Saturday, 24 February 2024

మాఘ పురాణం - 16 వ అధ్యాయం (25/02/2024)* నుండి నేటి వరకు

 


*మాఘ పురాణం - 16 వ అధ్యాయం (25/02/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*విద్యాధర పుత్రిక కథ :*

రాజా ! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను , వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ *"నయనా ! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపముకై మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని"* అంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను , మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని , తనను చూచినవారికిని , సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని  నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను , ఆ రక్షసుడు దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను , కోరిన రూపము ధరింపగల  శక్తిని కూడ సంపాదించెను. ఆ రక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు , శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు *"ఓయీ ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని"* చెప్పి యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.

అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి *"సుందరీ ! నన్ను వరించుమని యడిగెను , ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను , విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను , విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును , ఈ లోపున నిన్నేమియు బాదింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు , రాక్షసుడు మరల మరల నడుగగా *'నాకిప్పుడేమి అక్కరలేదు , ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది , దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను. ఆశ్చర్యపడి *'అమ్మాయి ! నీవిచటనున్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.*

నారదుడామె చెప్పినదంతయును వినెను. అమ్మాయీ ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.

విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును , కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును , హృషీకేశాయని మేల్కొనును , వామనాయనుచు తిరుగును , ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.

హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి , సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును. అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను. హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను , నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి , హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను , వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి , అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.

*_ మల్లప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ *

*మాఘ పురాణం - 17 వ అధ్యాయం (26/02/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*ఇంద్రునికి కలిగిన శాపము :*

వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా ! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువనుమహాముని మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి  మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతఃకాలమున నదీస్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు.

పూర్వము తుంగభద్రా నదీతీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని యొకడు ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య అతిలోకసుందరి , ఆమె యొకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో గలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును , ఆమె చేష్టలను గమనించుచుండెను.

మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను , విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశయై ఇంద్రునిపొందు అంగీకరించెను , కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై  స్వర్గమునకుపోలేక భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమునువిడిచి పరమాత్మలో లీనమయ్యెను.

ముని శాపమువలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరములయందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీస్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి, మునులు వారిట్లనిరి.

దేవతలారా వినుడు మేము చేయువ్రతము మాఘమాసవ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకాదులందు స్నానము చేయుట శ్రీమహావిష్ణుపూజ , పురాణ పఠనము , యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవస్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు గోదానము , వృషోత్పర్జనము , తిలదానము ఆవూప దానము , పాయసదానము , వస్త్రకంబళములదానము , విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును డేవతలిట్లు స్తుతించిరి.

*స్వామీ:* నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీయనుగ్రహము లేనిదే యెవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ ! యిట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్పమరెవరును యెరుగజాలరు. కర్మప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ , ఇంద్రుడు మొదలైన దేవతలు , పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు , నారదుడు , ప్రహ్లాదుడు , ఉర్దవుడు మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై , పూర్వమువలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు , కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయపుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.

దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వగ్ధుడగునా ? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు , దేవతలారా ! మాఘమాసస్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము , సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి నొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాసకాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీచన్నీటి స్నానము బాదాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆశక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వును భార్య మాఘస్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృస్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *" విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

దేవతలారా ! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .*

*మాఘ పురాణం - 18 వ అధ్యాయం (27/02/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*ఇంద్రుని శాపవిముక్తి :*

శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను. దేవతలారా ! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు మాఘస్నానము , పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు నశించును. మాఘ వ్రతము నాచరించినవారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు.

మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది.  పర్వతములలో మేరువు గొప్పది. అన్ని  దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి , గంగా , కావేరీ ఇలా సర్వనదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము , మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ  మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును , అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను.

దేవతలు విష్ణువాక్యమును శిరసా వహించి ఇంద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి చిన్న పాదములు , పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.  ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి.

పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కౌరించి యిట్లు పలికెను. నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి *"మనుష్య జన్మము కష్ట ప్రదము , స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను , ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుటమేలని"* తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.

నేనును బంధువుల వద్దనుంటిని , వారి నిరాదరణ ఫలితముగ చూచువారెవరును లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి , వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితిని. ధనమును దాచి సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు , నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని , తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.

పులి , కోతి , ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనొందితిని , పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కల వానికి పెట్టితిని , ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాపవిముక్తిని కలిగించిరి అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే ఆమె దేవతత్వమునంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికారరూపముతో తిరుగుచున్న ఇంద్రుని జూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను , లోనికిపారిపోయెను. దేవతలు ఇంద్రుని జూచి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను , ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.

ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా జహ్నుముని , స్వామీ ! యీ విష్ణు కథామృతము ఇంకను వినవలెననున్నది ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధనసంపాదనము తప్ప ధనవినియోగము నాతడు చేయలేదు. పూజ , దానము మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మఱ్ఱిచెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్త్యమును వివరించుచుండెను , అతదు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునకుపోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను , చేయకపోవుటవలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన , మాఘ స్నానము వలన వాని పిశాచరూపముపోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను.

*_మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ ప్రాంజలి ప్రభ .*

**మాఘ పురాణం - 19 వ అధ్యాయం (28/02/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*మునుల వాగ్వాదము :*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. ఓయీ వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము , వైరాగ్యము , ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగ నేనేయక్కువయను వివాదము కలిగెను. భృగుమహర్షి , నేను తపోనిష్టుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను , బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని యనెను. మాండవ్యుడు నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదును. నిత్కర్మలనాచరింతును , అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను , ఆత్మజ్ఞానిని , ఏకాగ్రతకలవాడను నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి , నేను వేదములు. , శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడననియనెను. శౌనకుడును ఆత్మనేత్తలలో నేను మొదటివాడను , నాకంటె పూజ్యులెవరును లేరనెను. ఆ మునివరులు తమ గొప్ప తనమును బిగ్గరగా యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు , కొట్టు కొనుచు వారి దండములను , ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి.

ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను , కలహించుకొనుచున్నవారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు 'నారదా ! ఆ మునులు జ్ఞానులైనను నామాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక , సనందన , సనత్కుమార , సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు , బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరిని కుశల ప్రశ్నాధికముతో శంతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.

కొంతకాలము గడచిన తరువాత బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని జూచి యెదురువెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి సనకాది మునులాశ్చర్య పడి యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా ! నీవు వయో వృద్ధుడవు మునులలో నుత్తముడవు , సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి ?  వృద్దులు బాలురకు యెదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శ్రుతివాక్యమున్నది కదా మేము అయిదేండ్లవారమే కదా ! అని పలికిరి.

ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి యిట్లనెను. భగవద్గావలాలమలారా ! ఒకొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము , కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి , యోగమును పాటించుటచే , ఉపయోగమేమి ? తపముచేత , కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి ? జ్ఞానహీనుడు చిరంజీవియైనచో వచ్చిన ప్రయోజనమేమి ? నిరర్దకముగ కాలము గడచుటచే దుష్టుల జీవనము గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే యెక్కువగ వ్యర్థముగ అజ్ఞానియై యెక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలముననుభవించి మరల జన్మించును. నిత్యముకాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది.

మహాత్ములైన సనక , సనందన , సనత్కుమార , సనత్పుజాతులారా ! మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు , నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును నీ హృదయపద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే , నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే , హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను  వినుచున్న మునులు తమలో తాము యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరును మార్కండేయ మహర్షికి , సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగశక్తి యుండని ప్రార్థించిరి.

నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతునివలన మునులు మొదలగు వారందరును శ్రుతులసారము నెరిగిరి. శౌనకుడు మునులును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంతచిత్తులై పరమేశ్వర జ్ఞానము , పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్నరూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి వివిధరూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదవేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్త్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహము నందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగ అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వరా ! మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయవివేకములను , సనక సనందనాదుల మహత్త్యమును , పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములని యెరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్నృమద మహర్షి వివరించెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ .*

*మాఘ పురాణం - 20 వ అధ్యాయం (29/02/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*శివ బ్రహ్మల వివాదము :*

  గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు , శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను , దేవతల కిస్టుడైన అధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.

ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు , నేత్రములు , బాహువులు , పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీమహవిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ , శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ యిద్దరిలో నుత్తములని తలచిరి , ప్రయాణమైరి , నాలుగుదిక్కుల క్రిందను , పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని , చివరనుగాని చూదలేకపోయిరి , తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.

ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుడు. గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు , స్వయంప్రకాశుడు , సర్వప్రాణులయందు నివసించువాడు , సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు , మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరి.

*🌳బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి🌳*

అనంతమూర్తీ ! సర్వాద్యమూ , సర్వాధారమూ , అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్సమనట్లు చేయుము. సర్వాత్మకా ! సర్వేశ్వరా ! సర్వప్రాణి నమస్కృతా !  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు , భర్తవు నీ తేజమనంతము , నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు , సర్వస్వరూపుడవు , సర్వవ్యాప్తరూపుడవు అనుచునిట్లనిరి.

