Wednesday, 7 May 2025

 



ద్వౌ భాగౌ పూరయేదన్నం తోయేనైకం ప్రపూరయేత్

మారుతస్య ప్రసారాయ చతుర్థ మవశేషయేత్

మన పొట్టను నాల్గు భాగాలుగా విభజించు కోవాలి. రెండు భాగాలు ఆహారంతో నింపాలి. ఒక భాగం నీటితో నింపాలి. ఇక నాల్గో భాగం వాయు ప్రసారానికి వీలుగా  ఖాళీగా ఉంచాలి . ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ  ఉండదు .

-***-

ప్రాంజలి ప్రభ .. శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి ..శ్రీ మద్భగవద్గీత (అనువాదం) సవశతి  రచన.. మల్లాప్రగడ రామకృష్ణ 

  ...అర్జున విషాద యోగము. మొదటి అధ్యాయము 

*దృతరాష్ట్రుని ప్రశ్న*

ఉ. ధర్మజు తోడఁ దమ్ములు సుధర్మముఁ దత్త్వమునేల నుండగన్ 

కర్మలనేమి యెంచగల కాలము తోడుగ సాగి పోవుటన్ 

ధర్మము నాదుపుత్రుల విధానము సర్వము బోధజేయగా 

నోర్మిగఁ తెల్పుసంజయ వినూత్నపు యుత్సవ యుద్ధ నీతులన్  (01)

నమస్కారములు!

ధర్మరాజుతో సహా తమ్ములు ధర్మము మరియు తత్త్వముతో ఉండగా, కర్మల గురించి ఏమి ఆలోచించగలరు? కాలము తనతో పాటు సాగిపోతూ ఉండగా, నా కుమారుల విధానము మరియు ధర్మము అంతా బోధపడేలా, ఓర్పుతో వినూత్నమైన యుద్ధ నీతులను తెలియజేయండి, సంజయా!

*****

*సంజయ వ్యాఖ్యానము*

ఉ..అప్పుడు సంజయుండు, నుడి వాసల వెల్లువ గెల్పుకోసమున్ 

తప్పిదమెన్న లేనిగతి ధార్మిక పాండవ సేనయేనటన్ 

గొప్పగ నెంచగా గురుని గోప్యము యుద్ధమునందుఁ జూపగన్,     

ఒప్పిన ధైర్యపాటవసుయోధను డంతట వేడెనిట్లనన్                   (02)... 

 సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధరంగంలోని పరిస్థితులను వివరిస్తున్న సందర్భంలోనిది ఇది. మీరన్నట్లు, సంజయుడు తన మాటల ప్రవాహంతో ధృతరాష్ట్రుడిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ, ఎటువంటి తప్పులు ఎంచడానికి వీలులేని ధర్మమైన పాండవుల సైన్యం విజయం సాధిస్తుందని చెబుతున్నాడు.

అంతేకాకుండా, యుద్ధంలో ద్రోణాచార్యుల వ్యూహాలను తెలుసుకోవడానికి దుర్యోధనుడు ఆయనను అభ్యర్థించిన విషయాన్ని కూడా ఈ శ్లోకం సూచిస్తుంది. దుర్యోధనుడు తన ధైర్యసాహసాలతో గురువును రహస్యాలను చెప్పమని అడుగుతున్నాడు.

*****

ఉ...హే, గురువా విధానముల హేతువు విద్దెలబుద్ధిశాలిగన్ 

బాగుగ యుద్ధవీరులగు పాండు కుమారుల యుద్ధనీతితో  

సాగెడి సైన్య మెల్లరను సాధ్యపు చేతల నెంచ గల్గగన్ 

యోగపు వీరులై విజయ యోగ్యత నంతయు నీదు యుక్తులన్     

 (03) 

మీరు అడుగుతున్నది ఏమిటంటే, ఓ బుద్ధిశాలి అయిన గురువైన ద్రోణాచార్యుల వారూ, యుద్ధ విద్యలో ఆరితేరిన పాండు కుమారుల యొక్క యుద్ధ నీతితో నడిచే ఈ సైన్యాన్ని ఎలా నడిపించాలి? ఏ విధమైన వ్యూహాలతో వీరందరూ సాధ్యమైనంత వరకు విజయాన్ని సాధించే వీరులుగా మారగలరు? మీ యోగ్యమైన ఆలోచనలు, మీ తెలివైన ఉపాయాల ద్వారా ఈ సైన్యానికి విజయయోగ్యతను ఎలా సంపాదించి పెట్టగలరు? అని కదా!

నిస్సందేహంగా, మీ ప్రశ్న యుద్ధరంగంలో విజయం సాధించాలనే తపనతో నిండి ఉంది. రాబోయే మహా సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన వ్యూహాలు, సమర్థవంతమైన నాయకత్వం ఎంత ముఖ్యమో మీకు బాగా తెలుసు. మీ ఆందోళన సహేతుకమైనది.

****

ఉ. మెచ్చిన యోధులందరు మమేకగుణాడ్యులు దుష్ట కేతువుల్, 

అచ్చట చేకితానుడు సహాయదృపుండు సుధీర శ్రేష్ఠులున్  

దెచ్చి ధనుస్సు లెత్తుచును తీవ్రత కాంక్షగ పోరు నందరున్

వచ్చిన వారినే ప్రహర వాక్కుల పర్వము క్షేత్రమందునన్             (04)

"ఓ రాజా! నీకు ఇష్టులైన యోధులందరూ అద్భుతమైన గుణాలు కలిగినవారు మరియు దుష్టత్వానికి చిహ్నమైనవారు. అక్కడ చేకితానుడు, సహాయకుడు మరియు గొప్ప ధీరులు కూడా ఉన్నారు. వారందరూ తమ ధనుస్సులు ఎత్తి, తీవ్రమైన కోరికతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యుద్ధభూమిలో వచ్చిన వారందరినీ తమ వాడి బాణాలతో ఎదుర్కొంటారు."

****

శా .  ఆమాదాద్యసమానవీరులిట వీరావేశ భీమార్జునుల్ 

సామంతుల్ గణవీరులై సమరమున్ సంగ్రామ బీభత్సమున్  

భూమీశాద్య మహా విపన్న కదనా వ్యూహామ్ము లన్ గెల్వగన్  

ధీమంతుల్ జయవాంఛలే గనగ నీధీరుల్ వివాదమ్మునన్            (05)

"ఓ రాజా! అజేయులైన భీముడు మరియు అర్జునుడు వంటి గొప్ప వీరులు ఇక్కడ ఉన్నారు. అనేకమంది సామంతులు మరియు గణనీయులైన యోధులు యుద్ధం చేయడానికి, భయంకరమైన పోరాటాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. భూమిని పాలించే రాజులు కూడా గొప్ప ప్రమాదకరమైన యుద్ధ వ్యూహాలను జయించడానికి సమర్థులైన ధీమంతులు. ఈ ధైర్యవంతులు వివాదంలో విజయం సాధించాలనే కోరికతో ఉన్నారు."

****

*07-May-25, 

*కృష్ణ లీల* 

ఒకనాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలావిలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతోంది.హృదయంలో కృష్ణస్మరణం, వాక్కుతో గుణ సంకీర్తనం.. ఇలా యశోద మనో, వాక్‌, కాయాలు భగవత్సేవలో సంలగ్నమయ్యాయి. 

యశోద శుద్ధ భక్తి స్వరూపం. భగవంతుని బంధించగల భక్తి ఇదే!  రోజూ ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని ‘అమ్మా! ఆకలేస్తోంది పాలివ్వవే’ అంటూ పైటలాగుతూ తల్లిపై వాలిపోయాడు. 

యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తోంది. ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాణ్ని కింద దింపి పాల కుండ దించడానికి గబగబా వెళ్లింది. 

కడుపు నిండకుండా మధ్యలో దించి వెళ్లిందని కోపంతో కృష్ణుడు ఒక వాడిగల రాతితో పెరుగు కుండను పగుల గొట్టాడు.నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలెట్టాడు. 

