ఓడలు బండ్లు, బండ్లు ఓడలు
@@
ఆ కాలనీలోకి కొత్తగా చేరింది జానకి కుటుంబం. జానకి భర్త రామయ్య ఏదో ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగి. ఆర్ధికంగా ఉన్నత కుటుంబమే. వారికి ఒక కొడుకు. వారింట్లో అలివేలు అని ఒకామె ఇంటిపని చేసేది. అలివేలు భర్త తాగుబోతు, జూదరి. వారికి ఒక కొడుకు, కూతురు. తాగొచ్చి రోజూ భార్యాపిల్లలను కొడుతుండేవాడు. ఇంట్లో రూపాయి కూడా ఇవ్వడు. అందువలన అలివేలు నలుగురి ఇళ్లలో పాచిపనులు చేస్తూ పిల్లలను చదివిస్తుండేది. జానకికి కొంచెం మడి, ఆచారం, చాదస్తం ఎక్కువ. అలివేలును చిన్నచూపు చూసేది. ఆమె ఎప్పుడైనా పసి పిల్లలైన కొడుకు, కూతురుని తీసుకుని వస్తే...వారిని అసహ్యంగా చూస్తూ ఇంట్లోకి తీసుకురావద్దు అని అరిచేది. అలివేలు అంట్లు తోమి అక్కడ పెడితే వాటిని శుద్ధి చేసి కానీ ముట్టుకునేది కాదు. కొడుకు చదువుకుంటున్న దశలో రామయ్య మరణించడంతో వారి పరిస్థితి తల్లక్రిందులయింది. కొడుకు చదువుకోసం సొంతిల్లు అమ్మాల్సివచ్చింది. అద్దె ఇళ్లలోకి మారుతూ మారుతూ కొడుకు ఉద్యోగస్తుడు కాగానే ఆఫీసుకు దగ్గరలోని కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని చేరారు.
అక్కడ ఆమెకు పనిమనుషులు దొరకలేదు. కాలనీలోని ఒక షాపులో సరుకులు తీసుకుంటుండగా ఆమెకు హఠాత్తుగా అలివేలు కనిపించింది. ముప్ఫయి ఏళ్ళ తరువాత మళ్ళీ అలివేలును చూడటంతో జానకికి ఆనందం వేసింది. అలివేలు కూడా గుర్తుపట్టి పలకరించింది. ఇద్దరూ నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నడుస్తున్నారు.
"ఒసేయ్ అలివేలు... ఎన్నాళ్లకు కనిపించావు! నువ్వు వెళ్ళిపోయాక మాకు అసలు పనిమనుషులే సరైనవాళ్లు దొరకలేదు. గత పాతికేళ్లలో పదిమందిని మార్చాము. అందరూ అంట్లు తోముతూ చెంచాలు, ప్లేట్లు దొంగతనం చేసేవారు. నీలాంటి పనిమనిషి దొరక్క చస్తున్నాం. ఉన్న ఇల్లు అమ్ముకున్నాం కానీ మళ్ళీ కొనలేకపోయాము. ఈ కాలనీలో మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాం. కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కోడలు కడుపుతో ఉంది. మహా బద్ధకస్తురాలు. నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. అప్పట్లో నీకు మూడు వందలు ఇచ్చాను. ఇప్పుడు రెండువేలు ఇస్తాను. కొంచెం రావే..." అన్నది సంబరంగా.
ఒక మూడంతస్తుల భవనం దగ్గర ఆగారు. అయిదు వందల గజాల్లో మహా ఆడంబరంగా ఉంది. ఎంత లేదన్నా మూడుకోట్లు తక్కువ ఉండదు. "రండమ్మా లోపలి వెళదాం" అన్నది అలివేలు. "ఓహో...పెద్ద ఇంటినే పట్టావ్...ఇలాంటి ఇంట్లో నీకు రోజంతా పనిచేసినా పని తీరేది కాదు...పైగా డబ్బున్నవాళ్లకు పొగరు ఎక్కువ..." అన్నది లోపలకు నడుస్తూ.
