Wednesday, 12 April 2023

ప్రాంజలి ప్రభ..*



ప్రాంజలి ప్రభ 

[*ఓం నమో నారాయణాయ*


*విష్ణువు వేయి నామములు- 1-200*


*వేయి నామములు*


*2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు*.


3) వషట్కార: - వేద స్వరూపుడు.


*4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.*


5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.


6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.


7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.


*8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు*.


9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.


10) పూతాత్మా - పవిత్రాత్ముడు.


11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.


*12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు*.


13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.


14) పురుష: - నవద్వారములు కలిగిన పురములో ఉండువాడు.


*15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.*


16) క్షేత్రజ్ఞ: - శరీరములో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.


17) అక్షర: - నాశరహితుడు.


18) యోగ: - యోగము చే పొందదగిన వాడు.


*19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు.*


20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత.


21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.


*22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.*


23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.


24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.


*25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు*


26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.


27) శివ: - శాశ్వతుడు.


28) స్థాణు: - స్థిరమైనవాడు.


29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.


30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.


31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.


32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.


33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.


34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.


35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.


36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.


37) స్వయంభూ: - తనంతట తానే ఉద్భవించిన వాడు.


38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.


*39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.*


40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.


41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.


42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.


*43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు*.


44) విధాతా - కర్మఫలముల నందించువాడు.


45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.


46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.


47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.


48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.


49) అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.


50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.


51) మను: - మననము (ఆలోచన) చేయువాడు.


52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.


53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.


54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.


55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.


56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.


57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.


58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.


59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.


*60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.*


61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.


62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.


63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.


64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.


*65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు*.


66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.


67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు)


68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.


69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.


*70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు*


71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.


72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.


73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.


74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.


75) విక్రమీ - శౌర్యము గలవాడు.


76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.


77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.


78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.


79) క్రమ: - నియమానుసారము చరించువాడు.


80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.


81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.


82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.


83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.


84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.


85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.


86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.


87) శర్మ - పరమానంద స్వరూపుడు.


88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.


89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.


90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.


91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.


92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.


93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.


94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.


95) అజ: - పుట్టుకలేని వాడు.


96) సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.


97) సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.


98) సిద్ధి: - ఫలరూపుడైనవాడు.


99) సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.


100) అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.


101) వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.


102) అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.


103) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.


104) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.


105) వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.


106) సత్య: - సత్య స్వరూపుడు.


107) సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.


108) సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.


109) సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.


110) అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.


111) పుండరీకాక్ష: - భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.


112) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.


113) వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.


114) రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.


115) బహుశిరా: - అనేక శిరములు కలవాడు.


116) బభ్రు: - లోకములను భరించువాడు.


117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.


118) శుచిశ్రవా: - శుభప్రధమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.


119) అమృత: - మరణము లేనివాడు.


120) శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.


121) వరారోహ: - జ్ఞానగమ్యమైనవాడు.


122) మహాతపా: - మహాద్భుత జ్ఞానము కలవాడు.


123) సర్వగ: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.


124) సర్వవిద్భాను: - సర్వము తెలిసినవాడు.


125) విష్వక్సేన: - అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్ధమునకు ఉపక్రమించినంతనే అసురసేన యంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విష్వక్సేను డాయెను.


126) జనార్దన: - దు:ఖమును కల్గించువాడు. ఆనందము నొసగూర్చువాడు.


127) వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.


128) వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు.


129) అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.


130) వేదాంగ: - వేదములనే అంగములుగా కలిగినవాడు.


131) వేదవిత్ - వేదములను విచారించువాడు.


132) కవి: - సర్వద్రష్ట యైనవాడు.


133) లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు.


134) సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.


135) ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు.


136) కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు.


137) చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.


138) చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు.


139) చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.


140) చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.


141) భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.


142) భోజన: - భోజ్యరూపమైనవాడు.


143) భోక్తా: - ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు.


144) సహిష్ణు: - భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.


145) జగదాదిజ: - సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు.


146) అనఘ: - పాపరహితుడైనవాడు.


147) విజయ: - ఆత్మజ్ఞానముతో వైరాగ్యసంపన్నుడై, శ్రేష్టమైన జయమునొందువాడు.


148) జేతా: - సదాజయము నొందువాడు.


149) విశ్వయోని: - విశ్వమునకు కారణభూతమైనవాడు.


150) పునర్వసు: - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.


151) ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.


152) వామన: - చక్కగా సేవించదగినవాడు.


153) ప్రాంశు: - ఉన్నతమైన శరీరము గలవాడు.


154) అమోఘ: - వ్యర్ధము కాని పనులు గలవాడు.


155) శుచి: - తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు.


156) ఊర్జిత: - మహా బలవంతుడు.


157) అతీంద్ర: - ఇంద్రుని అతిక్రమించినవాడు.


158) సంగ్రహ: - ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు.


159) సర్గ: - సృష్టియు, సృష్టికారణమును అయినవాడు.


160) ధృతాత్మా - తనపై తాను ఆధారపడినవాడు.


161) నియమ: - జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు.


162) యమ: - లోపలనుండి నడిపించువాడు.


163) వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.


164) వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.


165) సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.


166) వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.


167) మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.


168) మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.


169) అతీంద్రయ: - ఇంద్రియములద్వారా గ్రహించుటకు వీలులేనివాడు.


170) మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.


171) మహోత్సాహ: - ఉత్సాహవంతుడు.


172) మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు.


173) మహాబుద్ధి: - బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు.


174) మహావీర్య: - బ్రహ్మాండములను సృష్టించి, పోషించి, లయింపచేయు శక్తిసామర్ధ్యములు కలిగియున్నవాడు.


175) మహాశక్తి: - మహిమాన్విత శక్తిపరుడైనవాడు.


176) మహాద్యుతి: - గొప్ప ప్రకాశము అయినవాడు.


177) అనిర్దేశ్యవపు: - నిర్దేశించుటకు, నిర్ణయించుటకు వీలుకానివాడు.


178) శ్రీమాన్ - శుభప్రదుడు.


179) అమేయాత్మా - ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు.


180) మహాద్రిధృక్ - మందర, గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు.


181) మహేష్వాస: - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.


182) మహీభర్తా: - భూదేవికి భర్తయై, రక్షకుడైనవాడు.


183) శ్రీనివాస: - శ్రీమహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు.


184) సతాంగతి: - సత్పురుషులకు పరమగతి అయినవాడు.


185) అనిరుద్ధ: - మరొకరు ఎదురించువారు లేనివాడు.


186) సురానంద: - దేవతలకు ఆనందము నొసంగువాడు.


187) గోవింద: - గోవులను రక్షించువాడు.


188) గోవిదాం పతి: - వాగ్విదులు, వేదవిదులైనవారికి ప్రభువైనవాడు.


189) మరీచి: - తేజోవంతులలో తేజోవంతుడైనవాడు.


190) దమన: - తమకప్పగించబడిన బాధ్యతలనుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు.


191) హంస: - నేను అతడే (అహం బ్రహ్మస్మి)


192) సుపర్ణ: - అందమైన రెక్కలు గలవాడు.


193) భుజగోత్తమ: - భుజంగములలో ఉత్తముడు.


194) హిరణ్యగర్భ: - బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు.


195) సుతపా: - చక్కటి తపమాచరించువాడు.


196) పద్మనాభ: - హృదయపద్మమధ్యమున భాసించువాడు.


197) ప్రజాపతి: - అనంతజీవకోటికి ప్రభువైనవాడు.


198) అమృత్యు: - మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.


199) సర్వదృక్ - తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది, చేయునది అంతయు చూచుచుండువాడు.


200) సింహ: - సింహము. పాపములను నశింపజేయువాడు


*మరికొన్ని విశేషాలు భగవత్ అనుగ్రహంతో*


*సర్వదర్శనః*


*మా తల్లి గారు సేకరణ భాగ్యం*

*మొహమాటం-  సాయం* (కథ ) 

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు 


ఆ రోజు సుందరం  మాష్టారు అంగడికి వెళుతుంటే వెనుకే  బయల్దేరాడు వాళ్ళబ్పాయి చంటి.    పిల్లాడు చదివేది ఎనిమిదో తరగతే అయినా …. అన్ని విషయాల్లో  చురుకుగా ఉంటాడు.  


వాళ్లిద్దరూ అంగడిలోకి వెళ్లి  కాయగూరలు కొన్నారు. దుకాణం యజమానికి  డబ్బులివ్వబోతుండగా  అతడి  స్నేహితుడు రావడంతో మాట్లాడుతూ డబ్బు అందుకోలేదు. దీంతో కాసేపు తండ్రీ కొడుకులు ఆగాల్సి వచ్చింది.  


కొట్టు యజమాని  మోటారు సైకిలు కొత్తది కొన్నాడట. అప్పుడే  పూజ చేయించి తెచ్చాడట. అతడి మిత్రుడుకి   తొందరగా పని ఉన్నందున  బండి  తాళాలు అడిగాడు.  కానీ బండి ఇవ్వడం ఇష్టం లేనట్టుంది. “నేనూ  పని మీద  వెళ్ళాలి” అని చెప్పాడు దుకాణం యజమాని. 

కానీ ఆ మిత్రుడు వదల్లేదు. తొందరగానే వచ్చేస్తానని చెప్పాడు.  కొట్టు యజమాని ఏది చెప్పినా వినిపించుకోకుండా  “ బండి తాళం ఇవ్వలేని నీదీ ఒక స్నేహమేనా?” అన్నాడు కోపంగా.  తప్పనిసరి పరిస్థితుల్లో  తాళం ఇచ్చాడు కొట్టు యజమాని. 


మిత్రుడు వెళ్ళిపోగానే “తాళం ఇచ్చేవరకు  ఎలా పీడించాడో చూసారా? ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సి వచ్చింది” అన్నాడు కొట్టు యజమాని.  


“అంత మొహమాటం పనికి రాదు. ఇవ్వాలని లేకపోతే  ఖచ్చితంగా చెప్పాల్సింది“ బదులిచ్చాడు సుందరం. 


అతడికి డబ్బు చెల్లించేసి వెళుతుండగా  ‘మొహమాటం అంటే ఏమిటి’అనడిగాడు చంటి.  జవాబు చెప్పబోతుండగా ఎదురుగా  టెంకాయల దుకాణం కనబడడంతో , కొబ్బరికాయలు కొనాలని గుర్తొచ్చి  అటు నడిచాడు సుందరం. 

