(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ ప్రాంజలి ప్రభ గాధ )
తల్లి కొడుకుల ముచ్చట్లు కాఫీ చిన్న కధ (5)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అయ్యగారు అయ్యగారు
ఏమిటిరా అట్లా అరుస్తున్నా వు
నేనో పని చేసానండి
ఏపని చేసావు నాకు చెప్పకుండా, మీ అమ్మ గారికి చెప్పకుండా
ముందుగా క్షమాపణను కోరుచున్నా గదండీ
సరే ఏపని చేసావో చెప్పు
అమ్మగారు ఏమను కుంటారో
ఏమనుకుంటారో చేసేముందు ఆలోచన రావాలి
ఇప్పు డొస్తే లాభ మేముండదు
ఏమి లేదండి, ఏమీలేదండి అలా నాన్చాకు
ఓ అమ్మగారు
ఆ ... అమ్మగారు పడి పోయారండి
పడి పోవటమేమిటి
నిక్షేపంలా ఇప్పటిదాకా నాతొ మాట్లాడింది ఇప్పుడే వంటగదిలో పనుందని వెళ్ళింది
మణమ్మగారు కదండీ ఎవరో అమ్మగారు "అలా కారుతీసుకొని బస్టాండు దాక చిన్నమ్మాయిని దించామన్నారు కదండీ
ఆ దించమన్నాను
తిరిగి వస్తూ ఉంటే ఓ అమ్మగారు నడుస్తూ నా కారు దగ్గర పడిందండి
ఏ మిటీ యాక్సిడెంట్ చేసావా
లేదండీ
మరి ఏమిటో చెప్పండీ
అందరూ కలసి కారులో ఎక్కించారు ఇక్కడకు తెచ్చాను
తెచ్చావా ఎక్కడా
కారులో ఉంది
ఉండట మేమిటిరా తీసుకురా
ఆ ఆ ఆగు ముందు ఆమూలా నవారు మంచం ఉంది దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టు దానిపై దిండు దుప్పటి వేయి
ఇప్పుడు తీసుకురా
ఈ చేతుల తోన
నీవు చేసేపని మంచి ధైతే భయము నీలో ఉండదు వేళ్ళు
ముస్లావిడిని పువ్వులా పట్టి తీసు కొని వచ్చాడు బంటు
రామ సీతారామ జానకిరామ జయజయ రామ పట్టాభిరామ అంటూ కలవరిస్తున్నది, నిద్దరిలో జారుకుని
ఎవరీ పెద్దవిడా అంటూ లోపల నుంచి వస్తూ అడిగింది
ఏమో నమ్మగారు మనకారు క్రింద పడింది తీసుకొచ్చా
దెబ్బలేమన్నా తగిలాయా
లేదమ్మగారు కారు ఆపి ఉంచా కారుదాకా ఎదురువస్తూ ఒక్కసారి కుప్పకూలింది
సరే ఎవరున్నా చూసారా అందరూ చూసారు
సరే మంచిపని చేసావు ఇక్కడకు తెచ్చి
అమ్మా అని పలకరించాడు రామారావు ఆ ఇంటి యజమాని
అమ్మా అని పిలిచింది జానకి ఆ ఇంటి యజమానురాలు
అమ్మా అంటూ దండం పెడుతూ నన్ను గుర్తుపట్టారా నీవు పిలిచావే ఆ హనుమంతుణ్ణి
మిమ్మల్ని చూస్తుంటే నాకు సీతా రామ ఆంజనేయులు వారు గుర్తుకొచ్చారు
నేనే మీఅందరికీ నమస్కారం పెట్టాలి
ఎదో రామభజన చేస్తూ అలా కళ్ళు తిరిగి పడిపోయాను
నాకథ చెప్పాలంటే పెద్దకథ కానీ ఇప్పుడు చెప్పలేను క్లుప్తముగా చెప్పగలను
ఆ చెప్పండి మీ ఆరోగ్యం బాగుందా
బాగానే ఉంది మీ అందరి దయవల్ల
మేము ఏంచేశామని మా దయ అంటున్నారు
ఎవరో తెలియకుండా ఆశ్రమం కల్పించారు అందులో ఈ కరోనా కాలంలో "అదిమంచి పనేగా ఉండండి మంచి కాఫీ తీసుకొనివస్తా అందరం త్రాగుతూ మాట్లాడు కుందాం
నాకథ అత్తాకోడళ్ల కథే ఎవరిపంతం వారిది యవ్వన పంతం గెలుస్తుంది, ముసలిపంతం జాలిగా మారుతుంది కానీ గెలవలేదు ఇదే లోకధర్మం అని ఇప్పుడు తెలుసుకున్నా
ఆనందం, విషాదం... సందర్భం ఏదైనా ఏకాంతంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచనా ముద్ర వహిస్తుంది దీర్ఘాలోచనతో తన భవిష్యత్ జీవితం గురించి కలలు కంటుంది సానుకూల, వ్యతిరేక ఆలోచనల ప్రభావం మనిషి ఆరోగ్యం పైనా ఆయుర్దాయం మీదా ఎంతగానో ఉంటుంది. వస్త్రంతో వడగట్టడం ద్వారా నీటి మాలిన్యాన్ని శుభ్రపరచినట్లు, ఆలోచనా మాలిన్యాన్ని ధ్యానంతో పరిష్కరించాలని అనుకున్నా. సంసార బంధాలు అన్నీ కూడా వృత్తంలా తిరుగుతాయి మనం ఆశాజీవులం వాటిని తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు. కానీ ధ్యానం అన్నింటికీ మూలం మనస్సు శాంత పరుస్తుంది బాహ్య ప్రపంచం జోలికి పోకుండా అంతర హృదయాన్ని వికసింపచేసింది
మానవ మస్తిష్కం ఆలోచనల భాండాగారం. ఆకాశం నుంచి వానజల్లు లక్షలాది నీటి బిందువులుగా జాలువారినట్లు అది నిత్యం వేల ఆలోచనల్ని మనో క్షేత్రంలో వర్షిస్తుంది. బాహ్య లోచనాలు(కళ్లు) అడుగు అడుసు(బురద)లో పడకుండా రక్షిస్తాయి. ఆలోచనా లోచనాలు జీవితం తడబడకుండా నిలబెడతాయి. ఉత్తమోత్తమ ఆలోచనల్ని చేసే మనిషి జీవితం వర్ణమయం అవుతుంది
అని కాఫీ త్రాగుతూ చెప్పింది
అప్పుడే బయటనుండి అమ్మా నన్ను క్షమించు
అత్తయ్యగారు నన్ను క్షమించు అంటూ కాళ్ళమీద పడ్డారు కొడుకూ కోడలు
ముందు నాకు కాదు నమస్కరించేది ఆ ఆది దంపతులకు నమస్క రించండి మొహమాట పడకుండా నన్ను మోసుకొచ్చిన ఆ హనుమంతునకు నమస్కరించండి
మమ్మలి క్షమించండి మేము ఎన్నో తప్పులు చేసాము
ఒకరికొకరుక్షమాపణ చెప్పుకోటం కాదు ఆలోచనతో మనం చేసేది తప్ప ఒప్పా ఒక్క ఘడియ అలోచించి చెయ్యాలి అదే రాయణంలో హనుమ చేసింది. అందరికీ అదే ఆదర్శం.
