##
#day52
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 51
శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ ।
హరాహిభ్యో భీతా సరసిరుహసౌభాగ్యజననీ
సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టిః సకరుణా ॥ 51 ॥
అర్థం
ఓ భగవతి! నీ కన్నుల దృష్టి శృంగార రసముతో శివుని మోహింపచేస్తున్నది.
ప్రాకృతజనాలతు బీభత్సము కలిగించుచున్నది. సవతి అయిన గంగ యందు రౌద్రం, శివుని గాథలకు విస్మయం చూపుతున్నవి.
శివుని మెడలో పాములను చూసి భయం, ఎర్ర కలువలు కాంతి సౌందర్యం ఉత్పాదముచే వీరం, సఖులతో హస్యం చూపుతున్నాయి. అట్టి నీ నయనములు నా యందు కరుణ చూపుము తల్లీ అని శంకరభగవద్పాదులు వేడుకుంటున్నారు.
తేగీ॥
నవరసములు చూపెడు నయనముకు నమము
హాస్య రౌద్ర నద్బుత భీతిఁ అచ్చెరువులు।
చూపు తల్లి నను కరుణ చూపు నెపుడు
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ
అన్ని అవయవములలో కన్ను పిరధానమైనది. సర్వేంద్రియాణాం నయనం ప్రధానమన్నారు కూడా.
కళ్ళు హృదయానికి గవాక్షాలు. కన్ను చూపు బట్టి వారి మనస్సు పట్టెయ్యగలరు.
అమ్మవారి కన్నులు చూపే హావాభావాల గురించి ఈ శ్లోకములో వివరించారు.
ఈ లోకములో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన దృష్టి ఉంటుందట పరమైశ్వరికి. అవి ఎనిమిది రకాలైనవిగా చెబుతున్నారు.
నవరసాలంటారు. అంటే తొమ్మిది రకాలైన భావాలు.
శృంగారము, వీరము, కరుణ, అద్భుతం, హాస్యం, బీభత్సము, భయం, రౌద్రం, శాంతం.
పరపురుషులను చూస్తే పరాణ్ముఖత్వము చూపుతాయి అమ్మ కన్నులు.
సవతి అయిన గంగను తలిస్తే అమ్మకు రోషము కోపము కన్నులలో కనపడుతుందట.
శివయ్య వంటి మీద సర్వాలను చూస్తే భీతి కనిపిస్తుంది ఆ కన్నులలో.
శివయ్య చేసిన లోకకల్యాణం గురించి హాలహలము స్వీకరించిన కథలు, త్రిపురాసుర సంహారం మొదలైన కథలు వింటుంటే అద్భుత రసము చూపుతాయి అమ్మకన్నులు.
తన సౌందర్యముతో లోకాలను తమ వైపు త్రిప్పుకునే తామరలను చూసి అంతకు మించి సౌందర్యమైన కళ్ళు కనుక వీరం చూపుతాయి. తన చెలులలతో మాటలలో హస్య రసముచూపుతాయి.
రసరాజ్యమైన శృంగార రసము అమ్మ కన్నులలో శివుడ్ని చూసినప్పుడు కలుగుతుందట. అందుకే సృష్టి నిర్మాణం జరిగింది.
ఇలా వివిధావస్థలలో వివిద రసాలను చూపినా సదా ఉండేది మాత్రం శాంత రసమే.
సదా ఉన్నది శాంత రసమే కాబట్టి దాని గురించి ఇక్కడ చర్చించలేదు శంకరభగవద్పాదులు. ఇలా నవరసాలు చెప్పబడినాయి.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
#day49
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 48
“అహః సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా ।
తృతీయా తే దృష్టిర్దరదలితహేమాంబుజరుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీమ్ ॥ 48 ॥”
అర్థం:
అమ్మా భగవతీ! నీ కుడికన్ను సూర్యుడు. దీని వలన పగలు ఏర్పడుతున్నది. నీ వెడమకన్ను చంద్రుడు. అందుచేత రాత్రి ఏర్పడుతున్నది.
నీ లాలటము మీదున్న మూడవనేత్రం ఉభయసంధ్యలకు ప్రతీకగా అరుణ వర్ణములో అగ్నివలె యున్నది.
తేగీ
సూర్య చంద్రులు కన్నులు చూడ నీకు
నుదిటి నేత్రము అరుణిమ నెనరు కాంతి
కాల చక్రము తిప్పు నీ కంటి చూపు
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ.
అమ్మవారి కళ్ళ గురించి శంకర భగవద్పాదులు ఈ శ్లోకంలో చెబుతున్నారు.
ఈ శ్లోకములో అమ్మవారి కళ్ళు సూర్యచంద్రులతో పోల్చబడ్డాయి. లలాటము మీది కన్ను ఉభయసంధ్యలకు గుర్తుగా అరుణ వర్ణములో ఉన్నదట. ఆ కన్ను శివునికి కదా ఉండాలి. మరి త్రినేత్రం అమ్మకు చెప్పటములో అంతరార్థమేమంటే అమ్మవారే అయ్యవారని సమయభావము తెలపటం. శివపార్వతుల ఏకత్వాం చెబుతున్నారు.
నుదుటి మీద కన్ను అగ్ని స్వరూపము. అసలు సర్వ ప్రపంచము, షోమసూర్యాగ్నిమయమే. అంటే సూర్య, చంద్ర అగ్నులే. ఈ మూడుతోనే సర్వం నిర్మాణం జరిగిందని శ్రీవిద్య చెబుతుంది.
అమ్మవారి కన్నులు సూర్యచంద్రాగ్నులంటే ఆమె మనలను సూర్యునితో ఉదయం చంద్రుని వలే రాత్రి కాచుకుంటూ పరిరక్షిస్తున్నదన్న భావము కూడా ఉంది.
సూర్యచంద్రుల వలనే మనకు కాలము తెలుస్తుంది. అంటే అమ్మవారు మనకిక్కడ కాలస్వరూమన్నమాట.
కాలం గురించి చెబుతూ భైరవయామళంలో ఇలా చెబుతారు-
“తేషాం అనంత కోటినాం మయూఖానాం మహేశ్వరీ
అష్టోత్తరశతం వహ్నే, షోడశోత్తరశతం రవేః
షట్త్రింశదుత్తర శతం చంద్రస్య కిరణాశివే
బ్రహ్మాండం భాసయంతస్తే పిండాండ మపిశాంకరి
దివాసూర్యౌ స్తధారాత్రౌ సోమో వహ్నిశ్చ సంధ్యయోః॥”
ఆ ఈశ్వరి నుంచి అనేక కిరణాలు ప్రసరించబడుతూ ఉంటాయి. అందులో 108 అగ్నికి, 116 సూర్యుడు, 136 చంద్రుడు తీసుకున్నారు. పగలు సూర్యుని వలన, రాత్రి చంద్రుని వలన, సంధ్యవేళలు అగ్ని వలనా ప్రకాశించబడుతాయి.
ఇలా కాలము అమ్మవారి వలన నడవబడుతున్నది.
ఇక ఇవి మానవుని శరీరములోని నాడులుగా తీసుకొని సమన్వయం చేసుకుంటే-
మానవుని వెన్నెముక లోపల ముఖ్యమైన మూడు నాడులు ఉంటాయి. అవి ఇడా నాడి , పింగళా నాడి , సుషుమ్నా నాడి .
మనలో సూక్ష్మం నుండి స్థూలానికి దారి తీసే ప్రక్రియలన్నీ ఇడా నాడి ద్వారా జరుగుతాయి. స్థూలం నుండి సూక్ష్మానికి దారి తీసే ప్రక్రియలన్నీ పింగళా నాడి ద్వారా జరుగుతాయి. ఇడా నాడి చంద్ర సంబంధమైనది.
పింగళానాడి సూర్య సంబంధమైనది.
మనం భూమిమీద ఉన్నాము. చంద్రుణ్ణి భూమి తన వైపు ఆకర్షిస్తుంది. అందుకని ఈ బలం బయట (ఆకాశం) నుండి మనవైపు (భూమి వైపు ) పనిచేస్తుంది. ఆధ్యాత్మిక విద్యలో చంద్రుడు - మనస్సుకు, సూర్యుడు - ఆత్మకి, భూమి - శరీరానికి సంకేతాలు. కాబట్టి ఇడా నాడి - మనస్సు నుండి శరీరం వైపుకు లేదా సంకల్ప లోకం నుంచి కల్ప జగత్తు వైపుకు పనిచేసే ప్రక్రియలకు సంబంధించినది. అలాగే, సూర్యుడు మన భూమిని ఆకర్షిస్తాడు. కాబట్టి, పదార్థమయ దేహం నుండి, సూక్షమైన ఆత్మ వైపుకు పని చేసే ప్రక్రియలకి సంబంధించిన నాడి పింగళా నాడి అవుతుంది.
జీవికి జన్మ రావటం ఇడానాడికి సంబందించినది అయితే - ముక్తి రావటం పింగళా నాడికి సంబంధించినది అవుతుంది.
ఈ ఇడా పింగళ నాడులు వరుసగా పైనుండి క్రిందకు పోయే దిశగాను, క్రిందనుండి పైకి పోయే దిశగాను ఉంటాయి . ఈ రెండూ నాడులకు మధ్యన ఉండే అత్యంత సూక్ష్మమైన చోటులో సుషుమ్ననాడి ఉంటుంది. ఇది తామరతూడు విరిచినపుడు వచ్చే అతి సన్నని దారపు పోగు (Fibre) కన్నా సూక్ష్మంగా ఉంటుంది. ఇది అగ్నితత్త్వాత్మకం. నీరు ఆవిరిగా మారటం గాని, నీటి ఆవిరి నీరుగా మారటం లో గాని జరిగే మార్పులు ఉష్ణోగ్రతా భేదం వల్లనే గదా ! అందుకే ఈ సుషుమ్నా నాడి - ఇటు శీతల గుణ ఘనీభవన సంబంధమైన, పదార్థ ఉత్పత్తి సంబంధించిన చంద్రనాడి అయిన ఇడానాడిని, అటు ప్రకాశ గుణ వికరణ సంబంధమైన, ఉత్పతన సంబంధమైన,సూర్యనాడి అయిన పింగళానాడిని నియంత్రణం చేస్తూ - రెంటికి అతీతంగా వుంటుంది. ఈ సుషుమ్నా నాడి మార్గాన్ని అనుసరించే సాధకుని సాధనలో కుండలిని శక్తి అనే తేజస్సు మూలాధార చక్రం నుండి సహస్రారం దాకా వెన్నెముకలో - ఊర్ద్వమార్గంలో పైకి వెడుతుంది.
ఈ ఇడా, పింగళా, సుషుమ్నా నాడులను వరుసగా గంగా యమున, సరస్వతీ నదీ ప్రవాహలతో పోలుస్తారు.
ఈ మూడు కూడా ఆజ్ఞా చక్రంలో కలస్తాయి కాబట్టి ఆ స్థానాన్ని వారణాసీ అంటారు. ఆజ్ఞ మీద దృష్టి పెట్టి సాధన చేస్తే ఫలితం త్వరగా సిద్ధిస్తుందంటారు.
అమ్మవారిని ఇలా ధ్యానము చేసుకోవటానికి మనకు ఇంతటి దివ్య సాహిత్యానిచ్చిన జగద్గురువులకు నమస్కారాలు తెలుపుకోవాలి.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ.
#day48
47 శ్లోకం
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 47
భ్రువౌ భుగ్నేకించిద్భువనభయభంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాంధృతగుణమ్ ।
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతినిగూఢాంతరముమే ॥ 47 ॥
అర్థం
అమ్మా పార్వతీ! నీలి రత్మాల వలేకుదురుగా అందముగా నీ కనుబొమలజంట కనపడుతున్నది. నడిమి భాగముమన్మథుని తన వెడమ చేతి పిడికిడితోపట్టుకునినప్పుడు కనపడని ధనస్సులాతోచుచునన్నది శివునికి.
తేగీ
కనుబొమల జంట అందము కనగ తోచె
మన్మథుని విల్లు చేబట్ట మధ్య భాగ
ము, నతని పిడికిడిగ బ్రాంతి ముసరుచూడ
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ:
ఈ శ్లోకములో అమ్మ వారి కనుబొమలనువర్ణిస్తున్నారు శంకరులు.
అమ్మవారి కనుబొమలు చక్కగాయున్నాయి. ధనస్సులా ఉన్నాయట యవి. ధనస్సు మధ్యలో ఉన్న పిడిని ధనస్సువాడేటప్పుడు పట్టుకుంటారు.
అవి మన్మథుని బాణమైతే, కనుబొమలమధ్యనున్న కాలీ మన్మథుడుపట్టుకునినప్పుడు కనపడని పిడిలాఉంది. సవ్య హస్తం అన్నారు. అంటేఎడమచేయి.
లలితానామాలలో“వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా” అన్న నామము అమ్మవారి కనుబొమలగురించే చెబుతుంది.
మన్మథుడు తన కార్యక్రమ నిర్వహణకు ఒకనిలయాన్ని ఏర్పరచు కోవాలనుకున్నాడు . ఇందుకు అమ్మవారి ముఖాన్ని మించిందిఏదీ మన్మథునికి నచ్చలేదుట .
అన్నిరకాలుగా అందచందాలతో వున్న ముఖంఅమ్మవారిది . ఈ అమ్మవారి మొఖాన్నే తననివాసంగా చేసుకుంటే ఇంకొక అదనపుసౌకర్యం కూడా ఉందట !
ఈ గృహానికినిత్యకల్యాణ శోభను కలుగచేసేపచ్చతోరణాలను వేరే కట్టవలసిన పనిలేదుట. అమ్మవారి ముఖంలో ఎంతోరమణీయంగా కనపడే ఆమె కనుబొమలేఈ తోరణాలుగా భాసిస్తాయి గదా!
అంటేమన్మథుని ఇల్లు లాగా అమ్మవారి వదనంఉందంటే - ఆ ఇంటి తోరణాలుగాఅమ్మవారి కనుబొమలుభాసిస్తున్నాయన్నమాట ! మన్మథునికిఅమ్మవారి ముఖం "మాంగల్యప్రదం"అంటే - ‘శోభనాన్ని చేకూర్చేది ' ఎందుకంటే-
ప్రళయంలో అయ్యవారు అమ్మవారివదనాన్ని స్మరిస్తే ముందు పుట్టేవాడుమన్మథుడు. ఇలా స్మరిస్తే ( అంటే గుర్తుచేసుకుంటే ) పుట్టేవాడు కాబట్టి, మన్మథుణ్ణి 'స్మరుడు ' అన్నారు.
అయ్యవారు తన కంటి మంటతో పూర్వం మన్మథున్ని బూడిద చేశారు. కానీ అదే అయ్యవారుకి అమ్మవారి వదనం గుర్తుకు రాగానే తన కోర్కె కు బదులు ముందు ఆమె కోర్కెను తీర్చటం కోసం మన్మథునిపునర్జీవుణ్ణి చేయ్యాల్సి వచ్చింది.
అలామాడిపోయి, బూడిద అయిన మన్మథునికిజీవం రావటానికి కారణమైన అమ్మవారిముఖం అతనికి (మన్మథునికి ) మంగళగృహం కదా మరి ! ఆ వదనము మంగళ గృహం అనేందుకు తగ్గట్టుగామంగళ తోరణాలు వేరే కట్టవలసినఅవసరం లేకుండా సహజ సిద్దంగానేమంగళతోరణాల లాగా ఆమె రెండుకనుబొమలు ఉన్నాయి.
అంటే - ఒకవిధంగా అయ్యవారి మూడవ కన్నుతెరవటం అంటే - 'మన్మథునిజన్మదినోత్సవం జరుపుకునే ఇంటి గృహద్వారం తెరవటం ' అన్నమాట !
ఇంకోవిధంగా చెప్పుకోవాలంటే - అయ్యవారిమూడో కన్ను జ్ఞాననేత్రం కాబట్టి, 'జ్ఞానోదయం అయితే - మన్మథలీలభస్మమౌతుంది'.
ఇక్కడి ఇమిడి ఉన్న రహస్యాలను ఇంకా వెతికితే బీజాక్షరాలు గూడా తెలుసుకోవచ్చును.
వదన - వాగ్భావ బీజం - 'ఐం ' బీజాక్షరాన్ని
స్మర - మన్మథ బీజం - ' క్లీం ' బీజాక్షరాన్ని
మాంగల్య - సౌభాగ్య బీజం - సౌః'బీజాక్షరాన్ని
గృహ - సంపత్కరమైన , శుభకరమైనబీజం - 'శ్రీం' బీజాక్షరాన్ని
తోరణ = హృల్లేఖ - 'హ్రీం' బీజాక్షరాన్ని
తెలియచేస్తాయి. కాబట్టి మొత్తము మీదఈ ఇక్కడ ఐదు బీజాక్షరాలు ఇమిడి వున్నాయని తెలుస్తుంది. " ఐంక్లీంసౌః" ఈ మూడింటికూటమి ముఖమైతే “శ్రీం,హ్రీం’ లు, రెండూకనుబొమలకి సూచిస్తాయి.
ఇంతటి రహస్యాలను ఒక శ్లోకములో ఉంచి చెప్పిన జగద్గురువులకు వందనాలు సమర్పించాలి.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ
#day47
శ్రీ మాత్రే నమః
సౌందర్యం లహరి శ్లోకం 46
లలాటం లావణ్యద్యుతివిమలమాభాతి తవ య-
ద్ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ ।
విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ॥ 46 ॥
కళా ప్రపూర్ణుడైన అమ్మవారు తన ముఖంగా కలిగినందువలన అమ్మవారు పదహారు కళలు కలిగిన పరిపూర్ణస్వరూపము.
అందువల్లనే అమ్మవారిని "షోడశీ" అంటారు.
చంద్రకళలు సూచించే తిథులు, అమ్మవారి కళలకి, మన్వంతరాలకు,సమన్వయముఉంది. చంద్రుడు పౌడ్యమి నుండి క్రమక్రమంగాఒక్కొక్క కళ చొప్పున వృద్ధి చెందుతూ పూర్ణిమ నాటికినిండు చంద్రుడౌతాడు. సూర్యుని నుండి పొందేవెలుగు శుక్ల పక్షం లో క్రమక్రమంగా పెరుగుతూచంద్రునికి సంక్రమించటం వలన - పూర్ణిమ రోజుచంద్రుడు పరిపక్వ స్ధితిని పొందుతాడు. కృష్ణ పక్షములో చంద్రుడు ఒక్కొక్క కళ చొప్పున తగ్గుతూఅమావాస్య నాటికి పూర్తిగా తన కళను కోల్పోతాడు. చంద్రుని యొక్క ఈ పదహారు కళలని శ్రీ విద్య లో'నిత్య' ల పేర్ల తో సంకేతిస్తారు. రెండు పక్షాలలోనితిధులకి, నిత్యల పేర్లకు సమన్వయము :
1. పాడ్యమి / కామేశ్వరీ / చిత్రా
2. విదియ / భగమాలినీ / జ్వాలామాలినీ
3. తదియ / నిత్యక్లిన్నా / సర్వమంగళా
4. చవితి / భేరుండా / విజయా
5. పంచమి / వహ్నివాహినీ / నీలపతాకా
6. షష్ఠి / మహావజ్రేశ్వరీ / నిత్యా
7. సప్తమి / శివదూతీ / కులసుందరీ
8. అష్టమి / త్వరితా / త్వరితా
9. నవమి / కులసుందరి / శివదూతీ
10. దశమి / నిత్యా / మహావజ్రేశ్వరీ
11. ఏకాదశి / నీలపతాకా / వహ్నివాహినీ
12. ద్వాదశి / విజయా / భేరుండా
13. త్రయోదశి / సర్వమంగళా / నిత్యక్లిన్నా
14. చతుర్దశి / జ్వాలామాలినీ / భగమాలినీ
15. పూర్ణిమ / చిత్రా / కామేశ్వరీ
పైన తెలిపిన పదిహేను నిత్యలయందు - శుక్ల పక్షంలో ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ, కృష్ణ పక్షం లోఒక్కొక్క కళ తగ్గుతూ వర్తించే 'మూల భూతమైన కళని- మహానిత్యా ' అంటారు. మహానిత్యను - లలిత, శ్రీకళ , నైసర్గికకళ, సంవిత్కళా, చిత్కళ మొదలైనపేర్లతో కూడా పిలుస్తారు. ఈ మూల భూతమైన'లలితా కళ'ను 'ఆద్యకళ ' అని కూడా అంటారు.
ఈ‘మహానిత్య’ లలితాంగిగా ఉండి మిగిలిన నిత్యలయందు అంగములుగా ఉంటుంది, అని తంత్రరాజతంత్రం' లో ఈ క్రింది శ్లోకంలో చెప్పబడింది.
శ్లో !! ఆద్యయా లలితాయాస్సు రన్యా పంచదశాంగగాః
లలితాంగి త్వరూపేణ సర్వాసామాత్మ విగ్రహ ,
అష్టమీ తిథి ఒక్క దానికి తప్ప శుక్లపక్షంలోని ఒక తిథికి సంబందించిన నిత్యా దేవతలు కృష్ణ పక్షం లోఅదే తిథి కి రాదు. మారుతుంది. రెండు పక్షాలలోనిఅష్టమి తిథికి సంబందించిన 'త్వరిత' మాత్రంమార్పు చెందదు . ఇది ఒక విశేషాన్ని సూచిస్తుంది. అష్టమి నాటి చంద్రుని లో అమ్మవారి ఫాలభాగంపోల్చపడింది.
ఈ శుక్ల, కృష్ణ పక్షాలు రెండు
'వృద్ధి - క్షయము'లకు
'వికాస - వికల్పము'లకు
'సంతోష విషాదము' లకు ప్రతీకలైతే,
ఈ రెండు పక్షాలలోని అష్టమి తిథికి సంబందించిన నిత్యా పేరు మార్పు రాకపోవటం గమనిస్తే - ఈఅష్టమీ చంద్ర ఫాలభాగం - 'సంతోష - విషాదాల' ప్రభావం పనిచేయక, వాటికి అతీతంగా, సర్వదా , ఏకరీతిగా ఉండే అమ్మవారి నిర్వికారతను - తెలియచేస్తుందని - తెలుస్తుంది.
కృష్ణ అష్టమి నాటి, శుక్లఅష్టమి నాటి చంద్రుని ఆకార ప్రకాశాలలో మార్పుఉండదు , అని గుర్తు పెట్టుకోవాలి.
(త్వరితంగా ఫలితాన్నీనిచ్చేది కాబట్టి "త్వరితా " అనిఉండవచ్చు )
ఫాలభాగం విశాలంగాను, అర్థ చంద్రాకారంగానుఉండడాన్ని సాముద్రిక సలక్షణంగా పరిగణిస్తారు.
పరమేశ్వరి వదనములో చంద్రుని, చంద్రునిలో ఈశ్వరిని తలచి కొలచిన వారికి అమృతత్త్వంతో బ్రహ్మానందం కలుగుతుంది.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
#Day46
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 45
అరాలైః స్వాభావ్యాదలికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ ।
దరస్మేరే యస్మిన్ దశనరుచికింజల్కరుచిరే
సుగంధౌ మాద్యంతి స్మరదహనచక్షుర్మధులిహః ॥ 45 ॥
అర్థము
తల్లీ! నీ ముఖము మీద వ్రేలాడే ముంగురులు వంకర తిరిగియున్నాయి. నీ ముఖము పద్మము కన్నా అందమైనది. నీ పలువరసలు కింజిల్కముల వలే ప్రకాశిస్తున్నవి. నీ ముఖమనే పద్మమును శివుని చూపులన్న తుమ్మెదలను ఆకర్షిస్తున్నవి.
