#Day9
శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి -8శ్లోకం
“సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే
శివాకారే మంచే పరమశివపర్యంక నిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీ”
అర్థం:
అమ్మా! సుధా సముద్ర మధ్యన కల్పవృక్షములచే నిండిన మణిమయద్వీపములో కడిమిచెట్లు (కదంబవృక్షాల)నడిమి చింతామణులు ఇటుకలుగా చేసి కట్టిన ఇంటిలో, శివాకార మంచంపై సదాశివుని తొడమీద జ్ఞానానంద తరంగస్వరూపముగా ఉన్న నిన్ను ధన్యులైన కొందరు మాత్రమే సేవించి తరించగలుగు తున్నారమ్మా…
తేగీ.
అమృత సాగరమున మణాంతరితమున,క
దంబవనపు చింతామణి ధామమందు
శివుని పర్యంకవాసిని స్థితము నీవు
కొలచెదను సంధ్యను శరణు గోరి మదిన “
వివరణ:
ఈ శ్లోకములో భగవద్పాదులు మనకు అమ్మ వారి అడ్రస్సు ఇస్తున్నారు. ఈ శ్లోకములో అమ్మవారిని అంతర్ముఖంగా ధ్యానించుకోవటానికి అవసరమైన చిరునామా చాలా స్పష్టంగా తెలుపుతున్నారు.
గూఢార్థం:
పాల సముద్రం అదే సుధా సింధువు. అది పిండాడములో ఉంది బ్రహ్మండాములో ఉంది. మన ఋషులు తమ దివ్యదృష్టితో చూసిన పాల సముద్రం నేడు మిల్కీవే అన్నారుకదా. అదేనా అంటే అదే కాదు సముద్రం అంటే అసంఖ్యాకమైన బిందువుల కలయిక.
‘సుస్ఠు దధాతి ఇతి సుధా’. అంటే అమృత స్వరూపము. మృత్యువు లేనిది సుధా. అంటే అమృతత్వం సముద్రంగా ఉన్నదట. అమ్మవారిని తలుచుకోవటమే అమృతం. ఆనందం. అనంతమైన ఆనందము అమ్మ స్ఫరణతో వస్తుంది.
మన మెదడులో ఉన్న అనేకానేక ఆలోచనా తరంగాల కడలి ఉంది. అది మనలో ఉన్న సుధా సాగరం.
సురవిటపి వాటీ పరివృతే అంటే, దేవతలు ఉండే లోకములో ఉన్న చెట్లు నడిమి. దేవతలున్న చోట ఉన్న చెట్లు కల్పవృక్షాలు.
కల్పవృక్షాల గురించి ముందు చెప్పటము ఎందుకంటే ముందు మనకు పై నుంచి చూస్తే చెట్లు కనపడుతాయి కదా. అందుకే మొదట కల్పవృక్షాలదీవి అని చెబుతున్నారు.
భావనోపనిషత్తులో చెబుతారు మన సంకల్పాలే కల్పవృక్షాలని.
మానవ దేహములో మనస్సు కల్పనలు చేస్తూ ఉంటుంది. పిండాండములో మన్ససు, బ్రహ్మండములో కల్పవృక్షాలు.
మణిద్వీపము అంటే మణుల అనగా రత్నాలు దీవిగా ఉన్నదట. ఆ మణులు స్వయం ప్రకాశములు. ప్రసార, ప్రచోద లక్షణాలు కలిగి ఉంటాయి. సర్వ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తుంది కూడా. అమ్మవారు స్వయం ప్రకాశవంతమైన మణుల ద్వీపంలో ఉందన్నమాట. ఇది మనలోని అంతఃస్పురణ, మేధాశక్తి, తేజస్సును సూచిస్తుంది.