*హేవిషోవంతమూర్తే తవఘవ* *విఖిలాకారమాద్య స్వరూపం*

*సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం |*

*అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం*

*చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం ||*

*నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై*

*త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |*

*పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః*

*ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||*

*త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః*

*గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర |*

*త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట*

*దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం ||*

*లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర*

*త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః* 

*సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్* *సర్వగుణశ్చదేవ*

*త్వమేవ భూర్భూరికృత* *ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||*

*త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ* *యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ*

*త్వమేవశక్ర స్పురలోకనాధః* *నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||*

*పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం*

*త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||*

*వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ*

*కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||*

*నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః*

*రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||*

*అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం*

*తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి ||*

*తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో* *భగవన్నమస్తే*

*తూర్ణం జగనాథ* *మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||*

ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా ! మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి , ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్దసరిగా లేకపోవుట , శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే , చేయవలసిన దానిని వీడి నిద్రించుట , కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను , నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.

మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను , నేను పోషకునిగను , శివుడు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదా !


అని బ్రహ్మకు శివునికి శ్రీమహావిష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను , మరియు బ్రహ్మతో నిట్లనెను , బ్రహ్మ ! నీవు స్వతంత్రుడవు , నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు , ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని. మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.


*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ .*

*మాఘ పురాణం - 21 వ అధ్యాయం (01/03/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*శివ స్తుతి :*

శ్రీమహావిష్ణువు చేసిన శివ ప్రశంస - నారదుని శివస్తుతి.
గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరియు నిట్లనెను. విష్ణువు శివుని జూచి యిట్లనెను. శంకరా ! నీవు నాతో సమానుడవు. మన ఇద్దరికిని భేదము లేదు. నావలెనే సర్వ పూజ్యుడవు. సర్వవ్యాపకుడవు , సర్వోత్తముడవు , సర్వవ్యాపివి , సర్వాత్మకుడవు సుమాయని యిట్లు స్తుతించెను.

*విష్ణుకృత శివస్తుతి :*

*శంభో భవానర్కహిమాంశు* *నహ్నివేత్రత్రయస్తే ఖిలలోక కర్తా*
*తధాసమస్తామర పూజితాంఘ్రీః* *సంసేవ్యమానస్పురయోగిబందైః ||*
*వచాస్తికించిత్తవ మిత్ర భేదస్తే హంచ్వహం త్వం సురనాధసత్యం*
*వేదాంద వేద ప్రముఖా నిశం ర్వాంసన్యాసినస్వృర్గ విముక్తి హేతుం*
*వదంతి తద్వత్ సుభజంతిశంభో ప్రయాంతి ముక్తించ తివ ప్రసదం ||*
*సర్వభేదవినిర్ముక్తః సర్వభేదాశ్రయోభవాన్*
*త్వంత్వరిష్ఠాయలోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః ||*
*త్వమేవ పరమానందస్త్వమే వాభయదాయకః*
*త్వమక్గరం పరంబ్రహ్మ త్వమేవహినిరంజనః ||*
*శివస్స్ర్వగతః సూక్ష్మః ప్రబ్రహ్మవిదామసి*
*ఋషీణాంచ వశిష్ఠస్త్వం వ్యాసోవేదనిదామసి ||*
*సాంఖ్యానాంకపిలోదేవః రుద్రాణామపి శంకరః*
*ఆదిత్యానాముపేంద్రప్త్యం వసూనాం చ హిపొవకః ||*
*వేదానాంసామవేదస్త్యం సావిత్రి చందసామపి*
*ఆధ్యాత్మ విద్యావిద్యానాం గతీనాం పరమాగతిః ||*
*మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి*
*ఓంకారస్సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ||*
*ఆశ్రమాణాం చ గార్హ్యస్థ్యం ఏశ్వరాణాం మహేశ్వరః*
*పుంసాంత్వమేకుపురుషః సర్వభూతహృదిస్థితః ||*
*సర్వోపనిషదాంచేవ గుహ్యోపనిషదుచ్యతే*
*కల్పానాంచమహాకల్పః యుగానాంకృత మేవచ*
*ఆదిత్యః సర్వమారాణాం వాచాందేవి సరస్వతీ ||*
*ర్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి*
*సూక్తాణాం పౌరుషంసూక్తం బ్రహ్మసిబ్రహ్మవేదినాం ||*
*సావిత్రీచాసి జాహ్యిరాం యజుషాం శతరుద్రీయః*
*పర్వతానాం మహామేరుః అనంతోయోగినామపి ||*
*సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేనహి*
*యరైవాహం త్వంహి సర్వముఖ్యోషు శంకర ||*

శంకరా ! నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగ తెలియును. నేను నారదునకు నీ మహిమను చెప్పగా నతడు నీయనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనెందెను. నీవాతని ననుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా ? మరల స్మరింపుము.

