ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ
*ఆచార్య సద్బోధన: సమయములో *. నిస్పృహ *
➖➖➖
ప్రపంచములో మీకు ఎందరో బంధుమిత్రులు, లెక్కలేనన్ని సంపదలు, భూములు ఉండనివ్వండి.. వీటన్నింటి మీద కూడా మీరు భగవంతుడికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇహలోక సంపదలు అన్నీ బంధాలను కలిగించడానికే తప్ప తొలగించడానికి కాదు. దేవుని నిమిత్తము దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడి ఉండాలి.
బాగా ఆలోచించి చూడండి! నేడు కాకున్నా ఇంతకు ముందు ఎప్పుడో ఒక కష్ట బంధుమిత్రులు ఎవరూ ముందుకు రాని సమయములో సమస్య నుండి ఎట్లా గట్టెక్కారో , ఆ సమస్య నుండి ఎవరు మిమ్మలని కాపాడారో తెలుసుకోండి. ఇక ముందు కూడా జీవితంతో ఒంటరి పోరాటాలు చేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఆ భగవంతుడే దిక్కు అవుతాడు. కనుక అన్నింటి మీదా ఎప్పుడూ కూడా ఆయనకే ప్రాముఖ్యత ఇవ్వండి.
మీలో కొంత మంది సద్గురువు నాహ్వానించి (ధ్యానమున) మీకున్న సమస్తమైనటువంటి బాధల్ని కుండపోతగా వారి ముందు పోస్తూ వుంటారు. చాలా సేవ చేస్తున్నాము కదా! “మా కెందుకీ బాధలు, కష్టాలు” అని ప్రశ్నించెదరు. ఇటువంటి సత్యభామ బుద్ధి (ఆరోపణ బుద్ధి) మానుకోవటము ఉత్తమము. ఆరోపణలు చేయటానికి ఆవాహన మెందుకు? ఎప్పుడూ ఆరోపణలు చేసే వారి దగ్గరికి మీకు వెళ్ళబుద్ధి అవుతుందా? మాకు వెళ్ళ బుద్ధి అవుతుంది. పిలుస్తే వస్తాము, కాని మీ బాధలు ఆరోపణలు మా రాకను గుర్తింపనీయవు.
మీరు బాధలలో నున్నప్పుడు మీరు చేయవలసినదల్లా మేమందించిన బోధనలు చదువుకొనుచు, మనో ప్రశాంతత మనో వైశాల్యతను పొందుచుండవలెను. అట్లుకానిచో క్రమముగ మీకు భక్తి తగ్గును. అనుమానము పెరుగును. మీ చేతన ఘర్షణకు గురి అగును. మేము అనంత ప్రేమను, ఆదరణను ఎప్పుడూ ప్రసరించుచునే యుందుము.
మీరు యోగమున నిలచి సేవను పెంచుడు. మాతో అనుసంధానము కూడ పెంచుడు. అప్పుడు మీ సమస్యలకు పరిష్కారములు దొరకును. మాతో మీ అనుసంధానమును యిట్టి సమయమున పెంచుకొనవలెను కాని ఆరోపణలతో తెంపుకొనరాదు. ప్రతినిత్యము కత్తిపీట ముందు కూర్చుని ఉల్లిపాయలు కోయుచు ఏడ్చుచున్న వారి వలె మీరు మాకు గోచరించుదురు. దీని వలన ఎట్టి ప్రయోజనము లేదు. పై తెలిపిన సూత్రములను పాటింపుడు.
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
***

చతుఃషష్టి ఉపచారాలు
ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము..
