Friday, 14 April 2023

ప్రాంజలి ప్రభ..17/04

 

 



🌳 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.  

🌴 ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. 

🏝 కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు

🌿 కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 

👦 బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 

🌳 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది. 

🍎 బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 

🌴 క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది 

🏕 "నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు. 

🌿 "నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 

🌴 అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది. 

🌴 బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు

🌴 నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 

🌴 అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 

🌴 చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. 

నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 

ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు.. 

🌴 చెట్టు: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 

ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు .. 

🌴 నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. 

🌴 నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు. 

🌴 వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు. 

🌴 ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 

🌴 కొంచెం పెద్ద అయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసర మైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం.

☘️వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. 

🌴 చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.

👥 మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది. 

💘 ఈ కథలోని నీతి.. 

💗 మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది. 

💖 మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది.

pranjali Prabha

....

[08/09, 7:20 am] Mallapragada Sridevi: భానుమతి గారు ఇంటర్వ్యూలో -

మీకు బాగా నచ్చిన నటి ఎవరు ?

భానుమతి .. ఇంకెవరూ .. మన కన్నాంబ గారే .. ఆవిడ పాత్రలను చాలా ఈజ్ తో చేసేస్తారు.. అది కరుణరసం , నెగటివ్ షేడ్, రౌద్రం ఏదైనా అలా పండించేస్తారు. నేను స్వర్గసీమలో సుబ్బులు పాత్ర చేయడానికి కారణం బి ఎన్ గారు ఒకరు కాగా .. నేను అంతకు ముందు చూసిన తమిళ్ లో కన్నాంబ గారు చేసిన అశోక్ కుమార్ చిత్రములో ని పాత్ర ప్రధాన కారణం.ఆమె చేసిన ఆ పాత్ర వల్లే నేను స్వర్గసీమ, చింతామణి, తెనాలి రామకృష్ణ పాత్రలు మరింత ధైర్యంగా చేయగలిగాను

మీరు ఆమె చేసిన నాగమ్మ పాత్ర తిరిగి చేసారు కదా మీకు ఎలా అనిపించింది.

భానుమతి : కన్నాంబ గారు చేసిన దానిలో పది శాతం నేను చేసున్నా బాగుండేదనిపించింది.

మీరు చేయాలనుకుని చేయని పాత్రేదైనా ఉందా

భానుమతి: నేను చేసిన కృష్ణ ప్రేమ 1944  చిత్రములో మన టంగుటూరి సూర్యకుమారి నారద పాత్ర వేసారు. ఆ తరువాత తమిళ్ లో  ప్రముఖ కర్ణాటకా సంగీతజ్ఞురాలు ఎన్ సి వసంత కోకిలం చేసారు.. నేనూ నారద పాత్ర వేయాలని అన్నీ సిద్ధం చేసుకున్నాము.. కానీ కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయిపోయాము.

మీ అభిమాన గాయని ఎవరు : సుశీల, ఎం ఎల్ వసంత కుమారి . చాలా బాగ పాడతారు ఇద్దరూ

మీది ప్రేమ వివాహం కదా .. ఎవరు ఎవరికి ముందు ప్రపోస్ చేసారు..

భానుమతి : ఆయనకా అంత ధైర్యం.. నేను చెబితేనే భయపడిపోయారు పాపం.

మీ అత్త గారి కథలు అంతా మీ అత్త గారి గూర్చే వ్రాసారా ?

భానుమతి : అబ్బే లేదు.. ఆవిడ స్పూర్తి మాత్రమే .. మా అత్త గారు చాలా దొడ్డమనసున్నావిడ.

మీకు  గర్వం ఎక్కువ అని అందరూ అంటారు.?

భానుమతి : గర్వం అని ఎందుకనుకోవాలి.. ఆత్మ విశ్వాసమనుకోవచ్చు కదా.. ఎవరు ఏది అనుకున్నా అది నాకు పెట్టని ఆభరణం.

ప్రాంజలి ప్రభ కధలు 


"*మూడు వజ్రాలు""



      ఒకరోజు శివపురం ప్రక్కనే ఉన్న కృష్ణాపురం నుండి ముగ్గురు గ్రామస్థులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు. ముగ్గురినీ సాదరంగా ఆహ్వానించి కాఫీ ఫలహారాలు పెట్టాక “ఇప్పుడు చెప్పండి! మీ ముగ్గురూ ఏ పని మీద నన్ను చూడటానికి వచ్చారు?” అనడిగాడు.


“అయ్యా! నా పేరు శివుడు. నేను కుమ్మరిని. కుండలు తయారుచెయ్యటానికి మట్టిని ఎప్పుడూ ఈ భూషయ్య దగ్గరే కొంటుంటాను. నిన్న ఉదయం కుండలు చెయ్యటానికి నేను మట్టిని జల్లిస్తుంటే అందులో విలువైన మూడు వజ్రాలు దొరికాయి.


రెక్కాడితే గానీ డొక్కాడని పేదవాడ్ని. ఆ భగవంతుడే ఇన్నాళ్ళకి నన్ను కరుణించాడని ఆనందపడ్డాను. కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ వజ్రాలు తనకి చెందుతాయని నిన్నటి నుండి నాతో తగవు పడుతున్నాడు. తమరు ధర్మప్రభువులు. నాకు న్యాయం జరిపించండి” అంటూ మొలలో భద్రపరచిన వజ్రాలను రామన్నకు అందించాడు.


శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ "ఏం భూషయ్యా! శివుడు చెప్పింది నిజమేనా...?” అనడిగాడు. అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు.


"అయ్యా! శివుడు చెప్పింది నూటికినూరు పాళ్ళు నిజమే. కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాటేశాడు. అదే అసలు కిటుకు. శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను. కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకి తోలించుకున్నాడు. ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనేలేదు. తమరే చెప్పండి. శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా... నేనా?


ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా? నాకు చెందటం న్యాయమా? తమరు ఏం న్యాయం చెప్పినా తు.చ తప్పకుండా పాటిస్తాను.'


“దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం... ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ మూడు వజ్రాలకి మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారుడెవరో తేల్చాలి... ఇదేనా మీ తగవు?” అనడిగాడు మర్యాదరామన్న.


 ఇంతలో మూడవ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు.  "అయ్యా! వాళ్ళిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి....నేను చెప్పింది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి”


"నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకి మట్టి అమ్మింది నేనే. ఆ మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు. కానీ అందులో  ఒక చెల్లని నోటు ఉంది. చెల్లని నోటును నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడవుతాడు? అతని దగ్గర అరువుకి ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడవుతాడు? కావాలంటే ఈ నోటును పరిశీలించండి" అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాదరామన్నకు అందించాడు.


ఆ నోటును అందుకుని పరిశీలించిన రామన్న “నిజమే ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించ వలసిందే” అన్నాడు.


వెంటనే భూషయ్య “అయ్యా ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని పదిరోజులు అయింది. ఈ పదిరోజులలో నాకు మూడుసార్లు ఎదురుపడ్డాడు. కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశపుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు విలువలేనట్లే ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువలేదు.


వెంటనే శివుడు కల్పించుకుంటూ "అయ్యా! ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకి మాత్రమే కాదు. ఈ భూషయ్యకి కూడా. నాకు మట్టి అరువుకి తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక గానీ అతనికి డబ్బులు ముట్టచెప్పనని నేను ఖరాఖండిగా చెప్పాను. అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకి తోలాడు. ఇప్పుడు డబ్బులు తనకి ముట్టలేదన్న సాకుతో ఈ మూడు వజ్రాలు తనవే అనటం దుర్బుద్ది కాక మరేమిటి?”


శివుడి మాటలకి ధర్మయ్య కల్పించుకుని "అయ్యా! వీళ్ళిద్దరూ తోడుదొంగల్లా కన్పిస్తున్నారు.... భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకు పోయిన తరువాత అతను నాకు మూడుసార్లు ఎదురుపడ్డా నేనీ నోటు గురించి అడగలేదు. ఎందువల్లనంటే భూషయ్య నాకిచ్చిన డబ్బుల బొత్తిని నేనలాగే బీరువాలో భద్రపరిచాను. నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ బొత్తిని తీస్తే ఈ నోటు బయటపడింది. ఇందులో దుర్బుద్ధి గానీ కుట్ర కుతంత్రాలు గానీ ఏమీలేవు" అని తనని తాను సమర్ధించుకున్నాడు.


ముగ్గురి వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న. ఆ తరువాత “ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురూ తగవు మాని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెబుతాను” అని చెప్పాడు. ముగ్గురూ మర్యాదరామన్నకు నమస్కరించి వెళ్లిపోయారు. ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య "మిత్రమా! సమస్య జఠిలమైనదే. ఎలా పరిష్కరిస్తావు?” అని సందేహం వెలిబుచ్చాడు.


“ఈ తగవంతా నువ్వనుకునేంత జఠిలమైందే కాదు మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికీ, మోసపూరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ ...చూస్తూ ఉండు... రేపు ఉదయానికల్లా  ఈ మూడు వజ్రాలకు అసలైన సొంతదారుడిని నిర్ణయించి మిగిలిన ఇద్దరితో వాళ్ళ తప్పును ఒప్పిస్తాను” చిరునవ్వుతో మిత్రుడికి చెప్పాడు రామన్న.


ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు.


“తమలాంటి వారు మా ఇంటికి రావటం ఆశ్చర్యంగాను, సంతోషంగాను ఉంది” అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న.


"ధర్మన్నా! అనవసరమైన హడావిడి చేసి నేను వచ్చినట్లు పదిమందికీ తెలిసేటట్లు చెయ్యకు. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను” అన్నాడు రామన్న.


“అలాగా! అయితే రండి......” అంటూ రామన్నను మేడమీద గదిలోకి తీసుకుపోయి తలుపులు మూసి "అయ్యా! తమరు వచ్చిన కారణం చెప్పండి” అనడిగాడు ధర్మయ్య.


"ధర్మయ్యా! ముసుగులో గుద్దులాట ఎందుకు? విషయం సూటిగా చెబుతున్నాను విను! ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకూ తెలుసు నాకూ తెలుసు. ఆ మూడు వజ్రాలు కొట్టెయ్యటానికి నువ్వు వేసిన ఎత్తుకి నాకే మతిపోయింది.... రేపు నీ పక్షాన తీర్పు చెబుతాను. మరి నాకేమిస్తావు?”


 "అయ్యా! మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఉదయం నుంచి  మీరు ఎవరిపక్షాన తీర్పు చెబుతారా అని సతమతమైపోతున్నాను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిచొచ్చింది. మీ ఋణం నేనుంచుకోను. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం తమకి సమర్పించుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు.”


"సంతోషం ధర్మయ్యా! కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతలలో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవ్వాళ్ళ ఉదయం చూశాను కదా. అందుకే మనిద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం” అన్నాడు రామన్న.  


ఒక్కక్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తరువాత తను రామన్న వాటా ఎగ్గొట్టినా అతనేం చెయ్యలేడు. తన ఊళ్లోనే  కాక చుట్టుప్రక్కల పదహారు ఊళ్ళలోనూ అతను సరైన న్యాయం చెబుతాడని పేరుంది. పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో తర్కించుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు.


ఆ తరువాత భూషయ్యను కలుసుకున్నాడు.


"అయ్యా! ఇది కలా? నిజమా? తమ వంటివారు ఇంత రాత్రివేళ నా ఇంటికి రావటం. నా ఇల్లు పావనమైంది?” అంటూ సాదరంగా ఆహ్వానించాడు. “భూషయ్యా! సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెబుతాను విను!


మూడు వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా? అని ఎంతోసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది. అందుకే ధర్మయ్యను కలుద్దాం అని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెబుతున్నాను. ఇందుకు కృతజ్ఞతగా నువ్వు నాకేమిస్తావు?”


"అయ్యా! మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం ఇచ్చుకుంటాను... అంతకుమించి వేరే ఏదన్నా ఇచ్చుకునేంత ధనవంతుడిని కాదు నేను" అన్నాడు భూషయ్య.


“భలేవాడివి భూషయ్యా! రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడుట. నాకు కావలసింది అదే. కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఓ పత్రం రాసుకుందాం. అప్పుడు మనలో ఎవ్వరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది.”


పత్రం అనగానే ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య ఆలోచించాడు. పత్రం రాయటం వల్ల తనకి వచ్చే నష్టం ఏమీలేదు. ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి కానీ రామన్నకి పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతులు పోతాయి అనుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడతను.


భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్లాడు రామన్న. శివుడు, అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామన్నను చూసి కంచం ముందునుంచి లేవబోతున్న అతన్ని వారించి అతని ప్రక్కనే పీఠం వేసుకుని కూర్చుని "అమ్మా! నాకు ఆకలేస్తోంది. అన్నం వడ్డించు" అన్నాడు.


"క్షమించయ్యా! రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకో, పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉంటుంది. మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చి మిరపకాయలు మాకు పంచభక్ష్య పరమాన్నం. ఇది తమబోటి వారు తినలేరయ్యా" అందా ఇల్లాలు.


“ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచభక్ష్యపరమాన్నమేనమ్మా. నిద్ర సుఖమెరుగదు......ఆకలి రుచెరుగదు.... ఆ గంజి నాక్కూడా పోయమ్మా" అని గంజి త్రాగి బయటకు వచ్చి ఆరుబయట ఉన్న నులకమంచం మీద కూర్చున్నాడు.


రామన్న వెంటే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చుని "అయ్యా! మీరు తీర్పు చెబుతానన్నది రేపు ఉదయం కదా! ఈ రాత్రి వేళ నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్లు తోస్తోంది. అదేమిటో చెప్పండి”


“శివుడూ నీకెలా చెప్పాలో నాకర్థం కావట్లేదు.... ఏం చెయ్యాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను. ఉదయం నీవిచ్చి వెళ్ళిన వజ్రాలు  ఇంట్లో బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాలపిల్లాడు వాటిని గోలీలనుకుని తీసుకువెళ్ళి ఆడుకుని ఎక్కడో పారేసి వచ్చాడు. ఎంత వెదికినా అవి కనిపించలేదు... రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెబుతాను. మర్నాడొచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను.... రేపు నువ్వురా...ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకిస్తాను".


"అయ్యో! ఎంతపని జరిగిపోయిందయ్యా... న్యాయమో, ధర్మమో నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి. న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు  ఆ మూడు వజ్రాలు నాకు చెందుతాయనా?..... ధర్మయ్యకి చెందుతాయనా? తేల్చి నాకు చెప్పండి అప్పుడు నా నిర్ణయం చెబుతాను.”


“శివుడూ న్యాయంగా నేను తీర్పుచెప్పాల్సి వస్తే ఆ మూడు వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే ఆ మట్టిని పోయించుకున్నావు. భూషయ్య ధర్మయ్యకి చెల్లని నోటును ఇచ్చాడు. కనుక ఆ మట్టికి అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనటంలో సందేహం లేదు”.


"అయ్యా! రామన్న గారూ రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పును చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజుముక్కలు ధర్మయ్యకు ఇవ్వండి. అవి వజ్రాలు కావు కనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నేనిచ్చినవే అని చెప్పండి. నేను కూడా ఒప్పుకుని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను".


 “శివుడూ బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడంటారు".


"మరేం ఫర్వాలేదయ్యా! నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పుచెప్పటం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాటపడటం నష్టం లేదు. మీరు ఇప్పటివరకు ఒక్క తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్లనయినా అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు, ముందు కూడా ఇస్తారు. పదిమందికి  న్యాయం చేసే మీరు ఏ కారణం వల్లా అన్యాయం వైపు అడుగెయ్య కూడదు". 


 " వెంటనే రామన్న “శభాష్ శివుడూ! నా కళ్ళు తెరిపించావు. ధనము లో పేదవాడివైనా గుణములో ధనవంతుడివని నిరూపించావు. రేపు పంచాయతీలో నీవు చెప్పినట్లే చేస్తాను” అంటూ అక్కడనుండి బయలుదేరి ఆ రాత్రి ఆ ఊరిలోనే ఉన్న పూటకూళ్ళ ఇంట్లో బస  చేశాడు.


 మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న. ఆ వూరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యని మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్థులు పంచాయతీ దగ్గర గుమిగూడి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


రామన్న అందరికీ నమస్కరించి "అయ్యలారా! ఈ మూడు వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు” అంటూ తన తీర్పు చెప్పాడు. వెంటనే మోసం, దగా అంటూ భూషయ్య, ధర్మయ్య ఒకేసారి అరిచారు. ఇందులో మోసం, దగా ఏమీ లేదు. మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్కపెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నాడన్నది అబద్ధం. ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే మూడు సార్లు భూషయ్య ఎదురుపడ్డాడు కనుక ఒక్కసారన్నా నిలదీసి ఉండేవాడు... ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు. ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనయినా పగిలి పోయినా, పనికి రాకుండా పోయినా అతనికెలా సంబంధం ఉండదో మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళు ఆ మూడు వజ్రాలు కాజెయ్యటానికి శివుడితో తగవు పెట్టుకున్నారనటానికి నా దగ్గర తిరుగులేని మరో సాక్ష్యం ఉంది" అంటూ రాత్రి భూషయ్య, ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు.


ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను, ధర్మయ్యను ఛీ కొట్టారు. దాంతో వాళ్ళు, పశ్చాత్తాపపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగవుపడ్డామని అందరిముందు ఒప్పుకున్నారు.


పంచాయతీ పెద్దల చేతిమీదుగా శివుడికి మూడు వజ్రాలను అందిస్తూ “శివుడూ! అవి గాజు రాళ్ళు కాదు. నిజంగా వజ్రాలు. జాగ్రత్త సుమీ!” అంటూ చమత్కరించాడు రామన్న.



[06/09, 7:20 am] Mallapragada Sridevi: ప్రాంజలి ప్రభ

 


ఈ అనంత కోటి సృష్టికి మూలం భగవంతుడు. మనము ఆ భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని పంచభూతాలను వరంగా ప్రసాదించాడు. వాటిని మనం సక్రమంగా వినియోగించుకొంటే జీవితం ఆనందమయం అవుతుంది భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి సైతం భగవంతుని యందు భక్తి, ప్రకృతి అందు సంరక్షణ కలిగియుండాలి.

