Saturday, 16 July 2022


ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది.

ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ  ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం.

తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి.

జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం.

ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..!

సా.. ధ.. న  అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు.

అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు.

     సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు  విచక్షణ,

వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి.

కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు.

ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు.

  ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే.

    నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు.

     భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి.


ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని  ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి.

అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు.

సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం!

సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన  చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత  శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా  చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు.


వినయానికున్న విలువ


సత్య భామ శ్రీకృష్ణునితో ఒకసారి’ స్వామీ ! రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా’ అని అడిగింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడుడు “ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా”అన్నాడు. పక్కనే ఉన్న సుదర్శనుడు (సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా! అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.నాతో సరితూగు వారెవరు స్వామీ అన్నాడు. ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.


దీర్ఘంగా ఆలోచించిన నారాయణుడు..

సత్యా, నువ్వు సీతగా మారిపో…నేను రాముణ్నవుతాను. గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా. చక్రమా !నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు, అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.


గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. హనుమ ఆనందంతో పుల కించిపోతూ ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు. ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు. కానీ.. ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు. ఇంతలో..’హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. ’లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా’అని అడగ్గా..

హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.ఎన్ని చెప్పినా వినక పోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు.


సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై పడి ‘స్వామీ !మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.

అలా కృష్ణపరమాత్ముడు ముగ్గురిలోనూ మొగ్గతొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలువేమిటో తెలియ చెప్పాడు.

................


వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది.

లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది.

‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘,

‘నేను చెప్పేదేమిటంటే’...

అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు.

మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా,  ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు.

ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత.

హిట్లర్‌ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది.

అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి.

చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే.

ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది.

ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది.

అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం.

అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి.  తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న  అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది.

విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో  మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది.

అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం.

అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి.


         *తెలుగు సంవత్సరాల పేర్లు...*

                   *వాటి అర్థాలు*

                    ➖➖➖✍️


*1. ప్రభవ అంటే... ప్రభవించునది!అంటే... పుట్టుక.*


*2. విభవ - వైభవంగా ఉండేది.*


*3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.*


*4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.*


*5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.*


*6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.*


*7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.*


*8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.*


*9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.*


*10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.*


*11. ఈశ్వర... పరమేశ్వరుడు.*


*12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.*


*13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.*


*14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.*


*15. వృష ... చర్మం.*


*16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.*


*17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం!*

*18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.*


*19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.*


*20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.*


*21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.*


*22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.*


*23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.*


*24. వికృతి... వికృతమైనటువంటిది.*


*25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.*


*26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.*


*27. విజయ... విశేషమైన జయం కలిగినది.*


*28. జయ.... జయాన్ని కలిగించేది. *


*29. మన్మథ... మనస్సును మధించేది.*


*30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.*


*31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.*


*32. విలంబి... సాగదీయడం.*


*33. వికారి.... వికారం కలిగినది.*


*34. శార్వరి... రాత్రి.*


*35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.*


*36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.*


*37. శోభకృత్... శోభను కలిగించేది.*


*38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.*


*39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.*


*40. పరాభవ ... అవమానం.*


*41. ప్లవంగ... కోతి, కప్ప.*


*42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.*


*43. సౌమ్య... మృదుత్వం.*


*44. సాధారణ... సామాన్యం.*


*45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.*


*46. పరీధావి... భయకారకం.*


*47. ప్రమాదీచ... ప్రమాద కారకం.*


*48. ఆనంద... ఆనందమయం.*


*49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.*


*50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.*


*51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.*


*52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.*


*53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.*


*54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.*


*55. దుర్మతి... దుష్ట బుద్ధి.*


*56. దుందుభి ... వరుణుడు.*


*57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.*


*58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.*


*59. క్రోదన... కోప స్వభావం కలది.*


*60. అక్షయ... నశించనిది.*

,...................


*

No comments:

Post a Comment