[
తాతయ్య సందేశం (కథ )
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
ఆరవ తరగతి చదివే రవికి బద్ధకం ఎక్కువ. బడి నుండి రాగానే పుస్తకాలు పడేసి, బూట్లు తియ్యకుండానే మంచం మీద చతికిలబడతాడు. కొన్నిసార్లు కుర్చీలో కూర్చుని అమ్మ మొబైలులో ఆటలాడతాడు. తరువాత పక్షులు, చెట్లు, జంతువుల గురించి చూపించే కార్యక్రమాలను చూస్తాడు.
టిఫిన్ తినేసి హోమ్ వర్క్ చెయ్యమని అమ్మ చెప్పినా వినిపించుకోడు. చాలాసార్లు వాళ్ళ నాన్న కూడా చెప్పాడు.
అలాగేనంటాడు కానీ బద్ధకం వదలడు రవి.
బడికి వెళ్ళేటప్పుడైతే పుస్తకాల సంచి కనబడలేదని, సాక్స్ దొరకలేదని పెద్దాళ్ల మీద చిరాకు పడతాడు. హోమ్ వర్క్ చెయ్యని రోజైతే బడికి ఎగనామం పెడతానంటాడు కానీ బ్రతిమలాడితే కానీ హోంవర్క్ చెయ్యడు.
ఒకసారి వూరు నుండి సత్యం తాతయ్య వచ్చాడు. మూడోరోజుకే రవికి ఉన్న బద్ధకంతో బాటు టీవీల్లో వచ్చే జంతువుల కార్యక్రమాలను అదేపనిగా చూస్తాడని తాతయ్య తెలుసుకున్నాడు. వాడిని దారిలోకి తేవాలని అనుకున్నాడు.
ఆదివారం రోజు ఉదయం రవిని తీసుకుని పార్కుకి వెళ్లాడు తాతయ్య. వాడికి ఇష్టమైన ఐస్ క్రీమ్, పల్లీలు కొనిచ్చాడు తాతయ్య. అవన్నీ తిన్న తరువాత ఆటలాడి తిరిగొచ్చాడు రవి. వాడిని నెమ్మదిగా మాటల్లోకి దించాడు తాతయ్య.
“ జంతువులకి బద్ధకం ఉండదన్న సంగతి నీకు తెలుసా?“ అనడిగాడు తాతయ్య. ‘ అవునా’ అని ఆశ్చర్యపోయాడు రవి. నిజమేనని తాతయ్య చెప్పగానే ‘ఎందువలన’ అన్నాడు రవి.
“జంతువుల కార్యక్రమాలు టీవీలో చూస్తావు కదా. నీకు తెలియదా? వాటికి కొంత వయసు వచ్చాక కావలసిన ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. అజాగ్రత్తగా ఉన్నా , బద్ధకంగా మెలిగినా ఇంకో జంతువుకి ఆహారమైపోవాలి. అందుకే బద్ధకంగా ఉండవు“ అన్నాడు తాతయ్య.
‘నిజమా తాతయ్యా?’ అని రవి ఆశ్చర్యపోతుంటే “నిజమేరా. పుట్టింది మొదలు పరుగులు నేర్చుకుని పరుగెత్తుతూనే ఉంటుంది జింక. లేకపోతే పులి, సింహం వంటి జంతువులకు దొరికిపోయి చస్తుంది. పులి కూడా బద్ధకముగా ఉండదు. అది వేగంగా పరిగెత్తినప్పుడే జంతువులు దొరికి దాని ఆకలి తీరుతుంది. అలాగే మిగతా జంతువులూ, పక్షులు చలాకీగా ఉంటాయి” అని చెప్పాడు తాతయ్య.
“ ఇంకా చెప్పు తాతయ్యా’ అని రవి అడగ్గానే “వాటి ఆహారం మనుషులకి అందినట్టుగా కాళ్ల దగ్గరకు రాదు. కష్టపడి సంపాదించాల్సిందే. అవేకాదు మొక్కలు కూడా నిత్యం చలాకీగా ఉంటాయి”అన్నాడు తాతయ్య.
