ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...
రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ, కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా.. వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...
మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???
నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...
ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...
శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !
ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం )
తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు...
మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....
మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కాసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి........
******
భగవంతుడి దర్శనం ఓ అంతుచిక్కని వ్యవహారం. అది తరతరాల మానవుడి తీరని తృష్ణ. ప్రసంగాల వల్లనో, మేధాశక్తి వల్లనో, ప్రవచనాలు వినడం వల్లనో భగవంతుడి దర్శనం అనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదంటుంది ముండకోపనిషత్తు. ఎవరైతే తనదైన ఉపాయాల చేత ప్రయత్నిస్తారో పొందుతారని చెబుతుంది.
‘మహాశయా! మీరు భగవంతుడిని కండ్లారా చూశారా?’ అని పరమహంసను ప్రశ్నించాడు నరేంద్రుడు. దానికి ఆయన ‘అవును చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా, ఇంకా స్పష్టంగా’ అని జవాబిచ్చాడు. మళ్లీ ‘నిన్ను చూస్తున్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్లుగా భగవంతుడిని చూడవచ్చు. భగవత్ దర్శనం పొందలేదని ఎవరు విలపిస్తున్నారు? ఆయనను దర్శించాలనే పరమ వ్యాకులతతో తపిస్తే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు’ అంటాడు రామకృష్ణ పరమహంస.
యముడిని కలిసిన నచికేతుడు ‘యమధర్మరాజా! మీరు చెబుతున్న సుఖాలన్నీ అశాశ్వతాలు. అవి మనిషి ఇంద్రియాల శక్తిని వృథా చేసేవే. జీవితమే స్వల్పమైనది. కనుక మీరు చెప్పిన గుర్రాలూ, ఆటలూ, పాటలూ అన్నింటినీ మీరే ఉంచుకోండి. నాకు మాత్రం ఏ విషయంలో సందేహం నెలకొని ఉందో, పరలోక విషయంలో ఏది తెలుసుకుంటే గొప్ప ఫలం లభిస్తుందో, ఏ నిజం అత్యంత గోప్యంగా దాగి ఉందో దానిని తెలుసుకోవాలి. మరే వరమూ అవసరం లేదు’ అని సమవర్తిని అడుగుతాడు. అందుకు ఆయన ఆత్మ దర్శనం చేసుకున్నవాడు అరుదని చెబుతూ, గీతాచార్యుడు చెప్పినట్టుగా ‘ఆత్మదర్శనం అయినవారు కూడా ఆశ్చర్యంలో ఉన్నారు. నీవు అడిగిన ఆత్మ ఎంతో శ్రమతో కూడుకున్నది, గోప్యమైనది, అత్యంత చీకటి ప్రాంతం లో దాగి ఉంది. సనాతనమైనది. హృద్గుహలో ప్రకాశించేది. బుద్ధి వికాసం పొందినవాడు, ఆ ఆత్మను అధ్యాత్మ యోగం ద్వారా కనుగొని జ్ఞానియై సుఖదుఃఖాలకు అతీతుడవుతాడు’ అంటాడు యముడు.
మరో సందర్భంలో శౌనకుడు అంగిరసుని సమీపించి, చేతులు జోడించి, ‘దైవ సమానుడా! దేనిని తెలుసుకుంటే ఈ సమస్తమూ బోధపడుతుంది’ అని అడుగుతాడు. అందుకు అంగిరసుడు ఇచ్చిన జవాబే ‘ముండకోపనిషత్తు’. ‘ఆత్మ అనేది నిరంజనమైన, నిర్గుణమైన సనాతన వస్తువని, అనంతమైనదని, దానికి ఇంద్రియాలకు చిక్కే లక్షణాలేవీ లేవని, అయినా అన్ని రూపాలుగా మారేదీ, అలా మారి వాటిల్లో దాక్కొని ఉండేదీ అదే’ అని ఆత్మను విశదీకరించింది ముండకోపనిషత్తు. ఎలాగైతే సాలీడు నుంచి దారాలు ఉద్భవిస్తాయో, ఎలాగైతే భూమి నుంచి చెట్టూచేమా పెరుగుతున్నాయో, ఎలాగైతే జీవి శరీరంపై వెంట్రుకలు పెరుగుతున్నాయో అలాగే ఆ ఆత్మ నుంచి ఈ సృష్టి వెలుగులోకి వస్తుందని ఆ ఉపనిషత్తు స్పష్టం చేసింది.
భగవంతుడు అంటే కేవలం ఏదో మానవ రూపంలోనో, జంతువు రూపంలోనో, వృక్ష రూపంలోనో, కాంతి రూపంలోనో ఉండే వస్తువు కాదు. భగవాన్ అనే పదం నుంచి భగవంతుడు ఉద్భవించింది. భగవాన్ అంటే జ్ఞానం, ఐశ్వర్యం, బలం, వీర్యం, తేజస్సు, శక్తి అనే ఆరు గుణాల సమాకలన రూపం. ఈ ఆరు గుణాలను షాడ్గుణ్యమని, భగమనీ అంటారు. ఇవి సంపూర్ణంగా ఉన్న చైతన్యమే భగవంతుడు. ఈ గుణాలన్నీ అపారమైనవి. అవి ఎందులో దాక్కుని ఉన్నా, ఏ రూపాన్ని ధరించినా అది భగవంతుడే. ఈ ఆరు గుణాల కారణంగానే ఈ విశ్వం మనుగడలోకి వస్తుంది.
ఈ ఆరు చైతన్యాలే ఈ విశ్వంలోని సూక్ష్మం నుంచి అనంతం వరకు ఉన్న అన్ని రూపాల్లో విస్తరించి ఉంటాయి. అది తెలుసుకోవడమే ‘ప్రజ్ఞానం బ్రహ్మ’. భగవంతుని రూపం సూక్ష్మాతి సూక్ష్మం నుంచి ఈ భూనభోంతరాలూ నిండి, ఆపై మానవుడి మేధకు అందనిదై వెలుగొందుతున్నది. ‘ఈశావాస్య మిదగ్ం సర్వం’ అన్నట్లుగా భగవంతుడు వ్యాప్తి చెందని రూపం ఈ విశ్వమే కాదు, ఏ విశ్వంలోనూ లేదు. ఇది అర్థం చేసుకున్నవాడు, తన మనసులో జీర్ణించుకున్నవాడికి అన్నిటా, అంతటా ఆ భగవంతుడే దర్శనమిస్తాడు. ఇందుగలడందు లేడను సందేహం అవసరం లేదు. రామకృ
లు చెప్పినట్టు భగవత్ దర్శనం కోసం తపించిన వారు తప్పకుండా తరిస్తారు.