దహరాకాశము మనలో ఉంది. ఈ దహరములో ఐదు క్రేందాలుంటాయి. వాటినే కడిమిచెట్లు అంటారు. అందుకే కడిమిచెట్లును మాత్రమే ఇక్కడ వాడారు. కడిమిచెట్లు వాతావరణములో తేమ తీసుకొని మబ్బుల నిర్మాణానికి సహకరిస్తాయిట. అది వర్షమై కురుస్తుంది. కడిమిచెట్లు అంటే కదంబవృక్షాల మధ్య ఉన్నదట.
చింతామణులు కోరిన కోరికలు తీర్చే మణులు.
ఇంటి ఇటుకలే ఇంతటి అనుగ్రహం కురిపిస్తుంటే ఇక ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలికి ఎంత కరుణ ఉండాలో కదా.
శివాకార మంచము, పరమశివపర్యంకము లోని గూఢార్థం చూస్తే అమ్మవారి మంచానికి కోళ్ళు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు. మన లోని కుండలినీ శక్తి పైకి సాగుతుంటే మూడు ముడులు తగులుతాయని మనకు అని లలితా సహస్రం చెబుతుంది.
బ్రహ్మ, విష్ణువు, రుద్రులు ఆ ముడులు, ఈ మంచాల కోళ్ళు. ఆజ్ఞా చక్రమందు మహేశ్వరుని స్థానము, అది మరో కోడు.
సహస్రారం లోని సదాశివుడు మంచము పైని దుప్పటిగా అమ్మవారి అయ్యవారి పర్యంకం
మీద నున్నదంటే, ఇక అక్కడ ఇద్దరులేరు అని భావము. కుండలిని శక్తి సహస్రారం చేరిన తరువాత అక్కడ మిగిలిఉండేది
శివశక్త్యైక రూపమే తప్ప ఒక్కటిగా లేరని చెబుతున్నారు.
అమ్మవారు సహస్రారంలో కూర్చుండగా ఆమె పాదాలు ఆజ్ఞా మీద నిలుస్తాయి. కాబట్టి భ్రూమధ్యం మీద దృష్టి నిలిపి, అమ్మపాదాల మీద ధ్యానము చేసిన వారికి సత్వర ఫలితాలు కలుగుతాయి.
విశ్వంలో మొదట ఒంటరిగా ఉన్న పరమశివుడిని బిందువుగా సూచించబడుతాడు. అంకమంటే ఉనికి. పర్యంకమంటే పరిపూర్ణమైన చోటు, లేదా విశాల విశ్వం తన నిలయముగా గలది. మన మనస్సులో దహరాకాశములో ఈ సర్వ ప్రపంచము ఇమడగలదు. మన దహరాకాశంలో అత్యంత సూక్ష్మంగా ఉన్నది అమ్మవారే!
ఈ అమ్మవారు చిదానందలహరి. లహరి అంటే తరంగం. అమ్మవారిని తలుచుకుంటే హృదయములో ఆనందం వృద్ధిచెంది మానసమంతా విస్తరిల్లి జ్ఞానానందముతో నిండిపోతుంది.
నిరంతరం ఇట్టి స్థితిలో ఉండటము యోగసిద్ధి. ఇటు వంటి స్థితిలో శ్వాస అన్న హంస మన మానస సరోవరములో నిలకడగా ఉంటుంది. ఈ రకంగా అమ్మవారిని ధ్యానించి ఆ స్థితిలో నిలచిన వారు కొందరే ఉంటారని భజంతి త్వాం ధన్యాః కతిచన అని చెప్పారు భగవద్పాదులు.
అమ్మవారిని అంతర్ముఖంగా ఎలా దర్శించుకోవాలో, ఎలా సాధన చెయ్యాలో మనకు ఎంతో సవివరంగా ఈ శ్లోకములో చెప్పిన జగద్గురువులకు మనం ఎంతో ఋణపడి ఉంటాము.
ఆజ్ఞా చక్రంలో తన పాదము నిలిపి, మానసములో నిలకడగా నిలిచి ఉన్న హంస యన్న జగదంబను ధ్యానిస్తూ ఆ ఆనందలహరిలో ఓలలాడుదాము.
సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ.
No comments:
Post a Comment