Sunday, 19 March 2023

*


*

 నమస్కారం.




ఒకసారి ఓ వ్యక్తి ఒక పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పండితునకు తెలుసు.., తనను ఆశ్రయించిన వ్యక్తికి శివుడు అంటే పడదని.. శివకేశవ అభేదమును గూర్చిన అద్వైతము అతనికి తెలియదని..

ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం వ్రాసి ఇచ్చినాడు.. ఆ వ్యక్తి చదివి నివ్వెర పోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది..

గవీశపాత్రో నగజార్తిహారీ

కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజిత పాదపద్మః

పాయాదనాదిః పరమేశ్వరో నః॥

చదవగానే ఆశ్చర్యపోయాడు... ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి..

గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం.. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పర్వత పుత్రిక.., అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాద పద్మములు కలవాడూ..
అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆది మధ్యాన్త రహితుడు అయినవాడూ, అటువంటి పరమేశ్వరః నః పాయాత్ ....
వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింపబడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం..

మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు. "అది విష్ణువును కీర్తించే శ్లోకమే..!" అని చెప్పి అతనికి ఆ శ్లోకార్థమును ఈ విధముగా వివరించినాడు.

 " నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోనలేదు.

 న+ఆది.., అంటే మొదటి అక్షరము తీసి చదువుకొమ్మన్నాను అని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు."

గవీశపాత్రః ... లో గ తీసివేస్తే వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధము. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు,

గరుడుని చేత గౌరవింప బడువాడు, ... అంటే గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసివేస్తే గజార్తి హారీ ... గజేంద్రుని ఆర్తిని దూరము చేసినవాడు విష్ణువు..

కుమార తాతః .... 'కు' తీసివేస్తే మార తాతః అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. (మదనో మన్మదో మారః... అమరము)

శశిఖండ మౌళి: ... 'శ' తీసివేస్తే శిఖండమౌళిః. నెమలి పింఛము ధరించినవాడు.. కృష్ణుడు., అనగా విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: .. మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: .

క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు . అంటే బ్రహ్మ రుద్రాదులు పూజించు పాదపద్మములు కలవాడు.. విష్ణువు.

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు.. .

ఇక 'ప' తీసివేస్తే రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా..! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

అడిగినతడు సిగ్గుతో తలవంచుకొన్నాడు..

గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రసాయనాది ఏ శాస్త్రమున కైనా మహనీయులు వ్రాసిన రామాయణ, భారత, భాగవత, రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము.

 ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆ భాషకు అనుంగు బిడ్డ అయిన తెలుగు నేర్పించండి....

ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది... 


 అత్యంత విలువైన సమాచారం ..

కస్తూరీ మృగం అంటే ఒక రకమైన జింక, సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది, అది మంచి మదపువాసనగా ఉంటుంది, అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా ..? అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది, ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నది అని అది గ్రహించలేదు, ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది, ప్రాణాలు కోల్పోతుంది ...

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు, పుణ్యక్షేత్రాలనీ, తీర్ధయాత్రలనీ, అనవసరంగా తిరిగి కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు ..

పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ శ్రీకృష్ణుణ్ణి కూడా తమతో తోడుగా రమ్మని పిలుస్తారు ..

ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి, నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి అని చెబుతాడు, వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు, అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి, వారికి వడ్డింపచేస్తాడు శ్రీకృష్ణుడు, ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది ..

ఇది చేదు దోసకాయ ..  కటికవిషంలాగా ఉంది ..
ఇలాంటి వంటకం చేయించావేమిటి ..? అని/పాండవులు అడుగుతారు, శ్రీకృష్ణుడు నవ్వి, ఎన్ని గంగలలో మునిగినా, ఈ దోసకాయ చేదు పోలేదు,  ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని శ్రీకృష్ణుడు, ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు, ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం ..

మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపలకు జరగాలి, యాత్ర అనేది బయట కాదు, అంతరికంగా యాత్రను మనిషి చెయ్యాలి, ఈ ప్రపంచమంతా మనిషి తిరిగినా, తనలో మార్పు రాని పక్షంలో, ఏమీ సాధించలేడు, అదే తనలోనికి, తాను ప్రయాణం చేస్తే, ఉన్న గదిలో నుంచి కదలకుండా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు, మహర్షులు, మునులు ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేసి జ్ఞానసిద్ధిని పొందారు, కేవలం గ్రంథాలను,  ఇంట్లో పెట్టుకోవడం వలన లాభం శూన్యం, చదవి తర్వాత, ఆచరణలో తీసుకుని వస్తే శుభం కలుగుతుంది ..

