ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ
ఓం శ్రీ రామ... శ్రీ మాత్రే నమఃభగవంతుణ్ని మనం ఏం కోరుకోవాలి? ఇది చాలా సులభంగా కనిపించినా, చాలా కఠినమైన ప్రశ్న. అన్నీ ఆయనే అయి, సమస్తమూ ఇవ్వగల భగవంతుడే కనబడి మనలను కోరుకోమంటే ఏం కోరుకుంటాం? ధనమా! మరణం లేని జీవితమా! ప్రభుత్వమా! శాశ్వత యౌవనమా! పెద్దచిక్కే కదా! ఏది కోరితే శాశ్వతత్వం లభిస్తుందో దాన్ని కోరుకోవడమే సరైనది. ఇంతకీ అది ఏది?
మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎంతోమంది మునులు, రాక్షసులు కఠోరమైన తపస్సు చేసి తీరా భగవంతుడు దర్శనమిచ్చాక ఏం కోరుకోవాలో తెలియక తికమక పడ్డ సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. విచిత్రంగా ఎందరో రాక్షసులు మరణం రావొద్దని, సమస్త విశ్వానికి ఆధిపత్యాన్ని కోరుకొని కోలుకోలేని దెబ్బతిన్నారు. తన సోదరుడైన హిరణ్యాక్షుడిని వధించాడని శ్రీహరిపై పగ పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడిని మెప్పించాడు. విష్ణుమూర్తిని ఎదిరించాలనే లక్ష్యంతో తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని విధాతను కోరాడు. ఆ వరం ఇవ్వడం సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అప్పుడు తనకు మరణం లేకుండా కొన్ని షరతులతో కూడిన వరం అడుగుతాడు హిరణ్యకశిపుడు.
శా॥గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్,
రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ
వ్యాళాదిత్య, నరాదిజంతుకలహ వ్యాప్తిన్, సమస్తాస్త్ర శ
స్ర్తాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.
‘గాలిలో, నేలమీద, నిప్పుతో, నీటిలో, ఆకాశంలో, దిక్కులలో, రాత్రిగానీ, పగలుగానీ, చీకట్లోగానీ, పగలుగానీ, భూచరాలతోగానీ, జలచరాలతోగానీ, పాములతోగానీ, రాక్షసులతోగానీ, దేవతలతోగానీ, మానవులతో గానీ, అస్ర్తాల వల్ల గానీ, శస్ర్తాల వల్ల గానీ మృత్యువు లేకుండా వరం ప్రసాదించమన్నాడు. యుద్ధాల్లో తన ఎదుట ఎవరూ నిలవలేని శౌర్యాన్నీ, లోకాలన్నీ జయించగల శక్తినీ ఇమ్మని కోరుకున్నాడు.
చాలా తెలివిగా చావేలేని వరాలు కోరాననుకున్నాడు కానీ, భగవంతుని ప్రణాళికను ఈ వరాలేవీ అడ్డుకోలేకపోయాయి. ఇందులో ఆశ్చర్యం ఏమంటే తన సోదరుడిని చంపినవాడు, తననూ చంపుతాడేమోనన్న భయం ఒకవంక, తాను కోరినవాటికంటే భిన్నమైన మృత్యుకారక మార్గాలు మరేవీ ఉండవనే అవివేకం మరోవంక హిరణ్యకశిపుడిని మరణానికి దగ్గర చేశాయి. రావణుడు ఇలాగే నరవానరులను వదిలేసి మరెవరిచేత చావు రాకూడదని కోరుకొని మరణించాడు. అంటే, అనివార్యమైన మరణాన్ని ఏ వరాలు ఆపలేవన్నది నిజం. నహుషుడు ఏకంగా ఇంద్రపదవి కోరి తపించి సాధించి అహంకారం నెత్తికెక్కి స్వర్గం నుంచి భూమిపై కొండచిలువగా జారిపడ్డాడు. అలాగే భస్మాసురుడు తానుపొందిన వరంతో తానే భస్మమయ్యాడు.
