Wednesday, 22 January 2025

#day12

 


శ్రీ మాత్రే నమః

సౌందర్యలహరి 11 శ్లోకం


చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి

ప్రభిన్నాభిశ్శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః

చతుశ్చత్వారింశద్వసుదళ-కలాశ్ర - త్రివలయ-

త్రిరేఖాభిస్సార్థం తవశరణ కోణాః పరిణతాః


అర్థం:

తల్లీ! భగవతి! నలుగురు శివుల చేత శివుని కంటే వేరైన ఐదుగురు శివశక్తుల చేతను, తొమ్మిది మూల ప్రకృతులతో, అష్టదళ, షోడశదళ, త్రివలయ త్రిరేఖలను నీకు నిలయమైన శ్రీచక్రంనలుబదినాలుగు అంచులు గలదిగా అగుచున్నది. (అంటే నాలుగు శివచక్రాల, ఐదు శక్తి చక్రాలు మొత్తం నవచక్రాత్మకమై ఉన్నది.)


తే.గీ॥

శంభులైరి నాలుగు, శివ శక్తు లైదు

షోడశ దళాష్టదళముల శోభచే,న।

లుబది నాలుగంచు రథములు కల తల్లి!

కొలచెదను సంధ్యను శరణుకోరుమదిన॥


వివరణ:


ఈ శ్లోకములో శ్రీచక్రం వర్ణన వివరణ చెప్పబడింది. శంకరులు శ్రీచక్రాన్ని చక్రరాజ్యమన్నారు. పరదేవత శ్రీచక్రసంచారిణి. అంటే శ్రీచక్రంలో ఉంటుంది. శ్రీచక్ర మహారాజ్ఞి. అంటే అమ్మవారు శ్రీచక్రంలో నివసిస్తుంది. ఇది శివశక్తుల స్థానము. ఈ శ్రీచక్రం తొమ్మిది ఆవరణలుగా ఉంటుంది.

మూడు డైమెన్షలు ఉన్న శ్రీచక్రమును మేరువంటారు.


తొమ్మిది త్రికోణాలుగా, తొమ్మిది ఆవరణలుగా మనము శ్రీచక్రాన్ని దర్శిస్తాము. అంటే తొమ్మిది త్రికోణాలు ఒక లెక్క, తొమ్మిది ఆవరణలుగా మరో లెక్కగా చూడాలి.


తొమ్మిది త్రికోణాలలో శివ కోణాలు నాలుగు. శక్తి త్రికోణాలు ఐదు. పరమేశ్వరుడు స్వచ్ఛత, మోక్ష కారకం కాబట్టి  శివ త్రికోణాలు ఊర్థ్వముఖంగా ఉంటాయి. శక్తి మాయ కప్పి భూమి మీదత్రిపుతుంది కాబట్టి అధోముఖంగా ఉన్న ఐదు త్రికోణాలు శక్తి త్రికోణాలు.


ఇక తొమ్మిది ఆవరణలు ఈ ప్రకారముగా చూడాలి-

మధ్యలో బిందువు మొదటి ఆవరణ. త్రికోణము, అష్టకోణాలు, దశకోణాల చక్రాలు రెండు, పద్నాలుగు కోణాలున్న చక్రం, అష్టదళము, షోడశదళము,రెండు వృత్తాలు, భూపురత్రయము. ఇది ఆవరణల వివరాలు.

ఇందులో శివ ఆవరణలు నాలుగు, శక్తి ఆవరణలు ఐదు.


త్రికోణాలు అమ్మవారిని. వృత్రాలు అయ్యవారివి. బిందువు విస్తరిస్తే వృత్తము. వృత్తము కుంచించుకుపోతే బిందువు.

బిందువు, అష్టదళ చక్రం, షోడశదళచక్రం, భూపురం శివ చక్రాలు. చతురస్రమైన భూపురము వృత్తము నుంచి విస్తరించినది. శ్రీ చక్రం లో భూపురం (బయటి చతురస్రం).


ఇక శక్తి చక్రాలు త్రికోణాలు.

బిందువు బయటి మొదటి త్రికోణము,

అష్టకోణము, దశకోణాలు రెండు (ఒకటి అంతర్దశార్థం, రెండు బహిర్దశార్థం) పద్నాలుగు కోణాల చక్రం. మొత్తం ఐదు చక్రాలు.

బిందువు లోపలి చక్రమైతే, భూపురము పూర్తి బయటి ఆవరణము.


మనము భూపురం బయట ఉంటాము. మనం బిందువులో ఉన్న శివశక్తులను ధ్యానిస్తూ ఉండాలి. అక్కడకు చేరచమే మన జీవన గమ్యము కావాలి.


1.భూపురమును ప్రథమాఆవరణ. దీనిని ‘త్రైలోకమోహనచక్ర’మంటారు.

2. ద్వితీయ ఆవరణ - షోడశదళము. పదహారు దళాల పద్మం. దీనిని ‘సర్వాశాపరిపూరకచక్ర’మంటారు.

3.మూడవ ఆవరణ అష్టదళము. ఎనిమిది దళాల పద్మము. దీనిని ’సర్వాసంక్షోభణచక్ర’మంటారు.

4.నాలుగొవ ఆవరణ చతుర్దశారము. పద్మాలుగు కోణాల చక్రం. ఇది ‘సర్వసౌభాగ్యదాయకచక్ర’మంటారు.

