Tuesday, 27 February 2024

యీ పక్షం 15 కథలు.. ప్రాంజలి ప్రభ



016.. రాజు కధ 

ఓ రాజు తనకు యుద్ధంలో విజయం సంపాదించిపెట్టిన తన సామంతులకు విందు ఇస్తూ,

తన అందమైన కుమార్తె చేత వడ్డింపజేస్తున్నాడు.

ఇంతలో ప్రచండమైన గాలి వీచి, దీపాలు ఆరిపోయాయి.

తరువాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి,

ఒక సామంతుడెవడో తన చేయి పట్టుకొని లాగాడని,

తాను విడిపించుకొని వస్తూ అతని తలపాగాను లాక్కొచ్చానని,

దాని సాయంతో ఆతని శిక్షించమని చెప్పింది.

రాజు, ఆమెను ఊరుకోబెట్టి, దీపాలు వెలిగించాక, తన సామంతులతో

సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగాలు ధరించవద్దని

అందర్నీ తీసేయమన్నాడు. అందఱూ తీసేసి, మరింత ఉత్సాహంతో విందారగించారు.

ఆ తరువాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ, రాజు,

ఆ సంతోషసమయంలో అతనిని శిక్షిస్తే, అది విషాదంగా మారుతుందని,

తమ సాటివాడు శిక్షకు గురయితే, అది మిగతావారికి క్షోభకరంగా మారుతుందని,

అందువల్ల ఓపికవహించానని, మనకు విజయం సాధించిపెట్టాడు కాబట్టి

నీవు కూడా అతనిని క్షమించలేవా? అన్నాడు.

రాకుమార్తె, అంగీకరించిందో లేదో మనకు తెలియదు.

ఒకనాడు రాజు వేటకు వెళ్లగా, పగబట్టిన శత్రువులు అదును చూసి, చుట్టుముట్టారు.

రాజు యుద్ధం చేస్తున్నాడు కానీ అలసిపోయాడు. అదే సమయంలో మెరుపులా దూకిన

ఒకడు, రాజుకు అండగా నిలబడి, శత్రువులందర్నీ ఊచకోత కోశాడు.

ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియజేయగా,

నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అతడన్నాడు.

ఆశ్చర్యపొతున్న రాజుతో అతడు విషయం తెలుపుతూ,

విందురోజున వీచిన గాలికి, అలంకరణార్థం ఏర్పాటుచేసిన స్తంభం ఒకటి

రాకుమార్తెమీద పడబోతుండగా తాను, విధిలేక

ఆమె చేయి పట్టుకొని, ఇవతలకు లాగానని,

అయితే మీరు పెద్దమనసుతో తనను క్షమించి, ప్రాణాలను తీయక వదలిపెట్టినందువల్లే

ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు.

ఈసారి రాకుమార్తె అతణ్ణి క్షమించడం కాదు. అతడికే క్షమాపణలు చెప్పి ఉంటుంది.

ఈ కథ క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతోంది.

పైవన్నీ ప్రక్కన పెట్టండి. కోపం మనకు ఎలా శత్రువవుతుందంటే,

కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

అనేక కెమికల్ టాక్సిన్స్ పుడతాయి. ఇవి మనకు చెరుపు కలుగజేస్తాయి.

రక్తప్రసరణవేగం హెచ్చుతుంది.

అంటే బిపికి రహదారి కోపం.

తలనొప్పులు వస్తాయి.

ముఖ కవళికలు మారతాయి. దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.

నుదుటిన ముడుతలు ఏర్పడతాయి.

వాల్మీకి, రామాయణంలో రాముని వర్ణిస్తూ,

రాముని నుదుటి మీద ఎన్నడూ ముడుతలు ఏర్పడలేదని అంటాడు.

అంటే రాముడెప్పుడూ ప్రసన్నమైన మోముతోనే ఉండేవాడని అర్థం.

ఈ ప్రసన్నతే అంటే శాంతగుణమే ఆరోగ్యదాయిని.

చుట్టం అవసరంలో ఆదుకొన్నట్లు

మన దయాస్వభావం మనను అవసరంలో తప్పక ఆదుకొంటుంది.

తద్ద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తుంది.

శుభసాయంత్రం
 😊💐

 🙏

017..ఏమి కావాలి నీకు

ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది.  అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం?

సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.

దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమె అని.

షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "

పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు.

ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు. భూతం ప్రత్యక్షం అయ్యింది." ఏమి కావాలి నీకు? అని అడిగింది.

తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.

భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.

 నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.

వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.

ఏమి కావాలి నీకు అని అడిగింది.

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు.  కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.

ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా ?

పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.

తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.

భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.

పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు. భూతం అలసిపోయి

స్థంభం ప్రక్కన నిద్రపోతోంది.

తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.

ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.

ఈ కధ మనది.

ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?

మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని.

 ఆ వృద్ధ సన్యాసి (మన అనుభవం) చెప్పిన...ప్రకారం భూతం నాటిన స్థంభం  "మంత్రం" (దైవ నామ స్మరణ) 

ఎక్కడం దిగడం మంత్రం జపం. జప సాధన ! (మనసు ను స్వాధీనపరచుకుని సాధన) 

అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.

అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.

అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.

మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే నిర్మించిబడిన మహ గొప్ప మాయ యంత్రం. అంతే కాక 

దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా 

మహోజ్వల జ్యోతి రూపం.

మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.

ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది.

ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.

జై శ్రీ కృష్ణా...💐

018..రక్త సంబంధం*🙏🙏

*తోబుట్టువులంటే ఇప్పటి కాలంలో  ఒక బరువులా  భావిస్తున్నారు.....*

*ఒకే తల్లి కడుపులో పుట్టి పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటాం...*

*పెళ్ళి అవగానే ఎవరి జీవితం వారికి ముఖ్యం అని తలచి తోడబుట్టినవారి కష్టాలను పట్టించుకోము....*

*అప్పట్లో.....*

*ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.   అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని.  పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు....     రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది...*

*బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.  ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది.  అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది...*

*వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది...     తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ...*

*తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.*

*ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు...*

*అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు.* *అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే....     జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే...    అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.*

      *ఇక వెళ్ళొస్తామంటూ...    బయల్దేరారు ముగ్గురూను.*

    *తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.*  👍

    *"ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా...     నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు* *భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ...*

*ఆలోచించుకుంటూ....!*

*సోదరులంటే ఇలా ఉండాలి కదా....!*  

*బంధం అనే కాదు...    కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.*

          *ఆత్మీయతను కోల్పోకండి.!*

*దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా...      మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.*

              *"ఏమంటారు"*..?