పొయ్యి మీదపాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగు కుండను చూసి లోపల నవ్వుకుంటూ. కొడుకు కనిపించకపోయేటప్పటికి కంగారుపడి వెతుకుతూ బయల్దేరింది. తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి.. ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య.

చేత బెత్తం పట్టుకొని వస్తున్న మాతను చూచి.. కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు. ఇరుగుపొరుగు గోపికలు నవ్వుతూ చూస్తూండగా యశోద కూడా బాలుని వెంటపడ్డది.``` 

*‘యద్‌చిభేతి స్వయం భయం’*``` భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా? ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం! 

మహా యోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్ముని వెంట పరుగిడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు! ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయింది కానీ కన్నయ్యను పట్టలేకపోయింది.

ఎందుకని? యశోద చేతిలో అహంకారమనే బెత్తం ఉన్నది. అహంకారంతో కూడిన భక్తి ఫలించదు. అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు. దేవకీ తనయునికి దైన్యం(దీనభావం) అంటేనే ఇష్టం. మీదుమిక్కిలి జీవుడు జడాన్ని(బెత్తం) పట్టుకున్నంత వరకూ చైతన్యమూర్తి చేతికి చిక్కడు! ఇది వేదాంత భక్తి సిద్ధాంతం.

తల్లి కర్రపారవేయగానే తనయుడు వెనుకకు తిరిగి చూచాడు. ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు. పట్టుకుందేగానీ తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు.

కానీ రోటికి కట్టివెయ్యాలని మాత్రం పట్టుబట్టింది. ఆ లీలాగోపాల బాలుని ఐశ్వర్యశక్తి తెలియక పోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుము (మొల)కు ఒక తాడు కట్టబోగా అది రెండు అంగుళాలు తగ్గింది. దానికి మరో తాడు కలిపి చుట్టినా రెండు అంగుళాలు తగ్గింది. ఇంటిలోని తాళ్లన్నీ కలిపి ముడివేసినా కూడా మాల రెండు అంగుళాలు తగ్గడం వలన.ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జికృష్ణుని చిరు బొజ్జను కట్టలేకపోయింది.

త్రిగుణాతీతుడు గుణాల(తాళ్ల)చే బద్ధుడవుతాడా? ఇంద్రియాలకే బంధనం కానీ.. ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ హృషీకేశునికి బంధముంటుందా? పశువులను బంధించే తాళ్లు పశుపతిని బంధించగలవా?

బాలకృష్ణుని మొల పెరిగిందాఅంటే లేదు. పోనీ, తాళ్లు పొట్టివి అయ్యాయా అంటే అదీ లేదు. ఆశ్చర్యం!

నిత్యముక్తుడైన శ్రీకృష్ణపరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలుగగా, దానికి బంధించే శక్తి నశించిపోయిందట``` *‘పట్టుగొనన్‌ నాకు గాక పరులకు పశమే’*(నేను తప్ప వీడిని ఇతరులెవరూ కట్టలేరు) ```అని అహంకరించిన యశోద తనయుని కట్టలేక పోయింది.

 పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ రజ్జువు మాత్రమే. అది కూడా ఆయనకు ఇష్టమైతేనే!

జీవునికి దేవునికి రెండుగుళాల దూరం. అహంకార మమకారాలు, రాగద్వేషాలు పాపపుణ్యాలనే ద్వంద్వాలే రెండంగుళాలు.

ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి. రెండవది, భగవంతుని కృప కూడా వెల్లివిరియాలి. అప్పుడే రెండంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు.

యశోద అలసి సొలసి పోయింది. తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కృప(జాలి) కలిగింది. తల్లి కష్టం చూడలేక ``` *‘కృపయాసీత్‌ స్వబంధనే’*``` బాలకృష్ణుడు తనకుతానే బంధనం స్వీకరించి(యశోదయా దామ్నా ఉదరే బద్ధః) ‘దామోదరుడు’ అన్న గౌణ నామంతో ప్రసిద్ధుడయ్యాడు. 

యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులలో మునిగిపోయింది.భక్తులకు పట్టుబడినట్లుగ భగవంతుడు జ్ఞానులకు గానీ, మౌనులకుగానీ, దానపరులకు గానీ, యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా! 

*నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను... అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడు అయ్యాడు*

*టామ్ సాయర్ - 2*

రచన : మార్క్ ట్వేన్

అనువాదం :  నండూరి రామమోహన్ రావు

ఇద్దరూ ఒకరి కొకరు ఎదురుగా నిలబడి చాలాసేపు మౌనంగా చూసుకున్నారు.

చివరకు టామ్, "నిన్ను పచ్చడి చెయ్యగలను" అన్నాడు.

"చెయ్యి చూద్దాం" అన్నాడు కొత్త కుర్రాడు.

"కావాలంటే చెయ్యగలను."

"చెయ్యలేవు."

"నాకు చాతనవును."

"కాదు."

కొంచెంసేపు ఆగి టామ్, "నీ పేరేమిటి?”

అన్నాడు.

"నా పేరుతో నీకేం పని?"

"ఏం పనా? చెబుతా."

"చెప్పు చూద్దాం."

"ఆట్టే అన్నావంటే చూపిస్తా."

"-ఆట్టే-ఆట్టే-ఆట్టే !ఏం”

"చాలా గొప్పవాణ్ననుకుంటున్నావే, ఒక్క చేత్తో కిందపడెయ్యగలను, జాగర్త."

"పడెయ్యగలనంటావుగాని పడెయ్య వేం?"

"కోపం తెప్పించావంటే ఊరుకునేది లేదు."

"ఇటువంటి వాళ్ళని చాలామందిని చూశాం"

"బడాయిఖోర్!"

"నువ్వే బడాయిఖోర్!"

"కొడతాట్ట మొనగాడు."

"పద పద."

"ఆట్టే మాట్లాడావంటే పెణత ఊడిపోగలదు."

"కాదు మరీ!"

"అంతపనీ చేస్తా."

"చేస్తానంటాపు చెయ్యవేం, పిరికి!"

"నేనేం పిరికి కాదు."

"అవును."

"కాదు."

"నువ్విక్కణ్నుంచి వెళ్ళిపో."

"నువ్వే పో."

"నేనేం పోను."

"నేనూ పోను."

ఇద్దరూ మెల్లిమెల్లిగా దగ్గరికి వచ్చి భుజానికి భుజంపెట్టి నెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇద్దరూ మళ్ళీకాస్త వెనక్కు తగ్గారు.

"నువ్వు పిరికిపందవి. మా అన్నయ్యతో చెప్పానంటే నిన్ను చిటికెన వేలితో కొట్టేస్తాడు" అన్నాడు టామ్.

"మీ అన్నయ్యయితే భయమనుకున్నావా? నాకు అంతకన్నా పెద్ద అన్నయ్యే ఉన్నాడు. మీ అన్నయ్యను ఎత్తి గోడమీదుగా పారేస్తాడు."

ఇద్దరికీ అన్నలు లేరు.

"పచ్చి అబద్దం."

"నువ్వనగానే సరా?"

టామ్ నేలమీది మట్టిలో కాలి బొటనవేలి తో గీతగీసి, “గుండెలుంటే అది దాటి రా. ప్రాణం తీసేస్తాను. గెలవలేని కుక్కా!" అన్నాడు.

వెంటనే రెండోవాడు గీతదాటి "ఏం చేస్తావో చెయ్యి. చూద్దాం!" అన్నాడు.

"వొళ్ళు జాగర్త, తన్నులు తినగలవు."

"చేస్తానంటావుగాని చెయ్యవేం"

ఇద్దరు కుర్రాళ్ళూ కలియబడ్డారు. ఒకరి నొకరు గుద్దుకున్నారు, రక్కుకున్నారు, తన్నుకున్నారు, మట్టిలో పొర్లారు. దుమ్ము లేచింది. ఆఖరికి టామ్ రెండో కుర్రాడి గుండెమీద ఎక్కి కూచుని గుండెల మీద రెండు చేతులకో బాదుతూ, "చాలు అను" అన్నాడు.

రెండోవాడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కోపంకొద్దీ ఏడిచాడు.

