిటి.. అని.
అప్పుడు వేటగాడు ఇలా అన్నాడు...

నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు, నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి, నీ ఆచారాలు స్వచ్ఛమైనవి, నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు, కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది. ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణ కాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది.
అందుకే మన పూర్వీకులు, పెద్దలు ఎల్లప్పుడూ చెపుతుంటారు మంచి సత్సాంగత్యం లోనే వుండమని..
                
   లోకా సమస్తా సుఖినోభవన్తు!

--(())--

నీవు ఎవరవు? ఎవరి వాడివి? ఎక్కడి నుండి వచ్చావు? విచారణ - యదార్ధం
భార్యాభర్తలు అన్యోన్యంగా, అనురాగంగా ఉంటారు. అలా ఉండాల్సిందే. అయితే వారి మధ్య ఉండవలసిన బంధం యొక్క అసలు తత్త్వం తెలిసి ఉంటే వారి బంధం అందంగాను, అద్భుతంగా ఉంటుంది. అలా తెలుసుకోలేక పోతే దుఃఖమయం అవుతుంది.
కళ్ళు అందంగా కనిపించాలని కాటుక పెట్టుకున్నారు. అది సరైనది కాకపోతే అందం సంగతి ఎలా ఉన్నా కళ్లు పోయే ప్రమాదం ఉంటుంది.
అలాగే భార్యాభర్తల మధ్యగల బంధం యొక్క యదార్థస్థితిని తెలుసుకోలేకపోతే సుఖం కోసం చేసుకున్న వివాహం దుఃఖంతో అంతమవుతుంది.
భార్యాభర్తలు కలసి ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని ఇలా కలిసి ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య కొంచెం ఎడం ఉండాలి. ఒకరికొకరు పూర్తిగా అతుక్కుపోతే, ఒకరు లేకపోతే మరొకరు బ్రతుకలేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటే అది ఇద్దరిలోను ఎవరో ఒకరికి భరించలేని దుఃఖ కారణమవుతుంది. కనుక తత్త్వాన్ని విచారించాలి.
1. కాతేకాంతః :- నీ భార్య ఎవరు? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకే ప్రమేయమూ లేదు. ఆమె ఎక్కడో పుట్టింది. నీవు ఎక్కడో పుట్టావు. అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది. పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా! చివరిదాకా ఇలా కలిసే ప్రయాణిస్తారా? అదేం లేదు. ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు. ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి. అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు. వెళ్ళిపోవటం కూడా ఒక్కసారిగా జరగటం లేదు. ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను, కొంతకాలం కలసి మెలసి జీవిస్తారు అంతే.
ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. లోకాభిరామాయణంతో ప్రారంభమై -, రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.
భార్యాభర్తల సంబంధం కూడా ఇట్టిదే. అందుకే తత్త్వవిచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది.
2. కస్తే పుత్రః :- అలాగే నీకుమారుడెవరు? అని కూడా విచారించు. పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో ప్రేమాస్పదుడైన కుమారుడు. మరి అంతకుముందు? అతడు నీ భార్య గర్భంలో పిండం. అంతకు ముందో! అతడు నీలో బీజరూపం! ఆ బీజం ఎలా వచ్చింది? నీవు తిన్న ఆహారం ద్వారా నీలో తయారైంది? మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది. అంటే మట్టి యొక్క చివరి రూపమే నీ కుమారుడన్నమాట. మరి నీవెవరు? నీవూ అంతే. కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో నీవు ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే.
ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టిముద్ద మరొక చిన్న మట్టిముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, ప్రేమను పెంచుకుంటుంది. విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విలవిలలాడి పోతుంటుంది. దూరంగా ఉండి ఈ రెండు మట్టిముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం. కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టిముద్దల పాత్రలను పోషిస్తున్నాం. ఇదే భ్రమ, ఇదే మాయ, ఇదే అజ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగ చూడలేక 'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం? అందుకే ఈ సంసారం అతి విచిత్రం, తమాషా అయినట్టిది.
ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవెవరు? ఎవరి వాడవు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ విచారణ ముఖ్యమైనది.
వేదాంతంలో నేనెవరు? అని విచారణ చేయటమే మానవజీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం. సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతం ఈ నేనెవరు? అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం.
నేనెవరు? నేను ఈ శరీరమా? కాదు. ఇదొక గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా? కాదు. అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే. అవీ జడమే. వాటిని నేను ఉపయోగించుకుంటున్నాను. మరైతే నేనెవరు? దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను. అయితే జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను? ఎక్కణ్ణించి వచ్చాను? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను. నేనువచ్చింది అక్కణ్ణించే. మరి ఎక్కడకు వెళ్ళాలి? ఆ పరమాత్మ వద్దకే. పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. అప్పుడే పరమశాంతి, శాశ్వతానందం. 

--(())--

 sekarana   

మట్టి మనిషి - దేవసేన పెద్దినేని
వర్షం వచ్చేటట్లుంది . మబ్బు నల్ల బడింది. పగలు గుమ్మం దాటకుండానే రాత్రి చొరబడింది .చినుకులు మొదలయ్యాయి . మంచి మట్టి వాసన . చాలా బాగుంది .వర్షం కూడా బాల్యం లాంటిదే .ఎదిగితే బావుండదు . ఆ వాసనని ఆస్వాదిస్తూ అక్కడే కూర్చుండి పోయాను .
అదేమిటో మట్టి వాసన వచ్చినప్పుడల్లా , బాల్యం కూడా తన వాసనలతో వచ్చి నా ముందు వాలిపోతుంది . చేతులు చాపి చినుకుల మథ్య గుండ్రంగా తిరిగిన ఙ్ఞాపకం . పందిరి పైన పడే గమ్మత్తైన చినుకుల శబ్దం ఙ్ఞాపకం
నాకు కనపడని ఇంద్రథనస్సుని తమ్ముడికి
చూపిన ఙ్ఞాపకం .ఇన్ని ఙ్ఞాపకాల నడుమ మా బసవడి ఙ్ఞాపకం .
ఇక్కడ బసవడి గురించి చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు .బసవడి లాంటి మనుష్యుల గురించి చెప్పాలని నా ఉద్దేశ్యం.
బసవడంటే ఒకరకంగా నాన్నకి ఆత్మ బంథువే .నాన్న వృత్తి పరంగా ప్రభుత్వోద్యోగే అయినా రైతుగానే మా ఊర్లో గుర్తింపు .అలా ఉండటమే ఆయనకిష్టం .పొలం వెళ్ళేటప్పుడు ఆయన వేషథారణ రైతులాగే ఉండేది.పొలం చూసుకోవడానికి బసవడుండే వాడు . నాకు ఊహ తెలిసినప్పటి నుండీ ఉన్నాడు .నాన్నదీ , బసవడిదీ ఇంచుమించు ఒకేవయస్సు .
మంచి చేవదేలిన నల్లమాను కొయ్యతో చెక్కిన నిలువెత్తు బొమ్మలా ఉండే వాడు .మోకాళ్ళవరకు ముదురు నీలం రంగు నిక్కరు , చెమటకు తడిసి వంటికి అతుక్కు పోయిన పాత బనియన్ తో బలంగా ఉండేవాడు .
సాయంకాలమైతే ఇంటికి వచ్చేవాడు పొలం సంగతులన్నీ చెప్పటానికి.