ఈ కలియుగాన మానవుడు క్షణికమైన సుఖాలంటూ పరిగెడుతున్నాడు. అధికార, ధన అహంతో అంధుడిగా మారి రాక్షస జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ జగతిన ఏది శాశ్వతం కాదని జగమెరిగిన సత్యమే అయినా మనిషిలో మార్పు లేదు. నాది అనే అహంకారంతో మానవత్వం మరిచి మనిషిగా మాయమైపోతున్నాడు. మనిషిగా ఈ భువిపై చేయాల్సిన సత్కార్యాలు ఎన్నో మన కళ్ళముందున్నాయి. అన్నీ సమకూర్చిన ఆ భగవంతుని యందు భక్తి , మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మన పూర్వీకులకు సదా రుణపడి వుండాలి. ఆ భగవంతుడు ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే. ఆ లోక కళ్యాణానికి భాగస్వాములు కావాలి. మన వంతు సాయం సదా చేస్తూనే వుండాలి. అందుకే భగవంతునియందు, పెద్దలయందు భక్తి, అనురాగంతో, ఆప్యాయతతో, మమతానుబంధాలతో మానవత్వంతో సతతం మనం పరిమళించాలి.

ప్రకృతి మనకు తినడానికి తిండి, తాగటానికి నీరు, వుండటానికి నివాసంతోపాటు సకల సౌకర్యాలను ఇస్తుంది. కాని మనిషి స్వార్థంతో మన ప్రకృతి పరిసరాలను కలుషితం చేస్తున్నాము. ఈ వేదభూమిలో ఎందరో మహాత్ములు ఏ ప్రతిఫలం ఆశించకుండానే తమ జీవితాలను మనకై ధారబోశారు. అలాంటి వారిని స్మరిస్తూ మనమూ వారి బాటలో నడవడానికి ముందుకు వెళ్లాలి కాని స్వార్థచింతనతో ప్రకృతి సమతౌల్యతను దెబ్బతీయకూడదు.

కర్మభూమిలో పుట్టిన మనం గర్వంగా జీవించాలి. ఆపన్నులకు, అన్నార్తులకు మన వంతు సాయం అందించాలి. ఏ స్వార్థం లేకుండా జీవిస్తే జీవితం ఆనందంగా వుంటుంది. స్వార్థంతో కళ్ళు మూసుకుపోతే ఆ జీవితం వ్యర్థం అవుతుంది.

‘ఈ సృష్టికి మూలం అమ్మ. బిడ్డ ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా అక్కున చేర్చుకొనేది అమ్మ మాత్రమే. ఆ అమ్మకు ప్రతిరూపం జగన్మాత. శ్రీశైలంలో భ్రమరాంబిక, కాశీలో అన్నపూర్ణ, విజయవాడ కనకదుర్గ, తిరుచానూరు అలివేలుమంగ, హిమాలయాల్లో వైష్ణోదేవి, ఆలంపూర్ జోగులాంబగా.. అన్నింటా అమ్మవారిదే అగ్రస్థానం. ఆ కలియుగదైవం శ్రీ శ్రీనివాసుని ఎదపై శ్రీలక్ష్మీదేవి నిలవడం ఎంత భాగ్యం. అమ్మ కరుణా వీక్షణములు లేకుండా మనిషి మనుగడ సాగించలేడు. గంగ, కృష్ణ, గోదావరి, యమున, సరస్వతీ నదీ తీరాలు మన జీవన గమనానికి జీవవాహినులు. అలాంటి అమ్మ పట్ల మనం సదా భక్త్భివంతో కలిగి జీవించాలి. అమ్మ చల్లని చూపుతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. సుఖమయ జీవితానికి నాంది పలకాలి. ఈ కలియుగంలో అమ్మరూపంలో ఉన్న స్ర్తిరూపులను మనం భక్త్భివంతో చూడాలి. వారిని పూజించాలి. వారియెడ సహనభావంతో చూడాలి.

భగవంతుడు లేడని వాదించే వితండవాదులు వున్నారు. భగవంతుడు అంటే నమ్మకం. ఆ నమ్మకానికి ప్రతిరూపం భగవంతుడు. భగవంతున్ని నమ్మి చెడినవారు చరిత్రలో లేరు. ఎందరో భక్తులు భగవంతున్ని నమ్ముకొని మహాత్ములు అయ్యారు. అందుకు సాక్ష్యాలు మన కళ్ళముందు కోకొల్లలు. అందుకు నిదర్శనాలు సతతం మనకు ఆదర్శ దర్శనాలు.

భగవంతుని మెప్పు పొందిన అన్నమయ్య కీర్తనలు అజరామరాలు. త్యాగయ్య రామకీర్తనలు తేనె పలుకులు. క్షేత్రయ్య పల్లె పదాలు అద్భుతాలు. భక్తరామదాసు పాడిన పాటలు ఆనందపరవశాలు. ఇంతకుమించిన భాగ్యం మనకు ఏమి కావాలి. ఈ సృష్టికి స్థితి లయ కారకుడు ఆ భగవంతుడు. కర్త కర్మ క్రియ భగవంతుడు. ఆ భగవంతుని చల్లని నీడలో సేద తీరుదాము. ఆనందంగా జీవిద్దాం.

[06/09, 7:22 am] Mallapragada Sridevi: *కోడలే ఇంటికి దీపం :*

*0x0x0x0x0x0x0x0x0x0*



*కొడుకు పెట్టె పిండాలకన్నా.... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.* అది....కోడలి గొప్పతనం....    


*కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...*—ఎందుకోతెలుసా...!!!


చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!


కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!


తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!


తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!


కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!


*-- ప్రాంజలి ప్రభ.*

_*శ్లోకం పరమార్థం...!*_

           _*గురు శిష్య సంబంధం...!*_

_*🙏గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః.....*_ _*గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః....🙏*_ 


_*ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది...మొదట ఎవరు పలికారు....ఎందుకు పలికారు.....దాని వెనుక ఉన్న కథ....*_ 



_*పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.*_


 _*గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.*_


 _*వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు...అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.*_


 _*కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు ,పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.*_


 _*కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.*_ 


_*అతని గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.*_

 _*గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః*_ _*గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః*_


 _*తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.*_ _*ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ....

ప్రాంజలి ప్రభ


*ఎవరికోసం.. ఈ పాకులాట?*




మరణానంతరం మన అంత్యక్రియలు జరిగిన తరువాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో  నిమగ్నమవుతారు.


మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు.


అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన - శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన  పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు.


ఈ లోగా నీదగ్గరి బంధువు ఒకాయన - ఆఫీసులో శెలవు దొరకని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని నీ భార్యతో మొక్కుబడిగా వాపోతాడు.


మరునాడు వెళ్ళిపోయినవాళ్ళు  వెళ్ళిపోగా - మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు. మరొకాయన దానికి వంత పాడుతాడు.


నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని  కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో   నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు. అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా! మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు. విదేశాల నుండి వచ్చిన బంధువులైతే, పదకొండో రోజు తరువాత వెళ్ళబోయే విహారయాత్రకు ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.


నువ్వు పోయిన విషయం తెలియక          నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు.


అంతలో,   తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు.


నెల తిరగక ముందే, మీ అర్థాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది. అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు చుట్టబెట్టేస్తుంటారు.


మొత్తంగా, నెల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు - అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే - నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!!

ఒక  పండుటాకు ఓ మహావృక్షాన్నుంచి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో, అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథం లోంచి నువ్వు కనుమరుగై పోతావు


నీ మరణానంతరం కుడా - అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు. పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి. సినిమాతారలకి రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది.

అంతలో, నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ జ్ఞాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది.


ఈ కార్యక్రమంతో నీకు, ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.


ఇప్పుడు చెప్పండి…!!


ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం? 

దేనికోసం తెగ హైరానా పడిపోయావు?

నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా?


జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా? ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో   అర్థం, పరమార్థం ఉంది కదూ!!!

***



*శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సూత్రములు..*

ఒక పురుగు  దేహంలో ప్రవేశించినపుడు​, రోగము మొదలవుతుంది.  డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని, ఆ భాగం తీసివేస్తాడు•

అలాగే చెడు చస్తేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది.. కాలధర్మము ప్రకారం వీళ్ళను చంపాలి.. నీవు నిమిత్త మాత్రం.. పుట్టిన వానికి చావు తప్పదు ​ యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట , కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది... మమకారం వదిలి పెట్టు, అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు•

కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు..

*ఇది ధర్మమా కృష్ణా!*  అని...,

నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను.. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది.
ఆవు శాఖాహారము తింటుంది.., మాంసాహారము తినదు...... కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మము.
                
యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే.. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే  రాముడు యుద్దం  చేయలేదు.. , వెళ్ళిపోయాడు.. ఆ రోజు రాత్రి రావణుడు శివుణ్ణి దూషిస్తాడు... నీవు భక్తుణ్ణి రక్షించలేదని... ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించబడినాడు.

అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు.. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి... కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం... మన ఇంట్లో దొంగలు పడ్డారు.., సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు...  వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు .. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు.., నీవు కారు వేసుకుని  తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి... 

అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు  *"అశ్వత్థామ హతః"* అని పెద్దగా చెప్పి *"కుంజరహః"* అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన భగవంతుడు​ ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి...

పిల్లలకి  గీత  చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు...

పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి...  ప్రతి దేశం లోనూ యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది... ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర..? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా...

కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో​ ఎవరికీ తెలియదు.   అప్పటికప్పుడు సిద్ధం అయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు... అప్పుడు మనం ఏమి చేయగలము... వారికి బానిసలు కావాలి...

అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి.. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు... దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి  గీత యిస్తుంది... దీనుడైన అర్జునుని ధీరుని వలె భగవద్గీత మార్చివేసినది.

అదేవిధముగా... చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసిన వారు  ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.
   
భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే.  అందుకే...  *గీతా పారాయణ కన్నా  గీతాచరణ ముఖ్యం* అన్నారు... భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అట్లే వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరంలేదు... ఒక్క పుల్ల చాలు.. 
         ​
బెంగుళూరు, బెంగుళూరు అని మనము ఎన్ని సార్లు జపించినా బెంగుళూరు చేరలేము.. ప్రయాణం మొదలుపెడితే గమ్యం చేరగలము.

చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు... గరుడ పక్షి యైనా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు..  కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలుపెడితే కృష్ణుడు యిచ్చే ఫలితం అందుకోగలము..

ప్రాంజలి ప్రభ


ధర్మాచరణ పంపిన


సృష్టిలో కనిపించే లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకలి, నిద్ర, సంతానోత్పత్తి ఇతర ప్రాణుల్లోనూ ఉన్నాయి. మరి మనిషి ప్రత్యేకత ఏమిటి?


దర్యాన్ని ఆచరించే యోగ్యత మనిషికే ఉంది. ఏ ఇతర ప్రాణుల్లో ధర్మాన్ని ఆచ రించే అవకాశం లేనందువల్ల, అది మనిషికి దక్కిందని జ్ఞానులు చెబుతారు. ఆ స్థానాన్ని పొందిన మనిషి సరైన మార్గంలో ధర్మాన్ని ఆచరించకపోతే, మిగిలిన ప్రాణులకూ మనిషికి తేడా ఉండదు. మనిషికి మాట్లాడేందుకు నోరు, పూజించడానికి చేతులు, ఆలకించేందుకు చెవులు, ఆలయానికి వెళ్ళడానికి రాళ్లు భగవద్వాసనలు ఆఘ్రాణించే నాసిక, దైవ తీర్ధం

సేవించే జిహ్వ ఉన్నాయి. మిగిలిన ప్రాణులకు చెవులు ఉన్నాయి. కానీ... భగవంతుడి స్తుతులను ఆలకించాలని తెలియదు. కాళ్లు ఉన్నాయి కానీ గుడికి వెళ్ళాలని

తెలియదు. పూజ చేసే చేతులు లేవు. నోరు ఉంది. కానీ భగవన్నామం చెయ్యా


లని తెలియదు. అందుకే వాటిలో లేని ఆ యోగ్యత మనిషిలో ఉంది. కాబట్టే

మానవ జన్మ అత్యున్నతమైనది. శాస్త్రోకమైన ధర్మాచరణ చేసేవారిని మహాత్ములు అంటారని శంకరులు తమ భాష్యంలో తెలిపారు. ధర్మం ఈ చరాచర జగత్తును అంతటినీ నడిపి స్తున్న దివ్య శక్తి, దానివల్లనే ఈ బ్రహ్మాండమంతా నిలబడుతోంది. ప్రకృతి ఎలా ప్రవర్తించాలి. ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజే సేదే : ధర్మం. అది కాలానుగుణమైన మార్పు. లకు మారేది కాదు. దానికి కాల దోషం లేదు. దేని కారణంగా మనిషికి ఆధ్యా


తికోన్నతి లభిస్తుందో అదే ధర్మం. "మనిషి కచ్చితంగా దాటాల్సిన భౌతిక దశలన్నీ క్షణభంగురాలే. ఈ లోకంలో ఆచంచలమైనది, స్థిరమైనది ధర్మం ఒక్కటే అన్నారు వివేకానంద.


సత్కరల్లో ముఖ్యంగా దానం, ధ్యానం ప్రతినిత్యం శ్రద్ధగా చేసేవారికి మనో చైతన్యం కలిగించేది ధర్మం మాత్రమే. ప్రతివారూ తమ పనులు ధర్మబద్ధంగా ఉన్నాయా లేవా అని తరచి చూసుకోవాలి.


ధర్మం సారమే ఈ జగత్తు అన్నాడు గౌతను బుద్ధుడు | మనిషిని జీవింపజేసే ధర్మాల్లో ముఖ్యమైనవి- నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, దహింపకే సేవి- అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ.

వ్యక్తిగత ధర్మాలు సమష్టి ధర్మాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అలాంటివాటిని త్యజించడమే అసలైన ధర్మం. రామాయణంలో ధర్మం మూర్తీభవించిన శ్రీరాముడు, మహాభారతంలో ధర్మానికి ప్రతినిధి అయిన ధర్మరాజు, లోక ధర్మానికి కట్టుబడి భార్యను, కుమారుణ్ని, రాజ్యాన్ని వదిలి వెళ్ళిన గౌతమ బుద్ధుడు ధర్మ స్వరూపుల య్యారు. అనంతర కాలంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. అరవిందులు... ధర్మాచరణలో సఫలీకృతులైన సత్పురుషులు,

ధర్మరాజు యుద్ధంలో అశ్వత్థామ హతః' అని చెప్పడం, యుద్ధంలో నియమ విరుద్ధంగా దుర్యోధనున్న గదతో తొడలపై మోదడం, కర్ణుడు నేలపై ఉండగా సంహ రించడం.. ధర్మ విరుద్ధాలు కావా అనే సందేహం కలుగుతుంది. ధర్మాన్ని ధర్మంతో, ఆధర్మాన్ని ఆదర్యంతో ఎదుర్కోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు.

మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతర ప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు. ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతను మనిషికి ప్రసాదించాడు భగవంతుడు, ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః


- ఎం.వెంకటేశ్వరరావు


"టాక్సీలో పర్సు"

   చెన్నపట్టణంలో సింగారవేలు అనే టాక్సీవాలా ఒకడు ఉన్నాడు. వాడికి రెండు దుర్గుణాలు ఉండేవి. మొదటిది ఏమిటంటే, వాడి టాక్సీ ఎక్కి వెళ్ళినవాళ్ళు మీటరు లెక్కప్రకారం వాడికి ఛార్జీ ఇస్తే సరిపోక, పేచీపెట్టి రూపాయో అర్థో గుంజుకోవడం.

రెండోదుర్గుణం ఏమిటంటే, సామానులు అన్నీ దించక ఏదో ఒకటి కార్లో అట్టే బెట్టేసుకోవడం. ఆ ఎక్కినవాళ్ళు జాగ్ర త్తయిన వాళ్ళయి, సామానంతా దిగిందా లేదా అని చూసుకునేవాళ్లయితే సింగార వేలు 'అయ్యో, ఈమూల ఈసామాను ఉండిపోయిందే; నేను చూసుకోనేలేదు!' అంటూ ఏమీ ఎరగనట్లు నాలిక కరుచుకుని, వెంటనే ఆ సామానుకూడా దించేసే వాడు. వాళ్ళు ఏమాత్రం ఏమారివున్నా, వాళ్ళ కళ్ళలో దుమ్ముకొట్టి సామాను కొట్టేసేవాడు.

ఒకనాడు బెజవాడనుంచి సంగమేశ్వ ర్రావు అనే ఆయన సకుటుంబ సమేతంగా రైలులోవచ్చి చెన్నపట్నం సెంట్రల్ స్టేషన్లో దిగేడు. ఆయన భార్యా తమ్ముడు, వెంకటా చలం అనే క్రిమినల్ లాయరు, ట్రిప్లికేనులో సింగరాచారివీధిలో మకాంచేసి వుంటున్నాడు.

సంగమేశ్వర్రావు కంటపడటంతోనే సింగారవేలు " టాక్సిసార్ !" అని, ఆయన ఏమీ సమాధానం చెప్పకుండానే ఆయన సామాను ఎక్కించేసి, "అమ్మగారూ ఎక్కండి" అన్నాడు. వాళ్లంతా ఎక్కడంతోనే, "ఎక్కడికి సార్ ?” అని సింగార వేలు అడగటం, సంగమేశ్వర్రావు బావ మరది అడ్రస్సుచెప్పటం జరిగింది.

టాక్సీ వెంకటాచలం గారింటిముందు ఆగటంతోనే చుట్టాలంతా దిగి లోపలికి వెళ్ళేరు. వాళ్లని ఇంట్లోవాళ్ళు కుశల ప్రశ్నలు అడుగుతోంటే సింగారవేలు సామాను చేరవేసి, ఛార్జీ అడిగాడు.