*****
దేహం ఒక రథం, ఆత్మ రథ సారథి
ఒక కారు ఉంది, ఇంజను కండిషన్లో ఉంది. వీల్స్, స్టీరింగ్, బ్రేకు, గేర్స్ అన్నీ బాగున్నాయి. కొంత దూరం ఆ కారు నడిపి డ్రైవర్ దిగి వెళ్లిపోయాడనుకుందాం. కారును అతను ఎక్కడ వదలి వెళ్లాడో అక్కడే ఉంటుంది. అంగుళం కూడా అటూఇటూ కదలదు. ఎందువల్ల? దానిని నడిపే డ్రైవరు దిగిపోయినందువల్ల. అట్లే మానవదేహం కూడా. ఈదేహం ఆ కారువంటిదైతే, దీనిని కదిలించే చైతన్యం డ్రైవరు వంటివాడు. చైతన్యం శరీరం నుంచి వెడలిపోతే డ్రైవరు కారు దిగిపోయినట్లే. అయితే ప్రాకృతికంగా కారులో మరో డ్రైవరు ఎక్కి నడిపించవచ్చు. కాని భగవంతుడిచ్చిన ఈ దేహంలో మరో డ్రైవరు ఆ స్థానాన్ని ఆక్రమించ వీలులేదు. ఆత్మ, దైవశక్తి లేక చైతన్యము ఉన్నంత వరకే మనదేహానికి విలువ. ఆ తదుపరి అంతకన్న పనికిరాని వస్తువు మరొకటిలేదు.
మన కళ్లు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నది, కాళ్లూచేతులు చలనాత్మకంగా ఉన్నాయి. చెవులు వింటున్నాయి, మనస్సు ఆలోచనలను రేకెత్తిస్తున్నది. ఈ పనులన్నింటినీ మన దేహమే చేస్తున్నదనుకుంటాం. కానీ, కాదు దేహంలో గల చైతన్య శక్తి శరీరావయవాలచే, అంగాలచే, ఇంద్రియాలచే ఆ విధంగా పని చేయిస్తున్నది. దేహం నుండి ఆ చైతన్యం వెళ్లిపోయిన మరుక్షణం చలనశీలమైన దేహం నేలకూలుతుంది. చలనరహితమవుతుంది. దేహంలోని ఏ అవయవమూ పనిచేయదు. అప్పటి వరకు ‘ఫలానా’ వారు అని పిలువబడిన, గౌరవింపబడిన దేహం ‘ఫలానా’ వారి పార్థివ దేహమవుతుంది. శవంగా మారుతుంది. అంత్యక్రియలకు సిద్దం అవుతుంది. శాశ్వతంగా ఈ లోకంనుండి కనుమరుగవుతుంది. ఆ క్షణం వరకు శరీరాన్ని లోనుండి పనిచేయించిన చైతన్యమే భగవంతుడు.
దేహం ఒక రథం
ఆత్మ రథ సారథి
ఆ చైతన్యాన్నే ‘ఆత్మ’ అని కూడా అంటాం.
ఆత్మానాం రథినం విద్ధి, శరీరం రథమేవ తు’ అంటుంది కఠోపనిషత్.
ఈ ధర్మసూక్ష్మాన్ని అవగాహన చేసుకొని గాఢంగా విశ్వసించగల్గితే దేవుని దర్శనార్థం అక్కడకు ఇక్కడకు పోనవసరం లేదు. గుళ్లు గోపురాలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం అంతగా ఉండదు. ఈ భావన స్థిరపడినపుడు ఎవరూ మనకు పరాయి వారు కాదు. అందరూ దైవస్వరూపులే. మానవదేహం కదలాడే దేవాలయం వంటిది. ప్రతి దేవాలయంలో దైవ ప్రతిమ ప్రతిష్ఠింపబడి ఉన్నట్లుగా, ప్రతీ దేహంలో చైతన్య స్వరూపంగా ఆత్మతత్వం వ్యాపించియుంటుంది. అందుకే ఎవరిని గౌరవించినా, ఆదరించినా భగవంతుని గౌరవించినట్లే. ఎవరిని కించపరచినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా భగవంతునికి అపరాధం గావించినట్లే. ఒక్క మానవ దేహంలో మాత్రమేగాదు... ఈ భూమిపై ఉన్న 84లక్షల జీవరాశుల్లోను భగవత్ చైతన్యం తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక చిన్న చీమను పరిశీలించండి. ఏదో పెద్దపని ఉన్నట్లు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతుంటుంది. ఆ చిన్న చీమలోనున్న ఆ కదలాడే శక్తి ఆత్మతత్వమే.
దేవుడెక్కడనుచు దేవులాడగనేల
దేవుడుండు తనదు దేహమందె, దేవుడే తానయ్యు
దేవుని వెదకుట, తన్నుతా వెదకునట్లుగాదె!’
అని భగవాన్ సత్యసాయిబాబా వారు చెప్పేవారు.
కాబట్టి మనలో ఉన్న ఆత్మ అనే దేవుడిని తెలుసుకోవడానికి ధ్యాన సాధన చేయాలి.
నేను ఎవ్వరు? అని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని రమణ మహర్షి చెప్పేవారు.
నిన్ను నీవు తెలుసుకున్నపుడు అంతా నీకు అర్థం అవుతుంది అని రమణ మహర్షి భోధించేవారు.
అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుడిని.
తత్వమసి అంటే నువ్వు కూడా దేవుడివే.
సర్వం ఖల్విదం బ్రహ్మ. అంటే మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ దేవుడు ఉన్నాడు.
ఇదే వేదాలు మరియు ఉపనిషత్తులు సారాంశం.
యోగులు యోగ దృష్టి తో చెప్పినవి కూడా ఇదే.
*****
ఒక వూరిలో వూరి బయట ఒక గుడిసె లో తల్లీ కొడుకు నివసిస్తూ వుండే వారు.కొడుకు పేరు రాము. వాళ్ళు చాలా బీదవాళ్ళు.
తల్లి చాల మంది ఇళ్ళల్లో పాచిపని చేసి కొడుకు ను పోషిస్తూ వుండేది. వూరిలో పిల్లలందరూ పక్క వూరికి వెళ్లి ఒక గురువు గారి దగ్గర చదువుకునే వారు.వాడు నేనూ వెళ్లి చదువుకుంటానని గొడవ చేశాడు. తల్లి ఆ గురువు గారి దగ్గరికి వెళ్లి కొడుకును చేర్పిస్తానని బతిమాలి ఆయనను ఒప్పించింది.గురువు గారి వూరికి వెళ్ళాలంటే అడవి దారి గుండా వెళ్ళాలి.మిగతా పిల్లలందరూ వారి వారి ఎడ్ల బండ్ల లో వెళ్ళే వారు.రాముడు నడిచి వెళ్ళేవాడు.వాడు వాళ్ళమ్మ తో అమ్మా! నాకు అడివి లో వెళ్ళేటప్పుడు భయమేస్తుంది అన్నాడు.వాడి అమ్మ
నాన్నా! 'గోపాలా గోపాలా అని గట్టిగా పిలుస్తూ వెళ్ళు నీకు భయ మెయ్యదు అని చెప్తుంది
వాడు అలాగే గోపాలా గోపాలా అని అరుస్తూ వెళుతుంటే ఒక చిన్న గోవులు కాసుకునే పిల్లవాడు చేతిలో పిల్లనగ్రోవితో వచ్చి పిలిచావా? అని అడిగాడు. వాడు వాళ్ళ అమ్మభయం వేయకుండా అలా పిలవమని చెప్పిందని చెప్పాడు .సరేలే నేను నిన్ను అడవి దాటిస్తాను అని రోజు వాడిని అడవి దాటించి వెళ్ళేవాడు.వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు.రాముడు చాలా శ్రద్ధగా చదువుకునే వాడు.