*ఇలాంటి ఆత్మీయతలను;* *అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం, కానీ ఈ మెసేజ్ ని సాధ్యమైనంత ఎక్కువ గ్రూవులలో షేర్ చేసి మళ్ళి ఈ తరం నుండి ముందు తరాల వారు పాటించడం కొరకు దోహదపడుతుంది ఇది నా చిన్న ప్రయత్నం 

నా ప్రయత్నం కు మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ..🙏🙏🙏

****

019..*పక్షి నేర్పిన పాఠం

ఓ వూరి దగ్గరి పొలంలో సారసపక్షుల జంట నివసిస్తూ వుండేది. ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది. కొంత కాలానికి గుడ్లలో నుంచి పిల్లలు బయటికి వచ్చాయి. వాటికి రెక్కలు వచ్చి, అవి ఎగరటానికి ముందే పంట కోతకు వచ్చింది. సారస పక్షులకు దిగులు చుట్టు కొనింది. రైతు పంటను కోయటానికి ముందే, పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి ఎగిరి వెళ్లాలి. కాని పిల్లలు ఎగరలేవే? అప్పుడు సారసపక్షి పిల్లలతో ఇలా అంది - 'మేం లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.'

ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయం కాలం గూడు చేరుకొంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి - “ఈ రోజు రైతు వచ్చాడు. పొలం చుట్టూ తిరిగాడు. ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది. ఇక కొయ్యాల్సిందే. ఈ రోజే వెళ్లి వూళ్లోని వాళ్లతో నా చేను కోయమని చెప్తాను.” అన్నాడు.

“మీరేమీ భయపడకండి. రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడే హాయిగా వుండొచ్చు” అని పక్షి పిల్లలతో చెప్పింది.

కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడు చేరుకొంది. అప్పుడు

పిల్లలు బితుకు బితుకుమంటూ ఇలా చెప్పాయి.

“మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్లాలి. ఈ రోజు రైతు మళ్లీ వచ్చాడు. ఊళ్లోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు. నేను నా అన్నతమ్ముల్ని పిలిపించి వాళ్లతో పంట కోయిస్తాను.”

సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది “ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు. నాలుగైదు రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పాలం విడిచి మరో చోటికి పోనక్కర్లేదు.”

“అన్నతమ్ములు నా మాట వినడం లేదు. ఏదో ఓ నేపంతో తప్పించుకొంటున్నారు. పైరు బాగా ఎండిపోయి గింజలు నేల రాలిపోతు న్నాయి. రేపు పొద్దు పొడవగానే నేనే వచ్చి కోత మొదలెడ్తాను.”

అప్పుడు సారసపక్షి భయపడింది. “అరరే! వెంటనే బయలుదేరండి. ఇంకా చీకటి పడలేదు. మరో చోటికి వెళ్లి తలదాచుకొందాం. రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని. 

పిల్లలు ఆదుర్దాగా అడిగారు “ఎందుకు వెళ్లాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?”

సారసపక్షి ఇలా బదులు చెప్పింది.  “రైతు గ్రామస్తులను, సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలుగలేదు. తన పని తాను చేయకుండా, ఇతరులు చేసి పెడ్తారని అనుకున్నంత కాలం ఎవరి పనులు జరగవు. కాని ఎవరంతట వారు, తమ పనులు చేసుకోవాలని నిర్ణయించుకొన్నప్పు డు, అవి చకచకా సాగిపోతాయి. రైతు తానే రేపు పంట కోస్తానని అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది.” అన్నది.

సారసపక్షులు పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటికి ఎగిరిపోయ్యాయి.

ఆ మరుసటి రోజు రైతు తానే పనిముట్లు తెచ్చుకుని పంట కోత మొదలుపెట్టాడు.

నీతి: ఒకరి మీద ఆధారపడకుండా పనులు మొదలుపెడితేనే పనులు సజావుగా, చక్కగా సాగుతాయి.

🦩

 *సమాప్తం*

020..శాంత స్వభావం

జీవితం పట్ల సరైన, స్పష్టమైన అవగాహన లేక మనసు పరిపరి విధాల పరిగెడుతూంటుంది. ముందు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మారిపోయి దృష్టి ఎటో మరలిపోయి సాధారణమైన మన జీవన విధానంలో భయాలు, ఆందోళనలు, సందేహాలు కలిగి ఎటూ తేల్చుకోకుండా సందిగ్ధం ఏర్పడుతుంది. గతంలో జరిగినదానికి విచారించకూడదు. వర్తమాన కాలంలో జరుగుతున్న పరిణామాలను మనం అడ్డుకోలేం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవలసిందే! భవిష్యత్తులో జరగబోయేది తెలియదు. అందుచేత ఏం జరగబోతోందో అని ఊహించుకుని భయాందోళనలకు గురి కావడం ఎందుకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయని భావించకూడదు ప్రతికూలంగా జరుగుతాయని మానసికంగా సిద్దపడితే ధైర్యంగా ఉండగలుగుతాం. అప్పుడు మనసు వైకల్యం చెందదు

మన ఆలోచనా సరళిలో స్పష్టమైన అవగాహన ఉంటే సందేహాలు కలగవు. ఒకవేళ కలిగినా ఆ సందేహాలకు సమాధానాలు వాటంతట అవే లభిస్తాయి. ఎవరి సలహాలు సూచనలు పాటించకుండానే సందేహ నివృత్తి కలుగుతుంది. ఒక నిబద్ధతతో, మార్గనిర్దేశనంతో మనం ముందుకు సాగాలి

చిన్నచిన్న విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చి భూతద్దంలో చూసి భయపడకూడదు. అటువంటి చిన్న విషయాల్ని పట్టించుకోకుండా పక్కకు నెట్టేయాలి. కొందరు కొన్ని పనులు సాధించుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడ్డారనుకుందాం. ఆ సంఘీభావం వల్ల అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆసంఘ సభ్యులు తమ లోపాలను ఒకసారి అవలోకనం

చేసుకుని, వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నించాలి ఇతరులు ఆ వైఫల్యాలను గోరంతలు కొండంతలుగా చిత్రీకరించి ఆ సభ్యులను దెప్పి పొడవకూడదు. "సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తిని మనం ఆదుకుంటాం. మనం చేసిన సహాయానికి ఆ వ్యక్తే కృతజ్ఞతలు చెప్పకపోతే బాధపడతాం