కొబ్బరికాయలు చూస్తుండగా ఒకామె  వచ్చి “అయ్యా! మా అమ్మాయికి బాగాలేకపోతే ఆసుపత్రికి తీసుకొచ్చాను. బస్సులో ఎవరో మా డబ్బులు దొంగిలించారు.  ఖర్చులకు డబ్బుల్లేవు.  సాయం చెయ్యండయ్యా”  అంది. 

 యాభై రూపాయలు తీసి  ఆమెకు ఇవ్వబోయాడు సుందరం. 

“ ఆ డబ్బు  డాక్టరుకి కూడా చాలదు. పెద్ద మనసు చేసుకుని ఎక్కువ డబ్బులివ్వండి” అందామె  దీనంగా . ఆమె ప్రక్కనే  బలహీనంగా ఉన్న అమ్మాయి కనబడింది. నీరసంగా దగ్గుతోంది. వాళ్ళిద్దరినీ చూడగానే సుందరానికి జాలి కలిగింది. 


“ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందరినీ అడిగితే అవసరానికి డబ్బు వస్తుంది కదా.  నేనొక్కడినే ఎలా ఇవ్వగలను?”  అనడిగాడు సుందరం. 

“వాళ్ళనడిగితే బిచ్చగాళ్ళనుకుని రెండు రూపాయలు,  అయిదు రూపాయలు ఇచ్చారు. . అవెటూ సరిపోవు. మీరొక్కరే యాభై ఇవ్వడం చూసి అడిగాను. మేము రైతులం. బిచ్చగాళ్లం కాదు” అంది ఆమె. 

ఆ మాటలకు జాలిపడిన సుందరం అయిదు వందల రూపాయలను ఆవిడ చేతిలో పెట్టాడు. అది చూసిన కొబ్బరికాయల కొట్టువాడు “అంత మొహమాటమయితే ఎలాగండీ? ఎంతడిగితే అంతిస్తారా?“ అన్నాడు ఎగతాళిగా. 


“అడిగితే  ఇవ్వలేదు. వాళ్ళని నమ్మాను కాబట్టి ఇచ్చాను. మొహమాటంతో కాదు” అనేసి అక్కడ నుండి బయల్దేరాడు సుందరం. 


“ఇందాక కూరగాయల కొట్టు యజమానిది మొహమాటం అన్నావు. ఇప్పుడు నీది మొహమాటం కాదన్నావు. మరైతే  ఏమంటారు?” అనడిగాడు చంటి.  


“సాయం “ అన్నాడు సుందరం నవ్వుతూ.  


 “మొహమాటానికి , సాయానికి తేడా ఉందా?” మళ్ళీ అడిగాడు చంటి.  ఉందన్నాడు సుందరం.  తనకి అర్ధమయ్యేలా చెప్పమన్నాడు   చంటి. 


“ఒకరికి ఇవ్వడం  వల్ల వచ్చే ఆనందం కంటే , ఇస్తున్నందువల్ల కలిగే బాధ ఎక్కువైతే దాన్ని  మొహమాటం అంటారు.  ఇందాక కూరగాయల కొట్టువాడి  మోహంలో ఆ బాధను  చూసే ఉంటావు“ అన్నాడు సుందరం. 


అవునన్నాడు నవ్వుతూ చంటి. 


“ఒకరికి ఇవ్వడం వల్ల  కలిగే బాధ కంటే, ఇవ్వడంలో ఉండే ఆనందం ఎక్కువైతే   సాయం అంటారు.  కష్టాల్లో ఉన్న సాటి మనిషికి  చేయూత అందించానన్న తృప్తి కలిగింది తప్ప  విచారం, బాధ   కలగలేదు నాకు“ అన్నాడు  సుందరం. 


“అర్ధమైంది నాన్నా . నేను కూడా అవసరంలో ఉన్నవాళ్ళకి సాయం చేస్తాను.   మొహమాటానికి పోయి ఎవరికీ ఏదీ ఇవ్వను“ అన్నాడు చంటి. 


కొడుకుని తనతో అంగడికి తీసుకెళ్ళినందుకు  జ్ఞానం పెరిగే  సంఘటనలు జరిగాయని సంతోషించాడు సుందరం.

[

*👍బ్రతుకంటే బ్రతుకే*👍


*ఒక యువకుడు గురువు గారి దగ్గరకి వచ్చాడు."నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి. కాసింత కూడు పెట్టండి. ఏదో దేవుడిని తలచుకుంటూ, మీ సేవ చేసుకుంటూ బతుకుతాను." అని అడిగాడు."నీకేం వచ్చోయ్?" అని ప్రశ్నించారు గురువుగారు."నాకేమీ రాదండీ. చదువుకోలేదు. ఏ విద్యా నేర్చుకోలేదు. కప్పులు కడగడం, ఇల్లు ఊడ్వడం వంటి పనులు వచ్చు. అంతే నండీ" అన్నాడు యువకుడు."ఇంకే పనీ రాదా?" "అంటే ... చదరంగం కొద్దిగా వచ్చు."*


