Friday, 28 May 2021

 🕉️ *వైశాఖ పురాణం 18వ అధ్యాయము* 🕉️



*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*



🌻 *విష్ణువు యముని ఊరడించుట* 🌻



💫🌹నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.


💫🌹యముని మాటలను విని బ్రహ్మ యిట్లనెను. ఓయీ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. 


💫🌹ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. 


💫🌹తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవరు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. 


💫🌹శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా! యమధర్మరాజా! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి/సేవకుడు పాపమునందడు. 


💫🌹వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.


💫🌹అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


💫🌹అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. 


💫🌹కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు యిద్దరును శ్రీహరికి నమస్కరించిరి.


💫🌹శ్రీహరియు వారిద్దరిని జూచి "మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని యేల నుండెను? బ్రహ్మ! యీ విషయమును చెప్పుమని" యడిగెను.


💫🌹అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. 


💫🌹స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని, బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను, నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతీమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను?


💫🌹యమధర్మరాజా! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. 


💫🌹ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలదిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. 


💫🌹మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా! అప్పుడు నీకు వలసి నంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా! (ఇచట గమనింపవలసిన విషయమిది. 


💫🌹కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. 


💫🌹కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము) వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. 


💫🌹వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


💫🌹కావున యమధర్మరాజా! నీకు యీ విధముగా భాగము నిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడుపుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును, పెరుగన్నమును భాగముగ గ్రహింపుము. ఇట్లు చేయనివారి వైశాఖకర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపముల ననుసరించి నీ లోకమున నుందురు. ధర్మాధర్మముల నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నాయాజ్ఞానుసారము శిక్షింపుము. 


💫🌹వైశాఖవ్రతమున నీకు అర్ఘ్యమునీయనివారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చునట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నామాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము నిప్పించును. అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగనే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును గొని శ్రీహరి కడకు వచ్చి యా విషయమును చెప్పెను.


💫🌹శ్రీహరి యీ విధముగ యమధర్మరాజు నూరడించి యంతర్ధానము నందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగినదానికి విస్మయపడుచు తన వారితో గలసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీమహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు, వాని యేలుబడిలోని ప్రజలు అందరును వైశాఖవ్రతము నాచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నానసమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండిరి. 


💫🌹ధర్మరాజునకెవరైన అర్ఘ్యము మున్నగు వాని నీయనిచో యమధర్మరాజు వారి వైశాఖవ్రత ఫలమును గ్రహించును.


💫🌹కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను, గురువును పూజింపవలయును, తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు/పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. 


💫🌹వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.


💫🌹ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


💫🌹కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి యిహలోక సుఖములు, సులభములు తప్పవు. 


💫🌹కాని పురాకృతసుకృతము వలననే యిది సాధ్యము సుమా అని శ్రుతదేవుదు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు యిక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.


💫🌹శ్రుతదేవుడును రాజా! యుగములనుబట్టి, కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆకథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.



*వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము*


  

 🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏


[02/06, 5:52 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


పవిత్రతా స్వరూపిణి సీత

భారతదేశంలో వివాహితుడు భార్య ప్రక్కన  ఉంచుకోకుండా ఏ క్రతువు, వ్రతము చెయ్యకూడదు. భార్య భర్త ప్రక్కన ఉండాలి. సహధర్మచారిణి అనేది పత్నికి వాచకం. గృహస్థుడు అనుష్ఠించాల్సిన కర్మకలాపాలు వందల. సంఖ్యలో ఉన్నాయి. కానీ భార్య లేకపోతే సక్రమంగా ఏ కర్మ చెయ్యడానికి  శాస్త్ర ప్రకారం అతడికి అర్హత లేదు.

రాముడి భార్య బహిష్కరింపబడ్డ కారణంగా ఆమె అతని ప్రక్కన లేదు. కాబట్టి ప్రజలు రాముణ్ణి పునర్వివాహం చేసుకోమన్నారు.  " అలా ఎన్నటికీ జరగదు.నా జీవితం సీతదే." అన్నాడు రాముడు. రాజుగా అతడు ప్రజల కోరికను ప్రతిఘటించడం ఇదే మొదలు. యజ్ఞనిర్వహణార్థం అప్పుడు సీతాదేవికి బదులుగా బంగారంతో ఒక సీత ప్రతిమను రూపొం దించారు. 

రాముడు నైమిశారాణ్యంలో అశ్వమేధ యాగం చేసాడు.ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి శిష్య సమేతంగా వెళ్ళాడు. వాల్మీకి కుశలవులను రామాయణాన్ని గానం చేయమని ఆదేశిం చాడు. రామాయణాన్ని విన్న రాముడు వారుసీత పుత్రులే అని నిశ్చయించుకున్నాడు. సీత తన శుద్ధిని తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేసే శపథం చేయాలని దూతల ద్వారా కబురు పంపాడు. వాల్మీకి వెంట సీత సభలో ప్రవేశించింది. సీత చేయబోయె శపథాన్ని వినటానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలతో ఆ సభ  కిక్కిరిసిపోయింది. 

వాల్మీకి తన తపస్సు సాక్షిగా సీత పరిశుద్ధు రాలని ఉద్ఘోషించాడు. సీత సౌశీల్యం తనకుతెలుసని అయినా లోకాపవాదానకి వెరసితాను సీతను పరిత్యజించినట్లు అంగీకరిం చాడురాముడు.ఈ కలవలిద్దరు తన బిడ్డలేనన్నాడు.

