Sunday, 13 September 2020

stories

: దాతృత్వం

దాత పిసినారి. చచ్చినా భూమిపై దేన్నీ వదిలిపెట్టడు. అంతా దానం చేసి వెళ్ళిపోతాడు. పిసినారి గొప్ప త్యాగి. చచ్చిన తరవాత అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తనవెంట ఏదీ తీసికొని వెళ్ళడు. దాతను, పిసినారిని గురించి పూర్వకవులు చేసిన చమత్కార వ్యాఖ్య ఇది!
దానం చేయకపోతే మరుసటి జన్మలో దరిద్రం వస్తుందని, దానాలు చేస్తే తరవాతి జన్మలో సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతాయి.
దాతృత్వం అనేది నిజంగా ఒక గొప్ప గుణం. లోకంలో ఉదార చరితులైన మహాత్ములు ప్రాణులందరినీ తమవారిగానే భావించి దానాలు చేస్తారని, సంకుచితమైన మనసు కలిగిన అల్పులు మాత్రం ప్రాణుల్లో స్వపర భేదాలను సృష్టించుకొంటూ భేదభావం ప్రదర్శిస్తారని ప్రాచీన నీతి చెబుతోంది.
దానం చేసేవాడి చేయి ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. యాచించేవాడి చేయి ఎప్పుడూ కిందనే ఉంటుంది. ఇదీ దాతకు, యాచకుడికి ఉన్న తేడా!
సముద్రం భూమి అంతా విస్తరించి ఉంది. కానీ ఏం లాభం? ఏ ప్రాణికైనా దాహం వేస్తే గుక్కెడు మంచినీళ్లను కూడా ఇవ్వలేదు. ఎక్కడో మూలలో ఉన్న చేదబావి చిన్నదే. కానీ దాహం వేస్తే అందరూ ఆ చిన్నబావినే ఆశ్రయిస్తారు. దాత కూడా చేదబావిలాంటివాడే. పిసినారి సముద్రంతో సమానుడు!
దానం చేయాలనే ఆలోచన రాగానే వెంటనే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక చేయినుంచి మరొక చేతిలోనికి తీసుకొనేలోగా బుద్ధి మారిపోవచ్చు. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానం చేయమంటాయి ధర్మశాస్త్రాలు! అమోఘ దానశీలంతో చరిత్రలో నిలిచిపోయిన బలి, శిబి, దధీచి, కర్ణుల వంటివారు చేసింది అదేనని గ్రంథాలు చెబుతున్నాయి.
సంపాదించిన ధనానికి మూడే మార్గాలుంటాయి... వాటిలో మొదటిది, శ్రేష్ఠమైంది దానమని, రెండోది మధ్య మార్గమైన భోగమని, ఈ రెండూ చేయకపోతే మూడో మార్గం నశించిపోవడమేనని భర్తృహరి సుభాషిత త్రిశతిలో అంటాడు. కనుక దానం చేసి శ్రేష్ఠులుగా నిలిచిపోవాలని సందేశం.
పాలు ఇవ్వడం ద్వారా గోవులు, ఫలాలను ఇవ్వడం ద్వారా చెట్లు... ఎప్పుడూ పరోపకారమే చేస్తాయి. అలా జీవించడం ప్రశంసార్హం.
తేనెటీగలు ఎంతో శ్రమించి, పుప్పొడులను సేకరించి తేనెలను దాచుకుంటాయి. కానీ, ఏం లాభం? ఎంతగా దాచినా, ఆ తేనెలను మనుషులు దోచుకుంటారు. అవసరానికి మించి ఎంతగా దాచినా, అది పరుల పాలవుతుంది.
మనిషి తనకు సంపదలు పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు బాగా చేయాలి. సంపదలు ఎప్పుడు నశించిపోతాయో ఎవరికీ తెలియదు. అవి వ్యర్థంగా నశించిపోయాక విచారించి లాభం లేదు. కనుక కలిగి ఉన్నప్పుడే దానం చేయాలి.
ఆర్తులకు దానం చేయడం ఉపయోగం. అందుకే పాత్రోచిత దానం ఫలాన్నిస్తుంది. ఆకలిగొన్నవాడికి ఆహారం పెట్టాలిగాని, అజీర్ణమైనవాడికి ఆహారం పెడితే ఏం ప్రయోజనం?
పరోపకారం కోసమే మేఘాలు వర్షిస్తాయి. పరోపకారం కోసమే చెట్లు ఫలాలనిస్తాయి. పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి. మనిషికి భగవంతుడు ఇచ్చిన అమూల్య శరీరమూ పరోపకారానికే ఉపయోగపడాలి. బలవర్ధకాలైన ఆహారాలతో శరీరాన్ని ఎంతగా పోషించినా, శారీరక శక్తిని పరోపకారం కోసం వినియోగించకపోతే, కొవ్వు పెరగడానికి తప్ప దేనికీ ఉపయోగపడదు.
దాతృత్వం ఒక వరం. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. ప్రపంచంలోని చరాచరాలన్నీ అనాదిగా అందిస్తున్న సంపదలే నేడు మనిషికి సౌఖ్యజీవన సాధనాలైనాయి. చేసిన దానం తరతరాలూ చెరిగిపోకుండా నిలుస్తుంది. చివరికి మిగిలేది అదే!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ
 

