Monday, 17 May 2021

 🕉️ *వైశాఖ పురాణం 7 వ అధ్యాయము* 🕉️

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం 

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*

🌻 *వైశాఖమాస దానములు* 🌻

💫🌹అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగుగ వినుమని యిట్లు వివరింపసాగెను.

💫🌹రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. 

💫🌹యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, వైశాఖవ్రతాచరణము యివి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.

💫🌹సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి, అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. 

💫🌹నీటితో నిండిన పాత్రను యిచ్చుట, మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకఱ్ఱలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానముచేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.

💫🌹ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్యకర్తవ్యములు. 

💫🌹బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి వలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్ననివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.

💫🌹పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అలాంటి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. 

💫🌹రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును యీయవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. 

💫🌹శ్రేయస్సును సర్వసుఖ భోగములను, సంపదలను, కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా!

*వైశాఖ పురాణం ఏడవ అధ్యాయము సంపూర్ణము*

       🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏


ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎవరూ వృథాగా కాలం వెళ్లబుచ్చకూడదన్నది’ మన పూర్వీకుల సందేశం. నిరంతరాయంగా, ధర్మబద్ధంగా మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే ‘ఆత్మోద్ధరణ’ దిశగా ప్రయాణించాలి. మళ్లీ మళ్లీ పుడుతూ చనిపోయే (‘పునరపి జననం, పునరపి మరణం’) కర్మబంధాలలో చిక్కుకొని అలమటించే పరిస్థితిని తెచ్చుకోకూడదు. సంసార సాగరం నుంచి మనల్ని మనమే ఉద్ధరింపజేసుకోవాలి. లోకంలో మనకు మనమే మిత్రులం, మనకు మనమే శత్రువులం. బయటి శత్రువులను సామదాన భేదదండోపాయాలతో జయించవచ్చు. కానీ, శరీరం లోపలి అంతశ్శత్రువులను జయించడం చాలా కష్టం. ముఖ్యంగా మనసును జయిస్తే అదే మంచి మిత్రుడౌతుంది. జయించలేకపోతే అదే మన పాలిట శత్రువువలె మారి, మనల్ని కుంగదీస్తుంది. మానవులకు అతిపెద్ద శత్రువులైన ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం’ (అరిషడ్వర్గాలు) అనేవి మనలోనే ఉంటాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటికన్నా ఎంతో హానికరమైనవి, నిర్దాక్షిణ్యమైనవి.


ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు. ఎవరికి దాహమేస్తే వారే నీళ్లు తాగినట్లుగా ఎవరి సాధన వాళ్లే చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్లే సంపాదించుకోవాలి. సద్గురువులను ఆశ్రయించి ధ్యానసాధన చేయాలి. గురు ముఖతఃగానీ, సద్గ్రంథాధ్యయనం వల్లగానీ ఆత్మజ్ఞానాన్ని పొందినవారే ఆత్మోద్ధరణ చేసుకోగలుగుతారు. ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలిచినట్లు మనం ఏ విధమైన కర్మలు చేస్తుంటామో అదేవిధమైన ఫలితాలను పొందుతాం. గురువు, శాస్త్రం, దైవం కూడా చివరికి మన ఆత్మోద్ధరణకు దారి చూపేంతవరకే పరిమితం. మన కాళ్లతో మనమే నడిచినట్లు, మన కండ్లతో మనమే చూస్తున్నట్లు, మన ఆకలిని మనమే తీర్చుకుంటున్నట్లు మనల్ని మనమే ఉద్ధరింపజేసుకోవాలి.


