పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత .ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.
తండ్రి శాపం :-
ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పినదని పలికినాడు. అంతే కాదు నిద్రాహారము లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.
తండ్రికి శిక్ష :-
సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి 'నాథా నేయి ,ధాన్యము, నూనె తెండనీ చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లగా.ఆ సమయమున అచ్చట ఒక పందెము జరుగుచుండెను. వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదనని, ఓడినవారు జలమజ్జితులై వుండవలెనని విన్నాడు ఏకపాదుడు . వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయినాడు.
అష్టావక్రుడు జన్మించుట :-
సుజాత కుమారుని ప్రసవించింది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నకారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్ధాలకుని భార్య .ఉద్ధాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్ధాలకమహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగించాడు.
అష్టావక్రుని వాదన :-
కొంత కాలమునకు అసలు విషయం తెలిసికొని జలమజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని నిశ్చయము చేసుకొని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక రాజు మందిరద్వారము కడ చేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విసయములు తెలిపి దారినిమ్మని పలికాడు. మారు మాట్లాడక ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు. బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు. అంత అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేశాడు. జనకుడు వాదనకు అంగీకరించాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు వందని బాలకుడగు అష్టావక్రుడు ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు 'మహాజ్ఞానీ అజ్ఞాపింపుమనీ అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు
తండ్రిని విడిపించుట :-
ఇక్కడ ఒక రహస్యమున్నది. వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు. వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించాడు. అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను తెలిసికొన్నాడు.
అష్టావక్రుని శాపవిముక్తి :-
తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు సాన్నం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచూ కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగానే తండ్రి కుమారునకు పెళ్ళి చేయతలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు. కుమారుడు అంగీకారము తెలిపి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను
వివాహము చేసికొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సునందుండిపోయాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. పుత్రులను పొందాడు.
గోపికల పూర్వ వృత్తాంతం :-
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు. మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి పరమపదించాడు. అనంతరం అతడు గోలోకమునకు పోయి మోక్షము పొందాడు.
అష్టావక్రుని పూర్వజన్మ :-
పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు . దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగెను. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగెను. ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించింది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడా తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేక అష్టావక్రగీత.
****
శమంతకమణి ఏం అయింది
శ్రీకృష్ణుడి మీద పడిన అపనింద ఎందుకు వచ్చింది
సత్రాజిత్తు శమంతకమణి ని సూర్యభగవానుడి దగ్గరి నుండి పొందుతాడు. అయితే సత్రాజిత్తు ధరించిన శమంతకమణి ని చూసిన శ్రీకృష్ణుడు దానిని తనకి ఇవ్వమని అడుగగా దానికి సత్రాజిత్తు అంగీకరించాడు. ఆ తరువాత శమంతకమణి ని జాంబవంతుడు దొంగలించగా ఆ అపనింద శ్రీకృష్ణుడి పైన పడుతుంది. మరి అసలు శమంతకమణి ఏంటి? శ్రీకృష్ణుడి మీద పడిన అపనింద ఏంటి? చివరకు శమంతకమణి ఏమయ్యిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం నిఘ్నుడు అనే ఒక రాజు ఉండగా అతడికి సత్రాజిత్తు, ప్రసేనుడు అనే ఇద్దరు కొడుకులు. ఒక రోజు సత్రాజిత్తు సూర్యభగవానుడిని ప్రార్ధించగా, సూర్యుడు విపరీతమైన కాంతితో దర్శనమివ్వగా ఆ కాంతి వలన సత్రాజిత్తుకి సూర్యుడు కనిపించలేదు. అప్పుడు సూర్యభగవానుడు నేను ఈరోజు శమంతకమణి ధరించి ఉన్నందున నీకు కనిపించలేదు అని ఆ మణిని తీసి పక్కనబెట్టాడు. అప్పుడు ఆ మణిని చూసి ఆశపడిన సత్రాజిత్తు శమంతకమణి ని తనకివ్వమని ప్రార్ధించగా, ఇది ధరించడానికి అందరు అర్హులు కారు, ఈ మణి అగ్నికి సంబంధించినది. రోజుకు కావాల్సినంత బంగారాన్ని కూడా ఇస్తుందని కొన్ని జాగ్రత్తలను చెప్పి దానిని సత్రాజిత్తుకు ఇవ్వగా, ఆ మణి ధరించి విపరీతమైన కాంతితో రావడం చూసిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని అడిగి శమంతకమణి గురించి తెలుసుకొని దానిని తనకివ్వమని అడుగగా ఇవ్వడానికి సత్రాజిత్తుడు నిరాకరించాడు.
