" శార్దూలే..మాతృస్తుతిః..
--
హ్రీంకారాత్మకతత్త్వభూతిపరమాంలీనార్ధశైవాకృతిం ,
హుంకారధ్వనిభర్త్సితాంతకుజనాంహోమార్చనైఃపూజితామ్..
క్లీంకాస్థపదప్రభూతి జననీం కృష్ణానుజాం తుష్టిదాం ,
ఓంకారీంశుభదాంప్రసన్నకరుణాపూర్ణాంభజేऽహంసదా !!! "
-
మల్లాప్రగడ రామకృష్ణ
సమస్య:
పొలతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో
చం.
చిలుకల పల్కు లే బలుకు చింతయు మాపుట పాత్రధారి, యా
తలపులు తెల్పుటే కధల తంతయు కాలము సాధనమ్ముగాఁ
విలువలు నిల్పు టే విషయ వింతలు నాటక మాడుబుద్ధిగా
పొలతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో
సమస్య:
నస్యము వాడువాని వదనమ్మున వచ్చె మనోజ్ఞ వాసనల్
ఉ.
లాస్యవినోదముల్ నటనలాడెడి యింతియె వేదికెక్కగన్
హాస్యము కోసమై నొకడు హాచ్చని తుమ్మె; నదేమిటన్నచో
నస్యము వాడువాని వదనమ్మున వచ్చె; మనోజ్ఞగంధముల్,
శస్యము లారగించుతరి సభ్యతనుండుట చాలమేలగున్
సలలిత రాగముల్ బలుకు చానయె నాగమ పాత్రధారి, యా
వెలదిది ప్రొద్దుటూరు తన వేషము వేయుట నక్కడేననెన్,
విలువగు పాత్ర జేయగను వేసిరి నాటక మామె కోర్కెపై,
పొలతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో
***
నేటి సూక్తి : సమాధి స్థితిలో అనుభూతి - సమాధ్యానుభూతి ఒక సాధన కావచ్చునే కాని పూర్ణసిద్ధి కానేరదు. ఆ యాతరంగిక అనుభూతి వలన బాహ్య చేతనలో ఏ విధమైన మార్పూ రాకపోవచ్చును. సమాధి స్థితిలో ఎన్నో చక్కని అనుభూతులు పొంద గలుగుతూ కూడ బాహ్య వ్యవహారంలో ఎప్పటి స్థితిలోనే వుండే సాధకులు అనేకులు ఉన్నారు.
సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతా: |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||
🌷. తాత్పర్యం :
ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు, నాకు నమస్కారమొసగుచు, నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు
***
🌹. శివ సూత్రములు - 066 / Siva Sutras - 066 🌹
🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀
1- శాంభవోపాయ
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌻. 21. శుద్ధవిద్యోద్యాచ్చక్రేఈశత్వ-సిద్ధిః - 1 🌻
🌴. యోగి పరిమిత శక్తులను కోరకుండా, సార్వత్రిక జ్ఞానాన్ని పొందాలనే తపనతో ఉన్నప్పుడు స్వచ్ఛమైన జ్ఞానం పెరిగి , అతను విశ్వ చైతన్య నిపుణుడు అవుతాడు. 🌴
శుద్ధవిద్య - జ్ఞాన స్వచ్ఛత నుండి ఉత్పన్నమయ్యే స్వచ్ఛమైన చైతన్యం ; ఉదయాత్ – రూపము; చక్రా - అన్ని శక్తులు లేదా శక్తుల మిశ్రమ ప్రభావం; īśatva – ఆధిపత్యం లేదా నైపుణ్యం; సిద్ధిః - సాధన;
యోగి తన సంకల్ప శక్తిని (మునుపటి సూత్రాన్ని) ఉపయోగించడం ద్వారా సర్వశక్తి (శక్తులు లేదా శక్తులు) యొక్క సామూహిక ప్రభావాన్ని (కనిపించడం ద్వారా) గ్రహించి, వాటిపై పట్టు సాధిస్తాడు. ఇది స్వీయ చైతన్యాన్ని సార్వత్రిక చైతన్యంతో అనుసంధానించే ప్రక్రియ. శివ చైతన్యం అనేది అంతిమ చైతన్యం లేదా సార్వత్రిక చైతన్యం. ఇంతకు మించి ఏమీ లేదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
03. నైధన తార -- మల్లాది సూరిబాబు
శ్రీ మల్లాది సూరిబాబుగారు మహా కవిపండితులు శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి రెండవ కుమారులు
తండ్రిగారి నుంచి వారసత్వంగా లభించిన సాహితీ సృజన వీరిని మంచి కథకునిగా తీర్చి దిద్దింది. వీరు సుమారు 70 కథలకు పైగా వ్రాశారు. చక్కటి తెలుగు నుడికారంతో, మధ్యతరగతి జీవితాలను హృద్యంగా తన కథలలో నింపుతారు. పాఠకుడిని పట్టి చదివించే రచనాశైలి వీరి ప్రత్యేకత.
