Sunday, 16 April 2023

ప్రాంజలి ప్రభ...19/04


 

సేకరణ రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
*కామాక్షీ వైభవం*
0®®®®®®®®®®®0
 

➡️ ఒకప్పుడు పరమశివుడు కైలాసపర్వతం మీద కూర్చుని ఉన్న సమయంలో, అమ్మవారు లీలావినోదంగా ఆయనతో సంతోషంగా కాలం గడుపుతూ, ఆయన రెండు కళ్ళూ మూసింది. ఆయన రెండు కళ్ళు 'సూర్యచంద్రౌ చ నేత్రే' ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. అగ్నిహోత్రం మూడవ కన్ను. ఆ కారణం చేత ఆవిడ ఆయన రెండు కన్నులూ మూస్తే లోకమంతా చీకటియిపోయింది. సూర్యచంద్రుల గమనం లేకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ధర్మచక్రం ఆగిపోతుంది. ఏది లుప్తమైనా పరవాలేదు గాని ధర్మచక్రం ఆగిపోకూడదు. 
 

➡️ ఏ పని చేసినా ఆయా కాలాలలో చేయాలి తప్ప, ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చేయకుండా వేరొక పని చెయ్యకూడదు. సూర్యచంద్రులు కదలిక లేక ఆగిపోవడంతో లోకమంతా చీకట్లు కమ్మి కాలం తెలియలేదు కాబట్టి చేయవలసిన అనుష్టానాలు జరగక ధర్మానికి గ్లాని ఏర్పడింది. ఇది జరిగినది ప్రమశివునకు లిప్తకాలమైనా భూలోకంలో దాని ప్రభావం చాలా ఉంటుంది. లోకులు ఖేదపడ్డారు. ఈశ్వరునిలో ఉన్న గొప్పదనం ఏమిటంటే అమ్మవారికి పాపపుణ్యాలు ఉండవు. 
 

➡️ కానీ ఒక పని చేసినప్పుడు ఇతరులు బాధ పడేటట్లు చేస్తే అది దోషమవుతుంది. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. సూర్యచంద్రుల ప్రకాశం లేక లోకులు బాధ పడ్డారు. పార్వతీ దేవి కదా అని ఉపేక్షిస్తే లోకంలో మిగిలిన వాళ్ళు ఇతరులను బాధపెట్టి మేం మాత్రం ఎందుకు ఉపేక్షించ కూడదు అంటారు. అందుకని ఆయన భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి అంటే ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేసింది. 
 

➡️ ఆ తల్లి ఉత్తరభారతంలో హిమాలయాల మీద ఎప్పటి నుండో తనని కుమార్తెగా పొందడానికి ప్రయత్నిస్తూ తపస్సు చేసుకుంటున్న కాత్యాయన మహర్షి కుమార్తె అయి, కాత్యాయనుని కూతురు కాబట్టి కాత్యాయిని అని పేరుపొందింది. ఆ తల్లి యుక్త వయస్సు పొందిన తరువాత ఆమెకి వివాహం చేయవలసివచ్చింది. అమ్మవారు ఎంతమందికైనా కూతురవుతుంది కాని పరమేశ్వరునికే ఇల్లాలు. ఆయనని భర్తగా తేవడం ఆమెకే సాద్యం తప్ప ఇతరులకు సాధ్యం కాదు. 
 

➡️ కాత్యాయనమహర్షి కొన్ని వస్తువులిచ్చి అమా! ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు ఏ ప్రాతాంనికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయి ఈశ్వరుడు స్వీకరించి భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుంటాడు. 
 

➡️ ఆమె బయలుదేరి దక్షిణదేశం వస్తుండగా, కాంచీపురానికి వస్తున్నప్పుడు ఆమెకి ఇచ్చిన వస్తువులు మార్పు చెందాయి. ఆ పట్టణంలోనే తపస్సు చేయాలని అమ్మవారు అక్కడ తపస్సు ప్రారంభించింది. పరమశివుడు ఆమెకి తన పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో ఎంతటి మహాపతివ్రతో లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆయన తన జటాజూటంలోని గంగపాయను ఒకదానిని విడచి పెట్టాడు. విశేషమైన ప్రవాహంతో విచ్చేస్తున్నది. ఆవిడ ఇసుక లింగాన్ని చేసి ఆరాధన చేస్తున్నది. 
 

➡️ ఆమెకి తాను కొట్టుకుపోతానని బెంగ కాదు, సైకత లింగం కొట్టుకొనిపోతుందేమో అని బెంగ కలిగి దుర్గమ్మ ఆవిర్భవించేటట్లుగా ధ్యానం చేసి ఆ నీటినంతటినీ త్రాగేయమంది. ప్రళయకాల బంధిని అయిన గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టి దుర్గమ్మ తాగేసింది. శివుడు చూసి ఏం చేస్తుందో చూద్దామని అంతకన్నా అధృతమైన ప్రవాహాన్ని విడిచి పెట్టాడు. 
 

➡️ బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం వైపు వస్తుంటే, పార్వతీదేవి కంప కంప అన్నది. అంటే భయం భయం అని అర్థం. అమ్మవారే భయం పోగొట్టగలిగిన ఆదిశక్తి. ఆవిడకు భయం లేదు. సైకత లింగం వెళ్ళిపోతుందని ఆవిడకు భయం. ఆ శివలింగం పోవడానికి వీలు లేదు. లింగానికి నీళ్ళు తగిలేముందు నేనే వెళ్ళీపోవాలని, తన పతిభక్తిని చాటి చెప్పడానికి, సైకత లింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నది. అప్పుడు అమ్మవారి కుచములు, కంకణాల ముద్రలు శివలింగం మీద పడ్డాయి. 

 
➡️ పరమశివుడు చూసి అమ్మవారి పతిభక్తికి మెచ్చి, ప్రవాహాన్ని ఉపసంహారం చేసి అమ్మవారిని తాను స్వీకరించాడు.
🙏 *ఓం శ్రీమాత
--(())--
 

ప్రాంతంలోని ప్రభు ...(21)
కొత్తది ఛందస్సు
సుగంధి UIII UIII - UIII UIII - UIII UU
 
జ్ణానముయె పుస్తకము
పుస్తకము దేహముయె
దేహముయె కాలం
 
దేహముయె కాలము తొ
కాలము యె మిత్రముతొ
మిత్రుడుయె కాలం
 
మాటలుయె దాహముతొ
దాహముయె ఆకాలితొ
ఆకలియె కాలం
 
సాధన యె శోధనతొ
శోధన యె ఆశల తొ
ఆశలు యె కాలం
 
ప్రేమలుయె జీవితము
జీవిత మె ప్రొద్భవము
ప్రొద్భవమె కాలం
 
ప్రేరణయె ఆయుధము
ఆయుధమె ఆశయము
ఆశయమె కాలం
 
దీపముయె వెల్గులుగఁ
వెల్గులు యె జిల్గులుగ
జిల్గులు కాలం
 
దేహముకు గాయములు
గాయములు రోగములు
రోగములె కాలం
 
గొప్పలకు తిప్పలుగఁ
తిప్పలకు ముప్పలుగఁ
ముప్పులులె కాలం

🙏🕉️🛕🚩🌼🥥🌹🏵️🙏

 *ఏకాక్షి నారికేళం - వివరణ* 

🙏🕉️🛕🚩🌼🥥🌹🏵️🙏

      నారికేళం అనగా మన పరి భాషలో కొబ్బరి కాయ. పచ్చిగా ఉంటే కొబ్బరి బోండాం అంటారు. సామాన్యంగా కొబ్బరి కాయను కొట్టి, జుట్టు తీస్తే మూడు నల్లటి భినందువులు కనిపిస్తాయి. కానీ సముద్ర తీరాల్లో పెరిగిన కొబ్బరి చెట్టుకు, వేలల్లో కానీ లక్ష కాయాల్లో కానీ ఒక కొబ్బరి కాయ రెండు భిoదువులు కానీ ఒక భిoదువు కానీ ఉన్న కాయ లభ్యమవుతుంది. దీనికి వెల కట్టడం అసాధ్యం.