మీ అమ్మే నాకుకూడా అమ్మ మేము పూజించే ఆ ఆదిపరాశక్తి ఈ తల్లి ఈ దీవెనలు సర్వజగతికి క్షేమము
ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ...ఓం శ్రీ రాం ...ఓం శ్రీ రాం ...నిశ్శబ్దములో వినబడుతుంది సర్వం రామమయం ...
--(())_-
🙏 *ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు?* 🙏
🍃🌹సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు.
🍃🌹అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయుని తమలపాకు ప్రీతిపాత్రమైనది.
🍃🌹అది మాత్రమే కాదు. సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ… ఆకాశంలో పయనిస్తూ… గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్లతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు.
🍃🌹అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు.
🍃🌹హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరతాయి.
🍃🌹అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వసంపదలూ సుఖసంతోషాలూ వెతుక్కుంటూ వస్తాయి.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*శ్రీ భాగవతం - 95 వ భాగం*
*చదువుకుందాం భాగవతం*
*బాగుపడదాం మనం అందరం*
*దశమ స్కందము*
*శ్రీకృష్ణ లీలలు - 25*
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*మథురలో బలరామకృష్ణులు*
బలరామకృష్ణులు చేసిన గొప్ప చేష్టితములను తెలిసికొనివారైన మధురా నగర వాసులు మేడలమీద నిలబడి వారిని చూస్తున్నారు. ఎంతో ఆనందముగా బలరామ కృష్ణులు మధురా నగరం రాజవీధిలో వెడుతున్నారు.
కంసుడికి బట్టలు ఉతికే చాకలి వాడు పట్టుబట్టలన్నీ ఉతికి మూటను కట్టుకొని తలమీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు అతనిని పిలిచి, ‘మేము నంద మహారాజుగారి బిడ్డలము. మాకు కూడా ఒక పట్టుపంచె ఇవ్వు. కట్టుకుంటాము’ అన్నాడు.
అపుడు ఆ చాకలి కృష్ణుడుతో చాలా పొగరుతనంతో మాట్లాడాడు. ‘ఈవిషయం మా కంసమహారాజు గారికి తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు, నేతులు త్రాగి బాగా కొవ్వు పట్టింది. ఇవి సాక్షాత్తు కంసమహారాజు గారు కట్టుకొనే పంచెలు. ఇవి మీకు కావలసి వచ్చాయా! వెర్రి మాటలు మాట్లాడకండి’ అన్నాడు.
వాని మాటలు విని కృష్ణుడు బలరాముని వంక చూసి, ‘అన్నయ్యా, ఇంక ఈ పుర్రె మారదు’ అని పిడికిలి బిగించి ఆ చాకలి వాని నెత్తిమీద ఒక గుద్దు గుద్దాడు. వాడు తలబద్దలై చచ్చిపోయాడు.
కృష్ణుడు రజకుడిని ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి.
చాకలి వాని పుర్రె ఇప్పటిది కాదు. అది త్రేతాయుగం నాటి పుర్రె. అప్పుడు సీతాదేవి మీద నిందవేశాడు. ఆ పుర్రె సీతా పరిత్యాగమునకు కారణమయిన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికయినా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనయినా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు.
ఒక్కొక్కడు అవకాశం వచ్చినా అహంకారముతో నాశనం అయిపోతాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక నోటిమాట వలన చెడిపోతాడు. పొగరుగా మాట్లాడాడు. చచ్చి ఊరుకున్నాడు.
ఈశ్వరుని క్షమా గుణమును, మనిషి తెంపరితనమును ఈ రజకుని మరణము మనకు ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనస్సును ఉతుక్కోలేకపోయాడు.
అది దాటి వెళ్ళారు. మరోచోట వృద్ధుడయిన సాలెవాడు ఒకడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురువచ్చి తీసుకు వెళ్ళి, ‘ఇవి నేను కంసుని కోసం నేస్తున్న మెత్తటి పంచెలు. మహానుభావా, మీరీపంచె కట్టుకుని కనపడితే ఎంతో బావుంటారు. కాబట్టి ఈ పంచె కట్టుకోవలసింది’ అన్నాడు.
కృష్ణ పరమాత్మ ఆ పంచె కట్టుకొని సాలెవానికి ఇహమునందున్న సమస్త ఐశ్వర్యమును యిచ్చి అంత్యమునందు అతనికి సారూప్యము యిచ్చి తన దగ్గర కూర్చోపెట్టుకొనగలిగిన ఐశ్వర్యమును కటాక్షించాడు.
సుదాముడు అనబడే మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన కంసునికి పుష్పమాలలు కడుతూ ఉంటాడు. ఆ మాలాకారుడు వీరికి ఎదురువచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు.
