నెరవాడ అనఘాదేవి సమేతుడైన దత్తాత్రేయ స్వామి
శ్రీపాదరాజం శరణంప్రపధ్యే...జ్తె గురుదత్తా....దుఃఖాన్ని దూరంచేసే దత్తాత్రేయుడు
జీవితమంటేనే కష్టాలు ... కన్నీళ్లు ... వ్యాధులు ... బాధలు కలిసిపోయి
కనిపిస్తుంటాయి. ఎంతగానో ఎదురుచూసే సుఖాలు మాత్రం ఇలా వచ్చి అలా
వెళ్లిపోతుంటాయి. అయితే సుఖాల తరువాత వచ్చే కష్టాలు మరింత కష్టంగా
అనిపిస్తూ వుంటాయి. అలాంటివాటి బారి నుంచి బయటపడటానికే భగవంతుడి సాయాన్ని
కోరుతూ వుండటం జరుగుతుంది.
అలా సాయాన్ని అర్ధిస్తూ ఏడుసార్లు పిలవగానే సరాసరి ఆర్తులను చేరుకునే
దేవుడే దత్తాత్రేయుడు. అందువల్లనే నేడు దత్తాత్రేయస్వామి ఆలయాలు సమస్యలను
హరించివేసి సంతోషాలను ప్రసాదించే ప్రశాంత నిలయాలుగా అలరారుతున్నాయి. అలాంటి
ఆలయాల్లో ఒకటి కర్నూలు జిల్లా 'నెరవాడ' లో దర్శనమిస్తుంది.
సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో శ్రీ దత్తాత్రేయస్వామి
త్రిమూర్తి స్వరూపంగా కొలువై కనిపిస్తుంటాడు. ఆ పక్కనే గల ప్రత్యేక
మందిరంలో 'అనఘాదేవి' పూజలు అందుకుంటూ వుంటుంది. దత్తాత్రేయస్వామి ఆలయంలో
మేడిచెట్టు వుంటే ఆ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకున్నదిగా
భావిస్తుంటారు. అలాంటిది ఈ ఆలయంలో ధ్వజస్తంభంగా మేడిచెట్టు వుండటం ఆశ్చర్య
చకితులను చేస్తుంది.
ఇదే ప్రాంగణంలో వినాయకుడు .. సుబ్రహ్మణ్య స్వామి .. అష్టలక్ష్ములతో
పాటు, శ్రీ శిరిడీ సాయిబాబా ... శ్రీ గజానన్ మహారాజ్ కూడా దర్శనమిస్తారు.
గురువారాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.
అనఘాదేవి సమేతుడైన దత్తాత్రేయ స్వామిని దర్శించడం వలన దుఃఖానికి కారణమైన
దారిద్ర్యం తొలగిపోతుందనీ, సంతోషాన్ని ప్రసాదించే సంపదలు చేకూరతాయని
భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. |
No comments:
Post a Comment