ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ. దయచేసి సాంతం చదవగలరు ......
" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో." చిన్నకోడలు పెద్దకోడలితో అంది.
" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు. విషయమేంటి? " అని అడిగింది పెద్దకోడలు.
" ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది కదా. అప్పట్లో మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము.
మనకూ పిల్లలు, సంసారం ఉన్నాయి. మామగారిని
ఎన్ని రోజులని చూడగలం. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంది చిన్నకోడలు. " ఏంటది అడిగింది పెద్దకోడలు.
మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో
చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం మన పిల్లలతో హయిగా ఉండవచ్చు అనింది చిన్నకోడలు.
" దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు. మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం అంది చిన్నకోడలు.
ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని చూసుకోవలని వారి ఉద్దేశ్యం.
కానీ రోజూ భార్యల నస భరించలేక ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు. " నాన్నా! ఈ పిల్లల గొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేక పోతున్నాం.
మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి చూసుకునేది. దగ్గరిలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ
చేరుద్దామని అనుకుంటున్నాము. మీరేమంటారు? "
" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్ని రోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని బయలు దేరండి ఇద్దరూ!? అన్నారు తండ్రి కొడుకులతో. షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి.
" అదేంటి నాన్నా ! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి? బయట బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి. ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి."
" నిజమే! మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా ఉన్నాం. ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి.
నా తదనంతరం మాత్రమే ఈ ఇల్లు మీకు. పైన ఇంటి బాడుగతో,నాకు వచ్చే పెన్షన్ తో ఎలాగోలా బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నాడు తండ్రి.
" అదేంటి మామగారూ! వూర్లో్ జనాలు ఏమను కుంటారు? బయటికివెళ్ళి
అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి మేము ఆలోచించండి" అన్నారు కోడళ్ళు.
నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి." అంటూ తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళి పోయాడు. షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ...... కోడళ్ళకు.
తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా
ఆశ్రమాలకు వెళ్లి పోతున్నారు. కానీ ఇలా తిరగబడితే తప్ప గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం, ఆస్తి పాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ శరణాలల్లో ఉంటున్నారు.
తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి.
ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదములు .......
ప్రముదితా -
==
*..భగవంతుని లీలలు.... మనుషులకు అర్దం కావు
వీధులు ఊడ్చేవాడు..... ఒకరోజు దేవుడితో మొర పెట్టుకున్నాడు.
"రోజూ హాయిగా నీవు పూజలందుకుంటూ ఉంటావు.
నా బతుకు చూడు. ఎంత కష్టమో.
ఒక్క రోజు... ఒకే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,"
అని సవాలు విసిరాడు.
దేవుడు విని.... 'సరే' నన్నాడు.
"అయితే ఒక్క షరతు. ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.
నోరు మెదపకూడదు."అన్నాడు దేవుడు.
"సరే" అన్నాడు మనోడు.
తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.
కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
"దేవా ... నేను కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు"
అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.
అప్పుడు జేబులోని పర్సు కింద పడిపోయింది.
అతను చూడకుండా వెళ్లిపోయాడు.
మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.
కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.
ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.
"దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ"
అంటూ మోకరిల్లాడు.
కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.
"ఇలా దయ చూపించావా తండ్రీ"
అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.
"ఒరేయ్ దొంగా.... "
అని అరుద్దామనుకున్నాడు మనోడు.
కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.
ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.
"దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ"
అన్నాడు.
అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చి...
"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.
"ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు."
అని అరిచేశాడు.
దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.
ఇచ్చిన ఒక్క రోజు గడువు అయి పోవడంతో...
సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు.
దేవుడు కూడా తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.
"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా... నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాలని. ఒక దోషిని అరెస్టు చేయించాను."
అన్నాడు మనోడు సంతోషంగా!
దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు."
అన్నాడు నిష్ఠూరంగా.
"అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావను కున్నాను."అన్నాడు మనోడు బాథగా!
అప్పుడు దేవుడు అసలు విషయం బయట పెట్టాడు.....