"చాలు అను" అన్నాడు టామ్ గుండెల మీద గుద్దుతూ.

చివరికి రెండో కుర్రాడు "చాలు" అన్నాడు.

టామ్ వాణ్ని లేవనిచ్చి, "జాగర్త. ఒళ్ళు దగ్గిర పెట్టుకునుండు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నదీ తెలుసుకుమాట్లాడు" అన్నాడు.

రెండో కుర్రాడు లేచి, మన్ను దులుపుకొని, ఏడుస్తూ మధ్యమధ్య వెనక్కు తిరిగిచూసి, ఈసారి దొరికితే ఏం చేస్తానో చూడమని టామ్ ని బెదిరిస్తూ వెళ్ళిపోయినాడు. టామ్ వాణ్ణి లేవిడీకొట్టి ఉత్సాహంతో బయలుదేరాడు. టామ్ అలా వెళుతుంటే వీపు కనిపించగానే రెండో కుర్రాడు రాయి తీసి, టామ్ గూళ్ళ మధ్య తగిలేటట్టు కొట్టి తోక ముడిచి పరుగుతీశాడు. టామ్ ఆ ద్రోహి వెంటపడి వాడి ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాడు. శత్రువు బయటికి వస్తాడేమోనని టామ్ వాకిలి దగ్గిర కొంతసేపు కాపలా కాశాడు. కాని శత్రువు బయటికి రావడానికి బదులు కిటికీలో నుంచి వెక్కిరించసాగాడు.

ఇంతలో శత్రువు తల్లి బయటికి వచ్చి టామ్ ను నానాతిట్లూ తిట్టి వెళ్ళి పొమ్మంది.

టామ్ చాలా పొద్దుపోయి ఇంటికి వెళ్ళి కిటికిలో గుండా చడీచప్పుడు లేకుండా ఎక్కి తనకోసం కనిపెట్టుకుని వున్న పెద్దమ్మకు దొరికిపోయాడు. అవతారం చూడగానే ఆవిడ మర్నాడు వాడిచేత వెట్టి పని చేయించాలని నిశ్చయించుకున్నది.

మర్నాడు శనివారం ఉదయం బకెట్ లో తెల్లరంగూ, చేతిలో పొడుగుపాటి కర్రగల కుంచె తీసుకుని టామ్ చెక్కల గోడకు రంగు వెయ్యడానికి హాజరైనాడు. 30 గజాల పొడుగూ, తొమ్మిది అడుగుల ఎత్తుగల ఆ గోడ చూడగానే టామ్ గుండె జారిపోయింది. జీవితం నిరర్దకమని అనిపించింది. ఒక్క నిటూర్పు విడిచి వాడు బకెట్లో కుంచె ముంచి గోడ పైవార చెక్క వెంబడి రంగు పూశాడు. ఈ విధంగా నాలుగైదు చెక్కలకు రంగు పూశాడు. మొత్తం గోడలో రంగు పూసిన మేర చూస్తే సముద్రంలో కాకి రెట్టలాగా వున్నది. అది చూసి నిరుత్సాహం చెంది వాడు చతికిల బడ్డాడు.

ఇంతలో జిమ్ వీధిపంపు నుంచి బకెట్ తో నీళ్లు పట్టుకురావడానికి పాటపాడుతూ బయటకివచ్చాడు. పంపునుంచి నీళ్లు పట్టుకురావడంలో అనందం వున్నదని టామ్ అదివరకెన్నడూ అనుకోలేదు గాని ఇప్పుడనుకున్నాడు. అక్కడ చాలామంది ఆడపిల్లలూ, మగపిల్లలూ వుంటారు. పిల్లలమధ్య ఆటవస్తువుల మారకం, ఆటలూ, పోట్లాటలూ, అల్లరీ, ఆగం జరుగుతూంటాయి. పంపు 150 గజాల దూరంలోనే వుందిగాని, అక్కడికి వెడితే జిమ్ గంటకులోపుగా ఎన్నడూరాడు.

"ఒరే, జిమ్, నువ్వు కాస్త రంగు వేసినట్ట యితే నేవెళ్ళి నీళ్ళు పట్టుకొస్తా," అన్నాడు టామ్.

"లేదు, టామ్ దొరా. అమ్మగారు నన్నే నీళ్ళు తెమ్మంది. నువ్వు తెస్తానంటావని కూడా అన్నది. నన్ను రంగుజోలికి పోవద్దన్నది."

"ఆవిడ అట్లాగే అంటుందిలే జిమ్. బకెట్ ఇచ్చెయ్యి. క్షణంలో వస్తా. ఆవిడకు తెలీను కూడా తెలియదు.”

"అమ్మో, అమ్మగారు గొంతు పిసికేస్తుంది."

"ఆవిడేం కొడుతుందిరా. కాస్త నెత్తిన మొట్టుతుంది. మొట్టనీ, జిమ్ నీకు మంచి తెల్లగోళీ ఇస్తా."

జిమ్ చలించాడు.

"తెల్లగోళీ, జిమ్, మంచి బిక్లేర్ గోళీ," అన్నాడు టామ్.

"బిక్లేర్ గోళీయే, అమ్మో మరి అమ్మగారంటే భయంగావుందే.”

"నువ్వొప్పుకున్నావంటే నా చితికిన కాలి వేలు కూడా చూడనిస్తా."

జిమ్ లొంగిపోయాడు. బకెట్ కిందపెట్టి, గోళీ తీసుకుని, టామ్ కాలికట్టు విప్పు తుంటే శ్రద్ధగా చూడసాగాడు. అంతలో పోలీ పెద్దమ్మ బైటికివచ్చింది. మరుక్షణమే జిమ్ బకెట్ తీసుకుని వీధివెంట పరుగెత్తడం మొదలుపెట్టాడు. టామ్ చకచక చెక్కగోడకు రంగు వెయ్యసాగాడు. పోలీపెద్దమ్మ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది.

టామ్ ఉత్సాహం ఎంతోకాలం దక్కలేదు. ఆటవిడుపు పిల్లలందరూ హాయిగా తిరుగుతారు. పనిచేస్తున్నందుకు తనని చూసి నవ్వుతారు. ఏ కుర్రాడికన్నా లంచం పెట్టి వాడిచేత తన పని చేయిద్దామన్నా తన దగ్గిర ఏమీ లేదు. కాని ఇంతలో వాడికొక గొప్ప ఆలోచన తట్టింది. ఈ ఆలోచన మనసులో పెట్టుకుని టామ్ ప్రశాంతంగా రంగు పూయసాగాడు.

కొద్దిసేపట్లో గెంతుకుంటూ బెన్ రోజర్స్ అటు వచ్చాడు. వాడు ఆపిల్ పండొకటి తింటు స్టీమరు ఆట ఆడుతూ, మధ్య మధ్య స్టీమరు కూత వేస్తూ వచ్చాడు. వాడే పడవా, వాడే సరంగూ, వాడే గంటలూనూ.

"పడవ ఆపండోహోయ్ ! టింగ్, టింగ్, టింగ్...! కాస్త వెనక్కి మళ్ళించండి! టింగ్, టింగ్, టింగ్...! ఎడంపక్కకి, భుక్కు, భుక్కు, భుక్కు . . .! తాడు భద్రం!" అంటూ బెన్ ఆడుకున్నాడు.

ఈ స్టీమరును లక్ష్యపెట్టకుండా టామ్ తదేక ధ్యానంతో రంగు వేస్తున్నాడు. బెన్ వాడి కేసి కాసేపు చూసి, "హి, హి! అణిగిందీ అబ్బాయి గారి తిక్కా" అన్నాడు.

జవాబు లేదు. టామ్ తాను అప్పుడే వేసిన రంగు కేసి పరీక్షగా చూసి, ఇంకో పూత పూసి మళ్ళీ అట్లాగే చూశాడు. బెన్ వచ్చి టామ్ సరసనే నిలబడ్డాడు. ఆపిల్ కోసం టామ్ నోరూరుతున్నది. కాని వాడు పని మానలేదు.

