🕉️ *వైశాఖ పురాణం 23వ అధ్యాయము* 🕉️
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||*
🌻 *కిరాతుని పూర్వజన్మ* 🌻
💫🌹నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను.
💫🌹కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను.
💫🌹సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!
💫🌹గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది, నీకు విధేయుడనగుటవలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.
💫🌹శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖమహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.
💫🌹కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖధర్మములనాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడలేవు. నేనిచటనుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.
💫🌹అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను.
💫🌹ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురుచెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై యుండెను.
💫🌹వివిధములగు పక్షులచటవ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను.
💫🌹పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి యిట్లనెను.
💫🌹నాయనా! కిరాతా! ధర్మతత్పరా! నీకేధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు, ఆయుష్మికములునగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.
💫అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.
💫🌹ఓయీ! నీవు పూర్వము శాకలనగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్ససగోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, యుత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.
💫🌹ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును, భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.
💫🌹ఓయీ కిరాతా! ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించునాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదెపెరుగు ముల్లంగిదుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారమువలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితోబోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవచేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని.
💫🌹అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పదిజన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు 'నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసినదానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించినవారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును.
💫🌹దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో సమర్పింతును.
💫🌹గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారములుపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.
💫🌹ఒకనాడు దేవలుడను ముని సాయంసమయమున నామె యింటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మకార్యములనిన యిష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను.
💫🌹నీయనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి యుదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని యిన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు.
💫🌹పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.
💫🌹నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమునిచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరిసాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది.
💫🌹దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖవ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దానినడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.
💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.
*వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము*
🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏
మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట
"గాన గంధర్వుడు" శ్రీ S P బాలసుబ్రహ్మణ్యం గారు
ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...
పూజ్య గురుదేవులు, వాచస్పతి బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ S P బాలసుబ్రహ్మణ్యం గారి యశస్సును గురించి చెప్పిన విషయములు "గాన గంధర్వుడు" శ్రీ S P బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా...
శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు లబ్ధప్రతిష్టులైన గాయకులు. వారు దాదాపుగా 40 వేలకు పైగా పాటలు పాడటము, అవికూడా జనరంజకము కావడము, కొన్ని కోట్లమంది ప్రజల హృదయములలో పాట ద్వారా సుస్థిరమైన స్థానము సంపాదించుకోవటము అంత తేలిక అయిన విషయము కాదు. బహుశా వారి నాన్నగారు చేసిన గొప్ప తపస్సు వారిని అంత యశో విరాజితులను చేసిందని నేను వ్యక్తిగతముగా నమ్ముతూ ఉంటాను. బాలసుబ్రహ్మణ్యం గారి నాన్నగారు శ్రీ పండితారాధ్యుల సాంబమూర్తిగారు నెల్లూరులో హరికధలు చెపుతూ ఉండే వారు. 19 సం || పాటు ఊంఛవృత్తి చేసి నెల్లూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తూ ఉండేవారు. మొదటి భిక్ష బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మగారు పెడుతూ ఉండేవారు. అపర త్యాగరాజులాగే 'మనసా ఎటులోర్తునో' కీర్తన పాడుతూ వీధి వీధి తిరిగి భిక్ష స్వీకరించి రామపాద పూజలో తరించే వారు. నెల్లూరు పట్టణానికి ఎందరో సంగీత విద్వాంసులను పిలిపించి సంగీత కార్యక్రమములు నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన యొక్క అపారమైన భక్తి, వారు చేసిన త్యాగరాజ ఆరాధనోత్సవాల ఫలితముగా బహుశా బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు కుమారుడిగా జన్మించారు. ఆయన జీవితము నిజానికి పూలు పరచిన పడక కాదు. చిన్నతనములో ఆయన పడ్డ కష్టములు అన్నీఇన్నీ కావు. ఎన్ని ఊళ్లు మారారో, వాళ్ళ అమ్మగారి చేతికి ఉన్న విసినకర్ర కాడ దెబ్బలు ఎన్నిమాట్లు తిన్నారో! దీపావళి పండగ వస్తే ఒక సిల్కు లాల్చి కోనుక్కోవడము, 10 రూ. పెట్టి దీపావళి సామాను కొనుక్కోవడము ఎంతో కష్టము అయ్యేదో. చిన్నతనములో బాలసుబ్రహ్మణ్యం గారిని వాళ్ళ నాన్నగారి స్నేహితుల దగ్గరకు వెళ్ళి డబ్బు అప్పుగా తీసుకుని రమ్మంటే ఎంతో బిడియ పడుతూ వెళ్ళి తీసుకుని వచ్చేవారని ఆయన వ్రాసుకున్నారు. అన్ని కష్టములు పడి సంగీతము మీద అభిరుచి భగవంతుని యొక్క అనుగ్రహముగా ఏర్పడిన తరవాత వెనక్కి తిరిగి చూడలేదు. ఒకసారి చలనచిత్రములలో నేపథ్య గానము పాడటము ప్రారంభము చేసిన తరవాత ఆయన ఎవరి కంఠము అయినా సరే అంత అద్భుతముగా అనుకరించే వారు. ఆ నటుడే పాడితే ఎలా ఉంటుందో బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే అలా ఉండేది. ఎందరికో నటులకు వారి కంఠమును డబ్బింగ్ కోసమని అద్భుతముగా వెచ్చించారు. ఆయా నటులు అంత లబ్ధప్రతిష్టులు కాగలిగారు అంటే దానిలో బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సేవ, వారు చూపించిన సౌహార్ద్రము ఎంతో ఉన్నది. ఆయన గొప్ప నటులు, గొప్ప సంగీత విద్వాంసులు. ఎన్నో పాటలు పాడారు. ఆయన గురుముఖతః సంగీతము నేర్చుకోకపోయినా భగవంతుడు ఆయనకు అంత గొప్ప సంగీతవిద్య ఇచ్చారు. ఎన్ని పాటలు పాడారో, ఎంత భావయుక్తముగా పాడారో. ఉచ్ఛారణ గురించి ఎంత జాగ్రత్త తీసుకునేవారో. ఏ పదమైనా శాస్త్రీయముగా ఉచ్ఛరించి, అర్థము చెడిపోకూడదని జాగ్రత్త తీసుకునేవారు. అన్నిటినీ మించి విశాల హృదయము కలిగిన స్నేహశీలి. వారిని అనేక సందర్భములలో కలుసుకోవడము జరిగింది. పెద్దల పట్ల వారి గౌరవము చాలా గొప్పగా ఉండేది. "అంత స్థాయి కలిగిన వ్యక్తి , ఆకాశమంత ఎత్తు ఎదిగిన వ్యక్తి ఇంత వినయముతో ప్రవర్తించడము సాధ్యమవుతుందా?" అనిపించేది. పెద్దలు కనపడితే అంత వినయముతో ప్రవర్తించేవారు. ఎంతో సమయ పరిపాలన చేసేవారు. అందరినీ ఆదుకునేవారు. గొప్ప భక్తి కలిగిన వ్యక్తి. వారికి గోసేవ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. అన్నిటినీ మించి వారిలో ఉన్న చాలా చాలా గొప్ప విషయము ఎక్కడ మంచి ఉన్నా గ్రహించేవారు. ఏ కార్యక్రమమైనా దానిని అడ్డు పెట్టి సమాజానికి మంచిని అందించే ప్రయత్నము చేసేవారు. లబ్ధప్రతిష్టులైన గాయకులు, గాయనీ మణులు తయారు కావాలన్న ఉద్దేశ్యముతో etv లో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమములో వేదికకు ఎందరో గాయకులను పరిచయము చేసారు. స్వరాభిషేకము అన్న పేరుతో ఎప్పుడూ నిత్య నూతనమైన పాటలను పాడుతూ, వెనక ఉన్న నేపథ్యమును, కవి ఏ సందర్భములో పాట వ్రాసారు? నటీ నటులు ఎలా నటించారు ? ఆ దర్శక ప్రతిభ ఏమిటి? పాట వ్రాసిన కవి ఎంత భావ స్ఫూరకముగా ఆ గీతము రచించారు? అన్న విషయములు చెపుతుంటే ఎంతో అద్భుతముగా అనిపించేది. వ్యక్తిగతముగా ఆయన కారణజన్ముడు అనిపిస్తుంది. 74 సం || ల వయసులో అన్ని వేల పాటలు గురువు దగ్గర సంగీత అభ్యాసము లేకుండా పాడగలగడము, అంతమంది నటుల కంఠమునకు సరిపోయేట్టుగా పాడగలగడము , మాటవిరుపు దగ్గర నుంచి మాట్లాడే మాట వరకు అంత గొప్పగా ఉండగలగడము, అంతగా ఒదగగలగడము ఆయనకే చెల్లింది. అంత గొప్పవారు బాలసుబ్రహ్మణ్యం గారు.
ఆయన ఇవ్వాళ శరీరము విడిచి పెట్టి ఉండవచ్చుగాక! కానీ ఆయన ఎప్పటికీ అలాగే శాశ్వతముగా ఉండిపోతారు. ఎందుచేత అనగా సాగరసంగమము చలనచిత్రములో చిట్టచివర విశ్వనాథ్ గారు ఒక శ్లోకము చెప్పిస్తారు. యశః శరీరము కలిగిన మహానుభావులకు జరా-మరణములు ఉండవు. శరీరము ఉన్నంత కాలమే మిగిలిన వారి యొక్క వాణి వినపడుతుంది. ఇటువంటి లబ్ధప్రతిష్టులైన వారి శరీరము కాలగతిలో వెళ్ళిపోయినా, వారి కంఠము వినపడుతూనే ఉంటుంది. ఎన్ని లలిత గీతములు పాడారో, ఎన్ని భక్తి గీతములు పాడారో, ఎన్ని సందేశాత్మకమైన గీతములు పాడారో. ఆయా సభలలో, ఆయా సందర్భములలో, మనసుకి ఉత్సాహము కలగవలసిన సందర్భములలో జనులు నిరంతరముగా పాటలు వింటూనే ఉంటారు. అటువంటి కీర్తి శరీరము కలిగిన బాలసుబ్రహ్మణ్యం గారికి జరా మరణములు ఉంటాయని నేను నమ్మటము లేదు. భర్తృహరి తన నీతిశతకములో చెప్పినట్టు
జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం ||
విశ్వనాథ్ గారు ఆయనతో ఎందుకు ఆ శ్లోకము పాడించారో - అది ఆయన విషయములోనే నిజమైంది.
ॐ 🙏Very interesting. Pl see the above video, the difference in vedic chants chanting for gayathri mantra
No comments:
Post a Comment