Monday, 7 June 2021

 

 

 

 🕉️ వైశాఖ పురాణం 26 వ అధ్యాయము 🕉️


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||


🌻 వాల్మీకి జన్మ 🌻

💫🌹నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను.

💫🌹తమయెదురుగ నున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి 'ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను.

💫🌹శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు.

💫🌹జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను.

💫🌹ఒక వైశాఖమాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖవ్రతమును, ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరిపూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరికథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి.

💫🌹నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోనివారందరికిని యిబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని.

💫🌹ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను, సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, యెనుబదినాలుగు లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన యీ మఱ్ఱిచెట్టు తొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమునందితిని.

💫🌹నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై యిట్లు నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము.

💫🌹నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను.

💫🌹శంఖమునియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. ధ్యాన స్తిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుటవలన శ్రీహరి మహిమను వినుటవలన నీ పాపములన్నియు పోయినవి.

💫🌹నీవు దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, యింద్రియజయము కలవాడై సదా విష్ణుకధాసక్తుడవు కాగలవు.

💫🌹ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా భయపడకుము. నీకు నాయనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమునగాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమునుచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా.

💫🌹ఇట్టి స్థితిలో శ్రద్దాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమునుచ్చరించినవారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచినవారైనను శ్రీహరిపదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జనసహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా!

💫🌹శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తసులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారి నుద్దేశించి పలికెను.

💫🌹ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను.

💫🌹శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమగు 'రామా యను రెండక్షరముల మంత్రము నుపదేశించెను.

💫🌹నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని భూలోకమున ప్రసిద్దినందగలవు.

💫🌹అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట  బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను.

💫🌹అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకఱ్ఱలు మున్నగువాని నిచ్చుచు బాటసారుల ననేకవిధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవచేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.

💫🌹కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము నాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను.

💫🌹వానిని జూచి నాట్యకత్తెయొకతె మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది.

💫🌹శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదులను మున్నగువానిని దుర్బుద్ధితో నపహరించియు వైశాఖమహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు దెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు.

💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

వైశాఖ పురాణం ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము

🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

 నమస్కారం ఎవరికి.. ఎలా?
నమస్కారం భారతీయ సంస్కృతి. అది ఉత్తమ సంస్కారం అంటారు పెద్దలు. ఎలా నమస్కారం చేయాలనే కాదు ఎన్నిసార్లు నమస్కారం చేయాలో మన శాస్త్రంలో లెక్క ఉంది. ప్రసన్న వదనంతో రెండు చేతులు జోడించి వాటిని ఛాతీకి ఆనించి నమస్కారం చేయాలి. నమస్కారం ఎవరికి... ఎలా చేయాలో తెలుసుకుందాం...
ఈ భూమి మన తల్లి. మన దినచర్యలో భాగంగా తెలిసో తెలియకో మనం ఎన్నో అపరాధాలు చెస్తున్నాం. అందుకే నిద్ర లేవగానే  తప్పులు మన్నించమని ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి. ఆ తరువాత ఇంటిలో తల్లిదండ్రులుంటే వారికి నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అన్ని వేళలా, అన్ని చోట్లా చేయ నవసరం లేదు. పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలనుకుంటే వక్షస్థలాన్ని నేలకు తాకేలా శిరస్సు నేలపై ఉంచాలి. రెండు చేతులు నమస్కార స్థితిలో సాగదీసి ముందుకు చాపాలి. దేవుడికి ఈ నమస్కారం చేస్తున్నప్పుడు పురుషులు ఛాతి మీద వస్త్రం ఉంచుకోరాదు. అందువలన సాంప్రదాయకంగా దేవునికి, మఠాధిపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నపుడు ఈ నియమం పాటించవచ్చు.
పూర్వకాలంలో అంతవరకు పరిచయం లేని పెద్దలకు నమస్కారం చేస్తున్నప్పుడు తమ వంశం పరంపర, గోత్రం, పేరు చెప్పే ఆచారం ఉండేది. ఆధునిక కాలంలో అది కుదరదు. అయినా నమస్కారం చేస్తూ స్వంత పరిచయం చేసుకోవడం మంచిది. ఒక్కొక్కప్పుడు అవతలి వ్యక్తి హోదాలో పెద్ద, వయస్సులో చిన్న కావచ్చు. వయస్సులో చిన్నవారికి నమస్కారం చెయ్యం కాని హోదాలో పెద్ద కాబట్టి తప్పక నమస్కారం చేయాలి. కొందరు ఉన్నత అధికారులు తమ కన్నా తక్కువ ఉద్యోగంలో ఉన్న పెద్దవారికి ముందుగా నమస్కారం చేసిన ఉదాహరణలున్నాయి.
కొన్ని సందర్భాల్లో వంగి నమస్కరించవలసి వస్తుంది. అప్పుడు వారి పాదాలను చేతితో తాకి ఆ చేతిని మన శిరస్సు మీద ఉంచుకోవాలి. తల్లిదండ్రులకు, తనకన్నా పెద్దవారైన ఇతర కుటుంబ సభ్యులకు ఒకసారి నమస్కారం చేస్తే చాలు. సన్న్యాసులు, మఠాధీశులు, చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు నాలుగు పర్యాయాలు నమస్కారం చేయాలి. గుడిలోనూ పూజామందిరంలోనూ దేముడి ముందు నమస్కారం చేయాలి. అది ఒక స్థానంలో నిల్చుని అయినా లేదా ఆత్మప్రదక్షిణ చేస్తూనో చేయాలి. అమ్మవారి విషయంలో నాలుగు పర్యాయాలు నమస్కారం చెయ్యాలి. భక్తితో నమస్కరిస్తే అది అనంతకోటి ఫలాలనిస్తుందని శాస్త్రవచనం.
ఇంతవరకు నమస్కారం చేసేవారి ధర్మం గురించి తెలుసుకున్నాం. మరి దానిని స్వీకరించినవారి ధర్మమేమిటి? మనకు పురుషులు నమస్కరిస్తే ‘దీర్ఘ ఆయుష్మాన్‌ భవ’ అని, పుణ్యస్త్రీలు అయితే ‘దీర్ఘ సుమంగళీ భవ’ అనీ ఆశీర్వదించాలి. పిల్లలు నమస్కరిస్తే ‘సువిద్యా పాప్తి రస్తు’ అని, అవివాహితులయిన యువతీ యువకులను శీఘ్రమేవ వివాహ ప్రాప్తి రస్తు’ అని దీవించాలి. సందర్భానుసారంగా వారి కోరికలు సిద్ధించాలని ఆశీర్వదించాలి. భగవంతుడు అభయ ముద్రలోనే ఉంటాడు కాబట్టి ఆయన మన నమస్కారం స్వీకరించేడని సంతృప్తి పడాలి. ఒక శ్లోక భావాన్ని అనుసరించి నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా మనం ఎవరికి నమస్కరించినా అది చివరకు కేశవుడికే చెందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
–గుమ్మా ప్రసాద రావు
👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
కదిలిపోయేదే కాలం


కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు. అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు. నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి. కలతపడటమూ ఉంటుంది. దానికి నివారణోపాయం- మనోధైర్యంతో ఎదుర్కోవడమే. సంయమనంతో సమాధానపడటమే. అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది, ఎగిరిపోతుంది. కష్టం కాలంలాంటిది. కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో సంభవించిన కష్టమూ కదిలిపోతుంది.

జీవితం చాలా విలువైంది. నిజానికి విలువ కట్టలేనిది. జీవితంలోని ప్రతిక్షణం కూడా. ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు? మనం లోతుగా ఆలోచించాలి. కష్టాలు, కన్నీళ్లు... ఇవన్నీ అధిగమించగలిగినవి. కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు. ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు. కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం, మన ప్రగతి ఆగిపోకూడదు.

ఏ కష్టం కోసమైనా సరే జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు. కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే, దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది. కొత్త క్షణం వస్తుంది. దానితోపాటే కొంత సుఖం రావచ్చు. కొత్త సుఖం రావచ్చు. పోనీ... కనీసం కొత్త కష్టమైనా రావచ్చు. వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా? అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక... ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు. లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు. మార్పు ప్రకృతి సహజం. రుతువులు మారతాయి. రాత్రింబవళ్లు మారతాయి. సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు.
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే. పిల్లలు పిల్లకాలువలో వేసిన కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది. మనం పిల్లల్లా వినోదంగా చూడాలి. వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని. నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని, తడిసిపోతుందని. అయినా క్రీడావినోదం కావాలంటే ఆ కష్టానికి వెరవకూడదు. ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి. పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు. టైటానిక్‌ చేసినంత ఉత్సాహంతో. మనం పిల్లలపాటి చేయమా? ఆ మాత్రం అనర్థాలను, ఆటంకాలను అధిగమించలేమా? దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు- అది సుఖమైనా, కష్టమైనా! కష్టాన్ని కదిలిపోతున్న క్షణంతోపాటు మరచిపోవాలి. కదిలిపోతున్న క్షణాన్ని మనం మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం. పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం. అది సరికాదు. మనముందు ఎవరూ ఆపలేని మరో అద్భుత క్షణం ఉంది. మరెన్నో అమృత క్షణాలున్నాయి. వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం.
నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు!