'చివురంటి చిన్నది', 'వాసవసజ్జిక', 'శహన', 'మరణం ధృవమ్' మొదలైన గొప్ప కథలెన్నో సూరిబాబుగారు వ్రాశారు.
ఇప్పుడు పరిచయం చెయ్యబోయే నైధనతార అనే వారి కథ 2002లో 'రచన' మాస పత్రికలో ప్రచురింపబడింది.
* * *
"మా అమ్మగారు మీకు తాంబూలం ఇస్తారుట. ఈ పూట ఇంటికి తప్పక రమ్మన్నారు. రేపు ఆవిడ వూరికి వెడతారుట" అంటూ శారదాంబగారి నౌకరు నారాయణ సిద్ధాంతిగారి ఇంటికి వచ్చి చెప్పేడు.
నారాయణ సిద్ధాంతిగారు ఆ పరగణాలో --ముహూర్తం, ప్రశ్న, జ్యోతిషం, వాస్తు శాస్త్రాలలో మేటి మొనగాడు. ఆ శాస్త్రాలలో ఆయనకి తెలియని విషయం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన సద్గురువుల వద్ద వేదవేదాంగాలు సక్రమంగా చదువుకున్నవాడు. పీఠాధిపతుల వద్ద మంత్ర దీక్ష పొందారు. వాక్ శుద్ధి గలవారిగా పేరు పొందారు.
ఆయన ఎందరి తల రాతలనో సరిదిద్దారు.
ఇన్ని పనులు చేసినా, పెద్దమ్మవారి (జ్యేష్ఠాదేవి) ముద్దుబిడ్డగా, సరస్వతీ వరప్రసాదుడుగానే మిగిలిపోయారు.
తన ఇల్లాలి సలహా మేరకు నిత్యం కనకధారా స్తవం, విష్ణు సహస్రనామం పారాయణ చేసినా, ఆయనకి రవ్వంత విరామం దొరికితే మాత్రం స్మరణ చేసేది -- బమ్మెర పోతనగారి 'భాగవతం' లోని... శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అనే మొదటి పద్యం!
ఆయన ముఖంలో వర్ఛస్సు పెరిగింది. కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది. కానీ... అడుగు నేల మీదనే ఉంది.
"ఇంతమందికి ఇంతకాలంగా ఎంతో మేలు చేస్తున్నారు. ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు. మీరు ఏ మాత్రమూ ఎదుగూ బొదుగూ లేకుండా ఈ తీరుగానే ఉన్నారేం?" అని ఆయనతో పనిలేనివారు ప్రశ్నిస్తూ వుంటే ఆయన సమాధానం- మధురమైన మందహాసం!
తనలో తాను 'పూర్వ జన్మ సుకృతం!' అనుకునేవారు.
"ఇందరి జాతకాలు చూశారు కదా - మీ జాతకం ఎప్పుడైనా చూసుకున్నారా?" అని కావలసిన వారు అడిగితే,
"పెద్ద పెద్ద దైవజ్ఞులే చూశారు! చాలా గొప్ప యోగ జాతకం అన్నారు. బుధాదిత్య యోగం అన్నారు. గజ కేసరి యోగం వంటి మంచి యోగాలు ఉన్నాయన్నారు. కానీ - వీటన్నింటినీ కేమద్రుమ యోగం మింగేసిందని అన్నారు" అని చెప్పేరు.
"దానివల్ల ఏమి జరుగుతుంది?- నష్టమా?" కొందరి సందేహం.
"పెద్ద నష్టమేమీ లేదు. మనం అందరికీ ఉపయోగ పడతాం..కానీ ఇతరుల వలన మనకు ఉపయోగం ఉండదు."
"దీన్ని మార్చడానికి ఏదైనా అవకాశం కాని, శాంతి ప్రక్రియ కానీ ఉందా?"
"ఉన్నదల్లా ఒక్కటే ఉపాయం! ఈ జన్మలో పుణ్యం సంపాదించడం, వచ్చే జన్మలో ఆ పుణ్యఫలాన్ని అనుభవించడం."
