Wednesday, 9 June 2021

  🕉️వైశాఖ పురాణం 30వ అధ్యాయము


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||


🌻 పుష్కరిణి - ఫలశ్రుతి 🌻


💫🌹నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును.

💫🌹ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు.

💫🌹పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును.

💫🌹దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను. త్రయోదశినాడు దేవతలకు నమృతమును యిచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను.

💫🌹పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ యను మూడు తిధులకును, "ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను యిచ్చును. వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. యీ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము.

💫🌹ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను, దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు, దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములున్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు.

💫🌹వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి.

💫🌹కావున నీ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని  యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చి సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు.

💫🌹ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు.

💫🌹శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.

💫🌹మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి.

💫🌹అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయముకంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.

💫🌹నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు.

💫🌹పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.

💫🌹అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.

💫🌹ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.


వైశాఖ పురాణం ముప్పైవ అధ్యయము సంపూర్ణము


🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏
 

[8:19 pm, 09/06/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌻 తిరుమల సర్వస్వం 🌻


🎈 భాగము 93 (మహామణి మండపం లేదా, తిరుమామణిమండపం) 🎈


🍃🌹క్యూ మార్గంలో నడుస్తూనే గరుత్మంతుని దర్శనం చేసుకుని, ఆనందనిలయానికి ప్రధాన ద్వారమైన బంగారువాకిలి ఎదురుగా నున్న "ఘంటామండపం" లేదా "మహామణిమండపం" లోనికి ప్రవేశించాము. ఈ మంటపం ఈ క్రింది విధంగా అనుసంధానిస్తూ, దాదాపుగా చతురస్రాకారంలో ఉంటుంది.

తూర్పుదిక్కున గరుడాళ్వార్ సన్నిధిని,
- పడమరదిక్కున బంగారువాకిలిని,
ఉత్తరదిక్కున హుండీని,
తూర్పుదిక్కున విమానప్రదక్షిణాపథాన్ని.

🍃🌹ఈ మండపం పైకప్పుకు ఆధారంగా ఉన్న 16 శిలా స్తంభాలపై - శ్రీమహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరుడు, వరదరాజస్వామి, ఆదివరాహస్వామి యొక్క ఆకృతులు కడు రమణీయంగా చెక్కబడి ఉంటాయి. పైకప్పు అంతా అత్యద్భుతమైన పౌరాణిక ఘట్టాలు మలచబడి, బంగారు తాపడంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. 15 వ శతాబ్దం ప్రారంభంలో, చంద్రగిరికి చెందిన ఓ విజయనగర పాలకుని ద్వారా నిర్మింపబడ్డ ఈ మండపంలోనే, ప్రతిరోజు సుప్రభాత సమయంలో స్వామివారికి మేలుకొలుపులు పాడుతారు.

🍃🌹ప్రతి బుధవారం, ఈ మంటపంలోనే, ఆర్జిత సేవయైన "సహస్రకలశాభిషేకం" కూడా జరుగుతుంది. ఈ మండపంలో, బంగారువాకిలికి ఎడమప్రక్కగా రెండు పెద్ద ఘంటలు వ్రేలాడదీయబడి ఉంటాయి. తమిళంలో "మహామణి" అంటే " పెద్దఘంట" అని అర్థం. అందువల్లనే ఈ మంటపానికి ఆ పేర్లు వచ్చాయి. ఈ ఘంటలను మ్రోగించే ఆలయ పరిచారకులను "ఘంటాపాణి" గా పిలుస్తారు. ఈ ఘంటానాదం విన్న తరువాతనే, చంద్రగిరిలో నివసించే స్వామివారి వీరభక్తులైన విజయనగర రాజులు ఆహారాన్ని స్వీకరించేవారట. ఆ సాంప్రదాయం చాలామంది తిరుమల వాసులు నేటికీ కొనసాగిస్తున్నారు.

🍃🌹ఈ రెండు ఘంటలలో ఒక దానిని "నారాయణఘంట" గానూ, రెండవ దానిని "గోవిందునిఘంట" గానూ వ్యవహరిస్తారు. ఒకప్పుడు బంగారువాకిలికి ఇరు ప్రక్కలా ఉండే ఈ రెండు ఘంటలను ప్రస్తుతం ఒక పార్శ్వానికి చేర్చి, రెండింటిని ప్రక్క- ప్రక్కనే అమర్చారు.


🌻 జయ-విజయులు 🌻


🍃🌹శ్రీవారు కొలువుండే వైకుంఠానికి ఏ విధంగా జయవిజయులు కాపుంటారో, అదేవిధంగా బంగారువాకిలికి దక్షిణాన జయుడు - ఉత్తరాన విజయుడు; శంఖు, చక్ర, గదాధారులై, సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపాల్లా దర్శనమిస్తుంటారు. వీరిని "చండ - ప్రచండులు" అని కూడా వ్యవహరిస్తారు. పది అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాలు - తర్జనితో భక్తులను ఎల్లవేళలా హెచ్చరిస్తుంటాయి.

🍃🌹స్వామి పుష్కరిణిలో పవిత్రస్నాన మాచరించి, శుచిగా ఆలయంలోకి ప్రవేశించి, ఆలయ నిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారేమో! ఈ మూర్తులను జాగ్రత్తగా గమనిస్తే, వారి నోళ్లకు చిన్నచిన్న కోరలుంటాయి. దానికి కారణం పూర్వజన్మలో వారు రాక్షసులుగా జన్మించడమే.

