మహాభారతంలో విచిత్రవీర్యుని కుమారుడు దృతరాష్ట్రుడికి, గాంధారితో వివాహం ఎలా జరిగింది?
ఈ కులము వివర్ధింపగ నాకభిమతము..అంటాడు భీష్ముడు.
రాజ్యానికి తానే వారసుడైనా, తండ్రి శంతనుని కోరిక తీర్చడం పితౄణం తీర్చుకోవడం లో భాగమని —దాశరాజు కోరికకు కట్టు బడి తన జీవితాంతం బ్రహ్మ చర్య నిష్ఠలోనే ఉండిపోయాడు.
ఐనా, తన తండ్రి రాజ్యం , ఆ వంశం వృద్ధిలో ఉండాలని భావించాడు.
వంశ వృద్ధి సంతానం వల్లనే కదా కలిగేది! తన సోదరులు చిత్రాంగదుడూ, విచిత్ర వీర్యుడూ నిస్సంతుగానే పోయారాయె. వ్యాస మనీషి వల్ల వంశం నిలబడ్డా , వాళ్ల పెండ్లిండ్లయితే తన బాధ్యత కొంతైనా తీరినట్టు.
ధృతరాష్ట్రుడు జాత్యంధుడాయె. గాంధార దేశపురాజు సుబలుడు . అతడి ఒక కూతురు గాంధారి. ఆమెకు నూటొక్క మంది పిల్లలను పొందే వరం శంకరుని వల్ల లభించింది అని తెలిసి —మీ అమ్మాయిని ఇవ్వండి అని తగిన వృద్ధులను అడగబంపాడు.ఆయన కురుకుల విస్తారకుడైన ధృతరాష్ట్రుడే తగినవాడని తలచి ఆ రాజునకు గాంధారి నిచ్చితి— అన్నాడు.
.ఎదుటి వారి ధార్మికమైన కోరికను తెలుసుకొని సుబలుడు " ఇచ్చితి" అన్నాడు. కురువంశం ప్రతిష్టను చూచిన సుబలుడు ముందు వెనుకలు ఆలోచించ లేదు. కౌరవ రాజ్యం ధర్మ బుద్ధి కి, పరాక్రమానికీ ప్రసిద్ధం. అలాంటి రాజ్యం తో బాంధవ్యం ఘనమైనదిగా భావించాడాయన.. గొప్ప రాజ్యం తో స్నేహబాంధవ్యాలు తన రాజ్య క్షేమానికి మంచిదని భావించాడు.
ఇందులో ఏ వంచనలూ భయాలు లేవు. (ఉంటే వ్యాసమహర్షి దాచిపెట్టడు. )
తన భర్త గుడ్డి వాడని విని గాంధారి—^ భర్త ను చూచి ఆయనలో దోషాలు ఎంచడం దోషం^— అనే పాతివ్రత్య భావనలో అపుడే కళ్ళకు గంతలు కట్టు కొన్నది. (ఆమె చెల్లెళ్లు పది మందిని గూడా ఆ తర్వాత వివాహ మాడాడు .మరి వంద మందిని క్షత్రియ కన్యలను గూడా ధృతరాష్ట్రుడికి తెచ్చి పెళ్ళి చేశాడు భీష్ముడు. ..
, రాజులకెందరో భార్యలు, సంతానం ఉంటారు అనేది విస్మరించ గూడదు. సుబలుడు, అతని సంతతి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షంలో నిలిచి యుద్ధం చేశారు. వాళ్ల బాంధవ్యం ఏ మాత్రమూ చివరివరకూ చెడలేదు.
రాజ్యానికి ఉత్తరాధికారి మరెవరైనా ఉంటే— మిగిలిన అన్న దమ్ములు అవసరాన్నిబట్టి మరో బంధురాజ్యంలో ఉండేవారు. (రామాయణంలో భరత శత్రుఘ్నులు వాళ్లకు రాజ్యానికి రాజయ్యే బాధ్యత లేదు గాబట్టి .పెండ్లి అయిన తర్వాత వాళ్ల మేనమామగారి రాజ్యం లో ఉన్నారు.దశరథునికి విపత్తు కలిగినట్లు వార్త తెలిసి వస్తారు) శకుని గాంధారి పెండ్లి చేసి వెంటనే వెళ్లి పోయాడు. రాక పోకలు సాగిస్తూన్నాడు..
శకుని కొన్ని ముఖ్య ఘట్టాలలో తన మేనల్లుళ్ళ దగ్గర తానుగా ఉండదలచి ఉన్నాడు గానీ, ఏదో కుట్ర చేయడానికి ఆతని తండ్రి సుబలుడు పంపించలేదు. గాంధార దేశానికి తిరిగి పోక హస్తినలోనే ఉన్నాడని చెప్పలేము. (70 సంవత్సరాల పాటు ఇక్కడే దుర్యోధనుడి ప్రక్కన కూర్చొని ఉంటాడా ?
