Sunday, 16 April 2023

ప్రాంజలి ప్రభ...*

 [


కర్ణుడు కవచకుండలాలతో ఎందుకు పుట్టాడు....!!

కర్ణుడు.. కుంతీదేవి కి పుట్టలేదు.. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు.. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు. అంతే..

కన్యగా ఉన్న కుంతికి., దూర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం... ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు.. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థం చేసుకుంటే... కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది..
 ఇక విషయంలోకి వెడితే....

పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు.. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు.. అప్పటి నుంచి వాడికి ‘సహస్ర కవచుడు’ అనే పేరు స్థిరపడి పోయింది.. ఆ వర గర్వంతో వాడు సర్వ లోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు..

వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి  శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి నేను నర, నారాయణ రూపాలలో బదరికావనం లో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు.. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.

హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత  నరసింహస్వామి రెండు రూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’ గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’ గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించారు.. వారే నర, నారాయణులు... వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధ ధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై  తపోదీక్ష వహించారు.. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది.

ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి... ‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులై యుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారి మద్య భీకర యుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు.

శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు.. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర, నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

నర నారాయణుల తపస్సు కొనసాగుతోంది.. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసి రమ్మని అప్సరస లను పంపాడు.. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ.., ఫలితం శూన్యం.

అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు.. ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడం లేదు..అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడ మీద చరిచాడు.. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది.. తన ఊరువుల (తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి  'ఊర్వశి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర, నారాయణులను క్షమించమని వేడుకున్నాడు..

నర, నారాయణుల తపస్సు కొనసాగతోంది.. ఆ సమయంలో వర గర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారి దగ్గరకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు.. అప్పుడు నారాయణుడు అతనితో  ‘రాక్షసేశ్వరా.. నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ.., మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు.. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు.. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు... ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు.. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది.. అలా సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు.. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు.

మరో కొన్ని సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు  సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర నారాయణు లిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకే ఒక కవచం.. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు..

అప్పుడు సూర్యుడు.. ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నా నుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు... సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు.

 కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచుడినే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు.

ఆ కర్ణుని సంహరించడానికే నర నారాయణు లిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.

*****

ఎవరు గొప్ప

లోకంలో నిజమైన గొప్పవాణ్ని నిజమైన గొప్పవాడే గుర్తిస్తాడు. గొప్పతనాన్ని తమలో ఆపాదించుకున్న నీచులు నిజమైన గొప్పవాణ్ని గుర్తించరు. శివుడు త్రిలోకనాథుడు. సర్వేశ్వరుడు. అఖిలారాధ్యుడు. అతడు అంత గొప్పవాడు కనుకనే కళానిధి అయిన చంద్రుని గొప్పతనాన్ని గుర్తించి, తన తలపైకి ఎత్తుకొన్నాడు. అంత గొప్పవాడైన చంద్రుణ్ని దొంగతనంగా అమృతం తాగిన రాహువు మాత్రం కబళించాలనుకొన్నాడు. రాహువులోని కుటిలత్వమే గొప్పతనానికి విరోధమై అతణ్ని మింగేసే గ్రహంలా మార్చివేసింది. చంద్రునిలోని అమృతత్వాన్ని గ్రహించిన పరమేశ్వరుడు ఎప్పుడూ గొప్పవాడే. సకల లోకారాధ్యుడే.

పాపాన్ని పోగొట్టే నిర్మల జలవాహిని పుణ్యనది గంగ చల్లని వెన్నెలలతో హృదయతాపాన్ని పోగొట్టేవాడు చంద్రుడు. అడిగినవన్నీ అనుగ్రహించడం ద్వారా దైన్యాన్ని పోగొట్టేది కల్పవృక్షం. ఈ మూడు విధాలైన గుణాలను ఏకకాలంలో ప్రసాదించేవాడు సజ్జనుడు. కనుక అతడే గొప్పవాడు

జననాన్ని ఉదయమనీ, మరణాన్ని అస్తమయమనీ వ్యవహరించడం లోకంలో పరిపాటి. సూర్యుడికి ప్రతిదినం ఉదయాస్తమయాలు సంభవిస్తుంటాయి. కానీ ఏనాడైనా సూర్యుడు ఉదయిస్తే పొంగిపోవడం కానీ, అస్తమిస్తే దిగులుపడటం కానీ చేస్తాడా? గొప్పవాడు కూడా సంపదల్లో పొంగిపోయి కన్నుమిన్ను కానకుండా ఉండడు. ఆపదలు వచ్చినప్పుడు ఏమాత్రం కుంగిపోకుండా ధైర్యంగా నిలబడతాడు. అందుకే గొప్పవాడు ఎప్పుడూ స్థితప్రజ్ఞుడే కానీ, చలస్వభావి కానే కాడనేది సత్యం.కస్తూరీమృగానికి నాభిలోనే సహజంగా పరిమళద్రవ్యంఅయిన 'కస్తూరి' ఉద్భవిస్తుంది. కృత్రిమంగా రూపొందిస్తే రాదు. అలాగే సజ్జనుల్లో సద్గుణాలు సహజంగానే ఏర్పడతాయి కానీ ఎవరో ఆపాదిస్తే రావు. సహజగుణ సౌందర్యం ఉన్నవాడే గొప్పవాడు

గొప్ప మనస్సుగలవాడు పరిస్థితులు తారుమారు అయినప్పుడు ఇబ్బందులకు లోనై కిందపడినా, బంతిలా మళ్లీ పైకి ఎగురుతాడేగానీ నేలకు అతుక్కొని ఉండిపోడు. నీచుడు మాత్రం పతనమైతే మట్టి ముద్దలా నేలలోనే కూరుకొనిపోతాడు. కనుక బంతిలా ఉండడానికి మానవుడు ప్రయత్నించాలేగానీ, మట్టిముద్దలా పడి ఉండాలని భావించకూడదు

గొప్పవాడు ఎప్పుడూ ఏ పనిని అయినా చిన్నగానే ప్రారంభించి, క్రమంగా 'ఇంతింతై వటుడింతయై' అన్నట్లు ఎదుగుతూ- మొదట వామనుడివలె ఉండి, చివరికి త్రివిక్రముడై విశ్వమంతా వ్యాపిస్తాడు. నీచుడు మాత్రం అట్టహాసాలతో, ఆర్భాటాలతో గొప్పలకుపోయి అరుపులతో ప్రారంభించి, చివరికి చతికిలపడతాడు.

ఇతరులకు నీతులను ఉపదేశించే పాండిత్యం ఎంతైనా ఉండవచ్చు. ఆ ఉపదేశించే విషయాలను తాము ముందు .ఆచరించాలని చాలామంది అనుకోరు. నిజంగా గొప్పవాడు మాత్రం తాను ఆచరించే నీతులనే ఇతరులకు చెప్పాలనీ, ఇతరులకు చెప్పినవన్నీ తాను కూడా ఆచరించాలని దృఢంగా భావిస్తాడు

విషాన్ని ఎదుటివాళ్లమీద ఎగజిమ్మి తాను ఆనందించేవాడు గొప్పవాడెలా అవుతాడు? ఎన్నటికీ కానేకాడు. నిజమైన గొప్పవాడంటే పరమశివుడే. విషాన్ని కంఠంలో దాచుకొని, లోకానికి అనుగ్రహామృతాన్ని పంచుతున్నాడు. అందువల్ల గొప్పవాడు శివునిలా ఉండాలి.సంపదలుకానీ, ఆపదలుకానీ గొప్పవాడికే లభిస్తాయి అల్పులకు అంతగా లభించవు. అయినా గొప్పవాడు తొణకడు, బెణకడు. వృక్షయాలు చంద్రునికేగానీ, నక్షత్రాలకు సంభవించవు కదా! కృష్ణపక్షంలో క్షీణించిపోయే చంద్రుడు తన క్షీణతకు ఎంతమాత్రం బాధపడడు. శుక్లపక్షం రాగానే రోజుకొక్క కళతో వృద్ధి చెందుతాడు చంద్రునిలాంటి స్వభావాన్ని అలవరచుకొన్నవాడే గొప్పవాడు

గొప్పతనం అనేది డబ్బుతో కొనేది కాదు. ఒకరు ఇచ్చేది అంతకంటే కాదు. సత్ప్రవర్తనద్వారా, సదాశయాల ద్వారా కృషితో సాధించవలసిన అమూల్య విషయం. ఎవరికి వారు తామే గొప్పవారమని అనుకుంటూ ఉంటారు కానీ ఇతరులు ప్రశంసించినా నిర్లిప్తంగా ఉంటూ, సమభావంతో ముందుకు సాగేవాడే గొప్పవాడు

అబల కాదు తబలే .. ఇప్పటికీ!

 -కర్లపాలెం హనుమంతరావు

బ్రహ్మదేవుడు ఏ బ్యాడ్ మూడ్  లో ఉండి సృష్టించాడో, ఆడదాని బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలి కింది ఎండుకొమ్మే!

కిందే కాదు.. పై ప్రపంచంలోనూ! బ్రహ్మయ్యకు రిమ్మ తెగులు. శివయ్య సగం శరీరం భార్యకు ఇచ్చినట్లే  ఇచ్చి మరో గంగానమ్మను నెత్తికెత్తుకున్నాడు. హరి మాత్రం!  హరి.. హరీ! కట్టుకున్న దానిని ఆకట్టుకోవలసింది పోయి కాళ్ల దగ్గర అచ్చంగా కట్టిపడేసుకున్న మహానుభావుడాయన. 

'ఆడదానికి స్వేచ్ఛిసేస్తే మహా అపాయం' అని ఆ మనువెవరో అన్నాట్ట కదా! ఆయనన్న మిగతా సుద్దుల్ని మాత్రం గట్టున పెట్టేసి, ఈ ఒక్క ముక్కను వేదంలా మన మగమహారాజులు  ఈ ఇరవైయొకటో శతాబ్దం దాకా వేదంలా ఈడ్చుకొచ్చారు! 