"ధనవంతుడు మహాపాపాత్ముడు.
వాడు అందరినీ దోచుకుంటాడు.
వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు.
ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు.
వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.
ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు...
అన్నాడు దేవుడు.
దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.
కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు.
ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఆ భగవంతుడిని ధ్యానించండి..
*నవ్వు నాలుగువిధాలా చేటు!*
నవ్వు అన్ని సమయాలలో ముఖానికి అందమూ మనసుకు ఆహ్లాదము కలిగించవు. నవ్వుల వల్ల కలిగిన ఎన్నో అనర్ధాల గురించి మన పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడ్డాయి. అలాటి కొన్ని సంఘటనలు చూద్దాము…సీతాకళ్యాణ సమయంలో సీతారాములను ఆశీర్వదించడానికి శివపార్వతులు కూడా విచ్చేసారు. సీతాదేవిని తనకు పెళ్ళికానుకగా ఏమి కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వరుడు.
సీత దీర్ఘదృష్టితో తనకు భవిష్యత్తులో ఏది ప్రయోజనకరమో త్రికాలజ్ఞుడైన త్రినేత్రునికే బాగా తెలుసని అటువంటిదానినే తనకు కానుకగా ఇవ్వమని కోరింది.
పరమశివుడు ఆలోచించాడు. గతంలో త్రిపురాసురులను తన క్రోధపూరితమైన నవ్వుతోనే భస్మంచేశాడు. అటువంటి నవ్వును సమయానుకూలంగా ఉపయోగించుకోమని సీతాదేవికి కానుకగా ఇచ్చాడు. ఆ నవ్వును సీతాదేవి తన మనసులో భద్రంగా పదిలపరుచుకున్నది.
రావణాసురునిచే లంకలోని అశోకవనంలో చెఱపట్టబడి వున్నప్పుడు సీతాదేవిని చూడడానికి హనుమంతుడు వచ్ఛాడు. మాటల సందర్భంలో రావణునిపట్ల గల కసిని క్రోధపూరితమైన నవ్వుగా వ్రెళ్ళగక్కింది. అది చూసిన హనుమంతుడు ఆవేశం చెందాడు. లంకా దహనం చేశాడు. నిజానికి ఆనాటి లంకా దహనం జరిగింది హనుమంతుని వలన కాదు. పరమేశ్వరుడు కానుకగా ఇచ్చిన నవ్వును సీతాదేవి ఈసందర్భంలో ఉపయోగించు కున్నది. మహాసాధ్వియైన సీతాదేవి రౌద్రం వలన కలిగిన నవ్వువలనే లంక దహించబడిందని ఒక రామాయణ గ్రంధ వివరణ.
అలాగే రామాయణంలో జరిగిన మరో సంఘటన…
రావణ సంహారం అనంతరం అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం మహావైభవంగా సాగింది. శ్రీరాముడు తనకు సహాయం చేసిన వానర ప్రముఖులతో సహా అందరినీ సత్కరించి సంతోషపరుస్తున్నాడు.
ఆ సమయంలో పక్కనే వున్న లక్ష్మణుడు ఉన్నట్టుండి ఫకాలున నవ్వాడు. లక్ష్మణస్వామి ఎందుకు నవ్వాడో ఎవరికీ అర్ధంకాలేదు. శ్రీరాముడు , సీత , భరతుడు , సుగ్రీవుడు , హనుమంతుడు అందరూ ఎవరికివారే తమలోని ఏదో లోపాన్ని చూసే లక్ష్మణుడు నవ్వాడాని అతనిపై ఆగ్రహించారు. వారిని శాంతింపజేయడానికి వారికి క్షమాపణలు చెపుతూ తన నవ్వుకు గల కారణం గురించి లక్ష్మణుడు ఇలా చెప్పాడు…
సీతారాములతో పధ్నాలుగేళ్ళపాటు వనవాసంలో గడిపిన తను ఏ ఒక్కరాత్రి పగలు కూడా ఒక్క క్షణమైనా నిద్రపోకుండా సీతారాముల కాపలాలో గడిపానని ఆ సమయంలో ఒక్క రెప్పపాటు సమయంలో కూడా నిద్రాదేవి ఆవహించలేదు. కానీ ఈ సంతోష సమయంలో యింతమంది ప్రముఖుల సమక్షంలో వున్న నన్ను నిద్రాదేవి ఆవహించిందని తన ఈ దురవస్థకు ఆపుకోలేని నవ్వు వచ్చిందని లక్ష్మణుడు సంజాయిషి చెప్పుకున్నాక కానీ ఆ సభలోని వారి అనుమానం , కోపం తగ్గలేదు. అందరికీ తెలిసిన మరో నవ్వు …పాంచాలి నవ్వు..!
