జీవితం ఒక నదిలాంటిది. దాని ఈవలి ఒడ్డు పుట్టుక. పుట్టిన ప్రతి మనిషి జీవనం సాగించాలి. తరువాత, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ మరణమే ఆవలి ఒడ్డు. అలా ఆవలి వైపుకు చేరుకున్నవారందరూ ఏమయ్యారు.. ఎక్కడికి వెళ్లారు.. తిరిగి మళ్ళీ పుడతారా ఇటువంటి విషయాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.
సృష్టి.. సృష్టికర్త.. దేవుడు.. పరమాత్మ.. ఆత్మ.. ఆస్తికత్వం.. నాస్తికత్వం.. శాస్త్రీయావగాహన.. హేతుబద్ధత .. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటిని బట్టి మన ఆలోచన.. ఆలోచనా విధానం..విశ్వాసం.. నమ్మకం..వైఖరి ఏర్పడి చావు పుట్టుకలను అర్ధం చేసుకుని , వాటిని విశ్లేషించగల శక్తి వస్తుంది.
మృత్యువు అంటే మనకు ఎన్ని విభిన్నమైన అభిప్రాయాలున్నా జనన, మరణాల మధ్య మనం గడపవలసిన.. గడిపే జీవితం పట్ల చాలామంది ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అరుదుగా లభ్యమైన ఈ జన్మను అర్ధవంతం చేసుకోవాలని తపిస్తారు. సకల ప్రాణరాశిలో ఆలోచనలో.. మేధలో.. తార్కికత లో..నిరంతరం ఎదగగలిగే ఏకైక జీవి మానవుడే.
ఇది గ్రహించాడు కనుకనే ఈ సృష్టి లో తన ఉనికికి ఒక సార్ధకత చేకూర్చాలని ఉవ్విళ్ళురుతాడు. ఇక్కడే అందరూ వర్గ వైరుధ్యాలను.. మత విశ్వాసాలను వీడి ఏకభావనులవుతారు. మనసా.. వాచా.. కర్మణా మంచి చేయటానికి ప్రయత్నిస్తారు. కరుణ, ప్రేమలను చూపుతారు. తాము చేసే పనులకు తమ మనస్సునే సాక్షిని చేసుకుంటారు. తోటివారికి శక్తి మేరకు సహాయం సహకారాలనందిస్తారు.
ఇదే కేవలం నేను.. నా కుటుంబమే ..నా సంక్షేమమేనన్న సంకుచిత.. స్వార్ధ భావన, చింతనల నుండి మనిషిని వేరుచేసి.. అతణ్ణి ఉన్నతుడుగా.. విశ్వమానవుడిగా చేసి...మనీషి గా.. చేస్తుంది. ఇదే అర్ధవంతమైన జీవితమంటే. మనం కన్ను మూసే లోపు ఆ గొప్ప స్థితి కి చేరాలని.. కనీసం ప్రయత్నం చేయాలన్న సంకల్పం వుండాలి. దాన్ని మరింత బలోపేతం చేసే ధతిని జత చేయాలి. ‘ ఒక అర్ధరహితమైన జీవితాన్ని కన్నా ఒక అర్ధవంతమైన చావును కోరుకుంటాను. ‘ ఒక గొప్ప తాత్వికుడి మాటలు ఎంత అక్షర సత్యాలు!
శరీరంలోని కణం, కణజాలంలోని ప్రాణాధారమైన శక్తి సమూలంగా, సంపూర్ణంగా నశించినపుడే మనిషి చనిపోవడం జరుగుతుంది. ఈ చావును ఒకొక్కరు ఒకొక్క రకంగా భావన చేస్తారు. చూసే వ్యక్తి దృష్టి.. దృక్పధం... అవగాహనా శక్తిని బట్టి అర్ధం గోచరిస్తూ ఉంటుంది. వేదాంతులు చావును ఈ శరీరమనే కారాగారంలోబందీ గా వున్న ఆత్మ స్వేచ్ఛను పొందే ఒక అద్భుత వరంగా చెపుతారు. ఆధ్యాత్మిక పరులు జీవాత్మ, పరమాత్మల కలయికగా అభివర్ణిస్తారు.
శాస్త్రవేత్తలు.. భౌతిక శాస్తవేత్తలు .. నాస్తికులు ఒక సహజపరిణామంగా చూస్తారు. ప్రతి ఒక్కరి పుట్టుక చావుతో అంతం కావాలి. ఇది తప్పనిది. తప్పించుకోలేనిది. చదువుకున్న వాడైనా.. చదువుకోనివాడైనా... ధనవంతుడైనా.. పేదవాడైనా.. జ్ఞానైనా, అజ్ఞానైనా మృత్యువాత పడక తప్పదు. జీవితాన్ని ఎవరెలా ఆస్వాదించారు.. ఉన్నంతలో ఎంత తృప్తిగా జీవించారు.. ఎంత చక్కగా భాషించారు.. పవిత్రమైన మనస్సుతో ఆలోచనలు చేసారు అన్న ఈ వివరాలు ఏ ఒక్కరి జీవితంలో ఉంటాయో ఈ జీవితం గొప్పది. వారే గొప్పవారు.
కొందరికి చావంటే భయం. ఇది వారికి సహజాతం. ఇది వారిని జీవించనీయదు. దానికి వారిని సమాయత్తం చేయదు. ఈ భయంతో వారు జీవితాన్ని హాయిగా.. ఆహ్లాదంగా.. ఆనందంగా గడపనేలేరు. ఇది ఆధార రహితమే కాదు అర్ధరహితం కూడ. ఎందుకని..? వారికి ప్రపంచంలోవారొక్కరే చనిపోతున్నారేమో నన్న ఆలోచన. కాని ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారు కదా! ఇది వారి మనసుకు.. బుద్ధికి తట్టదు. ఒకవేళ తట్టినా చావకుండా ఉంటే బావుండునన్న కోరిక. ఎంత అసంబద్ధ మైనది..! ఎంత అసాధ్యమైనది..!