రాజులందరూ జూదం ( వేట గూడా)అంటే ఇష్ట పడతారు, అందులో మెలకువలు, లోతుపాతులు వాళ్ల అభిరుచిని బట్టి నేర్చుకుంటారు. ఆ విద్యలు తగినపుడు, తగిన చోట ప్రయోగించవలసిన వస్తే ప్రయోగిస్తారు.
(ధర్మరాజు అరణ్య వాస కాలంలో బృహదశ్వ మహా ముని దగ్గర ఈ విద్యలు నేర్చుకొనే వచ్చాడు. మళ్ళీ వెనకటి పరిస్థితి వస్తే, దెబ్బ తినగూడదని , నేర్చుకొన్నాడు. నల మహారాజు గూడా ఋతుపర్ణ మహారాజు వల్ల ఆ అక్ష విద్య నేర్చాడు. దానితోనే తిరిగి తన రాజ్యం పొందాడు.
శకుని, మరి ముగ్గురు ఆ రకమైన శాబర విద్యలు ( క్షుద్రం) నేర్చిన వాళ్లు పాచికలతో నిత్యమూ క్రీడిస్తూ (ప్రాక్టీస్) ఉన్నారు అని విదురుడు ధర్మరాజు కు ఇంద్రప్రస్థంలోనే , తాను ఆహ్వానింపబోయినపుడే చెప్తాడు.
ఇక్కడ తప్పు తండ్రిగా ఎంతో గౌరవం తమ్ముడి బిడ్డల దగ్గర పొందుతూ , వాళ్ల పతనాన్ని కోరుకున్న ధృతరాష్ట్రుడిదే.
వంశ గౌరవం నిలప వలసిన వాడే , కారణమేదైనా— కపటంగా ప్రవర్తిస్తే జరిగేదిదే. సర్వ నాశనం చేసుకొని, పదేళ్ళకు పైగా పుత్ర శోకంతో దీనంగా పరాధీనం గా బతకు ఈడ్చవలసిన దుస్థితి ఊరక వస్తుందా? చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ .
కపటంగా ఇది సుహృత్ ద్యూతమని, పెద్దలు మీరు ఆడుతూ ఉండగా చూడాలని ముచ్చట పడుతున్నారని కథలు చెప్పి, బలవత్ ద్యూతం ఇతరుని చేత (న్యాయ విరుద్ధం) ఆడించి , తెలిసే వంచన చేశారు ధృతరాష్ట్రుడు, అతని కొడుకులు.
శకుని ప్రధానుడు కాదు, సహాయకుడు . అతడూ తన కంటే చిన్న వాడైన సొంత అల్లుడి చేతిలోనే మరణించాడు. అపకీర్తి మూటగట్టు కొన్నాడు.
ఈ కథ ఎందుకు పుట్టింది....
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు..
ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.
ఎన్నో అసహజాలు.., అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...
రీజనింగ్ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ #ఏడు_చేపల_కథ....
నిజానికి రాజు గారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.
అడవికి పోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా!
అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు.
చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం.
వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తి పోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా...
నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్ ప్రశ్న... అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు..
ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు.
అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి..
రాజు గారు అంటే మనిషి..
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషి లోని సప్త ధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.
*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం. *
రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే ..
మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )
1. కామ 2. క్రోధ 3. లోభ
4. మోహ 5. మద 6. మాత్సర్యాలు
వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండ గట్టవచ్చు... అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
అందుకే కథలో ఆరు చేపలను ఎండ గట్టినట్టు చెప్పారు.
రాజు గారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.
ఏమిటా చేప... అది మనస్సు
దీన్ని జయించడం చాలా కష్టం.
ఎంత ప్రయత్నించినా అది ఎండదు.
మనస్సు అంటే ఏమిటి..?
మనస్సు అంటే సంకల్ప వికల్పాలు..
ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచు కొస్తుంది.
మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవిత కాలం చాలదు.
కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు.
మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది..?
గడ్డిమేటు
గడ్డిమేటు అంటే ఏమిటి...?
కుప్పపోసిన అజ్ఞానం..
గడ్డిమేటులా పేరుకు పోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా..
మామూలు గడ్డికుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
కానీ అజ్ఞానం అలాంటిది కాదు.
జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే... ఆ కుప్ప తరిగేది కాదు.., తగ్గేది కాదు.
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే ఏం చేయాలి..
ఆవు వచ్చి మేయాలి.
ఆవు ఎక్కడి నుంచి రావాలి.... అసలు ఆవు అంటే ఏమిటి...?