మనం కోరే కోరిక మనకు మాత్రమే కాదు, సమాజానికీ హితం చేసేదై ఉండాలి. సకల జీవుల సంక్షేమం కోసం దివిజగంగ భువికి రప్పించిన భగీరథుని కోరిక ఉన్నతమైనది. తన శరీరాన్ని దేవతల కోసం అర్పించిన దధీచి త్యాగం అందరికీ ఆదర్శం. కేవలం స్వీయ ఆధిపత్యానికి, మరణాది ప్రకృతి సిద్ధమైన లక్షణాలకు విరుద్ధంగా భగవంతుని కోరే కోరికలన్నీ నిష్ఫలాలే అవుతాయి. నిజానికి భగవంతుని కోరదగింది అనాయాసమైన మరణం, దైన్యంలేని జీవనం, సదాగోవింద స్మరణం అని మన పెద్దలు చెప్పారు. వీటిని కాదని, ఎన్ని ఐశ్వర్యాలను కోరినా అవన్నీ అశాశ్వతాలే అవుతాయి. పరమభక్తుడైనవాడు ఏమి కోరుకోవాలంటే..
నీపాదకమలసేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము నితాం
తాపారభూతదయయును, తాపసమందార నాకు దయసేయగదే!
పోతన చెప్పినట్లు భగవంతుని పాదకమలసేవ, భగవత్ భక్తులతో స్నేహం, అంతులేని భూతదయ. ఇవే మనల్ని భగవంతుని దరికి చేర్చే మార్గాలు. ఇవే భగవంతుడిని కోరాల్సిన వరాలు.
.......
‘కృతజ్ఞత ’ అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం.
ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం.
ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది.
మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి.
అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము.
కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు.
ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక.
కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది.
అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి.
ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి.
అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు.
కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు.
తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది.
.....,
*ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతున్న సమయంలో...*
దొంగలు తుపాకీలు చూపిస్తూ మీరు కదిలితే చంపేస్తాం అని బ్యాంకులో ఉన్న వారిని బెదిరించారు. ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది,
కానీ మీ ప్రాణాలు మీకు సంబంధించినవి. కనుక మీరు ప్రశాంతంగా ఉంటే మా పని మేము చేసుకుని పోతాం అని చెప్పారు.
*"మనసు మార్చే మాటలంటే ఇవే"*
దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ అనాగరికంగా ప్రవర్తించడంతో అందులో ఒక దొంగ మేము దొంగతనానికి వచ్చాము. అత్యాచారం చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు.
*"దీన్నే అంటారు చేసే పనిలో నిమగ్నత అవసరం అని"*
దొంగలు దొంగతనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. అందులో ఒక దొంగ డబ్బును లెక్కపెడదామని చెప్పడంతో అందులో ఒకడు
ఎందుకు ఎంత డబ్బు పోయిందన్నది
ప్రభుత్వమే ప్రకటిస్తుందిలే అన్నాడు.
*"దీన్నే అంటారు చదువు కన్నా అనుభవం గొప్పది అని"*
బ్యాంక్ అధికారి దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసుల కన్నా ముందు అతని పైఅధికారికి చెప్పగా... బ్యాంకులో దొంగతనం జరిగింది మొత్తం రూ.20 కోట్లు. మనం ఇంకో రూ.30 కోట్లు పంచుకుని మొత్తం రూ.50 కోట్లు చోరీ అయిందని చెబుదాం అన్నాడా అధికారి.!
*"దీన్నే అంటారు అసందర్భాన్ని కూడా మనకు ఉపయోగకరంగా (అవకాశంగా) మార్చుకోవడం అని"*
ఇది విన్న ఒక అధికారి ఏటా ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అనుకున్నాడు మనసులో.
*"ఇదే స్వార్థం అంటే"*
✨మరుసటి రోజు షాక్⚡
దొంగతనం జరిగిన మర్నాడు వార్తల్లో...
బ్యాంకులో రూ.100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట ముఖ్యమంత్రి ప్రకటించారు.
అంటే ఆ ముఖ్యమంత్రి వాటా రూ.50 కోట్లన్నమాట._
ఆశ్చర్యపోయిన దొంగలు డబ్బుని లెక్కపెట్టారు. మొత్తం రూ.20 కోట్లు ఉన్నట్టు తేలింది.
అదేంటి మనం రూ.20 కోట్లు దొంగతనం చేస్తే మిగిలిన రూ.80 కోట్లు ఎవరు దొంగతనం చేశారని వారు ఆశ్చర్యపోయారు.!
దొంగలకి విషయం అర్థం అయింది, దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. మనం మన ప్రాణాలు పణంగా పెట్టి రూ.20 కోట్లు దొంగతనం చేస్తే, వీళ్లు మాత్రం దొరల్లా రూ.80 కోట్లు దోచేసుకున్నారు అని.