నాన్న , బసవడు ఆరుబయట కూర్చుని మాట్లాడుకోవడం ఇప్పటికీ నా కళ్ళముందు దృశ్యమై మెదుల్తుంది . నాన్న వాలుకుర్చీ లో కూర్చుని , బసవడు నేలమీద దొంతుక కూర్చుని రెండు చేతులను నిటారుగా మోకాళ్ళకు ఆన్చి కూర్చునేవాడు .అలా కూర్చున్నప్పుడు అతను చాలా ఠీవిగా ఉండేవాడు .జుట్టు రాగి రంగు లో ఉండేది .నేను నాన్న ఒళ్ళో కూర్చుని అతన్ని గమనిస్తూ ఉండేదాన్ని . అతని కాలి వేళ్ళు రెండు జట్లుగా విడిపోయి ఉండేవి .బొటన వేలు ఒక్కటే ఒక జట్టు , మిగతా నాలుగూ ఒక జట్టు అన్నట్టు ఉండేవి .రెండింటి మథ్యా ఖాళీ ఉండేది .
ఒక్కొక్కసారి బసవడు వచ్చేటప్పుడు
పై కండువలో తంపటేసిన వేరుశనగ కాయలు తెచ్చి నాన్నకి ఒలిచి పెడుతూ ఊరి సంగతులకి ,కట్టుకథలు జోడించి చెప్పి నవ్విస్తుంటే వాళ్ళిద్దరూ నాకు ఎదిగిన పసి వాళ్ళై కనిపించేవాళ్ళు .బసవడు నవ్వుతూ ఉంటే నల్లమబ్బు నవ్వు తున్నట్టుండేది . అప్పుడు అతని దగ్గర మట్టి వాసన వచ్చేది .
నాన్న ఒడి లో ఉన్నప్పుడు నేనామాట అడిగితే మా అమ్మ పొలం లో పన్జేస్తున్నప్పుడు పుట్టానంట అందుకే నాతో పాటూ మట్టివాసన పుట్టింది అనేవాడు .
అతను భార్యా బిడ్డల దగ్గర కంటే పొలం లోనే ఎక్కువ గడిపేవాడు .చెట్టు చెట్టు తో మాట్లాడేవాడు .నాన్న అంటుండే వాడు "పొలం దేహమైతే బసవడు దానికి ఆత్మ లాంటి వాడు "అని .పండగొచ్చిందంటే చాలు ,మాతోపాటూ కొత్త బట్టలు వేసుకుని నాన్నకి చూపిస్తూ తెగ సంబరపడి పోయే వాడు .అప్పుడప్పుడూ నాన్నతో పరాచికాలాడేవాడు .
ప్రతి భోగి పండుగ కి సరుగుడు చెత్త , తాటాకులు తెచ్చి భోగి మంటేసేవాడు . అప్పుడు బసవడి ముఖం లో చెప్పలేనంత ఆనందం .ఆ ఆనందం లో ,భోగి వెలుగులో వేకువజామునే వచ్చేసిన సూర్యుడులా ఉండే వాడు .
మా ఊర్లో ఎవరింట్లో వేడుక జరిగినా మా బసవడికే హైరానా ఎక్కువ. ఎవరికి తేలు కుట్టినా తేలు మంత్రం బసవడిదే .ఆ మంత్రం వేస్తున్నప్పుడు బసవడినే చూస్తుండి పోయేదాన్ని .కళ్ళు మూసుకుని ఏదో తనలో తను చిన్నగా ఏదో మాట్లాడుతండేవాడు .అప్పుడతను యోగిలా ఉండేవాడు .
కాలం వాళ్ళిద్దరికీ ముసలితనపు ముసుగు వేసింది .బసవడి రాగి రంగు జుట్టు అలానే ఉంది నాన్న జుట్టు ముగ్గు బుట్టైంది .నాన్న ఎప్పటిలానే వాలుకుర్చీ లో బసవడు మాత్రం చిన్నగట్టు మీద కూర్చునే వాడు .ఎప్పటిలానే పొలం కబుర్లు ,ఊరు కబుర్లు , పరాచికాలు .
"ఇది వరకటిలా ఎప్పుడూ పొలం లోనే ఉండొద్దు "అనేవాడు నాన్న .ఆ మాటకు బసవడు పొలంలా అనిపించదు అమ్మ లా అనిపిస్తుంది అనేవాడు .ఇప్పుడు ఇదివరకటిలా ఇంటికి రాలేకపోతున్నాడు . నాన్న పొలం వెళ్ళలేకపోతున్నాడు .
ఒకరోజు నేను తీసుకెళ్ళాను . బసవడు కనపడ లేదు . ఏచెట్టు మొదట్లోనో ఉండి ఉంటాడు అంటూ వస్తున్నాడు నాన్న నా వెనుకగా .నా కాలికి ఏదో తగిలినట్లై ముందుకు తూలి పడబోయి నిలదొక్కుకుని ముందుకు చూశాను . ఒక్కసారిగా గుండె పగిలినట్లైంది .బసవడు బోర్లాపడి పోయున్నాడు నిర్జీవంగా .మాట రాలేదు .మట్టి వాసన మట్టిలో కలిసినట్లనిపించింది . నా భుజం మీద నాన్న చెయ్యి పడింది , నిలబడటానికి ఆసరాకోసం .కాసేపు ఆగి వెనక్కి తిరిగి చూశాను .నాన్న చూపు బసవడి మీది నుండి పొలం వైపుకు మళ్ళించి ఇక మిగిలింది దేహం మాత్రమే అంటున్నాడు .
బంథాల్లోనే పుట్టి , బంథాల్లోనే పెరిగి చివరికి వాటిని కాలరాస్తున్న ఈ రోజుల్లో , మట్టిలోనే పుట్టి , మట్టితోనే మెలిగి , మట్టిలోనే కలిసిన బసవడి లాంటి వాళ్ళు
అప్పుడప్పుడు మనఙ్ఞాపకాల నెమరువేతల్లో కూడా మట్టివాసనతోనే ఉంటారు .
బసవడి లాంటి వాళ్ళ ఙ్ఞాపకం ఎప్పటికీ కనుకొలకుల్లో మిగిలిపోయే అశ్రు బిందువు లాంటిది .ఒక్కసారిగా మొహం మీదికి వేగంగా వీచిన చల్లగాలి నన్ను ఈ లోకం లోకి తీసుకొచ్చింది . ఆకాశంలోకి చూశాను . ఇదాకటి నల్లమబ్బు లేదు .ఎక్కడికో కదిలి వెళ్ళింది .

--(())--








🌹🙏 ( పతంజలి మహర్షి )🙏🌹
👉యోగ సూత్రములు 195 మొత్తం
.
పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సమాధి పాదము) సాధన పాదము

జ్ఞానము. :
1. అథ యోగానుశాసనము.. . .
(అథ యోగ అను శాసనమ్) - యోగసాధన విధానము తెలుసుకొనుటకు ఇది సమయము (సాధకునిజీవితంలో తగిన సమయము)
2. యోగశ్చిత్త వృత్తి నిరోధః
(యోగః చిత్తవృత్తి నిరోధః) - యోగము అంటే చిత్తవృత్తులను నిరోధించడం.
నిరోధము అంటే యోగసాధనకి అంతరాయమైన చిత్తవృత్తులను గుర్తించి, వాటిప్రభావములకు లోను కాకుండా యోగసాధన కొనసాగించడం.