............
 అహం - భావం

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు.... ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు.
ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.
ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ! ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego] నింపాయి.
ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి... ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తాను.
కాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను, మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంచుతాను...
అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది.
నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు ... ' అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు.

మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది..., శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు.
దేవత వెతుకుతూ వస్తోంది, ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి...
ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు , శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది,  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేక పోయింది.
ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వేల్లిపోవలనుకొని  వెనుతిరిగింది.
శిల్పి ఆనందనాకి అవధులు లేవు, తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు...
 ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! అంది.

'' అంతే ! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది, తన కెరీర్ లో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరుకూడా వంక పెట్టలేదు, అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు.
వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' ఏది ? ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది, ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , " నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని, కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే, నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు !  ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది, అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది."

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది.
అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు , ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది.
నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము.
స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.
'' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు...

          🔥శుభమస్తు🔥
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
[08:40, 17/08/2021] Mallapragada Sridevi: 🌹🌺🌿🌿💐🌴🪴🍀✍️

భారతీయ సంస్కృతికి ఆకరములు అనదగిన మహాభారత, రామాయణాది కావ్యాలలో రామాయణం ఒక విశిష్ట గ్రంథం. హిందువులకు భగవద్గీత మాదిరి ఇది కూడా ఒక ప్రమాణ గ్రంథం. చతుర్విధ పురుషార్థాలను బోధిస్తుంది కనుక దీనిని ఇతిహాసం అనీ, వాల్మీకి చేత వ్రాయబడింది కనుక ఆదికావ్యమనీ అంటారు. ఈ గ్రంథం శ్రీరాముని చరిత్రను చెబుతున్నది కనుక రామాయణం అనీ, సీత చరిత్రను వర్ణిస్తుంది కనుక సీతాయాశ్చరితమని, రావణుని వధ గురించి చెబుతున్నది కనుక పౌలస్త్యవధ అనీ పిలువబడుతున్నది. ఈ కావ్యంలో అనేక దేవ, మానవ, వానర, రాక్షస పాత్రలు ఉన్నాయి. వాటిలోని స్త్రీ పాత్రలకు సంబంధించిన వివరాలు:

అంజన - కుంజరుని కుమారై వానర స్త్రీ. కేసరి భార్య. ఆంజనేయుని తల్లి.

అనసూయ - అత్రి మహర్షి భార్య. సీతకు పతివ్రతాధర్మాలను బోధించింది.

అరుంధతి- వశిష్ట మహర్షి భార్య.

అహల్య - గౌతముని భార్య. పతివ్రత. రాముని పాదము సోకగానే శాప విముక్త అయ్యింది.

ఊర్మిళ - లక్ష్మణుని భార్య, జనక మహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె తపస్సాధనలో ఉన్నది.

కైకసి- రావణుడు, కుంభకర్ణు, విభీషణుల తల్లి.

కైకేయి - దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.

కౌసల్య - దశరథుని మొదటి భార్య. రాముని తల్లి.

ఛాయాగ్రాహిణి - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

జంఝాట

*తాటకి *- మారీచ, సుబాహువుల తల్లి. రాక్షసి.

తార - వాలి భార్య. అంగదుని తల్లి.

*త్రిజట *- రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకతె.

ధాన్యమాలిని - రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.

అనల- విభీషణుని కుమార్తె.

మండోదరి - రావణుడి భార్య. ఇంద్రజిత్తు, తల్లి.

మంథర - కైకేయి చెలికత్తె. కైకేయికి దుర్బోద చేసి రాముడు అరణ్యవాసం చేయడానికి కారకురాలు అయ్యింది.

మాండవి - కుశధ్వజుని కుమార్తె. భరతుని భార్య.

రేణుకాదేవి - జమదగ్ని భార్య. పరశురాముని తల్లి.

లంకిణి - లంకను కాపలాగా ఉన్న ఒక రాక్షసి .

వేదవతి - సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.

*శబరి *- రాముని భక్తురాలు. సిద్ధయోగిని. మతంగమహర్షి శిష్యురాలు. రాముని రాకకై ఎదురు చూసిన వృద్ధురాలు.

శాంత - దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.

శూర్పణఖ - రావణుని చెల్లెలు. రాముని వనవాస కాలంలో అతనిపై మోజుపడింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేశాడు.

*శ్రుతకీర్తి *- కుశద్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య.

సరమ- విభీషణుని భార్య.

సింహిక- హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

సునయన - జనక మహారాజు భార్య.

*సుమిత్ర *- దశరథుని భార్య. లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి.

సురస - నాగమాత. హనుమంతునిచే ఓటమి పాలయ్యింది.