సంగమేశ్వర్రావు మీటరుచూపిన ఛార్జీ ఇవ్వబోయేసరికి సింగారవేలు ఖస్సుమని, "తిరిగిపోయేటప్పుడు ఖాళీగా పోవాలే. మీటరుఛార్జీమాత్రం ఇస్తే ఎలాగ?" అని పేచీ పెట్టేడు. సంగమేశ్వర్రావు మరో రూపాయి వాడిచేతిలోపడేసి, వెళ్లమన్నాడు.

సింగారవేలు సణుక్కుంటూ టాక్సీని డ్రైవు చేసుకుపోయాడు.

భోజనాలయాక సంగమేశ్వర్రావు ఏదో వెతుక్కో బోగా, ఆయన బావమరది వెంకటాచలం ' ఏమిటిబావా ?' అన్నాడు.

'చడావుల జతవున్న అట్టపెట్టె కనపట్టం లేదోయ్. మొన్న హైదరాబాదులో మనసు పడి కొన్నాను' అన్నాడు సంగమేశ్వర్రావు. ఆయనభార్య, 'రైలుదిగినప్పుడు నేను చేత్తో పుచ్చుకున్నానండీ టాక్సీలో వదిలేరేమో!' అంది.

'సాయంత్రం స్టేషనువైపు వెళ్లి చూద్దాం. ఇలా మరిచిపోయిన సరుకులేమైనా వుంటే వాళ్ళు జాగ్రత్తపెట్టి ఇవ్వడంకలదు' అన్నాడు బావమరిది వెంకటాచలం.

సాయంత్రం బావమరదులిద్దరూ స్టేషన్లో టాక్సిస్టాండువద్దకు వెళ్ళేరు. అక్కడ సింగారవేలు కనపట్టంతోనే 'ఏమోయ్, పొద్దున్న టాక్సీలో కొత్త చెప్పులున్న అట్ట పెట్టె ఒకటి దిగడిపోయింది' అన్నాడు. వెంకటాచలం.

సింగారవేలు ఏమీ ఎరగనివానికిమల్లే, 'ఏమీలేదే. అమ్మగారు సామాను అంతా సరిచూసుకున్నారు' అని బొంకాడు.

సంగమేశ్వర్రావు కారంతా ఓమాట గాలించాడు. వెతికితే కనపడటానికి ఆ జోళ్లపెట్టె ఇంకా అక్కడ కూచుందా ? దాన్ని కారులోనే ఉంచటానికి సింగారవేలు తెలివితక్కువవాడా ?

సింగార వేలు మీద పోలీసులకి రిపోర్టు ఇద్దామనిపించింది వెంకటాచలానికి. కాని సంగమేశ్వర్రావుగారు, 'పోనిద్దూ, అజాగ్రత్తగా ఉండటం మనదే తప్పు. పోయిన వస్తువు చెప్పులజోడు అంటే పోలీసువాళ్ళు కూడా అంత లక్ష్యపెట్టరు. ఇంక కేసు పెట్టి ఏంప్రయోజనం?' అనిచెప్పి, ఆ ప్రయత్నం మానిపించేశాడు.

సంగమేశ్వర్రావు చెన్నపట్టణంలో ఒక వారంరోజులుండి కుటుంబంతో సహా బెజవాడ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ దరిమిలా ఒకనాడు రాత్రి వెంకటాచలం, అడయారు గాంధీనగరంలో స్నేహితుడొకాయన గృహ ప్రవేశమై విందుకిపిలుస్తే, అక్కడికి వెళ్ళేడు. తిరిగివస్తో బస్సుకోసం స్టాండులో నిలబడితే ఎంత సేపటికి బస్సు రాలేదు. ప్రాణంవిసిగి ' ఏంచేద్దామా?' అనుకునే సరికి టాక్సీ ఒకటి ఆ దారిని పోతూ ఆయన్ని చూసి ఆగింది.

" రండిసార్ !” అన్నాడు డ్రైవరు. మరొకప్పుడైతే వెంకటాచలం పొమ్మనే వాడేగాని రాత్రి తొమ్మిది దాటిపోవటం, పైన చినుకులు కూడా ప్రారంభించడం చూసి త్వరగా ఇంటికి చేరుకోవడమే మంచిదనిపించిందాయనకి. కార్లోకూచుని "ట్రిప్లికేను పోనియ్యవోయ్” అన్నాడు.

మొదట ఆనవాలు కట్టకపోయినా, కారు కొంతదూరం పోయేసరికి వెంకటాచలం గారికి ఆ కారుడ్రైవరెవరో తెలిసిపోయింది. సంగమేశ్వరరావుగారి జోడుకొట్టేస్త వాడే అని ఆయన పోల్చుకోడంతోనే వాడికేదైనా తగినశాస్తి చేసి ఏడిపించాలనిపించింది. వాడిది ఇతరులసొమ్ము అంటే గడ్డితినేబుద్ధి అని ఆయనకు తెలుసు గనక వాణ్ణి టోకరా కొట్టించటానికి ఆయన ఒక ఎత్తు వేశాడు.

ఒక వంద గజాలలో తమయిల్లు వస్తుందనేవరకూ టాక్సీని పోనిచ్చి 'డ్రైవర్, టాక్సీలో ఎక్కడో నా పర్సు పడిపోయింది. ఏమూలకి పోయిందో ఎంతతడిమినా చేతికి తగల్లేదు. అగ్గిపెట్టెవుంటే ఇయ్యి, వెలిగించి చూస్తాను !' అన్నాడు.

సింగారవేలు దగ్గిర అగ్గిపెట్టె లేకపోలేదు. కాని వాడికి దాన్ని ఇవ్వ బుద్ధి వెయ్యలేదు. ఏమంటే పర్సు మాట చెవిని పడంతోనే వెంకటాచలం అనుకున్నట్లే వాడికి దురాశ పుట్టి దానినింక ఆయనకు దక్కనివ్వ కూడదనిపించింది. వాడి మెదడు వెంటనే పనిచేసి ఆయనను మోసంచెయ్యటానికి తగిన ప్లాను ఇట్టే తోచింది.

వాడు, 'సార్, నావద్ద నిప్పుపెట్టలేదు. అదిగో ఆ సందులో ఒక కిల్లీకొట్టు ఉంది. అక్కడ అగ్గిపెట్టెలు అమ్ముతారు. నేనే వెళ్లి తెచ్చిపెడుదునుగాని, ఇంజను ఆపేస్తే కారు మళ్లీ ఓపట్టాన కదలదు! మీరేదయ చేసి ఒక్క అడుగు వెళ్లివస్తారా?' అన్నాడు. అంతేగాదు ' పర్సు పడిపోయిందిగనక మీవద్ద వేరేచిల్లర ఉండదు' అంటూ వాడు తన జేబులోంచి ఒక అణా కూడా తీసియిచ్చి ఆయనచేతిలో పెట్టాడు.

వెంకటాచలం టాక్సీదిగి వాడు చెప్పిన సందులోకి నడిచాడు.

ఆయన అనుకున్నట్లే సింగారవేలు ఆయన వెళ్లగాచూసి వెంటనే బ్రేకు వదులు చేసి నలభైమైళ్ళ స్పీడున టాక్సీతో పారి పోయాడు. షెడ్డుచేరేవరకూ సింగారవేలు మళ్ళీ ఎక్కడా టాక్సీని ఆపలేదు. అక్కడకు చేరేక, ఆ పర్సుకోసం తన టార్చి లైటుతో కారు అంతా గాలించాడు.

పర్సు అనేది ఉంటేగా కనపడటానికి? ఈ లేనిపర్సుకోసం ఆశపడి నిష్కారణంగా ఛార్జీ పోగొట్టుకున్నాడు! పైగా సొంత సొమ్ము కూడా ఒక అణా వదిలింది! అందుకని తేలుకుట్టిన దొంగలాగా సింగారవేలు లోలోపఠే ఒక రాగం పెట్టి ఊరుకున్నాడు. మరి, అంతకంటె చేసేదేముంది?

(1952 మార్చ్ నెల "చందమామ" కథ)

కొంచం రిలాక్స్ కోసం...🤪🤪😂😂🤣🤣

"నాన్నా .. అమెరికా లో నా ఉద్యోగం పోయేలా ఉంది"

'ఏం ఫర్లేదు .. వెంటనే ఇక్కడికొచ్చేయి '

'వచ్చి ఏం చెయ్యాలి ?'

'ఓ స్కూలు పెట్టు ?'

'ఏ స్కూలు ? డ్రైవింగ్ స్కూలా ?'

'నీ మొహం .. ఇంటర్నేషనల్ స్కూలు .. స్టార్టెడ్ బై ఫారిన్ రిటర్న్డ్ ఎన్నారై అని టాగ్ లైన్ పెడదాం '

"NRI అంటేనే ఫారెన్ కి వెళ్లినవాడు కదా .. మళ్ళీ ఫారిన్ రిటర్న్డ్ ఎందుకు ?'

'నువ్వు తిరిగొస్తున్నావుగా ..
అందుకు ..
అయినా మన వాళ్ళు ఫారిన్ రిటర్న్డ్ అంటే బొద్దింకనైనా నెత్తినెట్టుకుంటార్రా .. '

'సరే .. స్కూలెక్కడ పెడదాం ? బోల్డు స్థలం, పర్మిషన్లు  గట్రా కావాలి కదా '

'ఏవఖ్ఖర్లేదు .. మన అపార్ట్మెంట్ కాంప్లెక్సులో నువ్వు పంపిన డబ్బుల్తో మూడు ఫ్లాట్లు కొన్నాం కదా .. రెండు ఫ్లాట్లు కలిపి స్కూలెట్టేద్దాం '

'అపార్టుమెంట్లో స్కూలా ?.. జనం వస్తారా ?'