ఇది ఇలా ఉంటె, వినాయకచవితి పూజలో శమంతకమణి కథ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే, చవితి రోజున చంద్రుడిని చూడకూడదు చుస్తే అపనిందలు తప్పవు అని అంటారు. శ్రీకృష్ణుడు చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తాడు. అయితే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతకమణి ధరించి వేటకు వెళ్లగా అయన వెళుతున్న అశ్వాన్ని ఒక సింహం చంపి, ప్రసేన జిత్తును పంజాతో విసిరేసి, శమంతకమణిని తీసుకొని వెళుతుంది. అయితే ప్రసేనుడిని చంపి శ్రీకృష్ణుడే శమంతకమణి దొంగలించాడనే అపనింద వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు శమంతకమణి వెతుకుంటూ ఆ సమయంలో జాంబవంతుడి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని గుహలోకి వెళ్తాడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు చనిపోయినా సింహాన్ని, గుర్రాన్ని దాటుకొని జాంబవంతుడు ఉన్నగుహలోకి వెళ్తాడు. ఆ మణి గురించి శ్రీ కృష్ణుడు ఎంత చూపిన జాంబవంతుడు వినకపోవడంతో ఇద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది. ఇలా 28 రోజుల భీకర ద్వంద్వ యుద్ధం తరువాత రాముడితో యుద్ధం చేయాలనే కోరిక నెరవేరడంతో యుద్దాన్ని విరమించి మణిని, తన కూతురిని శ్రీకృష్ణుడి చేతిలో పెడతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరి సత్రాజిత్తుకు మణిని అప్పగించడంతో తన తప్పుని తెలుసుకొని శ్రీకృష్ణుడికి తన కుమార్తె అయినా సత్యభామని ఇచ్చి వివాహం చేసి శమంతకమణి కూడా ఇవ్వగా ఆ మణిని సత్రాజిత్తుకే ఇచ్చి శ్రీకృష్ణుడు సత్యబామతో కలసి వెళ్ళిపోతాడు. ఇక చివరకు శ్రీకృష్ణుడు తనువూ చాలించిన తరువాత ద్వారకా తో పాటుగా శమంతకమణి కూడా సముద్ర గర్భంలో కలసిపోయిందని, ఇప్పటికి మునిగిపోయిన ద్వారకాలో ఎక్కడో ఒక చోట శమంతకమణి ఉండే ఉంటుందని కొందరి నమ్మకం.
*నిరంతర చక్రభ్రమణం*
~~~~~~~~~~~~
కాలం చాలా కఠినమైంది. దయాదాక్షిణ్యాలు లేనిదే కాలమని అంటారు. భీష్ము పర్వంలోని విష్ణు సహస్ర నామ స్తోత్రం ఏడో శ్లోకంలో కాలం సర్పం వంటిదని భీష్ముడు చెబుతాడు. కాలానికి అతీతమైనది లేదని సూర్యుడి మనవడు గార్గేయుడు, భరద్వాజ మహాముని కొడుకు సుకేశుడికి చెబుతాడు. కాలాన్ని సృజించింది. విరాట్పురుషుడని పురుష సూక్తం చెబుతోంది. కాలాన్ని తానేనని భగవద్గీత పదకొండో అధ్యాయం ముప్ఫై రెండో శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు. చెప్పాడు. విష్ణు సహస్రనామ స్తోత్రంలోని నలభై అయిదో శ్లోకంలో కాలంలోని రుతువులన్నీ పరమాత్ముడి చేతిలోని సుదర్శన చక్రానికి ప్రతీకలని భీష్ముడు ధర్మజుడికి వివరించాడు. సృష్టిలోని అన్ని కార్యాలు కాలాన్ని అనుసరించే జరుగుతాయని శ్రీకృష్ణుడు చెబుతూ కాల కర్తవ్య క్రమాన్ని మార్చే శక్తి తనకు సైతం లేదంటాడు.