3.తదా ద్రష్టుస్స్వరూపేఽవస్థానమ్
(తదా ద్రష్టుః స్వరూపే అవస్థానమ్) - ఆ విధంగా చిత్తవృత్తులను అధిగమించగలిగినవాడు యోగస్థితిలో తనను తాను దర్శించగలడు.
4. వృత్తి సారూప్యమిత
(వృత్తి సారూప్యమ్ ఇతరత్ర) - ఇతరులు ఆ చిత్తవృత్తులే తాము అనుకుంటూ వాటిప్రభావాలకి లోనై, ప్రవర్తిస్తారు.
5. వృత్తయః పంచతయ్యః క్లిష్టాఽక్లిష్టాః
(వృత్తయః పంచతయ్యః క్లిష్టాః అక్లిష్టాః) - ఈ చిత్తవృత్తులు ఐదు విధములు. తేలికగా అధిగమించగలిగినవి కొన్ని. శ్రమతో కూడినవి కొన్ని.
6. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః
అవి - సత్యము, సత్యము అనిపించే అసత్యము, భ్రాంతి (ఊహాజనితము), నిద్ర, స్మృతి
7. ప్రత్యాక్షానుమానాఽగమాః ప్రమాణాని
(ప్రత్యక్ష అనుమాన ఆగమాః ప్రమాణాని) - ప్రమాణములు ప్రత్యక్షముగా చూచినవి (తెలుసుకొన్నవి), తర్కముద్వారా తెలుసుకొన్నవి, పరంపరానుగతముగా శాస్త్రములలో సత్యముగా అంగీకరించబడినవి.
8. విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూపప్రతిష్ఠమ్.
(విపర్యయః మిథ్యా జ్ఞానమ్ అతత్ రూప ప్రతిష్టమ్) - అసత్యమును సత్యమని భ్రమ పడడం విపర్యయము.
9. శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యః వికల్పః
(శబ్ద జ్ఞాన అనుపాతీ వస్తుశూన్యః వికల్పః) - వస్తువు శబ్దము ఆలంబనగా రూపాన్ని సంతరించుకుంటున్నది. వస్తువు లేకపోతే పదానికి అర్థం లేదు. వస్తువు శూన్యమయినప్పుడు (లేనప్పుడు) శబ్దమునే వస్తువు అనుకోడం వికల్పం.
10. అభావప్రత్యయాఽలంబనా వృత్తిర్నిద్రా.
(అభావ ప్రత్యయ ఆలంబనా వృత్తిః నిద్రా) - పరిసరములను గమనించకుండా తామసప్రవృత్తిలో ఉండడం (జడభరతునివలె) నిద్ర.
11. అనుభూతవిషయాఽసంప్రమోషః స్మృతిః
(అనుభూత విషయాః అసమ్ప్రమోషః స్మృతిః) - అనుభూతమయిన విషయములు మనసుపై వేసిన ముద్రలే స్మృతులు లేక వాసనలు.
12. అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః
(అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధః) - ఈ వృత్తులను నివృత్తి చేయడం (అదుపులో ఉంచడం) అభ్యాసమువలన వైరాగ్యమువలన సాధ్యం.
13. తత్ర స్థితౌ యత్నాభ్యాసః
(తత్ర స్థితౌ యత్నః అభ్యాసః) - ఆ స్థితి ప్రయత్నమువలన సాధ్యం.
14. స తు దీర్ఘకాలనైరంతర్య సత్కారాఽసేవితో దృఢభూమిః
(స తు దీర్ఘకాల నైరంతర్య సత్కారః ఆసేవితః దృఢభూమిః) - ఆ సాధన దీర్ఘ కాలము అంతరాయాలు లేకుండానూ భక్తిప్రమత్తులతోనూ కొనసాగించినప్పుడు మాత్రమే సుస్థిరంగా సాగుతుంది.
15. దృష్టాఽనుశ్రవిక విషయవితృష్ణస్య వశీకారసంజ్ఞా వైరాగ్యం
(దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యమ్) - తాను చూస్తున్నవి, పరంపరానుగతంగా వింటున్నవి అయిన విషయాలలో ఇచ్ఛ లేకపోవడమే వైరాగ్యం (వైరాగ్యానికి చిహ్నం).
16. తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యమ్.
(తత్ పరం పురుష¬ ఖ్యాతే గుణ వైతృష్ణ్యమ్) - త్రిగుణాలలో (సత్వ, తమస్సు, రజస్సు) విముఖుడయిన సాధకునికి పరమ పురుషునిగూర్చి కలిగిన జ్ఞానమే పరమోత్తమ జ్ఞానము.
17. వితర్క విచారాఽనందాస్మితాస్వరూపానుగమాత్ సంప్రజ్ఞాతః
(వితర్క విచార ఆనంద అస్మితా స్వరూప అనుగమాత్ సంప్రజ్ఞాతః) - తర్కం, నిశిత పరిశీలన, బ్రహ్మానందము, అహమిక (అస్మిత) – ఈ నాలుగు పద్ధతులు ప్రజ్ఞతో కూడిన సమాధికి మార్గములు. ఈ పద్ధతిలో సాధించిన స్థితి సబీజసమాధి. ఈ స్థితిలో "నేను సమాధిస్థితిని పొందేను" అన్న ఎఱుక ఉంది.
18. విరామప్రత్యయాభ్యాసపూర్వస్సంస్కారశేషోఽన్యః
(విరామ ప్రత్యయ అభ్యాసపూర్వః సంస్కారశేషః అన్యః) - ఎఱుకతో ప్రయత్నం చేస్తూ ఇతర సంస్కారాలను (చిత్తవృత్తులను) వెనుకకి మళ్ళించి సాధన చేయడం మరొక పద్ధతి.
19. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానామ్
(భవ ప్రత్యయః వి దేహ ప్రకృతి లయానామ్) - ప్రకృతిలో లయమయినవారికి, విదేహులకు (స్థూలశరీరము నశించినతరవాత మిగిలిన సంస్కారశేషము) మరు జన్మలో సమాధిస్థితి లభిస్తుంది. (ఈ సమాధిస్థితి వెనకటిజన్మలో సమాధి కంటే పైస్థాయి అయినా, సంపూర్ణ సమాధి కాదు.)
20. శ్రద్ధావీర్యస్మృతిసమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషామ్
(శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞా పూర్వకః ఇతరేషామ్) - తదితరులు శ్రద్ధ, తేజస్సు, తపోబలం, స్మృతులు, జ్ఞానముద్వారా క్రమంగా సమాధి స్థితి సాధించగలుగుతారు.
21. తీవ్రసంవేగామాసన్నః
(తీవ్ర సంవేగానాం ఆసన్నః) - తదేకదృష్టితో నిష్ఠతో సాధన చేసేవారికి సంప్రజ్ఞత త్వరితగతిని సిద్ధిస్తుంది.
22. మృదు మధ్యాధిమాత్రత్వాత్ తతోఽపి విశేషః
(మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతః అపి విశేషః) - ఆ సాధన మూడు స్థాయిలలో సాగవచ్చు – అచంచల దీక్షతో, మధ్యమస్థాయిలో, లేదా అతి సాధారణస్థాయిలో.
23. ఈశ్వర ప్రణిధానాద్వా
(ఈశ్వర ప్రణిధానాత్ వా) - ఈశ్వరునియందు తదేకనిష్ఠ నిలిపి ధ్యానించడం ద్వారా కూడా చేయవచ్చు.