🍃🌹పురాణాల్లోకి వెళితే - ఒకప్పుడు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండే జయ - విజయులు; కారణాంతాన - బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాది మునులచే శపించబడి; కృతయుగంలో హిరణ్యాక్ష - హిరణ్యకశిపులు గానూ, త్రేతాయుగంలో రావణ - కుంభకర్ణులు గానూ, ద్వాపరయుగంలో శిశుపాల - దంతావక్తులు గానూ జన్మించి, వారి వారి దుష్క్రుత్యాల వల్ల శ్రీవారి చేతిలో సంహరింప బడ్డారు.

🍃🌹శాపకాలం పూర్తయిన తర్వాత, శ్రీమహావిష్ణువు కటాక్షంతో - తిరిగి కలియుగంలో శ్రీనివాసునుకి ద్వారపాలకులుగా నియమింపబడ్డారు. ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు తరువాత, విష్ణుమూర్తి పరివార దేవతలలో అత్యంత ప్రముఖులు వీరే!

🍃🌹శ్రీవారిసన్నిధి యందున్న బంగారు కటాంజనాలలో నిరంతరం నిలుచుని ఉండే మహద్భాగ్యానికి నోచుకున్న జయ - విజయులకు భక్తిపూర్వకంగా నమస్కరించి - శ్రీవారి దర్శనార్థం బంగారువాకిలి లోనికి ప్రవేశిద్దాం...అయితే, చిన్న మనవి: కొన్ని అర్జిత సేవలలో పాల్గొనేవారు, విఐపి బ్రేక్ దర్శనం అనుమతి ఉన్న భక్తులు మాత్రమే బంగారువాకిలి దాటి లోనికి ప్రవేశించగలరు. మిగతా భక్తులందరూ, ఇక్కడినుండే, "లఘుదర్శనం" ద్వారా శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని, మహామణి మంటపానికి దక్షిణంగా ఉన్న కటకటాల ద్వారం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.

🍃🌹జయ - విజయులకు నమస్కరించుకుని, వారి అనుమతితో "బంగారువాకిలి" ముంగిట చేరుకున్నాం. బంగారువాకిలి, దాని లోపల ఉన్న ఇతర మండపాలు మరియు "గర్భాలయం" గురించి ఇప్పుడు తెలుసుకుందాం...


🌻 బంగారువాకిలి 🌻


🍃🌹శ్రీవారి ఆలయానికి మూడవది (మొదటిది "మహాద్వారం" లేదా "పడికావలి", రెండవది "వెండివాకిలి" లేదా "నడిమి పడికావలి"), అత్యంత ముఖ్యమైనది అయిన ఈ బంగారువాకిలి పేరుకు తగ్గట్లే, పసిడి కాంతులతో తళతళలాడుతూ, లక్ష్మీవల్లభుడైన శ్రీనివాసుని అనంతమైన ఐశ్వర్యాన్ని, వైకుంఠ వైభవాన్ని చాటుతూ ఉంటుంది.

🍃🌹బంగారువాకిలి గుమ్మం పై భాగాన - గుమ్మానికి ఇరుప్రక్కలా - జయవిజయుల మధ్యనున్న ప్రదేశమంతా - కడు రమణీయమైన పుష్పాలు, లతలు చెక్కబడి బంగారు తాపడంతో మెరుస్తూ ఉంటాయి.

🍃🌹ఈ రెండు తలుపులు గళ్ళు - గళ్ళుగా విభజించబడి, ప్రతి గడిలోనూ ఒక్కో అద్భుతమైన ప్రతిమ అచ్చెరువు గొల్పుతూ ఉంటుంది. సుదర్శనచక్రం, శ్రీవేంకటేశ్వరుడు, మహావిష్ణువు, పాంచజన్యం, వాసుదేవుని విభిన్నరూపాలు, కేశవుని ద్వాదశమూర్తులు (కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు), దశావతారరాలు - కన్నులకింపుగా చెక్కబడి, సాక్షాత్తూ వైకుంఠమే ఇక్కడికి చేరుకున్నట్లుగా గోచరిస్తుంది.

🍃🌹పై గడపకు ఇరుపార్శ్వాలలో గజరాజులచే పూజింపబడుతున్న గజమహాలక్ష్మి పద్మాసీనురాలై ఉంటుంది. బంగారువాకిళ్ళను సుప్రభాత సమయంలో "కుంచెకోల" అనే పరికరంతో, జియ్యంగార్లు - అర్చకులు - ఆలయ అధికారుల వద్దనున్న తాళంచెవులతో అందరి సమక్షంలో తెరిచే విస్తారమైన ప్రక్రియను మనం "సుప్రభాతసేవ" లో తెలుసుకున్నాం...

🍃🌹ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు చేరుకున్న భక్తులు - పూటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి, మ్రొక్కుబడులు చెల్లించుకుని, బంగారువాకిలి వెలుపలి నుండే క్షణకాల దర్శనంతో సంతృప్తిపడి, శ్రీనివాసుని దివ్యమంగళమూర్తి నుండి దృష్టి మరల్చుకోలేక, రెప్పవేస్తే కన్నుల ముందున్న పెన్నిధి కనుమరు గవుతుందేమోనన్న బెంగతో, అతికష్టం మీద ముందుకు సాగిపోతారు. స్వామివారిని ఎన్నెన్నో కోర్కెలు కోరుదామని వచ్చిన భక్తులు - ఆనందాతిశయంతో, భక్తిపారవశ్యంతో, తన్మయంతో తమను తాము మైమరచిపోతారు.

🍃🌹మనం కోరుకో గలిగింది అత్యల్పం - స్వామివారు ప్రసాదించ గలిగింది అనంతం! భక్తుని మానసం భగవంతు డెరుగడా?కొండంత దేవుడిని కోటి కోర్కెలతో కష్టపెట్టకుండా, క్షణకాల దర్శనంలో ఆ చిన్మయానంద రూపాన్ని గుండెగుడిలో పదిలంగా కొలువుంచు కోవడం శ్రేయస్కరం!



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment