#Day5
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి -4 శ్లోకం
త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥
అర్థము
అమ్మా! జగజ్జననీ!!
ఇతర దేవతలకు రెండు చేతులతో రెండు ముద్రలు పెట్టి ఉంటారు. అవి అభయ ముద్ర, వరద ముద్ర. నీవు మాత్రం నీ చేతులతో ఏలాంటి మద్రులు అభినయించకున్నావు. అమ్మా! భయము నుంచి రక్షించటానికీ, కోరినవి ప్రసాదించటానికీ నీ పాదములు సమర్థమైఉండగా ఇంక చేతులతో ముద్రలు పట్టనేల?
తేటగీతి
అభయ ముద్రతో పనిఏల? అభయ మొసగ/
మాత! వరదాయిని!చరణమదియు చాలు/
మించి కల్పవృక్షముగ కామితముతీర్చ/
కొలచెదను సంధ్యను శరణు గోరి మదిన।।
వివరణ:
దేవతలు భక్తుల కోరికలు తీర్చటానికి గుర్తుగా వరద ముద్ర, అభయ ముద్ర పట్టి ఉంటారు. -అభయ ముద్ర అంటే, చెయి తెరచి వెళ్ళు పైకి ఉండేలా పెట్టడం. కారణము భయంలేదు నీకన్న సందేశమందులో ఉంది.
-వరద ముద్ర అంటే, నీవు కోరినవి తీసుకో అన్న సందేశము తెలిపుతూ వెళ్ళు క్రిందకు చూపుతూ చెయి తెరచి ఉంచటము. ఇవి సామాన్యంగా సర్వదేవతలలో చూస్తాము. కాని అమ్మవారు మాత్రము అలా లేరు.
అమ్మ చతుర్భుజ. నాలుగు చేతులలో నాలుగు ఆయుధములు ధరించింది. అవి పాశము, అంకుశము, ధనస్సు, పంచ బాణములు.
కాళీదాసు శ్యామలాదండకములో చెబుతాడు:
“చతుర్భుజే చంద్రకళావంతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే।
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణా హస్తే నమస్తే జగదేకమాతః॥”
ఆయన దర్శించిన తల్లి నాలుగు చేతులతో ఉన్నది. ఆమె చేతులలో పాశాంకుశము, ధనస్సు బాణాలున్నవన్నాడు.
లలితా ప్రార్థనా శ్లోకంలో చెబుతారు ఇలా
“ సకుంకుమ విలేపనా మళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం” అని చెప్పారు.
లలితా నామాలలో “ఉద్యద్భాను సహస్రాభా చతుర్భాహు సమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా
మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్రసాయకా”॥ అన్న నామాలు మనకు చెబుతున్నదీ ఇదే.
అమ్మ నాలుగు చేతులతో ఉన్నది. అందులో ఎడమవైపు పైచేతిలో పాశము పట్టుకున్నది. ఇది అనురాగ పాశము. జీవిని కట్టిపడేస్తుంది.
రాగము అరిషడ్వర్గాలకు మూలము. దీనిని జయిస్తే ముక్తి లభ్యమవుతుంది.
(అమ్మవారి ఆయుదాలకు మంత్రాలుంటాయి. అవి జపించిన వారికి భయం తొలిగిపోతుంది.)
అమ్మవారి కుడి చేతిలో అంకుశముంది. రాగం అంటే కోరిక. అది తీరకపోతే కోపము ద్వేషం కలుగుతాయి. అమ్మవారు తన అంకుశముతో ఆ కోప ద్వేషాలను తీసేస్తుంది.
అమ్మ క్రింది వెడమ చేతిలో ధనస్సు పట్టుకుంది. మనస్సే ధనస్సు. సంకల్ప వికల్పాలకు కారణము మనస్సు. మోక్షకామికై ఈ మనస్సును అదుపు చెయ్యాలి సాధకుడు.
అమ్మ కుడి చేతిలో బాణాలుంటాయి. అవి కమలము, ఇందీవరము, పారిజాతము, కల్హారము, సహకారము. అవే పంచ తన్మాత్రలు.
సాధకులు మనస్సు అన్న ధనస్సును అదుపు చేసి, అహంకారమన్న పుష్పము అమ్మకు సమర్పిస్తే వారికి మోక్షము సిద్ధిస్తుంది.
అటు వంటి అమ్మ మనకు మళ్ళీ అభయ వరద ముద్రలతో ఎందుకు కనపడటం? ఆమె పాదాలను ఆశ్రయిస్తే చాలు మనకు సర్వం సమకూరుతాయి.
సర్వం సమకూరుతాయని నానారకాలు కావాలనుకోకూడదు. చెడ్డపనులు చేసి అమ్మ రక్షిస్తుందని కోరకూడదు. అమ్మవారికి ఉన్న నామాలలో వాంఛితార్థ ప్రదాయిని అన్న నామం కూడా ఉంది. అంటే కోరిన వాటిలో అర్థవంతమైనవాటిని ఇస్తుంది.
తనను శరణు కోరిన వారిని రక్షించే తల్లి పాదాలు పరమపూజ్యాలు.
కాబట్టి అమ్మవారికి అభయ ముద్ర, వరద ముద్ర పట్టనవసరము లేదని శంకరులవారు మనకు చెబుతున్నారు.
అమ్మ పాదాలు విడవక పట్టుకోవటమే సాధకులుగా మన పని అని శంకరులు మనకు చేసిన బోధగా గ్రహించి, సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ
No comments:
Post a Comment