Saturday, 18 January 2025

Day3

 



సౌందర్యలహరి


శ్రీమాత్రే నమః


తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం

విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।

వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం

హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2 ॥


అర్థము

అమ్మా! నీ పాదముల నుంచి అణువంత ధూళికణముతో బ్రహ్మగారు ఈ చతుర్ధశ భువనాలు నిర్మించాడు. విష్ణువు ఆ ధూళికణము ధరించి వేయి తలల ఆదిశేషువుగా మారి విశ్వమంతా తల మీద ధరించి మోస్తున్నాడు. శివుడు అదే కణమును తన శరీరమంతా బూడిదలా పూసుకు తిరుగుతున్నాడు. 


తే.గీ॥

తొలుత లేశ మాత్రపు పాదధూళి చేత,

బ్రహ్మ సృష్టియు, విష్ణువు  భారమంత।

మోయ, శివుడు బసువముగ మొఖము నుంచె

కొలచెదను సంధ్యను శరణుఁ గోరి మదిని॥


వివరణ:

పరమేశ్వరి అయిన ఆ జగదంబ పాదపద్మముల నుంచి స్వీకరించిన ఒక్క ధూళికణము సర్వ ప్రపంచ కార్యాలు చేస్తున్నదట. అదెట్లాగు? 


భారతీయ సనాతన విజ్ఞానములో ఉన్న వైశేషికం గురించి విన్నారా? ఇది షడ్దర్శనాలలో ఒకటి.

ప్రపంచము ఒక్క కణము నుంచి మొదలైయిందని, సమస్తం అణువుల కలయిక వల్ల జన్మించిందని వైశేషికం ప్రతిపాదిస్తుంది. దీని కర్త  కణాద మహర్షి.


సైన్సు కూడా ఒక కణము విస్పోటమే

 బిగ్‌బ్యాంగ్‌ అని చెబుతోంది. 


శంకరులు అదే ఈ శ్లోకములో చెప్పారు. 

అమ్మవారి పాదపద్మాల నుంచి ఒక్క కణమాత్రం ధూళి స్వీకరించి త్రిమూర్తులు తమ తమ కార్యాలు చేస్తున్నారు. 


బ్రహ్మ సృష్టికారుడు. చతుర్ధశ భువనాలనూ సృష్టిచెయ్యవలసినవాడు. ఆయనకు ముడిసరకు ఎక్కడ్నుంచి వస్తుంది?

కుమ్మరి కుండలు చెయ్యాలంటే పుట్టమన్ను తెచ్చుకొని కుండలు చేస్తాడు. అలా బ్రహ్మ ఈ సర్వ విశ్వమూ సృష్టిస్తున్నాడు. గ్రహాలు వాటి వాటి కక్షలలో తిరిగేలా నిర్దేశిస్తున్నాడంటే అది అమ్మవారి పాదపంకేరుహ పరాగ అనుగ్రహమే. అమ్మవారి పాదధూళికణము స్వీకరించి బ్రహ్మ ఈ ఘనకార్యము చేశాడు. 


విష్ణువు స్థితికారుడు. సృష్టించబడిన భువనాలను రక్షించటము ఈయన పని. విష్ణువే ఆదిశేషువుగా మారి వేయితలలతో ఈ విశ్వభారమంతా తలనెత్తుకున్నాడంటే, ఆయన అమ్మవారి పాదధూళీకణము స్వీకరించటము వలననే. 


హరుడు లయకారుడు. ప్రళయకాలములో హరుడు సర్వమునూ లయం చేస్తున్నాడు. లయమంటే లీనమగుట. 

మనం నిద్రించేటప్పుడు మనస్సు ఆత్మలో లీనమవుతుంది. బయట సర్వప్రపంచము ఉన్నా లయమైన వానికి ఏమీ తెలీదు. మరునాడు లేచి చూస్తే సర్వం ఉన్నదున్నట్లుగా ఉంటుంది. ఇదే లయం చెయ్యటమంటే. 

హరుడీకార్యము విజయవంతంగా చెయ్యగలుగుతున్నాడంటే, అమ్మవారి పాదధూళి గ్రహించి విభూతిలా వళ్ళంతా పూసుకోవటం వలన. భూడిదెందుకంటే, లయమయితే ఏదీ మిగలదని సర్వం భస్మమవ్వాలని చెబుతున్నారు. 


విజ్ఞానపరంగా చూస్తే:

 

కనిష్ఠస్థాయిలో, అంటే పరమాణువు (పిండాండములో) నందు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ (analysis, balance and synthesis) ఎలా పనిచేస్తాయో, సమిష్ఠి రూపములో అంటే బ్రహ్మాండములో బ్రహ్మ (Emerger) విష్ణువు(sustainer), శివుడు(Merger) అలా పనిచేస్తారు. వారందరూ అమ్మవారి ఉపకరణములుగా ఉండి ఆమె ఆదేశబద్ధులై పని చేస్తారని ఈ శ్లోకార్థము. 


రేపు మరికొంత ఆవిష్కరించుకుందాము. 

అప్పటి వరకూ సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ


No comments:

Post a Comment