Sunday, 27 February 2022

02-03-2022

 

 

 
 🍁యధార్థం - మాయాజాలం - జీవితం 🍁

ధనమున్నదని... అనుచరణ గణం ఉన్నదని.. యౌవనం ఉన్నదని, ఈరోజు మానవుడు గర్విస్తాడు...

ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి...
ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు...

ధన జన యౌవన గర్వం...!!

కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు...
వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు...
అంతా డబ్బే , డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు, అన్నింటిని డబ్బుతోనే వి…
ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు!
➖➖➖✍️
- గురుమంచి రాజేంద్రశర్మ.


ఒక స్త్రీ కొండపైనుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చాల ఎత్తయిన కొండ పైకి ఎక్కింది. మరో పది అడుగులు వేస్తే దూకుతుందనగా కాలికి ఏదో తగిలింది. క్రిందికి చూస్తే ఏదో మెరుస్తూ కనిపించింది. ఆమె ఒక కొయ్య సహాయంతో ఆ మెరిసే వస్తువును భూమిలోంచి బయటకు తీసింది.

అది ఒక దీపం. దానికి అంటుకున్న దుమ్ము దులుపుతున్నపుడు ఒక చిన్న మెరుపు వచ్చి అందులోంచి ఒక భూతం బయటకు వచ్చింది.

ఆమె ఆ భూతాన్ని చూసి మొదట భయపడింది. కానీ,ఆ భూతం కొంచెం మనిషిలాగే ఉండడం, అదీగాక చావాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ దయ్యాలకూ, భూతలకూ భయపడడమేమిటని ధైర్యంగా ఆ భూతాన్ని "ఎవరు నువ్వు?" అని అడిగింది.

"నేనొక భూతాన్ని ! బహుశా నీకు కాబోయే స్నేహితురాలిని కూడా కావచ్చు ! నా వివరాలు తర్వాత చెబుతాను. ముందు నీ విషయం చెప్పు! నువ్వు ఎందుకు చావాలని నిర్ణయించుకున్నావు? నీ సమస్య ఏమిటో చెబితే నాకు వీలైతే పరిష్కారం చెబుతాను." అన్నదా భూతం.

‘చెబితే నష్టమేమిటి? దొరికితే పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే 'చావు' పరిష్కారం ఉండనే ఉంది’. అని ఆలోచించి తన కష్టాలు చెప్పసాగింది.

"నా మనస్సు కు సుఖమనేదే లేదు.
నా తల్లిదండ్రులు నన్నర్థం చేసుకోలేదు. ఇష్టం లేనివాడికిచ్చి పెళ్లి చేశారు. సరే పోనీలే ! అని అడ్జెస్ట్ అయ్యాను. కానీ, చేసుకున్న మొగుడు కూడా నన్నర్థం చేసుకోవట్లేదు. నామాట లెక్క చేయడు. నేను కన్న పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు విలువ ఇవ్వడం లేదు. ఆఫీస్ లో నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు. చివరకు పొరుగింటివారు, కొలీగ్స్ ఎవరి వద్ద నాకు విలువ లేదు. దీంతో నా మనస్సులో భరించలేని ఒంటరితనం ఏర్పడి విలువ లేని ఈ బ్రతుకు వద్దనుకుని చచ్చి పోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి ఇది ఆవేశంతోనో- దుఃఖంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. నిరాశా - నిర్లిప్తతతో తీసుకున్న నిర్ణయం .

ఆమె మాటలు విన్న భూతం ఇలా అంది…

"నిజమే! మీరంతా సామాజిక జీవులు. మీరు ఏం చెయ్యాలన్నా చుట్టూ ఉన్న వారి ప్రమేయం ఉండాలి. ఆమోదం ఉండాలి. సహకారం ఉండాలి. ఎంత ధీమాగా ఒంటరి పయనానికి తెగించినా కొన్ని అడుగుల తర్వాత మరి కొన్ని అడుగులు జత కలవాల్సిందే. అందుకే ఇతరులు అర్థం చేసుకోవాలని కోరుకోవడం చాలా సహజం.

మరి అలా జరగనప్పుడు ఏంచెయ్యాలి?

ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. అసలు నిన్ను అర్థం చేసుకోవలసిన అవసరం అవతలి వాళ్ళకేముంది?

నిజమే! నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి ఆలోచించడం సహజం కదా! నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే, నీ అవసరం వాళ్లకు ఉందా? అని ఆలోచించు! వాళ్లకు కావలసిన అర్హతలు నీ దగ్గర ఏమున్నాయో చెక్ చేసుకో!

ఎందుకంటే అవసరం లేనిదే ఎవరూ ఏపనీ చేయరు! ఎంత సొంత వారైనా నిన్ను అర్థం చేసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. సరే! వాళ్ళకు నీ అవసరం లేదని తేలిపోయింది. మరిప్పుడు ఎలా? నీ కర్మ ఇంతే అనుకుందామా? కానేకాదు. ఇప్పుడిలా ప్రశ్నించుకో!

నీకు వాళ్ళ అవసరం నిజంగా ఉందా?

ఇది కూడా నిజమే!

ఒక్కోసారి మనం అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 'అవతలి వారికి వారి అర్హతలకు మించిన స్థానాన్ని ఇచ్చి బాధపడిపోతుంటాం'.

ఉదాహరణకు ఒక సంస్థలో నీకు గుర్తింపు లేకపోతే మరో సంస్థను వెదుక్కోవచ్చు. ఒకరు నిన్ను తిరస్కరిస్తే మరొకరు నిన్ను ఆదరించవచ్చు. అయితే అన్ని సందర్భాలలోనూ అందరినీ ఒదులుకోలేము కదా! కూతురినో, భర్తనో అలా వదిలేసుకుంటామా? ఒక్కోసారి ప్రేమించిన వాళ్ళను కూడా ఒదులుకోలేకపోవచ్చు! అప్పుడేం చేద్దాం ?

ఇంకేం చేస్తాం ? మన ఫిర్యాదును వెనక్కి తీసుకుందాం! వెనక్కి అంటే వ్యాకరణం మార్చి చదువుదాము.

" నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు!"

దీన్నే మరోలా చదువుదాం " నేను ఎవరికీ అర్థం కావట్లేదు " ఎలా ఉంది? రెండింటి లో తేడా ఉంది కదా!
మొదటి దాంట్లో నిన్ను అర్థం చేసుకోలేక పోవడం ఎదుటివారి తప్పు అన్నట్టుగా ఉంది. రెండో దాంట్లో తప్పు నీలోనే ఉంది.
అవును! మనకు సంబంధించిన ప్రతి సమస్యకూ చాలావరకు మన దగ్గరే పరిష్కారాలు ఉంటాయి. ఇదీ అంతే !

నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అంటే దానర్థం నువ్వు ఎవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నావని.

ఇప్పుడు రెండే దారులు.

ఒకటి నువ్వు మారాలి. అంటే ... నీ వైపు నుంచి కాకుండా అవతలి వైపు నుంచి ఆలోచించాలి. నీలో లోపాలున్నాయి అనిపిస్తే సరిదిద్దుకోవాలి.

ఇక రెండోది.

నిన్ను నువ్వు సరిగా చూపించుకోవాలి. నువ్వేంటన్నది కొత్తగా నిరూపించుకోవాలి. నీ అభిప్రాయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయాలి. సరిగా అంటే ఎలా అనేది సందర్భాన్ని బట్టి నువ్వే ఆలోచించుకోవాలి. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఈ నైపుణ్యాలు ఉంటేనే లోకానికి కనబడతావు. సమాజం నిన్ను గుర్తిస్తుంది.

నీ ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక ఆరు నెలలు వాయిదా వేసుకో!
ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలను మరో ఆరు నెలలు అనుభవించడానికి సిద్ధపడు. అంతే కాదు వీలైతే మరింత ఎక్కువగా అనుభవించు !
నేను చెప్పిన విషయాలను ఈ ఆరు నెలలు సాధన చెయ్యి! తర్వాత వచ్చి నీ అనుభవాలు చెప్పు!
ఫలితమేమీ లేకుంటే చచ్చి పోయే నిర్ణయం నీ చేతిలోనే ఉంది. చివరగా మరొక్క మాట!

ఇతరుల విలువనూ,గౌరవాన్ని కోరుతున్న నువ్వు 'స్వయంగా నీకు నువ్వు ఇచ్చుకునే విలువా, గౌరవం ఎంతో ఒక పెన్ను పేపర్ పెట్టుకుని విశ్లేషించుకో! " అంటూ సుదీర్ఘమైన పరిష్కారాన్ని సూచించింది ఆ భూతం.

భూతమిచ్చిన ఈ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని విన్న ఆ స్త్రీ "ఇదేదో చచ్చేవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఇచ్చిన భూతములాగుంది.
అయినా మనుషుల కన్న ఈ భూతమే నయం. నా గోడు విని పరిష్కారాన్ని సూచించిన మనిషి ఒక్కడూ లేడు. ఒకసారి దీని మాట కూడా విని చూద్దాం! అనుకుని, "సరే! ఆరు నెలల తర్వాత వచ్చి కలుస్తాను." అంటూ ఆ దీపాన్ని యథా స్థానంలో వుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ.

ఆరు నెలలు గడిచిపోయాయి.

ఆ స్త్రీ వచ్చింది. భూమి లోంచి ఆ దీపాన్ని తవ్వి తీసి రాచింది. అందులోంచి భూతం బయటకు వచ్చి ఆనందం తో వెలిగిపోతున్న ఆ స్త్రీ ముఖం చూసి,
"ఏం జరిగింది? " అని అడిగింది.

"ఏం చెప్పాలి? ఒకటా ? రెండా? అన్నీ మార్పులే!" అంది నవ్వుతూ.

ఆత్మవిశ్వాసం తో కూడిన స్వచ్ఛమైన ఆమె నవ్వును భూతం విస్మయంగా చూస్తూవుంటే ఆ స్త్రీ చెప్పసాగింది…

ఇన్నిరోజులు నా అశాంతినీ, ఒంటరితనాన్నీ మరిచిపోవడానికి 'టీ.వి' కి బాగా అలవాటు పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నన్ను ఆలోచించకుండా చేస్తూ, నా సమయాన్నంతా తినేస్తున్న టీ.వీ అలవాటును అరగంటకు కుదించాను.
అంతకు ముందు టి.వి చూస్తూ, పాటలు వింటూ, ముచ్చట్లు పెడుతూ, మధ్యమధ్య ఫేస్బుక్ - వాట్సప్ లు చెక్ చేస్తూ నేను చేసే ఏకాగ్రత లేని పనుల వల్ల రోజంతా బిజీగా ఉన్నాగానీ నా పనులు తెమిలేవి కావు.
ఇప్పుడు చేసే పనిలో లీనమై ఏకాగ్రతగా చేయడం వల్ల పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా చాలా సమయం మిగులుతుంది కూడా !.

డైరీ రాయడం ప్రారంభించాను.నా బలాలూ, బలహీనతలు అర్థమవ్వసాగాయి.

మనస్సులో అశాంతిగా ఉండడం వల్ల రాత్రిళ్లు అనవసర కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే దానిని.

ఆలస్యంగా నిద్ర లేచిన నేను పిల్లలకు స్కూల్‌ బస్ వచ్చే టైం అవుతుందని నేను టెన్షన్ పడుతూ పిల్లలను కూడా టెన్షన్ పెడుతూ గట్టిగా అరుస్తూ నిద్ర లేపే దానిని. అలాగే అరుస్తూనే వాళ్లను రడీ చేయించేదాన్నీ.

నాకు తెలియకుండానే పిల్లలకు కూడా ‘టెన్షన్ పడడాన్నీ, అసంపూర్తిగా పనులు చేసే విధానాన్నీ అభ్యాసం చేయిస్తున్నాను’ అన్న విషయాన్ని గమనించలేకపోయాను.

“నీకు తెలుసా! గతంలో నీ దగ్గరకు వచ్చే వరకూ నా పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపి కావలించుకున్న సందర్భం ఒక్కటీ లేదు."