మనం పలకరింపుగా చిరునవ్వు నవ్వితే, అవతలివాళ్లు చిరునవ్వుతో స్పందించకపోతే కుంగిపోతాం, క్షోభపడతాం వీడికింత తలబిరుసు అనుకుంటాం. అలాగే మనకూ తలబిరుసు లేకుండా చూసుకోవాలి. ఎదుటివారిలో ఏ లోపం ఉందనుకుంటామె ఆ లోపం మనలో ఉండకుండా జాగ్రత్తపడాలి. మిన్ను విరిగి మీద పడిపోతున్నా, ప్రశాంతంగా ఉండే ఉత్తమ పురుషులు మన పౌరాణిక గాథల్లో కనిపిస్తారు. అందులో ప్రహ్లాదుడు అయిదేళ్ల బాలకుడు. తన తండ్రి ఎన్ని బాధలు పెట్టినా, శ్రీహరి నామాన్ని నిరంతరం మననం చేసే ప్రశాంత స్వభావుడు

తరవాత- రాజర్షి అయిన అంబరీషుడు. దుర్వాసమహర్షి క్రుద్ధుడై తన జటాజూటం నుంచి 'కృత్య' అనే అగ్ని జ్వాలలతో ఉన్న శక్తిని అంబరీషుడిపై ప్రయోగించాడు అంబరీషుడు ప్రశాంతంగా రెండు చేతులూ తల మీద పెట్టుకుని శ్రీహరి నామస్మరణలో నిమగ్నుడైపోయాడు. అంతేకాని ప్రతీకారం తీర్చుకోవడానికి కించిత్తెనా ప్రయత్నించలేదు. ఆ శ్రీమహావిష్ణువే 'వెర్రితపసే చేయు వేడబంబు చక్కవెట్టుమనుచు' సుదర్శన చక్రాన్ని పంపి దుర్వాసుని పొగరు అణచివేశాడు.

ప్రశాంతచిత్తుల జాబితాలో ఉండాల్సినవాడు ఉత్తమోత్తముడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు, తెల్లవారితే యువరాజుగా పట్టాభిషిక్తుడు కాదగినవాడు, జటాధారియై నారచీరలు ధరించి అడవులకు వెళవలసి వచ్చినప్పుడు ప్రశాంత చిత్రంతోబయలుదేరాడు. 'పయోనిధి' అయిన సముద్రంలో బడబాగ్ని ఉంది. అటువంటి బడబాగ్నిని తనలోనే అణచుకుని గంభీరంగా అడవులకు వెళ్లాడు. అందుకే 'కరుణాపయోనిధి' అని స్తుతించాడు కంచర్ల గోపన్న అనే భద్రగిరి రామదాసు

పైన పేర్కొన్న ఉత్తమ పురుషులు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మేరునగధీరులై, ప్రశాంత చిత్తులై, ఎటువంటి ఆందోళనలకు గురికాకుండా నిలబడగలిగిన ధీరోదాత్తులు. వాళ్లను తలచుకుంటూ మనం ముందుకు సాగితే జీవితంలో అపజయాలు సైతం విజయాలుగా పరిణమిస్తాయి

--(())--

21..ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
🙏🙏🙏🙏🙏



నేను తండ్రిని ..నేను తండ్రిని ..
‘పిల్లలకి పెళ్ళి చేసెస్తే ప్రశాంతంగా ఉండచ్చు’అని అనుకోవడం...

*{“ఈ దశ పిల్లలకు పెళ్ళి చేసి ..ఆ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు ఉంటుంది ..
అంటే ఒకప్పటి భర్త ..తండ్రి దశ దాటి తాత అవ్వడం..”}*

9)చల్లారిన’భర్తలు:

పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూంటారు..
వీరికి ఇక ఏ బాధ్యతలు ఉండవు..
ఓపికా ఉండదు..కానీ అప్పటికింకా భార్యకి ఓపిక ఉండటం ..ఒకప్పుడు తను తిట్టాలనుకున్నవి..
అనాలని ఆపుకున్నవి అన్నీ గట్టిగా భర్తకి వినిపించేలా తిట్టడం..జరుగుతుంది..
కానీ ఏమీ వినపడనట్టు “వంటైందా..?”
అని అమాయకంగా అడగడం పడక్కుర్చీలో కళ్ళ జోడు సర్దుకుంటూ పేపరు చదివినట్టు అడ్డు పెట్టుకుని ..”అన్నీ గుర్తున్నాయ్ దీనికి ఎన్నెన్ని మాటలంటోంది నాయనో పెళ్ళంత నరకం లేదు..
నడుం వొంగాక పూర్తి జ్ఞానం వచ్చి
ఏం ప్రయోజనంలేదు..
పోనీ ,తిట్టుకుంటే తిట్టుకోని మనకింత ముద్దపాడేస్తోందిగా ఎవరి పాపాన వారే పోతారు ప్రొద్దున్నేగా టివి లో ప్రసంగం విన్నాంగా..అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు”అని సమాధాన పడతారు..ఈలోపు “మింగడానికి తగలడు”
అని పిలుపు వినపడగానే ..కిక్కురుమనకుండా వచ్చి అన్నంతిని కాలం గడుపుకుంటూ ఉండడం..

“ఈదశ చివరి దశ ఇక్కడితో భర్త పాత్రకు శుభం పడుతుంది...”}

*అంకితం:
భర్తగా మారిన వారికి..,
భర్తగా మారాలనుకునే వారికి..,
భర్తగా మారకూడదు ,అని అనుకునే వారికి..
బాధ్యయతాయుతంగా ఈ వ్యాసం అంకితం.....*
 కాసేపు హాయిగా నవ్వుకోటానికే అని మనవి
*****



023.. ప్రాంజలి prabha👍.. సమదృష్టి 

భగవంతుడి గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో సాధన చేయాలి. పవిత్రమైన దివ్య భావాల మధుమందారాలతో ఆయనను ఆరాధించాలి. భగవంతుడు లేదా సద్గురువు కృప వల్లనే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మనుషులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ దైవ స్వరూపంగా ఎంచి ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాతఃస్మరణీయులు. వారి పట్ల సదా భక్తిప్రపత్తులు ప్రదర్శించాలి. వారు చేసే బోధనలు, ఉప దేశాలు ఆత్మవికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన జ్ఞాని ఎవరి నుంచీ ఏదీ ఆశించడు.

ఒక రాజు జ్ఞానమూర్తి అయిన గురువు పాదాలపై శిరసు ఉంచి వినయపూర్వకంగా అభివందనం చేశాడు. పక్కనే ఉన్న మంత్రికి అది నచ్చలేదు.

‘దేశానికి రాజైన మీరు ఆ జ్ఞాని పాదాలపై శిరసును ఎలా ఉంచారు? ఈ దేశ సార్వభౌముడిగా స్వర్ణ కిరీటాన్ని అలంకరించుకున్న శిరసు మీది’ అన్నాడు మంత్రి.

