Saturday, 18 January 2025

 #Day8 


సౌందర్యలహరి 7 శ్లోకము


శ్రీమాత్రే నమః


“క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా

పరీక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః

పురస్తా దాస్తాంనః పురమధితు రాహో పురుషికా॥”


అర్థము:

చిరు సవ్వడి చేయు గజ్జెల మొలునూలు కలది, గున్నఏనుగు కుంభము పోలిన స్తనములు కలది, సన్నని నడుము కలది,శరదృతువు పూర్ణ వెన్నెలనిచ్చే చంద్రుని పోలిన ముఖము కలది, నాలుగు చేతులలో ధనస్సు, బాణము, పాశము, అంకుశము కలది, త్రిపురహరుడైన శివుని అహంకార రూపమైన జగన్మాత మాకు ప్రసన్నురాలగుగాక!!


తేగీ॥

బాణము, ధనస్సు, నంకుశ, పాశము కల

నాల్గు చేతులు , వెన్నెల నగవు ముఖము।

శంభు వ్యక్త స్వరూపిణి శాంభవి నిను

కొలచెదను సంధ్యను శరణు కోరి మదిన॥

పూర్ణ చంద్ర వదన కుంభపు స్తనములు మొ/

గెడి పసిడి మువ్వవొడ్డాన కెంపు సొగసు।

జగమును పరిపాలించెడి జనని నిను/

కొలిచెదను సంధ్యను శరణ గోరి మదిన॥


ఇందులో అమ్మవారి స్థూల వర్ణన చెయ్యబడింది. 

స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ రూపాలని నాలుగు రకాలుగా మనము అమ్మవారిని సేవిస్తాము. 

స్థూలరూపం అమ్మవారి విగ్రహం. సూక్ష్మరూపము మంత్రరూపము,

సూక్ష్మతర కుండలినీ, సూక్ష్మతమ రూపము అమ్మవారి నిర్గుణ రూపము. అదే వేదాలు చెప్పినది. ఇవి నాలుగు వివరిచేంది సౌందర్యలహరే. ఈ శ్లోకములో అలా నాలుగు విధములుగా అమ్మవారిని తలవబడింది. 


1.

‘ క్వణత్కాంచీదామా’ అంటే మణిమేఖల. గజ్జలు మొలనూలు. 

అమ్మవారి ఆభరణాలు చైత్యనమైనవి. అవి మృదువైన శబ్ధం చేస్తూఉంటాయి. 

భావార్థము మరోటి ఉంది. అమ్మవారు అక్షరస్వరూపిణి. అందుకే అమ్మను మాతృకావర్ణరూపిణి అని పిలుస్తారు. అన్ని వర్ణాలు అంటే అక్షరాలు అమ్మ నడుము చుట్టూ వడ్డాణమై మెరుస్తున్నాయని అర్థం చెప్పుకోవచ్చు. అన్ని అక్షరాలు అమ్మవారి స్వరూపమే. అన్ని మాటలు అమ్మ మంత్రములే. ఈ విషయం జ్ఞప్తియందు ఉంచుకుంటే మనకు మాటయందు భక్తి పెరిగి సచ్ఛీలత పెరుగుతుంది. 


2.

‘కరికలభకుంభస్తననతా’

అమ్మ వక్షములను ప్రతి కవి వర్ణిస్తాడు. మాతృస్వరూపమైన అమ్మవారు సకల ప్రపంచానికీ తల్లి. అంటే సర్వ ప్రపంచాన్ని పోషిస్తున్నది. అలా పోషిస్తున్న తల్లి పాలిండ్లు ఏనుగ కుంభము వలే ఉన్నదని భావన. 

ఏనుగు ముఖము వాన్ని తల్లి కాబట్టి ఏనుగ కుంభముల వలె నున్నదని మరో అర్థము. గజముఖని తల్లి అని పిలిస్తే అమ్మవారికి సంతోషము కలుగుతుందట. అందుకని అలా వర్ణించాడు భగవద్పాదులు. 