మనసు చంచలమైంది. ఒకవంక మంచిపనుల వైపు, మరొక వంక చెడు ఆకర్షణలవైపు అది లాగుతూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని ప్రయత్న పూర్వకంగా సాధించిన మనిషి మహోన్నతుడవుతాడు. ఇంద్రియ వ్యామోహంలో చిక్కుకున్నవాడు పతితుడవుతాడు. దశకంఠుడైన రావణుడు పది రకాలుగా ఆలోచించేవాడట. అతని నాలుగు తలలు మంచివైపు ఉంటే, ఆరు తలలు చెడువైపు లాగేవట. ఇంద్రియ చాపల్యమే మనిషి పతనానికి హేతువవుతుందన్నది నిజం. కాంచనాన్నీ (బంగారం), గాజు ముక్కనీ సమానంగా చూడగలిగిన శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. వివేకం, వైరాగ్యం కలిగినవారే మనసును జయించగలుగుతారు. అలా, మనోనిగ్రహం కలిగినవానికే మనసు మిత్రునిలాగా మారిపోతుంది. తన ఆప్తమిత్రుడు, బాల్య స్నేహితుడైన శ్రీ కృష్ణుని ఏదో అడగాలనే కోరికతో కుచేలుడు వెళ్లినా, స్వామి దివ్యత్వాన్ని కండ్లారా చూశాక, ఏమీ కోరకుండానే వచ్చేస్తాడు. అడగకుండానే ఐష్టెశ్వర్యాలనూ ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరంధాముడు. అనన్య స్నేహభక్తి కుచేలునిదైతే, ఆశ్రిత వత్సలత పరమాత్మ తత్త్వం.


మనిషి ఎల్లవేళలా ధర్మబద్ధమైన, సకల ప్రాణి హితమైన కర్మలనే ఆచరించాలి. మనం చేస్తున్న పనులెలాంటివో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. సాధనతో జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. సృష్టిలోని ప్రతి ప్రాణినీ పరమాత్మ స్వరూపంగా చూస్తూ, ప్రేమభావంతో మెలగాలి. అమూల్యమైన కాలాన్ని వృథా చేయకుండా నిరంతరం సత్కర్మాచరణలతో మనసును అదుపులో ఉంచుకోవాలి. నకారాత్మక మనోభావాల (నెగెటివ్‌ థాట్స్‌) ప్రభావం వల్లనే ఒత్తిడి, కోపం, విపరీత ధోరణులు, దీర్ఘకాలిక అనారోగ్యం వంటివి కలుగుతాయని మనస్తత్వ శాస్త్రవేత్తలూ అంటారు. కనుక, సకారాత్మక ఆలోచనావిధానాన్ని (పాజిటివ్‌ థింకింగ్‌) సాధనతోనే అలవరచుకుందాం.

అమృతస్య పుత్రా:
ధర్మోద్ధారకులు_శ్రీ శంకరాచార్యులు

🔥ఓంశ్రీమాత్రే నమః🔥


జయ జయ శంకర హర హర శంకర!!

ధర్మానికి హాని ఏర్పడినపుడు శిష్టరక్షణకై దుష్టశిక్షణకై తాను అవతారాన్ని ధరిస్తానని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పాడు. ' సంభవామి యుగే యుగే ' ధర్మహాని అంటే జనులకు స్వధర్మాచరణ పట్ల శ్రద్ధా భక్తులు లోపించడం ధర్మాచరణ కించిత్తు కూడా ఆచరణ చేయకుండా ఉండటం . అలానే వేదాలలో ... శాస్త్రాలలో చెప్పినదానికి విరుద్ధంగా ధర్మాన్ని ప్రబోధించి జనులను పక్కదోవ పట్టించి అవైదిక ధర్మ ప్రాబల్యం పెరగడం.


అలాంటి సమయంలో పునః ధర్మప్రతిష్ట చేయడానికి భగవదవతారం జరుగుతుంది. కలియుగానికి వచ్చేసరికి జనులలోని రాక్షస ప్రవృత్తిని తీసివేయాలి. అంటే వారిని అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపు బుద్ధిని ప్రచోదించేలా చేయాలని , జ్ఞానభిక్ష పెట్టాలని సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో ఆర్యాంబా శివగురువులనే పుణ్యదంపతులకు కేరళ రాష్ట్రం కాలడీ క్షేత్రంలో పూర్ణానదీ తీరాన వైశాఖ శుద్ధ పంచమి శుభతిథిన తేజోమూర్తియైన శంకరాచార్యుల వారు జన్మించారు.


