Thursday, 15 February 2024

 

🪷 * మాఘమాసం ప్రారంభం* 🪷

1-02-2025వ తేదీ నుండి 10-03-2025వ తేదీ వరకు

కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత ..!

ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.

*దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ*
*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం*

అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని, బావుల వద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.

పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే, కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.

అరుణాచల శివ.... ఓం నమః శివాయ.. ఓం శ్రీ మాత్రేనమః

*మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలిప్రభ *
6281190539

*🎻🌹🙏ఈ రోజు నుండి మాఘ పురాణం  ప్రారంభం..!!*


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


*మాఘ పురాణం - 1 వ అధ్యాయము*


    *🌹మాఘమాస మహిమ 🌹*


🌷శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |l

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||🌷


🌷వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||🌷


🌸 ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము, కర్మధర్మ ధ్యాన పరాయణమై, సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. 


🌿అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు, గంగాదినదులూ, నైమిశం మొదలైన అరణ్యములూ, మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ, మొదలైనవానికి, అనేకరెట్లు, ఫలితాన్నిచ్చేవిగా, ప్రసిద్ధి చెందినాయి. 


🌸వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం, మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం, మొదలైన వాని వలన, వచ్చే పుణ్యం, బగణ్యమైనది. అంటే, యింత అని లెక్కకురానిది.


🌿 పూర్వం మహర్షులు, 

శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి, ''స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ, ప్రశాంతమూ, పావనమూ, సిద్దిప్రదమూ, అయిన ప్రదేశాన్ని, మాకీ భూమండలంలో, నిర్దేశింపుడని, ప్రార్థించినారు. 


🌸అప్పుడు శ్రీ మహావిష్ణువు, వారితో, "మహర్షులారా! నేను నా చక్రాన్ని విసురుతాను. అది యెక్కడ పడుతుందో, ఆ ప్రదేశం, తృణకాష్ఠజల సమృద్ధమైన, తపో యోగ్యమైన ప్రదేశంగా, గుర్తించండీ, అని చెప్పి, తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని, నైమిశారణ్యమని వ్యవహరిస్తూ, శౌనకాది మహర్షులు, అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. 


🌿వారక్కడ నివసిస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూవుంటే, భూమండలంలో, వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ, చూడడానికి, వస్తూ వుండేవారు. 


🌸అలగే, రోమహర్షుణుడో, ఆయన కుమారుడు సూతమహర్షియో , అందరిలా, ఆయాగాన్ని, చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు, వాళ్ళని ప్రార్థించి, విరామకాలంలో, పుణ్యకరములైన కథలని, విశేషాలని,చెప్పించుకునేవారు.


🌿 అంటే నైమిశారణ్యంలోని, ఆ ఆశ్రమంలో, జపహోమాదులు లేనప్పుడు, పుణ్యకథాప్రవచనాలు, అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని, పెoపొందించేవి.

ఇలా ఒకప్పుడు, శౌనకాది మహర్షులు, చిరకాలం జరిగే యాగమునొకదానిని, ప్రారంభించారు. 


🌸ఆ యాగం, కొన్ని సంవత్సరాలు, జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని, చాలా మంది మునులు, దేశం నలుమూలలనుండి, ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో, సూతమహర్షి వున్నారు. శౌనకాది మునులు, ఆయనకెదురు వెళ్ళి, సగౌరవంగా తీసికొని వచ్చారు. 


🌿తగిన ఆసనం పై కూర్చుండబెట్టి, అతిధి సత్కారాలు, చేశారు. ఆయనతో ఇలా అన్నారు. "సూతమహర్షి! మీ తండ్రిగారు, రోమహర్షణులవారు, పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో, సాటిలేని వారు. శరీరము పులకించి, ఆనంద పారవశ్యంచే, రోమములు కూడా, పులకరించేటట్లు చేయగల  సమర్థులు, రోమములకును, హర్షము కలిగించువారు కనుగ, రోమహర్షణులని సార్థక నామధేయులైనారు.


🌸 వారి కుమారులైన మీరు కూడ, ఆయన అంతటివారై, ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన, మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో, మాకు పుణ్యకరములైన విషయాలని వినడం, మరింత ఫలప్రదం అవుతుంది కదా! దయవుంచి, మాకు పుణ్య కథలని వినిపించండి" అని ప్రార్థించారు.


🌿సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి, సుఖాసనంపై కూర్చుని, వారి మాటలను విన్నాడు. 


🌸వారందరికీ నమస్కరించి, చిరునవ్వుతో, మీకు నా మీద వున్న అభిమానానికి, కృతజ్ఞణ్ణి, పుణ్యకార్యాలు జరిగే చోట, పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా, ఒక అదృష్టమే. అది కూడ, యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. 