24. క్లేశకర్మవిపాకాఽశాయైరపరామృష్ట పురుషవిశేష ఈశ్వరః
(క్లేశ కర్మవిపాక ఆశాయై అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః) - దుఃఖము, కర్మఫలములు, పూర్వజన్మలో సంతరించుకున్న స్మృతులతాలూకు ఛాయలు – వీటి అన్నిటికీ అతీతుడయిన పరమపురుషుడే ఈశ్వరుడు.
25. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం
(తత్ర నిర్ అతిశయం సర్వజ్ఞ బీజమ్) - ఆ పరమపురుషునిలో సంపూర్ణ జ్ఞానబీజము ప్రతిష్ఠమై ఉన్నది.
26. పూర్వేషమపి గురుః కాలేనానవచ్ఛేదాత్
(పూర్వేషాం అపి గురుః కాలేన అనవచ్ఛేదాత్) - ఆ పరమపురుషునికి ఏ ఒక్క కాలానికి చెందనివాడు. అంటే పరంపరానుగతంగా వస్తున్న గురువులందరికీ కూడా ఆయనే గురువు.
27. తస్య వాచకః ప్రణవః
- ఓంకారము ఈశ్వరునికి సంజ్ఞాపూర్వకమైన శబ్దము.
28. తజ్జపస్తదర్థభావనమ్.
(తత్ జపః తత్ అర్థ భావనమ్) ఈశ్వరభావమునందు దృష్టి నిలిపి ఆ ఓంకారమును సదా జపించాలి.
29. తతః ప్రత్యక్చేతనాధిగమోఽప్యంతరాయాభావశ్చ
(తతః ప్రత్యక్ చేతన అధిగమః అపి అంతరాయ అభావః చ) - ఆ జపముద్వారా సాధకునిచేతన అంతర్ముఖమయి ఆటంకాలను అధిగమించగలదు.
30. వ్యాధి స్త్యాన సంశయ ప్రమాదాలస్య అవిరతి భ్రాంతిదర్శనాలబ్ధభూమికత్వ అనవస్థిత్వాని చిత్తవిక్షేపాస్తే అంతరాయాః
(వ్యాధి స్త్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతిదర్శన అలబ్ధభూమికత్వ అనవస్థిత్వాని చిత్తవిక్షేపాః తే అంతరాయాః) - వ్యాధి, తామసం (కాలయాపన), సంశయం, నిర్లక్ష్యం లేక అలసత్వం, భోగలాలసత, అవాస్తవాన్ని వాస్తవంగా భ్రమించడం, యోగసాధన ఏకోన్ముఖంగా కొనసాగించలేకపోవడం, స్థిరత్వం లోపించడం – ఇవన్నీ యోగసాధనకి ఆటంకాలు.
31. దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వశ్వాసప్రశ్వాసా విక్షేప సహభువః
( దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాసాః విక్షేపసహ భువః) - దుఃఖము, నిస్పృహ (నిరాశ), శరీరంలో వణుకు, క్రమబద్ధం కాని ఉచ్ఛ్వాసనిశ్వాసాలు – ఇవి మనసుని నిలకడ లేకుండా చేస్తాయి.
32. తత్ప్రతిషేధార్థం ఏకతత్త్వాభ్యాసః
(తత్ ప్రతిషేధ అర్థం ఏక తత్త్వ అభ్యాసః) వీటిని అధిగమించి ధ్యానం కొనసాగించడానికి సాధకుడు ఒక పద్ధతిని ఎంచుకుని ఆ పద్ధతిలో దృఢచిత్తంతో సాధన కొనసాగించాలి.
33. మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనాతః చిత్తప్రసాదనమ్.
(మైత్రీ కరుణా ముదిత ఉపేక్షాణాం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణాం భావనాతః చిత్త ప్రసాదనమ్) - సుఖదుఃఖాలు, పాపపుణ్యాలవిషయంలో ఉదాసీనతతోనూ, స్నేహం, కరుణ, ప్రసన్నతవంటి సుగుణాలతోనూ ఉంటే చిత్తము ప్రశాంతమయి యోగసాధన సాగుతుంది.
34. ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య
- ఉచ్ఛ్వాసనిశ్వాసాలను నియంత్రించి కూడా చిత్తమును అదుపులో ఉంచుకొనవచ్చు.
35. విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా మనసః స్థితినిబంధినీ
(విషయవతీ వా ప్రవృత్తిః ఉత్పన్నా మనసః స్థితినిబంధినీ) - ఇంద్రియాలద్వారా పొందే అనుభవాలలో ఒకదానిపై చిత్తము స్థిరంగా నిలపడంద్వారా కూడా అన్య విషయాలనుండి దృష్టి మరలి చిత్తము స్థిరము కాగలదు.
36. విశోకా వా జ్యోతిష్మతీ
- దుఃఖానికి అతీతమైన అంతర్జ్యోతిమీద దృష్టి నిలపడానికి ప్రయత్నించడం మరో పద్ధతి.
37. వీతరాగ విషయం వా చిత్తమ్
- మమతానురాగములను వదులుకోడంద్వారా కూడా స్థిరచిత్తము కలుగుతుంది.
38. స్వప్న నిద్రా జ్ఞానాఽలంబనం వా
(స్వప్న నిద్రా జ్ఞాన ఆలంబనమ్ వా) - స్వప్నములు లేని గాఢనిద్రద్వారా లేదా నిద్రలో వచ్చిన కలలను విశ్లేషించుకోవడంద్వారా కూడా చిత్తశాంతిని పొందవచ్చు.
39. యథాఽభిమత ధ్యానాద్వా
(యథా అభిమత ధ్యానాత్ వా) - ఎవరికి వారు తమకి అనుకూలమైన పద్ధతిలో చిత్తమును దృఢపరుచుకొనవచ్చు.
40. పరమాణు పరమ మహత్వాంతఽస్య వశీకారః
(పరమ అణు పరమ మహత్వ అంతః అస్య వశీకారః) - ఆ అభ్యాసమువలన సాధకునికి అణువునించి బ్రహ్మాండంవరకూ సమస్తమూ స్వాధీనము కాగలదు. అంటే చిత్తవృత్తుల ప్రభావమునుండి తప్పుకుని, సాధన కొనసాగించగలడు.
41. క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేః గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్థ్స తదఞ్జనతా సమాపత్తిః
(క్షీణ వృత్తేః అభిజాతస్య ఇవ మణేః గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్థ్స తత్ అఞ్జనతా సమాపత్తిః) - అవాంతరములయిన చిత్తవృత్తులు పరిహరించినతరువాత – గ్రహించినవాడు, గ్రహణశక్తి, ఆ గ్రహణానికి కేంద్రమైన వస్తువు – ఈ మూడు అంశాలను సమస్థితిలో దర్శించగలుగుతాడు. స్వచ్ఛమైన మణిపూస ఏ వస్తువుమీద ఉంచితే ఆ వస్తువు రంగును ప్రతిఫలించినట్టు సాధకుడి చిత్తము పరమాత్మస్వరూపాన్ని గ్రహించడానికి సిద్ధముగా ఉంటుంది.
42. తత్ర శబ్దార్థ జ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః
(తత్ర శబ్ద అర్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః) - సమాపత్తి అంటే శబ్దము, అర్థము, వస్తువు – ఈ మూడింటిని గూర్చి తర్కించుకొను సమయంలో గల మానసిక స్థితి.
43. స్మృతిపరిశుద్ధౌ స్వరూపశూన్యేవ అర్థమాత్రనిర్భాసా నిర్వితర్కా
(స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యా ఇవ అర్థమాత్ర నిర్భాసా నిర్వితర్కా) - సాధనద్వారా చిత్తము పరిశుద్ధమైన అనంతరం వస్తురూపం, అర్థం, శబ్దాలకు సంబంధించిన తర్కం కూడా ముగుస్తుంది.
44. ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా
(ఏతయా ఏవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా) ఇంతవరకూ పై సూత్రాలద్వారా సవిచార సమాధి, నిర్విచార సమాధి, తద్వారా సూక్ష్మవిషయానికి సంబంధించిన జ్ఞాన సముపార్జన వివరించడం జరిగింది.
45. సూక్ష్మవిషయత్వం చ అలింగపర్యవసానం.
ఆ సూక్ష్మవిషయంగురించిన అవగాహనద్వారా ఆ సూక్ష్మవిషయానికి మించిన రూపము లేని ఉత్కృష్ట పరమపురుషుడు ధ్యేయము కాగలడు.
46. తా ఏవ సబీజః సమాధిః
- ఇది బీజముతో కూడిన సమాధి. ఈ సాధనలో సాధకుడు సూక్ష్మవిషయాలను అధిగమించినా సాధకుడి చిత్తములో ఒక రూపము (బీజము) ఆలంబనముగా ఉంటుంది.
47. నిర్విచార వైశారద్యే అధ్యాత్మప్రసాదః
- ఈ నిర్విచారస్థితి పొందిన అనంతరం సాధకుడికి అధ్యాత్మికజ్ఞానం కలుగుతుంది.
48. ఋతంభరా తత్ర ప్రజ్ఞా
- సాధకుని చిత్తము పరమోత్కృష్టమైన ఋతము (సత్)తో నిండిపోతుంది.
49. శ్రుతానుమానప్రజ్ఞాభ్యాం అన్యవిషయా విశేషార్థత్వాత్
(శ్రుత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయా విశేషార్థత్వాత్) - పై సాధనలవలన పొందిన బ్రహ్మానందము - అనుశ్రుతంగా అభ్యసించినది, తర్కంద్వారా గ్రహించినది, తనకు తానుగా అవగాహన చేసుకొన్నది – స్థిరమైనదీ, సమతౌల్యము సాధించినదీ అవుతుంది.
50. తజ్జ సంస్కారోఽన్యసంస్కార ప్రతిబంధీ
(తత్ జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధీ) - ఆ తరవాత పొందిన ఆత్మజ్ఞానము సాధకునికి గల పూర్వ ప్రవృత్తులను, స్మృతులను నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు కూడా సాధకునికి తానొక జ్ఞానమును పొందేను అన్న స్పృహ అంతర్గతంగా ఉంటుంది.
51. తస్యాపి నిరోధే సర్వన్నిరోధాన్నిర్బీజస్సమాధిః
(తస్య అపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః) ఆ జ్ఞానమును నిరోధించినతరవాత పొందిన స్థితి నిర్బీజసమాధి.
పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సమాధి పాదము) సాధన పాదము →
జ్ఞానము. :
మూస:పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము.
 .
← సమాధి పాదము పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సాధన పాదము) విభూతి పాదము →
ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు. :
1. తపస్స్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః
(తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః) - యోగసాధన మూడు భాగాలు. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనస్సును లగ్నము చేయడం.
2. సమాధిభావనార్థః క్లేశతనుకరణార్థశ్చ
(సమాధి భావన అర్థః క్లేశ తను కరణ అర్థః చ) - ఈ క్రియాయోగం ఆచరించడం క్లేశములను నశింపజేసి సమాధిస్థితి పొందడానికి.
3. అవిద్యాఽస్మితారాగద్వేషాభినివేశాః పంచక్లేశాః
(అవిద్యా అస్మితా రాగ ద్వేష అభినివేశాః పంచ క్లేశాః) - క్లేశములు ఐదు. అవి అజ్ఞానం, అస్మిత (అహమిక), రాగము, ద్వేషము, అభినివేశము (జీవితేచ్ఛ, మరణభయం).
4. అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణామ్
(అవిద్యా క్షేత్రమ్ ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణామ్) - అవిద్య మిగతా నాలుగు క్లేశములకు హేతువు. క్లేశములు అంతర్లీనమయి ఉంటాయి. లేదా క్షీణిస్తూనో వృద్ధి పొందుతూనో ఉంటాయి.
5. అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచీ సుఖాఽత్మ ఖ్యాతిరవిద్యా
(అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచీ సుఖ ఆత్మ ఖ్యాతిః అవిద్యా) - అనిత్యమైనదానిని నిత్యము అనీ, అశుద్ధమైనదానిని పరిశుద్ధమైనది అనీ, దుఃఖమును సుఖమనీ భ్రమించడమే అవిద్య.
6. దృగ్దర్శనశక్త్యోరేకాత్మతేవాస్మితా
(దృక్ దర్శన శక్త్యోః ఏక ఆత్మతా ఇవ అస్మితా) - దృక్కుని (సాధారణ బుద్ధిని) దర్శనశక్తిగా గుర్తించడం అస్మిత.
7. సుఖానుశయీ రాగః
(సుఖ అనుశయీ రాగః) - మమత్వము సుఖమును కలిగిస్తుంది.
8. దుఃఖానుశయీ ద్వేషః
(దుఃఖ అనుశయీ ద్వేషః) - ద్వేషము దుఃఖమును కలిగిస్తుంది.
9. స్వరసవాహీ విదుషోఽపి తథాఽఽరూఢోఽభినివేశః
(స్వరసవాహీ విదుషః అపి తథా ఆరూఢః అభినివేశః) - పండితులలో సైతం జీవితేచ్ఛ, మరణభయం అజ్ఞానమువల్లనే అభివృద్ధి చెందుతాయి.
10. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః
(తే ప్రతి ప్రసవ హేయాః సూక్ష్మాః) - ఈ విషయముల (రాగద్వేషాలు, అహం, అభినివేశం) మూలములను గుర్తించి, వాటిని ప్రతిఘటించి నివర్తింపచేయాలి.
11. ధ్యానహేయాస్తద్వృత్తయః
(ధ్యాన హేయాః తత్ వృత్తయః) - క్లేశములను ధ్యానముతో నివర్తింపచేయాలి.
12. క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయాః
(క్లేశ మూలః కర్మ ఆశయః దృష్ట అదృష్ట జన్మ వేదనీయాః) - క్లేశములు (రాగద్వేషాలు, అభినివేశము) ప్రస్తుత జన్మలోనూ భావి జన్మలలోనూ కర్మలవలన కలుగుతాయి. కర్మలకు మూలము అస్మిత. క్లేశములవలన కర్మలూ, కర్మలవలన క్లేశములు పునరావృతము అవుతూ మళ్ళీ మళ్లీ జన్మించడానికి కారణం అవుతాయి.
13. సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః
(సతి మూలే తత్ విపాకః జాతి ఆయుః భోగాః) - ఒక జన్మలో జీవి చేసిన కర్మలయొక్క ఫలములను అనుసరించి మరుజన్మలో జాతి, ఆయుష్షు, ఇతర భోగములు కలుగుతాయి.
14. తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్య హేతుత్వాత్
(తే హ్లాద పరితాప ఫలాః పుణ్య అపుణ్య హేతుత్వాత్) - ఒక జన్మలో చేసిన పుణ్యపాపాలను అనుసరించి మరుజన్మలో సుఖదుఃఖాలు అనుభవము అవుతాయి.