సాపేక్షత్వం గురించిన ప్రస్తావన గరుడ పురాణంలో కనిపిస్తుంది. గరుడుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వివరించాడని అంటారు. పురాణం పూర్వకాండలో దిగంతం కుంచించుకుపోయేకొద్దీ విశాలమవుతుందని సమయం గరుడుడు కశ్యపుడికి చెప్పినట్లు తెలుస్తోంది. విష్ణువు కాలానికి ప్రతిరూపమని ఈ పురాణం చెబుతోంది. సృష్టి ఆదిలో విశ్వం ఆసాంతం పరమాణువుకన్నా సూక్ష్మమై ఉంటుందని, కాలమే ఆద్యంతాలు విస్తరించి ఉంటుందని బ్రహ్మపురాణం విశదం చేస్తోంది. కాలం విరాట్పురుషుడి సామర్ధ్యమని పురుష సూక్తం చెబుతోంది. సామర్థ్యం కాలంలాగా ఎల్లెడలా విస్తరించి ఉంటుంది. మహాభాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో ఇక్కడ అక్కడ అనిగాక హరి ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ ఉంటాడని అంటాడు. భూమిపైన కాలాన్ని లెక్కించేందుకు సూర్యచంద్రులే ప్రాతిపదిక. వాటి కదలికలను అనుసరించి కాలగణన సాగుతుంది. సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి ప్రదక్షిణ చేయడానికి పట్టే కాలాన్ని సంవత్సరం అన్నారు. ఒక సంవత్సరాన్ని మూడువందల అరవై అయిదు రోజులుగా విభజించారు. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి చుట్టి రావడానికి పట్టే కాలాన్ని నెల రోజులని లెక్కించారు. భూమి దాని ఇరుసుపై తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే కాలాన్ని ఒక రోజుగా నిర్వచించారు. రోజును గంటలుగా, గంటను అరవై నిమిషాలుగా, నిమిషాన్ని అరవై సెకన్లుగా విభజించి కాలనిర్ణయం చేశారు. ఇదంతా పూర్వ రుషులు (శాస్త్రవేత్తలు) హేతుబద్ధంగా వర్గీకరించారు. వేలాది సంవత్సరాల క్రితమే ఈ కాల గణన జరిగిపోయింది. విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఇరవై మూడో శ్లోకంలో నిమిషం అనే కాలానికి సంబంధించిన పదం కనపడుతుంది. ఈ కాలనిర్ణయం ప్రకారమే కాలగమనాన్ని గమనించేందుకు రకరకాల సాధనాలను కనిపెట్టారు.
దేవుడు మహాద్భుత సృజనకారుడు. మనిషి దేహాన్ని సైతం కాలానుగుణంగా నిర్మించాడు. గుండె లయబద్ధంగా నిమిషానికి డెబ్భై నుంచి వందసార్లు మాత్రమే కొట్టుకోవాలి. కాలానికి అతీతంగా గుండె స్పందనలు ఉంటే ప్రమాదమే! కాలం గడచినకొద్దీ మనిషి శరీరంలోని జీవకణాలు నశిస్తూ ఉంటాయి. మనిషిలోని నరాల వ్యవస్థ సైతం కాలానుగుణంగా వైఫల్యం చెందుతుంది. అది సమయ ధర్మం. అందుకే మనిషి మృత్యువును కాలధర్మమనే అన్నారు. కాల భ్రమణాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. మన్వంతరాలు, యుగాలు అన్నీ కాలానికి ప్రతీకలు. కాలం అంతులేనిది. దానికి ముందు చూపే కానీ వెనక చూపు లేదు...
