*వాక్చాతుర్యం*
➖➖➖
సాహితీ సంగీతప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి ఒక పేద పండితుడు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ కోట కావలి భటులు యేవో కారణాలు చెప్తూ అడ్డుకుంటూ వచ్చారు.
ఒకనాడు భోజరాజు ఊరిలోని
దేవాలయం దర్శించడానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు.
అక్కడి ఆలయంలోని వారందరికీ
ఆ పండితుడన్నా , ఆయన పాండిత్యం అన్నా అపారమైన గౌరవాభిమానాలు వున్నాయి.
మహారాజు పరమేశ్వరుని స్తుతిస్తుండగా, ఈ పేద పండితుడు మహారాజు వెనుకగా నిలబడ్డాడు.
అర్చకుడు దేవుడికి ఆరతి ఇస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా…
"గర్భగుడిలో పరమశివుడు లేడు" అని అరిచాడు.
వెనక నుండి వచ్చిన అరుపు విని మహారాజు ఉలిక్కిపడ్డాడు.
పండితుని వేపు వెనక్కి తిరిగి చూసి
"ఎందుకు అలా చెప్తున్నారు? దేవుడిని దూషించడం తప్పు అన్నట్టు ఖండిస్తూ అడిగాడు.
అందుకు ఆ పండితుడు "చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం నారాయణునికి యిచ్చి శంకరనారాయణు
డైనాడు. మరియొక సగాన్ని ధర్మపత్నికి యిచ్చి అర్ధనారీశ్వరుడైనాడు. అందుకే ఆయన చిహ్నంగా ఏదీ లేదని అంటున్నానన్నాడు.
"ఆయన శిరసున గంగ వున్నది కదా.." అని భోజరాజు అడిగాడు.
“గంగ సముద్రంలో కలిసి పోయింది.”
అన్నాడు పండితుడు.
వెంటనే మహారాజు ఝటాఝూట అలంకారమైన చంద్రుడు ఏమయ్యాడు? అని అడిగాడు. "చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడే వున్నాడు." అని అన్నాడు పండితుడు.
అప్పుడు భోజరాజు "అవేవీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా వుంటుంది.” అన్నాడు.
"అది కూడా లేదు. తన శక్తినంతా మీకు
యిచ్చివేశాడు .." అని అన్నాడు పండితుడు.
పండితుని నిందాచమత్కార సంభాషణ విని భోజమహారాజు , చిరునవ్వుతో "అన్నీ పోయినా కూడా ఆయన భిక్షాపాత్ర మాత్రం తప్పక ఆయన వద్దనే వుంటుంది" అన్నాడు.
పండితుడు అప్పుడు "ప్రభూ .. అది కూడా యిప్పుడు ఆయన వద్ద లేదు. దానిని పరమేశ్వరుడు నాకు యిచ్చివేశాడు."
ఈ సంభాషణ విన్న భోజరాజుకు పండితుని పేదతనం అర్ధం అయింది. ఆ పండితునికి ధనధాన్యాలు, అగ్రహారాలు దానం చేశాడు.
ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు.
ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తనలోని ప్రతిభను ఇతరులకు తెలియజెప్పడానికి తగిన లౌక్యం, వాక్చాతుర్యం కావాలి. తన వ్యక్తిత్వానికి భంగకరం కాకుండా తన గురించి తానే పొగుడుకోకుండా
తన గురించి చెప్పకనే అవతలివారు తెలుసుకోగల బుధ్ధి సూక్ష్మత కావాలి.
అలాటివారు ఏ మూలనున్నా రాణిస్తారు.
---
*300 ఏళ్ల క్రితం తిరుమల మార్గంలో శ్రీ కృష్ణదేవరాయలు త్రవ్వించిన చేదురుబావి*
• నేటికీ చెక్కు చెదరని వైభవం...