ఒక కవి చమత్కారముగా అమ్మా ఒక వైపు కరి ముఖము వాడు మరో వైపు ఆరు ముఖముల వాడు నీ పాలు త్రాగుతుంటే ఇక నా వంతు ఎమిటి? అని అమ్మ వద్ద ఏడ్చాడు. అమ్మ తన తాటంకములతో సర్వ ప్రపంచానికి ఆహారమందుతుందని చెప్పిందిట. అమ్మ తాటంకములు సూర్యచంద్రులు. వారి వలనే కదా ఆహరం ఫృథ్వికి వస్తుంది. కాబట్టి ఆహారమందించే తల్లి వక్షము తలచుకోవటం వలన క్షుద్భాద ఉండదు. 


3.

ఊర్థ్వలోకాలను, అధోలోకాలనూ కలిపే అమ్మవారి కటిస్థలము అత్యంత సన్నగా ఉన్నదని చెబుతూ పరిక్షీణా మధ్యే అని చెప్పారు. 


4.

పరిణితశరచ్చంద్రవదనా

పూర్ణమైన పౌర్ణమి చంద్రుని వంటి ముఖమట అమ్మవారిది. అదీ శరత్‌ కాలములో. శరత్తువులో ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది. మబ్బుతునకలు ఉండవు. నిర్మలమైక ఆకాశంలో చంద్రుడు మరింత నిండుగా మరింత వైభవంగా కనపడుతాడు. ఇది బాహ్యార్థం. అంతరార్థం మరోటి ఉంది. 

అమ్మవారు షోడశి. అంటే పదహారు కళలున్నది. (పదహారు సంవత్సరాల యువతి అని మరో అర్థం చెబుతున్నారు. అది తప్పు). 

అమ్మవారు పూర్ణ కళలున్న తల్లి. కళలు పదహారు.చంద్రకళలని కూడా అంటారు వీటినే. 

అవే తిథినిత్యా దేవతలు. వీరి మూలంగా కాలము కదులుతూఉంటుంది. 

వీరు చంద్రునిలో ఉన్నప్పుడు ఆ తిథి మనకు లభ్యమవుతుంది. ఈ పదహేను కళలలో అమ్మ వారి వారి రూపాలలో ఉంటుంది. తరగని పదహారవ కళగా షోడశి రూపముగా ఉంటుంది. అమ్మవారు షోడశకళాప్రపూర్ణ. 

పదిహేను తిథినిత్యా దేవతలు శ్రీచక్ర రెండవ ఆవరణలో ఉండిన ఆకర్షణాశక్తులు. 

అవి కామేశ్వరీ,భగమాలినీ, నిత్యక్లినా, భేరుండా, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య.

ఈ పదిహేను కళలలో ఉన్నా పదహారవ కళైన షోడశీ రూపంలో పూర్ణ చంద్రునిలా ఉన్నది అమ్మవారే. అమ్మవారి అనుగ్రహముతో చంద్రుడు పౌర్ణమినాడు అంతకళగా ఉంటాడు. అందుకే ప్రతి పౌర్ణమి నాడు మనము చంద్రునిలో అమ్మను ఊహిస్తూ లలితా నామాలు కాని మహామంత్ర జపం కాని చేసి స్వచ్ఛమైన పాలు నివేదన చేస్తే, చేసిన పూలు సత్వరంగా సిద్ధిస్తాయని పూజ్య చంద్రశేఖరయతివర్యేణులు చెప్పేవారు. 

ఇటు వంటి పూర్ణచంద్ర బాంబిపు ముఖముతో వెలుగుతున్న తల్లి నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలను ధరించింది. అమ్మవారి ఆయుధాల గురించి ముందరి శ్లోకములో చర్చించుకున్నాము. 


5.

ఇప్పుడు అమ్మ పంచబాణాలైన ఐదు పువ్వులను పట్టుకుంటుదన్న విషయములో గూడార్థం తెలుసుకుందాము. 

