ప్రతి ఒక్కరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు
ఘటోత్కచుడు శ్రీకృష్ణుని దగ్గర పొందిన వరం
🌷🌷🕉🌷🕉🌷🌷
మహాభారతంలో పాండవులు లక్క ఇంటిని నుంచి తప్పించుకుని ఒక దట్టమైన అడవిలోకి వెళతారు. చాలా సేపు నడచి అలసిపోయి ఆ రాత్రి ఒకచోట విశ్రమిస్తారు. అందరూ నిద్రపోతుండగా భీమసేనుడు కాపలాగా ఉంటాడు. వారికి సమీపంలో రాక్షస జాతికి చెందిన హిడింబి, తండి అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు. తండి పాండవుల వాసనను పసిగట్టి అక్కడ బాగా బలిష్టంగా ఉన్న భీముని ఆకర్షించి ఆహారంగా తీసుకుమ్మని హిడింబిని పంపిస్తాడు.
కానీ హిడింబి భీముణ్ణి మోహిస్తుంది. ఒక అందమైన స్త్రీ రూపం ధరించి తనను పెళ్ళాడమని భీముని కోరుతుంది. భీముడు అందుకు అంగీకరించడు. ఆమె తన నిజస్వరూపం ధరించి తన అన్న చెప్పిన పని గురించి చెబుతుంది. భీముడు తండితో యుద్ధానికి తలపడతాడు. ఆ పోరులో భీముడు తండిని సంహరిస్తాడు. సోదరుని మరణంతో తనమీద ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భీముడు హిడింబిని కూడా చంపబోతాడు.
అయితే ధర్మరాజు అడ్డుకొని ఒక మహిళను చంపడం భీముని వంటి వీరునికి తగదని వారిస్తాడు. తరువాత హిడింబి తను ఒంటరిదానను కాబట్టి పెళ్ళి చేసుకోమని భీముడిని ఒప్పించమని కుంతీదేవిని వేడుకుంటుంది. అప్పుడు కుంతీ దేవి హిడింబిని పెళ్ళాడమని కుమారుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. అయితే భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు.
హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు. తల కుండ లాంటి ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు. అతని మంత్ర తంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు.మహాభారత యుద్ధంలో పాండవుల తరుపున ఘటోత్కచుడు ప్రముఖ పాత్ర పోషిస్తాడు. కౌరవ సేనను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. కురు సైన్యాన్ని చిందరవందరగా చేసి రణరంగంలో బీభత్సం సృష్టించాడు.
తనని నిలువరించలేక చివరికి అర్జునుడిని ఆచరించడానికి ఇంద్రుని దగ్గర నుండి వరంగా పొందిన అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు కర్ణుడు. నేలకొరుగుతూ కూడా లక్ష మంది సైన్యాన్ని మట్టు బెట్టాడు. ఘటోత్కచుడి భారీ కాయం కింద పడి దాదాపు లక్ష మంది సైనికులు మరణించినట్టు చరిత్ర చెబుతుంది.
****
*🌹. మహా శివరాత్రి విశిష్టత - విధి - శివ మంగళాష్టకం 🌹*
*🍀. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి 🍀*
*ప్రసాద్ భరద్వాజ*
*మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి.*
*శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.*
*శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.*
*ఉపవాసము ఉండి, రాత్రి నాలుగు ఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!” ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగ రూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.*
*నాలుగు ఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.*
*🍀. శ్రీ శివ మంగళాష్టకం 🍀*
*1) భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |*
*కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్*
*2) వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |*
*పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్*
*3) భస్మోద్ధూళిత దేహాయ నాగయఙ్ఞోపవీతినే |*
*రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్*
*4) సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే |*
*సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్*
*5) మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |*
*త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్*
*6) గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |*
*ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్*
*7) సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |*
*ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్*
*8) సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |*
*అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్*
*9) మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |*
*సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||*
🌹 🌹 🌹 🌹 🌹
పుండరీకుని కధ
పూర్వం ‘ముచుకుందుడ’నే రాజు అసురులమీద యుద్ధం చెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు.
ముచుకుందుడు దీర్ఘకాలం యుద్ధం చేసి అలసిపోవటంవల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్రలేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు.
శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధంచేస్తూ అతడు ఏ ఆయుధంచేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే గుహాలో దూరాడు శ్రీకృష్ణుడు.
నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపుపడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనంకావటం జరిగాయి.
ఆ ముచుకుందుడే మరు జన్మలో ‘పుండరీకుడి’గా జన్మించాడు.
పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలుపోయి యధాస్ధితికి వస్తామని పేర్కొన్నారు.
కుక్కుటమునికి అంత మహిమ అతని మాతాపితరుల సేవతో వచ్చిందనికూడా తెలిపారు.
పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు.
ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు.
పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి వుండమని తన చేతికి అందుబాటులో వున్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి వుండమంటాడు.
భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని వుంటాడు.
పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరముకోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు.
విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు. విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక.
భగవంతునికి భక్తుల పై గల కరుణకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే....
దైవం మానుష రూపేణా
🌷🌷🕉🌷🌷
మానుష రూపేణ అంటే దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన దగ్గర ఉంటుంది అని అర్థం .. మరి ఆ యొక్క దైవస్వరూపం ఎవరు అంటే .. మొదటగా మనను నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి,(రెండవది మనం ఈ భౌతిక శరీరధారణకు కారణమైన 'తండ్రి'), మూడవది మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు, అజ్ఞానం తొలగించిన గురువు. చివరిగా నాలుగవది.. మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి.. అందుకే మన సనాతనధర్మం నినదిస్తుంది .. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని.
మాతృదేవోభవ:
ఇలలో తల్లిని మించిన దైవం లేదు అన్న ప్రాథమిక సత్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలి.. డిల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే కదా.. అసలు భూలోకంలో అద్భుతం ఏదైనా ఉంది అంటే అది 'నువ్వే'. మరి అటువంటి అద్భుతాన్ని సృష్టించిన తల్లికి మించిన వేరే దైవం ఏమి ఉంటుంది. తన రక్త మాంసంతో మనిషిని సృష్టించి, ప్రత్యక్షంగా కంటికిరెప్పలా కాపాడుతూ పెంచి, పోషించి, ప్రయోజకుడిగా సరిదిద్దడంతో తల్లి పాత్ర ప్రతి మనిషి జీవితంలోనూ సుస్పష్టం.. మరి అటువంటి తల్లి ఒకరోజు వృద్ధురాలు అయినప్పుడు ఆ యొక్క తల్లితో మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మనకు మనం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలం, తనకు స్వాంతన కలిగించడమే మనం తల్లి ఋణం తీర్చుకోవడం.. తల్లితో అమర్యాదగా వ్యవహరించకపోవడమే ఋణం తీర్చుకోవడం !
తల్లిని గౌరవించడమే.. తల్లికి అగ్రతాంబూలం..!!
పితృదేవోభవ:
తల్లి .. తండ్రి.. రెండుకళ్ళు ప్రతి మనిషికి. నిరాకార భగవంతునికి సాకార ప్రత్యక్షమే తండ్రి.. మన ఎదుగుదలకు అనుక్షణం ఆరాటపడుతూ.. జీవితంలో ప్రత్యక్షం పోరాడుతూ.. మన ఉన్నతికి బాటలు వేసిన అలుపెరుగని యోద్ధుడు తండ్రి.. సమసమాజంలో మనకోసం గౌరవం, బాధ్యత, కర్తవ్యం, భద్రత, కీర్తి, వంశం, ప్రతిష్ట మొదలగు పదాలకు స్వరూపం నాన్న.
అందుకే ఒక మహాత్ముడు ఇలా అన్నాడు.. "ఎవరైనా ఒకరికి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం అంటే ఆ యొక్క వ్యక్తి ఆ స్థాయికి ఎదగడానికి కారణం అయిన తన తల్లి, తండ్రులకు మొదట నమస్కారం పెట్టాలి." కాని వారిని కన్న తల్లి తండ్రులు.. మరింత గౌరవనీయులు..! తల్లి తండ్రులను గౌరవించడమే .. అసలైన ఆధ్యాత్మికత. వారు శరీరాలను వదిలిన తరువాత విగ్రహాలు నిర్మించడం, ఫోటోలకు దండలు వేయడం, కర్మకాండలు ఆడంబరంగా
నిర్వహించడం ముఖ్యం కానేకాదు. వారు జీవించియుండగా వారికి తోడుగా, నీడగా ఉండడమే అసలైన మన ధర్మం..!
ఆచార్య దేవోభవ:
మనతో ఏ మాత్రం రక్త సంబంధం లేకున్నా మన ఉన్నతి కోసం పై లోకాల నుండి దిగివచ్చిన.. మనలను గొప్ప జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధుడై, అపర భగవంతుడే ఆచార్యుడు .. ఇహ, పర జ్ఞానాన్ని మనకు ప్రసాదించి జన్మను సార్థకం చేసుకుని మహా భాగ్యాన్ని మనకు అందించిన గురువుకు సదా కృతజ్ఞుడై ఉండడమే 'ఆచార్య దేవోభవ'.