“అదెలా తాతయ్యా’ అని రవి అడగ్గానే “ మామిడి టెంక గట్టిదనం తెలుసుగా. దాన్ని చీల్చుకుని మొలక బయటపడి మొక్కగా మారుతుంది. చెట్టుగా ఎదిగేవరకు వేళ్ళను భూమిలోకి బలంగా నాటుతుంది. వేళ్ళు ద్వారా నీటిని పీల్చుకుని , సూర్యుడి వేడి గ్రహించి ఆకుల ద్వారా తగిన శక్తిని పొందుతుంది. అందుకే ఎప్పుడూ చలాకీగా ఉండాలి మొక్క. తరువాత కూడా తియ్యటి పండ్లని, కలపని, కాయల్ని మనుషులకు అందిస్తూనే ఉంటాయి చెట్లు”అన్నాడు తాతయ్య.
“మొక్కలు మాత్రమేనా?లేక జంతువులు కూడా పుట్టుకతోనే పోరాటం చేస్తుంటాయా?’ అనడిగాడు రవి.
“అవి కూడా చేస్తాయి. ముక్కుతో గుడ్డుని పగలకొట్టుకుని బయటకు వస్తుంది కోడిపిల్ల. తల్లి కడుపులో నుండి తల బయటపడగానే కోతిపిల్ల తన చేతుల్తో అమ్మకి సాయపడుతూ పుడుతుంది. ఆరడుగుల ఎత్తు నుండి తల క్రిందులుగా భూమ్మీద పడే జిరాఫీ పిల్ల వెంటనే లేచి నడవగలగాలి. లేకపోతే తల్లి జిరాఫీ దాన్ని కాళ్లతో తన్ని నిలబెడుతుంది. జంతువులన్నీ పుట్టుకతోనే సొంతంగా బ్రతకడం అలవాటు చేసుకుంటాయి“ అన్నాడు తాతయ్య.
“నువ్వు చెప్పింది వింటే ఆశ్చర్యంగా ఉంది తాతయ్య” అన్నాడు రవి.
“అందుకే .. మనుషులుమైన మనం బద్ధకంగా ఉండకూడదు. జంతువులకన్నా ఆలోచనలో, తెలివిలో ఎంతో గొప్పవాళ్ళమైన మనం, సరికొత్తగా ఆలోచిస్తూ ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటూ, జీవితాన్ని అందంగా తీర్చి దిద్దుకోవాలి. బద్ధకానికి అలవాటు పడితే ఏమీ సాధించలేము. అందుకే ఎప్పటిపని అప్పుడే చేసేస్తూ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నించాలి” కొనసాగించాడు తాతయ్య.
“తాతయ్యా. నాకిప్పుడో విషయం అర్ధమైంది. నేను బద్ధకంతో అమ్మానాన్నల మీద ఆధారపడుతుంటాను. ఇకనుండి అన్ని పనులు సొంతంగా చేస్తాను. క్రమశిక్షణతో మెలుగుతాను” అన్నాడు రవి.
ఈ మాటలు విని సత్యం తాతయ్య ఎంతగానో సంతోషించాడు.
____*****_____
[
🌹🌹 *శ్రీ పంచమి* 🌹🌹
*మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు*
*జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి*.
*యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు*.
*యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి*.
*శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:*
*మాఘ శుక్ల పంచమ్యాం*
*విద్యారంభే దినేపి చ*
*పూర్వేహ్ని సమయం కృత్యా*
*తత్రాహ్న సంయుతః రుచిః ॥*
*వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి*.
*చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం*.
*పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా గోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది*.
*సరస్వతీ కటాక్షం:*
*బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు*.
*గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు*.
*సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు*.
*వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి*.
*అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి*.
*తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు*.
[
వీటిని అవమానిస్తే చావుకు దగ్గరైనట్లే!
అష్టాదశ పురాణాల్లో ఒకటి భాగవత పురాణం. దీన్ని శ్రీమద్భాగవత మహా పురాణం అంటారు. అలాగే భాగవతం అని కూడా పిలుస్తారు.
