చదువుల తల్లిగ పాఠము
విధిననుసరిగా మనసగు విద్యల నే త్రీ
హృదయము నీదియు నీదయ
పదముల కరుణా కటాక్ష కామాక్షి యనన్
చదువుల తల్లిగ పాఠము
విధిననుసరిగా మనసగు విద్యల నే త్రీ
హృదయము నీదియు నీదయ
పదముల కరుణా కటాక్ష కామాక్షి యనన్
ౘలిమలరాయనిపట్టికి
ౘలువవెలుఁగులనిడునట్టి చంద్రుని ముఖికిన్
కలువలసొగసులనగవునుఁ
గలిగిన విరజకు నతులివె కళ్యాణికిన్ !!! "
శుభ కరుణా హృదయమ్మగు
ప్రభువు కన్నారచూచి పరిమళమనే
ప్రభలై ఆఘ్రానించుచు
ప్రాభవ మే సుఖ విషమ్ము పాలన శంభో
లెక్కలు చూపక నుండిడి
చిక్కులు యున్నటి మహత్తు చింతల తెచ్చేన్
చక్కగ చేయని నాయక
నిక్కపు నటనల కదలిక నిలవని కళలన్
కం//.. ఉసిగొల్పు భావమెపుడును
వసుధకు క్షేమమ్ము కాదు వైరుద్ధ్యంబౌ
మసిబాఱని మానవతయె
వసివాడని వైభవమును వరముగ నిలుపున్ !
నిన్నును నిన్ను నిన్ను మరి నీడల వెల్గుల విద్య లవ్వుటే
మన్నన పొందగల్గుటయు మాటల నేర్పుయు నిత్య మవ్వుటే
నున్నటి గీత భావమగు నూతన లక్ష్యము ధర్మ మవ్వుటే
కన్నుల తీర్పు లేలుటయు కాల ము నందున సర్వ మవ్వుటే
యోగము వాణి పలుకుగా
రాగము శ్రీకరమగుటయు రమ్యపు భక్తిన్
వేగము వేదపు తత్వము
తీగలు లేనట్టి వీణ తీయగ బలికెన్
*రామా మాటలు మధురము*
*రామా మార్గమున సాగ రక్షణ గతియున్*
*రామా చూపులు చాలును*
*రామా రామా యనినను రమ్యత గలుగున్*!!
కష్టంలో కలిసుంటూ
నష్టంలో సహకరిస్తు నమ్మక గుణమై
ఇష్టంగా సతి పతిగా
ఇష్టం నిజమైన తృప్తి నిశ్చయ ప్రేమే
కం. గురుపదమే జ్ఞానం బిడి
గురుతరశక్తిన్ నడుపుచు గుణముల నొసగున్
గురుకరుణల గురియుచు మది
గురుభక్తి నొసంగుచుండు గూఢత నెపుడున్||
ఊహ తుంచి వదలి ఊయల లత కదలి కే
స్నేహ వాడి పోవు సిద్ధి పరిమళ మవకే
ఊహ ఏడ్పు కెరట ఉజ్వలమగు మనసు కే
స్నేహ గుండె ఘటన శీఘ్ర ప్రేమ కళలు కే
విరాజిల్లే బ్రహ్మాదిముని ఋషి సిద్ధా కనులాయే
శ్వరా క్రీడా యానందపు జనని స్వేచ్చా మనసాయే
హరా యాటే కాలమ్ము కనులగు హవ్యా భవమాయే
శరా ధీరత్వమ్మున్ సకలవిధి శంభో మహదేవా
ప్రాంజలి ప్రభ
** మంచి మాట మహత్యమే మహద్భాగ్యమౌ
మానవత్వమ్ముయే మానస తత్వమౌ **
తరుణి సమయమౌను తృప్తి పర్చుకళయే
అమ్మవాత్సల్యమే యా నంద పర్చుటే
తల్లి సంకల్పమే తన్మయ పర్చటే
మాతృ వందనముయే మానవ తీర్పుయే
నిన్నని తలవకు నిజమగు ధర్మమే
రేపుని అడుగకు రెప్పజయ కర్మమే
నేటిని మరువకు నీడయు సత్యమే
మంచిని మానకు మానస మర్మమే
నీతిని వదలకు నిర్మల బ్రతుకుయే
ధర్మము వీడకు దానము మలుపుయే
చెడు తలపే కామ చేష్ట గమణము యే
మోసము నేర్వకు మోహ గ్రాహ్యమ్ముయే
పగనునే పంచకు పాఠమ్మగు గతియే
పెద్దల బాధింప పిచ్చి గమ్య మదియే
వృద్ధుల నొప్పింప వృక్షయేడ్పు మదియే
అంధుల వేధింపు ఆశ పాశమదియే
కన్నవారినిగను కలహించకు మదిలో
అర్ధాంగినిగనుమా అనుమానించకు మదిలో
బాంధవ్యాలనుజూడు ప్రత్యేకము మదిలో
మూగజీవుల హింస ముప్పు యగు మదిలో
ప్రకృతి హరించకు ప్రతిభను జూపు టే
ప్రేమించు మదిని ప్రీతి కల్పించుటే
భగవంతుని మదిలో భక్తిని పంచుటే
ధ్వేషించకు ఎవర్ని దీనత్వ తలచుటే
*****
🕉 శ్రీ గం గం గం గణపతే నమః