"అంతేనా?"
"అంతే!"
ఆ తరవాత ఆయన యోగక్షేమాల సంగతి ఎవరికీ పట్టలేదు! ఆ శ్రీ హరికి తప్ప!!
రెండు పుష్కరాలుగా ఆ దంపతులకు రెండు జతల బట్టలు, ఒక పూట భోజనం!
నెలకు పదిహేను ఏకాదశులు!! (పస్తులు).
దారిద్ర్యం ఉన్నా దీనత్వం లేని ఈ నిష్ణాతులకు భగవంతుడు అడగకుండానే ఇచ్చిన వరం-- ఆనందం!
అందరు ఇల్లాళ్ళలాగే ఆయన అర్థాంగి సోమిదేవమ్మ కాపురానికి వచ్చిన తొలి సంవత్సరాలలో సంతానం కోసం ఎదురు చూసింది. కలగకపోయే సరికి పున్నామనరకం గురించి భయపడింది!
'పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు' అన్న వాక్యం గుర్తుకొచ్చి దాన ధర్మాలు చెయ్యాలని సంకల్పించింది. ఉబలాట పడింది.
అయితే, ధర్మంగా ఉండడం సాధ్యమైంది! దానమే- శక్తికి మించిన పనయింది! ఆమెకు అంతులేని దిగులు వేసింది. కాని ఆయన మాటలు విన్న తరువాత మనసుకు ఉపశమనం కలిగింది!
"దానం అంటే... ధనదానం, వస్తుదానం ఒక్కటే కాదు. ఆపదలో ఉన్నవారికి మంచి మాటలతో, మంచి చేతలతో మనం చేసే సహాయం కూడా దానమే!" అన్నారాయన.
ఆ నాటినుంచి ఆవిడ ఆ వాడలోవారికి పెద్ద దిక్కు అయ్యింది. తలలోని నాలుక అయ్యింది.
ఆ ప్రాంతానికి వారే పార్వతీ పరమేశ్వరులు అయ్యారు కానీ...కుబేరుడి స్నేహితులు కాలేకపోయారు!
ఆనాటికీ ఈనాటికీ ఆ లోగిలిలో ఉయ్యాల తొట్టె కట్టలేదు, పసిపిల్ల ఏడుపు వినిపించలేదు!
ఓనాడు సోమిదేవమ్మ ఆయనను, "నేను గొడ్రాలిని. మన వంశం నిలబడటం కోసమన్నా మీరు మళ్ళీ వివాహం చేసుకోండి" అని అమిత వేదనతో ప్రార్థించింది.
"శివ శివా!" అంటూ సిద్ధాంతిగారు చెవులు మూసుకున్నారు.
"సోమిదేవీ! హాస్యానికైనా ఎప్పుడూ ఇటువంటి మాటలు అనవద్దు" అంటూ మందలింపుగా అంటూంటే ఆయన మనస్సు, మాట గద్గదమయ్యాయి.
"ఏ వంశం ఎంతకాలం ఈ భూమిమీద ఉండాలో, అవి ఎవరి ద్వారా నిలబడాలో నిర్ణయించేది ఆ సర్వేశ్వరుడే! మానవుల లాగానే వంశాలూ పుడుతూ ఉంటాయి, గిడుతూ ఉంటాయి. అది సహజం. కాలం తీరిన వంశం కాలగర్భంలో కలిసిపోతుంది. దాని ఆయుర్దాయము పొడిగించడానికి మనం ప్రయత్నం చెయ్యడం అవివేకం!" అన్నారు.
ఆ విషయం గురించిన ప్రస్తావన ఆ ఇంట్లో మళ్లీ రాలేదు.
సుమారు పద్దెనిమిది మాసాల క్రితం తనని వెతుక్కుంటూ శారదాంబ వచ్చింది. ముఖంలో దైన్యం, భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. నమస్కారం చేస్తూ తన ముందు నిలబడ్డది.
చేతిలో ఫలం, పుష్పం ఏమీ లేవు. ఆవిడ తన జాతకం కాగితాలు ఆయన చేతిలో పెడుతూ,
"చాలా కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నాను. ప్రాణ భయం వేస్తోంది. మీరు రక్షిస్తారని, ఈ ఆపద గట్టెక్కిస్తారని మీ శరణుకోరి వచ్చాను" అంటూ మోకరిల్లింది.