‘కృష్ణా! నా జన్మ ధన్యమయింది. ఏమి అదృష్టం! మీరిద్దరూ ఇవాళ నా దగ్గరకు విచ్చేశారు. దయచేసి నేను యిస్తున్న ఈ పుష్పమాలను అలంకారం చేసుకొనవలసింది’ అని పుష్పమాలలు ఇచ్చాడు. అపుడు పరమాత్మ పొంగిపోయి నీకు ఏమి కావాలో అడుగు ఇచ్చేస్తాను’ అన్నాడు. ఆనాడు మాలాకారుడు మనం అందరం పూజలో చెప్పవలసిన దానిని అడిగాడు.
*నీ పాదకమల సేవయు, నీ* *పాదార్చకుల తోడి నెయ్యమును నితాం*
*తాపారభూత దయయునుఁ,* *దాపస మందార! నాకు దయసేయ గదే!!*
కేవలం బ్రతికేయడం కాదు తండ్రీ! ప్రతిక్షణం నీ పాదకమలముల సేవ నేను చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదములు పట్టి పూజచేసే మహాభక్తులు ఉన్నారో వాళ్ళతో నాకు స్నేహము కావాలి. ఏ పదార్థము చూసినా అది ఈశ్వరుడే అని నేను భావించి ప్రేమించగలగాలి. దానికి ఎల్లలేదు. పూర్ణమై ఉండాలి. ఈశ్వరా, నాకు అటువంటి భక్తిని ప్రసాదించవలసినది’ అని అడిగాడు.
అపుడు కృష్ణుడు పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యమునిచ్చాడు.
తదనంతరము ఆ ప్రదేశమును దాటి ముందుకు వెడుతున్నాడు. వెడుతుంటే ఒక కుబ్జ ఎదురువచ్చింది. ఇవి అన్నీ దశమ స్కందములో గొప్ప రహస్యములు. ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టములు.
ఎదురువచ్చిన కుబ్జ త్రివక్ర. గూని వలన ఆమెకు శరీరంలో మూడు వంకరలు ఉన్నాయి. ఆవిడ ఎదురుచూస్తోంది. కృష్ణ పరమాత్మ ఆవిడ వంకచూశారు. కుబ్జ అందంగా ఉండదు కదా! ఆవిడ కృష్ణుని వంక చూసి, అయ్యా! నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ త్రివక్ర అని పిలుస్తారు. నీవు చూస్తే చాలా అందంగా ఉన్నావు. నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. నేను గంధపు చెక్కలమీద గంధం తీస్తూ ఉంటాను. పరిమళ ద్రవ్యములు సిద్ధం చేస్తాను. వాటిని కంస మహారాజుకి పట్టుకు వెడతాను. ఆయన వాటిని తన ఒంటికి రాసుకుంటాడు. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధమును రాసుకుంటే ఈ గంధమునకు అందం వస్తుంది. ఈశ్వరా! కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా!’ అంది.
కుబ్జ కొద్దిపాటి గంధము యిచ్చినందుకు, ఈశ్వరుడు ఆమెకు ఎవ్వరికీ దొరకని విచిత్రమయిన సౌఖ్యమును ఇచ్చాడు. కుబ్జ పాదమును తన కుడి పాదముతో తొక్కేడు. తన చేతి రెండు వేళ్ళను కుబ్జ గడ్డం క్రింద పెట్టి పైకి ఎత్తాడు. అలా ఎత్తేసరికి కుబ్జ మూడు వంకరలు పోయాయి. ఆమె అందమయిన సౌందర్యరాశి అయిపొయింది.
ఇళ్ళు లేని వాళ్ళని పూర్వం పాంథులు అనేవారు. అలాంటి వారందరూ పూర్వం సైరంధ్రి యింట్లో వుండేవారు. సైరంధ్రి, పురుషులు అడగడమే తడవు వారికి కావలసిన సౌఖ్యమును కూడా కటాక్షిస్తుంది. కుబ్జ సౌందర్య రాశి అయిపోగానే, ‘నేను సైరంధ్రిని, నాకు యింత సౌందర్యమును ఇచ్చావు. నీవు ఒకసారి మా యింటికి వచ్చి నేను యిచ్చే ఆనందమును అనుభవించు అని ఆయన మీద వున్న ఉత్తరీయమును పట్టుకొని లాగింది. అపుడు కృష్ణ పరమాత్మ తప్పకుండా నేను మీ యింటికి వస్తాను. కాని యిప్పుడు కాదు. కంస సంహారము అయిన తరువాత వస్తాను’ అన్నాడు.
ఇది మనకు చిత్రంగా తోస్తుంది. త్రివక్రకు కృష్ణ దర్శనం అయిన తరువాత ఆయన పాదంతో తొక్కాక కూడా ఆమెలో యిటువంటి వాంఛ ఉండిపోయిందా అనిపిస్తుంది.
మీరు భాగవతమును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. *త్రివక్రం అంటే మనసులో ఒకమాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం.* మూడింటియందు మూడు వంకర్లు. ఈ మూడు వంకర్లు తీసివేయడమే కుబ్జ తనమును తీసివేయడం. అవి పోయి ఏకత్వం వచ్చేసిందంటే ఈశ్వర స్పర్శ కలిగిన వాడు ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని అడుగుతాడు. ఆ సేవకి వేళాపాళా ఉండదు. త్రివక్రకు తన వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుని కైకర్యము అడుగుతోంది. అందుకు తన యింటికి రమ్మంటోంది. పరమాత్మ కంసవధ అయిన తరువాత వస్తానంటున్నాడు. అనగా అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అందుకని అప్పుడు వస్తానని మాట యిచ్చాడు తప్ప ఆమెయందు మీరు దోషమును పట్టకూడదు.
ఆయన ఒక చిత్రమయిన మాట అన్నాడు *‘నేను పాంథుడను’* అన్నాడు. పాంథుడు అనగా ఇల్లు లేనివాడు. ఆత్మకి యిల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. కానీ అది అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి ఉంటూ ఉంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మాటలు చెప్పి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాడు.
ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నాడు. ఆయాగం జరిగేచోట ఒక పెద్ద ధనుస్సు నిలబెట్టబడి ఉంది. కృష్ణ పరమాత్మ ఆ ధనుస్సును తీసుకొని సంధించారు. అది రెండుగా విరిగిపోయింది. ఆ ధనుస్సు రెండు ముక్కలను బలరామ కృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ వున్న కంసుని సైన్యమునంతటినీ సంహారం చేసి ముందుకు వెడుతుంటే, కంసుని గుండెలు అదిరిపోయాయి. ఇక కృష్ణుడు తనను చంపివేస్తాడని భావించాడు.
*కువలయా పీడము* అనే పెద్ద ఏనుగు ఒకటి కంసుని వద్ద ఉంది. ఆ ఏనుగును కృష్ణుని మీదకి తోలించాడు. కృష్ణుడు మరణించేలా దానిని కృష్ణుని మీదకి తోలవలసిందని మావటి వానికి చెప్పాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావటి కలిసి కృష్ణుని మీదికి ఆ ఏనుగును నడిపించారు. అప్పుడు ఆ ఏనుగు వచ్చి ఆయనను గట్టిగా చుట్టుచుట్టింది. అప్పుడు కృష్ణుడు దాని తొండములో నుండి జారిపోయి నాలుగు కాళ్ళ మధ్యలో దూరాడు. అది తన రెండు కాళ్ళ మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం వెతుకుతోంది. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యనుండి బయటకు వచ్చి దాని తోక పట్టుకొని దానిని నూరు ధనుస్సుల దూరం వెనక్కి ఈడ్చేశారు.
సమస్త బ్రహ్మాండములను తన బొజ్జయందు ఉంచుకున్న వాడికి దిక్కుమాలిన ఏనుగును లాగడం పెద్ద కష్టమా! గిరగిర త్రిప్పి విసిరేశాడు. అపుడు మావటి వాడు పరుగెత్తుకు వెళ్ళి ఆ ఏనుగును మరింత ప్రచోదనం చేశాడు. యుద్ధంలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమయినది ఏనుగు. గుఱ్ఱము తనమీద కూర్చున్న వీరుడిని తీసుకుని పరుగెడుతుంది. కానీ యుద్ధమునకు తీసుకువెళ్లేముందు ఏనుగుకు నల్లమందు పెడతారు. దానికింక అస్సలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతూ దానికి అడ్డు వచ్చిన వాళ్ళని తొండముతో లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అది తొక్కుతుంటే చచ్చిపోతారు. తొండము పెట్టి కొడితే చచ్చిపోతారు. దంతము పెట్టి పొడిస్తే చచ్చిపోతారు. అది ఎవడి మీదయినా పడితే చచ్చిపోతారు. కాబట్టి ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగును కృష్ణుని మీదికి పురిగొల్పాడు.
అది చిన్నికృష్ణుని మీదికి పరుగెత్తుకు వస్తోంది. కృష్ణుడు ఒక్కసారి తనకాలితో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో అని ఘీంకరిస్తూ వంగింది. అలా వంగేసరికి కృష్ణుడు దాని రెండు దంతములు ఊడబెరికేశాడు. అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక దెబ్బ కొట్టాడు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ కింద పడిపోయింది. అది కింద పడిపోయిన తరువాత దాని దంతములను పెట్టి అక్కడ వున్న యితర వీరులను మావటిని సంహరించాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగు దంతములు రెండింటిని భుజముల మీద వేసుకున్నాడు.
మార్గశీర్ష మాసంలో మనవాళ్ళు *తిరుప్పావై* ని చదువుతుంటారు. అందులో నీలాదేవికి మంచం చేయించవలసి వస్తే కువలయా పీడము నుంచి లాగేసిన దంతముల తోటే ఆయన ఆవిడకు మంచమును చేయించాడు.
ఏనుగుకు కువలయా పీడము అనే పేరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
‘కు’ అంటే భూమి. ‘వలయము’ అంటే భూమండలము. కువలయా పీడము అనగా భూమండలమును పీడించునది అని అర్థము. పృథివీ వికారమయిన మనము పూజ చేద్దామని భూమి మీద వుండి కూర్చుందామని అనుకుంటే ముందు మనలని దేహాత్మాభిమానము అడ్డుతుంది. ఈ శరీర అహంకారమే మనలను పాడుచేసేస్తుంది. ‘అమ్మో, ఈవేళ అంతసేపు కూర్చోవాలా’ అంటుంది. కువలయా పీడము అనేది దేహమునకు సంబంధించిన అహంకారము. శాస్త్రములో దీనిని ‘అన్న వికారము’ అని పిలుస్తారు. అన్న వికారము అంటే ఈ పృథివిలో పండినవి ఎన్నో తినేశావు. వాటినన్నిటిని తినడం వలన యింత శరీరం తయారయింది. ఈ అన్నవికారమయిన శరీరం ఏమవుతుంది? ఇందులో వున్న రక్తము భూమిలోకి యింకిపోతుంది. యిందులో వున్న మాంసము కాలిపోతుంది. లేదా పురుగులు తినేస్తాయి. శరీరం పృథివిలో కలిసిపోతుంది. వెంట్రుకలు మాత్రం వెళ్ళి చెట్ల మొదళ్ళను పట్టుకుంటాయి. ఈపాటి శరీరమును చూసుకుని మనం ఎంతో పొగరుతో ప్రవర్తిస్తాము. రెచ్చిపోతూ ఉంటాము. అహంకారంతో ప్రవర్తించి లేనిపోని పాపములను మూట కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చిన భ్రాంతి! కాబట్టి దీనిని భాగవతంలో కువలయా పీడము అంటారు.
జ్ఞానము లేనివాడికి యిది వాడిని వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది. పాపం బాగా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక మహా పురుషునికి యిది పుణ్యం చేయించడానికి, వినయముతో నమస్కారం చేయడానికి ఈశ్వరుని ఆరాధించడానికి తాను యిక్కడ వున్నన్నాళ్ళు హాయిగా వుండి, సంతోషంగా ఉండి గట్టెక్కడానికి పనికివస్తుంది.
