సౌందర్యలహరి -ఆచారము- ఫలము
సౌందర్యలహరిని సమయాచారములో
ఆష్కరించారు శంకరులు. శ్రీవిద్యా స్వరూపమైన భగవతిని సేవించుకోవటానికి మనకు అందించిన స్తోత్రరాజ్యము సౌందర్యలహరి.
ప్రతిశ్లోకంలో నిగూఢముగా ఎన్నో రహస్యాలను పొందపరిచారు. భక్తితో ఈ శ్లోకాలను చదివితే మనకు ఆ మంత్రఫలితము దక్కుతుంది.
ఈ శ్లోకాలను చదువుకుంటే శ్రీవిద్యా ఉపాసనా పుణ్యఫలము కూడా దక్కుతుంది.
కారణం తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది కదా. అలాగే విద్య కూడా.
ఈ శ్లోకఫఠనము వలన బ్రహ్మవిద్యను కూడా పొందగలరు చదివినవారు.
శంకరులు తన పరమగురువులైన గౌడపాదులవారి ‘సుభగోదయస్తవము’ ను అనుసరించి సౌందర్యలహరి రచించారని చెబుతారు. అలా వారి పరమ గురువుల పరంపరను శంకరులు కొనసాగించారు.
గౌడపాదులవారు మాండుక్యోపనిషత్తుకు వ్రాసిన కారికలు లోకప్రసిద్ది. అలాగే ఆయన రచించిన ఈ సుభగోదయస్తవము కూడాను.
సౌందర్యలహరి శిఖిరినీ చందస్సు లో
రచించారు శంకరులు. శిఖరిణి వృత్తము ఒక కొండ ఎక్కుతున్నట్లుగా ఉంటుంది.
ఈ వృత్తములో ఉన్న ఆకర్షణ కూడా చాలా అద్భుతమైనది. అందుకే సౌందర్యలహరి చదువుతుంటే ఎంతో మనోహరంగా అనిపించి సంతోషపరుస్తుంది.
సాధకులకు ఉపాసన పండాలన్నా, అపరోక్షమవ్వాలన్నా అది సమయాచార పద్దతిలో కుదిరుతుందని శంకరులు సౌందర్యలహరితో చూపారు. ఆగమాలలో చూపిన ఉపాసనే సమయాచార పద్ధతి.
సమయాచార పద్ధతిలో శివపార్వతులకు అబేధము. వారికి పంచ సారూప్యాలను చెబుతారు.
అవి:
1నామ సారూప్యము, (శివ-శివాని,భవ-భవాని,ఈశ్వరుడు-ఈశ్వరి, కాళుడు-కాళీ, భైరవుడు-భైరవి ఇత్యాదివి)
2.రూప సారూప్యము,(మూడు కన్నులు, చంద్రవంక)
3.ఆయుద సారూప్యము(ధనస్సు, బాణము, అంకుశము, పాశము)
4.చేసే పనులు (సృష్టిస్థితిలయఅనుగ్రహ తిరోధానము )
5. ఆవాసము (కైలాసము, శ్రీచక్రములో బిందువులో ఇత్యాదివి)
ఇలా పంచ సారూప్యం ల చేత శివశక్తులను సమయులుగా చూపబడు సంప్రదాయము సమయాచారము.
సౌందర్యలహరి నామాన్ని సమర్ధన:
సత్చిత్ ఆనందమే అమ్మ స్వరూపముగా సౌందర్యలహరి మనకు కనపడుతుంది.
సౌందర్యలహరి, శ్రీవిద్యా స్వరూపమనటానికి మరో ఉదాహరణ శ్రీవిద్యకు సుందరీవిద్య అని మరోపేరు. సుందరీ విద్యే సౌందర్యలహరీ గా మారింది. స్త్రీ పురుషులకు తేడా లేక ఉండేది సర్వత్రా నిండి ఉండేది చైతన్యం. అమ్మవారు చిచ్ఛక్తి స్వరూపము. కాబట్టి సౌందర్యమైన చైతన్యమే అమ్మవారు కాబట్టి ఇది సౌందర్యలహరి.
ఆనందము సౌందర్యం. ఆ ఆనందము సదా నిలబడటమే సౌందర్యం. లౌకిక విషయాలను మించిన అసలు విషయమే సౌందర్యం. కాబట్టి ఇది సౌందర్యలహరి.