*"చదువు అవసరం ఇప్పుడు తెలిసింది" అని అన్నాడు*
మన భారతదేశం ఇలాంటి దొంగల చేతుల్లోనూ, అధికారుల మాటల్లోనూ, రాజకీయ నాయకుల పాలనలోనూ నడుస్తున్నది.
ఒక రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అప్పుడు ఎంపీ కృపాలాని ఎదురై ఇలా అన్నారట.
_కృపాలాని:_ ఏంటి అంబేడ్కర్ ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నారేంటి.?
_అంబేడ్కర్:_ ఈ భారతదేశంలో రాణుల కడుపులో నుంచి రాజులు పుట్టటం చూశాం. కానీ నేను రాణుల కడుపులో నుంచి కాకుండా నా ప్రజల ఓట్లతో ఓట్లపెట్టె నుంచి రాజులు పుట్టేలా ఏర్పాటు చేశాను.. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను.
_కృపాలాని:_ అయితే నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు..
ఎందుకంటే నీ ప్రజలు పేదవారు, నిస్సహాయులు, అడుక్కునే వాళ్లు, అమ్మడుపోయే వాళ్ళు..
మేము వారి ఓట్లు కొని మా ప్రభుత్వాలు ఏర్పాటుచేసి ప్రజల సొమ్మును దోచుకుని వాళ్లను బిచ్చగాళ్లను చేస్తాం, నువ్ ఏమీ చేయలేవు.
_అంబేడ్కర్:_ నా ప్రజలు పేదలే, నిస్సాహయులే, అడుక్కునే వారే, అమ్ముడుపోయే వారే..
వారి ఓట్లను కొని,
మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు..
కానీ, ఏ రోజయితే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో అప్పుడు మీకన్నా బిచ్చగాళ్లు ఎవరు ఉండరు, అది గుర్తుంచుకోండి అన్నారు బాబాసాహెబ్.
*_ఇది కథ కాదు.. జరిగిన సంఘటన._*
*నీ ఓటు విలువ నువ్వు గుర్తించే వరకూ ఈ అవినీతిపరుల చేతుల్లో బలవుతూ ఉండాల్సిందే..
💐అందరికి శుభోదయం 💐
.....
ఏవరో మిత్రులు పంపించారు....
వారికి నా అభినందనలు..💐 💐 💐
*కూరగాయల మనోభావాలు..*
*గోంగూరకి* ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...
*తోటకూరకి* వయ్యారం ఏక్కువ ..
ఏందుకంటే నవనవ లాడతానని ...
*పొట్లకాయకి* పొగరు ఎక్కువ..
ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....
*చిక్కుడుకు* చికాకు ఎక్కువ..
ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....
*కందకి*..వెటకారం ఎక్కువ..
ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....
*చేమకు* చిమచిమలు ఏక్కువ ...
ఏందుకంటే కూర - పులుసు - fri గా ఉపయోగ పడతానని ...
*పేండలానికి* పేంకితనo ఏక్కువ ....
కత్తిపీటతో తరూగూతారని ...
*మునగకాయకి* మురిపం ఏక్కువ ...
మగవారికి దివ్య ఔషధం అని ...
*వంకాయకి* గర్వమెక్కువ ..
కూరగాయలన్నింటికీ తనే రారాజునని....
*అరటికాయకి* అభిమానం ఏక్కువ ...
శాఖాకూర అయిన తనను మాంసంతో పోల్చి లంకమాంసం అంటారని ..
*బెండకాయకి* ఆనందమెక్కువ..
తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....
*దొండకాయకి* ఆందోళనెక్కువ..
కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....
*కాకరకాయకి* శాంతమెక్కువ..
ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....
*బంగాళాదుంపకి* సహనమెక్కువ..
కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....
*గుమ్మడికాయకి* గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....
*ఆనపకాయకి* ఆనందం ఏక్కువ ...
యేలాగయినా అన్నిరకాలుగా తనని తింటారని ...
*ఉల్లిపాయకి* టెక్కు ఎక్కున..
తానులేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....
*మిర్చికి* కోపమెక్కువ..
ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....
*కరివేపాకుకి* మిడిసిపాటు ఎక్కువ..
తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....
*బీరకాయకి* దిగులెక్కువ..
తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....
*కారెట్ కి బీట్ రూట్ కి* హంగామా ఎక్కువ..