తేగీ।
వదనము విరియని భ్రమసె భ్రమర బోలు
శివుని కనులు,కింజల్కరు సిరిమొగమును ।
నిన్ను బోలు పుష్పములేదు నిజము చూడ
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరము
అందమైన ముఖము గురించే
చెప్పేటప్పుడు శరత్కాల చంద్రుణితో పోలుస్తారు. లేదా పద్మము తో పోలుస్తారు.
అమ్మవారి ముఖము పద్మలకన్నా అందమైనది. అమ్మవారి ముఖమును పద్మముతో కన్నా ఎంతో ఉత్కృష్టమైనది.
పద్మము వికసించినప్పుడు తుమ్మెదలు ఆ పద్మం చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
అమ్మవారి ముఖమనే పద్మము చుట్టూ శివుని చూపులన్న భ్రమరములు తిరుగుతున్నాయట.
అలాగే పద్మము వికసిస్తుంది. దేవి ముఖము చిరునవ్వులతో వికసించి యుంటుంది.
పద్మములోన కేసరములంటాయి. అమ్మవారి ముఖమందు తెల్లని పలువరస కేసరముల వలే మెరుస్తున్నదట. పద్మములో తెనే వుంటుంది. అమ్మవారికి తెనెలూరు పదములు(మాటలున్నాయి).
అమ్మవారికి అందమైన ముంగురులున్నాయి. పద్మమునకు ఇలా చెప్పటానికి ఏమీలేవు.
కాబట్టి పద్మముకన్నా అమ్మవారి వదన సౌందర్యము గొప్పది. కాని మనము పద్మముతో చెబుతున్నాము.
కారణము మనకు పద్మము కన్నా అందమైనది తెలియదు.
ఇలా అందమైన అమ్మవారి ముఖము గురించి ఈ శ్లోకములో జగద్గురువులు స్తోత్రం చేస్తున్నారు.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
Day45
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకము 44
తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ-
పరీవాహస్రోతఃసరణిరివ సీమంతసరణిః ।
వహంతీ సిందూరం ప్రబలకబరీభారతిమిర-
ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్ ॥ 44 ॥
అర్థం
అమ్మా! నీ ముఖ సౌందర్యము పొంగిపొరలుతున్నది. ఈ ప్రవాహంలో చీలికలా చిన్న నీటి పాయలా పాపడి ఉంది. ఆ పాపడికి అటు ఇటూ ఉన్న నల్లని కురులు కారు చీకటిలా ఉండి రెండువైపులా పొంచి ఉన్న శత్రు మూకలా ఉన్నాయి. పాపడిలోని సింధూరము శత్రు సైన్యానికి చిక్కిన ఉదయించే భానుడిలా ఉన్నది. ఆ భావుడు ఉదయిస్తే మాలోని అజ్ఞానమన్న చీకటి తొలిగిపోతుంది.
తేగీ।
కురులు వైరము బూనితగువులు సేయ
ప్రాగ్ దిశన ఉదయించెడి భాను బ్రోలు।
నీదు నొసటి సింధూరము నిలిచె నమ్మ
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ:
అమ్మవారి వేణీబంధం తరువాత శంకరులు అమ్మవారి పాపిట గురించి
చెబుతున్నారు.
సింధూరము పాపిటలో ధరించటము సుహాసినుల ఆచారము. ఇది సుమంగళీ చిహ్నం.
ఈ శ్లోకములోనే సౌందర్యలహరి అన్నమాట
వస్తుంది. దీని వలననే ఈ భాగానికి సౌందర్యలహరి అన్న పేరు వచ్చిందంటారు.
అమ్మవారి ముఖ సౌందర్యమన్న లహరిలా ప్రాకుతున్నదట.
అమ్మవారి వదన సౌందర్యకాంతులు ప్రవహించటానికి అనువుగా అమ్మవారి పాపిట తిన్నగా, తీరుగా, తలకట్టు మధ్య భాగములో ఉన్నది.
అంటే ఈ తలకట్టు పై ఉన్న బ్రహ్మరంధ్రము చేరటం యోగసాధనకి పరాకాష్ఠ.
అమ్మవారి ముఖసౌందర్యము యోగవికాసానికి ప్రతీక.
అమ్మవారి జుత్తు నల్లగా ఒత్తుగా ఉందిట. ఆ జుత్తు నడిమి అమ్మ పాపిడి తీసి ముడి కట్టింది. ఆ పాపిడి తెల్లగా ఉంది. అటు నిట్లు నల్లని జుత్తు నడిమి పాపిట. ఆ పాపిటలో సింధూరము. ఈ సింధూరము ఉదయించే సూర్యునిలా ఉంది.
ఆ జుత్తు ఒత్తు వలన ఆ ఎరుపు ఎక్కువగా కనపడటంలేదు. అందుకని ఆ అటు నిటు ఉన్న జుత్తు పాపిటలోని సూర్యుని బంధించినట్లి తోస్తున్నదట.
కాని అది ఎక్కువ సేపు సాగదు.
తన రాకతో వెలుగులు పంచి చీకటిని త్రుంచే బాలభానుడిలా సింధూరముంది.
సూర్య కిరణాలకు చీకట్లు ఓడిపోతాయి.
సూర్య కాంతి వలన చీకట్లు చెదిరిపోయినట్లు పాపిటలోని సింధూరము మనము ధ్యానం చెయ్యటం వలన మనలోని అజ్ఞానము తొలుగుతుంది. శుభసౌభాగ్య యోగక్షేమాలు కలుగుతాయి.
ఈ ఊహతో ధ్యానము చేస్తే మనకు తప్పక అజ్ఞానము తొలుగుతుంది.
అమ్మవారి దర్శనము కలుగతుంది.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ
#day44
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకము 43
ధునోతు ధ్వాంతం నస్తులితదలితేందీవరవనం
ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే ।
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే వలమథనవాటీవిటపినామ్ ॥ 43 ॥
అర్థం
అమ్మా! అప్పుడే వికసిస్తున్న నల్లకలువవలె , కారు మబ్బుల వలే,సుగంధతైలముతో కూడి మెత్తనైన, దట్టమైన నీ కురులు మా అజ్ఞానము తొలగించుగాక. నీ కురుల సువాసన తనకు తెచ్చుకోవటానికి ఇంద్రని నందనోద్యానవనములోని సుమములు నీ కురులు చేరుతున్నాయి.
తేగీ।
కురులు నల్లకలువలుగ కుసుమ విరులు
మించు పరిమళము కలిసి మెలుగు వేణి।
చూడ సురవనపు సుమము చేర వేడె
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
అమ్మవారి కురుల గురించి, వేణీబంధనము(కొప్పు) గురించీ చెబుతున్నారు జగద్గురువులు.
సూర్యుడు ఉదయిస్తున్న తీరుగానే అమ్మవారి ఆవిర్భావం మనము కనుక ఊహిస్తే - ముందుగా అమ్మవారి తలకట్టుతో ప్రారంభమై, పాదాక్రాంతం తో ఆవిర్భావం పూర్తవుతుంది కదా. (లలితా సహస్రనామం గుర్తుకు తెచ్చుకోవాలి)
కిరీటం తరువాత, అందువల్ల అమ్మవారితలకట్టును గూర్చి చెబుతున్నారు.
అమ్మవారిశిరోజములు పుష్పముుకన్నా అతి మృదువుగా ఉంటాయిట. పైగా ఆ కురులు సహజ పరిమళాలు విరజిమ్ముతూ ఉంటాయి.
అమ్మవారిశిరోజములకి సుగంధం సహజంగా ఉంటుంది.
ఖనిజ, వృక్ష, జంతు, మానవులందరు ప్రకృతి మాతకు బిడ్డలే కాబట్టి, పుష్పలకి ఉండే సువాసన అమ్మవారి వల్లనే వచ్చింది అని మనము భావన చెయ్యవచ్చు.
అమ్మవారి శిరోజ సుగంధాన్ని పొంది, తాము'సుగంధవంతమవ్వాలని' , 'అమ్మవారి వేణి బంధంలోచేరాలని' - కల్ప వృక్షపు పువ్వులన్ని ఆత్రుత పడుతాయట.
ఆ పువ్వుల అమ్మ కేశాల సువాసన గ్రహించి సువాసలులు వెదజల్లుతాట. అటువంటి కేశబంధము అమ్మవారిది.
మనము అమ్మవారి వేణీబంధమును ధ్యానిస్తే మన కర్మలు తొలిగి, అజ్ఞానము పోయి జ్ఞానము కలుగుతుందిట.
మరి మనకు అమ్మ ముఖము కనపడుతుంది కాని, వేణీబంధము చూడటమేలా?
అది మనము కేవలము ధ్యానములో మాత్రమే చూడగలము.
నల్లని వత్తైన జుత్తును ముడివేసి దానికి అశోకము, సంపెగ మల్లె మరువము పూల మాలలతో అలంకరించిన అమ్మ వేణీబంధము మనము భావనచేసి ధ్యానిద్దాము.
అమ్మవారికబరీ బంధం (జుట్టుముడి ) మనలోనిఅజ్ఞానతిమిరాన్ని తరిమి ప్రజ్ఞావంతుల్ని చేస్తుంది!
అమ్మవారి కబరీ బంధ దర్శనం మన కర్మ బంధవినాశనానికి దారితీస్తుంది.
అటు వంటి అమ్మ కేశాల ధ్యానము మన మనఃకేశము తొలగిస్తుంది. మనకున్న పాశాలను నిర్మూలిస్తుందని జగద్గురువులు చెబుతున్నారు.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ
#day43
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 42
గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః ।
స నీడేయచ్ఛాయాచ్ఛురణశబలం చంద్రశకలం
ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ॥ 42 ॥
అర్థం
హిమవంతుని కుమార్తె హైమవతీ! తల్లీ!
ద్వాదశ ఆదిత్యులు మణులుగా కలిగిన నీ బంగారు కిరీటమును దర్శించి కీర్తించినవాడు, ఆ కాంతులలో నీ తలపై నున్న చంద్రరేఖను చూసి అది ఇంద్రధనస్సుగా భ్రమిస్తాడు.
తేగీ।
ద్వాదశాదిత్యులు మణులై తలనలంక
రించుమకుటపు కాంతిన రేదొర కన।
ఇంద్ర ఛాపమై తోచదే ఇల జనులకు?
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ
అమ్మవారి తలపైనున్న సువర్ణ కిరీటము మణిమయమైనది. అందులోని మణులు ఆదిత్యుల వలే ప్రకాశిస్తున్నాయట. ఒక్క ఆదిత్యునే మనం సూటిగా చూడలేము. ద్వాదశ ఆదిత్యులంటే ఎంత ప్రకాశమో ఊహించటానికే కష్టం. అంతటి ప్రకాశము అమ్మ తలపై నున్న నెలవంక మీద పడి మెరిసి ఇంద్రధనస్సులా తోచుచున్నదని చెబుతున్నారు.
ఆదిత్యులు పన్నెండు మంది. వారు ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భృగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు.
వీరందరిరీని జగన్మాత కిరీటంలో ఉంచుకున్నదట. ఆ కాంతులకు చంద్రరేఖ విచిత్రంగా కనపడుతున్నదట. అది ఇంద్రధనుస్సని బ్రాంతి చెందుతున్నాడట.
ఇందులో గూఢార్థాలు చూస్తే గగనమే అమ్మవారి తలగా, అందు ప్రకాశించే సర్వ సూర్యులు, నక్షత్రాలు అమ్మ మకుటములో మణులు అన్న భావన.
ఈ రెండవ భాగము అమ్మపై శంకరులు రచించి సౌందర్యలహరి కాబట్టి(మొదటి 41 శ్లోకాలను ఆనందలహరిగా పిలుస్తారు)
అమ్మను తల నుంచి వర్ణిస్తున్నాడన్న అర్థం మరోటి.
ఇంకో అర్థం మునుపు శ్లోకాలలో చెప్పబడిన చక్రాల తరువాత సహస్రారం గురించిన వర్ణనగా భావించాలి.
సహస్రారంలో వేయిరేకుల పద్మం ఉంటుంది.
అక్కడ సప్త వర్ణాలు మిళితమై మెరుపులు మెరుస్తూ ఉంటాయి.
జగన్మాతకు సహస్రారంలో మణులు ద్వాదశ ఆదిత్యులే. అంటే ప్రతి ఒక్కరి సహస్రారంలో వివిధ వర్ణాలలో మెరుపులు చిమ్ముతున్న కాంతి అమ్మవారి సహస్రారంలో ఆదిత్యుల కాంతి సమానమైన వెలుగుతో ప్రకాశవంతముగా వివిధ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటుందన్న భావన చేసుకోవాలి.
అట్టి కాంతి అమ్మవారి తలపై ఉన్న తెల్లని చంద్రుని పై పడితే అది పరావర్తనం చెంది సప్తవర్ణ ఇంద్రఛాపములా తోస్తున్నది.
ఇంతటి దివ్యభావనను ధ్యానించి సాధకునికుని సాధనే కదా సాధన.
హిమవంతుని కుమార్తె హైమవతీ అని సంబోధనలో భావము, హిమము తెల్లనిది. తెలుపు అంటే రంగులు లేనిది కాదు. సర్వ రంగులను తనలో కలుపుకున్నది. అట్టి సర్వ వర్ణాలనూ తనలో కలుపుకున్నప్పుడు మిగిలేది తెలుపే కదా. తనలోనే స్వరమూ నింపుకున్న మాతా అని భావన.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ.
Day42.
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 41
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటమ్ ।
ఉభాభ్యామేతాభ్యాముదయవిధిముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగదిదమ్ ॥ 41 ॥
అర్థం
అమ్మా! ఆధారచక్రంలో శృంగారపరమైన నృత్యమందు ఆసక్తి గల సమయ అను శక్తివి నీవు. నీతో కలిసి తాండవమాడే శివుడు ఆనందభైరవుడు. భైరవీభైరవులుగా శివపార్వతులు జగత్తునుత్పత్తి పనిలో నిమగ్నమైయున్నారు ఆధారాచక్రములో.
తేగీ
జనని నీవు భైరవునితో జతగ సేయు
తాండవము సృష్టి మూలమై తారసిల్లు
మూలమందు మాతాపితురులుగ వెలుగు
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ:
మూలస్థానము వెన్నెముక చివరకొసన యుంటుంది. గుదస్థానములో ఉంటే ఈ మూలాధార చక్రము ఆధారచక్రం. ఇది గనుక అంటే ఈ చక్రం గనుక లేకపోతే, శరీరము పడిపోవటమో, ఎగిరిపోవటమో జరుగుతుంది.
ఈ చక్రము ఫృథివీ తత్త్వాత్మకమై యుంటుంది. ఇక్కడ నాలుగు దళాల పద్మము ఉంటుంది. ఈ చక్రానికి అధిపతి గణపతి.
అందుకే ప్రథమ దేవునిగా గణపతి ఆరాధన మనకుంది. స్థిరత్వానిచ్చే చక్రం కాబట్టి, స్థిరత్వకోరుకునే వారు ఈ చక్రం మీద ధ్యానం చెయ్యాలి.
ఈ చక్రాదిదేవత సిద్ధవిద్యాదేవి. ఈ చక్రములో “లం” బీజముంటుంది. అది కుండలినీ స్థానము. ఇక్కడే విద్యుత్కాంతుల త్రికోణముంటుంది. ఆ త్రికోణములో ఉన్న క్లీంకారజీజానికి స్వయంభూలింగ ముంటుంది. అలింగానికి మూడున్నర చుట్టు చుట్టుకు ఉన్న సర్పాకృతే కుండలినీశక్తి.
ఇక్కడి సిద్ధవిద్యాదేవికి ఐదు తలలు. ఎముకులను సరి చేసే అస్తిధాతువు ఇక్కడే ఉంటుంది. ఈమె ఐదు శిరస్సులు పరమశివుని ఐదు శిరస్సులైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పరుష,ఈశానాలుగా చెప్పబడుతాయి.
ఇక్కడి అస్తి దేవతను కొలిస్తే ఎముకలు గట్టిపడతాయి. లలితా నామాలలో ‘అస్తిసంస్థితాయే నమోనమః’ అన్న నామము సంపుటి చెయ్యటం ద్వారా ఆ తల్లి ని ప్రసన్నం చేసుకోవచ్చు.
లలితా సహస్ర నామాలలో ‘మూలాధారాంబుజారూఢా’ నుంచి ‘సాకిన్యా’ వరకూ నామాలన్నీ ఈ తల్లి గురించిన వివరణే.
ఇక్కడి అమ్మవారిని సమయాదేవి అని కూడా అంటారు.
సృష్టి- లయముకు శివపార్వతులు కారణము . అమ్మవారు సృష్టి చేస్తే అయ్యవారు లయం చేసుకుంటారు. అంటే శివపార్వతుల తాండవమే ఈసృష్టి లయాలు.
అమ్మవారి నృత్యము లాస్యము. సౌకుమార్యము. అయ్యవారి నృత్యం తాండవము. అమ్మవారు భైరవి. అయ్యవారు భైరవుడు. ఆనందభైరవుడాయన. వారి నృత్యము ఆనందం.
“జపాకుసుమ సంకాశౌ మధుఘూర్ణితలోచనౌ
జగతః పితరౌ వందే భైరవీభైరవాత్మకౌ”
మంకెన్న పూల వంటి శరీరచ్ఛాయ గలిగి మధుపానముచే మత్తెక్కిన కనులు కలిగి, ఈ జగ్గుత్తుకు మాతాపితురులైన భైరవీ భైరవులకు నమస్కారము.
షట్చక్రాల ఐక్యత- మాతృకావర్ణములు.
షట్చక్రాలు భాషలోని అక్షరాలతో ఐఖ్యత చెందటము మాతృకావర్ణము.
సంస్కృత భాషలో వర్ణాలు (అక్షరాలు) 50.
విశుద్ధి వద్ద అ నుంచి అః వరకూ 16 అక్షరాలు పదహారు దళాల పద్మముగా చెప్పబడుతుంది.
అనాహతము వద్ద క నుంచి ఠ వరకూ 12 దళాలు.
మణిపూరంలో డ నుంచి ఫ వరకు 10 దళాల పద్మము.
స్వాధిష్ఠానములో బ నుంచి ల వరకు 6 దళాలు.
ఆధార చక్రములో వ, శ,ష,స 4 దళాలు.
ఆజ్ఞా చక్రం వద్త హ క్ష రెండు. మొత్తం 50 అక్షరాలు.
శ్రీచక్రముతో ఐక్యత
గౌడపాదులవారు సుభగోదయ స్తుతిలో షట్చక్రాలకూ, శ్రీ చక్రముతో ఐఖ్యతను సూచించారు.
“త్రికోణం చాధారం త్రిపుర వినుతేష్ఠార మనఘే
భవే త్స్వాధిష్ఠానం పునరపి దశారం మణిపురం।
దశారంతే సంవిత్కమల మథ మన్వస్రక్రముమే
విశుద్ధం స్వాధాజ్ఞా శివ ఇతి భైందవ గృహమ్॥”
త్రికోణము ఆధారచక్రం, స్వాధిష్ఠానం మన అష్టకోణము, మణిపూరము అంతర్దశారము, అనాహతము బహిర్దశారం, విశుద్ది చతుర్దశారము, ఆజ్ఞ అష్టదళ షోడశదళాలతో ఐక్యత. సహస్రారము భూపురముతో.
మూడు వృత్తాలు మూడు గ్రంధులు.
సాదకుడు గురువును పూజించి గురువు ద్వారా మంత్రము తీసుకున్నప్పుడు వారికి మంత్ర జపము వల్ల చక్రాలలో భగవతి దర్శనం కలుగుతుంది.
శ్రీ చక్రంలోకి జీవుని ప్రయాణం బహిర్ ఆవరణ నుంచే ప్రారంభమవుతుంది. అంటే మూలాధారం నుంచే అన్నమాట. కాబట్టి యోగము ప్రారంభం ఇక్కడ్నుంచే.
శంకరులు మనకు ప్రతి చక్రములో శివపార్వతుల రూప,నామ, అధిష్ఠాన, అవస్ఠా,అనిష్ఠాన సామ్యమును ప్రతిపాదించి సమయాచారములో చక్రాలలో వారిని ధ్యానించు పద్ధతిని చెప్పారు.
ఇక్కడి వరకూ ఉన్న శ్లోకాలను ఆనందలహరి అంటారు.
ఇంత వరకూ మనకు అమ్మవారి తత్త్వము, తాత్వికత, ధ్యానించు పద్ధతి, చక్రలలో ధ్యానము, కుండలినీ యోగము, అమ్మవారి ని సాధకులో లోలోపల ఎలా ఆవిష్కరించుకోవాలో వివరించి చెప్పారు.
ఇది మొదటి భాగము. తరువాత వచ్చేది సౌందర్యలహరి.
అది 42 వ శ్లోకము నుంచి ప్రారంభమవుతుంది.
శంకరులు మొదటి తత్వం చెప్పి తదుపరి అమ్మవారి రూపసౌందర్యములోనికి తీసుకుపోతారు.
అమ్మవారంటే మనకు తెలిసిన మానవ స్త్రీ శరీరము కాదండి. మంత్ర స్వరూపము. శ్రీచక్ర విన్యాసము. పరమాణువు నుంచి విశ్వాంతరాల వరకూ వ్యాపించి యున్న కేవల చిత్రూపం.
అట్టి జగత్జననిని మనలోనికి ఆవిష్కరించుకోవటానికి సహాయం చేసేదే ఆనంద లహరి.
శంకరులు మానవుల జీవితాలను పండిచటానికి ప్రసాదించిన ఈ దివ్య
జ్ఞానానికి నమస్కరిస్తూ
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్త
#day41
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 40
తటిత్త్వంతం శక్త్యా తిమిరపరిపంథిఫురణయా
స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేంద్రధనుషమ్ ।
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ ॥ 40 ॥
అర్థం
మణిపూరక చక్రములో అసుముకున్న అంధకారములో మెరుపులా ప్రకాశిస్తున్న భగవతీ! స్వాధిష్ఠానములో అగ్నికి దగ్ధమైన లోకాలకు తన వర్షధారలతో తడుపుతున్నది. నవరత్నాలు ధరించి ఇంద్రధనస్సులా మెరుస్తున్నది. నల్లని మేఘములా ఉండి మేఘరూపములో ఉన్న పశుపతిని ధ్యానిస్తున్నది.
తేగీ।
చీకటి మణిపూరములోన జిలుగుమెరుపు
చంచలమగు సౌదామిని జలము కురుయు।
కలసి శివుని శమించు జగములు బ్రోచు
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ:
మణిపూరంలో పదిదళాలతో ప్రకాశించే చక్రముంది. ఇది జలతత్త్వమున్నది. దీని పది దళాలలో స్వాధిష్ఠాన, ఆధార చక్రాలకు ప్రతీకగా కూడా ఉంది.
ఇక్కడున్న దేవి మూడు ముఖములతో, వజ్రం, శక్తి, దండము, అభయముద్ర ధరించియుంది. ఆమెకు గూఢాన్నమంటే ప్రీతి. ఈమె డామరి మొదలైన శక్తులతో కలిసి ఉంది. ఈమె లాకినీ అన్న పేరు గల యోగిని.