అతిథి దేవోభవ:
మనకు తల్లి తండ్రుల ద్వారా సంక్రమించిన సంస్కారాన్ని, గురువు ద్వారా అభ్యసించిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ..మనకి విశేష సేవకి అవకాశం కల్పించిన మహాత్ముడే 'అతిథి'. 'పంచుకుంటే పెంచబడుతుంది' అన్నది పరమసత్యం. అతిథి సేవ ద్వారానే మన జీవితంలో ప్రస్పుటం అవుతుంది. మనం ఎవరికైనా సేవ చేసే అవకాశం వస్తే.. సాక్షాత్ భగవంతుడికి సేవ చేస్తునట్లే .. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి అందరికీ బోధిస్తూండేవారు .. 'మానవ సేవయే మాధవ సేవ' అని .. ఇలా మనకు సేవకు అవకాశం కల్పించిన మన తోటి మిత్రులే అతిథి దేవళ్ళు..
మానవ జన్మ తీసుకుని ఎవరైతే ధ్యానసాధన, అహింసపాలనలో ఉంటారో వారు మాత, పితృ ఋణం తీర్చుకున్నవారు అవుతారు. మరి ఎవరైతే ధ్యానప్రచారం, జ్ఞానప్రచారంలో సారధులౌతారో వారు గురు ఋణం తీర్చుకున్నవారు అవుతారు .. ప్రతివ్యక్తికి సేవచేస్తూ.. అందరిలో భగవత్ స్వరూపాన్ని దర్శించుతారో అతిథి ఋణం తీర్చుకున్నవారు అవుతారు. తన జన్మకు ఒక అర్థం, పరమార్థం సాధించుకున్న వారుగా.. ఆచంద్రార్కంగా .. ఆనందంలో జీవిస్తారు.
💥మౌనంగానే ఎదగాలి🚩
*వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.
*‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.
*మౌనం మూడు రకాలు.
*1. ఒకటవది: వాక్మౌనం. వాక్కును నిరోధించడమే వాక్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి.
*2. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం.
*3. మూడోది కాష్ఠమౌనం. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.
*మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర్ సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో పరివర్తన తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమౌవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు.
*మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధి వంటి వారెందరో ఉన్నారు.
*ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.
*రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.
*ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై, తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.
*ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే…‘మౌనం’.
*ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనమందరం మౌనంగానే ఎదుగుదాం!
నాలుక తెలుపు రుచియేను నాట్య మాడి
నాలుకయె కాళ మగుటయే నటన తీరు
నాలుకతొ ముద్దుచేసియు నమ్మి చెరచు
నాలుక అనుబంధాలనూ నలిపి తెలుపు
అది తమిళనాడులోని చిన్నమనై కెన్పట్టి అనే ఓ చిన్న ఊరు… పేదరికం తాండవించే ఊరు… ఆ ఊరవతల ఓ చిన్న గుడిసె… మరీ చిన్న గుడిసె… దాని ముందు ఓ కారు వచ్చి ఆగింది… ఒకాయన నీలి గళ్ల చొక్క టక్ చేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు… బెల్టు, బూట్లు… కారు దిగి ఆ ఇంటి తలుపు అనబడే ఓ తడిక తీసుకుని లోపలకు తలవంచి వెళ్లాడు… మసిబారిన గోడల పక్కన ఓ మూలన గాజుకళ్లతో ఓ ముసలామె కనిపించింది… ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు ఆ దొరబాబు… ఆమెకు అధికార్లను చూస్తేనే వణుకు… భయంభయంగానే చెప్పింది… ‘అయ్యా, నా పేరు రంగమ్మాళ్… ఆయన పేరు రామన్… మా ఆయన… ఇప్పుడే ఎటో పోయాడు…’ అన్నది బెరుకుబెరుకుగా… ఆమె వయస్సు 80 ఏళ్లు… ఆయన వయస్సు 82… ఏందయ్యా..? అనడిగింది ఆమె ఆ దొరబాబును… ఆ పక్కనే