మహాభారతంలో మయసభ ఘట్టంలో దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్విన నవ్వువలన ఎన్ని అనర్ధాలు , ఎన్ని దుష్పరిణామాలు, ఎన్ని ఘాతుకాలు , ఎంతటి మహా సంగ్రామం జరిగి కుఱువంశం నాశనమైపోయిందో అందరికీ తెలిసిందే!
అందువలన పదిమందిలో వున్నప్పుడు అకారణంగా నవ్వి నవ్వులపాలు కాకూడదు.
............
*దుఃఖించి ప్రయోజనం లేదు*
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
పూర్వం నముచి అనే రాక్షసరాజు సంపదలన్నీ పోగొట్టుకుని చీకూచింతా లేనివాడై ఒక మూల విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఇంద్రుడు అతడి వద్దకు వెళ్లి “ రాక్షసరాజా ! నీకిప్పుడు బంధు మిత్రులు లేరు. పరివారం లేదు. ఈ హీనస్థితికి ఎంతగా బాధపడుతున్నావో అనిపిస్తోంది” అన్నాడు.
నముచి “దేవేంద్రా ! దుఃఖం వల్ల ప్రయోజనమేమీ లేదు. దుఃఖించినంత మాత్రాన కోరుకున్నవన్నీ లభిస్తాయా ? అవేవీ నెరవేరక పోవడమే కాకుండా శరీరాన్ని , మనస్సును కష్టపెట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదు. అంతేకాకుండా అలా చేయడం వల్ల ధర్మహాని కలుగుతుంది. ఇవన్నీ ఆలోచించి దుఃఖం లేకుండా ప్రశాంతుడనై ఉన్నాను” అని బదులివ్వడమే కాకుండా కొనసాగింపుగా మరికొన్ని మాటలు చెప్పాడు.
‘ సృష్టినంతటినీ పరిపాలించే వాడు ఒకడున్నాడు. ఏ ప్రాణికి ఏది ఏర్పాటు చెయ్యాలో ఆయనే చూసుకుంటాడు. నీరు పల్లానికి ప్రవహించినంత సులభంగా ప్రయత్నం లేకుండానే వారికది వచ్చి చేరేటట్టు చేస్తాడు. నాకిలా కావలసి ఉందని విధాత నిర్ణయించాడు కాబట్టి అట్లా జరిగిందన్న దృఢ నిశ్చయం గల యోగ్యుడికి ఆనందం, దుఃఖం , సంపత్తి , దరిద్రం వంటి ద్వంద్వాలేవీ ఉండవు.
అంతేకాదు విధాత ఇతడికి ఇవి చెందకూడదని నిర్ణయిస్తే ఆ మానవుడి ధైర్య సాహసాల వలన గానీ , భుజ బల పరాక్రమాల వలన గానీ పొందలేడు. ఆ సత్యం గ్రహిస్తే సజ్జనుడికి భయం ఉండదు.
జీవితంలో మేలు, కీడు అనేవి కాలవశాన మానవుడికి తప్పకుండా సంభవిస్తాయి. వాటిని తోసేస్తే తొలగిపోవు. కౌగిలించుకుంటే దగ్గరకి రావు. కనుక వాటి గురించి ఆలోచించడం మంచిది కాదు’
నముచి మాట్లాడిన మాటలు విన్న దేవేంద్రుడు అతడిని మెచ్చుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు.
