ప్రాంజలి ప్రభ ..07-04-౨౦౨3
రచయిత, సేకరణ ఎందరో మహానుభావ్వులు రచించినవి "కేవలం తెలుగు బ్రతికించాలని చిన్న ప్రయత్నం ,
మీ విధేయురాలు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, విశ్రాంతి ఉపాధ్యాయురాలు
*మల్లాప్రగడ రామకృష్ణ
సమస్య:purana
పొలతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో
చం.
చిలుకల పల్కు లే బలుకు చింతయు మాపుట పాత్రధారి, యా
తలపులు తెల్పుటే కధల తంతయు కాలము సాధనమ్ముగాఁ
విలువలు నిల్పు టే విషయ వింతలు నాటక మాడుబుద్ధిగా
పొలతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో
🍀. నేటి సూక్తి : సాక్షాత్కారానుభవం - జాగ్రదవస్థకు అతీతమైన సమాధి స్థితిలో సాక్షాత్కారం కలిగిన మాత్రాన చాలదు. జాగ్రదావస్థలో సైతం సాక్షాత్కారానుభవం కలిగి సుస్థిరం కావాలి. ఇందుకొరకై అంతకంతకు సువిశాల మగుచుండెడి ప్రశాంత చైతన్యమున కృషి సాగించడంలోనే సాధనతో పాటు సిద్ధి కూడా కలిసివస్తుంది. 🍀
***
01. పరోపకారం
అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు.
"ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి" అని చెప్పుకునేవాళ్ళు జనం.
ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ...
ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. "స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు.
నన్ను నీతో తీసుకొని పోరాదా?" అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ.
శివుడు నవ్వి, "దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది" అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు.
"ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి" అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు.
మొదట 'ఇదేదో అద్భుతమైన కల' అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఓ మట్టిపాత్ర కనిపించింది శంకరశాస్త్రికి.
ఆయన చాలా భక్తిగా ఆ మట్టిపాత్రను తాకి చూసాడు: అది రంగు మారలేదు! అయితే స్వతహాగా మంచివాడైన శంకరశాస్త్రి అందుకు బాధపడలేదు.
"నేను ఇంకా పుణ్యం సాధించాలి అని తెలియజేసేందుకుగాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది! ఇప్పుడిక దీన్ని కొలమానంగా వాడి, ఆలయానికి వచ్చేవాళ్ళలో అసలైన పుణ్యాత్ములెవరో గుర్తిస్తాను. వాళ్ళ అడుగుజాడల్లో నడచి, నేనూ పవిత్రుడినౌతాను" అనుకున్నాడు.
ఆ రోజునుండీ గుడికి వచ్చే భక్తులందరిచేతా ఆ మట్టి పాత్రను తాకించేవాడు ఆయన.
చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెన్నిక గన్న భక్తులు ఎందరో వచ్చి మట్టిపాత్రను తాకారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండింది తప్ప, రంగు ఏ కొంచెం కూడా తిరగలేదు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి, మహా శివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో, ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు- మాసిన గడ్డంతో, మురికి పట్టిన వస్త్రాలతో- దైవదర్శనం కోరి వచ్చాడు.
చలి బాగా ఉన్న ఆ సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటూన్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవటం మొదలెట్టాడు.
భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉడ్న్నారు- అతన్ని ఎవరూ గమనించలేదు; గమనించినా పట్టించుకోలేదు.
పూజారి శంకరశాస్త్రి కూడా ముసలాయన్ని చూసి; జాలి పడ్డాడు- కానీ "ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను?" అనుకొని ఊరుకున్నాడు. అయితే వచ్చిన ఆ బాటసారి మటుకు ముసలాయన దగ్గర ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబళిని తీసి అతనికి కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు. బయటికి వెళ్ళి, వేడి వేడి టీ తెచ్చి అతని చేత త్రాగించాడు. భగవంతుడికి అర్పించేందుకుగాను తను తెచ్చిన పండును కూడా ముసలాయనకు ఇచ్చివేసాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడిలోకి వచ్చాడు.