ఇలా వుండగా ఒక రోజు గురువు గారింట్లో ఆయన కూతురి పెళ్లి జరుగుతూంది. పిల్లలందరూ వెళుతున్నారు.అందరూ ఏదో ఒక కానుక తీసుకొని వెళుతున్నారు. రాముడు అమ్మా! నేనేమి తీసుకెళ్ళాలి? అని అడిగాడు. మనం పేదవాళ్ళం నాయనా!మనం వాళ్లకు ఏమి కానుక యివ్వగలము?అని చెప్పింది.
వాడు విచారంగా వెళ్ళిపోయాడు.రోజు లాగే గోపాలా గోపాలా అని పిలిచాడు. ఆ గొల్ల పిల్లవాడు పిల్లన గ్రోవి ఊదుకుంటూ వచ్చాడు. రాముడి ముఖం విచారంగా వుండడం చూసి ఎందుకు అలా వున్నావని అడిగాడు వాడు విషయం చెప్పగానే ఆ గొల్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చెంబు నిండుగా పాలు తీసుకొని వచ్చి వాళ్లకు పాయసానికి యివి ఉపయోగ పడతాయి తీసికెళ్ళు అని చెప్పాడు. వాడు జాగ్రత్తగా ఆ పాల చెంబు తీసుకొని గురువు గారింటికి వెళ్ళాడు.గురువు గారి భార్య తో అమ్మా నేను ఈ పాలు తెచ్చాను తీసుకోండి అని చెప్పాడు.ఆవిడ నిర్లక్షంగా ఒక నౌకర్ కి ఆ పాలు తీసుకొని వెళ్లి ఆ పాల గంగాళం లో పొయ్యమని చెప్పింది. వాడు పోసే సరికి మళ్ళీ చెంబు నిండా పాలు వున్నాయి అలాగ ఎన్ని సార్లు పోసినా
మరీ చెంబు నిండా పాలు వుంటున్నాయి.గంగాళం నిండి పోయింది.వాడు గురువుగారి భార్యను పిలిచి చూపించాడు. ఈ విషయం పెళ్లి యింటికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసి పోయింది అందరూ ఆశ్చర్య పోతున్నారు గురువు గారు రాముడిని పిలిచి ఈ పాలు ఎక్కడ తెచ్చావు? అని అడిగాడు.రాముడు మొత్తం కథ అంతా అమాయకంగా చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పడం తను .రోజూ తను గోపాలా అని పిలవగానే గొల్లవాడు వచ్చి తనను అడవి దాటించటం,పాలు యివ్వడం అన్నీ చెప్పాడు. వాళ్ళెవ్వరూ నమ్మలేదు.వాడిని ఆ అడవి కి తీసుకెళ్ళి ఏదీ
యిప్పుడు పిలువు వస్తాడేమో చూస్తాము.అని అన్నారు.వాడు గోపాలా గోపాలా అని ఎన్ని సార్లు పిలిచినా ఎవరూ రాలేదు.అన్నే అపద్దాలు యిల అబద్దాలు చెప్తావా?
అని గురువు గారు, మిగతా వాళ్ళందరూ వాడిని బాగా తిట్టారు.వాడికి దుఃఖ మొచ్చింది పెద్దగా ఏడువ సాగాడు.ఎందుకు గోపాలా నీవు రావడం లేదు రోజూ
పిలవగానే వచ్చేవాడివి కదా! అని వెక్కి వెక్కి ఏడువ సాగాడు అప్పుడు ఆకాశవాణి వినిపించింది.
నీవు అమాయకంగా మీ అమ్మ మాటను నమ్మి నన్ను పిలిచావు కనుక నేను వచ్చాను. నేను ఈ స్వార్థ పరులకు కనిపించను.అందుకే రాలేదు. అని విని పించింది. అందరూ ఆశ్చర్య పోయారు. అప్పటినుండి వూరివాళ్ళు, గురువుగారు,పిల్లలు రాముడి తల్లినీ రాముడినీ తమ యిళ్ళ దగ్గరనే ఒక ఇల్లు యిచ్చి వాళ్ళు జీవించడానికి తగినంత సహాయం చేసేవారు.
"దేవుణ్ణి నిష్కల్మషంగా నమ్మితే సహాయం చేస్తాడు
[*****
క్రోధానికీ, కామానికీ బానిసలైతే కలిగే దుష్పరి ణామాలను తెల్పుతుంది ఈ కథ. ఆడైనా మగైనా నోటిదురుసుతనం,అయిన దానికీ కానిదానికీ దుర్భాష లాడితే కలిగే ఫలితం ఏమిటో చదవండి.
ఔర్వుడు అనే మహర్షి కూతురు కందళి.ఆమె చాలా అందగత్తె,మంచి సుగుణాలు వున్నది.కానీ ఆమెకు నోటి దురుసుతనం యెక్కువ. ఆమె దుర్వాస మహర్షిని పెళ్లి చేసుకుంటానని తండ్రి తో చెబుతుంది. ఆయన చాలా కోపిష్టి అని తండ్రి వద్దని వారిస్తాడు. కానీ కందళి పట్టు బడుతుంది. సరే యని ఆమెని దూర్వాసును దగ్గరికి తీసుకెళ్ళి ఆమె గురించి వివరంగా చెప్పి ఆమె కోరిక గురించి చెప్తాడు. అన్నీ విన్న దూర్వాసుడు ఆమె అందానికి మోహితుడై ఆమెను వివాహం చేసుకోడానికి అంగీకరిస్తాడు.కాకపొతే కందళి యొక్క నూరు దుర్భాషలను క్షమిస్తానని ఆ పైన వూరుకోననీ ఒక నియమం పెడతాడు.తండ్రీ కూతుళ్ళు ఒప్పుకుంటారు.
ఆ పైన ఔర్వుడు వివాహం జరిపిస్తాడు.కొంత కాలం వారి దాంపత్యం సవ్యంగానే సాగుతుంది. ఆమె నోటి దురుసుతనం దూర్వాసుడికి కష్టం కలిగించినా యిచ్చిన మాటకు కట్టుబడి ఆమెని క్షమిస్తాడు.చివరకు ఆమెతో మాట్లాడకుండా వుండే పరిస్థితులు వస్తాయి. అలా కొంతకాలమయ్యాక ఆమె నూరు దుర్భాషలూ పూర్తవుతాయి.ఒక రోజు ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం లో వుండగా కందళి వచ్చి ఏమిటి నాతో
మాట్లాడరా? అని దబాయిస్తుంది.అప్పటికే ఆమె ప్రవర్తనతో విసిగి వున్న దుర్వాసుడు కళ్ళు తెరిచి ఆమెను తీక్షణం గా చూస్తాడు. ఆ చోపుకు కందళి నిలువెల్లా మాడిపోయి బూడిదవుతుంది.
.ఆమె ఆత్మ రూపం లో వచ్చి నిలబడి ఆయనను క్షమించమని వేడుకుంటుంది.
తర్వాత దుర్వాసుడు ఆమెను భస్మం చేసినందుకు బాధ పడుతూ వుండగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక స్త్రీ కోసం తన తపస్సు యొక్క శక్తిని దుర్విని యోగం చేసుకున్న దుర్వాసుడికి కర్తవ్య దీక్షను వివరిస్తాడు..
.