కర్ణుడి కృతజ్ఞత
హస్తినాపురంలో రాయబార వ్యవహారం ముగిశాక కర్ర, భీష్మాదులతో కలిసి మేనత్త కుంతి దగ్గరకు వెళ్లాడు శ్రీకృష్ణుడు ఆమెను పరామర్శించి, రాయబార విశేషాలు వివరించాడు. అనక పాండవులకు కుంతీదేవి ఇచ్చిన సందేశాన్ని తీసుకుని భీషు, సంజయులతో సహా వెనుతిరిగాడు. అందర్నీ తమ తమ మందిరాలకు పంపించి, కర్ణుణ్ణి మాత్రం రథంపై కూర్చోబెట్టుకొని, బయల్దేరాడు. రధం కొంత దూరం వెళ్లాక 'రాచేయా! నువ్వు దర్మశాస్త్ర 'రహస్యాలు బాగా తెలిసినవాడివి. నీకు కొత్తగా చెప్పేవేమీ లేదు. నిజానికి మా మేనత్తకు ప్రథమ పుత్రుడివి. కనుక రాజ్యాధికారం నీవే దుర్యోధనుణ్ణి వదిలి. నాతో వచ్చి పాండుపుత్రుల వైపు చేరు. అన్నగా నీకు బ్రహ్మరధం పడతారు' రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తారు. అందుకు కుంతీమాత కూడా ఆనందిస్తుంది. అన్నాడు. గోవిందుకు.
కర్ణుడు మందహాసంచేసి 'కేశవా! నీ వాత్సల్యానికి కృతజ్ఞుణ్ణి ధర్మానుసారం పాండుపుత్రుణ్ణి అనే విషయం ఎప్పుడో తెలుసు నాకు. కానీ కుంతీదేవి నన్ను నదిలో పడేసినప్పుడు అతిరథుడు, రాచ నన్ను చేరదీశారు. ప్రాణప్రదంగా పెంచిన ఆ ప్రేమమూర్తుల రుణం ఎలా తీర్చుకోగలను! మరోవైపు ఏ ఆశ్రయం దొరక్క అవమానాలు పొందుతున్న వేళ దుర్యోధనుడు నన్ను ఆదరించి రాజ్యభాగాన్నిచ్చి, రాజును చేశారు. సొంత సోదరుడిలా ఆదరించాడు. దుర్యోధనుడు నన్ను నమ్ముకునే ఈ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. నాకు తెలుసు, ధర్మవర్తనులైన పాండవులే గెలుస్తారు. కానీ తల్లిదండ్రుల ప్రేమకు, మైత్రీబంధానికి ద్రోహం చేయలేను. సమస్త భూమండలం రాసిచ్చినా, బంగారు రాశులు కురిపించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లతో అనుబంధాన్ని తెంచుకోలేను' అన్నాడు. కర్ణుడి కృతజ్ఞతకు కృష్ణభగవానుడే కదిలిపోయాడు. అందుకే మహాభారతం ఉద్యోగపర్వంలో విదురుడు ఒకరి పోషణతో ఉన్నత స్థానానికి చేరి, ఎందులోనూ కొరత లేకుండా జీవిస్తూ, ఆతంచ సంపదను అర్జించి, చివరికి ఆ రాత నమ్మకాన్నే వమ్ముచేసి అపకారం చేసేవారి పార్థివ దేహాన్ని పక్కలు కూడా ఇష్టపడవు' అన్నాడు దృతరాష్ట్రుడితో. చైతన్య
........
జ్ఞానాన్ని పొందడానికి
*ముఖ్యమైన మూడు లక్షణాలను, ఆ జ్ఞానము పొందిన తరువాత కలిగే లాభాన్ని* వివరించాడు పరమాత్మ.