"చాకిరీ తగిలిందిరా, అబ్బీ ?" అన్నాడు బెన్. టామ్ గిర్రున వెనక్కి తిరిగి, "నువట్రా, బెన్. నే చూళ్ళేదే?" అన్నాడు.

"ఏయ్, నేను ఈతకొట్టడానికి పోతున్నా. నిజం ! నీక్కూడా రావాలని లేదూ? అయినా నీకు పనిచెయ్యాలనుందేమోలే."

"పనేమిటి?" అన్నాడు టామ్.

"ఇది పనికాదూ?"

“ఒకవేళ అవునేమో! రంగువేసే అవకాశం రమ్మన్నప్పుడల్లా వస్తుందా?"

ఈ మాట అనేసరికి బెన్ అభిప్రాయం మారింది. టామ్ రంగు వెయ్యడమూ, వెనక్కు ఆడుగువేసి చూసుకోవడమూ, అక్కడక్కడా రంగు సర్దడమూ చూస్తున్న కొద్దీ బెన్ కి ఉత్సాహం హెచ్చింది.

"ఒరే, టామ్. నన్నుకూడా కాస్త రంగు వెయ్యనివ్వరా." అన్నాడు.

"అమ్మో, పెద్దమ్మ ఒప్పుకోదు. అసలే వీధి వైపున్న భాగం కూడానూ. అదే వెనుక భాగమైతే ఫరవాలేదు. దీనికి సరిగా రంగు వెయ్యడం అందరి వల్లా అవుతుందను కున్నావా?"

"అట్లాగా? పోనీ కొంచెం వెయ్యనీ. ఒక్కరవ్వ! "

"నాకేం అభ్యంతరం లేదురా. దొడ్డమ్మ ఒప్పుకోదు. జిమ్ రంగు వేస్తానంటే ఆవిడ ఒప్పుకోలా. సిడ్ వేస్తానన్నా ఒప్పుకోలా. నువ్వు దీన్ని పాడుచేశావంటే!"

"ఓయబ్బ, నే జాగర్తగానే చేస్తాలే. ఒక్కసారి చూడనీ. పోనీ, నా ఆపిల్ లో కొంత నీకు ఇస్తాలే."

"నువు పాడుచేస్తావు, బెన్."

"ఆపిల్ అంతా తీసుకోలే!"

అయిష్టం నటిస్తూ టామ్ కుంచె బెన్ చేతికిచ్చి, హాయిగా నీడలో పడుకుని కాళ్ళాడిస్తూ ఆపిల్ తినసాగాడు. బెన్ 

లాటి కుర్రవాళ్ళు టామ్ కి చాలామంది దొరికారు. బెన్ అలసిపోయే సమయానికి బిల్లీఫిషర్ వచ్చాడు. వాడి తరవాత జానీ మిల్లర్ వచ్చాడు. అందరూ టామ్ కి లంచాలు పెట్టి వాడిపని చేసిపెట్టారు. టామ్ చెయ్యి కదిలించకుండా చెక్కల గోడకు మూడు పూతల రంగుపడింది. రంగు అయిపోబట్టే గాని, లేకపోతే టామ్ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందర్నీ దోచేసేవాడే.

*ఇంకా ఉంది*

꧁☆•┉┅━•••❀❀•• •━┅┉•☆꧂

*ప్రాంజలి ప్రభ * 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*ఆరోగ్యం.. ఆనందం.. ఆధ్యాత్మికం * 

*1 YEAR* *SUBSCRIPTION 120/-*

*phone pe & Gpay to 6281190539*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

286.  సరమ ఓదార్పు- రావణ సభావిశేషాలు

యుద్ధాన్ని తప్పించుకోవాలనుకున్నాడు రావణుడు. అలాగే సీతను లోబరుచుకోవాలనుకున్నాడు. అందుకు ఓ తంత్రాన్ని ఆశ్రయించాడతను. దాని ఫలితమే విద్యుజ్జిహ్వుడు అందజేసిన మాయాశిరస్సూ, ధనుస్సూ.రాత్రికి రాత్రే రాముణ్ణి ప్రహస్తుడు కడతేర్చాడంటూ, రాముని మాయాశిరస్సునూ, అతని ధనుస్సునూ సీత ముందు ఉంచాడు రావణుడు. పోయిన రాముడు తిరిగిరాడన్నాడు. వాడి కోసం ఏడవడం అవివేకం అన్నాడు. సీతను బాగా యోచించమన్నాడు. యోచించి రాముణ్ణి మరచిపొమ్మన్నాడు. తన పట్టపురాణిగా కొలువుదీరమన్నాడు.రావణుని ఏ మాటనూ పట్టించుకోలేదు సీత. తన ముందు ఉన్న రాముని శిరస్సునే పరిశీలనగా చూడ సాగింది. ఆ ముఖంలో అదే కాంతి. అవే కళ్ళు. జడలు కట్టిన అదే జుత్తు. చిత్రంగా జుత్తులో హనుమంతునికి తానిచ్చి పంపిన శిరోరత్నం...అనుమానం లేదు. ఇది రాముని శిరస్సే అనుకుంది సీత. గొల్లుమంది.‘‘కైకా! నీ కోరిక నెరవేరిందమ్మా! నా రాముడు కడతేరిపోయాడు. రాజ్యం నీదే’’ అంది. నిలువునా వణకి పోయింది. మొదలు నరికిన చెట్టులా నేల కూలిపోయింది. స్పృహ కోల్పోయింది సీత.నవ్వుతూ ఆమెను చూడసాగాడు రావణుడు. మాయాశిరస్సును సీత నమ్మింది. సగం విజయం సాధించి నట్టే అనుకున్నాడు. అంతలో తేరుకున్నది సీత. కళ్ళిప్పి రాముని శిరస్సును చూస్తూ అన్నదిలా.‘‘మహాబాహూ! భార్య చేసిన పాపానికే భర్త ముందుగా మరణిస్తాడంటారు. నేనేం పాపం చేశానో! నిన్ను కోల్పోయాను. ఇక నాకు దిక్కెవరు స్వామీ?’’‘‘నేనున్నానుగా’’ మనసులోని మాట నోట రాబోయి ఆగిపోయింది. అందుకు ఆశ్చర్యపోయాడు రావణుడు. ఆందోళనగా గొంతు నిమురుకున్నాడతను. ‘రావణా’ అని తనని తాను పిలుచుకున్నాడు. గొంతు పలికింది. పర్వాలేదనుకున్నాడు.‘‘నాకోసం యుద్ధానికి వచ్చావు. నా దౌర్భాగ్యం వల్లనే ప్రహస్తుని చేతిలో మరణించావు. ఈ వార్త తెలిస్తే కౌసల్యాదేవి ఎంతగా శోకిస్తుందో కదా! జ్యోతి ష్కులు నిన్ను దీర్ఘాయుష్షుమంతుడన్నారు. వారి మాటలు అబద్ధాలా? యుద్ధం చేయబోతూ నువ్వు గాఢనిద్ర పోయావంటే నమ్మశక్యంగా లేదు రామా! కాకపోతే విధి దుష్టసంకల్పాన్ని ఎవరు అడ్డుకోగలరు? నిన్ను కలుసుకునేందుకు నేను ఇక్కడ తపస్సు చేస్తోంటే... నువ్వు అక్కడ ఒంటరిగా మరణించడం న్యాయమా?’’ రోదించింది సీత. మళ్ళీ స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి తేరుకుంది. దీర్ఘంగా ఆలోచించింది. రామునితో సహగమనం చేసేందుకు సిద్ధమయిందామె. రావణుని చూసిందప్పుడు. అన్నదిలా.