ఒక్క మగాడనేమిట్లే, గ్యాసుబండలు, యాసిడ్ సీసాలు, సెల్ఫోన్ కెమేరాలు, సినిమా బడితె బొమ్మలు, కట్నం వేధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు, అనారోగ్యాలు, భ్రూణహత్యలు, పరువుహత్యలు, లైంగిక వేధింపులు, గాడిద చాకిర్లు, తక్కువ జీతాలు.. అబ్బో.. జల్లెడ చిల్లుల కన్నా ఎక్కువ ఆడదాని కడగండ్లు!

వేళకు వంట చేసి వడ్డించడానికి, మగాడికి బిడ్డల్ని కని.. పెంచడానికి, ఇంటిని కనిపెట్టుకునుండటానికి, వంటికి సుఖమందించడానికి, బైట బడాయి షోలకు, వేణ్నీళ్లకు చన్నీళ్లని వంక పెట్టి సంపాదించిందంతా కుమ్మేయడానికి, సినిమాల కెళ్లినప్పుడు క్యూలల్లో త్వరగా టిక్కెట్లు కోయించుకోడానికి, బస్సుల్లో ఆడాళ్ల సీట్లనూ అక్రమంగా అక్రమించడానికి, బ్యాంకుల్లో దొంగపేర్లతో ఖాతాలు తెరుచుకోడానికి.. మాత్రమే భగవంతుడు ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడనుకుంటున్నాడు మగాడు. 

బల్లిని చూసి భయపడేటంత సున్నితమైన మనస్సు నిజానికి ఏ అమ్మడుకయినా. అయినా ఒక మగాడి సంసారం గాడినపెట్టడానికి నవమాసాలు నరకయాతన నవ్వుతూ సహించేందుక్కూడా సిద్ధపడే సాహసి సహచరి. బిడ్డ పుట్టుకకు అవసరమైతే కత్తికోతకైనా తను సిద్ధపడే త్యాగశీలి తరుణి. 

గంట పనికే వందలు డిమాండు చేసే వ్యాపార ప్రపంచంలో పాచి పని  నుంచి రాత్రి పడక పని దాకా సహస్రావతారాలతో సమర్థంగా శ్రమించే స్త్రీ మూర్తి శుశ్రూషకు పైసల్లో, పెన్నీల్లో విలువ గడితే పది మంది బిల్ గేట్స్, అంబానీల సంపాదలన్నీ కలిపినా ఒక వారానికి మించి సరిపోతాయా?

మగమనుషులు మద మాత్సర్యాలతో ఒకరినొకరు ఆడిపోసుకునే నీచ సంస్కృతిలో కూడా పాపం ఏ ప్రమేయం లేని అమ్మలక్కల ప్రస్తావనలే వస్తాయి! మనుషులలో సరే.. మనసులలో సంగతి!

పులి అడవిలో కదిలేటంత చురుగ్గా ఇంటిలో కలితిరిగే శక్తి కలది స్త్రీ. ఇంటి నాలుగు గోడల మధ్య పనిపాటల చేసుకొనే సందర్భంలో అమ్మ నడిచే దూరం ముందు  ఏ మారథాన్ పరుగుపందెం విజేత రికార్డయినా బలాదూర్! ఇంటి బరువు బాధ్యతలను ఒంటిచేతి మీదుగా నిర్వహించే ఆమె దారుఢ్యం ముందు ఎంత మంది కరణం మల్లీశ్వరులు ధృఢంగా నిలబడగలిగేది! 

ఇంటికి ఆమే యమర్జెన్సీ వైద్యురాలు. ఏ శిక్షణా అక్కర్లేని సుశిక్షణగల ఉపాథ్యాయురాలు. అనుక్షణం బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే జీతమివ్వని వార్డెన్ కూడా ఆమే. కుటుంబ సభ్యులు ఎవరికైనా కష్టం వాటిల్లితే పైసా ముట్టకుండా చక్కని కౌన్సిలింగు ఇచ్చే సామర్థ్యం ఆమె సొంతం. ఎవరి ఇష్టాయిష్టాలేమిటో పెదవి విప్పకుండానే ఇట్టే పసిగట్టి వీలును బట్టి ఉన్న వనరులతో అందరికి సంతృప్తి కలిగించే ట్రబుల్ షూటర్ అమ్మ తరువాతే భూమ్మీద ఇంకెవరైనా. 

సంసారమనే విమానానికి ఆమే ప్రధాన చోదకురాలు. ఎయిర్ హోస్టెస్. రచ్చలో కూర్చున్న రాజేంద్రునికి మల్లే భర్త కాలు కదపక పెత్తనం చెలాయిస్తున్నా, ఆమె కలికి కామాక్షికి మల్లే వదిగి  ఉంటున్నందు వల్లనే ఇల్లు ఓ కైలాసగిరిగానో.. అమరావతికి మల్లేనో బైటి కళ్లకు శోభకలిగించేది. 

ఆధార్ కార్డ్ సైతం ఓ పట్టాన దొరకని ఈ కలికాలంలో ఇంటిల్లిపాదీ గుడ్డిగా ఆధారపడ్డా ఇబ్బంది లేని ఆమె సేవలు ఉదారంగా దొరకడం మగమారాజు చేసుకున్న అదృష్టం. మెడలో మూడు ముళ్లు పడి, సహచరునితో ఏడడుగులు నడిచిన మరుక్షణం నుంచి  ఇంటి పేరును మార్చు, మార్చక పో వంటి తీరును భర్త వంశానికి మీదు కట్టే త్యాగమయులు భూమ్మీద తరుణుల  తప్ప ఇంకెవరుంటారు! 

రాముడొచ్చి కూల్చే వరకు రావణబ్రహ్మనైనా  గడ్డిపోచ కింద దూరం పెట్టగలిగిన సీతనీతి స్త్రీ జాతిది. కాళ్ల పారాణి ఆరక ముందే కట్టుకున్న భర్త సోదర ప్రేమతో కానలు పట్టిపోతున్నా కంటి నీరు కొనుకుల కట్ట నుంచి ఉబికి రానీయని ఊర్మిళకట్టు ఉదిత జాతిది. పతిని దేవుడనుకోడం వట్టి మాటలలోనే కాదు; ప్రాణగండం ముంచుకొస్తే సాక్షాత్ ఆ దేవుడితో  తలపడేందుకైనా వెనక్కు తగ్గని సావిత్రిసాథ్వీగుణం కూడా స్త్రీ జాతిదే. తనవాడుగా తలచిన మరుక్షణం  మనువాడే తెగింపుగుణం రుక్మిణికి వలె మనం  మగులందరిలోనూ చూడగలం. భర్తకు లేని దృశ్యభాగ్యం తనకు మాత్రం ఎందుకు.. వద్దని కళ్లకు గంతలు కట్టుకుంది  పట్టపురాణి గాంధారి!  బుద్ధిలో నాలుగు రెట్లు, సాహసబుద్ధిలో ఎనిమిది రెట్లు స్త్రీకే ఆధిక్యతని చెప్పేందుకు  ఈ తరహా ఉదంతాలు చరిత్రలో ఇంకెన్నో!

మగవాడి మతలబు కేవలం ఐదు పదాల్లో తేల్చేసిన అమరుకం, ఆడదాని విషయంలో నూటనలభై నాలుగు పదాలు వాడీ 'ఇహ  నా వల్ల కాదు పొమ్మ'ని గుడ్లు తేలేసింది. కావ్యాలంకారాల అష్టవిధ నాయికల నుంచి, కన్యాశుల్కం మార్కు మధురువాణి వరకు స్త్రీ మనసు అర్థం చేసుకోనేందుకు మగవాడు పడ్డ ఆపసోపాలు అన్నీ ఇన్నీ కావు. స్త్రీ అంతరంగ  గంగనూ ఎంత తిరగ దోడినా మగాడి మనసనే చేదకు దక్కేది రవ్వంత బొట్టే! 

హృదయంతో కాకుండా పెదవులతో కొలవబోతే కోమలి కొలతలకు ఏనాడూ అందదు. యుగయుగాలుగా చిక్కుబడ్డ స్త్రీ-పురుష సంబంధం చక్కబడాలంటే మగవాడికి కావాల్సింది ఒక్క నేర్పే కాదు!  కష్టానికి సుఖానికి విడిపోకుండా వుండే ఓర్పు. 

అప్పడాల కార్ట్యూన్లు కేవలం మగాడి మనోవికార సూచితాలే! అసలుకు  అప్పడంలా నలుగుతున్నది స్త్రీ  జాతి మగాడి అహమనే కరకు కోరల మధ్యన చిక్కి . చంద్రమతి నాటి సత్యకాలం నుంచి.. దివ్య దిశాల ఈనాటి కలియుగం వరకు వ్యథ ఒకేలా సాగుతున్నది.. వ్యక్తీకరణల్లోనే ఆధునికత..  వైవిధ్యం!

సునీతా మిలియమ్స్, నైనా సెహ్వాలు, మలాలా, ఇందిరా ప్రియాంకాలు, ఇంద్రా సూకీ.. ఎన్ని కోట్ల మందిలో  కొట్లాడి పరజితులవగా చివరకు  గెలిచిన  విజేతల జాబితాలో కనిపించేది?

నిన్నటి దాకా వంటిళ్ళు, పడగ్గదుల వరకే పరిమితమై నోరు విప్పే అవకాశం లేని నారి తంటాలు. విశాల ప్రపంచంలోకి వచ్చి పనిపాటలు చేసుకోక తప్పని ఆర్థిక వాతావరణంలోనూ మారని దుస్థితి! మగవాడి మదమాత్సర్యాల మూలకంగా ఈనాటికీ ఆడదాని పరిస్థితి ముల్లు పక్కన అరటి ఆకు అధోగతే! ఇదే వాస్తవ పరిస్థితి!