లలితా నామాలలో మణిపూరాబ్జనిలయా నుంచి లాకిన్యంబా స్వరూపిణి వరకూ నామాలు ఈ దేవి గురించి చెప్పినవి.
స్వాధిష్ఠాన మహా సంవర్తాగ్ని వల్ల దగ్ధమైన లోకాలను శివశావానిలు అమృతధారలలో తడుపుతారు. శివుడు మేఘరూపములో, అమ్మవారు మెరుపు సౌదామినిగా ఉంటారు. వీరు ఇక్కడ తటిత్వంతుడు, తటిత్వతి పేర్లతో పిలవబడతారు.
చక్రాల వివరణ:
షట్చక్రాలలో తత్త్వాల గురించి తంత్రశాస్త్రంలో
ఆధారచక్రం- పృథ్వీతత్త్వం
స్వాథిష్ఠానములో జలతత్త్వం
మణిపూరంలో అగ్నితత్త్వం
అనాహతమమ-వాయు
విశుద్ధి - ఆకాశముగా చెప్పబడింది.
ఇది పంచభూతాలైన ఆకాశ-వాయు-అగ్ని-జ్వల-పృథ్వి తత్త్వాలకు అణుగుణముగా చెప్పబడింది.
కొంత చక్రాల గురించి తెలిసినవారికీ ఇదే వరుస క్రమము తెలుసు.
అయితే మనకు సౌందర్యలహరిలో జగద్గురువులు స్వాధిష్ఠానికి అగ్నితత్త్వము, మణిపూరముకు జలతత్త్వము చెప్పారు. ఈ విధమైన మార్పు కేవలం స్వాధిష్ఠాన మణిపూరకాలకే చెప్పబడింది. (దీని గురించి కొంత అయోమయం కలుగుతుంది. కాని 9వ శ్లోకమైన మహీం మూలాధారే…లో చెప్పేయున్నారాయన…. కమపి మణిపూరే యని)
మానవశరీకము షోమసూర్యాగ్నిమయము.
సోమమంటే చంద్రుడు, సూర్యుడు, అగ్ని కలిసినదే మానవ శరీరము. మూడు ఖండాలుగా ఉంటుంది. ఈ విషయమే మనకు త్రిశతిలో కూడా కనపడుతుంది. పంచదశిలో కూడా ఇదే వివరణ చెబుతారు.
విశుద్ధి నుంచి పైకి చంద్రలోకము. నుదురు నుంచి పైకి జ్యోతిర్లోకము.
అనాహతము - మణిపూరము సూర్య,
స్వాదిష్ఠాన ఆధారచక్రములు అగ్నితత్త్వములు.
కాబట్టి స్వాదిష్ఠానము అగ్ని తత్త్వము గా చెప్పబడింది.
అయినా అందులో జలము పాళ్ళ తేడాతో ఉంటుంది.
మణిపూరములో జలము, అగ్ని ఉంటాయి.
(నారాయణుడికి నాభి నుంచి పద్మముదయించినదంటే అక్కడ జలతత్త్వముంది కాబట్టే.)
ఇదీ ఒక యోగ ప్రక్రియ. దీనిని కూడా పాటించవచ్చును.
దీనిని పరిశీలిస్తే లొల్ల లక్ష్మీధరులన్న పెద్దల వ్రాసిన వ్యాఖ్యలో చెప్పినది -మణిపూరం
జలతత్త్వామైనది. స్వాధిష్ఠాన అగ్ని నుంచి మేఘములుదయించి వర్షించునికడ.
మణిపూరం మణులతో కూడి ఉంటుంది. సూర్యఖండంలో ఉంటుంది. ఇక్కడి జలం మీద ఇంద్రదనస్సు ఏర్పడి ఉంటుంది. దీనికి అల్లెత్రాడు ఉండదు. మేఘస్వరూపుడైన రుద్రుని ధనస్సుకు అల్లెత్రాడు ఉండదని అరుణోపనిషత్తు చెబుతుంది. ఇక్కడ అంటే మణిపూరంలో భగవతి స్థిరమైన మెరుపులా ఉంటుంది. స్వాధిష్ఠానములోని అగ్నికి జల్వము నుంచి మేఘాలుత్పన్నమై మణిపూరం, స్వాధిష్ఠానముల మధ్య ఉంటాయి అని వివరణ
ఇచ్చారు.
మణిపూరంలో జలమూ ఉంది, అగ్ని ఉన్నా, జలతత్త్వాన్ని సాదనచేసి స్వాధిష్ఠానములో అగ్నిని సాధన చెయ్యటం వలన త్వరగా సాదనలో పూరోగమించవచ్చని జగద్గురువులు ఈ మార్గం ఉపదేశించారు. శంకరులకు పరమగురువైన గౌదపాదులవారి సుభగోదయస్తుతిలో కూడా మణిపూరం జలతత్త్వంగా సూచించారు.
ఒక విషయము గమనించాలి- చక్రాల తత్త్వాల గురించి మార్పు సూచించినా, చక్ర క్రమము మాత్రము వ్యాసాదుల క్రమమే స్వీకరించారు శంకరులు. (ఆకాశ-వాయు-అగ్ని-జలము-పృథ్వీ). ఎందరో పెద్దలు యోగములో ఇదో పద్ధతిగా అంగీకరించారు. జగద్గురువులు సూచించారంటే అది మనకు తెలియనది తెలియచేస్తున్నారన్నది మనము గ్రహించాలి.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
#day40
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 39
తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ ।
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే
దయార్ద్రా యా దృష్టిః శిశిరముపచారం రచయతి ॥ 39 ॥
అర్థం:
అమ్మా! భగవతీ! స్వాధిష్ఠాన చక్రమందు అగ్నితత్వాన్ని అధిష్టించి నిరంతరము ప్రకాశిస్తున్న సంవర్తాగ్నిగా యున్న పరమేశ్వరుడ్ని ధ్యానిస్తూ సంవర్తాగ్ని శక్తిగా అమ్మవారిని ఆరాధిస్తున్నాను.
అగ్ని రూపుడైన శివుని దృక్కులకు లోకాలు వేడెక్కగా పరమేశ్వరి కరుణార్థ దృక్కులచే అదే లోకాలు శీతలోపచారము కలుగుచున్నాయి.
తేగీ॥
లోకముల శివుడాగ్నిగ లుప్తముంచ
కరుణ బ్రోచు సమయ శక్తి కాంతి నీవు।
అగ్ని స్వాధిష్టమున చింద అనలమీవు
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ
ఈ స్వాధిష్ఠానములో శివశక్తులను ధ్యానించు పద్ధతిని శంకరాచార్యులవారు అగ్నితత్త్వముగా చూపుతున్నారు.
ఇక్కడ పరమేశ్వరుడు అగ్నిశిఖలను చిందిస్తూ సంవర్తాగ్ని యన్న మహాగ్నిగా యుంటాడు. అమ్మవారు ‘సమయ’ యన్న పేరు కలిగి శక్తి రూపిణిగా యుంటుంది.
అయ్యవారు ప్రళయకాలంలో సర్వమును తనలో లయం చేసుకునే సంవర్తాగ్ని కాగా, తన దయార్థ్ర దృక్తులతో లోకాలను చల్లపరుస్తుంది అమ్మవారు. వాటిని రక్షించి పునః సృష్టికై సంరక్షిస్తుంది.
స్వాధిష్ఠానము జీర్ణాశయము. సర్వ ఆహారమును దహించి శక్తిగా మార్చి శరీరాని ఇస్తుంది.
మూలాధారానికి పైన యున్న ఈ స్వాధిష్ఠాన చక్రానికి ఆరు దళాలుంటాయి. ఇక్కడ అమ్మవారు నాలుగు ముఖాలతో యున్న సిద్ధేశ్వరిదేవి. నాలుగు చేతులలో శూలము, పాశము, కపాలము, అభయ ముద్రలతో ఉంటుందీ తల్లి. పసుపు పచ్చని శరీరముతో మహాతిశయ సౌందర్యముతో ఉండే ఈ తల్లి మేదస్సులో యుంటుంది. మధువు అంటే తేన అంటే ప్రీతి. లలితా నామాలలో స్వాధిష్ఠానాంబుజగతా నుంచి కాకినీరూపధారిణీ వరకూ నామాలు ఈ తల్లి గురించే చెబుతాయి.
ఇక్కడ పరమేశ్వరుడు అగ్ని అయితే అమ్మవారు జ్వాలా రూపము.
అయ్యవారి సంవర్తేశ్వరుడు అమ్మవారు సమయాంబ.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
##Day39
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 38
సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్ ।
యదాలాపాదష్టాదశగుణితవిద్యాపరిణతి-
ర్యదాదత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యః పయ ఇవ ॥ 38 ॥
అర్థం:అమ్మా! భగవతి! వికసిస్తున్న జ్ఞానమన్న అనాహత పద్మమన్న హృదయ సరోవరమందు సంచరిస్తున్న రాజహంస మిథునమును ధ్యానిస్తున్నాను.
ఏ హంస పలుకులు నుంచి వేదాలు, వేదాంగాలు, సర్వ విద్యలు ఉద్భవించాయో, ఏ హంసలు నీటిని పాలనుంచి వేరుచేస్తాయో ఏ హంసద్వయము యోగుల హృదయాలలో తిరుగాడుతారో ఆ హంసద్వయాన్ని ధ్యానిస్తున్నాను.
తేగీ॥
రాజహంసద్వయకల జలము హృదయము
శక్తిశివులని భావించు సాధకులకు ।
జ్ఞానముదయించు విద్యలు జననమొంద
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ:
హృదయాన్ని దహరాకాశమని పిలుస్తారు.
సర్వ ప్రపంచము మనము మన హృదయములో నిర్మించుకుంటాము. హృదయమే సర్వ కార్యాలకు కారణము. ఈ హృదయ స్థానమే అనాహత చక్రం . అదే హృదయ చక్రం. ఇదే సంవిత్కమలం.
హిమాలయాల అంతర్భాగములో మానస సరోవరముంది. అక్కడ రాజ హంసలు తిరగాడుతాయి.
ఈ రాజహంస ద్వయము యోగుల హృదయ సరోవరములో తిరుగాడుతాయి.
హృదయపద్మానికి పన్నెండు దళాలు. ఈ చక్రం వాయుతత్త్వాత్మకమైనది. బంగారు రంగు కలిగి ఉంటుంది. వాక్కు ఇక్కడ మధ్యమారూపం సంతరించుకుంటుంది.
అక్షమాల, డమరుకము, శూలము, కపాలము ధరించి నాలుగు చేతులు, రెండు ముఖాలు ఉన్న ‘వామదేవి’ అన్న తల్లి ఈ చక్రానికి అధిదేవత. ఈ తల్లి రక్తానికి అధిదేవత. రక్తహీనం వంటి వాటికీ ఈ తల్లిని సేవించమనే చెబుతారు. లలితా నామాలలో మనకు “అనాహతాబ్జ నిలయా నుంచి రాకిన్యంబా స్వరూపిణి వరకూ చెప్పే నామాలన్నీ ఈ తల్లి గురించే.
శంకరుల గురువులైన గౌడపాదులవారి సుభగోదయస్తుతి లో
“వదంత్యేకే వృద్ధా మణిరితి జలం తేన నిబిడం
పరేతు త్వద్రూపం మణిధనురితీదం సమయినః
అనాహత్యానాదః ప్రభవతి సుషుమ్నా ధ్వజనిత
స్తదా వాయో స్తత్ర ప్రభవ ఇద మహుః సమయినః॥” అని చెబుతారు.
అనాహతములో నాదము బయలుదేరుతుంది. సుషుమ్నలో జన్మించి అనాహతములో బయటకొస్తుందీ నాదము. ఇక్కడ ఇది వాయుత్త్వాత్మకం కాబట్టి నాదము బయటకు వస్తుంది.
యోగులు ఇక్కడ శివశక్తులను హంస మిథునముగా ధ్యానిస్తారు. ఇది సమయాచారము.
శంకరులు ఈ హంసద్వయం నుంచి 18 విద్యలొచ్చాయని చెబుతున్నారు.
అవి వేదాలు నాలుగు, శాస్త్రాలు ఆరు( తర్కము, వ్యాకరణము, ధర్మము, శిక్ష, వైద్యము, జ్యోతిష్యము), మీమాంస, న్యాయము, పురాణము, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము, అర్థశాస్త్రము, నీతిశాస్త్రము. అన్నీ కలిపి పద్దెనిమిది. ఇక్కడి శివశక్తులని ధ్యానించే యోగులకు ఈ జ్ఞానము వికసితమవుతుంది. ఇక్కడ హృదయేశ్వరి-హృదయేశ్వరుడు అనిన పేర్లతో అమ్మవారు అయ్యవారు కొలువబడతారు.
సర్వం శ్రీ మాత పాదాలకు సమర్పిస్తూ
****
#Day38
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 37
“విశుద్ధౌ తే శుద్ధస్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితామ్। యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్యసరణే-
విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ ॥ 37 ॥
అర్థం:
అమ్మా! విశుద్ధి చక్రంలో దోషరహితుడు, స్పటికంలా నిర్మలుడైన శివునిడిని నీతో కలిపి ధ్యానిస్తున్నాను. శివాశివులైన మీ నుంచే వచ్చే కాంతులు సాధకుని అజ్ఞానము పోగొట్టి జ్ఞానమిస్తాయి.
చంద్రకిరణాల వల్ల చకోరాలు తృప్తి చెందినట్లుగా అజ్ఞానం తొలిగి సాధకుడు సంతృప్తుడవుతాడు.
తేగీ।
స్వచ్ఛమైన శివునితోడ సమము గున్న
నిన్ను ధ్యానింతురు విశుద్ధి నిలిపి మునులు।
జ్ఞాన వంతులవుదురురజ్ఞానమీడి
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ:
శంకరులు వివిధ చక్రాలలో శివశివానులను మనకు దర్శింపచేస్తూ అక్కడి ధ్యానము విధానము, జపం వల్ల కలిగే ఫలితము చెబుతున్నారు.
విశుద్ధి అంటే శుద్దతత్త్వమే. స్వచ్ఛమైనది, మలినంలేనిది. విశుద్ధి చక్రం కంఠానికి క్రిందగా ఉంటుంది. దీనికి పదహారు దళాలుంటాయి.
ఈ పదహారు దళాలలో అ నుంచి అః వరకూ అచ్చులుంటాయి.
వాక్కు ఇక్కడికి వచ్చాక అచ్చులతో కలిసి వైఖరిగా మార్పు చెందుతుంది. పదహారు దళాలపై పదహారు శక్తులు ఉంటాయి.
ఈ చక్రానికి అధిదేవత వజ్రేశ్వరి.
ఈ తల్లి మూడు కన్నులు కలిగి నాలుగు చేతులతో ఉంటుంది. ఈమెది పాటలా వర్ణం(తెలుపు, ఎరుపు కలిగిన గులాబీవర్ణము).
లలితా సహస్రనామాలలో ఈ తల్లి వివరాలుంటాయి. అవి
“విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా ।
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98 ॥
పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥”
ఈ చక్రం ఆకాశతత్త్వం. శివుడు ఇక్కడ స్వచ్ఛంగా శుద్ధంగా స్పటికంలా ఉంటాడు. భగవతి కూడా ఇక్కడ ఇలాగే ఉంటుంది.
ఇక్కడ దళాలు పదహారు చంద్రుని పదహారు కళలకూ సంకేతముగా కూడా చెప్పబడుతుంది.
ఇక్కడ అమ్మవారు అయ్యవారు వ్యోమేశ్వరి- వ్యోమేశ్వర నామాలతో పిలువబడుతారు.
ఈ విశుద్ధ చక్రములో శివుడ్ని, అమ్మవారిని శుద్ధ స్వచ్ఛమైన రూపాలలతో భావిస్తూ ధ్యానించిన వారి అజ్ఞానమును తొలగిస్తుంది. జ్ఞానము వికసించి మోక్షానికి దారి చూపుతుంది.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
****
*****-
#day37
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 36
తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం
పరం శంభుం వందే పరిమిలితపార్శ్వం పరచితా ।
యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామవిషయే
నిరాలోకేఽలోకే నివసతి హి భాలోకభువనే ॥ 36 ॥
అర్థం:
అమ్మా భగవతీ!
నీకు చెందిన ఆజ్ఞాచక్రంలో, కోటి సూర్యుల, కోటి చంద్రుల కాంతులు కలిగి ‘సరయు’ అన్న నామం ధరించిన చిచ్ఛక్తి తన ఉభయపార్శాలలో కలిగిన పరమశివునికి నమస్కారము.
సాధకులు శివుని ప్రసన్నుగా చేసుకొని బయటకు కనపడని చంద్రలోకములో నివశిస్తున్నాడు.
తేగీ
ఆజ్ఞయందు ప్రకాశించు అమ్మ-అయ్య
తోడ, చిచ్ఛక్తి భావము తలచు యోగి।
చేరి, శివుడు వెలుగు నందు చేర్చు నిజము
కొలచెదను సంధ్యను శరణుగోరమదిన॥
వివరణ
ఇక్కడ్నుంచి జగద్గురువులు చక్రములలో జగదంబను ధ్యానించటము గురించి తెలుపుతున్నారు.
భ్రూమధ్యములో రెండు దళాలతో ఉండే చక్రం ఆజ్ఞా చక్రం.
ఈ చక్రానికి అధిపతి సదాశివుడు.
ఇది గంగ, యమున, సరస్వతీ సంగమస్థానము. అంటే ఇడ , పింగళా, సుష్నునాల సంగమం. ఇదే వారణాసి.
లలితా సహస్రంలో చెప్పిన రుద్రగ్రంథి కూడా ఇదే.
వాగ్భవకూటమీ, కామరాజకూటమీ, శక్తి కూటమీ కలసిన సంగమ స్థానము కూటత్రయం.
చంద్రఖండం, సూర్యఖండం, అగ్నిఖండము కలిసిన ఖండత్రయం.
సూర్య మండలము, చంద్రమండలమూ, అగ్ని మండలమూ కలిసిన మండలత్రయము. ఇదే త్రిపురా నివాసము. ఇంద్రియాలకు ఆజ్ఞలు ఇక్కడ్నుంచే వెడుతాయి. కాబట్టే ఇది ఆజ్ఞా చక్రము.
ఇదే ఆత్మచక్రము కూడా.
ఇక్కడి రెండు దళాలకు ఒక్కొక్క దళానికీ ముపై నాలుగు చొప్పున అరువై ఎనిమిది కాంతి పుంజాలుంటాయి. అన్నీ అమ్మ పాదాల నుంచి ఈ చక్రములో ప్రసరించబడతాయి. ఇక్కడి దేవత సిద్ధమాత. తెల్లని రంగులో ఉంటుంది.
ఈ తల్లిని హంసవతీ, క్షమావతీ అన్న శక్తులు పరివేష్ఠిస్తూ ఉంటాయి. ఈ తల్లిని హరిద్రా న్నము(పులిహార) ప్రీతి.
ఈమెను హాకినీ దేవత అంటారు.
“ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥” ఈ నామాలన్నీ ఆ తల్లికి చెందిన నామాలే.
ఈమే రెండు దళాల పద్మములో ఉంటుంది. అక్షమాల, జ్ఞానముద్ర, డమరుకము, కపాలము ధరించి ఉంటుంది.
ఈ ఆజ్ఞా చక్రము తూర్పు దిక్కుకు సంకేతము. తూర్పున సూర్యోదయం తిమిరానికి శత్రువు. అలాగే ఈ ఆజ్ఞా చక్రం పై ధ్యానిస్తే జ్ఞాని కాగలడు సాధకుడు.
ఇక్కడ బాహ్యదృష్టికి గోచరము కాని చంద్రకాంతులతో నిండి ఉంటుంది. ఈ కాంతులు మానవ నేత్రానికి దొరకవు. జ్ఞానచక్షువులకు మాత్రమే గోచరము.
ఇక్కడ శివుడు శివాని కలిసి ఉంటారు. వారు మునుపు చెప్పినట్లుగా పంచవిధములైన సారూప్యాలతో ఒప్పుతుంటారు.
ఆజ్ఞా చక్రం పై ద్యానించిన సాధకునికి పరశంభ ప్రసన్నమై అనంతమైన వెలుగులతో నిండిన చంద్రలోకాన్ని చూపుతాడు.
అతనికది ముక్తిహేతువు అగుతుంది.
ఇలా మనము ధ్యానించి పరశంభ అనుగ్రహం పొందటానికి జగద్గువులు ఈ శ్లోకాన్ని ప్రసాదించాడు.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
#day36
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 35
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ ।
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే ॥ 35 ॥
అర్థం
అమ్మా! శివునికి ఇల్లాలా! ఆజ్ఞా చక్రములో మనస్తత్వం, విశుద్దియందు ఆకాశతత్త్వమూ, అనాహతమందు వాయుతత్తవం, స్వాధిషానమందు అగ్నితత్త్వం, మూలాధారములోభూతత్త్వమూ నీవుగా యున్నావు. పంచభూతాలు నీవే. నీవు కాక మరో పదార్థము లేదు. నీ స్వరూపము జగదాకారముగా పరిణమింప చిచ్ఛక్తి అయి శివతత్త్వమును నీ చిత్తముతో ధరించావు.
తేగీ।
పంచ భూతములందలి పరమ సార
మదియు నీవు, దివి,సమీరమగ్ని నీవు
శంభునిల్లాల సర్వ విశ్వానివీవు
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
వివరణ
పంచభూతాలలో ఉన్న అమ్మవారి తత్త్వమే ఈ శ్లోకములో చెప్పబడింది.
మట్టి వలన వివిధ రూపాలలో ముంత లేర్పడినట్లు, పాల మూలంగా నెయ్యి ఇత్యాదివి వచ్చినట్లు షట్చక్రాలలో ఉండి
నియంత్రణ చేస్తూ అమ్మవారే వివిధ పరిణామాలుగా రూపొందింది.
ఉత్తరకౌళులకు అమ్మవారు మరోటి ఉండదు. ఉన్నది ఒక్కటే పరమేశ్వరి.
దేవీ ఉపనిషత్తులో కూడా ఇదే చెప్పబడుతుంది.
దేవతలు పరమేశ్వరిని సమీపించి “దేవీ నీవెవరు?” అని అడుగుతారు.
అప్పుడు అమ్మవారు “నేనే బ్రహ్మస్వరూపిణి, నావల్ల జగత్తు ఆవిర్భవించింది. విజ్ఞానము, అవిజ్ఞానమూ నేనే, బ్రహ్మమూ, అబ్రహ్మమూ నేనే. పంచభూతాలు నేనే. అఖిలజగత్తు నేనే” అని చెబుతుంది.
సృష్టికి మునుపు ఉన్నదొక్కటే అదే పరాశక్తి, మహాత్రిపురసుందరి.
అందుకే జగద్గురువులిక్కడ చెబుతున్నారు - తల్లీ పంచభూతతత్త్వము నీవే. ఒకటిగా యున్న శివశక్తులు సృష్టి కొరకు ప్రకృతీపురుషులుగా మారుతున్నారు. ఆనందభైరవుడుగా, ఆనందభైరవిగా మారుతున్నదీ తల్లే.