సులోచన - ఇంద్రజిత్తు భార్య

*సీత *- జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో లభించింది. రాముని భార్య.
🌹🌺🏵️🌿💐🌴🪴🍀✍️
[08:43, 17/08/2021] Mallapragada Sridevi: అగరుబత్తి (పరిమళం)

     కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక అగరుబత్తి డబ్బాను కానుకగా ఇచ్చాడు..
 
  అది చూసిన తల్లి ముఖం చీదరించుకుని.., మీ నాన్న ఎప్పుడూ ఇంతే, మహా పిసినారి.. అంటూ లోపలికి వెళ్లి మంచి బ్లౌస్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకు ఇచ్చి అత్తారింటికి పంపించింది.. తను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్లిపోయింది.

     మరుసటిరోజు అత్తారింట్లో ఉదయమే దేవుని ఇంట్లోకి వెళ్లి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరుబత్తిని వెలిగించింది..
డబ్బాలో నుండి అగరుబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది..
అది తీసి చూస్తే తండ్రి చేతిరాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది.. తను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.. ఏమైందీ.. ఏమైందీ అంటూ అడగసాగారు.. తను తన చేతిలో ఉన్న చీటిని అత్త చేతిలో పెట్టింది..

    ఆ చీటిలోని 'సందేశం' ఇలా ఉంది..

      అమ్మా.. నీవు పెళ్ళయిన  తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళుతున్నప్పుడు,  నీ తండ్రిగా నీకు ఏమి కానుక ఇవ్వాలని చాలా ఆలోచించాను..

     దేవుని దయవలన నీ మనస్సుకు తగిన భర్త , అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు..
ఇప్పుడు నేను నీకు ఒక సుగంధభరితమైన అగరుబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను... ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ.. మీ నాన్న బాగా కంజూస్ అనుకుంటున్నావ్ కదా..
కాదు.. కాదు..

     మీ అమ్మ, పెళ్ళి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ ఎలా కలుపుకుని పోయి ఏ విధంగా వ్యవహరించిందో.. నువ్వు కూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి..

    ఏ విధంగా ఐతే అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి.. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడు నీకు గుర్తుండాలి.. నీ జీవితం సాఫీగా సాగాలి...ఇది మీ నాన్న కోరిక..

     ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి.. కోడలిని కౌగలించుకుని, ఇటువంటి సంస్కారవంతమైన ఇంటి నుండి మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం.. నిజంగా మేము ధన్యులం... 🙏

                  _శ్రీనివాసరావు ఊట్కూరు
   
         🙏సర్వేజనాః సుఖినోభవంతుః🙏
[08:52, 17/08/2021] Mallapragada Sridevi: క్రీ.శ. 1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీనపరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాదారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట.తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా శాసించే స్వరం, దారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.

గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.

థామస్ మన్రో మద్రాసు గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసినవారు కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.

చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. ఒక ఆంగ్లేయునికి మనదేశంలో ఇన్నివిధాలుగా దేవుని తార్కాణాలు లభించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది

సేకరణ:-

శుకబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు, కారణజన్ముడు. పరమ విరాగి. దర్బలు చేబూని, ఎల్లప్పుడూ సత్‌కర్మలు చేయుచుండెడివాడు. ఒక సందర్భములో శుకుడు నడిచి వెళుతుండగా, స్నానము చేయు ఆడవారు వివస్తల్రుగా వుండి కూడా, ఆ మహానుభావుని గురించి శంకించలేదు. అంతటి పరబ్రహ్మ స్వరూపుడైన శుక బ్రహ్మ భాగవతం చెప్పడానికి పూనుకొన్నాడు. కడుపులోనే భగవంతుని తేజాన్ని చూచి అటువంటి తేజము ఎక్కడఉందా అని అనుక్షణమూ వెతుకుతూ తన పేరును సార్థకం చేసుకున్న పరీక్షిత్తు ఆ భాగవతాన్ని శుకబ్రహ్మద్వారా విన్నాడు.

శమీక మహాముని తపస్సులో మునిగిన ఉన్నసమయంలో మరణించిన సర్పమును ఆ మహర్షిమెడలో వేసిన శృంగి శాపానికి గురయన పరీక్షిత్తు తన శాపం తనను కబళించేలోపల నేను జన్మసార్థక్యాన్ని పొందడమెలా అని విచారిస్తున్న కాలంలో శుకబ్రహ్మ వలన భాగవతాన్ని శ్రవణం చేశాడు.