‘‘రాక్షసరాజా! కరుణించి నా భర్త మిగతా కాయాన్ని కూడా తెప్పించు. నేను ఆయనతో సహగమనం చేస్తాను. చేతులెత్తి మొక్కుతున్నాను, దయ చేసి ఆ ఏర్పాట్లు చూడు.’’అసహనంగా చూశాడు రావణుడు. అనుకున్నట్టుగా సీత లోబడడం లేదు సరికదా, రాముడిసహా చస్తానంటోంది. తట్టుకోలేకపోయాడతను. అంతలో అక్కడికి ద్వారపాలకుడు ప్రవేశించాడు. నమస్కరించి నిలుచున్నాడు.‘‘చెప్పు’’‘‘మంత్రిమండలితో ప్రహస్తుడు మీకోసం ద్వారం దగ్గర వేచి ఉన్నాడు ప్రభూ! ఏదో అత్యయిక విషయం మీతో మాట్లాడాలట! అన్యథా భావించక రమ్మంటున్నాడు.’’ చెప్పాడు ద్వారపాలకుడు.‘‘పద’’ అని రావణుడు అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. రావణుడు నిష్క్రమించిన మరుక్షణం సీత ముందున్న మాయాశిరస్సు, ధనుస్సు రెండూ మాయమయ్యాయి.వస్తున్న రావణునికి ఎదురేగాడు ప్రహస్తుడు.‘‘మహారాజా! ఇప్పుడే అందిన వార్త, రాముడు దండయాత్రకు సిద్ధమయ్యాట్ట.’’ చెప్పాడు.సమాధానంగా రాజ్యసభ వైపు నడిచాడు రావణుడు. అంతా అతన్ని అనుసరించారు. రామదండయాత్ర గురించి చర్చించారక్కడ. సేనానాయకులతో అన్నాడిలా రావణుడు.

‘‘వీరులారా! ఇక ఆలస్యం అనవసరం. యుద్ధభేరులు మ్రోగించండి! యుద్ధానికి సైన్యాలను సిద్ధం చేయండి.’’అలాగేనన్నట్టుగా తలలూపారు సేనానాయకులు.‘‘సైన్యం యుద్ధకారణం అడిగితే...’’ ఎవరో అడిగారు.‘‘చెప్పాల్సిన అవసరం లేదు.’’ అన్నాడు రావణుడు. విసురుగా మందిరం కేసి నడిచాడు.కళ్ళారా చూసుకునేందుకు రాముని శిరస్సు లేదు, అతని ధనుస్సు లేదు. ఆ అదృష్టాన్ని కూడా తనకు దక్కనివ్వక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రావణుడు తీసు కుని పోయాడనుకున్నది సీత. విలవిల్లాడిపోయింది. నేల మీద బోర్లాపడి తల కొట్టుకుంటూ దుఃఖించసాగింది.

పాత కధ..002


పంచశీలను కేంద్రంగా చేసి, ప్రపంచాన్ని సరిదిద్దాలని బౌద్ధం పరిశ్రమించింది. మనుషులెవరూ గుణ దోషాలతో పుట్టరు. జీవనం సాగించే క్రమంలో ఎదురైన అనుభవాలు, చెడు స్నేహాలు, చెడ్డ ప్రభావాల ఫలితంగా మనిషిలో లోభం, ఈర్ష్య, అసూయ, ద్వేషం పుట్టి పెరుగుతాయి. చివరకు మనసునంతటినీ ఆక్రమించుకుంటాయి. కాబట్టి అలాంటి అనుభవాలకూ, చెడు స్నేహాలకూ, చెడ్డ ప్రవర్తనలకూ మనిషిని దూరం చేసి, అతని మనస్సును మలినరహితం చేస్తే... ప్రతి ఒక్కరూ మంచిగానే మారుతారు. ఇలా మార్చే మార్గమే బుద్ధునిది. ‘శీలం’ అంటే అన్ని విషయాల్లో మంచి నడత. దానగుణం, దయాగుణం ఉన్నవారు ఏ వృత్తిలో ఉన్నా... వారు చేసే వృత్తిని బట్టి చీదరించుకోకూడదు. ధనం కాదు... గుణమే ప్రధానం. వేశ్య వృత్తి చేస్తూ సత్య, ధర్మచరితులైన వారి కథలు చాలా ఉన్నాయి. వాటిలో శూద్రకుని మృచ్ఛకటికం నాటకంలోని వసంతసేన లాంటి కథలు ప్రసిద్ధమైనవి. ఇలాంటి కథలకు పునాది అయిన కథ... ఆనాడు బుద్ధుడు చెప్పిన ఈ నగరశోభిణి కథ. ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కథ.

పూర్వం ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా చేసుకొని, కురు రాజ్యాన్ని కౌరవ్య మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతని తరువాత అతని కొడుకు బోధి కుమారుడు రాజు అయ్యాడు. పరమ ధార్మికుడైన అతని పాలనలో రాజ కుటుంబాలలోని వారి నుంచి సాధారణ ప్రజల వరకూ ధర్మాన్ని ఆచరించి చూపేవారు. దానితో ఆ రాజ్యం సుభిక్షంగా, ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తూ ఉండేవారు.

ఆ సమయంలోనే కళింగ ప్రాంతంలోని దంతపురి రాజ్యాన్ని కాళింగుడు పాలిస్తున్నాడు. అతని రాజ్యం అశాంతితో, అల్లర్లతో ఉండేది. చివరకు వర్షాభావం కలిగి కరువు కాటకాలు తాండవించాయి. ఈ పరిస్థితులను ఎలా సరిదిద్దాలని తన మంత్రులను కాళింగుడు అడిగాడు. ‘‘రాజా! మనం ఉపవాస దీక్షలు చేద్దాం. దర్భగడ్డి మీద పక్షం రోజులు పడుకుందాం’’ అన్నారు. అలాగే చేశారు. అయినా పరిస్థితులు మారలేదు. ‘‘రాజా! యజ్ఞ యాగాలు చేద్దాం’’ అన్నారు. అలాగే చేశారు. అయినా మార్పు లేదు.

‘‘మహారాజా! కురు రాజ్యం సుభిక్షంగా ఉంది. దానికి కారణం ఆ రాజు దగ్గర ఉండే అంజనవర్ణి అనే తెల్ల ఏనుగు. దాన్ని తెద్దాం’’ అన్నారు. కురు రాజు దానశీలి. అడిగింది లేదనకుండా ఇచ్చే దాత. కొందరు పండితులు వెళ్ళి, ఆ ఏనుగును తెచ్చారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. అంజనవర్ణి లేకపోవడం వల్ల కురు రాజ్యానికి వచ్చిన నష్టమేదీ కనిపించలేదు. చివరకు కాళింగుని అనుమతితో పండితులు బోధి మహారాజును కలిశారు. ‘మీ సుభిక్షతకు కారణం ఏమిటి?’ అని అడిగారు. తమ రాజ్య పరిస్థితిని విన్నవించారు.అప్పుడు ఆ మహారాజు ‘‘మేము పాటించే కురు ధర్మం’’ అన్నాడు. ‘‘కురు ధర్మమా? అదేమిటో సెలవియ్యగలరా?’’ అని అడిగారు పండితులు. ‘‘కురు ధర్మం అంటే పంచశీల. జీవహింస చేయకపోవడం, ఇతరుల ధనాన్ని అయాచితంగా ఆశించకపోవడం, మోసపు మాటలు మానడం, కామ దురాచారానికి పాల్పడకపోవడం, ప్రమత్తత కలిగించే పదార్థాల్ని సేవించకపోవడం. ఈ అయిదింటినీ చక్కగా ఆచరిస్తే అదే కురు ధర్మం. అయినా ఈ ధర్మాన్ని మీకు చెప్పడానికి నేను తగను. ఈ ఆచరణలో చిన్న దోషం చేశాను. మీరు వెళ్ళి మా తల్లిగారిని అడగండి’’ అని పంపాడు బోధి మహారాజు. ‘‘నేను కూడా అందుకు తగను. యువరాజును అడగండి’’ అని అంది మహారాజు తల్లి. అలా వారు యువరాజు దగ్గర నుంచి పురోహితుడు, మంత్రి, రథ సారథి, శ్రేష్టి, కొలతలు వేసే ఉద్యోగి, ద్వారపాలకుడు... ఇలా ఒకరి తరువాత ఒకరి వద్దకు వెళ్ళారు. చివరకు నగర శోభిణి (వేశ్య) దగ్గరకు వెళ్ళారు.