🙏సర్వోజనా సుఖినోభావంత్🙏
***
కర దండం
గ్రామాలల్లో సాదారణ ప్రజలు ప్రతివారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర పట్టుకొని వెళ్లేవారు. వారు ఆ కర్రను అనేకవిధాలుగా వాడేవారు. ఏమైనా విషపురుగులు అంటే పాములు తేళ్లు మొదలైనవి వారి దారిలో కనపడితే వెంటనే ఏది వెతకాల్సిన పనిలేకుండా వాటిని హతమార్చేవారు. ఇక కుక్కలు లాంటి జంతువులు వారి చేతిలోని కర్రను చూసి వారి జోలికి వచ్చేవే కావు. మీరు గమనించి ఉండొచ్చు కుక్కలు ఒంటరిగా ఒకమనిషి కనపడితే గుంపులుగా వచ్చి దాడిచేస్తాయి. ఈ విషయం మనలో కొందరికి అనుభవం కలిగి కూడా ఉండొచ్చు. ముందుగా ఒక కుక్క వచ్చి అరుస్తుంది తరువాత మిగిలిన కుక్కలు ఎక్కడినుండి వస్తాయో తెలియకుండా వచ్చి దాడి చేస్తాయి. అదే నీ చేతిలో కర్ర ఉంటే మాత్రం అవి నీ జోలికి రావటానికి వెనకాడతాయి. అధవా నిన్ను చుట్టుముట్టిన వెంటనే నీవు నీ చేతికఱ్ఱతో నిన్ను నీవు కాపాడుకోగలవు. కాబట్టి చేతిలో కర్ర ఉండటం సదా క్షేమకరం. ఇక విషయానికి వస్తే
సాదాకా రోజు నీ వెంట ఒక గుంపుగా కుక్కలు దాడి చేస్తున్నాయి. కానీ నీకు ఆ విషయం తెలిసినా కూడా నీవు వాటిని పరిగణలోకి తీసుకోక నీవు నేను రోజు ఆ కుక్కల దాడికి బలవుతున్నాము. సాధకుడు తన సాధనను ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ కుక్కలగూర్చి తెలుసుకోవటమే కాక వాటినుండి ఎట్లా రక్షణ పొందాలో తెలుసుకోవాలి. ఇప్పడికే మీకు నేను దేనినిగూర్చి చెపుతున్నానో తెలిసే ఉంటుంది అదేనండి ఆ కుక్కలు యేవో కావు అవే అరిషడ్వార్గంగా పేరుపొందిన ఆరుగురు శత్రువులు.
అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. మన శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి. అవి యేమియనగా కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ప్రతి మనిషి మనస్సును ఈ ఆరు కలిసికాని లేక ఏ ఒక్కటో లేక ఒక్కటి కంటే ఎక్కువో చేరి కలుషితం చేస్తాయి. వీటిలో ఏ ఒక్కదానికి చిక్కినా సాధకునికి సాధన అస్సలు కుదరదు.
సాధారణంగా మనం ఎవరైనా ఒక ముఖ్యమైన విషయం చేపుతుంటే కొన్ని సందర్భాలలో వాటి మీద నీవు శ్రార్ధ చూపవు ఎందుకురా నేను ఇంతముఖ్యమైన దానిని చెపుతుంటే ఏమి ఆలోచిస్తున్నావు అని నీ మిత్రుడు అడిగితె ఏమిలేదురా ఈవేళ నా మనసెందుకో బాగా లేదని సమాధానం ఇస్తావు. నిజానికి నీ మనస్సు బాగా లేకపోవటానికి కారణం పైన తెలిపిన ఏదో ఒక శత్రువు దాడి కానీ నీవు ఆ విషయాన్ని గమనించవు. అదే నీవు గమనిస్తే వాటిని అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేస్తావు. మన పురాణాలలో, ఇతిహాసాలలో ఈ ఆరు శత్రువుల వలన ఎవరు యెట్లా నష్టపోయారా చెప్పారు. కాబట్టి సాధక మేలుకో ఈ ఆరు కుక్కలను నీ మీద దాడి చేయకుండా నిరోధించే ప్రయత్నం చేయి. అకుంఠిత దీక్షతో తపస్సు సాగిస్తున్న విశ్వామిత్ర మహర్షికి మేనకా సాంగత్యంతో తపోభంగం కలిగిన విషయం మనకు విదితమే. ఇప్పుడు సాధకుల సాధనను బంగపరచటానికి దేవలోకం నుంచి మేనక దిగి రానవసరం లేదు ఏ సాధారణ స్త్రీ అయినా చాలు. ఇలా వ్రాస్తున్నందుకు ఏమి అనుకోవలదు. ఎందుకంటె మనం చేసే సాధన అంతబలహీనంగా వున్నదని నా భావన.
మరి ఈ ఆరు శత్రువులను పారదోలే దండం ఎక్కడ వున్నది అది నాకు దొరుకుతుందా అని అడగవచ్చు. అది నీ దగ్గరే వున్నది కానీ నీవు దానిని ఉపయోగించటం లేదు ఏమిటి అది అంటే అది మరేమో కాదు నిత్యం దైవ చింతనం. ఎప్పుడైతే సాధకుడు దైవచింతనంలో నిమగ్నుడై ఉంటాడో వాని చెంతకు ఈ ఆరు శత్రువులల్లో ఏ ఒక్కటి కూడా దాడి చేయటానికి సాహసించవు. ఎందుకంటె అన్ని శత్రువులను ఎదుర్కునే కర దండం దైవచింతన మాత్రమే ఇది సత్యం. అందుకే ప్రతి క్షణం దైవచింతన చేయాలని దైవఘ్నులు వక్కాణిస్తున్నారు.