*1. శ్రద్ధ..*
ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యం. ఒక్క జ్ఞానం సంపాదించడానికే కాదు ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి. ఏ కార్యము చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసినా, విద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులో పని చేసినా, వ్యాపారం చేస్తున్నా, వృత్తిపని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికి అయినా శ్రద్ధ ముఖ్యము. పైగా చేసే పని మీద నమ్మకము విశ్వాసము ఉండాలి. అంతే కానీ అయితే అవుతుంది లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో రాదో అనే సందేహము కూడా ఉండకూడదు. తప్పక సిద్ధిస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణము అవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసి పని మీద కుతూహలము కాదు. నేను చేసే పని నాకు మేలు చేస్తుంది. నా ఉన్నతికి తోడ్పడుతుంది. నా భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది అనే నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు.
*2. తత్వరః..*
తత్వరః అంటే తదేకనిష్ట ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగాచేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయడంవలన విరుద్ధ ఫలితాలు వస్తాయి ఎవరూ మనల్ని నమ్మరు. మనసు నిర్మలంగా ఉండాలి అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేపట్టినా ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది. అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. కాబట్టి మనసును బయట ప్రపంచంలో ఉన్న విషయాల నుండి మరల్చి ఆత్మవిచారణవైపు తిప్పితే, ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది.
విద్యార్థులు చాలా మందికి చదివే చదువు మీద నిష్ఠ ఉండదు. ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టివి. పక్కనే సెల్ఫోను. ( పురాణ కాలాల్లో ఋషుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి మొదలగు అప్సరసలను పంపేవాడని విన్నాము. ఈ రోజుల్లో, మానవుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి ఇంద్రుడు స్మార్ట్ఫోన్ ను కనిపెట్టి మన మీదికి వదిలాడు.) అందులో facebook,whatsapp, instagraam, youtube etc.. ఇన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశం లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాసు, ర్యాంక్ ఖాయం. కాని ఈ రహస్యం తెలుసుకోలేక క్వశ్చన్ బాంకుల మీద వేలకువేల ట్యూషన్లమీద ఆధారపడుతుంటారు. క్లాసురూములో చెప్పే పాఠం శ్రద్ధగా విని, ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే, తెలియని విషయాలను మరునాడు టీచరును కానీ లెక్చరరును గానీ అడిగి చెప్పించుకుంటే, అది మెదడులో శాశ్వతంగా రికార్డు అవుతుంది. పరీక్షలలో ఎంతో సాయపడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా ఇంకా బోధించాలనే ఉత్సుకత కలుగుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరం.
*3. ఇంద్రియ నిగ్రహము..*
ఇంద్రియములు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి. ప్రాపంచిక విషయాలలో లీనం అయి ఉంటాయి. ఇంద్రియాలు చూసిన వాటి గురించి మనసు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనసు చంచలం అవుతుంది. అటువంటప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియ నిగ్రహము లేకపోతే ఆత్మజ్ఞానము అలవడదు. సాధకుడికి ఇంద్రియములు ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తేనే గానీ సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు.
ఈ ప్రకారంగా శ్రద్ధ, తదేకనిష్ఠ, ఇంద్రియనిగ్రహం అవలంబించి ఆత్మజ్ఞానము పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒకటే సమాధానం, పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావాల్సింది అదే. ఎంత ధనం, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా మానవునికి మనశ్శాంతి కరువయింది. అటువంటి వారు ఆత్మజ్ఞానంకోసం ప్రయత్నించాలి. పైవిధంగా ప్రయత్నిస్తే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేణ అనే పదం వాడారు. అంటే అచిరకాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్యప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖం అనంతమైన దుఃఖం తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించాడు పరమాత్మ.
🙏 *కృష్ణం వందే జగద్గురూమ్* 🙏
))--
ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రాం ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ
ధర్మరాజు
సర్వేజనా సుఖినోభవంతు
ధర్మజు ని రక్తం ఎన్ని బొట్లు నేలమీద పడతాయో అన్ని సంవత్సరాలు ఇక్కడ అనావృష్టి కలుగుతుంది.!