తన కోపానికి గురైన భార్య గుర్తుగా కంద ళీ
వృక్షాన్ని సృష్టిస్తాడు.కందళి క్రమేపీ కదళి గామారిన అరటికి .మానవుల పూజలలో, తాంబూలం లో యెంతో ప్రాధాన్యం వుండేట్టు అనుగ్రహిస్తాడు దుర్వాసుడు.అదీ మన అరటి కథ.
తపశ్శక్తి వున్న మహర్షి, యెంత అందం సుగుణాలు వున్నఆడైనా మగైనా దుర్భాష లాడితే కలిగే అనర్థాలను ఈ కథ మనకు తెల్పుతుంది యిప్పటి మన సమాజం లో విడాకులకు దారితీసేది కూడా ఈ కోపం,దుర్భాష లే. అందుకే అవి అదుపులో పెట్టుకోవాలని తెలుసుకోవాలి.
******
ఎంతటి జటిలమైన విషయాన్నయినా... ఎంతటి పామరుడికైనా అర్థం అయ్యేలా చెప్పగల నేర్పరి గౌతమ బుద్ధుడు. పండితులకు పండితుల స్థాయిలో, పామరులకు పామరుల స్థాయిలో చెప్పగల మహా ప్రబోధకుడు. విషయాన్ని పూర్తిగా అవగతం చేయడం కోసం నిత్యజీవితంలోని ఎన్నో సంఘటనలను ఆయన ఉపమానాలుగా చెప్పేవాడు. ఆ ఉపమానంతో వినగానే విషయం హృదయానికి చేరేది. మనసుపై ముద్ర వేసేది.
ఒక రోజు బుద్ధుడు జేతవన విహారంలో ఉన్నప్పుడు, జైన మతానికి చెందిన ఒక సాధువు వచ్చాడు. బుద్ధుడికి వినయంగా నమస్కరించి- ‘‘భగవాన్! నేను ఇంతకాలం అజ్ఞానంలో గడిపాను. నా గురువులు అజ్ఞానులు, స్వార్థపరులు’’ అంటూ తన గురువులను నిందించడం మొదలుపెట్టాడు. చివరకు వారిని ఏకవచనంతో సంబోధించాడు. ‘‘అందరిలో నేను మాత్రమే సుగుణశీలిని’’ అని గొప్పలు చెప్పుకొని... ‘‘భగవాన్! తమరు అనుమతిస్తే నేను మీ శిష్యుడిగా ఉండగలను’’ అని వేడుకున్నాడు.
‘‘ముందుగా నీవు నీ పూర్వ గురువులను గౌరవించడం నేర్చుకో. వారు చెప్పేది నీకు ఇప్పుడు నచ్చినా, నచ్చకపోయినా... ఒకప్పుడు వారు నీకు గురువులే! వారిపట్ల సంస్కారంతో జీవించు. ఆ తరువాత నా దగ్గరకు రా’’ అని చెప్పి పంపాడు.
అతను వెళ్ళిపోయాక అక్కడున్న భిక్షువులతో- ‘‘భిక్షువులారా! గురువు పట్ల ప్రతి వారికీ అణకువ చాలా అవసరం. గురువు పట్లే కాదు... మనతో ఉండే ప్రతివారి పట్లా ఆ అణకువ ఉండాలి. మన మాటతీరే మన ప్రవర్తనకు అద్దం. మన నిజ స్వరూపాన్ని చక్కగా చూపిస్తుంది. ఎదుటివారి దోషాలను అడగకపోయినా ఎవరు చెబుతారో వారు చెడ్డవారు. అలాగే ఎదుటివారి సుగుణాలను మనం అడిగినా చెప్పకుండా ఎవరు దాస్తారో వారూ అలాంటివారే! మనం అడగకపోయినా తమ గొప్పలు చెప్పుకొని, తప్పులు చెప్పరో వారూ చెడ్డబుద్ధి కలవారే! మనం అడగకపోయినా ఎదుటివారి సుగుణాలను చెప్పి, దోషాల గురించి చెప్పనివారు మంచివారు. తమ గొప్పలు తాను చెప్పుకోకుండా... తమ తప్పులను తాము గుర్తించి ఎవరు చెప్పగలరో వారే సజ్జనులు. అలాంటివారు నిరంతరం అణకువగా ఉంటారు. ఒక వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్త పదవి స్వీకరించినప్పుడు... మొదట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. పెళ్ళయి అత్తవారింటికి కొత్తగా వచ్చిన అమ్మాయి... అత్తమామల పట్లా, భర్త విషయంలోనే కాదు... పనివారి పట్లా, ఇరుగుపొరుగుల పట్లా బిడియాన్ని ప్రదర్శిస్తుంది. అందరితో నెమ్మదిగా, మంచిగా నడచుకుంటుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు... ‘‘అవతలకు వెళ్ళండి! మీకేం తెలుసు?’’ అంటుంది. అలాగే మీలో కూడా కొందరు మీ గురువుల పట్లా, మీ తోటివారి పట్లా, మీకన్నా చిన్నవారి పట్లా మొదట్లో నెమ్మదిగానే ఉంటారు. రానురానూ రాటుదేలిపోతారు. అదే మీ పతనానికి ప్రథమ సోపానం. ఎవరు నిరంతరం నవ వధువులా నైతిక బిడియాన్ని పాటిస్తారో, వారే యోగ్యులవుతారు. భిక్షువులారా! మరువకండి. మీరు నవవధువు మనసులాంటి మనసుతో ఉండాలి’’ అని చెప్పాడు.
ఈ ప్రబోధం ఈనాటికీ అందరికీ పనికివచ్చేదే! ఒక విద్యార్థి, రాజకీయ నాయకుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉద్యోగి... అందరూ ఈ మనసుతో ఉంటే -అందరి కర్తవ్య పాలన సక్రమంగా ఉంటుంది. అలక్షం, అరాచకం, అవినీతి మటుమాయమవుతాయి
*****
ధ్యానం అంటే ఏమిటి? ఆ స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి?’ అనే ప్రశ్న ఒక బాలుణ్ణి వేధిస్తూ ఉండేది. తల్లితండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను అడిగి తన సందేహం తీర్చుకోవడానికి అతను ప్రయత్నించాడు. కానీ సంతృప్తికరమైన సమాధానం ఎక్కడా దొరకలేదు.
చివరకు అతను తల్లితండ్రులతో కలిసి అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. స్వామిని దర్శించుకున్నాక... తన సందేహాన్ని ఆయన ముందు ఉంచాడు. ఆ ప్రశ్న విని శ్రీరమణులు నవ్వారు. అతణ్ణి తనకు దగ్గరగా కూర్చోమన్నారు. తన భక్త బృందంలో ఒకరిని పిలిచి... ‘‘వంట గది నుంచి ఒక దోశె తీసుకువచ్చి ఈ కుర్రాడికి ఇవ్వు’’ అని చెప్పారు.ఆ భక్తుడు అరిటాకులో దోశె తీసుకువచ్చి, ఆ బాలుడి ముందు ఉంచాడు.