ఆవు అంటే #జ్ఞానం...
జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.
లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు..
(జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం)
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధ పురుషుడు, యోగ పురుషుడు మాత్రమే...
ఈ గోవును ఎవ్వరు మేపాలి.
గొల్లవాడు మేపాలి.... గొల్లవాడు అంటే ఎవరు..?
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా..
అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞాన రూపంగా మనందరికి ధారపోశాడు.
ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు...
ఏమిరా నాయనా.. ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు..?
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ... ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.
ఓ జగన్మాతా.. ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు..?
ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు..?
వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమ..
దానికి ఇంకోపేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది..
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా..?
లేదు... అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.
చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే.. సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,
మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.
చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట..
మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.
ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు....
*****
మన తలరాత మార్చే గీత మన లోపల ఒకడు ఉన్నాడు....
అసలైన వాడు.
కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు దొంగలు అడ్డుగా ఉన్నారు..
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు దొంగలు..!
ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం..
ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం....ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..
" కామ ఏష క్రోధ ఏష రజో
గుణ సముద్భవహ "
ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..
కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు.
ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు.....మనం Ground floor లో ఉన్నాం.
మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.
అంటే మనం తమో గుణంలో ఉన్నాం.
బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం..... ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం..... ఇంకా Ground floor లోనే ఉన్నాం.
ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.
ఆ floor పేరు ‘సత్వ గుణం..’
ఈ floor చాలా పెద్దగా ఉంటుంది....హాయిగా ఉంటుంది....
ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..
అయితే చిన్న సమస్య....... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి
వాడు మంచి దొంగవాడు మీకు మంచి మాటలే చెబుతూ ఉంటాడు మీకు Third floor కు దారి చూపిస్తాడు... ఆ floor పేరు శుద్ధ సాత్వికం.... ఇదే చివరిది..... ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోయింది.... ఆ అఖండమైన వెలుగే పరమాత్మ..అది వెలుగులకు వెలుగు, మహావెలుగు.
చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక Lift ఉంది ఆ Lift పేరే "భగవద్గీత".
గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు. పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..
******
*ఊర్వశి శాపం..*
ధర్మరాజు దివ్యాస్త్రాలు సంపాదించుకురమ్మని అర్జునుణ్ణి హిమగిరి ప్రాంతాలకు పంపాడు. అర్జునుడు దక్షిణదిశగా వెళ్ళి ఇంద్రలోక పర్వతం మీద తపస్సు చేసాడు.
ఇంద్రుడు సంతోషించి కోరినన్ని వరాలు ఇచ్చాడు. అటు తరువాత యమధర్మరాజు దండాస్త్రాన్నీ, వరుణుడు పాశాన్నీ, కుబేరుడు అంతర్ధానాస్త్రాన్నీ ఇచ్చారు.
అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాలు సంపాదించడం ఇంద్రుడికి నిజంగా ప్రీతి కలిగించింది.
తన రథ సారథి మాతలిని పిలిచి అర్జునుణ్ణి దేవలోకానికి తీసుకురావల్సిందిగా ఆజ్ఞాపించాడు.
మాతలి సరేనని వెళ్ళాడు.
మాతలి సారథ్యంలోని రథం బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా వుంది. వాయువేగంతో పరుగులు తీసే గుర్రాలు ఆ రథానికి పూంచి వున్నాయి. అవి మహాఘోషతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళాయి.
మాతలి అర్జునుడి దగ్గరకు వెళ్ళి, "అర్జునా! అమరనాథుడు నిన్ను స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. దేవ, ముని, గంధర్వ, అప్సరసలతో కొలువుతీర్చి దేవేంద్రుడు
నీ రాకకై ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ళు అక్కడే అమర సుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి వెళ్లవచ్చని ఇంద్రుడు నీతో చెప్పమన్నాడు" అన్నాడు.
అది విని అర్జునుడు మహదానందపడ్డాడు. దేవరథం అధిరోహించాడు. తక్షణం అది దివ్యపథం పట్టింది.
అమరావతీనగర మొగసాలలో ఆగింది. రథం దిగి లోకానికి నడిచాడు. అక్కడ దేవేంద్రుడు కొలువుతీరి ఉన్నాడు.
సవ్యసాచి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇంద్రుడు అర్జునుణ్ణి కౌగలించుకుని ఆప్యాయంగా శిరస్సు నిమిరాడు. నారదుడు ఆశీర్వదించాడు. తుంబురుడు పాట పాడాడు. అప్సరసలు నృత్యం చేశారు.
పార్థుడు అమరలోకంలో కొన్నాళ్ళుండి భూలోకంలో లేని సంగీత నృత్యగానాలూ, విలువిద్యలో మెళకువలూ తెలుసుకున్నాడు.