అట్టి తల్లిని శరణువేడి ఈ మాయను తప్పిచుకోవటానికి శంకరులు మనకు దివ్యమైన ఈ శ్లోకాలను ప్రసాదించారు.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
****
##day35
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 34
శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్ ।
అతశ్శేషశ్శేషీత్యయముభయసాధారణతయా
స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః ॥ 34 ॥
అర్థం
అమ్మ భగవతీ! జన్మ,స్థితి, లయ,తిరోధాన, అనుగ్రహము అన్న ఐదు విషయాలు తెలిసినదానవు. సూర్యచంద్రులను స్థనాలుగా కలిగి, ఆనందభైరవునకు శరీరమైనదానవు. నవవ్యూహాత్మకుడైన ఆనందభైరవుడే నీ శరీరం. మీరిరువురూ శేష-శేషీ భావముతో సమానముగా యున్నారు.
తేగీ
శశిరవులు స్తనము కలిగి శంభుని సగ
భాగము నిలుపి నవ్యాత్మ భావమొంది
శేశశేషీగ పోషణ సేయ్యు జగతి
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
వివరణ
ఈ శ్లోకములో మనకెన్నో విషయాలు జగద్గురువులు చెబుతున్నారు.
ఈ శ్లోకములో ఐదు కృత్యాల గురించి, పరమేశ్వరుని నవవ్యూహాత్మకునిగా, అమ్మవారు అయ్యవారు “శేష-శేషీ” అని చెప్పబడింది.
అమ్మవారు-అయ్యవారని రెండు లేరు. ఒక్కరే ఉన్నారు. ఆనందభైరవుడు అమ్మవారి విద్యకు ఆద్యుడు. ఆయనను అమ్మవారి మంత్ర ద్రష్టగా కొలిచే సంప్రదాయమున్నది.
“భ” అంటే వెలుగు, లేదా వ్యక్తము, “గ” అంటే గమనము.
ఎవరి వలన విశ్వం సృష్టించబడి- తిరిగి లయమవుతున్నదే వ్యక్తం-అవ్యక్తంగా నిరంతరం సాగుతున్నదో వారు భగవతి-భగవంతులు. వారే ప్రకృతీ- పురుషుడు. వారే ఆనందభైరవుడు- ఆనందభైరవి.
వీరి సంబంధం “శేష-శేషీ” భావముతో ఉంది.
అంటే ఏ ఒక్కరూ ప్రధానము కాదు. ఏ ఒక్కరూ తక్కువా కాదు. వారు చేసే కృత్యాలు పంచకృత్యాలు. అవి సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం.
ఇద్దరూ ఈ ఐదు కార్యాలను పంచుకున్నారు. అమ్మవారు చేస్తుంటే అయ్యవారు సహకరిస్తారు. అయ్యవారు చేస్తుంటే అమ్మవారు సహకరిస్తారు. ఇద్దరూ కలిసి పని చేస్తారీ విశ్వరచనకు.
అమ్మవారు సృష్టి, స్థితి చేస్తారు. అయ్యవారి సహకారంతో.
అయ్యవారు తిరోధానం, లయము చేస్తారు.
ఇద్దరూ కలిసి అనుగ్రహిస్తారు. ఇలా పంచుకోవటము శేష-శేషీ భావము.
అమ్మవారు ఈ విశ్వానికి స్థితి చెయ్యటానికి ఆమె చంద్రసూర్యులను నియమించింది. వారి వలననే ఈ విశ్వం స్థితి- పృష్ఠి కాబట్టి వారు అమ్మవారి స్తన్నాలుగా చెప్పబడ్డాయి.
అట్టి అమ్మవారు పరమేశ్వరుడిలో సగభాగమైయున్నారు కాబట్టి ఆమె వ్యక్త రూపము. సదాశివుడు అవ్యక్తరూపమగుచున్నారు.
ఏదైనా జరిగాక మనకు తెలుస్తుంది. కానీ జరగక మునుపు తెలియటం భైరవం. ఆనందభైరవుడు మహాభైరవుడు కూడా.
ఈయనే నవాత్మకుడు. లేదా నవవ్యూహాత్మకడు.
నవ వ్యూహాల గురించి ఇలా చెప్పబడింది.
“కాలవ్యూహః కులవ్యూహో నామవ్యుహ, తథైవచ
జ్ఞానవ్యూహస్తథా చిత్తవ్యూహస్స్వా స్తదనంతరమ్॥
నాదవ్యూహ స్తథా బిందు వ్యూహస్స్యా స్తదనంతరమ్
కలావ్యూహ స్తథా జీవవ్యూహఫ్స్యా దితి తేనవ॥”
వీటిని గురించి కొంత వివరంగా చెప్పాలంటే
1. కాల వ్యూహము- నిముషం నుంచి కాలాంతరం వరకూ కాలమే. సూర్య-చంద్రులు కాలంలో భాగమే.
2. కులవ్యూహం- వర్ణాలు అంటే రంగుల గురించి తెలిపేది.
3.నామవ్యూహం- స్థావరజంగాత్మకమైన ప్రపంచములో ప్రాణకోటి పేర్లును తెలిపేది.
4.జ్ఞానవ్యూహము- ఇది విజ్ఞాన విషయం. ఇది వికల్ప, నిర్వకల్పాల గురించి చెబుతుంది.
5. చిత్తవ్యూహాము, మనస్సు బుద్ది అహంకారాలు.
6. నాదవ్యూహము వాక్కు పరమేశ్వరి స్వరూపము. పరా పశ్యంతి, మధ్యమా వైఖరి రూపాలుగా నాదము ప్రయాణిస్తుంది.
పరాస్థానము వాక్కు ప్రథము స్థానము. ఆధారచక్రమది. అక్కడ్నుంచి స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతములో పశ్యంతిగా మారి అక్కడ్నుంచి విశుద్ధి చక్రములో మధ్యామా రూపం దాల్చుతుంది. తదనంతరం నోటి ద్వారా వచ్చిన వాక్కు వైఖరిగా వినపడుతుంది.
పరావాక్కు అవ్యక్తమైనది. పశ్యంతి వాక్కు పరదేవత. వైఖరి స్పష్టమైన మాట. అమ్మవారి స్వరూపమే వాక్కు.
వైఖరిగా మారకమునుపు ఈ వాక్కు త్రిఖండితమైన మాతృకా రూపమే. అదే పంచదశి లోని మూడు ఖండాలు లేదా కూటమిలు. ఇదే శ్రీవిద్యా రహస్యము.
7. బిందు వ్యూహము - ఆధార చ్కరం నుంచి సహస్రారం వరకూ ఉన్న విషయజ్ఞానము.
8. కళావ్యూహము పంచశత్ (50) అక్షరాల గురించి, కళా స్వరూపాల గురించి తెలిపేది.
9. జీవవ్యూహం - భోక్తలైన జీవుల సమూహం.
పరాశక్తి, పరానందుడుగా భైరవుడు నవవ్యూహ్మకం.
పరాశక్తి చిద్రూప అయిన భైరవి. వీరి సామరస్యమే జగత్తికి కారణము.
సృష్టి కారణం, వాక్కు స్వరూపము వివరించిన జగద్గురువులకు సదా ప్రణామాలు చేసుకోవాలి మనమందుకే.
సర్వం శ్రీమాతపాదాలకు సమర్పిస్తూ
****
Day34
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం33
“స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో-
ర్నిధాయైకే నిత్యే నిరవధిమహాభోగరసికాః ।
భజంతి త్వాం చింతామణిగుననిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః ॥ 33 ॥”
అర్థము
అమ్మా భగవతీ!
నీ మంత్రానికి ముందు కామరాజ, భువనేశ్వరీ, లక్ష్మీ బీజాక్షరాలను చేర్చి మహాభోగులైన సమయాచారులు, యోగులు చేతిలో చింతామణి అక్షమాలను ధరించి, నిన్ను “శివాగ్ని” అన్న హవమందు నేతితో హోమము చేస్తూ సేవిస్తూ ఆనందిస్తున్నారు.
తేగీ
కాముడు, హకార,సిరి తోడ కలిపి మంత్ర
ము తలచు సమయులు, మునులు ముదము తోడ
హవముసేయ చేరి నిను ఆహ్లాదపరచు
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
తేగీ
చేతిలో మణిమాలలు, జేర్చి కూడి
చింత తీర్చు, శివాగ్నితో చేర్చి ఘృతము
హవయు చేసిముదము నొందు యతులు నిన్ను
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
వివరణ.
ఈ శ్లోకములో మొదటి లైనుతో అమ్మవారి మహామంత్రము పూర్తి అవుతుంది.
అంటే పదిహేను అక్షరాల మహామంత్రానికి ముందు గణపతి బీజక్షరమో, బాలా బీజక్షరమో, మన్మథ బీజాక్షరమో చేర్చి అమ్మవారిని సేవిస్తారు. అలా సేవిస్తూ దానికి తగ్గ హవము అంటే హోమము చేస్తారు. అలా చేసిన వారు మహా భోగులవుతున్నారు. భోగమంటే అత్యంత ఉత్కృష్టమైన ఆనందం.
తైత్తిరీయం ఆనందం గురించి వివరిస్తుంది. ఆ ఉపనిషత్తు ప్రకారం మానవ ఆనందం కన్నా గంధర్వ ఆనందం నూరు రెట్లు ఎక్కువ. గంధర్వ ఆనందం కన్నా దేవతల ఆనందం నూరురెట్లు, అంతకన్నా పితృదేవతలు- దానికన్నా దేవగురువు బృహస్పతి ఆనందం అంతకు మించి బ్రహ్మానందం (బ్రహ్మ గారి ఆనందం) సత్యము, నిత్యము అయినది.
అమ్మవారిని ఇలా హృదయంలో ధ్యానిస్తూ చింతామణి అక్షమాలతో ధ్యానిస్తూ హోమము చేయు సమయాచారులకు శ్వాశ్వత ఆనందం లభ్యమవుతుంది. ఆ ఆనందపానం చేసి వారు మహాభోగులుగా రంజిల్లుతున్నారుట.
ఈ మోక్షానందాన్ని కోరుకునేవారు మహాభోగరసికులని ఈ శ్లోకములో చెప్పబడింది
చింతామణి మాల అంటే సదా అమ్మవారి గురించి చింతన చేయుట. అమ్మ ఆలోచనల చింతలు మాలగా కలిగిఉండటము.
అయితే ఈ సౌందర్యలహరికి వ్యాఖ్య రచించిన లొల్ల లక్ష్మీధర పండితులు హవము గురించి చెబుతూ,
మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ సహస్రారం లోని బిందువు నుంచి దేవిని చిత్తాకాశములోకి తెచ్చి , అదే సమయంలో స్వాధిష్టాము నుంచి అగ్నిని తెచ్చి కామధేనువు ఘృతధారలతో చిత్తాకాశమందు హవము చెయ్యాలని చెబుతారు.
మనకు ఈ శ్లోకములో చక్కని చింతామణి మాల దొరికింది. ఈ నాటి నుంచి మనము అమ్మ ఆలోచనలనే చింతామణితో ధ్యానించి ఆనందాన్ని పొందే ప్రయత్నం చేద్దాము.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
#Day33
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 32
శివః శక్తిః కామః క్షితిరథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః ।
అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ ॥ 32 ॥
అర్థం
అమ్మా! శివుడు, శక్తి, కాముడు, భూమి మొదటి ఖండం. సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, సూర్యఇంద్రులు రెండవకాటమిగా,పరాశక్తి, మన్మథుడు హరి మాడవకూటమిగాచివరల హ్రీకారముతో మొత్తము పదహేను అక్షరములతో ఓ భగవతీ! పంచదశీ మంత్రముగా నీవు ఒప్పారుతున్నావు.
తేగీ।
శివుడు, శక్తి, కాముడు, ఫృథ్వి, సీర చంద్ర
మన్మథ దినకరాంతర మాత మార।
మాధవునితో హకారాంత మంత్రమిదియు
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
(మార -సూర్యుడు)
తేగీ।
కూటములు మూడు చూడగ కూడి మంత్ర
రాజ్యమిది పంచదశిగ పేర వహినొంద।
సర్వ సాధకులకు దిక్కు సలిపి నిలచు
కొలచెదను సంధ్యను, శరణుగోరి మదిన॥
వివరణ
ముందు శ్లోకములో శ్రీవిద్య ఎలా వచ్చిందో చెప్పారు శంకరభగవద్పాదులవారు. ఇప్పుడు పంచదశి మహా మంత్రం గురించి ఇందులో చెబుతున్నారు.
ఈ శ్లోకములో సూచనగా నామాలు చెప్పబడ్డాయి. బీజాక్షరాలు ఇవ్వకూడదన్న నియమం ఉంది కాబట్టి, అని సూటిగా చెప్పబడవు. సూచనగానే చెప్పబడతాయి శ్లోకంలో. మంత్రాని చదవరులు ఆవిష్కరించుకోవాలి.
ఈ పంచదశి మహామంత్రం రెండు రకాలుగా ప్రసిద్ధి చెందింది.
అది కాదివిద్య, హాదివిద్య. మన్మథుడు సాధనచేసినది కాదివిద్య. విష్ణువు సాధనచేసినది హాదివిద్య. ఈ హాదివిద్యనే మునుపు లోపాముద్రాదేవి కూడా సాధనచేసింది. లోపాముద్రాదేవీ అగస్యులవారి భార్య.
మునుపు శ్రీవిద్యను పన్నెండు మంది సాధనచేసి తరించారని మానసోల్లాసమన్న గ్రంథం చెబుతుంది.
“విష్ణుః శివః సురజ్యేష్ఠో మను శ్చంద్రో ధనాధిపః
లోపాముద్రా తథాగస్త్యః స్కంద కుసుమ సాయకః
సురాధీశో రోహిణీయో దత్తాత్రేయ మహామునిః
దుర్వాస ఇతి విఖ్యాతా ఏతే ముఖ్య ఉపాసకాః॥
విష్ణువు,శివుడు,బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్రా, అగస్త్యుడు, కుమారస్వామి, మన్మథుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు. వీరంతా శ్రీవిద్యా ఉపాసకులు.
మంత్రాలను దర్శించిన మునులు ద్రష్టలు. పరమశివుడు దక్షణామూర్తిగా ఈ మంత్రాన్ని ప్రసాదించాడు. కొందరి మరో ఇద్దరు మునులను చెబుతారు. వారి సంప్రదాయం బట్టి అది మారుతుంది.
కలియుగంలో కామితార్థమైనదే కాబట్టి కాదివిద్యే మనకు ప్రసిద్ధి. అంటే మన్మథుడు చేసినది కాదివిద్య.
ప్రళయం సంభవించినప్పుడు సర్వం పరమేశ్వరుడిలో లీనమైపోతుంది. కర్మక్షయం కాని జీవరాశియంతా తమ కర్మలతో కలిసి లయమవుతారు. ఇలా లయమైనప్పుడు ఎటు వంటి వికారాలు లేని సత్యజ్ఞానానందమైన పరిపూర్ణమైన, సనాతనమైన ఏకమైనది మూలప్రకృతిలో కలిసిపోయి ఉంటుంది. ఇది రూపరహితం. గుణరహితం. లింగరహితమైన తేజోమయమైన కాంతిపుంజం. ఇదే శివశక్తి స్వరూపం.
కర్మక్షయం కాని జీవుల కర్మలను నశింపచెయ్యటానికి సృష్టి చెయ్యాలన్న సంకల్పం పరమేశ్వరికి కలుగుతుంది.
అవ్యక్తం- మహత్తత్త్వం, అహంకారం ఒకదాని తరువాత ఒకటి పుట్టుకొస్తాయి. మరో మాటగా మాయ- హిరణ్యగర్భుడు- విరాడ్రూపము. ఇక అక్కడ్నుంచి నామరూపాత్మకమైన జగత్తు ఉద్భవిస్తుంది. ఆకాశము-వాయువు-అగ్ని-జలము-ఫృథ్వి. ఈ పంచభూతాల నుంచి సర్వ జగత్తు వస్తుంది.
ఈ పంచభూతాలే పంచదశిలో ఉన్న మంత్రాది దేవతలు.
ఈ మంత్రం సాహిత్యపరంగా తెలీదు. అంటే రామాయ నమః అంటే రాముని నమస్కారమని. అది రామ మంత్రం. ఇలా కాక పంచదశిలో అక్షరాలు మనకు అర్థంకావు. కాని గురువుల ద్వారా ఉపదేశం తీసుకొని, గురువు అనుగ్రహించినప్పుడు ఆయన ద్వారా అర్థం కూడా తెలుస్తుంది.
ఈ మహా మంత్రం మూడు కూటములుగా ఉంటుంది. ఇది సృష్టి, స్థితి, సంహారానికి,- స్థూలసూక్ష్మ కారణ దేహాలకు, - జాగృత్, స్వప్న, సుషుప్తులకు, -సత్వ, తమో, రజస్సుగుణములకు గుర్తు.
ఈ మహామంత్రం ఆ భగవతి స్వరూపం. శ్రీచక్రం కూడా ఈ మంత్రం నుంచే ఉద్భవించింది.
త్రిశతి పూర్తిగా పంచదశీ మహామంత్రమే. ఈ మంత్రము పరమ శ్రేష్టమైనది. ఘనమైనది. శక్తివంతమైనది. దీనినే గుప్తగాయత్రీ అంటారు. ఇది అమ్మవారి శక్తి మంత్రం. లౌకికమైన అవసరాలతో పాటూ పారమార్థికమైనవీ తీర్చే కేవల బ్రహ్మవిద్యే ఇది. గురు ముఖతా స్వీకరించి సాధన చేసిన జీవులను అమ్మ తరింపచేస్తుంది.
“శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ॥”
శ్రీ సుందరిని సేవించినవారికి భోగము, మోక్షము లభిస్తాయి.
ఇంతటి దివ్యజ్ఞానము ఈ శ్లోకములో అందించిన జగద్గురువులకు మనం ఎంతో ఋణపడియున్నాము కదా.
శ్రీ మాత పాదాలకు సర్వం సమర్పిస్తూ
#Day32
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 31
చతుష్షష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం
స్థితస్తత్తత్సిద్ధిప్రసవపరతంత్రైః పశుపతిః ।
పునస్త్వన్నిర్బంధాదఖిలపురుషార్థైకఘటనా-
స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదమ్ ॥ 31 ॥
అర్థం
అమ్మా! భగవతి! పశుపతి అయిన పరమేశ్వరుడు జీవులను తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో కూడినవి, ఐహిక సంబంధమైనవి అగ్ని స్తంభన, వాయుస్తంభన, ఆకాశగమనం, పరకాయప్రవేశము వంటి వాటిని అరువదినాలుగు రకాలైన తంత్రాలను ఈ లోకానికి ఇచ్చాడు. ఈ తంత్రాలన్నీ జీవులు మోహవ్యామోహాల్లో పడేస్తున్నాయి. నీ బిడ్డల మీద కరుణతో నీవు నీ భర్తను ప్రేమతో నిర్బంధించగా, స్వామి పరమ పురుషార్థమైన నీదైన ప్రత్యేకమైనదైన పరమపురుషార్థాలు ప్రసాదించేదైన శ్రీవిద్యను భూలోకావాసులకు ప్రసాదించాడు.
తేగీ
శివుడు కరుణతొ తంత్రము జీవులఒస
మోహపరిచె జనులు వాసి మొందలేక।
నీవు నీభర్త నొప్పించి నిచ్చె విద్య
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
తేగీ।
తంత్రములు రకములు ఇచ్చె తండ్రి జనకు
అవి జనులనుద్దరింపవు, అమ్మ కోరి।
దివ్య శ్రీవిద్య సర్వగతి విడుపొంద
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
వివరణ
మన దేశములో అనాదిగా ఎన్నో రకాలైన తంత్రాలున్నాయి. అవి అన్నీ పరమేశ్వర ప్రసాదితమైనవే.
కాపాలికులు, దిగంబరులు, భైరవయామళము, వామకేశ్వరతంత్రం, పంచామృతతంత్రం ఇలా పూర్వాది తంత్రాలు అరవైనాలుగు పరమేశ్వరుడు ప్రసాదించాడు. ఈ తంత్రాలు ఆ సాధకుని లౌకిక కోరికలను తీరుస్తాయి. ఇవి చిరుతిళ్ళవంటివి. బలమైన అన్నములా కాక ఇవి ఆరోగ్యహాని.
అలాగే జీవుడికి ముక్తి కాక, కేవల ఇంద్రియసుఖాలు తీర్చటమే ఈ అరువది నాలుగు తంత్రాల లక్ష్యం.
మోక్ష కామి కాని వారు, అహంకార మమకారాలలో చిక్కుకున్న వారు పశువులు. అందుకే మానవులు పశువులు. వీరందరికీ పతి ఈశుడైన పశుపతే. అందుకే శంకరులు పశుపతి అని సంబోధించారు ఇక్కడి శ్లోకములో.
అమ్మవారు విశ్వ జనని. అమ్మవారే పోషిస్తున్నది విశ్వాన్ని. ఈ తంత్రాలతో జీవులు మోక్షకామి కాకపోవటం అమ్మవారిని కష్టపెట్టింది. ఆమె ఈశ్వరుడ్ని బలవంత పెట్టింది. ఆ బలవంతంకూడా నిర్భంధపెటిందట.
జగద్గురువులు చెబుతున్నారు ఈ శ్లోకములో పునః తత్వత్ నిర్బంధా. తిరిగి తిరిగి భర్తను అమ్మవారు బలవంతపెట్టిందట.
పిల్లలకు ఏదైనా ఇవ్వాలన్నా, వారు బాగు పడాలని తల్లి భావిస్తే పిల్లవాడి తండ్రిని అదే పనిగా అడుగుతూ ఉంటుంది. పిల్లాడు మోటరుసైకిల్ అడిగాడు. తల్లి వాడికి కొని ఇవ్వమని తండ్రిని కోరుతుంది. వాడికి క్షేమము కాదు ఇప్పుడు అని తండ్రి భావిస్తే మౌనంగా ఊరుకుంటాడు. తల్లి, పిల్లాడి తండ్రిని నిర్బంధిస్తుంది.
మన భాషలో చెప్పాలంటే షంటుతూ ఉంటుంది. ఇంట్లో పోరు భరించరానిగా మారుతుందీ తండ్రికి. ఇదీ మనము చూస్తూనే ఉంటాము.
అలాగే జీవులమీద కరుణతో అమ్మవారు జీవులకు మోక్ష విద్య ప్రసాదించమని తన భర్తను నిర్బంధించింది. అమ్మ కోరిక మీద,
అప్పుడు పరమేశ్వరుడు ఈ అరువై నాలుగు తంత్రాలు సంబంధములేని స్వతంత్ర తంత్రమైన, అమ్మవారిదైన శ్రీవిద్యా తంత్రాన్ని మనకు ప్రసాదించాడు.
శ్రీవిద్య కేవల బ్రహ్మవిద్యే.
ఇది లౌకిక, పారమార్థికమైన సర్వ కోరికలు తీర్చే తంత్రం.
ఇది ఆత్మను తెలియచేసేది. కాబట్టి ఆత్మవిద్య. గొప్పనైన విద్య కాబట్టి మహావిద్య. లలితానామాలలో ఈ నామాలు మనము చదువుతాము కూడా.
ఇంతటి దివ్యమైన మహావిద్యను అమ్మవారు అయ్యవారిని నిర్బంధించి మనకు ప్రసాదించింది. మనమెంతో భాగ్యులమో కదా. అమ్మ అతి కరుణ మన మీద ఎంతగా ఉన్నదో కదా. సదా అమ్మ మనందరి మీదా తన కరుణాదృక్కులను ప్రసరిస్తూనే ఉంటుంది. అంతటి ఆ తల్లికి మనమివ్వగల కానుకేముంటుంది? ప్రేమపూర్వక నమస్కారం తప్ప?