15. పరిణామతాపసంస్కారదుఃఖైర్గుణవృత్తివిరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః
(పరిణామ తాప సంస్కార దుఃఖైః గుణ వృత్తి విరోధాత్ చ దుఃఖమ్ ఏవ సర్వమ్ వివేకినః) - అనవరతమూ మారే పరిస్థితులు, భౌతిక సుఖాలు, సాత్త్విక తామస రాజస గుణాలు – వీటివలన కలిగే పరస్పర విరుద్ధ అనుభవాలూ - అన్నిటినీ వివేకవంతుడు దుఃఖభాజనముగా పరిగణిస్తాడు.
16. హేయమ్ దుఃఖమనాగతమ్ .
(హేయమ్ దుఃఖమ్ అనాగతమ్) - భావి జన్మలలో కలగనున్న దుఃఖములను ప్రస్తుత జన్మలో ఉపసంహరించుకోవాలి.
17. ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయహేతుః
(ద్రష్టృ దృశ్యయోః సంయోగః హేయ హేతుః) - ద్రష్ట (చూచేవాడు) తనకీ దృశ్యమునకూ (దృశ్యమాన ప్రపంచం) మధ్య విభేదము లేదన్న భావన ఉపసంహరించవలసి ఉంది.
18. ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్.
(ప్రకాశ క్రియా స్థితిశీలం భూత ఇంద్రియాత్మకం భోగ అపవర్గార్థం దృశ్యమ్) - దృశ్యముయొక్క గుణములు కాంతి, ఆచరణ (క్రియాశీలత), స్థిరత్వము. సాధకుడు ఇంద్రియములద్వారా కలిగిన అనుభవాలను గుర్తించి, వాటినుండి తన దృష్టిని యోగసాధనవైపు మళ్ళించడమే దృశ్యముయొక్క ప్రయోజనము.
19. విశేషావిశేష లింగమాత్రాలింగాని గుణపర్వాణి
(విశేష అవిశేష లింగమాత్ర అలింగాని గుణ పర్వాణి) - ఈ గుణాలు నాలుగు విధాలుగా చెప్పుకోవచ్చు – ప్రత్యేకత కలిగినవి, సాధారణమైనవి, సూచనప్రాయమైనవి, సూచనప్రాయంగానైనా ఏమీ చెప్పనివి.
20. ద్రష్టా దృశిమాత్రః శుద్ధోఽపి ప్రత్యయానుపశ్యః
(ద్రష్టా దృశి మాత్రః శుద్ధః అపి ప్రత్యయ అనుపశ్యః) ద్రష్ట (ఆత్మ) స్వతస్సిద్ధంగా పరిశుద్ధము అయినా దృశ్యమును ఇంద్రియాలద్వారా చూడడం జరుగుతుంది.
21. తదర్థ ఏవ దృశ్యస్యాత్మా
(తత్ అర్థః ఏవ దృశ్యస్య ఆత్మా) - ద్రష్ట ఏర్పడినది దృశ్యముయొక్క అనుభవంకోసం మాత్రమే.
22. కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్
(కృత అర్థం ప్రతి నష్టమ్ అపి అనష్టమ్ తత్ అన్య సాధారణత్వాత్) - అది గ్రహించినవారికి దృశ్యము కనిపించకుండా పోతుంది. కానీ ఆ అవగాహన లేనివారికి మాత్రం ఆ దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది.
23. స్వస్వామిశక్త్యోః స్వరూపలబ్ధిహేతుస్సంయోగః
(స్వ స్వామి శక్త్యోః స్వరూప ఉపలబ్ధి హేతుః సంయోగః) - ఆత్మ ప్రకృతి, దృశ్యము పురుషుడు. ప్రకృతి ధ్యేయము ఆత్మజ్ఞానం. పురుషుని ధ్యేయం సంయోగముద్వారా ఆ రెంటి స్వరూపాలను తెలివిడి చేయడం.
24. తస్య హేతురవిద్యా
(తస్య హేతుః అవిద్యా) - ప్రకృతి పురుషుల సంయోగానికి కారణం అవిద్య.
25. తదభావాత్ సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్
(తత్ అభావాత్ సంయోగ అభావః హానమ్ తత్ దృశేః కైవల్యమ్) - అవిద్య నశించినతరవాత సంయోగం అంతమవుతుంది. అదే విముక్తి. దృశ్యమాన ప్రపంచంనుండి విడివడగలగడమే కైవల్యము. (నాల్గవ అధ్యాయములో విపులముగా వివరించబడింది).
26. వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః
(వివేక ఖ్యాతిః అతిః అవిప్లవా హాన ఉపాయః) - అవిద్యను తొలగించగల సాధనము విచారణ. దానిని నిరవధికంగా స్పష్టంగా నిర్దుష్టంగా కొనసాగించాలి.
27. తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా
- అవిద్యను నాశనము చేసి ప్రజ్ఞ సాధించడానికి ఏడు పద్ధతులు ఉన్నాయి. (ఆ ఏడు పద్ధతులు - నిత్యానిత్య వస్తు వివేకజ్ఞానం, సమస్త దుఃఖనివారణ, పరిపూర్ణజ్ఞానప్రాప్తి, కర్తవ్య త్యాగబుద్ధి, స్వాతంత్ర్యం, చిత్తస్వాధీనం, నిరాశ్రయమైన జ్ఞానం.)
28. యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరవివేకఖ్యాతేః
(యోగ అంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞాన దీప్తిః అవివేక ఖ్యాతేః) - యోగాంగములు అనుష్ఠించడంవల్ల అవిద్య నశించి జ్ఞానదీపం ప్రకాశిస్తుంది.
29. యమనియమాఽసనప్రాణాయామప్రత్యాహారధారణధ్యానసమాధయోఽష్టావంగాని
(యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయః అష్టౌ అంగాని) - యోగసాధనలో ఎనిమిది అంగములు ఉన్నాయి. అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, నిశ్చల ధ్యానము, అనవరత ధ్యానము, సమాధి.
30. అహింసాసత్యమస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహా యమాః
(అహింసా సత్యమ్ అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహా యమాః) - యమములు ఐదు. అవి అహింస, సత్యము, చోరబుద్ధి లేకుండుట, బ్రహ్మచర్యం, పరుల సొమ్ము స్వీకరించకుండుట.
31. జాతిదేశకాలసమయానవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతమ్
(జాతి దేశ కాల సమయ అనవచ్ఛిన్నాః సార్వభౌమః మహా వ్రతమ్) - కులం, స్థలం, కాలం, పరిస్థితులవల్ల కలిగే అవధులను లెక్క చేయకుండా నియమాలను ఆచరించడమే మహా వ్రతము.
32. శౌచసంతోషతపః స్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః
(శౌచ సంతోష తపః స్వాధ్యాయ ఈశ్వరప్రణిధానాని నియమాః) - నియమములు ఐదు. అవి పరిశుభ్రత (మనస్సు, శరీరము), ఆనందము, తపస్సు, స్వాధ్యాయము, భగవంతునియందు చిత్తము లగ్నము చేయడం.
33. వితర్కబాధనే ప్రతిపక్షభావనమ్
(వితర్క బాధనే ప్రతి పక్ష భావనమ్) - బాధించే తలపులను వాటికి వ్యతిరేకమైన భావాలతో తొలగించుకోవాలి.
34. వితర్కా హింసాదయః కృతకారితానుమోదితా లోభక్రోధమోహపూర్వకా
మృదుమధ్యాధిమాత్రాదుఃఖాజ్ఞానానంతఫలా ఇతి ప్రతిపక్షభావనమ్.