శ్రీ శంకరులు బాల్యంలోనే అత్యంత ప్రజ్ఞాశాలిగా ఉండేవారు. ఆయన ఐదవ సంవత్సరంలో ఉపనయనాన్ని చేసుకొని అతి తక్కువ సమయంలో ఏ మానవ మాత్రునికి కూడా సాధ్యం కాని ' అష్టవథ చతుర్వేదీ ద్వాదశీ సర్వశాస్త్రవిత్ ' ఎనిమిదవ సంవత్సరంలో చతుర్వేదాలు 12 సంవత్సరాల వయస్సులోపు సర్వశాస్త్రాలను అధ్యయనం చేశారు.


వేదాధ్యయన సమయంలో భిక్షాటనకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా ఆమె ఒక ఉసిరికాయను ఇచ్చింది . ఆమె దారిద్య పరిస్థితిని చూసి చలించిపోయిన శంకరులు ' కనకధారా స్తోత్రం ' ఆశువుగా స్తుతించారు . దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది.


శంకరుల సన్యాస ఆశ్రమ స్వీకారం కూడా చాలా విచిత్రంగా జరిగింది . సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో తల్లిని ఆనుమతి కోరారు . సన్యాసం స్వీకరిస్తే తన ఒంటరి అవుతానన్న కారణంతో తలి అందుకు నిరాకరించింది.


ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది . తనను సన్యసించడానికి అనుమతిస్తే మొసలి వదిలేస్తుందని చెప్పారు . ఈ సంసారబంధాలు తనను మొసలిలా పట్టుకున్నాయని ఆ బంధాల నుండి తనను తప్పించమని కోరారు . దీనినే ఆతుర సన్యాసం అంటారు , సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను విడిచి వెళ్లిపోయింది . తరువాత గురువు కోసం అన్వేషిస్తూ నర్మదా నదీతీరంలో ఉన్న గోవింద భగవత్పాదులను దర్శించి ఆయననే తన గురువు తెలుసుకొన్నారు. ' షోడశే కృతవాన్ భాష్యం ' తరువాత మహోత్కృష్టమైన బ్రహ్మసూత్రాది గ్రంథాలకు భాష్యాన్ని రచించారు.


మహా మహా పండితులకు కూడా మళ్లీ మళ్లీ చదివితే కాని అర్థం కాని ఎన్నో గ్రంథాలు రచించారు . కనీసం శబ్దజ్ఞానం కూడా లేనటువంటి సామాన్యవ్యక్తికి కూడా వేదాంతాది విషయాలను ' భజగోవిందం ' వంటి స్తోత్రాల ద్వారా ప్రబోధించారు  భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించాలన్నా సమైక్యవాదాన్ని స్థాపించాలన్నా ఆదిశంకరుల సిద్ధాంతం తప్ప మరొకటి లేదని నిరూపించినవే ఆదిశంకరుల రచనలు l.


ఆయన కాలినడకన దేశాద్యంతం పర్యటించి అవైదికమైన 72 మతాలను సప్రమాణంగా ఖండిస్తూ వేదప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠించారు  ఆదిశంకరులు వైదిక మతోద్ధారకులు. దాని పేరే అద్వైత సిద్ధాంతం.


" వేదో నిత్యమధీయతాం " తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అనే అనేకమైన ఉపదేశాలను జనహితానికి ఆయన ప్రబోధించిన జ్ఞానమార్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంతవరకు ప్రసరింప చేయాలనే ఉద్దేశ్యంతో తూర్పున పూరీలో గోవర్థన పీఠం , దక్షిణాన శృంగేరీలో శ్రీ శారదా పీఠం , పశ్చిమాన ద్వారకలో శారదా పీఠం , ఉత్తరాన బదరిలో జ్యోతిప్పిదాలను స్థాపించారు . ఈ పీఠాలు , పీఠాధిపతుల ద్వారా ఎల్లప్పుడూ జనులకు ధర్మ ప్రబోధం జరిగి అందరూ వేదోక్తకర్మలను ఆచరించి జ్ఞానమార్గాన్ని పొంది శ్రేయోవంతులు అవాలని లోకోపకారం కోసం మహత్తరమైన కార్యకలాపాలను శంకరాచార్యుల వారు చేశారు.


అలాంటి మహోన్నతమైన శ్రీ శంకరాచార్యుల వారిని అయన జయంతి సందర్భంగా స్మరించడం కన్నా ప్రతి సనాతన ధర్మ అనుయూయులకు పుణ్యమేముంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరుల వారిని ఈ రోజు ఆరాధించాలి . ఆరాధించడం , పూజించడం , స్మరించడం ఎంత ముఖ్యమో ఆయన ప్రతిపాదించిన ధర్మాన్ని పాటించడం అంతే ముఖ్యం . ఎల్లప్పుడూ స్వధర్మాన్ని ఆచరిస్తూ , జ్ఞానోపార్జన చేస్తూ ఈ జీవనాన్ని సఫలీకృతం చేసుకుందాం.


అద్వైత సిద్ధాంత ప్రవక్త" శ్రీ శంకర భగవత్పాదులు"

 నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యoతాం
వందే గురు పరం పరాం.
 

బౌద్ధ పాషoడ మతాల దాడి నుండి ‌సనాతన వేదధర్మము నశించి పోకుండా సజీవంగా భారతావనిలో ఈనాడు నిలబడి ఉందంటే అది శ్రీ శంకర భగత్పాదులు మన భారత జాతికి అందించిన మహత్తర మైన సేవ." ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే" అన్న గీతా వాక్యాన్ని సార్థకం చేస్తూ శ్రీ వారు అవతరించి తన పాండితీ ప్రకర్షతో ,అపూర్వ వాదనా పటిమ తో బౌద్ద, చార్వాక తదితర నాస్తిక మతాలన్నింటిని పూర్వపక్షం (ఓడించి) చేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.


శ్రీ వారు నందన నామ సం, వైశాఖ శుద్ద పంచమి,పునర్వసు నక్షత్రం లో శివ గురుడు, ఆర్యాంబ పుణ్య దంపతులకు శివానుగ్రహo గా కేరళా లోని ' కాలడి ' గ్రామం లో అభిజిత్ ముహూర్తంలో అవతరించారు( భగవతారమైన శ్రీ రామ చంద్ర ప్రభువు కూడా కర్కాటక లగ్నం,పునర్వసు నక్షత్రం,అభిజిత్ ముహూర్తంలో నే అవతరించడం భగవత్ సంకల్పం. అయిదు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉండటం అపురూప మైన పోలిక.) కేవలం 32 సం. లకే అవతార పరిసమాప్తి చేసిన శంకరుల మేధా శక్తి, తర్క బలం,తాత్విక చింతన నిరుపమానo.


 బ్రహ్మ సత్యం జ గన్మిధ్యా, జీవో బ్రహ్మైవ నా పరః( బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్తు అంతా మిథ్య) ఈ జీవుడే ఆ బ్రహ్మం. ఆరెందూ వేరు వేరు కాదు, అంటూ అద్వైతాన్ని ప్రబోధించారు.
ఆదిశంకరులు వర్ణాశ్రమ ధ ర్మా న్ని సమర్థించారు. కర్మ సిద్ధాంతాన్ని బలపరిచారు.ఈ జన్మలోని కష్టసుఖాలు, పూర్వ జన్మలో చేసిన పాప,పుణ్య కర్మల ఫలితమే నన్న కర్మ సిద్ధాంతాన్ని ధృవీకరించారు.