ఆత్మరక్షణకు మహిళలు వాడుకునే 'పెప్పర్ స్ప్రే' పార్లమెంటు వాడకం వరకూ పెరిగిందే కానీ, ఆత్మగౌరవానికై మహిళకు హామీ ఇచ్చిన 'రిజర్వేషన్ బిల్లు' అదే పార్లమెంటులో ఎన్నో దశాబ్దాల బట్టి పెండింగులో పడివుంది! 'చీపురు కట్ట'కు దక్కిన రాజకీయ గుర్తింపు ఆ చీపురే అనాదిగా ఆయుధంగా వాడే స్త్రీ జాతికి ఇరవైఒకటో శతాబ్దం వచ్చినా  దక్కకపోవడం.. మగాడి  హిపోక్రసీ బుద్ధి.. రంగులు మార్చే ఊసరవెల్లి  చెల్లికి అక్క అవుతోందని తేటతెల్లమవడంలా! 

'అబల' అనగానే లబలబలాడటమే గానీ,  మగవాడి పెత్తందారీ కచేరీలో ఆడదాని  పరిస్థితి 'తబలా' కు మించి ఏం మెరుగ్గా ఉందని!

'ఆడ పుటక'మగ సమాజం పానకంలో ఇంకా పుడకలాగే ఉంది. 'తిరిగి ఆడది .. తిరక్క మగాడు' చెడతారన్న మనువు సూత్రం మంట గలిసేదాకా ఆడది తిరగబడి  ప్రశ్నించడం కొనసాగాల్సుంది అందుకే! 

ఏడాదికి ఏదో ఓ ఎన్నిక చేసుకున్న రోజు మహిళా దినోత్సవం జరుపుకోడం కాదు.. ఏడాదంతా మహిళకు ఉత్సవంలా సాగాలంటే ముందు మగవాడి అంతరంగానికి శాశ్వతంగా మరమ్మత్తు చేసే చాతుర్యం కావాలి!

-కర్లపాలెం హనుమంతరావు


‘మాతస్తులసి గోవిందా హృదయానంద కారిణీ’ అంటూ ‘బ్రహ్మవైవర్త పురాణం’ తులసి ప్రాముఖ్యాన్ని చెప్తున్నది. ‘తులసి’ అన్న పదాన్ని మనం వివేచన చేస్తే ‘తులాంస్యతి తులసి’. ‘తుల’ అంటే ‘వెల కట్టడం’ అని అర్థం. వెల కట్టడానికి వీలు లేనిది తులసి. ‘తులస్యంమృత జన్మాసి’ అని కీర్తింపబడే తులసిని పరమపూజ్యమైందిగా భావిస్తాం. దీన్ని మహాలక్ష్మీ స్వరూపంగా ‘పద్మపురాణం’లో వ్యాసమహర్షి చెప్పాడు. ఇది విష్ణుకామిని. కృష్ణభూషణ రూప. విష్ణుపాద స్థల నివాసిని. తపఃస్సంకల్ప పూజాదులను సిద్ధింపజేసే శక్తి కలది. కలియుగంలో కాలుష్యాలను దహించే అగ్ని. దేవతల తృప్తి కోసం మహర్షులు తపస్సు చేసి ఈ వృక్షాన్ని పొందగలిగారు. అందుకే, ఇది  కోరికలు తీర్చగలిగే మన పాలిటి కల్పవృక్షం. గంగ ఎంత పవిత్రమో తులసి కూడా అంతే పవిత్రమైంది. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి అని వివిధ రకాలుగా పిలుస్తున్నా వాటి గొప్పతనం, పవిత్రత మాత్రం ఒక్కటే. ‘తులసి లేని ఇంట పితృకర్మ, దైవకర్మ లేవి చేసినా ఫలించవు’ అన్నది శాస్త్రం.

తులసి ఉన్నచోటికి దేవతలైనా, పితృదేవతలైనా ఆనందంగా వస్తారట. అంతేకాక, ఇది ఉన్నచోటకు దుష్టశక్తులు రావు. ఎందుకంటే, ఇది సాక్షాత్తూ ‘అమ్మవారి ప్రధానాంశ’ అని ‘దేవీ భాగవతం’ చెప్తున్నది. పువ్వులన్నిటి సారం తులసి. భూమ్మీద దొరికే పుష్పాలన్నిటి సారమంత విశేషమైన, పవిత్రమైంది ఇది. అంతటి పుణ్యదాయిని కూడా. దీన్ని దర్శించినా, స్పర్శించినా ముక్తిని, శక్తిని ప్రసాదిస్తుంది. భారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మాన్ని అనుసరించి తులసి మొక్క లేని గృహం ఉండదు. మనం ప్రకృతిని దైవంగా భావించి వృక్షాలన్నిటినీ దైవాలుగానే భావించినా ప్రత్యేకించి తులసి మొక్కను ఇంటి వద్ద తులసికోటలో పెంచి ధూపదీప నైవేద్యాలతో పూజించటం ఒక ప్రత్యేకత. దీనిని ‘కోట’గా ఎందుకంటామంటే, కోట ఎలాగైతే రక్షణనిస్తుందో ఇదీ అలాంటిదని నమ్మకం. ఇంటి గుమ్మం ముందు నుంచి చూస్తే పెరట్లో పెట్టిన తులసికోట కనపడాలని, ఉదయం నిద్ర లేవగానే తులసిని చూడాలన్నది అనాదిగా వస్తున్న ఆచారం. ఆధునిక ఇండ్ల నిర్మాణంలో అది సాధ్యం కాకపోయినా చిన్న కుండీలలోనైనా తులసి చెట్టు ఉండటం మాత్రం ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ తులసి మొక్కలు కనపడుతున్నాయంటే అది మన ప్రాచీన ఋషుల తపఃఫలమే. 

తులసి మూలంలోని మట్టికి ఉన్న శక్తి ఎంతో గొప్పది. తులసీ మృత్తిక (మట్టి)కు ‘గోపీ చందనమని’ వ్యవహారం. దీన్ని బొట్టుగా పెట్టుకుంటే పవిత్రమని, దివ్యత్వమని అంటారు. తులసి మూలంలో సర్వతీర్థాలున్నాయని, మూలంలో నీళ్లు పోసి తలపై చల్లుకుంటే తీర్థస్నాన ఫలితం కలుగుతుందని ‘విష్ణు పురాణం’ చెబుతున్నది. మన దేశంలోని తులసి, మారేడు వంటి వృక్షజాతి, గోజాతి సామాన్యమైనవి కావు. మనిషి తుదిఘడియలో ‘తులసీ తీర్థం నోట్లో పోయడం’ అంటే తిరిగి ప్రాణాన్ని పుంజుకుంటాడేమోనని ఆశ. అంత ఔషధీయుతమైన తులసి చెట్టు అత్యధిక ప్రాణవాయువును ప్రసరింపజేస్తూ ఆ గాలి పీల్చిన వారికి దీర్ఘాయుర్దాయాన్ని కలిగిస్తుంది. తులసి చెట్టు వద్ద సంధ్యావేళ దీపం పెట్టడం మోక్షదాయకం. అటువంటి ఇంటికి ఐష్టెశ్వర్యాలు లభిస్తాయి. వేదవాక్యంలోని అంతరార్థం తెలిపే తులసిని పెంచి పూజించడం నిజమైన భారతీయాత్మకు ప్రతీక. మన సంస్కృతీ సంరక్షణలో భాగంగా, ఆచారాలు అనుసరించడంలో అంతర్భాగంగా తులసీ మాతను భక్తితో అర్చిద్దాం.

((()))

: 💚🍋 అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రం స్థాపించి అందులో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం 🍋💚

🌷🌻 మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం 🌻🌷

🌺 పంచశత శక్తిపీఠాల్లో  మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.

🌺 మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.

🌺 పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!

🌺 క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.

🌺 తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.  

🌺 ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు. 

🌺 "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో,  ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క"  అని పాండ్యరాజు వేడుకున్నాడు. 

🌺 ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు.  పాండ్యరాజు హతాశుడైయ్యాడు.

🌺  దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని  పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు. 

🌺 రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.

🌺 ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో  చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది.  

🌺 పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.

🌺  ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి?  నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.

🌺 క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆతల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్వికరూపం అంతరించి తామసికరూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారుమబ్బు రంగులోకిమారి భయంకర దంష్ట్రాకరాళవదనంతో, దిక్కులనుసైతం మ్రింగివేసే భయంకరమైనచూపులతో అడుగుముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా. 

🌺  ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్క రించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !

🌺 అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి  ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? 

🌺 అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో వజ్రాసనంవేసి కూర్చుని స్తోత్రంచేశాడా యువయోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలివస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమెహృదయంలో ఒకానొక సాత్త్వికతేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.

🌺 ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు. 

🌺 ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది?  ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!"  ఆనుకుంది అమ్మవారు.

🌺 "ఎవరు నాయనా నీవు ?  నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.

🌺 ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార  ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. 

🌺 "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి"  మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగినవారు శ్రీచక్రార్చన చేసినంతటిఫలం పొందుతారు". 

🌺 " నీకు ఏవరం కావాలోకోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నాసంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించకఅనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. 

🌺 "బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించానుతల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"

🌺 "కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా  నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.

🌺 పసితనపు  అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు" 

🌺  "మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసోతెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనపెడతాను. నేనుఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను". 

🌺 "అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని.ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.  

🌺  ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికిలోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమికోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివునినుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తననైపుణ్యాన్ని సుందరీశ్వరునికికూడా తెలియచేయాలి" అనే  ఉబలాటము ఆమెలో వచ్చేసింది.

🌺  "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేనుపెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులుమెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది"  

🌺  "తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై  ఈ సంహారకార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య.  

🌺 జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాటప్రకారాం నేను ఈ సంహారకార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగాఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి,  తన సంహారకార్యక్రమం కొనసాగించాలని  ఆలోచించింది. 

🌺  ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలుగల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.

🌺 "ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి.  చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది.  మరి మీఇష్టము!" అన్నది.  సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. 

🌺 ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు  ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.

🌺 నీ లలితాసహస్రనామంలోని  కొన్ని నామాలు, వాటిఅర్ధాలు ఆలోచిస్తూ  ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.

🌺 సంఖ్యాశాస్త్రప్రకారము  పావులు కదులుతూ ఉన్నాయి.  సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది. 

🌺 ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. 

🌺 "విజయం నాదయినా, నీదయినా రెండూఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి  చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.