సీత త్రికరణశుద్ధిగా తాను రాముడిని పూజించి నట్లయితే వివరమిమ్మని భూదేవిని ప్రార్థించింది మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే । తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి ॥

అప్పుడు భూమి విచ్చుకుంది. " ఇదిగో ఋజువు " అంటూ సీత భూమిఒడిలోచేరింది. భూదేవి సీతను సింహాసనంపై కూర్చోబెట్టుకొని రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్వీణ్ణులయ్యారు. రాముడు శోక సముద్రంలో మునిగి పోయాడు.

సీతాదేవి పాతివ్రత్యమే! పవిత్రతా సరూపమే! ఆమె తన భర్త దేహాన్ని తప్ప మరొకరి దేహాన్పి స్పృశించదు. "పాతివ్రత్యమే ఆమె పరిశుద్ధత"అని రాముడన్నాడు.

సీత అనే మాట భారత దేశంలో శుభం, పరిశుద్ధం,పవిత్రమైనవాటికెల్లా పర్యాయపదం,ఆమె సకల సద్గుణాలరాశి.

సీత క్షమాశీలి,సర్వదా పరిశుద్ధ వర్తనం ఉన్న అర్థాంగి! అంతటి బాధను అనుభవిస్తున్నారాముని గురించి ఒక్క పరుషమైన వాక్కు  కూడా పలకలేదు. సీత ఏనాడూ హానికి  ప్రతిహాని తలపెట్ట లేదు.ప్రతి స్త్రీ సీతాదేవి  అవడానికి ప్రయయ్నంచుగాక!

 గుమ్మా ప్రసాద రావు

[02/06, 5:52 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


🙏 *శివ పూజ*🙏




ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివ భక్తుడు ఉండేవారు.


 శివ నామ స్మరణ చేయకుండా మంచి నీళ్ళు కూడా ముట్టుకోని మహా భక్తుడు.. 


కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబ పోషిoచు కునే వారు.. నిత్య అనుష్ఠానపరుడు శివనామమే ఊపిరిగా బతికే ఆ శివ భక్తుడు ఏ పని చేసిన శివ నామ స్మరణతో చేయడం వల్ల  అది మహా తపస్సు అయ్యింది.


 అతనికి రకరకాల పూలతో శివయ్య ని అలంకారం చేసి మురిసిపోవడం పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది. 


వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారి లాగా పూజ చేయలేక పోయిన శివ నామ స్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు.


 వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను కనుక కనీసం వారు చేసే పూజలో ఎదో రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒక రోజు శివ గానం చేస్తూ అనేక రకాల పూలు చెట్టల్లో సేకరించి శివ భక్తుని గుమ్మం ముందు నిల్చుని  వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి ...స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామి కి పూజ చేసి మెప్పించ లేను నాకు అంత చదువు లేదు శివ నామ స్మరణ తప్ప ఇంక ఏమీ తెలియదు మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను ..

 మీరు అనుమతిస్తే ప్రతి రోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు.. 




మహా భక్తుడు అయిన ఆయన అతన్ని గమనిస్తున్నారు ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ అహంకారం లేదు చదువు లేకున్నా మాటలో సంస్కారం ఉంది, 


పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు పైగా శివ నామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు ఇస్తున్నది శివయ్యకే కదా అని చాలా సంతోషం అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు,.


 శివుడే వరం ఇచ్చినట్టుగా అతను పొంగిపోయాడు .


ప్రతి రోజు శివ నామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చే వాడు పూజ జరిగే సమయంలో కిటికీ లోనుండి చూసి శివ నామ స్మరణతో పొంగిపోయే వాడు.  


ఇలాగే కాలం గడిచింది ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది శివ భక్తుడి కోసం శివ గణాలు వచ్చారు , ఆ గొల్ల వాని కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు..


అది గమనించిన శివ భక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకొని వెళ్లడానికి ఆ పల్లకీ వచ్చింది ఎందుకు అని అడుగుతారు ..


, 'అతను మహా శివ భక్తుడు శివ నామ స్మరణతో ప్రతి నిత్యం నామ స్మరణ చేస్తూ ఒక మహా శివ భక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించే వాడు అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివ పాదాల చెంతకు చేరేవి అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకీ పంపారు' అని వివరించారు, 


ఆ శివ భక్తుడికి ఆశ్చర్యం తో పాటు నిస్వార్ధమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనంద పడ్డారు..


 శివ గణాలతో వెళ్లిన శివ భక్తుని కన్నా ముందే పుష్ప పల్లకీలో ఆ గొల్లవాడు శివుని సన్నిధి చేరుకున్నాడు.



🍁🍁🍁🍁🍁


 తోడు తొడటన్న తొడనే ఉన్నాడు, 

 లేడు  లేడటన్న...లేనె లేడు. 

 కాదు  కాదటన్న ..కానేకాడు,

 *విశ్వదాభిరామ  వినురవేమ !!* 




భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మనివారు కొందరు, అటు ఇటుగా కొందరు ఉంటారు. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు.

              పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిఎగా  నమ్మి, సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎపుడైనా ఆపద వచ్చినప్పుడు పరమేశ్వరా నీవే దిక్కు అని తలిస్తే చాలు తప్పకుండా ఆదుకుంటాడు.

             అదే విధంగా లేదు అన్న వారికి లేనట్లుగాను, కాదు అన్న వారికి కానట్లుగాను ఉంటాడు. 


భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు... నన్ను ఎవరెవరు ఏవిదంగా తలిస్తే వారిని నేను ఆవిధంగానే గానే అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు కదా

No comments:

Post a Comment