హిందువులకు ఇది గొప్ప గ్రంథం. మొదట సంస్కృతంలో రచించిన ఈ గ్రంథం ప్రస్తుతం అన్ని భారతీయ భాషల్లోనూ లభ్యమవుతుంది. కృష్ణ తత్వాన్ని గురించి భాగవతం తెలియజేస్తుంది. ఆది శంకరుల అద్వైత్వం దీనిలో మిళితమై ఉంది. ఇతర పురాణాల్లో కంటే భాగవత పురాణంలో వంశవృక్షం, పురాణాలు, భూగోళ శాస్త్రం, విశ్వోద్భవ శాస్త్రం, నృత్యం, సంగీతం, యోగా, సంస్కృతి లాంటి అనేక విషయాలను విస్తృతం గా చర్చించారు. రాక్షసుల అలజడులు, దేవాసుర యుద్ధాలు, విశ్వాన్ని నాశనం చేయడానికి అసురుల ప్రయత్నాలను శ్రీహరి ఎలా అడ్డుకున్నారో పేర్కొన్నారు. వారి నుంచి లోకాన్ని రక్షించి శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పాడు.
విష్ణువును ఆరాధించేవారిని వైష్ణువులుగా పేర్కొంటారు. శ్రీమహా విష్ణువును ఆరాధించేవారికి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని కృష్ణుడు ఎందుకు రక్షించాడు, భాగవత పురాణం అంతర్గత స్వభావాన్ని బట్టి, వేదాలను బట్టి తెలుసుకోవచ్చు. జ్ఞానం, ధర్మానికి మూలమైన భాగవతం హిందూ గ్రంథాల్లో చాలా ముఖ్యమైంది.
భాగవతం ద్వారా కృష్ణుడు అత్యంత ముఖ్యమైన జీవిత పాఠాల గురించి వెల్లడించాడు. ఆనాడు బోధించిన నైతిక పాఠాలు నేటి సమాజానికి చాలా ఉపయోగ పడుతున్నాయి. జీవితంలో ముఖ్యమైన వాటిని బాధపెడితే అవి దు:ఖానికి హేతువని ఆ భగవానుడు వివరించాడు. ఈ ఐదుగురు వ్యక్తులను అవమానించినా, బాధపెట్టినా తీవ్రమైన ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపాడు.
1. ఆవు చాలా పవిత్రమైన జంతువు. అలాగే హిందూ మతంలో అత్యంత గౌరవమైంది కూడా. ఆవును గౌరవించని వ్యక్తులకు త్వరగా మరణం సంభవిస్తుందట.
దీనికి బలాసురుడనే రాక్షసుడు ఉదంతమే ఉదాహరణ. దేవతలకు చెందిన గోవులను హింసించిన బలూసురుని శ్రీహరి సంహరించాడు. 2.ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరుల నమ్మకాలను కించపరిచేవాళ్లు, దైవ దూషణకు పాల్పడేవాళ్లు ఎటువంటి నేరం చేయకపోయినా తీవ్రమైన శిక్షను అనుభవిస్తారట. అహంకారంతో రాముని అవమానించిన, బెదరించిన రావణాసురుడి పరిస్థితి చివరకు ఏం జరిగిందో తెలుసుకదా.
3. విజ్ఞానానికి మూలమైన వేదాల ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుంది. అహంకారంతో వీటిని అవమానిస్తే చావు కొని తెచ్చుకున్నట్లే. రాక్షసులు ఇలాగే వేదాలను అగౌరవపరచి, వాటిని బ్రహ్మ దగ్గర నుంచి తస్కరించినప్పుడు నారాయణుడు మత్స్యావతారంలో వాటిని కాపాడాడు.
వీటిని చదవడం అలవాటు చేసుకుంటే జీవితం ఆనందంగా, విజయవంతంగా సాగుతుంది. 4.ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు అధర్మం వెంట నడిచి చావును కోరి తెచ్చుకున్నాడు.