🌺 పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది.  ఆ పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. 

🌺 "గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.

🌺 ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపుపొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారిపాదాలవద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధముచేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యేవరకు  "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది. 

🌺 పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము  మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పుఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు. 

🌺 వెంటనే అతనిహృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది. 

🌺 అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకాకొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం  రెప్పపాటుసాకుతో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.

🌺  "ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనేఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. 

🌺 "తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్టసమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు. 

🌺 "నాయనా! చివరి పందెంనాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో  యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష  ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారిముందు పెడుతూ.

🌺 "నేను గెలిచాను. మరిమన ఒప్పందంప్రకారం నా సంహారకార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.

🌺 "నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి  నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!" అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు. 

🌺 దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందుత్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు. 

🌺 అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్దనుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ  విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ!  తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ!  నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్కఅక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను  చూడుతల్లీ!"

🌺 44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపుసంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్వికబీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయంవరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. 

🌺 "అకారాది క్షకారాంత" దేవతాశక్తి స్వరూపాలకు వారివారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైనవారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీస్వరూపాలను, యోగినీదేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చనగదా తల్లీ!నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాలసహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూవస్తున్నాను".

🌺  "ఆకార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు  కించిత్ లజ్జ, కించిత్ వేదనతో  బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈయువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలనుసంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. 

🌺 "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరునిరూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణవేడుకుంటూ "శివ అపరాధ  క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. 

🌺 ఒకవైపు అహం తగ్గిపోయినఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వదేవీ, దేవ గణాలు ఆస్వామి తీర్పుకోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళుతెరిచాడు. చిరునవ్వునవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తలవిదిలించి రంకెవేసాడు. మధురాపట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామివెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలివచ్చింది. ఆలయగంటలు అదేపనిగా మోగాయి. 

🌺 భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు.  

మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. 

🌺 పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు.  ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.

🌺 అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలాచేసింది. అతినిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్కఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైననాకు మాత్రమే తెల్సు. 

🌺 కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో  తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింతఉగ్రరూపము సంతరించు కునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసికశక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు.  బ్రష్టులయ్యారు. కానీనీలో తామసికరూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణంతప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసికశక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలితప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్వికకళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు. 

🌺 అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరునిరంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య భలైఉంటాడని

 భయబ్రాంతుడయ్యాడు.

🌺  రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులుతీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికిసిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్వికరూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు. 

🌺 సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాందిపలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతోఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. 

🌺 ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృస్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే  వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి". 

🌺 "నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.

*********

: ప్రపంచంలో సుఖం ఎరుగనివారు

ఎవరైనా ఉన్నారా?

అంటే

ఉన్నారంటున్నాయి శాస్త్రాలు

వారిని "దుఖఃభాగులు"అంటారు

వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*

*1. ఈర్ష్యాళువు*

వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు

అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.


*2. జుగుప్సావంతుడు*

వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు

వారివానికి సుఖం ఎక్కడుంటుంది.

*3. నిస్సంతోషి*

వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు

దాంతో వీనికి సుఖమెక్కడ

*4. క్రోధనుడు*

వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ

కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ

*5. నిత్యశంకితుడు*

అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు

అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది

సుఖం.

*6. పరభాగ్యోపజీవి*

ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు

వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే

దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ

సుఖం సున్నా.

ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,

ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో

జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.

******

 *రాశి ప్ర‌కారం …ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు*


మేషరాశి =


వీరి గుణం: వీరికి  తెలివి తేటలు ,పట్టుదల అధికం

రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. కాబట్టి మిలట్రీ, రాజకీయాల‌లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా సక్సెస్ అవవచ్చు.


వృషభ రాశి=


వీరి గుణం:  హార్ట్ వర్క్ చేస్తారు. చాలా లగ్జరీగా, అందంగా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు:  డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు.


మిధున రాశి=


వీరి గుణం:చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైనవాళ్లు.

రాణించ‌గ‌లిగే రంగాలు: టెక్నికల్ వింగ్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు.


కర్కాటక రాశి=


వీరి గుణం: చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువ‌

రాణించ‌గ‌లిగే రంగాలు: టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు.


సింహరాశి =


వీరి గుణం: వీళ్లకు భయమంటే తెలియదు. ప్లాన్డ్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు సీఈవో, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు.


కన్యా రాశి=


వీరి గుణం: చాలా లాజికల్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలసిస్  జాబ్స్లో  సక్సెస్ అవుతారు.


తులారాశి=


వీరి గుణం: తెలివైనవాళ్లు. వీళ్లకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది. అలాగే ఎదుటివాళ్లు చెప్పే విషయాలు ఓపిగ్గా వింటారు. వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివాళ్లను ఆకట్టుకుంటాయి.

రాణించ‌గ‌లిగే రంగాలు:ఆట‌గాళ్లుగా  స‌క్సెస్ అవుతారు.


వృశ్చిక రాశి= 


వీరి గుణం: చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: కాబట్టి వీళ్లు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు.


ధనస్సు రాశి=


వీరి గుణం:చాలా సైలెంట్ గా ఉంటారు. ట్రావెలింగ్ ను ఇష్టపడతారు. ఆధ్మాత్మికత ఎక్కువ‌.

రాణించ‌గ‌లిగే రంగాలు: ఇతరులను ప్రేరేపించడానికి, కోచింగులు ఇవ్వడానికి, మంత్రులుగా, ఫిలాసఫర్లుగా రాణిస్తారు.


మకర రాశి =


వీరి గుణం: చాలెంజ్ లను ఇష్టపడతారు.. జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా మెచ్యూర్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది.


కుంభరాశి=


వీరి గుణం: చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు. క్యూరియాసిటీ ఎక్కువ‌. ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: సైంటిస్ట్ లు ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు.


మీన రాశి=


వీరి గుణం: సహాయపడే గుణం ఉంటుంది. చాలా సృజనాత్మకంగా, పాషినేట్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు:   ఆర్టిస్ట్ లుగా మంచి లైఫ్ ఉంటుంది.

******

 *ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ?*

*ైంైంైంైంైంైంైంైంై*



*1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు:*


 కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు "విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల"ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 


విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.


*2.కనకధారా స్తోత్రం:*


"కనకధార స్తోత్రం"ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు... నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.


*3.సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం:*


ప్రతిరోజూ "సూర్యాష్టకం, ఆదిత్య హృదయం" చదువుతూ.. "సూర్యధ్యానం" చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి అవకాశాలతోపాటు ఫలితాలు కూడా లభిస్తాయి.


*4.‘లక్ష్మీ అష్టోత్ర శతనామావళి:*


లక్ష్మీ అష్టోత్తర శతనామావళి"ని నిత్యం పారాయణం చేస్తే పిల్లలకు..మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.


*5.నవగ్రహ స్తోత్రం:*


నవగ్రహ స్తోత్రా"న్ని ప్రతిరోజు చదువుకుంటే.. ఋణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా.. ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు.


*6. హాయగ్రీవ స్తోత్రం..సరస్వతి ద్వాదశ నామాలు:*


విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజూ "హయగ్రీవ స్తోత్రం", "సరస్వతి ద్వాదశ నామాల"ను పఠించాలి.


*7. గోపాల స్తోత్రం :*


సంతానం లేని వారు ప్రతిరోజు "గోపాల స్తోత్రం"ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భంతో వున్న వారు..ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, శాస్త్రాన్ని ఆధారంగా చెబుతున్నారు.

********

[ *తెలుగు  సంవత్సరముల  వెనుక  నున్న  కథ  ఏమిటి* 


తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. 

అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

తెలుగు సంవత్సరాలు,ఆయనములు,ఋతువులు,మాసములు,తిధులు

మన తెలుగు సంవత్సరాల పేర్లు : 

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.


సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది....ఆయనములు 2:అవి...

ఉత్తరాయణము :

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.

దక్షిణాయణం :

కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.


సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది...అందుకే ఋతువులు ఆరు... 

వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర


సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది...అందుకే

మాసములు 12 :

చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)


పక్షములు 2 :

ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...

పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం

పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.

ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.. అవి

పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య

ఇక ఒక పక్షానికి రెండు వారములు..


 ఒక వారమునకు ఏడు రోజులు...

ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడానమోదు చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..

ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు... మనకు అసలైన నూతన సంవత్సరం.. ఉగాదే.. ఇప్పటినుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది... పంచాగం మొదలవుతుంది.. సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే ఉగాది అయింది.. ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి.. క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది...


వారములు 7 :

ఆదివారం - భానువాసరే

సోమవారం - ఇందువాసరే

మంగళవారం - భౌమ్యవాసరే

బుధవారం - సౌమ్యవాసరే

గురువారం - గురువాసరే

శుక్రవారం - భృగువాసరే

శనివారం - స్థిరవాసరే / మందవాసర🙏🙏


నాతో..నా శ్రీమతి.ప్రాంజలి ప్రభలు..21
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ఏవండోయ్ శ్రీ వారు మీకు తెలుసా
తెలుసా అని అనే బదులు తెలిసినది కక్కేస్తే ఒకపనైయ్ పోతుంది
పనివివరం తెలుసుకోవాలని అనుకోవు ఏదోపనిచేయబోయి మరేదో పనిచేస్తావ్ చెయ్యి కోసుకుంటావ్ ఏమన్నా అంటే అరుచు కుంటావ్.

ప్రపంచంలో సుఖం ఎరుగనివారు
ఎవరైనా ఉన్నారా?
అంటే
ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు"అంటారు
వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*
*1. ఈర్ష్యాళువు*
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.పక్కింటిలో మేళం మ్రేగితే ఏడ్చే వారు.