*కూపంతనాశేష కధాభిగుప్తం అగోచరం* *నిర్మలమేకరూపం*
*అనాదిమధ్యాంత* *మనంతమాద్యం నమామి దేవంతమనః పరస్తాత్ ||*
*ర్వాందేకపస్యంతి జగతృసూతిం వేదాంత సునిశ్చితార్థాః*
*ఆనందమాత్రం ప్రణనాభిధానం* *చతేవరూపం శరణం ప్రపధ్యే ||*
*ఆశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని* *వియోగహేతుం తేజోమయం* *జన్మవినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మిరూపం ||*
*ఆద్యంత హీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేపరస్తాత్*
*కూటస్థమవ్యక్తవపు స్తదైవ నమామిరూపం పురుషాభిదానం ||*
*సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమ ప్రవిష్టం*
*సూక్ష్మంవిచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములుస్త భేధం ||*
*ఆద్యం మహత్త్వే పురుషార్త్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం*
*ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మైస్పమన్వితం దేవనతోస్మిరూపం ||*
*ద్వీసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్ర భేదం పురుషైకరాధం*
*అనంత భూతైరధివాసితంతే వతోస్మ్యహం తజ్జ గదంద స్థంస్థం ||*
*అశేష దేవాత్మక మేకమాద్యం స్వతేజసారూపితలోక భేదం*
*త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవి మండలస్థం ||*
*సహస్రమూర్థానమనంత శక్తీం సహస్రబాహుం పురుషం పురాణం*
*శయానమంతస్పంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మినిత్యం ||*
*దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంత కాలావల కాలరూపం*
*అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవకాల సంజ్ఞం ||*
*ఫణా సహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభీ పూజ్యమానం*
*జనార్దన ప్రీతి మహత్కరం త్వాం సతోస్మిరూపంతవ శేష సంజ్ఞం ||*
*అన్యాహతైస్వర్యమయుగ్మ నేత్రం బ్రహ్మమృతానంద రవజ్ఞమేకం*
*యుగాంతశేషం దివిసృత్యమానం నతోస్మ్యహంత్వామె తిరుద్ర సంజ్ఞం ||*
*ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చిత పాదయుగ్మం*
*మకోమలం హింద్ర సుశుభ్రదేవాం నమామ్యహాం త్వామఖిలాభినాధం ||*
*చతుర్భుజం శూలమృగాగ్నిపాణీం ప్రయత్నతో భక్తవర ప్రదానం*
*వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహందేవ కృపాకరేశం ||*

శంకరా ! నారదుడు చేసిన అమోఘమైన యీ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితిమ్ని. మునులందరి స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు. మనకు భేదమున్నదని తల్చు మూఢులు నరకమున బడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడంతర్థానము నందెను.

జహ్నుమునీ ! విష్ణు ఏ విధముగ రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరచి లోకములకి వినయము నీ విధముగ తెలిపెను. ప్రస్తుతం  ముగ్గురికి భేదములేకున్నను భేదమున్నదని తలచివాదించు , అహంకార పండితులకొరకీ సంఘటన జరిగినది. మాధమాసవ్రతము నాచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే నాలోచించి దోషమునకు ఓడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులైముక్తినందవలెను. అజ్ఞానులు మాఘమాసవ్రతము నాచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింపవలయును సుమా వృధాపదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకుగాదని తెలుపుటే యీ సంఘటన జరిగినది లెనిచో సర్వాధికిలు సర్వాధారులు సర్వోత్తములునగు త్రిమూర్తులకు కలహమేమి యెక్కువ తక్కువలేమి ? మూర్ఖుడైనను భక్తితో మాఘమాసవ్రతము నాచరించిన జ్ఞానియై సుఖించును.

అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వాని నాక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను వానిశక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండును ఉండదు. ఏదియును అయనను మించినది లేదుకదా. జ్ఞానము కలుగలలెనని భగవంతుడే యిట్టి సంఘటన నేర్పరచి మనవంటి మూఢులకు అహంకూడదని తెలిపెను. కావున గర్వమును , సిగ్గును , అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాసవ్రతము నాచరించి విష్ణుకథలను విని తరింపవలెను. యధాశక్తి దానములాచరించి సాటివారియందు ప్రేమనుచూపుచు సర్వాత్మకుని దయా విశేషము నందవలయును అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్త్యమును భగన్మహిమను బోధించెను.