ఎంత మంది మృత్యువు నుండి తప్పించుకునే ప్రయత్నం రకరకాలుగా చేసి... తార్కిక శక్తిని వినియోగించక అసాధ్యమైన కోరికలడిగి ఎలా భంగపడ్డారోచెప్పే ఉదాహరణలు పురాణాలలో ఎన్నో వున్నాయి.
ఎవ్వరినీ వదలని మత్యువు తనను విడిచిపెట్టదని, తను చావక తప్పదన్న నిజాన్ని బోధపరచుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితాన్ని చక్కగా గడపాలి. ఈ సహజ భయానికి తోడు .. మహమ్మారి అంటువ్యాధులు.. విపత్తులు సంభవించిన వేళలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, భయ విహ్వలురై చనిపోయేవారుంటారు. ఇది కూడా కూడదు.
చావనేది కష్టం కాదు. నష్టమూ కాదు. మనం బతికున్నప్పుడే మనలో ఆలోచనలో చనిపోయేవి.. అంటే మాయమయ్యేవి.. కొన్ని ఉంటాయి. వాటివల్ల మనం ఎన్నో కోల్పోతాం. ఎంతో నష్టపోతాం. ఏమిటవి..? కరుణ.. ప్రేమ.. పరోపకారం.. సహకారం..! వీటివల్ల మానవత్వానికి దూరమవుతాం. నిజానికి దీనికి మనం భయపడాలి.
జీవితాన్ని గడపటం వేరు. జీవించటం వేరు. మొదటిది యాంత్రికం. రసవిహీనం. ఇది ఒక రకమైన మృత్యువే. ఇక రెండవది జీవించటమంటే ఉన్నంతలో తృప్తిగా, చెడు ఆలోచన మొగ్గలోనే చిదిమేస్తూ చేయగలిగిన సాయం నలుగురికి చేస్తూ, కష్టాలనుండి పాఠాలు నేర్చుకుంటూ, ఆనందంగా ఉండటం. మనిషి ఎలా మరణించాడన్నది ముఖ్యం కాదు. ఎలా జీవించాడన్నది చాలా ముఖ్యం. దీనికి ధనానికి సంబంధమేమి లేదు.
జీవిత వైఖరి.. విలువలు.. మానసిక స్థితి.. ధైర్య, స్థైర్యాలు.. వీటివల్లే మనిషి జీవితం గొప్పదా.. కాదా అన్నది నిర్ణయ మవుతుంది.
జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని కొందరు.. ఆత్మ ఈ శరీరమనే చెరసాల నుండి స్వేచ్ఛ పొందుతుందని ఇంకొందరు, ఇవేమీ కావని చావు ఒక ఒక సహజ సంఘటనని మరికొందరనచ్చు. ఈ భావనలో భేదాలున్నా జీవితాన్ని ఆదర్శంగా, మంచిగా, విలువైనదిగా చేసుకోవాలన్న విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. ‘పిరికివాళ్ళు తమ మరణానికి ముందే చాలాసార్లు చనిపోతారు. కాని స్థైర్యవంతుడు ఒక్కసారే మృత్యువును రుచి చూస్తాడు. అన్న షేక్సి్పయర్ మాటలు మనస్సులో పెట్టుకుంటే మృత్యువుకు భయపడకుండా జీవితాన్ని ఎలా జీవించాలో వస్తుంది.
మనం పొందిన ఈ జీవితం అపురూపం. మళ్లీ లభిస్తుందో లేదో తెలియదు. ఇది మరల తిరిగి రాదని కొందరు భావిస్తారు. అందుకే ఈ జీవితాన్ని మంచితనంతో, మంచిపనులతో సుగంధ భరితం చేసుకోవాలి. ఇక్కడ.. సరిగా ఇక్కడే మనిషి తన తెలివితేటలను.. యోచనను..వివేచన విచక్షణలను ఉపయోగించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తను బుద్ధిశాలని నిరూపించుకోవాలి.
****
*ధర్మసూక్ష్మం*
ధర్మం తల్లిలాంటిదంటారు. అది చక్కగా కర్తవ్యం చెబుతుంది. భగవంతుడు మహర్షుల ద్వారా ధర్మసూత్రాలను మానవాళికి అందించాడు.
యుగధర్మాలను కూడా పరమాత్మే నిర్ణయించాడంటారు. నాలుగు యుగాలకు నాలుగు ధర్మాలున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఈ నాలుగు ధర్మాలకు ప్రతీకలుగా నాలుగు శ్వేతాశ్వాలను పూన్చిన రథానికి సారథిగా సమరాన్ని శాసించాడు. యుద్ధకాండ అంతా శ్రీకృష్ణుడి కనుసన్నల్లో, ఆయన సంకల్పానుసారమే జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
సాక్షాత్ నారాయణుడు నడిపిస్తున్నా, నరుడైన అర్జునుడు వివిధ సందర్భాల్లో వివశుడు, విచలితుడిగా కర్తవ్యనిష్ఠలో తడబడటం మనం గమనించవచ్చు. ఇది మానవ సహజమైన బలహీనత. ఎంతటి భక్తులైనా తీవ్రమైన పరీక్షలను తట్టుకోలేరు. భక్తరామదాసు భక్తి పరీక్షలోని పతాక స్థితిలో శ్రీరాముణ్ని తన బాధలో పలు విధాల నిందిస్తాడు. కానీ, అదే స్థితిలో ప్రహ్లాదుడుప్రాణాపాయంలోనూ నిబ్బరంగా నిలబడ్డాడు. జీవితంలోని అన్ని పరీక్షల కంటే, భక్త పరీక్ష కఠినాతికఠినమైనది. లోకంలో ధర్మాలను మతాలుగా చెప్పుకొంటారు. అది మనుషుల నిర్వచనం. భగవంతుడు ఏ మతానికీ ఏ కులానికి చెందనివాడు. అన్నింటికీ అతీతమైనవాడు.