యుద్ధంలో జయం పొందిన విరాటరాజు, అంతకుముందే తన పట్టణానికి తిరిగి వచ్చాడు. విప్రులు, వనితామణులు సేనలు జల్లుతూండగా తాను, పాండువులు, బంధువులు రాజమందిరం ప్రవేశించారు. విరాటుడు సింహాసన మధిష్టించాడు. తన విజయాన్ని మెచ్చుకోవడానికి వస్తున్న వాళ్లందర్నీ అభినందిస్తున్నాడు.ఉత్తరుడు కనబడకపోయే సరికి ఎక్కడున్నాడు ? అని అడిగాడు. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ మున్నగు కురువీరులు. సైన్యంతో వచ్చి ఉత్తరిదిక్కున గోగ్రహణం చేసారనీ అందుచేత ఉత్తరుడు, బృహన్నల రధసారధిగా చేసుకొని ఒక్కడే యుద్ధానికి వెళ్లాడనీ, విరాటరాజు తెలుసుకుని దుఃఖంతో కుంగిపోయాడు. మంత్రులు మొగాలు చూసాడు.
కుర్రతనం చేత క్రిందూమీదూ కానకుండా రోషావేశంతో పశువులను కాపాడ్డానికి వెళ్లాడుట ! పసివాడు ! కౌరవ సైన్యం ఎక్కడ ? వీడు ఒంటిరగా వెళ్లడం ఎక్కడ ? నాకిది మహాదుఃఖం కలిగిస్తోంది. అతివడిగా సైన్యాన్ని అతనికి తోడు పంపాలి. చాలినన్ని వేగంగా పంపండి అన్నాడు ఆదుర్దాతో.
అక్కడకు వచ్చి సుశర్మ ఓడిపోయాడు. కనుక ఇక్కడ వీరికి జయమవుతుంది. భయపడనక్కర్లేదు. యుద్ధానికి ఉత్తరుడు ఒక్కడే వెళ్లాడనుకోవద్దు. అతనికి బృహన్నల సారధి కనుక దేవతల్నైనా జయించుకొస్తారు అన్నాడు కంకుడు. విరాటుని ఆరాటం కొంచెం తగ్గింది.
మహారాజా ! కౌరసైన్యాన్ని జయించి, మనగోవుల్ని మళ్లించి ఉత్తరుడూ, సారధీ వస్తున్నారు. చివరకు రధానికైనా ఈషణ్మాత్రంకూడా ప్రమాదం లేకుండా సురక్షింతగా ఉన్నారు. మమ్మల్ని పిలిచి మీరువడిగా పోయి పురంలో ప్రకటించండి అంటే వచ్చాం అన్నారు, వారు.
విరాటరాజు హృదయాంతరాళాల నుండి పొంగిపొర్లిన ఆనందం ఆశ్రువులరూపంలో అతని నేత్రాలనుండి ధారాపాతంగా ప్రవహించినది. అతని ఒడలు పులకాంకితమైంది. ఏమిటేమిటి ? అంటూ గొల్లవాళ్లచేత పదేపదే చెప్పించుకొన్నాఆ శుభవార్త. మంత్రుల మొగములు సగర్వంగా చూచాడు.
అత్యాచ్చరకమైన ఈ అమోఘ విజయం, నాకొడుకు జయం, గంటలు మ్రోగిస్తూ ఏనుగులమీద వీధివీధికి వెళ్లి చాటించమనండి. మేళతాళాలతో, మంగతూర్యాలతో, బ్రాహ్మణశ్రేష్ఠులతో, పుణ్యస్త్రీలతో వారికి ఎదురువెళ్లి తీసుకు రావాలి...మా అమ్మాయి ఉత్తర మున్నగు ఉత్తమ కన్యలంతా సుగంధ ద్రవ్యాలతో నా కొడుకుకు ఎదురు వెళ్లి తీసుకు వచ్చే యేర్పాట్లు చేయించండి, అని ఆజ్ఞలిచ్చాడు.
గొల్లవాళ్లకు నూతన వస్త్రాలు ఇప్పించాడు. కంకుభట్టును చూచాడు. నేస్తం ! ఒక ఆట వేద్దామా ? అన్నాడు, పట్టలేని సంతోషంతో .
నువ్వు సంతోషపరావశ్యంతో ఉన్నవు. ఈ వేళనీతో ఆడిగెలవడం కష్టం. అందుచేత భయపడుతున్నాను. అన్నాడు, కంకుడు.