*_ మల్లాప్రగడ .*

*మాఘ పురాణం - 22 వ అధ్యాయం (02/03/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*క్షీరసాగరమధనము :*

గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా ! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును , ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును , మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారణ చేయువాదు , అన్నదానము చేయువాదును పొందు పుణ్యము అనంతము అని పలికెను.

జహ్నుముని గృత్నృమదమహాముని ! తిధులనేకములుండగా యేకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను ? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి ? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను , సంపదలను , పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను , సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.

వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము , కామధేనువు , కల్పవృక్షము , అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని యింద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు , రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.

*దేవదానవులు చేసిన శివస్తుతి :*

*నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే*
*నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||*
*నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ*
*నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||*
*త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక*
*త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||*
*త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే*
*అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||*
*హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే*
*మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||*
*పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్*

అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును , ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి , ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.

మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు , జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు , పొడవైన కేశములు , తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.

ఆమె దేవదానవులను జూచి దేవతలారా , దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను.దేవతల వర్గమొక వైపునను , రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.

అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును , దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను , హస్తకంకణముల సుమధుర నాదములతోను , ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర , మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును , సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.

*రాహుకేతువుల వివరణ :*

రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపదిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుదు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు యింతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.

చక్రముచే నరుకబది చావుబ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని , అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని , చద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్సించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.

ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.

పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును 'నీవు యక్షుడవు , ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెనూ. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.

యక్షుదు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాతు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని 'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి , మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ యక్షుడును 'నేను యక్షుదను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .*

*మాఘ పురాణం - 23 వ అధ్యాయం (03/03/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹0


*నారదుని దౌత్యము - దేవతల దైన్యము :*


  గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడు విచారించెను. పారిజాత పుష్పముపై నున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను గూడ తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కిదాటిరి. ఫలితముగా దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి , ఇంద్రాదులింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాతవృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తి హీనులై పడియుండిరి.


మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా ! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా ? అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకాశపడి భూమిపై వ్రానియవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పముల కాశపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో యెట్టిదో చెప్పుమని యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను.


ఇంద్రుడు మొదలగువారు ఆహారము లేక దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు ఇచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము , చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యధాపూర్వకముగ పూజించుచు తానును భార్యయు నిరాహారులై యుండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడ పదనొకండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక , శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున దిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి యిట్లు స్తుతించెను.


*నారదకృత విష్ణుస్తుతి :*


*ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే*

*గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||*

*మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే*

*శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||*

*అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ*

*సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||*

*నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే*

*భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||*

*నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన*

*సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||*

*సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి*

*పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||*

*పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః*

*సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||*

*త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః*

*ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||*

*త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే*

*జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||*

*త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో*

*గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||*

*ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం*

*ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||*


నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరియేమియు నెరుగనివానివలె *'నారదా ! స్వాగతము ఇప్పుడెందులకీ స్తుతి ? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది యెట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని యడిగెను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడుపనిని చేసి ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించు చుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతవలె దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదునొకండు దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ ! నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను.


నారదుని మాటలను విని శ్రీహరి *'నారదా ! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను , తులసిగను అయినది. అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు , సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను , తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను , ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్పసంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును గూడ దాటెను త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వారి అనుచరులు శక్తిహీనులై తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసికాని , తెలియకకాని దాటిన , తొక్కిన యెంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి చేయవలెనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదనొకందు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని జూచి భార్యతోబాటు నిరాహారుడై యుండెను. దేవతల పుష్తికై నన్ను ప్రతిదినము అర్చించు చూనే ఉన్నాడు. నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడ ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమొనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు ఏవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానినిచ్చెదను అని విష్ణువు సమాధానము '* నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక తన దారిన బోయెను అని గృత్నృమదమహాముని జహ్నువునకు చెప్పెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .*

***

*మాఘ పురాణం - 24 వ అధ్యాయం (04/03/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

  *శ్రీమన్నారాయణుని అనుగ్రహము - తులసీ మహాత్త్యము :*

గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను.

నీలమేఘమువలె నల్లనిచాయతో , నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో , విచిత్రకుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుతుండగా , సూర్యకాంతినిమించు కిరీటముతో , హారకేయూరాది విభూషణములతో , పచ్చని పట్టు బట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపైనెక్కివచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతోబాటు శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి 'నాయనా ! కోరిన వరము నిచ్చెదను అడుగూ అనెను.