(వితర్కా హింస ఆదయః కృత కారిత అనుమోదితః లోభ క్రోధ మోహ పూర్వకః మృదు మధ్య అధిమాత్రః దుఃఖ అజ్ఞాన అనంత ఫల ఇతి ప్రతిపక్ష భావనమ్) - యోగసాధనకి ప్రతిబంధకమైన హింసవంటి చర్యలు – స్వయంకృతం గానీ ఇతరుల చర్యలవల్ల గానీ సంభవిస్తాయి. కోపము, లోభము లేదా మోహము ఇత్యాదులవల్ల కలుగవచ్చు. అవి ఏ స్థాయిలోనైనా - మహోధృతంగానో, ఓ మోస్తరుగానో, సాధారణస్థాయిలో -సాధకునిచర్యగా పరిణమించవచ్చు. అందుచేత ఆ యా ప్రవృత్తులను వాటికి తగిన వ్యతిరేక భావనలతో అరికట్టాలి.
35. అహింసాప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః
(అహింస అప్రతిష్ఠాయాం తత్ సన్నిధౌ వైర త్యాగః) అహింసాప్రవృత్తిని గట్టి పట్టుదలతో నిలకడగా పాటించినవాని సమీపంలో వైరభావాలు నిలువవు.
36. సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్
(సత్య ప్రతిష్ఠాయాం క్రియాఫల ఆశ్రయత్వమ్) నిత్య సత్యవ్రతుని కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి.
37. అస్తేయప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానమ్.
(అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వ రత్న ఉపస్థానమ్) చోరబుద్ధిని జయించినవానికి సకల సంపదలు సమకూరుతాయి.
38. బ్రహ్మచర్యప్రతిష్ఠాయాం వీర్యలాభః
(బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్య లాభః) దృఢచిత్తంతో బ్రహ్మచర్యదీక్ష పూనినవానికి శారీరక, మానసిక దారుఢ్యము కలుగుతుంది.
39. అపరిగ్రహస్థైర్యే జన్మకథంతాసంబోధః
(అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధః) పరులసొమ్ము స్థిరచిత్తముతో తిరస్కరించినవాడు జన్మవృత్తాంతమునుగురించి తెలుసుకొనగలడు.
40. శౌచాత్ స్వాంగజుగుప్సా పరైరసంసర్గః
(శౌచాత్ స్వ అంగ జుగుప్సా పరైః అసంసర్గః) పరిశుభ్రతను పాటించడంవలన తన శరీరము అంటే రోత, ఇతరులతో సంపర్కము విషయంలో వైముఖ్యం సిద్ధిస్తాయి.
41. సత్త్వశుద్ధిసౌమనస్యైకాగ్ర ఇంద్రియజయాత్సమదర్శనయోగ్యత్వాని చ
(సత్త్వ శుద్ధి సౌమనస్య ఏకాగ్ర ఇంద్రియ జయాత్ సమ దర్శన యోగ్యత్వాని చ) మనసు నిర్మలముగా ఉంచుకున్న సాధకుడు సాత్వికగుణము, మంచితనము, ఏకాగ్రత, ఇంద్రియనిగ్రహము, ఆత్మదర్శనము పొందగలడు.
42. సంతోషాదనుత్తమసుఖలాభః
(సంతోషాత్ అనుత్తమ సుఖ లాభః) - నిత్య సంతుష్టునికి అత్యుత్తమైన ఆనందము సిద్ధిస్తుంది.
43. కాయేంద్రియసిద్ధిరశుద్ధిక్షయాత్తపసః
(కాయ ఇంద్రియ సిద్ధిః క్షయాత్ తపసః) - తపోనిష్ఠ శరీరాన్నీ ఇంద్రియములనూ అంటి ఉన్న మాలిన్యమును తొలగిస్తుంది.
44. స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః
(స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగః) - స్వాధ్యాయమువలన ఇష్టదేవతలను చేరగలుగుతాడు.
45. సమాధిసిద్ధిః ఈశ్వరప్రణిధానాత్
ఈశ్వరునియందు చిత్తము లగ్నము చేయడంవలన సమాధి సిద్ధిస్తుంది.
46. స్థిరసుఖామాసనం
(స్థిర సుఖమ్ ఆసనమ్) - స్థిరంగానూ ఇబ్బంది కాని విధంగానూ కూర్చోడం ముఖ్యం.
47. ప్రయత్నశైథిల్యానంతసమాపత్తిభ్యామ్
(ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యామ్) - అది సమాధిస్థితి చేరుకోడానికి సహాయకారి అవుతుంది.
48. తతో ద్వంద్వానభిఘాతః
(తతః ద్వంద్వ అనభిఘాతః) - ఆ పైన సుఖదుఃఖాలు, శీతోష్ణాలవంటి ద్వంద్వములు బాధించవు.
49. తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయోర్గతివిచ్ఛేదః ప్రాణాయామః
(తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః ప్రాణాయామః) - ఊపిరి పీల్చి ఉంచడం, వదలి ఉంచడం (పూరక, రేచక క్రియలు) యోగసాధనకు నిర్ణీతమైన పద్ధతిలో చేయడం ప్రాణాయామము.
50. బాహ్యాభ్యంతరస్తంభవృత్తిః దేశకాలసంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘసూక్ష్మః
(బాహ్య అభ్యంతర స్తంభ వృత్తిః దేశ కాల సంఖ్యాభిః పరిదృష్టః దీర్ఘ సూక్ష్మః) - ఊపిరి పీల్చి ఆస్థితిలో ఉండడం (పూరక),ఊపిరి వదలి ఆ స్థితిలో ఉండడం (రేచక) రెండు పద్ధతులు. అలా ఊపిరి బిగబట్టి గానీ బయటికి వదలి గానీ ఎంతసేపు నిలపడం అన్నది సాధకుని సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అలాగే రోజుకి ఎన్నిసార్లు చేయడం అన్నది కూడా సాధకుడు నిర్ణయించుకోవాలి.
51. బాహ్యాంతరవిషయాఽక్షేపీ చతుర్థః
(బాహ్య అంతర విషయ ఆక్షేపీ చతుర్థః) - ఈ ప్రాణాయామము నాలుగు స్థాయిలలో ఉంటుంది.
52. తతః క్షీయతే ప్రకాశాఽవరణమ్
(తతః క్షీయతే ప్రకాశ ఆవరణమ్) - అది అంతర్జ్యోతిని ఆవరించిన అంధకారాన్ని నశింపచేస్తుంది.
53. ధారణాసు చ యోగ్యతా మనసః
- ఈ అష్టాంగములను ఆచరించడంద్వారా సాధకుడు పరమపురుషుని చేరడానికి తగిన యోగ్యత, సామర్ధ్యము పొందగలడు.
54. స్వవిషయాసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః
(స్వవిషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూప అనుకారః ఇవ ఇంద్రియాణాం ప్రత్యాహరః) - ఇంద్రియప్రవృత్తులను (చూడడం, వినడం వంటివి) వాటికి లక్ష్యాలు అయిన వస్తువులనుండి నివర్తింపజేయడమే ప్రత్యాహారం.
55. తతః పరమా వశ్యతేంద్రియాణాం
(తతః పరమా వశ్యతా ఇంద్రియాణామ్) - ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు.
← సమాధి పాదము పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సాధన పాదము) విభూతి పాదము →
ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు. :
మూస:పతంజలి యోగ సూత్రములు
.