కం. కరుణారసభర మూర్తీ
వరదాభయదాయకుండ వరవిఘ్నేశా
శరణంబీవని దలచుచు
చరణంబుల మ్రొక్కుచుంటి చల్లగనేలన్||
పూరణ మదివేదన లే
ధారణ సుఖవాంఛలన్ని దారులుజూపే
తీరుగ దాహము తోడై
చేరువ చెలిమియు విశాల చిత్తపు శోభల్
ధ్యానం గా జీవితమే
ప్రాణంగా చరితలోన పాఠము తెలిపే
మౌనంగాగతి మతిగా
మానం ప్రణయాక్షరమ్ము మానస మగుటే
నవ్వుల మగువల తెగువలు
గువ్వల వలె కళకళలగు గూటిన కూడన్
కవ్వింపు హృదయ కదలిక
పువ్వుల సువాసనలల్లె పుడమిన చేరెన్
గడిపేద్దామా క్షణమై
తడిపొడి తపన కళ యూహ తన్మయ మగుటన్
విడివడి కనుల కలగలుపు
తడి యారెమదీయ భావ తత్త్వపు శోభల్
రమ్మని పిలుపే రసమయ
మిమ్మని తలపే పిలుపుల పీఠము మదిగన్
కమ్మని రాత్రుల మనుగడ
నిమ్మకు నీరేత్తువిధియు నీడగ బ్రతుకున్
****
------ శుభోదయం ---- సుభాషితాలు -------
సరసిజ నిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఙే
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం !
ప్రళయంబు గల్పించి పాడు జేయుదు నీవె సృష్టియంచని పుట్టజేతునీవె
మాయయంచని కన్ను మూయగజేయుదు వీవె నిజమని గనుపించు నజుఁడు నీవె
పండితుల్ వచియించు పరతత్వ మది నీవె యాజ్ఞాను లెరుగని యదియు నీవె
పాప పుణ్యము నీవె ఫలము,గష్టము నీవె జీవుడను వాని జీవ మీవె
ఏడ్చువాడవు, పరులను నేడ్చునట్లు
జేయువాడవు నీవంచు జెప్పుజ్ఞాని
యిట్టి తత్వంబు మాబోంట్ల కెట్టు లెఱుక
రమ్యగుణసాంద్ర! శ్రీరఘురామచంద్ర!
అది పయోధి దోషమడుగున మణులిడి
తృణగణమ్ము తల ధరించుటనిన
మణుల విలువ పోదు తృణముల కది రాదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! ౧౯
దీనుండై నను శాత్రవు
డైనన్ శరణనుచు వేడునపుడు ప్రియత న
మ్మానవుని కోర్కె దీర్చిన
వాని సుజనుడాండ్రుబుధులు వసుధ కుమారా!
.
ఓ కుమారా! దీనుండై శరణు గోరి వచ్చినవాడు శత్రువైననూ, ఆతని ప్రయోజనమును ప్రేమతో నెరవేర్చినచో అతనిని జూచి పండితులు సుజనుడని పొగడుదురు.
చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు
కడకు మొదటి కులము చెడినయట్లు
పాపమొకటి గలదు ఫలమేమి లేదయా!
విశ్వదాభిరామ వినురవేమ!
అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిదిఅంటున్నాడు వేమన.
పూచిన ప్రతి కొత్తపూవు
నోచు కొనదు పిందె జన్మ
నాయన పర్వమైనంతనె
నాల్క కెక్కబోదు ఫలము
గుణమున్నదొ లేదో నది
కనుగొనవలిసినది జగతి
అంతదాక నరుని కర్మ
కహం తత్వముండరాదు
(కవిత:-మిరియాల రామకృష్ణ )
దీపములేని యిల్లు నుపదేశము లేని జపంబు, మంజులా
లాపములేని కావ్యము. విలాసములేని వధూటి; విక్రమా
టోపములేని భూపతి; పటుత్వము లేని యురోజపాపాళి ; ప్ర
స్తాపము లేని మాటలు; వృత్తాలు సదాశివసద్గురుప్రభూ!
ఆరోగ్యం, దృఢ గాత్రత్వం
అనృణ్య మఘమోచనం
అపారవశ్యం నైశ్చింత్యం
ఆస్తిక్యం స్వర్గమేవహి
తా:-- ఆరోగ్యం, దృఢత్వం, ఋణం లేకపోవడం, పాపవిముక్తి, పరాధీనత లేకపోవడం,
నిశ్చింతత, ఆస్తికత, యివన్నీ సాక్షాత్తూ స్వర్గమే ; అనగా ఏ లక్షణాలన్నీ గలవారికి ఈ లోకమే స్వర్గతుల్యమని భావము.