ధర్మాలు తెలిసినవారు కూడా ధర్మ సూక్ష్మాలను గ్రహించలేరు. పరమాత్మ చెప్పగలడు. ఆయన అనుగ్రహం గలవారు చెప్పగలరు. అలాంటివారు దైవసమానులైన అష్టావక్రుడు, శుకుడు లాంటి మహర్షులు. మహాభారతంలో ధర్మసూక్ష్మానికి సంబంధించి రుక్మిణీ శ్రీకృష్ణుల సంవాదం గురించి తెలుసుకుందాం. యుద్ధం ముగిసింది.
మహాయోధులెందరో మరణించారు. వారి మరణాల గురించి రుక్మిణికి కొన్ని సందేహాలు కలిగాయి. పరమాత్ముణ్ని ఇలా ప్రశ్నించింది. 'దేవా! గురు ద్రోణ, భీష్మపితామహుల వంటి మహనీయులు ధర్మబద్ధంగా జీవించారు. వారి సంహారంలో మీరెందుకు పాలుపంచుకున్నారు... ఇది అధర్మం కదా?'
‘రుక్మిణీ! నీవు చెప్పిన మహనీయులు నిజంగా గొప్పవారే. పూజ్యులు, పుణ్యమూర్తులే. కానీ, నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో తమకు అధికారం, శక్తి ఉన్నా మౌనంగా ఉండిపోయారు. అది మహాపరాధం. దానివల్ల ఆ క్షణంలోనే వారి పుణ్యం నశించిపోయింది. వారి పూజ్యత శూన్యమైపోయింది. అందుకే వారికి మరణదండన లభించింది' అన్నాడు. శ్రీకృష్ణుడు.
'మరి లోకోత్తరమైన దానగుణం గల కర్ణుడి విషయం ఏమిటి? అర్ధించిన వారికి లేదనకుండా చివరకు తన కవచకుండలాలనే చీల్చి ఇచ్చేశాడే! అతడినెందుకు సంహరించారు? '
'దేవీ! కర్ణుడి గురించి నీవు చెప్పింది అక్షరసత్యం. కానీ, మరణ వేదన పడుతున్న అభిమన్యుడు ఆర్తితో దోసెడు నీరు ఇచ్చి దాహం తీర్చమని కోరితే, పక్కనే నీటిచెలమ ఉన్నా, దుర్యోధనుడు అపార్థం చేసుకుంటాడేమోననే సంశయంతో కర్ణుడు ఇవ్వలేదు. అతడి జీవితకాల దానపుణ్యం ఆ క్షణమే లుప్తమైపోయింది. కడకు అతడిరథచక్రం అదే నీటి చెలమలో కూరుకుపోయి
ప్రాణాంతకమైంది. ధర్మాలు కేవలం పాటిస్తే చాలదు.
వాటిలోని సూక్ష్మాంశాలను కూడా గ్రహించి
అనుసరించాలి!' అని బదులిచ్చాడు శ్రీకృష్ణుడు.
అంతరంగ భక్తి మానసిక పూజల ప్రాధాన్యం ఏమిటో కథ ద్వారా మనకు అర్థమవుతుంది. దీన్నే ధర్మంలోని ధర్మం అంటారు. అగ్నిలోని వెలుగు, సత్యంలోని శక్తి, ‘అంతర్యామి’లోని దివ్యత్వం... ఇవన్నీ సూక్ష్మ దృష్టికి మాత్రమే అర్థమవుతాయి. అలా అర్థం చేసుకోవడమే
ఆధ్యాత్మిక కృషి ఫలం.
కె.విజయలక్ష్మి
*స్వర్ణ మౌనం*
మౌనం గొప్ప భాష, అద్భుత కావ్యం, గొప్ప అనుభూతి అసంఖ్యాకమైన ఆలోచనలను రేపే ఒక నిశ్శబ్ద శబ్దబ్రహ్మాండం. ఒక మార్గదర్శి, హితైషి, ఉపాధ్యాయుడు మౌనం ఒక సింహావలోకనం. అన్నింటికీ మించి అంతర్ముఖత్వం. మనలోని 'అంతర్యామి' ఘోషను మనం వినగలిగేటట్టు చేసి... ఆ 'అంతర్యామి'ని చేరుకునేందుకు ఉపకరించే గొప్ప సాధనం.
‘భాషణం రజతం... మౌనం స్వర్ణం'. భాష మన భావాలను ఇతరులకు వ్యక్తం చేసి వారివి తెలుసుకునే ఒక మహత్తర వాహిక. కానీ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడినప్పుడే ఆ మాటలు విలువను
సంతరించుకొంటాయి. భాషకందని భావాలు, అనుభూతులు మనందరి జీవితాలలో సహజమే. ఆటువంటి వేళ, మౌనం మన మనోభావాన్ని అనాయాసంగా, అద్భుతంగా అభివ్యక్తం చేయగలదు. అక్కడ మౌనం హేమతుల్యమే.
ఎక్కడ భాషించాలో, ఎక్కడ మౌనం పాటించాలో తెలుసుకోవాలి. అది విజ్ఞత, వివేచనల వల్లనే సాధ్యం.
జ్ఞానులు, పండితులు, అనుభవశాలుర సమక్షంలో మిడిమిడి జ్ఞానంతో నోరు మెదపడం దుస్సాహసమే కాదు, దుశ్చర్య కూడా. మన మాట చెల్లని చోట, విలువివ్వనివారి దగ్గర ఒక్క మాటైనా పెదవి దాటకూడదు. మహాత్ముల మాటలు ఆలకిస్తున్న వేళ మౌనముద్రులం కావాలి. కోపం సింహాసనమెక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఆవేశపూరితులమైనప్పుడు విచక్షణను కోల్పోతాం. అప్పుడు మౌనమే ఉత్తమ మార్గం. 'మౌనేన కలహం నాస్తి' అంటారు. వివాదాస్పద వ్యక్తుల దగ్గర ఇది చాలా అవసరం.