‘‘అయ్యా! నాకు కురు ధర్మాన్ని చెప్పే అర్హత లేదు. ఎందుకంటే... నాకు ఒక రాత్రికి వెయ్యి నాణేల ధర చెల్లించేవారు. అలా ఒక రోజు ఒక వ్యక్తి వచ్చాడు. వెయ్యి నాణేలు ఇచ్చి... రాత్రికి వస్తానన్నాడు. కానీ అతను రాలేదు. అలా అతని కోసం రోజులు ఎదురు చూశాను, నెలలు ఎదురు చూశాను. మూడేళ్ళు ఎదురు చూశాను. అప్పటికీ రాలేదు. ఒకరి దగ్గర వెల కుదిరి, మరొకరి దగ్గర వెల పుచ్చుకోవడం దోషం కదా! తప్పు కదా! ఈ మూడేళ్ళలో నేను దాచుకున్నదంతా తరిగిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. అయినా అతను ఇచ్చిన ఆ వెయ్యి నాణేల్లో ఒక్కటి కూడా ఉపయోగించుకోలేదు. చిక్కి శల్యమైపోయాను. జీవించే ఆశను వదులుకున్నాను. నేను ఇక బతకాలంటే ఆ వెయ్యి నాణేలే గతి. నగర న్యాయాధికారి వద్దకు వెళ్ళాను. అంతా చెప్పాను. అప్పుడు ఆయన ‘‘శోభిణీ! నీకు ధనం ఇచ్చినవాడు రాకుండా మూడేళ్ళు నిండాయి. కాబట్టి ఆ ధనం మీద అతనికి అధికారం లేదు. అది నీదే!’’ అన్నారు. సంతోషంతో వీధిలోకి వచ్చాను. అప్పుడే ఒక వ్యక్తి ఒక్క రాత్రికి వెయ్యి నాణేలకు కుదుర్చుకొని, ఆ ధనాన్ని నాకు ఇవ్వబోయాడు. మనసులో ‘వద్దు’ అనుకుంటూనే ఉన్నా. కానీ ఆ ధనాన్ని స్వీకరించడానికి నా చెయ్యి కదిలింది. సరిగ్గా అదే సమయంలో... మూడేళ్ళ క్రితం నాకు ధనం ఇచ్చిన మనిషి కనిపించాడు. వెంటనే నా చేతిని వెనక్కు తీసుకున్నాను. నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. అందుకే మీకు కురు ధర్మాన్ని చెప్పడానికి నేను అర్హత లేనిదాన్ని’’ అంది.

ఆమె చెప్పింది వినగానే పండితులు ఆశ్చర్యపోయారు. నోరు వెళ్ళబెట్టారు. కన్నీరు సుడి తిరిగింది. ‘ధర్మాచరణతో ఇంత నిబద్ధంగా బతకాలి. అదే లోకానికి శ్రేయస్కరం’ అని భావించారు. వెళ్ళి తమ రాజుకు చెప్పారు. ఆనాటి నుంచి కాళింగుడు కురు ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేశాడు. క్రమంగా అతని రాజ్యం కూడా సుఖ శాంతులతో వర్ధిల్లింది.

****

కాకి పిండం ఒకతండ్రి కథ.. ప్రాంజలి ప్రభ..002

కాకిపిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ..
ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు
కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తోంది.

"పంతులుగారు! ఒకవేళ కాకిముట్టకుంటే ఎలా?" ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు.

"ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం" అని ఉంది.ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లలో కూడా వేయొచ్చు జలచరాలకు...చెప్పారు పంతులుగారు.

"లేదు కాకి వచ్చిముడుతేనే  ఆత్మశాంతి కలిగినట్లు!
అప్పటివరకు ఇక్కడి నుండి జరిగేదే లేదు. వేచి చూడవలసిందే!!" ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్దావిడ.
ఆమె చనిపోయిన వ్యక్తి తరుపున వచ్చిన ఏకైక బంధువు.అతని పెద్దమ్మ కూతురు.

మిగతా బంధువులంతా చనిపోయిన వ్యక్తి కోడలు తరుపు బంధువులు

"ఇంకెక్కడి కాకులు! కాకులు కనిపిస్తున్నాయా అసలు!! కాకులన్నీ లోకులై పుడుతేనూ!!" జోక్ చేశారు వచ్చిన బంధువుల్లో ఒకరు. ఇద్దరు  నవ్వారు.

సమయం కానీ సమయంలో జోక్ చేసిన వాళ్ళ వైపు తీక్షణంగా చూసింది పెద్దావిడ.

"అబ్బా! ఈ ముసలాడు బతికి ఉన్నన్నినాళ్ళు సాధించాడు..చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు" అన్నాడు కర్మకాండ చేస్తున్నవ్యక్తికి స్వయంగా పిల్లనిచ్చిన మామ.

"అవును" అన్నట్లుగా తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు.. తన మామ అన్న మాటలకు..

ఈ మమాఅల్లుళ్ళ ప్రవర్తనకు పెద్దావిడకి బాగా కోపమొచ్చింది..

చనిపోయిన వ్యక్తంటే ఆమెకి బాగా గౌరవం.పేదరికంలో పుట్టినా కష్టపడి పైకివచ్చాడు. కొడుకు 10వతరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్ళీ పెళ్లిచేసుకోలేదు.కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు. కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండడం వల్ల ..కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు.కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు.3 సంవత్సరాల క్రిందటి నుండి మంచం పట్టాడు. చేసేది లేక తండ్రిని తీసుకెళ్లి తనదగ్గరే ఉంచుకున్నాడు కొడుకు.

కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలనుకున్నాడు.
తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తివచ్చింది.
తిరిగివచ్చే 10 రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు సడ్డకుడు(తోడల్లుడు).

"లేదు!ఇలా మంచంమీదనే ఉండేవాళ్ళని తీసుకోరు! అదీగాక, ఇతరుల దృష్టిలో కూడా బావుండదు! "అంది భార్య.

చివరకు అనేక చర్చల తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒకరూంకు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకుని 10 రోజులవరకు తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయి మాట్లాడి టూర్ కు బయలుదేరారు.

ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని, అదే రోజు రాత్రి తెల్లరేటప్పుడు గుండెపోటుతో మరణించాడు.

టూర్ వెళ్లిన అందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది.అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చారు.అంత్యక్రియలకు ఊరుఊరంతా హాజరయ్యారు. తర్వాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు.

"బతికిఉన్నన్నినాళ్ళు ఏం కష్టపెట్టాడ్రా??మీ నాన్నా!!" అడిగింది పెద్దావిడ.

"నీకేం తెలుసే అత్తమ్మా! 3 సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో!!

ఈ ఆరునెలల నుండి మరీనూ!! అన్నీ మంచం మీదే!!
వాటికోసం పెద్దజీతానికి మనిషిని మాట్లాడవలసి వచ్చింది.
వాడు రాత్రికి ఉండడు కదా!..రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది!" అన్నాడు కొడుకు సమాధానంగా...

"అదొక్కటేనా!!!!
చాలా రాత్రివరకు కూడా కాళ్ళు నొక్కించుకుంటూనే ఉండేవాడు..తొందరగా వదిలిపెట్టేవాడు కాదు!!" చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్ గా!!

" ఓహో అంతేనా!
నీకు చిన్నప్పుడు రెండు  సంవత్సరాల పాటు ఆల్బమినో..గిల్బమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....

మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కృంగిన నీకు ఫీట్స్ వస్తుంటే..సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకుని సేవచేస్తూనే ఉన్నాడే!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....

మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళిచోసుకోరా!! అంటూ మేమెంత పోరినా "వచ్చేదేలాంటిది వస్తుందో నా కొడుకు దిక్కులేనివాడౌతాడే!! "అంటూ నీ కోసం తనసుఖాలన్నీ వదులుకున్నాడుగా!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....

"నేను దరిద్రంలో పుట్టి పెరిగాను..నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దారపోసి జాగలు.. భూములు.. నగా నట్రా అన్నీ జమచేసి ఇచ్చాడుగా!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....