“ఇప్పుడు నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను.

ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేస్తున్నాను. వెంటనే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఒక పదినిమిషాలు హృదయ పూర్వకంగా నా ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని ప్రార్థించి నా భర్తాపిల్లలను నిద్ర లేపుతున్నాను.

నాలో ఆత్మ విశ్వాసమూ, జ్ఞానం పెరుగుతున్న కొద్ది అనవసర అనుమానాలూ, మూఢ నమ్మకాలు తొలగిపోసాగాయి.

అంతకుముందు స్నానం తర్వాత ప్రక్క బట్టలు ముట్టుకోకూడదని దూరంగా ఉండి అరుస్తూ నిద్ర లేపే దాన్ని.

రాతి విగ్రహంలోనే దేవున్ని దర్శించే నేను,నా భర్తాపిల్లలలో దర్శించలేనా?

కృష్ణ జయంతి రోజు కృష్ణవిగ్రహాన్ని పడుకోబెట్టి ఊపే ఉయ్యాల ఎంత పవిత్రమైనదో నా భర్తాపిల్లలు పడుకునే మంచం - బట్టలు అంత పవిత్రమైనవి కావా ?

అందుకే నా పిల్లలకు "యశోద"నయ్యాను.

నా భర్త కు "రాధ"నయ్యాను.

అలా ప్రేమగా నా భర్తాపిల్లలను నిద్ర లేపి వాకింగ్ తీసుకెళ్ళడం ప్రారంభించాను. అంతకుముందు ప్రతిదానికి ఎదురు చెప్పే నా భర్తాపిల్లలు మారు మాట్లాడకుండా నాతో ఉత్సాహంగా వాకింగ్ కు రాసాగారు.

ఆ ప్రభాతసమయంలో చల్లని పిల్లగాలులు వీస్తూ ఉండగా నా కుటుంబంతో కలిసి నేను ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ నడుస్తూవున్నప్పుడు భరించలేని నా ఒంటరితనమంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయింది.

నాకు ఇంగ్లీషు లో బాగా మాట్లాడాలని కోరిక. కానీ, చాలా భయపడేదాన్ని. ఒక రెండు నెలలు తీవ్రంగా శ్రమించి, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడడాన్ని అభ్యాసం చేశాను. మా ఆఫీసు మీటింగ్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూసి తర్వాత చప్పట్లతో నన్ను అభినందించారు.

నా భర్తాపిల్లలను కారులో కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేస్తూ కారులో ప్రయాణించాలని కోరికగా ఉండేది. కారు డ్రైవింగ్ నేర్చుకుని ఆ కోరికా తీర్చుకున్నాను.

చెబితే నమ్మవు కానీ, ఈ వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకుని నా భర్తతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరిక తీర్చుకున్నాను. ఈ సెలవులలో నా పిల్లలకూ స్విమ్మింగ్ నేర్పించి నా కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరికను కూడా తీర్చుకుంటాను. ఇది విని ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నాని అనిపించవచ్చు ! కానీ, ఒక స్త్రీకి తన కుటుంబం తో కలిసి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వల్ల పొందే తృప్తి వెలకట్టలేనిది.

నాలో ప్రశాంతత పెరిగిన కొద్దీ నా భర్త కూడా నాకు అర్థమవ్వసాగాడు. అతనొక జర్నలిస్టు. తన వృత్తిని బాగా ప్రేమిస్తాడతడు. ఒక విషయాన్ని చూసి అందులోని మంచి - చెడులను విశ్లేషించే తత్వం అతని నుండి వేరు చేయలేంతగా అతనిలో జీర్ణమైపోయింది.
అతనిలో అభ్యాసమైన ఈ గుణం వల్ల గతంలో నాలోని మంచి - చెడులను కూడా విశ్లేషించేవాడు. నాలోని పొరపాట్లు గూర్చి ఆతను చెబుతున్నపుడు నేను అవేశం తో రగిలిపోయేదాన్ని.

గతంలో ‘నేను తలదువ్వుకుని చాలా సార్లు దువ్వెనకు అలాగే వెంట్రుకలుంచే విషయం గొడవగా మారి ఒక పదిరోజులు మాట్లాడుకోని సంగతి’ గుర్తుకువస్తుంది.

ఇంత చిన్నవిషయం గూర్చి ఇతనికెందుకు పట్టుదల? అని ఆలోచించేదాన్ని.
కానీ అది చిన్న విషయం కాదనీ, నాలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికీ - నిర్లిప్తతకు గుర్తని ఇప్పుడు నాకర్థమౌతోంది.
ఇలా అతన్ని వృత్తితో సహా అర్థం చేసుకున్న తర్వాత అతను నాకు అర్థమవ్వసాగాడు. క్రమంగా అతడు అర్థమౌతున్నకొద్ది అతని అద్భుతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాను.

అతను నాపట్ల ఆసక్తి చూపాలంటే, అతనికిష్టమైన విషయాల్లో నేనూ ఆసక్తి చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని నేను గ్రహించాను. పేపర్ లో వచ్చిన అతడు రాసిన వార్తలనూ, వ్యాసాలనూ శ్రద్ధగా చదివి విశ్లేషించి అతన్ని ప్రోత్సహించడం ప్రారంభించాను.

నాలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును చూసి నా భర్త మొదట్లో నా మీద విపరీతమైన గౌరవంతో కొన్ని రోజులు దగ్గరకు రావడానికే ధైర్యం చాలక తటపటాయించాడు. నేనూ కొన్ని రోజులు బింకాన్ని నటించి, అతని ఇబ్బందిని చూసి ఫక్కున నవ్వేసి వెళ్లి కావలించుకున్నాను.

ఇప్పుడు నాకు కుటుంబసభ్యులతో పట్టుదలలు లేవు. అన్నీ పట్టు విడుపులే !

నీకో విషయం చెప్పనా ? మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భర్తను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను.