• శతాబ్దాలనాటి అపురూప కట్టడం
శ్రీవారి మెట్టు సమీపంలో పురాతన తటాకం
ఇప్పటికీ పుష్కలంగా జలం
మూడు శతాబ్దాల కిందటి చేదురుబావులు ఎలా ఉండేవో చూడాలని ఉందా? తరాలుమారినా, శతాబ్దాలు గడిచినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చెక్కు చెదరని నాటి అద్భుత రాతి కట్టడాన్ని చూడాలనుకుంటున్నారా? శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి నిర్మాణ కౌశల్యానికి నిదర్శనంగా, నేటికీ రాజఠీవితో నిలచిన దిగుడు బావిని చూడాలని ఉందా..! అయితే ఇంకెందుకు ఆలస్యం. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టుకు కాస్త ముందే కుడిపైపునకు వెళ్తే చాలు. ఈ పురాతన కట్టడం కనిపిస్తుంది.
వృత్తాకారంలో బావిని తొవ్వి, అందులోకి దిగడానికి వీలుగా.. వాలుగా మెట్టు నిర్మించి ఈ రెండు భాగాలను కలుపుతూ కట్టిన రాతి కట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిని ఏ కాలంలో.. ఎవరు నిర్మించారో స్పష్టంగా తెలియదు. అయితే, ఈ బావికి ఎదురుగా ఉన్న మండపంపై కన్నడ లిపిలో శాసనాలున్నాయి. వీటిని పరిష్కరిస్తే మండపం, తటాకం గురించి తెలుస్తాయి.
స్థానికంగా ఉన్న పెద్దల సమాచారం ప్రకారం ...
శ్రీకృష్ణదేవరాయలు తిరుమల యాత్రకు సంబంధించిన చారిత్రక ఆధారాల నేపథ్యంలో ఈ తటాకాన్ని ఆయన కాలంలో నిర్మించి ఉండొచ్చట. ఈ తటాకానికి ఎదురుగా రాతి మండపం ఉంది. ఇందులో నృసింహస్వామి విగ్రహం ఉండేదని, ఆ ఆలయానికి సంబంధించిన పుష్కరిణిగా ఈ తటాకం ఉండేదని స్థానికులు అంటున్నారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించిన ఎనిమిది సార్లు ఈ మార్గం గుండానే వెళ్లినందున ఆయనే నిర్మించారని అంటున్నారు.ఎవరు.. ఎప్పుడు నిర్మించారనేది పక్కన పెడితే.. 15 ఏళ్ల కిందట ఈ తటాకం వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద ముళ్ల పొదల మధ్య కప్పి కప్పబడి కనిపించకుండా పోయిన ఈ దిగుడు బావిని పార్వేటి ఉత్సవం సందర్భంగా స్థలం శుభ్రం చేసే క్రమంలో టీటీడీ బాగు చేసింది. బావి గట్టు చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు వేళ్లూని ఉన్నా కట్టడం కొంచెం కూడా చెక్కు చెదరకపోవడం గమనార్హం. తిరుపతి, చంద్రగిరి పరిసరాల్లో భూగర్భ జలాలు 500 అడుగుల లోతుకు వెళ్లినా 24 అడుగుల లోతున్న ఈ బావిలో పుష్కలంగా
నీళ్లున్నాయి. మోటారు పెట్టి తోడినా నీటి మట్టం తగ్గకపోవడం విశేషం. వీలైతే ఈసారి తిరుమలకు వెళ్లెప్పుడు తప్పక దర్శించండి.
ఓం నమో వేంకటేశాయా
[27/02, 6:35 am] +91 94404 88271: *జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర :*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
👉 ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.
*పురాణగాధ :*
👉 బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా, గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతున్నది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.
*ఆలయ విశేషాలు :*
👉 సరస్వతి ఆలయ గోపురము, వెనక సరస్వతి విగ్రహము బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.
*రవాణా సౌకర్యాలు :*
👉 హైదరాబాదు - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్, భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.
👉 సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.
👉 ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.
👉 మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ 'వేదవతి' (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం.