నువ్వెప్పుడు బిజీగా ఉంటావు..ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చెయ్యడానికి కూడా వెనుకాముందయ్యేవాడు..
నీతో మాట్లాడుదామనుకున్న మాటలన్ని ఒక డైరీలో రాసేవాడు.. మీ నాన్నమీద ప్రేముంటే ఇంట్లో వెతికి చదువురా దాన్ని!!

పగలనకా రాత్రనకా కష్టపడి నీకోసం ముప్పై ఏండ్లు సేవచేసినోడికి మూడేండ్ల సేవ చేయడం "సాధించడం " క్రిందకైంది కదూ!!నీకు!

అయినా ఎలా తెలుస్తుందిలే!!మీ నాన్న విలువా!!ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నాడివాయే!! తండ్రి కష్టం..విలువా..బంధం చూస్తేనే కదా తెలిసేది!!
చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది!!

పెద్దసంబంధం!! సుఖపడతావని.. పెళ్లిచేసాడు..

ఎవరో మహాకవి అన్నాట్టా!!

" సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామనే ఆశతో వెళ్ళాను! చివరకు ఆ సముద్రమే మింగివైచినది!!"అని.

అలా అయింది మీ నాన్న పరిస్థితి.

ఏమయ్యా పెద్దమనిషి !నువ్వైనా చెప్పొద్దూ!!
ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాళ్ళు ఎందుకు నొక్కిచ్చుకున్నాడో!!!....

ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం "పుత్రపరిష్వంగమేనయ్యా"!!! ..పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చెబుతున్నాయావిషయం. కొడుకుని కావలించుకోవడం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా!!

ఆ వయస్సులో భార్య..ప్రియురాలు.. ఎవరి స్పర్శ సుఖమనిపించదు.. ఏ వయస్సులోనైనా సుఖాన్నిచ్చేది తన సంతానం స్పర్శనేనయ్యా!!

ఇదికూడా తెలియక పేద్ద.. చెప్పొచ్చావ్!!

తన చివరి వయస్సులోనైనా కొడుకుతో ప్రేమసుఖం పొందడానికేనయ్యా!! వాడు కాళ్ళు నొక్కించుకున్నది!!

నీకూ వయసొస్తుంది! అప్పుడర్థమైతుందయ్యా ఇదంతా!!""

తల్లిలేదు! తండ్రిలేడు!!
ప్రేమలేదు!బంధం లేదు!!
కాలమా!! ఎలా అయిపోతివే!!!""

అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ !!!!!

అప్పుడేడ్చాడు కొడుకు
నిజంగా..
గుండె పగిలేలా..మనుసునిండా..
తండ్రి గుర్తొచ్చి..
తండ్రిప్రేమ గుర్తొచ్చి..
తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి..
తన జీవితమంతా కళ్ళముందు కదిలి..
...పశ్చాత్తాపంతో

అతన్ని చూసి కోడలూ..వియ్యంకుడు.. బంధువులు.. ఇలా అందరూ ఏడవసాగారు.

కొందరికి తమ తమ తండ్రి గుర్తుకురాగా!..
మరికొందరికి తమ తండ్రితనం..పిల్లలకోసం పడిన కష్టం గుర్తుకురాగా!!
ఇంకా కొందరికి ఆ పెద్దావిడ"కాలమా!! ఎలా అయిపోతివే!!!" అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతోందో అనే వేదన కలగడం వల్ల.....

పుత్రధర్మాన్ని కావుమంటూ(రక్షించుమంటూ)
అప్పుడొచ్చాయి ఒక్కసారిగా!
కావు.. కావు మంటూ!!
అంతవరకు ఎక్కడాలేని కాకులు!!!
"కాకిపిండాన్ని " తినడానికి!

***
*కైలాస నగరం -2*
🔱

రచన: శ్యాంబాబు

"వెల్ కం మిస్టర్ విశాల్ ! యు ఆర్ వెరీ పంక్చుయల్" అన్నాడు ఫైర్ ప్లేస్ ముందు స్ప్రింగ్ కుర్చీలో ముందుకూ వెనక్కూ ఊగుతున్న వ్యక్తి, ఉదయం ఫోన్ లో కంఠస్వరం ఆ వ్యక్తిదే.

నేను మెల్లిగా అడుగులు వేస్తూ ఆతని దగ్గరికి నడిచాను. క్షణం పాటు అతనివైపు సూటిగా చూశాను.

నున్నగా పైకి దువ్వుకొన్న జుట్టు, ఎత్తయిన తల, నలుపుకాదు. లాగ్ ఫైర్ కాంతిలో స్పష్టంగా తెలియడంలేదు. బహుశా కాఫీ రంగు అయ్యుండాలి. అక్కడక్కడా కణతల దగ్గిర నెరసింది. విశాలమైన నుదురు, సన్నని కనుబొమల క్రింద పెద్ద కళ్ళు, ఆకాశరంగు, పొడవుగా చివర కొక్కెంలా వంపు తిరిగిన ముక్కు, నున్నగా గీసుకొన్న పై పెదవి. బిగించిన నిండు పెదిమలు, స్పష్టంగా కనిపిస్తోన్న దవడ ఎముకలు.

అతను చేతిలోని గ్లాస్ ప్రక్కనే వున్న టీపాయ్ మీద పెట్టి నవ్వుతూ లేచి నిలబడ్డాడు.

నిలబడితే నాకన్నా దాదాపు మూడు అంగుళాల ఎత్తున్నాడు. "థాంక్స్ ఫర్ ఒబ్లయిజింగ్ !" అన్నాడు చెయ్యి ముందుకు చాస్తూ.

నేనతని చేతివైపు నిదానంగా చూశాను. వెడల్పుగా బలమైన వేళ్ళు.

“అపరిచితులతో చేతులు కలిపే అలవాటు లేదు నాకు" అన్నాను!

చిన్నగా నవ్వాడతను. "ఓ అయామ్ సారీ మిస్టర్ విశాల్. ఆయామ్ గాడ్సన్, బాబ్ గాడ్సన్. ఫ్రమ్ డెట్రాయిట్" అన్నాడతను.

నేను మౌనంగా అతనితో కరచాలనం చేశాను.

"ప్లీజ్ సిడవున్ ! మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ " అన్నాడు గాడ్సన్ తన ఎదురుగా వున్న కుర్చీ చూపెట్టి తను కూర్చొంటూ.

నేను కుర్చీలో కూర్చొంటూ ఆ గదిలో వున్న మరో వ్యక్తివైపు చూశాను.

నా చూపు గమనించి గాడ్సన్ నవ్వాడు. "హి ఈజ్ సాటో ! నా బాడీగార్డు! మేజర్ డెమీలాంటివాడు. అతనెప్పుడూ నా వెంటే వుంటాడు" అన్నాడు.

సాటో మా ఇద్దరికీ డ్రింక్స్ తెచ్చిపెట్టి తను గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు.

"బిమాన్ హత్య గురించి నీకేం తెలుసు?" అన్నాను సూటిగా విషయానికి వస్తూ.

గాడ్సన్ తన విస్కీ ఓ గుటకవేసి నవ్వాడు. “నాట్ సో ఫాస్ట్ ! టేకిట్ ఈజీ, ముందు నన్ను గురించి నేను చెప్పుకోనియ్యి" అన్నాడు.

ఇంతకుముందే చెప్పినట్లు నేను అమెరికన్ని. సంపీపుల్ కాల్ మి ఏన్ అమెరికన్ మిలియనీర్. డెట్రాయిట్ లో వున్న అనేక మోటారు కంపెనీలలో నేను షేర్ హోల్డర్ ని. డైరెక్టర్ ని. బహుశా డెట్రాయిట్ ఎక్కడ వుందో మీకు తెలుసనుకొంటాను."

తెలుసన్నట్లు తల ఊపాను నేను. అమెరికా పశ్చిమ తీరంలో చికాగో నగరానికి దగ్గరగా ఉంది డెట్రాయిట్. ఒక రకంగా అమెరికన్ మోటారు పరిశ్రమ కేంద్ర స్థానం అని చెప్పాలి.