సాధకుడు సదా ఈశ్వర జ్యానంలో ఉంటే ఎట్టి పరిస్థితిలోను మనస్సు అరిషడ్వార్గం మీదికి పోదు. అధవా పోయిన వెంటనే తన తప్పు తాను తెలుసుకొని దైవత్వం వైపు నడుస్తుంది. కాబట్టి మిత్రమా ఎల్లప్పుడూ నీ మనస్సును ఆ దేవదేవుని మీదనే వుంచు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించు.
___((()))___
మనిషి వృద్ధిలోకి రావడానికి తప్పకుండా నేర్చుకుని తీరవలసినది నీతి శాస్త్రం. ఆ నీతిని పాటించకపోతే తాను ఒక్కడే పతనమయిపోడు. తనతోపాటూ చుట్టూ ఉండే సమాజం కూడా భ్రష్టుపట్టే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తిన్న అన్నం కొద్దిగా కలుషితం అయితే ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే అనారోగ్యం వస్తుంది. కానీ ఒక ఊరివారందరూ దాహం తీర్చుకునే చెరువు విషపూరితం అయితే ఊరంతా అస్వస్థతకు గురవుతుంది. అయితే నీతి విషయంలో మాత్రం... ఒక వ్యక్తి నీతి తప్పితే కేవలం ఆ వ్యక్తి మాత్రమే పతనమయిపోడు, సమాజంలో ఉన్న అనేకమంది దాని దుష్ప్రభావానికి లోనవుతారు. అంతేకాక అతని తాత్కాలిక సుఖాలను ఆదర్శంగా భావించే అపరిపక్వ మనస్కులూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే చిన్నతనంలోనే నీతి శాస్త్రాలను బాగా చదువుకోవాలి. తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేంత సులభంగా మనకు శతకాలు అందుబాటులో ఉన్నాయి... ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చక్కటి పద్యాల రూపంలో ఉన్నాయి.
శతకం అంటే నూరు పద్యాలతో ఉన్న గ్రంథం అని. కానీ నూరే ఉండాలన్న నియమం లేదు. శతకం – అంటే ‘నూట ఎనిమిది’ అన్న అర్థం కూడా ఉంది. 108 కానీ, 116 కానీ పద్యాలు ఉండడం సంప్రదాయంగా వస్తోంది. కొన్నిచోట్ల అవి దాటిన శతకాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో లేనిది తెలుగులో మాత్రమే ప్రత్యేకంగా కనిపించేది మకుటం. ప్రతి పద్యం చివర మాటకానీ, చివర పంక్తి కానీ, కొన్నిసార్లు చివరి భాగం కానీ, సీస పద్యాలవంటి వాటిల్లో అయితే చివరి పద్యం కానీ మకుటం అవుతుంది. సుమతీ అనీ, దాశరథీ! కరుణాపయోనిథీ! అనీ, విశ్వదాభిరామ వినురవేమ... అనీ ఉంచారు. వీటిలో భక్తికి సంబంధించినవి, ఆవేదనను వెళ్ళగక్కేవి, ప్రకృతిని వర్ణించేవి ... ఇలా చాలా శతకాలు ఉన్నా తెలుగు భాషలో నీతి శతకాలకు ప్రత్యేక స్థానం ఉన్నది.
పెద్దలు, పరిశోధకుల పరిశీలన ప్రకారం శతక రచన ప్రారంభం అయింది నన్నయతో అంటారు. భారతాన్ని ఆంధ్రభాషలో రచన ప్రారంభం చేసే సమయంలో ఆయన రాసిన కొన్ని పద్యాల చివరన ఆదిశేషుని ఉద్దేశించి ‘..నాకు ప్రసన్నుడయ్యెడున్’ అన్న మకుటంతో ముగించారు. ఇది తరువాత కాలంలో శతక రచనకు ప్రేరణనిచ్చాయంటారు వీరు. విద్యార్థులకు సంబంధించినంతవరకు అత్యంత ప్రధానమైనది నీతి శతకం. తెలుగులో ఇలా వచ్చిన మొట్టమొదటి శతకం – సుమతీ శతకం. కాకతి రుద్రమదేవి దగ్గర సామంత రాజుగా ఉన్న భద్ర భూపాలుడు .. బద్దెన అనే పేరుతో అందరికీ పనికి వచ్చే నీతుల సమాహార స్వరూపంగా దీనిని రచించారు.
కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు, పౌరులు, సమాజంలోని విభిన్న వర్గాలవారు, చివరకు కవులు కూడా తెలుసుకోవాల్సిన నీతి సూత్రాలను ఇందులో పొందుపరిచారు. ఏవి పాటించాలో, ఏవి పాటించకూడదో, వేటిని మనిషి ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలో దీనిలో ప్రతిపాదించారు. వీటిని కంఠస్థం చేసుకుని ధారణలో ఉంచుకుంటే.. జీవితంలో క్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుని ఏ దారీ కనిపించ నప్పడు ఇవి వాటంతట అవే గుర్తుకు వచ్చి కాపాడతాయి. సుమతీ శతక పద్యాలు ‘సుమతీ’ అన్న మకుటంతో ముగుస్తాయి.
........
‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ.
ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు.
ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే.
దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా!
ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు.
అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు.
ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి.
తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే.
ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం.
ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం.
మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు.
ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి.
ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి.
భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు.
........
*ఆత్మశోధన*
ప్రపంచంలో అందరూ తమ ప్రజ్ఞ గురించే పొంగిపోతుంటారు. లోపాలను దాచు కుంటారు. వాటిని బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నత్తిని అణచివేస్తూ పట్టిపట్టి మాట్లాడటం, కుటిలత్వాన్ని కప్పి పెడుతూ తేనెపలుకులు పలకడం, అజ్ఞానాన్ని పండిత వేషంలో దాచడం... ప్రపంచ వ్యవహారంలో ఇలాం టివి కోకొల్లలు.
మెరిసిపోయేది నకిలీ బంగారమని, తళతళలాడేది వజ్రంలా భ్రమగొలుపుతున్న గాజుముక్క అని, ఉత్తముడిగా అగుపించేవాడు కుట్రదారుడని తెలిసినప్పుడు నివ్వె రపోతాం. బయటికి, లోపలికి పూర్తి వైరుధ్యం ఉన్నప్పుడు దేన్ని నమ్మాలో అర్ధం కాదు. అందుకే పెద్దలు 'గుడ్డిగా దేన్నీ నమ్మవద్దు' అంటారు. అలాగని దేన్నీ .. నమ్మకుండా జీవించలేం. నమ్మకం కలిగించగల కారణాలను మనం పరిశీలించాలి. నమ్మకం కలిగించి ద్రోహం చేయడం కుట్రదారులకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, నమ్మకం ప్రదర్శించాలి. అంతరంగంలో అనుమా నంగానే ఉండాలి. నమ్మకద్రోహులు విశ్వాసం నటిస్తూనే విషం వెదజల్లు తారు. భారతంలో శకుని పాత్ర అలాంటిదే శత్రువులతో చేతులు కలిపిన జయచంద్రుడులాంటి చారి త్రక ద్రోహుల గాథా అలాంటిదే. సమాజంలో మనకు నమ్మకద్రో హులు, నయవంచకులు ప్రచ్చ న్నంగా పలురూపాలలో, వేషాలలో కనిపిస్తారు. పాములకు కోరలు, విషం ఉన్నా వాటి రూపాలు వేర నమ్మకద్రోహులూ భిన్నంగా ఉంటారు. విషం లేని పాముల్లాంటి వాళ్లూ ఉంటారు. కానీ, చాలా అరుదు. నమ్మకం అంటే విశ్వసనీయత
ముందు మన ఆత్మకు మనం విశ్వసనీయంగా ఉండాలి. చర్యలన్నీ ఆత్మస్థితుడైన అంతర్యామి మౌనంగా గమనిస్తూ ఉంటాడు. మనం ఇత రుల్ని వంచిస్తున్నామంటే, మనల్ని కూడా మనం మోసం చేసుకుంటున్నట్లే. ఎందు కంటే, శరీరాలు వేరు తప్ప ఆత్మ ఒక్కటే. మన మోసాలన్నీ ఆత్మవంచనలే! ప్రతి ఆత్మవంచనకి ఆపరాధ శిక్షలుంటాయి. వాటిని నవగ్రహాలు కర్మదేవత లుగా అమలు చేస్తాయంటారు. ఆ బాధల నుంచి బయటపడటానికి గ్రహశాం తులు చేస్తుంటారు. అసలు అపరాదమే చేయకపోతే శిక్షలు ఉండవుకదా?