భక్తి కన్నా జ్ఞాన మార్గానికే శంకరులు  ప్రాధాన్య మిచ్చారు. జీవన్ముక్తి, విదేహ ముక్తి  అనే రెండు రకాల ముక్తులను ప్రతిపాదించారు." అష్టై వర్షే చతుర్వేది, ద్వాదశీ సర్వశాస్త్ర విత్, షోడశీ కృత వాన్బాష్యం, ద్వా త్రిoశే మునిరభ్య గాత్' అంటే ఎనిమిదేళ్ల కే నాలుగు వేదాలు అధ్యయనం చేసి, పన్నెండేళ్ల కే సర్వశాస్త్రాలు మధించి, పదహారేళ్ల కు బ్రహ్మసూత్ర భాష్యo అనుగ్రహించారు.ముప్పది రెండు సం.రాలకే మునిగా అవతార పరిసమాప్తి చేసిన మౌని.


సుమారు త్రి శతాధిక గ్రంధాలు ప్రసాదించి నట్లు ప్రతీతి. విమతస్తులతో, కుమతస్తులతో వాదిస్తూ, ఓడిస్తు, అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపన చేస్తూ , ఆసేతు హిమాచల పర్యంతం తిరిగి సనాతన ధర్మ  సంస్థాపన కోసం ఉత్తరాన బదరీనాథ్ లో జ్యోతిష్పీఠం, పశ్చిమాన ద్వారకలో కాళిక పీఠం,తూర్పున పూరి జగన్నాధo లో  గోవర్ధన్ పీఠం,దక్షిణాన శృంగేరి లో శారదా పీఠం శంకరులు స్థాపించారు.( కంచి లో కామకోటి పీఠం కూడా శంకరులే స్థాపించారనీ పండిత కోట వెంకటాచలం వంటి పరిశోధకుల భావన)
 తన సమకాలీనులైన అనేకమంది లబ్ధ ప్రతిష్టులైన పండితులనే కాకుండా,ఉద్దండ పండితులైన మండన మిశ్రుని, ఆయన భార్య ఉభయ భారతిని శంకరులు వాదంలో ఓడించి, జైత్ర యాత్ర చేశారు.శ్రీ వారు బ్రహ్మ సూత్ర భాష్యం తో పాటు భగవద్గీత, ఉపనిషత్తులకు అద్వైత భాష్యం చెప్పారు.


శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద శుశ్రూష చేసే కాలంలో శంకరులు ఒక పేదరాలింటికి ' భవతి భిక్షాం దేహి' అంటూ బిక్ష కు వెళ్లగా , ఆ పేద రాలి వద్ద యేమీ లేక మూలన కనపడిన ఒక ఉసిరిక పండు భిక్షా పాత్రలో వేసింది.ఆమె దారిద్య్ర దైన్యానికి చలించి పోయిన శంకర భగవత్పాదులు శ్రీ మహాలక్ష్మిని సోత్రం చేశారట..ఆ స్తోత్రమ్ పూర్తయ్యే సరికి ఉత్తర క్షణంలో ఆ పేదారాలి గృహం బంగారు ఉసిరి పండ్లతో నిండి పోయిందట..శ్రీ కనకధారా స్తోత్రం గా ప్రసిద్ధి చెందిన ఈ స్తోత్రాన్ని మనం త్రికరణ శుద్ధితో పఠిస్తే మనకు అష్టైశ్వర్యాలు శ్రీ మాత అనుగ్రహముతో సంప్రాప్త మౌతాయనదంలో ఎలాంటి సంశయం లేదు.ఇది తథ్యం.