ధుర్యోదనుడు చెప్పుచేతుల్లో ఉంటూ పాండవులను శత్రువులుగా చూసిన ఈ బ్రాహ్మణోత్తముడు చివరకు దిక్కులేని చావు చచ్చాడు. 5. రుషులు, విద్వాంసులు, పండితులను అవమానించిరాదు.
దురాశ, అహంకారంతో దుర్యోధనుడు గురువుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాదు, గురుదక్షిణ కూడా చెల్లించలేదు. అలాగే తన విజయం కోసం గురువుతోనూ యుద్ధం చేయించాడు కూడా. రుషులను కూడా అవమానించాడు కూడా. హస్తినాపురకు వచ్చిన ఓ రుషి ధుర్యోధనుడికి ధర్మం గురించి బోధిస్తాడు. పాండవులతో వైరం వదిలిపెట్టాలని, దీని వల్ల శాంతి, స్నేహం చేకూరతాయంటూ సలహా ఇస్తాడు. దీనికి వికటట్టహాసం చేసి అతడిని అవమానిస్తాడు. చివరకు దుర్యోధనుడి దుస్థితి ఏమైందో తెలిసిందే కదా.
[
శ్రీకృష్ణుని చక్రాయుధాన్ని కోరిన
అశ్వత్థామ
*ద్రౌపది దుఃఖాన్ని మాన్పడానికి ధర్మరాజు ఆమెతో ఇట్లన్నాడు. .....*
“ద్రుపదరాజపుత్రీ! రాచబిడ్డలు యుద్ధంలో మరణించడం సమంజసమే కదా! నీసోదరులూ, సుతులూ మహా పుణ్యాత్ములకు తగిన సద్గతులు పొందారు. ఇక నీవు దుఃఖంతో బాధ పడటం దేనికి? మంచి మనసున్న నీవు శోకం మాని శాంతించడం మంచిది. అశ్వత్థామను చంపితే గానీ నీ కోపం తగ్గదని నాకూ తెలుసు! నిజానికి నా అభిప్రాయం కూడా అదే. అయితే వాడు అడవులు పట్టి పోయి ఉంటాడు. అడవులు గాలించియైనా ఏదో విధంగా వాడిని పట్టి వధిస్తాము, అయితే అతణ్ణి చంపినట్లు నీకెలా తెలుస్తుంది. నీవు నమ్మడమెలా?”
అనగా ద్రౌపది “నాథా! ఆ దుష్టుడికి పుట్టుకతోనే శిరమున మణి వుంది. దాని తెచ్చి ఇస్తే చూసి ప్రాణాలతో వుంటాను” అని పలికి వాయుపుత్రుడిని తన చేతితో స్పృశించి ...
"భీమసేనా! మనసులో క్షత్రియోచిత ధర్మాన్ని పాటించి వెంటనే వెళ్లి దుష్టుడైన ఆ అశ్వత్థామను చంపి నాలో కలిగిన కోప, తాప శోకావేశాలను మాన్పి నన్ను రక్షించు. లక్క ఇల్లు కాలేటప్పుడు చూపిన పౌరుషాన్నీ, హిడింబాసురుడిని చంపినప్పుడు చూపిన కాఠిన్యాన్నీ, యక్షులు ఆక్రమించినప్పుడు చూపిన భయంకర భుజబల పరాక్రమాన్నీ, కీచకుడిని సంహరించినప్పుడు చూపిన పరాక్రమోద్ధతినీ ప్రదర్శించి నిన్నుజనులు ప్రశంసించు రీతిన వెళ్లి ఆ నీచుడిని అశ్వత్థామను సంహరించు’ అని ద్రౌపది చెప్పగా భీముని కోపం ఉద్ధృతి కాగా ద్రౌపదితో ధర్మరాజు (నాఅభిప్రాయం కూడా అదే) అన్నమాటలు కూడా అశ్వత్థామను సంహరించుటకు అంగీకారంగా భావించి బంగారు కాంతితో మణులు పొదగబడిన రథాన్ని సిద్ధం చేయించమని నకులుడిని పురమాయించగా అతడుత్సహించి మంచి బలమూ, వేగమూ కల గుర్రాలను రథానికి పూన్చి భీముని మనోవృత్తికి అనుగుణంగా రథాన్నినడుపుటకు తానే సారథయ్యాడు."
