Thursday, 2 February 2017


ఒక నెరజాణ యైన వేశ్య ఒక విటుని గురించి తన కూతురి కిని, మనుమరాలికి చెప్తూ అతనితో జాగ్రత్త యని హెచ్చరిస్తూ చూపిన పద్యం.
నగపగతు పగతు పగతుని
పగతుండగు మగధ రాజు బరిమార్చిన యా
జగజ్జెట్టి యన్న తండ్రికి 
దగువాహనమైన యట్టి ధన్యుండితడే


వివరణ:--నగపగతుడు=ఇంద్రుడు (ఇంద్రుడు పర్వతములను ఖండించాడుకదా!)
అతని విరోధి=నరకాసురుడు, వాని విరోధి= కృష్ణుడు, అతని విరోధి =జరాసంధుడు,
అతనిని చంపినవాడు= భీముడు, అతని యన్న=ధర్మరాజు, ధర్మరాజుతండ్రి=యముడు అతని వాహనము =దున్నపోతు. అంటే అతను సరసము తెలియని దున్నపోతు అని అన్యాపదేశంగా హెచ్చరిస్తున్నది.

"తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్ “||
ఇదొక సమస్య

శైశవచాపల్యము! (శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో)
“లలితాకారు కుమారు షణ్ముఖుని తా లాలించి ౘన్నిచ్చుచో
గళలగ్న గ్రహరత్న దీప్తకళికా గాంభీర్య హేమాంచితో
జ్జ్వల రత్న ప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షింపగా
తలలొక్కేబదినాల్గు కానబడియెన్ తద్గౌరి వక్షంబునన్ “||
“పార్వతీదేవి పసిపిల్లవాడైన ఆరుముఖాలున్న కుమారస్వామివారిని లాలిస్తూ,
శైశవమౌగ్ధ్యంతో వెలిగిపోతున్న ముద్దుమోములని ముద్దాడుతూ, నిమురుతూ,
శిశుస్కందులవారికి, ఒక్కొక్క బులిబుల్లినోటికి తన మహనీయస్తన్యాన్ని
మహాభావుకతా పారవశ్యంతో త్రావిస్తోంది. శిశుగుహులవారు స్తన్యం సేవిస్తున్నారు. ఆ
మహాదేవి, తన కంఠసీమలో నవరత్నాల పతకంవున్న అందమైన హారం ధరించింది.
ప్రక్కనేవున్న శంకరదేవులు ఈ ముచ్చటని ప్రీతితో గమనిస్తున్నారు. పాలు త్రాగుతున్న
శిశుషణ్ముఖుని ఆరుముఖాలలోని పసిబుగ్గలు, నవరత్నాల వివిధ వర్ణకాంతి
కిరణ వైభవంతో వెలుగులీనుతూ, కదులుతున్నాయి. ఆ కాంతికిరణాల మహాభాగ్యం
ఏమిటంటే, అవి, బుల్లి అయ్యవారి బుజ్జిబుగ్గలని అమితమైన గారాబంతో తెగ
నిమురుతూ, వదలకుండా ముగ్ధమోహనంగా అలవిమీరి ముద్దులాడేస్తున్నాయి.
ముద్దూ-ముచ్చటా తెలిసినవారు ఎవరుమాత్రం అంతటి అద్భుత అవకాశాన్ని
జారవిడుచుకుంటారు? ఆ సన్నివేశానికి సంబరపడుతూనే నవరసాభినయ ఉద్గమ
ఆస్పదుడైన చిదంబరేశ్వరుడగు మహాశివుడు, ఈ అందాలనుంచి చూపు మరల్చి,
అటు నవరస సంకేతాలైన నవరత్నాలనిపరిశీలిస్తే, తొమ్మిది రత్నాలలోను, ఒక్కొక్క
రత్నంలో ఆరేసి కార్తికేయుడి ముఖాలు వివిధరసస్ఫూర్తితో విరాజిల్లుతున్నాయి.
మొత్తంగా చూస్తే, 6×9=54 ముఖాలు లెక్కకొచ్చేయి.
శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి
“చాటుపద్య రత్నాకరము“లో ఈ సమస్య ప్రస్తావించబడింది. మనకి సుపరిచితులైన, శ్రీ
మోచర్ల వెంకన్నగారు ఈ సమస్యని పూర్తిచేసేరు. నెల్లూరుసీమకిచెందిన వెంకటగిరి
రాజావారైన, శ్రీ వెలుగోటి యాచేంద్ర గారి ఆస్థానంలో, ఆయన సమక్షంలో
పూరించబడినట్లుగా ఐతిహ్యంద్వారా తెలుస్తోంది.
డా:R.V.కుమార్, రసజ్ఙభారతి సౌజన్యంతో--
-----

No comments:

Post a Comment