అటువంటి భాగవతాన్ని అందరూ చదవాలి. ఎందుకు చదవాలి అంటే భాగవతము ఎల్లవేళలా పఠిస్తే, ఆ ఇంటిలోగాని, ఆ గ్రామంలోగాని, ఆ ఊరిలోగాని శుభ పరంపరలు కలుగుతాయ. భాగవత పఠనముచే జీవునిలో సర్వదోషములు హరించబడుతాయ. భాగవత పఠనముచే దోష నివృత్తి చెంది, సత్‌సంగములు ఏర్పడుతాయ అని పురాణాలు చెబుతున్నాయ.

కానీ భగవంతుని లీలను వినడంతో మనసు రంజిల్లుతుంది. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమే భక్తిగా పరిణమిస్తుంది. విషయ భోగాలపై విరక్తి ఏర్పడుతుంది. దానివలన మనిషి శుద్ధసత్వగుణస్థుడౌతాడు. ఆ సత్వగుణ ప్రభావంతో అతనిలో ఇతరజీవాల పట్ల ప్రేమకరుణ వృద్ధి అధికవౌతుంది. సర్వప్రాణి కోటిని పరమాత్మస్వరూపంగా ఎంచుతాడు. అట్లాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. తనపర భేదభావాన్ని మరిచి మనసును ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేస్తూ మనుషులందరూ ఒక్కటిగా ఉంటారు. అందరూ ఒక్కటేనన్న భావాన్ని కలిగి వ్యత్యాసాలు దూరమవుతాయ. వైషమ్యాలు తొలుగుతాయ. మైత్రీ భావం ఏర్పడుతుంది.

........


గానం-పానం

‘నేను భాగవతాన్ని వింటున్నాను/చదువుతున్నాను’ అని ఎప్పుడూ అనుకోకూడదంటారు. మరేమనాలని అడిగేవారికి ‘పిబత భాగవతం’ (భాగవతాన్ని తాగండి) అనాలని చెబుతారు భాగవతులు. చెవులతో వినేదాన్ని తాగడం ఎలా కుదురుతుంది?

కుదురుతుంది. అలా అనడంలో లోతైన అంతరార్థం ఉంది.

ఏదైనా తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉన్నా ఆ పదార్థాన్ని నోరు నేరుగా కడుపులోకి పంపిస్తుంది. ద్రవంలో సాధారణంగా తీసిపారేసేది ఏదీ ఉండదు. ఆ దృఢమైన నమ్మకంతో రెండో ఆలోచన లేకుండా తాగేస్తాం. ‘భాగవతమూ అలాంటిదే. దాన్ని రచించినప్పుడే అనేక వడపోతలు జరిగిపోయాయి. (భక్తులు, భగవంతుల కథలు కాబట్టి, వాటివల్ల అనేకమందికి మార్గదర్శనం అవుతుంది కాబట్టి) దీనిలో తీసి పారేయవలసింది ఏదీ ఉండదు’ అని వేదాంత ప్రవచనకర్తల మాట. భాగవతంలో భగవంతుడు శబ్దరూపిగా వసించడమే అందుకు కారణం. కాబట్టి భావంతో సంబంధం లేకుండా గా(పా)నం చెయ్యవచ్చు.

‘తెలుగు భాషకు ముగ్గురు మకుటంలేని మహారాజులు ఉన్నారు. వారు వరసగా- త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీరి ముగ్గురి పేర్లలో రాచరికం ఉంది. కానీ వీరు ముగ్గురూ భగవంతుణ్ని సేవించి, ఆ సేవల్లోని మాధుర్యాన్ని గ్రోలి (తాగి), ఆ రుచి మరిగి ‘ఈ రాచరికం వల్ల ఏమీ సుఖంలేదు. కాబట్టి మాకు వద్దు’ అని విడిచిపెట్టేశారు.

ఆ పరంపరలో ఒక రాజు దాసుడయ్యాడు. అతడే రామదాసుగా మారిన గోపరాజు. ఆయన తన కీర్తనల్లో ‘రామజోగి మందు కొనరే...’ అనే కీర్తనలో ‘శ్రీరామ దివ్య నామస్మరణ అనే పానం చెయ్యండి’ అన్నాడు. మరోచోట ‘తారక నామమనే రసాన్ని పానం చేసేవారికి అమృతాన్ని తాగే అవసరం లేదు’ అన్నాడు.

మరో రాజు అయ్య (తండ్రి)గా మారి త్యాగయ్య అయ్యారు. ఆయనా తన కీర్తనల్లో చాలాచోట్ల ‘దైవ నామ పానం చెయ్యండి’ అని ప్రయోగించారు.

పోతరాజు ‘పోతన్న’ పేరుతో అందరికీ అన్న అయ్యారు. ఆయన తన భాగవత అనువాదంలో అనేకచోట్ల నామపానం అనే ప్రయోగం చేశారు. ప్రహ్లాదుడి గురించి చెబుతూ, నారాయణుడి పాదపద్మాల గురించి ఆలోచించడమనే అమృత పానం చేసేవాడు- అని ప్రయోగించారు. ‘మందార మకరంద...’ అనే పద్యంలో విష్ణు పాదాల గురించి ఆలోచనలనే అమృతాన్ని గ్రోలేవాడు అని ప్రయోగించారు.