విజ్ఞుల సమూహంలో 'వాగ్భూషణం భూషణం'. విషయపరిజ్ఞానం లేని వ్యక్తులకు
‘విభూషణం మౌనమపండితానాం' అంటారు భర్తృహరి. మౌనం దేవుడిముందు భక్తి, గురువుల ముందు శ్రద్ధ, పెద్దల ముందు గౌరవం, ఉపాధ్యాయులముందు వినయాన్ని వ్యక్తం చేస్తుంది.
లంకలో, ఆ ఒంటరి వేళ రాముడి చింతనలో ఉన్న సీతాదేవి మౌనాన్ని ఆశ్రయించింది. అదే ఆ సాధ్వికిగొప్ప ఊరటనిచ్చి రక్షణ కవచమైంది. ధర్మవేత్త, రాజ నీతిజ్ఞుడైన విదురుడికి, సంభాషణా చతురుడైన ఆంజనేయుడికి మాటల గలగలలూ తెలుసు... వాటి గాంభీర్యత, సాంద్రత తెలుసు. మాట, మౌనం అర్థం, విలువ వారికి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియదేమో!
స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే, ధ్యానం మనసును శుద్ధిచేస్తుంది. ధ్యానం మౌనాన్ని సూచించే ఒక అద్భుత ప్రక్రియ. ఒక క్రమం, నియంత్రణ లేక ఒకదాని వెంట ఒకటిగా వచ్చే ఆలోచనా తరంగాలను తట్టుకోవాలంటే మానసిక శక్తి కావాలి. అది మౌనం వల్లే ఒనగూడుతుంది. తపస్సు కూడా ఒక మౌనమే. మంత్ర ఉచ్చారణతో ప్రారంభమయ్యే ఈ తపస్సు కొన్ని దశలు దాటిన పిదప వాక్కు ఆగిపోయి కేవలం పెదవుల కదలికలు ఉంటాయి. ఆపై దశలో శుష్కించిన ఊపిరితిత్తుల కదలికలే ధ్యానమవుతాయి. మౌనం అత్యున్నత స్థాయి అది.
మౌనం ఆధ్యాత్మికవేత్తలకు ముఖ్య సాధనమార్గం. 'నడిచే దేవుడు'గా కీర్తిపొందిన శ్రీ చంద్రశేఖర పరమాచార్య, శ్రీ రమణులు మౌనంగానే ఎన్ని గొప్ప భావపరిమళాలను పరివ్యాప్తి చేశారో! మహాత్మా గాంధీ వారంలో ఒక రోజు మౌనవ్రతం పాటించేవారు. మౌనం ఆయన ఆత్మ పరిశీలనకు, సత్యశోధనకు, సాధనకు ఒక ప్రయోగశాల అయింది. మౌనం ఎంతో శక్తిమంతమైనది. మనసు మనసు కలిస్తే మౌనం. ఆత్మ పరమాత్మతో సంలీనమయ్యే ఘడియకూడా మౌనమే. అది జీవిత సార్ధకతను నిర్ణయించే విఘడియ. ఈ శుభలగ్నం కోసమే మునులు, యోగులు, సాధకులు తపించిపోయేది.
కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్
****
*ఎవరికైనా తప్పదు పరీక్ష!*
ఏ మనిషిని అయినా వస్తువునైనా అనేక విధాలుగా పరీక్ష చేసిన తరవాతే దాని విలువను, గుణాన్ని నిర్ధారిస్తారు. ఇది సహజం. ఒక విద్యార్థి ఎంత జ్ఞానం సంపాదించాడో తెలుసుకోవడానికి అధ్యాపకుడు పరీక్షిస్తాడు. అనేక రీతులుగా ప్రశ్నలు వేసి జవాబులు రాబడతాడు. అధ్యాపకుడు సంతృప్తి చెందితే ఆ విద్యార్థి కృతార్థుడవుతాడు. ఏ ఉద్యోగార్థికైనా ఇలాంటి పరీక్ష తప్పదు.
ఉద్యోగం, వృత్తిరీత్యానే గాక, కుటుంబంలోని సభ్యులకూ పరీక్షలుంటాయి. అవి చెప్పిరావు. ఎప్పుడైనా, ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా పరీక్షలొస్తాయి. అవి సమస్యలుగా పరిణమించి వాళ్లను వేధిస్తుంటాయి. ముఖ్యంగా ఇంటి యజమానినీ యజమానురాలినీ మానసిక సంఘర్షణలకు గురిచేస్తాయి. అటువంటప్పుడే ధైర్యంతో, సహనంతో, వివేకంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు.
నిరంతరం భగవంతుణ్ని పూజించి ఆరాధించే భక్తుడికీ పరీక్షలు తప్పవు. సచ్ఛరిత్రులకు, సచ్ఛీలురకూ పరీక్షలుంటాయి. సత్యవ్రతుడైన హరిశ్చంద్రుణ్ని విశ్వామిత్రుడు పరీక్షించాడు. సతీ అనసూయను త్రిమూర్తులు పరీక్షించారు. సతీసావిత్రిని యమధర్మరాజు పరీక్షించాడు. యక్షుడు అనేక ప్రశ్నలు వేసి ధర్మరాజు విజ్ఞతను పరీక్షించాడు. దేవేంద్రుడు, అగ్నిదేవుడు డేగ, పావురాల రూపంలో వచ్చి శిబి చక్రవర్తి దానశీలతను పరీక్షించారు. సతీసక్కుబాయి పరీక్షలకు గురైనదే. పరమశివుణ్ని పతిగా పొందాలని కఠిన తపోదీక్షలో నిమగ్నమై ఉన్న పార్వతిని కపట బ్రహ్మచారి వేషంలో శివుడు వచ్చి అనేక ప్రశ్నలతో పరీక్షిస్తాడు. ఆమె జవాబులు విన్న ముక్కంటి తనపట్ల ఆమెకు గల అచంచలమైన అనురాగాన్ని గ్రహిస్తాడు.