*అప్పటికప్పుడు చదరంగాన్ని తెప్పించారు గురువుగారు. "ఆటాడుదాం. ఒకటే పందెం. ఇదిగో ఈ కత్తిని చూశావా? ఓడిన వాడి ముక్కు తెగ కోయాలి. ఒప్పుకుంటావా?" యువకుడికి ఉద్యోగం కావాలి. ఇంకో మార్గం లేదు. ఒప్పుకున్నాడు. ఆట మొదలైంది. యువకుడు మొదట్లో కొన్ని తప్పులు చేశాడు. ఆటలో వెనకబడ్డాడు. అతని దృష్టి పొడవాటి కత్తిపై పడింది. చేత్తో ముక్కును తడుముకున్నాడు. మొత్తం దృష్టినంతా కేంద్రీకరించాడు. ఏకాగ్రతతో పావులు కదిపాడు. యువకుడిదే పైచేయి అయింది. ఇంకో రెండు మూడు ఎత్తులతో గురువుగారిని చిత్తు చేసే స్థితికి వచ్చాడు. ఆ సమయంలో అతను మళ్లీ కత్తి వైపు చూశాడు. గురువుగారి ముక్కు వైపు చూశాడు. ఏమనుకున్నాడో ఏమో కావాలనే ఒక తప్పుడు ఎత్తుగడ వేశాడు. గురువు గారు ఒక్క ఉదుటున లేచి కత్తితో చదరంగం పై పావులను తోసేశారు. "ఆట అయిపోయింది. నువ్వు ఆశ్రమంలో ఉద్యోగానికి ఎంపికయ్యావు." అన్నారాయన.*

 

*యువకుడికి ఏమీ అర్ధం కాలేదు. మంచి పనివాడికైనా, మంచి సాధకుడికైనా రెండు గుణాలుండాలి. మొదటిది "మహాప్రజ్ఞ" అంతులేని ఏకాగ్రతతో దృష్టిని చేస్తున్న పని మీదే పెట్టగలగాలి. రెండవది అన్నీ ఉన్నా అతనికి తప్పనిసరిగా "మహాకరుణ" ఉండాలి. నువ్వు గెలిచే ఆటని నేను ఓడకుండా ఉండేందుకు వదులుకున్నావు. నా ముక్కు తెగే కన్నా నీ ముక్కు తెగడమే మంచిదనుకున్నావు. ఇదే మహాకరుణ. ఈ రెండు గుణాలూ నీకున్నాయి. అందుకే నువ్వు మాతోటే ఉండు." అన్నారు గురువుగారు.*


*నిజం... బ్రతుకు గెలుపు కాదు... ఓటమి కాదు. బ్రతుకంటే బ్రతుకే!!*

🙏🙏🍁🍁❤‍🔥🍁🍁🙏🙏

[


ఒక స్వర్ణకారుడి మరణంతో, అతని కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. తినడానికి సరిపడా డబ్బు కూడా వారి వద్ద లేదు. ఒకరోజు అతని భార్య తన కొడుక్కి నీలమణిహారాన్ని ఇచ్చి - "నాయనా, దీన్ని మీ మామయ్య దుకాణానికి తీసుకెళ్లు, ఈ హారాన్ని అమ్మి, మనకు కొంత డబ్బు ఇవ్వమని మీ మామయ్యకు చెప్పు", అని అంది.

కొడుకు ఆ హారాన్ని తీసుకుని మేనమామ దుకాణానికి చేరుకున్నాడు.

మేనమామ ఆ హారాన్ని క్షుణ్ణంగా చూసి - "నాయనా, ప్రస్తుతం మార్కెట్ బాగా మందంగా ఉందని అమ్మకు చెప్పు. కొంత కాలం తర్వాత అమ్మితే మంచి ధర వస్తుంది", అని కొంత డబ్బు ఇచ్చి, "రేపటి నుండి వచ్చి నాతో పాటు దుకాణంలో కూర్చో" అని చెప్పాడు.

మరుసటి రోజు నుండి, ఆ కుర్రవాడు ప్రతిరోజూ దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టాడు, అక్కడ వజ్రాలను, రత్నాలను ఎలా పరీక్షించాలో నేర్చుకోవడం ప్రారంభించాడు.

*త్వరలోనే, అతను వజ్రాల నాణ్యతను పరీక్షించడంలో అనుభవశాలి అయ్యాడు. ప్రజలు తమ వజ్రాలను పరీక్షించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి రావడం ప్రారంభించారు.

ఒకరోజు మేనమామ, ‘‘అమ్మ హారాన్ని ఇప్పుడు తీసుకుని రా… ఇప్పుడు మార్కెట్ బాగుందని చెప్పు, నీకు మంచి ధర వస్తుంది’’, అన్నాడు.

 తల్లి వద్ద నుండి హారాన్ని తీసుకుని ఆ యువకుడు స్వయంగా పరీక్షించగా అది నకిలీదని తేలింది.   మేనమామ అంత గొప్ప అనుభవశాలి అయ్యి కూడా, వారికి ఈ విషయం ఎందుకు తెలియజేయలేదని ఆశ్చర్యపోయాడు.

*హారాన్ని ఇంట్లోనే వదిలేసి తిరిగి దుకాణానికి వచ్చాడు*

మేనమామ, “హారం తీసుకురాలేదా?” అని అడిగాడు. 