అర్థా గృహే నివర్తన్తి స్మ శానే మిత్ర బాంధవా
సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మను గచ్చతి
అర్థము:--మనము చనిపోయినప్పుడు ధనము యింటి వద్దనే వుంటుంది, బంధుమిత్రులు
స్మశానము వరకే వస్తారు. మనము చేసిన పాప పుణ్యాలే మన వెంట వస్తాయి.
అభ్యాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ
ఉద్యోగాను సారిణీ లక్ష్మీ
ఫలం భాగ్యాను సారిణీ
అర్థము:ఎప్పుడూ చదువుతూ ఉంటేనే విద్యలు అబ్బుతాయి.
బుద్ధి మన కర్మ ననుసరించి కలుగుతుంది.
ఉద్యోగము చేయడము వల్ల డబ్బు వస్తుంది.
ఫలము ఎప్పుడూ మన అదృష్టమును బట్టి కలుగుతుంది.
సుఖార్థీ త్యజతే విద్యాం
విద్యార్థీ త్యజతే సుఖం
సుఖార్తినః కుతో విద్యా
కుతో విద్యార్తినః సుఖం.
అర్థము:సుఖము ను కోరువాడు విద్యను వదులుకోవల్సిందే.
విద్య కావలిసిన వాడు సుఖాన్ని వదులు కోవలిసిందే. సుఖార్థు లకు .విద్య ఎందుకు?విద్యార్థులకు సుఖము ఎక్కడ?
ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ
పురా వృద్ధి ముపైతి పశ్చాత్
దివాస్య పూర్వార్థ పరార్థ భిన్నా
చాయేన మైత్రీ ఖల సజ్జనానామ్ (భర్తృహరి సుభాషితము)
మొదట జూసిన గడు గొప్ప పిదప గురుచ
యాది కొంచము తర్వాత నదిక మగుచు
దనరు దిన పూర్వ పరిభాగ జనితమైన
చ్చాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి.(ఏనుగు లక్ష్మణ కవి అనువాదము)
అర్థము: దుర్మార్గులతో స్నేహము ఉదయకాలపు నీడ వలె ముందు పెద్దగ యుండి క్రమముగా క్షీణించి పోవును. సజ్జనుల తోడి మైత్రి సాయంకాలపు నీడ వలె ముందు చిన్నదిగా యుండి క్రమముగా వృద్ది
పొందును. కావున ఈ రెండింటి లో యుక్తమైన దానిని బుద్దిమంతులు పొంద వలెను.
తనువే నిత్యముగానొనర్చు మది లేదా, చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు, మీ గతుల రెంటన్నేర్పు లేకున్న లే
దని నాకిప్పుడెచెప్పు; చేయఁగల కార్యంబున్న సంసేవఁజే
సి నినుంగాంచెదఁగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నాకు ఈ తనువును శాశ్వతమొనర్పుము, లేక మఱొక్క జన్మమైనా లేకుండుగా నిశ్చయించుము. ఈ రెండు పనులు చేయకున్న నాకు నీ పాద నిరంతరధ్యానము ఎబ్భంగి కలుగునో వచింపు ప్రభో!
చిన్నారులకై బద్దెన
వెన్నల వలే చిలికి నుడులవిందులు గూర్చెన్
పన్నీటి జల్లెనేటికి
అన్నా సుమతీ శతమ్ము నారాధ్యమెరా!
స్వల్ప మపి దీప కణికా బహుళం నాశ యే త్తమః
స్వల్పేపి బోధో నిబిడం బహుళం నాశయేత్తమః
అర్థము:-- దీపము ఎంత చిన్న దైనను చీకట్లను పోగొట్టునట్లు ఉత్తమ గురువుల బోధనలు ఎంత కొద్దిగా ఉన్ననూ
అంతకంటే గొప్పదైన అజ్ఞానమనే చీకట్లను నశింప జేయును. (గ్రహించే శక్తి గల శిష్యునీకె యిది వర్తించును)
పద్యమ్ము నెవడు రా పాతి పెట్టెద నంచు ఉన్మాది యై ప్రేలుచున్నవాడు
పద్యమ్ము నెవడు రా పారవేయుదు నంచు వెర్రి వాడై విర్ర వీగువాడు
పద్యమ్ము ఫలము రా పాతి పెట్టిన యంత యది పెద్ద వృక్షమై పండ్లు వేవేల నొసగు
పద్యమ్ము నెన్నడో పాతి పెట్టితిమి మేము లోకుల హృదయాల లోతులందు (గరిమెళ్ళ వరప్రసాద్ శతావధాని)
పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట
పద్యమన్నది తెలుగింటి పాడిపంట
పద్య మన్నది ఇంటింట పండు నంట కవిత,
పద్యమ్మన్న మీకేల కడుపు మంట (గరికిపాటి నరసింహారావు సహస్రావధాని)
ఇంచుక మాయలేక మదినెన్నడు బాయని భక్తి తోడ వ
ర్తించుచు నెవ్వఁడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సే
వించు, నతడెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో
దంచితమైన యా హరి మహాద్భుత కర్మ మార్గముల్!
