Friday, 10 January 2025

#Day1



సౌందర్యలహరి

 

ఉపోద్ఘాతము

శ్రీమాత్రే నమః.

అమ్మవారి సాహిత్యం అపారం. అసలు అక్షరమే జగన్మాత స్వరూపము. జగత్తు పుట్టినది నాదము నుంచి. నాదము అక్షరమే. అక్షరమంటే క్షరము లేనిది, నాశనము అన్నది లేనిది. ఈ అక్షరాలన్నీ కూడా చెప్పేది పరమాత్మ గురించే. వీటినే వర్ణాలని కూడా అంటారు. వర్ణాలంటే అక్షరాలు, రంగులు కూడా. 

అన్నీ వర్ణాలు చెప్పేది ఆ దేవదేవి గురించే. అందుకే అమ్మవారిని మాతృకావర్ణరూపిణీ అంటారు. అన్నీ వర్ణాలు మంత్రమయమే. మంత్రాలన్నీ వర్ణాల కూడికే కదా. 

అమ్మవారి గురించిన సాహిత్యము అపారం. అది పూర్తిగా చదవటం, ఆకళింపు చేసుకోవటము ఈ జన్మకు సాధ్యమా అంటే సందేహమే. 

మునుపు వేదము పూర్తిగా నేర్చుకోవాలని ముని భరద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడట. 

బ్రహ్మ వరమిచ్చాడు “వేదం పూర్తిగా నేర్చేవరకూ జీవింతువుగాక!” అని. 

ఆ ముని వేదరాశిని చూసి భయపడిపోయాడట. ఇంతటి వేదరాశిని నేను నేర్వగలనా అని కృంగిపోయాడు. పరమేశ్వరుడు కృపాలుడై వైశంపాయనుడైన వ్యాసునిగా వచ్చి వేదాలను నాలుగు విభాగాలు చేసి నేర్పాడుట. ఇది గురుచరిత్రలో కథ. 

అలాగే అమ్మవారి సాహిత్యాన్నీ పూర్తిగా నేర్చిన ఘనులు, వేదవేత్తలూ, బ్రహ్మవేతలూ ఉన్నారా? అంటే సందేహమే సుమా! అంటారు పెద్దలు. అందుకే మనము గురువు వద్ద చేరి వారిచే ప్రభోదించబడిన మంత్రం పట్టుకు సాగుతుంటే ఈశ్వరే ఒకనాటికి కరుణిస్తుంది. 

ఇదే కదా ప్రపత్తి మార్గమంటే.

గురువై గతి చూపించేదీ, ప్రయత్నాన్ని చేయించేదీ, మోక్షానికి ఉపాయాన్ని (సాధన) చూపించేదీ సర్వమూ నీవేనని పూర్తిగా శరణువేడడమే ప్రపత్తి. 

భగవతి ప్రపత్తి మార్గ సులభ. సర్వకర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ, అహంకారాదులను త్యాగం చేయడమే అసలైన ప్రపత్తి. ఇలా ప్రపత్తిని చేసే వారిని 'ప్రపన్నులు' అంటారు. భక్తునికి ఉండవలసినది 'ప్రపన్నత'. 

కాబట్టి ప్రపన్నతతో వేడితే ఈశ్వరి మార్గం చూపుతుంది గురురూపములో. 

జగద్గురువులైన శంకరభగవద్పాదులు అలా ఈ ప్రజావళికి దయతో ఇచ్చిన అపూర్వ వరం ‘సౌందర్యలహరి’.

శంకరుల సాహిత్యము అపారము. ఆ సాహిత్యములో అత్యంత విశిష్టమైనది, విశేషమైనది, మంత్రమయమైనది, శక్తివంతమైనది, శ్రీవిద్యాఉపాసకులు పారాయణం చేసేది అయినది సౌందర్యలహరి. 

దీని గురించి మనకు ఒక కథ ప్రచారంలో ఉంది. శంకరులు ఒకనాడు సూక్ష్మరూపములో కైలాసం వెళ్ళారుట. అక్కడ అమ్మవారినీ, అయ్యవారినీ దర్శించుకున్నారు. మహాదేవుడు శంకరులకు ఐదు స్ఫటికలింగాలనిచ్చారుట. అమ్మవారు గొప్ప గ్రంథరాశిని చేతిలో పెట్టారు. 

ద్వారము వద్ద ఉన్న నంది ఆపి ఆ గ్రంధములో ముందుభాగమిచ్చి, వెనకభాగము దాచాడుట. 

శంకరులు ఖిన్నలై ధ్యానించగా అమ్మవారు శంకరులని ఆ భాగము పూరించమన్నారుట. అందుకే మొదటి 41 శ్లోకాలనూ ఆనందలహరీ అనీ, వెనుక 59 శ్లోకాలు శంకరులచే రచించబడినవి సౌందర్యలహరీ అనీ అన్నారు. 

సౌందర్యలహరి పూర్తిగా వంద శ్లోకాల మంత్రరాజ్యం. ఎన్నో బీజాక్షరాలు ఇందు నిభిడీకృమైనాయని, చదివిన వారికి అవి ఫలిస్తాయనీ చెబుతారు. 

ఈ శ్లోకాలు శ్రీవిద్యా రహస్యాలను చెప్పేవిగా ప్రసిద్ధి. ఎన్నిసార్లు చదివితే, అన్నీసార్లూ కొత్త అర్థాలను స్ఫరింపచేస్తాయని పూజ్యులు చెబుతారు. 