అర్జునుడి అందానికీ, ఠీవికీ, శక్తియుక్తులకీ దేవలోకంలోని అప్సరస్త్రీలు సమ్మొహితులయ్యారు. పాండవ మధ్యముడికి తన ప్రేమను అర్పించాలని సౌందర్యరాశి ఊర్వశి తహతహలాడసాగింది. అర్జునుడితో తన ప్రేమ సఫలమయ్యేట్టు చూడమని ఇంద్రుణ్ణి ప్రార్థించింది.
పార్థుడికి తన కోరిక తెలియపరచమని పరిచారిక చిత్రసేనను వేడుకుంది.
చిత్రసేన వెళ్ళి "మన్మథాకారా! అప్సరకన్య మా ఊర్వశి నిన్ను మోహించింది. నీవు లేకుండా క్షణమైనా గడపలేనంటోంది. కనుక ఆమెను చేపట్టి సుఖాలు అనుభవించు" అని అర్జునుడితో చెప్పింది.
అది విని ధనుంజయుడు చెవులు మూసుకున్నాడు. "ఆమె నాకు తల్లితో సమానం. పూజ్యురాలు. మా వంశానికి మూల పురుషుడైన పురూరవుణ్ణి ఆమె వరించింది. కనుక ఇలాంటి చెడు ఆలోచన ఆమె మనస్సులో రావటం మంచిది కాదని చెప్పు " అని బదులు చెప్పాడు.
చిత్రసేన వెళ్ళి ఆ సంగతి ఊర్వశితో చెప్పింది.
జగదేకసుందరి ఊర్వశి చిరుకోపం తెచ్చుకుని అందెలు ఘల్లుఘల్లున మోగుతుండగా తానే బయలుదేరి పార్థుడి మందిరానికి వెళ్ళింది.
"మేము అప్సరకాంతలం. భూలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వచ్చిన మహనీయులను సంతోషపెట్టటం మా విధి. పూరు వంశంలో జన్మించిన ఎందరో రాజులు స్వర్గానికి వచ్చి నాతో సౌఖ్యం అనుభవించారు. కాబట్టి నీవూ సంశయించక నాతో సుఖాలు అనుభవించు" అని చెప్పింది.
"తల్లీ! నీవు చెప్పింది నిజమే కావచ్చు. పెద్దలూ మహనీయులూ ఏమి చేసినా ఒప్పే. కాని నా వంటి వాడికి అది తగని పని. ఈ అనుచితకార్యానికి నా మనస్సు అంగీకరించదు. నన్ను మన్నించు" అన్నాడు పార్థుడు.
అర్జునుడు అలా తిరస్కరించేసరికి ఊర్వశి కోపం పట్టలేకపోయింది. "పార్థా! నేను స్త్రీని. పైగా నా అంతట నేను వలచి వచ్చినందుకు నన్ను చులకన చేశావు. పరాభవించావు. కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నీవు మానరహితుడవై ఆడపిల్లలకు ఆట పాటలు నేర్పుతూ స్త్రీ, పురుష జాతికి దేనికీ చెందకుండా వుందువు గాక!" అని తీవ్రంగా పలికి వెను దిరిగి వెళ్లి పోయింది.
ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. నాయనా! ఊర్వశి శాపానికి భయపడకు. నీకు ఒక ఏడాది అజ్ఞాత వాసం ఎలాగో చెయ్య వలసి ఉంది. ఆ సమయంలో ఇతరులు నిన్ను ఎవరూ పోల్చుకోకుండా ఉండేందుకు ఈ శాపం బాగా ఉపకరిస్తుంది. అజ్ఞాత వాసం పూర్తయ్యాక నీ అసలు రూపం నీకు వస్తుంది" అని దీవించాడు.
అర్జునుడు సంతుష్టుడైనాడు.
........
*నిన్ను నువ్వు మలచుకో! *
శాంతం, సహనం, ప్రేమ, అనురాగం, ఆనందం, సహకారం, ఉపకారం అనే తత్వాలు కలిగినవారిని ఉత్తములుగా పరిగణిస్తారు. వీటికి వ్యతిరేక గుణాలు కలుపు మొక్కల్లా మనిషి మదిలో మొలకెత్తుతూ ఉంటాయి. వెలుగు వెనకాలే చీకటి, సుఖం వెనక దుఃఖం, శాంతికి అశాంతి, ప్రేమకు ద్వేషం, అనురాగానికి అహంకారం, ఆనందానికి విషాదం... ఇలా ఎన్నో వ్యతిరేక లక్షణాలు మదిని చొరబడి చోటు చేసుకొంటాయి. మెల్లిగా పెత్తనం చలాయిస్తాయి. వివేకం, విచక్షణాజ్ఞానం కలిగిన వ్యక్తి తనలో పుట్టిన ఈ వ్యతిరేక లక్షణాలను ఎప్పటికప్పుడు పంట పొలంలోని కలుపు మొక్కల్లా ఏరి పడేస్తాడు. తెలివిగా ముందుకెళ్తాడు. బలహీనుడు దాసోహం అంటూ ఆ వికారాలకు లొంగిపోతాడు.