*పూజా విశేషాలు :*
👉 ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానుకలు సమర్పించే ఆచారము ఉంది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.
*దర్శన వేళలు :*
👉 ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.30 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.30 గంటల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.30 గంటల నుండి 12.30 గంటల వరకు అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.30 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.30 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.30 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3౦ గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.
*నవరాత్రులు :*
👉 ఆశ్వియజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహార్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికథలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ఆవు..పులి
ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.
ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.
దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.
అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.
ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.
కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,
" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,
నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..
అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది.
అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?? అంది.
అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,
"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?? అంది.
ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.
ఈ కథలో...
*ఆవు* - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.
*పులి* - అహంకారం నిండిఉన్న మనస్సు.
*యజమాని* - సద్గురువు/పరమాత్మ.
*బురదగుంట* - ఈ సంసారం/ప్రపంచం
మరియు,
*ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.
*నీతి :*
ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,
" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.
దీనినే ' *అహంకారము* ' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.
ఈ జగత్తులో *'సద్గురువు'*(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?? ఉండరు.
ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.
పరమాత్మా నీవే ఉన్నావు...!
అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!🙏🙏🙏శుభోదయం 🙏🙏🙏
........
*విచిత్రం... మనిషి తత్వం*
సృష్టిలోని ఒకే జాతికి చెందిన జీవులన్నీ ఒకే రకమైన లక్షణాలు, అలవాట్లు కలిగి ఉంటాయి. మనిషి తత్వం విచిత్రం. మనిషి ముఖం చూసి సన్మార్గుడో, దుర్మార్గుడో నిర్ణయించడం కష్టం. ఒకే ఆకారంలో కనిపించినా మనుషుల మధ్య గోముఖ వ్యాఘ్రాలుంటాయి.
జ్ఞానులు, అజ్ఞానులు, మంచివారు, చెడ్డవారు, శాకాహారులు-మాంసాహారులు, ధర్మవర్తనులు, అధర్మ చింతనులు, అమాయకులు-అహంకారులు, బుద్ధిమంతులు-బుద్ధిహీనులు వంటి వైరుధ్య స్వభావులు కలిసి తిరగగలగడం మానవజాతి ప్రత్యేకత.
మనిషికి పైకి కనిపించే చేతులు, కాళ్లు వంటి అవయవాలు- కంటికి కనిపించని మనసు, బుద్ధి ఆదేశానుసారం పనిచేస్తాయి. మాట నేర్చిన మనిషి మంచి మాటలు చెప్పగలడు. వితండవాదనా చేయగలడు. మనిషి తన భావనలతో ఏకీభవించినవారిని, మనసుకు నచ్చినవారిని ఆత్మీయులంటాడు. తనమాట కాదన్నవారిని శత్రువులుగా భావిస్తాడు.
నమ్మించి మోసం చేయడం, ప్రేమించి ద్వేషించడం, అభిమానిస్తూనే అనుమానించడం, మాటలతో కవ్వించడం, ఆవేశంతో కక్ష కట్టడం మనిషి నేర్చిన కళ. మనసు మాయకు లొంగిపోవడం మానవ బలహీనత. ప్రశాంతంగా జీవించగల శక్తియుతుడు అశాంతితో అలమటిస్తుంటాడు. నిలకడ లేని మనస్తత్వం మనిషి తత్వం.
మరుక్షణంలో జరగబోయేది తెలుసుకోలేనివాడు కాలాన్ని శాసించ గలనన్న భ్రమలో బతుకుతాడు. మంచిచెడుల విచక్షణ చేయగలవాడు చెడుమార్గాన్ని అనుసరించడానికి ఉత్సాహపడతాడు. హానికరమని తెలిసీ దుర్వ్యసనాలకు బానిసవుతాడు. స్వయంకృతాపరాధాలతో సతమతమవుతాడు. దుష్టులు, దురా త్ములైనవారి సంఖ్య పరిమితమై నందుకే ఈ జగత్తు ఇంకా నిలిచి ఉందని లోకాభిప్రాయం.