అందుకే సదా కృతజ్ఞతతో అమ్మను తలుచుకోవటం సాధన చెయ్యాలి.
ఇంతటి మోక్షవిద్యను మనకు ప్రసాదించిన గురువులకు, దక్షిణామూర్తికి, అమ్మవారికి సదా ప్రణామాలు సమర్పిస్తూ
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ.
#Day34
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం33
“స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో-
ర్నిధాయైకే నిత్యే నిరవధిమహాభోగరసికాః ।
భజంతి త్వాం చింతామణిగుననిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః ॥ 33 ॥”
అర్థము
అమ్మా భగవతీ!
నీ మంత్రానికి ముందు కామరాజ, భువనేశ్వరీ, లక్ష్మీ బీజాక్షరాలను చేర్చి మహాభోగులైన సమయాచారులు, యోగులు చేతిలో చింతామణి అక్షమాలను ధరించి, నిన్ను “శివాగ్ని” అన్న హవమందు నేతితో హోమము చేస్తూ సేవిస్తూ ఆనందిస్తున్నారు.
తేగీ
కాముడు, హకార,సిరి తోడ కలిపి మంత్ర
ము తలచు సమయులు, మునులు ముదము తోడ
హవముసేయ చేరి నిను ఆహ్లాదపరచు
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
తేగీ
చేతిలో మణిమాలలు, జేర్చి కూడి
చింత తీర్చు, శివాగ్నితో చేర్చి ఘృతము
హవయు చేసిముదము నొందు యతులు నిన్ను
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
వివరణ.
ఈ శ్లోకములో మొదటి లైనుతో అమ్మవారి మహామంత్రము పూర్తి అవుతుంది.
అంటే పదిహేను అక్షరాల మహామంత్రానికి ముందు గణపతి బీజక్షరమో, బాలా బీజక్షరమో, మన్మథ బీజాక్షరమో చేర్చి అమ్మవారిని సేవిస్తారు. అలా సేవిస్తూ దానికి తగ్గ హవము అంటే హోమము చేస్తారు. అలా చేసిన వారు మహా భోగులవుతున్నారు. భోగమంటే అత్యంత ఉత్కృష్టమైన ఆనందం.
తైత్తిరీయం ఆనందం గురించి వివరిస్తుంది. ఆ ఉపనిషత్తు ప్రకారం మానవ ఆనందం కన్నా గంధర్వ ఆనందం నూరు రెట్లు ఎక్కువ. గంధర్వ ఆనందం కన్నా దేవతల ఆనందం నూరురెట్లు, అంతకన్నా పితృదేవతలు- దానికన్నా దేవగురువు బృహస్పతి ఆనందం అంతకు మించి బ్రహ్మానందం (బ్రహ్మ గారి ఆనందం) సత్యము, నిత్యము అయినది.
అమ్మవారిని ఇలా హృదయంలో ధ్యానిస్తూ చింతామణి అక్షమాలతో ధ్యానిస్తూ హోమము చేయు సమయాచారులకు శ్వాశ్వత ఆనందం లభ్యమవుతుంది. ఆ ఆనందపానం చేసి వారు మహాభోగులుగా రంజిల్లుతున్నారుట.
ఈ మోక్షానందాన్ని కోరుకునేవారు మహాభోగరసికులని ఈ శ్లోకములో చెప్పబడింది
చింతామణి మాల అంటే సదా అమ్మవారి గురించి చింతన చేయుట. అమ్మ ఆలోచనల చింతలు మాలగా కలిగిఉండటము.
అయితే ఈ సౌందర్యలహరికి వ్యాఖ్య రచించిన లొల్ల లక్ష్మీధర పండితులు హవము గురించి చెబుతూ,
మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ సహస్రారం లోని బిందువు నుంచి దేవిని చిత్తాకాశములోకి తెచ్చి , అదే సమయంలో స్వాధిష్టాము నుంచి అగ్నిని తెచ్చి కామధేనువు ఘృతధారలతో చిత్తాకాశమందు హవము చెయ్యాలని చెబుతారు.
మనకు ఈ శ్లోకములో చక్కని చింతామణి మాల దొరికింది. ఈ నాటి నుంచి మనము అమ్మ ఆలోచనలనే చింతామణితో ధ్యానించి ఆనందాన్ని పొందే ప్రయత్నం చేద్దాము.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ.
#Day33
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 32
శివః శక్తిః కామః క్షితిరథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః ।
అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ ॥ 32 ॥
అర్థం
అమ్మా! శివుడు, శక్తి, కాముడు, భూమి మొదటి ఖండం. సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, సూర్యఇంద్రులు రెండవకాటమిగా,పరాశక్తి, మన్మథుడు హరి మాడవకూటమిగాచివరల హ్రీకారముతో మొత్తము పదహేను అక్షరములతో ఓ భగవతీ! పంచదశీ మంత్రముగా నీవు ఒప్పారుతున్నావు.
తేగీ।
శివుడు, శక్తి, కాముడు, ఫృథ్వి, సీర చంద్ర
మన్మథ దినకరాంతర మాత మార।
మాధవునితో హకారాంత మంత్రమిదియు
కొలచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
(మార -సూర్యుడు)
తేగీ।
కూటములు మూడు చూడగ కూడి మంత్ర
రాజ్యమిది పంచదశిగ పేర వహినొంద।
సర్వ సాధకులకు దిక్కు సలిపి నిలచు
కొలచెదను సంధ్యను, శరణుగోరి మదిన॥
వివరణ
ముందు శ్లోకములో శ్రీవిద్య ఎలా వచ్చిందో చెప్పారు శంకరభగవద్పాదులవారు. ఇప్పుడు పంచదశి మహా మంత్రం గురించి ఇందులో చెబుతున్నారు.
ఈ శ్లోకములో సూచనగా నామాలు చెప్పబడ్డాయి. బీజాక్షరాలు ఇవ్వకూడదన్న నియమం ఉంది కాబట్టి, అని సూటిగా చెప్పబడవు. సూచనగానే చెప్పబడతాయి శ్లోకంలో. మంత్రాని చదవరులు ఆవిష్కరించుకోవాలి.
ఈ పంచదశి మహామంత్రం రెండు రకాలుగా ప్రసిద్ధి చెందింది.
అది కాదివిద్య, హాదివిద్య. మన్మథుడు సాధనచేసినది కాదివిద్య. విష్ణువు సాధనచేసినది హాదివిద్య. ఈ హాదివిద్యనే మునుపు లోపాముద్రాదేవి కూడా సాధనచేసింది. లోపాముద్రాదేవీ అగస్యులవారి భార్య.
మునుపు శ్రీవిద్యను పన్నెండు మంది సాధనచేసి తరించారని మానసోల్లాసమన్న గ్రంథం చెబుతుంది.
“విష్ణుః శివః సురజ్యేష్ఠో మను శ్చంద్రో ధనాధిపః
లోపాముద్రా తథాగస్త్యః స్కంద కుసుమ సాయకః
సురాధీశో రోహిణీయో దత్తాత్రేయ మహామునిః
దుర్వాస ఇతి విఖ్యాతా ఏతే ముఖ్య ఉపాసకాః॥
విష్ణువు,శివుడు,బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్రా, అగస్త్యుడు, కుమారస్వామి, మన్మథుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు. వీరంతా శ్రీవిద్యా ఉపాసకులు.
మంత్రాలను దర్శించిన మునులు ద్రష్టలు. పరమశివుడు దక్షణామూర్తిగా ఈ మంత్రాన్ని ప్రసాదించాడు. కొందరి మరో ఇద్దరు మునులను చెబుతారు. వారి సంప్రదాయం బట్టి అది మారుతుంది.
కలియుగంలో కామితార్థమైనదే కాబట్టి కాదివిద్యే మనకు ప్రసిద్ధి. అంటే మన్మథుడు చేసినది కాదివిద్య.
ప్రళయం సంభవించినప్పుడు సర్వం పరమేశ్వరుడిలో లీనమైపోతుంది. కర్మక్షయం కాని జీవరాశియంతా తమ కర్మలతో కలిసి లయమవుతారు. ఇలా లయమైనప్పుడు ఎటు వంటి వికారాలు లేని సత్యజ్ఞానానందమైన పరిపూర్ణమైన, సనాతనమైన ఏకమైనది మూలప్రకృతిలో కలిసిపోయి ఉంటుంది. ఇది రూపరహితం. గుణరహితం. లింగరహితమైన తేజోమయమైన కాంతిపుంజం. ఇదే శివశక్తి స్వరూపం.
కర్మక్షయం కాని జీవుల కర్మలను నశింపచెయ్యటానికి సృష్టి చెయ్యాలన్న సంకల్పం పరమేశ్వరికి కలుగుతుంది.
అవ్యక్తం- మహత్తత్త్వం, అహంకారం ఒకదాని తరువాత ఒకటి పుట్టుకొస్తాయి. మరో మాటగా మాయ- హిరణ్యగర్భుడు- విరాడ్రూపము. ఇక అక్కడ్నుంచి నామరూపాత్మకమైన జగత్తు ఉద్భవిస్తుంది. ఆకాశము-వాయువు-అగ్ని-జలము-ఫృథ్వి. ఈ పంచభూతాల నుంచి సర్వ జగత్తు వస్తుంది.
ఈ పంచభూతాలే పంచదశిలో ఉన్న మంత్రాది దేవతలు.
ఈ మంత్రం సాహిత్యపరంగా తెలీదు. అంటే రామాయ నమః అంటే రాముని నమస్కారమని. అది రామ మంత్రం. ఇలా కాక పంచదశిలో అక్షరాలు మనకు అర్థంకావు. కాని గురువుల ద్వారా ఉపదేశం తీసుకొని, గురువు అనుగ్రహించినప్పుడు ఆయన ద్వారా అర్థం కూడా తెలుస్తుంది.
ఈ మహా మంత్రం మూడు కూటములుగా ఉంటుంది. ఇది సృష్టి, స్థితి, సంహారానికి,- స్థూలసూక్ష్మ కారణ దేహాలకు, - జాగృత్, స్వప్న, సుషుప్తులకు, -సత్వ, తమో, రజస్సుగుణములకు గుర్తు.
ఈ మహామంత్రం ఆ భగవతి స్వరూపం. శ్రీచక్రం కూడా ఈ మంత్రం నుంచే ఉద్భవించింది.
త్రిశతి పూర్తిగా పంచదశీ మహామంత్రమే. ఈ మంత్రము పరమ శ్రేష్టమైనది. ఘనమైనది. శక్తివంతమైనది. దీనినే గుప్తగాయత్రీ అంటారు. ఇది అమ్మవారి శక్తి మంత్రం. లౌకికమైన అవసరాలతో పాటూ పారమార్థికమైనవీ తీర్చే కేవల బ్రహ్మవిద్యే ఇది. గురు ముఖతా స్వీకరించి సాధన చేసిన జీవులను అమ్మ తరింపచేస్తుంది.
“శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ॥”
శ్రీ సుందరిని సేవించినవారికి భోగము, మోక్షము లభిస్తాయి.
ఇంతటి దివ్యజ్ఞానము ఈ శ్లోకములో అందించిన జగద్గురువులకు మనం ఎంతో ఋణపడియున్నాము కదా.
శ్రీ మాత పాదాలకు సర్వం సమర్పిస్తూ
*****
Day31
శ్రీమాత్రై నమః
సౌందర్యలహరి 30
స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః ।
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నిరాజనవిధిమ్ ॥ 30 ॥
అర్థం
ఆద్యంతాలు లేని భగవతీ! ఓ తల్లీ! ఓ నిత్యా!
నీ పాదాల నుంచి ఉద్భవించిన కిరణాలే శ్రీచక్రరాజ్యములోని అణిమాది సిద్ధులు. ఆ కిరణాలతో ఆవరించియున్న నిన్ను, ‘నీవేనేను’ అన్న భావనతో ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో నీలో నీతో తాదాత్మ్యము పొందుతాడో, ఆ సాధకుడు సర్వం పొందగలడు, అయినా సదాశివుని ఐశ్వర్యం సైతం గడ్డిపోచలా తీసేస్తాడు. అతనిని మహా ప్రళయమందు వచ్చే సంవర్తాగ్ని సైతం ఎమీ చెయ్యలేదు. అట్టి సాధకునికి ఆ అగ్ని నీరాజనాలు ఇవ్వటంలో ఆశ్చర్యమేంది?
తేగీ।
నిత్యగ నిలచిన నిను నేనీవనుకొని
తలచి సేవించు జీవులు ధన్యమొందు।
సాధకునికి తృణప్రాయ శంభు స్థితియు
కొలచెదను, సంధ్యను శరణుకోరి మదిన॥
మనకు సౌందర్యలహరిలో కొన్ని
నీరాజన శ్లోకాలున్నాయి. అటు వంటి వాటిలో ఈ ప్రస్తుత శ్లోకము కూడా ఒకటి.
అమ్మవారి శరీరం నుంచే జాలువారే కిరణాలు అణిమ, మహిమా వంటి సిద్ధులు. అవి శ్రీచక్రమంతటా నిండియున్నాయి. అమ్మ బిందు స్థానము. అమ్మ బిందువుకు, ఆ కిరణాలకు తేడా ఉండదు. అటువంటి అమ్మవారు నిత్య. శ్వాశ్వతమైనది. అలాగే మానవ దేహములో నాడులంతటా ప్రవహిస్తున్న చిచ్చక్తి అమ్మవారే, శరీరమంతా అమృతమయం చేస్తుంది.
అమ్మవారిని తలుస్తూ నిరంతరం తను చేసే పనులు అమ్మవారి సేవగా భావన చేస్తూ ఉండే సాధకుడు ‘నీవేనేను’ అన్నీ నీవే, అన్నీ అమ్మే అన్న భావనలోకి వస్తాడు. అలాంటి వారికి అమ్మవారి సాయుజ్యమే లభ్యమవుతుంది.
అట్టి సాధకుడు ముక్కింటి ఐశ్వర్యమును కూడా తృణంగా తీసేస్తాడు.
మూడు కాలాలలో మూడు లోకాలలో మూడు
గుణాలలో నిండి ఉన్నదే ఈశ్వర త్రిగుణాత్మకమైనది ఐశ్వర్యం. అంతటి ఐశ్వర్యం ఆ సాధకుడు తృణప్రాయంగా తీసేస్తాడు. కారణం అతనికి అమ్మవారి సాయుజ్యమన్న ఐశ్వర్యం దొరికింది. అమ్మే సర్వస్వం. అంతకు మించిన ఐశ్వర్యంలేదని అతనికి తెలుసు. అటు వంటి సాధకుడిని
మహసంవర్తాగ్ని సైతం ఏమీ చెయ్యడు.
మహా సంవర్తాగ్ని ప్రళయకాలంలో వస్తుంది.
ప్రళయకాలంలో సర్వం లయమై అమ్మవారు సదాశివునితో కలిసి ఉంటుదని మనం తెలుసుకున్నాము కదా. ఆ సంవర్తగ్ని వీనిని ఏమీ చెయ్యకపోవటానికి కారణం ఆతను ఈ లోకాల స్థితి నుంచి బయటపడి, బ్రహ్మమైన అమ్మవారిలో కలిసి బ్రహ్మానందంలో యున్నాడు కాబట్టి.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
*****
#day29
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 28
“సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యా దివిషదః।
కరాలం యత్క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ॥ 28 ॥”
అమ్మా! బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు ముసలి తనము పొగొట్టుకోవటానికి అమృతం త్రాగినా కాలానికి బద్దులు. కాలానికి వశమై పోతున్నారు. కాని నీ పతి అయిన సదాశివుడు భయంకరమైన కాలకూటవిషము త్రాగినా చెక్కచెదరలేదంటే అది నీ చెవి తాటంకముల ప్రభావమే.
తేగీ॥
కాలమన్నది చిత్రమై కదులుతుంది
సురలు సైతము నిలువరు చూడబోవ।
మల్లన నిలు నీ తాటంక మహిమతోడ
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన॥
కాలంలో ప్రతి ఒక్కరు కలిసిపోవలసినదే. జనన, జరా, వ్యాధి, మరణాల వశమవ్వవలసినదే. అదే కాలమహిమ. దేవతలు జరావ్యాధి తర్కించుకున్నారు అమృతపానం వలన. కానీ కాలంలో కలవటము వారీకీ తప్పదు. దేవతలు బ్రహ్మ, విష్ణువులు సైతం కాలవశమే. మహాప్రళయ సమయంలో వారంతా కాలంలో కలిసిపోతారు.
అత్యంత ఘోరమైన కాలకూటాన్ని శివుడు స్వీకరించినా ఆ విషము ఆయన్నీ ఏమీ చెయ్యలేదు కారణం అమ్మవారి తాటంకాల మహిమ వలన.
వివాహమైన స్త్రీలకు చెవికమ్మలు, ముక్కు పుడక, నుదుటన సింధూరం, చేతికి గాజులు, పసుపుకుంకుమ సౌభాగ్య చిహ్నాలు. అమ్మవారికివి శక్తి చిహ్నాలు. అమ్మ ధరించినది కాబట్టి అవి శక్తివంతమైనవి, పవిత్రమైనవి. సౌభాగ్యమైనవి. కాబట్టి విషం సైతం సదాశివుడ్ని ఏమీ చెయ్యలేదు.
అమ్మవారి తాటంకాలకు ఒక ప్రత్యేకతయుంది.
అది అమ్మవారి తాటంకాలు సూర్యచంద్రులు.
ఆద్యంతాలు లేని కాలగతి సూర్యచంద్ర మండల గమనం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, అమ్మవారి చెవులకుండే తాటంకాలు గూడా అనంతత్వ లక్షణం గలిగి, అమ్మవారి సౌభాగ్యానికి అనంతత్వాన్ని చేకూరుస్తాయి. అందుచేత అయ్యవారికి కాలవశం అయ్యే ఇబ్బంది లేదు.
చూసింది చూసినట్లు చెప్పటానికి అమ్మవారి కన్నులతోను, విన్నది విన్నట్లు చెప్పటానికి అమ్మవారి చెవి కమ్మలుగాను కర్మసాక్షులైన సూర్య చంద్రులను పోల్చడం గూడా ఒక ఔచిత్యం.
శ్రీ విద్య - కుండలినీ యోగ ప్రధానమైనది. కుండలిని యోగంలో సూర్యచంద్రాగ్నుల ప్రసక్తి తప్పకుండా వస్తుంది. ఇడా,పింగళానాడులు వరుసగా చంద్ర సూర్య తత్త్వములకు సంబంధించినవే !
ఈ సూర్య చంద్రుల్ని అమ్మవారి స్తన యుగ్మంగాను, నయన యుగ్మంగాను, ప్రస్తుతం తాటంక యుగళంగాను సంకేతించటం శ్రుతిబద్ధమే అని ఈ శ్లోకం చెబుతుంది.
శ్లోకం !
“సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాః తావేవనయనే స్మృతా,
ఉభౌ తాటంక యుగళం ఇత్యేషా వైదికీ శ్రుతిః”
(పసిపిల్లలు స్తన్యంతో పోషించ పడతారు. అదే విధంగా సమస్త జీవులు తన నుండి ఆహారాన్ని పొందటానికి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు - వృక్ష సంతతిని, ఔషధులను పెంపొందించటానికి అవసరమయే సూర్య చంద్రులను తన స్తనయుగ్మంగా ధరించిందని చెప్పుకోవచ్చును. ఇది సంకేతగా వాడబడినది).
ఇది పింగళా, ఇదా నాడులకు సంబందించిన విభజనగా గ్రహించాలి. అమ్మవారు సూర్య చంద్రుల్ని సృష్టించి, వారి యందు వెలుగుతూ ఉంటుందని చెప్పటం కూడా తప్పుకాదు. ఎందుకంటే 'తత్సృష్ట్వా తదే వాను ప్రావిశత్ " అన్నది శ్రుతి వాక్యం. ఈ జగత్తును సృష్టించి, ఆ సృష్టించిన జగత్తులోని ప్రతి అణువునందు తాను ప్రవేశం చేసింది. (మనం వస్తువుల్ని తయారు చేయగలం కానీ, వాటిలో కి ప్రవేశించలేము. )
ఆకాశం శబ్ద గుణకం, అలాంటి ఆకాశంలో సంచరించే సూర్య చంద్ర మండలాలను - శబ్ద గ్రాహ్యమునకు సంబందించే అమ్మవారి చెవుల ఆభరణాలుగా చెప్పటం సమంజసమే కదా !
"రవి చంద్ర మండలాలను అమ్మవారి తాటంకాలు. వాటి మహిమ చేత అయ్యవారికి కాలప్రభావము ఏమీ చెయ్యలేదు. అసలు అమ్మవారే కాలస్వరూపం. కాలమే అమ్మ. కాబట్టి అట్టి కాలాన్ని తన తాటంకాలతో అమ్మ ఆదేశిస్తున్నది. అమ్మవారి తాటంకాలను ధ్యానిస్తే ఇట్టి కాలానికి అతీతమైన దివ్యమైన భక్తితో అమ్మ అనుగ్రహానికి పాత్రులమవ్వొచ్చు.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
*****
#day27
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 26
విరించిః పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్।
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సంమీలితదృశా
మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ ॥ 26॥
అర్థం
ఓ భగవతీ!
ప్రళయకాలములో బ్రహ్మదేవుడూ విష్ణువు, దేవతలూ కాలధర్మం చెందుతారు. నీవు మాత్రం నీ భర్త సదాశివునితో కలిసి మార్పులేకుండా విహరించుతున్నావు.
తేగీ।
బ్రహ్మ విష్ణు రుద్రులు మహేంద్రవరు లొందు
కాల ధర్మము నీశ్వరీ! కాని నీవు।
నీ పతి సదా శివుని తోడి నిలుతువమ్మ
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన॥
వివరణ
ఈ శ్లోకం విశ్వం యొక్క ఉత్పత్తి సదాశివుని స్థితి చెబుతుంది. విశ్వసృష్టికి మునుపు సదాశివుడు సత్చిత్ స్వరూపంగా నిశ్చలంగా ఉంటాడు. ఆయనకు ఏ రకములైన అవస్థలూ ఉండవు అప్పుడు. నిశ్చలుడు, నిర్గుణుడు, నిరాకారుడు. ఆ స్థితిలో అవ్యక్త రూపములో ఈశ్వరి ఆయనలో ఉంటుంది. వారిద్దరూ కలిసి ఉంటారు.
మన శరీరంలో మానవప్రజ్ఞకు అతీతంగా బ్రహ్మరంధ్రం వద్ద సహస్రార చక్రంలో ఇలా కలిసి ధ్యానినిమగ్నులై ఉంటారు. ఈ అభివ్యక్త-అభికుప్లమే సృష్టి- లయం.
ప్రకృతే జగజ్జనని. బ్రహ్మవిష్ణువు ఇంద్రుడు ఇతర దేవతలందరూ కాలంలో పాటూ ఉద్భవిస్తారు, తిరిగి కలిసిపోతారు. కాని పరమేశ్వరి మాత్రం సదాశివునితో, సదాశివునిలో నిలిచి ఉంటుంది. అటు వంటి తల్లి పాదాలు పట్టుకుంటే ఈ జననమరణ చట్రం నుంచి తప్పిస్తుంది.
ఆ తల్లికే సర్వం సమర్పిస్తూ
******
#day26
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 25
త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా ।
తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకులిత కరోత్తం సమకుటాః॥
అర్థం :
అమ్మా భవానీ!