 మూలాలకు తరలి వెళదాం
××××××××××××××××××××
"నాన్నగారు! చదువుకున్న నేను ఉద్యోగం చెయ్యకూడదా? అమ్మ కూడా పెద్ద చదువులు చదివింది, అయినా మీరు ఉద్యోగం చెయ్యనివ్వలేదు.          పెద్దవదినని కూడా ఉద్యోగం మాన్పించారు...                ఎందుకని నాన్నా... " నిలదీస్తున్నట్లుగా ప్రశ్నించింది వైష్ణవి.

"బంగారూ..." కూతుర్ని ప్రేమగా అలానే పిలుస్తారు చంద్రశేఖరం గారు...

"ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే పాతికేళ్ల కిందట మీ అమ్మకు, నాలుగేళ్ళ కిందట మీ పెద్ద వదినకు వచ్చింది. కానీ నా పెద్దరికానికి విలువనిస్తూ, మీ అన్నయ్యతో సహా అందరూ ఎదురు ప్రశ్నించలేదు. ఇప్పుడు అందరికీ ఒకేసారి వివరంగా చెప్తాను... ఇలా వచ్చి కూర్చోండి." అన్నారు చంద్రశేఖరం గారు.

విషయం గంభీరమైనదిగా అనిపించి కొడుకులు ఇద్దరూ గోపాల కృష్ణ, వంశీకృష్ణ చేస్తున్న పని అక్కడికి ఆపుజేసి వచ్చి తండ్రి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. భార్య శైలజ, పెద్దకోడలు సుహాసిని ఎదురుగా చాప పరుచుకుని కూర్చున్నారు. వైష్ణవి నాన్న కూచి. తండ్రి వడిలో తలపెట్టి కూర్చున్నది. కూతురి తల నిమురుతూ చెప్పడం ప్రారంభించారు చంద్రశేఖరం గారు.

"మా నాన్నగారు నాకు 16, మీ అమ్మకు 12 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేశారు. అప్పటికి బాల్యవివాహాల నిషేధం ఉంది. అయినప్పటికీ వృద్ధులైన మా తాతా బామ్మల కోర్కె తీర్చడానికి మాకు పెళ్లి చేసేశారు. అయితే నా చదువు పూర్తయి, ఉద్యోగం సంపాదించేవరకు , మీ అమ్మ వాళ్ళింట్లోనే ఉండటానికి, తనకు కూడా నచ్చినట్లు చదువుకోవడానికి , ఆతర్వాతనే కాపురానికి పంపడానికి రెండువైపుల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నా అదృష్టమో, దైవబలమో 23 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది. ఉన్న ఊళ్ళోనే ఉండే అవకాశం కలిగింది. అప్పటికి మీ అమ్మ ఇంకా డిగ్రీ చదువులోనే ఉంది. ఇంకా చదువుకుంటానని ఆశ పడింది. సరే అన్నాను. ఒక పి.జి. పూర్తిచేసింది. ఈలోగా గోపాలకృష్ణ, వంశీకృష్ణ పుట్టేరు.  పిల్లల ఆలనపాలనలో చదువు సాగలేదు. ఇంతలో బంగారుతల్లి పుట్టింది. వీళ్ళు ముగ్గురు చదువుల్లో పడేసరికి మళ్ళీ మీ అమ్మకు చదువుపై ధ్యాస మళ్లింది. వొద్దనలేదు నేను. మరొక పి.జి. చేసింది. అప్పుడు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన నాకు చెప్పింది. మన కుటుంబ పోషణకు నా జీతం సరిపోతోంది. నువ్వు ఉద్యోగం చేస్తే, ఇంట్లో నేను ఎంత సహాయం చేసినా కూడా ఒత్తిడితో సతమతమౌతావు. అంతే కాక నీవు చేసే ఉద్యోగం నీకు కాలక్షేపం మాత్రమే... మన చదువు విజ్ఞానాన్ని ఇవ్వాలి కానీ మరొకరి భవిష్యత్తును కాలరాసేది గా ఉండకూడదు, మరొకరి జీవనోపాధిని మనం అడ్డుకోకూడదు అని చెప్పేను.