*"మామయ్యా, ఈ హారం కృత్రిమమైనది, నిజమైనది కాదు ....  మీరు ఈ విషయం నా నుండి ఎందుకు దాచారు?" అని అడిగాడు.*

*దానికి అతని మేనమామ, “నువ్వు నాకు హారం తెచ్చిన వెంటనే అది కృత్రిమమైనది అని చెబితే, నువ్వు కష్టాల్లో ఉన్నందువల్లనే నేను నీకు సహాయం చేస్తున్నాను అని అనుకునేవాడివి".*

*”ఈ రోజు నీకు నీకుగా జ్ఞానం ఉంది గనుక, హారం నిజంగా నకిలీదని నీకు ఖచ్చితంగా తెలిసింది. ఆ సమయంలో, నిజం మాట్లాడటం కంటే సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ముఖ్యమనిపించింది", అని చెప్పాడు.*

*నిజం ఏమిటంటే, జ్ఞానం లేనప్పుడు, మనం ఆలోచించేది , ఈ ప్రపంచంలో చూసేది, తెలుసుకున్న ప్రతిదీ తప్పే.  దీని కారణంగా, మన సంబంధాలు అపార్థాలకు గురవుతాయి, అది విభేదాలకు దారి తీస్తుంది, మన జీవితబంధాలు విడిపోవడం ప్రారంభమవుతాయి.*


మన సంబంధాలు ఒక అదృశ్య దారం ద్వారా ముడిపడి ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం ద్వారా అది సంరక్షించబడుతుంది.


 *ఒక చిన్నపాటి ఒత్తిడి వల్ల లేదా అపార్ధం వల్ల సంబంధాలలో ఎవరి పక్షాన్ని వదలకండి ...*

వ్యక్తులను మీ స్వంతం చేసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది.

                     మనం చెప్పే నిజం ఎలా ఉండాలంటే, అది ఇతరులలో ప్రేమను రేకెత్తించే విధంగా ఉండాలి.

[

కొన్ని బంధుత్వాలు పుట్టుకతో ఏర్పడతాయి. పుట్టగానే తల్లిదండ్రులనే బంధం కలుగుతుంది. ఆ ఇంట్లో వాళ్లతో రక్త సంబంధం ఏర్పడుతుంది. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, మామయ్య ఇలాంటి బంధుత్వాలు పుట్టుకతో సహజంగా ఏర్పడతాయి. కొన్ని బంధాలు మనిషి పెరిగి పెద్దయ్యాక ఏర్పరుచుకుంటాడు. స్నేహితులు, జీవిత భాగస్వామి ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. అయితే, ఏ బంధం ఎప్పుడు, ఎందుకు ఏర్పడుతుందో ఊహించలేం. ఒకసారి ముడిపడిన బంధాన్ని తుంచుకోకుండా ఉండటం మన ప్రవర్తనలోనే ఉంటుంది.

పసితనంలో అమ్మ తప్ప మరో బంధం తెలియదు. కాస్త పెద్దయ్యాక నాన్న, అన్నదమ్ములు అన్న స్పృహ కలిగి వారితో అనుబంధం పెరుగుతుంది. పెద్దయ్యే కొద్దీ సమాజంలోని రకరకాల వ్యక్తులతో బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే, బంధాలు ఏర్పడటం ఎంత సులభమో, వాటిని నిలుపుకోవడం అంత కష్టం. లౌకిక ప్రపంచంలో అందరూ తోడు కోరుకునేవారే! కానీ, ఒకానొక దశలో ఏ బంధం కోసం అంతగా ఎదురుచూశారో, అదే బంధాన్ని ప్రతిబంధ కంగా భావిస్తుంటారు. అవసరార్థం ఏర్పరుచుకున్న బంధాల్లో ఇలాంటి కప్పదాటు వైఖరులు కనిపి స్తుంటాయి. లౌకిక సమాజంలో ఇలాంటి ఉదంతా లు తరచుగా చూస్తూనే ఉంటాం. ఆస్తి కోసం సోదర బంధాన్ని వదులుకోవడా నికి సిద్ధపడతారు కొందరు. అదే ఆస్తిపాస్తులకు ఎక్కడ ఎసరు పెడుతుందో అని ఆప్యాయంగా పలకరించే సోదరికి కనిపించకుండా ముఖం చాటేసే వాళ్లూ ఉన్నారు. అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావించి పేగుబంధా న్ని మరచి వారిని వృద్ధాశ్రమాల్లో పడదోసే ప్రబుద్ధులూ కోకొల్లలు. ఏ బంధ మూ శాశ్వతం కాకపోవచ్చు. కానీ, భౌతికంగా జీవించి ఉన్నంత కాలం వాటిని కాపాడుకోవడం మానవ ధర్మం.

బంధాలను తెంచుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో వివరించే కథలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. వాలి, సుగ్రీవులు సోదరులు. చిన్న అనుమానం ఇద్దరి మధ్యా ఉన్న సోదర బంధాన్ని తుంచివేసింది. చివరికి సుగ్రీవుడు అన్నను కోల్పోయాడు. రావణుడు తన తమ్ముడు విభీషణుడితో ఉన్న బంధాన్ని తెంచుకున్న తర్వాత లంకకు చేటు దాపురించింది. వ్యక్తిగత బంధాలను నిలుపుకోవడం ఎంత ప్రధానమో, ఇతరుల అనుబంధాలనూ గుర్తించడమూ అంతే అవసరం. సీతారాముల అనుబంధాన్ని చూసి ఓర్వలేక శూర్పణఖ పన్నిన కుట్ర ఆ దంపతులకు పుట్టెడు కష్టాలు తెచ్చిపెట్టింది. కురుక్షేత్ర సంగ్రామానికి బంధాల మధ్య పొడచూపిన వైషమ్యాలే ప్రధాన కారణాలుగా నిలిచాయి. పురాణాల్లో బంధాల విలువల గురించిన గాథలు ఎన్నో కనిపి స్తాయి. అంధులైన తల్లిదండ్రులపై శ్రవణకుమారుడి భక్తి తరతరాలకూ ఆదర్శం. రాముడు-సుగ్రీవుడి మధ్య ఏర్పడిన బంధం లోక కల్యాణానికి కారణమైంది. ‘సుగ్రీవ మైత్రి’ అని నేటికీ ఉదహరిస్తుంటారు. శ్రీకృష్ణుడు-కుచేలుడి బంధం స్నేహధర్మానికి చుక్కాని వంటిది.