సత్త్వరజస్తమో గుణముల వలన జన్మించిన బ్రహ్మ, విష్ణువు రుద్రులు నీ పాదములకు చేయు పూజయే పూజ అగుతున్నది. వేరుగా చేసినది పూజకాదు. అది యుక్తమూ కాదు. నీ పాదాలుంచిన నవరత్నపీఠము వద్ద తమ నమస్కారాలను ఉంటే త్రిమూర్తులు నీ ప్రజ్ఞచే వర్దిలుతున్నారు.
తేగీ
సత్త్వము రజస్తమోగుణసార మయిన
బ్రహ్మ హరి రుద్రువరులు నీ పాదములకు।
పూజలర్పింతురది కదా పూజ యనిన
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన॥
అమ్మవారిని పాదాలను అర్పించుకునే భాగ్యం అందరికీ కలగదు. అందరూ గొప్పవారూ కాలేరు.
బయట మాములు లోకంలో వారు మహామహులైయుండవచ్చు. కాని ఈశ్వరి ముందు కాదు కదా.
హరిహర బ్రహ్మాదులు త్రిగుణాలకు ప్రతీక. త్రిగుణాలచే అమ్మవారు పూజించబడుతోంది అంటే తమ త్రిగుణాలపై ఎవరు పట్టు కలిగి ఉంటారో వారు అమ్మవారి పాదాలకు పూజించే అర్హతను పొందుతారు.
మరో రగంగా చెప్పాలంటే అమ్మవారి పాదాలు పట్టుకుంటే వారికి త్రిగుణాలపై పట్టు సంపాదిస్తారు. అదీ కాక అమ్మవారిని సేవించుకుంటే త్రిమూర్తులను సేవించినట్లే.
“విష్ణుపూజ సహస్రాణి శివపూజ శతానిచ
అంబికా చరణార్చాయాః కాలం నార్హంతి షోడశమ్॥” అని దేవీ పురాణం చెబుతుంది.
వేయిమార్లు విష్ణు పూజ కన్నా ఒక్కసారి శివపూజ ఉత్తమం. వంద శివపూజలకన్నా ఒక్కసారి పరమేశ్వరి పూజ మేలు అంటుంది దేవీపురాణం.
ఆ దివ్య పాదాలకు ఈ శివరాత్రికి నమస్సులు సమర్పిస్తూ
*****
#day25
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 24
జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్తిరయతి ।
సదాపూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ-
స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః ॥ 24 ॥
అర్థం
అమ్మా! జగజ్జననీ! బ్రహ్మ ఈ లోకాలను సృజింస్తున్నాడు, విష్ణువు సంరక్షిస్తున్నాడు, రుద్రుడు లయంచేస్తున్నాడు. ఈశ్వరుడు ఈ త్రయాన్ని తనలో దాస్తున్నాడు. సదాశివుడు నీ మాట మీద మరల ఉద్ధరిస్తున్నాడు. అంటే సృష్టి స్థితి లయము తిరోధాన అనుగ్రహాలు నీ కనుచూపులో జరుగుతున్నాయి.
తేగీ।
సత్త్వము రజస్తమోగుణసార మయిన
బ్రహ్మ హరి రుద్రవరులు నీ పాదములకు
పూజలర్పింతురది కదా పూజ యనిన
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన
బ్రహ్మ సృష్టి చేయు, సకల బ్రహ్మములను
శౌరి రక్షించు లోకాల, శూలధారి
చేయు లయము, నిర్మించునీ చేతిలీల
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన॥
వివరము:
ఈ శ్లోకంలో అమ్మవారి పంచకృత్యాల గురించి చెప్పబడింది. అమ్మవారు సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరోదానము చేస్తుంది.
ఈ సృష్టిలో పంచబ్రహ్మలు ఉన్నారు. వారు బ్రహ్మ, విష్ణువు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు. ఈ పంచబ్రహ్మల రూపంలో జగదంబే ఈ కార్యాలు నిర్వహిస్తుంది. అమ్మవారి కంటి సైగలతో ఈ కార్యాలు జరుగుతుంటాయి.
ప్రళయకాలములో బ్రహ్మ విష్ణువులో, విష్ణువు రుద్రునిలో, రుద్రుడు మహేశ్వరునిలో, మహేశ్వరుడు సదాశివునిలో, సదాశివుడు అమ్మవారిలో లీనమవుతారు.
అమ్మవారి దివ్య పాదాలకు సర్వం సమర్పిస్తూ
*****
#day24
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 23
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ ।
యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటమ్ ॥ 23 ॥
అర్థం:
అమ్మా! భగవతి!
అరుణ కాంతులు వెదజల్లు నీ దేహము, మూడు కన్నులు , శిరస్సున నెలవంక, స్తనభారముతో వంగి కనబడుతున్న నిన్ను చూస్తే, మొదట శివుని వామభాగము ఆక్రమించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన శరీరార్థమును కూడా హరించితివి అన్నట్లుగా యున్నది.
తేగీ।
శూలి వామ భాగమునున్న శోభలరుణ
కాంతి నీవు, శిరోమణి కనగ సవ్య।
భాగమది చూడ నీవని బ్రమలు కలుగు
కొలిచెదను సంధ్యను శరణు గోరి మదిన।।
(శూలి= శివుడు)
శివుడు వ్యక్తరూపమది శక్తి వెలుగొందు
పంచ సారూప్యముల కూడి పరిమళించ
సగుణ బ్రహ్మముగ కొలుచు సమయచరులు
కొలిచెదను సంధ్యను శరణు గోరి మదిన।।
వివరణ
అమ్మవారికి అయ్యవారికి సారూప్యత చెబుతుంది ఈ శ్లోకము.
శంకరులు అమ్మవారి వద్దకు వెళ్ళి “అమ్మా! నీవు దొంగతనం చేశావు” అన్నాడట.
అమ్మ”అదేమి శంకరా అంత మాట అన్నావు” అంటే
“అమ్మా! నీవు పరమేశ్వరుని ఎడమభాగానివి . నీవు ఎఱ్ఱని ఎరుపు రంగులో ఉన్నదానవు. మహాదేవుడా శుద్ధమైన స్వచ్ఛమైన తెలుపు. కాని నీ ఎఱ్ఱపుదనం ముందు తెల్లని శివుడు కనపడటంలేదు. అంతటా అరుణవర్ణమై శోభిల్లుతోంది. నీవు చంద్రరేఖ ధరించావు. శివుడూ శశిధరుడు. నీకూ ఆయనకూ కూడా ఫాలభాగములో మూడవ నేత్రం ఉంది. చూస్తూంటే అంతటా నీవే కనపడుతున్నావు. ఈశ్వరుడు కనిపించటములేదమ్మా.మరి నీవు దొంగతనము చేసినట్లుగా అయ్యవారిని…” అన్నాడుట.
అమ్మవారు ఆ మాటలకు నవ్వేసిందట.
ఇది తల్లి వద్ద పిల్లవాడు గారాబంలా ఉన్నా ఇది సమయాచారతత్త్వమైన శివశివానిల సమము చెబుతుంది.
అంటే శివుడు పార్వతీ వేరు కారు. ఉన్నది ఒక్క పరతత్త్వమే అని చెబుతుంది.
అర్థనారీశ్వర రూపములో ఎడమవైపు అమ్మవారి దేహము అరుణకాంతులలో పరిసరాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ ప్రభావము వలన కుడివైపున ఉన్న తెల్లని శివుడు కూడ అరుణ వర్ణములో కనపడుతాడు.
దీనిలో గూఢార్ధం
శివుడు యొక్క వ్యక్త రూపము అమ్మవారు. శివుడు నిరాకార నిర్గణ తత్త్వం. శివుని యొక్క అహంకారమే అమ్మవారని మునుపు మనకు “అహో పురుషికా” అని తొమ్మిదవ శ్లోకములో చెప్పియున్నారు.
అంటే శివునకు వేరు రూపములేదు. అంతా అమ్మవారే.
సమయాచారులు అమ్మవారికీ, అయ్యవారికీ ఐదు సమాలు చెబుతారు. అవి
రూప సామ్యం(చంద్రవంక శిఖపై, మూడు కన్నులు)
నామ సామ్యం, (శివ-శివాని, భవ-భవాని, కాలుడు-కాళి, భైరవ-భైరవి ఇత్యాదివి)
ఆవాస సామ్యం ( ఉండే చోటు)
ఆయుధాల సామ్యం (ధనస్సు- త్రిశూలం)
పనుల సామ్యం (సృష్టి స్థితి సంహార అనుగ్రహ, తిరోధాన)
ఈ ఐదు సామ్యాల వలన శివపార్వతులు అభేదులు. జ్యోతికి కాంతిలా వారు ఒక్క పరతత్త్వానికి గుర్తు.
శ్రీమాత పాదాలకు సర్వం సమర్పిస్తూ
******
#day26
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 25
త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా ।
తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకులిత కరోత్తం సమకుటాః॥
అర్థం :
అమ్మా భవానీ!
సత్త్వరజస్తమో గుణముల వలన జన్మించిన బ్రహ్మ, విష్ణువు రుద్రులు నీ పాదములకు చేయు పూజయే పూజ అగుతున్నది. వేరుగా చేసినది పూజకాదు. అది యుక్తమూ కాదు. నీ పాదాలుంచిన నవరత్నపీఠము వద్ద తమ నమస్కారాలను ఉంటే త్రిమూర్తులు నీ ప్రజ్ఞచే వర్దిలుతున్నారు.
తేగీ
సత్త్వము రజస్తమోగుణసార మయిన
బ్రహ్మ హరి రుద్రువరులు నీ పాదములకు।
పూజలర్పింతురది కదా పూజ యనిన
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన॥
అమ్మవారిని పాదాలను అర్పించుకునే భాగ్యం అందరికీ కలగదు. అందరూ గొప్పవారూ కాలేరు.
బయట మాములు లోకంలో వారు మహామహులైయుండవచ్చు. కాని ఈశ్వరి ముందు కాదు కదా.
హరిహర బ్రహ్మాదులు త్రిగుణాలకు ప్రతీక. త్రిగుణాలచే అమ్మవారు పూజించబడుతోంది అంటే తమ త్రిగుణాలపై ఎవరు పట్టు కలిగి ఉంటారో వారు అమ్మవారి పాదాలకు పూజించే అర్హతను పొందుతారు.
మరో రగంగా చెప్పాలంటే అమ్మవారి పాదాలు పట్టుకుంటే వారికి త్రిగుణాలపై పట్టు సంపాదిస్తారు. అదీ కాక అమ్మవారిని సేవించుకుంటే త్రిమూర్తులను సేవించినట్లే.
“విష్ణుపూజ సహస్రాణి శివపూజ శతానిచ
అంబికా చరణార్చాయాః కాలం నార్హంతి షోడశమ్॥” అని దేవీ పురాణం చెబుతుంది.
వేయిమార్లు విష్ణు పూజ కన్నా ఒక్కసారి శివపూజ ఉత్తమం. వంద శివపూజలకన్నా ఒక్కసారి పరమేశ్వరి పూజ మేలు అంటుంది దేవీపురాణం.
ఆ దివ్య పాదాలకు ఈ శివరాత్రికి నమస్సులు సమర్పిస్తూ
సంద్యా యల్లాప్రగడ
#day25
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 24
జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్తిరయతి ।
సదాపూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ-
స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః ॥ 24 ॥
అర్థం
అమ్మా! జగజ్జననీ! బ్రహ్మ ఈ లోకాలను సృజింస్తున్నాడు, విష్ణువు సంరక్షిస్తున్నాడు, రుద్రుడు లయంచేస్తున్నాడు. ఈశ్వరుడు ఈ త్రయాన్ని తనలో దాస్తున్నాడు. సదాశివుడు నీ మాట మీద మరల ఉద్ధరిస్తున్నాడు. అంటే సృష్టి స్థితి లయము తిరోధాన అనుగ్రహాలు నీ కనుచూపులో జరుగుతున్నాయి.
తేగీ।
సత్త్వము రజస్తమోగుణసార మయిన
బ్రహ్మ హరి రుద్రవరులు నీ పాదములకు
పూజలర్పింతురది కదా పూజ యనిన
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన
బ్రహ్మ సృష్టి చేయు, సకల బ్రహ్మములను
శౌరి రక్షించు లోకాల, శూలధారి
చేయు లయము, నిర్మించునీ చేతిలీల
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన॥
వివరము:
ఈ శ్లోకంలో అమ్మవారి పంచకృత్యాల గురించి చెప్పబడింది. అమ్మవారు సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరోదానము చేస్తుంది.
ఈ సృష్టిలో పంచబ్రహ్మలు ఉన్నారు. వారు బ్రహ్మ, విష్ణువు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు. ఈ పంచబ్రహ్మల రూపంలో జగదంబే ఈ కార్యాలు నిర్వహిస్తుంది. అమ్మవారి కంటి సైగలతో ఈ కార్యాలు జరుగుతుంటాయి.
ప్రళయకాలములో బ్రహ్మ విష్ణువులో, విష్ణువు రుద్రునిలో, రుద్రుడు మహేశ్వరునిలో, మహేశ్వరుడు సదాశివునిలో, సదాశివుడు అమ్మవారిలో లీనమవుతారు.
అమ్మవారి దివ్య పాదాలకు సర్వం సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ
#day24
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 23
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ ।
యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటమ్ ॥ 23 ॥
అర్థం:
అమ్మా! భగవతి!
అరుణ కాంతులు వెదజల్లు నీ దేహము, మూడు కన్నులు , శిరస్సున నెలవంక, స్తనభారముతో వంగి కనబడుతున్న నిన్ను చూస్తే, మొదట శివుని వామభాగము ఆక్రమించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన శరీరార్థమును కూడా హరించితివి అన్నట్లుగా యున్నది.
తేగీ।
శూలి వామ భాగమునున్న శోభలరుణ
కాంతి నీవు, శిరోమణి కనగ సవ్య।
భాగమది చూడ నీవని బ్రమలు కలుగు
కొలిచెదను సంధ్యను శరణు గోరి మదిన।।
(శూలి= శివుడు)
శివుడు వ్యక్తరూపమది శక్తి వెలుగొందు
పంచ సారూప్యముల కూడి పరిమళించ
సగుణ బ్రహ్మముగ కొలుచు సమయచరులు
కొలిచెదను సంధ్యను శరణు గోరి మదిన।।
వివరణ
అమ్మవారికి అయ్యవారికి సారూప్యత చెబుతుంది ఈ శ్లోకము.
శంకరులు అమ్మవారి వద్దకు వెళ్ళి “అమ్మా! నీవు దొంగతనం చేశావు” అన్నాడట.
అమ్మ”అదేమి శంకరా అంత మాట అన్నావు” అంటే
“అమ్మా! నీవు పరమేశ్వరుని ఎడమభాగానివి . నీవు ఎఱ్ఱని ఎరుపు రంగులో ఉన్నదానవు. మహాదేవుడా శుద్ధమైన స్వచ్ఛమైన తెలుపు. కాని నీ ఎఱ్ఱపుదనం ముందు తెల్లని శివుడు కనపడటంలేదు. అంతటా అరుణవర్ణమై శోభిల్లుతోంది. నీవు చంద్రరేఖ ధరించావు. శివుడూ శశిధరుడు. నీకూ ఆయనకూ కూడా ఫాలభాగములో మూడవ నేత్రం ఉంది. చూస్తూంటే అంతటా నీవే కనపడుతున్నావు. ఈశ్వరుడు కనిపించటములేదమ్మా.మరి నీవు దొంగతనము చేసినట్లుగా అయ్యవారిని…” అన్నాడుట.
అమ్మవారు ఆ మాటలకు నవ్వేసిందట.
ఇది తల్లి వద్ద పిల్లవాడు గారాబంలా ఉన్నా ఇది సమయాచారతత్త్వమైన శివశివానిల సమము చెబుతుంది.
అంటే శివుడు పార్వతీ వేరు కారు. ఉన్నది ఒక్క పరతత్త్వమే అని చెబుతుంది.
అర్థనారీశ్వర రూపములో ఎడమవైపు అమ్మవారి దేహము అరుణకాంతులలో పరిసరాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ ప్రభావము వలన కుడివైపున ఉన్న తెల్లని శివుడు కూడ అరుణ వర్ణములో కనపడుతాడు.
దీనిలో గూఢార్ధం
శివుడు యొక్క వ్యక్త రూపము అమ్మవారు. శివుడు నిరాకార నిర్గణ తత్త్వం. శివుని యొక్క అహంకారమే అమ్మవారని మునుపు మనకు “అహో పురుషికా” అని తొమ్మిదవ శ్లోకములో చెప్పియున్నారు.
అంటే శివునకు వేరు రూపములేదు. అంతా అమ్మవారే.
సమయాచారులు అమ్మవారికీ, అయ్యవారికీ ఐదు సమాలు చెబుతారు. అవి
రూప సామ్యం(చంద్రవంక శిఖపై, మూడు కన్నులు)
నామ సామ్యం, (శివ-శివాని, భవ-భవాని, కాలుడు-కాళి, భైరవ-భైరవి ఇత్యాదివి)
ఆవాస సామ్యం ( ఉండే చోటు)
ఆయుధాల సామ్యం (ధనస్సు- త్రిశూలం)
పనుల సామ్యం (సృష్టి స్థితి సంహార అనుగ్రహ, తిరోధాన)
ఈ ఐదు సామ్యాల వలన శివపార్వతులు అభేదులు. జ్యోతికి కాంతిలా వారు ఒక్క పరతత్త్వానికి గుర్తు.
శ్రీమాత పాదాలకు సర్వం సమర్పిస్తూ
*****
#day22
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 21
“తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ ।
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీమ్ ॥ 21 ॥”
అర్థం
తల్లీ! భగవతి! మెరుపుతీగల సొగసైన, సూక్ష్మమైన పొడగైన క్షణకాల ప్రకాశ వికాస విలక్షణ గలది, సూర్యచంద్రాగ్ని రూప సమన్వితం షట్చక్రాల పై భాగము గల తామరతోటయందు అనగా సహస్రార కమలములో వెలుగు నీ సాదాఖ్య కళను కామాది మలినములు పొగొట్టుకొని పరిపూర్ణమైన మనసుతో మహపురుషులైన యోగులు ధ్యానించి పరమానందమొందుచున్నారు.
తేగీ.
భూమి, జలమాగ్ని. వాయువు, భువనమైదు/
తత్త్వ ములు, నారు చక్రపు తాలిషమును ।
నీ పదముల ప్రద్యోతమై నిలుచు తుదకు/
కొలిచెదను సంధ్యను శరణు గోరి మదిన॥
తేగీ
కళగ సాదాఖ్య మెరుపుతీగల సొగసులు
భానుసోమాగ్ని కలిసిన వాడివెలుగు।
తలచు యోగులు ముదమొందు ధరణియందు
కొలిచెదను సంధ్యను శరణు గోరి మదిన॥
వివరణ:
అమ్మవారి అనుగ్రహం ఈ శ్లోకము చూపుతుంది. జీవితానికి పరమ లక్ష్మం జీవన్ముక్తి. పరమానంద స్థితిని తెలిపే పరమపదము. అమ్మవారి ఆరాధనకు ఇదే ధ్యేయము.
మునుపు తొమ్మిదవ శ్లోకములో చెప్పిన విషయమే తిరిగి ఇక్కడ ఊటంకించారు జగద్గురువులు.
కులపథము, తేజోస్వంతమైన ధాతువు ఈ కుండలినీశక్తి. ఈ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తామరతూడ కన్నా సన్ననైన సుష్మునా నాడి గుండా సౌదామినిలా, ఆకాశంలో మెరిసే మెరుపులా, తటిల్లతలా సాగి సహస్రారం చేరుతుంది సాధకునిలో. అక్కడ పరమశివునితో కలిన సాదాఖ్యకళగా వెలుగుతుంది. యోగులకు పరమానందం కలగచేస్తుంది. వారిని జీవన్ముక్తులను చేస్తుంది. ఇది శ్రీవిద్య రహస్యం.
అయితే ఇది చాలా క్లిష్టమైనది. దీనికి నిరంతర సాధన కావాలి.
ఈ దారిలో అడ్డుగా మూడు గ్రంథులున్నాయి.
‘యోగినీ హృదయం’ ఈ దారిలో పంతొమ్మిది స్థానాలున్నాయని చెబుతుంది.
మూలాధారానికి క్రింద ఒక సహస్రారం ఉంటుంది. దానిని అకులం అంటారు. క్రింద సహస్రం నుంచి ఆజ్ఞ వరకు ఒక జట్టు. ఆజ్ఞ నుంచి సహస్రారం క్రింద బిందువు వరకు తొమ్మిది స్థానాలున్నాయి. ఇవి రెండవ జట్టు. మూడవజట్టు మహాబిందువు.
సాధకులు పరమేశ్వరిని ఈ మూడు స్థానాలలో పూజిస్తారు.
క్రింద చక్రాలలో కొలిచేవారు లౌకిక సుఖాల మీదనే దృష్టి కలిగియుంటారు. వీరిని అధములంటారు.
ఆజ్ఞ నుంచి పైన స్థానాలలో కొలిచేవారు మధ్యములు.
మహాబిందువుపై దృష్టి పెట్టి పరదేవతే తానన్న భావన తో కొలిచేవారు ఉత్తములు. ఈ శ్లోకము అటువంటి ఉత్తముల గురించి చెబుతున్నది. ఈ ఉత్తముల సాధనే సాద్యాఖకళ.
షట్చక్రాల మీద కూర్చున భగవతిని ఆరాధించేటప్పుడు
‘మహాపద్మవనాంతస్థే కారణానంద విగ్రహే’ అని చెబుతారు.
లలితా సహస్రంలో కూడా మనకు “తటిల్లతామరు ష్షట్చక్రోపరి సంస్థితా
మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ॥” అని చదువుతాము. ఆ నామాల భావము ఇదేయని గమనించాలి.
ఇదే సాదాఖ్యకళ, ఇదే పరమాకళ, ఇదే బ్రహ్మ కళ, చిత్కళ, ధృవాకళ. ఇదే పరమేశ్వరి. మన దేహమందు లోలోన యుండి ఈ జీవన నాటకాన్ని నడుపుతున్న పరమేశ్వరి.
ఆ తల్లిని తెలుసుకోవటమే జీవిత లక్ష్యంగా జీవించటమే పరమపథము.
ఇంతటి ఆత్మతత్త్వాని తెలుసుకోగల దివ్య శ్లోకాలను మనకిచ్చిన జగద్గురువులకు మనం ఋణపడియున్నాము.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
*****
#Day21
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 20
“కిరంతీమంగేభ్యః కిరణనికురంబామృతరసం
హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ।
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా ॥ 20 ॥
అర్థం:
అమ్మా జగజ్జననీ!!
కరచరణాది ప్రసరిస్తున్న కాంతిపుంజముల నుంచి జనించు అమృతం కురిపిస్తున్న నిన్ను ఏ సాధకుడు చంద్రకాంతి మణి దేహముగా నిను హృదయంలో ధ్యానిస్తాడో ఆ సాధకుడు విషసర్పముల దర్పమును గరుక్ముంతని వలె శాంతిపచేస్తాడు.