మీ అందరికి గుర్తుండే ఉంటుంది... మీ అమ్మ ఇంట్లో ఉండి, మీకు బోధించిన జ్ఞానం వలన మీ చదువుల్లో మీకు వచ్చిన బహుమతులు, స్కాలర్షిప్పులు ... మీరు ట్యూషన్ ఎక్కడ చదువుతున్నారని అందరూ అడగడం... మా అమ్మ దగ్గర అని మీరందరు గర్వంగా చెప్పడం..."

కాసేపు చెప్పడం ఆపి పిల్లల వైపు చూసారు. అందరూ తల ఊచారు.

"చదువు జ్ఞాన సముపార్జనకే కానీ ఉద్యోగం చేయడానికి కాదు. మన ఇంట్లో ఉన్న అందరూ ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు కదా... ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అవసరానికి మించి ధన సంపాదన చేయాల్సిన పని లేదు"

"నాన్నా! మీ మాటలకు అడ్డువస్తున్నాను అనుకోకండి. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ లేకుండా కట్టడి చేయడం కాదా ఇది?" ప్రశ్నించింది వైష్ణవి.

"శైలజా, నీకు మీ పుట్టింటివారు ఇచ్చిన నగలు, ధనం, నాకు కట్నం పేరుతో ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

" నా దగ్గర బీరువాలో కొన్ని, లాకర్ లోకొన్ని నగలు, బాంక్ లో డబ్బు, మీకు ఇచ్చిన కట్నం డబ్బులు కూడా నా పేరునే వేశారు కదా... మా నాన్న ఇచ్చిన భూమి కూడా నా పేరునే ఉంది" అన్నది శైలజ.

"అమ్మా సుహాసిని, నీ సంగతి?"

"నా డబ్బు, నగలు అన్ని నా దగ్గరే ఉన్నాయి మామగారు"

"వైష్ణవి, నీకు చేయించిన నగలు, నీకు మీ అన్నలు, అమ్మ, నేను ఇస్తున్న డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

"నా దగ్గరే, బాంక్ లో డబ్బులు ఉన్నాయి"

"మీకెవరికైనా భావ వ్యక్తీకరణ లో కానీ, చదువు సంధ్యలలో కానీ, ఏ పని చేయడానికైనా కానీ షరతులు, కట్టుబాట్లు ఉన్నాయా?"

"లేవు"

"అంటే మనింటికి సంబంధించినంత వరకు స్త్రీధనం, స్త్రీస్వేచ్ఛకు భంగం లేనట్లే కదా" నవ్వుతూ అడిగారు చంద్రశేఖరం గారు.

"చూడమ్మా... మన ఇంట్లో పురుషాధిక్యత కానీ, స్త్రీ అణచివేత కానీ ఉండదు. స్త్రీ భావి తరాలకు ఆరోగ్యమైన సంతానాన్ని అందించాలి. అది మగవారిగా మాకు చేతకాని పని. సాధ్యమైనంత వరకు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండి, వేళకు తింటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటే చక్కని బిడ్డలు కలుగుతారు. ఇంట్లో పనులు చేసుకుంటూ, తనవాళ్ళు వచ్చేసరికి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, బయటనుంచి వచ్చేవారికి, ఇంట్లో ఉన్నవారికి కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడే బంధాలు బాగుంటాయి.  

పగలంతా ఉద్యోగం పేరుతో ఇద్దరు అలసిపోయి వచ్చి, ఒకరి మీద ఒకరు విసుక్కుంటు, ఏదో తప్పనిసరిగా ఇంత ఉడకేసుకుని తినగానే అలసిన శరీరాలు యాత్రికంగా విశ్రాంతి కోరుకొని, మళ్ళీ ఉదయం నుండి ఉరుకులు పరుగులు, తీరా పిల్లల్ని కనే సమయానికి సెలవు దొరక్క వత్తిడి, తీరా పిల్లలు పుట్టాక వాళ్ళని సరిగ్గా పెంచే తీరిక లేక, ఆయాలకు, బేబీ కేర్ సెంటర్ కు అప్పగించడం, కాస్త పెద్దవగానే హాస్టల్ లో వెయ్యడం, మేము ముసలి అవగానే వృద్ధాశ్రమానికి వెళ్లడం... అవసరం అంటావా?"

అందని దూరాలకు పరుగులెత్తి,  అందే ఆనందాల్ని, అనుబంధాల్ని దూరం చేసుకోవడం ఎందుకు తల్లి? సమాజం మారాలంటే మార్పు మనతోనే మొదలు పెడదాం. ఆరోగ్యకరమైన జాతిని అందిద్దాం. ఇదే నా ఉద్దేశ్యం" ముగించారు చంద్రశేఖరం గారు.

"మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం మామయ్యగారు. చదువుకుని, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే నన్ను ఉద్యోగం మాన్పించినందుకు మొదట్లో కోపం వచ్చినా, మీరు, అత్తయ్యగారు, మిగతా కుటుంబసభ్యులు నన్ను ఆదరించిన తీరు, నన్ను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా మన కుటుంబాలలో ఇద్దరూ ఉద్యోగస్టులవడం వలన బంధువులను పెళ్లిళ్లలో , అదికూడా మొక్కుబడిగా మాత్రమే కలవగలుగుతున్నాం.  ఇప్పుడు ఇంట్లో ఉన్న మేము మన గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు, మన కుటుంబాలలో ఉన్న మిగతా సభ్యులతో తరచుగా తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం. ముక్కు మొహం తెలియని సామాజిక అనుసంధాన వేదికల కంటే మన కుటుంబ, బంధువర్గమే పెద్దది, శ్రేయోదాయకమైనది అని అర్ధమైంది.  వంటలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఎన్నో కొత్తవిషయాలు గూగుల్ అవసరం లేకుండానే తెలుస్తున్నాయి. మీ విశాలమైన ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇది నాకే కాదు మరో మూడునెలల్లో మన కుటుంబం లోకి రాబోయే నా బిడ్డకి కూడా నేను నేర్పుతాను" అంది సుహాసిని.

"చాలా సంతోషం సుహాసిని, పిల్లలూ.. మీరేమంటారు..."

"నాన్నగారు, నేను కూడా మీరు పదవీవిరమణ చేసేవరకు ఉద్యోగం మానేస్తాను" అన్నాడు వంశీకృష్ణ...

"చిన్నన్నా... నువ్వు చేసే ఉద్యోగం మానేసేది కాదు... పదిమందికి భుక్తి పెట్టే వ్యవసాయం.. నీ పరిశోధనలు నువ్వు చేస్తూ, మరిన్ని ఎక్కువ పంటలు నిచ్చే సేంద్రీయపద్దతులు కనిపెట్టు..." అన్నది వైష్ణవి

"అంతేనంటావా.. "

"నాన్నగారు మీ ఈ విలువైన ఉపన్యాసం మా వరకే పరిమితం కాకూడదు. మీరు అనుమతిస్తే మన కుటుంబాలలో అందరికి పంపిస్తాను. సాంకేతికత మేలును కూడా చేస్తుందిగా" అన్నాడు వంశీకృష్ణ...
   * ఆడవాళ్ళని ఉద్యోగం చెయ్యనివ్వడం లేదని నన్ను ఆడిపోసుకునే మన కుటుంబంలో ని ఇతరులకు కూడా నా ఉద్దేశ్యం అర్ధమవుతుంది. నావి కుత్సిత, సంకుచిత భావాలు కావని వాళ్ళు కూడా తెలుసుకుంటారు."

కుటుంబ జీవనానికి ఆద్యం మన భారతీయం. మూలాలకు తరలి వెళదాం
కాలం విలువ

ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి, ఒక కొత్త కలను కనడానికి వయసుతో సంబంధం లేదు. మూడొందల అరవై అయిదు రోజులంటే, మూడొందల అరవై అయిదు అవకాశాలు అనుకుని మనిషి కార్యోన్ముఖుడై ముందుకు సాగిపోవాలి.
కాలం అంచు మీద జీవితం నాట్యం చేయనీయండి... ఆకు చివర మంచు బిందువులా- అని వర్ణిస్తారు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. కాలం కదలడం లేదని, మనిషి ఒంటరిగా ఉన్నానని అనుకుంటాడు... అదే అతడు తనతో తాను గడపాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి. మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం.
సమయపాలనంటే గడియారాన్ని అనుసరించి బతికేయడం కాదు. స్వయం నిర్వహణ. ముఖ్యమైన విషయాలకు ‘అవును’ అని చెప్పగలగడం. ‘కాదు’ అని చెప్పాల్సిన విషయాలకూ, అంతే శక్తితో చెప్పగలగడం. చేయాలనుకున్న పనులే కాదు. చేయకూడనివేమిటో క్రమశిక్షణతో, జీవితం పట్ల బాధ్యతతో వేరు చేయగలగాలి. ‘రేపు ఎక్కడుండాలి’ అని అనుకుంటే, కాలాన్ని ఆ దిశలోనే వెచ్చించాలి. ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు. ఆధ్యాత్మికమైన ఆలోచనలను ఆకళింపజేసుకుంటే భవిష్యత్తులో మానసిక వైద్యులను సంప్రతించే పని తప్పుతుంది. మనశ్శాంతీ దక్కుతుంది.
చరిత్రలో కాలాన్ని సక్రమంగా వెచ్చించకుండా ఎవరూ విజేతలు కాలేదు. విజేతలను చూసి వారు అదృష్టవంతులని ఆసూయపడటంకంటే కాలాన్ని మనసు పెట్టి సద్వినియోగం చేసుకునే పనిలో నిమగ్నం కావాలి. కాలాన్ని వెచ్చించిన చోటే భవిష్యత్తు మొలకెత్తుతుంది! జనన మరణాల మధ్య మనిషి ఎన్నింటినో ఎదుర్కొంటుంటాడు. కొందరు ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిస్తే, మరికొందరు ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు. చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు.
జీవితానికి కాలం మూలాధారం. పుట్టగానే ఎంతో ‘కాలం’ ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయి ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవడానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే. కాలానికి విలువను ఇచ్చేవారే జీవితానికి విలువనిస్తారని గ్రహించాలి. ‘నేను ఏది ముఖ్యమని నమ్మానో, దాని కోసం నాకు సరిపోయేంత సమయముంది చేయడానికి’ అని అనుకోగలిగే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు.
కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంది అంటూంటారు. ఒక రుతువు తరవాత మరొకటి. రోజులు, నెలలు సంవత్సరాల్లో ప్రచండ వేగంతో ఎగిరిపోతున్నట్లు ఉంటుంది. ‘ఏం సాధించలేకపోతున్నాం’ అని చింతించేవారు ఎందరో. కదిలిపోయే ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి. దేనికోసం లావాదేవీలు జరుపుతున్నాం... కోపం, అసూయలతోనా, గతం గురించిన వ్యక్తమైన బాధతోనా, భవిష్యత్తు గురించిన చింతతోనా... ఈ భూమ్మీదకు మనమెందుకొచ్చాం, దేనికోసం అన్న యథార్థాలను గ్రహించి ఆకళింపజేసుకోవడానికా... వీటి పై జీవితంలో స్పష్టత అవసరం.
ప్రకాశానికి అడ్డుతగలకుండా ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజూ ధ్యానం కోసం సమయం కేటాయించాలి. లక్ష్యసాధనకు మార్గం ఏర్పడుతుంది. ఎంత సమయం కేటాయించగలిగితే అంత సార్థకత. జీవితం ఊహాతీతం. మనిషి ఎంపికలు, ఫలితాలు, ప్రేరణలు... ఎలా ఉన్నా గడియారం అదే వేగంతో కదులుతుంటుంది. కాలాన్ని సక్రమంగా వినియోగించుకుని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం. కాలం నేర్పే పాఠాలెన్నో! కాలం విలువను గ్రహించకపోతే, ఆ తరవాత అది మనిషితో తనకు తోచిన విధంగా ఆడుకుంటుంది. జీవితంలో మనిషి తన ఆనందపు తాళం చెవులను ఎవరి చేతిలోనూ పెట్టకూడదనే సత్యాన్ని తెలుసుకోవాలి.
- మంత్రవాది మహేశ్వర్‌

🙏 *శుభోదయం*🙏
ప్రాంజలి ప్రభ.. అంతర్జాల పత్రిక
1. *ఎంత సంపాదించినా కలగని ఆనందం.*
*ఒక మంచి మిత్రుణ్ణి సంపాదించినపుడు కలుగుతుంది.*
2. "కోపం కళ్ళల్లో ఉండాలి.... బాధ గుండెల్లో ఉండాలి.... పెదాలపై ఎప్పుడు చిరునవ్వే ఉండాలి
ఇవి మంచివాళ్ళ లక్షణాలు..."!
3.*గెలవడం అంటే మనుషులను కాదు, మనస్సులను గెలవాలి.*
*ముందుకు వెళ్లడం అంటే నలుగురిని తొక్కుకుంటూ కాదు నలుగురిని కలుపుకుంటు వెళ్లాడమే నిజమైన విజయం*

 

 

💐💐💐కథ : కాకి. 💐💐💐 ఈ కథ పూర్తిగా చదవండి

......నాపేరు "కాకి"నాకది మనుషులు పెట్టిన పేరు... "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు... ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.....

నాకు నలుగురు పిల్లలు..... అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి ....కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం తెలియదు... కానీ ,మాకు గుడ్లు పెట్టడం ,వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లీబిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు.....

ఆ రోజు ఆదివారం జోరువాన.. బంగాళాఖాతంలో వాయుగుండం అంట ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను...

పిల్లలేమో ఆకలి అంటున్నాయి.. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో ,డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది....

"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా".. అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను....

ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి... కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను...

సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు ...నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు ..వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ ...ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ...

మొత్తం నలుగురు... ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి ...పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి...

"అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా".. అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు...
వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .."ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను ...తిండి పెట్టడమే ఎక్కువ... దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు... కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ...

ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత....

అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు ..
"ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి "అని పోయించుకుని తింటున్నాడు ...
వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ....పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???

పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు... అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో... మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు... వెంటనే నీళ్లు తాగాడు ...బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది ...
ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు... అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన...
వాళ్లు తినడం అయిపోయింది.. అందరూ లేచారు ...ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు ...అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు... ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి....

"పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు ...నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని.. నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.....

సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా "ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా" ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు ...కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను... ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన...." ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి...

"అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి ...మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ... ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి".. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి....

వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు ... బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??

పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??

బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??

ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా... ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య...

పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు.... అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి...

ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా ... కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??

ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి ..పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??

అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది ...వెంటనే గాల్లోకి ఎగిరాను ...చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు...

గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి... పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు... చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది... "బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు" అని ఒకడు... "ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు" అని ఇంకొకరు... "నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు" అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ...
అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది ...అలాగే ఉండిపోయాడు... కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి... పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి ... నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను... ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను....

రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!
" సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం... అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం...

అయినా "ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు"..

"ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు" ..రేయ్ !మనిషి అర్థమైందా...

"ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ "....త్వరగా బయటపడరా మనిషి....

ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ....అందుకే  కథకు సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ....రేయ్ మనిషి విను....

"ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం" ...వృధాగా పోవు....

"బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం.... వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు"....

చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్...

చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు.... 

--(())--


రాముడు భరతునికి చెప్పిన రాజధర్మాలు :
+++++++++++++++++

నదులు పర్వతాలు ఉండే పర్యంతం రామాయణ కావ్యం ఉంటుందని, రామకథ నిలిచిపోతుందనేది బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం. రామ, అయనం రామాయణం. అంటే రాముని ప్రయాణం. రాముని మార్గమంతా, ప్రయాణమంతా ధర్మమయం. రాముడు చేసినదంతా ధర్మహితం, ప్రజాహితం, జాతి హితం. ధర్మనిష్ఠని కార్యదీక్షని తను తన జీవితమంతా ఆచరించి చూపిన ధర్మమూర్తి, వేదమూర్తి. పైగా ఈనాడు అంతా 'రామరాజ్యం' కావాలి అంటుండడం మనం వింటుంటాం, కంటుంటాం. కలలు కంటుంటాం. అదీ రామాయణం విశిష్టత. అదీ రాముని పరిపాలనా ప్రత్యేకత. అదే.. 'రామరాజ్యం' పరమోత్కృష్టత.

పితృవాక్య పరిపాలనకోసం శ్రీరాముడు వనవాసానికి కొచ్చేడు. భరతుడు రాముడిని వెదుక్కుంటూ మందీ మార్బలంతో, పరివారంతో రాముడ్ని కలవడానికి వస్తాడు. భరతుడు రాముడు కలుసుకుంటారు. ఆ సందర్భంలో- భరతుడు రాజు కాబట్టి రాజనీతిజ్ఞతని, ఎన్నో రాజధర్మాలని శ్రీరాముడు భరతునికి చెప్తాడు.

రాముడు భరతునికి వివరించిన ఆ రాజ ధర్మాలను ఓసారి పరిశీలిద్దాం..
©©©©©©©©©©©©

1. రాజ్యాన్ని పాలించే రాజు- దేవుడు లేడు, పరలోకం పర జన్మ లేదు. విశృంఖలత్వంతో ఇంద్రియములు ఏ రకంగా చెబితే ఆ రకంగా భ్రష్టుడేయ్య నాస్తికత్వాన్ని విడనాడాలి.

2. ఆడిన మాట తప్పకూడదు.

3. అసత్యాన్ని పలకరాదు.

4. క్రోధము విడనాడవలెను. క్రోధమువల్ల అనరాని మాటలు మాట్లాడ్డంవలన పాపము వచ్చును.

5. పెద్దలవలన పొరపాటు సంభవించినను తొందరపడి క్రోధము, కోపం తెచ్చుకోకూడదు. ఇంద్రియాలకు లొంగిపోకూడదు.

6. వ్యసనాలకు బానిసైపోకూడదు.

7. అలసత్వమును వదులుకోవాలి. అంటే సోమరితనాన్ని, మందబుద్ధిగా మత్తు మత్తుగా ఉండకూడదు.

8. నేను, చక్రవర్తి అనే అహంకారం ఉండకూడదు. తత్ఫలితంగా నేనే అధికుడ్ని అనుకుని జ్ఞానుల్ని, సిద్ధుల్ని దర్శించకుండా ఉండకూడదు.

9. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే వెంటనే చేయాలి. తర్వాత్తర్వాత చేద్దామనే అశ్రద్ధ వదులుకోవాలి.

10. రాజు ఎప్పుడూ అతి జాగరూకుడై ఉండి అప్రమత్తతతో మెలగవలెను. అప్పుడే రాచకార్యాలు సవ్యంగా సాగును. కాబట్టి మరపున కొనితెచ్చే 'ప్రమాదము'ను వదులుకోవాలి. ఇవీ రాజు ఆచరించవలసినవి.. రాజు వదులుకోవలసినవీ. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు, పైన చెప్పిన వాటిలోని అవలక్షణాలను వదులుకుని సుగుణాలతో తను పాలన సాగించాలి.

ఇక రాజ్యపాలనలో చేయవలసిన ఇతర అంశాలను  పరిశీలిద్దాం
%%%%%%%%%%%%%

1. రాజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలు మంచిని దృష్టిలో పెట్టుకునే ఉండాలి. ప్రజలమీద ఎనలేని భారాన్ని మోపే అధికమైన పన్నులు వేసి, ప్రజలను పీడనకు గురిచేయకూడదు.

2. రాజు యజ్ఞయాగాదులు చేసి దేవ, పితృ, రుషి రుణాలను తీర్చుకోవాలి. గురువులను మహర్షులను ఆచార్యులను, పెద్దలను పూజించాలి. గౌరవించాలి.

3. రాజ్యములోనున్న దీనుల, హీనుల, అనాథల, అన్నార్తుల, వృద్ధుల యోగక్షేమములు చూస్తూ మెలగాలి. అలా మెలగటం రాజధర్మం.

4. తల్లిదండ్రుల్ని, ప్రజల్నీ ప్రేమతో చూసుకోవాలి. సదాచార సంపన్నత, సత్ప్రవర్తన లోకహితం గావించేవారిని పురోహితులుగా నియమించి యజ్ఞ హోమ ఆధ్యాత్మిక కర్మలు జరిగితే చూడాలి.