ఆయన ఆవిడను దీవిస్తూ,
"అందరికీ శరణు ఇవ్వగలిగిన కరుణానిధి, శరణాగత వత్సలుడు - ఆ శ్రీమన్నారాయణుడే. వారిని ఆశ్రయించండి. అన్ని ఆపదలూ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది." అన్నారు.
ఆవిడ మళ్లీ నమస్కరిస్తూ, "నాకు తెలిసిన లక్ష్మీనారాయణులు మీరే. మీరు ఏది చెయ్యమంటే అది చేస్తాను!" అంది.
సిద్ధాంతిగారు ఆ జాతకం క్షుణ్ణంగా పరిశీలించారు.
రవ్వంతసేపు అంతర్ముఖులయ్యారు.
ఆవిడ మనసులోని మాటలు ఆయనకు వినిపించాయి.
నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపం దగున్ దీనునిన్....
ఆయన చిరునవ్వుగా ఆవిడ వంక చూశారు.
"మబ్బులు తొలగిపోతాయి. మళ్ళీ వెలుగు వస్తుంది. జీవితమంతా ఎప్పుడూ అమావాస్యగా ఉండదు. మీరు చేయవలసిన పనులు ఈ కాగితం మీద రాశాను. ఆ ప్రకారం చేయండి... సుఖం కలుగుతుంది" అన్నారు.
"ఏమేమి చెయ్యాలో చెప్పండి, తప్పక చేస్తాను" అందామె.
"ఈ మంగళవారంనాడు.. నూట ఎనిమిదిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అనంతరం ప్రతినిత్యం ఉదయం ఋణ విమోచన అంగారక స్తోత్రం మూడుసార్లు పారాయణ చేయండి.
తరువాత మీ ఇంటి దగ్గర ఖాళీస్థలంలో నేను నిర్దేశించిన శుభ ముహూర్తాన శంకుస్థాపన చెయ్యండి. తరువాత గృహనిర్మాణం ప్రారంభించి, నేను నిర్ణయించిన ముహూర్తంలో గృహప్రవేశం చెయ్యండి - మూడు అంతస్తుల భవనం నిర్మించండి! సందేహించకండి. సాధ్యమా అని తర్కించకండి. మీ జాతకం అపూర్వ వస్తు లాభం సూచిస్తోంది. దానిని నిర్లక్ష్యం చేస్తే, ఆ ధనం రోగ నివారణకు... వ్యాధి రూపంగా వ్యయం అవుతుంది." అన్నారు.
ఆవిడ ఇంకొకసారి నమస్కారం చేసి వెళ్ళిపోయింది! ఆనాటికి ఈనాడు ఆవిడ కబురు వచ్చింది.
"శారదాంబగారింటికి వెళ్లొస్తాను" అంటూ సిద్ధాంతిగారు లేచారు.
సోమిదేవమ్మ ఒక్క క్షణం తటపటాయించింది.
"ఈనాడు మంగళవారం! నక్షత్రం మీకు నైధనతార!! రేపటి రోజున వెడితే బాగుంటుందేమో" అన్నది.
"రేపు ఆవిడ ఊరికి వెడతారుట. ఈ రోజే రమ్మని కబురు చేశారు. వెళ్ళొస్తే సరిపోతుంది" అన్నారు.
"ఆహ్వానం - ఉభయులకూనా? మీ వక్కరికేనా?"
"ఆ వార్తలో ఆ వివరాలు లేవు... పిలుపు నా వరకూ మాత్రమే ననిపించింది."
ఆవిడ చిరునవ్వు నవ్వి శుభ శకునంగా ఎదురు వచ్చింది.
"క్షేమంగా వెళ్ళి లాభంగా రండి!" అంది.
ఆయన కూడా స్మిత వదనంతో, "లాభం కంటే క్షేమం ముఖ్యం" అని శారదాంబగారి ఇంటివైపు నడిచారు.
తాను నిర్ణయించిన ముహూర్తానికే ఆర్భాటంగా శంకుస్థాపన చేశారనీ, అలాగే వైభవంగా గృహప్రవేశం కూడా జరిగిందనీ ఆయన కర్ణాకర్ణికగా విన్నారు.
తనకు పిలుపు లేదు, పేరంటమూ లేదు!
ఆ సంబరం ముగిసిన చాలా రోజులకు ఈనాడు ఈ ఆహ్వానం!
వెళ్లకపోతే... కబురు చేసినా రాలేదనే మాట మిగిలిపోతుంది.
ఆయన అన్యమనస్కంగానే వెళ్ళేరు.
ఎదురుగా వచ్చి ఎవ్వరూ స్వాగతం పలుక లేదు. రెండు ఘడియలు నిరీక్షణ అనంతరం ఆవిడ వచ్చింది. రావడమే...