5.ఐదవ ఆవరణ బహిర్దశారము. పదికోణముల చక్రం. దీనిని ‘సర్వార్ధసాధకచక్రం’.

6. ఆరవ ఆవరణ- అంతర్దశారం. పదికోణముల చక్రం. దీనిని సర్వరక్షాకరచక్రమంటారు’.

7. ఏడవ ఆవరణ అష్టకోణము. ఏనిమిది కోణాల చక్రం. దీనిని ‘సర్వరోగహారచక్ర’మంటారు.

8.ఎనిమిదవ ఆవరణ- త్రికోణము. ‘సర్వసిద్ధిప్రదచక్రం’.

9. తొమ్మిదవ ఆవరణ -బిందువు- ‘సర్వానందమైయచక్ర’మని పేరు.

ప్రతి ఆవరణలో దేవతలు ఉంటారు. వారు అమ్మవారి పరివారము. మనము చదివే ఖడ్గమాల అంతా ఈ ఆవరణలు, అందున్న శక్తుల గురించి చదువుతాము. వాటి వివరాలు మరొక్కమారు తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం శ్రీచక్రం వరకూ వివరించుకుందాము.


శ్రీవిద్యా ఉపాసకులు శరీరాన్ని శ్రీ చక్రంగా ఉపాసిస్తారు. ఇది ఏ విషయమైనా, అండములో జరిగేదే, పిండాండములో, బ్రహ్మాండం లో జరుగుతుంది.

అదే మన సనాతన ధర్మం చేప్పే విషయం.


“బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకమ్

లలాటేష్టార పత్రంచ భృవోర్మధ్యే దశారకమ్

బహిర్దశారం కంఠేతు మన్వస్రం హృదయం భవేత్‌

నాభౌచ వసుపత్రం చ కట్యాం షోడశపత్రకమ్

వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయమ్॥ అని చెబుతారు.


దీని అర్థం పద్మాసనం వేసుకు కూర్చున్న మానవులను శ్రీ చక్ర మహా మేరువుతో పోలికను చెబుతున్నారు.

సహస్రారం ఉన్న బ్రహ్మరంద్రం బిందు స్థానం. మస్తకం త్రికోణము. లలాటము అష్టకోణము. భ్రూమధ్యము అంతర్దశారం. కంఠం బహిర్దశారం.

హృదయము చతుర్దశారం. నాభి అష్టదళపద్మం. కటి శోడషదళపద్మం. ఊరువులు వృత్తత్రయము. పాదాలు భూపురము.

కోణాల గురించి కూడా శ్లోకములో శంకరులు చెప్పారు. పైకి చూస్తున్న నాలుగు త్రికోణాల మీద క్రిందకు చూస్తున్న ఐదు త్రికోణాలు వచ్చి కూర్చుంటే ఈ త్రికోణాలు ఖండన జరిగి మనకు 44 కోణాలు ఏర్పడుతాయి.


అలాగే అమ్మవారి గురించి, శ్రీవిద్యా రహస్యాల గురించి చెప్పే ఉపనిషత్తులలో భావనోపనిషత్తు ప్రధానమైనది. ఈ ఉపనిషత్తు మానవదేహములో శ్రీ చక్రమును గురించి వివరిస్తుంది. “నవరంధ్రరూపో దేహః నవచక్రరూపం శ్రీ చక్రం” అంటూ సాగుతుంది.


శ్రీచక్ర బిందువులో పరదేవత ఉంటుంది. ఒక్కోక్క ఆవరణలో ఎనిమిది మంది చొప్పున మొత్తం అరువై నాలుగు మంది యోగినులు సేవిస్తూ ఉంటారు. వీరిలో ఒక్కక్కరికి ఎనిమిది మంది చొప్పున యోగినులు సేవిస్తూ ఉంటారు. మొత్తం మీద 9x8x8x 576 కోట్ల యోగినులు పరమేశ్వరిని సేవిస్తూ ఉంటారు.  అందుకే అమ్మవారిని ‘మహాచతురషష్ఠికోటియోగినీ గణసేవితా’ అన్న నామముతో సేవిస్తారు.


అమ్మను తెలిపే యంత్రం రాజ్యం శ్రీచక్రమైతే, మంత్రం పంచదశి మహా మంత్రం. దీని వివరము ఇక్కడ అప్రస్తుతం.


శ్రీచక్రార్చన గురువుల ద్వారా పొందవలసి ఉంటుంది.

శ్రీచక్రం అర్చన వలన సర్వ కార్యాలు సిద్దిస్తాయి. సర్వసంపదలు కలుగుతాయి. తుదకు ముక్తి కూడా ప్రసాధిస్తుంది పరదేవత.

శ్రీచక్రాన్ని అర్పిస్తే సర్వ ప్రపంచాన్ని అర్చించినట్లే. మనము శ్రీచక్రార్చ వలన పొందే సర్వము ఈ శ్లోకము చదువుకొని పొందవచ్చును. గ్రహబాధలు తీరి సకల శుభాలు చేకూర్చే శ్రీచక్రార్చన ఫలము ఈ శ్లోకం ద్వారా మనకు ప్రసాదించిన గురువులు మరల మరల నమస్కారము చేసుకోవాలి.


సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ

No comments:

Post a Comment