మనిషి మనసు కురుక్షేత్రం లాంటిది. అందులో దైవగుణ సంపద కలిగినవారు పాండవులు, అసురగుణం కలిగినవారు కౌరవులు. క్షీరసాగర మథనం సమయంలో విషం, అమృతం రెండూ పుట్టినట్లు- మానవ మానస సాగరంలో ఈ రెండు గుణాలూ మిళితమై ఉంటాయి. అలజడులు లేపడమే చెడుగుణ స్వభావం. మనం మంచికి చోటివ్వాలి. చెడును తరిమికొట్టాలి.
అరిషడ్వర్గాలు మన అంతశ్శత్రువులు. వాటిలో మొదటిది కామం. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉండటమన్నది సహజం. అనుకొన్నది తీరింది లెమ్మనుకొని హాయిగా ఊపిరి పీల్చుకొంటూండగానే దాని వెనకాలే మరో కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది. అది తీర్చుకొనేందుకు చేయరాని పనులు చేయాల్సివస్తుంది. కోర్కెల కోరల్లో చిక్కుకొన్నవారికి మనశ్శాంతి ఉండదు.
రెండోది క్రోధం. దీన్ని క్రోధాగ్నిగా ఉదాహరించారు. నిప్పు లక్షణాలన్నీ దీనికున్నాయి. ఇది తాను ఆవహించిన యజమానిని కాల్చి బూడిద చేస్తుంది. అటుపై ఎదుటివారిని తాకుతుంది. వెంటనే వాళ్ల నెత్తురును వేడెక్కించేస్తుంది. దీని మొదటి లక్షణమే అది. ఆ ప్రభావం గుండెమీద, మెదడుమీద చూపుతుంది. క్రోధంతో మనిషి వివేకం కోల్పోతాడు.
పీనాసితనమే లోభం. లోభి తాను తినడు. ఇతరులకు ఇవ్వడు. పరమాత్ముడు జీవులను భ్రమింపజేయడానికి పుట్టించిన మనోదశ మోహం. లేనిది ఉన్నట్లు, కానిది అవునన్నట్లు తోచేలా చేస్తుంది. బుద్ధిహీనతకు కారణం అవుతుంది.
మదం ఆవహించిన వ్యక్తి అంతటా- అన్నింటా తానే గొప్ప అంటాడు. తనంతటివాడు మరెవ్వడూ లేడని గొప్పలు చెప్పుకొంటాడు. మదం ఆవహించిన వ్యక్తి గుడ్డివాడితో సమానం అంటుంది నీతిశాస్త్రం.
మాత్సర్యానికి మరోపేరు అసూయ. సహించలేకపోవడం, ఓర్వలేకపోవడం వంటి లక్షణాలు దీనికున్నాయి. నరంమీద లేచిన నారికురుపులాగ ఇది మనిషిని ఓ చోట నిలకడగా నిలబడనివ్వదు. లోలోపలే సలుపుతూ ఉంటుంది.
ఈ అరిషడ్వర్గ మూకను వాటి మానాన అలా వదిలేసే బదులు మనకు అనుకూలమైన హితషడ్వర్గంగా మలచుకోవచ్చు.
దేన్నయినా కోరుకోవడం మానవ లక్షణం. చెడును కోరుకోకుండా సద్గతిని ఇచ్చే మోక్షాన్ని కోరుకోవడం మంచిది. దానికి కావాల్సిన చిత్తశుద్ధిని కోరుకోవడం ఉత్తమం. మంచి జరిగేది ఏది కోరినా ఫలితం మధురంగానే ఉంటుంది. చెడు అన్న ప్రతి విషయంపై కోపగించుకోవడం తప్పుకాదు. మంచికి ఊతమిచ్చే కోపం మనిషికి ఉత్తమ స్థితిని కలగచేస్తుంది. సద్గుణ సంపదల్ని అధికంగా కూడబెట్టుకోవడంలో లోభిగా ఉన్నా ఫర్వాలేదు. ఆత్మచింతన కావాల్సినంత పెంచుకోవడంలో తప్పేలేదు. భగవత్ చింతనపై మోహం పెంచుకోవాలి. సద్గ్రంథ పఠనంపై మోహం చూపవచ్చు. ఆత్మజ్ఞానం, జీవన్ముక్తిపై మోహం ఉత్తమం.