అలివేలు ఇంటిలోపలికి వెళ్ళింది. జానకి కూడా వెళ్ళింది. అది ట్రిప్లెక్స్ భవనం. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, ఇంటీరియర్ చూసి నోరు వెళ్లబెట్టింది జానకి. ఆ హాల్లో ఉన్న సోఫాలు, ఎనభై ఇంచుల టీవీ చూసి నోటమాట రాలేదు ఆమెకు. "ఈ సోఫాలు తుడవడానికి నీకు సాయంత్రం అవుతుంది అలివేలూ... వీళ్లకు ఎంత చేసినా తృప్తి ఉండదు" నవ్వింది జానకి.
అలివేలు సోఫాలో కూర్చుంటూ జానకిని కూడా కూర్చోమంది. జానకి మనసు ఎందుకో వణికింది.
ఇంతలో మెట్లు దిగుతూ పైనుంచి ఫుల్ సూటులో ముప్ఫయి ఏళ్ల కుర్రాడు దిగాడు. "మమ్మీ...నేను ఆఫీసుకు వెళ్తున్నా.. అటునించి ఆటే సాయంత్రం ఫ్లైట్ కు సింగపూర్ వెళ్తాను. రెండు రోజులుండి చెల్లాయిని, బావను, పిల్లలను తీసుకుని వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు...." అని జానకిని చూసి "ఎవరీమె మమ్మీ..." అన్నాడు.
"కాలనీలోకి కొత్తగా వచ్చారుట..నువ్వెళ్లు బాబూ" అన్నది అలివేలు నవ్వుతూ.
అలివేలు పాదాలకు నమస్కరించి బయటకు వెళ్ళాడు ఆ యువకుడు.
"మీరు చిన్నప్పుడు సత్తిగా..సత్తిగా అని పిలిచేవారు..గుర్తుందా అమ్మగారు...వాడే...సత్యనారాయణ. దేవుడి దయవలన బాగా చదువుకున్నారు. ఒక అమెరికన్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. కూతురుకు పెళ్లి చేశాం. సింగపూరులో భర్తతో సెటిల్ అయింది. ఇద్దరూ భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం ఇక్కడ అబ్బాయి విల్లా కొన్నాడు. కింద పోర్షన్లో నేను, మధ్య పోర్షన్లో కొడుకు, కోడలు, పిల్లలు ఉంటారు. మూడో అంతస్తులో కూతురు, అల్లుడు వచ్చినపుడు నాలుగు రోజులు ఉండిపోతారు. అయ్యో...నిలబడే ఉన్నారు. మీరు కూర్చోండమ్మగారు...కాఫీ
తీసుకుంటారా...అయ్యయ్యో...క్షమించండమ్మా...పొరపాటున అడిగాను..." మామూలుగా అన్నది అలివేలు.
నిలువెల్లా కంపించింది జానకి దేహం. ఆనాడు తనముందు చేతులు కట్టుకుని నించుని, తానిచ్చే పాచిపోయిన అన్నాన్ని మహాప్రసాదంలా తీసుకెళ్లి పిల్లలకు పెట్టి తానూ తినే అలివేలు....ఈనాడు ఇలాంటి ఉన్నతస్థాయిలో ఉంటుందని ఏమాత్రం ఊహించని జానకి తన నోటిదురుసుతనానికి సిగ్గుపడింది.
"క్షమించు అలివేలూ....పొరపాటయింది...." అంటూ గబగబా బయటకి వెళ్ళిపోయింది....
పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధమైన కురుక్షేత్ర రణరంగంలో విజయుడి రథం జెండాపై ”కపి రాజు ”హనుమంతుడు కొలువై ఉన్నాడు. యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్య , అర్జునుని కోరికపై రధాన్ని నిలి పాడు పార్ధసారధి అయిన శ్రీ కృష్ణుడు. కిరీటి రధం దిగి, రెండు వైపులా ఉన్న సైన్యసమూహాన్ని చూశాడు అందరు బంధువులే, కావలసిన వారే. వీళ్ళందర్నీ చంపి, తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు. యుద్ధం చేయటం కంటే భిక్షంఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి. మనసంతా వ్యాకులం అయింది. కర్తవ్యమ్ తోచటం లేడు . శ్రీ కృష్ణ పరమాత్మ నే శరణు కోరి కర్తవ్యం బోధించమని వేడుకొన్నాడు.
ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడైన అర్జునుని మనో భావం గుర్తించిన శ్రీ కృష్ణ భగవాననుడు వెంటనే పద్దెనిమిది అధ్యాయాలభగవద్గీతా సారాన్ని వినిపించి యుద్దోన్ముఖుడిని చేశాడు. భగవానుని గీతను అనుసరించి , విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు .
పార్దునికి , పార్ధ సారధి విని పిస్తున్న భగవద్ గీత నంతటిని అర్జునుని రథపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు .మనసుకు దాన్ని అంతటిని పట్టించుకొన్నాడు .”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తితో నమస్కరించాడు . అప్పుడు గోపాల చక్రవర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హనుమంతా !నేను చెప్పినవిషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు .దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు. నువ్వు విన్న గీతకు ”భాష్యం ”రచించు. దానితో నీ పిశాచ రూపం అంతరిస్తుంది ”అని శాపాన్ని , శాప విమోచనాన్ని తెలియజేశాడు పరమాత్మ
*రామభక్తి*
భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతున్నది. భక్తిలోనిది మొదట శ్రవణం, సంకీర్తనం. రామనామం నిత్య పారాయణం చేసుకునేవానికి సాధు సత్సంగాలు దర్శించుకునేవారికి రామదర్శనం, రామనుగ్రహం కల్గుతుందని రామాయణంలోని సుందరాకాండ తెల్పుతున్నది. పాప పుణ్యాలు మనసులోనికి రాకుండా మనసును దైవమునందే నిల్పిన వానికి రామ మహిమ తెలుస్తుంది. ‘సర్వ ధర్మాన్ పరిత్యజే మమేకం శరణం’ అని గీతలో భగవంతుడు ధృవపరిచినట్లు, రాముడు మన కష్టాలలో తోడు ఉంటానని భగవద్గీతలో తెలియజేస్తాడు. నామ సంకీర్తనం ఒంటరిగా చేసినప్పటికీ సంకీర్తనంలో తన్మయత్వం చెందటమే భక్తికి పరాకాష్ఠ. రామనామంలో ఆయనను దర్శించిన ఆనందబాష్పాలు కంటినుండి ధారాళంగా కారినపుడే అసలైన భక్తి, రామానుగ్రహం కలుగుతుంది. హృదయంలో కరుణారసము, చేతలో పరోపకారము, నోటితో మంచి మాటలు, రామనామ స్మరణ, నిత్యం జరుగుతున్నపుడే రామభక్తి కలుగుతుంది. ఒకనాడు ఒకతను కబీరుదాసు గారి వద్దకు వచ్చి అతని భక్తి చిట్టా చెప్పుకున్నాడు. అయ్యా, నేను ఇన్ని యాత్రలు చేసాను, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని గుళ్లు తిరిగాను, ఇన్ని నదులలో స్నానం చేసినాను, ఇన్నిసార్లు రామనామము చేసినాను అని తెలియజేశాడు. దానికి ఆయన నాయనా, ఇన్ని యాత్రలు, ఇన్ని నదులలో స్నానం చేశానని చెప్పావు. నేను ఒక చేదు దోసకాయ ఒకటి ఇస్తాను. దానిని నీ వెంబడి తీసికెళ్లి నీతోపాటు స్నానం చేయించుకొని తీసుకొని రమ్మని ఒక చేదు దోసకాయ అతనికిచ్చి పంపాడు. అతడు అలాగే అతనితోపాటు యాత్రలు తిప్పుకుంటూ అతనితోపాటు స్నానం చేయించుకొని వచ్చి కబీర్దాసుకు ఇచ్చాడు. అపుడు ఆ దోసకాయను ముక్కలు చేసి తినమని చెప్పాడు. ఎలా ఉందంటే, చేదుగా ఉందన్నాడు. చూశావా, ఇన్ని నదులలో తిరిగినా దాని చేదుతనము పోలేదు. మనలో అహంకారం ఉన్నంతవరకు ఎన్ని తీర్థయాత్రలు చేసినా అది వ్యర్థమే అవుతుందని చెప్పాడు.