ఇలా ఆ ముగ్గురూ పరమేశ్వరుడి పాదాల దగ్గర దాస్యాన్నే అభిలషించారు. భక్తి అనే రసం పంచారు. భక్తి సామ్రాజ్యాలను ఏలారు.

సదాశివ బ్రహ్మేంద్రులవారు ‘పిబరే రామరసం’ అంటూ రామ నామమనే రసాన్ని పానం చెయ్యండన్నారు. ఇలా విష్ణునామ సంకీర్తనలు చేసినవారంతా పానం చెయ్యమనే చెప్పారు.వేదాలనే కల్పవృక్షాల శాఖల చిట్టచివర పండిన పళ్లు ఉపనిషత్తులు. అవి జ్ఞాన రసాత్మకమైనవి. దాన్ని చిలక కొరికింది. పండు బాగా పక్వానికొచ్చినప్పుడే చిలక కొరికి రుచి చూస్తుంది. చిలక రుచి చూసిన పండ్లను ఎంగిలిగా భావించరు. ఇక్కడ చిలక ఎవరు? శుకబ్రహ్మ. శుకుడు తన నోటిద్వారా ప్రవచనం చేశారు. అదే భాగవతం. దేనిమీదా ఆపేక్ష లేని మహాపురుషుడు శుకుడు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది కాబట్టి భాగవతం ఎంగిలికాని, మధురమైన పానద్రవ్యం అయింది. అందుకని ఆ భాగవతాన్ని రెండో ఆలోచన లేకుండా తాగెయ్యవచ్చు అంటారు.

నాలుక లాగానే చెవి, కన్ను లాంటి ఇంద్రియాలు సైతం రుచిని ఆస్వాదించగలుగుతాయి. భగవన్నామం అన్నా, విన్నా, కన్నా మధురమే కదా! అంత గొప్పదైన రసాన్ని, అమృతసమమైనదాన్ని గానం చేస్తుంటే, ఆ గానం ఏ అడ్డంకీ లేని పానం కావాలి. కాబట్టి భాగవతాన్ని వినడం అనేకన్నా పానం చెయ్యడం అనడమే అన్నిందాలా సబబు.

- అయ్యగారి శ్రీనివాసరావు

.........

శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు. శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు. పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు. జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

........

సర్వ సాధారణంగా ఆధ్యాత్మికత అంటే..

సగటు మనిషికి మత సంబంధమైన, ఆరాధన సంబంధమైన ప్రార్థన, భజన, పూజ, జప, ధ్యాన, యోగాలు అని భావిస్తారు. అయితే, అవన్నీ వ్యక్తిలో, సమాజంలో ఆధ్యాత్మికతను పురిగొల్పే సాధన సంబంధ ఉపకరణాలు మాత్రమే! ఆధ్యాత్మికత అన్నది అత్యున్నత సంస్కార విశేషం. ఆధ్యాత్మికత జీవితంలోని అన్ని పార్శాలను అలుముకొని

ప్రభావితం చేసే సంస్కారం. అందుకు ప్రధాన మార్గం శ్రవణం, మననం, నిధి ధ్యాసనం. శాస్ర్తాన్ని అధ్యయనం చేయడం, అధ్యయనం చేస్తున్న దానిలోని విషయాన్ని శాస్త్రీయంగా గ్రహించడం, ఆధ్యాత్మిక బోధలు వినడం.. శ్రవణం. ఈ విధంగా గ్రహించిన విషయాన్ని తరచి తరచి చూచి స్పష్టత ఏర్పర్చుకోవడం మననం. ఆ స్పష్టమైన అవగాహనను హృదయంలో స్థిరపరచుకొని, ఆచరణలోకి అనువదించడం నిధి ధ్యాసనం. ఈ ప్రధాన మార్గానికి పైన పేర్కొన్న ఉపకరణాలు ప్రబల సహాయకారులుగా నిలుస్తాయి.