ఇందులో కుదిరితే పూర్తిగా కుదరకపోతే కనీసం కొన్ని శ్లోకాలైనా చదువుకుంటే వారి సర్వకామాలు తీరుతాయని పేరు. 

ఏది ఏమైనా అత్యంత్య శక్తివంతమైన సౌందర్యలహరి జగదంబ కృపన చదివి, పెద్దలు చెప్పిన అర్ధాలను స్వీకరించి, మనము అనుసంధానం చేసుకోవటానికి ఈ దివ్యమైన మార్గశిరం కన్నా పుణ్యకాలమేముంది? 

వైకుంఠఏకాదశి కన్నా దివ్యమైన రోజేముంది? 

ఇది ఆనందలహరీ, సౌందర్యలహరీ అని అంటారని చెప్పుకున్నాము కదా. 

మొదటి 41 శ్లోకాలలో కుండలినీ యోగము, షట్చక్ర వివరణ, తంత్ర మంత్ర యంత్ర రహస్యాలను వివరించారు. 

రెండవ భాగమైన సౌందర్యలహరిలో అమ్మ వర్ణనే కనపడుతుంది. 

వీటికి వ్యాఖ్యానాలు మనకు ఎన్నో కనపడుతాయి. వాటిలో డిండిమ వ్యాఖ్యా, లక్ష్మీధర వ్యాఖ్య, సుధావిద్యోతిని మొదలైనవి ముఖ్యమైనవి. 

ఇవి నేను చూడలేదు. కానీ GLNశాస్త్రిగారిది చదివాను. పూజ్యగురువుల ప్రవచము విన్నాను. కొన్ని రోజులు ఆలోచన చేసిన తరువాత నోట్సు వ్రాసుకోవాలని కోరిక కలిగింది. అమ్మ కృపన మనస్సుకు అంటిన కొన్ని అమ్మ పాదాల రేణువులును భక్తితో స్వీకరించి పంచుకుంటున్నాను. 

సౌందర్యలహరి, లలితా నామాలలా కథలా ఉండదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకము నిగూఢమైన అర్థాని ఇస్తూ అంతర్ముత్వనికి దారి చూపుతుంది. 

ఎంతో క్లిష్టమైన తత్త్వ విచారాన్ని శంకరభగవద్పాదులవారు అందమైన శిఖరిణీ వృత్తములో రచించారు. ఉపమా, రూపక, ఉత్ర్పేక్ష శబ్ధాలంకారాలతో శబ్ధ రమ్యతతో, కవితా శిల్పంతో చదువుతుంటేనే ఎంతో సంతోషం కలిగిస్తుంది. 

ఆ ఆనందమే లహరిలా ఉంటుంది. లహరి అంటే అల. అల అన్నది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. దివ్య మంగళ స్వరూపమైన జగదంబ సౌందర్యం నిరంతరం ఆనందకారణం. అలాగే ఈ కాలస్వరూపమైన అంబ ఆడుతున్న ఈ ఆట కూడా లహరే. ఇది నిరంతర ప్రక్రియే. 

సౌందర్యలహరి కావ్యం ప్రారంభం “శివః” అని మొదలయి, చివర “ ఇయమ్” అని పూర్తి అవుతుంది. 

శివఃఇయమ్ అంటే ఈమె శివుడు. ఈ పూర్తి కావ్యము ఆ విశేషాన్ని నిరూపిస్తూ నడుస్తుంటుంది. 

దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ శ్లోకాలను తెలుగు పద్యాలుగా మార్చుకోవాలని కోరిక కలిగింది. కొన్ని అలా వ్రాసుకొని పూజ్యగురువులకు చూపితే బావుందని నవ్వారు. ఇలాగే పూర్తి చెయ్యమన్ని ప్రోత్సహించారు. అవి మధ్యలో ఆగాయి. అని మళ్ళీ ఇప్పుడు పూర్తిచెయ్యాలను కోరిక కూడా కలిగింది. ఇలా రోజుకొకటి వ్రాసుకుంటే ఉత్తమమని తలిచింది. 

ప్రార్థన

1.

వందనమ్ములో జయ గణపతి, నమామి

ఈశ్వరి! జననీ! గురురూపిణీ! నమామి

పార్వతి, త్రిశతి సేవింతు పరి పరి విధి,

కొలిచెదను సంధ్యను శరణు గోరిమదిని।।

2.

శ్వేత వస్త్రమును ధరించి చేత వీణ

పుస్తకములతో తెల్లని పూలమాల

ముత్యపు మెరపు నగవుల మోము, వాణి

కొలచెదను సంధ్యను శరణుఁ గోరి మదిని

3

ఆదిగురువు మహేశ్వరుండనుచు పలికె

శంకరుని జగద్గురువుగ సంఘపరచె 

దేవిదాసు గురు కృపన దీక్ష నొఁస గె 

కొలచెదను సంధ్యను శరణ గోరి మదిన।।

4

తెలుగు నెంత నేర్చిన పద్యములు తెలియవు

నేడు గురు యాజుల దయన నేర్తు పద్య

విద్య, నడచి వచ్చిన వాణి వీరి రూపు

కొలచెదను సంధ్యను శరణు గోరి మదిన


సర్వం శ్రీమాతపాదాలకు సమర్పిస్తూ

మల్లాప్రగడ 


No comments:

Post a Comment