యుద్ధ భయంతో నిద్రపట్టక అలమటిస్తున్న ధృతరాష్ట్రుడికి సకల శాస్త్ర పండితుడు, నీతి కోవిదుడు, ధర్మవేత్త అయిన విదురుడే నీతి సూత్రాలు బోధించాడు. మానవ శరీరం ఒక రథం. దానికి ఆత్మ(బుద్ధి) సారథి. ఆ రథానికి అశ్వాలు ఇంద్రియాలు. జాగరూకతతో నిపుణుడైన ధీరుడు తనకు వశమైన గుర్రాలతో మహారథికుడిలా సుఖంగా జీవన ప్రయాణం సాగిస్తాడని, శిక్షణ పొందని అదుపులోకి రాని గుర్రాలు మార్గమధ్యంలో సారథిని కూలదోసినట్లు అదుపు కాని ఇంద్రియాలు మానవుణ్ని నాశనం చేస్తాయని విదురుడు బోధించాడు.
మాట్లాడటం కన్నా మౌనం మేలని, మాట్లాడితే సత్యం మాట్లాడటం రెట్టింపు మేలని, ఆ సత్యం ప్రియంగా పలకడం మూడు రెట్లు మేలని, ఆ సత్యం, ప్రియం ధర్మంతో కలిసి ఉంటే నాలుగు రెట్లు మేలని విదురుడు ఉపదేశించాడు.
వ్యక్తికి శీలం(సత్ప్రవర్తన) ముఖ్యం. శీలంతో ధర్మం తెలుస్తుంది. అసూయ లేనివాడు, ప్రజ్ఞ కలవాడు, సదా సత్కార్యాలు చేసేవాడు అందరికీ ఇష్టుడవుతాడని, ఉత్తమ పురుషుడు ఇతరులకు కీడు తలపెట్టక అందరి అభ్యున్నతిని కోరుకుంటాడని, మానవుడు ప్రయత్నపూర్వకంగా తన నడవడిని రక్షించుకోవాలన్న విదుర నీతిని అనుసరించి జీవన విధానాన్ని తీర్చిదిద్దుకునేవారు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతారనడంలో సందేహం లేదు.
విదురుడు సమగ్రంగా బోధించిన ధర్మ, న్యాయ, నీతి సూత్రాలను శ్రద్ధగా విన్న ధృతరాష్ట్రుడు పుత్ర వాత్సల్యానికి లోబడి కౌరవపాండవ యుద్ధాన్ని నివారించలేక కురువంశ నాశనానికి కారకుడయ్యాడు. జ్ఞానుల బోధనలను విని ఆచరించాలి. - ఇంద్రగంటి నరసింహమూర్తి
*వైశాఖ బుద్ధ పూర్ణిమ*
పరమ శాంతి పల్లవించే మనోహరమైన, దివ్యమైన పలుకులకు నెలవు- శాంతి స్వరూపుడు గౌతముడు. తల్లి పేరుతో చరిత్ర గతిని మార్చేశాడు. దివ్యమైన అంతరంగ ఆనంద తరంగాలు కనురెప్ప వాల్చకుండా అతడిని చూడగలిగే సామర్థ్యాన్ని మనకు ప్రసాదిస్తాయి. అతడి సన్నిధిని అనుభవించిన వారెందరో మహా చైతన్యపు లోతులు చూశారు.