అవగాహనలో, అనుభూతిలో అనన్యత, అన్యోన్యత, ఆత్మీయత అనంతంగా విస్తరించడమే ఆధ్యాత్మికత. అదే సాధకుడి మార్గాన్ని అనుభవింపజేసే విస్తరణం. అంతిమంగా పొందేది అమృతత్వం. ‘మృత్యోర్మా అమృతం గమయ’ అంటే ఇదే ప్రస్థానం. పరిమితిలో కూరుకుపోయిన అహంకారం రకరకాల ఆధిక్యతా ఆకాంక్షలుగా వ్యక్తమవుతుంది. అది ఇతరులను తొక్కివేయాలన్న భావన

కలిగించవచ్చు. మాయమాటలతో ఆధ్యాత్మిక వేదికను ధనార్జనకు భూమికగా మార్చుకునే ప్రయత్నమూ జరగవచ్చు. అయితే, ఆధిక్యత సాధించాలన్న అభిలాష, ఆశయం తప్పు కాదు. అది లోక క్షేమానికి దారితీయాలి. ఆ మార్గంలో ఉన్న వ్యక్తులు వివేకంతో మసలుకోవాలి. తమ శక్తియుక్తులను సమాజ శ్రేయస్సుకు ధారపోయాలి. ఇలాంటి భావనను విస్తారంగా వినియోగంలోకి

తేవాలన్న ఆధిక్యతాభిలాష ఎప్పుడూ మంచిదే. అదే సాత్వికాధిక్యత. అయితే, పరుల విశిష్టతను, ఉన్నతిని ఓర్వలేక ప్రదర్శించే ఆధిక్యత సరైనది కాదు. ఇలాంటి తామసాధిక్యత సమాజంలో భేదాలకు, ఘర్షణలకు దారితీస్తుంది. మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సంస్కృతిని దెబ్బతీస్తుంది.

సారభూతంగా నిస్వార్థత, ప్రేమను పెంచడమే నిజమైన ఆధ్యాత్మికత. అటువంటి విధానం వ్యక్తిలో, సమాజంలో, దేశంలో పరివ్యాప్తమై పరిఢవిల్లాలి. అయితే అనేక వికృతులు విస్తరిస్తున్న ఈ కాలంలో ఇది అసాధ్యం అనిపించవచ్చు. కానీ, ఈ మార్గంలో మాత్రమే మానవాళి భవిష్యత్తు క్షేమంగా ఉండగలుగుతుంది. ఇందుకు విరుద్ధమైన విధానం వినాశనాన్ని ఆహ్వానిస్తుందన్నది కూడా

తథ్యం. ప్రస్తుత వినియోగవాద ప్రపంచంలో ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచిపోషించేవి వ్యవస్థలు కాదు. నిష్పక్షపాత దార్శనికత, ధైర్యం కలిగిన బుద్ధిజీవులుగా, మేధావులైన శిష్టజనులు మాత్రమే ఈ పనిని సాకారం చేయగలరు. సమాజంలో వీరి సంఖ్య పరిమితమే కావచ్చు. కానీ, వీరంతా ఒక బలమైన వేదికగా ఏర్పడి, సాఫల్య వైఫల్యాలపై దృష్టిపెట్టక ధర్మనిష్ఠతో

ముందుకుసాగాలి. నిరంతరం ప్రజలకు మార్గదర్శనం చేస్తుండాలి

శ్రేష్ఠజనుల ఉద్ఘోష , అచంచల ఆచరణే మానవాళికి ప్రేరణ. ఆర్ష వైదిక దర్శనం, ధర్మం, వాఙ్మయం, సంస్కృతి ఈ దిశలోనే సంప్రదాయాన్ని నిర్మించింది. స్వేచ్ఛ పేరుతో అన్ని రంగాలలో స్వార్థం, సంకుచితత్వం పెరుగుతున్న ఆధునిక సమాజంలో ఆర్షవైదిక స్ఫూర్తిని విస్ఫారింపజేయడం అత్యావశ్యకం. సంస్కారకాంతులను అన్ని దిశల నుంచి గ్రహిస్తూ తాము వికసిస్తూ, సమాజాన్నిమేల్కొలిపే శిష్టజనుల పాత్ర ఆధ్యాత్మిక శ్రేయస్సుకు శ్రీరామ రక్ష.

........

ధర్మరాజు, ఆయన తమ్ముళ్లు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్లను చూడటానికి లోమశ మహర్షి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత లోమశుడు, ‘ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది’ అని సలహా ఇచ్చాడు.

లోమశుడి మాట ప్రకారం కొన్నాళ్లకు పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్లారు. అలా వెళ్లినప్పుడు వాళ్లకు గంగానది ఒడ్డున రైభ్య మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే భరద్వాజుని ఆశ్రమం ఉంది. భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. నదీ తీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పర్చుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు పరావసు, అర్వావసు. వాళ్లిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరు పొందారు. భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. అతనికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు. పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు.