🌿ఈ రూపంగా, నన్నూ, ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు, నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి, వ్యాసమహర్షుల వారి, దయా విశేషం చేత, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని, యధాశక్తి  వినిపించి, మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను, పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి" అని సవినయంగా అడిగెను. 


🌸అప్పుడు మునులు, ''సూతమహర్షి, లోగడ వైశాఖమాసం, కార్తీకమాసం, వైశిష్ట్వాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి, మాకానందం కలిగించారు.

 ప్రస్తుతం, మాఘమాస మహిమను వివరింపుడని'' కోరారు.


🌿 అప్పుడు సూతమహర్షి, క్షణకాలం కళ్ళు మూసుకుని, ధ్యానంలో ఉండి, తండ్రిగారిని, గురువులను, తలచుకొని, నమస్కరించి, కనులు తెరచి, మునులకు, మరల, నమస్కరించి, యిలా ప్రారంభించాడు.


🌸 "మహర్షిసత్తములారా! మీరు అడిగిన ప్రశ్న, సారవంతమైనది. విశేషించి, సామాన్య ప్రజానీకానికి, మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది, అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి, పాపం పోగొట్టుకొని, పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు, తరించడానికి, ఈ విషయం బాగా ఉపకరిస్తుంది.


🌿పూర్వం, ఒకప్పుడు, జగన్మాత అయిన పార్వతీదేవి, పరమేశ్వరుణ్ణి, యిదే  విషయాన్ని అడిగింది.


🌸గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని, పార్వతీదేవికి, పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు, చెప్పెదను వినండి.


🌿 పార్వతీదేవి, పరమేశ్వరునితో, "విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూతదయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై, నా చెవులకు మరింత యింపుగానున్నవి. 


🌸మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని" ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు "కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయము, మిక్కిలి నిగూఢమైనది. 


🌿గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియండును? తప్పక చెప్పెదను,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా, మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు, పాపవిముక్తులై ముక్తినందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా, చేసిన స్నానం, అధిక పుణ్యప్రదం.


🌷 మొదటి స్నానం, 

వాని సర్వపాపములను పోగట్టును.


🌷 రెండవస్నానము, వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. 


🌷మూడవస్నానం, అతనికి, శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు, చేస్తుంది. 


🌸ఇట్టి పుణ్యాత్మునికి, నేనేమి యివ్వాలని, శ్రీమహవిష్ణువే, ఆలోచనలోపడును. ప్రయాగలో, మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి, పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో, ఉదయాన్నే, నది ప్రవాహంలోగాని, సరస్సులో గాని, స్నానం చేసినవారికి ముక్తి, కలుగుతుంది. 


🌿ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ, మొదలైనవానిలో చేసిన స్నానం, పాపనాశకం, మోక్షదాయకం సుమా! తెలిసికాని, తెలియకకాని, బలవంతంగాకాని, మాఘ మాసమున, ఒకమారు స్నానమైనను, సూర్యోదయమునకు ముందుగా చేసినచో, వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో, నెలoతయు చేసినచో, విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో, అతడు ఋషియై జన్మించును.


🌸మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక, పురాణమును వినక, మాఘమాసమును గడిపిన వానికి, మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన, కుంభీపాకనరకమున, బాధలు పడును. మదగర్వముచే, మాఘస్నానము మానిన, అధముడు, నీచజన్మలను, పలుమార్లుపొందును.


🌿 చలికి భయపడి, స్నానము చేయనివారిని, చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో, సూర్యుని చూచి, నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు, పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా! దరిద్రులైనను, బాలురైనను, ప్రాతఃకాల స్నానముచేసిన, శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు.


🌸 చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు, హరినామస్మరణ చేయుచు, ముమ్మారు, జలబిందువులను, శరీరముపై చిలుకరించుకొన్నను, పుణ్యమే. నీచుడైనను, మాఘస్నానము చేసిన, పాపములను వీడి, ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున, మాయందు స్నానమాడినచో, వాని పాపములను, మేము నశింపజేయుదుమని, జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి, సంసార భయము లేదు. 


🌿ఆడంబరము కొరకుగాని, భయముచే గాని,, బలవంతముగాగాని, మాఘస్నానము చేసినవాడు, పాపవిముక్తుడై, పుణ్యాత్ముడగును. అశక్తుడు, తాను మాఘస్నానము చేయలేకపోయినచో, స్నానము చేసినవానికి, దక్షిణనిచ్చి, వానినుండి, స్నానఫలమును పొందవచ్చును. 