‘తగిన సమయంలో నీకు సమాధానం చెబుతాను’ అన్నాడు రాజు.

కొద్ది రోజుల తరువాత రాజు మంత్రిని పిలిచాడు.

‘నాకు ఒక మేక తల, పులి తల, మనిషి తల కావాలి. వెంటనే తీసుకుని రా’ అని రాజు ఆజ్ఞాపించాడు.

రాజాజ్ఞతో మంత్రి అయోమయస్థితిలో పడ్డాడు. చివరకు మేక తలను తీసుకుని రావాలని తన మనుషులను పంపాడు. డబ్బు చెల్లించగానే ఒక కసాయి వాడు మేక తలను ఇచ్చాడు. పులి తల బజారులో ఎక్కడా దొరకదు. కాబట్టి మంత్రి ఆరితేరిన వేటగాళ్లను అడవికి పంపాడు. వాళ్లు పులిని చంపి దాని తలను తీసుకువచ్చారు. ఇక మనిషి తల ఎలా సంపాదించాలి? అనేది మంత్రికి సమస్యగా మారింది. మృతదేహం నుంచి తలను వేరు చేయడానికి ఎవరూ అంగీకరించరు. మొత్తానికి ఎలాగో అష్టకష్టాలు పడి మంత్రి మనిషి తలను కూడా సంపాదించాడు. మొత్తం మూడు తలలను తీసుకుని రాజు వద్దకు వెళ్లాడు.

అప్పుడు రాజు మంత్రితో- ‘ఈ మూడు తలల్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ ఇచ్చేయ్‍’ అన్నాడు.

మంత్రి కంగుతిన్నాడు. ఎంతో కష్టపడి తెస్తే ఇచ్చేయమంటారేమిటి? అనుకున్నాడు. మేక తలను వెనక్కి ఇచ్చేయడం కష్టం కాదు కాబట్టి దాన్ని ఇచ్చేశాడు. పులి తలను ఎవరూ తీసుకోలేదు. పైగా అందరూ భయపడ్డారు. కొంత ధనం ఎరవేసి దానిని ఒకరికి అంట గట్టాడు. మనిషి తలను తీసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.

మంత్రి రాజు వద్దకు వెళ్లి ‘మనిషి తలను ఎవరూ తీసుకోవడం లేదు మహారాజా’ అని చెప్పాడు.

‘అంటే మేక తలకు కానీ, పులి తలకు కానీ చచ్చిన తరువాత కూడా ఎంతో కొంత విలువ ఉంటుంది. మనిషి తలను ఎవరూ స్ప•శిం చరు. అటువంటి ఎందుకూ కొరగాని నా తలను జ్ఞాని పాదాలపై ఉంచాను. నేను చేసింది తప్పా?’ అని రాజు మంత్రిని ప్రశ్నించాడు.

ప్రాపంచిక విషయాలు, విజయాలు, సుఖాలు నిత్యం, నిరంతరం మనల్ని వ్యామోహంలో ముంచెత్తుతుంటాయి. నిజానికి అవి ఏ విలువా లేనివి. జ్ఞాని పాదాలకు నమస్కరించడం కన్నా పుణ్యప్రదమైన పని మరొకటి లేదు. ఆ పాదాలు మోక్షానికి సోపానాలు. భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసుకొన్న జ్ఞాని సాక్షాత్తూ భగవత్‍ స్వరూపుడే. ఆయన పాదాలు భగవంతుని పాదకమలాలతో సమానమైనవి. కాబట్టి జ్ఞాను లను గౌరవించడం నేర్చుకోవాలి. వారితో సాంగత్యం చేయాలి. మానవ జీవితాలకు మోక్షాన్ని ప్రసాదించి తరుణోపాయం చూపించేది జ్ఞానులే.

----

024.. ప్రేమ కధ 

అమ్మా ! రేపటి లోపు నీ నిర్ణయం తేల్చాలి.మీ ఇద్దరికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నా మాట విని నాయనమ్మను వృద్ధాశ్రమానికి  పంపి నువ్వు, నేను, నా భార్య కలిసుందాం. అత్తగారినే కాక అత్త గారి అత్తగారిని కూడా చూడాలంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందమ్మా చెప్పు.. అలా నువ్వు నాయనమ్మని పంపిస్తేనే ఉష నన్ను పెళ్లి చేసుకుంటుంది. లేకపోతే నా ప్రేమ విఫలమే " అన్నాడు శశి.

తల్లీ కొడుకుల మాటలు ఎంత వినకూడదు అనుకున్నా చెవిన పడుతూనే ఉన్నాయి పూర్ణమ్మకి. వినపడాలనే గట్టిగా మాట్లాడుతున్నాడని అర్ధం కాకపోలేదు ఆవిడకి.

నిమిషం మౌనం తరువాత...

స్వరూప మాట్లాడుతోంది " శశి ! నీ పెళ్ళికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. పెళ్లి అయ్యాక నువ్వు, నీ భార్య కలిసి ఉండండి విడిగా..  నేను, మా అత్తగారు ఇక్కడే ఉంటాం. నా నిర్ణయం ఇదే !

పంతొమ్మిదేళ్ళ వయసు నుండి నాకు ఆవిడతో అనుబంధం. నాకు తల్లి వంటిది. మీ నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆవిడే మనకి పెద్ద దిక్కుగా నిలబడింది. ఈ రోజు ఆవిడ జవసత్వాలుడిగాయని  ఆవిడని మనకి పనికి రాని వస్తువుగా చూడలేను. అలా చేస్తే నన్ను మీ నాన్న క్షమించరు పై నుండి. మీ నాన్న కోసం కాకపోయినా నాలోని తల్లి  ఆ తల్లిని  వదలలేదు.

అలాగని నువ్వు మనసు పడిన అమ్మాయి నుండి దూరం చేయలేను. తల్లిగా నేనెపుడు నిన్ను వదలలేను. నువ్వెక్కడ ఉన్నా నీ క్షేమమే కోరుకుంటాను.

ఒక్కటి మాత్రం ఆలోచించుకో... ఇవాళ నాయనమ్మ ఉంటే పెళ్లి చేసుకోనని చెప్పిన అమ్మాయి.. నేను నీతో వచ్చేస్తే  రేపు పెళ్లి అయ్యాక నన్ను కూడా పొమ్మంటే ?? అందుకే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఆ అమ్మాయి ప్రేమ పొందాలంటే నువ్వు నీ ప్రేమానుబంధాలను తాకట్టు పెట్టాల్సినందుకు మాత్రం బాధగానే ఉంది.