ఇహంలో అనుబంధాలను కాదనుకొని భగవంతుడితో బంధం కొనసాగిస్తా నంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. సర్వసంగ పరిత్యాగి అయినా సమాజంతో, ప్రకృతితో సంబంధం కొనసాగిస్తాడు. తన తపస్సు సమాజానికి ఉపయోగపడాలని భావిస్తాడు. ఆత్మీయులను తూలనాడుతూ భగవంతుడికి దండప్రమాణాలు చేసినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అలాంటి వ్యక్తులతో బంధానికి భగవంతుడు అంగీకరించడు. సత్యం, ధర్మం పాటిస్తూ, మానవీయ సంబంధాలను గౌరవించే వ్యక్తులను భగవంతుడు తన బంధుగణంగా భావిస్తాడు. ఈ మార్గంలో పయనించిన ఎందరో సామాన్యులు భగవత్‌ బంధువులు అయ్యారు. నిష్కళంకమైన స్వామిభక్తి వానరులను శ్రీరాముడి పరివారంలో ప్రముఖులను చేసింది. నిర్మలమైన మనసు రేపల్లె గోపబాలురను శ్రీకృష్ణుడికి ఆత్మీయులను చేసింది. అందుకే, బంధాలను గౌరవిద్దాం. భగవంతుడికి బంధువులం అవుదాం.

[


🕉️   *ధర్మ నిష్ఠ* 🕉️


రాముడు, "తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది?      రావణాసురుడు ఘోర తపస్సు చేసి, అనేక శక్తులను, వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే.


కానీ! రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?


కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన, జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు.


నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత "ధర్మాచరణం".


ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి."ధర్మాన్ని రక్షిస్తే! అది మనల్ని రక్షిస్తుంది’ అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి.


ఇందులోని విచిత్రమేమిటంటే,ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. 

శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.


తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక   "అస్త్ర శస్త్రాలను"   కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.


అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.


*ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః  | |*

 

*అని ఉపనిషద్వాక్యం.*


ఋజు వర్తనము,  సత్య వాక్పరిపాలనము ,   వేదశాస్త్రముల అధ్యనము,    శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట,  అంతరింద్రియ నిగ్రహము,  దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే.


దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు.  మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.


కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు.


అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు.  కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".


 ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు.


కధ 

ప్రసిద్ధులైన జెన్‌ గురువుల్లో బొకుజు ఒకరు. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. వారికి ఆయన వింత వింత పనులు చెప్పేవాడు. ఆయన మఠానికి కొంత దూరంలో ఒక నీటి వాగు ఉండేది. ఒక రోజు బొకుజు తన శిష్యులను పిలిచి... ‘‘ఈ రోజు మీరు సాధన చేయాల్సింది ఏమిటంటే... మీరు ఆ వాగు దాటి అటువైపు వెళ్ళాలి. తిరిగి ఇటువైపు రావాలి. కానీ నీరు మిమ్మల్ని తాకకూడదు’’ అని చెప్పాడు.

శిష్యులందరూ ఆ వాగు దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అక్కడ తెప్ప లాంటిది ఏదీ లేదు. వంతెన కూడా లేదు. మరి నీరు తగలకుండా ఎలా దాటాలి? ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ప్రయత్నించారు. చివరకు... నీరు తగలకుండా ఆవలి గట్టుకు వెళ్ళడం, రావడం అసాధ్యమని తెలుసుకున్నారు. ఆ వాగులో ఎక్కడ కాలు పెట్టినా... మోకాలి లోతు నీళ్ళున్నాయి. ‘కాస్త లోతు లేని చోట నడిస్తే పాదాలు మాత్రమే తడవవచ్చేమో! దాన్ని గురువుగారు మన్నించవచ్చేమో!’ అనుకొని అలాంటి ప్రదేశం కోసం వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. వారు నిరాశతో మఠానికి తిరిగి వచ్చారు.

వారిని చూసిన గురువు ‘‘సాధన బాగా చేశారా? నీరు అంటకుండా వాగును దాటి వచ్చారా?’’ 

అని అడిగాడు.

శిష్యులు తలవంచుకొని, ‘‘లేదు గురువుగారూ! నీరు అంటకుండా అది దాటడం అసాధ్యం. మీరెప్పుడూ అలాంటి పనులే మాకు చెబుతూ ఉంటారు’’ అని గొణుక్కున్నారు.

‘‘అదేమంత కష్టమైన పని కాదే? నేను చేసి చూపిస్తాను, పదండి’’ అన్నాడు బొకుజు.

శిష్యులందరూ ఎంతో ఆశ్చర్యంతో, ఆనందంతో, కుతూహలంతో ఆయన వెంట బయలుదేరారు. ‘గురువుగారు నీటి మీద నడిచి అద్భుతం చేస్తారా? అప్పుడైనా ఆయన పాదాలు తడిసిపోతాయి కదా! చూద్దాం, ఎలా చేస్తారో?’ అని వారిలో వారు గుసగుసలాడుకున్నారు.