అతడు ఊరూ పేరూ లేనివాడు కాదు. పేద కుటుంబంలో పస్తులున్నవాడు కాదు. రదాలు, పల్లకీలు, సేవకులు, వజ్రవైడూర్యాలతో తులతూగే మహా చక్రవర్తి కుమారుడు. ఆ స్థితి అతడికి తృణప్రాయం. అందుకే అన్నీ వదిలేశాడు. నిరాడంబరుడై, నిత్యం భిక్షాటన చేస్తూ, ముప్పై ఏళ్లకే దివ్య జ్ఞానం పొంది, తరువాత మరో ఏబై ఏళ్లు బతికాడు.. కాలి నడకన వేల మైళ్లు తిరిగాడు. దుఖ నివారణ మార్గం కనుగొన్నాడు. మానవాళికి శాశ్వత శాంతి బాటను ప్రసాదించాడు. అతడే తొలుత సిద్ధార్ధుడు తరువాత బుద్ధుడు. వైశాఖ పూర్ణిమ రోజున అతడు భూమి మీదకు వచ్చి, మళ్ళీ అదే రోజున భూమికి శరీరాన్ని అర్పించాడు. బుద్ధుడు, అతడి శిష్యులు, ప్రతి సంవత్సరం అష్టాంగ యోగ మార్గం గురించి చర్చించి, ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం. చెయ్యడానికి బుద్ధుడి నిర్యాణం తరువాత ఒక సంఘం ఏర్పడింది.. ఒక శతాబ్దం తరవాత మరో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుడి బోధనలను ప్రచారం చేశాయి.
ఒకరోజు బుద్ధ భగవానుడు బిక్షాటన చేస్తూ ఓ ఇంటి ముందు నిలబడ్డాడు. రుసరుసలాడుతూ. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇల్లాలు. ఎదురుగా నిలబడి ఉన్న బుద్దుడిని ఇలా అడుక్కోకపోతే ఏదైనా పనీ పాటా చేసుకుని బతకవచ్చుగా.... నీవు సోమరిగా తయారవడమే కాకుండా నీ శిష్యులని చెప్పుకొంటున్న వీరిని కూడా సోమరులుగా తయారుచేస్తున్నావని తెచ్చింది. బుద్ధుడు చిరునవ్వుతో ఆమె పరుష వాక్కుల్ని విన్నాడు. కానీ, ఏమీ అనలేదు. పట్టరాని కోపంతో ఊగిపోతున్న శిష్యులను చూసి వారించాడు.
తరవాత ప్రసన్నవదనంతో, మాతా చిన్న సంశయం తీరుస్తారా?' అన్నాడు. అందుకు ఆమె "సరే... చెప్పు " అంది. బుద్ధుడు తన చేతిలోని విక్షాపాత్రను చూపుతూ తల్లీ నేను నీకు ఓ వస్తువును ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తే ఎవరికి చెందుతుంది... అని ప్రశ్నించాడు. అందుకు ఆమె 'నేను తీసుకోకుండా తిరస్కరించాను కాబట్టి, ఆ 'వస్తువు నీకే చెందుతుంది' అని వేళాకోళంగా బదులిచ్చింది.
'అయితే... తల్లీ! నేను నీ తిట్లను స్వీకరించడం లేదు' అన్నాడు. ఆమె తన తప్పును తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది.
ఈ సంఘటనతో బుద్ధుడు గొప్ప ధర్మాన్ని బోధించాడు. మంచి చేసేటప్పుడు కూడా మనల్ని అవమానించేవాళ్లు, వేళాకోళం చేసేవాళ్లు చుట్టూ చాలామంది ఉంటారు. కొందరు బహిరంగంగా విమర్శిస్తే, ఇంకొందరు చాటుగా విమర్శిస్తుంటారు. వాటిని మనం పట్టించుకోనంత వరకు మన దారిలో ఎలాంటి ఆటంకాలూ
ఉండవు. ఎప్పుడైతే వాటిని పట్టించుకుని బాధపడతామో.. ఇక ముందుకు వెళ్ళలేం. విమర్శ హృదయాన్ని బాధించేలా కాక మనసును ఆలోచింపజేసేదిగా ఉండాలి. బుద్ధుడి మార్గంలో జనన మరణాలు చైతన్య స్థాయిలో భేదాలు. సాధకుడు అష్టాంగ యోగ మార్గంలో సాధన చేసి, నిర్వాణం పొందగలరు. అత్యుత్తమమైన ప్రశాంతిని అనుభవించగలడు. ఎక్కడా, ఎవరినీ వ్యక్తిగత ఆరాధన చేయనవసరం లేదు. అప్పోడిపోభవ అని చెప్పారు. అంటే, ఎవరికి వారే వెలుగై దారిచూపాలి?