ఇప్పటికే ఆలస్యం అయింది. పడుకో " అని చెప్పి బయటికి వచ్చేసింది.

బయటికి వచ్చిన కోడలులో తల్లి కనిపించింది పూర్ణమ్మకి !! ఏ జన్మ ఋణానుబంధమో అనుకుంది మనసులో !!

*******

*-**

025.. ప్రాంజలి prabha🌹.. జ్ఞానం 

నేను" అదృశ్యమయ్యే కొద్దీ ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది !!*🌸

జ్ఞానం అంటే ఉన్నది తెలియడమే. ఉన్నది అంటే కనిపించేదాని వెనుక ఉన్నదేదో తెలియడం. నేను అంటే మనసే. మనసంటే ఆలోచనలే. ఇది అర్ధమైతే ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గితే నేను తగ్గుతుంది. నేను అదృశ్యమయ్యే కొద్ది ఆశాంతి తగ్గి, ఉన్న శాంతి వ్యక్తమౌతుంది. సుఖం కోసం, సౌఖ్యం కోసం మరో దానిపై ఆధారపడే కొద్దీ నేను పెరుగుతుంది. నేను పెరిగే కొద్దీ అజ్ఞానం పెరుగుతుంది. ఆధునికత పేరుతో మనిషి సాంకేతికపై ఆధారపడటమే ప్రస్తుత అజ్ఞానానికి కారణం. అంటే సాంకేతికత వద్దని కాదు. దాని అతివినియోగం, దుర్వినియోగం వద్దని భావం. ప్రాపంచిక విషయాలపై కాకుండా పరిపూర్ణ విశ్వాసంతో పరమాత్మను నమ్మితే, అహంకారంతో కూడిన నేను పోయి జ్ఞానం అంకురిస్తుంది. నేను అస్తమించడమే జ్ఞానం ఉదయించడం !

ఆత్మజ్ఞానం భగవంతుడు బహుమతి గా ఇచ్చేదే కానీ, మనం

అడిగి తీసుకునేది కాదు.

జ్ఞానం పొందాలంటే సుఖపడాలనే కాంక్ష పోవాలి. సుఖపడే రోజులు రావడం లేదు అనేది ఒక ఆపేక్ష. నీవు అనుకున్నా అనుకోక పోయినా జరిగేది జరిగి తీరుతుంది.

కలియుగంలో ఎవరిని ఎలా హింసించాలనే ఆలోచనలు ఉంటాయి. మనకు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం ఉండాలి.

అందరినీ ఆయనే చూసుకుంటు న్నాడు. ఎవరిని హింసించినా భగవంతుని హింసిస్తున్నాము అనే భావన రావాలి.

ఈ దేహం ఎందుకు వచ్చిందో ఆ పనులు పూర్తి అయ్యేవరకు అది ఈ భూమి మీద తిరుగాడుతూనే ఉంటుంది. దేనికీ ఆందోళన వద్దు.


026..ఇదెప్పుడైనా ఆలోచించారా 

రాజు ఉదయాన్నే లేచి వాకింగ్ కు వెళ్ళాడు 

తెలియకుండా ఎదురుగా వస్తున్న వ్యక్తి చెయ్యి తగిలింది 

అతను సారీ అని చెప్పాడు 

రాజు పర్లేదండి అని చెప్పి చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుండి ఇంటికి వచ్చాడు 

ఇంట్లో స్నానం అన్ని ముగించుకుని అల్పాహారం తీసుకుని చెయ్యి కడుక్కుని వెనక్కు తిరగ్గానే తన ఆరేళ్ళ కొడుకు వెనుక నిల్చుకున్నాడు 

అతని చెయ్యి తగలడంతో రాజుకు కోపం వచ్చేసింది 

అడ్డంగా ఎందుకు ఇలా నిలబడ్డావు పక్కకు తప్పుకో అని అరిచాడు అంతే బాబు బయపడిపోయాడు 

దూరంగా వెళ్ళిపోయాడు 

రాజు అతడి పని ముగించుకుని కాసేపు అలా కూర్చుని ఆలోచిస్తుండగా పొద్దున జరిగిన విషయం గుర్తుకువచ్చింది 

మనకు అసలు తెలియని వ్యక్తిని క్షమించాను కానీ నా బాబుపై కోపాన్ని ప్రదర్శించాను 

ఒక్క నిమిషం అరవకుండా ఉండాల్సింది 

వెంటనే వెళ్ళి బాబును పలకరించాడు 

బాబు కళ్ళలో కన్నీళ్లు

సారీ చిన్నా అన్నాడు 

బాబు అన్నాడు నాన్న మనం పెంచిన చెట్లలో రంగురంగు పూలు పూశాయి 

అన్ని రంగులు కలిపి పూలగుచ్చాన్ని నీకు అందివ్వాలని నిన్ను ఆశ్చర్య పరచాలని నీ వెనుక నిలుచుకున్నాను నాన్న అన్నాడు 

ఇప్పుడు రాజు కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు సారీ బాబు ఇంకెప్పుడూ కోపగించుకొను అన్నాడు 

ఇది రాజు మాత్రమే చేసిన చేస్తున్న తప్పు కాదండి 

అందరం చేస్తున్నది 

ముక్కుమొహం తెలియని వ్యక్తులతో సర్దుకు పోయే మనం మన కుటుంబంతో అసలు సర్ధుకోము 

సారీ థాంక్స్ అనే పదాలు వాడనే వాడము 

ఆ పదాలు ఐనవారితో చెప్పాల్సిన అవసరం లేదు అంటారు కానీ నిజానికి ఆ పదాలు ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతుంది

పరాయివాళ్ళ గురించి అలోచించి నడుచుకునే మనం ఒక్క క్షణం అయినవారి గురించి ఆలోచించొచ్చుగా 

పరాయివాళ్ళకు నువ్వొక వ్యక్తివి 

కనిపిస్తే పలకరిస్తారు 

కనిపించకపోతే ఒక్కసారి లేదంటే రెండూ సార్లు తలచుకుంటారు 

కానీ నీ కుటుంభానికి నువ్వే ముఖ్యం 

నీ ఎడబాటు వారికి మాత్రమే బాధ 

ప్రతి క్షణం వారి ఊపిరి ఆగేవరకు నువ్వు పక్కన ఉన్నా లేకున్నా నీ గురించి ఆలోచన ఉండే ఉంటుంది 

అందుకే 

ఎక్కడో సర్దుకుపోయే నువ్వు నీ తోడు నీ పిల్లలతో కొంచం సర్దుకోవచ్చుగా 

ఆలోచించండి ఒక్కసారి .