"కబురు చేసిన యింత సేపటికా రావడం? శంకుస్థాపనకి, గృహప్రవేశానికి రాలేదేం? బొట్టూ కాటుక పెట్టి పిలవాలా? దగ్గరుండి చేయించవలసిన బాధ్యత మీకు లేదా??" అంటూ ప్రశ్నలతో ప్రళయంగా వచ్చింది.
ఆయన ముఖంలో చిరునవ్వు చెరగలేదు. చూపు ఆవిడను దాటి గోడ మీద ఉన్న తంజావూరు చిత్రపటం మీద నిలిచింది. మర్రిఆకు మీద పవళించిన బాలకృష్ణుడు!
ఆవిడ కూడా అటు చూసింది. ఆ చూపులో దర్జా ఉంది. గర్వముంది. ఆవిడ ఏదో చెప్పబోయింది.
"నేను ఇల్లు చూడవచ్చునా?" అని ఆయన అడిగారు.
ఆవిడ ఒక్క క్షణం తటపటాయించింది. చివరకు నౌకరును పిలిచి,
"దగ్గరుండి సిద్ధాంతిగారికి ఇల్లు చూపించు" అని ఆజ్ఞాపించింది.
సిద్ధాంతిగారు ఇల్లు చూసి వచ్చారు.
"ఎల్లా వుంది? అద్భుతంగా వుంది కదూ?" అని అడిగింది శారదాంబ.
"తూర్పు ఈశాన్యాలు రవ్వంత పల్లం చేయించండి. కుబేర స్థానానికి బలం చేకూరుతుంది" అన్నారాయన.
ఆవిడ ముఖంలో చికాకు కనిపించింది.
"ఇప్పుడు మార్పులు చేర్పులు చెయ్యడానికి కుదరదు" అంది.
ఆయన లేచి నిలబడ్డారు.
బహుశః అప్పుడు ఆవిడకు అసలు విషయం గుర్తుకొచ్చింది కాబోలు...
"మీకు తాంబూలం ఇవ్వాలి కదా... ఊరికే ఎవ్వరిచేతా పని చేయించుకోవడం నా కిష్టం ఉండదు. మీకేం కావాలో అడగండి ఇస్తాను" అంది.
సిద్ధాంతిగారి మనస్సుకు క్షణకాలం మాయ కమ్మింది! పరమాత్మ మీద నుండి మనస్సు పదార్థం మీదకు మరలింది. చూపు మళ్లీ ఆ వటపత్రశాయి చిత్రం మీద నిలిచింది.
ఆవిడ కూడా అటువంక చూసింది. హేళనగా ఎగతాళిగా నవ్వింది.
"సిద్ధాంతిగారూ! మీకు ఇంత అత్యాశ కూడదు. ఆ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా? పదిహేను వేలు! మీ అంతస్తుకు, తాహతుకు తగినది అడగండి...ఇస్తాను" అంది.
'అడగండి...ఇస్తాను!' -- ఆయన మనస్సులో యీ మాటే పదేపదే మసలింది.
మాయ తొలగింది. వెలుగు వచ్చింది. వివేకం గుర్తు చేసింది.
'నువ్వు యాచకుడివి కావు! దైవజ్ఞుడివి!! ఇటువంటి ప్రలోభం, ప్రతిఫలాపేక్ష లేకుండా సమదృష్టితో, సమభావనతో ఫలితాలు చెప్పవలసినవాడివి.
ఆశలకు అతీతంగా దూరంగా ఉండవలసిన వాడివి. నీవు స్వీకరించవలసింది సంభావన! దానం కాదు!'
'ఎందుకు ఈ పొరబాటు జరిగింది?' అని మనస్సు ప్రశ్నించింది. నీ సాధన ఇంకా పూర్తికాలేదు. అందుకనే ఇటువంటి అగ్ని పరీక్షలు. దిగులు పడకు. 'ప్రమాదో ధీమతా మపి' అని అన్నారు. ఎంతటి వారికైనా యిటువంటి సమస్యలు తప్పవు' అంటూ హృదయం ఊరడించింది... చిన్నబోయిన మనస్సు చిరునవ్వు నవ్వింది. మల్లె కన్నా తేలికయ్యింది.
ఆవిడ చికాకుగా ఆయన వంక చూసింది.
"మీరు ఇంకా ఆ పెయింటింగ్ గురించే ఆశపడుతున్నారా? ఆ బొమ్మ సంగతి మరచిపొండి! అసలు విషయం గురించి ఆలోచించండి" అందామె.