ఇక చుట్టుప్రక్కల జరిగే చెత్త విషయాలన్నీ తీసుకుని ఊసుపోని కబుర్లకోసం మా ఇంటికి కొంతమంది వచ్చేవారు. మొహమాటంతో నా పని మానుకుని ముచ్చట్లు పెట్టేదాన్ని. వాళ్ళవల్ల నా సమయమూ, మనస్సూ రెండూ చెడిపోయేవి. అలా వచ్చేవారికి ‘కొంచం కూరగాయాలు తరిగి పెట్టవా? గిన్నెలు కడగడంలో హెల్ప్ చెయ్యవా?’ అంటూ పనులు చెప్పడం మొదలు పెట్టాను. చాలామంది రావడం మానుకున్నారు. నా స్నేహాన్ని నిజంగా కోరుకునే స్నేహితులు మాత్రం వస్తూనే ఉన్నారు.

ఇప్పుడు నన్నెవరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది. నేనే అందరిని అర్థం చేసుకోగలను.

మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా?

ప్రధానమంత్రి స్త్రీ సమస్యలపై మాట్లాడడానికి దేశం లోని కొంత మంది మహిళలతో ఒకమీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ కు నేనూ ఎంపికయ్యాను. ఆ రోజు నేను మాట్లాడిన విషయాలను మీడియా హైలెట్ చేసింది. ప్రధానమంత్రిగారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు.
నన్ను చూసి మా బాస్ నిలుచుండి విష్ చేయడం మొదలు పెట్టాడు.

ఇప్పుడు నేను వృథాగా సమయాన్నీ , డబ్బునూ, ఆహారాన్నీ , మాటలనూ, కన్నీళ్ళనూ, భావావేశాలనూ ఖర్చు చేయడాన్ని మానుకున్నాను. నాకు తెలియకుండానే నా ముఖం పై చిరునవ్వు కదలాడుతుంది.

"ఉద్ధరేదాత్మనాత్మానం" అని గీతా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు మరచి…ఎవరో టీ.వి లో 'గురువారం మఱ్ఱిచెట్టు కు పాలుపోయ్యి !' అంటే వెళ్లి పోశాను. 'శుక్రవారం రాగిచెట్టు క్రింది మట్టిని బొట్టు పెట్టుకో!’ అంటే వెళ్లి పెట్టుకున్నాను.
నా భర్తాపిల్లలూ, పరిస్థితులు మారుతాయని ఆశపడ్డాను. మార్పు బయటనుంచి వస్తుందని ఎదురు చూశాను.
మార్పు లోపలినుంచే వస్తుందని మారాల్సింది నేనేనని నాకిప్పుడర్థమైంది.

ఇదంతా నీవల్లే!

నా ఆత్మహత్య ను తప్పించావు.
నాకో కొత్తజీవితాన్ని ప్రసాదించావు.
నన్నో వ్యక్తిగా నిలబెట్టి విలువా, గౌరవం రావడానికి కారణమయ్యావు.
ముఖ్యంగా ‘నేనంటే నాకు బాగా ఇష్టం కలిగేటట్లు చేశావు.’
ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది.

నిజంగా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతతో కూడా కళ్ల వెంబడి నీళ్లొస్తాయన్న సంగతి నాకు మొదటిసారిగా తెలుస్తోంది.

సరే! నా సంగతి అలా ఉండనీ! నీ వివరాలు చెప్పు" అన్నదా స్త్రీ కృతజ్ఞతాభాష్పాలను తుడుచుకుంటూ..

ఆ స్త్రీ మాటలు విన్న భూతం ఆనందంతో ఇలా చెప్పసాగింది…
"నేను గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి , ఇదే కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఇలా భూతన్నయ్యాను. చచ్చి భూతాన్ని అయ్యాక నేను చేసిన తప్పు తెలిసొచ్చి జ్ఞానం వచ్చింది.
నేనున్న స్థితి ఎలాంటిదంటే…
ఆకలౌతుంది కానీ, తినలేను.
నిద్రొస్తుంది కానీ, విశ్రాంతి తీసుకోలేను.
అన్ని రకాల కోరికలు కలుగుతాయి కానీ, తీర్చుకోలేను.
దుర్భరంగా, పరమ యాతనగా ఉంటుంది.

ఈ ప్రేతశరీరంలో వుండడం ఇష్టం లేక ఈ కొండకు వచ్చిన ఒక నిజమైన మహాత్ముని కాళ్లావేళ్ళా పడి విముక్తి కలిగించమని పార్థించాను.

నా ప్రార్థన విన్న అతడు ...
"ఆత్మహత్య మహా పాపం.
నీ జీవితాన్నీ - ఆయుష్షును వ్యర్థం చేశావు. నీ పాపం తొలిగిపోవాలంటే నీవల్ల మూడు విషయాలు జరగాలి.

1. ఒకరిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి.( ప్రాణదానం )
2. నీ మాటలు ఒక వ్యక్తికి క్రొత్త జీవితం పొందడానికి కారణం కావాలి.
( జ్ఞానదానం )
3. ఆ వ్యక్తి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ( పై రెండింటి దాన సిద్ధి )
అంత వరకు ప్రేతయాతనలు పొందకుండా ఈ దీపంలో ఉంచుతాను అంటూ దీపంలో ఉంచి ఇక్కడ పాతిపెట్టాడు.

ఎవరైనా నీతులు చెప్పగలరు.కానీ ఆచరించడంలోనే ఉంది గొప్పంతా!
నీ శక్తిసామార్థ్యాలవల్లనే ఇదంతా నువ్వు సాధించావు. నేను చేసిందేమీ లేదు.
నీ వల్ల నా మూడు విషయాలు ఒకేసారి నెరవేరి నాకు ప్రేతరూపం నుండి విముక్తి లభించింది. నీకే నాహృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ భూతం ‘సూర్య నటించిన రాక్షసుడు సినిమాలోని ఆత్మలా’ బంగారు రేణువులుగా విడిపోతూ శూన్యంలో కలిసి పోయింది.