అప్పుడు సత్యజిత్తు 'స్వామి ! యింద్రాదులకు పూర్వమువలెనే సంచరించు శక్తి నిమ్ము వారిపై దయనుంచుము. తరువాత నాకును , నాభార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక నంగీకరించెను ఇట్లనెను. ఓయీ ! యీ ఏకాదశితిథి సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని , కావున యీ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య యీ పారిజాత వృక్షమును పెకిలించి యింద్రునకిండు , పవిత్రము , వనవాసి. నాకిష్టము అయిన యీ తులసిని నకిమ్ము, నీకు శుభము కలుగును, మరియొక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి యింద్రాదుల కిచ్చెను. తులసిను లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరియనుగ్రహము వలన ఇంద్రాదులందరును శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి.

శ్రీహరి యింద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను జూచి యిట్లనెను. ఈ యేకాదశితిథి నాడు నీవు భక్తితో నీ విధముగ నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ యేకాదశీతిథి సర్వజీవుల పాపములన్నిటిని పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులీవిషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి యేకాదశి నాడు ఉపవాసమును , జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిద్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను, సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన యీ తిథి ఉత్తమ సంభావన నిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు పుణ్యము నిచ్చును. ధర్మవేత్తలగు మునులును యీ తిథి మిక్కిలి పుణ్యప్రదమని యందురు. పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి, పుష్టికలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియయని అందురు. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహాపాపముల నందుదురు. దశమినాటి రాత్రి భోజనమును మాని , ఏకాదశినాడు రెండు పూటల భోజనమును మాని , ద్వాదశి నాటి మధ్యాహ్నమున నొకమారు భుజించి నాటి రాత్రి భుజింపకయుండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని యందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యధా శాత్స్రముగ పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి యేకాదసి ఉపవాసము చేసినవానినే గాక వాని కులము వారినందరిని రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. నాలుగు వర్ణములవారు , సన్యాసి , వానప్రస్తుడు , స్త్రీబాలవృద్ధులు అందరును ఏకాదశినాడు భుజింపరాదు , ఏకాదశినాడు స్త్రీ సుఖము , నిద్ర , అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసములయందును, శుక్లకృష్ణపక్షములు రెండిటను వచ్చు యేకాదశులన్నియు నిట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయణాది వ్రతముల నాచరించుట వలన వచ్చెడి పుణ్యము యేకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా , మునులారా , నా భక్తులారా మెరెవ్వరును యీ యేకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షములయందును తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తధ్యము అని బిగ్గరగా పలికెను. అని గృత్నృమహాముని జహ్నుమునికి వివరించెను.

గృత్నృమహాముని జహ్నుమునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు యేకాదశి వ్రతవిధానమును మహత్త్యమును వివరించి యింద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసికొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాతవృక్షమును తీసికొని స్వర్గమునకు పోయిరి. వారందరును వెళ్లిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో నిట్లనెను. స్వామీ ! నీ పాపపద్మముల యందాసక్తి గల నన్ను దయ చూడుము. నాకు నీవు తప్ప మరియొక్క గతిలేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమియందు అమృతము వలన పుట్టిన తులసి ! నీవు నాకిటురాలవు. నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తులసి దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు గంగా స్నానము చేసిన వారువలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారు పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించినవారు అంతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నాలోనైక్యమగుదురు. నిన్ను తమ యిండ్లయందు గాని తోటలయందు గాని పెంచువారికి యే పాపములును అంటవు.ప్రాతఃకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వ సుఖముల నందును.

*యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః*
*యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||*

అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి ! నీ దళములతో నీటిని తన శరీరముపై జల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగ నుదుటిపై ధరించినవాడు. సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి యే బాధయు నుండదు. అమృత సంభవా తులసీ త్రైలోక్యపావనీ నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను కాండములను శాఖలను అన్నిటిని శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శవలన తులసి మరింత కాంతిని పవిత్రతనుపొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపమునంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి యెడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణతులసి యను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.

అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి 'నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు ' అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి , బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరును చూచుచుండ సత్యజిత్తు దంపతులతోను తులసితోను కలసి గరుత్మంతుని పైనెక్కి తనలోకమునకు పోయెను. నాయనాజహ్నుముని ! యిది ఏకాదశీ వృత్తాంతము. ఏకాదశీ వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని స్పష్టమైనది కదా. అన్నియేకాదశులలోను మాఘమాసమునందలి యేకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసినవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుజ్యమును పొందుదురు. ఏకాదశినాడు ఉపవాసము ద్వాదశినాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యధాశక్తిగ గోదానము , భూదానము , వస్త్రదానము , సువర్ణదానము , సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు , బ్రాహ్మణులకు యీయవలెను. అట్టివారు యిహలోకమున చక్రవర్తియై తుదకు శ్రీహరి సాయుజ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి వివరించెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .*

*మాఘ పురాణం - 25 వ అధ్యాయం (05/03/2024)*

*కలింగ కిరాతుడు - మిత్రుల కథ :*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ఓయీ ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతము నాచరించి పాప విముక్తుడగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథామహిమను తెలుపును.

పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు , పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు , ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని బలవంతముగ తీసికొనెను.

ఓయీ ! నీవు దాచిన ధనమునిమ్ము , లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును *'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి వారి నగలను , ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారి గూడ దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను.

ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె క్రూరుడు , వంచనాపరుడు , బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చావర్తనురాలయ్యెను. ఈ విధముగ నాకుటుంబమున కుమారుడు , తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలయిన తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయనుకొనెను , వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు యెరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి , సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను , బ్రాహ్మణుడగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు , కల్లుత్రాగువాడు , క్రూరుడు , బంగారము నపహరించినవాడు , గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను , అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయిదీనుడై యున్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను , కిరాతుని వద్ద పని చేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి యిట్లనెను.

ఓయీ ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు , హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో తిరిగి నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను , వారిని చూచినను , తాకినను , వాడును వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేత బట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు , మద్యపానము చేసినవాడు , గురుతల్పగమనము చేసినవాడు , బంగారమును దొంగలించిన వాడు , వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.

నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి విముక్తి యెట్లు కల్గును ? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని , దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని , సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మము నుపదేశింప గోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.

నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును , పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము , మాఘస్నానము చేసి పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము , ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.

వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్టసాంగత్యజనిత దోషము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.

వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము , సంధ్యా వందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను , బిల్యదళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము , యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము , మాఘస్నానమును మానకుము , మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము , అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.

నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖమిగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

*

*
*మాఘ పురాణం - 27 వ అధ్యాయం (07/03/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

*సులక్షణ మహారాజు కథ :*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.

నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును , పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి , కృతఘ్నునకు , వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో ? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను , అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా ! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు , సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులు ఓక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను , రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి , తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్బపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.

అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి , అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు , వనమున , జలమున , గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.

అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము , నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు , మృగములు , పక్షులు అచటికి వచ్చినవి , బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా ! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా , బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము , కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య , ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల , అట్లు వచ్చిన పక్షులు , మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి , తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె , ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు , పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను  మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదౌలో నుండుట , తులసిని జూచుట , తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని , యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ , గోవింద ,  అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు , ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.

*రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహం :*

సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి , తండ్రి , తాత , సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.

మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా ! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము , పుత్రపౌత్ర సమృద్ధిని , సంపదలను , భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను , సర్వసమృద్దులను , సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.

సులక్షణ మహారాజు ఆశ్చర్యమును , ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పెరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి , తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను , పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను , మనుమలతోను , భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్నుమునీ ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.

*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ *
మాఘ పురాణం - 28 వ అధ్యాయం (08/03/2024)*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*

  *క్రూర (రా) కథ :*

గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ  దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది. అప్పుడప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.

ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను. నాయనా ! అమ్మా ! నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు ? కలహమునకు కారణమేమి ? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము ? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు ? నేను గాని , నా భార్యగాని మీకేమి ఉపకారమును చేసితిమి ? మీ యీ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు ధనము , కీర్తి , సుఖము , గౌరవము , జ్ఞానము మున్నగునవి నశించును కదా ! సర్వజ్ఞులైన , పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.

పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను. మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత ? నీ భార్యయెంత ? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు , అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. *'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా ! విష్ణువుతో సమాన దైవము , గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగుమాటలతో నూరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.

కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడురోజులు అన్నము , నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను. యిరుగుపొరుగువారు, బంధువులు , మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.

క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.

క్రూర పశ్చాత్తాపమునందెను , పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి , పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు , ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి , చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.

సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన , శ్రీహరి మహిమను వినుటవలన , వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా ! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో , ఉత్తమ మునులు , సజ్జనులు , రాజులు , వైశ్యులు , బ్రాహ్మణులు , శూద్రులు , పురుషులు , స్త్రీలు , బాలురు , పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాసవ్రతము నాచరించుట వలన , చూచుట వలన , వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో , చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను ? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.