బొమ్మను మరచిపొండి! అసలు విషయం గురించి ఆలోచించండి సిద్ధాంతిగారికి వినిపించింది.
అలవాటుగా ఆశీర్వదించడానికి అలవాటు పడ్డ చేతులు - అప్రయత్నంగా ఆవిడకి నమస్కరించాయి. క్షణం కాలు నిలవలేదు. ఎనుగెక్కినంత సంబరంతో యింటికి తిరిగి వచ్చాడు....ఉత్త చేతులతో!
కను సన్నలతోనే యిల్లాలు ప్రశ్నించింది - "క్షేమమా? లాభమా?"
"అది నువ్వే నిర్ణయించాలి. నా దృష్టిలో పెద్ద ప్రమాదం తప్పింది. గొప్ప గండం గడిచింది" అని ఆయన అనగానే ఆ యిల్లాలి మొహంలో ఆందోళన కనిపించింది.
"ఏం జరిగింది?" అని అడిగింది.
"తనది కాని దాని మీద మమకారం కలిగింది. ప్రతిబింబం- పదార్థమనే భ్రమ కలిగింది! అసలు విషయాన్ని గురించి ఆలోచించడం మానేశాను. నేను ఆలోచించవలసింది పరమాత్మను గురించి!..అది క్షణకాలం మరిచాను" అన్నారాయన.
"నాకు అర్థమయ్యేలా చెప్పండి" అందామె.
ఆయన జరిగిన విషయమంతా చెప్పారు. ఆ మాటలన్నీ విని ఆవిడ హాయిగా నవ్వింది.
"మీరు నిత్యం కొలిచే పర్వతరాజ నందిని ఆ శారదాంబగారి రూపంలో మీకు జ్ఞానోపదేశం చేసింది. మీ అంతరాళాల్లోని అజ్ఞానాన్ని ఒక్క మాటతో తొలగించింది. మీరు ఆశించిన దానికంటే ఎక్కువగానే సంభావించింది. ఆవిడకు మనం చాలా ఋణపడి ఉన్నాం" అందామె.
సిద్ధాంతిగారు పంచాంగం పరిశీలనగా చూశారు- ఎంతో సంతోషం వేసింది.
"సోమిదేవీ! నైధనతార వెళ్ళిపోయి మిత్రతార వచ్చింది" అని అన్నారు.
ఆయన మాట విని ఆ ఇల్లాలు నవ్వింది. ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది.
------@@@@@------
అన్ని ముహూర్తాలకు ప్రధానంగా తారాబలం చూస్తారు. ఈ తారాబలం తొమ్మిది రకాలుగా విభజించారు.
అవి: 1) జన్మతార,2) సంపత్తార,3) విపత్తార,4) క్షేమతార,5) ప్రత్యక్తార,6) సాధనతార,7) నైధనతార, 8) మిత్రతార, 9) పరమ మిత్రతార.
వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం నుండి ముహూర్తం నిర్ణయించవలసిన రోజున ఉన్న నక్షత్రం వరకూ లెక్కపెట్టి, వచ్చిన సంఖ్యను 9 చేత భాగించి, ఆ వచ్చిన శేషాన్ని బట్టి తారాబలం తెలుసుకుంటారు.
తప్పనిసరిగా చేయవలసిన పనులకు తారాబలం సరిపోకపోయినా, ప్రత్యామ్నాయాలు (దానాల వంటివి) సూచించారు పెద్దలు.
కానీ, నైధనతార అన్ని ముహూర్తాలయందూ విడిచిపెట్టాలని చెప్పారు.
(జన్మతార నుంచి 7, 16, 25 నక్షత్రాలు నైధనతారలు).
ఇక ఈ కథ విషయానికి వస్తే....
ఒక ఇంటింటి మాస పత్రికలో వచ్చిన ఈ కథలో రచయిత మల్లాది సూరిబాబుగారు ఎంతో లోతైన తత్త్వాన్ని, జ్యోతిషశాస్త్ర విషయాన్నీ ప్రబోధించారు.
ఈ కథకు నైధనతార అని అనే పేరు ఎందుకు పెట్టేరో, కథలో వటపత్రశాయి చిత్రాన్ని ఎందుకు తీసుకున్నారో అనే విషయాలను విశ్లేషించుకుంటే ఒక రచయితగా మల్లాది సూరిబాబుగారి భావాలు ఎంత పరిపక్వత చెందాయో, వారి పారమార్థిక చింతన ఎంతటిదో
మనం అర్థం చేసుకోవచ్చు.