ద్రోణుడు విలువిద్యలో అర్జునుణ్ని పరీక్షించి, అతడి విద్యాకౌశలాన్ని మెచ్చుకున్నాడు. గణాధిపత్యం ఇచ్చే సందర్భంలో పరమేశ్వరుడు కుమారస్వామిని, గణపతి పరీక్షిస్తాడు. త్రిమూర్తుల్లో ఎవరు సహనంగలవారో
తెలుసుకోవాలని ప్రయత్నించి భృగుమహర్షి భంగపాటు చెందుతాడు.
బ్రహ్మ, విష్ణువు నేనంటే నేను అధికుణ్ని అని కలహించుకుని తీర్పుకోసం వచ్చినప్పుడు పరమశివుడు ఇద్దరినీ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో విఫలురైనందుకు శివుడు వారిని శపిస్తాడు. నాస్తికుడైన మంజునాథను పరీక్షించి, చివరికి పరమభక్తుడిగా చేసుకుంటాడు
ఈ గాథల వల్ల మనిషి ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని క్లిష్టమైనవీ కావచ్చు, మరికొన్ని అత్యంత సంక్లిష్టమైనవి కావచ్చు. ఈ సమస్యలే పరీక్షలు. వీటిని ఎదుర్కోవడానికి ఓర్పు కావాలి. వివేకం, వివేచన అవసరం. సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశపడటమో, కుంగిపోవడమో, ఎదుటివారినో పరమాత్మనో దూషించడమో వాంఛనీయం కాదు. కుటుంబసభ్యులతో చర్చించుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సాధారణంగా స్వయంకృతాపరాధం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం ఉంటుంది. పెద్దరాయి అడ్డమైనప్పుడు ప్రవహించే నీరు పక్కదారి చూసుకుని వెళ్ళిపోతుంది కదా! ఇది ప్రారబ్ధం అని కూర్చునేవారు సాఫల్యం పొందలేరు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్ని పరీక్షలనుంచి అయినా, సమస్యలనుంచి అయినా బయటపడవచ్చు. ధ్యానం, ఆధ్యాత్మిక చింతన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సత్సాంగత్యం వల్ల సానుకూల దృక్పథం గోచరిస్తుంది. బోధన కంటే శ్రవణం గొప్పది. శ్రవణం కంటే సాధన గొప్పది. సాఫల్యమనే వృక్షానికి సాధనే బీజం. గ్రీష్మమనే ఏ పరీక్షకైనా నీడనిచ్చేది ఆ వృక్షమే.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
****
*ఇంద్రియ నిగ్రహం - సాధన**
ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు , కర్మేంద్రియములు అని అర్ధం . వాటిలో మనస్సు కూడా ఒక ప్రధానమైన ఇంద్రియం . అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం . తనకు ఇష్టమైనదానికోసం పోవటం మనస్సు యొక్క సహజ లక్షణం . అది దానికి ఇష్టంలేని దానిమీదికి పోదు . ఎందుచేతనంటే దానివలన మనస్సుకు ప్రయోజనం లేదుకనుక . అలాంటప్పుడు ఎందుకు శ్రమపడాలి ? కాబట్టి మనస్సుకు ( ఇంద్రియానికి ) ఏది ఆకర్షణగా ఉంటుందో , దేనివలన తాను కోరుకున్న అనందం కలుగుతుందో దానిమీదనే ఆసక్తి ప్రసరిస్తుంది . అది లౌకికమైన తాత్కాలిక ఆనందం , కష్టసాధ్యమైన పారమార్ధిక విషయాల వైపు మనస్సు పోదు . అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్ధికమైన విషయాలవైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం . ఆ విధంగా మనస్సును మళ్లించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు .
కాబట్టి లౌకిక సుఖాన్ని కాదనుకుని నిత్యమైన పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చేయాలి . ఈ ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉండాలి . కార్యసాధనకు ప్రయత్నం అవసరం , ముఖ్యం . లేకపోతే మనస్సును నిగ్రహించి కార్యోన్ముఖంగా చేయటం ఎట్లా సంభవిస్తుంది . కాబట్టి కార్యసాధనకు తీవ్రమైన ప్రయత్నం చేయాలి , ఆలోచన చేయాలి . ఆలోచన అంతర్ముఖం చేసుకొని మనస్సు ఏ విషయాలకు లోనవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి .
మనకు ఇష్టంలేని ప్రస్తావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది . క్రోధం అంతః శత్రువు . హద్దు మీరుతుంది . చేయకూడని పని చేయిస్తుంది . మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది . దీనివలన అనర్ధం జరుగుతుంది . అది తనకూ మంచిది కాదు . ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు . అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించాలి .
సహనం , వివేకం జీవితంలో అలవరుచుకోవాలి . మనకు అనుకోని విధంగా ఒక ఆపద ఏర్పడింది అనుకుందాము . త్రోవను పోయే ఒకనిని హఠాత్తుగా పాము కాటువేసింది అనుకుందాము . అది ఆకస్మికమైన విపత్తు . దానికి ఏడ్చి పొడబొబ్బలు పెట్టి , ఇతరులను నిందించి , పాముపై క్రోధం పెరిగి , దానిని చంపటానికి ప్రయత్నించి , అది కనపడకుండా పోయి , భయము పెంచుకుంటూపోతే చేయవలసిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది తప్ప ఉపయోగం ఉండదు . అటువంటి ఆపద సమయములలోనే మనము సహనము , వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి .
ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది . ఆ పాము కాటు వేయటానికి ఒక ప్రేరణ ఉంది ఉంటుంది . అదియే దైవ ప్రేరణ . దీనినే మనం లౌకికంగా ఒక సామెత కూడా వాడుతూవుంటాము - "శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని" . ప్రారబ్ధ కర్మను పాలనంలోనే అట్లా జరిగి ఉంటుంది అని భావించాలి . అట్లా విచారణచేయటమే వివేకం . ఈ విచారణను వివేకముచే స్థిరపరచుకుని నిర్ణయం చేసుకోగలుగుతున్నాము . ఈ విధమైన విచక్షణచేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులను , అవరోధాలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది . నీటిని సహనంతో అధిగమించాలి . దీనినే తితిక్ష అని కూడా అంటారు . తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు అర్హుడు , యోగ్యుడు . అటువంటివానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది . శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం . శాస్త్రం అనేది ఏది నిర్దేశిస్తుందో అది చేయాలి . ఆ విధంగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు . శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి , విశ్వాసం ఉంటే చాలదు , శాస్త్రం చెప్పిన విధంగా ఆచరించి తీరాలి .
--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* .
***
భగవంతుడెవరో తెలుసుకోవాలన్న ఆసక్తి మనిషికి ఉండాలి' వ్యతిరేక భావనలు లేని బుద్ధి. మనసు ఉంటే అతడికి చాలన్న మహావేదాంతి రామకృష్ణ పరమ హంస, భగవంతుడెవరని శ్రద్ధాళువులకు విపులీకరించడానికి భౌతిక జీవనంలో మనుషుల కెదురయ్యే అనుభవాలనే పారమార్థిక సత్యాలకు అనుసంధానిస్తూ, చిర కాలం గుర్తుండే పిట్టకథల వంటి ఉదాహరణలతో, తన ఆధ్యాత్మిక హృదయం చేతనే మాట్లాడించిన ఆయన విలక్షణమైన వేదాంతి. జీవాత్మ పరమాత్మల అభేదం, నిజమైన ఆనందానికి అర్థం తెలిసిన ఆత్మజ్ఞానిగా, మనిషికి ఆ పరమ సత్యాలను, హంస నిర్వాణాలనిపించే స్వచ్ఛమైన వాక్కులతో వినిపించినందుకు పరమహంసగా ఆయన ప్రసిద్ధులయ్యారు.
భగవంతుడెవరో కాదని, ఎక్కడో లేడని, తనలోనే ఉన్న ఆత్మ స్వరూపుడని, తన కన్నా భిన్నమైనవాడేమీ కాదని మనిషికి తెలియాలనేవారు రామకృష్ణులు, దివ్యత్వం. లేని అత్యలని ఉండవని, అతడి పాపపుణ్యాలు ఆత్మకు అంటని గుణాలన్నారు. ఆత్మజ్ఞాన సాధనలకన్నా భగవంతుడిని చూసేందుకు భక్తిమార్గమే సులువైనదం మనసంతా కల్లాకపటం, బుద్ధి నిండా కుటిలత్వం, మడీ మైలా అంటూ మరొక మనిషిని దూరంగా ఉంచే అవలక్షణాలున్న మనిషికి ఆధ్యాత్మికతనిచ్చే జ్ఞాన సాధనలు ఫలితమివ్వవని చెబు తారు. ఆహేతుకమైన అభిప్రా యాలు, ఆడంబరమయమైన ఆరా ధనా పద్ధతులు, ఆచార వ్యవహా రాలు, సభ్రంధ పారాయణలకిచ్చే ప్రాధాన్యం కన్నా ఆచరణ సాధ్య మైన ధ్యానం, జప తపాదులు, దైవ నామ స్మరణలకు వినియోగించే జీవి తకాలు, అతడిని అంతర్ముఖుడిని చేసి భగవద్దర్శనమిప్పించడానికి సరిపోతుందన్నారు. వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో మీరన్న భక్తి సాధనలు సాధ్యమయ్యేవేనా అని ఎవరైనా సందేహిస్తే- దేవుడి పేరు ఒకమారైనా గుర్తుచేసుకునేందుకు తీరిక లేని వారా మీరు, ఆ పేరును ఉచ్చరించడాన్ని అలవాటుగా మార్చుకుంటే ఫలితం మీకే తెలుస్తుందని సున్నితంగా మందలిస్తుండేవారు.
అంతర్యామి
రామకృష్ణులు భగవద్భక్తిని కలియుగ ధర్మమన్నారు. మనిషికి తన తపనంతా భగ వదనుగ్రహ ప్రాప్తికి ఉంటున్నప్పుడు అతడిని భక్తిమార్గం విడిచిపెట్టవద్దన్నారు. అందులో ముందుకు సాగుతున్నప్పుడు ఎప్పటికైనా అతడికి అక్కడ ఎదురుకాబోయేది. ఆ భగవంతుడొక్కడేనంటారు. భక్తిమార్గంలో పయనించిన ఆయనకు, కలియుగం అంటున్న ఆధునిక జగత్తులో, అసాధ్యమనుకునే అరుదైన భగవత్ సాక్షాత్కారం ఆ మార్గంలో లభించింది. నమ్మిన దైవం కాళికామాత ప్రత్యక్షమై కరుణించింది.
వివేకానందుడు తనకు స్ఫూర్తినిచ్చిన రామకృష్ణుల ఆధ్యాత్మికతలోని వాస్తవికత ఆసాధారణమైనది అనేవారు. ఆయన శిష్యుడిగా చేరాకనే, అంతవరకూ అద్వైతం, వేదాంతాలంటే అంతగా ఆసక్తి చూపని, దైవాన్ని విమర్శించే ఆయన వివేచనా దృక్పథం అలవరచుకున్నారు. వేదాంతం చెబుతున్నదంతా వినడం నేర్చుకున్నారు. దేవుడున్నాడని, విశ్వవ్యాపకుడైన సర్వాంతర్యామి అతడని అంగీకరించారు. తత్వ విచారానికి కొత్త దిశానిర్దేశనమిచ్చి మహావేదాంతిగా గణుతికెక్కారు.