"ఒకరికి సహాయం చేయడంలోనే మన మేలు కూడా ఉందన్న" క్రొత్త సత్యాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ కొంగ్రొత్త ఉత్సాహంతో తెలుసుకున్న ఆ సత్యాన్ని ఆచరణ లో పెట్టడానికి బయలుదేరింది
 
 అది అందమైన అడవి. రావి, మర్రి, మోదుగ వృక్షాలతో దట్టంగా ఉండేది. ఎన్నో పక్షులకు, జంతువులకు ఆవాసాన్ని ఇస్తోంది. ఆ అడవి ప్రసేనుడు రాజైన కోసల రాజ్యంలో ఉంది. తన వంశం వృద్ధి కావాలని, తన పాలన వర్థిల్లాలనీ పెద్ద యజ్ఞం చెయ్యడానికి సంకల్పించాడు ప్రసేనుడు. యజ్ఞానికి కావలసిన ఎన్నెన్నో జంతువులను భటులు ప్రజల నుంచి సేకరించి తెస్తున్నారు. అడవిని నరికి, వందలాది చెట్లను బండ్ల మీద కోసల రాజధాని శ్రావస్తికి చేరవేస్తున్నారు. రాజపరివారం అడవిలోని చెట్లను నరకడంతో... పరిసర గ్రామాల ప్రజలు కూడా తమ శక్తి కొద్దీ చెట్లను నరుక్కోవడం మొదలుపెట్టారు. అడవిలో పెద్ద పెద్ద రావి చెట్లన్నీ హరించుకుపోతున్నాయి.
శ్రావస్తి పొలిమేరలో... ఒక నదీతీరాన బుద్ధుడు తన భిక్షుగణంతో ఒక చెట్టు నీడన సేదతీరుతున్నాడు. వందల బండ్లమీద తరలిస్తున్న చెట్లను చూశాడు. అదే సమయానికి, పనుల పర్యవేక్షణ కోసం రథం మీద ప్రసేనుడు అటుగా వచ్చాడు. చెట్టు నీడన ఉన్న బుద్ధుణ్ణి చూశాడు. రథం దిగి వెళ్ళి, ఆయనకు ప్రణామం చేశాడు. తాను చేపట్టిన కార్యం గురించి వివరించాడు. అడవిలో చెట్లను కొట్టి తీసుకుపోతున్న ప్రజలను హెచ్చరించడానికి వచ్చానని చెప్పాడు.
అప్పుడు బుద్ధుడు ‘‘ప్రసేనా! రాజ్యాన్ని పాలించే రాజును బట్టే రాజ్యం ఉంటుంది. రాజ్యమే కాదు... లోకరీతి కూడా అతణ్ణి బట్టే నడుస్తుంది. రాజు అధర్ముడైతే సామంతరాజులు అధర్మపరులవుతారు. పండితులు, ప్రజలు అదే బాటలో నడుస్తారు. అప్పుడు నగరాలు, పట్టణాలు, గ్రామాలు అధర్మంలో కూరుకుపోతాయి. చివరకు నేల, నీరు, గాలి కూడా అధర్మమార్గానికే మరలుతాయి. అవి తమ ధర్మాలను తప్పుతాయి. ఈ అధర్మ చేష్టల వల్ల ఋతువులు గతి తప్పుతాయి. రేయింబవళ్ళు మార్పునకు గురవుతాయి. సూర్యచంద్రులు కాంతి విహీనులవుతారు. కాలాలు తల్లకిందులవుతాయి. పడవలసినప్పుడు వర్షం పడదు. పడవలసినంత వర్షం పడదు. పడవలసిన చోట పడదు. అప్పుడు పంటలు పండవు. దుర్భిక్షం ఏర్పడుతుంది. ప్రజలకు తిండి దొరక్క రోగాల పాలవుతారు. దేశం బలహీనులతో నిండిపోతుంది. జనం అల్పాయుష్కులవుతారు.
ఆ రాజు ధర్మమార్గంలో ఉంటే, ప్రజలు, ప్రకృతి, పంటలు ధర్మమార్గంలోనే ఉంటాయి. సకాల వర్షాలు, చాలినంత వర్షాలు పడతాయి. పంటలు చక్కగా పండుతాయి. ప్రజలు రోగాలపాలు కారు. సమృద్ధమైన ఆహారం వల్ల జనం బలవంతులు, బుద్ధికుశలులు, దీర్ఘాయుష్కులు అవుతారు. పశువులు రేవు దాటేటప్పుడు వాటిని ముందుండి నడిపించే వృషభరాజం సరైన మార్గంలో రేవు దాటితే... మిగిలిన పశువులన్నీ క్షేమంగా రేవు దాటుతాయి. ఆ వృషభం దారితప్పితే... ఆలమంద మొత్తం విపత్తులపాలవుతుంది. పశువులే కాదు... మనుషులైనా ఇంతే!’’ అని చెప్పాడు.
ఆ సందేశం విన్న ప్రసేనుడికి... చెప్పకనే చెప్పిన బుద్ధుడి హెచ్చరిక అర్థమయింది. తన కార్యం విరమించాడు. వేలాది జంతువులు, వందలాది చెట్లకు రక్షణ దొరికింది. ఆలమందలు ఊపిరి పీల్చుకున్నాయి. అడవి ఆనందపడింది. అవని సంబరబపడింది. సంతోషంతో మేఘం సకాలంలో వర్షించింది. పుడమి పులకరించింది. పంట నవ్వులు కురిపించింది.

