*🧘♂️నాడీ విజ్ఞానం🧘♀️*
*శరీరంలో గల సూక్ష్మనాడులు:-*
*మానవ శరీరంలో కోట్లాది నాడులలో, 72000 నాడులు ముఖ్యమైనవి. ఇవి కాకుండా మరి కొన్ని సూక్ష్మమైన నాడులు.*
*నాడి అనగా ప్రవాహమని అర్థం. ఏ ప్రవాహము? చైతన్య ప్రవాహము. శక్తి ప్రవాహము. నాడులనేవి, కేవలం శరీరంలో ఉండే మాంసమైన నాడులు కావు. అవి చైతన్యాన్ని, శరీరమంతా ప్రవహింజేసే శక్తి వాహినులు. ప్రాణ శక్తి, మనో శక్తి ఈ నాడీ వాహినుల ద్వారానే ప్రవహిస్తాయి. కొన్ని నాడులు మనోశక్తిని ప్రవహింపజేసే నాడులైతే, మరికొన్ని ప్రాణ శక్తిని, వైశ్విక చైతన్యాన్ని కూడా ప్రవహింపజేసే నాడులు.*
*1. గాంధారి నాడి :- ఎడమ కన్ను యొక్క ఒక మూల నుండి, ఉదర ప్రాంతం వైపు ప్రవహిస్తూ, ఎడమ కాలి బొటన వ్రేలి వద్ద అంతమౌతుంది. ఈ నాడి, ఇడా నాడికి వెనుక వైపున ఉంటూ...కొన్ని పనులు చేస్తోంది. ఈ గాంధారీ నాడి, శరీరం యొక్క క్రింది భాగాల నుండి... మనో శక్తిని...ఆజ్ఞా చక్రం వైపు తీసుకు వెళుతుంది. దీనియొక్క పరి పూరక నాడి "హస్తి జిహ్వ " నాడి.*
*2. హస్తి జిహ్వ నాడి :- ఈ నాడి ఏనుగు నాలుక లాంటి స్వభావము గల నాడి. ఈ నాడి కుడి కన్ను యొక్క ఒక మూల నుండి ప్రారంభమై...నాభి ప్రాంతం వరకు ప్రవహిస్తూ, కుడి పాదము యొక్క బొటన వ్రేలి వద్ద అంతమౌతుంది. ఈ హస్తి జిహ్వ నాడి, శరీరము యొక్క క్రింది ప్రాంతాల నుండి మనో శక్తిని ఆజ్ఞా చక్రం వైపు తీసుకుని వెళ్తుంది. దీని యొక్క పరి పూరక నాడి గాంధారి నాడి. అంటే గాంధారి నాడి, హస్తి జిహ్వ నాడి ఒక దానికొకటి పరి పూరకాలు.*
*3. యశస్విని నాడి :- యశస్విని నాడి అనే ఈ అద్భుతమైన నాడి....కుడి పాదం యొక్క బొటన వ్రేలు నుండి ప్రారంభమై...ఎడమ చెవి వద్ద అంతం అవుతుంది. ఈ యశస్విని నాడి యొక్క పరి పూరక నాడి "పూషా నాడి".*
*4. పూషా నాడి :- ఈ పూషా నాడి పోష కర్త నాడి. ఈ నాడి పోషణ చేస్తుంది. ఈ నాడి ఎడమ కాలి బొటన వ్రేలు నుండి, నాభి వరకు వ్యాపిస్తూ...కుడి చెవి వద్ద అంతం అవుతుంది. దీని పరిపూరక నాడి "యశస్విని నాడి".*
*5. అలంబుస నాడి :- ఈ నాడి శక్తివంతమైన నాడి. ఈ నాడి మార్మికంగా ఉంటుంది. మనిషి యొక్క ముడ్డి ప్రాంతంలో ప్రారంభమై ...నాభి ద్వారా వెళుతూ...నోటి కుహరం వద్ద అంతం అవుతుంది.*
*6. కుహు నాడి :- ఈ నాడి పున్నమి చంద్రుడు ఎంత శక్తివంతమైన వాడో...ఈ నాడి అంత శక్తి వంతమైనది. ఈ నాడి గొంతు వద్ద ప్రారంభమై...జననేంద్రియాల ప్రాంతంలో...అంతమౌతుంది. తంత్ర సాధనల్లో, ఉన్నతమైన లైంగిక శక్తి, బిందువు (శుక్రము)...ఈ జననేంద్రియ ప్రాంతం నుండి ఉత్పత్తి జరిగి, సోమ చక్రము వైపు ప్రవహిస్తుంది. అలా జరగడం వలన ఒక యోగి "ఊర్థ్వ రేతస్కుడు" అవుతున్నాడు. అంటే...లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తున్నాడన్నమాట. అందుకే బ్రహ్మచర్య పాలన శ్రేయస్కరం అంటారు, యోగి జనులు. ఈ నాడి మల దోషాలను కూడా నియంత్రణ చేస్తుంది.*
*7. శంఖిణి నాడి :- ఈ నాడి గొంతులో ప్రారంభమై...పురీషము యొక్క ప్రాంతంలో అంతం అవుతుంది. దీని శక్తి సరస్వతీ నాడి - గాంధారి నాడుల మధ్య ప్రవహిస్తుంది. అశ్వనీ ముద్రల సతత అభ్యాసం ద్వారా ఈ నాడిని చైతన్య వంతం చేయవచ్చును. ఈ నాడి, మనం తినే ఆహార సారాన్ని ప్రవహింపజేస్తుంది కూడా.....*