******
ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుటచే బ్రహ్మహత్యా దోషము సంభవించి వైభవము కోల్పోయాడు .అప్పుడు అతడు నిషాద పర్వతము మీద అజ్ఞాతవాసము చేయుచుండెను.దేవతలు,మునులును స్వర్గము నకు
రాజు లేక అరాచకమై పోయి ఆపదలు వచ్చునని భయపడి అనేక యజ్ఞములు చేసి మహా మహిమాన్వితుడైన నహుషుడి దగ్గరికి వెళ్లి ఇంద్రపదవి స్వీకరించమని కోరిరి.అతడు నాకు యోగ్యత వున్నదా?
అని సందేహించగా,యముడు,వరుణుడు మొదలగు వారు తమ శక్తి ,దర్పము లలో కొంత భాగము అతనికి యిచ్చి అతన్ని ఇంద్రుడిని చేసి స్వర్గమునకు అధిపతిని చేసినారు.భూలోకములో నున్నంత కాలము
మహాత్ముడు,శాంతుడు అని విఖ్యాతి పొందిన నహుషుడు స్వర్గాధి పత్యము రాగానే మారి పోయాడు.
ఇంక నాకేమి తక్కువ అని గర్వముతో తన యిష్టమొచ్చి నటుల ప్రవర్తించ సాగాడు.పరస్త్రీలను కన్నెత్తి
కూడా చూడనివాడు అప్సరసలతో కాలము గడపు తూ కొలువుకు రాకుండా నిర్లక్ష్యముగా ప్రవర్తించ
సాగాడు. అంతే కాకుండా మంచి చెడ్డలు మరిచి త్రిలోక సుందరి యగు శచీదేవిని చూసి మోహించి రమ్మని కబురు పంపెను.ఆమె దేవగురువాగు బృహస్పతిని శరణు కోరింది.దేవతలందరూ కలిసి ఆమెకు
ఒక ఉపాయము చెప్పిరి.ఆమె నహుషుని దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి నాకు ఒక వ్రతము వుంది,
నీవు పల్లకి ఎక్కి మునుల చేత మోయించుకొని వస్తే నేను నీదాన్నవుతాను అని చెప్పింది.
వెంటనే నహుషుడు సప్తరుషులను పిలిచి మీరు బోయీలై నన్ను పట్టణమంతయు తిప్పవలయును అని ఆజ్ఞాపించెను.అది విని మునులందరూ తెల్లబోయారు.కానీ చేయునది లేక ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి మోయసాగారు.నహుషుడు గర్వముతో వారిని యిష్ట మోచ్చినట్లు మాటాడుతూ అదిలిస్తూ
మెల్లగా నడుస్తే ఊపిరి లేని వాళ్ళ లాగా అదేమీ నడక యని, వేగముగా నడిస్తే, అంత వేగముగా పోతున్నారెందుకు అని 'సర్ప'సర్ప' అంటే నిదానము,నిదానము అనేవాడు .మధ్యాహ్న కాలమైనందున
మునులు పల్లకి దింపి వేదమంత్రములు చెప్పసాగారు.నహషుడు ఆ మంత్రములు చాలించి పల్లకి మోయండి అని గద్దించెను.వేదమత్రములను గురించి యెగతాళి చేసెను.దానితో అగస్త్యునకు కోపము వచ్చి యింత అహంకారము నీకు తగదు,'సర్ప'సర్ప' అని మమ్మల్ని అదిలించినావు కనుక .భూలోకములో పామువై పడి వుండు అని శాప మిస్తాడు.
అప్పుడు నహుషుడి కళ్ళు తెరుచుకుంటాయి అగస్త్యుని కాళ్ళపై బడి క్షమాపణ వేడి శాపవిమోచనం
ప్రసాదించమని వేడుకుంటాడు.అగస్త్యుడు శాంతించి సర్పముగా ఉంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ వుండు. నీవు వేసిన ప్రశ్నలకు ఎవరు
సరియైన సమాధానము ఎవరు చెప్తారో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు.నహుషుడు వేసిన ప్రశ్నలే 'యక్షప్రశ్నలు' గా ప్రసిద్ధికెక్కాయి.
పాండవులలో నలుగురు యీతని ప్రశ్నలకు సమాధానము చెప్పలేక చనిపోతారు.చివరకు ధర్మరాజు వచ్చి యీతని ప్రశ్నలకు సరియైన సమాధానము యిస్తాడు.అప్పుడు నీకేమి వరము కావలెనో అడుగు అని అడుగుతాడు.అప్పుడు నా నలుగురి తమ్ముళ్ళను బ్రతికించ మని అడుగుతాడు.అప్పుడు
నహుషుడు వీరిలో ఎవరినైనా ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించ మంటావో చెప్పు అని అడుగు తాడు.అప్పుడు ధర్మరాజు సహదేవుడిని బ్రతికించ మంటాడు.నహుషుడు ఆశ్చర్యపోయి నీవు బలవంతు లైన నీ సొంత సోదరులను కోరకుండా సవతి తమ్ముడైన సహదేవుడిని కోరుకున్నావు ఎందుకు అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు కుంతీ పుత్రులలో జ్యేష్టుడిని నేను బ్రతికి వున్నాను మా పినతల్లి మాద్రి పుత్రులలో కనిష్టుడైన సహదేవుడు బ్రతికి ఉండుట న్యాయము కదా!అందుకనే సహదేవుడిని కోరుకున్నాను అంటాడు.అతని న్యాయ,ధర్మ సంద్రతకు మెచ్చి నలుగురినీ బ్రతికించి తన స్వస్వరూపముతో వెళ్ళిపోతాడు నహుషుడు.ఆ ప్రశ్నలే లోకములో యక్ష ప్రశ్నలు అని ప్రసిద్ధి చెందాయి.
అధికార గర్వముతో పెద్దలను ధిక్కరించి నిందించరాదు అని ఈకథ నీతి.