కరినేలింది హుళక్కి, ద్రౌపదికి కోకల్ తెచ్చి యిచ్చింది ద
బ్బర, కాకాసురునిన్ కటాక్షమున బ్రోచిందెల్లబధ్ధ, మహో!
శరణన్నన్ పగవాని తమ్మునికి రాజ్యం బిచ్చుటల్ కల్ల! యి
త్తరి నన్నేలిన నిక్కమీ కధలు అనంతా! భావ నారాయణా!
ఈ మత్తేభం రచించిన కవి ఎవరో తెలీదు. అనంతా! భావనారాయణా! అన్న మకుటంతో రాసిన శతకంలోది అని పెద్ద వాళ్ళు చెప్పగా వినడం.
గజేంద్రుడిని, ద్రౌపదిని,కాకాసురుని, విభీషణుని నువ్వు కాపాడావని చెప్తారు.
కానీ, ఇప్పుడు నన్ను కాపాడితేనే ఈ కధలన్నీ నిజమని నమ్ముతానంటూ భగవంతుడినే బెదిరిస్తున్నాడీ భక్తుడు.
తనమది దోషము గల్గిన
దన కందరయందుగూడ దప్పేదోచున్
దనకనుల పసరు గప్పిన
గనపడు గదయెల్ల పసరుగగాగను కృష్ణా !
శ్లో. ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్
సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్ ।
భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్
న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్ ॥ (3)
చ. మకర ముఖాంతరస్థ మగుమానికమున్ బెకలింపవచ్చుఁ బా
యక దలదూర్మి కానికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమునఁ బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరికిన్.
భా. మొసలినోట్లోని రత్నాన్ని బయటకుతీయవచ్చు, నిరంతము పెద్దపెద్ద అలలు ఎగససిపడే సముద్రాన్ని
సైతమూ దాటవచ్చు, పామును సైతము నెత్తిమీద పూలచెండులాగా ధరింపవచ్చు. కాని, మూర్ఖునితో
మాత్రమూ అతని మనసు తెలుసుకొని మసలుకోవటం ఎవరికీ సాధ్యము కాదు.
శ్లో. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్
పిబేచ్చ మృగ తృష్ణికాసు సలిలం పిపాసార్దితః ।
కదాచిదపి పర్యటన్ శశ విషాణమాసాదయేత్
న తు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్ ॥ (4)
తే.గీ. తివిరి యిసుమునఁ దైలంబు దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
భా. కష్టపడి(ప్రయత్నించి) ఇసుక నుండి నూనె పిండవచ్చు, ఎండమావులనుండి నీరు సంపాదించి త్రాగవచ్చు,
వెదకి వెదకి కొమ్ములున్న కుందేలు పట్టుకొని కొమ్మును సాదించవచ్చు. కాని, మూర్ఖుల మనసును మాత్రము సమాధానపర్చలేము (సంతోషపెట్టలేము). లౌకింగా అసాధ్యమైన పనులన్నా సుసాధ్యమౌతాయేమో కాని, మూర్ఖున్ని మార్చటం మాత్రము అంత తేలికకాదు.
చేసిన దుష్ట చేష్ట నేర్పున గప్పిపుచ్చి తా
మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై
పూసిన బంగరు౦ జెరిగిపోవ గడఁగిన నాడు నాటికిన్
దాసిన రాగి గానబడదా జనులెల్ల నెఱుంగ భాస్కరా!
తా:-- తాను చేసినట్టు దుర్మార్గపు పని ఎంత నేర్పుగా కప్పి మూసి పెట్టినా ఎప్పుడో నొకప్పుడు బయట పడుతుంది. ఎట్లయితే రాగి మీద బంగారు పూతపూసి పెట్టిన కొంతకాలానికి బంగారు చెరిగి పోయి రాగి బయట పడినప్పుడైనా అందరికీ తెలిసి పోతుంది కదా!
దురితలతాలవిత్ర, ఖర దూషణ కానన వీతిహోత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధ విమోచన సూత్ర, చారువి
స్ఫురదరవింద నేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
.
భావం: పాపమను తీగలకు కొడవలివంటివాడవు, ఖరదూషణాదుల నెడి యడవికి యగ్నివంటివాడవు, భూమిని రక్షించుటయందు విచిత్రుడవు, పుట్టుకయను ముడిని విడదీయుటయే విధిగాగలవాడవు, ప్రకాశించు పద్మములవంటి నేత్రములు గలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు.