గమనించిన శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. "ఈ ముసలతన్ని నేను రోజూ చూస్తుంటాను; పలకరిస్తుంటాను- అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు. ఈ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు- తను కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేసాడు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటంలేదా? నేను నా ధర్మాన్ని విస్మరించాను. ఇక ఎప్పుడూ అలా చేయను. ఇతరుల కష్టాల్ని తీర్చేందుకు నావంతుగా కృషి చేస్తాను!" అనుకుంటూ సిగ్గుపడ్డాడు.
ఇన్నాళ్ళుగా లేనిది, ఆ రోజున ఆయన చేయి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోకి మారినట్లు తోచింది- బాటసారి చేయి సోకే సరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది! ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసే సరికి ఎదురుగా బాటసారి లేడు! 'సాక్షాత్తూ శివుడే ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు' అనిపించింది, ఆశ్చర్యంతో నోరు తెరిచిన శంకరశాస్త్రికి. అటుపైన "ఏలాంటి ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం- అదే పుణ్యం అంటే!" అని ఆచరణలో చూపిస్తూ చరితార్థుడైనాడాయన...
****
2.కృతజ్ఞత
కురుక్షేత్ర యుద్ధం ముగిశాక శరతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు, ధర్మరాజు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అతణ్ణి శాంతపరుస్తాడు. ఆ సందర్భంలోనే ధర్మరాజు అడుగుతాడు. ఆశ్రయం ఇచ్చినవాని యెడల, ఆశ్రయం పొందినవాడు ఎలా నడచుకోవాలి అని! సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్తాడు. అది మహాభారతం అనుశాసనిక పర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
పూర్వం కాశీ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకనాడు అడవికి వేటకు వెళ్ళి, విషం పులిమిన బాణాన్ని లేడి మీదకు సంధించి వదిలాడు. అది గురి తప్పి, పూవులు కాయలతో పెరిగిన పెద్ద చెట్టును తాకింది. విషపు బాణం దెబ్బకు ఆ చెట్టు ఎండి మోడైపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక ఎప్పటి నుండో నివాసం ఉంటోంది. అది ఆ చెట్టును విడిచిపెట్టి పోకుండా, ఆ చెట్టు తొర్రలోనే కృతజ్ఞతతో ఉండి పోయింది.
చిలుక ఉ
దాత్త వైఖరిని ఇంద్రుడు తెలుసుకొన్నాడు. మనిషిగా రూపం మార్చుకొని, "ఈ అడవిలో గొప్ప గొప్ప వృక్షాలు, పూలు, ఫలాలతో అనేకం ఉన్నాయి. వాటిని ఆశ్రయించక, మోడువారిన ఈ చెట్టునే ఆశ్రయించుకొని ఎందుకు ఉన్నావు?" అని అడిగాడు. అందుకా చిలుక "పండ్లు కాస్తున్నప్పుడు చెట్టును ఆశ్రయించుకొని ఉండి, ఎండిపోయి నప్పుడు వదిలిపోవటం కృతఘ్నత అనిపించుకోదా ఇంద్రా?' అన్నది. పూర్వ జన్మలో ఈ చిలుక చేసుకొన్న పుణ్యంవల్ల గదా, మారు వేషంలో ఉన్న తనను గుర్తించగలిగింది అని ఇంద్రుడు. ఆశ్చర్యపడ్డాడు. చిలుకతో ఏదైనా వరం కోరుకో అంటాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన వృక్షానికి పూర్వపు శోభను తిరిగి కలిగించమని వేడుకొంది. సరే అని ఇంద్రుడు చెట్టు వేళ్ళను . అమృతంతో తడిపి పూలు, పండ్లతో పూర్వం కంటే ఎక్కువ శోభను కలిగించాడు. తను చేసిన మంచి పనికి, ఆ చిలుక కూడా చనిపోయాక స్వర్గం చేరుకొంది.