*8. సరస్వతి నాడి :- సరస్వతి నాడి, మానవుడి నాలుకలో ఉంటుంది. ఎవరైననూ... చక్కగా భాషించేవారికి, మంచి పాండిత్యం గలవారికి ఈ సరస్వతి నాడి చైతన్యవంతంగా ఉంటుంది.*
*9. పయస్విని నాడి :- ఈ పయస్విని నాడి, పూషా మరియూ సరస్వతి నాడులకు కుడి వైపున ప్రవహిస్తుంది. ఒకరకమైన యోగ మార్గంలో ఉన్న యోగులు, తమ చెవులకు పెద్దవైన చెవి పోగులు ధరించడం ద్వారా...ఈ పయస్విని నాడిని చైతన్యవంతం చేస్తారు.*
*10. విశ్వోదరి నాడి :- ఈ విశ్వోదరి నాడి నాభి ప్రాంతంలో వసిస్తూ ఉండి, కుహూ నాడి - హస్తి జిహ్వ నాడుల మధ్య ప్రవహిస్తుంది. ఇది అడ్రినల్ గ్రంథులతో సంబంధం కలిగియుంటుంది.*
*11. కౌశికి నాడి :- ఈ నాడి రెండు పాదాల బొటన వ్రేళ్ళ వద్ద అంతం అవుతుంది.*
*12. విశ్వోదరి నాడి :- ఈ విశ్వోదరి నాడి నాభి ప్రాంతంలో వసిస్తూ ఉండి, కుహూ నాడి - హస్తి జిహ్వ నాడుల మధ్య ప్రవహిస్తుంది. ఇది అడ్రినల గ్రంథులతో సంబంధం కలిగియుంటుంది.*
*13. కూర్మ నాడి :- ఈ నాడి శరీరానికి, మనస్సుకి మధ్య సమన్వయం చేస్తూ...ఆయా సంబంధాలను స్థిరీకరిస్తుంది.*
*14. రాకా నాడి :- ఈ నాడి ఆకలిని, దాహాన్ని కలిగిస్తూ, శ్లేష్మాన్ని గ్రహిస్తుంది.*
*15. సురా నాడి :- ఈ నాడి రెండు కను బొమల మధ్య ఉంటుంది.*
*16. వారుణి నాడి :- ఈ వారుణీ నాడి కటి ప్రాంతం యొక్క క్రింది భాగంలో, కుహు నాడితో కలసి...ఈ ప్రాంతపు మల దోషాలను శుభ్రం చేస్తుంది. ఈ నాడి శరీరమంతా ప్రవహిస్తుంది. ఈ నాడి మూత్ర విసర్జనకు సహాయ పడుతుంది. ఇది ముడ్డి ప్రాంతంలో అంతం అవుతుంది. బస్తి మొదలగు క్రియల ద్వారా ఈ నాడి చైతన్యవంతం అవుతుంది. ఈ నాడి యశస్విని - కుహు నాడుల మధ్య ఉంటుంది.*
🕉️🌞🌏🌙🌟🚩
*ఎక్కడ ప్రశాంతత?*
'మానవ జీవితం పుట్టుక మొదలుకొని మరణం వరకు నిత్య సంగ్రామంగానే సాగుతుంది. పుట్టిన వెంటనే పసిగుడ్డుకు సైతం ఆకలి బాధ తప్పదు. శైశవదశ దాటే సమయంలో చాలారిష్టాల రూపంలో అనారోగ్యాల కష్టాలు చుట్టుముడతాయి. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సమస్యలు ముసురుతాయి. కష్టాల కడలిని దాటేలోగానే వృద్ధాప్యం ముంచుకొస్తుంది. ఆ తరువాత దైహిక, మానసిక బాధలు వర్ణనాతీతం. ఏ సమస్యా మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. ఒకదాని తరువాత మరొకటిగా కడలి కెరటాల్లా సమస్యలు విరుచుకొని పడుతుంటాయి. వేదాంతులు మానవ సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. కష్టాలను కెరటాలతో సమానంగా భావిస్తారు. సమస్యలు లేని మనిషి ఈ భూ ప్రపంచంలో లేడనేది పరమసత్యం,
మనిషి చీకటిని చీల్చుకొని వెలుగుకోసం వెదికినట్లు ఆశాంతిలో నుంచే ప్రశాంతతను రాబట్టుకోవాలి. కష్టాలు నిప్పు కణికల్లాంటివి. వాటిలోంచే చల్లదనాన్ని పొందడానికి ప్రయ తించాలి. వేసవికాలంలో సూర్యుడి కారణంగా లోకమంతా తపించిపోతుంది. వేసవి ముగిసిన తరువాత చల్లని జల్లులు కురిసే వర్షాకాలం వస్తుంది. వేసవికి కారణమైన సూర్యుడే వర్షానికి కారణభూతుడు. సూర్యుడి వేడిమితో సముద్రజలాలు వేడెక్కి, ఆవిరి పైకి ఎగసిన తరువాతే కదా ఆకాశంలో మేఘాలు ఉత్పన్నమై వర్షాలు కురుస్తాయి. కనుక సమస్యలోనే సమాధానం కూడా ఉంటుందనేది. ప్రకృతి చెప్పే ఉపదేశం!