‘‘నేను ఒకసారి ‘ఊ...!’ అంటాను. అప్పుడు మాత్రమే నువ్వు తినడం మొదలుపెట్టాలి. ఆ తరువాత మళ్ళీ ‘ఊ...’ అనే లోగా దోశె పూర్తిగా తినెయ్యకూడదు. కానీ నేను రెండోసారి ‘ఊ...’ అన్న తరువాత ఆకులో దోశె మిగలకూడదు’’ అని చెప్పారు.
ఆ కుర్రాడు అలాగేనని తల ఊపాడు.చుట్టూ ఉన్నవారు ఇదంతా ఆసక్తిగా చూస్తున్నారు. ‘స్వామి ‘ఊ...’ అని ఎప్పుడు అంటారా?’ అని ఆ కుర్రాడు ఆత్రుతగా నిరీక్షిస్తున్నాడు. రమణ మహర్షి ‘ఊ...’ అన్నారు. అతను తినడం మొదలుపెట్టాడు. ఒకవైపు దోశె తింటూనే, మళ్ళీ ఆయన నుంచి సంకేతం ఎప్పుడు వస్తుందా? అని శ్రీరమణులను గమనిస్తున్నాడు. ఆయన మరోసారి ‘ఊ...’ అనేలోగా దోశెను దాదాపు పూర్తి చెయ్యడానికి హడావిడి పడుతున్నాడు. పెద్ద పెద్ద ముక్కలు విరిచి తింటున్నాడు. చేతులు ఆ పని చేస్తున్నా, అతని దృష్టంతా రమణుల మీదే ఉంది.
ఆకులో దోశె ఓ చిన్న ముక్క మాత్రమే మిగిలింది. రెండోసారి స్వామి నుంచి సంకేతం రాగానే, ఆ దోశె ముక్కను నోట్లో పెట్టేసుకున్నాడు.‘‘నీ దృష్టి ఎక్కడుంది? నా మీదా? దోశె మీదా? అని అడిగారు శ్రీరమణులు.‘‘రెండిటి మీదా’’ అన్నాడు కుర్రవాడు.
‘‘అవును. నువ్వు దోశెను పూర్తి చెయ్యడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నావు. అదే సమయంలో నా మీద నీ దృష్టి నిలిపి ఉంచావు. ఇప్పుడు నువ్వు చేసింది ధ్యాన ప్రక్రియే. నీ దృష్టిని దేవుడి మీద ఏకాగ్రతతో నిలిపి ఉంచాలి. అదే సమయంలో నీ రోజువారీ కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉండాలి. అంటే... నడవడం, తినడం, మాట్లాడడం లాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ పనులన్నీ చేస్తున్నప్పటికీ... అన్ని సమయాల్లో మన మనసు మాత్రం దేవుడి మీదే లగ్నమై ఉండాలి. అదే ధ్యానం’’ అని చెప్పారు శ్రీ రమణులు.
మనిషి జీవితంలో అనేక ఒడుదొడుకులు, కష్టాలు, బాధలు, సంతోషాలు, సుఖాలు... ఇవన్నీ కలగలుపుగా ఉంటాయనేది సత్యం. ఒక్కొక్కసారి దైవం నిష్కళంకులైన భక్తులపై కరుణ కురిపిస్తాడు. అలాగే కష్టాలు, ఆందోళనలు కూడా వర్షింపజేస్తాడు. ‘‘ఓ దేవాది దేవా శ్రికృష్ణ నీవు నీ భక్తులైన వారికే అనేక కష్టాలు కలిగిస్తావు. వారినే ఎన్నో విధాలుగా పరీక్షిస్తున్నావు. నీకు నమ్మకమైన భక్తులు అన్నిటికీ నీమీదే ఆధారపడతారు. అలాంటివారిని ఎందుకు కష్టాలపాలు చేస్తున్నావు?’’ అని కుచేలుడు ఒకసారి శ్రీకృష్ణుడిని అడిగారు.
దానికి కృష్ణుడి బదులిస్తూ ‘‘నా ప్రియ భక్తులు ఈ లోకంలో కష్టాలను అనుభవించి... విశ్రాంతి కోసం మార్గాన్ని సులభతరం చేసుకుంటున్నారు. తద్వారా పరలోకంలో వారికి అన్ని విధాలా శుభాలు సమకూరుతాయి. మరణించిన తరువాత పవిత్రంగా, ఎలాంటి మచ్చా లేకుండా, పాపాల నుంచి విముక్తి పొంది నా వద్దకు రాగలరు. అందుకోసమే నా ప్రియభక్తులను కష్టాలకూ ఆందోళనలకూ గురి చేస్తున్నాను’’ అని చెప్పాడు.
ఈ ప్రపంచంలో ప్రవక్తలకన్నా దైవానికి అత్యంత ప్రియమైనవారు, ప్రేమాస్పదులు ఎవరుంటారు? వారు దేవునికి ఎంతో ఆప్తులు. వారితో ఆయనకు దగ్గర సంబంధం ఉంటుంది. దేవుడి సందేశాన్ని ప్రజలకు అందజేసేవారు మహర్షులే . కానీ, దైవానికి ఎంత దగ్గరవారైతే... అంత అధికంగా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రమణ మహర్షి ఆయనను ఎన్నో కష్టాలు, అనంతమైన బాధలు, అంతులేని ఆవేదనలు చుట్టుముట్టాయి. ఇటువంటివన్నీ తట్టుకున్నవారే దైవ సుఖాన్ని పొందుతారు. కాబట్టి వాటిని తట్టుకుంటూ, ఓర్పే ఆయుధంగా ముందుకు సాగడమే ఉత్తమం.
_____
ఒకసారి రమణ మహర్షి వారి సన్నిధికి ఒక మహిళ వచ్చింది. ‘‘నాకుమూర్ఛ వ్యాధి ఉంది. అది తలెత్తినప్పుడు నా ఒంటి మీద ఆచ్ఛాదన తొలగిపోతోంది. ఆ వ్యాధి నయం కావాలని నా కోసం సహాయం చెయ్యండి’’ అని విన్నవించుకుంది.
అప్పుడు రమణ మహర్షి ‘‘ఈ బాధలో సహనం వహిస్తేనీకు స్వర్గం లభిస్తుంది. లేదా నువ్వు కోరితే ఈ వ్యాధి నుంచి నీకు ఉపశమనం కలిగించాలని దేవుణ్ణి కోరుతూ అన్నారు.
అందుకు ఆమె బదులిస్తూ ‘‘సరే! అలాగైతే ఓర్పు వహిస్తాను. కానీ మూర్ఛ వచ్చినప్పుడు నా ఒంటిపై ఆచ్ఛాదన తొలగిపోకుండా ఉండాలని మాత్రం దైవాన్ని ప్రార్థించండి’’ అంది.