తమంతటి రంగు ఎవరికీ లేదని....!!
ఆఖరిగా *పనస పొట్టుకి* పరువం ఏక్కువ (గ్లామరు)
ఏలాంటి వాళ్ళనైనా సంత్రుప్తి పరుస్తానని ....
.......
కనువిప్పు కలిగించే యదార్ధ గాథ. 🙏
‘ ఓమ్ భూర్భువస్సువః –తత్సవితు ర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి– థియో యోనః ప్రచోదయాత్-‘
అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న’ గాయత్రీ మంత్రా’ న్ని విని వినోద్, వనజా నవ్వుకున్నారు.
“తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు గంటల సమయం వృధా చేసుకుంటున్నారు. దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా!” అన్నాడు వినోద్. వంటగదిలోంచి వీరి మాటలు వింటున్న బామ్మ భవాని ” ఏరా! తాతగారిని విమర్శించేంత గొప్పవారా మీరు! మీకేం తెల్సురా ‘ గాయత్రీ ‘ మాత ప్రభావం ? “అంది కోపంగా.
“ఏంటర్రా! పిల్లలూ! మీ బామ్మ ఏదో చెప్తున్నట్లుంది ? ఏదైనా కధా?” అని అడిగాడు తాత తారకరామయ్య.
“వీరికి కాస్త గాయత్రి గురించి చెప్పండి .’గాయత్రీ మాత ‘మహత్వం తెలీక ఏదో అనుకుంటున్నారు . పైకి అనలేదు కానీ వీరి మనస్సుల్లో ‘ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?’ అనే సందేహం మాత్రం ఉంది .” అంటూ బామ్మ వంట గదిలోకి వెళ్ళింది.
తారకరామయ్య తన వాలు కుర్చీలో కూర్చున్నాక, పిల్లలిద్దరూ వెళ్ళి ఆయన కిరువైపులా స్టూల్స్ లాక్కుని కూర్చుని ” తాతగారూ చెప్పరూ! ప్లీజ్ ! ” అని అడిగారు.
ఆయన గొంతు సవరించుకుని చెప్పసాగారు. “ఇది నిజంగా జరిగిన సంఘటన, కల్పనా కాదు, ఎవరో రాసిన కధా కాదు. యదార్ధగాధ. అది ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పటి విషయం, అప్పటి ఒక ఆంగ్ల దొర ‘ధామస్ మన్రో ’ అనే ఆయన పేరని గుర్తు. క్యాంప్ మీద కన్నడదేశానికి వచ్చి, ఒక రోజున తన గుఱ్ఱం మీద తుంగభద్రా నది ఒడ్డున షికారుకు బయల్దేరాడు . ఆయన తోటి షుమారుగా అరడజను మంది జవాన్లు గుఱ్ఱంతో పాటుగా పక్కనే పరుగెడుతూ అనుసరించ సాగారు.
” మన గురించీ ఏమనుకుంటున్నారు జనం?” ధామస్ తన వెంట ఉన్న వారిని అడిగాడు. ” “చాలామంచివారనుకుంటున్నారు దొరా!” వారిలో ఒక ముఖ్య సేవకుడు, బాపన్న చెప్పాడు.
” మీరంటే అందరికీ భయమే దొరా!” ముఖప్రీతికై మరో జవాన్ చెప్పాడు.
” సరి, సరి.ఈ రోజు విశేషాలేంటి?” ధామస్ మళ్ళీ అడిగాడు.
“ఏమున్నాయ్ దొరా! మీరీ సమయంలో షికారుకు వస్తున్నారు కదా ఈ వారంగా ఒక్కపిట్టా ఈ దారంట రాదు.”
“ఓహ్! అక్క డ చాలామంది జనం ఉన్నారు? ఏంటి విశేషం! ” ఆశ్చర్యంగా అడిగాడు ధామస్ .
” దొరా! అక్కడ నది ఒడ్డున ‘ శృంగేరి పీఠాధిపతులు’ కొలువు చేసి ఉన్నారు , ఆయన శిష్యులూ , స్వామి వారి ప్రవచనం ఆలకించను ఊరి జనమూ చేరి ఉన్నారు దొరా!”
“శృంగేరీ పీఠమా! అదేంటీ ఎన్నడూ విన లేదే?”