ఆత్మజ్ఞానం కలిగి అహంబ్రహ్మాస్మి అన్న దర్పం కలిగి ఉండటం తప్పుకాదు.
లౌకిక సుఖ దుఃఖాలపై మాత్సర్యం మంచిదే. అరిషడ్వర్గాలకు బుద్ధి చెప్పేలా ఆ ఆరింటినీ హితషడ్వర్గంగా మలచుకొంటే- జీవితం... ఆనందో బ్రహ్మ!
Xxxxxxxx
ఒక భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళి స్వామీ! ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సంసారలంపటం వదలడం లేదు. ఏం చేయాలి? అని అడిగాడు. దానికి చిరునవ్వుతో చిన్న పిల్లవాడు స్తంభాన్ని గట్టిగా పట్టుకొని స్తంభం నన్ను వదలడంలేదని ఏడ్చినట్టు... సంసారం నిన్ను పట్టుకుందా, నువ్వు సంసారాన్ని పట్టుకున్నావా? ఆలోచించుకో' సమాధానం దొరుకుతుంది...' అన్నారు.
సంసారమనే సరస్సులో మోహమనే మొసలికి చిక్కిన గజేంద్రుడు వంటి ప్రతి జీవి ఎంతకాలం ప్రయత్నించినా సు-దర్శనం అనే బుద్ధితో మోహమనే బంధనాన్ని ఖండించకపోతే సంసార బంధనాలు వదులుకోలేడు. జడభరతుడు పరమ భాగవతోత్తముడు, బ్రహ్మజ్ఞాని. రాజ్యాన్ని సంసారాన్ని త్యజించి మోక్షార్డియై తపస్సు చేసుకోసాగాడు. ఒకరోజు తల్లిని కోల్పోయిన ఒక లేడి పిల్లను రక్షించి దాన్ని పోషించసాగాడు. క్రమంగా దానిపై మమకారం పెరిగి మరల సంసారబంధనాల్లో చిక్కుకున్నాడు. మరణకాలంలో భగవన్నామ స్మరణ మరచి ఆ లేడిపిల్లనే తలచుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఫలితంగా మరుజన్మలో లేడిగా జన్మించాడని కథ. విశ్వామిత్రుడు త్రిశంకుస్వర్గ సృష్టికర్త గాయత్రీమంత్రస్రష్ట ప్రపంచాన్నే జయించగల ఆస్త్రశస్త్ర శక్తి సంపన్నుడు. కానీ అరిషడ్వర్గాలను జయించలేక పలుమార్లు మోహబందనాల్లో చిక్కుకున్నాడు.
"నాది' అనే భావన ప్రతి జీవిలో ఉంటుంది. అదే మోహానికి మూలం 'మోహం అత్యంత వినాశకారియైన మృత్యువు వంటిది. మోహాన్ని జయించిన వ్యక్తే మోక్షాకాంక్షతో ముక్తిమార్గం చేపట్టడానికి అర్హుడు' అంటారు వివేకచూడామణిలో శంకరులు, మోహం ఆహాన్ని, ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది. ఇవి మనిషిని చింతలపాలు చేస్తాయి. ఈ చింతలు రగిల్చే చింతాన్ని చితాగ్ని కంటే ఘోరమైంది. చితాగ్ని శవాన్ని మాత్రమే కాల్చి బూడిద చేస్తుంది. కానీ చింతాన్ని బడబాగ్నిలా మనసును కంటికి కనపడకుండా అనుక్షణం దహిస్తూనే ఉంటుంది అన్నాడు
ముల్లును ముల్లుతోనే తీయాలి. కాలిలో దిగిన ముల్లు తీయడానికి మరో ముల్లు ఉపయోగిస్తాం. కాలిలో బాద కలిగించిన ముల్లుతోపాటు, బాధానివృత్తి చేసిన ముల్లునూ అవతల పారేస్తాం. చెడుభావాలను మంచిభావాలతో తొలగించాలి.. తరవాత మంచిచెడులు రెంటికీ అతీతంగా ఉండగలగాలి. అప్పుడు వాటి ఫలితాలు మనసుకు బంధనాలు కావు. బంధహేతువైన మననే మోక్ష హేతువుగా మారుతుంది.
కొలనులోని బురదలో తామర మొక్క పుడుతుంది. కానీ బురదను అంటదు. దాని ఆకు నీటిపైన తేలుతూ ఉంటుంది. పైనపడిన నీటిబిందువును ముత్యంలా మెరిపిస్తుంది కానీ ఆ నీటిబిందువులను తనకు అంటనీయదు. పూల సౌరభాన్ని వెదజల్లుతూ, ప్రకృతికి శోభ కలిగిస్తూ, తుమ్మెదలకు మకరందాన్నిస్తూ ప్రశాంతంగా జీవిస్తుంది. అలా ఉన్నవాడే నిస్సంగుడవుతాడు.