మనిషి తనకు తానుగా ఆందోళనలను సృష్టించుకొంటూ అశాంతికి గురవుతుంటాడు. గంధర్వ నగరాలను సృష్టించుకొని పగటికలలు కంటాడు. అందని ద్రాక్షపండ్ల కోసం అర్రులు చాస్తుంటాడు. ఏవో ఊహించుకొని గాలిలో తేలిపోతూ, గాలిమేడలు కడతాడు. వీటివల్లనే మానసిక ప్రశాంతతకు దూరమై అల్లాడుతుంటాడు. తన ఉనికిని మరచిపోతే మనిషికి అశాంతి గాక మరేమి లభిస్తుంది.
ప్రకృతి మనిషికి అన్ని వనరులనూ పుష్కలంగా అందించింది. వాటిని రక్షించుకోలేని అసమర్థుడిగా మనిషి మిగిలిపోకూడదు. పంచభూతాలు మనిషి ప్రశాంత జీవనానికి ఆధారాలు, వాటిని కలుషితం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక చెత్తకుండీలా మార్చివేస్తున్నాడు మనిషి చెట్లను విచక్షణారహితంగా నరికివేసిన పాపం, కాలుష్యపు ఉద్గారాలతో ప్రాణవాయువును విషపూరితం చేసిన శాపం మనిషికి మరణశాసనమై ప్రపంచాన్ని వీడిస్తోంది. ధ్వనికాలుష్యం గుండెలను చిద్రం చేస్తుంటే మనిషి ఆరోగ్యం మంటగలిసిపోతోంది. లక్షల ఏళ్లనాటి హిమ ఖండాలు కరిగిపోతూ, జలప్రళయాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయంటే పుడమిని వేడెక్కించిన మనిషి తప్పిదాల తీవ్రత స్పష్టమవుతుంది. మనిషి తన కుటుంబ జీవనంలోనూ ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాడు. పెద్దలపై గౌరవం లేకపోవడం, వ్యక్తుల మధ్య ఆత్మీయతలు దూరం కావడం, పరస్పర స్నేహ సహకార భావాలకు తిలోదకాలివ్వడం... మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. మానవతా బంధాలను
బందిఖానాలోకి నెట్టేస్తున్నాడు. సమైక్యజీవనం, సమభావం కొరవడుతున్నాయి. అన్నింటినీ పోగొట్టుకొనే మనిషికి ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది। తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనలోనే నిక్షిప్తమై ఉన్న ప్రసన్నతను, ప్రశాంతతను శోధించి, పట్టుకోవాలి.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
రెండు డైరీలు - భార్య...భర్త...07-12-2023
తమ వివాహ వార్షికోత్సవ సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట. నిజానికి వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.
వారి సంభాషణలో.......భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను. ఈ సంవత్సరం మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న వాటిని వీటిలో రాద్దాం.
వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని సరిదిద్దుకోడానికి కలిసి ప్రయత్నిద్దాం,” ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు.
ఇద్దరూ తమ తమ డైరీలు తీసుకున్నారు.
ఒక సంవత్సరం వేగంగా గడిచిపోయింది. మరుసటి సంవత్సరం వివాహవార్షికోత్సవం సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ ముందుగా నిర్ణయించుకున్న విధంగా తమ డైరీలను మార్చుకున్నారు.
మొదట.......భార్య తనను ఉద్దేశించి వ్రాసిన డైరీని భర్త చదవడం ప్రారంభించాడు.
మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం. మీరు నాకు మంచి బహుమతి ఇవ్వలేదు" అని,
రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్ కి తీసుకెళ్లలేదు."
మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."
" నా తరఫు బంధువులు వచ్చారు కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."
"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"
ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.
భర్త, “ఓ ప్రియా, నన్ను క్షమించు! ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు. భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.
ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు...........
మొదటి పేజీ - ఖాళీ
రెండవ పేజీ - ఖాళీ
మూడవ పేజీ - ఖాళీ
... ఖాళీ
భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!
భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు. నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.
భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు.
భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది.
అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.
అలాగని నీలో ఏమి లేవని కాదు. కానీ నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.
నాలో లెక్కలేనన్ని క్షమించరాని తప్పులు ఉన్నప్పటికీ, నా జీవితంలోని ప్రతి దశలో నాకు నీడలా ఉన్నావు. ఆ నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.
అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది.. మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!
వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది. మనం ప్రయాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 🙏🙏🙏🙏
🌼🌼
No comments:
Post a Comment