      రెండు  భినందువులున్న, ఒక కన్ను, ఒక నోరు మాత్రమే వున్నదని గ్రాహించాలి. మరీ అరుదుగా ఒక భిoదువు ఉన్న కాయ అంటే ఒకే. నేత్రం కలదని అని భావించాలి.

         అలా అలభ్యమైన నారికేళం ఎక్కడైనా లభిస్తే, దాని వెలచాలా అధికంగా ఉంటుంది. కొబ్బరికాయ ఎప్పుడూ శుభప్రదమే. కాకపొతే అది పగులు బాసినదై ఉండకూడదు. కాయ పూర్తిగా ఉండాలి. పూజ తరువాత దానిని పగల కొట్టి, ప్రసాదంగా కొబ్బరి స్వీకరించాలి. కాని, ఏకాక్షి నారికేళం ప్రసాదంగా నివేదన చేయబడేది కాదు. దానిని పూజలోనే ఉంచాలి. పగలకోట్టకూడదు.

ఇది సాధారణంగా దొరికేది కాదు కనుక ఎక్కడైనా లభిస్తే వెంటనే తీసుకోవాలి. శుభముహూర్తం కోసం చూస్తుంటే చేజారిపోవచ్చు. అలా కాకుండా శుభముహూర్తం వరకు జాగ్రత్తగా ఉంచి మీకు అప్పజెప్పే వారుంటే మీరు ముహూర్తం కోసం ఎదురుచూడవచ్చు.

 *పూజా విధానం* 

     దీపావళి పర్వదినం లేదా రవి పుష్య, గురుపుష్య యోగం వంటి శుభముహూర్తంలో ఉదయమే స్నానాదులు పూర్తీ చేసుకోవాలి. పూజాస్థలంలో ఒక బల్ల లేదా పీటను ఆసనంగా అమర్చాలి. దానిపై ఎర్రని వస్త్రం పరవాలి. నిత్యపూజ పూర్తీ చేశాక ఒక పళ్ళెంలో ఏకాక్షి  నారి కేళం ఉంచి, గంగా జలం లేదా స్వచ్ఛమైన నీటిని దానిపై చిలకరించాలి. అలా స్నానం చేయించాక శుభ్రంగా వస్త్రంతో తుడిచి, దానిని పీటపై ఆసనంగా అమర్చాలి. దానిపై ఎర్రని వస్త్రం పరవాలి.   తరవాత అది కేవలం నారికేళం కాదని, లక్ష్మీ స్వరూపమని చిత్తశుద్ధితో భావించి ధ్యానించాలి. ఆ నారికేళానికి ఎర్రచందనం, పూవులు, అక్షతలు సమర్పించాలి. తరవాత లక్ష్మీదేవి స్తోత్రం, ధ్యానం, పూజ చేస్తూ మంత్రజపం ప్రారంభించాలి. జపం ప్రారంభించదానికి ముందే ‘నేను నారికేళ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ప్రతిమను పూజలో ఆ దేవి సంతృప్తి కోసం ఇన్ని (సంఖ్య) మాలాజపాలు జపం చేస్తాను’ అని సంకల్పం చేయాలి. అనుకున్న సంఖ్య ప్రకారం మాలా జపం చేయాలి. మాలలో 108 పూసలుఉంటాయి. 10 మాలాజపాలు చేస్తే జపసంఖ్య 1080 అవుతుంది. ఈవిధంగా సంకల్పించిన సంఖ్య (కనీసం 11 మాలా జపాలు) ప్రకారం మాలాజపం తప్పక చేయాలి.

     తరవాత నారికేళాన్ని ఆ వస్త్రంతో సహా ఒక పళ్ళెంలో లేదా చిన్ని పాత్రలో జాగ్రత్తగా భద్రపరచాలి. వెండి పళ్ళెం (పాత్ర) అయితే ఉత్తమం. మొదటి దినం మంత్రజపం పూర్తయ్యాక అదే మంత్రంతో 21 ఆహుతులు ఇవ్వాలి. హోమం పూర్తి చేశాక కనీసం ఒక బ్రాహ్మణునికి భోజనం, దక్షిణ సమర్పించాలి.

         అనంతరం ఏకాక్షి నారికేళాన్ని ఒక పవిత్రమైన సురక్షిత స్థానంలో ఉంచి, ప్రతిరోజూ సింధూరం, ధూపదీపాలు, సమర్పించాలి. అప్పుడప్పుడు శక్తికొద్ది నాణెం సమర్పించాలి. ఏకాక్షి నారికేళంతో చేసె ఈ ప్రయోగం చాల లాభకరం. ఆర్ధిక ఉన్నతి, ధన సమృద్ధి దాయకం తప్పక పొందుతారు.

       🏵️ *ప్రభావం*🏵️ 

        ఏకాక్షి నారికేళాన్ని పూజించే ఇంట్లో నిరంతరం లక్ష్మీనివాసం ఉంటుంది. ధాన్యాగారం, నగదుపెట్టె, బీరువా, పూజాస్థలం…ఎక్కడ ఏకాక్షి నారికేళం ఉంచినా ప్రతి దినం పూజించాలి. అలా చేయడం వల్ల ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. వ్యాపార కేంద్రాల్లో ఉంచినా దీని ప్రభావం లాభకరంగా ఉంటుంది. పూజా సమయంలో జపించాల్సిన మంత్రం –

 *ఓం శ్రీం శ్రియై నమః!* 

          ఏకాక్షి నారికేళాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తాం. కనుక సాధన చేశాక, కింది శ్లోకంతో లక్ష్మీదేవికి ప్రియతముడైన విష్ణుమూర్తిని స్తోత్రం చేయడం వల్ల సాధన ప్రభావం ఇనుమడిస్తుంది.

 *శుక్లాంబరధరం దేవం* *శశివర్ణం చతుర్భుజమ్,*

*ప్రసన్నవదనం* *ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!* 

 *వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్,*

*పరాశరాత్మజం వందే శుక్రతాతం తపోనిధిమ్!*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే,*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః!*

*చతుర్వదనో బ్రహ్మో ద్విబాహురపరో హరిః*

*అభాలలోచనః* *శంభుర్భగవాన్ బాదరాయణః!*

🏵️🌼🛕 *శుభం* 🏵️🌼🛕


*నమస్కారములు చాలా విధములు* *అందు అతి ముఖ్యమైనవి నాలుగు*.