- ఆనందసాయి స్వామి
-----*🍁ఎవరికీ మోక్షం*🍁
🙏త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.
‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.
‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్తి.
స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.
విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.
‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు. ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.
‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.
ఈ పరిపక్వత మన అందరిలో వచ్చినప్పుడే మనం నిజమైన స్వామీ భక్తులం అవుతాము🤘
----[
పితృదోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం..
పితృదోషం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను
వంశపారంపర్యంగా అనుభవించటానికి
మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...
అలాగే,తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.
పితృ దోషం నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.
*స్మశాన నారాయణుడిని* ప్రసన్నం చేసుకోవడమే ...
అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.
1. కాశీ
2. పాపనాశి ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)
అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .
అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.
స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....
పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు .
స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.
ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును )
అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.
ఈ ఆలయ ప్రాముఖ్యము తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..
చేరుకొనే విధానం:
అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "
ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!
*🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏*
-----
[12/06, 6:38 pm] Mallapragada Sridevi: 🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴
"ఇప్పుడున్న చీకటిని కాదు,
రేపు వచ్చే ఉదయం కోసం
వేచిచూడు"
- నేతాజీ.🪴🪴
ఏ వస్తువైనా,బంధమైనా రెండు
సార్లు అందంగా కనిపిస్తుంది.
ఒకటి దొరికినపుడు
రెండు పోగొట్టుకున్నపుడు.
ఎందుకంటే
ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.
పోయాక ఎంత ఆరాటపడ్డా దొరకదు.🪴🪴
సులువుగా వచ్చినది ఏదైనా
విలువ తక్కువ
కష్టించి సంపాదించిన దానికి
విలువ ఎక్కువ.🪴🪴
చీకటి గుండా వెళ్తున్నప్పుడు
కాంతి గమ్యంగా ఉంటుంది.
మరి కాంతి గుండావెళ్తున్నపుడో!
- హిలేరి జెల్లాక్.🪴🪴
శరీరఛాయ చూసి గర్వపడకు
చీకటిలో అందరి రంగు ఒక్కటే,
నీ సంపాదనను చూసిఎగసిపడకు
మృత్యువు ఒడిలో అందరూ
ఒక్కటే..🪴🪴
తప్పు చేసిన వారికి ఒక అవకాశం
ఇవ్వు సరిదిద్దుకుంటారు...
మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ
నీ జీవితంలో చోటివ్వకు.
- పటేల్ 🪴🪴
పంచదార తియ్యగా వుందని
ఎక్కువగా తినడం ఆరోగ్యానికి
హానికరం. అలాగే మనుషుల
మాటలు తియ్యగా వున్నాయని
నీ బలం,బలహీనతలు అన్నీ
పంచుకోవడం కూడ
జీవితానికి హానికరం.🪴🪴
మాట వినపడనివాడు
చెవిటివాడు కాదు.
మంచిమాట వినిపించుకోనివాడు
నిజమైన చెవిటివాడు.
- ఆది శంకరాచార్య!🪴🪴
ఈ ప్రపంచంలో మనం
కొనుక్కోలేనిది ఏదైనా ఉంది
అంటే..! అది గౌరవమే...
దాన్ని సంపాదించుకోవాలే తప్ప
పేరుతోనో, డబ్బుతోనో,
పరపతితోనో కొనుక్కోలేము...!
- సర్వేపల్లి రాధాకృష్ణన్🪴🪴
విరిగిపోయిన పాలతో చేసే
పదార్థాలకి
నలిగిపోయిన మనసుతో చేసిన
ఆలోచనలకి విలువ ఎక్కువ.
🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴
No comments:
Post a Comment