*పంచముఖ ఆంజనేయుడు*
శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.
*మైరావణ వృత్తాంతం:*
రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.
హనుమంతుని పయనం:
రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ... తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.
మైరావణుని సంహారం: మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం... ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు.
పంచముఖాల ప్రాశస్త్యం: అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸
*****
సుప్రసిద్ధ జెన్ గురువుల్లో గిజాన్ ఒకరు. జ్ఞానార్జన కోసం, సత్య దర్శనం కోసం, సమాధి స్థితి సాధించడం కోసం తపిస్తున్న కోషు అనే యువకుడు ఆయనను కలిశాడు. తన కోరికను వెల్లడించాడు. శిష్యుడిగా తనను అంగీకరించి, తాను చేయవలసిన పని ఏమిటో చెబితే... అది ఎంత కష్టతరమైనా చెయ్యడానికి సిద్ధమేనని చెప్పాడు.
అతని జిజ్ఞాసను గమనించి, తన శిష్యుడిగా గిజాన్ చేర్చుకున్నాడు. అతనికి బోధ చేయడంతో పాటు, సాధనా పద్ధతులను సూచించాడు. గురువు ఏది చెప్పినా అత్యంత శ్రద్ధతో కోషు సాధన చేశాడు. రాత్రింబవళ్ళు కఠోరంగా శ్రమించాడు. ఇలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి. కానీ తను కోరుకున్న సమాధి స్థితిని కోషు పొందలేకపోయాడు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా సాధనను కొనసాగించాడు.
గిజాన్ అప్పుడప్పుడు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి.. శిష్యులకు సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఒకసారి తన మందిర ప్రాంగణంలోనే వారం రోజులు కొనసాగే సమావేశాలను మొదలుపెట్టాడు.
తన ధ్యేయాన్ని సాధించడానికి అదే సరైన సమయమని కోషు భావించాడు. మందిర ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న గోపురం ఎక్కి కూర్చున్నాడు. అక్కడ ఉన్న మహనీయుల విగ్రహాలను చూస్తూ ‘‘నేను నా కలను నెరవేర్చుకోవడమో, లేదా విగత జీవుడిగా ఈ గోపురం అడుగు భాగాన పడి ఉండడమో జరుగుతుంది’’ అని ప్రమాణం చేశాడు. కళ్ళు మూసుకొని కుర్చున్నాడు. ఏడు రోజులు నిద్రాహారాలు మానేశాడు. అప్పుడప్పుడు అంతర్ముఖంగా... లోలోతులకు వెళ్ళి వచ్చాడు. కానీ సమాధి స్థితికి చేరాలన్న అతని కల నెరవేరలేదు.
‘ఇంత కఠోరంగా దీక్ష చేస్తున్నా నాకు ఆ స్థితి ఎందుకు అందడం లేదు? నేను ఏ తప్పు చేశాను? ఎందుకు నాకీ దురవస్థ? అని కోషు ఆవేదన చెందాడు. చివరకు ఓటమిని అంగీకరించాడు. ఇక జీవించి లాభం లేదనుకున్నాడు. గిజాన్ పర్యవేక్షణలోనే తను అనుకున్నది సాధించలేనప్పుడు... ఇక మరణం తప్ప మార్గం లేదని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరచి... ముందున్న పిట్టగోడ వైపు నడిచాడు. ఆ ఎత్తు నుంచి కిందికి దూకి మరణించాలనుకున్నాడు.