🙏🛕🙏🌹🙏🌼🙏🏵️🙏

 *1.సాష్టాంగ నమస్కారము:-* 

ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.

“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా,

పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”

1కాళ్ళు 2 చేతులు 3 ముక్కు 4 చెవులు 5 ఉదరము 6 కళ్ళు 7 నోరు 8 మనస్సు

 *ముఖ్యగమనిక* :- స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి.

 *2.పంచాంగ నమస్కారము :-*

పంచాంగములు 1 అరి చేతులు 2 మోకాళ్లు 3 మోచేతులు 4 పాదములు 5 శిరస్సు.

 *3.అభివాద నమస్కారము:-* 

ప్రవరతోటి చేయు నమస్కారము. అభివాద నమస్కారము నిలబడి చేయరాదు. పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి. గురువుగార్లలను, ఆచార్యదేవులను,

వేదపండితులను,నిత్యాగ్నిహోత్రులను, వయో వృద్దులను, జ్ఞానవృద్దుల ను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.

 *4.ప్రణిపాతము:-* ఆర్తితో చేయు నమస్కారము.  

             నేలమీదపడి నమస్కారము చేయడము.

“మాహృదయ క్షేత్రాలలో *భక్తి,* అనే బీజాలను నాటండి. దీనిని మనస్సు అనే నీటితో తడపండి. దానికి నాలుగు దిక్కుల *సంత్సంగం అనే కంచె* వేయండి. దానివలన *కామాది వికృతరూప,* పశువులు రాకుండా ఉంటాయి. మీరీ విధంగా వ్యవహరిస్తే .... ఆ బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో *శాంతి* *ఆనందం* అనే పంట ఫలాలు మన చేతికి వస్తుంది.”

🙏🙏🙏

 *గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలో మీకు తెలుసా?*

పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన భావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. 'ఏం వెతుకుతున్నావు మావయ్యా!' అని గణపతి అనగా, సుదర్శన చక్ రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకేక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమొ గణపతి అంటే మహాఇష్టం. గణపతి ఏమి అనలేడు. అందువల్ల 'బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా' అని నానారకాలుగా బ్రతిమాలాడు విష్ణువు. గణపతి పట్టువదల్లేదు.

ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పిచేంతగా నవ్వాడు. ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. దీని మీద జరిగిన ఆధునిక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. అందుకే ప్రపంచంలో ఈ రోజు గుంజీళ్ళను 'సూపర్ బ్రెయిన్ యోగా'గా చెప్తున్నారు.

*******

*సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?* 

      సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సగం పoక్తి బోజనాలలో, రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు వుoటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . 

        కాని సహపంక్తి లొ కూర్చుని వున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది.

         అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తి అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది. కనుకనే సహపంక్తి బోజనానికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది. 

     కొంత వయస్సు మళ్ళిన   వారు కాస్త ఆలస్యంగా భుజిస్తుంటారు. మనం తొందర తొందర గా తిని (అసలు భోజనం ఆత్రంగా తినరాదు), మనం లేచిన, వారు తినలేక సగం కడుఫు తో లేస్తారు. అర్ధాంతరంగా అలా లేవటానికి మనం కారకులు కారాదు. ఆ పాపాన్ని మనం పొందకూడదు. పెద్దలను గౌరవించి, వారు లేచిన తరువాత మనం లేవడం కూడా సభ్యత.

     సాటి మనవుడిలో మాధవుడిని దర్శించుకొని,  ఆ పరమాత్ముడికి భక్తితో గౌరవిస్తున్నామని, మన ప్రతి కార్యంలో తలంచడం మనిషి గా మన కర్తవ్యo.

         ఆహారం ముఖ్యం. వివేకం ఇంకా ముఖ్యం. వివేకం కావాలంటే,విద్య కావాలి.శాస్త్రాలు పురాణాలు, ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం సిద్ధించదు. స్వానుభవంతో కూడిన వివేకం కావాలి. వివేకవంతుడిగా మన గలగాలి. *ఇది ధర్మం.*

 *ఒక చిన్నకథ* 

ఒక వృ ద్ధుడు తన కొడుకు కోడలు నాలుగేళ్ల మనుమడు తో కలసి నివసిస్తున్నాడు. ఆ ముసలివానికి చూపు స్పష్టంగా కనపడేది కాదు. చేతులు వణకుతూ ఉండేవి. నడుస్తూంటే అడుగులు తడబడేవి. ఆ కుటుంబం సాయంకాలం భోజనం అంతాకలసి ఒకే టేబుల్ వద్ద చేసేవారు. ఆ ముసలి తాత భోజనం చేస్తుంటే చేతులు వణకడం వలన కూరలోని బటాణీలు నేల మీద దొల్లి పడుతూ ఉండేవి. ఆయన పాలు త్రాగుతూ వుంటే చేతులు తడబాటు వల్ల పాలు ఒలికి పోతూ ఉండేవి. టేబుల్ క్లాత్ జిడ్డు గా తయారయ్యేది.  

      దీనితో ఆ ముసలి వాడి కొడుకు కోడలు చాల ఇబ్బంది పడేవారు. దీనికేదో ఏదో పరిష్కారం చూడాలని భావించారు. ఆ గది లో ఒక మూల ఒక చిన్న టేబుల్ వేసి దాని మీద ఆయనకు భోజనం పెట్టడం ప్రారంభించారు. మిగిలిన వాళ్ళంతా మామూలు గా తమ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేసే వారు. ఆ ముసలి తాత చేతి నుంచి గాజు పాత్రలు అప్పుడప్పుడు చెయ్యి జారి పగిలి పోతూ ఉండేవి. అందుచేత కర్ర పాత్రలు చేయించి పాలు మజ్జిగ మొదలైనవి వాటిలో పోసి ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ ముసలితాత భోజనం చేస్తూ అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకొనే వాడు. కొడుకు కోడలు ఇది గమనించక పోలేదు. అయినా ఎప్పుడయినా తాత చేతినుంచి ఏదైనా పాత్ర లేదా చంచా జారి పోతే జాగ్రత్త గా పట్టు కోవాలని తెలియదా అని గద్దించే వారు. నాలుగు సంవత్సరాల వయస్సు గల చిన్నపిల్లవాడు ఇదంతా మౌనంగా శ్రద్ధ గా గమనించే వాడు. ఒకరోజున ఆ పిల్లవాడు సాయంకాలం భోజన సమయానికి కొంచెం ముందు కొన్ని కర్ర ముక్కల తో ఆడు కుంటున్నాడు.