"నకులుడు సారథిగా భీముడు ధనుర్బాణాలు, గద, ఇతర ఆయుధాలు సిద్ధం చేసుకొని శిబిరము నుండి అశ్వత్థామాదుల రథాలు వెళ్ళిన జాడలను బట్టి వెళ్ళారు. మార్గాంతరమున కనిపించిన జనాలను చూసి అశ్వత్థామ ఎక్కడున్నాడో చెప్పగలరా? అని అడగగా వారు “అతడు కృపాచార్య, కృతవర్మలతో కలిసి హస్తినాపురం వెళ్లి మధ్యలో గంగానది ఒడ్డుకు వచ్చి ఇద్దరు వీరులు అశ్వత్థామను అక్కడ విడిచి వెళ్ళగా అశ్వత్థామ ఒంటరిగా వ్యాసుని ఆశ్రమానికి వెళ్ళాడు” అని చెప్పారు.
భీముడు నకులుణ్ణి రథాన్ని ఆవైపుగా నడపమన్నాడు. ఇది ఇట్లుండ ..
**********************
శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి “ధర్మరాజా! భీముడు శోకమూ, కోపమూ అధికం కాగా ఆశ్వత్థామను ఎదుర్కొనుటకు వేగంగా వెళ్ళాడు. అతడొక్కడే గురుపుత్రుని మీదికి వెళ్ళితే కార్యహాని జరుగవచ్చు. నీ తమ్ములలో అతడంటే నీకెంతో ఇష్టము కనుక యుద్ధానికి అందరూ వెళ్ళడం మంచిది. ఎందుకనగా సమస్త భూమినంతా భస్మీపటలం చేయగల ‘బ్రహ్మశిరస్సు’ అను పేరుగల దివ్యాస్త్రాన్ని అతని తండ్రి ద్రోణుడు అతనికిచ్చాడు. అట్లే అర్జునుడి మీద గల వాత్సల్యంతో అతనికి కూడా ఆ అస్త్రాన్ని ప్రసాదించాడు. అశ్వత్థామ అర్జునుడి మీద అసూయ గలవాడు. ద్రోణాచార్యుడు ఆ అస్త్రాన్ని పాండవులమీద ప్రయోగించకూడదన్న ఉద్దేశంతో ఈ మహాస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించ కూడదని చెబుతూ ఇట్లన్నాడు….”
"కుమారా! బ్రహ్మశిరమనే ఈ మహాస్త్రాన్ని మానవులమీద ప్రయోగిస్తే కీడు కలుగుతుంది. కనుక ఎన్ని ఆపదలు వచ్చినా వాటిని ఇతర ఉపాయములచేత తొలగించుకొమ్మ”ని చెప్పాడు.
కానీ దురహంకారియైన యితడు తండ్రి మాటను ఆచరించేవాడు కాదు. ధర్మజా! అతనికి ఈశ్వరవర ప్రసాదం వలన చిరంజీవిత్వము ఉందికదా అనీ, అగస్త్యమహర్షిద్వారా తన తండ్రికి, అతని ద్వారా తనకు సంక్రమించిన బ్రహ్మశిరోనామకాస్త్రము తనకున్నది కదా! అనీ, దాని మహిమతో దేవ, మానవ, రాక్షస లోకాలు భస్మీపటలం కాగలవనీ, ధీమాగా ఉంటాడు. మీరు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు నేను యాదవబాలురతో కలిసి వేడుకలలో ఆసక్తుడనై వున్నప్పుడు అతడు నావద్దకు వచ్చి నవ్వుతూ ఇట్లన్నాడు."