******
ధర్మ వీరుడు-కర్మయోధుడు
మహాభారతంలో భీష్మ పితామహుడి పాత్ర మహోన్నతమైంది. అటు మహర్షి వ్యాసుడు, ఇటు అవతారపురుషుడు కృష్ణుడితో సరితూగే వ్యక్తిత్వం ఆయనది. మూడు తరాల్ని చూసిన మహానుభావుడు. ఒక గొప్ప రాజ వంశం మహోన్నత స్థాయికి ఎదిగిన క్రమంలో ఆలంబనగా నిలిచాడు భీష్ముడు. తన కళ్లముందే క్షీణించిపోతుంటే నిశ్చలంగా గమనిస్తూ స్వచ్ఛంద మరణాన్ని ఆశ్రయించాడు. ఈ పరిణామ దశలన్నింటా ధర్మానికి కట్టుబడి స్థిరంగా మనుగడ సాగించిన మహా యోధుడు భీష్మాచార్యుడు. జీవిత పరమార్ధాన్ని కాచి వడబోసిన అనుభవజ్ఞుడాయన. మహాభారత కథ మొత్తానికి ఆయన కేంద్ర బిందువు. కురుక్షేత్ర యుద్ధం ఆరంభమవుతుండగా కవచం విప్పి ఆయుధాలను విడిచి ధర్మరాజు కాలినడకన పోయి భీష్ముడికి నమస్కరించాడు. సంగ్రామం సాగించడానికి అనుమతిని కోరాడు. తాము గెలుపు సాధించేలా దీవించమన్నాడు. శత్రుపక్షంలోంచి వచ్చి సమరాంగణంలో సాగిలపడిన ధర్మజుడి యుద్ధనీతికి భీష్ముడు ముగ్ధుడైపోయాడు. సంతోషంగా ఆశీర్వదించాడు. అయినా క్షాత్రధర్మాన్ని పాటిస్తూ సమరంలో అరివీరభయంకరంగా విజృంభించి పాండవ సైన్యాన్ని ఊచకోత కోశాడు. నాట్యశాస్త్రంలో భరతముని చెప్పిన యుద్ధ వీరం, దయా వీరం, దాన వీరాల్లో మొదటిదిది. దాంతో భీష్ముడు అజేయుడని అనుభవ పూర్వకంగా తెలిసిపోయింది ధర్మజుడికి. తొమ్మిదో రోజు రాత్రి రహస్యంగా పోయి భీష్ముడి కాళ్లమీద పడ్డాడు. కరిగిపోయిన తాతగారు తనను పడగొట్టే ఉపాయం చెప్పేశాడు- ఎందుకంటే ధర్మరాజును ఆయన ఎన్నడూ శత్రువుగా చూడలేదు! ఇది దయావీరానికి సరైన గుర్తు. అందుకే భీష్ముణ్ని 'త్యాగైకధనుడు' అని కీర్తించింది లోకం. త్యాగం కారణంగానే లోకంలో అమృతత్వ స్థితి సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇది భీష్ముడి లౌకిక జీవన కోణం.
ఆచార్యుడు అనే పదం ఆధ్యాత్మిక పరిభాషలో చాలా ఉన్నతమైంది. శాస్త్ర విషయాలను సమగ్రంగా ఆకళించుకొని ఆచరణ పూర్వకంగా వాటిని పోగుచేసి శిష్యులకు పంచిపెట్టేవాడని ఆ మాటకు అర్థం. శాంతిపర్వంలోని ధర్మజ- భీష్మ సంవాదమంతా నిజానికి ఉదాత్త జ్ఞానయజ్ఞం. దాని లక్ష్యం లోకహితం. 'అక్షర యజ్ఞంతో నేను కృష్ణుని అర్చిస్తున్నాను' అని భీష్ముడే అన్నాడు. రాజ ధర్మం, సాంఘిక వ్యవస్థ, ఆధ్యాత్మిక తత్త్వం, సృష్టిక్రమం, మృత్యుస్వరూపం, యోగం,
సాంఖ్యం, శివవిష్ణు పారమ్యాలు, నీతులు... ఇలా ఎన్నో వివరించాడు భీష్ముడు. ఇది జ్ఞాన, దాన వీరాలకు ప్రతీక.
'భీష్ముడి లాంటి వ్యక్తి ముల్లోకాల్లోనూ లేడు. సత్యం, తపస్సు, దానం, యజ్ఞాధికరణం, వేదవిద్యలు, నీతి... వీటిని ఆచరించాడు, పోషించాడు. ధార్మిక జీవనంతో, బ్రహ్మచర్య వ్రతంతో భీష్ముడు ఆజన్మాంతం అగ్నిహోత్రంలా మనుగడ సాగించాడు' అని సాక్షాత్తు శ్రీకృష్ణుడు ప్రకటించాడు. భీష్ముడు లోకానికి అందించిన శ్రీకృష్ణ స్తవరాజం' వాస్తవానికి సర్వ ఉపనిషత్తుల
సారాంశం. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ భీష్ముడు ధ్యానించింది- మృత్యువును కాదు, అమృతత్వ స్థితిని! దాని ఫలితమే చివరి దశలో పల్లవించిన భీష్మస్తుతి. అలాగే కృష్ణుడి ప్రేరణతో
ఉద్భవించింది-విష్ణుసహస్రనామస్తోత్రం.వీటి కారణంగా లోకం ఆయనకు రుణపడి పోయింది.
✍🏻ఎర్రాప్రగడ రామకృష్ణ
వితస్తా నదీ తీరంలో కర్దముడనే మహర్షి ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో ఎందరో శిష్యులు ఎన్నెన్నో విద్యలను నేర్చుకునేవారు. ఆ విద్యలతో భుక్తిని పొందినవారు కొందరు. ముక్తిమార్గాన్ని పట్టినవారు కొందరు. అక్కడ లోకాన్వేషి, దేవాన్వేషి, బ్రహ్మాన్వేషి అని ముగ్గురు శిష్యులు ఉండేవారు. వారు వారి పేర్లకు తగిన విధంగా వరుసగా లోకాన్ని, దైవాన్ని, బ్రహ్మతత్త్వాన్ని అన్వేషించేవారు. లోకాన్వేషి మిగిలిన ఇద్దరినీ చూసి నవ్వుతుండేవాడు. చార్వాకం అంటే అతనికి చాలా ఇష్టం. చార్వాకం చారు వాక్యముల సముదాయం అనేవాడు. మనకు కనబడే ప్రపంచం కన్నా వేరేమీ సత్యం లేదనే వాడు.
రెండో వాడు.. ‘మనకు కనబడని ఆ దేవదేవుడు మహేశ్వరుడు ఈ జగత్తుకు ఆధారం’ అనే వాడు. ఆ కనబడే త్రిమూర్తులకు కూడా మూలం నిర్గుణ పరబ్రహ్మమే అని మూడో శిష్యుడు నిర్గుణ బ్రహ్మోపాసన చేస్తూ ఉండేవాడు. గురువు వారి అభిరుచులకు తగిన విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాడు. కాలం గడిచిన కొద్దీ లోకాన్వేషి ఎగతాళి మాటలు ఎక్కువ అవుతున్నాయి. ‘దేవుడు ఉంటే ఈ చెట్లూ, కొండలు, గుట్టలు, నదులు ఇవన్నీ కనబడినట్లు కనబడాలి కదా?’ అని అడిగేవాడు. ‘నిర్గుణ బ్రహ్మోపాసన అంటే శూన్యాన్ని ఉపాసించటమే కదా?’ అనేవాడు. ఈ మాటలు గురువు చెవిని పడ్డాయి.