ఉన్న ఓ చాపను తీసుకుని, కింద పరుచుకుని కూర్చున్నాడు… పరిచయం చేసుకున్నాడు… ‘అమ్మా, నా పేరు అంబళగన్… నేను ఈ జిల్లాకు కలెక్టర్ను…’ అన్నాడు… ఆమె మొహంలో అంతులేని ఆశ్చర్యం… ఊళ్లో పట్వారీతో మాట్లాడటానికే ఆమెకు భయం… అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకు వచ్చాడు… ఏం తప్పు జరిగింది..? అవును ఏం తప్పు జరిగింది..? ఒక కలెక్టర్ అలాంటి గుడిసెల్లోకి అడుగుపెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికార్ల దృష్టిలో పెద్ద తప్పు… ఎంతసేపూ ఏ ఫైల్ మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో ఆలోచించని ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతుపట్టని తప్పు…
అక్కడికి దగ్గరలోనే ఉండే మాకన్ కురిచి అనే ఊరికి మాస్ కంటాక్ట్ ప్రోగ్రామ్ కింద వెళ్లాడు ఆ కలెక్టర్… మధ్యాహ్నం అయిపోయింది… అధికార్లు బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు చేసిపెట్టారు… కానీ అవన్నీ రిఫ్యూజ్ చేసి, ఇదుగో, ఇలా ఓ గుడిసెకు వచ్చాడు తను… చాప మీద బైఠాయించాడు… డ్రైవర్, తనతో వచ్చిన దఫేదార్. ఆ ఊరి పట్వారీ, ఏరియా గిర్దావర్, తాలుకూ తహసిల్దార్ అందరూ గుడిసె బయటే నిలబడ్డారు… ఆమె గురించి అడిగాడు… ఇద్దరు కూతుళ్లు… ఎక్కడో ఉంటున్నారు… ఆ గుడిసెలో ఆ ఇద్దరే… జీవనసంధ్యలో ఒకరికొకరు… పనిచేసే బలం లేదు… కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బతుకుతున్నారు… వాళ్లో వీళ్లో సాయం చేస్తే మిగతా సరుకులు… అంతే… అవును, మన దేశంలో ఇలాంటి వాళ్ల సంఖ్య కోట్లల్లో ఉంటుంది… చేదునిజం…
‘ఏం వండుకున్నావమ్మా… నాకూ కాస్త పెడతావా..?’ అనడిగాడు ఆ కలెక్టర్…
ఆమె మొహంలో మరింత ఆశ్చర్యం… ‘ఇంకా వండుకోలేదయ్యా..?’ అన్నది… ఏం..? అనడిగాడు కలెక్టర్… ఇంట్లో సరుకులు లేవని చెప్పలేక అలా నిర్వేదంగా కలెక్టర్ మొహం వంక చూస్తుండిపోయింది… కలెక్టర్ ఎక్కడికి వెళ్లినా తన ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తీసుకువెళ్తాడు క్యారియర్లో… డ్రైవర్ను కేకేసి అది లోపలకు తెప్పించుకున్నాడు… ఆమెను ఓ విరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు… అరిటాకులు పరిచాడు… ఈరోజు నాతో భోజనం చేయి అన్నాడు… ఇదంతా కలా అనుకుంటున్నది ఆమె… అవును మరి, ఆమె ఊహించని, ఊహించలేనిదే కదా అది…
ఆమెతోపాటు భోజనం చేస్తూ అడిగాడు… మీకు వృద్యాప్య పెన్షన్లు వస్తున్నాయా..?
‘లేదయ్యా… ఆఫీసుల చుట్టూ తిరిగి చేసిపెట్టేవాడు లేడు, మాకు ఓపిక లేదు, పైరవీలకు డబ్బు కూడా లేదు’ అన్నది ఉన్నదున్నట్టుగా… బయట నిలబడిన తహసిల్దార్ను లోపలకు పిలిచాడు… అప్పటికప్పుడు
ఓ దరఖాస్తు తనతోనే నింపించాడు… ఆమె వేలిముద్ర తీసుకున్నాడు… కింద కలెక్టర్ సంతకం… వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి అని చెప్పాడు… ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్… మరి ఆ ముసలాయనకు ఎలా..? ఏ పథకం కింద ఏం ఇవ్వవచ్చో చూసి, తనకు ప్రపోజల్ పంపించాలని చెప్పాడు… అంతేకాదు… ఆ తాలూకాలో పెండింగ్లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి, ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్కు పంపించాలని ఆదేశించాడు… ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేశాడు… సరేనమ్మా… మా అమ్మతో కూర్చుని భోజనం చేసినట్టుగా ఉంది అంటూ నమస్కరించి, వెళ్లిపోయాడు… ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతున్నది… ఈరోజు ఏం జరిగింది…?
