Thursday, 23 January 2025

#day13

 

శ్రీమాత్రేః నమః


సౌందర్యలహరి 12 శ్లోకం

”త్వదీయం సౌందర్యం తుహిక గిరికన్యే తులయితుం

కవీంద్రాం కల్పంతే కథమపి విరించి ప్రభృతయః

యదాలోకాత్సక్వాదమరలలనా యాంతి మనసా

తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్॥”

అర్థం:

అమ్మా! భగవతి! నీ సౌందర్యం చెప్పటానికి కవులలో శ్రేష్టులైన బ్రహ్మ, విష్ణువులకు చేతకాలేదు. దేవతా స్త్రీలైన రంభా, ఊర్వశులు నీ సౌందర్యం చూడలేక పరమశివుని కఠన తపస్సు ద్వారా పొంది నిన్ను చూడాలనుకుంటున్నారు.


తేగీ।।

అమ్మ సౌందర్యము పొగడ ఆత్మభువుడు

అంబుజాక్షులకును కాదు! అప్సరసలు।

సైతమూహింపను తరమే? శైల సుత ను

కొలచెదను, సంధ్యను శరణుకోరి మదిన॥


వివరణ:

అమ్మవారు సౌందర్యం వర్ణించటము అసాధ్యం.

వేదాలను సృష్టించిన, సరస్వతిని ధరించిన బ్రహ్మగారు సైతం అమ్మ వర్ణించ లేకపోతున్నారు. వశిన్యాది దేవతలు వాగ్దేవతలు. వారు కూడా అమ్మను వర్ణించినప్పుడు అమ్మ చేత సృష్టించబడిన ప్రపంచంలో వస్తువులకు అతీతమైన అనే ఉపమాన యత్నం చేశారు కాని వాటికి అతీతమైనది అమ్మ లావణ్యము. వశిన్యాది దేవతలు అమూల్యమైన అద్భుతమైన ప్రతి జీవిని, సౌందర్య సంబంధిత వస్తువును స్పృశించి దానిని అధిగమించి అమ్మవారి లక్షణాలు, గుణాలు ఉన్నాయని మాత్రమే స్తోత్రం చేశారు.

అంటే, చంద్రుని కన్నా ప్రకాశవంతమైన ముఖమన్నారు కాని అంతకు మించినది ఎలా చెప్పాలో తెలుసుకోలేకపోయారు. అమ్మవారు అందరి ఊహాశక్తికీ అతీతమైయున్నారు. ఆమెను సరిపోల్చగల పద సంపద లేదు. అమ్మవారు అక్షర స్వరూపం.


శంకరులు మొదటి శ్లోకాలలో అమ్మ పాదదర్శనం చేయించారు. అమ్మ స్మితవదనం గురించి చెప్పారు కానీ రూపదర్శనం చెయ్యలేము.

అమ్మవారి దయ పిల్లవాళ్ళకు తెలుసు. కాని అమ్మరూపం కేవలం అయ్యవారికి మాత్రమే తెలుసు. కారణం అమ్మ సదాశివపతివ్రత.

అమ్మను చూడాలంటే అతి దుర్లభమైన శివసాయుజ్యం పొందాలి.

దర్శనములో రహస్యము- దర్శనము అయిన తరువాత, దర్శించువారు, దర్శించబడునది, దర్శించు క్రియ అని మూడు రకాలుగా ఉండాలి. అంటే, దృశ్యము, ద్రష్ట, దృష్టి అని మూడు వేరుగా లేకుండా అంతా ఒకటై ఉన్నప్పుడు అనుభూతి మాత్రమే మిగులుతుంది.

అమ్మవారి సౌందర్యం కేవలం పరమశివునిలో సాయుజ్యం పొంది అమ్మవారిని దర్శించాలని కఠిన తపస్సు చేసి అప్సరసలు పరమశివుని ఐఖ్యమైతున్నారు. శివశక్తులలో ఐఖ్యమైన తరువాత మూడు లేవు. తిరిగి ఒకగా ఉన్నారు. అంటే అమ్మను హృదయంలో భావన చేస్తూ భావన ద్వారా మాత్రమే పొందగలమని జగద్గురువులు చెబుతున్నారు.

అమ్మ భావనామాత్రసంతృష్ట.

అమ్మ నామాలూ ఇదే చెబుతాయి. అమ్మను సదా ధ్యానిస్తూ, భావన చెయ్యటం ద్వారా అమ్మను పొందగలము.


సర్వం శ్రీమాతపాదాలకు సమర్పిస్తూ

No comments:

Post a Comment