ఆయన మూడు పాత్రల ద్వారా లోతైన జీవిత సత్యాలని ఆవిష్కరించారు.
నారాయణ సిద్ధాంతిగారు వేద వేదాంగాలు పఠించిన వారు. మంత్రదీక్షాపరులు. ఎన్నో శాస్త్రాలలో మహా పండితులు. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ, ఎవ్వరి దగ్గర్నుంచీ ఏమీ ఆశించని నిష్కామ కర్మ యోగి.
శారదాంబ మొదటిసారి ఆయన దగ్గరికి వచ్చి, ఆయనే దిక్కు అని వేడుకొన్నప్పుడూ.., ఆనక అన్నీ బాగున్నాకా ఆమె ఈయనను తన ఇంటికి తాంబూలానికి రమ్మని పిలిచి, ఆయనను ఒక సామాన్య యాచకుడిలాగ, యాయవారపు బ్రాహ్మణుని లాగ ఉద్దేశించి అవమానంగా మాట్లాడినప్పుడూ ఒకేలా చిరునవ్వుతో స్వీకరించారు. అంటే మానావమానాలకు ఆయన అతీతంగా ఉన్నారు.
నెలకు పదిహేను రోజులు పస్తులున్నా ఏనాడూ చేయిచాచి ఎవరినీ ఏమీ అడగలేదు.
అటువంటి నారాయణ సిద్ధాంతి గారు శారదాంబగారింట్లో వటపత్రశాయి చిత్రపటాన్ని చూసి ముగ్ధులైపోయారు. భక్తి భావంలో తన్మయులై ఏమి అడగాలో తెలియని స్థితిలోకి జారిపోయి, ఆ బొమ్మ మీదే దృష్టి పెట్టారు. కానీ...ఎంతయినా అది కేవలం చిత్రమే కదా! అసలుకి--ప్రతిబింబమే కదా!! అసలు పదార్థాన్ని దర్శించాలంటే లో చూపు కావాలి. ఎందుకంటే బాహ్యంగా కనపడేది ఏదయినా నశించేదే! నశ్వరమైన దానిని తను ఆశించడమేమిటి?
ఈ భావాలని చెప్పడం కోసమే రచయిత వటపత్రశాయిని తీసుకున్నారు. వటపత్రశాయి వృత్తాంతము భాగవతంలో మార్కండేయ మహర్షి చరిత్రలోనూ, మహాభారతం అరణ్య పర్వములోనూ వస్తుంది.
వటపత్రశాయి అంటే మర్రి ఆకు మీద శయనించిన దేవుడు (విష్ణువు) అని అర్థం.
మార్కండేయుడు విష్ణువును గూర్చి తపస్సు చేసి, తనకు వరంగా ఆ దేవదేవుని మాయ చూడాలని ఉంది అని అడుగుతాడు.
ఆ తరవాత విపరీతమైన గాలులూ, ధారాపాతంగా వర్షమూ వచ్చి సముద్రాలు పొంగిపోతాయి. నీటితో సమస్తం ములిగిపోతుంది. మార్కండేయుడు మోహ శోకాలతో విష్ణుమాయతో నీటిమీద జీవించాడు. అలా తిరుగుతున్న ఆయనకు ఒక చోట మర్రి ఆకుపై శయనించిన బాలుడు కనిపించాడు. అతడే వటపత్రశాయి. ఆ వటపత్రశాయి ఉదరంలో మార్కండేయునికి నీట ములిగిన సమస్త భూమి, ప్రాణికోటి కనిపిస్తుంది.
అపుడు మార్కండేయునికి నారాయణుని గురించి సమస్తమూ అర్థమవుతుంది. బ్రహ్మాది దేవతలు, సూర్య చంద్రులు, ఈ సృష్టి సమస్తమూ శ్రీ మహావిష్ణువే అని అర్థమవుతుంది. ఆయనకు మాయ స్వరూపం బోధపడుతుంది.
అలా క్షణకాలం మాయలో పడిన సిద్ధాంతిగారు ఆ అద్భుత కళాస్వరూపంలో పరమాత్మ స్వరూపాన్ని దర్శించడానికి బదులు ఆ చిత్రాన్నే కోరుకున్నారు.
ఇక నిధనం అంటే మరణం. అందుకే నైధనతార ఉన్నప్పుడు ఏ ముహూర్తమూ పెట్టరు. ఈ కథలో నైధనతారలో నారాయణసిద్ధాంతి గారు శారదాంబ ఇంటికి వెళ్ళేరు.