*****

027..*ఖర్చులేని స్వర్గం!*

**           

*వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ‘ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.*

*కాసేపు ఆలోచించి…“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.*

*ఆశ్చర్యంగా అతను నా వంకచూసి “అదెలా?” అన్నాడు.*

*నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..* 

భగవంతుని లీలలు చదవడానికి డబ్బు అవసరం లేదు, ఆయన శ్లోకాలు అందరికీ షేర్ చేయడానికి డబ్బు అవసరం లేదు, 

కానీ, *ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!*

*చిన్న చీమలైన ఒక్కటిగ కలగలసి

పెద్ద పామునైనా సుళువుగ చంపు

'ఐఖ్యత' బలమేమిటో తెలుసుకో.*


పుల్లలను ఒక్కటొక్కటి శ్రమతో పేర్చి

చిట్టి పిట్ట చూడ చక్కని గూడు కట్టు

'ఓర్ప' మహిమేమిటో నేర్చుకో..


రాళ్ళ దెబ్బలు తినిన కూడ సహించి 

తరువు తన తియ్యని ఫలముల నిచ్చు 

'గొప్పతనము' మాటకర్థము తెలుసుకో.. 


పిడికెడు కూడు పెట్టిన నమ్మకముంచి 

కుక్క కడదాకా నిను కనిపెట్టుకొనిండు

'విశ్వాసము' విలువేందో నేర్చుకో.. 

మూగ జీవులకైన ఉండు మంచి మనసు

నేర్వవలె నరుడు వీటినుంచెన్నో నీతులు 

మంచి బోధ విను ఎవ్వరు తెలిపిననేమి. 

                       

*దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 


*డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


*సుఖం న కృషితోsన్యత్ర యది

ధర్మే వర్తతే ౹

అవస్త్రత్వం నిరన్నత్వం కృషితో నైవజాయతే ౹౹

      

      

 వ్యవసాయం వదిలితే సుఖః ఉండదు.ధర్మాంగా నడుచుకుంటే వ్యవసాయదారుడికి ఎప్పటికీ అన్నం బట్టల కొరత ఉండదు.


*సత్సంగత్వే నిస్సంగత్వం !* 

*నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 

*నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 

*నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 


*సత్పురుషులు ..*  *మార్గదర్శనం* 

*సత్సంగత్యం ..* *సహవాసం* 

*సత్ప్రవర్తన ..* *జీవించడం* 

*మించి, ఈ  భౌతిక  ప్రపంచంలో  ఇంకొకటి,  మరొకటి  లేదు ..*

* :*

*_ ప్రాంజలి ప్రభ *

028..ప్రాంజలి ప్రభ..

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం, మొ. సృష్టించావు. ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తున్నావు. 

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

పంచదార, బెల్లం, తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ! ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు. 

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామికి కూడా దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

కాషాయం కట్టిస్తావు, ఆస్తులపై భ్రమ పుట్టిస్తావు. ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ..

నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు. కానీ నన్నొక్కడినే పూజించమంటావు. 

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు. అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు. 

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

పాము పడకపై శయనించి, అమ్మ చేత కాళ్ళోత్తించూకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు. 

నువ్వు తక్కువ వాడివి కావు సామీ... 

నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.

కానీ సామీ! 

నేనూ తక్కువవాణ్ని కాదు నాకు బాగా తెలుసు, నీ కాళ్ళట్టుకుంటే నీవే నన్నెత్తుకుంటావని..

ఆ గేనం (జ్ఞానం) మాత్రం నన్నొదలకుండా చూడుసామీ

ఆ ఒక్క వరం మాత్రం నాకివ్వు సామీ !!!

****

029.. భగవంతుని దర్శనం?

ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు.

ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని మెచ్చుకోలేక పోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.”

అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు.

“భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికి నాకు ఒకటే కోరిక! ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు..”

భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా..” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి “ఈ కోరికను తీర్చవలసిందే స్వామి” అన్నాడు. భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన చివరకు ఇలా అన్నాడు “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! నేను ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై, భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు తన నగరంలో దండోరా వేయించాడు. "రేపు అందరు కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికి కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఇది రాజుగారి ఆజ్ఞ!”

రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరిని తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒకచోట రాగి నాణేల నిధి కనిపించింది. ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు.

అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరచి, "అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే.. మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు.

కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. 

వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు 

'మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని!

రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక అందరికి ఒకచోట వెండి నాణేల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. 

వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు కదా!’ అనిపించింది.


ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత అందరికి విచిత్రంగా బంగారపు నాణేల నిధి కనిపించింది. ప్రజలలో ఇక మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇంక కేవలం రాజు, రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు.

“చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో...! భగవంతుడి నిజ దర్శనం లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు! భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒకలెక్కకాదే!” 

నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరు ముందుకు సాగారు. 

కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవటం ప్రారంభించి, "మీరు త్వరగా వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నింటిని పోగుచేసి ఉంచుతాను" అంది.

అదిచూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.

నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు.

"ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో.. ఇక్కడే నిలబడి మీ అందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నాను.” రాజుగారు చాలా సిగ్గుతో, భగవంతుని ముందు తలదించుకున్నాడు.

ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు.

“ఓ రాజా, ఎవరైన సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికి నేను లభించను, కనిపించను! వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు!”

ఎవరైన సరే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతున్ని శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి, ఇష్టంతో భక్తితో భగవంతున్ని కొలుస్తారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. మన తిరుమల శ్రీనివాసున్ని కలియుగ ప్రత్యక్ష దైవం అని పెద్దలు ఊరికే అనలేదు. స్వామి వారి మహిమలు వర్ణణాతీతం, ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల చెంత పెట్టండి చాలు, ఇక ఆయనే అన్ని చూసుకుంటాడు. ఇది మా అనుభవం నేర్పిన పాఠం, మీ వరకు రావాలంటే భక్తితో స్వామిని ప్రసన్నం చేసుకోండి చాలు.

,***

030..))నాన్న నేర్పిన చదువు(())మిత్రుల కోసం))


[[తండ్రి]]

।।ఓం నమః శివాయ।।

అబ్బాయీ, పద్మము - అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?


{{కొడుకు}}

కమలము, నళినము, తామరపూవు


[[తండ్రి]]

అంతేనా?


{{కొడుకు}}

నాకంతే తెలుసు.


[[తండ్రి]]

నేను చెబుతాను చూడు - వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము..


{{కొడుకు}}

నాన్నా, నాన్నా, ఆగు.


[[తండ్రి]]

చెప్పు.


{{కొడుకు}}

వీటన్నిటికీ అర్థం పద్మం అనేనా?


[[తండ్రి]]

అవును.