 ← సాధన పాదము పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (విభూతి పాదము) కైవల్య పాదము →
జ్ఞానము. :
1. దేశబంధశ్చిత్తస్య ధారణా
(దేశ బంధః చిత్తస్య ధారణా) - చిత్తమును ఒకే ఒక్క స్థానములో నిశ్చలంగా ఉంచడం ధారణ.
2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్
(తత్ర ప్రత్యయ ఏకతానతా ధ్యానమ్) - ధ్యానానికి కేంద్రమైన వస్తువుమీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలపడం ధ్యానము.
3. తదేవార్థమాత్రానిర్భాసమ్ స్వరూపశూన్యమివ సమాధిః
(తత్ ఏవ అర్థ మాత్రా నిర్భాసమ్ స్వరూప శూన్యమ్ ఇవ సమాధిః) - ధ్యానం సాఫల్యమైతే సాధకునికి స్థూలశరీరానికీ సమస్త ప్రపంచానికీ అతీతమైనదీ, తనలో అంతర్లీనంగా ఉన్నదీ అయిన అంతర్జ్యోతి కనిపిస్తుంది. అదే సమాధి.
4. త్రయమేకత్ర సంయమః
(త్రయమ్ ఏకత్ర సంయమః) - ఈ మూడింటినీ కలిసికట్టుగా (ధారణ, ధ్యానము, సమాధి) సంయమము అంటారు.
5. తజ్జయాత్ ప్రజ్ఞాఽఽలోకః
(తత్ జయాత్ ప్రజ్ఞా ఆలోకః) - సంయమము చేస్తే ప్రజ్ఞ కలుగుతుంది.
6. తస్య భూమిషు వినియోగః
- ఆ ప్రజ్ఞను క్రమపద్ధతిలో వినియోగించుకోవాలి.
7. త్రయమంతరంగమ్ పూర్వేభ్యః
(త్రయమ్ అంతరంగమ్ పూర్వేభ్యః) - సాధన పాదం 29వ సూత్రంలో ప్రస్తావించిన ఐదు విధాలకి (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారము) భిన్నంగా ఈ మూడూ (ధ్యానం, ధారణ, సమాధి) అంతరంగానికి సంబంధించినవి.
8. తదపి బహిరంగమ్ నిర్బీజస్య
(తత్ అపి బహిరంగమ్ నిర్బీజస్య) - అష్టాంగాలలో యమ, నియమ మొదలైన ఐదు స్థితులకంటె సంయమం ఉత్తమమే అయినా అది ప్రాథమిక దశలో బహిరంగ సాధనగా ఉంటుంది.
9. వ్యుత్థాననిరోధసంస్కారయోరభిభవప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః
(వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభవ ప్రాదుర్భావౌ నిరోధ క్షమ చిత్త అన్వయః నిరోధ పరిణామః) - ప్రారంభదశలో కింది స్థాయిలో చిత్తవృత్తులను అదుపులో ఉంచడానికి నిరోధక చిత్తవృత్తులు పుడతాయి. సాధకుడు వాటిని కూడా తొలగించుకోవాలి. ఈ చిత్తవృత్తులు పుట్టడం, వాటిని నిరోధించడం – ఈ నిరోధకపరిణామాన్ని సాధకుడు గుర్తించడం సాధనలో ఒక పరిణామదశ.
10. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్
(తస్య ప్రశాంత వాహితా సంస్కారాత్) - ఆ సాధనతో ధ్యానం ఏకోన్ముఖంగా సాగి ఆధ్యాత్మికమైన ప్రశాంతత లభిస్తుంది సాధకునికి.
11. సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః
(సర్వార్థతః ఏకాగ్రతయోః క్షయ ఉదయౌ చిత్తస్య సమాధి పరిణామః) - చిత్తవృత్తులు కలగడం, వాటిని నిరోధించడం, నిరోధిస్తున్నానన్న స్పృహ సాధకునికి కలగడంచేత ఇతర ఆలోచనలన్నీ తొలగి ఏకాగ్రత సాధిస్తాడు. చిత్తము సమాధిస్థితి చేరువ అవుతుంది.
12. తతః పునః శాంతోదితౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతాపరిణామః
(తతః పునః శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రతా పరిణామః) - ఆవిధంగా చిత్తవృత్తులు పుట్టడం గిట్టడం సమాన స్థాయిలో (హెచ్చుతగ్గులు లేకుండా) జరిగినప్పుడు ఆ స్థితికి ఏకాగ్రతా పరిణామం అని పేరు.
13. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖ్యాతాః
(ఏతేన భూత ఇంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః) - చిత్తము యొక్క పరిణామము వివరించినతరవాత, ఆ పరిమాణానికి ఇంద్రియముల ధర్మము (తత్వము), లక్షణములు, అవస్థలతో (పరిస్థితి) గల సంబంధాన్ని వివరిస్తున్నారు.
14. శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ
(శాంత ఉదిత అవ్యపదేశ్య ధర్మ అనుపాతీ ధర్మీ) - ధర్మము అంతర్లీనంగానో అవ్యక్తంగానో వ్యక్తంగానో ప్రతి జీవిలోనూ ఉండడం సర్వసాధారణం.
15. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః
(క్రమ అన్యత్వం పరిణామ అన్యత్వే హేతుః) - పరిణామంలో తేడాలకి కారణం పరిణామ క్రమం (చిత్తము ఒక దశనుండి మరొక దశకి పరిణమించే క్రమం)
16. పరిణామత్రయసంయమాదతీతానాగతజ్ఞానమ్
(పరిణామ త్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానమ్) - ఈ ధర్మ, లక్షణ, అవస్థలను (పరిణామత్రయం) స్వాధీనం చేసుకున్న సాధకునికి గత, భావి జన్మలగురించిన జ్ఞానం కలుగుతుంది.
17. శబ్దార్థప్రత్యాయానామితరేతరాధ్యాసాత్సంకరః
తత్ప్రవిభాగ సంయమాత్సర్వభూత రుతజ్ఞానమ్
(శబ్ద అర్థ ప్రత్యాయానామ్ ఇతర ఇతర అధ్యాసాత్ సంకరః తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వ భూత రుత జ్ఞానమ్) - శబ్దం (పదము), అర్థం, వాటికి మూలమైన వస్తువు – సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి అయోమయం కలిగిస్తాయి. సంయమంతో వీటిని విడదీసి స్వాధీనం చేసుకుంటే సమస్త జీవుల భాషను అర్థం చేసుకోడం సాధ్యం.
18. సంస్కారసాక్షాత్కరణాత్పూర్వజాతిజ్ఞానమ్
(సంస్కార సాక్షాత్ కరణాత్ పూర్వ జాతి జ్ఞానమ్) - సంస్కారంమూలంగా (పైన వివరించిన మూడు స్థాయీభావాలను అర్థం చేసుకోడంవలన) పూర్వజన్మగురించిన జ్ఞానము కలుగుతుంది.
19. ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్
(ప్రత్యయస్య పర చిత్త జ్ఞానమ్) - ఇతరచిత్తములతో సంయమంద్వారా వారి చిత్తముయొక్క స్వభావం గ్రహించగలరు.
20. న చ తత్సాలంబనమ్ తస్యావిషయీభూతత్వాత్వ్
(న చ తత్ సాలంబనమ్ తస్య అవిషయీ భూతత్వాత్) - అయితే ఆ జ్ఞానము కేవలము చిత్తస్వభావానికి సంబంధించినదే కా?

--(())__

No comments:

Post a Comment