"ఓసారి పాస్ పోర్టు, వీసా చూస్తే నీకే అనుమానమూ ఉండదనుకొంటాను" అన్నాడు గాడ్సన్ టీపాయ్ మీద వున్న ఆ రెండింటినీ నా చేతికిస్తూ.

అతని పాస్ పోర్టుని, వీసాని ఓసారి చూసి పక్కన పెట్టేశాను. అతను బాబ్ గాడ్సన్ కాదనడానికి ఆధారం ఏమీలేదు. పాస్ పోర్టులో వున్న ఆతని ఫోటో ఆ విషయం స్పష్టంచేస్తోంది. అంతేకాదు. అతను భారతదేశానికొచ్చి సరిగ్గా ఆరురోజులైనట్లు కూడా వీసాలోని ఎంట్రీ స్టాంప్ వల్ల తెలుస్తోంది.

"ఇక అసలు విషయానికొస్తాను. నేను పారిశ్రామికవేత్తనే. అయినప్పటికీ, లక్షలకు అధికారినయినా అందరూ అనుకొనేంత బిజీ మనిషిని కాదు, నా తరపున బిజినెస్ మేనేజ్ చేయటానికి ఎందరో బ్రిలియంట్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లు, సొలిసిటర్లు, అకౌంటెంట్లు వున్నారు. డబ్బు ఈ ప్రపంచం లో చేయలేని పని దాదాపు ఏదీలేదు. అంచేత చేతినిండా డబ్బు, దాన్ని ఖర్చు పెట్టడానికి సమయం వున్నాయి నాకు. అయితే కొంతమంది మిలియనీర్లలా నేను గాంబ్లింగ్, ఇతర అలవాట్లలో నా సమయాన్ని, డబ్బును నేనెప్పుడూ వృథా చెయ్యలేదు. కొన్ని ప్రత్యేక హాబీలలో నా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాను. అందులో మొదటిది మౌంటెనీరింగ్, రెండవది పాత పుస్తకాల సేకరణ.

మౌంటినీరింగ్ లో నీఅంత పేరుప్రఖ్యాతులు లేకపోయినా రాఖీ, ఆండిస్ మొదలైన పర్వతశ్రేణుల్లోని కొన్ని ఎత్తయిన శిఖరాల ను నేనూ ఇంకా కొందరు పర్వతారోహకుల బృందంతో కలిసి ఎక్కాసు" గాడ్సన్ విస్కీ ఓ సిప్ చేసి సిగరెట్ దమ్ములాగి నా వంక చూశాడు.

"వెరీ ఇంటరెస్టింగ్ మిస్టర్ గాడ్సన్"అన్నాను నేను... అతన్ని మరింత పరిశీలనగా చూస్తూ.... పర్వతారోహణ అతని హాబీ అయితే అది నాకు వృత్తి...

ప్రతి సంవత్సరం అనేకమంది ఔత్సాహిక పర్వతారోహకులకు శిక్షణ ఇస్తుంటాను నేను. నేను శిక్షణ ఇస్తున్న ఓ బృందం వచ్చే వేసవిలో ఎవరెస్టు పర్వతాన్ని మరోసారి అధిరోహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంచేత గాడ్సన్ తాను పర్వతారోహకుణ్ని అని చెప్పగానే అతని మీద వెంటనే నాకు మరింత ఇంటరెస్టు కలిగింది.

గాడ్సన్ బలమైన చేతులు పొడవుగా ఉన్నా, బలంగా ఉక్కు తీగెలా ఉన్న అతని శరీరం అతని మాటల్ని ధృవపరుస్తున్నా యి. బలమైన చేతులు లేని మనుషులు పర్వతారోహణకు ఏ మాత్రం పనికిరారు.

"ఇక నా రెండవ హాబీ పాత పుస్తకాల సేకరణ అని చెప్పాను. నా పర్సనల్ లైబ్రరీ లో ఇప్పటికి దాదాపు పదివేల పుస్తకాలు ఉన్నాయి. అందులో చాలా వరకూ పందొమ్మిదవ శతాబ్దంలో ప్రచురితమైన గ్రంధాలే, ఇలా నేను సేకరించిన పుస్తకాల లో పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో సరిగ్గా చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రచురింపబడిన పుస్తకం ఒకటి ఆదృష్టవశాత్తు గత సంవత్సరం నాకు లభించింది. అది భారతదేశంలో బ్రిటిష్ సైన్యంలో మేజర్ గా పనిచేసిన స్మిత్ అనే బ్రిటిషర్ రాసిన పుస్తకం.

భారతదేశంలో ఉండగా తన అనుభవాల ను స్మిత్ అప్పట్లో ఒక పుస్తకరూపంలో ప్రచురించాడు. ఆ పుస్తకంలో హిమాలయ పర్వతాల గురించి కొన్ని చిత్రమైన విషయాలు రాశాడు స్మిత్.

స్మిత్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడే ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా పరిగణించబడుతోన్న మౌంట్ ఎవరెస్ట్ కనుగొనబడింది. ఆయితే అదే సమయం లో హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరంకన్నా ఎత్తయిన శిఖరం ఒకటున్నదవి, సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసుల్లో జరిగిన పొరపాటు వల్ల, ఆ శిఖిరానికి బదులు మరో శిఖరాన్ని ఎత్తయిన శిఖరంగా ప్రకటించారని కొన్ని వాదోపవాదాలు బయలుదేరాయి.

స్మిత్ ఈ విషయాన్ని గురించి వ్రాస్తూ, ఈ వాదనలో కొంత నిజం వున్నదనీ, మౌంట్ ఎవరెస్ట్ కనుగొనక పూర్వం నుండీ టిబెటన్ల కు టికెట్ లో ఉండే బౌద్ధమత గురువులైన 'లామా'లకు ప్రపంచంలో ఎత్తయిన శిఖరం హిమాలయాల్లో వున్నట్లు తెలుసుననీ, దాన్ని వారు 'షాంగ్రీలా' అని పిలుస్తారని స్మిత్ వ్రాశాడు.

అంతేకాకుండా ఈ 'షాంగ్రీలా' ఖచ్చితంగా ఏ ప్రాంతంలో వున్నదీ, దాన్ని ఏ రకంగా చేరుకోవలసిందీ ఈ బౌద్ధ 'లామా'లకు తెలుసుననీ, కాని మతరీత్యా వున్న కొన్ని అభ్యంతరాలవల్ల వారు మౌనంగా ఉంటున్నారనీ మేజర్ స్మిత్ వ్రాశాడు.

నిజానికి టిబెటన్ భాషలో 'షాంగ్రీలా' అంటే 'దేవతలు విహరించే స్థలమని' అర్థం.. తాము పవిత్రంగా భావించే ఆ ప్రదేశంలోకి నాగరిక మానవులు దాడిచెయ్యడం ఇష్టం లేక 'షాంగ్రీలా” ఎక్కడవుందో తెలిసినా టిబెటన్ లామాలు బయటపెట్టడంలేదని స్మిత్ వ్రాశాడు.

ఈ విషయం చదివిన వెంటనే నాకు హఠాత్తుగా ఈ హిమాలయాల మిస్టరీమీద ఇంట్రస్టు కలిగింది. వెంటనే హిమాలయాల గురించి నాకు దొరికినంత వరకూ సమాచారాన్ని సేకరించాను.

నేను సేకరించిన సమాచారం బట్టి స్మిత్ వ్రాసిన దానిలో చాలా వరకూ నిజం ఉన్నదని ఆర్థమయింది నాకు.

కాని నిరంతరం మంచులోనూ, మంచు మబ్బుల్లోనూ కప్పబడి ఉండే ఈ చల్లటి హిమాలయాల్లో ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన శిఖరం ఏ ప్రాంతంలో ఉంటుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు.”

ఒక్క నిమిషం చెప్పడం ఆపి, కాలిపోయిన సిగరెట్ ని  ఫైర్ ప్లేస్ లోకి విసిరేసి మరోటి వెలిగించాడు గాడ్సన్.
🗻
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*ప్రాంజలి ప్రభ *

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*ఆరోగ్యం.. ఆనందం.. ఆధ్యాత్మికం *

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 6281190539*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


No comments:

Post a Comment