“కృష్ణా! మాతండ్రి చేసిన గొప్ప తపః ఫలితంగా అగస్త్యుడు సంతోషించి ‘బ్రహ్మశిరస్సు’ అనే గొప్ప అస్త్రాన్ని ప్రసాదించాడు. మాతండ్రి నామీద కల వాత్సల్యంతో ఆ మహాస్త్రాన్ని నాకు ఇచ్చాడు. అటువంటి మహాస్త్రాన్ని నీకిస్తాను. నీ చక్రాయుధాన్ని నాకు ఇమ్ము’ అని కోరాడు. నేను మరో మాట మాట్లాడకుండా నా ఆయుధాలు ‘సుదర్శనం’ చక్రాన్నీ, ‘శారజ్ఞం’ ధనుస్సును, ‘కౌమోదకీ’ గదను, ‘నందకం’ ఖడ్గాన్నీ చూపించి వీటిలో నీవు ధరించగల, ప్రయోగించగల దానిని ధరించు’ నీవు ప్రతిగా ఏమీ ఇవ్వనక్కరలేదు. స్నేహితుడు కోరిన దానిని ఇస్తూ దానికి ప్రతిగా మరొక దానిని పుచ్చుకోవడం ధర్మంకాదు’ అని సుదర్శన చక్రాన్ని తీసుకోమన్నాను."
"ధర్మరాజా! ఆమాటకు సంతోషించి మందబుద్ధిగల అశ్వత్థామ తన ఎడమ చేతినుపయోగించి చక్రాన్ని ఎత్తబోయాడు. దానితో ఎత్తలేక కుడి చేతినుపయోగించి ప్రయత్నం చేశాడు కానీ సాధ్యం కాలేదు. తరువాత తన రెండు చేతులను పయోగించి కూడా అణుమాత్రమైనా కదల్చలేకపోయాడు. దానితో గురుసుతుడు దిగులొంది యుండగా నేను అతనితో ఇట్లన్నాను."
"అశ్వత్థామా! అధిక నిష్ఠకలిగి బ్రహ్మచర్య వ్రతం పూని రుక్మిణీ దేవితో కూడి హిమవత్పర్వత చరియ మీద పన్నెండేండ్లు ఘోర తపస్సు చేసి ఈ చక్రాయుధాన్ని పొందాను. ఈ చక్రాయుధ మహత్త్వంతో రాక్షసులూ, దేవతలూ, గంధర్వులూ ఇంకా ఇతరప్రాణులు నా భుజబలంతో సాటికారు. అదీ దీని గొప్పదనం."
"గురుపుత్రా ! ఇంతవరకు ఈ చక్రాయుధాన్నిఇమ్మని మా అగ్రజుడు బలరామదేవుడుకానీ, నాకుమారులు ప్రద్యుమ్నుడు, సాంబుడు కానీ, తపోబలంతో శ్వేతాశ్వాలు, కపిధ్వజం పొందినవాడు, ఈశ్వరుడిని జయించి పాశుపతాస్త్రం సంపాదించిన నా చెలికాడు అర్జునుడు కానీ అడుగ లేదు. భరతవంశ గురుడి కుమారుడివి నీవు అడిగావు. ఎవరితో యుద్ధం చేయాలని? అని ప్రశ్నించగా అతడు ‘కృష్ణా! అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందిన ఈ సుదర్శన చక్రాన్ని నాకు ఇస్తే నీపాదపూజ చేసైనా నిన్నుఒప్పించి నీతోనే యుద్ధం చేస్తానన్నాడు’. కానీ చక్రాయుధాన్ని కనీసం ఎత్తనైనా ఎత్తలేక చతికిల బడి చివరకు ఇట్లన్నాడు."
"ఓ కృష్ణా! ఈ సుదర్శన చక్రం నీకే ధరించదగ్గదై ఉండుగాక! ఈ ఆయుధం లేకపోతే నాకు వచ్చే నష్టమేముంది? ఎలాగైనా నీతో యుద్ధం చేస్తానన్నాడు’.
ధర్మరాజా! నేను అతని మాటలకు నవ్వుకొని గురుపుత్రుడనే గౌరవం చేత మంచి గుర్రాలను, మనోహరమైన మణులను, వస్త్రాలనూ, ఆభరణాలను ఇచ్చి పంపగా వెళ్ళాడు."
[
No comments:
Post a Comment