అక్కడ ఆయనకు ఒక చిత్రం పట్ల కమ్మిన మోహమనే మాయ నిధనమైంది. అందుకే రచయిత నైధనతార అని కథకి పేరు పెట్టారు.
ఈ లోకంలో శారదాంబగారి లాంటి వాళ్ళను చాలామందిని చూస్తాము. కష్టాలలో ఉన్నప్పుడు ప్రాధేయపూర్వకంగా మాట్లాడతారు. అవి గట్టెక్కి ఒడ్డునపడ్డాకా గతం మరచిపోయి, అహంకారం నెత్తికెక్కించుకుంటారు.
రేవు దాటించే దాకా ఓడ మల్లన్న, రేవు దాటేకా బోడి మల్లన్న అనేవాళ్లంటే వీళ్ళే!
'తాంబూలం ఇస్తాను' అని కబురంపిన ఆమె తనకు తోచింది ఇచ్చి పంపించాలి కానీ, "ఏం కావాలో అడగండి ఇస్తాను" అనడమేమిటి? అదే అహంకారం అంటే!
సోమిదేవమ్మ మహా దొడ్డ ఇల్లాలు. తన భర్త పట్ల శారదాంబ అలా ప్రవర్తించినా, ఆయనలో జ్ఞానజ్యోతిని వెలిగించిన పార్వతీదేవి గానే భావించింది. అంతకు మించిన సంభావన ఏదీ లేదని ఆనందపడింది.
ఈ కథ చదివాకా ఒక గొప్ప కథ చదివిన భావన కలిగింది.
***
04. రెండు పుస్తకాలు
మనలో మార్పును సృష్టించేది ప్రేమ; మార్పు అనేది మంచి కోసం జరగాలి.
మన చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం మనం మారడానికి సిద్ధంగా ఉన్నామా?
తమ వివాహ వార్షికోత్సవ సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట. నిజానికి వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.
వారి సంభాషణలో, భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను.
ఈ సంవత్సరం మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న వాటిని వీటిలో రాద్దాం.
వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని సరిదిద్దుకోడానికి కలిసి ప్రయత్నిద్దాం,” ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు.
ఇద్దరూ తమ తమ డైరీలు తీసుకున్నారు.
ఒక సంవత్సరం వేగంగా గడిచిపోయింది. మరుసటి సంవత్సరం వివాహవార్షికోత్సవం సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ ముందుగా నిర్ణయించుకున్న విధంగా తమ డైరీలను మార్చుకున్నారు.
మొదట, భార్య తనను ఉద్దేశించి వ్రాసిన డైరీని భర్త చదవడం ప్రారంభించాడు.
మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం. మీరు నాకు మంచి బహుమతి ఇవ్వలేదు" అని,
రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్కి తీసుకెళ్లలేదు."
మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."
" నా తరఫు బంధువులు వచ్చారు కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."
"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"
ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.
భర్త, “ఓ ప్రియా, నన్ను క్షమించు! ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు. భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.
ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు.
మొదటి పేజీ - ఖాళీ
రెండవ పేజీ - ఖాళీ
మూడవ పేజీ - ఖాళీ
... ఖాళీ
భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!
భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు. నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.
భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు.
భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది.
అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.
అలాగని నీలో ఏమి లేవని కాదు, నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.
నాలో లెక్కలేనన్ని క్షమించరాని తప్పులు ఉన్నప్పటికీ, నా జీవితంలోని ప్రతి దశలో నాకు నీడలా ఉన్నావు. నా నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.
అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..
మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!
****
05*కంచిలోని బంగారు, వెండి బల్లి వెనక ఉన్న రహస్యం ఏంటి..?*
*బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే భయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకుతుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని. అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ వున్నది.అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది.
మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది ..,? బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం...
బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు.
కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.
బల్లి ఇంట తిరగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడ కుండా....కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది.
పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరంపైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి.
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది.
బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటిది అసలు సిసలు బంగారు బల్లే కనిపిస్తే..? నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరిని విస్మయానికి గురి చేసింది.
చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని.. అవికూడా ఎక్కడో కాదు.. మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించటం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది. రాతి గుహలే ఆవాసం.
బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది.
ఇవి 150 నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి.
అనుకూల వాతావరణంలో జనం చడీచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటి పూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి.
***
No comments:
Post a Comment