    ఆ పిల్లవాని తండ్రి ఇది గమనించి,  బాబూ! ఏమి చేస్తున్నావు అని ప్రేమగా అడిగాడు. దానికి ఆ పిల్లవాడు అమాయకంగా, అమ్మ నువ్వు, పెద్దవాళ్లు అయ్యాక మీరు భోజనం చేయడానికి కర్ర పాత్రలు చేస్తున్నానని చెప్పి ఆడు కోవడానికి వెళ్లి పోయాడు. అమాయకం గా ఆ పిల్లవాడు చెప్పిన మాటలు తల్లి తండ్రులకు జ్ఞానోదయం కలిగేటట్లు చేశాయి. ఆ రోజును నుండి ఆ ముసలి తండ్రికి వాళ్లతో బాటే డైనింగ్ టేబుల్ వద్ద భోజనం పెట్టడం మొదలు పెట్టారు. ఆయన చేతినుండి పాత్రలు జారిపోయినా మజ్జిగ ఒలికి పోయినా వాళ్ళు ఎప్పుడూ విసుక్కో లేదు.

      *భోజన విధిలో ఒక చిన్న పిల్లవాడికి ఉన్న జ్ఞానం మనకు లేకపోతే ఎలా?*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

 *శఠగోపము*

 *తీర్ధం ఎలా తీసుకోవాలి?*

🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️


చాలామంది గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. తీర్థానికి కాని, శఠగోపానికి కాని ప్రాధాన్యం ఇవ్వరు. 

దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి.

చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనై పోయిందని చక చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించుకుంటారు. 

శఠగోపం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపం. మానవునికి శత్రు వులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇకనుండి దూరముగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.

సహజంగా చిల్లర లేకపోవటం వల్ల శఠగోపంను ఒక్కోసారి వదిలేస్తుంటాం. ప్రక్కగా వచ్చేస్తాం. అలా చెయ్యకూడదు.

పూజారి చేత శఠగోపం పెట్టించుకొని, మనసు లోని కోరికను స్మరించుకోవాలి.

 ఈ శఠగోపంను రాగి, కంచు, వెండిలతో తయారుచేస్తారు. పైన విష్ణుపాదాలుంటాయి. ఈ శఠగోపమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగి లినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.

*తీర్ధం ఎలా తీసుకోవాలి?*

మనం గుడిలో పూజారి తీర్ధమిచ్చినప్పుడో ,లేదా ఇళ్లలో పూజలు,వ్రతాలు చేసినప్పుడో తీర్ధం తీసుకుంటూ ఉంటాము.చాలామంది తీర్ధం తీసుకున్నాకాచేతిని తలకు రాసుకుంటారు.నిజానికి తీర్ధం ఎలా తీసుకోవాలి? తీర్ధం తీసుకునే విధానం ఇది.

ముందుగా ఒక వస్త్రాన్ని నాలుగు మడతలుగా చేసి,ఎడమ చేతి మీద వేసుకోవాలి ,కుడిచేతిని దాని మీద ఉంచి ,తీర్ధాన్ని మూడు సార్లు తీసుకోవాలి.ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీర్ధాన్ని తీసుకోవాలి.ఒక చుక్క కింద పడినా అంతకు ఎనిమిది రెట్లు పాపం చుట్టుకుంటుంది.తీర్ధమిచ్చే సమయంలో ముందుగా తాను తీసుకొని తరువాత ఇతరులకు ఇవ్వాలి.

తీర్ధాన్ని మూడుసార్లు తీసుకోవడానికి కారణం...

మొదటిది ఆధ్యాత్మికం, రెండవది అధిభౌతికం,మూడవది అధిదైవికం .

తీర్ధాన్ని తీసుకునే సమయంలో గుడిలో అయితే నిలబడి తీసుకోవాలి.ఇంట్లో అయితే కూర్చుని తీసుకోవాలి.తీర్ధం తీసుకున్న తరువాత చేతిని తలకు తుడుచుకోకూడదు. బట్టకు తుడుచుకోవాలి.(ఉచ్చిష్టం అంటే ఎంగిలి కనుక).

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

పీయూషార్ణవమధ్యగాం మణిమయద్వీపాన్తరభ్రాజినీం,
షట్చక్రాన్తరవర్తినీం విజయదాం షట్ఛతృసంహారిణీమ్।
శ్రీచక్రాన్తరరాజితాం శశియుతాం పద్మాసనే సంస్థితాం,
వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసందాత్రిణీమ్।।(శార్దూలవిక్రీడితమ్)()

భావం-

అమృతసముద్రమధ్యమందుండేటటువంటి,మణిద్వీపమునందుప్రకాశించేటటువంటి,శ్రీచక్రాన్తరవర్తి ఐనటు వంటి, విజయమును చేకూర్చేటటు వంటి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములగు ఆరుగురు శత్రువులను సంహరించేటటు వంటి, చంద్రుడు ఆభరణముగా కలిగినటువంటి,పద్మమే ఆసనముగా కలిగినటు వంటి, వేదములచే  స్తుతింప బడేటటువంటి, అన్ని కోరికలను తీర్చేటటువంటి శారదమాతను నమస్కరించుచున్నాను


కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు...

లభంతో బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూషితే రతాః

ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయాలు జ్ఞానం వల్ల తొలగిపోయినవో, ఎవరు ప్రాణుల హితమునందు ఆసక్తి వున్నవారై వుంటారో, ఎవరు మనస్సును జయించి నిశ్చలముగా పరమాత్మలో నిలిచి వుంటారో అట్టి బ్రహ్మవేత్తైన పురుషులు శాంత బ్రహ్మను పొందుతున్నారు.
పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగి వుండి , పాప రహితులైన ఋషులు సర్వభూత హితరతాన్ని కలిగి వుండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతున్నారు. కాబట్టి మానవుడు సర్వ విధాలా స్వార్థాన్ని పరిత్యజించి, తన తనువును, మనసును, ధనమును ఇతరుల హితానికి అర్పించి దుఃఖంలో వున్నవారికి, అనాథలు, ఆపదలో వున్నవారికి సేవ చేయాలి. అభావంతో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నివారించి వారికి సర్వం వినియోగించాలి. తమ జీవనము, తమ సర్వస్వము దీనులు, దుఃఖ గ్రస్తులు, అనాథలైన జనులను సేవించడం కోసమే వున్నదని ఎవరైతే భావిస్తారో వారు ధన్యజీవులు.

కోపమునను ఘనత కొంచెమై పోవును 
కోపమునను గుణము కొరత పడును
కోపమునను బ్రతుకు కొంచెమై పోవును 
విశ్వదాభిరామ వినుర వేమ

కర్మ మధికమైన గడచి పోవఁగరాదు 
ధర్మరాజు దెచ్చి తగని చోట 
గంకుభట్టు జేసె గటకటా దైవంబు 
విశ్వదాభిరామ వినుర వేమ

అద్భిర్గాత్రాణి శుద్ధ్యన్తి ; 
మనస్సత్యేన శుద్ధ్యతి 
విద్యా తపోభ్యాం భూతాత్మా ; 
బుధ్ధి: జ్ఞానేన శుద్ధ్యతి :

అర్థము:-- జలము చేత శరీరము పరిశుద్ధ మగును: సత్యముచేత మనస్సు పరిశుద్ద మగును, జ్ఞానము చే బుద్ది శుచి యగును, విద్య చేత, తపస్సు చేత ఆత్మ పరిశుద్ధ మగును.