[9/11/2023, 4:52 pm] . Mallapragada: జీవనతరంగాలు
వనవర్ణనము
చంపక మాలిక
కురవక కేతకీ వకుల కుంద కురంటక
కోవిదారముల్
సరళ లవంగ లుంగ హరిచందన కాంచన
పారిజాతముల్
మరువక నాగ చూత పిచుమంద మధూక
కదంబ సాలముల్
సురతరు సామ్య వృక్షములు సుందర
పుష్ప లతా వితానముల్
వరబదరీ తమాల శతపత్ర పలాశ శిరీష
మల్లికల్
నిరతము సంతసంబునను నీరజ నాభుని
పాద సేవకై
పురికొని పల్లవించి మఱి పుష్పిత పక్వ
ఫలాల నొందియున్
సరస వసంత శోభనటఁ జందముఁగూర్చును
గాననంబునన్. 49
చంపకమాల
శుకపిక శారికా నికర సుందర హంస మయూర
జాలముల్
బక జలకుక్కుటావళులు వాయస సారస
పక్షి బృందముల్
వికసిత పంకజాకర సుభృంగము లానుచు
గోలఁ జేయఁగా
వికలము నొందఁజేయు నటఁ బ్రేమ పిపాసుల
మానసంబులన్. 50
కందము
హరికపి భల్లూకంబులు
కరి శార్దూలోష్ట్రములిల ఖడ్గమృగంబుల్
హరిణ చమరీ వృకంబులు
పరఁగుచునట భీతిఁగొల్పు వనమధ్యమునన్.51
అచ్యుతానందబ్రహ్మచారి
పాల్వంచ
[9/11/2023, 4:55 pm] . Mallapragada: జీవనతరంగాలు
సీసము
కమనీయ సుమమధు భ్రమరంబు లానుచు
జుమ్మని పాటకు శ్రుతినిఁబోసె
మావి చిగురుఁ దిని మత్తిల్లి కోకిలల్
వీనులలర నాల పించుచుండెఁ
జంపకా శోకముల్ చందన కింశుక
కదలీ తమాలముల్ కమ్రమైన
అలరు తావులఁ గూడి మలయానిలమ్ములు
మించి వీచుచు గుబాలించుచుండెఁ
తే గీ
బ్రేమికుల మానసంబులు వింతలలర
విరహ తాపమున్ గలిగించఁ గరము తాల
జాల లేరైరి తమ ప్రియా సఖుల కొఱకుఁ
దలఁచి తలఁచి కృశించుచుఁగలఁతఁబడిరి. 47
సీసము
పచ్చనాకులచీర వసుధా రమణిగట్టి
మల్లెల నగవుల మదినిఁదోచె
మోదుగు పూలనే మోవితో వెలుఁగుచుఁ
బ్రేమిక తాపంబుఁ బెంచుచుండె
మావి పాలిండ్లతో మాధవ సఖుఁగూడి
విరహముఁ గలిగించెఁ బ్రేమికులకుఁ
గమలమన్ గనులతోఁ గాంచుచు వలపును
యువకుల మనములఁ గవిసి పెంచె
తే గీ
వీనులకుఁ బక్షి రావముల్ విందుసేయ
వివిధ సుమ సువాసనల వాయువులు చిమ్మ,
సకల జీవులు కరముగ సంతసించఁ,
బ్రకృతి శోభాయ మానమై పరిఢవిల్లె. 48
అచ్యుతానందబ్రహ్మచారి
పాల్వంచ
----- సుభాషితాలు --------
తనయులతోడ నే దహ్యమానంబగు-
జతుగృహంబందునుఁ జావకుండఁ,
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల-
మారుతపుత్త్రుండు మడియకుండ,
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ-
ద్రౌపదిమానంబు దలఁగకుండ,
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే-
నా బిడ్డ లనిలోన నలఁగకుండ,
విరటుపుత్త్రిక కడుపులో వెలయు చూలు
ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ,
మఱియు రక్షించితివి పెక్కుమార్గములను,
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష!
భావము:
పుండరీకాక్షా! భగభగ మండుతున్న లక్కయింట్లో నా బిడ్డలు, నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు; దుర్యోధనుడు పెట్టించిన విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు; దురహంకారంతో త్రుళ్లిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకొన్నావు; భీష్ముడూ మొదలైన యోధానుయోధాల వల్ల పోరాటంలో నా బిడ్డలకు చేటు వాటిల్లకుండా అడ్డు పడ్డావు; మళ్లీ ఇప్పుడు చిట్టితల్లి ఉత్తర కడుపులోని కసుగందును, అశ్వత్థామ శరాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోకుండా కనికరించావు; మరింకా ఎన్నో విధాలుగా నన్నూ, నా బిడ్డలనూ కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా!
కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక ద్రాటఁ గట్టిన, వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రాపరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు, వెచ్చనూర్చుచుం,
బాపఁడవై నటించుట కృపాపర! నా మదిఁ జోద్య మయ్యెడిన్.
భావము:
దయామయా! శ్రీకృష్ణా! చిన్నప్పుడు నీవు ఒకసారి కోపంవచ్చి పాలకుండ బద్దలు కొట్టావు. అప్పుడు మీ అమ్మ యశోదాదేవి తాడు పట్టుకొని వచ్చి కట్టేసింది. అన్నీ తెలిసిన నువ్వేమో కాటుక కలిసిన కన్నీటి ధారలను చేత్తో పామేసుకుంటూ, ఉడికిపోతూ చంటిపిల్లాడిలా నటించటం తలచుకుంటే, ఇప్పటికి నా మనసులో ఆశ్చర్యం కలుగుతోందయ్యా.
ఆచారవంతు డౌనతఁడె విప్రోత్తము డఖిలంబురక్షించునతడు రాజు వరుసతో
గార్య నిర్వాహకుడే మంత్రి; రుచిరవర్తనుడె పురోహితుండు
కాదు దిట్ట దీవింపగలవాడె సత్కవి; యమృతహస్తుడు వైద్యుడఖిల దిశలఁ
బో టజ్జ యెఱిగిన పురుషుండు దళవాయి గణితజ్ఞుడైనవాడు కరుణ మరయ
బురుష రత్నంబులండ్రుబుధులు వీరి
నితరులెల్లను సామాన్యు లెంచి చూడ
కలిత లక్ష్మీశ! సర్వజగన్నివేశ!
విమలరవికోటి సంకాశ!వేంకటేశ!
చపల చిత్తుడు దక్క విజ్ఞాని చెలుల
వలపులకు మోసపోవునె ప్రవర విప్రు
డవరూధికి లోబడెనా తలంప
మతిథగజ దనుజాయ నమ శ్శివాయ!
మును నీచే నపవర్గ రాజ్యపదవీమూర్ధాభిషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినం గీటఫణీంద్రపోతమదవేదండోగ్ర హింసావిచా
రినిఁగాఁగా నినుఁగానఁగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ముందు నీవు మోక్షపదవీ సామ్రాజ్యమును ఒసంగిన పాము, సాలెపురుగు, ఏనుగు, కిరాతుడు మొదలైన వారందరూ నేనూ సమానులమే. ఏ విధముగా అన వారు నిన్ను మదిని చూచితిరి. నేను చూడలేకపోతిని.
తొలినాడు కలకండ పలుకులంబోని, ధూర్జటి సుకవి
పలుకులంబోని దాహమ్ము, చూచెడు వరకాగ రాని
యలనటై నిను వచ్చి చూచి యప్పటి కారియు మరల
నలసట యగుచు శృఈ కాళహస్తీశ్వరా! మహాదేవ!
హర్తకు గాదు గోచర మహర్నిశ మున్ సుఖపుష్టి చేయు స
త్కీర్తి ఘటించు విద్య యను దివ్య ధనంబకిలార్థ కోటి కిం.
పూర్తిగా నిచ్చినన్ బెరుగు బోదు యుగాంతపు వేళనైన భూ
భర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మాన్పు టొప్పగన్!
అర్థము:-విద్యా ధనమును దోగాలు దొంగిలింప లేరు,అది ఎల్లప్పుడు సుఖమునే
కలుగజేయును,కోరిన వారికి
ఎంత యిచ్చిననూ పెరుగుతుందే తప్ప తరిగిపోదు ధనము లాగ.ప్రళయ కాలమప్పుడు గూడ నశించదు,
ఇట్టి విద్యా ధనము గలవారి యెడ సామాన్య ధనము గల రాజులూ దురాగ్రహము విడిచి పెట్టవలెను.
విద్యావంతులను ఎవరూ ఎదుర్కొనలేరు. (భర్తృహరి సుభాషితం)
గూరిమి గృతఘ్నున కెయ్యెడ నుత్తమోత్తము
ల్మెలొన రించినన్ గుణము మిక్కిలి కీడగుఁ బాము పిల్లకున్
బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం
జాలఁగ నంతకంత కొక చాయను హెచ్చును గాక భాస్కరా!
మిత్రుండు దనకు విశ్వా
మిత్రము జేసినను గాని మేలనవచ్చును
శాత్రవుడు ముద్దగొన్నను
ధాత్రిం దన కదియె కీడు తలప కుమారా!
O
ఓ కుమారా! లోకమందు మిత్రుడు మనకు కీడు చేసిననూ, దానిని మేలు చేసినట్లుగానే భావింపవలెను. కాని శత్రువు మనయింట భోజనము చేసిననూ మనకు (కీడు) అపకారమే కలుగునని తెలియవలెను.