పరావసు, అర్వావసుల కన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుణ్ని గురించి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్లంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూ లోకానికి వచ్చి, ‘ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. ‘ఎవరూ చదువని వేద విద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ని కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువు గారి దగ్గరికి పోవటం, ఆశ్రమవాసం చేయడం, కొన్నాళ్లు ఆయనకు సేవ చేయటం నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాల మీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి’ అని యవక్రీతుడు వేడుకున్నాడు. అది విని ఇంద్రుడు నవ్వాడు. ‘పిచ్చివాడా! నీ తెలివి అపమార్గం పట్టింది. తక్షణమే వెళ్లి గురువును ఆశ్రయించు. ఆయన దగ్గర శుశ్రూష చేసి వేద విద్యలన్నీ నేర్చుకో. గురువు వద్ద నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు’ అని హితవు పలికాడు.

కానీ, యవక్రీతుడుకి ఇంద్రుడి మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సుకు పూనుకున్నాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి, ‘నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్లి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్లు కాల్చుకోవటం మానుకో’ అని చెప్పాడు. యవక్రీతుడికి కోపం వచ్చి, ‘నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను’ అన్నాడు.

అలా ఉండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్లాడు. అక్కడ ఓ వృద్ధుడు నది ఒడ్డున కూర్చుని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు ‘ఏం చేస్తున్నావు. తాతా?’ అని అడిగాడు. ‘గంగానది దాటడానికి వంతెన కడుతున్నా’ అన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాటలకు యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. ‘వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్టవేయడం కుదరని పని. వేరే మార్గం చూడు’ అని సలహా ఇచ్చాడు. ‘గురువు లేకుండానే, అసలు చదువకుండానే, కష్ట పడకుండానే విద్య రావాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో! అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా’ అని వృద్ధుడు బదులు చెప్పాడు.

ఆయన ఎవరో యవక్రీతుడికి అప్పుడు అర్థమైంది! వెంటనే కాళ్లమీద పడ్డాడు. ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుడిని దగ్గరకు తీసుకుని, ‘నీ తండ్రి దగ్గర వేద విద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు’ అని ఆశీర్వదించాడు.

......

ఒకనాడు శ్రీకృష్ణుడు... 

పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాడట!! అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాసుకుంటున్నాడు!!

కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది.కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాగున్నది నాకిస్తావా, అని అడిగాడు. 

వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా..

అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె యిచ్చాడు*

కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు, కుడిచేత్తో యీయరాదా, అన్నాడు. 

అందుకు కర్ణుడు

క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:

యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:

అర్థము:—

కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు.

లక్ష్మి చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణంలో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుంచి ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు. అందుకే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే చెయ్యాలనే హితోక్తి ననుసరించి యిలా చేశాను.అన్నాడు.

అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు

సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు*

అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా

దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ

అర్థము:- కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.అంతే కాదు నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు. అని కోరాడు. 

దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.

దానం విషయంలో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవ దర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి.

దానం చేసి నేను చేశాననే అహం కూడదు.

మానవునకు రోగం కలిగించేది- పాపం!

మానవునకు భోగం కలిగించేది- పుణ్యం!

మానవుని భవిష్యత్తు నిర్ణయించేది- కర్మ!

మానవునకు లాభం కలిగించేది- సేవ!

మానవునకు సంపాదన నిలిపేది- పొదుపు!

మానవుని విలువ పెంచేది – దానం!

మానవునకు నష్టం కలిగించేది – హింస!

మానవునకు అశాంతి కలిగించేది- ఆశ!

మానవునకు శాంతి కలిగించేది- తృప్తి!

మానవునకు దుఃఖం కలిగించేది- ‘కామం!

మానవుని పతనం చేసేది – అహంకారం !

మానవునకు అందరిని దగ్గర చేసేది- ప్రేమ !

మానవునకు అందరినీ దూరం చేసేది- అసూయ !

మానవుని స్థితిని సూచించేది-గుణం !

మానవుని దైవంగా మార్చేది- దయ !

మానవుని ఆత్మస్థితి తెలిపేది- వాక్కు !

మానవునకు విజయం చేకూర్చేది- ధర్మం !

మానవుని గొప్పవాడిగా చేసేది- జ్ఞానం !

మానవునకు- ముక్తి’ని ఇచ్చేది- సత్యం !

మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది-

జపం / ధ్యానం !..

. అందుకే జపం / ధ్యానం అన్నింటికంటే గొప్పవి. 

కాబట్టి నిత్యం జప ధ్యానాల్లో సమయాన్ని వెచ్చిస్తూ, దైవ చింతనలో మనస్సును లగ్నం చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి,

అలాగే ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి.

ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు.మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం “సత్పాత్ర” దానం చేయడం అలవరుచుకోవాలి


హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే🙏

[10/11, 10:07 am] . Mallapragada: తల్లికి కపిలుడి తత్త్వ బోధ!!