🌸ఈ మాసమున, నిరుపేదలకు, వస్త్రదానముగాని, కంబళదానముగాని, చేసిన, స్నానఫలమునంది, పుణ్యవంతులగుదురు.


🌿 బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని, పుణ్యముకల్గును. ఈ స్నానమును, అన్ని వర్ణములవారును, చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.


🌸పార్వతీ! మాఘస్నానము, సద్యోముక్తిప్రదము. దానికి సాటిలేదు. శక్తిలేనివారు, కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి, పురాణమును విన్నను, వారికి స్నానఫలము కలుగును.


🌿 అన్నిమాసములలో, మాఘమాసముత్తమము. 

శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో, మాఘమాసముత్తమము. వృక్షములలో, అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో, సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో, వేదములుత్తమములు.


🌸 కావున, మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను, మహాపాపములు కలుగును. 


🌿నాలుగువర్ణముల వారిలో, బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత, పుణ్యప్రదము సుమా.


🌸దిలీపుడను మహారాజు, పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు.


 🌿ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి, అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి, అచట కొంతకాలము విశ్రమించి, తన నగరమునకు ప్రయాణమయ్యెను.


🌸 అప్పుడు, వృద్ధ బ్రాహ్మణుడొకడా, మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి, ఆశీస్సులనందెను. 


🌿ఆ బ్రాహ్మణుడు, ''మహారాజా! పరమపవిత్రమైన మాఘమాసమున, నీ సరస్సున, స్నానము చేయకుండపోవుచున్నానేమి? మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని, మిక్కిలి పుణ్యమునిచ్చునని, యెరుగువా?" యని ప్రశ్నించెను. రాజు, మాఘస్నానమహిమను చెప్పుడని కోరగా,అతడు. 


🌸"రాజా! నీ విప్పుడీ సరస్సున, తప్పక స్నానము చేసిపొమ్ము. మాఘమాస స్నాన మహిమను, మీ గురువగు, వశిష్ఠమహర్షివలన, తెలిసికొనుమని చెప్పి," తన దారిన పోయెనుl.


*1 వ అధ్యాయం సంపూర్ణం 🙏*


*మాఘ పురాణం - 2 వ అధ్యాయం ()*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమలు చెప్పుట :*

      వశిష్ఠులవారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను." మహాముని! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిం" డని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ, నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవివచ్చి భర్తపాదములకు నమస్కరించి, 'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని, కానీ, ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన, ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని' వేడుకొనగా, పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను, దేవి! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.

    సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక, జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా, ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను, లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని, తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతకాలస్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి, తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.

     ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక, కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక, మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలోస్నానముచేసి, శ్రీమన్నారాయణుని పూజించి, సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి, విష్ణు అందిరమునగాని, శివాలయమున గాని దీపము వెలిగించి, ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక, స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణారంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె, తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి, దానధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ! యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

నేను తెలియజేసిన విధయముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని, జపముగాని, విష్ణుపూజగాని, యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, ఱంపములచేత, ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి, కాలకృత్యములను తీర్చుకొని, నదికిపోయి స్నానము చేసి, సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో, అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది, కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు, బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైననూ, జవ్వనియైననూ, ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.

       పార్వతీ! దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ, యితరులనువంచించించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదావ్యభిచార గృహములలో తిరిగి, తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను యెగతాళిచేయువాడును, గర్వముకలవాడై తానే గొప్పవాడనని

అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడుపనులకు ప్రేరేపించువాడను యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూరకర్మములు ఆచరించువారు, సిగ్గువిడిచి తిరుగువాడు, బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి, యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వౄద్ధులు, జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలోస్నానము చేయలేరు. కాన, అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.

              ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి, యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికికాని, క్షత్రియునికి కాని, శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని, చేయలేని వారినికాని, ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక, ఆయుఃక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు, ముఖము కడుగుకొని,  తలపై నీళ్ళుజల్లుకొని, సూర్యనమస్కారములు చేసి, మాఘపురాణమును చదువుటగాని, వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా, వంద అశ్వ మేధయాగములుచేసి, బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగ్ను. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంత యును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన, నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

*రెండవ భాగము సంపూర్ణం :*

*_ మల్లాప్రగడ రామకృష్ణ *
ప్రాంజలి ప్రభ, హైదరాబాద్.

*మాఘ పురాణం - 3 వ అధ్యాయం ()*

*గురు పుత్రికాకథ :*

మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి?  వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము, పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.

ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద, అనేకవర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలుగుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.

గురు పుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.