చత్వారో ధన దాయాదా:
ధర్మాగ్నినృప తస్కరాః 
తేషామ్ జేష్ఠావమానేన 
త్రయ: కుప్యంతి సోదారాః

అర్థము:-ధర్మము,అగ్ని,రాజు,దొంగ ; ఈనలుగురు ధనమునకు దాయాదులు.వీరిలో జేష్ఠు డయిన ధర్మము నవమానించిన అంటే ధర్మము మీరి ప్రవర్తించిన మిగతా ముగ్గురూ కోపిస్తారు. అనగా ధర్మముగా ప్రవర్తించని వాని ధనము అగ్గిపాలో, పన్నుల రూపంలో రాజులపాలో, దొంగలపాలో అవుతుందని భావము.

   *శివరాత్రి ఎలా జరుపుకోవాలి?*


*సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో,    ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.*


*శివరాత్రే యోగరాత్రి.     శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.*


*1.ఉపవాసం:-*


*శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.*


*ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.*


*ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.  మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.*


*2. జీవారాధాన:-*


*అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది.*


*అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.*


*శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.*


*3. మౌనవ్రతం:-*


*శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమక చమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.*


*ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.*   


*4.అభిషేకం:-*


*శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.*


*5.జాగరణ:-*


*శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.*


*6.మంత్ర జపం:-*


*శివరాత్రి మొత్తం శివనామంతో….                      ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.*


*శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి.* 


*అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.*

...........


వితస్తా నదీ తీరంలో కర్దముడనే మహర్షి ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో ఎందరో శిష్యులు ఎన్నెన్నో విద్యలను నేర్చుకునేవారు. ఆ విద్యలతో భుక్తిని పొందినవారు కొందరు. ముక్తిమార్గాన్ని పట్టినవారు కొందరు. అక్కడ లోకాన్వేషి, దేవాన్వేషి, బ్రహ్మాన్వేషి అని ముగ్గురు శిష్యులు ఉండేవారు. వారు వారి పేర్లకు తగిన విధంగా వరుసగా లోకాన్ని, దైవాన్ని, బ్రహ్మతత్త్వాన్ని అన్వేషించేవారు. లోకాన్వేషి మిగిలిన ఇద్దరినీ చూసి నవ్వుతుండేవాడు. చార్వాకం అంటే అతనికి చాలా ఇష్టం. చార్వాకం చారు వాక్యముల సముదాయం అనేవాడు. మనకు కనబడే ప్రపంచం కన్నా వేరేమీ సత్యం లేదనే వాడు.

రెండో వాడు.. ‘మనకు కనబడని ఆ దేవదేవుడు మహేశ్వరుడు ఈ జగత్తుకు ఆధారం’ అనే వాడు. ఆ కనబడే త్రిమూర్తులకు కూడా మూలం నిర్గుణ పరబ్రహ్మమే అని మూడో శిష్యుడు నిర్గుణ బ్రహ్మోపాసన చేస్తూ ఉండేవాడు. గురువు వారి అభిరుచులకు తగిన విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాడు. కాలం గడిచిన కొద్దీ లోకాన్వేషి ఎగతాళి మాటలు ఎక్కువ అవుతున్నాయి. ‘దేవుడు ఉంటే ఈ చెట్లూ, కొండలు, గుట్టలు, నదులు ఇవన్నీ కనబడినట్లు కనబడాలి కదా?’ అని అడిగేవాడు. ‘నిర్గుణ బ్రహ్మోపాసన అంటే శూన్యాన్ని ఉపాసించటమే కదా?’ అనేవాడు. ఈ మాటలు గురువు చెవిని పడ్డాయి.

ఒకరోజు ఆయన.. లోకాన్వేషిని తన ధ్యానకుటీరానికి పిలిచాడు. అతనిని ఆ విషయాలు, ఈ విషయాలు అడుగుతూ.. ‘‘మన తాళపత్ర గ్రంథాలయంలోని ‘శాస్త్రతత్త్వ రహస్య చంద్రిక’లో పదహారో పత్రంలో ఉన్న విషయం ఏమిటో వివరించు’’ అని ప్రశ్నించాడు. దానికి లోకాన్వేషి.. ‘‘గురువర్యా! నేను ఆ గ్రంథాన్ని ఎప్పుడూ చూడలేదు. కనుక మీరు చెప్పిన పత్రంలో విషయాన్ని ఎలా చెప్పగలను?’’ అని అన్నాడు. ‘‘ఆ గ్రంథశాలలోకి వెళ్లకుండా, ఆ విషయాన్ని చూడకుండా అది ఉందో లేదో చెప్పలేవు కదా?’’ అని కర్దముడు అడిగాడు. లోకాన్వేషి ఔనని తలూపాడు.

అప్పుడు గురువు.. ‘‘సరే. దగ్గరకు రా.’’ అని అతని తల పై తన కుడిచేతి బొటన వేలు అదిమిపెట్టి ఉంచాడు. కళ్లుమూసుకోగానే శిష్యుడు గ్రంథాలయంలో ఆ గ్రంథం దగ్గరకు చేరుకున్నాడు. అందులో తనకు కావాల్సిన పత్రాన్ని చదివాడు. తిరిగి చూసేసరికి గురువు దగ్గర ధ్యాన కుటీరంలో ఉన్నాడు. తాను భౌతికంగా కదలకుండానే గ్రంథాలయంలో ఆ గ్రంథాన్ని చూడగలగడం ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు గురువు అతడితో.. ‘‘ఎవరు ఏ పరిధిలో ఉంటే వారికి ఆ పరిధికి చెందిన జ్ఞానం లభిస్తుంది. నువ్వు ఆధిభౌతిక క్షేత్రంలో ఉండి ఆధిదైవిక అనుభవాన్ని, ఆధ్యాత్మికానుభవాన్ని పొందాలంటే కుదురుతుందా? అది సాధ్యం కావాలంటే మన దేహానికి సాధన అవసరం. ఈర్ష్యాసూయలకు అతీతంగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడు నీ హృదయం దేవతానిలయం అవుతుంది. దేవతానుగ్రహంతో నిర్గుణ పరబ్రహ్మ అనుభవమూ సాధ్యమవుతుంది. యోగం ద్వారా ఆధిదైవిక క్షేత్రంలోకి, ఆధ్యాత్మిక క్షేత్రంలోకి కూడా వెళ్లవచ్చు. 


నిన్ను నువ్వు పొగుడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సరళత, ఇంద్రియ ఆకర్షణకు లోనుకాకపోవడం, దైవం పట్ల సడలని నమ్మకం, ఏకాంత స్థలంలో ఉపాసన వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు నీలో దైవీ శక్తి పెరుగుతుంది. మన అనుభవంలోకి రానంత మాత్రాన అది లేదు అనరాదు’’ అని చెప్పాడు. దీంతో, లోకాన్వేషికి కర్తవ్యం తెలిసి వచ్చింది. శిష్యులు ముగ్గురూ మంచి సాధకులుగా పేరు తెచ్చుకున్నారు.