ఆస్రవాలు
రాగం, ద్వేషం, ఈర్ష్య... ఇలాంటి మనో రుగ్మతలన్నీ ఆస్రవాలు. వీటిని ‘క్లేశాలు’ అని కూడా అంటారు. ‘ఆస్రవంతి ఇంద్రియాణ్యనేనేతి ఆస్రవః’ ... అంటే ఇంద్రియాలను చెదరగొట్టేది అని అర్థం. ఈ ఆస్రవాలను బౌద్ధం ‘కామ ఆస్రవ’, ‘భవ ఆస్రవ’, ‘దృష్టి ఆస్రవ’, ‘అవిద్య ఆస్రవ’ అని నాలుగు రకాలుగా విభజించింది. ఈ ఆస్రవాలలో ‘దృష్టి ఆస్రవం’ నశించినవారిని ‘స్రోతాపన్నులు’ అంటారు. ‘కామాస్రవం’ నశించినవారిని ‘అనాగామి’ అంటారు. మొత్తం నాలుగూ నశించినవారిని ‘అరహంత’ అని పిలుస్తారు. అంటే ముక్తుడు. ఆస్రవాలు నశించడాన్ని ‘ఆస్రవక్షయం’ అని అంటారు. ఆస్రవక్షయం పొందినవాడు దుఃఖరహితుడవుతాడు. బుద్ధత్వానికి చేరువ అవుతాడు
***** 
ఏడు గొప్ప నేర్చుకోవడాలు :- ప్రకృతి సహజ లక్షణాలు.
1.స్త్రీ జాతి నుంచి నేర్చుకోవలసింది సహనంం, స్థిరత, దయ, లాలిత్యం
2. చిన్నవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది నిత్యనూతనత్వం, నిత్య ఉత్సాహం
3. పల్లెవాసుల నుంచి నేర్చుకోవాల్సింది నిరాడంబరత, సరళత
4. జంతు ,వృక్షాల నుంచి నేర్చుకోవలసింది మౌనం, టెలీపతి, ఆకలయినప్పుడు మాత్రమే తినడం
5. చదువులేనివాళ్ళ నుంచి నేర్చుకోవలసింది స్వచ్ఛత,వాక్శుద్ధి
6.ధ్యానుల నుంచి నేర్చుకోవలసింది త్రినేత్రం, అతీంద్రియ శక్తి
7. సూక్ష్మ లోకవాసుల నుంచి నేర్చుకోవలసింది
- Enlightenment , దివ్యజ్ఞానప్రకాశం.


******

 పూర్వం అగ్గిపెట్టెలు ఉండేవి కావు.అరణి (అంటే రెండు కర్ర ముక్కలు తెచ్చి ఒక దానికి గుంత చేసి రుద్ది నిప్పు పుడుతుంది )ద్వారా గానీ చేకుమికి రాళ్ళ ద్వారా గానీ నిప్పు తయారు చేసుకునేవారు.బ్రాహ్మణులు ఆ అగ్ని ఆరనీయకుండా అలాగే కర్రలు వేస్తూ వుండే వారు.అందుకే వాళ్లకు నిరతాగ్ని హోత్రులు అని పేరు.
ఒక వూరిలో ఒక ముసలమ్మ వుండేది ఆవిడ అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకొని చేకుముకు రాళ్ళతో చితుకులు వేసి మండించి నిప్పు చేసేది.దాన్ని అలాగే కర్రలు వేస్తూ నిప్పు ఆరనిచ్చేదికుంపట్లో ఎప్పుడూ నిప్పు వేసి వుంచేది. కాదు.వూళ్ళో అందరికీ అదే నిప్పు అందరూ ఆ ఆవ్వ దగ్గరకు వచ్చి అవ్వా!కాస్త నిప్పిస్తావా?అని అడిగి నిప్పుపట్టుకొనిపోయి వంట చేసుకునే వారు. ఆ అవ్వ దగ్గర ఒక కోడి కూడా వుండేది.అది రోజూ తెలావారుఝామున అవ్వ గుడిసె మీదికి ఎక్కి కొక్కొరోకో అని కూసేది.ఊరందరూ అబ్బ అవ్వ కోడి కూసింది తెల్లవారింది అని లేచి తమ పనులు చేసుకునేవారు.అవ్వ దగ్గర నిప్పుతెచ్చుకున్నందుకు బదులు ఒక్కోరోజు ఒక్కొక్కరు అవ్వకు బియ్యము,,పప్పులు కాయగూరలు యిచ్చేవారు.అలా ఆ ముసలమ్మ జీవనం సాగిస్తూ వుండేదియిలా కొన్నేళ్ళు గడిచాయి.ఆ అవ్వకు నా మూలంగానే వీళ్ళంతా బ్రతుకుతున్నారు అనే అహంభావం వచ్చింది..
ఒక రోజు అవ్వకు నా కోడి కూయకుంటే వీళ్ళంతా ఎలా నిద్ర లేస్తారు?నా కుంపటి లేకుంటే వీళ్ళెలా వంటలు వండుకుంటారు?అని తన కోడీ,కుంపటీ తీసుకొని అడవిలోకి వెళ్లి ఒక చెట్టుకింద కూచుంది.
మరుదినం కోడి కుయ్యలేదు.గ్రామస్తులంతా ఏమిటి కోడి కుయ్య లేదు అని అనుకున్నారు.అలవాటు ప్రకారం అందరూ లేచి తమ తమ పనులు చేసుకున్నారు.అవ్వ దగ్గరకు వెళ్లి నిప్పు తెచ్చుకుందామని
వెళ్తే అక్కడ అవ్వలేదు ఈ అవ్వ కేమైంది?ఎక్కడికి వెళ్ళింది అనుకోని వాళ్ళు చెకుముకి రాళ్ళు తెచ్చుకొని
నిప్పు తయారు చేసుకో ని వంట చేసుకున్నారు.
అవ్వ అడవిలో చెట్టుకింద కూచుని యివ్వాళ ఈ గ్రామస్తులంతా ఎలా నిద్ర లేచి వుంటారు??ఎలా వండుకుని వుంటారు?
అని ఆలోచిస్తూ తిండీ తిప్పలు లేకుండా వుండి పోయింది.సాయంకాలమయింది ఆవూరి అతను కట్టేలకోసం అడవికి వచ్చాడు.అతన్ని చూసి అవ్వ ఏమయ్యా! మీ ఊరిలో తెల్ల వారిందా?అందరూ నిద్ర చేచి వంటలూ అవీ చేసుకున్నారా?అని అడిగింది.వాడు నవ్వి ఓసి తిక్కవ్వా నీ కోడి లేకుంటే మాకెందుకు తెల్లవారదు?నీ కుంపటి లేకుంటే మీమెందుకు వంటలు చేసుకోము?నిప్పుచేసుకొని వంట చేసుకునే టప్పటికి కొంచెం ఆలస్య మయింది అంతే నీవే ఈ అడవిలోకి వచ్చి కూచుని పొద్దున్న నుండీ తిండీ తిప్పలు లేకుండా మాడావు.పో పో పోయి వంటచేసుకొని తినుపో.యిదిగో నా దగ్గర కాసిని కర్రలు వున్నాయి తీసుకొని పోయి వంట చేసుకొని తిను.అన్నాడు.అవ్వకు బుద్ధి వచ్చింది.యింటికి వెళ్లి నిప్పు చేసుకొని వంట చేసుకుంది.
మరుదినం నుండీ ఈ అవ్వను నమ్ముకుంటే అన్నీ ఆలస్య మవుతాయి..మనమే నిప్పు తయారు చేసుకుంటే పోయింది అనుకోని గ్రామస్తు లందరూ ఎవరికి వారే నిప్పు తయారు చేసుకున్నారు.అవ్వ ఎవ్వరూ తనదగ్గరకు నిప్పుకోసం రాకపోవటం,వాళ్ళే నిప్పు తయారు చేసుకోవటం చూసి దిగులు పడి పోయింది. వాళ్ళ దగ్గర నుండి వచ్చే బియ్యం పప్పులు కూడా లేకుండా పోయాయి.
ఎవరు కూడా నేను లేకుండా ఏదీ జరగదు అని గర్వ పడరాదు.అయ్యవారు రాకపోతే
అమావాస్య ఆగుతుందా?అనే సామెత దీని వల్లే ఏర్పడి వుంటుంది.అలాగే ఎవరో యిస్తారు లే ఎవరో చేస్తారులేఅనుకోని ఏమీ చేయకుండా సోమరితనం తో వుండకూడదు..ఒకరిమీద సాధ్యమైనంత వరకూ ఆధార పడకుండాతమ పనులుతామే చేసుకోవడం నేర్చుకోవాలి.