*2. జుగుప్సావంతుడు*
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది. శుభ్రం గా ఉన్నా నచ్చదు. తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగితే నే కాని తృప్తి పడరు

*3. నిస్సంతోషి*
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖ మెక్కడ. ప్రతి విషయంలో తప్పుపడతాడు సంతోషమోచ్చినా ముందే ఏడుస్తాడు ఎందుకొచ్చిందాయని

*4. క్రోధనుడు*
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోష మెక్కడ.
బుల్లి అరచి నా, చీమ కుట్టినా, మంచం కిర్రన్నా, పళ్ళు కొరికినా, తుమ్మినా దగ్గినా ఒకటే అరుపు దానిలో కూడా రౌద్రం

*5. నిత్యశంకితుడు*
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది
సుఖం. పెళ్ళాం బయటికి పోయినా, మంచి చీర కట్టినా, పిల్లలు ఏడ్చిన అనుమానం

*6. పరభాగ్యోపజీవి*
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా. పెళ్ళాం సంపాదన పై, ఇతరులను మోసపు సంపాదన యే లక్ష్యంగా జీవించేవాడు. అలా చేయక పోతే నిద్రే పట్టదు.
ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.
చాలా చక్కగా చెప్పావు ఇప్పుడు నా చేయి కోసుకుంది కదా నా మనసు ఎలాంటి చెప్ప గలవా
ఆ చెప్ప గలను నేను చేయగలనని ధీమా వయసు ఉడికాక ఆధీమా తగ్గించు కుంటే మంచిది
అవునే అది ఎలా తగ్గించుకోవాలి ఇలా..
ఎలా...
ముందు కాఫీ తాగితే తెలుస్తుంది కాస్త ఓపిక వస్తుంది ....

సింగినాదం జీలకర్ర (జాతీయం వెనుక కథ) -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
******
       అక్కడ ఏమీ లేదు. అంతా ఉత్తుత్త ఆర్భాటమే అని చెప్పడానికి సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఉపయోగిస్తారు. కొంతమంది ఉన్నదానికన్నా పదింతలు చెబుతుంటారు. ప్రచార ఆర్భాటంతో అదరగొడతారు. ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే అనేలా భ్రమపెడతారు..... దాంతో మనం ఎంతో ఆసక్తిగా ఉత్సాహంతో ఉరుకులు పరుగులమీద అక్కడకి వెళతాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేముంది మనం అనుకున్నదానికి చూసిన దానికి దోమకు ఏనుగుకు వున్నంత తేడా వుంటుంది. నిరాశతో నిట్టూరుస్తారు. ఎవరైనా దాని గురించి మరలా మనతో చెబుతుంటే సింగినాదం జీలకర్రలే ఉత్తమాటలు ఆపు అంటాం.

ఇంతకీ ఈ సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఎలా పుట్టిందంటే.... నిజానికి ఇది సింగినాదం కాదు శృంగనాదం. శృంగనాదం అంటే పెద్ద పెద్ద కొమ్ముబూరలతో ఊదేటప్పుడు వచ్చే ధ్వని. అది చుట్టుపక్కల చాలా దూరం వరకు పెద్ద శబ్దంతో వినబడుతుంది. ఈ శృంగనాదం అనేమాట జానపదులు నోరు తిరక్క సింగినాదంగా పలకడం మొదలు పెట్టారు. సింగినాదం అనే మాట ఎలా పుట్టిందో తెలిసిపోయింది కదా మరి ఈ జీలకర్ర అనే పదం దానికి ఎలా జతయ్యింది. దాని వెనుక వున్న కథ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ జాతీయం నెల్లూరు ప్రాంతంలో చాలా ప్రసిద్ధి కెక్కింది.

పూర్వకాలంలో అడవుల్లో దొంగలు గుంపులు గుంపులుగా తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళు ప్రయాణీకుల మీద దాడి చేసి వాళ్ళ దగ్గరున్నవన్నీ ఎత్తుకొని పోయేవారు. కొన్ని సార్లు చుట్టుపక్కల వున్న వూర్లమీద పెద్ద ఎత్తున కత్తులు బళ్ళాలతో, గట్టిగా కొమ్ము బూరలు వూదుతూ, అరుపులు కేకలతో దాడి చేసేవాళ్ళు. ఆ చప్పుళ్ళకు జనాలు భయపడి ఎక్కడి వక్కడ వదిలేసి వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయేవాళ్ళు. దొంగలు దొరికిన జనాల వంటి మీద వున్నవి దోచుకొని, ఇళ్ళలోకి దూరి ధాన్యం, నగలు, బట్టలు, వస్తువులు... అలా విలువైనవన్నీ ఎత్తుకొని పోయేవాళ్ళు. జనాలు ఆ కొమ్ము బూరల చప్పుడు వింటే చాలు భయపడి పోయేవారు. వణికిపోయేవారు.

ఆ తరువాత జనాలు దొంగలకు తాము సంపాదించినవి దొరక్కుండా భూమిలోపల రహస్యంగా ఎవరికీ తెలియని చోట దాచి పెట్టసాగారు. యువకులు కత్తులు, బళ్ళాలు తిప్పడం నేర్చుకొని గుంపులు గుంపులుగా రాత్రుళ్ళు కాపలా కాస్తూ దొంగలను ఎదిరించడం మొదలు పెట్టారు. దొంగలు వాళ్ళను ఓడించి వూరిలోకి అడుగుపెట్టినా ఎక్కడా ఏమీ దొరికేవి కావు. దాంతో నెమ్మదిగా కొంతకాలానికి దొంగల దాడులు తగ్గిపోయాయి.

చాలా రోజుల తరువాత ఒక సారి పెద్ద ఎత్తున శృంగనాదాలు వినబడ్డాయట. ఆ వూరివాళ్ళంతా భయంతో అదిరిపడి ఎక్కడివక్కడ సొమ్ములు, ధాన్యం, గబగబగబ భూగృహాలలో దాచి పెడుతుంటే, యువకులు అటకలమీద పెట్టిన కత్తులు, కొడవళ్ళు, తీసి పోరాటానికి సిద్ధం కాసాగారు. నిజానికి అలా ఊదిన వాళ్ళు దొంగలు కాదు. జీలకర్ర వ్యాపారస్తులు. అప్పట్లో జీలకర్రను విదేశీయులు పడవల్లో వేసుకొని అమ్మడానికి వచ్చేవాళ్ళు. పూరు దగ్గరపడగానే తాము వచ్చినట్లు తెలియడం కోసం వూరి పొలిమేర నుంచి శృంగనాదం చేసేవాళ్ళు. జీలక్రర కావలసిన వాళ్ళు ఆ చప్పుడు విని అక్కడికి పోయి కొనుక్కొని వచ్చేవాళ్ళు. అది తెలీని ఆ వూరివాళ్ళు వచ్చింది దొంగలనుకొని కత్తులు కటార్లు సిద్ధం చేసుకొని అక్కడికి పోయారు. పోయి చూస్తే చూస్తే ఇంకేముంది దొంగలు కాదు. సింగినాదం విని దొంగలనుకున్నాం కానీ వచ్చింది జీలకర్ర వ్యాపారస్తులని అందరూ నవ్వుకొన్నారంట. అలా అప్పటినుంచి ఏమీలేదు వుత్తుత్తిదే అని చెప్పడానికి సింగినాదం జీలకర్ర అని జాతీయం వాడుకలోకి వచ్చింది.
********
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

చిన్ని మేఘం   (కథ) ✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు


          ఒక చిన్ని మేఘం   ఉత్సాహంగా బయల్దేరింది. దానికిప్పుడు ఎంతో ఆతృతగా ఉంది. “మనకి మంచి పేరొచ్చేలా మీరు కురవాలి.  కొన్ని మేఘాలు బద్ధకంగానూ, మరికొన్ని  ఆలస్యంగానూ   వెళ్ళడంతో   చెడ్డ పేరు వచ్చింది.  ఇంకొన్నేమో కురవకూడని చోట కురిసి నా ప్రతిష్టను మసకబారేలా చేసాయి. మీరలా చేయవద్దు.  కురవబోయే ముందు మరొకసారి  ఆలోచించాలి. ఆ పని వల్ల  లోకానికి మేలు కలగాలి” అని మేఘరాజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.


ఇప్పుడెక్కడ  కురవాలా అని భూమి వైపు చూసింది  చిన్ని మేఘం. క్రిందకు చూస్తే  దట్టమైన అడవి, ఆకుపచ్చగా  కనబడింది.  అడవి మధ్య నీటితో నిండిన చెరువులు కనిపించాయి. ఇక్కడొద్దు అనుకుని ముందుకు వెళ్ళిపోయింది  చిన్ని మేఘం.   


అంతలో పెద్ద కొండ ఎదురొచ్చింది. కొండ మీద నుండి గాలి కూడా వీస్తోంది. ‘అయ్యో,  గాలి వీస్తే నేను ఇక్కడే  కురుస్తానేమో.  నా చినుకు జన్మ వృధాగా పోవడానికేనా? కాకూడదు’  అనుకుంది.  


అంతే!   ధైర్యం తెచ్చుకుంది  చిన్ని మేఘం. గట్టిగా అరిచి “ఓ గాలిదేవుడా ! నా వైపు రావద్దు. నన్ను తాకవద్దు. దూరం నుండే వెళ్ళిపో. నాకిక్కడ కురవాలని లేదు”  అంది.


  గాలిదేవుడికి  ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు  తనని పిలిచి అలా చెప్పిన  మేఘమే  లేదు. సరే, దీని సంగతేమిటో చూద్దామనుకుని  మరోప్రక్కకి పోయింది గాలి.  

 చిన్ని మేఘం ఉత్సాహంగా వెళ్లిపోతుంటే క్రింద  ఎడారి కనబడింది. అక్కడంతా ఇసుక మేటలే ఉన్నాయి. ఎంత వెదికినా  ఒక్క జీవి కనబడలేదు. ‘అక్కడ కురిస్తే  వృధా అవ్వడమే తప్ప ఎవరికీ పనికిరాను’ అనుకుంది. 