..........


పరీక్ష


🌷🕉🌷


జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం        


పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి, పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది.

బంగారానికి అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి.


బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు.


చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం. పక్షికి తుపాను పరీక్ష, పాముకు గద్ద పరీక్ష!


‘నన్ను పరీక్షించకు దేవా. నీ పరీక్షలకు తట్టుకోలేను...’ అని భక్తులు భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. పరీక్షలు నలిపేస్తాయి. తడిగుడ్డ పిండినట్లు మనుషులను పిండేస్తాయి. కొందరు తట్టుకోగలుగుతారు. కొందరు తట్టుకోలేరు. పరీక్షాకాలంలో మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి. అవగాహన చేసుకోగలిగే మంచి మేధ ఉండాలి. ఓర్చుకోగలిగే హృదయం ఉండాలి.


పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి- పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది. నిజానికి, దేవుడు పరీక్షలు పెట్టడు.


మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.


ధర్మరాజు జూదం ఆడాడు. అందరినీ రాజ్యాన్నీ ఓడాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు


పాండవులు. ఎన్నో కష్టాలు, బాధలు. అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కారు. కష్టాలు రాకుండా ఉండవు. పరీక్షలు లేకుండా ఉండవు. సహాయం చేసే చెయ్యి మన వెనక ఉందన్న ధీమా నిలబెడుతుంది, గెలిపిస్తుంది.


జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది. దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శక్తియుక్తులతో మనిషి ఒక కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. ఆట ఆడాలి. ఆడుతూ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటుతూ విజయ పరీక్షకు నిలబడాలి.


కుంతీదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది. తనకు మరిన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెట్టమంది. ఆ విధంగా, ఆ వేదనలో దైవాన్ని నిరంతరం వేడుకుంటూ దగ్గరగా ఉంటానని చెప్పింది. మనిషికే కాదు, భగవంతుడికీ పరీక్షలు ఉంటాయి. దైవాన్ని నమ్మని మనిషే భగవంతుడికి ఒక పెద్ద పరీక్ష! అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు. నమ్మని మనిషి, అవన్నీ కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారవేస్తుంటాడు. నమ్మినవాడి గురించి దైవం పట్టించుకోకపోయినా ఫరవాలేదు. నమ్మని వాడితోనే పెద్ద చిక్కు.


ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి, కొంతమంది మనుషులను మార్చిన ఉదంతాలు వినిపిస్తుంటాయి.   ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంది.

,............


చాలా బాగుంది ఇంటి పేర్ల పురాణం 


*తెలుగు మాస్టారా? మజాకా?*


తెలుగు మాస్టారు వచ్చీ రాగానే హాజరు పట్టీ అందుకున్నారు. కలం తీసి దానిమూత తీసి దాన్ని ఓ సారి అలవోకగా విదలించి, ఊఁ.....

ఓనమాల ఓంకారం, అచ్చుతప్పుల అప్పలాచారి, ఆటవెలది ఆనందరావ్, ఉత్పల ఉమాదేవి, చంపకమాల చంచలమ్మ, శార్దూలం శాంతమ్మ, మత్తేభుల మరకతమణి, మత్తకోకిల మహేశ్వరి, కందపద్యం కామేశ్వరి, తేటగీతుల దేవయాని, యతిప్రాసల యాచేంద్ర, అనుప్రాసల అనంతయ్య, అంత్య ప్రాసల అప్పన్న, విభక్తుల వినాయకరావు, సీసాల చినరామయ్య ఎత్తుగీతుల ఎంకటయ్య, శ్లేషల శేషాచలం, కూని రాగం కుటుంబరావు, వ్యాకరణం వసంతయ్య, ఛందస్సుల చంటి బాబు, వచనకవితల వంగపండు, హైకూల హైమవతి, ఆరుద్రపదాల ఆరుముగం, గ్రాంథికం గరుడాచలం, వ్య్వవహారాల వాసుదేవరావ్, పరుషాల పాపయ్యశాస్త్రి, సరళాక్షరం సంపత్కుమార్, అరసున్నల ఆదిలక్ష్మి, నిండు సున్ననిత్యానందం, అనునాసికం అప్పారావ్, శకట ఱేఫల శంకరయ్య, గురువుల గుండూరావు, లఘువుల లక్ష్మణరావు, ప్రకృతుల ప్రభాకరరావు, వికృతుల వీరాస్వామి, నామవాచకం నందకుమార్, విశేషణాల వీరభద్రయ్య, సర్వనామాల సంగీతరావు, భగణం భాస్కరయ్య సగణం సారయ్య, తగణం తాయారమ్మ

రగణం రంగాచారి, మగణం మావుళ్లయ్య, యగణం యాద్గిరి, నగణం నాగేంద్రుడు, జగణం జానకమ్మ, పద్యరచన పరమానందం, చివరగా ముక్తాయింపు మూర్తి రాజు. అమ్మయ్య,

అందరూ వచ్చారా, కూర్చోండి కూర్చోండి. ఏదోనర్రా ఈ రోజు మీకు వ్యాకరణం పాఠం చెబుదామనుకున్నాను. ఇదిగో ఇలా సరిపోయింది. సర్లే, రేపు చూసుకుందాం. ఈ రోజుకు ఇలా ......అదిగో గంట కూడా కొట్టారు.

శుభమ్.

,..............


*మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట.!*

            

       …బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు



కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో, అలా ధనము కూడా నీకు కావలిసినంత ఉంటే చాలు అని "వేదాంత" వాక్యం.


లోకం లోని 84 లక్షల జీవరాసులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే.


మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి.


ప్రకృతి పరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది.


లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయ్యింది అంటే….       ప్రింటింగ్ ప్రెస్సు వచ్చిన తరువాత!   లోకంలో దరిద్రం ఎపుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినపుడు!! 


పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికి సరిపడేదివారు వస్తువినిమయంతో సంపాదించు కొనితినేవారు. ఆరోజుల్లో దరిద్రం అంతగాలేదు.         తిండికి ఎంత  అవసరమో అంత సంపాదించుకునే వారు. మహా దాచుకున్నా రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి.!


ఎపుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో  ఒకడి కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు. ఫలితంగా వాడి కన్నా వీడికి, వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది..!


ప్రింటింగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసి లోకం మీదకు వదిలేశారు. వారి భావాలన్ని జనాలకు అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు విషయం తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళి పోయాడు..!


వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు. ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి నెట్టి వేస్తుంది..!

అన్నము అంటే ఏమిటి?

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునునితో అంటాడు...

 శ్లో: "అన్నాద్భవన్తి భూతాని 

పర్జన్యా దన్నసంభవః 

యజ్ఞాద్భవతి పర్జన్యో 

యజ్ఞః కర్మసముద్భవః "

తాత్పర్యం :- ప్రాణులు అన్నము వలన కలుగు చున్నవి. అన్నము మేఘము ( వర్షము ) వలన కలుగు చున్నది. మేఘము ( వర్షము ) యజ్ఞము వలన కలుగు చున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగు చున్నది.