*_ మల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ 👍.*


*మాఘ పురాణం - 29 వ అధ్యాయం (09/03/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*


*మృగశృంగుని కథ :*


వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయవలెనని తల్లిదండ్రుల అనుమతి నొంది  ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరి తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలేనను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. *"నాయనా ! నీవు అనేక పర్యాయములు మాఘమాసస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును , నా ప్రేమను సాధించితివి. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను".* మృగశృంగుడును *"స్వామీ ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను , ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను".* శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.


కౌత్సుడు ఇంటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి , ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.


భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల , ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు , గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన ఇద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల , ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను , చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.


కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను , యముని దయవలన , సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి. జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన ఇనుపస్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో , పాపముచేసిన వానిని పడవేయుదురు. తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.


వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి. అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాసస్నానము చేసి , ఇష్టదైవమును పూజించి , యధాశక్తి దానము , జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా ! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత ? చనిపొయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా యని ప్రశ్నించెను. అప్పుడు వశిష్టమహర్షి నాయనా ! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును , సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము , కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా ఇట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.


యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది ఇతనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి ఇతడు భయపడెను. భయముపోవుటకై హరినామ భజనమును చేసెను. ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా ! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.


*మృగశృంగుని వివాహములు :*


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను , మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో నంగీకరించిరి. శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము , ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా ? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా ? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ , గంగ ఇద్దరు లేరా ? వారికి లేని అభ్యంతరము నీకెందులకు ? అని వాదించిరి. ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.


కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు *బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయు వివాహము బ్రహ్మవివాహము , యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు. ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు , ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగా చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను.* గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని గూడ వివరించెను.


దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి ఇష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను , మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.


మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవయధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను , సర్వలాభములను పొందెను , మనుమలను గూడ పొందెను. ఈ విధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక , అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు యీ విధముగా తలపోసెను. *"కాశీ మహా పుణ్యక్షేత్రము , సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక , మనస్సునందలి కోరికలు నెరవేరెను , అనేకమంది కాశీ విశ్వనాధుని దర్శనము చేసికొని , వారి అభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని , కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.


కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాలబాహువులను చాచి , ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని , విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను. ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు , తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి , ఒక లింగమును ప్రతిష్టించి , దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా ! అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా ! సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి , ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. *"మహామునీ ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్టమెరిగినపుడు"* డని పలికెను. అంత మృకండుడు నమస్కరించి *"తండ్రి ! మహాదేవా ! తల్లి అనంపూర్ణా ! ఇవే మా నమస్కృతులు , లోకరక్షకా ! మీదయవలన నాకు సులక్షణవతి , సౌందర్యవతి , సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము. కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా ! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను"* అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు *"మునిసత్తమా ! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒకా నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా ? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా ?"*

అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను. కొంత తడబడి *"హే శశిధరా ! నన్ను పరీక్షింప నెంచితివా ? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని"* అడిగెను. *"అటులనే అగునుగాక !"* అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రునిగనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా ! పరమపూజ్యుడును , ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి , వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.


*_ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ *

మాఘ పురాణం - 30 (10/03/2024)*

*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*


*మార్కండేయుని వృత్తాంతం :*


వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము , మృకండుని జననము , కావిశ్వనాధుని దర్శనము , విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి *"మహారాజా ! ఇక మార్కండేయుని గురించి వివరింతును , శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు , వేదాంత పురాణేతిహాసములు , స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు "కుమారా ! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ , పెద్దలయెడ , బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన , నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును"* అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన , భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి , మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు , మునీశ్వరులు , గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరుకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా , ఆయన మార్కండేయుని వారించినారు , అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా ! మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా ! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా ? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.


అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. *'చిరంజీవివై వర్ధిల్లు'* మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా ? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి , వశిష్టులు కొంతసేపాలోచించి *"మునిసత్తములారా ! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు"* అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ *'చిరంజీవిగా జీవించు నాయనా'* అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొంతతడవడి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి *"పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక"* యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి *"ఓ మునులారా ! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు"* అని పలికి వత్సా మర్కండేయా ! నీవు కాశీ క్షేత్రమునకు పోయి , విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.


మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి , *'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ'* నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక , కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి. విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను.


క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి , ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా , నాతడు భయపడి , శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి , మార్కండేయుని రక్షించెను.


యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి , కోపముచల్లార్చుకో మహేశా ! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా ! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని , ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన , మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదగ్గరికి రావలదు సుమా ! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి , తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.


*_ mallapragada *

No comments:

Post a Comment