భారతీయుల ఆధ్యాత్మిక చింతనలను పాశ్చాత్యుల ఆలోచనా సరళి ప్రభావితం చేస్తూ, సత్యార్థుల ధర్మ మీమాంసను సందిగ్ధపరుస్తున్న సంధికాలంలో జన్మించిన మహాపురుషులు రామకృష్ణులు భావి తరంలో జరగబోయే వేదాంత విచారానికి తనదైన పద్ధతిలో కొత్త ఒరవడులు సృజించి ఇచ్చిన మార్గదర్శకులాయన.
- జొన్నలగడ్డ నారాయణమూర్తి
*సుమతీ శతకంలో మకుటంగా ఉంచిన ‘‘సుమతీ! ’’ అంటే... మంచి మనసున్న వాడా! మంచి మేధ కలిగిన వాడా! మంచి మతి కలిగిన వాడా! అని అర్థం. ఒక వ్యక్తికి ఏదయినా ఒకటి తెలియకపోవడం తప్పుకాదు. ఎవ్వరూ సర్వజ్ఞులు కారు. అందరం శంకర భగవత్పాదులం కాదు. పుట్టుకతో అందరికీ అన్ని విషయాలూ తెలియవు. కానీ తెలియనిది తెలుసుకోకపోవడం, తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం మాత్రం తప్పే. నాకు తెలిసినది మాత్రమే నిజం, నాకు తెలుసుకోవలసిన అవసరం లేదనడం ధిక్కారం...అది ముమ్మాటికీ తప్పు. నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకుంటాను–అని ఎవరు వినయంతో చెవిపెట్టి మంచి మాటలు వింటారో వారందరూ సుమతులే. విద్యార్థుల మనసు తెల్లకాగితంలా ఉంటుంది. దాని మీద ఏది రాస్తే దాని ముద్ర పడుతుంది.
పిల్లలకు అందవలసిన విషయం అందితే వాళ్ళు జీవితంలో వృద్ధి లోకి వస్తారు. ఉత్తమ పౌరులవుతారు. అటువంటి పిల్లలు కుటుంబంలో ఆధారపడతగిన వ్యక్తులవుతారు. ఆ వీథిలో ఉన్నవారు, ఆ ఊరి వారు, ఆ రాష్ట్రం, ఆ దేశంలో ఉన్న వారు కూడా వారిని చూసి గర్వపడే, సంతోషపడే స్థితిని పొందుతారు. అలా పొందేటట్లు బతకగలిగిన స్థితికి చేరుకోవడానికి సుమతీ శతకం పద్యాలు గొప్ప సోపానాలు. ఇవి పిల్లలను ఉద్దేశించి చెప్పినవే అయినా, వారికే కాక, అందరికీ అన్నికాలాల్లో ఉపయుక్తం అవుతాయి. వాటిలో ఒక పద్యం చూద్దాం...
‘‘ఇమ్ముగ చదువని నోరును/అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్/తమ్ముల పిలువని నోరును/కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతీ!’’ –‘ఇమ్ముగ చదువని నోరును...’ అంటే.. చదివేది ఇష్టంగా చదవాలి.. ఇష్టం అంటే? నీకు ఆకలేసింది. ఉదయం ఫలహారం తిన్నావు.. మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది.. మరి ఉదయం తిన్నదేమయింది! ఏదీ చూపించమంటే ఇక కనిపించదు. అది రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ వంటి సప్త ధాతువుల్లోకి కలిసిపోయింది. అలా కలిసి అది నువ్వయి పోయింది. అంటే నేను తిన్న ఫలహారం నాలో కలిసిపోయింది, నేనుగా మారిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం తింటాం. అదీ అంతే. నీళ్ళు తాగుతాం. అదీ అంతే. అలాగే చదివిన చదువు కూడా మనకన్నా వేరుగా ఉండకూడదు. అది కూడా నీలోకి వెళ్ళిపోయి ‘నువ్వు’గా మారిపోవాలి.
అంటే నీకు దాని అవసరం ఎప్పుడొస్తే అప్పుడు అది నీకు జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం వస్తూ ఉండాలి అంటే మీరు చదివిని దానిని లోపల మననం చేసుకుంటూ ఉండాలి. ఇదంతా జరగాలి అంటే... చదివే చదువు ఇష్టంగా, ప్రీతిగా చదవాలి. ఇష్టంగా స్వీకరించింది ఏదయినా మన ప్రయత్నం లేకుండానే అది మన మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అవసరమయినప్పుడు అది వెంటనే మనకు గుర్తొస్తుంటుంది. మీకు నాన్నంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం. మీరు ఎక్కడున్నా వారిని మనసులో అనుకున్న వెంటనే మీకు వారెలా గుర్తుకొస్తుంటారో, ఇష్టంగా చదివినది కూడా అంతే. ఆవుపాలు పితికేటప్పుడు ఆ పాలధార సన్నగా ఉన్నా నేరుగా పాత్రలోకి చేరేటట్లు ఎలా ఏకాగ్రతతో పితుకుతామో, అలా చదివే విషయాలు, గురువుల ద్వారా వినే విషయాలు కూడా నేరుగా మనసులోకి చేరాలి. అలా జరగాలంటే... చదివే వాటిని కష్టంతోనో, చదవాల్సి వచ్చిందన్న బాధతోనో కాకుండా బాగా ఇష్టపడి చదవాలి.