విరాటుడు నవ్వినాడు. ఈ పరిసరంలో ఉన్న సైరంధ్రిని పాచికలు తెమ్మన్నాడు. ముందుకు దిగినాడు, ఇక్కడకురా అని కంకుణ్ణి పిలిచినాడు.
జూదం ఏమంత మంచిది ? ధర్మరాజు జూదమాడి రాజ్యాన్ని, తమ్ముళ్లను, భార్యను, పందెంవొడ్డి నానా కష్టాలుపడ్డాడు కదా ? దీనివల్లవచ్చేకీడు అటువంటిది, అంటూనే జూదం ఆడనారంభించాడు కంకుడు.
విరాటరాజు ఆనందోత్సాహం పట్టలేకపోతున్నాడు. చూశావా నా కొడుకు ఉత్తరుడి బాహుబలం శౌర్యం ఎంతుఉదాత్తమైనవో ! కౌరవ సైన్యాన్ని ముట్టడించి, గెల్చి, గోవుల్ని తెచ్చాడు ! ఇంత ఘనకార్యం ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా చేశారా ! అన్నాడు పాచికలు వేస్తూ.
గెలవడం బ్రహ్మవశంకూడా కాదు గదా ! అంటూ అతడు తొందరపడుతున్న సమయంలో ఉత్తరుడు పంపించిన గొల్లవాళ్ళు అక్కడికి వచ్చారు.
భీష్మ, కర్ణ, దుర్యోదన, ద్రోణ, కృపామున్నగు యోధుల్ని ఉత్తరుడు ఒక్కడే జయించగలిగి నట్లయితే, ఇంతకన్న ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఉంటుందా ? ప్రపంచంలో ప్రసిద్ధి కెక్కుతాడు అన్నాడు , కంకుడు.
కంకుడి మాటలు విరాటుని బాధించాయి. అతడు కటకట పడినాడు.
నువ్వు ఇలాగమాట్లాడడంలో అంతరార్థం నా కొడుకు విజయం సందేహమనేనా ? నువ్వు కనుక ఇంతమట్టుకు ఓపిక పట్టాను. ఇంకఇటువంటి మాటలు అనకు, అన్నాడు, కోసంగా. అతని చెక్కిళ్లు అదిరినవి. కళ్ళు కెంపెక్కినవి. మూతిముడుచుకొని ఆడుతున్నాడు. కాని కంకుడా తణ్ణి లెక్కచేయలేదు.
కౌరవసైన్యాన్నే అన్నమాటేమిటి ? దేవతలూ, రాక్షసులూ కలిసి వచ్చినా గెలుస్తాడు, ఉత్తరుడు, శత్రుసైన్యాలకు జడుపుపుట్టే ఆ బృహన్నలరధం మీద ఉండాలిగాని అన్నాడు.
విరాటుడి కోపం రెట్టించింది. మొహం వికృతమైంది.
నీవల్ల చాలాచాలా వింతలు వింటున్నాం ! ఇంతకు ముందు ఎప్పుడూ సారధుల్ని చూడలుదనుకుంటున్నావు కాబోలు. అబ్బో ! లోకంలో మహామహా వీరుల్నే చూశాం అతని కన్నులు నిప్పులు కురుస్తున్నవి. నాకొడుకుని గురించి పోటు మాటలు నీకెందుకు ? సంతోషంగా ఆడలేవా ? పిచ్చిపిచ్చిమాటలు కట్టిపెట్టు. అటువంటివి మేం సహించలేం, బ్రాహ్మడా, అన్నాడు, విరాటరాజు.
ధర్మరాజు పట్టువదల్లేదు. చిరునవ్వు నవ్వి.
యుద్ధం చేయాలని వేడుకపడి, అతి సాహసుడై, బృహన్నల ఉత్తరుణ్ణి సారధిగా చేసుకొని కౌరవసేనలను జయించి, ఒక్క పశువైనా పోకుండా అన్నిటినీ తెచ్చి ఉంటాడు. నా మాట నిజం అవుతుందోకాదో చూస్తూండు, అన్నాడు కంకుడు. అంతటితో ఆగక బృహన్నల విజయం పురంలో చాటించు అన్నాడారాజు మొగం చూస్తూ.