 శ్రీ శంకరులకు పరకాయ ప్రవేశము కరతలామలకం సౌందర్య లహరి, భజ గోవింద స్తోత్రం,తాము ఆపదలో చిక్కుకున్నప్పుడు పఠించిన శ్రీ నృసింహ కరావలంబ స్తోత్రం, అన్న పూర్ణా ష్టకo శివానంద లహరి వంటి అనేక నిత్య పూజా సోత్రా లను  మనకు అందించిన జగద్గురు శ్రీ శంకరులు.. తన  తల్లి  అవసాన కోరిక తీర్చడం కోసం,తన సన్యాసి ధర్మాన్ని కూడా కొంత సేపు ప్రక్కన పెట్టి మాతృమూర్తి ఋణం తీర్చు కోవడం కోసo  తల్లి ' అంత్యేష్ఠి  స్వయంగా నిర్వహించిన ఆదర్శ మూర్తి శంకరులు..శ్రీ వారి శిష్యులలో  తోటకాచార్యులు, పద్మపాదులు, సురే శ్వ రాచార్యులు ముఖ్యులు.. త్రి మతాచార్యులలో శ్రీవారు ప్రధములు.. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త  భగవద్రామానుజులు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్రీ మధ్వాచార్యులు మనందరికీ ప్రాతః స్మరణీయులే..


భారతీయ సంస్కృతి నీ,సనాతన వైదిక ధర్మాన్ని పరిరక్షణకు " అపర శివుడిగా" అవతరించిన శ్రీ ఆది శంకరాచార్యులు తమ 32 వ ఏట కేదార్నాథ్ లో "శివైక్యం" పొందారు...ఏకం సత్ విప్ర బహుధా వదంతి" అన్నట్లుగా వివిధ ఆరాధన మార్గాలు ఉన్నప్పటికీ " సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి" , నదీనాం సాగరోగతి, అన్నీ భగవంతుని చేరే మార్గాలే...శ్రీ వారు 32 సం.రాలకు అవతార పరిసమాప్తి చేసినా, వారి దివ్య బోధనలు భారతావనికి నిత్య సోపానాలు.


         జయ జయ శంకర హర హర శంకర!!


సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి.  శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.


దుష్టాచార వినాశాయ
ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః
సాక్షాత్ కైవల్య నాయకః!!


దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి)...


కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా..

శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీల లోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మ పురాణం నుండి)....


హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు :


బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం... అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశ దేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించిన వారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీప స్తంభాలలా పనిచేశాయి.


గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం,శివానంద లహరి, సౌందర్య లహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్త మవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు..


సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురు లకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు.


కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మ నిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. శంకరులు #వైశాఖశుద్ధపంచమి తిథి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో  జన్మించారు.


బాల్యము

శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాల బ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.


ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారే సరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్య చకితులయ్యారు.


సన్యాస స్వీకారము

సన్యాసం తీసుకొనే సమయం ఆసన్న మవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు.


 ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.


గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.


గోవింద భగవత్పాదుల దర్శనం

తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు.. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవుల నుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు.. 'ఎవరు నువ్వు?' అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.


న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం...


నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేని వాడిని. నేను శివుడను. విభజన లేని జ్ఞాన సారాన్ని..


ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవింద భగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. -
"స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్"  (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు).


శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వ ప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మ జ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.


వారాణసిలో శంకరులు

గుర్వాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నాన మాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుప రజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసి లోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.


మనీషా పంచకం

ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్న కాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.


అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి!!


సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలో నైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకే విధంగా పని చేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు..


ఆ మాటలు విన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు..


 "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు వ్రాయాలి.. ఆ భాష్యాలు, అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలుమూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక నన్ను చేరుకుంటావు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు.


ప్రస్థానత్రయం

అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండిత గోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణు సహస్రనామ స్తోత్రము, "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.


వ్యాస మహర్షి

ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేద వ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు.


 శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు.


వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించమని వ్యాసుని కోరగా, వ్యాసుడు.. "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది.


లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశ లోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్ధాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్షు లభించు గాక" అని దీవించాడు...

ఓం శ్రీ గురుభ్యోనమః
 

No comments:

Post a Comment