***
అనుమానం పెనుభూతం
శ్రీకృష్ణుడు రాయబారం వహించడానికి హస్తినాపురం వెళ్లాడు. ముందుగా సభలో అందరికీ నమస్కరించి, అశ్వత్థామను సభ బయటకు పిల్చుకుని వెళ్లాడు. క్షేమ సమాచారం ముచ్చటించిన తర్వాత తనచేతి ఉంగరాన్ని కిందికి జారవిడిచాడు. దుర్యోధనుడు ఇదంతా ఒకకంట గమనిస్తూనే ఉన్నాడు. ఉంగరం పడిపోయిందని అశ్వత్థామ కిందికి వంగి తీసివ్వబోగా కృష్ణుడు గమనించనట్టు నటించి ఆకాశం వైపు చూపిస్తూ ఏదో మాట్లాడటం మొదలు పెట్టాడు. కృష్ణుడేం చూపిస్తున్నాడో.. అర్థం కాక అశ్వత్థామ కూడా ఆకాశం వైపు చూసి మాట్లాడుతూ, వేలికి ఉంగరం తొడిగాడు. ఇదంతా గమనించిన దుర్యోధనుడు, మరోలా అర్ధం చేసుకుని 17 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామను ఒక్కరోజూ సర్వ సైన్యాధిపతిగా నియమించ కుండా చేశాడు. యుద్ధంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పడ్డాడు. అప్పుడు అశ్వత్థామ సుయోధనా! నేను చిరంజీవిని. పైగా శస్త్రాస్త్రాలలో అర్జునుడితో సమానమైన వాణ్ణి. నన్ను సైన్యాధిపతిని చేసి ఉంటే పాండవులనందరినీ హతమార్చేవాణ్ణి. నీకీ దుస్థితి కలిగేది కాదు' అంటూ విలపించాడు. దుర్యోధనుడు 'కానీ నువ్వు రాయబారం నాడు శ్రీకృష్ణుడికి నింగీ నేలా సాక్షిగా పాండవుల విజయానికే సహాయపడతానని మాట ఇచ్చావు కదా! అందుకే నిన్ను దూరం పెట్టాను' అన్నాడు. అది విన్న అశ్వత్థామ విరక్తిగా నవ్వి 'విధి వైపరీత్యం దుర్యోధనా! ఇది ఆ జగన్నాటక సూత్రధారి పన్నాగం. నీకు నా మీద కలిగిన అనుమానమే నీ ఓటమికి కారణమైంది' అంటూ ఆనాడు జరిగిందేమిటో వివరించాడు. కనుక అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలి. అంతేగానీ లోలోపలే రగిలిపోతే నష్టం తప్పదు. అనుమానం పెనుభూతమని రుజువు చేసే ఘటన ఇది.
- డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్య
***
ఆ రోజుల్లో కొందరు గృహస్తులు భిక్షువుల్ని చూసి, వారికి లభిస్తున్న గౌరవాన్ని చూసి, తామూ భిక్షువులుగా మారేవారు. కానీ అక్కడి క్రమశిక్షణ నియమావళి, నైతిక జీవనంలో ఇమడలేక, మోహాన్ని, రాగాన్నీ వదిలించుకోలేక తిరిగి భిక్షుజీవనాన్ని వదిలి పెట్టేవారు. ఇలాంటివారి గురించి బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశం ఇది. నీటిలో దిగేవాడికి నాలుగు భయాలు ఉంటాయి. మొదటిది, తరంగ భయం. తరంగం మనిషిని వెనక్కి పడేస్తుంది.
ముందుకు పోనీయదు. అలాగే మనస్సులోని అహంకారం కూడా అలాగే వెనక్కి పడదోస్తుంది. ఇతను నాకు చెప్పేవాడు. నాకంటే వయస్సులో చిన్నవాడు. నాకంటే వెనుక వచ్చినవాడు అనే అకుశల భావన అహంకారాన్ని ప్రేరేపించి జలతరంగంలా మనిషిని వెనక్కి నెట్టేస్తుంది. అలాగే.... నీటిలో ఉండే మొసళ్ళ భయం. ఇది చాపల్యానికి చెందిన అకుశల కర్మ. నీటిలో కనిపించని మొసలి వచ్చి, వడిసి పట్టి లోనికి లాగేస్తుంది. ఈ చాపల్యం కూడా అలాగే లాగేస్తుంది.
అంతకుముందు తిన్నది ఇప్పుడు తినకూడదు. తాగింది తాగకూడదు. కానీ ఆ రుచి చపలత మనిషిని మొసలి పట్టు పట్టి వెనక్కి లాగేస్తుంది. అందుకే ఇది మకర భయం. ఇక మూడోభయం సుడిగుండ భయం. సుడిగుండం వేగంగా తనలోకి లాక్కు పోయి, గిరగిరా తిప్పేసి ముంచేస్తుంది. అలాగే గతంలో అనుభవించిన విలాసవంతమైన జీవితం తాలూకు సౌకర్యాలన్నీ మనల్ని సుడిగుండంలా చుట్టుముడతాయి.
నాలుగో భయం సొరచేప భయం. మనిషిని పట్టి కత్తిరించి సొరచేప ఎలా మింగేస్తుందో కామం కూడా అలాగే మింగేస్తుంది. అలంకరణలు, అందచందాలను చూసి అదుపు తప్పిన భిక్షువు చివరికి ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఈ కామరాగాన్ని అదుపుచేయని వ్యక్తి కూడా మింగివేయబడతాడు. అంటే పూర్తిగా ఉనికినే కోల్పోతాడు.ఆదర్శ మార్గంతో నడిచే వ్యక్తికి అపాయాన్ని కలిగిస్తాయి నాలుగు భయాలు. అందుకే ఈ నాలుగింటి పట్ల భయంతో ఉండాలి.వాటికి చిక్కుపడకుండా ఉండాలి. అందుకు జాగరూకత కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చిరకీర్తిని పొందుతాడు. పరిపూర్ణుడవుతాడు. చివరికంటూ ఆదర్శమూర్తిగా మిగులుతాడు.ధార్మికుడు తప్పనిసరిగా తన జీవితంలో ఊహించుకోవాల్సిన నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు….
***
No comments:
Post a Comment