**----**

 ఆసుపత్రిలో చేరిన యువ కోటీశ్వరుడు!!

డాక్టర్‌ని అడిగాడు, "మా అమ్మ ఎలా ఉంది? ఎప్పుడు, ఎందుకు అడ్మిట్‌ అయింది?"


"మీ అమ్మకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అక్కడ కూర్చున్న వృద్ధ దంపతులు సకాలంలో ఆసుపత్రికి తీసుకువచ్చారు" అని డాక్టర్ చెప్పారు.

కొడుకు వృద్ధ దంపతులకు కృతజ్ఞతలు తెలిపాడు. "మిమ్మల్ని గుర్తించలేకపోయినందుకు క్షమించండి" అన్నాడు. అతను కూడా తమకు తెలియదని ఆ మహిళ సమాధానం ఇచ్చింది. కొడుకు ఆశ్చర్యపోయాడు 😳

"మా అమ్మ నీకు ఎలా తెలుసు?" అతను అడిగాడు. "ఆమె మా వాట్సాప్ గ్రూప్‌లో మెంబర్" అని పెద్దమనిషి బదులిచ్చారు. కొడుకు బిత్తరపోయి చూసాడు.😳😳

పెద్దమనిషి కొనసాగించాడు, "మాకు WhatsAppలో ఒక సమూహం ఉంది - "60 ప్లస్ గ్రూప్."

అరవై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ సభ్యులు. సభ్యులు తమ పొరుగున ఉన్న వారిని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ "గుడ్ మార్నింగ్" సందేశాన్ని పంపాలి. అదేవిధంగా మధ్యాహ్నం మరియు రాత్రి. సభ్యులు చాట్ చేయవచ్చు, వీక్షణలు మార్పిడి చేసుకోవచ్చు.

మేము ప్రతిరోజూ తప్పనిసరి సందేశాలను అందుకోకపోతే, పొరుగు సభ్యులు అప్రమత్తం చేయబడతారు మరియు వారు సభ్యుడిని సందర్శించడాన్ని ఒక పాయింట్‌గా చేస్తారు.

"ఈ ఉదయం, మీ అమ్మ నుండి మాకు మెసేజ్ రాలేదు. అందుకే మేము ఇక్కడ ఉన్నాము."

"మీరు మీ తల్లిదండ్రులకు డబ్బుతో కొనుక్కోగలిగే అన్ని సౌకర్యాలు కల్పిస్తే సరిపోదు," అతను కొనసాగించాడు. "వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళు కావాలి. మీరు మీ అమ్మని చివరిసారి ఎప్పుడు సందర్శించారు?"

* కొడుకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు

"చూడండి, అందుకే మాకు ఈ గుంపు ఉంది. లేకపోతే, మేము 60+ మంది గోడలు మరియు కిటికీలతో మాట్లాడుతాము", అని దంపతులు వెళ్లిపోయారు.

మీరు ఎదుగుదలలో బిజీగా ఉన్నప్పుడు, మీ తల్లిదండ్రులు పెద్దవారవుతున్నారని మర్చిపోవద్దు

*చాలా ఆసక్తికరమైన!

గ్రూప్‌లో చేరడం తప్పనిసరి,

మరియు

శుభోదయం సందేశం పంపడం తప్పనిసరి!

****

నాకు నచ్చిన సరదా కధ.

**********************

యాండే... మాఇంట్లో ఓ నిమ్మసెట్టు ఉందండి...

దాని కాయలు కొయ్యవండి.. పండిన కాయల్లా రాల్తుంటాయి..


ఆటిని సుట్టుపక్కలున్నావోల్లికి... మా ఆఫీసులో మా కొలీగ్స్ కి తలో నాలుక్కాయలు ఇస్తా ఉంటానండి...


పదిరోజుల క్రితం ఓనాడు కొన్ని కాయలు ఆఫీసుకి అట్టికెళ్లి మా ముందు షిఫ్ట్  వాళ్లకి తలో మూడుకాయలు ఇచ్చేనండి...


అందులో సాయిరాం అన్నావోడు ఇంకారాలేదని...

ఆడికోసం ఉంచిన మూడుకాయలు ఆడి బండి ట్యాంక్ కవర్లో ఎట్టేసి...సెపదావని ఆడికి పోన్ కొడితే ఎంగేజ్ వచ్చింది...

అలా పని అడావుడిలో పడి మళ్లీ ఫోను సెయ్యలేదండి ఆడికి...