{{కొడుకు}}

మరి #డిక్షనరీ వెదికితే ఇవన్నీ దొరుకుతాయా?


[[తండ్రి]]

ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది.  అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.


{{కొడుకు}}

మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు కూడా నీకెలా దొరికాయి?


[[తండ్రి]]

నేను #అమరకోశం చదువుకున్నాను.  అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  


{{కొడుకు}}

అదెలా?


[[తండ్రి]]

#అమరం లో కొన్ని పర్యాయపదాలను #అమరసింహుడు ఉపదేశించాడు. వాటికి కొన్ని ప్రత్యయాలు జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.


{{కొడుకు}}

ఎలా?


[[తండ్రి]]

చెబుతా చూడు - 1 వారి, 2 నీరమ్, 3 జలమ్, 4 సలిలమ్, 5 కమ్, 6 తోయమ్, 7 ఉదకమ్, 8 పుష్కరమ్, 9 పయః, 10 అంభః, 11 అంబు ... ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు నీరు అనే అర్థంలో చెప్పాడు.


{{కొడుకు}}

అయితే?


[[తండ్రి]]

పద్మము పుట్టేది ఎక్కడ?  నీటిలో కదా?  అందువల్ల పైన చెప్పిన పదాలకు 'జ' అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - పద్మము అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి.  మళ్లీ చెప్పనా?  వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము..


{{కొడుకు}}

చివరలో 'జ' - అని ఎందుకు చేర్చాలి?


[[తండ్రి]]

'జ' - అంటే జాతము, జన్మించినది అని అర్థం వస్తుంది. జలజ అంటే జలములో జన్మించినది అని అర్థం. అలాగే నీరజ అంటే నీటిలో జన్మించినది అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.


{{కొడుకు}}

జ అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా?


[[తండ్రి]]

జాతము అనవచ్చు.


{{కొడుకు}}

అయితే నేను చెబుతాను చూడు. వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము..


[[తండ్రి]]

బలే.  నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.


{{కొడుకు}}

జ, జాత మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా?


[[తండ్రి]]

భవ, ఉద్భవ, సంభవ అనే పదాలను చేరిస్తే పుట్టినది లేదా పుట్టినవాడు అనే అర్థం వస్తుంది.  ఉదాహరణకు జలభవము, జలోద్భవము, జలసంభవము అంటే జలంలో పుట్టినది అని అర్థం.  అలాగే నీరభవము, నీరోద్భవము, నీరసంభవము అని చెప్పవచ్చు.


అలాగే రుహ అనే ప్రత్యయం చేర్చవచ్చు. రుహము అంటే పెరిగేది. 


{{కొడుకు}}

అయితే నేను చెబుతా దానితో పేర్లు - వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము..


[[తండ్రి]]

బాగా చెప్పావు.  ఏక సంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా పద్మము అనే అర్థం.  ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా?


{{కొడుకు}}

నీటికి 11 పర్యాయవాచకాలు చెప్పావు.  వాటికి జ అనే ప్రత్యయం చేర్చి, పద్మం అనే అర్థంలో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను. జాత అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను.  రుహ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను.  భవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను, ఉద్భవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను, సంభవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను.  అంటే, మొత్తానికి పద్మము అనే అర్థంలో ఇప్పటికిప్పుడు 66 పదాలను చెప్పగలను.


[[తండ్రి]]

మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు?  ఇప్పుడేమో ఏకంగా అరవై ఆరు పదాలు చెప్పగలనంటున్నావు?


{{కొడుకు}}

నువు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను?


[[తండ్రి]]

ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.


{{కొడుకు}}

అదెలా నాన్నా?


[[తండ్రి]]

పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు?


{{కొడుకు}}

పద్మాన్ని హస్తంలో ధరించే విష్ణువు ఉన్నాడు.  పద్మాన్ని నాభిలో ధరించిన అదే విష్ణువు ఉన్నాడు. పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడు ఉన్నాడు.  క్షీరసాగరమధ్యంలో పద్మంలో జన్మించిన లక్ష్మీదేవి ఉన్నది. 


[[తండ్రి]]

మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు?  సరే, ఇప్పుడు చూడు.  పద్మం అనే అర్థంలో నీవు 66 పదాలు చెప్పగలవు కదా?  వాటికి చివర హస్తుడు అని చేర్చు.  వాటన్నిటికీ పద్మాన్ని చేతిలో ధరించినవాడు అనే భావంలో విష్ణువు అనే అర్థం వస్తుంది.  అంటే ఈ క్షణంలో నీవు విష్ణువు అనే పదానికి పర్యాయవాచకాలు 66 చెప్పగలవు.


{{కొడుకు}}

ఓహో.  బలే.  అర్థమైంది. వారిజహస్తుడు, నీరజహస్తుడు ఇలా అన్నమాట.  


[[తండ్రి]]

అవును.


{{కొడుకు}}

అయితే నాన్నా, హస్తం అనే పదంతో పాటు కరము, పాణి అనే పదాలను కూడా చేయి అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా, వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా?  


[[తండ్రి]]

హాయిగా ఉపయోగించవచ్చు.  ఆవిధంగా హస్తుడు అనే ప్రత్యయాన్ని చేర్చి 66, కరుడు అనే ప్రత్యయాన్ని చేర్చి మరో 66, పాణి అనే ప్రత్యయాన్ని చేర్చి మరో 66 మొత్తం 198 పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.


{{కొడుకు}}

అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే?


[[తండ్రి]]

నీటికి ఇంకా కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము - ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి.  నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను.  ఆ పదాలతో పద్మం అనే అర్థం సాధించి, మరలా ఆ పద్మాన్ని చేత ధరించినవాడనే అర్థంలో ఇంకెన్ని విష్ణుపర్యాయవాచకాలను సృష్టించవచ్చో చూడు. 


{{కొడుకు}}

బలే నాన్నా, బలే.  అలాగే పద్మంలో పుట్టిన బ్రహ్మ అనే అర్థంలో -  పద్మం యొక్క 66 పర్యాయవాచకాలకు జ, జాత, భవ, సంభవ, ఉద్భవ,  రుహ అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం 396 (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.


[[తండ్రి]]

ఓహో, సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా?  పద్మజుడు, పద్మసంభవుడు అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే బ్రహ్మ అనే అర్థం వస్తుంది.  


వాటిని పద్మజ, పద్మసంభవ అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే లక్ష్మి అనే అర్థం వస్తుంది.


మరి ఆ బ్రహ్మకు తండ్రి విష్ణువు అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు? 