ఒకరోజు ఆయన.. లోకాన్వేషిని తన ధ్యానకుటీరానికి పిలిచాడు. అతనిని ఆ విషయాలు, ఈ విషయాలు అడుగుతూ.. ‘‘మన తాళపత్ర గ్రంథాలయంలోని ‘శాస్త్రతత్త్వ రహస్య చంద్రిక’లో పదహారో పత్రంలో ఉన్న విషయం ఏమిటో వివరించు’’ అని ప్రశ్నించాడు. దానికి లోకాన్వేషి.. ‘‘గురువర్యా! నేను ఆ గ్రంథాన్ని ఎప్పుడూ చూడలేదు. కనుక మీరు చెప్పిన పత్రంలో విషయాన్ని ఎలా చెప్పగలను?’’ అని అన్నాడు. ‘‘ఆ గ్రంథశాలలోకి వెళ్లకుండా, ఆ విషయాన్ని చూడకుండా అది ఉందో లేదో చెప్పలేవు కదా?’’ అని కర్దముడు అడిగాడు. లోకాన్వేషి ఔనని తలూపాడు.
అప్పుడు గురువు.. ‘‘సరే. దగ్గరకు రా.’’ అని అతని తల పై తన కుడిచేతి బొటన వేలు అదిమిపెట్టి ఉంచాడు. కళ్లుమూసుకోగానే శిష్యుడు గ్రంథాలయంలో ఆ గ్రంథం దగ్గరకు చేరుకున్నాడు. అందులో తనకు కావాల్సిన పత్రాన్ని చదివాడు. తిరిగి చూసేసరికి గురువు దగ్గర ధ్యాన కుటీరంలో ఉన్నాడు. తాను భౌతికంగా కదలకుండానే గ్రంథాలయంలో ఆ గ్రంథాన్ని చూడగలగడం ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు గురువు అతడితో.. ‘‘ఎవరు ఏ పరిధిలో ఉంటే వారికి ఆ పరిధికి చెందిన జ్ఞానం లభిస్తుంది. నువ్వు ఆధిభౌతిక క్షేత్రంలో ఉండి ఆధిదైవిక అనుభవాన్ని, ఆధ్యాత్మికానుభవాన్ని పొందాలంటే కుదురుతుందా? అది సాధ్యం కావాలంటే మన దేహానికి సాధన అవసరం. ఈర్ష్యాసూయలకు అతీతంగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడు నీ హృదయం దేవతానిలయం అవుతుంది. దేవతానుగ్రహంతో నిర్గుణ పరబ్రహ్మ అనుభవమూ సాధ్యమవుతుంది. యోగం ద్వారా ఆధిదైవిక క్షేత్రంలోకి, ఆధ్యాత్మిక క్షేత్రంలోకి కూడా వెళ్లవచ్చు.
నిన్ను నువ్వు పొగుడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సరళత, ఇంద్రియ ఆకర్షణకు లోనుకాకపోవడం, దైవం పట్ల సడలని నమ్మకం, ఏకాంత స్థలంలో ఉపాసన వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు నీలో దైవీ శక్తి పెరుగుతుంది. మన అనుభవంలోకి రానంత మాత్రాన అది లేదు అనరాదు’’ అని చెప్పాడు. దీంతో, లోకాన్వేషికి కర్తవ్యం తెలిసి వచ్చింది. శిష్యులు ముగ్గురూ మంచి సాధకులుగా పేరు తెచ్చుకున్నారు.
*****
ఆధునిక యుగంలో సులభంగా తరింపజేసేది భక్తి మార్గం. సామాన్యంగా భక్తుడైనవాడు భగవంతుణ్ని ఎందుకోసం ప్రార్థిస్తాడు? సాంసారికమైన కష్ట నష్టాలను తొలగించడానికో! ఏవో కోరికలు సాధించుకోవడానికో! అయితే, ఎంత సేపూ ఏదో కోరడానికేనా భగవంతుడున్నది! అసలు మనం కోరినవన్నీ ఆయనెందుకు ప్రసాదించాలి? కోరుకోకుండా ఉండలేమా!!
కోరేతీరుగా కోరితే భగవంతుడిచ్చే తీరుగా ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా సరే! కానీ, ఎన్నాళ్లీ కోరికలు-అని భక్తుడైనవాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, చేసుకోకపోతే ఉన్నచోటే ఉంటాడు. సరే! ప్రాథమిక దశలో ఏవో కోరినా, అవి తీరినా, ఎన్నడో ఒకనాడు ఏదీ కోరని స్థితికి చేరుకోవలసి ఉంది.
‘నాకు వ్యాపారంలో బాగా లాభాలు రావాలి. కోట్ల రూపాయలు రాబడి వస్తే గుడి గోపురం కట్టిస్తాను. నాకీ పదవి వస్తే నీకీ పూజలు జరిపిస్తాను’ ఇలాంటివి అన్నీ హేతువుతో కూడుకున్న కోరికలు. ‘నాకిది ఇస్తే నీకిది ఇస్తా’- అనడం చిన్నపిల్లల మనస్తత్వమే కానీ మరొకటి కాదు. విధి లేక కొన్నేండ్లు ఏవో కోరికలు కోరి భగవంతుడి అనుగ్రహంతో నెరవేర్చుకోగలిగినా, యథార్థమైన భక్తుడు కోరికల పట్ల విసుగు చెందుతాడు. కోరడం మానుకుంటాడు. కానీ, భగవంతుడిని సేవించడం మాత్రం మానుకోడు. భగవంతుడి పట్ల ప్రేమ అంటే అదే! ‘సా పరమ ప్రేమ రూపా’ అని నారదుడు చెప్పిన భక్తి ప్రేమరూపం అటువంటిదే!కోరికల పట్ల విసుగు రాలేదంటే అతని భక్తి పరిపక్వ దశకు చేరుకోలేదని భావించాలి.
జగదీశ్వరా! నాకు ధనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు, జన్మజన్మాంతరాల్లో నీయందు అహేతుకమైన భక్తి నెలకొని ఉండును గాక! అని దేవుడిని అర్థించాడు. ‘ఎందువల్లనో తెలియకుండానే భగవంతుణ్ని భజించడం కూడా ఉంది. ఈ స్థితి లభించిందా ఇక కోరదగ్గది ఏదీ ఉండదు. ఇలాంటి భక్తిని పొందిన వ్యక్తి ఇలా అంటాడు.. ‘పరమేశ్వరా! నాకు ఐశ్వర్యం వద్దు. కీర్తి వద్దు, సౌఖ్యం వద్దు, మరేమీ వద్దు- నీ పాదారవిందాల్లో నాకు వినిర్మల భక్తిని అనుగ్రహించు. అదే నాకు కావలసింది’ అంటారు రామకృష్ణ పరమహంస.
మనకేదో ఆపద కలిగితేనో, అవసరం ఏర్పడితేనో దేవుడు గుర్తుకువస్తాడు. అలాకాకుండా ఆపద కలిగినా, కలగకపోయినా, అవసరం ఏర్పడినా, ఏర్పడకపోయినా భగవంతుడు అనుకోకుండా గుర్తుకురావాలి. ఎప్పుడో ఒకసారి గుర్తుకురావడం కాదు. గుర్తులోనే ఉండాలి ఎప్పుడూ మరచిపోవడం అనేదే ఎప్పుడో ఒకసారి జరగవలసి ఉన్నది. అది కూడా జరగకపోతే మరీ మంచిది! భగవంతుడు తప్ప నాకు మరేదీ అక్కర లేదు..అనే స్థితి అదే! అటువంటి స్థితి ఆత్మారాములైన మునులకే సిద్ధిస్తుందని భాగవతం పేర్కొంటున్నది.