అన్నం పరబ్రహ్మ స్వరూపం! అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు. అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...

మనలో చాలామందికి ”అన్నము” అంటే తెలియదు. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.

అవి 1 అన్నమయ, 2 ప్రాణమయ, 3 మనోమయ, 4 విజ్ఞానమయ, 5 ఆనందమయ కోశములు. అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది. కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్న ము అని అర్ధం. అంతేకాదు. తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూత జాతములు జనించుచున్నవి. అన్నము వలననే జీవించుచున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించుచున్నవి లేక లయించుచున్నవి అని చెప్పబడి ఉంది. మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు అని అర్ధం చేసుకోవాలి.

అన్నదానం అంటే ఏమిటి?

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారు తున్నందు వలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయ డమే. అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని, అన్ని దానములకెల్ల అన్నదానం మిన్న అని, శాస్త్రాలు చెప్తున్నా యి. ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్న దానానికి మాత్రం ఈ నియమం లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది.

ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా. ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు. అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు. గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటిని అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరికి కడుపు పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట.

ఆయన సమకూర్చిన ఆన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట. అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే నీ ఆయువు క్షీణించి పోతుందట.

ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయు: క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాలో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.

అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతోపాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.

ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

[

*చంద్రునికో నూలుపోగు* 

చంద్రుడు హాయిగొలిపే వెన్నెలను ఇస్తున్నందుకు కృతజ్ఞతగా... ధరించిన తెల్లని కొత్త బట్ట నుండి ఒక నూలు పోగును లాగి, చంద్ర దర్శనం సమయంలో చంద్రునికి సమర్పించడం(చంద్రునివైపు విసరడం) ఒక ఆచారం. 

            ఇంకా చెప్పాలంటే... అమావాస్య తర్వాత వచ్చే విదియ నాడు చంద్రుడు మనకు మళ్లీ  కనిపిస్తాడు. కృష్ణపక్షం ముగిశాక శుక్లపక్షంలో కనిపించేది మనకు విదియ నాడే. ఆ రోజు కనిపించే  బాలచంద్రుడు క్రమక్రమంగా పెరిగి పూర్ణ రూపాన్ని సంతరించుకుంటాడు. 

              ఏదైనా ఇవ్వగలిగిన వాడికే... పుచ్చుకునే అధికారం ఉంటుంది. చంద్రుడు జ్ఞానానికి అధిపతి, మనః కారకుడు కూడా.  మన మనసును, జ్ఞానాన్ని ప్రభావితం చేస్తాడంటారు.  అందువలన మనకు వెన్నెల లాంటి చల్లని, తెల్లని (పవిత్రమైన) మంచి బుద్ధిని ప్రసాదించమని  చంద్రునికి అడగాలి. ఇతరుల నుంచి మనది కానిది పొందే అధికారం నైతికంగా...వారికి మనం ఏదయినా ఇచ్చినపుడే కలుగుతుంది.  

            బుద్ధిని ప్రసాదించే చంద్రుడంతటి గొప్ప వారికి మనం ఏమి ఇవ్వగలము?  ఏమిచ్చినా అంత గొప్పవాడి ముందు అవన్నీ దిగదుడుపే కదా! 

         ముందుగా ఉగాది తర్వాత వచ్చే చైత్ర శుద్ధ విదియనాడు *బాలేందు* *వ్రతాన్ని* చేస్తారు. కొత్త సంవత్సరంలో బాలచంద్రునికి జరిగే తొలి పూజ అన్నమాట. ఆనాడు మనం ధరించిన కొత్త తెల్లని బట్టలు నుంచి  ఒక నూలు పోగును చంద్రునికి అర్పించి, జ్ఞానాన్ని అడుగుతాం. కొనసాగింపుగా ఆ తర్వాత ప్రతి నెలా అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే విదియ నాడూ  నూలుపోగును  సమర్పిస్తాం.

        నిజంగా చంద్రుడు మనం విసిరే ఆ పోగును  తీసుకుంటాడా?  అంటే...తీసుకోవడం,  తీసుకోకపోవడం కాదు ఇక్కడ. *ఇతరులకు ఇచ్చే గుణాన్ని నేర్పించటం, అలవాటు చేయడం అన్నదే విషయం.*  మనము ఎంత ఇవ్వగలమో అంత... మన శక్తి కొలది ఇవ్వగలగటం అన్నమాట.

        *మన శక్తిని అనుసరించి  ఇతరులకు ఏదైనా ఒక కానుక ఇవ్వడం గానీ, సహాయం చేయడం గానీ చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతున్నాం.