*****


నిన్న ఆడు పోన్ సేసి, "రేపు మాఇంట్లో హోమాలు చేయించుకుంటున్నాం.. నువ్వు, మీయావిడ ఇద్దరూ రండిరా" అని సెప్పేడండి...


పొద్దున్నే రెడీ అయ్యి ఎల్లేవండి మేవిద్దరం...


ఎల్లేదప్పుడికి పీటలు మీద కూకున్నారు...


హోమం మాంచి బాగా జరుగుతా వుంది..

పొగవత్తోందని నేను బయటకొచ్చి కూకుంటే..


ఒక హోమం పూర్తయ్యి... రెండో హోమానికి కొంచెం 

గేప్ దొరుకుతుంతోటి మావోడు నా దగ్గరికొచ్చేడు...


"ఏరా అబ్బాయ్... ఇప్పుడేంటి అంత సడన్గా హోమలయ్యి చేయింతున్నావ్ ?..." అంటే,


"పది రోజుల కితం మనకెవరో సేతబడి సేసేర్రా...

దానికోసం ఇలా చేయింతే దోసాలయ్యీ పోతాయన్నారని...."


"సేతబడి సేసేరని ఎలా తెల్సిందిరా నీకు ?..."


"ఎలా తెలుత్తుమ్ ఏంటి..ఓనాడు పిల్లలు పెన్సిల్లు తెమ్మన్నారని డ్యూటీ నుంచి వత్తా వత్తా తీసుకుని ఇంటికెళ్లేను...


అయ్యి తీద్దాం కదాని సెయ్యెడితే షాక్ కొట్టినట్టయిపోయిందిరా..."


మంత్రం ఏసిన మూడు నిమ్మకాయలు బండిలో ఎట్టేసేడెవడో..


మా సిద్ధాంతి గార్కి పోన్ సేత్తే, ఆటిని అలాగే ఒట్టుకెల్లి, గోదాట్లో పాడేసి, తానం సేసి, అప్పుడు ఎల్లమన్నాడు ఇంటికి..."


అంటూ ఇంకా ఏవేవో సెప్పేత్తున్నాడు...


'ఒరే ఆ నిమ్మకాయలు ఎట్టింది నేనేరా బాబూ..."


అని సెప్పాలా వద్దా... కాతంత మీరైనా సెప్పండే....


🤔🤔🤔

( గోదారోళ్ళమండి.. ఆయ్...).

😄😄😄

*******

 *నాకు కోపం రాదు. ఎందుకంటే జీవితమనే మన ఈ ప్రయాణం చాలా చిన్నది.*

ఒక వృద్ధమహిళ బస్సులో ఎక్కి కూర్చుంది. 

తరువాతి స్టాప్ వద్ద, 

ఒక బలమైన, 

క్రోధస్వభావం గల యువతి పైకి ఎక్కి, వృద్ధురాలి పక్కన కూర్చుని, 

ఆమెను తన సంచులతో కొట్టినంత పని చేసింది. 

వృద్ధురాలు మౌనంగా ఉండిపోవడాన్ని చూసిన యువతి 

తన సంచులు తగిలినందుకు కోపం రాలేదా అని అడిగింది.?

వృద్ధ మహిళ ఒక చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చింది: లేదు,

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.* 

నేను తరువాతి స్టాప్లో దిగబోతున్నాను కాబట్టి, 

ఈ కొంత సమయానికి అసభ్యంగా ప్రవర్తించాల్సిన 

అవసరం లేదు.

ఈ సమాధానం బంగారు అక్షరాలతో వ్రాయడానికి అర్హమైనది:

*అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు* 

*ఎందుకంటే  ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఈ ప్రపంచంలో మనముండే సమయం చాలా తక్కువ అని 

మనలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. 

పనికిరాని వాదనలు, 

అసూయ, ఇతరుల మీద చాడీలు చెప్పడం, వారి మనసులను బాధపెట్టడం,

ఇతరులను క్షమించకపోవడం, ఎంత ఉన్నా అసంతృప్తి

మరియు చెడువైఖరి ద్వారా సమయం మరియు 

శక్తి హాస్యాస్పదంగా వృధా అవుతాయి.

మీ హృదయాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేశారా? 

ప్రశాంతంగా ఉండు. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మీకు 

ద్రోహం చేశారా, 

బెదిరించారా, 

మోసం చేశారా లేదా 

అవమానించారా? 

విశ్రాంతి తీసుకోండి. 

ఒత్తిడి కి గురికావొద్దు.

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? 

దాన్ని వదిలేయండి. 

దాన్ని విస్మరించండి. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మీతో విభేదించారా, 

బాగా ఆలోచించండి...? 

గట్టిగా ఊపిరి తీసుకోండి. 

అతన్ని / ఆమెను విస్మరించండి. 

మన్నించి మరచిపోండి. 

“ఎంత ముఖ్యమైనా 

మీ మనసుకు నచ్చని, 

నీ మనసు మెచ్చని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు, 

వారితో ప్రతిరోజూ తగవు పెట్టుకోకుండా. 

వారికి దూరంగా మనశ్శాంతి తో ఉండండి, 

కొంత ఇబ్బంది కలిగినా అలవాటైతే ఏదీ ఇబ్బంది కాదు” 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఎవరైనా మనకు ఏదైనా సమస్య కలగచేసినా, 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

ఈ మన యాత్ర యొక్క పొడవు ఎవరికీ తెలియదు. 

దాని స్టాప్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

మనకు అన్ని సమయాలలో అండగా ఉండే స్నేహితులను అభినందిద్దాం.

మనం గౌరవంగా, దయగా, క్షమించేలా ఉందాం.తద్వారా, మనం కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిపోతాము. చివరికి గుర్తుంచుకోవాల్సింది. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

మీ చిరునవ్వును అందరితో వెంటనే పంచుకోండి. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*

*ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు..* 

*ఇది మూన్నాళ్ళ ముచ్చటే.. !!*

*లోకా సమస్తా స్సుఖినోభవంతు*

🙏🙏

No comments:

Post a Comment