బొకుజు ఆ వాగులో దిగి అవతలి ఒడ్డుకు నడిచాడు. ఆయన వెంట శిష్యులు కూడా నీళ్ళలోకి దిగారు. ‘అబ్బ! నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో!’ అని కొందరు, ‘కింద ముళ్ళు, పదునైన రాళ్ళు గుచ్చుకుంటున్నాయి’ అని మరికొందరూ అనుకుంటూ ఆయన వెంట నడిచారు.

అటువైపు వెళ్ళిన తరువాత... ..మనం వెనక్కు పోదాం’’ అంటూ మళ్ళీ నీళ్ళలో బొకుజు నడవడం మొదలుపెట్టాడు. గురువు ఒక్క మాట మాట్లాడకుండా... నిర్వికారంగా, ప్రశాంత వదనంతో నడిచి వస్తే, శిష్యులందరూ నీటి గురించీ, అడుగున ఉన్న నేల గురించీ రకరకాలుగా మాట్లాడుతూ గట్టుకు చేరుకున్నారు.

‘‘చూశారా! నీరు తాకకుండా నేను ఎలా దాటానో!’’ అన్నాడు బొకుజు.

శిష్యులు ఆయన కాళ్ళవైపు చూపిస్తూ ‘‘ఎక్కడ గురువర్యా! మీ కాళ్ళు నీటితో తడిశాయి. చూడండి, మీ మోకాళ్ళ వరకూ నీళ్ళు అంటుకున్నాయి’’ అని అన్నారు.

‘‘మీరు చెబుతున్నది నిజమే! నీళ్ళు నా కాళ్ళకు అంటాయి. కానీ నన్ను అంటలేదు. నీటిలో దిగిన వెంటనే మీరంతా నీళ్ళు చల్లగా ఉన్నాయనీ, అడుగున ఉన్న నేల గుచ్చుకుంటోందనీ, నడవడం కష్టంగా ఉందనీ అన్నారు. నేను అలాంటి మాటేదీ అనలేదు. ఎందుకంటే నీరు కానీ, అడుగున ఉన్న నేల కానీ నన్ను తాకలేదు, బాధించలేదు. అలా ఉండడాన్నే సాధన చెయ్యాలి. అలాంటి సాధనే విలువైనది’’ అని చెప్పాడు బొకుజు.

‘‘నీటిలో పడవ ఉండవచ్చు. పడవలోకి నీరు వస్తే అది మునిగిపోతుంది. నీవు సంసారంలో ఉండవచ్చు. సంసారం నీలో ప్రవేశిస్తే మునిగిపోతావు’’ అనేవారు రామకృష్ణ పరమహంస. ‘పద్మపత్ర మివామ్భసా’ అన్నాడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు. అంటే ‘తామరాకు నీటిలో ఉన్నా దానికి నీరు అంటదు’ అని అర్థం. బొకుజు తన శిష్యులకు బోధించింది కూడా అదే.

[

 శ్రీశైల క్షేత్రం

 పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు.వుండేవాడు.అతడు మహా బలవంతుడు,అతడి ముక్కు,చెవులు,ముక్కు రంధ్రాలు,కళ్ళు అన్నీ చాలా భయంకరంగా కొండ గుహల్లా వుండేవి.అతడి బాహువులుమద్ది చెట్టు కొమ్మల్లాగా,జుట్టు పెద్ద పొదరిల్లు లాగ వుండి,శిరస్సు పర్వత శిఖరం లా ఎత్తుగా వుండేది.తనకు ఎవరితోనూ చావు లేకుండా వరం పొందటానికి అతడు బ్రహ్మను గూర్చి ఒక ఏకాంత ప్రదేశంలో తపస్సు చేయ నారంభించాడు .ఎండనూ,,వాననూ లెక్క చేయకుండా కనుబొమల నడుమ జ్యోతిని దర్శిస్తూ బాహ్య లోకాన్ని మరిచి,ఏకాగ్ర చిత్తం తో కాలి బొటన వేలిమీద నిలబడి రెండు చేతులూ పైకెత్తి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు.దానితో లోకాలు తల్లడిల్లి పోయాయి.అతడి తపాగ్ని జ్వాలలకు జగాలు దగ్ధమై పోతున్నాయి.దానితో బ్రహ్మ ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు.

అరుణుడు ఆనంద పరవశుడై నాకు దేవతల చేత గానీ,రెండు కాళ్ళ జీవాలతో గానీ,నాలుగు కాళ్ళ జీవులతో గానీ.నరులచేత గానీ,మరణం లేకుండా వుండేటట్టు వరం ప్రసాదించు అని వేడుకున్నాడు.తధాస్తు అన్నాడు బ్రహ్మ.

  వరగర్వం తో కన్నూ మిన్నూ గానకుండా సంచరించ సాగాడు అరుణుడు.శత్రువులైన దేవతల మీదికి దండెత్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు.దిక్పాలకులందరినీ జయించి ముల్లోకాలకూ అధిపతి అయ్యాడు.అతడి దుష్కృత్యాలకు తాళలేక దేవతఃలందరూ జగజ్జనని ప్రార్థించారు.నీవుతప్ప మాకు ఎవరూ దిక్కులేరు అమ్మా నేవే మమ్మల్ని కాపాడాలి అని విధవిధాలుగా ఆమెను స్తోత్రం చేశారు.