తేగీ॥
చంద్ర కాంతులు ప్రసరించు జనని యందు
దృష్టి నిలిపిన యోగికి దివ్య గరుడు।
డగును మిత్రుడు,విషపు పురుగులు తొలగు
కొలచెదను సంధ్యను శరణుఁ గోరి మదిని॥
అమ్మవారిని ధ్యానించే సాధకులకు మధురమైన వాక్కులు కలుగుతాయి. దివ్యమైన రచనలు చెయ్యగలుగుతారు. వశీకరణం వంటివి అలవోకగా అందుతాయి. తమ విషయభోగాల మీద పట్టు కలుగుతుంది. ముక్తికాంత చెంత చేరుతుందని మనకు ఇప్పటి వరకూ తెలిసింది. నేటి శ్లోకములో గారుడ ప్రయోగం గురించి చెప్పబడింది. విషాన్ని హరించగలడు గరుడుడు. విష సర్పాలను కట్టడి చెయ్యగలడు. అమ్మవారి ఉపాసకుడు మహత్వాన్ని పొందుతాడు. అమ్మవారిని ధ్యానించే సాధకునికి విషసర్పాల విషం విరుగుడు చెయ్యటం అలవోకగా అలవడుతుంది. సర్పముల విషాలను పోగొట్టుగలడు. విషజ్వరాలను తగ్గించగలడు. వారు ఇది పరోపకారార్ధం చేస్తారు. అతని హస్తస్పర్ష వలన విషం విరుగుడు అవుతుంది.
ఇది బాష్యార్థము.
ఇక గూఢార్థము-
జీవిత పరమపద సోపాన పఠములో పాములు అథోమార్గగాములు.
పాము, తేలువంటివి అథోమార్గనికి సూచన అంటే సాధన నుంచి పడిపోవటమే. అనగా కామప్రభావానికి లోనైనవాడికి అథోగతే. కాని చంద్రకాంతులు ప్రసరిస్తున్న జగన్మాతను ధ్యానించి వాడు రక్షించబడుతాడు.
ఉర్థ్వముఖంగా ప్రయాణించేవాడు గరుడుడు. అంటే ఆ సాధకుడు ఊర్థ్వముఖగామి అవుతాడు.
ఈ శ్లోకము పారాయణ చేసి విభూదితో అర్పించి ఆ భస్మం ధరించిన వారికి విషం తొలగించబడుతుంది.
ఈ శ్లోకమును ఉపాసించిన సాధకుడు తన స్పర్శతో అంటే సాన్నిధ్య, సత్సాంగత్యముతో సంసార లంపటములో చిక్కుకొని దిగజారు మానవులను ఉద్దరిస్తాడు. తన చూపుతో సంసార తాపత్రయ బాధితులకు బాధ ను తొలగించి ఉపశమనం కలిగిస్తాడని మనం భావించవచ్చు.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
******
#Day20
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 19
“ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్ ।
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగామ్ ॥ 19 ॥”
అర్థం:
అమ్మా ! సదాశివ పట్టమహిషీ!
ముఖము స్థానము బిందువుగానూ, క్రింద భాగము కుచయుగముగా, శక్తిగా త్రికోణముగా భావన సేయు సాధకుడు ఈ ధ్యానఫలితముగా కామాసక్తులైన స్త్రీలను చిత్తక్షోభకు గురిచేయుచున్నాడు.
తేగీ॥
కామకళ విలాసిని వీవు కామునింటి
రమణి, మధ్య కూటమిలోని లయగ త్రిపుటి।
సర్వ ప్రాణుల పాలించి సర్వజనని
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన॥
గూఢార్థము:
ఈ శ్లోకము మాములు భావము వశీకరణము గురించి తెలుపునట్లు ఉంటుంది. పైపై చదవరులకు ఇదో వశీకరణ మంత్రమని పిస్తుంది.
కాని నిజానికి ఇది శ్రీవిద్యలో అత్యంత అంతర్గతమైన “కామకళావిలాసము” గురించి చెబుతుంది.
పంచదశిలో రెండవ కూటమి కామకళావిలాసమే. ఆ బీజాక్షరము శక్తి వంతమైనది. ఆబీజాక్షరము కాళీ బీజము. అదే కృష్ణబీజము. అదే మన్మథ బీజము. అదే వశీకరణ బీజము కూడా. అత్యంత శక్తివంతమైన ఈ బీజము ప్రకృతి పురుషుల గురించి చెబుతుంది. “అ” అయ్యవారి బీజాక్షరము. “ఇ” అమ్మవారి బీజాక్షరము. అ+ఇ కలిపి ఏ అవుతుంది.
నిర్గుణుడైన ఈశ్వరుడు అమ్మవారితో కలిసినప్పుడు కామేశ్వరిడై ఈ సృష్టిని చేస్తున్నాడు.
ప్రకాశరూపుడై సదానందము స్వరూపుడై బిందురూపములో ఉంటాడు శివుడు.
సృష్ఠికి మునుపు పరమేశ్వరుడు ప్రకాశరూపడై ఉన్నాడు. ఆయనకు సృష్టి చెయ్యాలన్న కోరిక కలిగింది. ఆ కదలికే శక్తి. ఆమె విమర్శరూపిణి. పరమేశ్వరుని కోరికే కామము. కాబట్టి ఆయన మహాకామేశ్వరుడయ్యాడు.
అమ్మవారు మహాకామేశ్వరి అయింది.
సర్వ ప్రపంచాన్నీ సూర్యచంద్రులతో పోషిస్తున్నది. కాబట్టి అమ్మవారి స్తనయుగముగా సూర్యచంద్రులను చూపుతారు. ముఖమన్న బిందువు, స్తనయుగము తో కలిపి త్రిపుటి అవుతుంది. అదే విశ్వయోని.
ఆత్మ, మనస్సు భౌతికదేహ ఉత్పత్తి కేంద్రము వీటి మీద పట్టు యున్న సాధకునికి ధ్యానములో సిద్ధి చేకూరుతుంది. అట్టివానికి ప్రలోభాలు కలుగవు. పరలోక ముక్తికాంత అతనిని చేరుతుంది.
కామకళలో ఈ సృష్టి ఆవిర్భావము, పంచీకరణము, పంచభూతాల ఆవిర్భావము, మానవయుత్పత్తి, వారి వికాసము ఇత్యాదివి వివరించబడియుంటాయి. ఆ దివ్య జ్ఞానము మనకు జగద్గురువులు ఒక్క శ్లోకములో ఇచ్చారు. అన్నీ శ్లోకాలలో నిగూఢంగా బీజాక్షరాలు యుంటాయి. కాని అవి గురు ముఖతా తెలుసుకొని ధ్యానించాలి. బీజక్షరాలు యున్నాయని తప్ప ఆ అక్షరాలు వ్రాయకూడదని నియమము వలన ఇంతకు మించి వివరణ లేదు. కాని సాధకులు భక్తితో గురువునో, మంత్రాలనో ధ్యానిస్తే జగదంబ అతికరుణతో వారిలో ఈ బీజక్షరాలను ప్రచోదింపచేస్తుంది.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
****
#Day19
శ్రీమాత్రై నమః
సౌందర్యలహరి శ్లోకము 18
తనుచ్ఛాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభిః
దివం సర్వాముర్వీమరుణిమని మగ్నాం స్మరతి యః ।
భవంత్యస్య త్రస్యద్వనహరిణశాలీననయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణగణికాః ॥ 18 ॥
అర్థం:
అమ్మా! భగవతి! ఉదయించే బాల భానుని అరుణ కిరణాల కాంతి బోలు నీ దివ్య దేహపు అరుణకాంతులలో ఈ సమస్త భూమీ ఆకాశము మునిగినట్లు భావించి ధ్యానించే సాధకులకు , బెదరుచూపులతో ఉంటే అడవిలేళ్ళ కన్నులు కలిగిన అప్సరస స్త్రీలు వశమవుతారు.
తేగీ।
అవని అంబర కాంతుల అరుణ వర్ణ
దేహకాంతులు జనని దేదీప్యముగను
యశముకలుగు నిటు జపించు యాజ్ఞి కిలన
కొలిచెదనుసంధ్యను శరణు గోరి మదిన।।
భావార్థం
ఈ శ్లోకములో ఈశ్వరి యొక్క వర్ణాన్ని వివరిస్తున్నారు. భూమి ఆకాశం రెండూ పరమేశ్వరి యొక్క ఎరుపు కెంపుజాయ అనే సముద్రంలో మునిగిపోయినాయట.
ఈ శ్లోకము పైపై అర్థం వశీకరణ గురించి చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. జపించు యోగికి దేవవేశ్యలు వశమవుతారట.
ఇది వినటానికి మనకు వింతగా అనిపిస్తుంది. ఇదేమి జగద్గురువులు ఇలా చెబుతున్నారేమిటీ అని. కాని లోతుగా చూస్తే మరో గూఢార్థం వుంటుంది. పైపై అర్థాలు చూసి అపార్థాలు చేసుకొని సౌందర్యలహరికి దూరంగా జరిగేవాళ్ళు కర్మఫలం చాలక దూరంగా జరుగుతారు. నిజమైన సాధకులకు మాత్రమే విషయం అందాలని గూఢార్థాలతో సౌందర్యలహరినిచ్చారేమో జగద్గురువులు మనకు.
అప్రస్తుత ప్రసంగం అనుకోబోతే మా చిన్ననాటి విషయం చెబుతాను… నేను స్కూల్లో ఉన్నానప్పుడు. మా అమ్మ నన్ను పుచ్చుకు కరుణంగారి ఇంటికి తీసుకుపోయింది. అక్కడ కరుణంగారి చెల్లి అమ్మకు మిత్రురాలనుకుంటా. వారిరువురూ మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు పురోహితులు వచ్చారు. వాళ్ళు ఆమె వద్ద సహాయం కోసం వచ్చారు అనుకుంటా. అందులో ఒకరు ఆమెతో తమకు కావలసిన సాయం గురించి అడిగుతున్నారు. అక్కడ్నుంచి సంభాషణ జాతకాల వద్దకు.. అక్కడ్నుంచి యాత్రల మీదకు.. అలా అలా సాగుతూ జగద్గురువుల మీదకొచ్చి నిలచింది.
ఆమె వారితో “సౌందర్యలహరి లోతైన అర్థాలు చెప్పేవాళ్ళు కావాలి. మాములుగా చదివి వదిలేవి కావు ఇవి…” అన్నది.
మేమంతా విస్తుపోయేలా ఆ పురోహితులలో ఒకరు ఆమెతో …” ఆ సౌందర్యాల గోల మీకెందుకు? అసలు అటువంటివి చదవకూడదు స్త్రీలు. మీరు చక్కగా నోములు నోచుకోండి. లేదా ఏ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి…” అంటూ సలహా పడేశాడు.
తరువాత ఆవిడ వాళ్ళను ఒక దులుపు దులిపేశిందనుకోండి. ఒకటి జగద్గురువుల రచనల మీద అజ్ఞానానికి, మరోటి స్త్రీ చదవరాదన్న మాటకు. దాంతో వచ్చిన పని తప్పి సిగ్గుతో ఇద్దరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక ఆమె మాతో “ జగద్గురువుల రచనలు కూడా పూర్తిగా చదవరు. వీళ్ళా మనలను ఉద్దరించేవారు… కుదిరితే మీరు తప్పక చదవండి. చాలా శక్తి వంతమైనదీ రచన. శంకరాచార్యులు ఎంతో కరుణతో మనకు ప్రసాదించారు..” అన్నది.
నిజము పైపై చదివి ఇలా భావించిన వారికే నష్టం. ఎందుకంటే శంకరులు పొందవలసినదేమీ లేదు. ఆయన సాధకుల స్థాయి బట్టి అర్థం చేసుకోవటానికి ఎన్నో ప్రసాదించారు. కాబట్టి సౌందర్యలహరి వంటి మహా మంత్ర గ్రంధం మనము నేర్చుకోగలుగుతున్నామంటే, అర్ధం చేసుకోగలుగుతున్నామంటే కేవలం ఆ జగన్మాత మన మీద కురిపిస్తున్న అనుగ్రహం. మరి అంతటి మంత్రగ్రంధం వశీకరణలు వంటి భౌతికమైన విషయాలు చెబుతుందా? ఎన్నటికీ చెప్పదు. మరి ఇక్కడ శంకరులు మనకు చెప్పేదేమిటి?
జగదంబ సర్వ లోకాలకు తన కాంతితో కాంతివంతం చేస్తోంది. కాబట్టి అంబరము కాని అవని కాని ఎర్రని ఎరుపు రంగులో ఉన్నవి. అటువంటి ఆ ఎరుపు రంగులో ఉన్నదని భావన చేసే సాధకులకు సర్వం వశమవుతుంది.
సర్వం అంటే ఊర్వశి మొదలు సర్వం. ఉర్వశే ఎందుకు? ఊర్వశి నారాయణుడి ఊరువుల నుంచి జన్మించింది. ఆమె అందానికి పరాకాష్ఠ. అటువంటి అతిలోక సౌందర్యం వశమవుతుంది. అంటే సాధకునికి భౌతికమైన ఇంద్రియ విషయలోలత్వం వశమవుతుంది. అంటే అతనిని ఇక ఏ విషయము కదిలించలేవు.
అంతేనా అంటే కాదు, సర్వలోకాలను తన కాంతులతో దివ్యమైనది మార్చు భగవతి దర్శనమవుతుంది.
సాధకులకు తమ సాధనలో అతి పెద్ద అడ్డు విషయలోలత్వం. స్త్రీ గురించి చింత. ఈ చింతలన్నీ తీరిపోతాయి.
దేవతలు కంటి రెప్పవెయ్యరు. వారు ఈ సాధకుని వద్ద అడనివిలో లేడిలా చూస్తారట. అంటే అడవిలో లేడి భీతహరణి. భయపడుతున్న చూపులు కలది. రెప్పవెయ్యని దేవతలు భయపడే చూపులవారవుతారు అంటే సాధకునికి సర్వం అధీనమవుతుంది. అంటే సాధనలో జయం కలిగినట్లే గదా. దీనికి కావలసినది అరుణ వర్ణములో ఉన్న అమ్మవారి కాంతులతో అవని, అంబరము మెరుస్తున్నాయని భావన చేస్తూ ధ్యానము చెయ్యటమే.
ఇంతటి విషయజ్ఞానము మనకు ప్రసాదించిన జగద్గురువులకు మనము అనునిత్యం నమస్కరించుకోవాలి.
దివ్యమైన ఈ జ్ఞానాన్ని మనము నేర్చుకునేలా చేస్తున్న జగదంబ పాదాలకు సర్వం సమర్పిస్తూ
******
#day28
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 27
జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతివిధిః ।
ప్రణామస్సంవేశస్సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితమ్ ॥ 27 ॥
భావము
తల్లీ! ఆత్మార్పణ చెయ్యాలన్న దృష్టితో నేను నోటితో పలికిన మాటలన్నీ నీ మంత్రజపమే. ఈ దేహము నీవు ప్రసాదించినది కాబట్టి చేతులతో చేసే పనులు నీ ముద్రలు. నేనే చేసే సంచారము నీకు ప్రదక్షిణ. అంగభంగిమలన్నీ నీకు నమస్కారాలు. జఠరాగ్నివి నీవే కాబట్టి తినేదంతా నీకు నివేదన.
తేగీ
నాదు సల్లాపములు నీకు నామ జపము
నా అనుదిన క్రియలు, నీ కొనర్చు సేవ।
నా అణువణువు నిండియున్నది శివాని
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన॥
ఈ శ్లోకం అందరికీ పూర్తిగా అర్థంకాదని సౌందర్యలహరికి వ్యాఖ్య వ్రాసిన లక్ష్మీధర పండితుల అభిప్రాయం. ఇది చదివేవారి సంస్కారం బట్టి, వారి ఆలోచనలు బట్టి అర్థం మారుతుంది.
లోని అర్థం విచారిస్తే అమ్మా నాకు విద్యలు తెలియవు. మంత్రాలు రావు, ముద్రల గురించి తెలియేదే లేదు. హోమము యాగములు చెయ్యలేను. కాని చూస్తున్నదంతా నీ లీలా విలాసమే నన్న జ్ఞానమిచ్చావు. చేసేదంతా ఏ పనైనా నీ సేవ యన్న భావనతో చేస్తానమ్మా!” అని ఆత్మసమర్పణ భావము ఎవరియందుంటుందో వారి మీద జగజ్జనని దృష్టి ఉంటుంది. త్రికరణశుద్ధిగా ఆత్మసమర్పణా భావముతో ఉండేవారి జీవితం జగజ్జనని లీలలతో నిండిపోతుంది.
భగవానుడు గీతలో కూడా ఇదే చెబుతాడు.
9వ అధ్యాయములో
“యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ । యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్॥” అని 27 వ శ్లోకములో చెబుతాడు.
అంటే నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము.” అని భావము.
అన్ని పనులను/క్రియాకలాపములను తనకే అర్పించమంటున్నాడు భగవానుడు.
ఏ సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నా, ఏ శాఖాహార ఆహారాన్ని భుజిస్తున్నా, ఏ మత్తుపదార్థరహిత పానీయాలని త్రాగుతున్నా, ఏ వైదిక కర్మలు ఆచరిస్తున్నా, ఏ వ్రతాలు, నిష్ఠలు ఆచరిస్తున్నా, అవన్నీ కూడా, మానసికంగా పరమేశ్వరుడైన భగవంతునికే అర్పించాలి.
కానీ ప్రజలు భక్తిని, దైనందిన జీవితాన్ని వేరు వేరుగా చూస్తారు, మరియు భక్తి అంటే వేరేగా కేవలం గుడి లోపలే చేయాలి అనుకుంటారు. కానీ, భక్తి అనేది గుడి లోపల మాత్రమే చేసేది కాదు; అది జీవితం లోని ప్రతి క్షణం ఆచరింవలసినదే.
నారద మహర్షి భక్తిని ఈ విధంగా నిర్వచించాడు:
“నారదస్తు తదర్పితా ఖిలాచారతా తద్విస్మరణే పరమవ్యాకులతేతి”
(నారద భక్తి దర్శనము, 19వ సూత్రము)
‘భక్తి అంటే మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పితం చేయటమే, మరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే తీవ్రమైన విరహ వ్యాకులత చెందటమే.’ పనులను ఆయనకు అంకితం చేసి మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చివేస్తే దానినే అర్పణం అంటారు. ఇటువంటి దృక్పథం, భౌతికమైన ప్రాపంచిక పనులను, దివ్యమైన భగవత్ సేవగా సంపూర్ణముగా మార్చివేస్తుంది. స్వామీ వివేకానంద, పని పట్ల ఈ దృక్పథాన్నే వ్యక్తీకరించాడు: ‘ఏ పనీ లౌకికమైనది కాదు. ప్రతీదీ భక్తి మరియు సేవయే’ (No work is secular. Everything is devotion and service.)
సంత్ కబీర్ ఇదే విషయాన్ని తన పద్యాల్లో చెప్పాడు:
“జహాఁ జహాఁ చలూఁ కరూఁ పరిక్రమా, జో జో కరూఁ సో సేవా
జబ సోఁవూ కరూఁ దండవత్, జానూఁ దేవ న దూజా”
‘నేను నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది చేసినా, అది భగవత్ సేవ గానే భావిస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను.’
మనకు శంకరులు ఈ శ్లోకములో చెప్పినదీ ఇదే చేస్తున్నదంతా అమ్మ తవారాధనే అంటూ అమ్మవారిని క్షణ క్షణమూ తలుచుకుంటూ ఉండటము, చేసిన పనికి కర్రృత్వం స్వీకరించకపోవటము, మన‘వైదిక క్రతువులలో చేసినట్టు ‘శ్రీ కృష్ణాయ సమర్పణమస్తు’ అని అనటం ద్వారా చేయ్యటమే కాదు, ఆ సమర్పణ అనేది పని చేస్తూ ఉన్నప్పుడే, ఇదంతా భగవంతుని ప్రీతి కోసమే చేస్తున్న అంతర్గత భావన స్థిరపడుతుంది అది ఆత్మార్పణకు తోడ్పడుతుంది.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
*****
#day18
శ్రీమాత్రై నమః
సౌందర్యలహరి శ్లోకము 17
సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః।
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః॥
అర్థం:
అమ్మా! భగవతి! వాక్కును సృజించువారును చంద్రకాంతమణుల శకలముల వలె తెల్లనైన దేహముల కాంతికలవారు అయిన వశిన్యాది దేవతలు శక్తులతో కూడిన నిను ఎవరు ధ్యానిస్తారో వారు కాళిదాసు వాల్మీకి వలె మధురమైన, శ్రవణ రమణీయమైన మృధుమధురమైన కవిత్వం చెయ్యగలరు.
తేగీ।
వాక్కు నందించు దేవత వశిని శక్తి
గ, నిను ధ్యానించి అర్పించ కలుగు వాక్కు।
కాళిదాసు వాల్మీకులగలిగె కీర్తి
కొలిచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
తేగీ
మాతృకావర్ణ రూపిణి మాతనీవు
క్షరము లేక నిలబడు అక్షరము నీవు।
కవుల మాధుర్య సుందర కవిత నీవు
కొలచెదను సంధ్యను శరణగోరి మదిన॥
బావార్థం:
మనకు లలితానామాలలో చెబుతారు ఈ నామాలు వశన్యాది దేవతలు ఇచ్చారని. వశన్యాది దేవతలు వాగ్దేవతలు.
“మాతృకాం వశినీయుక్తాం యోగినీభి స్సమన్వితామ్
గంధాద్యాకర్షిణీ యుక్తాం సంస్మరే త్రిపురాంబికామ్”
అమ్మవారు మాతృకావర్ణరూపిణి. వశన్యాది ఎనిమిది శక్తులు, విద్యా యోగిని అనే నలుగురు శక్తులు కూడి అమ్మవారిని సేవిస్తూఉంటారు.
భాషకు అక్షరాలు యాభై.
ఈ యాభై కూడా ఎనిమిది వర్గాలుగా విభజించబడ్డాయి. అవి “అకచటతపయశ.”
అంటే
అ- వర్గం అ నుంచి అః వరకు 16 అచ్చులు
క - వర్గం క నుంచి జ్ఞ వరకు
చ - వర్గం చ నుంచి ఞ వరకు
ట - వర్గం ట నుంచి ణ వరకు
త - వర్గం త నుంచి న వరకు
ప - వర్గం ప నుంచి మ వరకు
య - వర్గం య నుంచి వ వరకు
శ - వర్గం శ నుంచి ళ వరకు.
విద్యాది యోగినులు పన్నెండుమంది.
వారు విద్యా యోగిని, రేచికా యోగిని, మోచికా యోగిని, అమృతా యోగిని, దీపికా యోగిని, జ్ఞాన యోగిని, అప్యాయనీ యోగిని, వ్యాపినీ యోగిని, మేథా యోగిని, వ్యోమరూపా యోగిని, సిద్ధిరూపా యోగిని, లక్ష్మీ యోగిని.
వశిన్యాది దేవతలు - వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయ సర్వేశ్వరి, కౌళిని యన్న ఎనిమిది మంది, గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి అన్న ఆకర్షణ దేవతలు. వీరంతా కలిసి 24 మంది దేవతలు అమ్మవారిని సేవిస్తుంటారు.
వీరు శ్రీచక్రంలో కొలువై ఉంటారు. ఆకర్షణీ దేవతలు భూపురంలో ఉంటారు.