దైవ శాసనాలు ఎంత కఠినంగా ఉంటాయంటే, మనం సునాయాసంగా చెప్పే అబుద్ధమూ శిక్షార్హమైన అపరాధం లేదా పాపం. ఆ విధంగా చూస్తే మనిషి నిత్యా పరాధి! అలాగని మనం బెంబేలు పడాల్సిన పనిలేదు. ఏ రోజు మురికి ఆ రోజు స్నానంతో శుభ్రం చేసుకున్నట్లు ఏ రోజు పాపాలు ఆ రోజే నశింపజేయగల జప, ధ్యాన క్రియలున్నాయి. దానాలు, పరోపకారాలు సైతం పాపాలను క్షాళన చేస్తాయి. ఒక విధంగా దీనజన సేవకే ఎక్కువ మహత్తు ఉంది. ఎందుకంటే, అందరూ ఆత్మస్వరూపులే, అంతర్యామికి కోవెలలే కదా?.
ఆధ్యాత్మిక జీవితంలో మన మనోమాలిన్యాలను ఆత్మశోధన ద్వారా మనకు మనమే శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అద్దం ఏ విధంగా మన రూపురేఖలను వ్యక్త పరుస్తుందో, ఆత్మశోధనా మన వ్యక్తిత్వ లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఆత్మశోధన అంటే ఆత్మను వెతుక్కోవడం కాదు. మనల్ని మనం వెతుక్కుని నేను 'ఎవరు?' అనే ప్రశ్నకు జవాబు రాబట్టడం. వసిష్ఠుడు రాముడికి చేసిన గీతాబోధ. . లోని సారాంశం- ఆత్మశోధన మార్గం. అదే యోగవాసిష్టమైంది. ఇక్కడ రాముడు. ఉపకరణంగా సమస్త ఆస్తికలోకానికి పరమాత్మ ప్రసాదించిన దివ్యబోధ అది. ఆవశ్యం ఆచరణీయమైనది. -
కె. విజయలక్ష్మి
............
క్రీస్తుశకం ఒకటో శతాబ్ది. రోమ్ నగరం. అక్కడ ఒక బాలుడు చిన్నతనంలోనే రోమన్ ప్రభుత్వ అధికారికి బానిసగా పట్టుబడ్డాడు. యజమాని అతడిని క్రూరంగా హింసిస్తూ వినోదించేవాడు. ఒకనాడు ఎందుకో కోపం వచ్చి యజమాని ఆ కుర్రవాడి కాలు మెలిపెట్టసాగాడు. బాలుడిలో ప్రతిస్పందన కనిపించలేదు. బాధ లేదు, దుఃఖమూ లేదు. మనసు మాత్రం నిర్వికారంగా ఉంది. అలాగే బాధను ఓర్చుకుంటూ ‘అయ్యా! అలా మెలితిప్పుతూపోతే నా కాలు విరుగుతుంది’ అన్నాడు బాలుడు. యజమాని ఆ మాటలు పట్టించుకోక మరింత మెలితిప్పడంతో బాలుడి కాలు కాస్తా విరుగుతుంది. అయినా, బాలుణ్ని దుఃఖం ఆవరించలేదు. బాధను ఓర్చుకుంటూ ‘అయ్యా! నా కాలు విరుగుతుందని ఇందాకే చెప్పానుకదా!’ అన్నాడు.
కొన్నాళ్లకు ఆ బాలుడు బానిసత్వం నుంచి విముక్తి పొందాడు. బాగా చదువుకొని పెద్ద పండితుడు అయ్యాడు. గురువుగా ఎందరికో విద్యాదానం చేశాడు. కానీ, జీవితాంతం కుంటివాడిగానే మిగిలిపోయాడు. అతనే గ్రీకు తత్వవేత్త ఎపిక్టెటస్. ఆయనలాంటి స్థితప్రజ్ఞులు అరుదు. అయితే, ఈ విషయంలో మన భారతీయులు ఎంతో ముందున్నారు. సనాతన ధర్మం పునాదులే స్థితప్రజ్ఞత, వైరాగ్యం, మోక్షం.