గురు పుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.

         తండ్రియామెను కాశ్మీరదేశ వాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి 'జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను. ఓయీ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!

సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి 'తండ్రీ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.' అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున  యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ నీమచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ మున్నగు సువాసిని అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుహ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.

*_ మల్లాప్రగడ రామకృష్ణ .*

ప్రాంజలి ప్రభ

*మాఘ పురాణం - 4 వ అధ్యాయం(13/02/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*సుమిత్రుని కథ :*

పార్వతీదేవియు శివునిమాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు , సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగగోరుచున్నాను , దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతీ ! సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను , చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లుపలికెను. గురువర్యా ! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచేపోతిని. మీ కుమార్తెయు బంతితోనాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహరప్రదేశమున నన్ను తనకోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె ఓయీ ! నీవు నామాటవిని నన్నుకూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగ నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా తండ్రి నాయందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా ! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించుకొనుము రమ్ము. నా కోరికను దీర్చుమని యనేక విధములుగ నిర్భందించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమెకోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహమువలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను.

సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి యిట్లు పలికెను. ఓయీ ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము అన్ని నదులలో మిక్కిలి యుత్తమ నదియైన గంగాతీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువుచెప్పిన యుపదేశమును పాటించి గంగాతీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోటనొక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు అచట విశ్రమించదలచెను. అచటివారందరును శిష్యులు , మిత్రులు , కుటుంబసభ్యులు మున్నగువారితో మాఘస్నానముచేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి.

సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయువ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి ? దీనిని చేసినచో నేలోకముకల్గును. మీరు పూజించునది యేదైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలోనోకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘమాసమున ప్రాతఃకాలమున నది , సరస్సు మున్నగువానియందు స్నానముచేసినవాడు శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు , పరులనునిందించువాడు , బ్రహ్మహత్యచేసిన వానితో సమానులు , అబద్దపుసాక్ష్యమును చెప్పినవాడు , దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘమాసస్నానము మానినవాడు , బ్రహ్మహత్యచేసిన వానితో సమానులేయగుదురు. తోటలను కూల్చినవాడు , కన్యలను , అశ్వములను అమ్మినవాడు , చెరువుగట్టును తెగ కొట్టినవాడు , పరస్త్రీ సాంగత్యము కలవాడు , దేవద్రవ్యము నపహరించువాడు , తానిచ్చిన దానినే దొంగలించువాడు , మద్యపానలోలుడు , ఆడినమాటను తప్పినవాడు , పెద్దలను , దేవతలను , బ్రాహ్మణులను ద్వేషించువాడు , దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు , పితృశేషాన్న భోజనుడు , సోదరుని భార్యతో రమించువాడు , అసత్యభాషణుడు , భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు , పురాణ శ్రవణమును , వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు , తల్లిదండ్రులను దేషించు వాడు , వీరందరును పాపాత్ములే సుమా. మేము చేయుచున్న యీమాఘమాస వ్రతమును పాటించినచో యీ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవునర్చించిన వాని పుణ్య అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘస్నానవ్రత ఫలమును పెక్కువిధములుగ వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును , గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడుదినములు మిగిలియున్నది. ఈ మూడుదినములును మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.

సుమిత్రుడును వారి మాటప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘస్నానమును చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమునారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులోనుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు , శ్రీ హరి కృపావిశేషమునంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునేగాక , మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాపవినాశమును , పుణ్యప్రాప్తిని వివరించు యీ కథను మాఘస్నానము చేసినవాడు. శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము , ఓంకారము లేని తపస్సు , మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను.

*_ మల్లాప్రగడ రామకృష్ణ

.ప్రాంజలి ప్రభ *


**మాఘ పురాణం - 5 వ అధ్యాయం :(14/02/2024)*

*కుక్కకు విముక్తి కలుగుట :

దిలీప మహారాజా ! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా ! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత , వారి కష్టములు క్రమేపి సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -

*"నాధా ! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా ! ఆ వ్రత విధానమెట్టిదో , యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని"* కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డునగాని , ఇంటివద్ద కాని , మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి , అన్ని రకాల పుష్పములు , ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి , ఆ విగ్రహాలకు గంధము , కర్పూరము , అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి , లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి , ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.

తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము , బెల్లము , ఉప్పు , పప్పు , కాయగూరలు , పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని , క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని , లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని , చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను , సావధానురాలవై వినుము. గౌతమమహర్షి , ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో యిష్టాగోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి , తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి

*శ్లో. మూలతో బ్రహ్మరూపాయ , మధ్యతో విష్ణురూపిణే |*

 *అగ్రతశ్శివరూపాయ , వృక్షరాజాయతే నమో నమః ||*

అని రావిచెట్టుకు నమస్కరించి , ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు , బొట్లుపెట్టి , మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు 

ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి , రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందునా , అది మాఘమాసము అయివున్నందునా అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ , గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. *"ఓయీ ! నీవెవ్వరవు ? నీవిట్లు మారుటకు కారణమేమి ?"* అని గౌతముడు ప్రశ్నించెను.

*"మునిచంద్రమా ! నేను కళింగరాజును , మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు , నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను , దానధర్మములనిన నాకు అతిప్రేమ , నేను అనేక దానాలు చేసియుంటిని , గో , భూ , హిరణ్య , సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను , ఎక్కువగా అన్నదానము , తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు , మంచినీటి చలివేంద్రములునునెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి , దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను , వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని , నేనిలా కుక్కనయ్యాను , దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.

ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా ! దానికి ధనము , వస్తు సముదాయము చాలా కావలెను గాన , ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి , *'రాజా ! నీకు గుప్త విషయములు తెలియజేయుదును , ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ , అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని , తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని , దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.

ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి , దానధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు , అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా , నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. అయ్యా ! మునిసత్తమా ! మీరు పలికిన విషయములు నాకు తెలియును , అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘమాసములు చేయుటకాని , దాన పుణ్యాదులు చేయుటగాని , పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము ? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికికోపము వచ్చినది. , ముఖం చిట్లించుకొని సరే , నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా , యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను , ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని , తరువాత నాకు వరుసగా యేడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా ! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.

నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరోక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా ! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని , పక్షికాని , వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా ! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను 

కొట్టబోవుటచే పారిపోయి , నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము  కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి , పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి , గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి , అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి  మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి , అతి సుందరాంగి , గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని *'అమ్మాయీ ! నీ వెవ్వరిదానవు ? నీ నామధాయమేమి ? నీ వృత్తాంతము  యేమి ?'* అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ *

ప్రాంజలి ప్రభ

మాఘ పురాణం - 6 వ అధ్యాయం (15/02/2024)**

*xxxxxxxxxxxxxxxxxxxx*

*కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ :*

మునిశ్రేష్ఠా ! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము , నా తండ్రి పేరు హరిశర్మ , నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు , జ్ఞాని , నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినది. 

ఒకనాడు నా భర్త *"సఖీ ! మాఘమాసము ప్రవేశించినది , యీనెల చాల పవిత్రమైనది , దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి , కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను , మంచి గంధము , అగరు , ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర , పటికబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతుము. తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును"* అని హితబోధ జేసెను.

నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి , అతనిని నీచముగా జూచితిని , నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి *"ఓసీ మూర్ఖురాలా ! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా , అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని , మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడిఉందువుగాక"* అని నన్ను శపించెను.

*"అమ్మాయీ ! భయపడకుము , నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా ! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు , పుత్రసంతతి , ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని , అతని గుణగణాలకు అందరూ సంతసించెడి వారు నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండెడివాడు. కానీ , నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు , నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించుమని శపించాడు.

ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా యిది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలుకాని , పురుషులుకాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. *ఎవరైనా తెలిసి కాని , తెలియక కాని మాఘశుద్ధ సప్తమి , దశమి , పౌర్ణమి లయందునూ , పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించినయెడల వారి పాపములు నశించును. మాఘ సుద్ధ పాడ్యమినాడునూ , అటులనే దశమి , ఏకాదశి , ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి , పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును"* , అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.


*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ *

ప్రాంజలి ప్రభ

*మాఘ పురాణం - 7 వ అధ్యాయం (16/02/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము :*

వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది , కాని , అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని , దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి , వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను , ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి , *"తల్లీ ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది , ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను , సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను"* అని బ్రతిమలాడెను.

తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి , అందొక తుంగచాపవేసి , కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె  దయార్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి , *"ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా ! ఆ మాఘస్నానమేమి ?* *సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది"* అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని , *"అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు , ఈ మాఘమాసములో నది యందు గాని , తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను , పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను , తరువాత మాఘపురాణము పఠించవలెను.* ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన , దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. *ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ , వృద్దులూ , రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని , ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు , పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను"* అని చెప్పగా , ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.

అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి , వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి *"ఓసీ వెర్రిదానా ! ఎవరు చెప్పినారే నీకీ సంగతి ? మాఘమాసమేమిటి ? స్నానమేమిటి ? వ్రతము , దానములేమిటి ? నీకేమైనా పిచ్చి పట్టినదా ? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా ? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి , పూజలుచేసి , దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి , నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త ! వెళ్ళి పడుకో"*, అని కోపంగా కసిరాడు.

ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి , మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా , ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.

కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.

*"ఓ యమభటులారా ! ఏమిటీ అన్యాయము ? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి ? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి ? ఇద్దరమూ సమానమేగదా"* అని వారి నుద్దేశించి అడుగగా , ఓ అమ్మా ! నీవు మాఘమాసములో ఒక దినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ , నీ భర్త అనేకులను హింసించి , అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.

ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. *"నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా ! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను ?"* అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి , యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని , ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా , ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా , బంగారుశెట్టిని పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా ! వింటివా ! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా ! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుటలో సందేహములేదు.

*_మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
.*ప్రాంజలి ప్రభ

*మాఘ పురాణం - 8వ అధ్యాయం (17/02/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

 *దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచుచుట :*

          దత్తాత్రేయుడు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించారు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసారు, త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు 'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు, ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి

       "గురువర్యా! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొంటినీ, కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను, అని దత్తాత్రేయుని కోరెను.

        దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.

           "భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమస్తమైన నదులు ప్రపంచమందెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును.

             కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములాచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును.

            గనుక, ఏ మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు", అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి      తెలుపుచుచూ  ఇంకనూ యీవిధముగా చెప్పుచున్నాడు.

      "పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారునగలు, నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను, తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి.

          ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి, కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.

      "అయ్యా! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును" అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు " ఓయీ వైశ్యపుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి  వెళ్ళి వచ్చుచుండెడివాడవు.

            అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా నీవు వినియున్నావు.

            గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా" అని వైశ్యకుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

మృగ శృంగుని కథ.

          గత అధ్యాయములో తెలిపిన విధంగా మరణించిన ముగ్గురు కన్యలను తిరిగి బ్రతికించుటకు గాను మృగశృంగుడు

 యముడు కోసం తప్పస్సు చేసిన విధానం

యమలోక విశేషములు

          మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమలోకమందు చూచిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.

           యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి.

           ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.

               అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్దమయినది.

            మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ .*

*మాఘ పురాణం - 9 వ అధ్యాయం (18/02/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

 *గంగా జలం మహిమ :*

   ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక , పూజదు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా , గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు , శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని , *"గంగ గంగ గంగ"* అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక , మాఘమాసములో అంగాస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుదు వివరించెను.


కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను , బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి , మోహించి , అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా , ఆ విధ్యార్థియూ , మీరుకూడ పిశచులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి , అందరిని బాదించి , ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.


కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు , తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు , గంధర్వులకు కూడ పవిత్రమైనది.


ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నసించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విస్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృస్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విస్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

*_మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

*మాఘ పురాణం - 10 వ అధ్యాయం (19/02/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

 *ఋక్ష కయను బ్రాహ్మణ కన్య వృత్తాంతం :*

  పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి , దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు , పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి , విరక్తితో ఇల్లువిడిచి గంగానది తీరమునకుపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుటవలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠ మందేవుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి *"తిలోత్తమ"* అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై *"ఓయీ ! మీకేమి  కావలయునో కోరుకొనుము"* అని అనగా , *"స్వామీ మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము"* అని వేడుకొనగా , బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.

బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులును మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి , ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి , దేవతలందరినీ తరిమివేసిరి , ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని *"మహానుభావా ! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానాభీబత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు"* మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  *"అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు యితరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో చాల అల్లకల్లోలము చేయుచున్నారు. కాన , నీవుపోయి నీచాకచక్యముతో వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము"* అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న అరణ్యమున ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమునూ విని ఆ దానవసోదరులు అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి , నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా ! మిమ్ములను పెండ్ళియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరియెడల సమాన ప్రేమతోనున్నాను. కాని ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను  స్వంతముకాగలను అని చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతునని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి , గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి , ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి , మద్దరాలనెత్తిరి , దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి , ఇద్దరూ చనిపోయిరి.

తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినందా తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి , *"తిలోత్తమా ! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన , నీవు దేవలోకమునకు వెళ్ళుము , దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"* వని పంపెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ .*


*మాఘ పురాణం - 11 వ అధ్యాయం (20/02/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*భీముని ఏకాదశి వ్రతం :*

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని , నదిలేనిచోట తటాకమందుగాని , తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు , తపశ్శాలురు , దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి , పెంకివాడు , అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను , తనకున్న ధనమును తాను తినడు , ఇతరులకు పెట్టడు , ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. *"అయ్యో ! నేనెంతటి పాత్ముడనైతిని ధనము , శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా"* అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా ! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ , బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్రనుండి లేచి చూడగా , అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ *'నారాయణా'* అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను , అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు , భోజనప్రియుడు , ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా ! *"ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా ! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా ! అని విచారించి , తన పురోహితుని కడకు బోయి , ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి"* , అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు *"అవును భీమసేనా ! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక , అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును"* అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని , *"విప్రోత్తమా ! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా ! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను , కనుక , ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున , ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము"* , అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి *"రాజా ! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు , కాన , నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది , దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు ఇరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన , ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన , ఓ భీమ సేనా ! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము , దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు , నియమము తప్పకూడదు"* అని వివరించెను.

ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని *"భీమ ఏకాదశి"* అని పిలుతురు. అంతియేగాక , ఓ దిలీప మహారాజా ! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో , అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా , శివచతుర్దశి. దీనినే *'శివరాత్రీ యని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే "మహాశివరాత్రి"* అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలోగాని , తటాకమందుగాని లేక నూతివద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి , అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ , అవన్నియు వెంటనే హరించిపోయి , కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక , అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయును.

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు బోవుట , జంతువులను చంపి , వానిని కాల్చి , తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూరమృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి , అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దుకృంగిపోయినన అక్కడున్న మారేడుచెట్టుపైకెక్కి జంతువులకొరకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచుకురుస్తున్నందున కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ , పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట , తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని , శిశువృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే , మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు - పార్వతి , గణపతి , కుమారస్వామి , తుంబుర , నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి , ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు , *"మహేశా ! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శనకారణమేమనగా , ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి , క్రూరుడు , దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒకదినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని , చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా"* అని యముడు విన్నవించుకున్నాడు. *"యమధర్మరాజా ! నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండిలేక జాగరణతోనున్న ఈ బోయవాడుకూడా పాప ముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక , ఈ బోయవాడు పాపాత్ముడైనను , ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది"* అని పరమేశ్వరుదు వివరించెను.

*_ మల్లప్రగడ శ్రీదేవి రామకృష్ణ 👌
ప్రాంజలి ప్రభ

*మాఘ పురాణం - 12 వ అధ్యాయం (21/02/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*


*శూద్ర దంపతుల కథ :*


వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు , వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. *"అమ్మా నేను బాటసారిని అలసినవాడను , చలి , చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే  వెళ్లిపోదునని"* ఇంట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి , పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.


కుముద *"ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును , అందులకై ఇట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను , కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన అభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు , అనారోగ్యమునకు , ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు ఇంటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.*


అప్పుడామె విష్ణుదూతలారా ! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు  అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను , భయమువలన గాని , పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా !  మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా ! బలవంతముగ చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా ! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.


అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట , నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున , నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు ఇష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా ! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి , విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి , యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని , యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.


మానవుడు తెలిసికాని , తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును , తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము , పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా , పురాణశ్రవణము , దానము యధాశక్తి గా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి , కృష్ణవేణి , నర్మద , తుంగభద్ర , సరస్వతి , గోకర్ణ , ప్రభాస , కోణభద్ర , గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను , కూడ ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ , పురాణశ్రవణము , దానము వీనినన్నిటినిగాని , కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము , మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.


*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .*ప్రాంజలి ప్రభ*

*మాఘ పురాణం - 13 వ అధ్యాయం (22/02/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*సుశీలుని కథ :*

రాజా ! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను , ఉన్నతములగు వృక్షములతోను , పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి అవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.

కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ ! నీవెవరవు ? నీకీ పరిస్థితియేమి ? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా ! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను , ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన , దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క , గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన , నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.

సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా ! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే , వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.

సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని , కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక , పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నొంది పుణ్యలోకముల నందుదురు.

