సౌందర్యలహరి -3
అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥ 3 ॥
అర్థం
అమ్మా! నీ పాదము ల నుంచి వచ్చే పద్మపరాగం అజ్ఞానులకు సూర్యోదమైన పట్టణము వంటిది. మందబుద్ధులైన జడులకు జ్ఞానమిచ్చు తేనె ప్రవాహము.
దరిద్రులకు చింతమణుల వరసవంటింది. సంసారమన్న సాగరములో మునిగిన జనులకు ఆది వరహామూర్తి కోర వంటిది. (భూమి సముద్రములో మునిగిన నాడు మహావిష్ణువు వరాహావతారములో భూమిని తన కోరపై ఉంచుకొని పైకి తీసుకువచ్చాడు)
తేటగీతి॥
“జలధి సంసారమిది నెంచ జనులకిలన,
నీ పదములాశ్రయించిగ నెనది, సూర్య।
కాంతి వెలుగు, తొలగు నంధకార తమసు
కొలచెదను సంధ్యను శరణుఁగోరి మదిని॥
ఈ శ్లోకములో మనకు భగవద్పాదులవారు అమ్మవారి పాద ధూళి కణము గురించి మరింత చెబుతున్నారు.
ఈ శ్లోకము అత్యంత శక్తివంతమైన శ్లోకము. దీని రోజూ వెయి చొప్పున పన్నెండు రోజులు చేస్తే కోరినది జరుగుతుందని పెద్దలు చెబుతారు.
ఈ శ్లోకములో ఒక లెక్క మనకు భగవద్పాదుల వారు చెప్పారు. అదేమంటే ‘గుణనిక’ అన్నది.
ఇది ఒక లెక్క. చింతామణుల గుణనిక యట. అమ్మవారి పాద పరాగము. ఒక్క చింతామణి కోరిన కోరికలు తీరుస్తుందని చెబుతారు. మరి గుణనిక లెక్క ఏమిటీ? అంటే-
అక్షరమాల లోని అక్షరాలకు సంఖ్యలు వేసే ఒక పద్ధతి ఉంది. అది ప్రతి గుంపుకు 1 నుంచి9 తరువాత పది బదులు 0 వేస్తారు.
క-ఞ వరకు మొదటి గుంపు
ట - వ వరకు రెండవ గుంపు
ప-మ వరకు మరో సమూహము
య- హ వరకు చివరి సమూహము.
ఇప్పుడు గుణనికను మనము లెక్కిద్దాము:
గు అంటే ‘గ’ తీసుకోవాలి. క-1,ఖ-2, గ-3 కాబట్టి మొదట అంకె 3 అయింది.
ఇలా ‘ణ’ కు 5, ని అంటే న కాబట్టి 0, ‘క’ కి 1
ఇవి 3501 అయ్యాయి.
సంస్కృతభాషలో సంఖ్య చదివేటప్పుడు చివర నుంచి మొదటికి చదువుతారు. అష్టాదశమంటే (అష్ట అంటే ఎనిమిది, దశమంటే పది పూర్తిగా 8+10=18, చతుర్దశము 4+10 పద్నాలుగు అని ఇలా…) ఇత్యాదివి. కాబట్టి మనమిప్పుడు గుణనిక అంటే 1053 అని తెలుసుకున్నాము.
లలితా సహస్రనామాలను సంఖ్య వేసుకుంటూ చదివితే అవి 1053 నామాలవుతాయి. అవే చింతామణులు. లలితా నామాలు చింతామణులన్నమాట. అందు ఏ ఒక్క నామము తీసుకొని మనం అమ్మవారిని ఆరాధించినా మనకు అమ్మ చింతామణిలా కోరినది ఇచ్చి కోరని కైవల్యం కూడా తుదకు ఇస్తుంది. అందుకే లలితా సహస్రం పరమ శక్తివంతమైనది.
అవిద్య అతి పెద్ద అడ్డం. కటిక చీకటిలో ఉన్న వారికి ఏది ఎమిటో తెలియనట్లు, అజ్ఞానములో ఉన్న జనులకు తాము మాయలో కప్పబడి ఉన్నామని తెలుసుకోలేరు. కాని వారు పూర్వ పుణ్యము వలన ఆ జగదంబ పాదాలు పట్టుకున్నారంటే సూర్యోదయమైన సమయంలో చీకట్లు తొలిగి సర్వం ఎలా స్పష్టంగా అగుపిస్తుందో, అలా అజ్ఞానము వీడి ఆత్మజ్ఞానము కలుగుతుంది. అది అమ్మవారి పాదపద్మముల నుంచి పరాగము స్వీకరించినందు వలన. అంటే అమ్మ పాదములను ఆశ్రయించినందు వలననే.
జడులైన వారికి కదలిక ఉండదు. వారు అమ్మ పాదాలనాశ్రయించిననాడు జ్ఞానమన్న తెనేను పొంది మధురమైన స్వస్వరూప జ్ఞానము కలుగుతుంది.
సంసారమన్నది పంకము(బురద). జలధి (సముద్రం). అందులో ఉన్నవారు ఎంతకీ బయటపడలేరు. కానీ అమ్మ పదములు చింతన చేసే వారిని అమ్మ ఆదివరహుడు కోరలతో ఫృథ్విని తీసినట్లు తీసి బయటపడవేస్తుంది. అంటే ఈ జననమరణ చట్రం నుంచి తొలగిస్తుంది.
అత్యంత్య శక్తివంతమైన ఈ శ్లోకము చదువుకుంటూ అమ్మ పాదాల వద్ద నుంచి కుంకుమ ధరించివారికి సర్వ సౌభాగ్యాలు లభ్యమవుతాయి.
మునుపు అంటే దాదాపు పన్నెండేళ్ళ నాటి సంగతి, అప్పుడే చాగంటి వారి ఉపన్యాసాలు చాలా వినపడటం మొదలైయినాయి. ఆయన లలితా సహస్రం విన్నాము. ఆయనతో ఫోను కాల్ ప్రోగ్రామ్ మొదలెట్టారు ఆయన శిష్యులు.
ఆదివారం సమయంలో ఫోను చేస్తే ఆయన మాట్లాడుతారు అని చెప్పారు.
అప్పుడే సౌందర్యలహరి నేర్చుకుంటున్నాము. ఆయనకు ఫోను చేస్తే లైను కలిసింది. ఎంతో అప్యాయంగా కాకినాడకు పుట్టింటి వచ్చినట్లుగా రమ్మని పిలిచారాయన. అప్పుడు చెప్పిన విషయము, “ఈ శ్లోకం విడవక ధ్యానశ్లోకములా చదువుకో తల్లీ!” అన్నారు. అప్పుట్నుంచీ ఈ శ్లోకాన్ని మరింత ప్రియమైనదిగా చదవటం ప్రారంభించాము.
అమ్మ దివ్య అనుగ్రహము మనకు లభ్యమవటానికి దివ్యమైన శ్లోకాలను మనకు ప్రసాదించిన జగద్గురువులకు మరొక్క మారు ప్రణామాలు చేస్తూ
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
No comments:
Post a Comment