నిస్సంగత్వం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల క్రమంగా మోహం నశిస్తుంది. మనసు చలించకుండా భగవంతుడిపై నిలుస్తుంది (నిశ్చలతత్వం), తద్వారా సమస్త కర్మబంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది.
అదే మోక్షం.. జీవన్ముక్తి! సంసారమనే విషవృక్షానికి రెండే రెండు అమృతఫలాలు. సజ్జనసాంగత్యం, సద్దందపరనం. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సూక్ష్యాన్ని శంకర భగవత్పాదులు 'భజగోవిందం'లో 'సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వ నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వం జీవన్ముక్తి అని సూత్రీకరించారు. నిస్సంగత్వ సిద్ధికి నిరంతర సాధనే మార్గం..
- కస్తూరి హనుమన్నా గేంద్ర ప్రసాద్
*#దవనం - #దొంగ..కధ
*భక్తి, శరణాగతి ముఖ్యం!*
ఒక్కోసారి మనకు అర్ధం పర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయ్ . పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే, పూజలో దోర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని వాటికోసం పూజనే మానివేయడం తప్పు.
దేవుడు ఎంత కారుణ్య మూర్తో చూడండి …
భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి...? జింక మాంసం..! ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు. కాని దేవుడు “ఛీ నీచుడా...! నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు. నువ్వు స్నానం చేసావా ముందు. విభూది కూడా పెట్టుకోలేదు దూరం జరుగు!” అనలేదు. పరమ సంతోషంతో స్వీకరించాడు.
ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు. నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించండి.
గజేంద్ర మోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామి వారిని పిలిస్తే వైకుంఠం నుండి పరుగెత్తుకుని మరీ వచ్చాడు .. పైగా తను నిత్యం ధరించే శంఖు చక్రాలను ధరించకుండా. లక్ష్మి దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు. అంతే కాని నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు. ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా .. నీ చావు నువ్వు చావు అనలేదు. ఆపదలో ఉన్నవాణ్ణి ఆర్తితో పిలిచినవాడిని, నీవుదప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతుడవైతే అప్పుడు శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో ఐనా సరే, ఏ సమయంలో నైనా సరే వచ్చి కాపాడతాడు, అదే ఆయన నైజం.
ద్రౌపతి వస్త్రాపహారణ వేళ నిండు సభలో రక్షించు వారెవరూ లేనప్పుడు ఇతరులెవ్వరు తనకు అండలేనప్పుడు ‘అన్నా శ్రీ కృష్ణా!’ అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా...?
తరువాత వస్తాను. అప్పటివరకు నన్ను తలచకు అని చెప్పలేదే. భక్తీతో…”స్వామీ నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు” అని శరణు వేడితే తప్పకుండా ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు. ఇక్కడ మనకు కావలసింది సంపూర్ణ భక్తి మాత్రమే...!
పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి .. అవి ఏ దిక్కుకు తిప్పాలి . ఏ నూనెతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభంలోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు శరణాగతుడవు కావాలి, అందుకే ఎప్పుడైనా ఒక్కటే గుర్తు పెట్టుకో .. స్వామికి కావాల్సింది భక్తి తప్ప హంగులూ ఆర్భాటాలు కావు. ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే “స్వామీ ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి!” అంటే అయన చిరునవ్వుతో మన్నిస్తాడు. తెలిసి కూడా తప్పుచేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏదీ దాయటం కుదరదు గాక కుదరదు.
****
*మార్పు*
అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని చాలామంది జీవితానుభవం కలిగినవారికి ఉంటుంది. అది మనసు వరకే. ఆలోచనల్లోనే. ప్రవర్తనలోకి రాదు.
కొద్ది కొద్ది మార్పులు కూడా ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మనకే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకొంచెం మెరుగ్గా వాళ్లతో ప్రవర్తించి ఉండాల్సిందని. కాని ఎందుకో అంతకు మించి సాగలేకపోయాం. అదేమంత కష్టం కాదు. అయినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉండిపోయాం.
ఎన్నో పుస్తకాలు చదువుతాం. వీలైతే పెద్దవాళ్ల మాటలు సభల్లో వింటాం. గొప్ప గొప్ప చలనచిత్రాలు చూస్తాం. ఇంట్లోనే అనుకోని ఒక సందర్భం ఎదురుపడినప్పుడు పదేళ్ల క్రితం ఎలా ప్రవర్తించామో ఇప్పుడూ అలానే ప్రవర్తిస్తుంటాం. శరీరంలో మార్పులు కనిపిస్తుంటాయి. కాని, మనసులో పెద్దగా మార్పులు రావు.