 ఈసారి దిశ మార్చింది  చిన్ని మేఘం.  క్రిందకు చూస్తే పంట పొలాలు కనబడ్డాయి. చేను బాగా పండి,  కోతకు సిద్ధంగా ఉంది. అలాంటి చోట కురిస్తే ఎవరికీ ఉపయోగం లేదు.  పండిన పంటలు  తడిసి ముద్దయి,  పాడవుతాయి. రైతుల్ని ఏడిపించి ఉసురు పోసుకోవడం తప్పు, పాపమనుకుంది.  అక్కడ నుండి మరింత ముందుకు వెళ్ళింది. 

క్రిందనే ప్రవహిస్తున్న నదులు, చెరువులు,  ఇల్లు  ఎన్నో కనబడ్డాయి. అక్కడ కురవకుండా ముందుకు వెళ్ళిపోయింది  చిన్ని మేఘం.  

ఈసారి దిశ  మార్చి మరోవైపు వెళ్ళింది  చిన్ని మేఘం. మళ్ళీ   భూమి మీదకు చూసింది. అక్కడ  పొలాలన్నీ ఎండిపోయి బీటలు వారి  కనబడ్డాయి. ఒక రైతు భుజం మీద కావిడితో కుండల నిండా నీరు నింపుకుని వచ్చి   నారుమడిని తడుపుతున్నాడు. మరో రైతు దీనంగా ఆకాశం కేసి చూసి చేతులెత్తి మొక్కుతున్నాడు. 

“వానదేవుడా.. ఈ ఏడాదైనా కరుణించి వర్షం కురిపించు. గతేడాది పంట పండక  అప్పులు చేసాను.  ఇంట్లోపిల్లలు  పస్తులు ఉండలేక ఏడుస్తున్నారు.   ఈ నారుమడి  కూడా అప్పు చేసి వేసిందే ” అని కళ్ళ నీరు పెట్టుకోవడం కనబడింది. 


అంతే  చిన్నిమేఘానికి తన గమ్యం చేరినట్టు తెలిసిపోయింది. 

 మరొక్క క్షణం ఆలోచించకుండా అక్కడ  కురవాలని నిర్ణయించుకుంది.  

సంతోషంగా భూమిని తడపడానికి సిద్ధమైంది.  అంతవరకు అది ఎటు వెళితే అటే వెళుతూ మరెన్నో మేఘాలు  వెనుకే వచ్చాయి. దాంతోబాటే  వర్షించాయి.  


వానచినుకులు నేలను తాకడం చూసి  ‘నా జన్మని సార్ధకం చేసుకున్నాను” అనుకుంటూ చిన్ని మేఘం చుట్టూ చూసింది. మిగతా మేఘాలు కూడా తననే అనుసరించడంతో అది చాలా సంతోషించింది.  

  

ఆ మేఘాల వెనుకే వచ్చిన  గాలిదేవుడు హోరున వీస్తూ మరిన్ని మబ్బులను  ఇక్కడికే  పంపించాడు. 


     “ఓ చిన్ని మేఘమా ! నీ ఒక్కదాని వల్లనే రైతులకి మేలు  జరగదు. నీ సంకల్పం చూసి సంతోషించాను.  నీ వెనుకే వచ్చాను. నువ్వు చేసే మంచి పనికి నా సాయం ఉండాలని మరికొన్ని  మేఘాలను తెచ్చేసి  ఇక్కడ కురిసేలా చేశాను” అన్నాడు గాలిదేవుడు . 

మంచిపని చేయాలన్న ఆలోచన ఉండాలి కానీ  ప్రకృతి సహకారం తప్పక ఉంటుందని అనుకుంటూ హాయిగావర్షించింది చిన్ని మేఘం.   

---***----

[

                 *భరతవాక్యం!*


*మనం పలు సందర్భాల్లో యధాలాపంగా “భరతవాక్యం పలికారు” అంటూ ఉంటాం కదా!*


*నాటకం చరమాంకానికి చేరాక తెరపడగానే నాటకాన్ని తిలకించిన ప్రేక్షకులకు శుభం కలగాలని కోరుతూ వారికి వీడ్కోలు పలకడాన్ని ‘భరతవాక్యం’. అంటాం.*


*కావ్యపఠనానికి ఫలశ్రుతి చెప్పినట్లు అప్పట్లో భరతవాక్యం వినిపించేవారు ప్రదర్శకులు.*


*ప్రపంచమనే నాటకరంగం చాలా విశాలమైనది. రాజు, పేద అన్న తేడా ఉండదు. జీవిత పరమార్థం తెలిసినవాడు రాజు; అది తెలుసుకోలేక ఎండమావి వెంట లేడిలా పరుగెత్తేవాడు కడుపేద.*


*భగవద్గీతలో ప్రథమ అధ్యాయం చివర ఒక వాక్యం కనిపిస్తుంది.*

*దాన్ని చదివేవారు, చదివి అర్థంచేసుకునేవారు అరుదుగా కనుపిస్తారు.*


*చరమశ్లోకాన్ని తప్పక చదవాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే అధ్యయనం అసంపూర్ణం అవుతుంది. అందులో మనం తెలుసుకోవలసిన విషయాలు, అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి.*


*భగవద్గీతను ‘గీతోపనిషత్తు’ అనడం కద్దు. గీతలోని ప్రతి శ్లోకం ఒక్కో ఉపనిషత్తుతో సమానం. దేనికదే స్వయంసంపూర్ణం. ఒక్క శ్లోకం (ఏకశ్లోకి) చదివినా, పరిపూర్ణమైన ఫలితం ఇచ్చే కల్పవృక్షం.*


*బ్రహ్మవిద్య, యోగవిద్య, గంగా యమునలవలె జ్ఞాన, కర్మమార్గాలు కలిపి బోధించే చేతిపుస్తకం. భక్తిలో రసీభవింపజేసి, ముక్తిశిఖరం చేర్చగల కరదీపం.*


*రథికుడికి, సారథికి మధ్య వివాదంగా మొదలై, కృష్ణార్జున సంవాదమై, పామరుల పాలిట ప్రబోధ గీతమై అనునిత్యం అలరించే నిత్యపారాయణ గ్రంథమది.*


*శ్యామసుందరుడైన కృష్ణుడు, శ్వేతవాహనుడైన అర్జునుడికి గీత బోధించటంలో అంతరార్థం ఉంది.*


*నలుపు-తెలుపుల అంతరంగ నాటకం ఇది. లౌకిక జీవనం తెలుపు అనుకుని మోసపోతున్నాం.*

*ఆధ్యాత్మిక జీవితం చీకటిగా ఊహించుకుని భయపడుతున్నాం. చీకటి కడుపులో వెలుతురు ఉన్నదన్న విషయాన్ని విస్మరిస్తున్నాం.*


 *’భోగికి పగలు- యోగికి రాత్రి* 

*యోగికి రాత్రి- భోగికి పగలు’.             అన్న గీతావాక్యం ప్రత్యక్ష ప్రమాణం.*


*అర్జున విషాదయోగం పగటిపూట చీకటి లాంటి ఒక మోహాంధకారం. ఒక యోధుడు విషాదాన్ని, సంశయాన్ని, శోకాన్ని, పిరికితనాన్ని తరిమికొట్టే ప్రణాళికకు పీఠిక.*


*అర్జునుడు ఊహించుకుంటున్న వియోగ బాధకు పరమ ఔషధం లాంటి యోగవిద్య రెండో అధ్యాయం 11వ శ్లోకంతో మొదలవుతుంది.*


*గీత దుర్యోధనుడి విషాదంతో మొదలవుతుంది. ‘ఎలా గెలవడం?’ అని అతడు ఒకవైపు ఏడుస్తుంటే, ‘ఎలా చంపటం?’ అని అర్జునుడు మరోవైపు కన్నీరు మున్నీరవుతున్నాడు.*


*అజ్ఞానపు తెరతీయగానే కర్తవ్యం గుర్తుకువచ్చింది. కర్తవ్యపాలన అర్జునుడి పాలిట యోగంగా మొదలైంది. అది దుర్యోధనుడి పాలిట దుర్యోగంగా పరిణమించింది.*


  *అర్జునుడి విషాదం రసార్ద్రం*

 *దుర్యోధనుడిది రసాభాసం.*

[


మానవ జీవితం సంపూర్ణంగా ‘యోగ’వంతం కావాలన్నదే భగవదాశయం. యోగమే మనిషికి క్షేమకారకం. మనిషిలోని అన్ని దుష్టభావాలను దూరం చేయడానికి యోగమే అత్యంత సమర్థనీయమైనదిగా భారతీయ తత్వవేత్తలు భావించడానికి కారణం శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతాబోధనే అన్నది అందరూ అంగీకరించిన సత్యం.

అయితే అసలు ‘యోగం’ అంటే ఏమిటి. యోగ సాధన చేయడానికి ఎటువంటి మానసిక స్థితి ఉండాలని భావించేవారికి భగవద్గీతలోనే సంపూర్ణ సమాధానాలున్నాయి. ‘సమత్వ బుద్ధి కలిగిన వ్యక్తి పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే విడిచిపెడతాడు. అంటే వాటినుంచి విముక్తుడవుతాడు. అదే అసలైన యోగం. అందుకే అర్జునా! నువ్వు కూడా ఆ సమతా యోగాన్ని అనుసరించు. ఆ యోగాన్నే కర్మ కుశలత్వం అనవచ్చు. లేదా కర్మ కుశలత్వాన్నే యోగంగా భావించవచ్చు’ అని అర్జునుడికి వివరించాడు గీతాచార్యుడు.

ఈ మాటలను అనుసరించి బుద్ధి యుక్తుడైన వ్యక్తి ఎవరైనా పుణ్యపాపాలను వదిలేస్తాడు. అంటే పుణ్యకార్యాలను ఫలాపేక్ష రహితంగా ఆచరించి, పాపకార్యాల జోలికి వెళ్లకుండా సమత్వ బుద్ధితో వ్యవహరిస్తాడు. దానివల్ల అతను పుణ్య పాపాలను వదిలిపెట్టినట్లు అవుతుంది. పుణ్య కార్యాచరణకు ఫలితం అతనికి మనశ్శుద్ధి ప్రాప్తిస్తుంది. అవి బ్రహ్మానుభూతి పొందడానికి మార్గమవుతాయి. కర్మాచరణలో నిష్కామ భావనకు సరైన స్థాయి ఏర్పడుతుంది. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం సులువు అవుతుంది.