కబీరుదాసు రామభక్తుడు. నిత్య రామనామ పారాయణుడు. రామభక్తులన్నా, సాధువులన్నా సత్పురుషులన్నా, సత్సంగాలన్నా ఎంతో ప్రీతి. కబీరుదాసు కడు పేదవాడు. అతని ఇల్లాలు కూడా మహాసాధ్వి. అతను ఏమి చెప్పినా కాదనదు. అతనికి తగ్గ ఇల్లాలు. వచ్చినవారికి కాదనక భోజనము పెట్టి పంపిస్తుంది. అతడు మాత్రం ఇంటిలో ఏమున్నది, ఏది లేదు అన్నది పట్టించుకపోయేవాడు. ఆ ఇల్లాలు కూడా ఇది లేదు, అది లేదు అని అతనితో ఎన్నడూ చెప్పకపోయేది.
ఒకనాడు కబీరింటికి రామభక్తులు వచ్చారు. కబీరు వారిని ఆతిథ్యము తీసుకోమని బలవంతం చేశాడు. దానికి వారు అంగీకరించారు. తనభార్యను పిలిచి వారికి భోజనసదుపాయం చేయమని చెప్పివారితో కలసి రామనామసంకీర్తనలో మునిగిపోయాడు. కాని ఆ ఇల్లాలు ఇంటిలో సరుకులు నిండిఉన్నాయ కదా ఎలా భోజన సదుపాయం చేయవలెనా అని ఆలోచించి దగ్గరగా ఉన్న షావుకారు దగ్గరకువెళ్లి విషయం చెప్పి సాయం చేయమని కోరింది. ఆ షావుకారు కోరరాని కోర్కెతీరిస్తే వెచ్చాలు ఇస్తానని అన్నాడు. రాత్రికి వాని కోరిక తీరుస్తానని చెప్పి ఆమె వెచ్చాలు తీసుకొని వచ్చి వంటపూర్తిచేసి రామభక్తులకు భోజనసదుపాయం చేసింది.
వారుకబీరుదంపదులను దీవించి వెళ్లారు. చివరకు షావుకారు సంగతి కబీరుతో చెప్తూ కంటనీరు నింపుకుంది. కబీరు అయ్యో దీనికి చింతించవలదు. రామభక్తులకు చేసిన సేవ ఎంతో పుణ్యాన్నిస్తుంది. ఆరాముడే అన్నీ చూసుకొంటాడు. పద షావుకారు నీకోసం చూస్తుంటాడు. నేను నీకు తోడువస్తాను అన్నీఆమెను తీసుకొని వెళ్లాడు. ఆసంగతి తెలుసుకొన్న షావుకారు వారిద్దరిని పిలిచిఅతిథి మర్యాద చేసి వారికాళ్లు కడిగి క్షమించమని కోరాడు. షావుకారుకు వారిలో సీతారాములు కన్పించారు. అంతటి మహానుభావుడు కబీరు.
పాపులనుఉద్ధరించడానికి ఇలాంటి కర్మయోగులు జన్మిస్తారు. రామభక్తులంటే శ్రీరామచంద్ర స్వరూపులే.
