#Day7
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరుదాయోధనరథః ।
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ॥ 6 ॥
అర్థము:
అమ్మా! హిమగిరి పుత్రి హైమవతి! అనంగుడు అంటే శరీరములేని వాడైన మన్మథుడు పూలతో చేసిన ధనస్సు, తుమ్మెదలఅల్లెతాడు,ఐదు పూల బాణాలతో మలయమారుతము అన్న రథము మీద మిత్రుడైన వసంతుడిని తోడుగా యుద్ధానికొచ్చి, ప్రపంచములోని సర్వులనూ ఓడిస్తున్నాడంటే అది నీ అనుగ్రహం కాక ఏమిటమ్మా?!
తే.గీ॥
కామము సమూలముగ కాల్చగ, నది జ్ఞాన
కాంతి మూడవ నయనముగా విరియును।
అమ్మ ధ్యానమది మొదటిఅడుగు మనకు
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన।।
పంచ బాణము, తుమ్మెద వరుస త్రాడు,/
చెరుకుగడ విల్లు మలయమె చెలిమి, మరుడు/
గెలిచు యుద్ధములది అమ్మ కృప వలననె/
కొలచెదను సంధ్యను శరణు గోరి మదిన॥
వివరణ;
శరీరమే లేనివాడు మన్మథుడు. అతని ధనస్సు పరమ సుకుమారమైనది. చిన్నపిల్లలు కూడా నమిలి తుత్తి చెయ్యగల చెరుకుగడను విల్లుగా చేసుకున్నాడు.
స్త్రీ కురులు తగిలితే నలిగిపోయే సున్నితమైన పువ్వులను కమలము, ఇందీవరము, పారిజాతము, కల్హారము, సహకారము అన్న పువ్వులు ఐదింటిని బాణాలుగా గలవాడు.
అల్లేతాడు గట్టిదా అంటే అది తుమ్మదల బారు. తుమ్మెదలు ఒకచోట ఉండవు. మరి అవి అల్లెతాడుగా నిలువగలవా?
అతని రథమా,మలయమారుతము. ఆ మలయమారుతం చల్లని శీతల పవనం. నెమ్మదిగా ప్రశాంతముగా వీస్తుంది.
మరి మిత్రుడా వసంతుడు. వసంతుడు సంవత్సరములో రెండు నెలలు మాత్రమే ఉంటాడు. ఆయన ఈయనకు తోడు. ఈయన సర్వులను, సర్వేష్వరుడైన ఈశునితో సహా అందరినీ తన బాణాలతో లొంగదీసుకుంటున్నారంటే, అది అమ్మవారి అనుగ్రహ ఫలము.
మన్మథుడు అమ్మవారి మహాభక్తుడు. అతను శ్రీవిద్యా ఉపాసకుడు. శ్రీవిద్యలో ప్రముఖమైన కాదివిద్యతో అమ్మవారిని ఆరాధించాడు. ఆయన భక్తితో అమ్మవారి అనుగ్రహం సాధించి, పనికిరాని వాటితో ప్రపంచమీద అధిపత్యం సాధించాడని ఒక అర్థం.
“తదార్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాన్ అపాంగాత్తే లబ్ద్వా మనంగో విజయతే” అమ్మా నీ కృపాకటాక్షవీక్షణాల వలన ఈ అద్భుతం జరుగుతోంది అని చెబుతున్నారు శంకరులు.
గూడార్థం:
ఇది మన్మథుడి గురించి కాదు మన గురించే అన్నది ఇందలి గూడార్థము.
జీవుడికి శరీరము ఒక సాధనము. ఒక వాహనము. తమ తమ కర్మలను అనుభవించి, తమ జీవితసాపల్యం పొందటానికి ఈ శరీరము తోడు తీసుకొని జీవుడు ప్రయాణిస్తాడు. కాబట్టి వాడు అనంగుడు. (ఆత్మకు శరీరము వాహనము మాత్రమే. ఆత్మే శరీరము కాదు. నేను శరీరము కాదు)
మన్మథుని చేతిలో చెరుగు గడ ధనస్సు మనస్సు. మనస్సే సంకల్పవికల్పాలకు కారణమైయింది. ఆత్మజ్ఞానానికి ముందు మనస్సు మీద అదుపు ఉండాలి. అంటే మనస్సును జయించాలి.
బాణాలు ఐదు. అవి జ్ఞానేంద్రియాలు. శబ్ధస్పర్షరూపరసగంధాలు. వీటిలో ఒక్కొక్క తన్మాత్ర ఒక్కో ఇంద్రియానికి చెందినది.
శబ్ధం- చెవి, స్వర్ష - చర్మము, రూపము- కన్ను, రసము- నాలుక, గంధం- ముక్కు.
ఇక వింటినారి మన లోని నాడులే. ఈ నాడులన్నీ మనస్సును అనుసంధానముగా పని చేస్తూ ఉంటాయి. తుమ్మెదల వలె ఇవి ఇందియ్రావిషయాలను మనస్సుకు చేరవేస్తాయి.
ఒక్కో బాణము ఒక్కో ఇందియము పై పట్టు కోల్పోవటము.
“కురంగ మాతంగ పతంగ భృంగమీనాః హతః పంచభిరేవపంచ।
ఏకః ప్రమాదీసకధం వహన్యతే యస్సేవతే పంచభిరేవ పంచ॥”
కురంగం అంటే లేడి. వేటగాడి శృంగనాదానికి అంటే కొమ్ముబూరకు ఆకర్షితురాలై వేటగాడికి లొంగిపోతుంది.
మాతంగమంటే మగఏనుగ. ఆడఏనుగ స్పర్ష కోసం వెతుకుతూ వలలో పడుతుంది.
పతంగం మంటే మిడుత. ఎర్రగా ప్రకాశించే దీపాన్ని చూసి పండు అని భ్రమపడి మంటలో పడి మరణిస్తుంది.
భృంగమంటే తుమ్మెద. పువ్వు లోని మకరందం త్రాగుతూ ఆ పువ్వు ముడుచుకుపోతే దారి లేక అందులో మరణిస్తుంది.
మీనం చేప జాలరి కొక్కానికి ఉన్న పురుగు కోసం వచ్చి చిక్కుకొని మరణిస్తుంది. ఇలా ఇంద్రియబలహీనతల వలన మరణిస్తాయి. మానవుడు ఐదు బలహీనతలు ఐదు దిక్కులుగా బాదిస్తాయి.
ఇక మలయపవనము అంటే మనలోని నిశ్వాస ఉశ్వాసలే.
వసంతుడంటే మానవ జీవితంలో యవ్వనమే.
ఇంత వ్యాపారం జరుగుతున్నదంటే అమ్మా! హిమగిరితనయా, నీవు ఈ శరీరంలో చిన్మాత్రగా ఉన్నావు కాబట్టే తల్లీ! అని జగద్గురువులు చెబుతున్నారు.
దైవ ధ్యానంలో మన మనస్సును అదుపులోకి తెచ్చి పెట్టుకొని, అమ్మను ధ్యానించటము ద్వారా మనము అమ్మసన్నిధి చేరుకోగలము.
సర్వం శ్రీమాతపాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ
No comments:
Post a Comment