 

{{కొడుకు}}

పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ అనే అర్థంలో 396 పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా,  తండ్రి అనే అర్థాన్నిచ్చే జనక, గురు, పితా, జన్మద అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ 396 పదాలకు చేరిస్తే (396x4) 1584 పదాలను విష్ణువు అనే అర్థంలో సృష్టించగలను.


[[తండ్రి]]

మరి లక్ష్మీదేవికి భర్త విష్ణువు అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించగలవు?


{{కొడుకు}}

పద్మంలో పుట్టినది లక్ష్మి అనే అర్థంలో 396 పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా, వాటికి పతి, ప్రియ, వల్లభ, నాథ, భర్త, ప్రాణేశ వంటి నాకు  తెలిసిన ఓ 6 ప్రత్యయాలను చేర్చి (396x6) 2376 పదాలను సృష్టించగలను. 


[[తండ్రి]]

చూశావా, నీవు విష్ణుసహస్రనామాలను రచించావు.  విష్ణువుకు మొత్తం 3960 నామాలను సృష్టించావు. (1584+2376)


{{కొడుకు}}

అయ్యో, నాలుగు వేల నామాలకు ఒక 40 తక్కువయ్యాయే.


[[తండ్రి]]

పద్మాన్ని నాభిలో కలిగినవాడు పద్మనాభుడు అంటే విష్ణువు కదా,  పద్మానికి 66 పర్యాయపదాలు నీకు తెలుసు కదా, వాటికి చివర నాభుడు అనే ప్రత్యయం తగిలించు.  వారిజనాభుడు, జలజనాభుడు అంటూ.  కాబట్టి, 3960+66=4026 నామాలు వచ్చాయి.  మొత్తానికి ఇలా విష్ణుచతుస్సహస్రనామాలు సృష్టించగలవు.


{{కొడుకు}}

సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటే, పదసంపదను ఇంత సులువుగా, ఇంత అపారంగా సృష్టించవచ్చా.


[[తండ్రి]]

అవును. ఇప్పుడు చెప్పినవి కేవలం మచ్చుకు మాత్రమే. ఈవిధంగా సంస్కృతపదాలను ఇంకా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అలవోకగా సృష్టించవచ్చు.  ఇన్నేసి పదాలను #డిక్షనరీలో చేర్చి వాటికి అర్థాలు ఎవరూ వ్రాయరు.  అందువల్ల ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీ వెదికి, అక్కడ కనబడకపోతే అబ్బో అబ్బో సంస్కృతం చాల కష్టం సుమీ అంటూ ఉంటారు.  


{{కొడుకు}}

అవును నాన్నా, ఇంతవరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను.  


[[తండ్రి]]

సరే, నళినదళేక్షణ అనే పదం విన్నావా?


{{కొడుకు}}

నా తరమా భవసాగరమీదను, నళినదళేక్షణ రామా అనే కీర్తనలో ప్రసిద్ధమే కదా?


[[తండ్రి]]

నళినదళేక్షణుడు అంటే అర్థం ఏమిటి?


{{కొడుకు}}

రాముడు.


[[తండ్రి]]

పాటలో విని రూఢి-అర్థాన్ని గ్రహించావు.  మరి #యౌగికార్థం చెప్పు?


{{కొడుకు}}

అదేమిటి?


[[తండ్రి]]

నళినము అంటే పద్మము. నళినదళము అంటే పద్మదళము, ఈక్షణము అంటే చూపు లేదా కన్ను.  కాబట్టి నళినదళేక్షణుడు అంటే పద్మపు రేకులవంటి కన్నులు కలవాడు అని అర్థం. అది యౌగికార్థం అంటే.  నీవు ఇంతవరకూ చెప్పిన పద్మపర్యాయవాచకాలు, విష్ణుపర్యాయవాచకాలు, బ్రహ్మపర్యాయవాచకాలు, లక్ష్మీదేవి పర్యాయవాచకాలు అన్నీ యౌగికపదాలే.  


{{కొడుకు}}

ఓహో.


[[తండ్రి]]

ఓహో అని ఆశ్చర్యపోవడం కాదు.  నళినదళేక్షణుడు అంటే యౌగికార్థం తెలిసింది కదా?   మరి ఇప్పుడు సమానార్థకాలైన ఇంకెన్ని పదాలను సృష్టించగలవు?


{{కొడుకు}}

నళినము అంటే పద్మము అనే అర్థంలో మునుపు 66 పదాలను సృష్టించివున్నాము కదా, వాటికి చివర కన్ను అనే అర్థంలో ఈక్షణ, నేత్ర, నయన, లోచన, చక్షు, అక్ష అని నాకు తెలిసిన ఆరు ప్రత్యయాలను ఉపయోగించి పద్మేక్షణుడు, పద్మనేత్రుడు, పద్మనయనుడు, పద్మలోచనుడు, పద్మచక్షువు, పద్మాక్షుడు ఇలా 396 పదాలను (66x6)  సృష్టించగలను. ఇలా పుంలింగంలో ఉపయోగిస్తే 396 పదాలతో రాముడు వస్తాడు.  అలాగే పద్మేక్షణ, పద్మనేత్ర, పద్మనయన, పద్మలోచన, పద్మచక్షువు, పద్మాక్షి అంటూ మరో 396 పదాలను స్త్రీలింగంలో ఉపయోగిస్తే సీతమ్మవారు. అంతేనా?


[[తండ్రి]]

అవును.  ఆ పదాలకు రాముడు, సీతమ్మ అని మాత్రం అర్థాలను గ్రహిస్తే అవి రూఢార్థాలు.  అలా కాదు, పద్మం వంటి కన్నులు కలిగిన ఎవరైనా పద్మాక్షుడు లేదా పద్మాక్షి కావచ్చును అనే అర్థంలో గ్రహిస్తే అవి యౌగికార్థాలు.


)))(((


{{కొడుకు}}

ఓహో, మరి #అకాయుడు అనే పదాన్ని మనం రూఢార్థంలో గ్రహించాలా లేక యౌగికార్థంలో గ్రహించాలా?


[[తండ్రి]]

ఎలాగైనా గ్రహించవచ్చు.


{{కొడుకు}}

అర్థమైంది నాన్నా.


[[తండ్రి]]

శుభమస్తు.


{{కొడుకు}}

సర్వం శ్రీ నళినదళేక్షణార్పణమస్తు.  

అంటే #శ్రీరామార్పణమస్తు.


[[తండ్రి]]

తథాస్తు.


)))(((

"నాన్న నేర్పిన చదువు" 

)))(((


ప్రాంజలి ప్రభ... మల్లాప్రగడ 

No comments:

Post a Comment