” దొరా ! మీరిక్కడికి ఎప్పుడూ రాలేదు కదా ! అంచేత విని ఉండరు. ఈ కన్నడదేశంలోని , చిక్క మగళూరు దగ్గరే శృంగేరి ఉంది. ఆది శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం మొదటి మఠాన్ని ఇక్కడ శృంగేరీ లో స్థాపించారు.”
” శృంగేరి అంటే అర్ధమేంటి ? దానికా పేరు మఠస్థాపన తర్వాత వచ్చిందా ? లేక ముందు నుంచే ఉందా? “ “శృంగేరి తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది దొరా!. తుంగభద్ర నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం , తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉన్నాయి . శృంగేరి అనే పేరు ‘ఋష్యశృంగగిరి ‘నుండి వచ్చిందని అంటారు దొరా! శృంగేరికి సమీపంలో ’ శృంగపర్వతం’ ఉన్నది . విభండక మహర్షి కుమారు డు ‘ ఋష్యశృంగ ‘ మహర్షి. ఈ యోగి మహానుభావుడు ఒకసారి ‘రోమపాదు’ డనే రాజు పాలిస్తున్న ‘అంగ రాజ్యం’ క్షామానికి గురై , జనం బాధపడసాగారుట. ఆ సమయంలో, ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే వర్షాలు పడి, క్షామ నివారణ ఐనదని అంటారు . ఈ గ్రామములో శంకరాచార్యులు అద్వైతాన్ని వ్యాప్తి చేయ టానికై స్థాపించినదే ఈ శృంగేరీ శంకరమఠం. ”
” ఎంతైనా మీ భారతదేశం చాలా గొప్పదోయ్ ! మహాను భావులు ఎంతోమంది ధర్మస్థాపనకై కృషి చేసిన ‘పుణ్యభూమి’ మీది. నాకెంతో ఇష్టం మీ దేశమంటే , నేనిక్కడ పుట్టకపోతినే అని బాధపడుతుంటాను అప్పుడప్పుడూ.” ధామస్ మనస్పూర్తిగా అన్నాడు.
“ఔ దొరా! మాదేశం మహా గొప్పది!” మురిసిపోతూ తన దేశాన్ని గురించీ చెప్పుకున్నాడు మరో జవాన్ రొప్పుతూ వెంట నడుస్తూ.
” శంకరాచార్యుల వారు మఠాన్నిఇక్కడే ఎందుకు స్థాపించాలనుకున్నారో తెల్సా?” థామస్ అడిగాడు.
“శంకరాచార్యుల వారు, తన పరివార శిష్యులతో ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతూ ఇక్కడ పర్యటిస్తూన్నప్పుడు, ఆయన ఒక చిత్రం చూశారు దొరా! ఒక సర్పం ప్రసవిస్తున్నఒక కప్పకు ఎండ పడకుండా తన పడగ నీడ పడుతున్న దృశ్యం , ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు , ఈ స్థల మహత్యం గొప్పదని గమనించారు . అంతే కాక ఇక్కడ వరకు వచ్చేసరికి మండన మిశ్రుడి భార్య ఐన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారి పోతుంది. ఆ కధ చాలాపెద్దది ఇంకోమారు చెప్తాను దొరా! ఈ రెండు సంఘటనలు చూసిన ఆయన ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మఠాన్ని స్థాపిస్తారు . ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెప్తారు. అంత గొప్ప పుణ్యక్షేత్రం ఈ శృంగేరి.”
“మరి ఆ మహాపురుషుడేనా ఈయన? ”
” కాదు దొరా అది జరిగి చాలా ఏళ్ళైంది . ఈయన ఆ గురు పరంపరలోనివారే ! వీరంతా బాల్యంలోనే పీఠాన్ని చేరి వేద వేదాంగాలూ , శంకరాచార్యుల వారు ప్రవచించిన విశేషాలన్నీ అధ్యయనం చేస్తారు దొరా ! వీరంతా బ్రహ్మచారులు, ఎవ్వరూ వారిని ముట్టుకోడం కాదుగదా! దరిదాపులకు వెళ్ళనే ఝడుస్తారు , స్త్రీలైతే బహు దూరం నుంచీ దర్శించవలసినదే! వారు అనుగ్రహ భాషణంలోని ఆధ్యాత్మిక విషయాలు చాలా గొప్పవి దొరా! ఒక్కటి ఆచరిస్తే చాలు జన్మ సార్ధకమవుతుంది.” దూరం నుంచీ ఆ ఆచార్యులను గమనించిన ధామస్ ” ఆహా! ఆ ముఖ వర్చస్సెంత గొప్పగా ఉంది! వెయ్యి వాల్టుల బల్బు వెలుగుతున్నట్లుంది వారి తేజస్సు! మరి బాపన్నా! ఆచార్యుల చెంతగా ఉన్న ఆ స్త్రీ మూర్తి ఎవరు? స్త్రీలకు ప్రవేశమే లేదన్నట్లు చెప్పావు ? మరి వారికి అంత దగ్గరగా ఉన్న ఆ అందమైన , అద్భుతమూర్తి, టీనేజ్ గాళ్ !ఎవరు బాపన్నా! వెళ్ళి తెల్సుకుని వస్తావా? ఈజ్ షీ హిజ్ సిస్టర్ !” ” దొరా! మాకక్కడ ఎవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే! మీకెవరు కనిపిస్తున్నారు?”