మహాత్మా గురుదేవానాం
అశ్రు పాతః క్షితే యది
దేశ భంగో మహా దుఃఖః
మరణం చ భవే ధృవం
అర్థము:--మహాత్ములైన గురువులు,మంచి మనసుగలవారు,ధర్మమార్గమున నడచువారు, వీరికి
దుఃఖము కలిగి వారి కన్నీరు గానీ రక్తముగానీ క్రింద పడినచో దేశ నాశనము,మహా దుఖములు ,
సాంఘాతిక మరణములు (ప్రమాదములలో అందరూ ఒకేసారి చనిపోవుట) సంభవించును.
నీతి ప్రౌఢ విహారు లైన నిపుణుల్ నిందిపనీ మెచ్చనీ
ఖ్యాతిం జెందిన సంపదల్ నిలువనీ గాఢ ముగా సాగనీ
ఘాతం బాప్పుడ పొందనీ నియతిమై గానీ యుగాన్తంబునన్
నీతి శ్ల్యాఘ్య పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్ (భర్తృహరి సుభాషితము)
అర్థము:--నీతి వంతులైన వారు,దీరులైన వారు పరులెవరైనా నిందించిననూ, భూషించిననూ,సంపదలు వచ్చిననూ,పోయిననూ, మరణ మిప్పుడే కలిగిననూ,కల్పాం తము వచ్చిననూ న్యాయ మార్గమును దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. (న్యాయ మార్గమును వీడరని భావము)
దివివా భువివా మమాస్తు వాసో
నరకే వా నరాంతక ప్రకామమ్
అవధీరిత శారదార విందౌ
చరణౌ తే మరణేపి చింతయామి
భావము:-- నరకాసురుని సంహరించిన కృష్ణా నా నెలవు స్వర్గముననే గాని, భూమిపై గాని,
నరకముననే గాని కానిమ్ము ,ఎచటనున్ననూ నేను శరత్కాలపు తామర పూల శోభ నధః కరించు నీ పాదములను మరణకాలమున గూడ మరువక తల౦తును.
. అలరు చుండ వలయు నన్నదమ్ములవోలె
శిష్యులెల్ల మిగుల శ్రేష్టులగుచు
కులమతాల గోడ కూల్చుట యుక్తమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల!
తనకు గల్గు పెక్కు తప్పులునుండగా
ఓగు నేరమెంచు నొరులఁగాంచి
చక్కిలంబుఁ గాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ వినుర వేమ!
సద్గోష్టి సిరియు నొసగు
సద్గోష్టి యె కీర్తి బెంచు, సంతుష్టియున్
సద్గోష్టి యె యోనగూర్చును
సద్గోష్టి యె పాపముల చరుచు కుమారీ!
విద్య వలన కలుగు విజ్ఞాన మెంతయో
విజయ పధము చూపు విబుధ తతికి
విశ్వ మందు చూపు విఖ్యాతిగా నిన్ను
నవ్య కవన సరణి నడుచు హరిణి.
సేకరణ (ప్రేమ ప్రసాద్ )
శ్రీ హరిణి శతకము నుండి.
ఇమ్ముగ జదవని నోరును,
నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
తమ్ముల బిలువని నోరున్
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
మనిషి జ్ఞానవంతుడు కావటానికి బాగా చదువుకోవాలి,కన్నతల్లిని వినయముతో అమ్మా అని పిలిచి అన్నము పెట్టు అని అడగాలి,తనకంటే చిన్నవారైనా సోదరులను వాత్సల్యముతో రమ్మంటూ చూసుకోవాలి. ఈ మూడూ చేయని వారినోరు కుమ్మరి మట్టి త్రవ్వగా యేర్పడిన గొయ్యి వంటిదే.
ఆతురే నియమో నాస్తి బాలే వృద్ధే తథైవ చ
సదాచార రతే చైవ హ్యేష ధర్మ స్సనాతనః
భావము:-రోగి,బాలురు, వృద్ధులు, సదాచారి ...వీరికి నియమములు అక్కరలేదు. ఇది సనాతన ధర్మము.
కామం క్రోధంచ లోభంచ దేహే తిష్ఠతి తస్కరా:
జ్ఞాన రత్నా స హరాయ తస్మాత్ జాగృత జాగృతః
అర్థము:-- మన దేహమందున కామ,క్రోధ,లోభములనే దొంగలు కూర్చొని జ్ఞానమనే రత్నమును దొంగిలించుటకు కాచుకొని యున్నారు. కావున జాగ్రత్తగా నడుచుకో.
జన్మ దుఖం జరా దుఖం జాయా దుఖం పునః పునః
సంసార సాగరం దుఖం తస్మాత్ జాగృత జాగృతః
అర్థము:--పుట్టుక దుఖం, చచ్చుట దుఖం, భార్యా దుఖం, ముసలితనం వచ్చునేమో నన్న దుఖం ఈ సంసార సాగరమే దుఃఖ మయం ఏ జన్మలోనైనా యివి తప్పవు. కావున జాగ్రత్త!