*****
🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️
తిరుమల ప్రధానాలయం
తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర మంటే విగ్రహం అని అర్ధం.
1.కౌతుక బేరం
ఇక్కడ నిత్య సేవలన్నీ కౌతుక బేరానికి నిర్వహిస్తారు.
ఈయన భోగ శ్రీనివాసుడు.
7వ శతాబ్దంలో పల్లవ యువరాణి సమవాయి ఈ విగ్రహాన్ని బహుకరించారు.
రోజువారి అభిషేకాలు, దీపారాధన నైవేద్యాలన్ని భోగ శ్రీనివాసునికే జరపడం ఆచారంగా వస్తుంది
2.బలి బేరం
సొమ్ము అప్పగింతలు, కొలువు బలి బేరానికి జరుగుతాయి.
గర్భగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు.
మూల విరాట్ కు తోమాలసేవ తరువాత కొలువు శ్రీనివాసుని ఆలయ మండపానికి తీసుకువచ్చి రోజువారి పంచాంగ శ్రవణం జరిపిస్తారు.
3.స్నపన బేరం
స్నపన బేరం ఈ మూర్తిని 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించారు.
ఈయనే ఉగ్ర శ్రీనివాసుడు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీవారీయన.
4.ఉత్సవ బేరం
ఉత్సవ కార్యక్రమాలన్ని ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి నిర్వహిస్తున్నారు.
మలయప్పస్వామి వారు ఉత్సవాలతో వైభోగం వెలిగిస్తారు.
ఉత్సవాలలో ఉత్సవ బేరాన్ని ఊరేగిస్తున్నారు. ఉత్సవ బేరమంటే మలయప్పస్వామి.
బ్రహ్మోత్సవాలలో వెలిగే స్వామి ఈయనే.
భక్త కోటికి దర్శనమిస్తూ సాగిపోతుంటారు.
ఈయనకు ఇరువైపులా 24 అంగుళాల ఎత్తున శ్రీదేవి భూదేవి కొలువైయున్నారు.
ధృవ బేరం
స్వామి వారి ప్రతిమను ధృవ బేరం అంటారు. నిశ్చల, ధీర, గంభీర మూర్తి శ్రీవారు.
ధ్రువమూర్తనే దేవదేవుడు ఈయనకు నిత్య సేవలు అందుతున్నాయి.
భక్తుల కోర్కెలు తీర్చే భారం
మాత్రం ఈ మూర్తులలో ధ్రువ మూర్తిది. అంటే ప్రధాన మూర్తి శ్రీ వెంకటేశ్వరునిదే.
గర్భాలయంలో దర్పంగా చిద్విలాసం చిందించే స్వామియే బ్రహ్మాండ నాయకుడు మూల విరాట్.
ఆగమ పరిభాషలో ఈ మూల విరాటునే ధృవ బేరం అని పిలుస్తున్నారు.
దేవ దేవుని విగ్రహం ఎత్తు తొమిదిన్నర అడుగులు. ప్రతి రోజు అనేక రకాల పూలతోను
బంగారు నగలతోను ఈ ధృవ బేరాన్ని అలంకరిస్తారు. గర్భగుడిలో అలంకరించే విరిదండలు మరింత శోభను తెస్తాయి.
ఇక్కడ శ్రీనివాసునికి ఇరువైపులా ఇష్ట సఖులుండరు. వీరిరువురు స్వామి వారి వక్ష స్థలం మీద దర్శన మిస్తుంటారు.
ప్రధాన విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు శ్రీవారి ఆలయంలో కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు.
||గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకట రమణా గోవిందా||
ఓం నమో వేంకటేశాయ!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురుబోధ:
ఎన్నో వేల జన్మల పుణ్య ఫలం, సంస్కారం ఉంటే గాని ఆలయాలను శుభ్రపరచడం, ఆలయానికి కావాల్సిన కనీస అవసరాలు తీరుద్దామని ఆలోచన రాదు. ఆలోచన వచ్చి మనం చేయాలని అనుకున్నా స్వామి అనుగ్రహం, అనుమతి, మన మీద ప్రేమ ఉంటే గాని ఆలయంలో ఉన్న దేవతామూర్తులు మనచేత సేవ చేయించుకోరు. భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇంతకన్నా సులభమార్గం
లేదు. కాబట్టి ఎదో ఒక ఆలయముకు మనం తరచూ సేవ చేసుకుందాం!
No comments:
Post a Comment