🙏🙏🙏🙏
*జ్ఞాన జ్యోతి*
*బుద్ధుడు జీవించి ఉన్నకాలంలో, శ్రావస్తీ నగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను ‘సుఖవతి’ అని పిలిచేవాళ్ళు.*
*ఒకనాడు సుఖవతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన బుద్ధుడు త్వరలోనే శ్రావస్తికి రానున్నాడు" అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు; ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. బుద్ధుడి గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'బుద్ధుడు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.*
*తర్వాతి రోజుల్లోఆమె బుద్ధుడి గురించి అనేక విషయాలు విన్నది- "రాజకుమారులనుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవోబహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు శ్రద్ధ తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.*
*సుఖవతి తనకు తెలియకుండానే బుద్ధుడి రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది. అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది. *
*కొన్ని రోజుల తర్వాత బుద్ధుడు వచ్చాడు. సుఖవతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. బుద్ధుడి వెంట అనేకమంది భిక్షువులు- అందరూ చకచకా నడచుకొంటూ సుఖవతిని దాటుకొని పోయారు. బుద్ధుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది సుఖవతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.*
*తెలివి వచ్చి చూసుకునేసరికి సుఖవతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. బుద్ధుడిని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.*
*ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీబుద్ధునికి-అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!*
*వాటిని చూసేసరికి సుఖవతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది?' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.*
*ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు. సుఖవతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.*
*'బుద్ధుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. సుఖవతి దాన్నిపట్టుకొని పోయి, బుద్ధుడు బస చేసిన ఆరామానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.*
*దానిముందు మోకరిల్లి, "బుద్ధుడా! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.*
*ఆరోజు రాత్రి ఆరామంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ అడుక్కుతినే ఆమె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.*
*తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన 'మౌద్గలాయనుడు' అనే శిష్యుడు దాన్ని చూసి "దీపంలోఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు.*
*అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన బుద్ధుడు నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. సుఖవతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు; అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల బుద్ధుడు అవుతుంది" అన్నాడు.*
*మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!*.
,,,,
*తృప్తిని మించిన సంపద లేదు*!
"మనిషికి కోరికలు ఆనంతం. జీవితం నీటి బుడగ వంటిదని తెలిసి కలకాలం" బతకాలనుకొంటాడు. నిరంతరం సుఖాల్లో తేలియాడాలని తపిస్తాడు. తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు. భగవంతుడి దయ ఉంటే తన కోరికలు తీరతాయన్న స్వార్ధంతో పూజిస్తాడు. భగవంతుడు దయామయుడు. అందరి ప్రార్ధనలు వింటాడు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. నిస్వార్ధంగా భగవంతుని నమ్ముకున్నవారికి ఆడగకపోయినా అనుగ్రహిస్తాడు.
కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు. రావణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తికాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు. అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ. మానవులు తనకు గడ్డిపరకల వంటివారని, కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు. అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇచ్చాడు
కుంభకర్ణుడు గ్రీష్మ రుతువులో ఆగ్ని మధ్య నిలబడి, వర్షరుతువులో వానలో తడుస్తూ, శిశిరరుతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు. అడ్డుపడతారు. సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే- నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిదుర కావాలంటాడు కుంభకర్ణుడు. తథాస్తు అంటాడు కమలాసనుడు. విభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవత్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండే సర్వకాల సర్వావస్థల్లో
తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు. ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు. లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు. కోరకుండానే చిరంజీవి కాగలిగాడు. విభీషణుడు. కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు.
'భగవంతుడి శరణు వేడుతున్నవారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి. తమ ఇచ్చానుసారం ఈశ్వరుణ్ని జరిపించమని కోరడమంటే ఆయనను శాసించినట్లవుతుంది. ఆయనను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు' తృప్తిని మించిన సంపద లేదు. అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని
ఆవేదన చెందేవారికి జీవితమంతా ముళ్లబాటే. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించేవారికి ఆనందం
వెన్నంటే ఉంటుంది.
No comments:
Post a Comment