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది. ‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు.

”నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్ళు చల్లావు. నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి గద్గద స్వరంతో.

కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి ”నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది.

”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుబోతూ ”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. ‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ ”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి.

”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. కపిలుడు మందహాసం చేసి ”అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యానిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం. కాయలు నరుకుతున్నాం. అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా.

నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. కపిలుడు మందహాసం చేసి ”అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా! నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. దేవహూతి నిర్విణ్ణురాలైంది. కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు.

”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. నేను, నాది, నావాళ్ళు అన్న ఆశాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉంచి ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు.

అరటి పిలక మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం.

”మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు.

”ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషిడిగా’ తానుంటూ ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో ఆ దేహం రాలిపోతుంది. దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది.

”ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి.

”ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?”

కపిలుడు అలా వివరంగా ఉపదేశించి ”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు.

దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాస్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రిడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. ”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… నీ దివ్యదర్శన భాగ్యం చేత నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు నా గర్భమున సుతుడవై జన్మించి నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.

కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు.

    ( సేకరణ : విష్ణు పురాణము నుండి)

మహాదేవ 🙏

[10/11, 5:49 pm] . Mallapragada: *వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం* 

—————————————-

 *అ* - *అ* రుదైన అమ్మాయి

 *ఆ* - *ఆ* కతాయి అబ్బాయి

 *ఇ* - *ఇ* ద్దరికి

 *ఈ* - *ఈ* డు జోడి కుదిరి

 *ఉ* - *ఉం* గరాలను తొడిగి

 *ఊ* - *ఊ* రంతా ఊరేగించారు

 *ఋ* - *ఋ* ణాల కోసం 

 *ఎ* - *ఎ* వరెవరినో అడుగుతూ ఉంటే

 *ఏ* - *ఏ* నుగు లాంటి కుభేరుడితో అడిగి

 *ఐ* - *ఐ* శ్వర్యం అనే కట్నం ఇచ్చి

 *ఒ* - *ఒ* కరికి ఒకరు వియ్యంకులవారు

 *ఓ* - *ఓ* ర్పుతో ఒప్పందం చేసుకొని

 *ఔ* - *ఔ* దార్యాని ఇరు కుటుంబాలకు

 *అం* - *అం* దించాలని కోరుకుంటూ

 *అ* : - *అ:* అంటూ

 *క* - *క* లపతో తయారయిన పత్రికలపై 

కలంతో రాసిచ్చి

 *ఖ* - *ఖ* డ్గాలతో నరికిన పందిరి ఆకులను

 *గ* - *గ* డప ముందుకు తీసుకొచ్చి

 *ఘ* - *ఘ* నమైన ఏర్పాట్లు చేయించి

 *చ* - *చా* పుల (బట్టలు)నింటిని కొని

 *ఛ* - *ఛ* త్రం (గొడుగు) పట్టి గండదీపాని

 *జ* - *జ* రిపిస్తూ

 *ఝ* - *ఝా* ము రాత్రి దాక

 *ట* - *ట* పాకాయలను కాలుస్తూ

 *ఠ* - *ఠీ* విగా (వైభవంగా)

 *డ* - *డ* ప్పులతో

 *ఢ* - *ఢం* ఢం అని శబ్దాలతో సాగుతుంది

 *ణ* - కంక *ణా* లు చేతికి కట్టుకొని

 *త* - *త* ట్టలో తమలపాకులు పట్టుకొని

 *థ* - *థ* మన్ (మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో

 *ద* - *ద* గ్గరి బంధువులను పిలిచి

 *ధ* - *ధ* నవంతులను కూడా పిలిచి

 *న* - *న* అనే నలుగురిని పిలిచి

 *ప* - *పది* మందిని పలకరిస్తూ

 *ఫ* - *ఫం* క్షన్ కి రావాలని చెప్తూ

 *బ* - *బ* లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి

 *భ* - *భ* టువులని (ఆభరణాలు) కొని

 *మ* - *మం* గళ స్నానాలు చేయించి, రాజసూయ

 *య* - *యా* గం లాంటి పెళ్లి కి 

 *ర* - *రా* రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి

 *ల* - *ల* క్షణమైన 

 *వ* - *వ* ధూవరులను మీరు

 *శ* - *శ* తమానం భవతి అని

 *ష* - *ష* రతులు లేకుండా ఆశీర్వదించడానికి

 *స* - *స* ప్తపది (పెళ్లి) వేడుకలో

 *హ* - *హం* గు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో

 *ళ* - క *ళ* త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని

 *క్ష* - *క్ష* త్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లి కి

 *ఱ* - *ఱా* రండి.........

🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment