🙏🌷ధర్మం’ అంటే ఏమిటి?🌷🙏
ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న! ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాల లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.
‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’
ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.
ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే). ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.
ధర్మము – సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలు.
శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||
“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;
1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిమర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.
2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.
3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.
4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.
5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.
7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.
8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.
9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.
అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించట, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం మంచిది కాదు.
కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అడుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’.
వీటినే ధర్మంగా గుర్తించారు పెద్దలు.
గారెల రాజ్యంలో...
పులిహోర పురం రాజధానిగా....
దద్దోజనం చక్రవర్తి...
చక్రపొంగలి రాణితో...
మలై కాజా మహా మంత్రి సలహాలతో...
సమోసా సైన్యధిపతిగా పరిపాలిస్తుండగా....
అతడి తమ్ముడు అప్పాలు...
వంకాయ బజ్జీ వంకర మాటలువిని...
వేడి వేడి పకోడీల్లా వేరుపడి...
కుడుముల రాజ్యం చేసుకుని...
రవ్వ లడ్డు రాజధానిగా...
మిరపకాయ బజ్జీ మంత్రిగా...
సేమ్యాపాయసం సేనానిగా... రాజ్యపాలన చేయాలని నిప్పంట్టంత నీల్గి,
నీరుల్లి వడలా వగ పడ్డాడు...
మడత కాజా లెవల్లోని లేఖకునితో...
అన్నకు కట్లెట్ భాషలో కమ్మగా వ్రాసి...
కలాకండతో కబురంపాడు...
లడ్డు బుట్టలో లేఖ పట్టుకుని..
మిర్ఛి బజ్జీ బండిలో...
తీపి గారెల కబుర్లు వింటూ...
కలాకండ వెళుతుండగా...
ఇది వేసవి కాలం కావటాన
వేరుశనగ ఉండల్లా వడదెబ్బతగిలి...
పరమాన్నపురంలో...
సున్నుండల సలహాతో...
ఇడ్లీ ఇంట విశ్రమించి...
మినపట్టు మెడికల్ సేవలతో...
మొక్క జొన్న వడల మందేసుకుని...
టమాట జామ్ తో సేదతీరి...
పాయసం ఫలహారం చేసి...
మసాలా పకోడితో మంచం దిగి...
బ్రెడ్ హల్వా బండిలో...
కరివేప వడ కళ్ళెం పట్టుకోగా...
పాలకోవా బాట చూపగా...
పుణుగులు కట్టిన బండి పరుగెత్తసాగింది...
వెజిటబుల్ వడ వెంట వస్తుండగా...
బర్ఫీ బిగువుతో...
సున్ని ఉండల కొండలూ...
కజ్జికాయల కోనలూ...
పూతరేకుల పర్వతాలూ...
సగ్గుబియ్యపాయస సముద్రాలూ...
ఖర్జూరం హల్వా కోనేరునూ...
కొబ్బరి పాయసపు కొలనునూ...
జాంగ్రీల జాగీరు నూ దాటుకుని...
ఆలూ వడ అరణ్యంలో ప్రవేసించగా...
బూరెల దొంగలూ...
కట్లెట్ కర్రలతో అడ్డుకోగా...
రవ్వ కజ్జి కాయల రక్షకులు...
బూందీ లడ్డు బూరలూది...
కాజాల జాగిలాలను రప్పించి...
సేమ్యా హల్వా శూలాలతో...
బొబ్బట్లు బొబ్బలతో భయపెట్టగా...
తొక్కుడు లడ్డు దొంగలంతా...
ఆవడల అరణ్యంలోకి పారిపోయారు...
రాజభక్తి గల రవ్వ కేసరి...
వడియాల వేగులూ...
బఠానీ వడ బంట్రోతులు...
చెర్రి జామ్ చారులూ...
కలాకండ కారణం లేని రాక తెల్సుకుని...
అన్నం పరవాన్నం పారించి...
ఉల్లిపాయ పకోడి,
అరటికాయ బజ్జీలూ దారికడ్డం వేసి...
అరిసెలు బండి అడ్డంపెట్టి...
ఊతప్పం తో వళ్ళంతా వాతలేసి...
గవ్వలతో గవదలూడ గొట్టి...
పాలకోవా బిళ్ళలతో పళ్ళు పీకి...
బాదం కేకుతో బాది...
కొబ్బరి ఖీర్ కొరడాతో కొట్టి...
గులాబ్ జామ్లతో గుచ్చి గుచ్చి...
ఉల్లిపాయ వడియపు తాళ్లతో కట్టేసి...
పాయసం తో పనిష్ చేసి...
బొంగుమిఠాయ్ తో బొమికెలు విరగ్గొట్టి...
అదిరి పోయే అల్లం, బెల్లం పచ్చడి- మిర్చి బజ్జీతో మిక్స్ చేసి పట్టించి...
ఖర్జూరం హల్వా ఖైదులో వేశారు....
చిమ్మిరుండల చారులూ...
సజ్జప్పాల సమాచరకులూ...
వెనిల్లా వేగులూ...
అప్పచ్చుల ఆత్మీయులూ అదించిన ఈ సమాచారం విని...
బూంది బాబాయ్ పెట్టిన భయంతో...
కొబ్బరి వడలా వణికిపోయి...
మిర్ఛి బజ్జీ మైత్రితో...
పెసరట్టు దొంగ ప్రేమతో...
మైసూరుపాక్ మైత్రితో...
జీళ్ళ జాయింట్లు జారిపోయి...
చిలకడ దుంపల లడ్డులా చింతించి...
సజ్జ బూరెల్లా స్వాంతనపడి...
పెసర అప్పడాల్లా పశ్చాత్తాపపడి...
ఖర్జూరం హల్వాలా కుళ్ళికుళ్ళీ ఏడ్వగా...
కరుణగల క్యారట్ పాయసపుదేవుని కారుణ్యంతో...
మైసూరు బజ్జీ బుజ్జగింపులతో మనసుమారి...
మినప్పిండి అప్పడాల్లా ముసిరిన ఆలోచనలు వదిలి...
నువ్వుండల నయ వంచకత్వం...
చెగోడీల చెప్పుడు మాటలూ...
బీరకాయ బజ్జీ బీరాలూ...
జిలేబీల జాడ్యాలూ అంటించినవి వదలుకుని...
అప్పాల్లా ఆగి ఆగి...
క్యారట్ కేక్ లా కేకలేసి...
ఉండ్రాళ్ళ లాపొర్లి పొర్లి...
హల్వా లా అరచి అరచి...
బొబ్బట్ల లా బొబ్బలేసి...
వేరుశనగ ఉండలా వేరుపడాలన్న తన చెడు చింతనకు..
పూర్ణం లా పూర్తిగా మారిపోయి...
బాదం ఐస్ క్రీం లా పశ్చాత్తాపపడి...
బాస్మతి బియ్యపు పరవాన్నంలో...
స్పాంజ్ కేక్ తోస్నానం చేసి...
సగ్గుబియ్యం వడియంలా శుధ్ధిపడి...
బ్రెడ్ హల్వాకేకుతో భయంతీరి...
జీడిపప్పు మైసూరుపాక్ లాంటి "అన్నప్రేమ " తల్చుకుని, మైమరచి...
ఐస్ క్రీం లాంటి అన్నతనను క్షమించే లా చేయమని...
ఉప్మా తో దేవుని ఉపాసించి...
పైనాపిల్ కేక్ లా ఫ్రెండ్సును పక్కకు నెట్టి...
తనకు జీడిపప్పు అచ్చు జాడ్యం వదలి నందుకు...
పిండి వడియంలా పరవసించి...
అప్పడాల వంటి అన్నను చూడాలని...
పకోడి పళ్ళెం పట్టుకుని...
బూరెల బ్యాగ్ భుజానికి తగిలించుకుని...
కొబ్బరి బొబ్బట్లు కొన్ని తీసుకుని...
ప్రియమైన వదిన కోసం పెసరపిండి వడియాలు...
స్నేహితుల కోసం సొరకాయ వడియాలు...
మరికొందరి కోసం కొబ్బరి క్యాబేజి వడలు...
ప్రేక్షకుల కోసం పాన్ కేక్సూ...
కొలువులోవారి కోసం కొబ్బరి ఉండలు...
సేవకుల కోసం సగ్గు బియ్యం పాయసంతీసుకుని...
అన్నపు పాయసం లాంటి అన్నను చేరి...
కొబ్బరి హల్వా పాయసం వంటి పాదాలు పట్టుకుని...
కోకోనట్ కేక్ లా కేక లేసి ఏడ్వగా...
అన్న ఆల్మండ్ చాకొలెట్ బార్ లా కౌగలించుకుని...
తీపికాజా లాంటి తమ్ముడ్ని...
ఆవడలా ఆలింగనం చేసుకుని...
బూడిద గుమ్మడి వడియాలవంటి బుగ్గలు ముద్దాడి...
బిడియ పడవద్దని బియ్యం పిండి వడియాల విందిచ్చాడు...
రవ్వ లడ్డు లాంటి వారి లవ్వుకు...
శాండ్ విచ్ వంటి సభికులంతా...
ఆవపెట్టిన పనసపొట్టు కూరలా ఆనందించారు
ఏమైనా మన తెలుగు రాష్త్రాల్లో లభించే మన తెలుగు వంటకాలు ని మర్చిపోయుంటే గుర్తుచేయగలరు.
---((()))--+
కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది....
అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నాకోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను.
కానీ, ఈరోజు, నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూలపానుపు కాదు అని. నేను ఊహించినదాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు, బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి.
నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా, పైజామాలతో రోజంతా, ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ, నేను అందరి గురిచి శ్రధ్ధ తీసుకోవాలి.
అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలుపోవాలని అనిపిస్తుంది.
మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచం లో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది.
కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది....నువ్వు కూడా ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చినదానివేగా అని....నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా...నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళి నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది..
నేను చెప్తున్నా అమ్మ...కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితం లో మాకోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయి. థాంక్ యూ అమ్మా...
నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయల్దేరాడు. దేశంలో చాలా రోజులపాటు తెగ తిరిగాడు.
చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు.
ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది. ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు.
నిజంగానే ఆ పర్వతం మీద కళ్లు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది.
తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావుడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది.
ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లిన కుర్రవాడు, తన బాధనంతా ఏకరవు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పితీరాలని పట్టుపట్టాడు.
కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. ‘నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు. ఇదిగో ఈ చెంచా ఉంది చూశావు. అందులో రెండు చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకుని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు. సరేనా!’ అన్నాడు పెద్దాయన.
‘ఓస్ అంతే కదా!’ అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకుని భవంతి అంతా కలియతిరిగాడు. ఓ రెండు గంటలు ఇంట్లోని మూలమూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకి చేరుకున్నాడు. ‘వచ్చేశావా! నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టెన్లు చూశావా? నా తోటమాలి పదేళ్లపాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా?...’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.
పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. ‘భవనం అంతా తిరిగాను కానీ... వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది,’ అంటూ సంజాయిషీ చెప్పాడు.
‘అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేనివాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు. మరోసారి భవంతి అంతా కలియతిరిగి రా!’ అన్నారు పెద్దాయన.
ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియతిరగడానికి బయల్దేరాడు కుర్రవాడు.
ఈసారి ఇంట్లోని నలుమూలలూ క్షుణ్నంగా పరిశీలించాడు.
అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు.
ఓ రెండుగంటల తర్వాత పెద్దాయన దగ్గరకి చిరునవ్వుతో వెళ్లి నిల్చొన్నాడు. ‘నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళమూ చూసి వచ్చినట్లు ఉన్నావే!’ అన్నాడు పెద్దాయన.
‘అవునండీ!’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు.
‘కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది చూశావా? జీవితం కూడా ఇంతే! దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే..... నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది,’ అని చెప్పుకొచ్చాడు పెద్దాయన.
ఏమి జరిగినా మన మంచి కే అని అనుకోవడము అలవాటు చేసుకోవాలి.అప్పుడే హాయిగా, సుఖంగా వుండగలవు, లేదంటే బాధ, వ్యధల తో జీవితం ముగిసిపోతుంది.
ఇందుకు చిన్న ఉదాహరణ చెపుతాను విను.
సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది.
అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.
ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు.
ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు.
ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.
ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు.
తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి.......
తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.
తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.
తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది.
అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు.
ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.
“నువ్వు మంట పెట్టి పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.
ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు.
ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతం అవుతుంది.
రాత్రి అయ్యింది, అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించడం లేదు అని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది నమ్మకం ఉండాలి. ఏందుకంటే ఇది ప్రతి రోజు జరిగేదే అని నీకు చాలా రోజులు గా అనుభవ పూర్వకంగా తెలుసు.
సంతోషం కూడా అలాగే వస్తుంది అని నమ్మకం వుండాలి. అలా కాకుండా రాత్రి, అయిన వెంటనే తెల్లవార లేదు అని బాధ పడకూడదు.
ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది అలాగే నీకు ఎదురైనా కష్టాలు కానీ, బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా నీకు మంచి జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవిత గమనాన్ని కొనసాగించాలి.
ఆధ్యాత్మిక కథలు - 21
- టి. వి. యల్. ప్రసాద్
కుటుంబం - అనుబంధం
ఒక ఊరిలో శివయ్య అనే గృహస్థు ఒకతడు ఉండేవాడు. అతడితో పాటు తల్లిదండ్రులు, భార్య, తోబుట్టువులు, పిల్లలు ఉండేవారు. శివయ్య ఒక మఠానికి పోతూ ఉండేవాడు. ఒకనాడు మఠంలోని సన్యాసితో "స్వామీ! నాకు కూడా మీలాగా సన్యాసం స్వీకరించాలని ఉంది. కానీ నా తల్లిదండ్రులకు, భార్యకు నేనంటే ప్రాణం. వారు నన్ను విడిచి ఉండలేరు. వారి కోసమే నేను సన్యాసం తీసుకోవడానికి సంకోచిస్తున్నాను" అని చెప్పాడు. గురువుగారు నవ్వి అతడికి ఒక వేరు ఇచ్చి, "ఇంటికి పోయిన తరువాత, ఈ మూలికను నోట్లో ఉంచుకో. నీ శరీరం నిశ్చేష్టితమవుతుంది. కదలలేవు. అయితే ఎవరేమీ మాట్లాడేది నీకు తెలుస్తుంటుంది" అని చెప్పాడు. గృహస్థు ఇంటికి వెళ్ళి పడుకొని వేరు నోట్లో ఉంచుకొన్నాడు. శరీరమంతా బిగుసుకుపోయింది. కాళ్ళు చేతులు కూడా కదిలించలేకపోయాడు. అతడి పరిస్థితి చూచి, కుటుంబమంతా శోకాలు పెట్టసాగారు. అప్పుడు సన్యాసి వారింటికి వచ్చాడు. ఆ దారిన పోతుంటే ఏడుపులు వినబడి లోపలికి వచ్చానన్నాడు. శివయ్య కుటుంబానికి ఆయన ఏదైనా చేయగలడనే ఆశ కలిగింది. సన్యాసి కాళ్ళమీద పడి, శివయ్యను కాపాడమని వేడుకొన్నారు. సన్యాసి శివయ్యను పరీక్షించి, వారితో అతడు జీవించాలంటే ఒకే ఉపాయం ఉందని చెప్పాడు. కుటుంబ సభ్యులు అదేదో చెప్పమన్నారు. సన్యాసి అతడి బదులు కుటుంబంలోని వారెవరైనా తమ ప్రాణాన్ని అర్పిస్తే శివయ్య బతుకుతాడని చెప్పాడు. ఆ మాటలు వినగానే శోకాలు ఆగిపోయాయి. సన్యాసి అతడి తండ్రి వంక చూచాడు. ఆయన "స్వామీ! శివయ్యకు లౌకిక వ్యవహారాలు అంతగా పట్టవు. నేనే ఈ కుటుంబానికి ఆధారం. నేను పోతే ఈ కుటుంబం వీధిన పడుతుంది" అన్నాడు. సన్యాసి శివయ్య తల్లి వంక చూచాడు. ఆమె "స్వామీ! నేను సిద్ధమే. కాని నాకు ఆడపిల్లలున్నారు. నేను పోతే వారి పెళ్ళిళ్ళు, బాగోగులు చూచేవారుండరు" అనింది. సన్యాసి శివయ్య భార్య వైపు చూచాడు. ఆమె "స్వామీ! నాకు చిన్న పిల్లలున్నారు. నేనుపోతే, ఆయన మరొకరిని పెళ్ళి చేసుకొంటే, సవతితల్లి వారి ఆలనాపాలనా సక్రమంగా చూస్తుందా?" అనింది. పడుకొని ఉన్న శివయ్య ఈ మాటలన్నీ విన్నాడు. నోట్లో ఉన్న మూలికను ఉమ్మేశాడు. శరీరం స్వాధీనంలోకి వచ్చింది. లేచి సన్యాసితో "గురువుగారు! సన్యాసం స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని సన్యాసితో పాటు బయలుదేరాడు.
అయినవారి మధ్య ఆపేక్షలు, అనురాగాలు చాలావరకు స్వార్థపూరితాలు, నటనలు. వాటిని సత్యాలని భ్రమించి, మానవుడు మమకార బంధాలలో చిక్కుకొని, పరమాత్మకు దూరమవుతాడు. లౌకిక ప్రేమలలోని డొల్లతనం గ్రహిస్తే, ముక్తి మార్గంలోకి అడుగిడ గలుగుతాడు.
ఓ ఫలంలోని విత్తనాల్ని ఎవరైనా చూడగలరు.
కానీ ఓ విత్తనంలో ఎన్ని ఫలాలున్నాయో చూడగలిగేవారే వివేకవంతులు.
నిజాయితీ అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఇతరుల విశ్వాసాన్ని పొందవచ్చు.
మంచితనం అనే విత్తనాన్ని నాటితే,
దానికి ఫలంగా ఇతరుల స్నేహాన్ని పొందవచ్చు.
వినయం అనే ఇత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా గొప్పతనాన్ని పొందవచ్చు.
పట్టుదల అనే విత్తనాన్ని నాటితే...
దానికి విజయాన్ని ఫలంగా పొందవచ్చు.
దయ అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఇతరులతో సమన్వయాన్ని పొందవచ్చు.
నిరహంకారం అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా సుహృద్భావాన్ని పొందవచ్చు.
నిష్కపటం అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా ఆత్మీయతను ఫలంగా పొందవచ్చు.
ఓర్పు అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా అభివృద్ధని పొందవచ్చు.
విశ్వాసం అనే విత్తనాన్ని నాటితే...
దానికి ఫలంగా అద్భుతాలనే పొందవచ్చు.
No comments:
Post a Comment