 వారిమీద దయ కలిగి అంబిక ప్రత్యక్ష మైంది.ఆమె కోటిసూర్యుల ప్రకాశం తో చూడ నలవికాని తేజస్సు తో ప్రకాశిస్తూ వుంది.ఆమె వారి కోరిక విని అరుణుడిని అంతం చేస్తానని అభయం యిచ్చింది. వెంటనే అంబిక యుద్ధ సన్నాహం గావించింది. .భూమ్యాకాశాలు దద్దరిల్లేలా వికటాట్టహాసం చేసింది. ఆ ధ్వనులకు సముద్రాలు అల్లకల్లోల మయ్యాయి,రాక్షసుల హృదయాలు బ్రద్దలయ్యాయి.ప్రళయ కాలం లోని వైపరీత్యాలను తలపించే శబ్దాలు విని అరుణుడి మనస్సు వికలమైంది.ఆ ధ్వనులు 

వచ్చిన ప్రదేశానికి చతురంగ బలాలతో తరలి వచ్చాడు.ఉభయ సేనలు పోరు ప్రారంభించారు.పోరు ఘోరంగా సాగింది.రాక్షస బలాన్ని యెదిరించ లేక దేవతలు దీనావస్థ లో వుండటం చూసి పరాశక్తి సింహ నాదం చేస్తూ అసుర సైన్యాన్ని కుప్పలు కుప్పలుగా నరికివేసింది.రుద్రుడు అనేక రూపాలు దాల్చి వచ్చినట్లుగా అయి శత్రు మూకలను చెల్లాచెదరు చేసేసింది.అరుణుడు పంపిన అతని అమాత్యులనందరినీ    తేజోమూర్తి యై   ఎదుర్కొని అందరినీ నేల కూల్చింది.ఆమె చూడ శక్యం గాని తేజం తో విజ్రుభించడం చూసి అరుణుడు స్వయంగా ఆమెను ఎదుర్కొన్నాడు.ఒకరిపై ఒకరు ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగించారు.జగదంబ వాడిని ఎన్ని మార్లు సంహరించినా అరుణుడు మరో రూపంతో వచ్చి యుద్ధం చేయసాగాడు.అది చూసి అంబిక ఆశ్చర్య పోయి వీడు అస్త్ర శస్త్రాల చేత చావడని తెలుసుకొని వెంటనే మహా భ్రామరీ రూపాన్ని ధరించి చూడనలవి కాని కాంతి పుంజాలను వెదజల్లుతూ పెద్ద గుహ వంటి నోటితో తన రెక్కలగాలికి పర్వత శ్రేణు లే కదిలేట్టు చేస్తూ చెవులు చిల్లులు పడేట్టు ఝంకారం చేస్తూ మహా వేగంగా అరుణు డిపై దాడి చేసింది. దాంతో అరుణుడు నిశ్చేష్టు డయ్యాడు.వ్యాకులత చెందిన మనస్సుతో దిగ్భ్రాంతు డయ్యాడు.అదే సమయం లో దర్శన మాత్రం తోనే దీనావస్థ నొందిన ఆ దుష్ట రాక్షసుడిని భ్రమర రూపం లో నున్న అంబిక హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహుని లాగ వాడి వక్ష స్థలం చీల్చి వేసింది.దాంతో వజ్రాయుధం తో 

రెక్కలు ముక్కలై నెల గూలిన పర్వతం లా భూమిపైకి ఒరిగాడు.

దేవతలు పూల వర్షం కురిపించారు.మహోగ్రమైన భ్రామరీ రూపానికి భయపడి బ్రహ్మాది దేవతలు రక్షించు తల్లీ ప్రసన్ను రాలివై సాక్షాత్కరించు నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించు అని వేడుకున్నారు.

వారి స్తుతికి ఆనందించి జగదంబ ఉగ్ర రూపాన్ని వదిలి జగన్మోహనాకార మైన దివ్య రూపంతో వారి ఎదుట ప్రత్యక్ష మైంది.వారు సంతోషించి తల్లీ!నీవు భూలోకం లో భక్తులను అనుగ్రహించడానికి ఎక్కడైనా ఒక 

చోట నిలువవలిసింది అని ప్రార్థించారు.అప్పుడా జగజ్జనని మీరు కోరిన విధంగా భూలోకం లో సర్వ తీర్థాలూ,నదీనదాలకూ నిలయమైన శ్రీశైల క్షేత్రం లో నివసిస్తాను.అని చెప్పింది.   ఆమె అక్కడి శివుడిని మల్లికా పుష్పములతో పూజ చేసింది అందుకనీ ఆ స్వామికి మల్లికార్జునుడనే పేరు వచ్చింది.మామూలుగా కవులు మగవారిని తుమ్మెదలుగాను ఆడవారిని పువ్వులతోనూ పోలుస్తారు.కానీ యిక్కడ అమ్మవారు తుమ్మెద గానూ,అయ్యవారు మల్లికా పుష్పముల పేరు మీద మల్లికార్జునుడు గా  ప్రసిద్ధులైనారు.

ఆవిధంగా శ్రీ మలికార్జున మహాదేవుడికి పడమర భాగాన చల్లని తల్లి భ్రమరాంబ గా వెలసి అనాదిగా భక్తుల కోరికలను తీరుస్తూ వారి కొంగు బంగారమై విలసిల్లింది.

అమ్మవారి ఆలయం వెనుక గోడల నుండి యిప్పటికీ భ్రమర ఝంకారం (తుమ్మెద నాదం)వినిపిస్తుందని భక్తుల నమ్మకం .. . .

*అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు

No comments:

Post a Comment