పంచబాణాలు పంచ తన్మాత్రలకు ప్రతీక. ఈ తన్మాత్రలు మానవ పంచకోశాలకు గుర్తు. పంచకోశాలు అన్నమయ్య, ప్రాణమయ,మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. 

పంచకోశ శుద్ధి జరగనిదే జీవుడు పైకి ప్రయాణించలేడు. సాధనలో ఈ కోశశుద్ధి ఎంతో ముఖ్యమైనది. ప్రముఖమైనది. 

యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్న ఈ నియమబద్ధమైన జీవితం ఉంటే కోశశుద్ధి జరుగుతుంది. ఇది మనస్సును నియంత్రించి నిర్లకల్ప సమాధికి సహయపడుతుంది. 


6.

ఈ రకంగా బంగారు మువ్వల మొలనూలు ధరించి ఏనుగ కుంభస్తలముల వంటి  వక్షములతో, శరత్కాల చంద్రుని పోలిన ముఖముతో నాలుగు చేతులలో పాశము, అంకుశము, ధనస్సు, పంచపుష్పబాణములు ధరించి యున్న ఈమే శంకరుని యొక్క అహంకారరూపిణి యట. అని మనకు శంకరభగవద్పాదులవారు చెబుతున్నారు. 

“అహో పురుషికా” అన్న నామము చెప్పారు. 

ఇది శ్రీవిద్యా అంతర్లీనముగా ప్రతిపలిస్తున్న నామము. 

7.

అహో! అంటే గొప్పనైన లేదా ఆశ్చర్యమైన విషయం చెబుతుంటే అహో అనటం మనకు సామాన్యంగా తెలుసు. అదే చెబితే వారు జగద్గురువులు కారు. కాని చెప్పినవారు జగద్గురువులు. శ్లోకం చదివు మనకు శ్రీవిద్యా ఉపాసనా ఫలమివ్వాలని వారి కరుణ. 

‘అ’ అక్షరము శివ స్వరూపము. ‘హ’ శక్తిబీజమని మనకు తెలుసు. “అహ” మధ్య సర్వ అక్షరాలు ఉన్నాయి. అంటే వర్ణాలు శివశక్తి స్వరూపం అని ఒక భావన. 

అహం- నేను అన్న భావనే ఆత్మ.  ఆ అహం కలిగినాడే పరమేశ్వరుడు, కామేశ్వరడై ఈ సర్వసృష్టి చేశాడు. అటువంటి అహం ప్రతి వారిలో ఉంటుంది. ఆ అహమే శివశక్యైకరూపం. అహో అన్న మాట శివశక్యైఖరూపమన్న భావన, సృష్టి చేసిన ఈశ్వర అహంకారమని అర్థం. 

పురమధితుః అన్న నామము ఇచ్చారు శంకరులు మనకు. 

త్రిపురాలను మధించినవాడు ఈశుడు. త్రిపురాలంటే మనలో ఉన్నవే. సత్వరజోతమోగుణాలు. మరో అర్థంగా చెప్పాలంటే మాతృకావర్ణబీజాలను మధించి పాలనుంచి వెన్న తీసిన చందనా శివుడే బాలా మంత్రాని లోకానికి అందిచాడని అర్థం. బాలాబీజములోని మూడక్షరాలు మూడు కూటములకు గుర్తు. 

ఇలా ఒక్క శ్లోకములోనే భగవద్పాదులవారు అమ్మవారి స్థూలరూపము, సూక్ష్మరూపము,సూక్ష్మతర, సూక్ష్మతమ రూపాలను ఆవిష్కరించారు. ఇది నిత్యపారాయణ శ్లోకము. దైవచింతనను పెంచి సాధనలో ముందుకు నడిపించే శ్లోకము. 

ఇంతటి దివ్య శ్లోకాన్నిచ్చిన జగద్గువుల కరుణకు మన సదా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 

జగదంబ పాదాలకు సర్వం సమర్పిస్తూ

సంధ్యా యల్లాప్రగడ

No comments:

Post a Comment