మనసులో మార్పు ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది.
మారకుండా ఉండే ఏ పరిస్థితీ మానవ జీవితంలో లేదు. అసలు ప్రకృతిలోనే లేదు. మార్పు నిత్యసత్యం. ఈ సత్యం తెలుసుకున్న మనిషి అందరికీ అనుకూలంగా ఉంటాడు. ఒకరిద్దరికి మించి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి అన్నారంటే, మనల్ని మనం పరిశీలించుకోవాలి. అద్దం ముందు పెట్టుకుని మన శరీరాన్నే కాదు, మనసును సైతం అన్ని కోణాల్లోంచీ శోధించాలి.
మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడే, ఎదుటివాళ్లను ఎవరిని చూసినా ఏదో వంక పెట్టాలని అనిపిస్తుంది. వాళ్లెవరూ సరిగ్గాలేరని అనిపిస్తుంది. ఒక్కక్షణం చాలు. మనం మారితే... ప్రపంచం మారిపోతుంది!
ధర్మరాజు దృష్టి కోణంలో అందరూ మంచివారే. దుర్యోధనుడి దృష్టి కోణంలో అందరూ చెడ్డవారే. చూపు మార్చుకుని, ప్రవర్తనలో ఆ మంచి విషయాలను అభ్యాసం చెయ్యాలి.
మారిన మనిషిని చూస్తే, ప్రతి ఒక్కరికీ విస్మయమే. ఎందుకంటే మార్పు కష్టం. మార్పును అంగీకరించి తన ప్రవర్తన మార్చుకుని ఎదుటివాళ్లకు అనుకూలంగా ఉండాలంటే, అతడెంతో సంయమనంతో ఉండాలి. పాత అలవాట్లను అధిగమించాలి. ముఖ్యంగా జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి.
శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంగా అర్జునుడిలో పెను మార్పులు తీసుకొచ్చాడు. లోకకల్యాణ కారకమైన భగవద్గీతనే అందించాడు. దైవం తలచుకుంటే మార్పును ఇవ్వడమే కాదు, కొత్త జన్మనే ప్రసాదించగలడు.
ముఖ్యంగా మన ప్రవర్తనను అద్భుతంగా నియంత్రించగలిగేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత రవ్వంత కూడా తెలియని మనుషులూ మంచివారుగా మెలగవచ్ఛు మంచివారుగా ఉండాలంటే వారు హృదయంతో జీవించాలి. ఆ హృదయంలో ఆత్మ ఆసీనురాలై ఉంది. ఆత్మను స్పృశిస్తే ఆధ్యాత్మికత పెల్లుబుకుతుంది.
‘అన్ని వైపుల నుంచి దివ్యమైన ఆలోచనలు రావాలి’ అని రుగ్వేదం చెబుతోంది.
సహజంగా మన లోపల పుట్టే ఆలోచనలన్నీ సానుకూలంగా ఉండవు సరికదా- మంచిగానూ ఉండవు. కొన్ని మనసులు ఆలోచించినట్లు శత్రువులైనా ఆలోచించరు. అందుకే మనకు దివ్యమైన భావాలు కావాలి.
ఎక్కడ అగ్ని ఉందో, అక్కడే నీటిని చల్లాలి. పుట్టే చెడ్డ ఆలోచనలను వెనువెంటనే మంచి ఆలోచనలతో ఖండించాలి. మాటలో, ప్రవర్తనలో సైతం గొప్పదనాన్ని, దివ్యత్వాన్ని ప్రకటించాలి. త్వరగా మనలో రావాల్సినంత మార్పు రాకపోతే అంత నష్టం జరిగిపోయినట్లే. కాలం తిరిగి రాదు. చింతించి లాభం లేదు. సమస్యను గుర్తించిన మరుక్షణమే మనసును మార్చుకొని ముందుకెళ్లాలి.
వాళ్లవాళ్ల ప్రవర్తనలో మార్పుల వల్లనే సంఘ సంస్కర్తలు, దేశభక్తులు, శాస్త్రవేత్తలు, యోగులు, జ్ఞానులు... చరిత్రలో నిలిచిపోయారు. వేల సంవత్సరాల నుంచి భూమిలో నిక్షిప్తమై పడిఉన్న బొగ్గుముక్కే ఒక రోజు వజ్రంగా సాక్షాత్కరిస్తుంది. ఇది శాస్త్రీయ పద్ధతిలో కనిపించే ఒక సత్యం. మనం మారదాం.. మన కోసం, అందరి కోసం!
****
మైమరపు - భోగం
పరవశం - యోగం
No comments:
Post a Comment