5. బుద్ధి కుశలతలోను ఆలోచన శక్తిలోను ఉన్నతంగా ఉండేవారిని, తనతో సమానమైన వారిని, పరాక్రమంలో, రాజుకి తగ్గ జోడి అయ్యేటటువంటి యోధులైనవారిని మంత్రులుగా నియమించాలి. విశ్వసనీయతగలవారిని మాత్రమే మంత్రాంగం చేసేందుకు నియమించుకోవాలి.

6. ప్రలోభాలకు, ఆశలకు, భౌతిక సుఖలాలసకు, వ్యసనాలకు దూరంగా ఉండేవారిని, ఈ దౌర్భల్యాలకు లొంగని దృఢ మనస్తత్వం గలవారిని మాత్రమే ఉద్యోగిగా తీసుకోవాలి. అక్రమాలకి, అవినీతికి, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడేవారిని, ధనాశాపరులను దూరంగా ఉంచాలి. ఉంచగలగాలి.

7. అక్రమార్కుల్ని, నేరస్థుల్ని, చెడ్డవాళ్ళను, నేరం రుజువు అయిన తర్వాత మాత్రమే శిక్షించాలి. తప్పులు చేయని, దుర్మార్గులు కాని నిరపరాధులు ఒక్కరైనా శిక్షింపబడకూడదు. ఆ రకంగా నిరపరాధుల్ని శిక్షిస్తే దారిద్య్రం కలుగుతుంది.

8. ఉద్యోగులకు, మంత్రులకు వారు చేసే విధులన్నీ వారికి నిర్దేశించాలి. నిర్దేశించి వారు వారికి అప్పగించిన విధులు, బాధ్యతలు సరిగా సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాలి. రాజు ఎల్లప్పుడు ప్రజలకు అనువుగా అందుబాటులో ఉండాలి.

9. నిజాయితీ స్వచ్ఛత ఉన్నవారినే, దేశ రక్షణకు బాగా పాటుపడే సేనాపతులుగా, సంబంధిత మంత్రులుగా నియమించి, దేశ రక్షణ పటిష్టంగా, భద్రంగా ఉండేలా చూసుకోవాలి.

10. శత్రువుల, శత్రురాజుల జాడల్ని, ఎత్తుగడల్ని పసికట్టేందుకు చారుల్ని, గూఢచారుల్ని ఏర్పాటుచేసుకోవాలి.

11. దేశభక్తిపరులను, జన్మభూమిమీద నిబద్ధత కలిగినవారినే రాయబారులుగా, ఇతర రాజ్యాలకు నియమించుకోవాలి.

12. అన్నివర్ణములవారు వారి వారి విధుల్ని, ధర్మాల్ని ఆచరించేలా నడిపించాలి. రాజు, మంత్రులు, సేనాపతులు, ఉద్యోగులందరూ ధర్మబద్ధులై ఉండేలా సత్యవర్తనులై ఉండాలి. అలా వారంతా రుజుమార్గంలో ఉంటూ ప్రజలను ధర్మపథంలో, సత్యమార్గంలో నడిచేలా చూడాలి. ప్రజలను నడిపించేలా చేయాలి.

13. ప్రజల అభిమానాన్ని, ఆదరణని తన పరిపాలనా విధులతో విధానాలతో రాజు పొందగలగాలి.

ఇవీ సంక్షిప్తంగా శ్రీరాముడు భ
రతునికి చెప్పిన రాజధర్మాలు. రాజనీతిజ్ఞతలు. ఈ విధులను, విధానాలను, ధర్మాలను, కర్తవ్యాలను, బాధ్యతల్ని రాజు అనేవాడు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా నమ్మాలి. ఆచరించాలి. అమలుచేయాలి. అమలు అయ్యేలా చూడాలి. ఆచరణలో రాజు సఫలీకృతుడు కావాలి. రాజ్యం సుభిక్షం కావాలి. సౌఖ్యవంతం కావాలి. సమృద్ధివంతం కావాలి. ప్రజలు సుఖ సంతోషాలతో భోగభోగ్యాలతో సిరిసంపదలతో తులతూగాలి. రామరాజ్యం నేపథ్యంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా పాలకులు సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడే శ్రీరాముడు అందించిన అసలు సిసలైన రామరాజ్యం మళ్లీ ఆవిష్కృతమవుతుంది.

--(())--

 

No comments:

Post a Comment