*పైడి నాగ సుబ్బయ్య*

[

త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు. కలియుగంలో దాన ధర్మాలు, దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించాడు. దానధర్మాలు ఎవరికున్నంతలో వారు దానం చేసుకోవచ్చు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఆడంబరాలకు పోనవసరం లేదు. దానాలు ఎన్నో రాకాలుగా ఉన్నాయి, దానాల్లో కూడా అన్నదానం, వస్తద్రానం, జలదానం గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని పూర్తిగా సంతృప్తిపరచేది అన్నదానము. దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుల దాహాన్ని తీర్చటం ద్వారా వారికి మనమెంతో మేలుచేసిన వారమవౌతాం. వస్తదానం చేస్తే సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది. ఎండ, వాన, చలినుండి పేదలకు కాపాడిన తృప్తీ మనకు దక్కుతుంది. మనం చేసే దానంలో స్వార్థం లేకుండా ఏ ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని అంటారు. కర్ణుడు, బలిచక్రవర్తి మొదలైనవారి దగ్గరికి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టు పురాణ, ఇతిహాసాల ద్వార మనకు తెలుస్తుంది. ఒక మనిషి మరణించినా అతడు చేసిన దానధర్మాల వలన ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దానగుణం లేని మనిషికి మోక్షం కలగదు. ప్రత్యుపకారము ఆశింపక చేసే దానం అత్యున్నతమైంది. ఆకలితో ఉన్నవారికి అనాధలకు, పేదలకు, రోగులకు, వికలాంగులకు, అన్నవస్త్ర ఓషదులు మొదలైనవి లేనివారికి దానం చేస్తే దానిని పాత్రత దానము అనబడును. అన్న దానం చేయడంలో ఏ మాత్రం పక్షపాత వైఖరిగాని 'పరతమ' భేద వైఖరి అస్సలు ఉండ కూడదు, చూపకూడదు. సంపద గలవారికి, అధికారం గలవారికి, బందుమిత్రులకు ప్రత్యేకంగా ఆతిధ్యం ఇస్తూ పేదవారిని తక్కువ చేసి చూస్తే అది అపాత్ర దానం అవుతుంది. బందుమిత్రులనే ప్రీతిలేకుండా ఉండి ఆర్ధిక స్థోమత లేని, శారీరక శక్తి లేనివారికి వృద్దులకు, ఆభాగ్యులకు సాక్షాత్తు భగవంతునికే అన్ననివేద సమర్పిస్తున్నామన్న భావన చెందుతూ మనస్పూర్తిగా అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం రెట్టింపౌతుంది. పేదవారిని పక్కనబెట్టి అయినవారికి ముందుగా వడ్డిస్తే అన్నదాన పుణ్యఫలం లభించదు. అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేనివారు, నిరుపేదలను "దరిద్ర నారాయణులు" భగవంతునిగా భావించి చేసే మహత్కార్యం ఇది. అన్నదానం జరిగే చోటకు భగవంతుడు పేదవారిగా రూపం దాల్చి వస్తాడు అని పురాణ ఆధారాలున్నాయి. ఉన్నోడికి అన్నం పెడితే పెట్టిన వారి మేలు కోరుతాడో లేదో తెలియదుకాని లేనివాడికి పట్టెడు అన్నం ప్రేమతో పెడితే వారి దేహాత్మలోని పరమాత్మ సంతృప్తి చెంది వారు వేద ఆశీర్వచానాలు ఇవ్వకున్నా అంతకుమించి దీవిస్తారు. మన పేరు వారికి తెలియకున్ననూ వారంటారు... ఏ తల్లిదండ్రులు కన్నబిడ్దో మా అయ్యా, మా దొర, మా దేవుడు కడుపునిండా కమ్మని అన్నం పెట్టించాడు ఆయన కడుపు సల్లంగుండా, వాళ్ళ భార్య పిల్లలు సల్లంగుండా, వాడ సల్లంగుండా, వంతన సల్లంగుండా అని నిండు మనస్సుతో దీవిస్తారు. నిజంగా ఆ దీవెనలు దాతకు జీవిత పర్యంతమే కాదు వచ్చే జన్మకు ఆ పుణ్యఫల దీవెనలు సంప్రాప్తిస్తాయి. ఈ అన్నదాన కార్యాక్రమానికి ఎదో రకంగా సహాయపడిన ప్రతి ఒక్కరికి ఆ పుణ్యఫలం లభిస్తుంది. భగవద్గీతలో కృష్ణ్భగవానుడు యజ్ఞ దాన తపోరూపములైన కర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా తప్పక ఆచరించవలెనని చెప్పాడు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేసావని అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి ఎప్పుడైనా అన్నదానం చేసావా?'' అనడిగాడు. దానికి సమాధానం లేదు. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ''పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?'' అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు ''అవును, ఓ బీదవాడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని చెప్పాడు. అన్నదానం చేసే ఇంటిని చూపించిన నీ వేలిను నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. చాలా మంది అన్నదానం చేయడం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే ప్రశ్నకు మనస్సులో మేదాలాడే ప్రశ్నలెన్నో! అన్నదానం చేయడంలో ఒక పరమార్ధంతో పాటు ఆనందం ఉన్నది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు. భౌతిక శరీరాన్ని 'అన్నమయ కోశం లేదా ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో కూడి ఉన్నది. అన్నదానం చేస్తే వారికి శరీరాన్ని అందిస్తునట్లే. ఆహారం పట్ల కొంత స్పృహని , అవగాహనని మీలో కలుగచేయడానికి అన్నదానం మీకొక గొప్ప అవకాశం. మీరు దానిని ఆహారంగా మాత్రమే చూడొద్దు, అది జీవితం. మీ ముందు ఆహారం వున్న ప్రతి సారీ అది వాడిపడేసే పదార్ధంలా కాకుండా అది జీవం అని అర్థం చేసుకోవాలి. మీ జీవితాన్ని ఉన్నతం చేసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఆహారాన్ని, నీటిని, గాలిని, భూమిని ఒక జీవంగా చూడాలి, ఎందుకంటే మీ శరీర నిర్మాణానికి ఇవే ముఖ్యమైన పదార్థాలు. మీరు వీటిని జీవాధారంగా ఆశ్రయిస్తే అవి మీ శరీర నిర్మాణంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి. అలాగాక మీరు వాటిని ఒక పదార్ధంగా చూస్తే మీ వ్యవస్థ మార్కెట్ లా తయారౌతుంది. ప్రేమ, అంకిత భావంతో వడ్డించి అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటి వారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది. మీరు దీనిని గొప్ప అంకితభావంతో చేయాలి. ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్నిచ్చే అవకాశం మీరు పొందుతున్నారు కాబట్టి. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో ఇతర పక్షులకో, ప్రాణులకో పెడతారు. ఇలా చేయడం వలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు. ఇలాంటి విషయాలు పాటిస్తుంటే మనకు మన ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలకి ఎటువంటి లోటూవుండదు. అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్ధాలని వృధాచేయకుండా సద్వినియోగం చేస్తూవుంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది. అలక్ష్యం చేస్తే భుక్తి కోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది. మనిషి పుట్టేప్పుడు ఏమి తీసుకురాడు, ఈ మధ్యకాలంలో ఏం సంపాదించినా, ఎంత కూడబెట్టినా పోయేటప్పుడు ఎవరూ ఏమి తీసుకువెళ్ళరు. కేవలం మంచి చెడు కర్మ ఫలితాలు తప్ప. భగవంతుడిచ్చిన సంపదలో మనిషి బ్రతికి ఉన్నన్ని రోజులు " అహంబ్రహ్మాస్మి"భావనతో తనలో దైవత్వాన్ని అలవరచుకుని తనకు కలిగినంతలో సాటి జీవులకు, ప్రాణులకు దానధర్మాలు చేయాలి. "క్షుద్బాద" ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారి ఆకలి కూడా అలాంటిదే అని గ్రహించే స్థాయికి 'స్థితి' కి రావాలి. ఆకలి బాధ అనేది అందరికీ ఒకేలాగే ఉంటుంది కనుక సాటివారి ఆకలి తీరుద్దాం. అన్నాన్ని గౌరవిద్దాం.. నలుగురిని ఆదరిద్దాం...తృప్తిగా జీవిద్దాం

[

యజమాని:

ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పరుగెత్తి పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.


దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది.అందులో ఆవు పీకల వరకూ కూరుకు పోయింది.


అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.


ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.


కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది, 

" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా?" అని అడిగింది . దానికి ఆ పులి గర్వంతో "నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు" అంది గొప్పగా.


అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా అంది.


అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??  అంది.


అప్పుడు ఆవు చిరునవ్వుతో "చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు? "అంది.


ఇలా అన్న కొద్దిసేపటికి  ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.


 నీతి :


ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, " నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.


 దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.


ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు.


ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.

[

#మరణం : ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో యమధర్మరాజు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


యమధర్మరాజు : మానవా.. నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


యమధర్మరాజు : తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


యమధర్మరాజు : నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


యమధర్మరాజు : అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


యమధర్మరాజు : కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


యమధర్మరాజు : అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


యమధర్మరాజు : వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


యమధర్మరాజు : వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


యమధర్మరాజు : తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


యమధర్మరాజు : ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


యమధర్మరాజు : ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. పశ్చాతాపులను క్షమించాలి. 


 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.


సేకరణ. మానస సరోవరం

No comments:

Post a Comment