కంసుని యందు వున్న కువలయాపీడము పాడుచేయడానికి పనికివస్తుంది. దానికి లోపల ఆ జ్ఞానము వుంది. ఈ కువలయాపీడము ను కృష్ణుడు సంహరించాలి. కాబట్టి కువలయాపీడమును ఆయన సంహరించాడు.
🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏
🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏
** (సశేషం.....)
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
: *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*శ్రీ భాగవతం - 96 వ భాగం*
*చదువుకుందాం భాగవతం*
*బాగుపడదాం మనం అందరం*
*దశమ స్కందము*
*శ్రీకృష్ణ లీలలు - 26*
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
కువలయాపీడము అనే ఏనుగును సంహరించిన అనంతరం, శ్రీకృష్ణ బలరాములు మరికొంత లోపలికి వెళ్ళగా *చాణూర ముష్టికులు* ఉన్నారు.
మనలో ఉన్న కామక్రోధములే *చాణూరముష్టికులు* .
వాళ్ళు మల్లయుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకుని, పట్టుకుని, మనలను పడగొడతారు. ఇప్పుడు కంసుడు చాణూర ముష్టికులను వారిపైకి ప్రయోగించాడు.
అజ్ఞానము ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చాణూరుని వేదకమీద మల్లయుద్ధం చేయమన్నాడు. వారిద్దరూ భయంకరమయిన మల్లులు. బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్ళతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ వున్నవారు ఆశ్చర్యపోతున్నారు.
వారికి, వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతోంది. ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతోంది.
చాణూరముష్టికులు అన్నారు – ‘ఇదేమీ వైకుంఠపురం కాదు, కంసుని సభ. ఇది సంసారమును వదిలి పెట్టేసిన వారి సభ కాదు. ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు. ఇది కాలదండము లాంటి నా పిడిగుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచికములు ఆడడం కాదు. పిల్లాడా, మాతోటి యుద్ధం చేస్తావా? నీవు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు – సాగి నీవు నడవడానికి వేదాంత వీధి కాదు. రా, నిన్ను మట్టు పెడతాము’ అన్నారు.
చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు.
బ్రహ్మాండమైన మల్లయుద్ధం జరిగింది. గరుడుడు పాములను పట్టుకుని ఎగరేసుకు పోయినట్లుగా వాళ్ళిద్దరూ చాణూరముష్టికులను ఇద్దరినీ సంహరించారు. వీళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తితీసి భటులను పిలిచి, ‘వసుదేవుని సంహరించండి – ఉగ్రసేనుని సంహరించండి – ఈ గోపాల బాలురను మట్టుబెట్టండి’ అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు.
అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకి ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే కంసుడు పంచత్వమును పొందేశాడు. వాడు చచ్చిపోయాడు. కంసుని మీదకి కత్తి విసరలేదు.
జరాసంధుడు – కాలయవనుడు – ముచుకుందుడు తరువాత ఒక ముఖ్యమయిన ఘట్టం జరిగింది.
జరాసంధుడు యుద్ధమునకు వచ్చాడు. కంసునికి యిద్దరు భార్యలు. వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి ‘కృష్ణుడు మా భర్తను సంహరించాడు మాకు వైధవ్యం వచ్చింది’ అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి ఇరువది మూడు అక్షౌహిణుల సైన్యమును తెసుకొని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా పదిహేడు మార్లు వచ్చాడు. పదేహేడు మార్లూ అనేక అక్షౌహిణుల సైన్యమును కృష్ణుడు చంపాడు.
పదునెనిమిదవ మాటు మరల జరాసంధుడు వస్తున్నాడు.ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమయిన పని చేశాడు. జరాసంధుడు మధురా నగరమును ముట్టడిస్తే అమాయకులైన గోపాల బాలురు మరణిస్తారని, తనకి కొంత చోటును యిస్తే అందులో జలదుర్గము కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడు. సముద్రుడు చోటు యిచ్చాడు.
ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్రగర్భంలో ద్వారకానగర నిర్మాణం చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరానికి తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు.
కాలయవనుడు అని ఒకాయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది. యాదవులు ఎవరూ కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరకు వెళ్ళి నారదుడు ఒకమాట చెప్పాడు ‘ నీవు అందరి మీదికి యుద్ధమునకు వెడుతుంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు, ఒకడు ఉన్నాడు. అతనిని కృష్ణుడు అని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి’ అన్నాడు.
ఆ కాలయవనుడు అతని యవన సైన్యమునంతటినీ తీసుకొని వచ్చాడు. కృష్ణుడితో యుద్ధమునకు శత్రు సైన్యమంతా కోటబయట విడిది చేసింది. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటకు వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరయినా ఉంటే కదా! లోపల బలరామ కృష్ణులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కు పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరకు వస్తున్నాడు. అలా వస్తున్న వానిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తు పట్టి కృష్ణా, నీకోసమే వచ్చాను ఆగు’ అన్నాడు. కృష్ణుడు పరుగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుని వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక కొండగుహ లోనికి దూరిపోయాడు. గుర్రమును వదిలివేసి కాలయవనుడు కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడు. కొండగుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒకాయన పడుకుని వున్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ‘ఎవడురా నన్ను నిద్రలేపిన వాడు’ అని ఆ ముసుగులో పడుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కిందపడిపోయి బూడిదయిపోయాడు.
అపుడు పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడు ఎవరు?” అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు చెప్పాడు.
త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు *ముచుకుందుడు* అనేవాడు ఒకడు ఉండేవాడు. అతను మహా తేజోసంపన్నుడు. గొప్ప భక్తుడు. రాక్షససంహారమునకు ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఆఖరుకి కుమారస్వామి వారికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏమి కావాలో కోరుకొనమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు నిద్రపోవాలని ఉంది. నన్ను ఎవరూ నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి’ అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. ‘నీకు ఎవరయినా నిద్రాభంగం చేస్తే నీవు వాడికేసి చూసిన తక్షణం వాడు బూడిద అయిపోతాడు’ అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించడు కదా! ఈవిధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు.