'జనందేముంది ?.. ఏవెట్టినా వస్తారు .. కొంచెం హడావిడి చెయ్యాలంతే .. '

'హడావిడి ఏమిటి ?'

'అంటే .. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అఫ్ కిడ్స్ , మల్టీ-లాంగ్వేజ్ స్కిల్స్ , టాబ్లెట్ బేస్డ్ టీచింగ్, హార్స్ రైడింగ్ , స్విమ్మింగ్  లాంటివి బ్రోచర్ లో పెట్టామంటే .. ఇంక చూస్కో '

'ఏమిటీ ..అవన్నీ నేర్పిస్తామా ?'

"మరదే ..రోజూ చిప్సూ , అడ్డమైన చెత్తా మన స్కూల్లో కొనిపిస్తాం కదా.

గుండ్రం గా పెరుగుతారు.. అదే ఆల్రౌండ్ డెవలప్మెంట్.
 
ఇంక ఆళ్ళు ఎలాగా ఇంట్లో ఇంగ్లిష్ మాట్లాడతారు , మన స్కూల్లో తెలుగు , హిందీ చెప్పేమనుకో అదే మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ .. టాబ్లెట్ లో గేమ్స్ నేర్పిద్దాం .. టాబ్లెట్ బేస్డ్ టీచింగ్ .. ఆళ్లిచ్చే డొనేషన్ తో వచ్చే ఏడాది కల్లా .. శంషాబాద్ తర్వాత చీపుగా ల్యాండ్ కొనేసి ఇంటర్నేషనల్ క్యాంపస్ అని ఓ బిల్డింగ్ కట్టేసి , పక్కనే ఒక స్విమ్మింగ్ పూలూ , ఓ రెండు గుర్రాలూ కొన్నామంటే సరిపోద్ది '

'బావుంది ..కానీ ఇన్నేసి స్కూళ్ళు ఉండగా మన స్కూలుకే ఎందుకెక్కువగా రావాలి ?'

'ఎందుకంటే .. మన స్కూల్లో ఫీజెక్కువ కాబట్టి .. మన  జనానికి రేటెక్కువ అంటే క్వాలిటీ ఎక్కువ అనుకునే వెర్రి ఉందిగా మరి !'

'మరి పర్మిషన్లు ?'

'పర్మిషన్లదేముంది ? గులాబీ రంగు బోర్డెట్టి , గులాబీ రంగు యూనిఫారం పెట్టి , లోకల్ ఎమ్మెల్యే ని ఓపెనింగ్ కి పిలిచేమంటే , మనం స్కూలు రోడ్డు మీదెట్టినా ఎగురుకుంటూ వచ్చి, పర్మిషన్లిచ్చి, ఓపినింగు చేసేస్తాడు '

'బావుంది ..స్కూలుకి పేరేం పెడదాం?.. తాతయ్య పేరెడదామా ?'

'నువ్వింకా ఎదగలేదురా ఎదవా .. జోగారావు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అని పెడితే ఎవ్వడూ రాడు ..

అందుకే ..

'ఆఁ ..అందుకే ?'

'సెయింట్ జోగా ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్,

బై ఎన్నారైస్
,

ఫర్ ఎన్నారైస్ ,

ఆఫ్ ఎన్నారైస్

అని పెట్టేమంటే గచ్చిబౌలి నుంచి అమీర్ పేట దాకా ఉన్న వెర్రాళ్లందరూ ఎగబడి మరీ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసేస్తారు '. 😄😄😄

*ధర్మాచరణ* 

 *మానవుడు సాధించవలసిన ధర్మ,అర్థ,కామ,మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలలో మొదటిది ధర్మం.అయితే ఏది ధర్మమో,ఏది అధర్మమో తెలుసుకోవడమే మానవుని విజ్ఞత.ఒక కోణంలో ధర్మంగా గోచరించినది మరో కోణంలో అధర్మంగా అనిపిస్తుంది.పాము కప్పను మ్రింగడమనేది సర్వసాధారణమైన విషయం.పాము దృష్టిలో కప్పను మ్రింగడం దాని ధర్మం.కప్పు దృష్టిలో చూస్తే పాము చేసేది అధర్మం.ఈ ధర్మాధర్మ విచక్షణ కావ్యాలూ,ఇతిహాసాలూ,పురాణాలూ* *తెలియజేస్తాయి.కావ్యాలను కథలుగా,ఇతిహాసాలను ఇతివృత్తాలుగా,పురాణాలను గాథలుగా మాత్రమే పఠించకుండా వాటిలోని ధర్మసూక్ష్మాల్ని మనం గ్రహించాలి.అప్పుడే మనం మన ధర్మాన్ని సరిగా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది తెలుస్తుంది.* 

 *"అహింసా సత్య మస్తేయ బ్రహ్మచర్య మసంగ్రహ " అహింస,సత్యము,అస్తేయము అంటే* *దొంగిలించకుండుట,బ్రహ్మచర్యము,అసంగ్రహము అంటే దేనినీ కూడబెట్టకుండుట మనం పాటించవలసిన ధర్మాలు. ఈ ఐదింటినీ యమము అంటారు.* 

 *"అహింసా పరమో ధర్మః " అహింస గొప్ప ధర్మం.అహింస అంటే హింస చేయకుండా ఉండడం.హింస శారీరకమైనదే కానక్కర్లేదు.మానసికమైనదైనా కావచ్చు.ఇతరుల మనసుకు బాధ కలిగేలా,వారి మనసును నొప్పించేలా మాట్లాడడం కూడా హింసే.అది వాచిక హింస.అహింసా ధర్మాన్ని పాటించాలంటే ఇంద్రియ నిగ్రహం* *అలవర్చుకోవాలి.జ్ఞానేంద్రియాల్నీ,కర్మేంద్రియాల్నీ,మనసునూ,బుద్దినీ మన అధీనంలో ఉంచుకోవాలి.అది చెప్పినంత తేలికైన పని కాదు.అలా అని అసాధ్యమైనదీ కాదు. అభ్యాసం చేయడంవలన సాధించవచ్చు.ఇంద్రియాల్ని సద్వినియోగపరచుకుని సన్మార్గంలో నడవడమే మానవుడు ఆచరించవలసిన ధర్మం.గాంధీ మహాత్ముడు చెప్పిన చెడు చూడకు,చెడు వినకు,చెడు మాట్లాడకు అనే మూడు సూక్తులూ అందరికీ ఆచరణీయమైన ధర్మాలు.* 

 *సత్యమనేది అందరికీ తెలిసినదే.ఎప్పుడూ నిజమే పలకడం.అలా మాట్లాడేవారిని సత్యవ్రతులు అంటారు.సత్యవాక్పరిపాలనలో మనం హరిశ్చంద్రుని ఆదర్శంగా తీసుకోవాలి.* 

 *అస్తేయం - దొంగిలించకుండా ఉండడం.మనది కాని దానిని దేనిని తీసుకున్నా అది దొంగతనం క్రిందే వస్తుంది.* 

 *బ్రహ్మచర్యం - బ్రహ్మచర్యం శారీరకంగానే కాదు మానసికంగా కూడా పాటించాలి.బ్రహ్మచర్యానికి ఆదర్శం ఆంజనేయుడు,భీష్ముడు.* 

 *అసంగ్రహం - ఏమీ కూడబెట్టకపోవడం. సంగ్రహించాలన్న కోరిక పుడితే వాటిపై ఆశ పుడుతుంది.అది నెరవేరకపోతే క్రోధం జనిస్తుంది.నెరవేరితే లోభం కలుగుతుంది.వాటిపై మోహం కలుగుతుంది.అతిగా సంగ్రహించడం వలన మదం ఎక్కుతుంది.ఇతరులపై మత్సరం పుడుతుంది.ఇన్ని అనర్థాలూ సంగ్రహం వలన కలుగుతాయి.అంచేత అసంగ్రహం ఉత్తమమైన ధర్మం.* 

 *ఇక సేవాధర్మాల్లోకి వస్తే రోగపీడితులకు నిస్వార్థంగా సేవ చేయడం వైద్య ధర్మం.వయోవృద్ధులైన తల్లిదండ్రులకు సేవచేయడం పుత్ర ధర్మం.అతిథి అభ్యాగతులను ఆదరించడం గృహస్థ ధర్మం.దీనజనులకూ,అనాధలకూ సేవచేయడం సంఘసేవా ధర్మం.గురువులను గౌరవించడం శిష్యధర్మం.సద్భుద్దికై సర్వేశ్వరుణ్ణి పూజించడం,మాధవునిపై మనసు లగ్నం చేయడం భక్తుని ధర్మం.* *ధర్మాధర్మాలనూ,న్యాయాన్యాయాలనూ,ఆధ్యాత్మికతనూ బోధించడం గురు ధర్మం. అన్యాయాన్ని శిక్షించడం న్యాయధర్మం.సంతానానికి సత్ప్రవర్తన నేర్పడం,సఛ్చీలాన్ని బోధించడం, సన్మార్గాన్ని చూపించడం పితృధర్మం.ఇలా ఎవరి ధర్మాల్ని వారు నిర్వర్తిస్తే కృతయుగంలోనూ ధర్మదేవత నాలుగు పాదాలతో నడుస్తుంది.*

[

*జీవితంలో లేటుగా నేర్చుకునే పాఠాలు ఇవే*..!