విరాటుడు రౌద్రుడుయాడు. బుసకొట్టాడు. పేడిని పొగడడం మానమంటే మానవేం ? అంటూ పాచికను కంకుడి మొహానికేసి కొట్టాడు.
ఈ విధంగా దెబ్బతినినా, ధర్మారాజుకు కోపంరాలేదు. ద్రౌపది వైపు చూచి ఊరుకున్నాడు. ద్రౌపది గబగబ పరుగెత్తి అతని నొసటి దెబ్బనుండి కారుతున్న రక్తాన్ని తన పమిట చెంగుతో అద్ది, ఆ చేరువలోనున్న బంగారు కలశలోని నీళ్లతో చేతులు తడుపుకొని గాయాన్ని నెమ్మదిగా తుడుస్తున్నది.
రక్తాన్ని చీర చెంగుతో అద్దుతున్నావేం ? అని విరాటుడు సైరంధ్రిని అడిగినాడు.
నిర్మలమైనవంశంలో పుట్టిన ఈ పుణ్యాత్ముని నెత్తురు ఎన్ని బొట్లు నేలమీద పడతాయో అన్ని సంవత్సరాలు ఇక్కడ అనావృష్టి కలుగుతుంది. ఉత్తమ బ్రాహ్మణుడికి హాని చేయడంవల్ల కలిగే పాపం ఎట్లాగూ కీడు కలిగిస్తుంది. కనుక నీకు హాని రాకుండా ఉండాలని ఇలాగ చేశాను. అంటూ ఆమె అతని గాయాన్నుండి కారుతున్న నెత్తురు తుడుస్తున్నది.
ఉత్తరుడొక్కడూ లోపలికి వచ్చినాడు. తండ్రిపాదాలకు మోకరిల్లాడు. విరాటుడు ఆనందబాష్పాలు కార్చి, కొడుకును గట్టిగా గుండెలకదుముకొన్నాడు. ఉత్తరుడు తండ్రికి పునః ప్రణామాలు చేశాడు. పిమ్మట కంకుడికి సగౌరవంగా నమస్కరించాడు. ఆతని నుదుటను ఉన్నగాయం చూచి ఇదేమి ? అన్నాడారుద్దాగా.
నాయానా ! నేను నీ విజయాన్ని పొగడుతూంటే అతడు పేడివాణ్ణి పొగడాడు. దాంతో, నేను కోపం ఆపుకోలేకపోయాను. అప్పుడు నాచేతిలో ఉన్న పాచికపుచ్చుకొని కొట్టాడు, అన్నాడు విరాటుడు.
ఉత్తరుడు భయమూ, సంభ్రమమూపడినాడు.
అయ్యయ్యో ! నాన్నా ! గొప్పతప్పుచేశావు. నీవు ఇలాగ చేయవచ్చా ? వారు ఏం చెపుతే అదల్లా మనం అంగీకరించాలిగాని, ఇలాగ, కాదు, కూడదు అంటూ నిషేదించవచ్చా ? వారిని సవినయంగా బ్రతిమాలుకోండి. పవిత్రచరిత్రులైన పరమద్విజుల్నికోపించి అవమానించిన పరిపాలకులకు ఆయువు, సిరి కలుగుతాయా ? అన్నాడు, ఉత్తరుడు, అత్యాదరంతో.
ఉత్తరుని మాటలు పాటిగా బట్టి, విరాటుడు ధర్మరాజును భయభక్తులతో వేడుకొన్నాడు క్షమించమని. ధర్మరాజు నాకేం కోపంలేదు. నీ తండ్రి చెడుమార్గన నడిచేవాడు కాదు. ఈ దినము అటువంటిది హాని కలిగింది అని నవ్వుతూ ఉత్తరుడితో అన్నాడు. అప్పుడు తండ్రి, కొడుకులు సంతోషించారు.
No comments:
Post a Comment