చిలుకకు చెట్టు మీద ఉండే భక్తి, దయ, కృతజ్ఞతాభావం మెచ్చుకోదగ్గవి. పూర్వం ఆ చెట్టు బాగున్నప్పుడు దానిని ఆశ్రయించుకొని జీవించిన సంగతి చిలుక మర్చిపోలేదు. చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మరచిపోయి ప్రవర్తిస్తుంటారు. ఈ కథలో చిలుక చేసిన పని అలాంటి వారికి కనువిప్పు కలిగించేదిగా ఉంది.
- సేకరణ ప్రాంజలి ప్రభ
****
🌹. కపిల గీత - 159 / Kapila Gita - 159 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 13 🌴
13. ప్రసన్నవదనాంభోజం పద్మగర్భారుణేక్షణమ్|
నీలోత్పలదళశ్యామం శంఖచక్రగదాధరమ్॥
తాత్పర్యము : ఆ శ్రీమన్నారాయణుని యొక్క వదనారవిందము ప్రసన్నమై యుండును. నేత్రములు పద్మకోశముల వలె అరుణవర్ణ శోభితములు. మేను నల్లగలువల రేకుల వలె శ్యామవర్ణముతో విలసిల్లు చుండును. ఆ స్వామి నాల్గు భుజముల యందును శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించి యుండును.
వ్యాఖ్య : పద్మ పత్రముల వంటి, ఎర్రాగా ఉన్న, నీలమేఘశ్యాముడు, పీతాంబరధారుడూ, అయిన పరమాత్మని ధ్యానం చేయాలి. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం వలన ప్రకృతి మనని బంధించదు. అలాంటి పరమాత్మని చేరడానికి జ్ఞ్యాన కర్మాదులతో కూడి ఉన్న భక్తి యోగం సహకరిస్తుంది. దానికి అన్ని ఇంద్రియాలనూ మనసులో, మనసును హృదయములో చేర్చాలి. మనసు ప్రాణాయామముతో మనం చెప్పినట్లు వింటుంది. పరమాత్మ భూషణాలూ, ఆయుధాలు ఉన్న పరమాత్మని ధ్యానించాలి. హృదయ దహరాకాశములో స్వామి ఉంటాడు. ఎలాంటి స్వామిని ధ్యానించాలి. పడుకుని ఉన్నా, కూర్చుని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. సంపూర్ణ ధ్యానం చేయాలి. కేశముల నుండీ పాదముల వరకూ, పాదముల నుండీ కేశముల వరకూ ధ్యానించవచ్చు. ఒకే సారి పరమాత్మను మొత్తం ధ్యానములో నిల్పుకోలేని నాడు, ఒక్కొక్క అవయవాన్నే ముందు పెట్టుకుంటూ దాని మీదే ధ్యానం చేయాలి. ఇతర ఏ విషయములవైపూ మనసు వెళ్ళకుండా, పరమాత్మ యొక్క ఆ అవయవం మీదే ధ్యానం కుదిరే వరకూ చేయాలి. ఇలాంటి ఏకాగ్రత కలిగిన తరువాత సాంసారికమైన విషయాలు బాధించవు. ఇది సులభ ఉపాయం.
సశేషం..
****
🌻751. త్రిలోకధృక్, त्रिलोकधृक्, Trilokadhrk🌻
ఓం త్రిలోకధృషే నమః | ॐ त्रिलोकधृषे नमः | OM Trilokadhrṣe namaḥ
త్రిలోకధృగితి ప్రోక్తః లోకాంస్త్రీన్ యోహ్యధారయత్
మూడు లోకములను ధరించువాడు కనుక లోకధృక్ అని నుతింపబడును.
:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
సీ.పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రభోధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి
కారాయ కర్మవిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయ
సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురంతాయ కర్మతే.సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభస్తేఽన్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమోఽస్తు (702)
లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉన్నది. అహంకారానికి అధిష్ఠాతవయిన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రలకు, ఇంద్రియములకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాతవయిన వాసుదేవుడవు నీవు. నీవు విశ్వమెల్లా నిండియుండెడివాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములనుండి దాటించువాడవు. వేదసంరక్షకుడవు. ప్రాణ రూపమున మూడు లోకాలలో విస్తరించియుండువాడవు నీవు. నీవు మూడు లోకములకును పాలకుడవు. నీవు సోమరూపుడవు. తేజో బలములుగలవాడవు. స్వయముగా ప్రకాశించెడివాడవు. నీవు అంతములేనివాడవు. కర్మములకును సాధనమైనవాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞఫల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. ఆకాశము నీవే. నీవు ముఖాగ్నిచేత లోకలను దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారము.