ఆత్మారాముడు అంటే ఎప్పుడూ ఆత్మయందు రమించేవాడు, ఆత్మ చింతనమే చేసేవాడని. మునులు అంటే మౌనమే ప్రధానంగా అవలంబించే వారని అర్థం. అలాంటివారు నిష్కారణంగానే హరిని సేవిస్తూ ఉంటారు. ‘సా న కామయమానా నిరోధ రూపత్వాత్’ అనీ, ‘కామనా రహితం, ప్రతిక్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం’ అని నారదుడు భక్తి సూత్రాలలో ప్రతిపాదించిన పరాభక్తి అదే!
పాండవుల తరఫున రాయబారిగా హస్తినకు వచ్చాడు కృష్ణుడు. పాండవులకు అర్ధ రాజ్యం ఇవ్వమనీ, కానిపక్షంలో ఐదుగురు అన్నదమ్ములు తమకు ఐదు ఊళ్లు ఇచ్చినా చాలన్నారనీ ధృతరాష్ర్టుడిని కోరుతాడు. దుర్యోధనుడు ససేమిరా అనడంతో ధృతరాష్ర్టుడు మిన్నకుండిపోతాడు. యుద్ధం అనివార్యమైతే జరగబోయే అనర్థాలను వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఎవరెన్ని చెప్పినా దుర్యోధనుడు పట్టువీడకపోవడంతో యుద్ధం తప్పదన్న నిశ్చయానికి వస్తారంతా! శ్రీకృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత ధృతరాష్ర్టుడికి భయం ఆవహిస్తుంది. యుద్ధం ఎటు దారితీస్తుందో అని లోలోపల మథనపడుతుంటాడు. ఆ సమయంలో సోదరుడైన విదురుడితో మాట్లాడితే తనకు ఊరట లభించవచ్చని అతణ్ని తన మందిరానికి రమ్మని పిలిపిస్తాడు.
కంటిమీదికి కునుకు రాక కకావికలమవుతున్న ధృతరాష్ర్టుడిని చూసి విదురుడు.. ‘మహారాజా! మీకు నిద్రపట్టడం లేదంటే విచిత్రంగా ఉంది. బలవంతుడితో విరోధం తెచ్చుకున్న బలహీనులకు, పరుల సొమ్ము దోచుకున్నవారికి, కామోద్రేకాలను అదుపు చేసుకోలేని వారికి, దొంగలకు మాత్రమే రాత్రి నిద్రపట్టదని శాస్త్ర వచనం. మీరు అలాంటి వ్యక్తి కాదని తెలుసు. మరెందుకు నిద్రలేమితో బాధపడుతున్నారు?’ అంటాడు.
విదురుడు నాడు ధృతరాష్ర్టుడిని అడిగిన ప్రశ్న.. ప్రతి ఒక్కరు ఎవరికి వారు వేసుకోవాలి. ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించినప్పుడు గుండెల మీద చెయ్యి వేసుకున్నప్పుడు సమాధానం లభిస్తుంది. అంతరాత్మ చెప్పే సమాధానం అది. ఎవరికి వాళ్లు చెప్పుకొనే సమాధానం. ఆ జవాబును స్వీకరించగలిగిన వ్యక్తికి నిద్రాయోగం తప్పక కలుగుతుంది. అదే జవాబు గుండెలో శూలంలా గుచ్చుకుందంటే ఏదో పొరపాటు చేసినట్టే! ఆ జవాబు చెప్పేది మరెవరో కాదు. అంతరాత్మే! అదిచ్చే జవాబు ఆధారంగా ఎవరికి వాళ్లు తమ తమ వ్యక్తిత్వాలను సులభంగా అంచనా వేసుకోవచ్చు. ఆ జవాబును స్వీకరించే ఆత్మబలం కూడా ఉండాలి. అలా కాకుండా, అంతరాత్మను కూడా మభ్యపెట్టి సమాధానాన్ని దాటవేస్తూ పోతే, చివరికి ఆ వ్యక్తి పతనమవడం ఖాయం.
ఈ అంతరాత్మకు సంజాయిషీ ఇచ్చుకోలేక, అది చెప్పే సమాధానాన్ని స్వీకరించలేక అధోగతిపాలైన ఎందరో పురాణాల్లో మనకు కనిపిస్తారు. తపోధనుడైన రావణుడు అలాగే అంతరాత్మను చంపుకొన్నాడు. తనను తోకకు చుట్టి, సముద్రాల్లో ముంచి, ముప్పుతిప్పలు పెట్టిన వానరరాజు వాలిని ఒక్కవేటున సంహరించిన వీరుడు రాముడే అని తెలిసినా అతనితో వైరం కోరి తెచ్చుకున్నాడు. పైగా, రాముడి కన్నా తానే అధికుడనని అంతరాత్మకు సర్దిచెప్పుకొన్నాడు. సొంత తమ్ముడు విభీషణుడి హిత వచనాలు పెడచెవిన పెట్టాడు. యుద్ధం విరమించమని కుంభకర్ణుడు హెచ్చరించినా లక్ష్యపెట్టలేదు. రాముడి తేజస్సు ముందు తాను నిలబడనని అంతరాత్మ ఘోషిస్తుంటే నిద్రలేని రాత్రులు గడిపాడు. తన తప్పిదాన్ని బలవంతంగా కప్పిపుచ్చుకున్నాడు. చివరికి రాముడి చేతిలోనే హతమయ్యాడు.
అంతరాత్మ చెప్పేమాట ఆలకిస్తే, చాలా సమస్యలకు పరిష్కారం లభించినట్టే! ఏది తప్పు, ఏది ఒప్పు నిర్ధారించగల శక్తి దానికే ఉంది. ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఇంకెవరో ఉపదేశించాల్సిన అవసరమూ లేదు. ఎవరికి వారు సమాధానం చెప్పుకోగలగాలి. అప్పుడు, చేసిన తప్పు తెలుసుకొని, పశ్చాత్తాపం చెందే మహదవకాశం లభిస్తుంది. అవకాశం ఉంటే ఆ తప్పును దిద్దుకునే పరిస్థితులూ ఏర్పడతాయి. వాటిని పునరావృతం చేయకుండా ఉండే బుద్ధి కలుగుతుంది. ‘ద్వేషాన్ని ద్వేషంతో జయించలేం. క్రోధాన్ని శాంతంతో, దుష్టులను మంచిమాటలతో, లోభాన్ని దానగుణంతో, అసత్యాన్ని సత్యంతో జయించాల’న్న విదురుడి మాటలు అక్షర సత్యాలు. ఒక వ్యక్తిలో ఉన్న దుర్గుణాలు ఎదుటివాళ్ల కన్నా, ఆ వ్యక్తికే మరింత బాగా తెలుస్తాయి. ఆ నిజాన్ని ఒప్పుకోలేక తప్పుదారిలోనే ప్రయాణిస్తూ ఆత్మవంచన చేసుకుంటారు చాలామంది. కానీ, ఆ అంతర్మథనంలో వెలువడిన కాలకూటాన్ని పక్కకునెట్టి అమృతాన్ని ఆస్వాదించగలిగితే నిద్రలేని రాత్రులుండవు.
No comments:
Post a Comment