ఆ ఆలోచన రాగానే అతని మనసు ప్రశాంతమయింది. పిట్టగోడ పైకి ఎక్కబోయాడు. అంతే... అద్భుతం! అనూహ్యంగా అతని కోరిక నిజమయింది. అతను కోరుకున్న సమాధి స్థితి కలిగింది. కొంతసేపు అలాగే నిలబడిపోయాడు. తరువాత... హృదయమంతా ఆనందంతో ఉప్పొంగుతూ ఉండగా... గబగబా గోపురాన్ని దిగాడు. సరాసరి గురువు గదికి పరుగులు తీశాడు.
కోషు ముఖాన్ని చూసి, అతను ఏదీ చెప్పకముందే ‘శభాష్ కోషూ! చివరకు సాధించావు’ అన్నాడు గిజాన్. కఠోరమైన సాధన చేస్తున్న సమయంలో ‘నేను చేస్తున్నాను’ అనే భావన, సమాధి స్థితిని చేరాలనే కోరిక కోషులో దృఢంగా ఉండేవి. ఎప్పుడైతే అతను వాటిని సంపూర్ణంగా వదులుకొని, ప్రాణాలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడో... అడ్డంకులన్నీ తొలగిపోయాయి. స్వచ్ఛమైన సమాధి స్థితి అతనికి ఆకస్మికంగా కలిగింది. ఇది వింతేమీ కాదు. శ్రీ రామకృష్ణ పరమహంస దైవ సాక్షాత్కారం కోసం తపించి, ఎన్నో కఠోర సాధనలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు కాళికాదేవి విగ్రహం చేతిలోని ఖడ్గాన్ని తీసుకొని, తనను తాను అంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడే ఆయనకు దివ్య దర్శనం (నిర్వికార సమాధి) కలిగినట్టు ఆయన జీవిత చరిత్ర తెలియజేస్తోంది.
****
*నేను పోతే.......?*
'భోజ మహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో
"మోక్షానికి పోగలిగే వాడెవ్వడు?" అని ప్రశించాడట.
యజ్ఞయాగదులు చేస్తే మోక్షానికి పోవచ్చునని కొందరు,
' జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు,
భక్తితో పోవచ్చునని కొందరు, మంచివారితో స్నేహం చేస్తే పోవచ్చునని కొందరు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పసాగారు.
అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి "నేను పోతే పోవచ్చు" అని అన్నాడు.
ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది.
"మాకు లేనిది ఏమిటి? కాళిదాసుకు ఉన్నది ఏమిటి? అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేంటి? అని చిరాకు పడ్డారు.
ఇతడేనా మోక్షానికి పోయేవాడు" అంటూ ఆరోపణలు కూడా మొదలయ్యాయి.
భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
అప్పుడు కాళిదాసు లేచి "మహాప్రభూ! "నేను" "నేనే" అనే అహంకారం, గర్వం పోతే, ఎవడైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను..
అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు" అని వివరించాడు.
'భోజ మహారాజుతో సహా సభాసధులందరూ కాళిదాసుని మెచ్చుకున్నారు.
మిత్రులారా...
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మనిషి ఎప్పుడైతే "నేను" "నేనే" అనే గర్వాన్ని, అహంకారాన్ని వదిలేస్తాడో అప్పుడే భగవంతుడిని చూడగలడు, భగవంతుడిని చేరుకోగలడు...
ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి నేను అన్ని పూజలు చేశాను, నేను ఇన్ని వ్రతాలు చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు దయచేసి అవి మానండి..
అప్పుడే జీవితం బాగుంటుంది.🙏
చిట్టికథ.✨
గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి కి ఒక సందేహం వచ్చింది!
వెంటనే గంగానదినే అడిగాడట!
అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ! అని.
అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.
అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?అనుకొని!
సముద్రాన్నే అడిగాడు!
ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!
దానికా సముద్రుడు!
నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట.
అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!
ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!
అవి పకపకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా...
ఓహో!!!
ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!
అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నానమాచరిస్తున్న ఋషి!
*ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.*
ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును!
అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"! ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.
కర్మ కర్మణా నశ్యతి కర్మ!
అంటే ..కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది.
🌷🌷🌷
No comments:
Post a Comment