హరి ణాపి హరే ణాపి బ్రహ్మ ణాపి సురైరపి
లలాట లిఖితా రేఖా పరిమార్ స్త్యుం న శక్యతే
అర్థం: విష్ణువు చేత గాని శివుని చేత గాని బ్రహ్మ చేత గాని ఇతరులైన దేవతల చేత
గానీ నొసట వ్రాయ బడిన వ్రాత తుడిచి వేయ నలవి కాదు.(సాధ్య పడదు)
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: రఘువంశమునకు జంద్రునివంటివాడవు, అట్టి నీ చరణముల నుత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తములను పూలచే బూజించును. నా పూజలను గైకొనుము.
భోజరాజు ఒకనాడు కొలువు దీరి యుండగా,ఒక బ్రహ్మచారి వచ్చి రాజును చిరంజీవ అని
ఆశీర్వ దించాడు.
రాజు ఆ యువ బ్రహ్మచారిని బ్రహ్మచారీ!ఈ కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం
యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించావు?నిత్య వుపవాసాలతో యిలా ఎందుకు
కృశించి పోవడం?గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ
కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.అన్నాడు.
అందుకు బ్రహ్మచారి రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది
ఏముంటుంది?అయినా
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహా: -శాంతి: ప్రియా గేహినీ,
వృత్తి: -- వన్యలతా ఫలై: నివసనం, వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నిర్వృతి:
తేషాం - ఇందు కళావతంస యామినాం మోక్షేపి నో నః స్పృహా
అర్థము:--లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే ఇల్లు,మనశ్శాంతి, మనోనిగ్రహమే మా
ఇల్లాలు, అడవులలో
తీగేలతో,పండ్లతోనే సహవాసమే మా జీవన విధానం.చెట్టు పట్టలే మాకు వస్త్రాలు,మంచి
మాటలు అనే అమృత ప్రవాహం లో నిరంతర మునిగి తేలే వాళ్ళం, ఎవరికైతే ఈ
సుఖాలు వుంటాయో అలాంటి చంద్ర
మౌళీశ్వరుడి భక్తులము ,యోగులమూ అయిన మాకు మోక్షం మీద కూడా కోరిక
వుండదు.అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము ఏమైనా వుంటే
చెప్పండి.అన్నాడు.
అప్పుడు అతడు రాజా!మేము కాశీయాత్రకు వెళుతున్నాము.దయచేసి మీ సభలోని
పండితులను భార్యా సమేతం గా మాతో పాటు యాత్రకు పంపించండి.త్రోవ పొడుగునా
శ్రమ తెలియకుండా పండిత గోష్టులు
జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.అన్నాడు ఆ బ్రహ్మచారి.రాజు అందుకు
సరే అన్నాడు రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళారు,ఒక్క
కాళిదాసు తప్ప.మీరు ఎందుకు వెళ్ళలేదు?అని రాజు కాళిదాసును అడిగాడు.కాళిదాసు
ఒక శ్లోకం లో బదులిచ్చాడు.
తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో: దూర వర్తినః
యస్య గౌరీశ్వరః చిత్తే / తీర్థం,భోజ! పరం హి సః
అర్థము:--భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు
వెళతారు,ఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజుకు కోపం వచ్చింది.కానీ ఏమీ చెయ్యలేక
వూరుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత భోజరాజు కాళిదాసు ను యీ రోజేమైనా విశేష మైన వార్త మీ చెవిన
పడిందా?అని అడిగాడు.కాళిదాసు నా చెవిన పడ్డది వార్త కాదు మహారాజా!అని ఒక శ్లోకం
చదివాడు.
మేరౌ, మందర కందరాసు, హిమవత్ సానౌ.మహేంద్రాచలే,
కైలాసస్య శిలా తలేషు, మలయ ప్రాక్ - భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గనై: (ణయై:) వుద్గీయ మానం యశః
అర్థము:--చారణులనే దివ్య గాయకుల బృందాల చేత,నీ కీర్తి గురించి
పాడబడుతున్నపాటలు వినబడ్డాయి
మేరు పర్వతం మీదా,మందర పర్వతపు గుహలలో,హిమాలయాల మీదా, మలయ
పర్వత శిఖ రాగ్రాల
మీదా,సహ్యాద్రి మీదా యిలా అనేకానేక ప్రదేశాలలో చారణులనే దివ్యగాయకుల
బృందాల చేత కొనియాడ బడుతున్న నీ కీర్తి వినపడ్డది
.
అప్పుడు భోజుడు సంతోషం తో కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని
నేను వినగలిగే వాడిని కాదు కదా!అనుకున్నాడు.కాళిదాసు మీద అతని కోపం
యెగిరిపోయింది.
------------------ శుభరాత్రి ------------------
No comments:
Post a Comment