అమ్మవారి విద్యలో మహామంత్రం మూడు కూటములుగా ఉంటుంది. ఆ కూటములు వాగ్భవకూటమి, కామరాజకూటమి, శక్తికూటమి. ఈ మూడు కూటములను సూచిస్తూ సాగే మంత్రరాజ్యానికి అమ్మవారి బీజాక్షరముతో ముగుస్తుంది. ఆ మహాబీజానికి నాదం తీసేసి సౌందర్యానికి చివరన కలిపి సౌందర్యలహరి అని భగవద్పాదులవారు నామకరణం చేసి మనకు ప్రసాదించారు.
సౌందర్యలహరి ప్రతిశ్లోకానికీ ఒక యంత్రము, బీజాక్షరం, పూజ చేసే విధానము ప్రసాద వితరణ పద్ధతులున్నాయి. అవి గురువు ద్వారా మాత్రమే పొందాలని చెబుతారు. మనము తత్త్వం మీద దృష్టి పెట్టి హృదయంలో పరదేవతను ప్రతిష్ఠించుకొని ఈ శ్లోకాలు చదువుకుంటే ఆ భగవతి తప్పక ప్రసున్నురాలవుతుంది.
ఇక శ్లోకాలు తెలుసుకుందాము:
ప్రతి కావ్యానికీ మొదటి శ్లోకము ఎంతో ముఖ్యమైనది. ఇది ఎంతో ప్రధానమైన శ్లోకము. ఈ శ్లోకాన్ని నిత్యం చదువుకుంటే సాధకునికి కావలసినవి లభ్యమవుతాయని చెబుతారు.
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥
అర్థము:
తల్లీ భగవతి! శివుడు నీతో కూడి ఉన్నప్పుడే సమస్త సృష్టిని చేయగలుగుతున్నాడు. నీవు లేక పోతే కదలలేకపోతున్నాడు. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులచే పూజించబడు నిన్ను ఆరాధించడానికి, స్తుతించటానికి గానీ పుణ్యము చేయ్యని వాని వలన అవుతుందా?
తేటగీతి
శంకరుని యందు వ్యక్తమౌ శక్తివీవు/
సర్వ లోకాల చైతన్య ఝరివి నీవు/
బ్రహ్మ విష్ణువులు గనఁ సేవకులు నీకు /
కొలచెదను సంధ్యను శరణుఁ గోరి మదిని//
వివరణ:
1.అమ్మవారు పతివ్రత. ఆ తల్లి పూర్తి ఆసక్తిని చూరగొనాలంటే అమ్మవారిని రకరకాల నామాలతో కొలవటం కన్నా “శివ” అంటే ఆమె సంతోషముతో చూస్తుండట. అందుకే ఎంతో తెలివిగా శంకరులు ఎత్తుగడే “శివః” అంటూ మొదలెట్టారు.
2. అయ్యవారైన మహదేవుడు “అ” అన్న అక్షరముతో సూచించబడుతాడు. అమ్మవారు “ఇ”కారరూపిణి. శివలో ఇకారము తీసివేస్తే శవ గా మారుతుంది. శవమంటే జడము. నిర్జీవమైనది. అంటే ఈశ్వరి లేని శివుడు కదలలేడు. శివునిలోనైనా, సర్వ విశ్వములోనైనా ఉన్న చైతన్యశక్తి అమ్మవారే.
3.స్పందన శక్తి అంటే లోపలి కదలిక. స్వామి సత్ స్వరూపము. ఆయన కదలక మెదలక అలా నిశ్చలంగా ఉంటాడు. ఆయనలో ఈ ప్రపంచసృషి చెయ్యాలన్న కోరికనే స్పందన. ఆ స్వందనే శక్తి, అమ్మవారు.
4. హరిహరులు సర్వదేవతల శక్తీ అమ్మ నుంచే వస్తున్నది. అంటే దేవతలు తమ పనులు చేయటానికి అమ్మవారి మీదనే ఆధారపడ్డారని శంకరులు చెబుతున్నారు.
శ్రీవిద్యా ఉపాసకులు మనకు 14 మంది కనపడుతారు.
5. అయ్యవారు అవ్యక్తముకు, నిర్గణబ్రహ్మకు సంకేతము. వ్యక్తమవటం అమ్మవారి లక్షణము. అందుకే శివుడిని కొలచినా శివుడు వరమివ్వాలన్నా వ్యక్తమయ్యేది అమ్మద్వారానే. అమ్మను కొలిస్తే అమ్మ చూపేది అయ్యనే. అందుకే హరిహరవిరించులు అర్పించవలసినది అమ్మవారినే అన్న సూచక కూడా ఉంది.
రేపు మరికొంత ఆవిష్కరించుకుందాము.
అప్పటి వరకూ సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
మల్లాప్రగడ
No comments:
Post a Comment