కదిలిపోయేదే కాలం


కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు. అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు. నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి. కలతపడటమూ ఉంటుంది. దానికి నివారణోపాయం- మనోధైర్యంతో ఎదుర్కోవడమే. సంయమనంతో సమాధానపడటమే. అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది, ఎగిరిపోతుంది. కష్టం కాలంలాంటిది. కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో సంభవించిన కష్టమూ కదిలిపోతుంది.

జీవితం చాలా విలువైంది. నిజానికి విలువ కట్టలేనిది. జీవితంలోని ప్రతిక్షణం కూడా. ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు? మనం లోతుగా ఆలోచించాలి. కష్టాలు, కన్నీళ్లు... ఇవన్నీ అధిగమించగలిగినవి. కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు. ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు. కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం, మన ప్రగతి ఆగిపోకూడదు.

ఏ కష్టం కోసమైనా సరే జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు. కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే, దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది. కొత్త క్షణం వస్తుంది. దానితోపాటే కొంత సుఖం రావచ్చు. కొత్త సుఖం రావచ్చు. పోనీ... కనీసం కొత్త కష్టమైనా రావచ్చు. వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా? అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక... ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు. లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు. మార్పు ప్రకృతి సహజం. రుతువులు మారతాయి. రాత్రింబవళ్లు మారతాయి. సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు.
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే. పిల్లలు పిల్లకాలువలో వేసిన కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది. మనం పిల్లల్లా వినోదంగా చూడాలి. వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని. నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని, తడిసిపోతుందని. అయినా క్రీడావినోదం కావాలంటే ఆ కష్టానికి వెరవకూడదు. ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి. పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు. టైటానిక్‌ చేసినంత ఉత్సాహంతో. మనం
 పిల్లలపాటి చేయమా? ఆ మాత్రం అనర్థాలను, ఆటంకాలను అధిగమించలేమా? దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు- అది సుఖమైనా, కష్టమైనా! కష్టాన్ని కదిలిపోతున్న క్షణంతోపాటు మరచిపోవాలి. కదిలిపోతున్న క్షణాన్ని మనం మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం. పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం. అది సరికాదు. మనముందు ఎవరూ ఆపలేని మరో అద్భుత క్షణం ఉంది. మరెన్నో అమృత క్షణాలున్నాయి. వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం.
నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు!

No comments:

Post a Comment