” అదో బాపన్నా! అంత బాగా కనిపిస్తుంటే లేదంటావేం? వెళ్ళి అడిగిరాపో?” అన్నాడు ధామస్ దొర .
దొర ఆదేశం మేరకు బాపన్న చేతులు కట్టుకుని దగ్గరగా వెళ్ళి వినయంగా , ఆచార్య శిష్యులకు తమ దొర సందేహం విన్నవించాడు .
ఆ శిష్యుడు ఆశ్చర్యంగా ” అక్కడ మాకెవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే ! అసలిక్కడ స్త్రీలకు ప్రవేశమేలేదే?” అన్నాడు. బాపన్న” ఔ స్వామీ! మాకూ కనిపించడంలేదు . కానీ మా దొరకు కనిపిస్తున్నదిట! అడిగి వివరం తెల్సుకు రమ్మన్నారు. పీఠాధిపతులకు విన్నవించండి”అన్నాడు.
ఆ శిష్యుడు పీఠాధిపతులను సమీపించి , ఆ దొరగారి సందేహాన్ని చెప్పగానే , ఆశ్చర్యంగా ఆయన తలెత్తి దూరంగా గుఱ్ఱం దిగి తననే దీక్షగా చూస్తున్న ఆ దొరను చూసి,” నాయనా! నా సమీపంలో ఉన్నది శారదా మాత! ఆ తల్లి దర్శనం ఎవరికో నిష్టగా గాయత్రి చేసే వారికి కానీ లభించదు . నేను ఇక్కడ ప్రవచిస్తున్నప్పుడంతా ఆ మాత నా సమీపంలో ఉండి సద్వాఃక్కులను నా నోట పలికిస్తుంటుంది . నాశిష్యులైన మీరే కాంచలేని ‘అమ్మ’ను ఆ దొర దర్శించాడంటే ఆయన పూర్వజన్మలో భారతదేశంలో జన్మించి , గాయత్రీ జపం సంపూర్ణంగా , నిష్టగా గావించి ఏదో ఒక కారణాంతరంవల్ల ఆంగ్లేయుడై , ఆ ప్రాచ్యదేశంలో జన్మిం చాడు. నేను పీఠాధిపతిని కనుక ఆయనకు నమస్కరించరాదు . లేనిచో ఆయన నమస్కార అర్హుడని వెళ్ళి చెప్పిరా!” అని శృంగేరీ పీఠాధిపతి చెప్పిపంపారు. ‘
“అదిరా గాయత్రీ మంత్ర మహత్యం అర్ధమైందనుకుంటా ! నియమంగా భక్తితో జపించిన వారికి ఈ జన్మలోనే కాక మరు జన్మలోనూ రక్షణ నందిస్తుంది.” అని తాతగారు వివరంగా చెప్పారు. .
పిల్లలిద్దరూ ” మన్నించండి తాతగారూ!! మాకివన్నీతెలీక తేలిగ్గా మాట్లాడాము. మాకూ ’ గాయత్రి’ ఉపదేశించండి.. ఈ వేసవిలో ఇక్కడ ఉన్నన్నాళ్ళూ మీతో పాటు రోజూ గాయత్రి చేస్తాము . మా ఊరువెళ్ళాక వీలున్నంత సేపు నిత్య గాయత్రీ చేసేందుకు ప్రయత్నిస్తాము.” అన్నారు
విదుర నీతి: నిద్ర పట్టని వాళ్లు ఎవరు?
జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.
ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.
రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.
సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!
జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.
మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.
‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు. సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!
.......
No comments:
Post a Comment