శ్రీచక్రంలో పది కోణాల చక్రాలు రెండున్నాయి. అంతర్ దశారము, బహిర్ దశారము. ఇవి రెండూ చక్రాలు కలిపి ఇరువై కోణాలు. వశన్యాది దేవతలూ, ద్వాదశ యోగినులు ఈ ఇరువై కోణాలలో యుంటారు.
వీరు చంద్రశిలలా మెరుస్తూ ఉంటారు. వీరు వాగ్దేవతలు. వీరిని కొలిచిన వారికి మధురమైన కవిత్వం చెప్పే శక్తి కలుగుతుంది.
“కకారాది క్షకారాంతా వర్ణాస్తే శివరూపిణః।
సమస్త వ్యస్తరూపేణ షట్త్రిశంతి తత్త్వవిగ్రహ॥
అకారాది విసర్గాంతాః సర్వాః షోడశయుక్తయః
నిత్యాషోడశకాత్మనః పరస్పకరమమూయతాః॥”
అని మాతృకా హృదయం చెబుతుంది.
అ నుంచి క్ష వరకు అక్షరాలు. క్షరము లేనివి.
అక్షరాలు అచ్చులు-హల్లులు అని రెండు విభాగాలు. అచ్చులు స్వరాలు. ఇవి ప్రాణాలు. స్వతంత్రమైనవి. శక్తి స్వరూపాలు. హల్లులు శివస్వరూపాలు. హలుల్లు స్వతంత్రతలేనివి. వాటిని అచ్చులు లేకుండా పలకలేము. అచ్చులు వచ్చి కూర్చుంటే హల్లు పూర్తికాబడుతుంది.
హల్లులు “క” నుంచి మొదలై “ళ” తో పూర్తి అవుతాయి. (క్ష దిత్వాక్షరమని వీటిలో కలుపరు)అందుకే కకారాది నుంచి ళకారాది వరకు ఉన్న వర్ణాలను “కళ” అంటారు.
పంచదశిలో వచ్చే అక్షరాలన్నీ కళలే. ఈ మహామంత్రంలో అన్నీ ఖండాలలో కళలున్నాయి. అందుకే ఇది గుప్త ప్రణవము.
ఇలా అక్షరాలు యాభై అక్షమాలలో మణులు. “క్ష” మేరువు. జపమాలలో ఒక పూస ప్రక్కగా ఉండి లెక్క చెబుతుంది చూడండి అది క్షకారమన్నమాట.
అక్షరాలను భక్తిగా పలికితే అదే మహామంత్రం. అందుకే మాటకు శక్తి ఉందని చెప్పేది. మన మాటలన్నీ శక్తి స్వరూపాలే. కాబట్టి మాట్లేడే మాటలు జాగ్రత్తగా పలకమని పెద్దలు చెబుతారు. ఇలా మాటలను భక్తిగా ఉచ్చరించేవారికి వశన్యాది దేవతల అనుగ్రహం ఉంటుంది.
మనకూ ఇంతటి వివరాలు మంత్రశాస్త్రంలో, మాతృకా హృదయంలో చెప్పబడింది. ఈ వివరాలు అన్నీ భగవద్పాదులవారు ఒక్క శ్లోకంలో ఇచ్చారు. అంతటి కరుణతో జగద్గురువులు ఇచ్చిన ఈ శ్లోకాలను మంత్రాలుగా గ్రహించి చదువుకుంటే దివ్యమైన అనుభవాలు సాధకులు పొందగలరు.
శ్రీమాత దివ్య చరణాలకు సర్వం సమర్పిస్తూ
*****
#day17
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 16
కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం
భజంతే యేసంతః కతిచిదరుణామేవ భవతీమ్
విరించిప్రేయస్వాస్తరుణ తర శృంగారలహరీ
గభీరాభిర్వాగ్భిర్విదదతి సతాం రంజనమమీ॥
అర్థం:
ఉత్తమ కవుల చిత్తము అనే కమలములతో కూడిన ఉద్యానవనానికి ఉదయసూర్యుని లేయెండ ఛాయతో అరుణ వర్ణముతో నున్న నిన్నుసేవించు భక్తులు - సరస్వతీదేవి యొక్క పరవపు శృంగార రస ప్రవహం వలే నున్న గంభీరమైన వాగ్విలాస సంపదచేత సత్పురుషుల హృదయాలను రంజింపచేయుదురు గదా!
తేగీ
అమ్మ అరుణ కాంతులు సర్వ అవని యంత
బాల సూర్య కిరణములా వ్యాప్తి చెందు
భావనకల సాదకులకు వశమగుయశ
కొలిచె దనుసంధ్యను శరణు గోరి మదిన।।
వివరణ:
భగవద్పాదులు మునుపు శ్వేత సరస్వతి గురించి చెప్పారు. ఇక్కడ అరుణ సరస్వతిని వివరించారు.
భగవతిని అరుణ వర్ణములో సేవించిన వారు పుంభాసరస్వతులై శ్లాఘనీయమైన తమ వాగ్విలాసముతో సభలను రంజిపచేస్తారుట. హృదయ కమలములో భగవతిని అరుణ వర్ణముతో ఉపాసించాలని చెబుతున్నారు.
ఈ అరుణ వర్ణపు దేవికి ఎనిమిది చేతులు అందులో పాశము, అంకుశము, ధనుర్బాణములు, వరద, అభయముద్రలూ కలిగి పుస్తకము, అక్షమాలా ధరించి యున్నది. మూడు కన్నులు కలిగి పాలసముద్రంలో విహరించే ఈ తల్లిని ధ్యానించు వాని వాక్కున నిలచి సభామండపములో సబాసదులను శృంగారరసంలో ముంచివేస్తుంది. (గొప్ప ప్రవక్త అవుతాడనమాట)
అరుణ వర్ణములోని భగవతిని ధ్యానించిన వానికి ఈశ్వరి సరసవాక్కును ప్రసాదిస్తుంది.
సారస్వత ప్రయోగ ఉపదేశం ఈ శ్లోకంలో ఉంది. బాలా మంత్రం నిగుఢాంగా యుంది.
కాళిదాసు ధ్యానము చేసినది ఈ తల్లినే.
గొప్ప కవిగా మారిన కాళిదాసు ఈ అరుణసరస్వతిని -
“వామే పుస్తకధారిణీ మభయదాం సాక్షాస్రజం దక్షిణే
భక్తేభ్యో వరదాన ఫేశలకరాం కర్పూరకుందోజ్వలాం
ఉజృమ్బాబుజపత్ర కాసనయన స్నిగ్ధప్రభాలోకినీం
యేత్వామంబ నశీలయంతి మనసా తేషాం కవిత్వం కుతః॥” అని ధ్యానించాడు.
చల్లని చంద్రకాంతి శిలవంటి ఈ తల్లిని ఎనిమిది చేతులతో యున్న భగవతిని ఎవరు కొలుస్తారో వారు మృధుమధురమైన కవిత్వం చెబుతారని చెప్పాడు కాళిదాసు.
అరుణ సరస్వతి అంటే మన లలితమ్మ మరో రూపమే. అరుణ వర్ణములో ఉన్న బాల కూడా ఈ తల్లే. కోరినవి ఇచ్చే భగవతి మనకు సదా రక్ష. మన వాక్కు నందు నిలచి మనల నడుపుగాక అని ప్రార్థిదాము.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
******
#day16
శ్రీ మాత్రే నమః
సౌందర్యలహరి 15 శ్లోకం
శరజ్జ్యోత్న్సా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్
సకృన్నత్వా సత్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః॥
అర్థం:
అమ్మా! శరత్కాలమందు ఉన్న వెన్నెలలాగా స్వచ్ఛమైన శరీరంతో, లేత జాబిలితో కూడిన జడముడి, కిరీటముతో అభీష్టము తీర్చే వరముద్రాతో, భయాన్ని పొగొట్టు అభయముద్రతో, స్పటికమాలతో కూడిన అక్షమాల, విద్యా సంబంధమైన పుస్తకము ధరించిన నిను నమస్కరించిన వారికి, ఆరాధించిన వారికి, తేనె వంటి తీయని, ద్రాక్షాపాకం వంటి రుచిగల వాక్కులు ప్రాప్తిస్తాయి.
తేగీ।
చంద్రకాంతులు వెదజల్లు శారదాంబి
రూపుగనినెంచి భజియింతురో,కవులుగ
రచన గావించి ధరణిలో యశము పొందు
కొలిచెదను సంధ్యను శరణుగోరి మదిన।।
తేగీ॥
తెల్ల కలువలమాలలు, తెలుపు చీర,
చంద్రవంక కిరీటము జారుముడియు/
వరద, నభయహస్త మొసగు వాక్కు వరము/
కొలిచెదను సంధ్యను శరణుగోరి మదిన॥
వివరణ
ఈ శ్లోకంలో సారస్వతప్రయోగం ఉపదేశిస్తున్నారు. ఇందు వాగ్భీజము గూఢంగా ఉంది. పంచదశిలో, బాలా మంత్రంలో ప్రథమఖండంగా యున్నది వాగ్భవబీజమే. దీని వలన సాధకులు మధురమైన కవిత్వం చెప్పగలరు.
ఇందులో శంకరలవారు అమ్మవారికి అభయముద్రా, వరముద్ర గురించి
చెప్పినారు. మునుపటి శ్లోకాలలో అమ్మ పద పంకజాలు గురించి వివరించి ఇక్కడ అమ్మవారి ముద్రల గురించి చెప్పారు. ఇది ధ్యానశ్లోకం. అమ్మవారి ఈ రూపం ధ్యానిస్తే ఎంతటి బుద్ధి హీనులైనా, అమ్మ అనుగ్రహంతో గొప్ప కవిగా మధురమైన వాక్కులు పలకగలరు.
శరత్ కాలంలో ఎండా ఉండదు చలీ ఉండదు. సమశీతోష్ణ స్థితి. మబ్బులు లేని ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అటు వంటి ఆకాశంలో చంద్రుడు పూర్ణత్వంతో వెలుగుతుంటే ఆహ్లోదం అనంతమవుతుంది. అంతటి ఆహ్లాదం కలిగిస్తుంది అమ్మవారి రూపం భక్తులకు.
నెలవంక మనోజ్ఞమైన భావరేఖలకు సూచిక.
జటాజూటము అంటే జుత్తుముడి. కవితా పదబంధాలు - కేశబంధాలతో సూచిక.
వరదముద్ర కవిత్వం చెప్పటానికి కావలసిన ధీశక్తినీ ఊహాశక్తినీ ప్రసాదిస్తుంది. అక్షరజ్ఞానము అక్షమాల ప్రసాదిస్తుంది. గ్రంథరచనా సామర్థ్యం పుస్తకం అనుగ్రహిస్తుంది.
ఈ సంకేతాలను అర్థం చేసుకొని అమ్మ రూప ధ్యానం చేసిన వారి వాక్కు ద్రాక్ష రసములా మధురమవుతుంది. వారి కవిత్వం పదికాలాలు నిలుస్తుంది. కాళిదాసు కవిత్వంలా, మూకకవి కవిత్వంలా.
ఈ శ్లోకం చిన్నతనం నుంచి చెబుతుంటే విద్యార్థులకు విద్య అలవోకగా వస్తుంది.
3-15-1 శ్లోకాలను (మొదట 3వ శ్లోకం, తరువాత ఈ పదిహేనవది చివరన 1 వ శ్లోకం. ఈ వరుసలో చెప్పుకోవాలి) నిత్యపారాయణ శ్లోకాలుగా చేసుకుంటే పూర్ణ పఠన ఫలితమొస్తుందని గురువులు చెబుతారు.
అంత ముఖ్యమైన శ్లోకాలలో ఈ శ్లోకము ఒకటి. ప్రతిరోజూ పూజలో చెప్పవలసిన శ్లోకమిది.
దుర్వాసులవారు “దేవీ మహిమ్నస్తుతి”లో
“వందే వాగ్భవమైందవాత్మ సదృశం వేదాదివిద్యాగిరో
భాషా దేశసముద్భవాః పశుగతాశ్ఛందాంసి సప్తస్వరాన్
తాలాన్పంచ మహాధ్వనీ న్ర్పకటయత్యాత్మ ప్రసారేణయత్
తద్భీజం పద వాక్య మాన జనకం శ్రీమాతృకే తే పరమ్॥” అంటూ వర్ణించాడు.
దీని భావము- ఓ తల్లీ! వాగ్భీజము చంద్రబింబం వలే తెల్లనైనది. అది తన ప్రసారం చేత, వ్యాప్తి చేత సకల విద్యలను, వాక్కులను, భాషలనూ, ఛందస్యులనూ, సప్తస్వరాలనూ, తాళాలనూ, పంచవిధ ధ్వనులనూ ప్రకాశింపచేస్తోంది. అక్షరాలూ, పదాలూ, వాఖ్యాలూ, శాస్త్రాలూ కూడా ప్రకాశిస్తూన్నాయి ఆ కాంతిలో. అటు వంటి వాగ్భీజ రూపమైన నిన్ను ఉపాసిస్తున్నాను.”
వాగ్భీజమే అమ్మవారి స్వరూపమని చెబుతున్నారు దుర్వాస ముని.
అవ్యక్తం నుంచి ఓకారం, ఓకారం నుంచి అకార, ఉకార, మకారాలు పుట్టాయి. అటు
నుంచి సమస్త అక్షరాలు వచ్చాయి. అంటే నామాత్మకమైన జగత్తు అంటే వాగ్భవబీజ రూపమైన ఆ పరమేశ్వరే.
సర్వ మంత్ర స్వరూరము ఆ జగన్మాతే. మూడు వేదాల సారమూ ఈ వాగ్భవబీజమే. కాళిదాసు కు అమ్మవారు నాలుక మీద రచించినది ఈ బీజమే.
ఈ దివ్యమైన వాగ్భవబీజాన్ని శ్లోకంలో పొదిగి మనకు మార్గం సుగమము చేసిన జగద్గురువులకు వందనాలు సమర్పిస్తూ
సర్వం శ్రీమాతపాదీలకు సమర్పిస్తూ
******
#day15
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి శ్లోకం 14
“క్షితౌ షట్పఞ్చాశ ద్ద్విసమధిక పంచాశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పంచాశ దనిలే
దివి ద్విష్టట్ట్రింశ న్మనసిచ చతుష్షష్టి రితియే
మయూఖాస్తేషా ముప్యుపరి తవపాదాంబుుజ యుగమ్॥”
అర్థం:
అమ్మా! ఫృథివీతత్త్వంతో కూడిన మూలాధార చక్రమందు యాభైఆరు, జలతత్త్వాత్మకమైన మణిపూరకంలో యాభైఆరు, అగ్నితత్త్వాకమైన స్వాధిష్ఠాన చక్రంలో అరువై రెండు, వాయుతత్త్వాత్మకమైన అనాహతమందు యాభై నాలుగు, ఆకాశతత్త్వమైన విశుద్ధిలో డైభైరెండుమనస్తత్త్వాకమైన ఆజ్ఞలో అరువై నాలుగు, వెరసి మొత్తం మూడువందలా అరవై కిరణాలు. ఈ మొత్తం చంద్రమండలములోని సహస్రారంలో ఉన్న నీ పాదాల నుంచి ప్రసరిస్తున్నాయి.
తేగీ॥
భూమి, జలమాగ్ని. వాయువు, భువనమైదు/
తత్త్వ ములు, నారు చక్రపు తాలిషమును /
నీ పదముల ప్రద్యోతమై నిలుచు తుదకు/
కొలిచెదను సంధ్యను శరణు గోరి మదిన
వివరణ
మూలాధారములో 56 కిరణాలు, స్వాధిష్ఠానములో 62, అనాహతములో 54, విశుద్ధిలో 72, ఆజ్ఞా యందు 64 కిరణాలు ప్రకాశిస్తున్నాయి. 360 కిరణాలు లేదా భాగాలుగా పడుతోంది.
అమ్మవారికి లెక్కలు చంద్రసంబంధమైనవిగా చూస్తే- అంటే కళా స్వరూపమైనదిగా చూస్తే 15 శుక్ల పక్ష కళలు, 15 కృష్ణపక్ష కళలు. కలిపి 30 కళలు. 12x30 కలిపి 360 కళలు. ఈ వెలుగుకు అమ్మవారి పాదాలే ఉత్పత్తి స్థాన్నాలు. ఈ కళలు పెరుగుతూ తరుగుతూ ఉన్నా, వీటియందు ఉన్నా, వీటికి అతీతంగా యున్న కళ అమ్మవారే.
మానవ శరీరంలో ఉన్న 72000 నాడులూ అమ్మ పాదాల నుంచి స్రవించే అమృతంతో తడుస్తున్నాయి.
షట్చక్రాలనూ మహాపద్మాలని అంటారు. అగ్నిసూర్యచంద్రాత్మకంగా ఈ చక్రాలు ఉప్పారుతూయుంటాయి.
అమ్మవారి నవావరణం నుంచి మయూఖము అన్న కిరణాలు ప్రసరింపబడుతాయి. రెండు చక్రాలకూ కలిపి ఒక గ్రంధి ఉంటుంది.
ప్రథమ గ్రంధికి మూలాధార మణిపూరకాలు కలిపి అగ్ని మండల 108 కిరణాలు లేదా మయూఖాలు.
స్వాధిష్ఠానము, అనాహతము కలిపి విష్ణుగ్రంధి. సూర్యమండలము 116 మయూఖాలు.
విశుద్ధి ఆజ్ఞాలు కలిపి రుద్రగ్రంధి 136 కిరణాలు.
ఒక కిరణము ఒక తిథిగా అనుకుంటే ఈ 360 కిరణాలూ అమ్మవారి పాదాల నుంచి ప్రసరింపబడుతున్నాయి. ఈ 360 కిరణాలకూ పేర్లు ఉన్నాయి. భాస్కరరాయలువారు ఈ వివరాలు ఇచ్చియున్నారు.
ఈ కిరణాలు సహస్రదళ పద్మంలో ఉన్న పరమేశ్వరి పాదాల నుంచి ప్రసరించి లోకాలను ప్రకాశవంతంగా చేస్తున్నాయి.
పూర్ణమైన కళలంటే 360 డిగ్రీలు. అన్ని ఋతువులు కలిపితే పూర్ణం. కాలం 360 డిగ్రీలు. రకరకాలుగా కాలం విభజించబడింది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క శక్తిగా అమ్మ ప్రసరిస్తున్నది. ఆరు ఋతువులూ కలిపి 360.
పంచభూత్మాత్మకమైనది ప్రపంచం. ఒక పద్ధతిలో ఈ పంచభూత్మాత్మకమైన విశ్వం నడుస్తోంది. అది ఈశ్వరజ్ఞానము. ఈ కాలాన్ని నడుపుతున్నది అమ్మ. అయినా ఆమె ఈ కాలానికి అతీతురాలు.
ఈ కాలాన్ని అమ్మ పాదాల నుంచి ప్రసరించబడే కాంతి నడుపుతున్నది.
కాలదేశ శరీర తత్త్వాలన్నీ అమ్మ పాదాల నుంచే ప్రసరించబడుతున్న ప్రకాశము చే నడుస్తున్నది. కాబట్టి అట్టి పాదాలే మనకు గతియని మరువరాదు.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
******
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి - 13 శ్లోకం
“నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసుజడం
తవాపోజ్గాలోకే పతిత మనుధావన్తి శతశః
గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః
హఠాత్త్రుట్య త్కాంచ్యో విగళిత దుకూలా యువతయః॥”
అర్థం అమ్మా! జగజ్జనని!
ముదుసలి, ఎగుడుదిగుడు కన్నులు ఉన్నవాడు, మూఢుడైనా, నీ కొనగంటి చూపు పడ్డవెంటనే వాని వెండ అప్సరసలు, అందమైన స్త్రీలు తన శరీరాల మీద స్పృహ కోల్పోయినట్లుగా, వంటి మీద వస్త్రాలు జారుతున్నా వాని వెంట పడతారు. నీ అనుగ్రహం ఎంతటివానినైనా భాగ్యవంతుడిని చేస్తుంది.
తేగీ.
జడుడు ముసలి వికారియు, చలన శూన్యు
డతని కోరి వెంటపడు యువతులు, కొలవ।
ముక్తి కాంతను మదిన, విముక్తి చేయు
కొలచెదను సంధ్యను శరణగోరి మదిన॥
వివరణ:
ఈ శ్లోకం అర్థం చూడగానే కొంత విచిత్రంగా కనపడుతుంది. ముదుసలి వాడు, కురూపి, జడుడు అయినవాని వెంట యవ్వనులు, సుందరమైన స్త్రీలు పడతారట… వారి కురుల ముడులు విడిపోతున్నా, వస్త్రాలు ముడులు జారిపోతున్నా వారు
ఇవ్వన్నీ పట్టక వాని వెంట పడతారట.
ఇది చూడగానే ఏమిటీ శ్లోకమని అనిపిస్తుంది. కానీ మనమొకటి గుర్తుంచుకోవాలి, ఇది మనకు జగద్గురువులు శంకరాచార్యులవారిచ్చిన శ్లోకం. తొమ్మిడేళ్ళకు సన్యసించిన మహాగురువులు ఏడేళ్ళ వయస్సులో కనకధారనిచ్చిన మహానుభావులు శృంగారాత్మకమైన విషయాలు చెబుతారా? అలా అనిపించి అసలు విషయం అర్హులకు అందాలని అంతర్లీనంగా చెప్పారా చూడాలి.
భాగవతములో గోపికల స్థితి ఏమిటి? కృష్ణ వేణుగానానికి వారు ఏ స్థితిలో వెళ్ళారో మనం గుర్తుతెచ్చుకోవచ్చు. అంటే పరమేశ్వరి మీద లేదా ఈశ్వరుడి మీద దృష్టి ఉంచిన భక్తులకు బహిర్ స్ఫృహ ఉండదు. భక్తిలో తద్యాత్మకతలో ఉంటారు.
అలాగే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైన వారు సాధించలేని లేదు. మనకు తెలిసిన చరిత్రలో మూక కవి, పుట్టు మూగవానిగా ఉండి అమ్మ అనుగ్రహంతో మూకపంచదశిని అందించాడు.
మరి కూరూపి రూపవంతులు కాలేదా ఏమీ?!
సరే, రూపవంతులైన, యవ్వనవంతులైన స్త్రీలు వాని వెంట పడుతున్నారన్నారు కానీ, అతనికి మనస్సులో ఎవరో వెంట పడాలని లేదు.
సన్యసించి వారికి ఎవ్వరి మీద ఎటు వంటి కాంక్షా ఉండదు. వారికీ కేవలం పరమేశ్వరి మీద మాత్రమే దృష్టి ఉంటుంది. అటు వంటి యోగుల వెంట ముక్తికాంత పడుతుంది.
అంతర్గత మాలిన్యముంటే అది ఇంద్రియముల ద్వారా వ్యక్తమవుతుంది.
హృదయం నిర్మలత్వ, స్వచ్ఛతలకూ నిలయం. మాములు మానవులకు హృదయం అహంకార మమకారాలతో కప్పబడి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ అహంకార మమకారాలు తొలిగి ప్రేమామృత కలశం కనపడుతుంది.
అమ్మవారి అనుగ్రహం కలిగినవెంటనే, మోక్షానంద రహస్యం తెలియని జడుడు కూడా ముక్తి కాంత వెంటపడుతుంది. ఇలా కర్మ క్షయమైన భక్తుడు మోక్షం పొందుతాడు.
మనమూ సదా జగదంబను స్మరిస్తూ మోక్షానికి దారి వెతకచ్చు. సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
No comments:
Post a Comment