భగవంతుడు తన బోధనలో ‘సమత్వం యోగ ఉచ్యతే, యోగః కర్మసు కౌశలమ్‌’- వంటి మాటలు చెప్పడంలోని ఆంతర్యం కూడా నిష్కాముడై కర్తవ్యపాలన చేయడమే యోగంగా భావించినట్లు స్పష్టమవుతున్నది. ఇంతకుముందు శ్లోకాలలో కూడా శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని సంక్షిప్తంగా సారభూతంగా వివరించాడు. కర్మలను ఎన్నటికీ వదలిపెట్టరాదన్నాడు. యోగాన్ని గురించి ఇంతకు పూర్వశ్లోకాల్లోనూ ఈ యోగమనేది సమత్వబుద్ధే అన్న అంశాన్ని చెప్పాడు. కర్మఫలాలు తప్పవు కాని కర్మ చేసిన వ్యక్తి ఆ కర్మఫలాలను సమత్వబుద్ధితో స్వీకరించినప్పుడు, అతనిలో నిస్సంగత్వం బహిర్గతమవుతుంది! ఏ కర్తవ్యాన్నైనా కేవలం కర్తృత్వబుద్ధితో మాత్రమే చేసి ఫలాసక్తి రహితుడైనప్పుడు అతని మనస్సు ప్రశాంతతను పొందుతుంది, ఎటువంటి మానసిక వికారం అతని దరిదాపులకు కూడా రాదు.

సాధారణంగా చేసే పనులలో కర్తృత్వభావన ఎక్కువై దాని ఫలితం కర్తను అంటిపెట్టుకునే ఉంటుంది. దానివల్ల అతనిలో ఒక విధమైన మనోవైకల్యం ఏర్పడుతుంది. అది ఒక్కోసారి దుఃఖ కారణం అవుతుంది. అంటే ‘నేనే కర్తను’ అనే భావం మనసులో ఉంటే దానివల్ల చాలా దుష్పరిణామాలు పొడచూపుతాయన్నమాట. అవి తొలగాలన్నప్పుడు మనిషి ఎటువంటి ఫలాసక్తి భావం లేకుండా నిష్కామ భావనతో మాత్రమే కర్తవ్య నిర్వహణ చేయాలన్నది గీతాచార్యుని సందేశం. అంతేకానీ చేయవలసిన కర్మను, అంటే బాధ్యతను తప్పించుకునే యత్నం చేయరాదన్నదే భగవానుని అభిమతం. యుద్ధం విధిగా చేయవలసిన అర్జునుడు ఫలితం దుఃఖ దాయకం అవుతుందేమోనని కర్తవ్య నిర్వహణలో వెనుకంజ వేస్తున్న సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా బోధించాల్సి వచ్చింది.

మానవ ప్రపంచంలో ప్రతి వ్యక్తి విహిత కర్మలను ఆచరించవలసిందే అన్న సందేశం భగవద్గీత నిర్దంద్వంగా బోధిస్తూనే ఉంది. ‘పని’ అనేది ఒక పవిత్రమైన పూజ. పూజించడం మన ధర్మం. ఫలితం భగవదిచ్చ. ఒకవిధంగా ఫలితమంటే ప్రసాదమే. అది భగవంతుడు మనకు ఇచ్చేదన్నమాట. కానీ, ఫలితాన్ని ముందే ఆశించొద్దు. ఆ విధంగా ఉండాలంటే కర్మను ఆచరించే వ్యక్తి ధర్మబద్ధుడై, నిష్కామ భావనతో సమత్వబుద్ధితో ప్రవర్తిస్తే.. అదొక మహాయోగంగా భావించినట్లు అవుతుంది. అందుకే ఆ యోగాన్ని అందుకోవాలని నారాయణుడు నరుని ద్వారా మనందరికీ అందించిన సందేశమే సమత్వ బుద్ధి కలిగి ఉండటం. అది ఆచరణలో చూపించడమే మనిషి కర్తవ్యం.

[


ఈ పుడమిపై పుట్టిన ప్రతి మనిషికీ అనుక్షణం అవసరాలెన్నో ఉంటాయి. బతుకు గడవాలంటే తిండి కావాలి. కట్టుకునేందుకు బట్టలు కావాలి. నివసించడానికి ఇల్లు కావాలి. ధన సంపాదనకు వృత్తులు, ఉద్యోగాలు కావాలి. ఆనందంగా ఉండటానికి ఇంకెన్నో కావాలి.

మనిషికి కోరికలు బలాలే కాదు, బలహీనతలు కూడా. మనిషి అవసరాలు ప్రాధాన్యాన్నిబట్టి మారుతుంటాయి. ఏది అత్యవసరమో దానికోసం మనిషి తహతహలాడుతుంటాడు. పరితపిస్తుంటాడు. మానవ ప్రయత్నంతో సాధ్యం కానప్పుడు దైవాన్ని ఆశ్రయించడం మానవ స్వభావం. ఇంటిలో ఉన్న దేవతలను ఆరాధించడమే కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడం, పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయడం, దానాలు చేయడం పరిపాటి. మనిషి దైవదర్శనం చేసుకొనే సమయంలో తన కోరికల చిట్టాను భగవంతుడికి నివేదించుకుంటాడు. అవన్నీ సమకూరిస్తే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటానని, కానుకలు సమర్పించుకుంటానని మొక్కుకుంటాడు. కోరికలు న్యాయమైనవే కావాలన్న నిబంధన ఏమీ లేదు కనుక అన్యాయార్జితాలకోసం మొక్కుకునేవారూ కనిపిస్తారు. ఉదాహరణకు ఒక దొంగ తనకు దొంగతనంలో అపారంగా ధనం లభిస్తే, అందులో కొంత హుండీలో వేస్తానని వాగ్దానం చేస్తాడు. అక్రమార్జనలో పుష్కలంగా ధనం లభిస్తే భూరి విరాళం ఇస్తానని మరొక వ్యక్తి కోరుకుంటాడు. ఎవరి బాధలు వారివి. ఎవరి కోరికలు వారివి. ఏ కోరికనూ కోరని భక్తులూ ఉండవచ్చు. అలాంటి వారిది నిష్కామ భక్తి.

కోరికలు ఉండటం, లేకపోవడం వ్యక్తిగతాంశం. కోట్లకు పడగలెత్తిన కుబేరులకూ అపారంగా కోరికలు పుడుతూనే ఉండవచ్చు. పూటకు గతిలేని నిరుపేదకు ఏ కోరికలూ లేకపోవచ్చు. కోరికలు మనిషిని బంధిస్తాయని మహర్షుల వాక్కు. ఒక కోరిక మరో కోరికను పుట్టిస్తుంది. కోరికలు కడలి కెరటాల్లాంటివి. ఒక కెరటం తీరాన్ని తాకి నశించగానే, మరో కెరటం వస్తూనే ఉంటుంది. కెరటాలకు అంతం లేనట్లే కోరికలకూ అంతం లేదు.

మనిషిని సృష్టించిన భగవంతుడికి మనిషి మనసులో ఏముందో తెలియదా అని ప్రశ్నించేవాళ్లూ ఉంటారు. మనిషి స్వభావం దేవుణ్ని అడిగేట్టుగా చేస్తుంది. ప్రాథమికావసరాల కోసం కొందరు దేవుణ్ని ప్రార్థిస్తారు. అవి తీరగానే విలాసాలు కోరుకుంటారు. వాటికి అంతులేదు. ఎన్ని ఉన్నా, ఇంకా ఏవో కావాలనిపిస్తుంది. కోరికలను ఏదో ఒక దశలో నియంత్రించకపోతే అశాంతి మిగులుతుందనడంలో సందేహం లేదు. పూర్వం యయాతి వంటి చక్రవర్తులుసైతం కోరికల అగ్నిజ్వాలలకు ప్రభావితులై, చివరిదశలో వాటిని వదిలేసిన కథలు పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి. ఎడతెగని కోరికలు జీవితాన్ని దుర్భరంగా మారుస్తాయి. సుఖంగా బతుకు గడవడానికి సరిపోయేంతటి కోరికలు అభిలషణీయాలేకానీ, గగనకుసుమాల వంటి అసాధ్యమైన కోరికలు వాంఛనీయాలు కావు.

కోరికల చిట్టాను దేవుడికి సమర్పించే ముందు వాటిని తీర్చుకోవడానికి మనిషి తన ప్రయత్నాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆచరించాడో తెలుసుకోవాలి. ప్రయత్నించే మనిషికే దేవుడి సహాయం లభిస్తుందని నీతికారులంటారు. కనుక మనిషి భగవంతుడి ముందు కోరికల జాబితాను సమర్పించిన తరవాత, తాను ఆ కోరికల సాధనకు తగిన కృషి చేయాలనే విషయాన్ని మరువరాదు.

గౌతమ బుద్ధుడు 'ఆశలేనితనం' గురించి మాట్లాడారు అని సాధారణంగా అంటుంటారు. ఆయన 'ఆశలేనితనం' అని అన్నప్పుడు జనాలు కోరికలు లేకుండా బ్రతకగలరు అని అనుకునే మూర్ఖుడు కాదు ఆయన. కోరిక లేకుండా మనుగడే లేదు అనేది ఆయనకు తెలుసు. ఆశలేనితనంగా ఉండాలి అని మీరు అనుకునేది కూడా ఒక పెద్ద కోరికే.

కోరికలు లేకపోవటం అంటే అర్ధం మీ కోరికలతో మీకు ఎటువంటి గుర్తింపు లేదనే. అప్పుడు కోరికలు కేవలం మీరు ఆడుకునే వస్తువులు మాత్రమే. కోరిక లేకుండా అస్సలు ఆటే లేదు. కానీ ఇప్పుడు ఈ కోరికలు ఇక మీ గురించి కాదు. ఈ క్షణానికి, ఈ పరిస్థితికి అనుగుణంగా అవి ఉంటాయి. ఏది ఎలా ఉండాలో అలా ఉంది. దాని గురించి మీరు ఏమి చేయగలుగుతారో అది మీరు చేస్తారు. మీరు అన్నిటిలో ఎంతో లోతుగా నిమగ్నమవ్వవచ్చు కానీ మీరు ఇక దేనితో గుర్తించబడరు.