ఇపుడు పదునెనిమిదవ సారి జరాసంధుడు వచ్చాడు. బలరామ కృష్ణులిద్దరూ కోటలోనుండి బయటకు వచ్చి మరల పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారివెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతమనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షములను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్లకి బలరామకృష్ణులు కనపడలేదు. అపుడు జరాసంధుడు ఆ పర్వతము నంతటినీ తగల పెట్టెయ్యమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగులపెట్టేశారు. అపుడు అగ్నిహోత్రుని కాంతులు ఆకాశమునకు అంటుకున్నాయి. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మీదనుండి సముద్రంలోనికి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. కృష్ణుడు, బలరాముడు యిద్దరూ మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణబలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు.
ఇందులో మీరు తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఉంది. ‘సంధి’ అనగా సగము. సంధికాలము వచ్చింది. యుగ సంధి వచ్చింది అంటారు. మనం ఎవరినయినా ఆశీర్వచనం చేస్తే *‘శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి’* అంటూ నూరు సంవత్సరములు జీవించు అంటాము.
నూరు సంవత్సరములలో సగము ఏభై. మీరు ఈశ్వరారాధన ఈ ఏభై లోపల చెయ్యాలి. ఏభై తరువాత చేసే ఆరాధన మానసికమయినది. ఏభై తరువాత అంత కలివిడిగా శరీరముతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ ఏబది సంవత్సరముల వయసు లోపల పూర్తి అవాలి.
జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు. మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు. అనగా హృదయగుహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడయిపోయిన వాడికి మరణం ఉండదు. కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుని నుండి తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతమును ఎక్కాడు. అలా చేయడం అనగా నిరంతరమూ భక్తితో ఉండడం. పరమభక్తితో ఉంటే మృత్యువు మిమ్ములను ఏమీ చేయలేదు. అపుడు యమధర్మరాజు గారు మీ దాపులకు రాడు. పరమభక్తుడయిన వాడిని తీసుకు వెళ్ళడానికి నారాయణుని పార్షదులు వస్తారు. శివుని పార్షదులు వస్తారు. యమదూతలు రారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రాంతర్గతమయిన ద్వారకను అనగా ఈశ్వర స్థానమునకు చేరుకున్నాడు. ఈవిధంగా లోకమున కంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు.
🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏
🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏
కాళహస్తీశ్వర శతకం - 47* 🕉
*మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి* *దుర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం* *దమ్ము దైవంబు నవ్వడె రానున్న దురాత్ములెల్ల* *దమత్రోవం బోవరే ఏల చేసెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_ 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు.
🌹వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్ఠమగుచున్నది.
🌹ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్తించునని కాని భయపడకున్నారు.
🙏 *ఓం నమః శివాయ* 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
*పరోపకారం*
🍁🍁🍁🍁
ప్రకృతిని నిశితంగా గమనిస్తే సర్వత్రా ‘ఇవ్వడమే’ కనిపిస్తుంది. గాలి ప్రాణవాయువై జీవుల్ని బతికిస్తుంది. చెట్లు కమ్మని పళ్లు ఇచ్చి క్షుద్బాధ తీరుస్తాయి. నదులు తియ్యని నీరిచ్చి దాహార్తిని ఉపశమింపజేస్తాయి. ప్రకృతికి వనరులను ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు.
భగవంతుడు వర ప్రదాత. భక్తుల కొంగుబంగారంగా కొలువై ఉంటాడు. మనుషులెప్పుడూ వరగ్రహీతలే! వరప్రదాతలు కావడం గొప్ప సుకృతం.
అమ్మస్తన్యం తాగడంతో మొదలయ్యే మనిషి జీవితం, చివరి క్షణాల్లో తులసి తీర్థం పోయించుకోవడంతో అంతమవుతుంది. నడిమి జీవితం చాలావరకు పుచ్చుకోవడంతోనే సాగుతుంది. ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కాని తనకున్నదాంట్లో ఇవ్వడానికి మనిషికి మనస్కరించదు.
మన పురాణాలు ‘దానం’ ప్రాశస్త్యాన్ని వీలున్నప్పుడల్లా ఉటంకిస్తాయి. పుణ్యంతో ముడిపెట్టి మనిషిలోని దానగుణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తాయి. ఇచ్చే చేయి కలిగి ఉండటం గొప్ప అదృష్టం. చాపే చెయ్యి వెనక సిగ్గుతో ముడుచుకుపోయే హృదయం ఉంటుంది. అది గమనించగలగాలి.
పాత్రతనెరిగి దానం చెయ్యమంటారు. కొంతమంది తమ అవసరాన్ని వ్యక్తపరచి అడిగి తీసుకుంటారు. మరికొంతమంది అస్సలు మనసు బయటపెట్టరు. అలాంటివారిని కనిపెట్టుకుని ఉండాలి. భగవంతుడు మనిషికి విచక్షణను ఇచ్చింది అందుకే. సృష్టిలోని ఏ జీవీ మరో జీవి మనసును చదవలేదు. అంచనా వేయలేదు. మనిషికే అది సాధ్యం.
నవ విధ భక్తిమార్గాల్లో సేవ ఒకటి. సేవ అంటే మనం చేయగలిగింది చేయడమే, ఇవ్వగలిగింది ఇవ్వడమే.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రజలు పెద్దమనసుతో వితరణ చేసి, బాధితుల ముఖాల్లో వెలుగు నింపుతారు. వారి జీవితాన్ని చైతన్యవంతం చేస్తారు.
దానం చేయడానికి తన ఇంట్లో ఏమీ లేక, ఉన్న ఒక్క ఉసిరికాయను దానం చేసింది ఒక నిరుపేదరాలు. చలించిన శంకరాచార్యులవారు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.
అన్నార్తులకు లేదనకుండా అన్నదానం చేసిన దొడ్డ ఇల్లాలు డొక్కా సీతమ్మ.