సశేషం...
****
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 06 🌴
🌻. శివస్తుతి - 3 🌻
ఓ జగద్గురూ! చూడబడే, వినబడే, తెలియబడే సర్వము నీవే. నీవు అణువు కంటె సూక్ష్మతరుడవు. మిక్కిలి పెద్ద దానికంటె పెద్దవాడవు అని ఋషులు చెప్పుచున్నారు (18). సర్వత్రా నీ చేతులు, కాళ్లు, కళ్లు, శిరస్సులు, ముఖములు, చెవులు, ముక్కులు గలవు. సర్వాత్మకుడవగు నీకు నమస్కారము (19). ఓ సర్వవ్యాపీ! సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, మాయావరణము లేనివాడు, జగద్రూపుడు, ముక్కంటి అగు నిన్ను అన్ని దిక్కుల యందు నమస్కరించు చున్నాను (20). సర్వేశ్వరుడు, జగదధ్యక్షుడు, సత్యస్వరూపుడు, మంగళ స్వరూపుడు, సర్వోత్కృష్టుడు, కోటి సూర్యుల కాంతి గలవాడు అగు నీకు సర్వదిక్కుల యందు నమస్కరించు చున్నాను (21).
జగత్తునకు ప్రభువు, ఆద్యంతములు లేనివాడు, ఇరువదియారు తత్త్వములను ప్రవర్తిల్ల జేయువాడు, తనకంటె పైన ప్రభువు లేనివాడు, సర్వప్రాణులను ప్రవర్తిల్ల జేయువాడు అగు నిన్ను అన్ని వైపుల నుండియూ నమస్కరించు చున్నాను (22). ప్రకృతికి చైతన్యము నిచ్చి అనుగ్రహించు వాడు, సర్వజగత్తును సృష్టించిన బ్రహ్మకు తండ్రి, సర్వదేవతాస్వరూపుడు, ఈశ్వరుడు అగు నిన్ను అన్ని విధములుగా నమస్కరించు చున్నాను (23). వేదములు, వేదవేత్తలు నిన్ను వరముల నిచ్చువాడనియు, సర్వులకు అధిష్టానమనియు, స్వయంసిద్ధుడవనియు వర్ణించుచున్నారు (24).
***
445. ‘శాంతిః'- 2
త్రిగుణముల యందు పంచభూతముల యందు వసించు వారికి శాంతి యెట్లు కలుగును?
అష్టప్రకృతులు కావల శాంతి యున్నది. దానిని పొందినవారు అష్ట ప్రకృతులలో కూడ శాంతియుతముగ వసింతురు. అష్టప్రకృతుల కావలయున్నది శ్రీమాతయే. ఆమె అనుగ్రహము పొందుటకు అనుస్మరణమే మార్గము. అనుస్మరణమే నిజమగు ఆరాధనము. అనుస్మరణమున శ్రీమాత సాన్నిధ్యమున వసించు వారికి సృష్టి యందెచ్చట నైననూ శాంతి లభింపగలదు. అట్టి శాంతి నిచ్చునది శ్రీమాత. అక్షరములలో చివరి ఎనిమిది అక్షరములను శాంతము లందురు. అవి వరుసగ య, ర, ల, వ, శ, ష, స, హ, ఈ ఎనిమిది అక్షరములు బీజాక్షరము లగుటచే శాంతి వర్ణములు. యం, రం, లం, వం, శం, షం, సం, హం. వీనిని రకరకములుగ 'ఈం' కారముతో చేర్చి ఋషులు మంత్రముల నేర్పరచిరి.
సశేషం...
No comments:
Post a Comment