‘సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ- సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించడమే స్థితప్రజ్ఞత’ అని గీతాచార్యుడు పేర్కొన్నాడు. స్థితప్రజ్ఞత కన్నా ఉన్నత మానసికస్థితి వైరాగ్యం. స్థితప్రజ్ఞత స్వీయ అనుభవానికి ప్రతిస్పందన. వైరాగ్యం.. బాహ్య వస్తువుల పట్ల, సంఘటన పట్ల విముఖత. రాగద్వేషాలు లేకుండటమే వైరాగ్యం. ఇక మోక్షం అనేది స్థితప్రజ్ఞతను, వైరాగ్యాన్ని మించిన అత్యున్నత మానసికస్థితి. మోక్షం అంటే జన్మ రాహిత్యం అనే ఒక బలీయమైన నమ్మకం. నిజానికి మోక్షం అంటే ఏమిటో మండనమిశ్రునితో జరిగిన వాదనలో ఆదిశంకరాచార్యులు తేల్చిచెప్పాడు. ‘మోక్షం.. శాశ్వతమైన ఆనంద స్వరూపం. ముక్తి అంటే క్రియా రూపులేని పరమతత్వం. మోక్షం ప్రాప్య వస్తువు కాదు. సర్వదా సిద్ధమైనది. తానే ‘పరబ్రహ్మ స్వరూపం’ అన్న దృఢజ్ఞానం కలిగి ఉండటమే మోక్షం. జ్ఞానం వేరుగా, ముక్తి వేరుగా లేవు. జ్ఞానంతో కైవల్యం లభించడం అంటే ఇదే. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాతే మోక్షం కలుగుతుందని వేదాంతాలు బోధిస్తున్నా యి’ అని వివరించాడు శంకరాచార్యులు.
బ్రహ్మజ్ఞానంతో మోక్షాన్ని అనుభవించే సాధకుడు తాను పరబ్రహ్మ స్వరూపం గా మారి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మీస్థితి. అదే అపరోక్షాను భూతి. ఈ విషయాన్ని అష్టావక్రుడు జనకుడితో…
‘యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్ఠసి
అధునైవ సుఖీ శాన్తః బన్ధముక్తో భవిష్యసి’॥
‘దేహం కంటే ఆత్మ వేరని విచారించి, తెలుసుకుని. ఆత్మలోనే మనసును లగ్నం చేస్తే సుఖశాంతులను పొందవచ్చు. ఎంతవరకు ఈ పరస్పర అధ్యాస (మిథ్యా జ్ఞానం) నాశనం కాదో అంతవరకు జీవుడు బందీగానే ఉంటున్నాడు. అధ్యాస గ్రంథి ఎప్పుడు తొలగిపోతుందో ఆ క్షణమే జీవుడు ముక్తి పొందుతాడు’ అని పై శ్లోకానికి భావం.
మోక్షస్య న హి వాసోసి గ్రామాన్తరమేవ వా
అజ్ఞాన హృదయ గ్రంథినాశో మోక్ష ఇతి స్మృతః॥
‘మోక్షమనేది లోకాంతరంలో ఉండేదో లేదా ఇంటి లోపలగాని, గ్రామంలోగాని ఉండేదో కాదు! మరెక్కడ ఉందది? అజ్ఞానంతో నిండిన కర్తృత్వ, భోక్తృత్వ భావన అనే చిత్జడ గ్రంథి నాశనమే ముక్తి’ అని తేల్చింది శివగీత. ఇక భగవద్గీత మోక్షసన్యాస యోగంలో ‘ఆత్మను యథార్థ రూపంలో తెలుసుకున్న వాడు వెంటనే మోక్షస్థితిని పొందుతాడు. సమస్త కర్మలను ఆచరిస్తున్నప్పటికీ, ఆత్మను శరణుపొందిన భక్తుడు శాశ్వతమైన, అవ్యయమైన మోక్షాన్ని అనుభ విస్తాడు’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అలాంటి నిర్వికార, నిరంజన మనోస్థితే మోక్షం. దానిని అనుభవించేవాడే ముముక్షువు. ఇలాంటివారిలో పాశ్చాత్యుల లో సోక్రటీస్, జోర్డానో బ్రూనో లాంటివారు కనిపించగా, భారతీయులలో సనాతన రుషులు మొదలుకుని ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిలాంటివారు కోకొల్లలు ఉన్నారు.
No comments:
Post a Comment