చ‌దువు పాఠం చెప్పి ప‌రీక్ష‌లు పెడుతుంది. అదే ఏ జీవితం ప‌రీక్ష‌లు పెట్టి పాఠాలు నేర్పుతుంది... వాట్సాప్ లో వైర‌ల్ అయ్యే త‌ర‌హా సందేశం ఇది. ఇలాంటి కొటేష‌న్ల‌ను కామెడీగా తీసుకున్నా... ఇది మాత్రం చాలా డెప్త్ ఉన్న కొటేష‌నే. ఇవే కాదు.. మ‌హామ‌హుల చేత చెప్ప‌బ‌డిన ర‌క‌ర‌కాల కొటేష‌న్లు కూడా జీవితంలో అంతా అయిపోయాకా వారు ప్ర‌వ‌చించిన‌వే! 

జ‌ర‌గాల్సిందంతా జ‌రిగిపోయిన త‌ర్వాతే.. ఆ అనుభ‌వం నుంచి వారు కొటేష‌న్లు, సూక్తులు చెప్పి ఉంటార‌నుకోవాలి! ఇలాంటి అనుభ‌వాలు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటాయి. క‌దిలిస్తే.. ప్ర‌తి ఒక్క‌రూ ర‌క‌ర‌కాల కొటేష‌న్లు చెప్ప‌గ‌ల‌రు. తాము చేసిన త‌ప్పులేమిటో వారికి ఎరుక అయి ఉంటాయి కాబ‌ట్టి.. ప‌క్క  వారికి త‌మ అనుభ‌వాల సారం నుంచి బోధించ‌గ‌ల‌రు. 

మ‌నిషి త‌న జీవితంలో చాలా లేటుగా నేర్చుకునే పాఠాల‌ను ఒక‌సారి ప్ర‌స్తావించుకోవ‌చ్చు. ఫ‌లితంగా.. ఈ త‌ప్పుల‌ను ఇంకా చేసేయ‌ని వారికి, అవ‌కాశాలు ఇంకా మిగిలి ఉన్న వారికి ఇవి ప‌నికి వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు.

*అప్పుడే క‌ష్ట‌ప‌డాల్సింది!*

ఈ మాట చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు వేరే ర‌కంగా చెబుతూ ఉంటారు. క‌ష్ట‌ప‌డాల్సిన స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డితే ఆ త‌ర్వాత జీవితాంతం క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చాలా మంది విజ్ఞ‌త ఉన్న త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు చెబుతూ ఉంటారు. 

క‌ష్ట‌ప‌డ‌టం అంటే.. ఇక్క‌డ ప్ర‌ధానంగా చ‌దువుకోవ‌డం. చ‌దువుకునే వ‌య‌సులో క‌ష్ట‌ప‌డో, ఇష్ట‌ప‌డో చ‌దువుకుంటే.. ఆ త‌ర్వాత జీవితంలో స్థిర‌ప‌డ‌టానికి అవ‌కాశాలు క‌చ్చితంగా మెరుగ్గా ఉంటాయ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేవ‌లం చ‌దువు అనే కాదు.. ఏ విష‌యంలో అయినా స‌రైన స‌మ‌యంలో సరిగా వ్య‌వ‌హ‌రిస్తే, ఆ త‌ర్వాత తాపీగా ఉండ‌టానికి అవ‌కాశం ఉంటుంది. 

నేటి ప‌నిని నిన్న‌నే పూర్తి చేయ‌డం, రేప‌టి ప‌నిని నేడే పూర్తి చేసుకుని ఉండ‌టం... ఒక‌ర‌క‌మైన ఆత్మ‌విశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. కెరీర్ విష‌యంలో పూర్తి సంతృప్తితో లేని చాలా మందిని క‌దిలిస్తే వారు చెప్పేమాట‌.. చ‌దువుకోవాల్సిన స‌మ‌యంలో తాము స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే చెబ‌తారు కూడా!

*భ‌యాన్ని వ‌ద‌లాల్సింది!*

కెరీర్ లోనో, వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్ట‌డంలోనో.. దేని విష‌యంలో అయినా భ‌య‌ప‌డ‌టం మొద‌లుపెడితే, ఆ భ‌యం శ‌క్తినంతా హ‌రించి వేస్తుంది. ఫ్ర‌స్ట్రేష‌న్ ను పెంచుతుంది. స్థూలంగా ఆ ప‌నిమీదే విముఖ‌త‌ను పెంచుతుంది. మ‌రి ఇదంతా జ‌ర‌గ‌కూడ‌దంటే.. భ‌యాన్ని వ‌ద‌లాల్సింద‌ని చాలా మంది అనుకుంటారు. 

తాము మొద‌ట‌ల్లోనే ఆ దిశ‌గా కృషి చేసి ఉంటే.. ఆ వృత్తిలో తాము మ‌స్టార్ అయి ఉండేవాళ్ల‌మ‌ని తీరిగ్గా చింతిస్తూ ఉంటారు.

*ప్రాక్టీస్ చేయాల్సింది!*

ప్రాక్టీస్ మేక్స్ యూ ప‌ర్ఫెక్ట్ అని మ‌రోసూక్తి త‌ర‌చూ వింటూ ఉంటాం. అయితే పాటించ‌డంలో మాత్రం అల‌స‌త్వాన్ని వ‌హిస్తూ ఉండ‌వ‌చ్చు. ఏ విష‌యంలో అయినా ప‌ర్ఫెక్ష‌న్ రావాలంటే ప్రాక్టీస్ త‌ప్ప మ‌రో మార్గం ఉండ‌దు. థియ‌రీలు తెలిసినా.. ప్రాక్టీస్ లేక‌పోవ‌డంతో ఫెయిలయ్యే వాళ్లూ ఉంటారు. వారు అయ్యే రియ‌లైజేష‌ణ్.. ప్రాక్టీస్ చేయాల్సింద‌నేది!

*కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు రావాల్సింది!*

జీవితంలో ఒక ద‌శ‌కు వెళ్లాకా కెరీర్ ఒక కంఫ‌ర్ట్ జోన్ ను క‌ల్పించ‌వ‌చ్చు. అయితే.. ఆ జోన్ లో మ‌రీ రిలాక్స్అయితే మాత్రం ఆ త‌ర్వాత కెరీర్ ఎదుగుద‌ల ఆగిపోవ‌చ్చు. అనుభ‌వాలే పెద్ద పాఠాలు. అనుభ‌వ‌మే అత్యంత గొప్ప‌ది. ఆ అనుభ‌వం కావాలంటే మాత్రం కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం త‌ప్ప మ‌రో ఛాయిస్ ఉండ‌దు!

[

సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం 

మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము. 

ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.

1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు. 

ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.

2. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు.

౩. ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది.

ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను.

4. ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది. 

పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది.

[

హిమాలయాల్లో కైలాస పర్వతం, ఆ హిమగిరి చెంతన మానససరోవరం, ఆ సరోవరంలో స్నానాదికాలు చేస్తున్న ఓ సాధువు. ఆ ముముక్షువు గడ్డకట్టే నీరు ఒంటికి తాకుతున్నా, ఎముకలు కొరికే చలిగాలులు శరీరాన్ని రాసుకుంటూ వెళ్తున్నా.. ఇవేవీ తనకు ఇబ్బంది కలిగించడం లేదన్నట్టుగా తన పనిలో తానున్నాడు. స్నానం పూర్తి చేసుకుని, ఆ పక్కనే మంచు పరుచుకున్న నేలపై కూర్చుని ధ్యానానికి ఉద్యుక్తుడయ్యాడు!

అదొక ప్రభుత్వ దవాఖాన. అనుభవజ్ఞుడైన వైద్యుడు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను సునాయాసంగా చేస్తున్నాడు. రోగి శరీరాన్ని కోసి, శస్త్ర చికిత్స నిర్వహించి చకచకా కుట్లు వేశాడు. ఆ రోగి బాధను, భయాన్ని గమనిస్తున్నా, అవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. వైద్యం ఫలితాన్ని కూడా ఆశించడం లేదు. కేవలం తన కర్తవ్యదీక్షలో నిమగ్నమయ్యాడు. ఈ రెండు ఉదాహరణల్లోని వ్యక్తులు పరిసరాలతో గానీ, తమ కర్తవ్యఫలాల గురించి గానీ బంధనాలు వేసుకోలేదు. కేవలం తమ కర్తవ్యంతో మాత్రమే వారికి సంబంధం.అతి శీతల జలాలు సాధువు శరీరాన్ని తాకినా ఆయన మనసును కదిలించలేక పోయాయి. వైద్యుని కత్తి రక్తాన్ని చిందిస్తున్నా అది ఆయన మనసును చలింప జేయలేక పోయింది. రెండు సందర్భాల్లోని వ్యక్తులు తమ కర్తవ్యాన్ని తప్ప ఫలితాలను త్యజించినవారే. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన బోధ కూడా ఇదే. ‘కర్మలు ఆచరించడమే నీ పని, ఫలితం గురించి ఆలోచించొద్దు’ అని ఉద్బోధ చేశాడు.

సాధారణంగా రాబోయే కష్టసుఖాలు మన అనుభవంలోకి రాకముందే మనం వాటిని అనుభవించడం మొదలు పెడతాం. ఉదాహరణకు ఒక బాలుడు తన తండ్రి ఆదేశానుసారం ఒక నెల తర్వాత గురుకులానికి వెళ్లాల్సి ఉంటే, ఆ బాలుడు ఆ నెలరోజులూ ఒక భయంలో కూరుకుపోతాడు. గురుకులానికి వెళ్లే రోజు ఆసన్నమయ్యేకొద్దీ ఆందోళన చెందుతూ ఉంటాడు. ఆ బాలుడు ఇంకా గురుకులానికి వెళ్లనే లేదు. కానీ, గురుకులంలో లేని కష్టాలను, ఇబ్బందులను, కోల్పోయే స్వేచ్ఛను ఊహించుకొని బాధపడుతుంటాడు. ఇంటికి దూరమవు తానన్న ఆవేదన ఆ బాధను రెట్టింపు చేస్తుంటుంది.

ఒక ఉద్యోగి నెల రోజుల తర్వాత పదోన్నతి పొందే అవకాశం ఉందని తెలియగానే, ఆ రోజే వచ్చేసిన ట్టుగా సంబరపడిపోతుంటాడు. కొందరైతే మరింత ఉత్సుకతతో ప్రవర్తిస్తుంటా రు. మాటల్లోనూ, చేతల్లోనూ మార్పు కొనితెచ్చుకుంటారు. అయితే, రాబోయేవి నిజమో, కాదో తెలియకుండానే వాటితో మన మనసు లంకె వేసుకుని ఉంటుంది. అది సమర్థనీయం కాదు. ‘ఈ మానసిక లంకెలు వద్దు’ అని హెచ్చరించాడు గీతాచార్యుడు. ‘ప్రతిదీ అశాశ్వతం అన్నది సత్యం. ఆ అశాశ్వతాలతో లంకెలు వేసుకుని, దుఃఖపడటమో లేక సంతోషపడటమో చేయక, స్థితప్రజ్ఞులమై, విరాగబద్ధులమై, మోక్షాన్ని అనుభవించాల’ని గీతా ప్రబోధం.

పరిశీలించదగిన విశ్వంలో దాదాపుగా వేల కోట్ల నక్షత్ర మండలాలున్నాయని అంచనా. ఒక్కో మండలంలో రమారమి వందల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ లెక్కలేనంత ఉష్ణాన్ని విశ్వంలోకి వెలువరిస్తూ ఉన్నాయి. ఈ నక్షత్ర మండలాల నడుమ అత్యంత శీతల ప్రాంతాలూ ఉన్నాయి. ఈ ఉష్ణ శీతలాలను రెండింటినీ అనుభవిస్తున్నా ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంది. దానికి ఏ బాధా లేదు, ఏ సంతోషమూ లేదు. నిజానికి ఆ భావనలేవీ దానికి కలగడం లేదు. అదే ఆత్మ మనలోనూ అణువణువూ వ్యాప్తి చెంది ఉంది.

ఆ ఆత్మకు మన మనసు అనుభవించే సుఖదుఃఖాలతో సంబంధం లేదు. భూత, వర్తమాన, భవిష్యత్తులతో పనిలేదు. ‘నిశ్చలమైన, నిర్మలమైన, నిత్యమైన ఆత్మతో మన మనసు లంకె వేసుకోవాలి’ అని సూచించాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘అడవికి పో!’ అని ఆదేశించగానే పద్నాలుగు సంవత్సరాల గురించి గానీ, అడవి గురించి గానీ చింతించక నార చీరలు ధరించి అడవికి పయనమైన రాముని మనసులా, మన మనసు నిరంజనమై వెలుగొందడమే మోక్షం. అది సాధించడానికి నిరంతరం ప్రయత్నించడమే మానవుడి కర్తవ్యం.

[

కోరికల్ని నియంత్రించడం ఎలా..???

 🌱మనిషిలోని మనసు చాలా చంచలమైంది. దాని యాంత్రికతకు అంతం లేదు. మనిషి బాల్యం నుంచి ఏవేవో వాంఛలకు అలవాటుపడతాడు. ఒకదాని తరవాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది.

 🌱జీవితాంతం అలా మనసు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. నిజానికి మనిషి తనలోని మనసును గురించి అవగాహన కల్పించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం. ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్లు వినడం మానేస్తే సరి. మనసు నిండా కోరికలు, ఆలోచనలను నింపకూడదు.

 🌱మనసును స్థిమితపరచడం ఎలా? కోరికల్ని నియంత్రించడం ఎలా? ఇందుకోసం మనిషి సాధన చేయాలి. మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి. అందులోని చెడును తెలుసుకోవాలి. మానవత్వాన్ని, దైవత్వాన్ని అవగాహన చేసుకోవడంవల్ల కోరికల ఉద్ధృతి తగ్గుతుంది.

 🌱సరిగ్గా అప్పుడు మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోవాలి. మనలో ఏం జరుగుతుందో గమనించడం అవసరం. మనసులోకి ప్రవేశిస్తున్న ప్రతి వాంఛను, ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండి, అలాంటి గమనిక కొనసాగినప్పుడు మనసు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది. ఆ తరవాత మన మనసులోకి మనం fప్రవేశించగలం.

 🌱సాధారణంగా మనసు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికో ప్రయోజనం కల్పించి, మరొకదానితో పోల్చడం చేస్తుంది. అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా, నిర్వ్యామోహంగా మనసు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి. నిశ్చలమైన స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనకు కోరికలు ఉండవు. ప్రయోజన ఆపేక్షా ఉండదు. ఆశలు, భయాలు కలగవు. ఈ స్థితిని నిలుపుకోవడం ఎలా?

 🌱వస్తున్న ఆలోచనలను గమనించాలి. వాటిని గమనిస్తే చాలు- మనసు పరిధిలోకి వ్యక్తిగతమైన శక్తి అపరిమితమవుతుంది. అప్పుడు మనసును వ్యక్తిగత పరిధినుంచి తప్పించడమే మనం చేయాల్సిన పని. నెమ్మదిగా ముందుకు సాగాలి.

🌱ఈ ఆలోచన లేని ఏకాగ్రతను ధ్యానం అనవచ్చు. నెమ్మదిగా నిశితంగా మనలోని మనసును గమనించడంవల్ల ఏ ఘర్షణ లేకుండానే మనోభూమిక నుంచి వెలుపలికి రావచ్చు. మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలనా పెరిగే కొద్దీ- ఆలోచనలు, కోరికలు సమసిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం- మనల్ని మనం తెలుసుకోవడం! ఇవి తెలివితేటలతో సాధించేవి కాదు. మన స్వప్రేరణతో అనుభవించవలసిందే. మనసు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? సాధ్యమే, కాని సాధన చాలా కష్టం.

 🌱ఎందుకంటే నిరాపేక్షతో మనసును గమనించడం మనకు అలవాటు లేని పని. మన నరాల నిర్మాణం అందుకు సహకరించదు. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడి లేవు. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం. ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదు. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది.మనశ్శాంతిని, ప్రశాంతిని, ఆనందాన్ని ప్రసాదించే శుద్ధ చైతన్యాన్ని అన్వేషించాలి. సంపూర్ణ అవగాహనతో మన సమస్త శక్తులను వెచ్చించి కృషి చేయాలి.

 🌱సరే! మరి ఈ యాంత్రిక మానసిక క్రియలను ఎలా వదిలించుకోవాలన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదు. మౌలికంగా ప్రస్తుత స్థితినుంచే సాధన ప్రారంభించాలి. మనసు చర్యలను నెమ్మది నెమ్మదిగా గమనిస్తూ ఉండాలి. ఉత్తినే గమనించండి చాలు. ఆలోచనా ప్రవాహం నెమ్మదిస్తుంది. ఉద్ధృతి తగ్గుతుంది. రానురాను మనసు మనల్ని వశపరచుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉంటుంది.

 🌱విచక్షణ, ఆలోచన, వాంఛ లేనప్పుడు ఆలోచనలు నిలిచిపోతాయి. ఎంత అధికశక్తిని ఏకాగ్రతపై వెచ్చించగలమో, అంతగా భౌతికమైన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు ఆలోచించకుండానే బాహ్యాన్ని మరిచి పరాన్ని గమనించగలుగుతాం. ఆ పైన మనసు చైతన్యమై ప్రస్ఫుటమవుతుంది. మనసనేది కోరికల కర్మాగారం. ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే. మన గురించి మనం అర్థం చేసుకొన్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది.

 🌱అప్పుడే మనసు చేసే పెత్తనం నుంచి మనం చైతన్యం, స్వేచ్ఛ పొందగలుగుతాం. ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. మనసును హృదయంతో జతచేయాలి. అప్పుడు మన ప్రతిభ బయటకొస్తుంది.

ఎల్లెడెలా ఆధ్యాత్మికానందం మన సొంతమవుతుంది.

🪴

No comments:

Post a Comment