దానం చేయడానికి మనసుండాలి, చేయి సహకరించాలి. కాలు, చేయి ఆడుతున్నప్పుడే హరి నామ స్మరణ చేస్తూ- తోచినంత దానం చేయగలిగితే ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అంటారు వేద ప్రియులు. ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో దానం చేసేవారు కొందరైతే, చేతికి ఎముక లేకుండా దానం చేసేవారు మరికొందరు. తమ కోసం ఏమీ మిగుల్చుకోకుండా దానం చేసినవారు అరుదుగా ఉంటారు.
కీర్తి కోసం కాకుండా, కైవల్య ప్రాప్తి కోసం దానం చేసేవారి అడుగు, మోక్షమార్గంపై పడుతుంది.
శుభోదయం.
ఏది మీకు పరమాత్మ నుండి ఒక ప్రసాదంగా ఒసగబడిందో, దాన్ని అనుభవించండి. దాని వలన మీరు ఆయన యెడల కృతజ్ఞతా భావంతో నిండి, నాకు నా యోగ్యత కన్నా ఎక్కువే ఇచ్చావు, ధన్యవాదాలు అని అనగలుగుతారు. మరచిపోయి కూడా పరమాత్మని ఏదీ కోరుకోకూడదు. ఆ కొరికే మీకు, ఆయనకు మధ్య ఒక గోడలా నిలుస్తుంది. దేవుని గుడిలో మీరు చేసే ప్రార్ధనల్లో మీ కోరికలు ఉండకూడదు, మీరు ఆయనకు తెలియజేసే ధన్యవాదాలు ఉండాలి.
ఈ క్షణంలో జీవించడం అంటే గతం నుండి, భవిష్యత్తు నుండి ముక్తుడై జీవించడం. వెనక్కి వెళ్లడం కాదు, ముందుకి వెళ్లడం కాదు, ఈ క్షణంలోనే మెలకువగా జీవించడం. ఎక్కడ గతం లేదో, అక్కడ అహంకారం లేచి నుంచోదు. అహంకారం గతంతో జోడింపబడి ఉంటుంది. అలాగే ఎక్కడ భవిష్యత్తు లేదో, ఎక్కడ ఆకాంక్ష లేదో, ఎక్కడ కోరిక లేదో అక్కడ మీరు కావాలని అనుకున్నా కూడా అహంకారాన్ని నిలబెట్టలేరు.
హిందూ మతాన్ని హిందూ శాస్త్రాలను జ్యోతిష్యాన్ని విమర్శించే మేధావులకు అంకితం
అంతర్జాల సేకరణ !
వారానికి 7 రోజులు ఎందుకు?
రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది??
ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు? మంగళ వారం రావొచ్చుగా??
ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే మందు ప్రతి ఉగాది రోజు పంచాంగం ను, జ్యోతిష్యం ను అవమానించిన వాళ్లకి అంకితం..
మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం..
ప్రపంచంలో ఏ దేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు..
ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి...
మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే..
ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది?
ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది?
ఎప్పుడు చంద్రగ్రహణం?
ఎప్పుడు సూర్యగ్రహణం?
ఏ కార్తె లో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే.. ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే..
పైన ప్రశ్న కి జవాబు:-
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు
ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR . ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.. 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది.. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మళ్ళీ శని హోరాకి..
ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుధ హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆతర్వాత హోరా 25వ హోరా. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.
రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే..సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి? మంగళ వారం రాకూడదా??
రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి..
ఇది మన భారతీయుల గొప్పతనం.. ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం..
ప్రపంచం లో దేశమయినా మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే.. కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ...
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది..
--(())--
శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత చరిత్ర
దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదాపీఠం 36వ పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత చరిత్ర.
Episode - 1
దక్షిణామ్నాయ శృంగేరి శ్రీశారదాపీఠం 36వ పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామివారు. అద్వితీయపాండిత్యం, బహుభాషాకోవిదత్వం, శిష్యులమీద వాత్సల్యం, పీఠం సంప్రదాయములను ఏమాత్రం తూచా తప్పకుండా, ధార్మిక విధివిధానాలకు లోపం జరగకుండా జరపటం, వేదశాస్త్రాలను సంరక్షిస్తూ, పండితులను సత్కరించడం, వంటి అనేకసద్గుణాలు కలిగిన సకలజగద్వంద్యులు జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
విశ్వంలో ఎన్నో మతాలున్నాయి. వాటన్నిటిలో హిందూమతం అని పిలువబడే సనాతన ధర్మం సర్వశ్రేష్ఠమయినది. సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వప్రాణి దయాపరత్వం అనే విస్తృత ప్రాతిపదికమీద నెలకొన్న ఈ ధర్మం ఒక్కటే మానవ సృష్టి ఉన్నంత కాలం ఉండగలిగినది. పరధర్మీయుల అనేక విధములయిన ఆక్రమణలకు తట్టుకొని నిలబడ్డ ఈ ధర్మానికి ఎన్నటికీ చ్యుతి లేదు అని అంటాడు ఒక మహాపురుషుడు.
ఈనాడు అనేకమంది మనస్సులను ఒక సమస్య పీడిస్తున్నది. అదేమిటంటే "ఇప్పటి కాలగతిని చూస్తుంటే జనులలో ధర్మం పట్ల శ్రద్ధ కోల్పోతున్నారు. విధర్మీయుల ప్రచారాలు విస్తృతమౌతున్నాయి. ఇట్టి స్థితిలో సనాతన ధర్మం ఇంక ఎన్నాళ్ళు నిలుస్తుంది” అని. ఈప్రశ్నకు ఆ మహాపురుషుని మాటలలో సమాధానమున్నది. "ऋषीणां पुनराद्यानां वाचमर्थोनुधावति" అని ప్రాచీనులు చెప్పారు. "మహాత్ముల వాక్కు నిశ్చయంగా ఫలిస్తుంది" అని ఆ వాక్యార్థం. పై మాటలు చెప్పినది వేరెవరో కాదు, శ్రీశంకర భగవత్పాదులు స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం 36వ పీఠాధిపతులుగా వెలుగొందుతున్న జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు.