స్నానము యేడు విధములు. అవి ,

*మంత్రములను చదువుచు చేయు స్నానము , మంత్రస్నానము.*

*మట్టిని రాచుకొని చేయు స్నానము , మృత్తికాస్నానము.*

*భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము , ఆగ్నేయస్నానము.*

*గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము , వాయవ్యస్నానము.*

*నదులు , చెరువులు మున్నగువానిలో చేయు స్నానము , వరుణ స్నానము.*

*ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము , దివ్యస్నానము.*

*మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము , మానసస్నానము.*

*ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు , వృద్ధులు , రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును , జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.*

*స్నానము చేయునప్పుడు కౌపీనము(గోచి)ఉండవలయును. తుమ్ము , ఉమ్ము , ఆవలింత , మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని , పసుపు , కుంకుమ , ఫలములు , పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట , జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి , ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను , ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను , నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును , పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.*

స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని , గంగను , దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా , యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి , ఏకాదశి , శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను , దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును , పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .*ప్రాంజలి ప్రభ

*మాఘ పురాణం - 14 వ అధ్యాయం(23/02/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*విప్రుని పుత్రప్రాప్తి :*

గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను. మహర్షీ ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా ? నా సందేహమును తీర్చుమని అడుగగా జహ్నమహర్షి యిట్లనెను. జహ్నమునీ ! వినుము మాఘమాస వ్రతము నాచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు , పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును , అందుచే సంతుష్టుడైన మానవుడింకను హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము అని యిట్లు పలికెను.

పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు , ఉత్తమశీలుడు , ఆచారవంతుడు , నీతిదయజ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయునుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు భార్యతో *"గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు , అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను".* అప్పుడామె నాధా ! నీవు తగిన పూజను చేయలేదేమో ? అందువలన మనకు సంతానము కలుగలేదనుకొందును , అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను , శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపముచేసి మృకండు మహామునివలె ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.

బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరినిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును , చక్రమును , గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యులకాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నతకల శ్రీహరి ముఖము మకరమండలముల కాంతితో మరింత శోభాయమానముగ నుండెను. నారదమహర్షి స్తుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.

తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు *"విప్రా ! నేను నీకు వరమునీయవచ్చితిని , నీ తపమునుమెచ్చితిని"* అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై , బాహ్యజ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో నతడు చేయుతపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్యప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.

*విప్రకృత విష్ణుస్తుతి :*

*నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |*
*నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||*
*గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |*
*కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||*
*లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |*
*అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||*
*యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |*
*జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||*
*సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |*
*కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||*
*నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |*
*విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||*
*సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |*
*హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||*
*పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |*
*ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||*
*జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |*
*వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||*
*జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |*
*ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||*
*నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |*
*గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||*
*కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |*
*కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||*
*సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |*
*భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||*
*నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |*
*నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||*
*(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము)*

జహ్నుమునీ ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను , భగవంతుడు వరమును కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విన్ ఆ విప్రుడు *'స్వామీ ! నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము , ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్రసంతానమునిచ్చి , నాకు ముక్తినొసగుమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరము నిచ్చితిని , నీవు 
చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదునని పలికి యంతరాథనము నుండెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభము నందినవానివలె సంతసింసించు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.

కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానినినిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచారవదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. *"నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా ! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను ?"* అని భర్తతో పలికెను.

ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము , దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా ? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువతనైన మరణింపక తప్పదు కదా ! మరి యీ ముందు వెనుకలు వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల ? నీవు దుఃఖించినను కనున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతిప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును , మరణించును , కనిపించినది నశింపక నిలుచునా ? కావున శోకింపుము అని యామనూరడించెను మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము అని పలికి మరల గంగాతీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ ప్రాంజలి ప్రభ .*
***

*మాఘ పురాణం - 15 వ అధ్యాయం (24/02/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*జ్ఞాన శర్మ కథ - (మాఘపూర్ణిమ)*

గృత్నృమదుడు జహ్నువుతో నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను , బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నారాకను గోరి తపమచరించితిని యెందులకు ? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమని యడిగెను. అప్పుడా విప్రుడు *'స్వామీ ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితివి , నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను , కాని నారదమహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది , నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను.*

అప్పుడు శ్రీహరి *'ఓయీ ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడి గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము , గుణములు కలిగియుండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట , భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.

ఓయీ ! మాఘ స్నానము ఆయువును , ఆరోగ్యమును , ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివరికి , వారి సంతానమునకు ఆపదలు కల్గును , అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు , బుద్దిమంతులు , ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ , శివుడు , లక్ష్మి , పార్వతి , సరస్వతి , ఇంద్రుడు , వశిష్టుడు , జనకుడు , దిలీపుడు , నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు , మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు , మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును , నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.

బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను , బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా , పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్ను మునివర్యా ! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను , నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము , సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ ప్రాంజలిప్రభ .*

No comments:

Post a Comment