ఈ అవగాహన ఒకసారి వస్తే, ఈ కోణంలో మీరు కోరికలు లేని వారు అయితే ఆ వ్యక్తికి కర్మబంధం ఉండదు. వారు ఒక యుద్ధం చేసినా కూడా వారికి కర్మ ఉండదు ఎందుకంటే వారికి అటువంటిది ఏదైనా చేయాలని కోరిక లేదు. అది దేని మీద అయినా వారి ప్రేమనుంచో ద్వేషాన్నుంచో వచ్చేది కాదు. అది అలా జరగటానికి కారణం ఏమిటంటే ఉన్న మార్గం అదే కనుక.

మీ కోరికలతో,ఆశలతో పోరాడటానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. మీరు ఎంత ఎక్కువగా పోరాడితే అవి అంత ఎక్కువగా వస్తాయి. పురాణాలలో, 'ఒక అసురుడిని చంపేటప్పుడు ఒక బొట్టు రక్తం నేల మీద పడితే, దానిలో నుంచి ఒక వెయ్యి మంది అసురులు పుడతారు' అని చెప్తారు. మీ ఆశలు, కోరికలూ అటువంటివే. మీరు ప్రయత్నం చేసి పోరాడితే, వాటిని నరికేస్తే అవి రక్తాన్ని చిందిస్తాయి. ఒక్కో చుక్కకూ ఒక వెయ్యి కోరికలు, ఆశలు పుడతాయి. వాటితో పోరాడటం పనికి రానిది, దాని వల్ల మీ జీవితం వృధా అవుతుంది. మీరు వాటితో ఎప్పటికీ పోరాడలేరు. మీ కోరికలను, ఆశలను సరైన దిశలో వెళ్ళేటట్లు మీరు శిక్షణ ఇవ్వాలి అంతే.

మీకు కోపం వస్తే దాన్ని మీరు ఉత్తమమైనది అనుకునే దాని వైపుకు మరల్చండి. మీ ఆశలను పెరగనివ్వండి.మీ కోరికలు, మీ ఆశలు అన్నీ కూడా కేవలం సాధారణమైన శక్తి మాత్రమే. వాటిని కోరికలుగా లేక భయాలుగా లేక కోపంగా లేక మరొకటిగా చేస్తుంది మీరే. బహుశా ఇప్పుడు అవి మీ చేతుల్లో లేవేమో. బహుశా ఇప్పుడు మీకు ఆ అవగాహన లేదేమో. కానీ వాటిని అలా చేస్తుంది మాత్రం మీరే. భావాలు ఏవైనా, మీ కోరికల స్వభావం ఏదైనా,  అదంతా మీరు మీ జీవితంలో ఇంకా లోతుగా పాతుకుపోవాలి అని మీ జీవ శక్తి చేసే ప్రయత్నం మాత్రమే. మీ జీవ శక్తి మీ జీవితానుభవాన్ని మరింత పెంచటానికే ప్రయత్నిస్తుంది. అది ఈ ప్రపంచంలోని బాహ్యమైన వాటిపై దృష్టి పెడితే, ఎప్పుడైతే ఎవరైనా లేక ఏదైనా దాన్ని పూర్తిచేయటంలో అడ్డుపడితే మీరు బాధపడతారు. అదే ఒకే ఒక్క దిశలో దృష్టిపెడితే, ఫలితాలు చాలా త్వరగా వస్తాయి. కనుక మీరు కోరుకునేటప్పుడు జీవితంలోని అత్యుత్తమమైన దాన్నే కోరుకోండి. మీరు కోపంగా ఉన్నపుడు ప్రేమగా ఉండలేకపోవచ్చు. మీరు కోపాన్ని వెంటనే ప్రేమగా మార్చలేకపోవచ్చు, కానీ మీరు మీ కోపాన్నే ఒక దిశలోకి మరల్చవచ్చు. మీకు కోపం వస్తే మీరు ఉన్నతమైనదిగా అనుకునేదాని వైపు దాన్నీ తిప్పండి. మీ కోరికలను పెరగనివ్వండి. వాటిని ఒక దిశలో పెట్టటం మీ చేతిలోనే ఉంది.

[


అర్థలక్ష్మి-భోగలక్ష్మి

పూర్వం కౌతుకపురమనే నగరాన్ని బహుసువర్ణుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనిని యశోవర్మ అనే క్షత్రియ యువకుడొకడు సేవిస్తున్నాడు. రాజాసేవకునకు ఒక సూర్యగ్రహసమయాన ధనమీయగా దానినాతడు పూర్తిగా ఖర్చు చేసికొన్నాడు. తదుపరి రాజేమాత్రం ధనమీయనందున దు:ఖితుడై  భార్యను పోగొట్టుకొని అభీష్టసిద్ధికై వింధ్యవాసినీ దేవిని ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై నీకు అర్థలక్ష్మి కావాలా? భోగలక్ష్మి కావాలా? అని అడిగింది. ఆతడు తనకీ రెండు లక్ష్ములభేదం తెలియదన్నాడు. అపుడామె ఈ దేశం లోనే అర్థవర్మ, భోగవర్మ అనే ఇద్దరు వణిజులున్నారని-వారి వద్దకు పోతే ఈ భేదం నీకు స్పష్టంగా తెలుస్తుందని చెప్పింది.  దేవి చెప్పినట్లుగానే యశోవర్మ మొదటగా అర్థవర్మ వద్దకు పోయాడు. అర్థవర్మ- యశోవర్మకు ఆతిథ్యమిచ్చి ఆనాటి మధ్యాహ్నం ఘృతమాంస వ్యంజనాలతో భోజనాన్ని పెట్టాడు. కాని ఆతడు మాత్రం అగ్నిమాంద్యంతో బాధపడే తనకింతకంటే ఎక్కువ తినరాదనే ఆంక్ష ఉందంటూ నేతితో కలిపిన పిండిని కొంచాన్నే తిన్నాడు. రాత్రి పూట కూడా యశోవర్మకు అన్నం పాలతో కలిపిన భోజనమిడగా ఆతడు తృప్తిగా తిన్నాడు. అర్థవవర్మ మాత్రం పలము మాత్రమే పాలు త్రాగాడు. భోజనానంతరం ఇద్దరు నిద్ర పోయారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దండధారులు కలలోన వచ్చినట్లుగా వచ్చి ఘృతపయో మాంసాలనధికంగా తిన్నావంటూ యశోవర్మ కాళ్లుపట్టుకొని లాగుతూ అర్థవర్మను లాఠీలతో చావమోదారు. అప్పుడాతడు ఇట్టి డబ్బెంత ఉన్నా కోరుకున్న పదార్థాలను తృప్తిగా తినలేని సంపద వ్యర్థమే అనుకొన్నాడు. అర్థలక్ష్మి స్వభావమాతనికి అర్థమైంది.   మరునాడు యశోవర్మ అర్థవర్మతో పాటు భోగవర్మ ఇంటికి బయలు దేరి వెళ్లాడు. భోగవర్మ యింట ధనసంపద జాడలేవీ కనిపించ లేదు. తనకు ధనం లేకపోయినా ఇతరులకు సాయం చేసి ధనాన్ని సంపాదించే భోగవర్మనాతడు చూచాడు. ఆడబ్బు ఎప్పటికప్పుడే వినియోగింపబడటం కూడా చూచాడు. తనింటికి వచ్చిన యశోవర్మ, అర్థవర్మలకు ఆతిథ్యమిచ్చాడు. మధ్యాహ్న సమయాన భోగవర్మ యశోవర్మాలతో పాటు ఉత్తమమైన ఆహారాన్ని భుజించి పానీయాలను సేవించారు. రాత్రి అయ్యేసరికి భోగవర్మ తన పరిజనాన్ని పిలిచి ఈ పూటకు తగినంత పానమున్నదా అని అడిగాడు. వారు లేదని చెప్పగా అపరరాత్రియందు జలమెలా త్రాగగలమంటూ శయనించాడు. యశోవర్మకూడా భోగవర్మ చెంతనే పడుకున్నాడు. అర్థరాత్రి సమయంలో ముగ్గురు పురుషులు యశోవర్మ కలలోనికి వచ్చి నట్లుగానే వచ్చి-భోగవర్మ యింటిలోనికి ప్రవేశించారు. వారు అక్కడి పరివారాన్ని భోగవర్మకు సమయానికి తగిన పానీయాలనేలయందించలేదని అంటూ చావమోదసాగారు.  ఇంతలో యశోవర్మకు మెలుకువ వచ్చి ధనం లేకపోయినా భోగవర్మ భోగలక్ష్మియే ప్రశంసమైనదనుకున్నాడు. అనుకొనకుండావచ్చే భోగవర్మ భోగలక్ష్మియే ప్రశంసనీయమైనదని-సమృద్ధమైనదైనా భోగహీనమైన అర్థలక్ష్మి నిరర్థకమని అనుకున్నాడు.  యశోవర్మ తిరిగి ఇంటికి వచ్చి విధ్యవాసినీ దేవిని ఆరాధించి ఆమె ప్రత్యక్షంకాగా భోగ లక్ష్మిని కోరుకొని తలంపక వచ్చే భోగసంపదలతో సుఖంగా ఉన్నాడు.  కాబట్టి భోగాసన్నమైన లక్ష్మి మిగుల కొంచెమైనా మంచిది. భోగరహితమైనది విస్తారమున్నా అది నిరర్థకమే అవుతుంది. (''తదేవం భోగసంపన్నా శ్రీరపి అల్పతరావరమ్/న పునర్భోగ రహితా సువిస్తీర్ణాపి అపార్థకా''210. శ్లో-          కథాసరిత్సాగరం-అలంకారవతీలంబకం-నాల్గవతరంగం. )

1 comment:

  1. చదివిన తర్వాత మరొకరికి పంపండి స్నేహం వృద్ది చేసుకోండి

    ReplyDelete