#దివ్యాంశావిర్భావం :- వేదమూర్తులు బ్రహ్మశ్రీ తంగిరాల వెంకటేశ్వర అవధాన్లుగారు ఆంధ్రదేశానికి చెందిన సనాతన ధర్మ పరాయణుడైన ఒక బ్రాహ్మణోత్తముడు.
ఈయన సనాతన వైదిక సంప్రదాయములో అధిక శ్రద్ధకల వంశంలో జన్మించినవారు. వీరిది కుత్సస గోత్రం, ఆపస్తంబ సూత్రం. తంగిరాల సుబ్బయ్యగారు, సుందరమ్మగారు వీరి మాతా పితరులు. బాల్యం నుంచి వీరు అధునిక భోగభాగ్యాల వైపు దృష్టి మరల్చక తమ స్వశాఖ అయిన కృష్ణయజుర్వేద అధ్యయనాసక్తులయ్యారు. వైదిక వృత్తిలో గౌరవాన్వితుడుగా మసలుచూ దురాశకు లోనుగాక నిరాడంబరమైన జీవితం గడుపుతూ వీరు తమ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించేవారు.
వీరు ఆంధ్రప్రదేశ్ లోని మిన్నెకల్లు గ్రామవాస్తవ్యులు, కౌండిన్యస గోత్రులైన బ్రహ్మశ్రీ వేదమూర్తి కోట బ్రహ్మయ్యగారి కుమార్తెయైన శ్రీమతి సౌభాగ్యవతి అనంత లక్ష్మమ్మను వివాహమాడారు. ఈ దంపతులు ఆంధ్రదేశములో గుంటూరుజిల్లాలో పల్నాడు తాలూకాలో నాగులేరు అనే నదీ తీరంలో ఉన్న అలుగుమల్లెపాడు గ్రామంలో నివసించేవారు. శ్రీమతి అనంతలక్ష్మమ్మగారు అతిథి పూజా నిరతురాలైన మహాసాధ్వి. ఆ గ్రామంలో వాళ్ళందరూ ఆ దంపతులయెడ మంచి గౌరవ భావంతో ఉంటూ వారితో ఏదో విధంగా సంబంధం పెట్టుకొనటం తమ భాగ్యమని భావించేవారు. భగవదనుగ్రహం చేత ఆ దంపతులకు నలుగురు కుమార్తెలు జనించారు. కాని "अपुत्रस्य गतिर्नास्ति" (పుత్రులు లేనివారికి ఉత్తర గతులు లేవు) అనే శాస్త్రోక్తిని స్మరిస్తూ ఆ దంపతులు పుత్రుడు కలుగనందుకు దుఃఖితులయ్యేవారు.
ఈ దంపతులు నివసించు గ్రామమునందు భవానీ శంకర దేవాలయం ఉంది. శ్రీ అవధానిగారు ప్రతిరోజూ నాగులేరులో స్నానంచేసి ఈశ్వర దేవాలయానికి వెళ్ళి ఒక సంవత్సరంపాటు ప్రతిరోజూ ఆ శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. శ్రీరుద్రం గొప్ప శక్తిగల మంత్రం. దానితో శ్రద్ధాపూర్వకంగా అభిషేకం చేసే భక్తులను శివుడు తప్పక అనుగ్రహిస్తాడని, శివుడు ఆశుతోషుడని శాస్త్రాలు చెపుతున్నాయి. అవధాని గారు తమ వ్రతం పాటించడం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపలేదు.
కొంతకాలం తరువాత శ్రీ అవధానిగారు తమ నివాసం మచిలీపట్నంకు మార్చారు. అక్కడ అవధానిగారు భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవరాత్రోత్సవం జరిపారు. నాకు కుమారుడు పుడితే వానికి రాములవారి పేరు పెడతానని శ్రీరామునికి మ్రొక్కుకున్నారు. శ్రీమతి అనంతలక్ష్మమ్మ ఆంజనేయుస్వామిని ఆరాధిస్తూ కుమారుడు పుడితే వానికి ఆంజనేయుని పేరు పెడతానని మ్రొక్కుకున్నది.
ఒక రోజు తెల్లవారుజామున ఆమెకు ఆంజనేయస్వామి స్వప్నంలో కనపడి మూడు మామిడి పండ్లు అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు. మరునాడు ఉదయమే ఆమె ఆ ఆనందకరమైన వృత్తాంతం భర్తకు చెప్పింది. ఆ స్వప్న వృత్తాంతం చెప్పగా విన్న ఇతరులకు మూడు మామిడిపండ్లు ఇవ్వడంలోని అంతరార్థం తెలియలేదు. భూలోక, స్వర్గలోక, పాతాళలోకాలను అతిక్రమించగలిగిన మహా పురుషుడు అనంతలక్ష్మమ్మకుపుత్రుడుగా అవతరించనున్నాడని ఆంజనేయుని అభిప్రాయమా? లేదా శివ-రామ- ఆంజనేయుల అనుగ్రహంచేత వైరాగ్యం, ధర్మనిరత, వక్తృత్వం అనే మూడు …
.................
మనకెవరికీ తెలియని గొప్ప విషయాలు...
మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది.
అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ''చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదిలస్తే వారు కూడా వెళ్ళవచ్చు'' అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి వెళిపోయారు.
ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా? అంటే చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్యచక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.
చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.
వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.
బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.
మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.
మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది.
తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.
నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.
పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముం దున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.
దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.
వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.
దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.
మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).
నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.
ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.
ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.
ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.
తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.
పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.
ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.
నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.
కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.
మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.
ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.
ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.
పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.
నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.
ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.
వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.
మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు,సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి,స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.
ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.
మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.
దివ్యాత్మస్వరూపులారా!
ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము.దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయి. సకల కష్టాలూ తొలగిపోతాయి.సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది.సకల దేవతలూ సంతోషించి సకల కోరికలూ తీరుస్తారు.
🙏 🙏
No comments:
Post a Comment